నేలలో పోషకాల పెంపుకు… బయోడైనమిక్ ఎరువులు

షామోమైల్ (503) : షామోమైల్ పూలను అవు చిన్న ప్రేవులలో నింపి శీతాకాలంలో సారవంతమైన భూమిలో కప్పిపెట్టాలి. కంపోస్టు కుప్పలలోని నత్రజని, కాల్షియం వాతావరణంలో కలిసి పోకుండా పట్టి వుంచుతుంది. పొటాషియం, మాంగనీస్, బోరాన్‌లతో పాటు అజటోబాక్టర్ బాక్టీరియా చర్యలను ప్రేరేపిస్తుంది. అజటోబాక్టర్ భూమిలో నత్రజనిని స్థిరీకరించే బాక్టీరియాలో అత్యుత్తమమైనది.

కొండీదురదగొండి (504) : కొండీ దురదగొండి మొక్కలను ఒక సంవత్సరంపాటు సారవంతమైన నేలలో పూడ్ౘ్ిపెట్టాలి. ఇది భూమిలో సేంద్రియ పదార్థం సరిగా కుళ్ళి పోవడానికి సహాయపడుతుంది. క్లోరోఫిల్ ఏర్పడటానికి భూమిలో ఇనుము, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, గంధకం చర్యలను ప్రేరేపించడానికి సహాయపడుతుంది.

ఓక్ చెట్టు బెరడు (505) : ఓక్ చెట్టు బెరడును ఆవు కపాలంలో ఉంచి చలి కాలమంతా నీటిలో వుంచాలి. కాల్షియం, భాస్వరం భూమి లోనికి జీవ రూపంలోచేరి మొక్కలను తెగుళ్ళనుండి కాపాడుతుంది.

డ్యాండెలియన్ (506) : ఆవు మీసెంటరీలోని డ్యాండెలియన్ భూమిలోని పొటాషియం / సిలికా బాక్టీరియాని ప్రేరేపించి పెరుగుదల శక్తులతో అతి సమర్థవంతంగా పనిచేయడానికి ప్రేరేపిస్తుంది. మొక్కలకు కావలసిన వాటిని ఆకర్షించడానికి సిలికా సహాయపడుతుంది. పూతని పెంచడానికి దోసజాతి కాయలలో చివరి వరకు నింపడానికి సహాయపడుతుంది. ఆహార పదార్థాలలో పోషకాలను పెంచుతుంది. భూమిలో మెగ్నీషియం, బోరాన్, సెలీనియం చర్యలను ప్రేరేపిస్తుంది.

వ్యాలీరియన్ (507) : వ్యాలీరియన్ పూలతో తయారు చేసిన టింక్బర్ భూమిలోని బాక్టీరియాని చైతన్యపరచి, భాస్వరం ప్రక్రియని ప్రోత్సహించి భాస్వరం, సెలీనియం, మెగ్నీషియం కదలికలను ప్రేరేపిస్తుంది. పూత ప్రక్రియకు సహాయ పడుతుంది. కంపోస్టు కుప్పచుట్టూ వెచ్చదనాన్ని పరుస్తుంది.

Read More

పొదుగు వాపు… పాడి రైతులకు పెను సవాలు! నివారణ ఎలా?

“పాలు ఇచ్చే ప్రతి పశువు… రైతు కుటుంబానికి ఒక ఆదాయ వనరు. దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి రైతు బాధ్యత.”

   పాడి పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన వ్యాధుల్లో పొదుగు వాపు (మాస్టిటిస్) ఒకటి. ఈ వ్యాధి వల్ల పశువు పొదుగులో వాపు, నొప్పి, పాలలో గడ్డలు, రంగు మారడం లేదా ఇతర అసాధారణ మార్పులు, పాల దిగుబడి తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఫలితంగా పాడి రైతులు పాల దిగుబడి తగ్గడం, చికిత్స ఖర్చులు పెరగడం, పాల నాణ్యత తగ్గడం వంటి ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. అయితే, సరైన అవగాహన, పరిశుభ్రత, శాస్త్రీయ నిర్వహణ పద్ధతులను పాటించడం ద్వారా మాస్టిటిస్‌ను చాలా వరకు నివారించవచ్చు. పొదుగు వాపు రావడానికి ప్రధాన కారణాలు, పాడి రైతులు తరచుగా చేసే పొరపాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే వ్యాధి వచ్చినప్పుడు అనుసరించాల్సిన చర్యలను తెలుసుకుందాం.

పొదుగు వాపు లక్షణాలు
పొదుగు వాపు (మాస్టిటిస్)ను ప్రారంభ దశలోనే గుర్తించడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే సకాలంలో చికిత్స ప్రారంభిస్తే పశువు త్వరగా కోలుకోవడంతో పాటు పాల దిగుబడిలో వచ్చే నష్టాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అందువల్ల ప్రతి పాడి రైతు ఈ వ్యాధి లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలి. పొదుగు వాపు వచ్చిన పశువులలో ప్రభావితమైన భాగం ఉబ్బడం, గట్టిపడటం లేదా నొప్పిగా ఉండటం గమనించవచ్చు. ఆ భాగం సాధారణం కంటే వేడిగా అనిపించవచ్చు. పాలు పితికే సమయంలో పాలు గడ్డకట్టినట్లు కనిపించడం, పాలు పలుచగా లేదా నీరుగా మారడం, రంగు మారడం లేదా రక్తపు చారలు కనిపించడం వంటి మార్పులు కనిపించవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ పాల దిగుబడి తగ్గుతుంది. కొన్నిసార్లు పాలు పితికేటప్పుడు నొప్పి కారణంగా పశువు కాలు ఎత్తడం, తన్నడం లేదా అసౌకర్యంగా ప్రవర్తించడం గమనించవచ్చు. తీవ్రమైన పరిస్థితుల్లో జ్వరం, నీరసం, ఆకలి తగ్గడం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు కూడా కనిపించవచ్చు.
ఈ లక్షణాల్లో ఏవైనా కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా పశువైద్యుడిని సంప్రదించాలి.

