నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని జూన్ 4వ తేదీన తాకి, ఆంధ్రప్రదేశ్ను తర్వాత 3 రోజుల్లో, హైదరాబాదును 6 రోజుల్లో తాకవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలను 10 రోజుల్లో పూర్తిగా విస్తరించవచ్చు. తన పొలంలో, ఎప్పుడు ఎంత వర్షం పడిందనేది రైతు గమనించుకోదగిన ముఖ్యాంశం. ఈ నేపథ్యంలో జూన్ (రోహిణి, మృగశిర, ఆరుద్ర కార్తెలు) లో చేయవలసిన వ్యవసాయ పనులను గూర్చి తెలుసుకుందాం.
ఏ పంట పండించాలి. ఆ పంటలో, అందుబాటులో ఉన్న రకాలలో ఎక్కువ ఆదాయాన్నిచ్చే రకాన్ని సరైన పదనులో విత్తాలి. త్వరగా విత్తితే ముందుగా కోతకొస్తుంది. తదుపరి పంట పెట్టడానికి భూమి త్వరగా ఖాళీ అవుతుంది.
టమాట: క్రితం సంవత్సరం ఎండాకాలంలో ధరలధికంగా కిలో 100 రూపాయల దాకా పలికినాయి. విస్తీర్ణం పెరిగి ఈసారి ఎండాకాలం టమాట పంట విపరీతంగా మార్కెట్కు వచ్చి ధరలు బాగా తగ్గినాయి. రుతుపవన ప్రభావంతో మేఘావృత వాతావరణం, ఎక్కువ వర్షాలు, ముసురు ఏర్పడితే పంట దిగుబడి తగ్గుతుంది. ధరలు పెరిగే అవకాశముంది.

కొత్తిమీర: ఎండాకాలంలో క్రమం తప్పకుండా అధికాదాయాన్నిస్తున్న పంట కొత్తిమీర. ఈ పంట పెరగడానికి ఎండల్లో పాక్షిక నీడ అవసరముంటుంది. కొత్తిమీర ధరలు జూన్ మాసం అంతా అధికంగా ఉండే అవకాశముంది. జూలైలో తగ్గే అవకాశముంది. చల్లని ఎత్తైన ప్రాంతాలైన మదనపల్లి ప్రాంతాల్లో ఈ నెలలో ఈ పంటను విత్తి, మంచి దిగుబడులతో పాటు అధిక ఆదాయాన్ని పొందవచ్చు. వర్షాలు కూడా ఈ ప్రాంతంలో తక్కువే. మంచి పంట వస్తుంది. అధిక వర్షాలకు ఈ పంట దెబ్బతింటుంది. జూన్లో అధిక వర్షాలు కురిసే ప్రాంతాల్లో ఈ పంట విత్తకపోవడం మంచిది. పందిరి కూరగాయపొలాల్లో మామిడి, మునగ, కొబ్బరి మొదలగు తోట పంటల్లోని ఖాళీ భూమిలో పాలీహౌస్లు, షేడ్నెట్లు, నెట్హౌస్లు, చెట్ల కొమ్మలతో ఏర్పాటు చేసిన పందిర్ల క్రింద పాక్షిక నీడలో కొత్తిమీర సాగు చేసి, జూన్లో అధిక లాభం పొందవచ్చు.

ఫ్రెంచిచిక్కుడు: ఎండాకాలంలో పాక్షిక నీడలో పండే పంట. అత్యధిక ధరలుండే దాని వలన పాక్షిక నీడలో పండించవచ్చు. మొక్కజొన్న, ఆముదం పంటలలో అంతరపంటగా కూడా పండుతుంది.
