మన భారత దేశానికే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మన తెలంగాణ విత్తనం ప్రాముఖ్యత పొందాలని, దానికి తగ్గట్లుగా ప్రభుత్వ ప్రయత్నాలకు మీరందరూ కలిసి రావాలని FICCI భవన్‌లో జరిగిన సీడ్‌మెన్‌ అసోసియేషన్‌ 29వ AGM లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 1995వ సంవత్సరంలో 20 నుంచి 30 మందితో ఆరంభమైన ఈ సీడ్‌మెన్‌ అసోసియేషన్‌ నేడు 507 మంది సభ్యులతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అన్ని విత్తన కంపెనీలకు ప్రాతినిధ్యము వహిస్తుంది. మన తెలంగాణాను విత్తనోత్పత్తిలో అగ్రస్థానంలో ఉంచిన అందరికీ, రాష్ట్రములో ఉన్న 5 లక్షల మంది విత్తన ఉత్పత్తి రైతులకు మంత్రి శుభాకాంక్షలు తెలియచేశారు. విత్తనోత్పత్తి చేసే రైతులకు పంట రుణాలను సాధారణ రైతుల కంటే 30% నుండి 50% మేర పెంచి ఇవ్వాల్సిందిగా బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏ ఒక్క రైతూ కూడా ఫలానా కంపెనీ విత్తనం వలన పంట నష్టపోయాం అనే మాట రాకుండా విత్తన కంపెనీలు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడానికి ప్రయత్నం చేయాలని, మీ ప్రయత్నాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి మాట ఇచ్చారు.