ఆర్యోకరమైన సరదా… ఇంటి పంట

ప్రతి వ్యక్తికి కొన్ని సరదాలు / అలవాట్లు / వ్యాపకాలు ఉంటాయి. ప్రస్తుతం సమాజంలో వ్యక్తుల అలవాట్లను గమనించినట్లయితే చాలావరకు తమకు, సమాజానికి నష్టం కలిగించేవిగానే ఉన్నాయి. ఉదాహరణకు కొంతమందికి డ్రైవింగ్‌ సరదాగా ఉండవచ్చు. అనవసరమైన డ్రైవింగ్‌ వలన ఇంధనము రూపంలో డబ్బు ఖర్చు అవటంతోపాటు ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండవచ్చు. ఇంకొంతమంది ప్రొగత్రాగడానికి, డ్రగ్స్‌కు, అల్కహాలుకు, బెట్టింగుల లాంటి అలవాట్లను సరదాగా మొదలు పెట్టి చివరకు వాటికి బానిసలు అయ్యి ఎంతో నష్టపోతుంటారు. ఇంకా కొంతమంది ఫోన్ల వాడకం సరదాగా మొదలు పెట్టి అది అలవాటుగా మారి చివరకు ఫోన్లకు కూడా బానిసలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈవిధంగా చెప్పుకుంటూపోతే సమాజంలో అనేక రకాల సరదాలు, అలవాట్ల వలన తాము నష్టపోవడంతోపాటు సమాజానికి కూడా నష్టం వాటిల్లుతుంది. ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే మన సరదాలు, మన అలవాట్లు మనతో పాటు తోటి వారికి ఉపయోగపడేవిగా, మన ఆరోగ్యాన్ని కాపాడేవిగా, శారీరక శ్రమకు అవకాశం ఉండేవిగా ఉండాలి. అప్పుడు అన్ని రకాలుగా ఫలితాలు ఉంటాయి. అలాంటి సరదాలలో/అలవాట్లలో ఇంటిపంట మొదటి వరుసలో ఉంటుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ విషయాన్ని గ్రహించిన చాలామంది ఇంటిపంటవైపు అడుగులు వేశారు, వేస్తున్నారు. ఈ కోవకు చెందుతారు హైదరాబాద్‌ రాంపల్లి, నేతాజీనగర్‌లో టెర్రస్‌గార్డెన్‌ పెంచుతున్న ఎలిజబెత్‌.

ఎలిజిబెత్‌ రెండున్నర సంవత్సరాల క్రితం సరదా కోసం ఇంటి పంటను మొదలు పెట్టారు. ప్రస్తుతం ఆ ఇంటి పంట తమ ఆరోగ్యాలను కాపాడటంతో పాటు తన పరిచయాలను కూడా పెంచి ఒక మంచి సర్కిల్‌ను ఏర్పాటు చేసింది. ఈ సరదాకోసం మొదలు పెట్టిన ఇంటి పంట ద్వారా రెండున్నర సంవత్సరాలలో నైపుణ్యాన్ని పెంచుకొని తక్కువ కాలంలో తోటి వారికి అవగాహన కల్పించే స్థాయికి ఎలిజబెత్‌ ఎదిగింది. ఎలిజబెత్‌ ప్రస్తుతం తన అనుభవాలను తోటి వారికి పంచడంతో పాటు ఉద్యాన శాఖ వారు ఇంటి పంటపై ఏర్పాటు చేసే అవగాహన సదస్సుల ద్వారా కూడా తన అనుభవాలను తోటి ఇంటి పంటదారులకు తెలియచేస్తున్నారు. 

తన ఇంటి పంటలో పునాస మామిడి, చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి, పందిరిమామిడి, అల్‌టైమ్‌ మామిడి లాంటి మామిడి మొక్కలు, యాపిల్‌ బేర్‌ 5 మొక్కలు, నేరేడు రెండు రకాలు, దానిమ్మ, డ్రాగన్‌ఫ్రూట్‌, అంజూర, అరటి, స్టార్‌ఫ్రూట్‌, జీడిమామిడి, టేబుల్‌ నిమ్మ, తీపినిమ్మ, బత్తాయి, చింత మొదలగు పండ్ల మొక్కలతో పాటు అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలతో పాటు మందార, గులాబి లాంటి మొక్కలు కూడా పెంచుతున్నారు.

తమ ఇంటిపంటలో ఉన్న మొక్కలను ప్రతిరోజూ గమనిస్తూ పిండినల్లి లాంటి చీడపీడలను బ్రష్‌తో, పేనుబంకను (ఎఫిడ్స్‌) గంజి+ఇంగువ+పసుపు ద్రావణంతో నివారించుకుంటున్నారు. ప్రతి 10 రోజులకు మ్యాజిక్‌ కంపోస్టు (వివరాలను బాక్సు చూడగలరు)ను అందిస్తున్నారు. తీగజాతి కూరగాయలకు 3 జి కటింగ్‌ (వివరాలకు బాక్సు చూడగలరు) చేస్తూ ఎక్కువ దిగుబడి పొందుతున్నారు. కాకర, సొర, బీర లాంటి తీగ జాతి కూరగాయలు మగ, ఆడపూలు విడివిడిగా ఉంటాయి కాబట్టి రెండుకంటే ఎక్కువ మొక్కలు వేస్తున్నారు. తన ఇంటి పంటలో ఉన్న మొక్కలలో కొన్నింటిని తోటి ఇంటిపంట దారుల వద్ద నుంచి సేకరించి అభివృద్ధి చేసినవి ఉన్నాయి అని తనకు మొక్కలు అందచేసిన వారికి కృతజ్ఞతలు తెలియచేశారు. అదేవిధంగా తాను కూడా ఇతరులకు విత్తనాలు, మొక్కలు అందచేస్తూ తోటివారిని ఇంటిపంటవైపు అడుగులు వేయించడంలో తన వంతు కృషి చేస్తున్నారు. తన అనుభవాన్ని వేరే వారికి తెలియపరచడానికి ఏవిధమైన ఇబ్బంది పడకుండా తోటి వారిని ఇంటి పంట వైపు ప్రోత్సహిస్తున్నారు. తమ కుటుంబానికి, తోటి సమాజానికి, పర్యావరణానికి ఉపయోగపడే అలవాటును సరదాగా తీసుకొని కొనసాగిస్తున్న ఎలిజబెత్‌ని నిజంగా అభినందించవలసిందే. మరిన్ని వివరాలు మరియు ఇంటి పంటకు అవసరమైన సలహాలను ఎలిజబెత్‌ 8142055527కి ఫోను చేసి తెలుసుకోగలరు.  