ఆకుకూరలు: వర్షాధారంగా పండే ఆకుకూరలు జూలై మూడవ వారంలో మార్కెట్కు వస్తాయి. అంతవరకు నీటితడులతో పండించిన ఆకుకూరలకు బాగా గిరాకీ ఉంటుంది. ఇవి ఎండలకు వేడికి కూడా బాగా పెరుగుతాయి. అన్ని రకాల భూములను ఆకుకూరల పంటకు వినియోగించవచ్చు. పాల కూర కొద్దిగా తక్కువ దిగుబడితో చౌడు భూముల్లో కూడా పెరుగుతుంది. వేసవిలో మంచి ఆదాయాన్నిచ్చే ఆకుకూరలు: పాలకూర, తోటకూర, మెంతికూర, చుక్కకూర, గోంగూర, పొన్నగంటి కూర, సోయకూర, కొయ్యగూర మొదలయినవి.
సిరిధాన్యాలు: సేంద్రియ వ్యవసాయంలో, రసాయనాలు వాడకుండా, వర్షానికి, జూన్ నెలలో కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికలు విత్తడానికి అనుకూలం. మొలకెత్తడానికి సరిపడ వర్షం పడితే విత్తవచ్చు. రసాయనాలు లేకుండా పండిస్తున్నామని వాట్సాప్లో ప్రచారం చేసుకుంటే ఖర్చులేకుండా, మంచి ప్రచారం జరుగుతుంది. రైతు వద్దకే వచ్చి కొనుక్కెళతారు. పంట పెట్టిన తర్వాత సిరిధాన్యాలను బియ్యం చేసి అమ్మడం వలన రైతుకు మంచి లాభం వస్తుంది. బుచ్చి మెథడ్ ద్వారా రోజుకు 20 కిలోల వరకు చిన్న మిక్సీ ద్వారా పొట్టు తీసే అవకాశముంటుంది. ఇంటివద్దనే క్లీన్ చేసి బియ్యం చేసే అవకాశముంది. ఇంకా సులభంగా బియ్యం చేయ గల్గిన చిన్ని చిన్న యంత్రాల ఆవిష్కరణలు జరగాలి.
వర్షాధార కూరగాయలు: వర్షాధారంగా పండే భూముల్లో పలు కూరగాయలను పండించవచ్చు.
జూన్లో విత్తగలిగిన కూరగాయ పంటలు:

బెండ: జూన్లో విత్తవచ్చు. విత్తిన 40-45 రోజుల్లో తొలి కోత మొదలవుతుంది. సొంత వితనాలుపయోగిస్తే ఖర్చు తగ్గుతుంది. ఎగుమతి కనువైన పలు రకాలు/హైబ్రిడ్లు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. ఉదా: విశాల్, నాథ్శోభ, వర్ష మొ|| నీటి ఆధారముంటే, బెట్ట సమయాల్లో తడులిస్తే దిగుబడి బాగా పెరుగుతుంది.
వంగ: జూన్-జూలైలో నారు పోసి 30-35 రోజుల తర్వాత నాటుకోవచ్చు. ఆయా ప్రాంతంలో ప్రాచుర్యంలో గల రకాలను ఎంపిక చేసుకుంటే మార్కెటింగ్ సులభమవుతుంది. పచ్చని రకాలకు ధర ఎక్కువ లభిస్తుంది. టమాట కంటే రేటు ఎక్కువగా లభిస్తుంది.
గోరుచిక్కుడు: తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి నివ్వగల్గిన మొండి పంట. జూన్-జూలై నెలల్లో విత్తుకోవచ్చు. పశువుల దాణాగా, పచ్చిమేతగా, పచ్చి రొట్ట ఎరువుగా కూడా పనిచేస్తాయి. గింజల నుండి గమ్ తయారు చేస్తారు. లేత కాయలను కూరగాయగా వాడుతారు. అనుకూలమైన రకాలు: పూసా సదాబహార్, పూసా మౌసమి మొ|| కూరగాయల దిగుబడి 3 నుండి 6 టన్నులు/ఎ. గింజ దిగుబడి 600-800 కిలోలు/ఎకరాకు.
పందిరి కూరగాయలు: జూన్-జూలై నెలల్లో విత్తుకోదగినవి.

ఆనప/సొర: అనుకూలమైన హైబ్రిడ్లు: అమిత్, విక్రాంత్, వరద్ అనుకూలమైన రకాలు: పి.ఎస్.పి.ఎల్. అర్కబహార్, పూసానవీన్.
