భారతదేశంలో ప్రత్తి పైరు 1300 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రత్తి సాగు 6.50 లక్షల హెక్టార్లలో, కర్నూలు, గుంటూరు, కృష్ణా, అనంతపురం, ప్రకాశం జిల్లాలలో ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ప్రత్తిని ఆశించే అనేక రకాలైన పురుగులలో గులాబి రంగు పురుగు ముఖ్యమైనది. ఇటీవల కాలంలో ఈ పురుగు ఉద్ధృతి గణనీయంగా పెరగడమే కాకుండా పంట విత్తిన 75-80 రోజులకే ఆశించి నష్టం చేకూరుస్తుంది. ఈ పురుగు యాజమాన్యంకు కేవలం ఒక రసాయిన పురుగుమందులపై ఆధారపడకుండా సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టుట వలన గులాబి రంగు పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు.

ప్రత్తి తీసిన తర్వాత అవశేషాలను పంట చేలోనే ఎక్కువ కాలం ఉంచడం వల్ల గులాబి రంగు పురుగు పంట పొలంలో ఆశ్రయం పొంది దాని ఉధృతి పెరుగుతోంది. కొంత మంది రైతులు ప్రత్తి తీత మరియు తర్వాత విత్తే పంటల మధ్య ఉన్న సమయం తక్కువగా ఉండటం వల్ల పొలాలను వేగంగా సిద్ధం చేయడం కొరకు ప్రత్తి కట్టెలను కాల్చేస్తారు. కానీ అలా కాల్చడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి.
ప్రత్తి అవశేషాలను కాల్చడం వల్ల నష్టాలు

1. పంట తీసుకున్న అనంతరం ఎండిన మొక్కలను పంట చేలోనే కాల్చేయడం వల్ల భూమిలోని సారం దెబ్బతింటుంది. 

2. నేలలో ఉండే మిత్రపురుగులు, సూక్ష్మజీవులకు హాని కలుగుతుంది.

3. కాల్చడం వల్ల భవిష్యత్తులో ఉద్గార వాయువుల పరిమాణం పెరిగి వాతావరణంలో తీవ్రమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది.

4. భారత దేశంలో ప్రత్తి సాగు చేయడం ద్వారా సుమారు 25-30 మిలియన్‌ టన్నుల పంట అవశేషాలు ఉత్పత్తి కాగా, వాటిలో 48.9 శాతం అవశేషాలను కాల్చివేయడం జరుగుతోంది. ప్రత్తి పంట తీసిన తర్వాత ఏర్పడే అవశేషాలను మెలకువగా ఉపయోగిస్తే లాభదాయకంగా ఉంటుంది మరియు గులాబీ రంగు పురుగు నివారణకు కూడా లాభం చేకూరుస్తుంది.
ప్రత్తి వ్యవసాయ వ్యర్థాల వినియోగం

1. ప్రత్తి తీతల తర్వాత వచ్చే కాండాలు, ఆకులు మరియు పండిన కాయలను చేలో మేకలను, గొర్రెలను మరియు పశువులను తోలి మేపవచ్చు. లేదా ఇంటికి తీసుకెళ్లి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టి శీతాకాలపు మేతగా కూడా వాడవచ్చు.అయితే మొక్కల్లో పురుగుమందుల అవశేషాల స్థాయి కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వాటిని పశువులకు తినిపించరాదు.

2. ప్రత్తి మోళ్ళను ట్రాక్టరు ష్రెడ్డర్‌ తో భూమిలో కలియ దున్నుకోవచ్చు. ఇలా చేయడం వల్ల…

*    భూసారం పెంచడంతో పాటు తేమను సంరక్షించుకోవచ్చు. పత్తి పంట వల్ల ఒక హెక్టారుకు సుమారుగా 2 టన్నుల కాండాలను ష్రెడ్డింగ్‌ చేసి భూమిలో కలియ దున్నటం వలన భూమికి 12.4-20.0 కిలోల నత్రజని, 1.6 కిలోల భాస్వరం మరియు 12.2-13.6 కిలోల పొటాష్‌ లభ్యమవుతుంది.

*    అధికవర్షాలప్పుడు భూమి కోతకు గురికాకుండా ఉంచుతూ అలాగే వేసవి కాలంలో భూమి యొక్క ఉష్ణోగ్రతను మితంగా ఉంటుంది.

*    మెరుగైన వేరు వ్యాప్తి, అధిక సూక్ష్మజీవుల కార్యకలాపాలు ఉంటాయి.

3. ఎండిన ప్రత్తి కట్టెను పొడి చేసి వర్మీ కంపోస్ట్‌ తయారీలో వినియోగించవచ్చు.

4. పోడి చేసి చేలో చల్లితే కలుపు మొక్కలు పెరగకుండా కొంత వరకు అరికడుతుంది.