పొదుగు వాపు వచ్చినప్పుడు రైతులు ఏం చేయాలి?
పొదుగు వాపు లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా పశువైద్యుడిని సంప్రదించి, సూచించిన చికిత్సను వెంటనే ప్రారంభించాలి. స్వయంగా మందులు వాడడం లేదా ఇతరుల సలహాతో చికిత్స చేయించడం మంచిది కాదు. అలాగే, పశువు ఆరోగ్యం మెరుగుపడిందని భావించి చికిత్సను మధ్యలోనే ఆపివేయకూడదు.

   చికిత్స జరుగుతున్న సమయంలో వ్యాధి సోకిన పశువును సాధ్యమైనంత వరకు ఇతర పశువులకు దూరంగా ఉంచడం మంచిది. పాలు పితికేటప్పుడు ఆ పశువును చివరగా పితకాలి. అనంతరం చేతులు, పాలు పితికే పాత్రలు లేదా యంత్రాలను పూర్తిగా శుభ్రపరచాలి.

     అదేవిధంగా, చికిత్స సమయంలో వచ్చే పాలను పశువైద్యుడి సూచనల ప్రకారం మాత్రమే వినియోగించాలి లేదా పారవేయాలి. యాంటీబయాటిక్స్‌ చికిత్స పొందుతున్న పశువుల పాలను, పశువైద్యుడు సూచించిన విత్‌డ్రావల్‌ పీరియడ్‌ (మందుల అవశేషాలు పాలలో పూర్తిగా తొలగే వరకు వేచి ఉండాల్సిన గడువు) పూర్తయ్యే వరకు తాగకూడదు, అమ్మకూడదు లేదా ఇతర అవసరాలకు వినియోగించకూడదు.

    చికిత్సను పూర్తిగా కొనసాగించి, సూచించిన జాగ్రత్తలను పాటించడం వల్ల పశువు ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు వ్యాధి మళ్లీ వచ్చే అవకాశాన్ని కూడా తగ్గించుకోవచ్చు.

పొదుగు వాపు ఎందుకు వస్తుంది? ఎలా నివారించాలి?
పొదుగు వాపు (మాస్టిటిస్) ఎక్కువగా వ్యాధికారక సూక్ష్మజీవులు పొదుగులోకి ప్రవేశించడం వల్ల వస్తుంది. ఈ సూక్ష్మజీవులు ప్రధానంగా పాలు తీసే సమయంలో, అపరిశుభ్రమైన పశువుల కొట్టం వల్ల లేదా పొదుగుకు ఏర్పడిన చిన్న గాయాల ద్వారా లోపలికి చేరుతాయి. అందువల్ల పొదుగు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ పాటించే పాడి నిర్వహణ పద్ధతులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

    పాలు తీసే సమయంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. పాలు తీసే ముందు పొదుగును శుభ్రమైన నీటితో కడిగి, ఒక్కో పశువును ప్రత్యేకమైన శుభ్రమైన పొడి గుడ్డతో తుడవాలి. పాలు తీసే వ్యక్తి చేతులు, ఉపయోగించే పాత్రలు లేదా యంత్రాలు కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. ప్రతిసారీ మొదటి కొన్ని పాల ధారలను ప్రత్యేక పాత్రలో సేకరించి జాగ్రత్తగా పరిశీలించాలి. పాలలో గడ్డలు, రక్తపు చారలు, రంగు మారడం లేదా పాలు పలుచగా కనిపించడం వంటి మార్పులు ఉంటే వెంటనే పశువైద్యుడిని సంప్రదించడం మంచిది. పాలు తీసిన అనంతరం చనుమొనలను పశువైద్యులు సూచించిన క్రిమిసంహారక ద్రావణంలో కొన్ని సెకన్ల పాటు ముంచడం (టీట్‌ డిప్పింగ్‌) వల్ల సూక్ష్మజీవులు నశించి, పొదుగు వాపు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే, పాలు తీసిన వెంటనే పశువు పడుకోకుండా కొద్దిసేపు నిలబడి ఉండేలా చూడాలి. ఇందుకోసం కొద్దిగా పచ్చిగడ్డి లేదా దాణా వేయడం మంచిది. ఇలా చేయడం వల్ల చనుమొనలు సహజ స్థితికి చేరే వరకు సూక్ష్మజీవులు పొదుగులోకి ప్రవేశించే అవకాశం తగ్గుతుంది. పాలు తీసే విధానం కూడా పొదుగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పాలను ఎల్లప్పుడూ పూర్తి చేతి పద్ధతిలో తీయాలి. పిడికిలి కణుపులతో (Knuckling) పాలు తీయడం వల్ల చనుమొనలకు గాయాలు ఏర్పడి, పొదుగు వాపు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే, పొదుగులో పాలు మిగిలిపోకుండా పూర్తిగా పాలు తీయడం, ప్రతిరోజూ ఒకే సమయానికి పాలు తీయడం కూడా పొదుగు ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