మ్యాజిక్‌ ఫార్ములా

200 గ్రాముల ఆవపిండి, 200 గ్రాముల వర్మికంపోస్టు, 200 గ్రాముల వేపపిండి, 50 గ్రాముల తాజా టీ పొడి, తొక్కతో ఉన్న 4 అరటి పండ్ల పేస్టు. వాటన్నింటిని 20 లీటర్ల నీటిలో కలిపి ప్రతి రోజు రెండుసార్ల చొప్పున కట్టెతో 3 రోజులు కలిపితే మ్యాజిక్‌ కంపోస్టు తయారవుతుంది. 4వ రోజు నుండి ఈ ద్రవ ఎరువును ఉపయోగించుకోవచ్చు. లీటరు ద్రవ ఎరువుకు 10 లీటర్ల నీటిని కలిపి సాయంకాలం పూట మొక్కల పాదులలో అందించాలి. సున్నితమైన మొక్కలకు అయితే ఒక లీటరు ద్రవ ఎరువుకు 15 లీటర్ల నీటిని కలిపి మొక్కల పాదులలో అందించాలి. ఈ ద్రవ ఎరువును ప్రతి 10 రోజులకు ఒకసారి మొక్కలకు అందిస్తే ఫలితం బాగా ఉంటుంది.

మట్టి మిశ్రమం

30 శాతం ఎర్రమట్టి, 30 శాతం వర్మికంపోస్టు లేదా మాగిన ఆవుపేడ, 30 శాతం ఇసుక (కోకోపిట్‌ తప్పనిసరి కాదు) 10% వేప పిండిని కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకున్నట్లయితే 30 నుంచి 40 రోజుల వరకు ఎలాంటి పోషకాలు అందించ కుండానే మొక్కలు ఎదుగుతాయి. 40 రోజుల తరువాత పోషకాలు అందించవలసి ఉంటుంది. 

అలోవేరాతో అనేక ఉపయోగాలు

ఆలోవేరాని అంగుళం ముక్కలుగా కోసుకుని, ఒక లీటరు నీటిలో ఒక ముక్క వేసి 5 గంటలు నానిన తరువాత ఆ నీటిని మొక్కకు ఒక్కొక్క కప్పు చొప్పున పాదులలో అందిస్తే వర్షాకాలంలో నీరు ఎక్కువ అయినందువలన వచ్చే సమస్య నుండి మొక్క తేరుకుంటుంది. అంతేకాకుండా మల్బరి, గులాబి, మందార లాంటి కొమ్మలను కలబంద జ్యూస్‌లో ముంచి నాటుకున్నట్లయితే త్వరగా వేర్లు అభివృద్ధి చెందుతాయి అని ఎలిజబెత్‌ తాను పాటించిన పద్ధతులు వివరించారు. 

3జి కటింగ్‌

బీర, సొర, కాకర లాంటి తీగజాతి మొక్కలను 3 జి కటింగ్‌ చేసినట్లయితే ఎక్కువ ఆడపూలు పుష్పించి దిగుబడి పెరుగుతుందని ఎలిజబెత్‌ వివరిస్తున్నారు. ఇందుకు గాను తీగజాతి కూరగాయ మొక్క రెండు అడుగులు పెరిగిన తరువాత తల త్రుంచినట్లయితే రెండు ఇగుర్లు వస్తాయి. అవి కూడా ఒక అడుగు వచ్చిన తరువాత మరలా వాటి తలను త్రుంచితే ఈసారి ఒక్కొక్క దానికి రెండు చొప్పున రెండు తీగలకు 4 తీగలు వస్తాయి. మరలా అవి కూడా ఒక అడుగు పెరిగిన తరువాత తల గిల్లినట్లయితే ఈసారి 8 తీగలు వస్తాయి. ఈ 8 తీగలను వదలి వేసినట్లయితే ఎక్కువ బ్రాంచీలు వచ్చి ఆడ పూల శాతం పెరిగి ఎక్కువ దిగుబడి వస్తుందని ఎలిజబెత్‌ తన అనుభవాన్ని వివరించారు. 

చింత చిగురు పొందడం

ఇంట్లో డ్రమ్ములో చింత చెట్టు పెంచుకొంటూ ముదురు ఆకులని క్రమం తప్పకుండా గిల్లుతూ ఉన్నట్లయితే చింత చిగురు వస్తూ ఉంటుంది. తాను ఆ విధంగానే తన మిద్దె తోటలో పెంచుతున్న చింత చెట్టు నుండి చింత చిగురు పొందుతున్నానని ఎలిజబెత్‌ వివరించారు.

Read More

పెరటితోట బహుళార్థక సాధక ప్రాజెక్ట్‌ : రఘోత్తమరెడ్డి

మనిషికి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం లేని జీవితాలలో ఆనందం ఉండదు. కాబట్టి అందరికీ ఆరోగ్యం తప్పనిసరి. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు మన పెద్దలు. మన ఆరోగ్యం ప్రధానంగా మనం పీల్చుకునే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం, వ్యాయామం లాంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఈ నాలుగు అంశాలలో ఆహారం తప్పితే మిగతావి అన్నీ కూడా వేరేవారిపై ఆధారపడవలసిన అవసరంలేదు. ఆహారం మాత్రం చాలావరకు వేరేవారిపై ఆధారపడాలి. గ్రామాలలో జీవించేవారు, పంటల సాగు చేసే వారు మాత్రం కొంతవరకు తామే సొంతంగా పండించుకుంటూ కొంతవరకు మాత్రమే మిగతా వారిపై అంటే అవి పండించే రైతుల ద్వారా పంట ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసే వ్యాపారులపై ఆధారపడాలి. వేరే వారిపై ఆధార పడటం అంటే నమ్మకం కుదరక పోవచ్చు. ఈ సమస్యకు పరిష్కారం పెరటి తోట లేదా మిద్దెతోట లేదా ఇంటి పంట. ఇంటి పంట అవసరం ప్రస్తుతం అందరికీ ఉంటుంది. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి 12 సంవత్సరాల క్రితమే ఇంటి పంటను మొదలు పెట్టారు తుమ్మేటి రఘోత్తమరెడ్డి. సక్రమంగా ఇంటిపంటను చేపట్టినట్లయితే ఇంటి పంట ఒక బహుళార్థక సాధక ప్రాజక్ట్‌ అని రఘోత్తమ రెడ్డి తన అనుభవంలో గ్రహించారు.

రఘోత్తమరెడ్డిది స్వతహాగా వ్యవసాయ నేపథ్యం. చదువుకునే రోజుల్లో కూడా పొలం పనులలో తనవంతు పాత్ర పోషిస్తుండేవారు. సింగరేణిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా తన నివాస స్థలంలో పెరటి తోటను పెంచేవారు. మొత్తం మీద మొక్కల సాగులో 40 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. సింగరేణి సంస్థలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్న రఘోత్తమరెడ్డి ఒకానొక సందర్భంలో తాను నిర్వర్తించే ఉద్యోగ బాధ్యతలు సరైనవి కావు అని భావించి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి మిద్దెతోట వైపు అడుగులు వేశారు. ఉప్పల్‌ సమీపములోని నారపల్లిలో 160 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. స్థలం తక్కువగా ఉండటం వలన పెరటి తోట కుదరదు. పెరటి తోటకు ప్రత్యామ్నాయం మిద్దెతోట అని గ్రహించి ఇంటి పైన మిద్దెతోట పెంచాలని నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా ఇంటి నిర్మాణం చేయించారు. మిద్దెపైన కుండీలలో మొక్కలు పెట్టి మొక్కల పెరుగుదలకు నీటిని అందిస్తుంటాము కాబట్టి ఆ నీరు క్రిందకు కారకుండా ఉండేందుకు వీలుగా స్లాబును వేయించారు. మిద్దెపై కొన్ని  మడులు నిర్మించుకున్నారు. మొక్కలు పెంచుకోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలతో ఇల్లు నిర్మించుకున్నారు కాబట్టి గత 12 సంవత్సరాలకు పైగా మిద్దె తోటలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో పాటు బొప్పాయి, జామ, అరటి లాంటి పండ్ల మొక్కలను కూడా పెంచుతూ ఆరోగ్యరమైన దిగుబడులు తీస్తున్నారు.

