రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జూన్‌ ఆఖరి వారంలో అరకొర వర్షాలు. జూలై మొదటి పక్షంలో కూడా వర్షాలు ముఖం చాటేసాయి. జూలై మధ్య నుండి తెలంగాణాలో విపరీతమైన ఎడతెరిపి లేని వానలు. తద్వారా వరదలు, ఉత్తరాంధ్రలో విపరీత వర్షాలు. మధ్యాంధ్రలో సాధారణ వర్షాలు. దక్షిణాంధ్రలో తక్కువ వర్షాలు. అనంతపురం జిల్లాలో వర్షాలు రాక వాటి కోసం ప్రార్థనలు. వర్షాధార పంటలు విత్తడం జూన్‌, జూలై నెలల్లో సరిగా జరగలేదు. ఈ పరిస్థితుల్లో ఆగస్టు (పుష్యమి తొలి రోజులు, ఆశ్లేష, మఖ కార్తెలు)లో వివిధ పంటల్లో చేయవలసిన పనులను గురించి…

టమాట: ధరలు విపరీతంగా పెరిగినాయి. ఆగస్టు నెలలో కూడా అధిక ధరలే ఉండే అవకాశముంది. అధిక వర్షాలు, మేఘావృత వాతావరణం, వరదలు, ఈ పంట దిగుబడి తగ్గిపోవడానికి తద్వారా ధరలు ఎక్కువగా ఉండడానికి కారణమవుతున్నాయి. దేశమంతా ఇదే పరిస్థితి ఉన్నందున ధరలు ఎక్కువగానే కొనసాగవచ్చు. పొడి వాతావరణం, టమాట విస్తీర్ణత పెంపు, వర్షాధారపు పంట అందుబాటులోకి వస్తే ధరలు తగ్గుతాయి. 

మిరప: ఈ పంట ధరలు కూడా బాగా అధికంగా ఉన్నాయి. కొత్త పంట వర్షాకాలంలో విత్తిన పంట చేతికొచ్చే దాకా వీటి ధరలు అధికంగానే ఉండే అవకాశం. మంచి రకాలు : ఎల్‌.సి.ఏ-424, ఎల్‌.సి.ఏ-436, ఎల్‌.సి.ఏ-620, ఎల్‌.సి.ఏ-625. కాశీఅభ: ఈ రకం బహుళ ప్రాచుర్యం పొందుతున్నది. ఆకుమచ్చ, ఆకుముడత, రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది. ఘాటు ఎక్కువగా ఉంటుంది. పచ్చిమిర్చికి అనువైనది. ఎగుమతికి కూడా మంచి అనుకూలం. ఇవి కాక పలు ప్రైవేట్‌ కంపెనీల విత్తనాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఆగస్టు నెలలో నారుపోయవచ్చు. ప్రధాన పొలంలో నేరుగా విత్తవచ్చు. నారుమడిలో సస్యరక్షణ, ప్రధాన పొలం తయారు చేసి విత్తుట, నాటుట, మొ|| పనులు ఆగస్టులో ఉంటాయి.

వంగ: ఆగస్టులో ఈ పంట నాటవచ్చు. ఆయా ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉన్న రకాలను ఎంపిక చేసుకొని నాటితే మంచి మార్కెట్‌ ఉంటుంది. ఆగస్టులో కూడా ఈ పంట ధరలు ఎక్కువగానే ఉండే అవకాశముంది.

క్యాబేజి, కాలీఫ్లవర్‌, క్యారట్‌, బీట్‌రూట్‌: ఈ పంటలను ఆగస్టు నెలలో విత్తవచ్చు. ఈ పంటల ధరలు కూడా ఆగస్టులో సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశముంది. 

బీర, బూడిదగుమ్మడి: ఈ పంటలను ఆగస్టు మొదటి పక్షం వరకు విత్తి అధిక దిగుబడి పొందవచ్చు. వీటి ధరలు కూడా ఆగస్టులో సాధారణం కంటే అధికంగా ఉండే అవకాశముంది.