   పశువులు ఉండే పరిసరాల పరిశుభ్రత కూడా పొదుగు వాపు నివారణలో కీలకమైనది. కొట్టంలో పేడ, మూత్రం, బురద పేరుకుపోతే సూక్ష్మజీవులు వేగంగా పెరుగుతాయి. పశువులు పడుకునే ప్రదేశం ఎల్లప్పుడూ పొడిగా, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో కొట్టం తడిగా, బురదగా మారకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల పొదుగు వాపు వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. పశువు ఆరోగ్యం బాగుంటేనే పొదుగు ఆరోగ్యంగా ఉంటుంది. సమతుల్య పోషకాహారం, ఖనిజ లవణాల మిశ్రమం, విటమిన్లు, పరిశుభ్రమైన తాగునీరు తగిన మోతాదులో అందితే పశువు శారీరక స్థితి మెరుగుపడుతుంది. దీంతో సూక్ష్మజీవులను ఎదుర్కొనే శక్తి పెరిగి, పొదుగు వాపు వచ్చే అవకాశం తగ్గుతుంది. అదే విధంగా, ప్రసవం అనంతరం, అధిక పాలిచ్చే దశలో లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న సమయంలో పశువులపై మరింత శ్రద్ధ చూపడం అవసరం. ఈ దశల్లో సరైన పోషణ, మంచి నిర్వహణ అందిస్తే పొదుగు వాపు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

పొదుగు వాపును నివారించాలంటే పరిశుభ్రమైన పాడి నిర్వహణ, సరైన పాలు తీసే పద్ధతి, పశువుల ఆరోగ్యంపై నిరంతర శ్రద్ధ—ఈ మూడింటినీ రోజువారీ అలవాటుగా మార్చుకోవాలి.

“రోజువారీ పాడి నిర్వహణలో పాటించే చిన్న చిన్న జాగ్రత్తలే… పెద్ద నష్టాలను నివారిస్తాయి.”

Dr. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్,
Dr. బద్దం అఖిల, టీచింగ్ ఫాకల్టీ,
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం,
పశువైద్య కళాశాల, కోరుట్ల. 7093198419

Read More

చేనులో ఉన్న పత్తి పంట: వాతావరణ మార్పుల వేళ ప్రస్తుత యాజమాన్యం

విత్తడం పూర్తయ్యి, తెలంగాణలో ఎక్కువ ప్రాంతాల్లో పత్తి పంట ప్రస్తుతం శాఖీయ పెరుగుదల నుంచి పూత, పిందె దశల్లో ఉంది. వర్షాల మధ్య పొడి వాతావరణం, ఆకస్మిక భారీ వర్షాలు, రాత్రి ఉష్ణోగ్రత మార్పులు చీడపీడల ఉధృతిని వేగంగా మారుస్తున్నాయి. కాబట్టి రైతులు క్యాలెండర్ ప్రకారం మందులు పిచికారీ చేయకుండా, చేనులో ఉన్న ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తక్షణ నిర్ణయాలు తీసుకోవడం అత్యంత కీలకం.

పొలంలో తప్పనిసరిగా పరిశీలించాల్సిన అంశాలు
ప్రతి 3–4 రోజులకు పత్తి చేనులో గులాబీ రంగు పురుగు (కాయ తొలచే పురుగు) లక్షణాలను తప్పనిసరిగా పరిశీలించాలి; పూత దశలో ముడుచుకున్న గులాబీ పువ్వులు కనిపిస్తున్నాయా, అలాగే 10–15 రోజుల పచ్చికాయలను కోసి చూస్తే లోపల పురుగు లేదా నల్లటి మచ్చలు ఉన్నాయా చూడాలి. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల అడుగుభాగంలో తామర పురుగులు, తెల్లదోమ ఉధృతి పెరుగుతుందనే కారణంగా ఆకులు దోనెల్లా లేదా పసుపు రంగులోకి మారుతున్నాయా గమనించాలి. అలాగే వర్షాల తర్వాత గాలిలో తేమ పెరిగినప్పుడు కాయలపై నల్లటి మచ్చలు ఏర్పడి కుళ్ళిపోతున్నాయా, కాయ కుళ్ళు లేదా బ్యాక్టీరియల్ తెగుళ్ల లక్షణాలను కూడా పరిశీలించాలి.

నాన్-బిటి విత్తనాలు వేయకపోతే ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు
విత్తనాల సమయంలో సరిహద్దు పంటలు (నాన్-బిటి పత్తి లేదా కందులు) వేయకపోవడంతో గులాబీ రంగు పురుగు నేరుగా పత్తిపై దాడి చేసే అవకాశం పెరుగుతుంది. దీనిని తగ్గించేందుకు ఎకరానికి 4–5 లింగాకర్షక బుట్టలు కట్టి, రోజుకు ఒక్కో బుట్టలో 8 కంటే ఎక్కువ రెక్కల పురుగులు పడితే ఉధృతి అధికంగా ఉన్నట్లు భావించాలి. అలాగే ఎకరానికి 10–15 పసుపు, నీలి రంగు జిగురు అట్టలను పైరు ఎత్తుకంటే కొద్దిగా పైన అమర్చడం ద్వారా రసం పీల్చే పురుగులను సుమారు 40% వరకు తగ్గించవచ్చు.

పిచికారీ వ్యూహం (MoA Rotation)
45–90 రోజుల పంటలో రసం పీల్చే పురుగుల నియంత్రణకు వేప నూనె (NSKE 5%) లేదా నింబిసిడిన్ పిచికారీ చేస్తే సాలీళ్ళు, లేడీబర్డ్ బీటిల్స్ వంటి మిత్రపురుగులు రక్షించబడతాయి. గులాబీ రంగు పురుగు ఆర్థిక నష్టపరిమితి (ETL) దాటినప్పుడు శాస్త్రీయంగా సిఫార్సు చేసిన మందులను మాత్రమే వాడాలి. అలాగే ఒకసారి వాడిన మందును తదుపరి పిచికారీలో మళ్లీ వాడకూడదు.

భారీ వర్షాలు కురిసినప్పుడు వెంటనే చేపట్టాల్సిన చర్యలు
పొలంలో నీరు నిల్వ ఉండకుండా వెంటనే మురుగునీటి కాలవలు ఏర్పాటు చేసి నీటిని బయటకు పంపాలి; లేకపోతే వేరు కుళ్ళు తెగులు వ్యాపిస్తుంది. గాలిలో ఆర్ద్రత పెరిగినప్పుడు Bacillus thuringiensis (Bt) లేదా NPV వంటి బయో-పెస్టిసైడ్స్ వాడకం మెరుగైన ఫలితాలు ఇస్తుంది.