మిద్దెపై నిర్మించిన మడులలో మరియు కుండీలు, ఇంట్లో వృథాగా పడిఉన్న కూలర్‌ బాక్సులు, బక్కెట్ల లాంటి వాటిలో కూడా వాటికి అనువైన మొక్కలు సాగు చేస్తున్నారు. వంటింటి వ్యర్థాలను మొక్కలకు అందిస్తూ చీడపీడల నివారణకు వేపనూనె లాంటివి ఉపయోగిస్తుంటారు. ప్రతిరోజు కొంత సమయాన్ని మిద్దెతోటలో గడుపుతూ ప్రతి మొక్కను పరిశీలిస్తూ ప్రాథమిక థలో ఉన్న చీడపీడలను చేతులతో కూడా నివారిస్తుంటారు. ఎక్కవగా నాటు రకం విత్తనాలను ఉపయోగిస్తూ తాను పెంచిన మొక్క నుంచే విత్తనాలను అభివృద్ధిపరుస్తూ అవసరమైన తోటి ఇంటి పంట ఔత్సాహికులకు విత్తనాలను అందిస్తూంటారు.

మిద్దెతోటను పెంచినందువలన ఇంటిలోపల ఉష్ణోగ్రత ఎండాకాలంలో కొద్దిగా తగ్గడం రఘోత్తమరెడ్డి తెలుసుకున్నారు. వేడి తగ్గి చల్లదనం లభిస్తే ఎండాకాలం ఏసిలు, కూలర్ల అవసరం లేకుండా పోయింది కాబట్టి విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. సాయంకాలం సమయంలో కొంత సమయం కుటుంబ సభ్యులందరూ మిద్దె తోటలో గడిపినట్లయితే ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపినట్లవుతుంది. అందరూ ఎంతో కొంత శారీరక శ్రమ చేయటానికి అవకాశం కుదురుతుంది. కాబట్టి మిద్దె తోటను ఒక బహుళార్ధక సాధక ప్రాజక్ట్‌ అని రఘోత్తమరెడ్డి అంటారు. రఘోత్తమ రెడ్డి స్వతహాగా కవి కాబట్టి మిద్దె తోటలో గడుపుతూ కవితలు రాస్తూ ఉంటారు.

ప్రస్తుతం గ్రామాలలో ఉన్న రైతులు ఏకపంట విధానానికి అలవాటు పడ్డారు కాబట్టి గ్రామాలలో కూడా ఇంటి పంట అవసరం ఉందని గ్రహించారు. పట్టణాలలో మరియు గ్రామాలలో కూడా ఇంటి పంట సాగుదారులను పెంచాలనే ధ్యేయంతో ఇంటిపంట ఆవశ్యకతను, ఇంటి పంటలో మెళకువలను సామాజిక మాధ్యమాల ద్వారా అందరికి తెలియచేస్తూ ఉంటారు. రైతునేస్తం తరఫున ఇంటి పంటపై జరుగుతున్న అవగాహన సదస్సులకు హాజరయ్యి తన అనుభవ పాఠాలను తోటి ఔత్సాహికులకు తెలియచేస్తుంటారు. అవగాహనా సదస్సులకు ఎలాంటి పరిమితులు విధించకుండా ఏ ప్రాంతానికైనా వెళ్ళి అక్కడ అవగాహనా సదస్సులలో భాగస్వాములవుతుంటారు. మిద్దెతోటకు సంబంధించిన పుస్తకాలను కూడా రైతునేస్తం పబ్లికేషన్స్‌ ద్వారా ముద్రించారు. ఇంటి పంట అభివృద్ధికి శక్తికి మించి కృషి చేస్తున్నారు.

ప్రస్తుత సమాజంలో సమాచారాన్ని విశ్వవ్యాపితం చేయటానికి సామాజిక మాధ్యమాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రఘోత్తమ రెడ్డి ప్రతిరోజూ ఇంటి పంటకు సంబంధించిన సమాచారాన్ని, చిత్రాలను వాట్సప్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా తోటి ఔత్సాహికులకు తెలియ చేస్తుంటారు. తాను తెలియపరిచే సమాచారం అంతా కూడా సరళమైన తెలుగు భాషలో అందరికీ అర్థం అయ్యేలా తెలుగులో టైపు చేసి పంపిస్తుంటారు. జిల్లాల వారీగా వాట్సప్‌ గ్రూపులను ఏర్పాటు చేసి తన సూచనలను సలహాలను ప్రతి జిల్లాలోని మారుమూల ప్రాంతాలలోని మిద్దెతోట/ఇంటిపంట ఔత్సాహికులకు చేరేలా చర్యలు చేపడుతుంటారు. ఇంటి పంటకు సంబంధించి సదస్సులు ఏర్పాటు చేసే నిర్వాహకుల ఆహ్వానం మేరకు సదస్సులకు హాజరై తన అనుభవ పాఠాలను వివరిస్తూ ఉంటారు. సదస్సుకు హాజరయ్యే ఔత్సాహికుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని సదస్సులకు హాజరవుతూ ఎక్కువ మందిని ఇంటిపంట వైపు అడుగులు వేయించడమే తన లక్ష్యం అంటూ ముందుకు నడుస్తున్నారు. ఇంటి పంట/పెరటి తోట / మిద్దె తోటల పెంపకంలో మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ అనుభవం ఉన్న వారి గురించి ప్రస్తావిస్తే రఘోత్తమరెడ్డి ముందు వరుసలో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహంలేదు. మరిన్ని వివరాలు 90001 84107 కి ఫోను చేసి తెలుసుకోగలరు. 

Read More

సమగ్ర సేద్యమే లాభదాయకం ఆకట్టుకున్న ‘రాయలసీమ ఆర్గానిక్‌ మేళా’

మన సంప్రదాయ వ్యవసాయ విధానమైన సమగ్ర వ్యవసాయ విధానంతో రైతులు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని ‘నాబార్డు’ చైర్మన్‌ చింతల గోవిందరాజులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్‌ సంయుక్తంగా తిరుపతిలో ఏప్రిల్‌ 8,9,10 తేదీల్లో ఇస్కాన్‌ మైదానంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల ‘రాయలసీమ ఆర్గానిక్‌ మేళా’ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. 

