ఆరోగ్యకరమైన మానవుల జీవన శైలికి పంచ భూతములలో ఒకటైన భూమి ప్రముఖ పాత్ర వహిస్తుంది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహారము మరియు ఇతరత్ర ఉత్పత్తి చేయుట కొరకు రైతులు రసాయన వ్యవసాయం ఆచరించుట వలన భూమి తన అస్థిత్వము కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా మానవుల ఆరోగ్యం భూమి ఆరోగ్యంపై ఆధారపడింది కనుక భూమి ఆరోగ్యం కాపాడుకోవటం తప్పనిసరి. ఇందుకొరకు భారత ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికగా ప్రతి రైతు భూమిలో పరీక్ష జరిపి నేల ఆరోగ్య పత్రాలను అందజేయడానికి నడుం కట్టింది. నేల ఆరోగ్య పత్రంలో సూచించిన విధంగా మెరుగైన యాజమాన్య పద్ధతులను చేపట్టి సమస్య ఉన్న భూములలో కూడా తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందిన రైతులు ఉన్నారు. కావున రైతులందరూ ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకొని వ్యవసాయంలో వ్యయం తగ్గించుకొని, సుస్థిర దిగుబడులతో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సన్నద్ధులు కావాలి.
ముఖ్యంగా నేలలు వాటిలోని సహజంగా ఉన్న పోషక పదార్ధాలతో పాటు, అదనంగా వేసిన సేంద్రీయ మరియ రసాయనిక ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడికి దోహదపడతారు. కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ఎంతో అవసరం. దీనికి సంబంధించిన రైతులు తమ పొలంలోని మట్టిని వర్షాధార భూములలో 3 సంవత్సరాలకు ఒకసారి మరియు నీటి వసతి క్రింద 3 పంటలకొకసారి పరీక్ష చేరుంచుకుంటే మంచిది. పోషక పదార్ధాల గురించేకాక, భూమిలోని చౌడు గుణాలను, సున్నం శాతాన్ని, నేల కాలుష్యాన్ని గుర్తించేందుకు కూడా మట్టి పరీక్ష చేరుంచుకోవాలి.
భూసార పరీక్షలో అన్నిటికన్నా ముందు తెలుసుకోవాల్సిన విషయం మట్టి నమూనాలను సేకరించడం. భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరియైనది కానిచో, దాని భౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండదు. దీని వలన చేరుంచిన భూసార పరీక్ష, దానికి అనుగుణంగా చేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్ధమవుతారు. కాబట్టి, మట్టి నమూనా సేకరణలో ఈక్రింది జాగ్రత్తలను తప్పక పాటించాలి.
- మట్టి నమూనాలను సేకరించాల్సిన భూమిని ముందుగా నేల రంగు, ఎత్తు, వాలు, చౌడు మరియు పంట దిగుబడులు మొదలగు అంశాలపై పరిశీలన చేసి కంటికి కనిపించే లక్షణాలను బట్టి వివిధ భాగాలుగా విభజించాలి. ప్రతి భాగం నుండి పొలం విస్తీర్ణమును బట్టి నమూనాలను తీయాలి. కంటికి కనిపించే లక్షణాలలో ఎటువంటి తేడా లేనప్పుడు జిగ్జాగ్ పద్ధతిలో పొలమంతా తిరుగుతూ ఒక ఎకరా భూమిలో కనీసం 8 నుండి 10 మట్టి నమూనాలను తీయాలి.
- పొలంలో అక్కడక్కడ చౌడు ప్రాంతంగా ఉన్నట్లు అనుమానం కలిగితే అక్కడి నుండి ప్రత్యేకంగా నమూనాను తీసి వేరుగా చౌడు లక్షణాల పరీక్ష కొరకు పంపాలి. అటువంటి మట్టిని బాగుగా ఉన్న ఇతర ప్రాంతపు మట్టితో కలుపరాదు.
- నమూనాలను తీయు స్థలంలో నేలపై ఉన్న ఆకులు, చెత్త, చెదారం తీసివేయాలి. తరువాత పొలంలో ”ఙ” ఆకారంలో గడ్డి జాతి పంటలైన వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, చెఱకు మొదలగు పంటలకు 15 సెం.మీ. వరకు మరియు లోతైన వేరు వ్యవస్థ గల వేరుశనగ, ప్రత్తి, అపరాలు, కూరగాయలు మొదలగు పంటలలో 30 సెం.మీ. వరకు పారతో గుంట తీసి, అందులో పైపొర నుంచి క్రింది వరకు ఒక ప్రక్కగా మట్టిని సేకరించాలి.
- ఈవిధంగా ఒక ఎకరా విస్తీర్ణంలో 8-10 చోట్ల సేకరించిన మట్టిని ఒక దగ్గర చేర్చి, బాగా కలిపి 4 భాగాలుగా చేయాలి. అందులో ఎదుటి భాగాలు తీసుకొని, మిగతా భాగాలు తీసివేయాలి. ఈ విధంగా మట్టి 1/2 కిలో వచ్చే వరకు చేయాలి.
- ఇలా సేకరించిన మట్టిలో రాళ్ళు, పంట వేర్లు, మొదళ్ళు లేనట్లుగా చూసుకొని, నీడలో ఆరనివ్వాలి.
- మట్టి నమూనా కొరకు పొలంలో మట్టిని త్రవ్వి, సేకరించినప్పుడు
- గట్ల దగ్గరలోను, పంట కాల్వాలలోను మట్టిని తీసుకోరాదు.
- చెట్ల క్రిందనున్న పొలం భాగం నుంచి మట్టిని సేకరించరాదు.
- ఎరువు (పశువుల పేడ, కంపోస్టు, వర్మి కంపోస్టు, పచ్చిరొట్ట మొదలగునవి) కుప్పలు వేసి ఉంచిన చోట మట్టిని సేకరించరాదు.
- ఎప్పుడు నీరు నిలబడే పల్లపు స్థలంలో మట్టిని సేకరించరాదు.
- పండ్ల తోటలకు అనువైన నేలలను గుర్తించునప్పుడు గాని, పండ్ల చెట్లకు ఏవైన పోషక పదార్ధాలు మరియు ఇతర సమస్యల గుర్తింపు కొరకు మట్టి నమూనాను ఈక్రింది విధంగా తీసుకోవాలి.
- సాధారణంగా పంటను బట్టి 3 నుండి 5 అడుగుల (1-2 మీ.) లోతు గుంట త్రవ్వి, విడిగా ప్రతి అడుగుకు కొంత మట్టిని (నమూనా) సేకరించి, భూసార పరీక్షకు పంపాలి.
- మట్టి నమూనా కొరకు గుంట త్రవ్వుతున్నప్పుడు ఏవైనా గట్టి పొరలు ఉన్నట్లరుతే వాటి లోతు మరియు వాటి లక్షణాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
- పండ్ల తోటల విషయంలో ఇలాంటి నమూనా సేకరణ ఎకరాకు 2-4 చోట్ల నుంచి చేస్తే చాలా మంచిది.
- ఇటువంటి నమూనాలను పరీక్ష కొరకు పంపునప్పుడు ”పండ్ల తోటలకు అనువైన పరీక్షల కొరకు” అని తెలియజేయాలి.
- పొలంలో పలు ప్రాంతాల (8-10 చోట్ల) నుండి సేకరించిన మట్టిని లేదా పండ్ల తోట కొరకు తీసిన మట్టిని గాని, కలిపేందుకు యూరియా లేక ఇతర ఎరువుల సంచులను వాడరాదు. ఇందుకొరకు శుభ్రమైన ప్లాస్టిక్ షీటును ఉపయోగించుట మంచిది.
- ఈ విధంగా సేకరించిన మట్టిని బాగా నీడలో గాలికి ఆరిన తరువాత మంచి ప్లాస్టిక్ బ్యాగులో గాని, గుడ్డ సంచిలో గాని, తమకు సమీపంలోని వ్యవసాయ శాఖకు సంబంధించిన భూసార పరీక్షా కేంద్రానికి ఈ క్రింది సమాచారంతో పంపాలి.
- రైతు పేరు, సర్వే నెంబరు, గ్రామం, మండలం.
- కావలసిన భూసార / చౌడు / పండ్ల తోట ఎంపికకు పరీక్ష.
- ఇంతకు మునుపు పంట, దానికి వాడిన ఎరువులు
- వేయబోవు పంట
- నేలలో గమనించిన ఏవేని సమస్యలు
- నీటి సదుపాయం – సాగు చేయవలసిన పంట వివరాలు.
- రైతులు కాగితంలో పైన తెలిపిన విషయాలను వ్రాసి మట్టి నమూనాతో పాటు సంచిలో వేసి భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి.
మరింత సమాచారం కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 89856 20346.
డా|| యం. వెంకటరాములు, సీనియర్ శాస్త్రవేత్త (విస్తరణ శాస్త్రం);
ఫోన్: 89856 20346
డా|| ఎ. లలిత, సీనియర్ శాస్త్రవేత్త, (విస్తరణ శాస్త్రం);
డా|| ఎ. మనోజ్, శాస్త్రవేత్త (విస్తరణ శాస్త్రం); వ్యవసాయ సమాచార మరియు ప్రసార కేంద్రం, లాం, డా|| కె.ఎస్. పూర్ణిమ, సీనియర్ శాస్త్రవేత్త (విస్తరణ శాస్త్రం); సార్వత్రిక మరియు దూర విద్యా కేంద్రం, లాం, గుంటూరు. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం.