లేట్ ఫ్లష్ (చివరి ఏరుత)లో దిగుబడి తగ్గకుండా పురుగు నియంత్రణ వ్యూహం
చాలామంది రైతులు డిసెంబర్–జనవరిలో వచ్చే చివరి ఏరుత ద్వారా అదనపు ఆదాయం ఆశించినా, ఈ దశలో గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మందుల మోతాదు పెంచి అధిక ఖర్చు చేయకుండా, PB-Rope లేదా లింగాకర్షక బుట్టల్లో ల్యూర్‌లు మార్చి మగ పురుగులను ఆకర్షించడం ద్వారా సంతానోత్పత్తిని తగ్గించాలి. కాయ తొలిచే దశలోనే తక్కువ ఖర్చుతో జీవ నివారణ పద్ధతులు లేదా సిఫార్సు చేసిన స్ప్రేలు వాడాలి. చివరి ఏరుత అనంతరం పత్తి కట్టెలను పొలంలో వదలకుండా రొటోవేటర్ లేదా షెడ్డర్‌తో తుంచితే మిగిలిన పురుగులు, కోశస్థ దశలు నశించి తదుపరి పంటకు పొలం పరిశుభ్రంగా ఉంటుంది.

వాతావరణ మార్పుల ప్రభావం పత్తి సాగుపై స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, వాటిని అధిగమించడం రైతు చేతుల్లోనే ఉంది. అధిక రసాయన పిచికారీలు పరిష్కారం కాదు; అవి ఖర్చు పెంచి పురుగుల్లో నిరోధక శక్తిని పెంచుతాయి. శాస్త్రీయ పర్యవేక్షణ (ETL), లింగాకర్షక బుట్టల వినియోగం, సకాలంలో మందుల మార్పిడి, పొలం పరిశుభ్రత ద్వారా వాతావరణ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవచ్చు. సాంప్రదాయ పద్ధతులకంటే క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా శాస్త్రీయ నిర్ణయాలు తీసుకునే రైతు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి, ఎక్కువ లాభాలను సాధించగలడు.

“పరిస్థితులు మారినప్పుడు మన వ్యూహం మారాలి — శాస్త్రీయ పర్యవేక్షణే పత్తి రైతుకు నిజమైన రక్షణ!”.

  • జి. యశస్విని, ఎస్. కార్తీక్. 8463976019, 6301187682
Read More

ఔషధ మొక్క…. కాగితాల పువ్వు

కాగితాల పువ్వు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇది క్షీణిస్తున్న వాతావరణ పరిస్థితులలో కూడా పెరుగుతుంది. ఇది అన్ని చోట్లా పెరుగుతుంది. దీనిని హెడ్డి, పొద, ప్రాకే తీగగా కుండీల్లో పెంచవచ్చు. ఇది పదునైన మందమైన ముళ్ళు కలిగి ఉంటుంది. కనుక పశువులు, మేకలు, కోతులు, పక్షులు హని కలిగించవు. ఈ మొక్క సూర్యకాంతిని ఇష్టపడుతుంది. వేడి, పొడి వాతావరణంలో కొన్ని రకాలు కాంతివంతంగా, ఆకర్షణీయమైన రంగులలో పెరుగుతాయి. ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఈపూవుకి గుర్తింపుగా ఒక పోస్టల్ స్టాంప్‌ని విడుదల చేసింది.

సాధారణ నామం : బోగన్ విల్లియా శాస్త్రీయ నామం : బోగన్ విల్లియా గ్లాబ్రా/ బోగన్‌విల్లియా సైక్టాబాలిస్ కుటుంబం: నిక్టాజినేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • ఈ మొక్క ఆకులు పినిటోల్ అనే రాసాయనం కలిగియుండి మధుమేహ వ్యాధి చికిత్సలో ఉపయోగపడతాయి. డయాబెటిస్ చికిత్సలకు ఆకులను ఉపయోగిస్తారు.
  • కాగితాల పూలతో తయారు చేసిన టీని, శ్వాసకోశవ్యాధుల నివారణకు త్రాగిస్తారు.
  • ఈ మొక్క పూలు, కాండాలను ఎండబెట్టి నీటిలో మరిగించి టీ లాగా త్రాగుతారు.
  • ఆకులను డయేరియా, చికిత్సలలో ఉపయోగిస్తారు. దగ్గు, గొంతునొప్పి, ఎసిడిటి నివారణకు ఉపయోగిస్తారు.
  • పూల ద్రావణాన్ని తక్కువ రక్తపోటు చికిత్సకు ఉపయోగిస్తారు. కొమ్మలు హెపటైటిస్ చికిత్సలో ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • కాగితాల పువ్వు మొక్క ఆకుల పొడి (10 గ్రా. గాఢత) చిక్కుడు గింజలు నిల్వ సమయంలో ఆశించే బీన్‌వీలిల్, అకాంతో సెలిడెస్ ఓబ్టెక్టస్‌ని అత్యధికంగా చంపింది. (విల్సన్, అతని అనుచరుడు, 2016) ఆకులలో ఫినాల్ అధిక పరిమానంలో వున్నాయి కనుక కీటక నాశక చర్య ప్రదర్శించాయి. (లీ, అతని అనుచరులు, 1997)
  • కాగితాల పువ్వు మొక్క ఆకుల డ్రావణం టమాట, చిక్కుడు పంటల నాశించే అనేక వైరస్ తెగుళ్ళను నివారిస్తుంది.
  • ఆకుద్రావణం తయారీ: ఒక లీటరు నీటిలో 200 గ్రా. తాజా ఆకులను కలిపి కనీసం 5 నిమిషాలు మిక్సీలో కలపాలి.
  • కాగితాల పువ్వు మొక్క ఆకులు మిథనాల్ ద్రావణం వరి పంటనాశించే లద్దె పురుగు స్పోడోప్టెరా మరిషియా 3 నుండి 6వ దశ లార్వాలు, పూలపై లార్వా సైడల్‌పై మరియు ప్యూపెసైడల్ చర్య ప్రదర్శించాయి. ఆకుల ద్రావణం { కీటక పెరుగుదల క్రమబద్దీకరం, ఫ్యూఫెనోక్సురాన్ పిచికారి స్పొడోప్టెరా మరిషియా నివారణకు అత్యత్తమ ఎంపిక అని ఫలితాలు వెల్లడించాయి. (ప్రసీజ, అతని అనుచరులు, 2015)
  • బోగన్ విల్లియా ఆకు ద్రావణం ఈడెస్ ఈజిప్టు లార్వా, ప్యూపాలను చంపింది. (రాజమోహన్ Ê లోగన్ కుమార్, 2012)
  • బోగన్‌విల్లియా స్పెక్లిబాలిస్ ఆకు ద్రావణం అలసంద, పొద్దుతిరుగుడు పంటల నాశించే సన్‌ఫ్లవర్ నైక్రోసిస్ వైరస్‌లను తగ్గించింది (సోమేశ్వర్ భాగత్, అతని అనుచరులు, 2016)

