మన దేశ జనాభా ఏఏటికాయేడు పెరుగుతూనే ఉంది. ఇటీవలే మన జనాభా చైనాను దాటి జనాభాలో ప్రపంచంలో మొదటి స్థానాన్ని సంపాదించింది. జనాభాతో పాటు నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతూనే ఉంది. పెరుగుతున్న నిరుద్యోగులకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు పెరగడము లేదు. కొంతమంది నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. మిగతా నిరుద్యోగులు ఉపాధి అవకాశాల కోసం అన్వేషించాలి. ఉపాధి అవకాశాల గురించి ఆలోచిస్తే ప్రస్తుతం ఉన్న ప్రజల జీవనశైలి ప్రకారం అందరికి నచ్చే ఉపాధి అవకాశాలు సరైన మొత్తంలో అందుబాటులో ఉండడము లేదు. మనది వ్యవసాయక దేశం కాబట్టి వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్యకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించే సత్తా మన దేశంలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకే ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు. కాబట్టి నిరుద్యోగులు తమ జీవన శైలిని మార్చుకొని వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను స్వయం ఉపాధిగా మలచుకున్నట్లయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. కాని ఈ రంగాలలో శారీరక శ్రమతో పాటు ఇతర సమస్యలు ఉంటున్నాయి కాబట్టి ఈ రంగాలను ఉపాధి అవకాశాలుగా ఎంచుకోవటానికి ఎక్కువమంది యువత ముందుకు రావడము లేదనే విషయం ప్రస్తుత సమాజాన్ని పరిశీలిస్తే అర్థం అవుతుంది. కాని కొంతమంది యువత అన్ని సమస్యలను ఎదుర్కోగలమనే నమ్మకంతో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలవైపు అడుగులు వేస్తూ స్వయం ఉపాధి మార్గాలుగా ఎంచుకుని విజయం సాధిస్తున్నారు. కొంతమంది ఇంకొంత ఆదర్శంగా ఆలోచించి చేస్తున్న ఉద్యోగాలను వదలి కూడా వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలను స్వయం ఉపాధి మార్గాలుగా ఎంచుకుని విజయం సాధిస్తున్నారు. ఈ రంగాలలో విజయం సాధించిన వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమకు వెనుకంజ వేయకుండా, సొంత మార్కెటింగ్‌ వ్యవస్థను సృష్టించుకున్న వారు తప్పనిసరిగా వ్యవసాయం రంగంలో విజయం సాధిస్తూ ఉద్యోగంలో వచ్చిన జీతం కంటే ఎక్కువ ఆదాయాన్ని తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఆనందకరమైన జీవితాలను గడుపుతూ ఆడుతూ, పాడుతూ, శ్రమిస్తూ… సంపాయిస్తున్నారు. ఈ కోవకే చెందుతాడు హైదరాబాదు శివారు తురకపల్లి మండలం మాధపురం గ్రామంకి చెందిన జైపాల్‌రెడ్డి.

వ్యవసాయ నేపధ్యానికి చెందిన జైపాల్‌రెడ్డి ఐఐటి చదివి ఇసిఐఎల్‌లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి కొనసాగిస్తున్నాడు. 2009లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి తన చదువుకు సంబంధించిన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్న సమయంలో ప్రకృతి వ్యవసాయం గురించి, ఆరోగ్యం గురించి, మన ఆరోగ్యం కాపాడుటలో ప్రకృతి వ్యవసాయం ప్రధాన పాత్ర పోషిస్తుందనే విషయాలను రాజీవ్‌ దీక్షిత్‌ మరియు సుభాష్‌ పాలేకర్‌ వంటి వారి ద్వారా తెలుసుకుని తాను కూడా సమాజానికి మంచి ఆహారాన్ని అందించాలని ఆలోచించ సాగాడు. తన లక్ష్యం నెరవేరాలంటే చేస్తున్న ఉద్యోగాన్ని వదలడముతో పాటు అప్పటి వరకు తన తల్లిదండ్రులు చేస్తున్న రసాయనిక సేద్యాన్ని సేంద్రియంలోకి మార్చగలగాలి. ఈ రెండు పనుల వలన కొన్ని ఇబ్బందులు ఉంటాయని తెలిసి కూడా చేస్తున్న ఉద్యోగాన్ని 2019 సం||లో వదలి వేసి తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నా కూడా ఏ మాత్రం లెక్కచేయకుండా ప్రకృతి వ్యవసాయంలోకి అడుగు పెట్టాడు. 