మార్కెటింగ్‌ సమస్య లేని తిరుపతి లాంటి కేంద్రాల్లో ఆర్గానిక్‌ విక్రయాలకు అవకాశం ఉందని ఆయన విక్రయదారులకు సూచించారు. సేంద్రియ వ్యవసాయానికి సహాయ సహకారాలు అందిస్తామని నాబార్డు చైర్మన్‌ డాక్టర్‌ చింతల గోవిందరాజులు తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆర్గానిక్‌ స్టోర్‌ ఏర్పాటు చేసేందుకు టిటిడి గానీ, ప్రకృతి వ్యవసాయదారులు గానీ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పురాతన కాలంలో ప్రజలు ఆరోగ్యంగా, బలిష్టంగా ఉండడానికి ప్రధాన కారణం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన పంటలను తినడమేనని వివరించారు. నేడు రసాయన ఎరువుల వాడకం రోజురోజుకూ పెరగడం వల్ల విషపూరిత ఆహార పదార్థాలు ఎక్కువగా లభిస్తున్నాయని, ఈ కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. కల్తీ లేని ఆహార ఉత్పత్తులను అందించడం ద్వారానే ఆరోగ్య భారత్‌ను చూడగలమని పేర్కొన్నారు. నాబార్డు ద్వారా ప్రకృతి వ్యవసాయం చేసే వ్యవసాయదారులను తాము ప్రోత్సహిస్తామని తెలిపారు. 1982లో 4 వేల కోట్లతో ప్రారంభమైన నాబార్డ్‌ నేడు 7 లక్షల 50 వేల కోట్ల రూపాయలకు చేరుకుందని తెలిపారు.    

రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ పద్మశ్రీ వై. వేంకటేశ్వరరావు మాట్లాడుతూ 2012 నుంచి సేంద్రియ వ్యవసాయ విధానాలపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రైతులు వినియోగదారుల్లో మార్పు కనిపిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం వ్యస్థాపకులు కుమారస్వామి మాట్లాడుతూ రసాయన వ్యవసాయానికి ఇచ్చే రాయితీలు సేంద్రియ వ్యవసాయానికి వర్తింపజేస్తే ప్రకృతి వ్యవసాయం ఊపందుకుంటుందన్నారు.

ప్రధాని నుంచి సామాన్యుడి వరకు...

భారతీయ కిసాన్‌సంఘ్‌ జాతీయ సంఘటన కార్యదర్శి దినేష్‌ కులకర్ణి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ఆరోగ్యం కోసం ప్రకృతి, గోఆధారి వ్యస్తాయంపై ఆధారపడడం మంచి పరిమాణం అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సంయుక్త నిర్వహణ కార్యదర్శి విజయ్‌ ఆదిత్య మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయ విధానాలను పాఠ్యాంశాలుగా చేర్చితే దేశ వ్యవసాయ విధానంలో మార్పు తేవచ్చని వివరించారు. ఆప్కాబ్‌ ఎండీ శ్రీనాథరెడ్డి ప్రసంగిస్తూ సేంద్రియ రైతులు రైతు ఉత్పత్తిదరాఉలు సంఘంగా ఏర్పడితే అనేక సౌకర్యాలు, అవసరమైన శిక్షణ కార్యక్రమాలకు సహకరిస్తామని ప్రకటించారు. నాబార్డు సీజీఎం ఉదయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్‌ పెంపొందించేందుకు రూరల్‌ మార్టులను రాయితీలతో ప్రోత్సహిస్తామని తెలిపారు. గో-ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఉపాధ్యకక్షుడు గంగాధరమ్‌, ప్రధాన కార్యదర్శి భరత్‌వర్మ, 300 మందికి పైగా ప్రకృతి వ్యవసాయదారులు పాల్గొన్నారు. 

Read More

పాలేకర్‌ బాటలో విజయరామ్‌

రసాయనిక వ్యవసాయం వలన సంభవించిన, సంభవిస్తున్న అనర్ధాల నుండి బయటపడడానికి అనేకమంది నిపుణులు, శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు, కొన్ని సంస్థలు రసాయనాలు అవసరం లేని వివిధ రకాల సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులకు చేరవేస్తున్నారు. వీటిలో ఫుకుఓక ప్రకృతి వ్యవసాయ పద్ధతి, భాస్కరసావే పద్ధతి, చౌహాన్‌క్యూ పద్ధతి, నమ్మళ్వార్‌ పద్ధతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతి, సుభాష్‌పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి లాంటి వాటిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. వీటన్నింటిలో సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి చాలా వేగంగా రైతులోగిళ్ళకు చేరింది. ఇంకా చేరేతూనే ఉంది అని చెప్పవచ్చు. సుభాష్‌ పాలేకర్‌ వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ ఈ పద్ధతి గురించి ప్రచారం చేయడంతోపాటు, కొన్ని ప్రభుత్వాలు ఈ పద్ధతిని ప్రోత్సహించడం మరియు రైతులు అమలుపరచటానికి అనుకూలంగా ఉండడం, ఈ పద్ధతిలో మన దేశీయ జాతి గోవు ప్రముఖ పాత్రను పోషించటం లాంటి వివిధ రకాల కారణాల వలన మిగతా పద్ధతులతో పోల్చుకుంటూ సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి చాలా వేగంగా రైతు లోగిళ్ళకి చేరిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే సుభాష్‌పాలేకర్‌ వలననే రసాయన వ్యవసాయం వలన జరిగిన, జరిగే నష్టాలు రైతులు తెలుసుకుంటున్నారు. రసాయన రహిత వ్యవసాయం ఇంత వేగంగా రైతులకు తెలియడంలో సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి ప్రధాన పాత్ర పోషించింది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ పద్ధతిని సుభాష్‌ పాలేకర్‌ ప్రచారం చేయకుండా ఉండి ఉంటే రసాయన రహిత వ్యవసాయం రైతులోగిళ్ళకు చేరటానికి చాలా సమయం పట్టేది కావచ్చు. పాలేకర్‌ వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవడం, వారి పుస్తకాలు చదివిన వారు, వారి సభలకు హాజరయ్యి ఈ పద్ధతుల గురించి తెలుసుకున్న చాలామంది రైతులు తమ రసాయనిక సేద్యాన్ని ప్రకృతి వ్యవసాయ బాట పట్టించారు. పట్టిస్తున్నారు. వ్యవసాయేతర ఉద్యోగ, వ్యాపారం లాంటి వేరే రంగాలలో ఉన్న వారు కూడా సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతుల గురించి తెలుసుకుని ఈ బాట పట్టారు. ఇంకా పడుతూనే ఉన్నారు. ఈ కోవకే చెందుతారు కృష్ణాజిల్లా, తరకటూరులో 8 ఎకరాలు, వికారాబాద్‌ సమీపములో 50 ఎకరాలు, రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 58 ఎకరాలలో ప్రకృతి సాగు చేస్తున్న విజయరామ్‌.

వాస్తవానికి విజయరామ్‌ ఆర్టిస్ట్‌ (బొమ్మలు గీస్తుంటారు). ఆర్టిస్ట్‌గా తన వృత్తిని కొనసాగిస్తూ హైదరాబాదు నగరంలో ఇందిరాపార్కు సమీపంలో ఒక మిఠాయి దుకాణాన్ని నడుపుతూ వస్తున్న సమయంలో నీటి యొక్క విలువను తెలుసుకుని నీటి సంరక్షణకు సంబంధించిన సమాచారాన్ని మిఠాయి దుకాణంకి వచ్చిన వినియోగదారులకు తెలియచేస్తూ ఉండేవారు. అందుకు సంబంధించి చార్టులను తయారు చేయించి అవసరమైన వారికి ఆ చార్టులను ఉచితంగా అందిస్తూ ఉండేవారు. ఆవిధంగా తన ఆలోచనలని సామాజిక రంగాలవైపు కూడా మళ్లించి కొనసాగుతున్న క్రమంలో 2010వ సంవత్సరంలో సుభాష్‌పాలేకర్‌ గారి జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి గురించి తెలుసుకొని తాను కూడా గో-ఆధారిత వ్యవసాయం చేయాలనే తలంపుతో అటువైపు అడుగులు వేసి ప్రకృతి వ్యవసాయంలో అడుగు పెట్టారు. ఈ పద్ధతిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనే తలంపుతో సుభాష్‌పాలేకర్‌ గారి ద్వారా సదస్సులు ఏర్పాటు చేయడంలో తనవంతు పాత్రను పోషించారు…. పోషిస్తూన్నారు.

గోఆధారిత వ్యవసాయంలో ప్రధానమయినవి మన దేశీయ జాతి గోవులు, మన పురాతన నాటు విత్తనాలు కాబట్టి తన సాగులో ఈ పద్ధతులను అమలుపరచడంతో పాటు అంతరించి పోతున్న మన పురాతన విత్తనాలను అభివృద్ధి చేసి వాటి లభ్యత పెంచాలనే తలంపుతో మన పురాతన విత్తనాల సేకరణకు నడుంబిగించి వాటిని సేకరిస్తూ అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. వీటన్నింటికిగాను కృష్ణాజిల్లా తరకటూరులోని 8 ఎకరాల పొలం, వికారాబాద్‌ సీమపంలోని 50 ఎకరాల పొలంలో పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వివిధ రకాల పంటలు పండిస్తూ వస్తున్నారు. ఇందుకుగాను మన దేశీయ జాతులు ఒంగోలు, గిర్‌ లాంటి ఆవులను మరియు ఎద్దులను కలిపి సుమారు 120 మేరకు పశువులను పోషిస్తూ వాటి వ్యర్థాలను తన పంటలసాగులో వినియోగిస్తున్నారు. ఆవు పాల ద్వారా మన తాత, ముత్తాతలు పాటించిన పద్ధతులతో నాణ్యమైన ఆవు నెయ్యిని తయారు చేసి అవసరమైన వారికి అమ్ముతూ వస్తున్నారు.

ప్రస్తుతం వరి, చెరకు, ఉల్లి, పసుపు, అల్లం, వివిధ రకాల కూరగాయలు అరటి మొదలగు పంటలతో పాటు 5 అంచెల పద్ధతిలో (పూర్తి వివరాల కొరకు బాక్స్‌ చూడగలరు) వివిధ రకాల పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. దుక్కిలో ఘనజీవామృతం అందించడంతో పాటు జీవామృతాన్ని భూమికి అందిస్తుంటారు. అవసరాన్ని బట్టి జీవామృతం, నీమాస్త్రం, పుల్లటి మజ్జిగ లాంటి వాటిని పంటలపై పిచికారి చేస్తూ ఆరోగ్యకరమైన దిగుబడి పొందుతుంటారు. పంట దిగుబడిలో నాణ్యతకు, పోషకాలకు ప్రాముఖ్యతని ఇస్తూ ఎంత దిగుబడి వచ్చిందనే దానిని పట్టించుకోకుండా వచ్చిన దిగుబడి నాణ్యమైనదా కాదా అనే కోణంలో ఆలోచిస్తూ పంటల సాగు కొనసాగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో నాటు విత్తనాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి కాబట్టి తను సాగు చేసే పంటలన్నింటికీ నాటు విత్తనాలనే ఉపయోగిస్తున్నారు. నాటు విత్తనాలను తన పంటల సాగులో వినియోగించడంతోపాటు తోటి రైతులకు అందచేస్తుంటారు. మన పురాతన విత్తనాలు అంతరించి పోతున్నవి కాబట్టి అందుబాటులో ఉన్న పురాతన విత్తనాలను ప్రత్యేకించి వడ్లను ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి సేకరించి వాటిని పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో అభివృద్ధిపరచి తోటి రైతులకు అందచేసి మన పురాతన విత్తన నిధిని కాపాడుటలో విజయరాం ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. పురాతన వడ్లలో పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి వీటిని ఆహారంగా తీసుకుంటే జబ్బులు వచ్చే అవకాశాలు ఉండవు అని తెలుసుకొని పురాతన విత్తనాల అభివృద్ధి మరియు పంపిణీని ఒక ఉద్యమంగా చేస్తున్నారు.

ఐదు అంచెల సాగు విధానం :

ఐదు అంచెల సాగు విధానాన్ని సుభాష్‌ పాలేకర్‌ బాగా ప్రచారం చేశారు. ఈ విధానంలో 36 అడుగుల దూరంలో మామిడి, నేరేడు లాంటి పెద్దగా ఎదిగే మొక్కలు పెంచుకొంటూ వాటి మధ్యలో వివిధ రకాల మొక్కలను, కూరగాయలు, ఆకుకూరలను 4 అంచలుగా సాగు చేయడం దాని ప్రధాన ఉద్దేశ్యం. ఈ విధానం 36þ36 అని కూడా ప్రసిద్ధి చెందింది. ఈ 36þ36 విధానం ప్రచారంలోకి వచ్చిందేకాని క్షేత్రస్థాయిలో విజయం సాధించిన వారు పెద్దగా లేరు. కారణం ఈ విధానంలో దిగుబడులు సక్రమంగా రావడం లేదు అని తెలుసుకుని విజయరాం ఈ విధానానికి వేరే రూపం ఇచ్చారు. అంటే 36 కి బదులుగా 50 అడుగుల దూరం పాటిస్తే అన్ని అనుకూలంగా ఉంటాయని అనుభవ పూర్వకంగా తెలుసుకుని 50þ50 అడుగుల దూరంలో 5 అంచెలుగా వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. 50 అడుగుల దూరంలో మొదటి అంచెలో నేరేడు, మామిడి, పనస, బాదం లాంటి పెద్దగా ఎదిగే వృక్షాలు 50 అడుగులలో సగం అంటే 25 అడుగుల దూరంలో రెండో అంచెగా బత్తాయి, నిమ్మ, నారింజ లాంటి మొక్కలు, 25 అడుగులలో సగం అంటే 121/2 అడుగుల దూరంలో 3వ అంచెగా బొప్పాయి, అరటి లాంటి మొక్కలు, 121/2 లో సగం 61/4  లో 4వ అంచగా మునగ, అవిశ లాంటి మొక్కలు 61/4 అడుగులకు మధ్యలో సొర, బీర, కాకర, బెండ లాంటి కూరగాయలతోపాటు తోటకూర, గోంగూర, చుక్కకూర లాంటి ఆకుకూరలు, పసుపు, అల్లం, చేమ దుంపలాంటి పంటలు పండిస్తున్నారు. వీటన్నింటిని పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులోనే పండిస్తున్నారు. 5 అంచెల విధానంలో లైనుకి లైనుకి 61/4 అడుగుల దూరం ఉంటుంది. లైనుకి లైనుకి మధ్య ఒక కాలువ చేసుకుని ఆ వచ్చిన మట్టి లైనులో ఎత్తుగా వేసుకోవడం వలన కలుపు సమస్య తగ్గడంతో పాటు లైనులో ఉన్న మొక్కలకు పోషకాలు బాగా అంది అవి ఆరోగ్యంగా పెరుగుతూ ఎలాంటి కషాయాలు, ద్రావణాలు అవసరం పడటంలేదు. తప్పనిసరి పరిస్థితులలో నీమాస్త్రం, పుల్లటిమజ్జిగ, జీవామృతం లాంటివి పంటపై పిచికారి చేస్తుంటారు. విజయరాం పండించే అన్ని పంటలకు నీటిని అందించటానికి ఎలాంటి డ్రిప్పు, స్ప్రింక్లర్‌ లాంటి విధానాలను ఉపయోగించకుండా కాలువల ద్వారానే నీటిని అందిస్తుంటారు. 5 అంచెల విధానంలో కాలువ ద్వారా నీటి అందిస్తూ ఆ కాలువలలో అరటి, బొప్పాయి లాంటి ఆకులు మల్చింగ్‌గా ఉపయోగిస్తుంటారు. 