బోగన్ విల్లియా ఆకుల కషాయం
కావలసిన పదార్థాలు: కలబంద ఆకులు – 1 కి., బోగన్ విల్లియా, ఆకులు 1 కి., బొప్పాయి ఆకులు – 1 కి. పసుపు పొడి – 200 గ్రా.

తయారు చేసే విధానం

  • పైన సూచించిన ఆకులను పసుపు పొడిని పైన పేర్కొన్న మోతాదులో తీసుకుని ఆకులను బాగా మెత్తగా నూరి 10 లీటర్ల నీరు పోసిన కుండలో వేసి దానికి 200 గ్రా. పసుపు పొడిని కలిపి పొయ్యిపై పెట్టి సన్నని సెగతో ఉడక బెట్టాలి. తర్వాత ఆ కషాయాన్ని బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా తయారైన కషాయాన్ని వడకట్టి ఒక డ్రమ్ములో పోయాలి. దీనికి 100 లీటర్ల నీరు కలిపి నిల్వ వుంచకుండా వేంటనే ఒక ఎకరంలో పంటపై సాయంత్రం వేళలో పిచికారి చేయాలి.
  • పంటకాలంలో పంట దశ,తెగులు ఉధృతిని బట్టి రెండు సార్లు పిచికారి చేసుకోవచ్చు.

నివారించబడే పురుగులు

  • బోగన్ విల్లియా ఆకులలో వున్న రసాయనాలు విత్తన నిల్వలో ఆశించే కీటకాల నాశణిగా, వికర్షినిగా పనిచేస్తాయి.
  • బోగన్‌విల్లియా ఆకులు బియ్యంలో ముక్కు పురుగులను పూలు, అపరాల గింజల నిల్వలో ఆశించే బీటిల్స్ నివారిస్తాయి.
  • బోగన్ విల్లియా ఆకుల కషాయం వేరుశనగ పంట నాశించే రసం పీల్చే పురుగుల నివారణకు బాగా పనిచేస్తాయి.

నివారించబడే తెగుళ్ళు

  • బోగన్ విల్లియా ఆకుల కషాయం పసుపు పెసర వంటి పంటల నాశించే ఆకుమచ్చ తెగుళ్ళను నివారిస్తుంది.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పూత, పిందె ఏర్పాటులో సహాయపడే బయోడైనమిక్ ఎరువు ‘యారో (502)’

యారోపూలను మగ కణుజు మూత్రాశయంలో ఉంచి వేసవికాలంలో ఎండలో వ్రేలాడదీసి, రాబోయే శీతాకాలంలో సారవంతమైన భూమిలో పూడ్చి పెట్టాలి. ఇది పొటాషియం, సిలికా, సెలీనియం చైతన్యకారక బాక్టీరియాని ప్రేరేపించి గంధకం యితర పదార్థాలతో కలియడానికి సహాయపడుతుంది. పూత, పిందె సరిగ్గా ఏర్పడకపోతే ఈ బలహీనతను పోగొట్టి పూత, పిందె ఏర్పాటులో సహాయ పడుతుందీ బయోడైనమిక్ ఎరువు. మొక్కలను బలపరచి పురుగుల తాకిడి నుండి రక్షిస్తుంది. గ్రహాల రిథమ్స్‌తో భూమిని కలపడానికి సహాయపడుతుంది.

Read More

టాప్-లిట్ అప్‌డ్రాఫ్ట్ కిల్న్ పద్ధతిలో బయోచార్ తయారీ

టాప్-లిట్ అప్‌డ్రాఫ్ట్ (Top-Lit UpDraft – TLUD) కిల్న్ అనేది పంట అవశేషాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా నాణ్యమైన బయోచార్‌గా మార్చే సమర్థవంతమైన సాంకేతికత. ఈ కిల్న్ సాధారణంగా ఇనుప లేదా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయబడుతుంది. అడుగు భాగంలో నియంత్రిత గాలి ప్రవేశానికి రంధ్రాలు, పై భాగంలో పంట అవశేషాలను నింపేందుకు అనువైన ఏర్పాటు ఉంటుంది.