వరి: భారతదేశం వరి ఎగుమతులు ఆపినందున, ప్రపంచమంతా సన్న బియ్యానికి కొరత ఏర్పడింది. వలస వెళ్ళిన భారతీయులు 3 రెట్లు ఎక్కువ ధర పెట్టి కొనాలన్నా సన్న బియ్యం అమెరికా వంటి దేశాల్లో దొరకుట లేదు. అధిక వర్షాలకు నిండిన రిజర్వాయర్ల నీటిని సద్వినియోగ పరచుకొని సన్న బియ్యాన్ని దండిగా పండించి ప్రపంచానికి సప్లయి చేయడం వలన మన రైతులు లాభపడతారు. సన్నబియ్యం పండించడానికి రైతులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. నార్లు రెడీగా ఉన్న రైతాంగం వెంటనే ప్రధాన పొలం తయారు చేసి నాట్లు వేయాలి. ఎంత లేత నారు నాటితే అంత దిగుబడి పెరుగుతుంది. నాట్లు పెట్టిన వారు అధిక వర్షాలకు ముంపుకు గురై ఉంటే వర్షం నీరు త్వరగా వెళ్ళిపోయేటట్లు గట్లు కొద్దిగా తెగ్గొట్టాలి. మురుగు నీరు త్వరగా వెళ్ళేటట్లు ఇది తోడ్పడుతుంది. మొక్కలు బతికే ఉంటే సేంద్రియ విధాన పంటలో విత్తిన 40-60 రోజుల వయస్సున్న వరికి 5 లీటర్ల ద్రవజీవామృతం 100 లీటర్ల నీటికి కలిపి ఎకరా పొలంలో పిచికారి చేయాలి. 60-90 రోజుల పంటకు 10 లీ. జీవామృతం 100 లీ. నీటికి కలిపి ఎకరా పొలంలో పిచికారి చేయాలి. ఇది సాధారణ పరిస్థితుల్లో చేసే పిచికారీలకు అదనం. మొక్కలు పాడయిన చోట తిరిగి వరి పండించాలంటే లేక కొత్త పొలంలో వరి పండించాలంటే స్వల్ప, లేక మధ్యకాలిక రకాలను విత్తాలి. మొలకెత్తిన విత్తనాలను ప్రధాన పొలంలో నేరుగా వెదజల్లే పద్ధతితో గానీ, డ్రమ్‌ సీడర్‌నుపయోగించి గానీ విత్తాలి. ఇలా చేస్తే, నారు పెంచి నాటిన పంటకంటే వారం రోజులు ముందే కోతకొస్తుంది. వెదజల్లే పద్ధతిని అనుభవమున్న రైతులే చేపట్టాలి. అనుభవం లేకపోతే నారు సరిగా అతకదు. నారు సరిగా మొలవదు. పంట సరిగా రాదు. అనుకూలమైన సన్నరకాలు: తెలంగాణ సోన (ఆర్‌.ఎన్‌.ఆర్‌-15048), బిపిటి-5204 (సాంబమసూరి) ఈ రకాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి మార్కెట్‌ ఉంది. నూతన సన్న గింజ రకాలు: ఆంధ్రప్రదేశ్‌కు: ఎం.టి.యు-1280, 135 రో. 28 క్వి/ఎ, సుజాత (ఎం.టి.యు-1210): 135 రో, 26-28 క్వి/ఎ, తెలంగాణకు: తెలంగాణ వరి-3 (జె.జి.ఎల్‌-21078): 120 రో. 32-34 క్వి/ఎ. తెలంగాణ వరి-2 (డబ్లు.జి.ఎల్‌-697):135 రో., 28-32 క్వి/ఎ. కూనారమ్‌ రైస్‌-1(కె.ఎన్‌.ఎమ్‌-733): 120 రో. 28-30 క్వి/ఎ.

ప్రత్తి: విపరీత వర్షాలు కురిసిన చోట ప్రత్తి పంట బాగా దెబ్బతిన్నది. ఎక్కువైన నీరు పల్లానికి వెళ్లేటట్టు నీటికడ్డంగా ఉన్న మట్టిని పారలతో తొలగించాలి. సేంద్రియ వ్యవసాయంలో 10-15 లీ. జీవామృతాన్ని 150-200 లీ. నీటితో కలిపి మొక్కలపై పిచికారి చేయాలి. ఇది సాధారణ పరిస్థితుల్లో పిచికారీ చేసే దానికి అదనం. భూమిపై పొర కొద్దిగా ఆరిన తర్వాత అంతరకృషికి బ్యాటరీతో నడిచే మినీట్రాక్టర్లను వాడవచ్చు. దీనివలన ఖర్చు బాగా తగ్గుతుంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో వర్షాధారంగా, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆగస్టులో విత్తడం అలవాటు. నల్లభూముల్లో ఎక్కువ దిగుబడి వస్తుంది. మిగతా ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణలలో ఈ నెలలో ప్రత్తి విత్తరాదు. పురుగులు, రోగాలు అధికం. పంట దిగుబడి తక్కువ. మే నెలాఖరు నుండి జూన్‌, జూలై నెలల్లో విత్తిన ప్రత్తిలో అంతర సేద్యం, కలుపు నివారణ పైపాటి ఎరువులు వేయుట, సస్యరక్షణ ఆగస్టులో చేపట్టాల్సి ఉంటుంది. ఆగస్టు నెలలో బెట్ట పరిస్థితులేర్పడితే, వీలయిన చోట తడి ఇస్తే దిగుబడి పెరుగుతుంది.