ప్రకృతి వ్యవసాయంలో అడుగుపెట్టి, దేశీయ జాతి గోసంతతిని, మన పురాతన విత్తనాలను అభివృద్ధిపరుస్తూ తోటి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు నడిపిస్తూ పంట దిగుబడులు ముఖ్యం కాదు, నాణ్యమైన దిగుబడులు ముఖ్యం అంటూ విజయరాం ముందుకు నడుస్తున్నారు. మరిన్ని వివరాలు 8374662262 కి ఫోను చేసి తెలుసుకోగలరు. 

Read More

తులసి సాగుతో రైతుకు ‘సువాసన’

మిరప, వరి, చెరకు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు లాంటి పంటలతో పాటు రైతులు ఔషధ మొక్కల సాగు కూడా చేపడుతున్నారు. ఔషధ మొక్కలలో ప్రధానంగా కలబంద, తులసి, దూలగొండి, అశ్వగంధ లాంటి వాటిని రైతుల స్థాయిలో పండించి అమ్ముకుంటున్నారు. ఔషధ మొక్కలు సాగు చేసే రైతులు తప్పనిసరిగా మార్కెటింగ్‌ అవకాశాలను చూసుకొన్న తరువాతనే కొనుగోలుదారులతో ఒప్పందాలు కుదుర్చుకున్న తరువాతనే పంటల సాగు మొదలు పెట్టాలేగాని ఏలాంటి కొనుగోలు ఒప్పందాలు లేకుండా సుగంధ మరియు ఔషధ మొక్కల లాంటివి సాగు చేసినట్లయితే ఇబ్బందులు ఎదురవుతాయి అనే విషయం రైతుల అనుభవాల సారం. ఈ పంటలు కూడా ఏ నేలలలో పడితే ఆ నేలలలో సరైన దిగుబడులు రావు కాబట్టి పంట లక్షణాన్ని బట్టి నేలలను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ తమకు సమీపంలో అనుకూలమైన నేల లేనట్లయితే అనుకూలమయిన నేల అందుబాటులో ఉన్న ప్రాంతాలకు వలసపోయి సాగు చేపట్టినట్లయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. కాబట్టి తాము ఉండే ప్రాంతంలో నేల తాము అనుకున్న పంటల సాగుకు ఉపయోగపడదు కాబట్టి ఆ పంట సాగుకు అనుకూలమైన నేల అందుబాటులో ఉన్న ప్రాంతానికి వెళ్ళి తులసి పంట సాగు చేస్తున్నారు అన్నదమ్ములు శ్రీనివాసరావు మరియు నాగేశ్వరరావు.

వీరిది గుంటూరు సమీపములోని పుల్లడిగుంట ప్రాంతం. ఈ ప్రాంతంలోని నేలలు నల్లరేగడి నేలలు. వీరు తులసి పంటను సాగు చేయాలనుకొని పుల్లడిగుంట ప్రాంతంలోని నల్లరేగడి నేలలు తులసి సాగుకు అనుకూలం కావు అని తెలుసుకున్నారు. తులసి సాగుకు ఇసుక నేలలు, ఎర్రనేలలు అనుకూలం. కాబట్టి అలాంటి నేలలు అందుబాటులో ఉన్న ప్రకాశం జిల్లా ఆకివీడు ప్రాంతానికి వెళ్ళి తులసి పంట సాగు మొదలు పెట్టారు. నల్లరేగడి నేలలో తులసి సాగు చేసినట్లయితే నూనెదిగుబడి తక్కువగా వచ్చి పంట గిట్టుబాటు కాదు. ఇసుక లేదా ఎర్ర నేలల్లో నూనె దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది కాబట్టి తులసి సాగును నల్లరేగడి నేలలలో చేపట్టవచ్చు అని వీరు సూచిస్తున్నారు.

గత సంవత్సరం మే నెలలో తులసి పంట సాగును 30 ఎకరాలలో చేపట్టారు. ఇందుకుగాను అవసరమైన విత్తనాలను హైదరాబాదులో సిఎంఏపి వద్ద కొనుగోలు చేసికుని నారు పోసుకున్నారు.  దుక్కిలో బాగా మాగిన పశువుల ఎరువును అందించారు. 35 నుంచి 40 రోజుల వయస్సు ఉన్న నారుని లైనుకి లైనుకి 27 అంగుళాలు మొక్కకు మొక్కకు 15 నుంచి 16 అంగుళాల దూరం పాటించి నాటించారు.  అవసరాన్ని బట్టి నీటిని అందిస్తూ వస్తున్నారు. తులసి ఔషధగుణాలు ఉన్న మొక్క కాబట్టి ఎలాంటి చీడపీడలు పంటను ఆశించలేదు. ఒకవేళ చీడపీడలు ఆశించినా కూడా ఎలాంటి సస్యరక్షణా చర్యలు చేపట్టవలసిన అవసరం లేదు అని వీరు వివరిస్తున్నారు. అన్నీ సక్రమంగా ఉంటే నారు నాటిన 60 రోజులకు మొదటి కోత వస్తుంది. తరువాత 50 రోజులకు ఒక కోత చొప్పున కోసుకోవచ్చు. సంవత్సరానికి 5 నుంచి 6 కోతలు కోయవచ్చు. పంట కోత విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వాతావరణములో తేమ తక్కువగా ఉన్నప్పుడే తులసి పంటను కోయాలి. పంట కోతకు ముందు కనీసం వారం రోజులు నీటితడిని ఆపి మొక్క బాగా వాడుబడిన తరువాత కోత కోయవలసి ఉంటుంది. వర్షాకాలంలో పంట వాడుపడదు కాబట్టి వాడుపడకుండా కోత కోసి నూనెను తీసినట్లయితే నూనె నాణ్యత తగ్గుతుంది కాబట్టి పంట వాడు పట్టిన తరువాతనే కోసి నూనెను తీస్తున్నారు. పంట ఎదుగుతూ పూత పూర్తిగా వచ్చి విత్తనాల తయారీ మొదలు కాకుండానే పంటను కోయాలి. విత్తనాల తయారీ మొదలయితే నూనె శాతం తగ్గుతుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితేనే నాణ్యమయిన నూనె దిగుబడి పొందవచ్చు.