మంచి జీతాన్ని వదులుకొని వ్యవసాయంలోకి అదీను శారీరక శ్రమ ఎక్కువగా ఉండే సేంద్రియ సాగులోకి జయపాల్‌రెడ్డి అడుగు పెట్టడము వారి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. వారికి ఇష్టం లేకపోవడానికి మన సమాజ పరిస్థితులే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. మన సమాజంలో ఎక్కువ మంది ప్రజలు డబ్బు సంపాదనే ధ్యేయంగా పెరుగుతున్నారనే విషయం అక్షర సత్యం. ప్రస్తుతంతో పోల్చుకుంటే గత రెండు మూడు థాబ్దాల క్రితం ఈ పరిస్థితులు మన సమాజంలో ఇంకా ఎక్కువగా ఉండేవి. గతాన్ని అంటే 30, 40 సంవత్సరాల క్రితం పరిస్థితులు ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే మనిషి పుట్టింది డబ్బు సంపాదన కొరకు, సుఖాలను అనుభవించుట కొరకే అని భావించే వారే అప్పటి సమాజంలో 90 శాతానికి పైగా ఉన్నారనే విషయం అక్షర సత్యం. కాబట్టే అప్పట్లో ప్రజలు అన్నీ ఫణంగా పెట్టి డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవితాలను కొనసాగించే వారు. కొంతమంది అయితే తమ ఆరోగ్యాలను, ప్రాణాలను ఫణంగా పెడుతూ డబ్బు సంపాదన కోసం వెంపర్లాడేవారు అనే విషయం అందరికీ తెలిసిందే. అందువలన అప్పట్లో ఆరోగ్యం కోసం పెద్దగా ఆలోచించే వారు కాదు. కాని రాను రాను ఎక్కువమంది ప్రజలకు డబ్బు అందుబాటులోకి రావడము, కొంతమందికి అవసరానికి మించి డబ్బు అందుబాటులోకి రావడము మొదలవటం, ఉపాధి అవకాశాలు పెరగడము లాంటి వివిధ రకాల పరిస్థితుల వలన గతంతో పోల్చుకుంటే ప్రస్తుత పరిస్థితులలో ఎక్కువమందికి కనీస అవసరాలు తీర్చుకోవటానికి అవసరమయినంత డబ్బు అందుబాటులోకి వచ్చిందని చెప్పవచ్చు. గతంలో కనీస అవసరాలు తీర్చుకోవడానికి అందుబాటులో లేని డబ్బు ప్రస్తుత పరిస్థితులలో కనీస అవసరాలతో పాటు విలాస వంతమైన, సౌకర్యవంతమైన జీవితాలను కొనసాగించటానికి కూడా అవసరమైన డబ్బు ఎక్కువమందికి అందుబాటులోకి రావటం వలన కొంతమందికి కోల్పోతున్న ఆరోగ్యం గురించి చర్చ మొదలయ్యింది. కరోనా సమస్య, సామాజిక మాధ్యమాలు వేగంగా అభివృద్ధి చెందడంతో సమాచారం చాలా వేగంగా ప్రపంచం మొత్తం తెలవటానికి అవకాశాలు అందుబాటులో ఉండడము లాంటి కారణాల వలన ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెరిగి ఆరోగ్యానికి సరైన దారి సేంద్రియ ఆహారం అని అందరికీ తెలిసి వచ్చింది కాబట్టి ఎక్కువ మంది యువత సేంద్రియం వైపు అడుగులు వేస్తున్నారు. జయపాల్‌ రెడ్డి కూడా ఈ బాటలోనే నడుస్తానంటే అప్పటి పరిస్థితులు ప్రత్యక్షంగా అనుభవించిన వీరి తల్లిదండ్రులు జయపాల్‌ రెడ్డిని వ్యతిరేకించారు. ఇంకా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయినాకాని జయపాల్‌ రెడ్డి వెనుకంజ వేయకుండా చేస్తున్న ఉద్యోగాన్ని వదలి సేంద్రియ సాగులో అడుగు పెట్టి ఇందులోనే తన ఆదాయం పెంచుకొనే మార్గాలను అన్వేషిస్తూ 2019 నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాడు.