రాగి: ఆగస్టు చివరి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పంటను విత్తుకోవచ్చు. అనుకూలమైన రకాలు: ఖరీప్‌, రబీ, వేసవిలలో (అన్ని కాలాలలో) పండి అధిక దిగుబడినిచ్చే రకాలు. భారతి: 12-16 క్వి/ఎ, 105-115 రోజులు, తిరుమల: 14-15 క్వి/ఎ, 115-120 రోజులు, చొప్ప దిగుబడి ఎక్కువ. సువర్ణముఖి: 14-15 క్వి/ఎ, 105-110 రోజులు, వరి మాగాణులకు అనుకూలం. పంట చివరి థ బెట్టను తట్టుకుంటుంది. ఇంద్రావతి: 14-15 క్వి/ఎ. 115-120 రోజులు, కాల్షియం, ఐరన్‌, జింకు ఎక్కువ. నారు పెంచి నాటుకోవచ్చు. నేరుగా ప్రధాన పొలంలో విత్తుకోవచ్చు. రాగి మద్దతు ధర: రూ. 3846/క్వి.

సిరిధాన్యాలు: కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, ఆరికలు ఆగస్టులో కూడా విత్తుకోవచ్చు. అధిక దిగుబడి రకాలు: కొర్రలు: రేనాడు (ఎస్‌.ఐ.ఎ-3223), ఎస్‌.ఐ.ఎ-3156: 11-13 క్వి/ఎ, 85-90 రోజులు, వెర్రకి కంకి తెగులును తట్టుకుంటాయి. సామలు: దిగుబడి 5-6 క్వి/ఎ, 90-110 రోజులు. ఓ.ఎల్‌.ఎమ్‌-36-3, బి.ఎల్‌-6, ఊదలు: డి.హెచ్‌.బి.ఎమ్‌-93-3: 9-10 క్వి/ఎ, 90-95 రోజులు. ఆరికలు: టి.ఎన్‌.ఎ.యు-86: 9-12 క్వి/ఎ, 95-110 రోజులు. జె.కె-13: 9-14 క్వి/ఎ, 95-110 రోజులు, జె.కె-48: 10-11 క్వి/ఎ, 95-100 రోజులు. అండుకొర్రలు: బి.టి.ఎం-1: 9-10 క్వి/ఎ, 100-110 రోజులు, జి.పి.యు.బి.టి.-6: 8-9 క్వి/ఎ, 90-92 రోజులు.

సోయాచిక్కుడు: కోస్తాంధ్రా ప్రాంతంలో ఈ పంటను ఆగస్టు-సెప్టెంబరులలో కూడా విత్తవచ్చును. మిగతా ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణలో ఈ నెలలో విత్తరాదు. దిగుబడి బాగా తక్కువ. అధిక వర్షాలకు దెబ్బతిన్న ఖరీఫ్‌ సోయా పంటను కాపాడడానికి, మచ్చతెగుళ్ళ నివారణకు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పసుపురంగు సోయాబీన్‌ మద్దతు ధర రూ. 4600/క్వి.

ప్రొద్దు తిరుగుడు: ఈ పంటను బరువైన నేలల్లో ఆగస్టు కడ వరకు విత్తి మంచి దిగుబడులు పొందవచ్చు. ప్రొద్దుతిరుగుడు విత్తనాల మద్దతు ధర రూ. 6760/క్వి. ఎక్కువ దిగుబడినివ్వగల్గిన ప్రైవేట్‌ కంపెనీల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. జూలైలో విత్తిన పొద్దు తిరుగుడు పంటలో అంతర సేద్యం, కలుపు నివారణ, పైపాటి ఎరువులు వేయుట, కాలువలు, బోదెలు ఏర్పాటు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. జూన్‌లో విత్తిన పంటలో బెట్ట పరిస్థితులొస్తే తడి ఇవ్వాలి. చిలుకలు తిని పోకుండా కాపాడాల్సుంటుంది. శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, తామర పురుగులకు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎకరాకు 400 గ్రా. బోరాక్స్‌ 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేస్తే గింజల దిగుబడి బాగా పెరుగుతుంది.

నువ్వులు: తెలంగాణాలో నువ్వు పంటను ఆగస్టు రెండవ పక్షంలో విత్తి అధిక దిగుబడి పొందవచ్చు. భూమి తయారీ, ఎరువులు వేసి విత్తుట ఆగస్టులో పూర్తి చేయాలి. అనుకూలమైన రకాలు: జగిత్యాల తిల్‌-1 (జె.సి.ఎస్‌-1020), తెల్లగింజ. వానాకాలంలో నిదానంగా విత్తిన పంట. దిగుబడి 280-300 కిలోలు/ఎ. 85-90 రోజుల పంట. శారద (ఎలమంచిలి-66): లేత గోధుమ రంగు విత్తనాలతో ఎకరాకు 600 కిలోల వరకు దిగుబడి నిస్తుంది. 80-90 రోజుల పంట. నువ్వుల మద్దతు ధర: రూ. 8635/క్వి. మే లో విత్తిన నువ్వు పంట ఆగస్టులో కోతకొస్తుంది.