నూనె తీయడానికి సిద్ధంగా ఉన్న పంటను కట్టెతో సహా కోసి నూనె తీసే యంత్రంలో వేసి నూనె తీస్తున్నారు. అంతా సక్రమంగా ఉంటే మొదటికోతలో ఎకరానికి 9 లీటర్ల నూనె దిగుబడి పొందవచ్చు. రెండవ కోత నుంచి నూనె దిగుబడి కొద్దిగా తగ్గుతుంది. ప్రస్తుతం తులసి నూనె లీటరు ధర 6700/- నడుస్తుంది. చెన్నై, బెంగుళూరు, బొంబాయిలలో ఈ నూనెకు గిరాకి ఉంది. విత్తనాలు, నారు, కూలీ ఖర్చులు అన్నీ కలిపి మొదటి కోత వరకు ఎకరానికి 30000/- వరకు ఖర్చు అవుతుంది. రెండవ కోత నుంచి కోతకు 10000/- వరకు ఖర్చు అవుతుంది. ఒకసారి నాటుకుంటే 3 సంవత్సరాలలో 15 నుంచి 16 కోతలు కోసుకోవచ్చు అని వీరు వివరిస్తున్నారు. మరిన్ని వివరాలు 9441928521 కి ఫోను చేసి తెలుసుకోగలరు.    

వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌

Read More

ఉల్లి సాగులో మెలకువలు

ఉల్లిగడ్డ అలియేసీ కుటుంబానికి చెందిన ద్వి వార్షిక మొక్క అధిక ఔషధ గుణములు మరియు కొన్ని రకాల చికిత్సలకు ఉపయోగ పడుతుంది. ఇది సాధారణంగా సమశీతోష్ణ వాతావరణంలో అధిక దిగుబడినిచ్చే మొక్క కానీ ఉష్ణ మండల, ఉప ఉష్ణ మండల ప్రాంతాలలో కూడా పెరుగును. దీర్ఘకాలిక పగటి కాంతి ఉల్లిపాయలో లశునము ఊరడానికి సహకరిస్తుంది కానీ ఉష్ణోగ్రత మొక్క పుష్పించడానికి దోహదపడుతుంది. ఉల్లిపాయను దాదాపు ప్రపంచంలోని అన్ని సంస్కృతుల ప్రజలు వంటలలో నిత్యావసర పదార్థంగా వాడతారు. ఇది వంటకి రుచి, సువాసనని అందిస్తుంది. దీన్ని సలాడ్‌ రూపంలో కూడా తీసుకుంటారు. ఉల్లిపాయలో వివిధ రకాల విశిష్ట రసాయన పదార్థాలున్నాయి. అవి ఫ్లవోనోయిడ్స్‌, ఆంథోసైయానిన్స్‌, ఫ్రక్టో ఒలిగో శకరైడ్‌, ఆర్గానో-సల్ఫర్‌లు ఔషధంగా ఆరోగ్యాన్ని పెంచి రుగ్మతలు, డయాబెటిస్‌ నుండి కాపాడతాయి. భారతదేశం నుండి వివిధ దేశములకు ఎగుమతి అయ్యే ఫలములు, కూరగాయలలో ఉల్లిగడ్డ ద్వారా వచ్చే ఆదాయపు వాటా శాతము 26%. చైనా ప్రపంచంలోనే ఉల్లి సాగులో మొదటి స్థానంలో ఉంటే భారత దేశం రెండవ స్థానంలో ఉన్నది. భారతదేశంలో ఉల్లిపాయలు అధికంగా పండే రాష్ట్రం మహారాష్ట్ర కాగా తదనంతర స్థానంలో కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణలో ఉండే వాతావరణ పరిస్థితులు ఉల్లి సాగుకు అనుకూలమైనవి. నాణ్యమైన విత్తనం అందుబాటులో లేకపోవడం, తెగుళ్లు, చీడల బెడద, ఉల్లిపాయను సాగుచేసే విస్తీర్ణం తక్కువ ఉండటం ఇలాంటి వివిధ కారణాల వల్ల రాష్ట్రం నుండి ఉత్పత్తి అయ్యే ఉల్లిపాయ దిగుబడి ఆశించినంత స్థాయిలో లేదు. కానీ ఆధునిక సాంకేతికత, నూతనంగా విడుదల అయిన ఉల్లి వంగడాలు, ఉత్పత్తిలో మెలకువలు సంక్షిప్త కీటక, వ్యాధి నివారణ, సాగులో మెలకువలు పాటించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉల్లి ఉత్పత్తిని గణనీయంగా పెంచవచ్చు.

సాగు చేయు ప్రాంతాలు, సమయం

తెలంగాణ రాష్ట్రంలో ఉల్లిపాయను ఖరీఫ్‌ (ఆగష్టు – నవంబర్‌) మరియు రబి (ఏప్రిల్‌ – జూన్‌) రెండు కాలములలో సాగు చేస్తారు కాని అధికంగా ఉత్పత్తి అయ్యేది రబీ కాలంలోనే. తెలంగాణలో ఉల్లిని సాగుచేసే ప్రాంతాలు వరుసగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, వరంగల్‌. ఉల్లిగడ్డ లశుణం సరిగ్గా పెరగకపోవడానికి గల కారణాలు ఉల్లిగడ్డ లశునము సరిగ్గా ఎదగక ముందే పుష్పించడం, దుంప పగుళ్లు వచ్చుట, సరైన ఉల్లిగడ్డ విత్తన రకమును ఎంచుకోవడములో తప్పిదం, నిస్సారమైన భూమి, ప్రతికూల పర్యావరణ కారకములు, ఉల్లిగడ్డ నిల్వచేయడంలో తగిన జాగ్రత్త చర్యలు చేపట్టక పోవడం.

నేలలు, వాతావరణం

భూ సారము అధికంగా ఉండి, సరి అయిన మురుగు నీరు పోయే సౌకర్యం ఉన్న ఇసుక నేలలు మరియు చల్లని వాతావరణము ఉల్లిపాయలో సరయిన పెరుగుదలకు దోహదపడే అంశాలు. దీర్ఘకాలిక కాంతి ఉండి ఉష్ణోగ్రత తక్కువ ఉన్నప్పుడు దుంప ఎదుగుదల సరిగ్గా జరుగుతుంది. ఉష్ణమండల తెలంగాణ ప్రాంతాలలో దీర్ఘకాల కాంతి వంగడాలను పెంచుకోవడానికి అనుకూలమైనవి. అధిక ఉష్ణోగ్రత స్వల్ప ఆర్ద్రత ఉండే వాతావరణంలో దుంప త్వరగా ఎదుగుతుంది. ఉల్లిగడ్డ శీతకాలాపు పంట, దుంపల కోసం, ఆకు కోసం సాగు చేస్తారు. 