5. ప్రత్తి వ్యవసాయ వ్యర్థాలతో కంపోస్టుని కూడా తయారు చేసుకోవచ్చు. సాధారణంగా ప్రత్తి కాండాలలో ఎక్కువ ్పు/శ్రీ నిష్పత్తి మరియు అధిక లిగ్నోసెల్యులోజ్‌ శాతం ఉండటం వలన అవి సూక్ష్మజీవుల దాడికి నిరోధకంగా ఉండి కంపోస్ట్‌ తయారీకి 4-6 నెలల సమయం పడుతుంది.

అలా కాకుండా యాక్సిలరేటెడ్‌ కంపోస్టింగ్‌ ప్రక్రియలో డీకంపోజర్‌ను ఉపయోగించి తడి ప్రత్తి కట్టెలని అయితే 45 రోజుల్లో, ఎండిన ప్రత్తి కట్టెలని అయితే 60 రోజుల్లో పూర్తి చేయవచ్చు. ఈ విధంగా తయారైన కంపోస్టులో ఉన్న పోషక విలువలు (1.43:0.78:0.82 శాతం ఎన్‌పికె), పశువుల పేడ యొక్క పోషక విలువలు (0.5:0.2-0.4:3-5 శాతం ఎన్‌పికె) కంటే అధికంగా ఉంటుంది.

6. ప్రత్తి వ్యవసాయ వ్యర్థాలు ఆచ్ఛాదనగా ఉపయోగించుకోవచ్చు.

7. పుట్టగొడుగుల పెంపకంలో మైక్రో క్రిస్టలిన్‌ సెల్యులోజ్‌ కోసం ప్రత్తి కర్రను వినియోగించుకోవచ్చు.

8. ఎండిన ప్రత్తి కట్టెలను ప్యాకింగ్‌ మెటీరియల్‌, పార్టీకల్‌ బోర్డులు, హార్డ్‌ బోర్డులు, కరుగేటెడ్‌ బోర్డులు,  బాక్స్‌లు, పేపర్‌ పల్ప్‌ మరియు ప్లైవుడ్‌ తయారీకి ఉపయోగించుకోవచ్చు. వీటి తయారీ కోసం రైతులు ప్రత్తి కట్టెలను ఫ్యాక్టరీలకు అమ్మటం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చు.

మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో ఫ్యాక్టరీ యజమానులు తొలగించిన ప్రత్తి కట్టెలను టన్నుకు 300-400/- రూపాయల వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన మన రైతులు కూడా ప్రత్తి కట్టెలను ఈ విధంగా సద్వినియోగం చేస్తే కేవలం ప్రతి కట్టె అమ్మకం ద్వారా ప్రతి రైతుకు హెక్టారుకు 1200-1600/- రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు.

9. ప్రత్తి కట్టెతో పిడకలు తయారుచేసి ఫ్యాక్టరీల్లో, బ్రాయిలర్లలో బొగ్గుకు బదులుగా కూడా వాడవచ్చు.

10. ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థ అయిన కేంద్ర ప్రత్తి సాంకేతిక పరిశోధనా సంస్థ వారి గణాంకాల ప్రకారం ప్రత్తి అవశేషాలలో 58.5 శాతం సెల్లులోజ్‌, 14.4 శాతం హెమి సెల్యులోజ్‌ మరియు 21.4 శాతం లిగ్నిన్‌ ఉంటాయి. వీటి వలన ఈ అవశేషాలను జీవ శక్తిగా మార్చి బయోచార్‌, బయోగ్యాస్‌, ఇతనాల్‌  లాంటి జీవ ఇంధన తయారీకి ఉపయోగించడానికి ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రస్తుతం రైతులు దూది సేకరణ తర్వాత మొక్కలను తొలగించడానికి ఎకరానికి 600/- దాకా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు కారణంగా ప్రత్తి సాగు రైతులకు భారంగా మారుతోంది. సాగుదారులు పెట్టుబడి ఖర్చు పెరిగి అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకతను తొలగించడం రైతుకు అదనపు భారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యేకతలను సద్వినియోగం చేసుకుని పరిశ్రమల ఏర్పాటుకు యువతకు చేయూతనిస్తూ గులాబిరంగు పురుగు నివారణకు తోడ్పాటు అందించాలి.      

ఎన్‌. చాముండేశ్వరి (ఎస్‌.ఆర్‌.ఎఫ్‌.),

 డా|| జె. మంజునాథ్‌ (కీటక శాస్త్రవేత్త), 

ఎమ్‌. శివ రామకృష్ణ (కీటక శాస్త్రవేత్త), 

డా|| డి. లక్ష్మి కళ్యాణి (సస్య విజ్ఞానము)

ఇ-మెయిల్‌: d.lakshmikalyani@angrau.ac.in

డా|| కె. మోహన్‌ విష్ణువర్ధన్‌ (సస్య ప్రజననము) 

డా|| బి. వెంకట రవి ప్రకాశ్‌ రెడ్డి (సస్య ప్రజననము)

డా|| కె. వెంకట రమణమ్మ (తెగుళ్ల విభాగము) 

డా|| ఎన్‌. సి. వెంకటేశ్వర్లు (ఏ.డి.ఆర్‌.),

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము, నంద్యాల.