దోస: వీటిని లేతగా ఉన్నపుడు సాలాడ్ (పచ్చిదోస) గా వాడుతారు. ముదిరిన తర్వాత కూరకు వాడతారు. అనుకూలమైన రకాలు: ఆర్.ఎన్.ఎస్.ఎం-3, ఆర్.ఎన్.ఎస్.ఎం-1
పచ్చిదోస: సాలాడ్గా పనికొచ్చే రకాలు: పూసాఖీర, కొ-1. సాలాడ్గా పనికొచ్చే హైబ్రిడ్లు: జిప్సి, మాలిని.
కాకర: ప్రస్తుతం అధిక ధర పలుకుతున్న రకాలలో స్టార్ కాకర చాలా ముఖ్యమైనది. దీనిని జూన్లో విత్తి అధిక దిగుబడి, అధిక ఆదాయం పొందవచ్చు.
గుమ్మడి: గుమ్మడి గింజల్లో జింకు లభ్యత ఎక్కువ. పూజల్లో ఎక్కువగా వాడుతారు. ఎప్పుడైన అమ్ముకోవచ్చు. నిల్వ ఉంటుంది. అధిక దిగుబడి రకాలు: పూసా విశ్వాస్, కో-2 మొదలయినవి. అధిక దిగుబడి హైబ్రిడ్: పూసా హైబ్రిడ్-1
బూడిద గుమ్మడి: గుండె జబ్బుల నివారణలో ప్రాముఖ్యం వహిస్తున్నది. పేట (గుమ్మడి స్వీట్) తయారీలో ఉపయోగపడుతున్నది. మంచి రకాలు: బి.హెచ్-25, బి.హెచ్-24
పొట్ల: నేలపై పాకే పొట్ల రకం: కొ-2, ఇది పందిరిపై కూడా కాస్తుంది. ఇతర రకాలు: పి.కె.ఎం-1, శ్వేత. అనుకూలమైన హైబ్రిడ్ (పందిరిపైన పండించడానికి): ఎం.డి.యు-1.
దొండ: జూన్-జూలైలలో నాటవచ్చు. చలి తక్కువగా ఉండే కోస్తాఆంధ్ర ప్రాంతంలో సంవత్సరమంతా నాటుకోవచ్చు.
కీరదోస: మంచి పార్థినోకార్పిక్ రకాలు: కియోన్, సటిన్, అలామిర్
పూలు:
బంతి: ఏదైనా పండుగకు ఈ పూలందివ్వాలంటే ఆ పండుగకు 60 రోజుల ముందుగా బంతి నారు నాటాలి. జూన్ రెండవ వారంలో నారు పోసుకుని జూలై 2వ వారంలో నాటితే మార్కెట్ చేయడానికి అక్టోబరులో పూలొస్తాయి.
గులాబి: వీటి అంట్లను జూన్ నెల నుండి జనవరి నెల వరకు నాటవచ్చు. సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో నాటితే చాలా ఎక్కువ దిగుబడి వస్తుంది. మంచి రకాలు: హైబ్రిడ్ టీస్: ఆదిత్య, గ్రాండ్గల, అమాలియ మొ|| ఫ్లోరిబండాస్: ఆకాష్ దీప్, రెడ్ ట్రెంప్ మొ|| మినియేచర్: బేబిచాక్లెట్, నర్తకి, పింక్ స్ప్రే మొ||
మల్లె: జూన్-జూలై నెలల్లో వేర్లు వచ్చిన పిలక మొక్కలు నాటాలి. సుమారు 5 కణుపులు గల కొమ్మ కత్తిరింపులను జూన్ నుండి సెప్టెంబరు వరకు ఇసుకలో నాటాలి. త్వరగా వేర్లు రావడానికి కాండపు ముక్కలను 4 గ్రా. ఇండోల్బ్యూట్రిక్ ఆమ్లం (ఐ.బి.ఎ)ను లీటరు నీటిలో కలిపి ద్రావణంలో ముంచి నాటాలి. గుండుమల్లెను 5þ5, జాజిమల్లెను 7þ7, కాగడ మల్లెను 6þ5 అడుగుల ఎడంలో నాటాలి. గుండుమల్లె: రెండు వరస రేకులుంటే దొంతర మల్లె అని, పెద్దపూలుంటే బొద్దుమల్లె అని అంటారు. గుండు మల్లెలు మార్చి నుండి అక్టోబరు వరకు పూస్తాయి.