సరైన వంగడాలు: N 2-4-1, ఆర్కా నికేతన్‌, అగ్రి ఫౌండ్‌ లైట్‌ రెడ్‌, పూస రెడ్‌, భీమా రాజ్‌ మరియు భీమా రెడ్‌ అనేవి రబి సీజన్లో సాగు చేయుటకు అనుకూలమైన రకాలు.

విత్తనం ఎంపిక, నారుమడి తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఉల్లిగడ్డను విత్తనము ద్వారా గాని, లేదా చిన్న దుంపల ద్వారా గాని సాగు చెయ్యవచ్చు. నారు మొక్కలు చాలా అనువైనవి నారు మొక్కలను ముందుగా నిర్మించుకున్న నారుమడిలో విత్తనాలను తగినంత దూరములో విత్తుకోవాలి. బెడ్‌లను భూమి నుంచి 10-15 సెం.మీ. ల ఎత్తులో నిర్మించుకోవాలి ప్రతి రెండు బెడ్‌ ల మధ్య కనీస నిడివి 50సెం.మీ. లు ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల అంతరకృషి సులభతరమగును రెండు విత్తన వరసల మధ్య దూరము 4-5 సెం.మీ.లు ఉండేట్లు చూసుకోవాలి. నారుకుళ్లు తెగులును అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకుని 4-6 వారాల వయసున్న నారు మొక్కలను ప్రధాన నాటుకోవాలి. 

నీరు, యాజమాన్యం

ఉల్లిమొక్క నీటి ఎద్దడిని దుంప ఊరే దశ, దుంప అభివృద్ధి చెందే దశలో అస్సలు తట్టుకోలేదు. పంట పరిపక్వత దశకు చేరుకున్న తరవాత అధిక నీరు ఇచ్చినట్లయితే ద్వితీయ వేర్లు వస్తాయి తద్వారా దిగుబడి తగ్గే అవకాశం ఉంది. పంట కోసే రెండు వారాల ముందు నుండి నీటి సరఫరా ఆపి వేయాలి. ఉల్లి సాగులో నీటిని తుంపర సేద్యము, బిందు సేద్యము ద్వారా అందించినచో సంప్రదాయ పద్ధతి లో సాధించే దానికన్నా ఎక్కువ దిగుబడి పొందవచ్చు. బిందు సేద్యము ద్వారా నీటిలో కరిగే పోషకాలను వాడటం సరైన లాభాలను ఆర్జించవచ్చు. పశు సంబంధిత వ్యర్ధాలు, పంట వ్యర్ధాలు, పచ్చి రోట్ట ఎరువులను వాడటం, పంట మార్పిడి, మృత్తికా పరీక్ష అనంతరం సూచించిన మోతాదులో నియమిత ఫర్టిలైజర్‌ ను అందించటం మేలైనది. ఒక హెక్టార్‌ భూమికి సుమారు 40 టన్నుల పశవుల ఎరువు వాడటం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చు. 

కలుపు నివారణ: ఉల్లి మొక్క వేరు వ్యవస్థ చిన్నధి అందువల్ల కలుపు ను అస్సలు తట్టుకోలేదు. సరైన సమయములో కలుపు ను నియంత్రన చర్యలు చేపట్టాలి. 

అంతర పంటల సాగు

ఒకే  సంవత్సరంలో వరసగా కేవలము ఉల్లిగడ్డ ను సాగు చేయకూడదు. దీనివల్ల భూమి యొక్క సారము తగ్గిపోవును, చీడ పీడల ఉధృతి అధికమగును. రసాయనిక ఎరువులు వాడటానికి బదులుగా ఇతర జాతి పంటలను పండించడం ద్వారా నేల సారవంతంగా మారును. ఉల్లి స్వల్పకాలపు పంట కాబట్టి రెండు ఋతువుల మధ్య అంతర పంట సాగు చెయ్యవచ్చు. బెండి, ముల్లంగిల మధ్య అంతర పంటగా ఉల్లిని సాగు చేయడము ద్వారా అధిక లాభాలు పొందవచ్చు. అన్నిటికంటే బీట్‌రూట్‌తో ఉల్లిని 15 సెం.మీ.ల వ్యవధితో సాగు చేసినప్పుడు అధిక లాభాలు గణించవచ్చు.

పంట పరిపక్వత దశ,  కోయు విధానం

నిల్వ చేసే ఉల్లిపాయలను కోత కోయడానికి మెడ విరుపు దశ,అత్యంత ముఖ్యమైనది. దాదాపుగా 75% పై ఆకులు నేలకు ఒరగడం ఇది మొక్క పూర్తిగా కోతకు వచ్చిందని సూచిస్తుంది. కోతకు 2-3 వారాల సమయం ముందు నీరు అందించడం ఆపాలి. కోత కోసే సమయం లో సమయంలో దుంపలను భూమి నుండి లాగి ఆకుల చివరలను కత్తిరించాలి. కోసిన దుంపలను వ్యవసాయ భూమి లోనే 2-3 వారాలు దుంపల పై ఉన్న పొలుసులు పూర్తిగా పొడిగా అయ్యే అంత వరకు ఆరనివ్వాలి.  ఆకు పచ్చని ఉల్లి పాయల కోసం దుంపలను భూమి నుండి లాగి కాడలను 15 సెం.మీ. లు ఉండే విధంగా కత్తిరించాలి.

చీడ పీడలు, తెగుళ్లు నివారణ

ఉల్లిలో చీడపీడలు, తెగుళ్లు కూడా అధికమే, కేవలం తామర పురుగుల ద్వారా 50% పంట నష్టం జరుగుతుంది. తామర పురుగులు పొడిగా వేడిగా ఉండే వాతావరణంలో అధిక నష్టాన్ని కలుగ చేస్తాయి. ఇవే కాకుండా మొక్కలకు నీరు పెట్టేటప్పుడు, ఆచ్ఛాదన, నాటుపెట్టే సమయం వల్ల  కూడా తామర పురుగుల ఉధృతి పెరుగును. వివిధ రకాల సేంద్రియ కషాయాలు మరియు ద్రావణాలతో తామర పురుగుల ఉధృతిని అరికట్టవచ్చు బవేరియా బస్సియానా అనబడే శిలీంద్రంను వాడటం ద్వారా అనేక రకాల చీడలను అరికట్ట వచ్చు. అస్పెర్గిల్లస్‌నైజర్‌ మరియు ఫ్యూసేరియం అనే శిలీంద్ర జాతులు విత్తనము ద్వారా దుంపలలో కూడా వ్యాపిస్తుంది. అధిక ఉష్ణోగ్రత ఆర్థ్రత వున్న పరిస్థితులలో నారుకుళ్ళు తెగులు ద్వారా 75-80 శాతము నష్టం కలుగును. ఎదుగుదల థలో అధిక నీటి వల్ల నారుకుళ్లు, ఊదారంగు మచ్చ  వ్యాధి సోకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది తగిన మోతాదులో నీటిని అందించడం వలన అరికట్టవచ్చు.              

డా. బి. అశోక్‌ కుమార్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, వెజిటబుల్‌ సైన్స్‌, మల్లారెడ్డి యూనివర్సిటి, బి. గౌతమి, పిహెచ్‌.డి. స్కాలర్‌, ఐఏఆర్‌ఐ, న్యూఢిల్లీ. 

Read More
  • 1
  • 2