ప్రకృతి వ్యవసాయం చిన్న, సన్నకారు రైతుల జీవితాలను మారుస్తోందని, రైతుల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింతగా విస్తరిస్తున్నట్లు రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ఛైర్మన్ టి. విజయకుమార్ అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలపై సంపూర్ణ అవగాహన కోసం నీతి ఆయోగ్ గౌరవ సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ రమేష్చంద్ నేతృత్వంలో ఎనిమిదిమంది సభ్యులతో కూడిన బృందం గురువారం ఏలూరు, కృష్ణాజిల్లాల్లో పర్యటించింది. తొలుత కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం, ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ శిక్షణా భవనంలో విజయకుమార్ బృంద సభ్యులకు ఏపీసీఎన్ఎఫ్ గురించి పవర్ పాయింట్ ప్రెజెటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో 2016లో 40 వేల మంది రైతులతో మొదలైన ప్రకృతి వ్యవసాయం ఇప్పటికి 10 లక్షల మంది రైతుల వరకు చేరుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆదర్శనీయమని నీతి ఆయోగ్ గౌరవ సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ చంద్ ప్రశంసించారు. వ్యవసాయ, రైతుసంక్షేమ మంత్రిత్వశాఖ కమిషనర్ డాక్టర్ ప్రవీణ్కుమార్ సింగ్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను బలోపేతం చేయడానికి మరిన్ని పరిశోధనలు చేయాలన్నారు.

11 Oct, 2024