2019లో ప్రకృతి సాగులోకి అడుగు పెట్టిన జయపాల్‌ రెడ్డి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి వచ్చాడు కాబట్టి ఉద్యోగంలో వచ్చిన డబ్బు తప్పనిసరిగా పొందాలనే లక్ష్యంతో మార్గాలు అన్వేషిస్తూ సొంత మార్కెటింగ్‌ మరియు అనుబంధ రంగాలను ఆదరించడమే అని గ్రహించి తాము పండించిన సేంద్రియ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు మంచి ధరలకు అమ్మడంతో పాటు మన దేశీయ జాతి ఆవులను కొనుగోలు చేసి వాటి ద్వారా వచ్చిన పాలను, నెయ్యిని మంచి ధరలకు నేరుగా వినియోగదారులకు అమ్ముతూ వస్తూ ఉద్యోగంలో సంపాదించిన దానికంటే ఎక్కువగానే సంపాదిస్తున్నాడు.

పూర్తి సేంద్రియ పద్ధతులతో వివిధ రకాల కూరగాయలు, మామిడి, మన పురాతన వరి రకాలను పండిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం మామిడి, వరి పంటలు సాగులో ఉన్నాయి. గత సంవత్సరం వరకు వివిధ రకాల కూరగాయలు సాగు చేశాడు. ప్రస్తుతం కూరగాయలు సాగులో లేవు. వాటితో పాటు మన దేశీ జాతి ఆవులను పోషిస్తూ వాటికి అవసరమయిన పశుగ్రాసాలను సొంతంగా సాగు చేస్తున్నాడు.

వరి: ప్రతి సంవత్సరం వరి సాగు చేస్తుంటాడు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు మొదలు పెట్టిన తరువాత నూతన వరి వంగడాలను ప్రక్కన పెట్టి మన పురాతన వరి రకాలను మాత్రమే సాగు చేస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు నవారా, బహురూపి, కర్పూరకేలి, రత్నచోడి, మైసూర్‌ మల్లిక, ఇంద్రాణి, కుజుపటాలియా లాంటి రకాలను మాత్రమే సాగు చేశాడు. మన పురాతన వరి రకాలలో మన ఆరోగ్యాన్ని కాపాడే లక్షణాలు ఉంటాయని భావించి ఆ రకాలనే సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం మూడు ఎకరాలలో మైసూర్‌ మల్లికు మరియు కుజుపటాలియా రకాలు సాగులో ఉన్నాయి. సొంత విత్తనాలను ఎకరానికి 10 కిలోల చొప్పున నారు పోసుకుని 20 రోజులు పెరిగిన నారుని ప్రధాన పొలంలో నాటించాడు. సొంత ఆవుల ద్వారా వచ్చిన ఎరువు కుప్పపై జీవామృతాన్ని చల్లి ఆ ఎరువుకుప్పను ఘనజీవామృతంగా మార్చుకుని దుక్కిలో ఎకరానికి ఒక ట్రక్కు చొప్పున ఘనజీవామృతాన్ని అందించారు. నవంబరు 20న నారు పోసుకుని డిసెంబరు 10న నారు నాటించారు.  నారు నాటిన తరువాత ప్రతి 10 లేదా 15 రోజులకు ఒకసారి ఎకరానికి 200 లీటర్ల చొప్పున జీవామృతం మరియు గో-కృపామృతాలను మార్చి మార్చి భూమికి అందిస్తూ వస్తున్నాడు. అవసరాన్ని బట్టి పుల్లటి మజ్జిగ, జీవామృతం, వేపకషాయాలను పంటపై పిచికారి చేయించారు. అంతకు మించి ఏమీ చేయలేదు. పంట మే మూడవ వారంలో కోత కోయించాడు. ఎకరానికి 70 కిలోల బస్తాలు 25 వరకు దిగుబడి వచ్చింది. గత పంటకాలంలో 3 ఎకరాలకు గాను 4200 కిలోల బియ్యాన్ని పొంది కిలో 70/- నుంచి 80/- ల వరకు అమ్మకం చేశాడు.