జాజిమల్లె: మంచి సువాసన ఉంటుంది. సంవత్సరమంతా పూస్తుంది. కాని ఏప్రిల్ నుండి నవంబర్ వరకు ఎక్కువ పూలనిస్తాయి.
కాగడమల్లె: నవంబరు నుండి జనవరి వరకు పూలనిస్తాయి.
కనకాంబరం: మే-జూన్ నెలల్లో నారు పెంచి ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో ప్రధాన పొలంలో 60þ30 సెం.మీ. దూరంలో నాటాలి. చలికాలం, ఎండాకాంలో బాగా పూస్తుంది. వర్షాకాలంలో తక్కువగా పూస్తుంది. అంటే సంవత్సరమంతా పూస్తుంది.
వేరుశనగ: జూన్ 2వ పక్షం నుండి జూలై మొదటి వారంలోపు విత్తి అత్యధిక దిగుబడులు పొందవచ్చు. జూలై మొదటి వారం తర్వాత విత్తడంలో నిదానమయ్యే కొద్దీ దిగుబడి తగ్గుతూ వస్తుంది. విత్తనాల కొరత వేరుశనగలో చాలా ఎక్కువ. మంచి రకాల విత్తనాలకు విపరీతమైన గిరాకీ ఉంది. మంచి రకాలు: విశిష్ట (టి.సి.జి.ఎస్-1694), కదిరి-9, కదిరి-7, నిత్యహరిత. విశిష్ట రకాన్ని విత్తనోత్పత్తి చేపట్టి అత్యధిక దిగుబడి, అత్యధిక ఆదాయం పొందండి. విత్తనాలు పండించే వారు వాట్సాప్లో ఖర్చు లేకుండా ప్రచారం చేసుకోవచ్చు. సులభంగా మార్కెట్ చేసుకోవచ్చు.
ప్రత్తి: కల్తీల బెడద విపరీతంగా ఉన్న పంటలలో ప్రత్తి ముఖ్యమైనది. అందుకే అనుభవమున్న రకాలను, బాగా నమ్మకస్తుడైన డీలరు దగ్గరనే కొనండి. కొత్తవాళ్ల దగ్గర విత్తనాలు కొనద్దు. కొత్త రకాలను వేయాలనుకుంటే కొద్ది విస్తీర్ణంలో (ఒక సెంటు లేక ఒక కుంట)లో పరీక్షించి, బాగా పండితే తదుపరి సంవత్సరంలో వాటి విస్తీర్ణాన్ని పెంచవచ్చు. అధిక సాంద్రత విధానంలో ప్రత్తి పండించి, అధిక దిగుబడులు పొందవచ్చు. నీటి ఆధారంతోను వర్షాధారంగా కూడా, అధిక సాంద్రతలో సాగు చేయవచ్చు. ఈ విధానంలో పంట త్వరగా పూర్తయి, తర్వాత పంటగా పెసర, మినుము, శనగ, నువ్వులు, వేరుశనగ వంటి పంటలు పండించుకోవచ్చు.

