ప్రతి మనిషికి గాలి, నీరు తరువాత ప్రాథమిక అవసరాలు ఆహారం మరియు రక్షణ. ప్రస్తుత పరిస్థితులు గమనించినట్లయితే వివిధ రకాల కారణాల వలన ప్రతి దేశం వారు విదేశీయుల నుండి, పొరుగు లేదా శత్రు దేశాల నుండి తమ దేశాన్ని, తమ దేశ ప్రజలను రక్షించుకోవడం కొరకు లక్షల కోట్లు ఖర్చు చేయవలసి వస్తుంది. విదేశీ శత్రువులనుండి మన దేశాన్ని సైనికులు ప్రతిక్షణం కాపాడుతూ ఉంటారు. సైనికులు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రతికూల పరిస్థితులలో కూడా దేశ రక్షణ కోసం అనునిత్యం పాటుపడుతుంటారు. అనివార్య పరిస్థితులలో యుద్ధంలాంటిది సంభవిస్తే తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మన దేశాన్ని కాపాడటానికి ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు. మనం క్షేమంగా ఉంటూ గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోతున్నామంటే అది మొత్తం మన సైనికుల త్యాగం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ, ప్రతిక్షణం జై జవాన్‌ అంటూ సైనికుల త్యాగాలను గుర్తిస్తూ వారికి జేజేలు పలకవలసిందే. అదేవిధంగా పెరుగుతున్న జనాభా అందరికీ ఆహారం అందుతుందంటే మరియు కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో కూడా అన్ని ఆగినవి కాని ఒకటి మాత్రం ఆగలేదు. అదే వ్యవసాయం. రైతులు స్వేదం చిందిస్తూ సేద్యం చేస్తూ కరోనాలాంటి విపత్కర పరిస్థితులలో కూడా తమ కాడిని ఆపకుండా పంటల సాగు చేశారు, చేస్తున్నారు కాబట్టే మన ఆకలి తీరుతుంది. పంటల సాగులో చాలావరకు రైతులు నష్టాల పాలవుతున్నారు. నష్టాలను భరించలేని కొంతమంది రైతులు తమ కుటుంబాలను అనాధలను చేసి లోకాన్ని విడిచి పెడుతున్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా రైతు పంటల సాగును ఆపడం లేదు. రైతు తమని తాము త్యాగం చేసుకుంటూ సేద్యం చేస్తున్నారు కాబట్టే మన కడుపులు నిండుతున్నవి కాబట్టి మనందరం రైతులకు రుణపడి ఉన్నాము. రైతు వేళ్లు మట్టిలోకి వెళితేనే మన వేళ్లు నోట్లోకి వెళుతున్నాయనే విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు, ప్రతి రోజు జై కిసాన్‌ అంటూ రైతులకు జేజేలు పలకవలసిందే. జై జవాన్‌… జైకిసాన్‌ అని జేజేలు పలికించుకున్న వ్యక్తి ఒకరే అయితే అంతకు మించిన అదృష్టం ఉండదు. అలాంటి అదృష్టవంతులు అతి తక్కువమంది ఉంటారు అనడంలో సందేహం లేదు. అలాంటి తక్కువమందిలో ముందువరుసలో ఉంటారు కడప జిల్లా, కోడూరు గ్రామానికి చెందిన వెంకటరామరాజు. 

వెంకటరామరాజుది వ్యవసాయ నేపథ్యం. పియుసి వరకు చదివిన వెంకటరామరాజు చదువు పూర్తి అయిన తరువాత వాయుసేనలో సైనికునిగా బాధ్యతలు చేపట్టి అందులో కొనసాగుతూ వస్తున్నారు. 15 సంవత్సరాలు వాయుసేనలో సేవలు అందించిన తరువాత అందులోనే కొనసాగే అవకాశం ఉన్నా కూడా స్వతంత్ర జీవనానికి, మన దేశ అభివృద్ధికి వ్యవసాయమే సరైన దారి అని నమ్మి వాయుసేనలో పదవీ విరమణ పొంది ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా వ్యవసాయరంగంలో అడుగుపెట్టారు. తోటి రైతుల లాగానే వ్యవసాయంలో అవసరమైన మార్పులను చేపడుతూ పంటల సాగు కొనసాగిస్తూ వస్తున్న సమయంలో రసాయనిక వ్యవసాయం వలన సంభవిస్తున్న అనర్థాల నుండి బయట పడటానికి సేంద్రియ సాగే సరైనదని అని తెలుసుకోవడం జరిగింది. ఈ మార్పుకు సుభాష్‌ పాలేకర్‌ అవగాహనా సదస్సులు బాగా ఉపయోగపడినవి. హైదరాబాదు మరియు తిరుపతిలో జరిగిన సుభాష్‌ పాలేకర్‌ అవగాహనా సదస్సులకు హాజరయ్యి ప్రకృతి సాగులో మన నాటు ఆవు ప్రాముఖ్యత మరియు ప్రస్తుత పరిస్థితులలో ప్రకృతి సాగు ఆవశ్యకతను గుర్తించి తన రసాయనిక సేద్యాన్ని ప్రకృతిసాగులోకి మార్చారు.

ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వివిధ పంటలు సాగు చేయడంతో పాటు పంటల సాగులో తన అనుభవాలను, తాను నేర్చుకున్న సాంకేతికతను తోటి రైతులకు తెలియజేస్తూ విజ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదు.. విజ్ఞానం అందరికి సంబంధించినది కాబట్టి తాను తెలుసుకున్న విజ్ఞానం తనతో అంతం కాకుండా అందరూ నేర్చుకున్నప్పుడే ఆ విజ్ఞానానికి సరైన అర్థం ఉంటుందనే లక్ష్యంతో వివిధ ప్రాంతాలలోని రైతులకు తన క్షేత్రస్థాయి అనుభవాలను నిస్వార్థంగా తెలియపరుస్తూ జై విజ్ఞాన్‌ అనే మూడవ నినాదాన్ని వెంకటరామరాజు జత చేశారు. ఈ జైవిజ్ఞాన్‌ అనే నినాదం వెనక వ్యవసాయ శాస్త్రవేత్త డా|| స్వామినాధన్‌ ఆలోచన ప్రధానమైనది. ఒకానొక సమయంలో వెంకటరామరాజుకి డా|| స్వామినాథన్‌ని కలిసే అవకాశం లభించింది. ఆ సందర్భంలో జరగిన సంభాషణల ఫలితమే జై విజ్ఞాన్‌ అనే నినాదం. జై జవాన్‌, జై కిసాన్‌.. జై విజ్ఞాన్‌ అనే మూడు నినాదాలకు వెంకటరామరాజు న్యాయం చేకూరుస్తున్నారు. 

వెంకటరామరాజుకు వివిధ పంటల సాగులో మంచి అనుభవం ఉంది. వీరి ప్రతిభను గుర్తించి అనేక అవార్డులు, రివార్డులు వీరిని వరించినవి. మన దేశంలోనే కాకుండా ఇథోపియా లాంటి దేశాలలో కూడా వ్యవసాయరంగంలో వెంకటరామరాజు తన సేవలను అందించారు. వీరికి వివిధ పంటల సాగులో మంచి అనుభవం ఉన్నా కూడా, ప్రత్యేకించి అరటి మరియు బొప్పాయి పంటల సాగులో వీరికి సుదీర్ఘ అనుభవం ఉంది. ప్రస్తుతం కడప జిల్లా కోడూరు ప్రాంతంలో తోటి రైతుల భాగస్వామ్యంతో అరటి మరియు బొప్పాయి పంటలను సుమారు 15 ఎకరాలలో పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నారు. జీవన ఎరువులు మరియు ట్రైకోడెర్మావిరిడి, సూడోమోనాస్‌ లాంటి జీవ శిలీంద్ర నాశినులతో అభివృద్ధి పరచుకున్న పశువుల ఎరువును దుక్కిలో అందించడంతోపాటు అవసరాన్ని బట్టి పైపాటుగా అందిస్తుంటారు. క్రమంతప్పకుండా జీవామృతాన్ని భూమికి అందించడంతోపాటు వివిధ రకాల కషాయాలు మరియు ద్రావణాలను పంటపై పిచికారి చేస్తూ పంటలను చీడపీడల నుంచి కాపాడుకుంటున్నారు. చీడపీడల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలలో భాగంగా జిగురు అట్టలు, సోలార్‌ లైట్‌ట్రాప్‌ని ఉపయోగిస్తున్నారు. 15 ఎకరాలలో ఉన్న అరటి మరియు బొప్పాయి మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయి. చుట్టుప్రక్కల రసాయన వ్యవసాయం చేసే తోటలతో పోల్చుకుంటే రాజు గారు సాగు చేసే బొప్పాయి, అరటి పంటలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. పూర్తి సేంద్రియ పద్ధతులతో పంటలు సాగు చేస్తూ తోటి రైతులు సేంద్రియంవైపు అడుగులు వేయటానికి రాజుగారు కృషి చేస్తున్నారు. మరిన్ని వివరాలు 9652902972 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

ఉద్యమాలలో వెంకటరామరాజు

రైతు సమస్యల కోసం, ప్రజల సమస్యల కోసం ఉద్యమాలు అవసరమయితే ఆ ఉద్యమంలో వెంకట రామరాజు ముందువరుసలో ఉంటుంటారు. వివిధ శాఖలకు చెందిన అధికారులతో సత్సంబంధాలను కొనసాగిస్తూ అధికారులకు సూచనలు, సలహాలను అందిస్తూ ప్రత్యేకించి వ్యవసాయ శాఖ ఉద్యానశాఖ వారితో క్రమం తప్పకుండా కలుస్తూ రైతులకు అవసరమైన చర్యలు ఆయా అధికారులు తీసకునేలా వారితో చర్చలు జరుపుతూ అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా వెంకటరామరాజు గుర్తింపు పొందారు.

జార్జిబుష్‌కి నాగలిని బహూకరించిన వెంకటరామరాజు

జార్జ్‌బుష్‌ (జూనియర్‌) అమెరికా ప్రెసిడెంటుగా ఉన్న సందర్భంలో 2006 వ సంవత్సరంలో మన రాష్ట్రాన్ని సందర్శించారు. జార్జిబుష్‌ తన సందర్శనలో భాగంగా రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొంతమంది రైతులను కలశారు. జార్జిబుష్‌ని కలిసిన రైతులలో వెంకటరామరాజు, చింతల వెంకట రెడ్డి, నాగరత్నం నాయుడు, మేకల లక్ష్మీనారాయణ లాంటి వారు ఉన్నారు. వెంకటరామరాజు ఒక నాగలిని జార్జిబుష్‌కి బహుమానంగా అందించారు. ఆ నాగలిని భుజంపై పెట్టుకుని జార్సిబుష్‌ ఫొటోలు దిగారు. నాగలితో పాటు పెద్ద పనసకాయ, ప్రకృతి సిద్ధంగా పండించిన మస్క్‌మెలన్‌, ఎర్ర అరటి పండ్లను కూడా వెంకటరామరాజు జార్జిబుష్‌కు అందించారు. జార్జిబుష్‌ అమెరికా తిరిగి వెళ్ళిన తరువాత వెంటరామరాజుని అభినందిస్తూ ఒక అభినందన పత్రాన్ని పంపడం, వెంకటరామరాజు నైపుణ్యానికి నిదర్శనం.