మామిడి: తెలిసిన వారికి చెందిన 7 ఎకరాల మామిడి తోటలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ తాను మార్కెటింగ్‌ చేసుకోగలిగిన మొత్తంలో మామిడి కాయలను తోట యజమాని నుంచి కొనుగోలు చేస్తూ నేరుగా వినియోగదారులకు మంచి ధరలకు అమ్మకం చేస్తుంటాడు. ప్రతి 30 రోజులకు ఎకరానికి 200 లీటర్ల చొప్పున జీవామృతం లేదా గోకృపామృతాలను మార్చి మార్చి డ్రిప్పు ద్వారా మామిడి మొక్కల పాదులలో అందిస్తుంటారు. అవసరాన్ని బట్టి థపర్ణి కషాయం, పుల్లటి మజ్జిగలను పంటపై పిచికారి చేయిస్తుంటారు. తనకున్న ఆవులను 7 ఎకరాల మామిడి తోటలో తిరగనిస్తుంటారు. బంగినపల్లి, రసాలు, థేరి రకాలను సాగు చేస్తూ కిలో 100 నుంచి 120/-లకు నేరుగా వినియోగదారులకు అమ్మకం చేస్తూ ఉంటాడు.

ఆవులు: ప్రస్తుత పరిస్థితులలో మనదేశీ జాతి ఆవులయిన ఒంగోలు, గిర్‌, సాహివాల్‌, తార్‌పార్కర్‌ మొదలగు గోవుల పాలు మరియు నెయ్యిలకు గిరాకీ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దానిని గమనించి జయపాల్‌ రెడ్డి దేశీ జాతి ఆవులతో పశుపోషణ మొదలు పెట్టాడు. పశుపోషణలో ఆర్థికంగా ఫలితాలు సాధించాలంటే గిర్‌, కాంగ్రెజ్‌, సాహివాల్‌ జాతులు మొదటి వరుసలో ఉంటాయని గ్రహించి ఈ జాతులనే కొనుగోలు చేస్తూ తన పశు సంపదను అభివృద్ధి పరుస్తున్నాడు. మొదటలో 2020వ సంవత్సరములో రెండు గిర్‌ ఆవులను కొనుగోలు చేశాడు. ప్రతి సంవత్సరం కొన్ని ఆవులను కొనుగోలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇటీవల అంటే రెండు నెలల క్రితం 1,20,000/-లు వెచ్చించి గిర్‌ ఆవును కొనుగోలు చేశాడు. ఆ ఆవు మే 2వ తారీఖున ఈనింది. ప్రస్తుతం అది రెండు పూటలా కలిపి 8 లీటర్ల పాలు ఇస్తుంది. పూటకి లీటరు చొప్పున దూడకు వదలగా పూటకు 4 లీటర్ల పాలు ఇస్తుంది. ఈ ఆవు పాల దిగుబడి పెరుగుతూ కొన్ని రోజులు గడిచే సరికి రోజుకి 16 నుంచి 20 లీటర్లు పాలు పొందగలననే నమ్మకంతోనే జయపాల్‌ రెడ్డి ఆ ఆవును 1,20,000/-లకు కొనుగోలు చేశాడు. మొత్తం 15 ఆవులను, ఒక ఎద్దును, 10 దూడలను పోషిస్తున్నాడు. 15 ఆవులలో 9 ఆవులు ప్రస్తుతానికి పాలు ఇస్తున్నాయి. ఆవులలో గిర్‌, కాంగ్రెజ్‌, సాహివాల్‌, రాఠి, రెడ్‌సింధి రకాలు ఉన్నాయి. దూడలలో 5 మగవి, 5 ఆడవి ఉన్నాయి. 9 ఆవుల నుండి రోజుకు రెండు పూటలు కలిపి సగటున 60 లీటర్ల పాల దిగుబడి పొందుతున్నాడు. ఒక రోజు పాలను నెయ్యి చేస్తుంటాడు. ఒక రోజు పాలను వినియోగదారులకు అమ్ముతుంటాడు. అంటే రోజు మార్చి రోజు అంటే నెలలో 15 రోజుల పాలను నెయ్యి (పాలను పెరుగు చేసి, ఆ పెరుగు చిలికి వెన్న చేసి వెన్న నుంచి నెయ్యి) చేస్తుంటాడు. నెలకు 50 నుంచి 60 లీటర్ల నెయ్యి పొంది లీటరు 2500/-లు (మిషను సహాయంతో వెన్న పొంది, ఆ వెన్నతో చేసిన నెయ్యి) మరియు లీటరు 3500/- (మనిషి చిలికి వెన్న పొంది ఆ వెన్న నుంచి పొందిన నెయ్యి) ల చొప్పున అమ్మకం చేస్తున్నాడు. నెలకు 15 రోజులు రోజుకు 60 లీటర్ల చొప్పున పాలను లీటరు 100/- నుంచి 120/-లకు నేరుగా వినియోగదారులకు అమ్మకం చేస్తున్నాడు. ఆవులను సాధ్యమయినంత వరకు స్వేచ్ఛగా తిరగనిస్తుంటాడు. వీటికి పశుగ్రాసంగా సూపర్‌ నేపియర్‌, మొక్కజొన్నలను సాగు చేస్తున్నాడు. ఈ పశుగ్రాసాలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులతోనే సాగు చేస్తున్నాడు. ఈ పశుగ్రాసాలతో పాటు వేరుశనగ చెక్క, దాణాలను కూడా అందిస్తున్నాడు. తాను పోషించే ఆవుల గర్భధారణ కొరకు ఎలాంటి కృత్రిమ పద్ధతులవైపు ఆలోచించకుండా తాను పోషిస్తున్న గిర్‌, కాంగ్రెజ్‌ కలయికలతో ఉన్న ఎద్దునే ఉపయోగిస్తున్నాడు.

