పండ్ల తోటలు

మామిడి: కాయల కోతకు 30-40 రోజుల ముందు నీరు పెట్టడం ఆపితే కాయనాణ్యత పెరుగుతుంది. కాయలను చల్లటి వేళల్లో, కోత పరికరాలను ఉపయోగించి కోయాలి. కాయకు 5-7 సెం.మీ. తొడిమ ఉండేలా కోసి సొన అంటకుండా తలకిందులుగా ఉంచి, సొన మొత్తం కారిపోయిన తర్వాత తర్వాత గ్రేడింగ్‌ చేసుకొని అట్టపెట్టల్లో కాగితపు ముక్కలను ఒత్తుగా వేసి ప్యాకింగ్‌ చేయాలి. దూరప్రాంత రవాణా కోసం కాయలను కోసిన తర్వాత 10 గంటల్లోపు శీతల గిడ్డంగుల్లో 12.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత, 80-90 శాతం తేమ వద్ద నిల్వ ఉంచాలి.

అరటి: 30-40 సెం.మీ. లోతుగా, తొలకరి వర్షాలు పడగానే మెత్తగా దున్నాలి.

జామ: చెట్లను బెట్టకు గురి చేయడం ద్వారా ఆకులు రాలేలా చేసి, ఎండిన, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను, కాపు కాసిన కొమ్మలను చివరి నుంచి 5-6 సెం.మీ. లోపలికి కత్తిరించాలి.

ద్రాక్ష: వేసవి కత్తిరింపుల తర్వాత 9వ ఆకు ఏర్పడిన థలో కొమ్మల కొనలను గిల్లడం ద్వారా పిల్లకొమ్మల అభివృద్ధి జరుగుతుంది. కొత్త చిగుర్లలో పక్షికన్ను తెగులు సోకకుండా సరైన చర్యలు చేపట్టాలి.

సపోట: ముదురు తోటల్లో నీటి తడులు ఇవ్వాలి. తయారైన కాయలను ఉదయం వేళల్లో తొడిమతో సహా కోసుకోవాలి. 

పనస: కళ్లు పూర్తిగా విచ్చుకొని, పసుపుపచ్చ రంగులోకి మారి సువాసనలు వెదజల్లే కాయలను కోయాలి. కోత తర్వాత ఎండిన రెమ్మలను తీసివేసి ఎలాంటి తెగుళ్ళు రాకుండా చర్యలు చేపట్టాలి.

దానిమ్మ: చెట్లకు పూర్తిగా విశ్రాంతి నివ్వాలి. బాక్టీరియా తెగులును అదుపులో ఉంచడానికి ఒక శాతం బోర్డోమిశ్రమాన్ని 20 రోజుల వ్యవధిలో 2-4 సార్లు పిచికారి చేయాలి.

రేగు: పాదుల దగ్గర మట్టిని తిరగబెట్టి నిద్రావస్థ థలో ఉన్న కాయతొలుచు పురుగులను నాశనం చేయాలి.

నిమ్మ: ఉష్ణోగ్రతలు 42 డిగ్రీ సెంటీగ్రేడ్‌ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు లీటరు నీటికి 5-10 గ్రా. సున్నం చొప్పున కలిపి పిచికారి చేస్తే అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే వీలుంటుంది. సున్నం పిచికారి చేశాక 15 రోజుల తర్వాత యూరియా లేదా పొటాషియం నైట్రేట్‌ (10. గ్రా./లీ. నీటికి) పిచికారి చేయాలి.

బొప్పాయి: 5 నెలలు దాటిన తోటల్లో ప్రతి మొక్కకు 25-30 లీటర్ల నీటిని డ్రిప్‌ ద్వారా ఇవ్వాలి. ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం పెరిగేకొద్ది ఆకుముడత, తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగుల నివారణకు సరైన చర్యలు చేపట్టాలి. తెల్లదోమ ఉధృతి నియంత్రణకు పసుపు రంగు జిగురు అట్టలను, పేనుబంక ఉధృతి నియంత్రణకు నీలంరంగు జిగురు అట్టలను ఎకరాకు 12-15 చొప్పున పంట ఎత్తులో అమర్చాలి. 