ముందుగా పొడి పంట అవశేషాలను 5–15 సెం.మీ. పొడవు ముక్కలుగా చేసి కిల్న్‌లో నింపాలి. అనంతరం పైభాగంలో కొద్దిపాటి పొడి గడ్డి, చిన్న చెక్క ముక్కలు లేదా ఇతర తేలికగా మండే పదార్థాలను వేసి మంట వేయాలి. మంట పైభాగం నుంచి క్రమంగా క్రిందికి వ్యాపిస్తుండగా, అడుగు భాగం నుంచి పరిమితంగా ప్రవేశించే గాలి కారణంగా అవశేషాలు పూర్తిగా కాలిపోకుండా పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా బయోచార్‌గా మారతాయి.

పైరోలిసిస్ పూర్తయిన తర్వాత గాలి ప్రవేశాన్ని నిలిపివేసి కిల్న్‌ను చల్లారనివ్వాలి. అనంతరం తయారైన బయోచార్‌ను బయటకు తీసి నిల్వ చేయాలి లేదా కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి పొలంలో ఉపయోగించవచ్చు.

ఈ పద్దతిలో పొగ తక్కువగా విడుదలవుతుంది, బయోచార్ నాణ్యత మెరుగ్గా ఉంటుంది. తయారీ సమయం తగ్గుతుంది మరియు కార్బన్ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఈ కారణాల వల్ల చిన్న రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలకు ఇది అనువైన, వాతావరణ అనుకూల సాంకేతికతగా గుర్తింపు పొందుతోంది.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం,
రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

ఔషధ మొక్క…. గుగ్గిలం / అండుగం చెట్టు

గుగ్గిలం ఒక మధ్య పరిమాణం నుండి పెద్ద పరిమాణం గల, తేలికగా విస్తరించే క్యానపి, కొద్దిగా వ్రేలాడే కొమ్మలు గల ఆకులు రాల్చే చెట్టు. సాధారణంగా దీని కాండం 3-5 మీ. పొడవుంటుంది. అడవులలో పెరిగేచెట్టు చుట్టుకొలత 1.2-1.8 మీ. ఎత్తు 9-15 మీ. ఉంటుంది. బెరడు చాలా పలుచగా, బూడిదఆకుపచ్చ, బూడిద లేదా ఎరుపు రంగులో ఉండి పలుచని, కాగితం లాంటి పొరలుగా విడిపోతుంది. ఆకులు ఒకదాని తర్వాత ఒకటిగా ఏర్పడతాయి. అవి 2.0-4.5 సెం.మీ. పొడవుండి కొమ్మల చివర్లలో గుంపులుగా ఏర్పడతాయి. చిన్న ఆకులు 1.7-3.1 సెం.మీ. పొడవుండి ఒకదానికొకటి ఎదురుగా ఏర్పడతాయి. పూలు తెల్లగా ఉంటాయి. 1.0-2.0 సెం.మీ. పొడవుంటాయి. పూలు కొమ్మల చివర గుబురుగా ఏర్పడతాయి. కాయలు 1-3 సెం.మీ. పొడవుండి 3 వాల్వులు, 3 గుండె ఆకారం, 1 విత్తనం గల పొరలను కలిగి ఉంటాయి.

సాధారణ నామం : ఇండియన్ ఒలిబానం శాస్త్రీయ నామం : బోస్వెల్లియాసెర్రేట కుటుంబం: బర్సరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వేలాది సంవత్సరాల నుండి గుగ్గిలం ద్రావణాన్ని వంటి వాపు, నొప్పి తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. దీనిని కీళ్ళనొప్పులు, డయేరియా, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణకు కూడా ఉపయోగిస్తారు. గుగ్గిలం ధూపం డిప్రెషన్, ఆందోళనకు ఉపశమనం కల్గిస్తుంది.
  • ఆస్టియో ఆర్థరైటిస్, రుమాటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళనొప్పులు, బర్సొటిస్, టెండొనైటిస్‌ల నుండి ఉపశమనం పొందడానికి ఉపయోగిస్తారు. దీనిని అల్సరేటివ్‌కోలైటిస్, కడుపునొప్పి, ఉబ్బసం, హేఫీవర్, గొంతునొప్పి, సిఫిలిస్, మహిళలలో రుతు సమయంలో నొప్పులు, మొటిమలు, క్యాన్సర్ నివారణలో ఉపయోగిస్తారు.
  • దీనిని ఉత్తేజికం, మూత్రం పారడం అధికం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. గుగ్గిలం రెసిస్ ఆయిల్, ద్రావణాలను సబ్బులు, కాస్మటిక్స్, ఆహార పదార్థాలు, పానీయాల తయారీలో ఉపయోగిస్తారు. గుగ్గిలం యాంటిక్యాన్సర్ లక్షణాలను కూడా కలిగి ఉంది.

