ఏనుగులు మందలుగా విరుచుకుపడి పంటల్ని సర్వనాశనం చేయడం, మనుషుల్ని తొక్కి చంపడం వంటి ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. ఏనుగులు దాడిచేసి పంటలను నాశనం చేశాక వాటిని తరమడం కంటే వాటి రాకను ముందే గుర్తించి అప్రమత్తమైతే చాలావరకు నష్టాన్ని నివారించగలుగుతాం. ఈ దిశగా కేరళలోని అమృత యూనివర్సిటీ ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ని ఉపయోగించి ‘అమృత ఎలిఫెంట్ వాచ్ టెక్నాలజీ’ని రూపొందించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన జీపీఏఐ సదస్సులో దానికి సంబంధించిన త్రీడీ నమూనాను ప్రదర్శించింది.
ఏనుగులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేస్తారు. రాత్రిపూట పనిచేసేందుకు వీలుగా ఇన్ఫ్రారెడ్ సపోర్ట్ ఉన్న కెమెరాలు వాడతారు. వాటిలోని సెన్సర్లు కెమెరా పరిధిలోకి వచ్చే జంతువుల కదలికల్ని గుర్తిస్తాయి. అవి ఏనుగులయితే అవి ఏ ప్రాంతంలో ఉన్నాయి? ఎటువైపు వెళ్తున్నాయి? వంటి వివరాలన్నీ కొన్ని సెకన్ల వ్యవధిలోనే విశ్లేషించి మెసేజ్ రూపంలో స్థానికులకు, రైతులకు మొబైల్ ఫోన్లలో పంపిస్తాయి. ఏనుగుల ఫోటోలు, వీడియోలు 5-10 సెకన్లలో అటవీశాఖ అధికారులకు చేరతాయి. కాబట్టి అవసరమైన చర్యలు వెంటనే తీసుకునేందుకు అవకాశాలు ఉంటాయి.

23 Sep, 2024