వరి: గవర్నమెంటు కొంటామంటుంది. మిల్లుల యాజమాన్యాలు సతాయిస్తుంటాయి. కాబట్టి మిల్లుల యాజమాన్యాల మీద, గవర్నమెంటు మీద ఆధారపడకుండా బయట అమ్ముకున్నా ఎక్కువ రేటుకు అమ్ముడుబోయే రకాలనే విత్తుకోండి. పంట పండినాక దాన్ని దాచుకొని, పాతగయినాక ఎక్కువ రేటుకు బియ్యం చేయించి అమ్ముకోవడానికి మొదటి నుండి ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఈ విధమైన పద్ధతులు అమలు చేయడానికి రైతు ప్రజా సంఘాలను ప్రతి పల్లెలోను, ఏర్పాటు చేసుకోండి. వాటి ద్వారా ఆర్థికంగా బలమైన వారుగా రైతులు ఎదగాలి. వివరాలు కావలిస్తే 9494408619 కు ఫోను చేయండి.

ప్రొద్దు తిరుగుడు: తేలిక నేలల్లో జూన్ 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. అత్యధిక దిగుబడినిచ్చే ప్రైవేటు హైబ్రిడ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అనువైన పబ్లిక్ హైబ్రిడ్లు: ఎన్.డి.ఎస్.హెచ్-1012, దిగుబడి: 600-720 కిలోలు/ఎకరానికి. డి.ఆర్.ఎస్.హెచ్-1, దిగుబడి: 520-640 కిలోలు/ఎకరానికి.
ఆముదం: మే చివరి వారం నుండి జూలై కడవరకు విత్తడానికనుకూలం. అనువైన రకాలు: ప్రగతి: దిగుబడి 6-7 క్వి/ఎ. 85-150 రోజులు. ఎండు తెగులును తట్టుకుంటుంది. త్వరగా కోతకొస్తుంది.అనువైన హైబ్రిడ్లు: పి.సి.హెచ్111, పి.సి.హెచ్-222, దిగుబడి: 7-8 క్వి/ఎ. ఎండు తెగులును తట్టుకుంటాయి. ఐ.సి.హెచ్-66: దిగుబడి 7-9 క్వి/ఎ. ఎండుతెగులును మరియు బెట్టను తట్టుకుంటుంది.
మొక్కజొన్న: దిగుబడి పెరిగినా, పౌల్ట్రీ పరిశ్రమలో వినియోగము ఎక్కువగా ఉన్నందున ధరలు నిలకడగా ఉన్నాయి. మార్కెట్ ధరలు అనుకూలంగా ఉన్నాయి. 30-35 క్వి/ఎ దిగుబడినిచ్చే పబ్లిక్ హైబ్రిడ్లు: డి.హెచ్.ఎం-117 (బి.హెచ్.-40625), డి.హెచ్.ఎం-119 (బి.హెచ్-4062), డి.హెచ్.ఎం-121 (బి.హెచ్-41009). 40-45 క్వి/ఎ దిగుబడినిచ్చే ప్రైవేటు హైబ్రిడ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్పెషల్ రకాలు: ఈ నెలలో విత్తదగినవి. తీపి రకాలు: కాంపోజిట్ రకాలు: విన్ఆరంజ్, అల్మోరా, ప్రియ, మాధురి, హైబ్రిడ్ రకాలు: షుగర్-75, బ్రైట్ జీన్. పేలాల రకాలు: పెర్ల్ పాప్ కార్న్ కాంపోజిట్, వి.ఎల్. అల్మోరా పాప్కార్న్, అంబర్ పాప్కార్న్. మన దేశంలో బేబికార్న్ రకాలుగా గుర్తించిన కాంపోజిట్లు: వి.ఎల్-42, హిమ్-123, హిమ్-129, మాధురి తీపిజొన్న, హైబ్రిడ్లు: హిమ్-128, ప్రకాశ్, హెచ్.ఎం.-4, పూసా ఎర్లీ హైబ్రిడ్ మొక్కజొన్న-1, పూసా ఎర్లీ హైబ్రిడ్ మొక్కజొన్న-2.
పంటలలో అధిక వివరాలకు, రైతు ప్రజా సంఘాలు అన్ని పల్లెలకు విస్తరించడానికి సంప్రదించవలసిన ఫోను నెంబర్లు: 9494408169 / 8639526595, సల్లా నారాయణస్వామి, ఛైర్మన్ – నారాయణ ఫౌండేషన్.