వ్యవసాయరంగంలో

  • గుగ్గిలం ఆకు ద్రావణం (5%, 10%, 15%), ఫ్యుజేరియం మొనిలిఫార్మె, ఫ్యుజేరియం సొలాని, ఆల్టర్నేరియా ఆల్టర్నేట పెరుగుదలను గరిష్టంగా అరికట్టింది (పెట్కార్, 2013). గుగ్గిలం ఆకు ద్రావణం ఫ్యుజేరియం సొలాని పెరుగుదలను గరిష్టంగా అరికట్టింది. గుగ్గిలం ఆకుద్రావణాన్ని పంటలలో తెగుళ్ళ నివారణకు జీవశిలీంద్రనాశినిగా ఉపయోగించవచ్చు. ఇది పర్యావరణహితమైనది. పశువులకు, మనుషులకు ఎటువంటి హాని జరగదు.
  • గార్గ్ (1974) ఫ్యుజేరియం మొనిలిఫార్మెపై గుగ్గిలం ఆకు ద్రావణం శిలీంద్రనాశక చర్యను రిపోర్టు చేశాడు. వరి పంటలో పురుగుల నివారణకు గుగ్గిలం ఆకులను పొలంలో వెదజల్లుతారు. గుగ్గిలం బంకని కాల్చి పొగ పెడితే ఈగలు, దోమలు వికర్షింపబడతాయి (శర్మ అండ్ సావంత్, 20120.
  • గుగ్గిలం బెరడు ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ శిలీంద్ర పెరుగుదలను 50% వరకు అరికడుతుంది (మిశ్రా & దుబె, 1994).
  • గుగ్గిలం ఎసెన్షియల్ ఆయిల్ పైన్ వుడ్ నెమటోడ్‌ని గణనీయంగా నివారిస్తుంది (పార్క్, అతని అనుచరులు, 2005, ఆండ్రెస్, అతని అనుచరులు, 2012).
  • గుగ్గిలం బెరడు ఎసెన్షియల్ ఆయిల్ స్టెఫైలోకోకస్ ఆరియస్, ఎస్కెరిచియా కోలి, ప్రోటియస్ మిరాబిలిస్ బాక్టీరియా పెరుగుదలను గణనీయంగా తగ్గించింది (కసాలి, అతని అనుచరులు, 2000).
Read More

‘వండని వంటలు’ ఓ అద్భుతం‘వంద వండని వంటలు’ పుస్తకావిష్కరణలో పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

ఈరోజు హైదరాబాద్‌లోని వారి నివాసంలో ‘రైతునేస్తం పబ్లికేషన్స’ ప్రచురించిన ‘వంద వండని వంటలు’ పుస్తకాన్ని పూర్వ ఉప రాష్ట్రపతి ఆవిష్కరించి… రచయిత, సంకలన కర్త తుమ్మేటి రఘోత్తమ రెడ్డిని అభినందించారు. ప్రస్తుత బిజీ ప్రపంచంలో బయటి ఆహారం మీద ఆధారపడకుండా, అప్పటికప్పుడు చేసుకుని తినేవిధంగా పలువురు అందించిన ఈ వండని వంటలు ఈతరానికి ఓ ఆరోగ్య దిక్సూచి. ఆరోగ్యానికి ప్రయోజనాన్ని కలిగించడమే గాక, సమయాన్ని ఆదాచేసే ఈ పుస్తకం ప్రత్యేకించి బ్రహ్మచారులకు, ఉద్యోగాలు చేసుకునే జంటలకు మరింత ప్రయోజనకారి కాగలదన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహారం నేపథ్యంలో పలు పుస్తకాలను అందిస్తున్న ‘రైతునేస్తం’ వ్యవస్థాపకులు శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి చొరవ ఇదే విధంగా కొనసాగాలని, ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాలను వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పద్మశ్రీ డా॥ యడ్లపల్లి వేంకటేశ్వర రావు, రచయిత తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, ‘మిసిమి’ పత్రిక సంపాదకులు అశ్వినీ కుమార్, వలేటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.

‘రైతునేస్తం పబ్లికేషన్స’ ప్రచురించిన ‘వంద వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777 కు సంప్రదించండి.

Read More

‘పల్లె పలుకు బతకాలి’పుస్తకావిష్కరణలో పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని వారి నివాసంలో ‘రైతునేస్తం పబ్లికేషన్స్’ ప్రచురించిన ‘పల్లె పలుకు’ (పాత గుంటూరు మాండలికము) పుస్తకాన్ని భారత పూర్వ ఉపరాష్ట్రపతి యం. వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘పల్లె పలుకు’ను మరచిపోతున్న ఈ రోజుల్లో, ఆ పలుకును భావితరాలకు అందించటం కోసం ‘రైతునేస్తం’ వేంకటేశ్వరరావు వ్యయ ప్రయాసలకోర్చి తీసుకురావటం అభినందించదగ్గ విషయమన్నారు. రచయిత కోన రమణారావు 85 సంవత్సరాల వయస్సులో పాత గుంటూరు మాండలికాల పదాలను సేకరించటంతో పాటు వారే కోడి పుంజు, ఎడ్ల బండి, వ్యవసాయ పనులతో గీసిన ముఖచిత్రం నాకెంతో ఆనందం కలిగించింది. ఈ పుస్తకం మన భాషను కాపాడుకునే దిశగా ఓ చక్కని ప్రయత్నమన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకం పేరుకు పాత గుంటూరు కానీ దీనిలోని పలుకు అంతా ప్రతి పల్లె పలికే పలుకే. ఆ పదాలు చదువుతుంటే పల్లె వాతావరణాన్ని ఒక్కసారిగా మనల్ని ఆవహిస్తుందనీ, ఎవరినైనా తట్టిలేపే శక్తి ఆ పదాలకు ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పద్మశ్రీ ‘రైతునేస్తం’ వేంకటేశ్వరరావు, ‘మిసిమి’ పత్రిక సంపాదకులు అశ్వినీ కుమార్, ప్రముఖ కథకులు, మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, ఆకాశవాణిలో పనిచేసిన వలేటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.

రైతునేస్తం పబ్లికేషన్స్’ ప్రచురించిన ‘పల్లె పలుకు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పెరటిలో పోషకాహార తోటలతో ఆరోగ్యం, ఆర్థిక పొదుపు – మహిళ సాధించిన విజయగాథ

మహిళా రైతు విజయ గాధ

వ్యవసాయ కుటుంబానికి చెందిన శ్రీమతి సి. విజయ కుమారి వైఎస్సార్ కడప జిల్లా, మైదుకూరు మండలం, పప్పనపల్లి వాసి. విజయ ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం సామూహిక నిర్వహణ విభాగంలో మైదుకూరు మండలం పోషణ మరియు ఆరోగ్యం కార్యకర్తగా పనిచేస్తుంది. ఆమె గతంలో తన కుటుంబానికి అవసరమైన కూరగాయలను మార్కెట్ నుంచి కొనుగోలు చేసేది. పెరుగుతున్న కూరగాయల ధరలు, రసాయన అవశేషాలపై ఆందోళన, అలాగే కుటుంబ సభ్యులు తగినంత ఆకుకూరలు, కూరగాయలు తీసుకోకపోవడం వల్ల పోషకాహార లోపం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అని ఆమె గమనించింది.

