ఈ మధ్యకాలంలో ఆవులలో ముఖ్యంగా ఒంగోలు ఆవులలో తిరిగి పొర్లడం అనే సమస్య మనం ఎక్కువగా గమనించవచ్చు. దీనికి కారణం ముఖ్యంగా గర్భవాతం, ఆరోగ్యం సరిగా లేకపోవడం, అండాశయ తిత్తులు మొదలైనవి.

  • పాడి పశువులలో అండాశయ ప్రాబల్యం 9-16 శాతం వరకు ఉంటుంది.
  • దీని వలన ఈతకు మరియు గర్భధారణకు మధ్య వ్యవధి 20-30 రోజులు పెరుగుతుంది.
  • ఆవులలో ఈతల సంఖ్య పెరిగేకొద్ది అదేవిధంగా అధిక పాల ఉత్పత్తి కారణంగా ఈ అండాశయ నీటి తిత్తులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • వేసవిలో తీవ్రమైన వేడి ఒత్తిడి కారణంగా ఆవులలో అండాశయ తిత్తులు ఏర్పడుట అధికమవుతుంది.

లక్షణాలు:

  • ఎదకు-ఎదకు మధ్య సమయం ఎక్కువగా లేదా తక్కువగా ఉండటం మనం గమనించవచ్చు. ఎద సమయం 2-3 రోజులు ఉంటుంది.
  • మట్టు ఎక్కువ పరిమాణంలో తరుచుగా వేస్తూ ఉంటుంది.
  • తోక మొదలులో లావుగా, ఎత్తుగా ఉంటుంది.
  • ఆవుకి మేపు సరిగా లేనప్పుడు సానుకూల శక్తి సమతుల్యత దెబ్బ తినడం వలన, హార్మోనుల సమతుల్యత ఏర్పడి మగ పశువు వలే దేహదారుఢ్యం సంతరించుకుంటుంది. 
  • పైన తెలిపిన లక్షణాలు ఎక్కువ కాలం ఉన్నట్లు అయితే గర్భంలోకి మట్టు చేరి గర్భం యొక్క పరిమాణం పెరుగుతుంది. దీని వలన పరీక్ష చేసిన యెడల చూడి పశువుగా భావించే అవకాశం ఉంటుంది.

కారణాలు:

  • హార్మోన్ల సమతుల్యం దెబ్బతినడం వలన అండాశయం నుండి  విడుదల అవ్వవలసిన అండం విడుదల అవ్వకుండా, అండాశయం మీద పుటిక పెద్దగా పెరిగి నీటితిత్తుగా పరిణామము చెందుతుంది.
  • శరీరంలో జీవక్రియలు అసమానతలకు లోనయినప్పుడు, మరియు గర్భవాతం ఎక్కువ రోజులు ఉన్న యెడల, పశువును ఎప్పుడూ కట్టేసి మేపడం వలన, ఒంట్లో కొవ్వు శాతం పెరిగి పోవడం వలన మరియు జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
  • మాంసకృత్తులు అధికంగా ఉన్న దాణా ఎక్కువ మోతాదులో ఇవ్వడం వలన (ఉదా: ఉలవలు)
  • ఈస్ట్రోజన్‌లు అధికంగా ఉన్న గడ్డి జాతులు (ఉదా: పిల్లిపెసర, చెరకు దవ్వ) అధిక మోతాదులో మేపడం వలన. 

నివారణ:

  • ఆవు ఈనిన తరువాత 3-5 నెలలలో తప్పనిసరిగా చూడి కట్టే విధంగా చూసుకోవాలి.
  • పాలు ఇస్తుంది కదా అని ఎక్కువ మంది రైతులు చూలి కట్టించడం మీద దృష్టి పెట్టకుండా ఎక్కువ కాలం దూడకు వదులుతారు.
  • ఎప్పుడూ పాకలో కట్టే ఉంచకుండా పొద్దున, సాయంత్రం కనీసం రెండు గంటలు ఆవులను తిరగనివ్వాలి.
  • సరైన మోతాదులో మేత మరియు దాణా అందించాలి. 
  • సూర్యరశ్మి ఎక్కువ సేపు పశువు యొక్క శరీరంకు తగిలే విధంగా చూసుకోవాలి.
  • దీని వలన పశువుకు విటమిన్‌-డి అందుతుంది. ఒంట్లో కొవ్వు శాతం నియంత్రణలో ఉంటుంది. దీనివలన పశువులలో జీవక్రియ ఆరోగ్యవంతంగా జరుగుతుంది.
  • త్వరితగతిన (3-5 నెలలు) చూలి కట్టిస్తే పాల దిగుబడి తగ్గిపోతుందనే అపోహను రైతు సోదరులు విడనాడి సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించినచో ఆవులలో అండాశయ నీటితిత్తుల సమస్యను అధిగమించి ఆర్థికంగా లాభపడతారు.

– బి. చంద్రప్రసాద్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, మందా శ్రీనివాస్‌, ప్రొఫెసర్‌, ఎన్‌.టి.ఆర్‌ విశ్వవిద్యాలయం, గన్నవరం.