చెరకు: చెరకు పంట కాలం మరియు ఎదుగుదలను బట్టి జడచుట్లు ఆగస్టు నెలలో వేయాల్సి ఉంటుంది. ఈ నెలలో దూదేకుల పురుగులు ఎక్కువగా ఉండే అవకాశమున్న చోట తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తెలంగాణలో అడ్సాలి పంటగా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో చెరకు నాటవచ్చు. బడ్‌చిప్‌ పద్ధతిలో నాటితే విత్తనపు ఖర్చు నాలుగింట మూడువంతులు ఆదా అవుతుంది. ఈ పద్ధతిలో ముచ్చెలకు బదులుగా, చెరకు కన్నులను యంత్ర సహాయంతో వేరు చేసి విత్తనంగా వాడుతారు. కన్నులు తీయగా మిగిలిన చెరకును బెల్లం లేదా చక్కెర తయారీకి, మామూలుగా వాడవచ్చు. నీటి ముంపుకు గురైన చెరకు పంట నుండి అధిక నీటిని వీలయినంత త్వరగా తీసెయ్యాలి. పసుపునల్లి, పొలుసుపరుగు, దూదేకుల పురుగు (స్పైరెల్లా) తెల్లపేను (ఊలి ఎఫిడ్‌), తెల్లనల్లి, రసంపీల్చు పురుగుల ఉధృతి తగ్గడానికి చెరకుపై పక్కన ఉన్న 8 ఆకులను మిగిల్చి క్రింది ఆకులన్నింటినీ జడవలె చుట్టుకోవాలి. అవసరాన్ని బట్టి పురుగుల నదుపు చేయడానికి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

అందివచ్చిన మహదవకాశం – వదలుకోవద్దు: చెరువుల్లో, బావుల్లో రిజర్వాయర్లలో పుష్కలంగా నీరు. సన్న బియ్యానికి కూరగాయలకు ప్రపంచమంతా మంచిధరలు. రైతులు రైతు సంఘాలను ప్రోత్సహించి, ఈ పంటలను ఎక్కువగా పండించేటట్లు ప్రోత్సహించిన పార్టీలకు రైతుల్లో మంచి పేరు, పలుకుబడి వస్తుంది. దండిగా ఓట్లు వచ్చే అవకాశం. రైతు సంఘాల ద్వారా వడ్లను మరపట్టించి బియ్యంగా తయారు చేయడానికి ప్రోత్సాహకాలనందిస్తే, ఎగుమతి చేయడంలో రైతు సంఘాలకు సహకరిస్తే, రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునే దానికి బాగా వీలవుతుంది. మధ్యవర్తులు, దళారీలు పొందే లాభాలను రైతులకే అందించడానికి ఈ పద్దతి బాగా సహకరిస్తుంది.

ప్రతి పల్లె, జనావాసంలో రైతు ప్రజా సంఘాల ఏర్పాటుకుకనీస సపోర్టు ఇస్తే ఆర్థికంగా వారే ఎదగడానికి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులకు ఉత్పత్తిదారులకు అనుసంధానం ఏర్పడి, వినియోగదారులకు తక్కువ ధరల్లో పంటల ఉత్పత్తులు అందడానికి వీలవుతుంది. ఉత్పత్తి చేసే రైతులకు కూడా కొద్దిగా ఎక్కువ ఆదాయం వచ్చే దానికి వీలవుతుంది. అట్టడుగు ఆదాయం కల్గిన పట్టణ, గ్రామీణ ప్రజలందరి ఉన్నతికి, అభివృద్ధికి బాగా తోడ్పడుతుంది. ఈ పాలసీలను ప్రోత్సహించడం వల్ల పార్టీలకేమి ఉపయోగమంటే – ఎన్నికల్లో దండిగా ఓట్లు. దీనిని ఆచరణ సాధ్యం చేయడానికి సలహాలు, సూచనలకు ప్రొఫెసర్‌ సల్లా నారాయణ స్వామి, ఫోను నెంబరు 9494408619  చైర్మన్‌, నారాయణ ఫౌండేషన్‌, హైదరాబాదు. ఇ-మెయిల్‌: profsnswamy@gmail.com,   ఫేస్‌బుక్‌: SALLA Narayana Swamy