ఈ నేపథ్యంలో కృషి విజ్ఞాన కేంద్రం (KVK), వొనిపెంట, ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటి పెరటిలో పోషకాహార తోటలు పెంపకం శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. శిక్షణలో సమతుల్య పోషకాహారం ప్రాముఖ్యత, ఇంటి పరిసరాల్లో శాస్త్రీయ పద్ధతిలో పోషకాహార తోటలు ఏర్పాటు, సీజన్కు అనుగుణంగా కూరగాయల ఎంపిక, వంటింటి వ్యర్థాలతో సేంద్రీయ ఎరువుల తయారీ, నీటి పొదుపు పద్ధతులు మరియు సహజ పురుగు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. అంతేకాక కూరగాయలు, పండ్ల తోటల్లో వాడే వివిధ రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలు, వాటివల్ల పర్యావరణానికి, మానవాళి ఆరోగ్యానికి కలిగే నష్టాలను గూర్చి తెలుసుకోవడం జరిగింది. కార్యక్రమం అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం (KVK), వొనిపెంట శాస్త్రవేత్తలు జాతీయ ఉద్యానవన పరిశోధన మరియు అభివృద్ధి ఫౌండేషన్ కూరగాయల విత్తనాల కిట్‌ను అందజేయటం జరిగింది. ఈ కిట్‌లో పాలకూర, మిరప, టమాటో, వంగ, బెండకాయ, నేతిబీర, సొరకాయ, ఉల్లి, అలసందలు, ముల్లంగి మరియు గోరు చిక్కుడు వంటి కూరగాయ విత్తనాలు ఉంటాయి

శిక్షణ ద్వారా పొందిన పరిజ్ఞానాన్ని ఉపయోగించి శ్రీమతి సి. విజయ కుమారి తన ఇంటి వెనుక ఖాళీ స్థలంలో టమాటా, బెండకాయ, వంకాయ, పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, కాకరకాయ, నేతిబీర, సొరకాయ, ఉల్లి, అలసందలు, ముల్లంగి, బీరకాయ తదితర కూరగాయలను సేంద్రీయ పద్ధతిలోఎటిఎం విధానంలో సాగు చేశారు. కొద్ది వారాల్లోనే కుటుంబ అవసరాలకు సరిపడా తాజా, పోషక విలువలు అధికంగా ఉన్న కూరగాయలు ఆమెకు అందుబాటులోకి వచ్చాయి.

దీని ఫలితంగా కుటుంబం మార్కెట్‌పై ఆధారపడటం గణనీయంగా తగ్గింది. కూరగాయల కొనుగోలు ఖర్చులో నెలకు సుమారు ₹1500–₹2,500 ల వరకు పొదుపు సాధించారు. కుటుంబ సభ్యుల ఆహారంలో ఆకుకూరలు, కూరగాయల వినియోగం పెరగడంతో వారి ఆరోగ్య పరిస్థితిలో సానుకూల మార్పులు కనిపించాయి. మిగులు ఉత్పత్తిని పొరుగువారికి విక్రయించడం ద్వారా ₹4,500 -5,000 లఅదనపు ఆదాయం కూడా పొందుతున్నారు. అలాగే ఆమె తమ పెరటి తోటలో పండిన కాయగూరలను , ఆకుకూరలను దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్ లో మరియు పాఠశాలలో పిల్లలు భోజనానికి అందించేది.

శ్రీమతి సి. విజయ కుమారి గారి న్యూట్రి గార్డెన్ విజయాన్ని చూసి గ్రామంలోని అనేక మంది తమ ఇళ్లలో కూడా పోషక తోటలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆ గ్రామంలో పోషకాహారం, సేంద్రీయ సాగు మరియు కుటుంబ ఆహార భద్రతపై అవగాహన కల్పించే ఆదర్శ మహిళగా ఆమె నిలిచారు.

విజయ అభిప్రాయం
కృషి విజ్ఞాన కేంద్రం అందించిన శిక్షణతో మా ఇంటి ఖాళీ స్థలం పోషకాహారాన్ని అందించే తోటగా మారింది. ఇప్పుడు మా కుటుంబానికి తాజా కూరగాయలు ఇంట్లోనే లభిస్తున్నాయి. డా॥బి. శ్రీ కాంతి శ్రీ, గృహవిజ్ఞాన శాస్త్రవేత్త తనకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వడం వల్లే నేను ఈ విజయం సాధించగలిగాను. ఇప్పుడు మా ఇంటికి కూరగాయల ఖర్చు తగ్గడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడింది. ప్రతి ఇంట్లో న్యూట్రి గార్డెన్ ఉంటే కుటుంబ ఆరోగ్యం, పోషకాహార భద్రత మరియు ఆర్థిక పొదుపు ఒకేసారి సాధ్యమవుతాయి.

సమాచారం కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 7032463875.

డా॥బి. శ్రీ కాంతి శ్రీ , డా ఎం. బాలకృష్ణ, డా ॥ఎన్ .శ్రీ విద్యారాణి, డా ॥టి. విజయ నిర్మల, డా ॥ఎస్ . ఫిరోజ్ హుస్సైన్, డా . బి. గోవిందరాజులు మరియు డా ॥ సి హెచ్ . రూత్, కృషి విజ్ఞాన కేంద్రం, ఒనిపెంట – డా॥వై. ఎస్. ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్న గూడెం. Ph: 9493993523

Read More