కూరగాయలు

తీగజాతి కూరగాయలు: వేసవి దుక్కులు లోతుగా చేసుకొని నేలలో దాగి ఉన్న పురుగుల కోశస్థ థలు చనిపోయేలా చూడాలి. కంద, చేమ, పెండలం నాటడానికి అనువుగా భూమిని 30-40 సెం.మీ. లోతుగా దున్ని, తొలకరి వర్షాలకు 3-4 సార్లు గొర్రుతో మెత్తగా దుక్కిచేయాలి.

ఉల్లి: ఖరీఫ్‌ ఉల్లిసాగుకు అనువైన అగ్రిఫౌండ్‌ డార్క్‌రెడ్‌, నాసిక్‌ రెడ్‌, అర్కాకళ్యాణ్‌ రకాల నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకొని నారు పోసుకోవాలి.

పూల తోటలు: కొత్తగా పూల తోటలు సాగు చేయడానికి వేసవిలో లోతుగా దుక్కులు చేయాలి. 

గులాబి: గులాబీ తోటల్లో నీరు పెట్టాలి.

కనకాంబరం: తోటలు వేయడానికి అవసరమైన నారును పెంచుకోవాలి.

తోటపంటలు: కొత్తగా కొబ్బరి నాటడానికి 1þ1þ1 మీ. సైజు గుంతలను 8þ8 మీ. దూరంలో చేయాలి. కాపుకాసే తోటల్లో వారానికి ఒకసారి నీరు పెట్టాలి. పళ్ళాలలో పచ్చిరొట్టను కోసి వేసి తేమ ఆరకుండా చూడాలి. తోటలను ఆశించిన సర్పిలాకార తెల్లదోమ యాజమాన్యం చేపట్టాలి.

తమలపాకు: మొదటి సంవత్సరం తోటలు వేయడానికి నేలను బాగా దున్ని ఎకరాకు 40 బండ్ల పశువుల ఎరువు, 20 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్‌ ఇచ్చే ఎరువులు వేసి, 16-20 కిలోల అవిశ గింజలను సాలుకు సాలుకు మధ్య మీటరు దూరం ఉండేలా ఉత్తర-దక్షిణ దిశల్లో ఒత్తుగా విత్తుకోవాలి. రెండో సంవత్సరపు తోటల్లో వేడి గాలులు తోటలోనికి రాకుండా తోటచుట్టూ దడులు కట్టాలి.

జీడిమామిడి: చెట్ల పాదుల్లో ఎండు ఆకులు గడ్డి మల్చ్‌గా వేసి నేల తేమ ఆరకుండా కాపాడుకోవాలి.

సుగంధద్రవ్య పంటలు

మిరప: పొలాలను లోతుగా దుక్కి చేసి, చెత్తాచెదారాన్ని ఏరి కాల్చివేయాలి. సిఫార్సు చేసిన రకాల విత్తనాలను సేకరించుకోవాలి.

అల్లం: ఏప్రిల్‌లో నాటిన చోట చేతితో కలుపు తీయాలి. మురుగు నీటి కాలువలను సరిచేసుకోవాలి. మే నెలలో నీటి వసతి ఉంటే విత్తుకోవచ్చు.

పసుపు: పంటకు భూమిని లోతుగా దున్ని తొలకరి వర్షాలకు 2-3 సార్లు దుక్కి చేసి ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల ఆముదం పిండి లేదా వేపపిండి, 10 కిలోల జింక్‌ సల్ఫేట్‌ వేసుకొని స్వల్పకాలిక రకాలైన కస్తూరి, సుగుణ, సుదర్శన రకాలను మే నెల చివరిలో నాటుకోవాలి.

ఔషధ, సుగంధ పంటలు

పామా రోజా: విత్తనాన్ని ఎకరానికి 2 కిలోల చొప్పున ముందురోజు రాత్రి తడి ఇసుకతో మూటకట్టి మరుసటి నారుమళ్ళలో విత్తుకోవాలి.

కలబంద: పంటకు నేలను బాగా కలియదున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులు వేసుకోవాలి.

నిమ్మగడ్డి: పిలకలు నాటడానికి పొలం బాగా దున్ని ఆఖరిదుక్కిలో 4 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి.

కె. సాధన (9940236076), డా|| యమ్‌.ఆర్‌. భానుశ్రీ, డా. జె.డి. సరిత, డా. బి. పుష్పావతి, వ్యవసాయ కళాశాల, పాలెం, ప్రొఫెసర్‌ జయంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ.