గత కొన్ని సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది రైతులు పాటిస్తున్న సుస్థిర వ్యవసాయానికి, అందుకు మార్గదర్శకంగా నిలిచిన ప్రకృతి వ్యవసాయ సంస్థకు ప్రతిష్ఠాత్మక గుల్బెంకియన్‌ ప్రైజ్‌ ఫర్‌ హ్యూమానిటీ అవార్డు లభించింది. పోర్చుగల్‌లోని లిస్బన్‌లో ఏపీసీఎన్‌ఎఫ్‌ తరఫున రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక వైస్‌ఛైర్మన్‌ టి. విజయ్‌కుమార్‌, ప్రకృతి వ్యవసాయ మహిళా ఛాంపియన్‌ రైతు నెట్టెం నాగేంద్రమ్మ ఈ అవార్డును అందుకున్నారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు 2014-15లో అప్పటి సీయం చంద్రబాబు ఈ సంస్థను నెలకొల్పి నిధులు సమకూర్చారు. 2018లో యూఎన్‌ఈపీ అవార్డు సైతం ఈ సంస్థకు దక్కింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సహజ విధానాల ద్వారా సుస్థిర వ్యవసాయం సాధ్యమని నిరూపించినందుకు పోర్చుగల్‌కు చెందిన ప్రముఖ దాతృత్వ సంస్థ గుల్బెంకియన్‌ పౌండేషన్‌ తాజా పురస్కారాన్ని అందజేసింది.