పంచగవ్యను ప్రకృతి వ్యవసాయంలోనే కాక రసాయన సేద్యం చేస్తున్న పొలాల్లో క్రిమి సంహారిణిగా వాడి మంచి ఫలితాలు పొందుతున్నారు రైతులు.
పంచగవ్య తయారీకి కావలసిన పదార్థాలు
ఆవుపేడ : 7 కిలోలు; ఆవు మూత్రం : 7 లీటర్లు; ఆవు పెరుగు : 2 లీటర్లు; ఆవు పాలు : 2 లీటర్లు; ఆవు నెయ్యి : 1 కిలో; లేత కొబ్బరి నీరు : 3 లీటర్లు; లేదా కల్లు : 3 లీటర్లు; బాగా మగ్గిన అరటిపండ్లు :12; నీరు : 15 లీటర్లు; నల్లబెల్లం : 1 కిలో
తయారు చేయు విధానం : మట్టి కుండలో వేసిన పేడలో నెయ్యివేసి బాగా కలిపి పెట్టాలి. ఈ విధంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నాలుగు రోజులు చేయగా పేడంతా నేతి వాసన వస్తుంది. 5వ రోజున మూత్రం, పాలు, పెరుగు, కల్లు, కొబ్బరి నీరు, బెల్లం, నీరు బాగా కలియబెట్టాలి. ఆ తరువాత అరటి పండ్లు మెత్తగా పిసికి ఈ మిశ్రమంలో కలియ తిప్పాలి. ఈ మిశ్రమం పోసిన మట్టి పాత్ర గాని ప్లాస్టిక్ డ్రమ్ముగాని వెడల్పాటి మూతికలిగి ఉండాలి. మూత బెట్టకుండా గుడ్డతో మూతిబిగించాలి. (లేకపోతే ఈగలు, క్రిములు మిశ్రమంలో పడతాయి) ఈ విధంగా 15 రోజులు వేసిన తరువాత మిశ్రమాన్ని పలుచటి గుడ్డలో వడబోయాలి. ఈ మిశ్రమాన్ని ఆరు నెలల వరకు వాడవచ్చు. పాత్ర మూత వదులుగా వుండాలి. ఒకవేళ పంచగవ్య గట్టిపడితే తగినంత నీరు కలుపుకుని వాడుకోవాలి. పంచగవ్య మొక్క పెరుగుదలకే కాకుండా చీడపీడలను దరిచేరనీయదు. అన్ని రకాల మొక్కలపై వాడుకొనవచ్చు. నారుమళ్ళకు బాగా శ్రేష్టం.