ఏది ఏది ఏమైనా కాని చేస్తున్న ఉద్యోగాన్ని వదలి తల్లిదండ్రులను ఎదిరించి సేంద్రియ సాగు చేస్తూ తన భూమిని, ప్రకృతిని తనవంతుగా కాపాడుతూ తాము ఆరోగ్యకరమైన ఆహారం తింటూ సమాజానికి ఆరోగ్యకర ఆహారాన్ని అందిస్తూ ఉద్యోగంలో కంటే ఎక్కువగా సంపాదిస్తూ శారీరక శ్రమ, సొంత మార్కెటింగ్‌ చేయగలిగితే ఉద్యోగం చేయనవసరం లేదు అని జయపాల్‌ రెడ్డి నిరూపిస్తున్నాడు. మరిన్ని వివరాలు 9666167923కి ఫోను చేసి తెలుసుకోగలరు.

శారీరక శ్రమ తప్పనిసరి

తాను చేసే సేంద్రియ సాగు మరియు పశుపోషణలో శారీరక శ్రమ తప్పనిసరిగా ఉంటుంది. సేంద్రియ సాగులో వినియోగించే వివిధ రకాల కషాయాలు మరియు ద్రావణాలు సొంతంగా తయారు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా వచ్చిన దిగుబడికి మంచి ధర లభించాలంటే సొంతంగా మార్కెటింగ్‌ చేసుకోవలసి ఉంటుంది. కాబట్టి శారీరక శ్రమ చేయగల వారికి సేంద్రియ పద్ధతులు ఆరోగ్యకరమైన వ్యాపకం అని నిస్సందేహంగా చెప్పవచ్చని జయపాల్‌ రెడ్డి అంటున్నాడు.

రోజుకి 20 లీటర్ల పాలు ఇచ్చే గిర్‌ ఆవు

మన దేశీ జాతి ఆవులు అనగానే పాలు సక్రమంగా పొందలేము అనే అభిప్రాయం రైతులలో ఉంది. అందువలననే విదేశీ జాతులవైపు పశుపోషకులు మొగ్గు చూపుతున్నారు. తాను పోషించే ఆవులలో రోజుకు 10 నుంచి 12 లీటర్ల పాలు ఇచ్చే గిర్‌, కాంగ్రెజ్‌, సాహివాల్‌ ఆవులు ఉన్నాయి. రోజుకు రెండు పూటలు కలిపి 16 నుంచి 20 లీటర్ల పాలు ఇచ్చే గిర్‌ ఆవును రెండు నెలల క్రితం 1,20,000/-లు వెచ్చించి కొనుగోలు చేయడం జరిగింది. ఈ ఆవు ఇటీవల ఈనడము జరిగింది. ప్రస్తుతానికి పూటకు 5 లీటర్ల చొప్పున (దూడ తాగే పాలతో కలిపి) రోజుకు 10 లీటర్ల చొప్పున ఇస్తుంది. క్రమేపి పాల దిగుబడి పెరిగి రోజుకు రెండు పూటలు కలిపి 16 నుంచి 20 లీటర్ల పాలను ఈ ఆవు నుంచి పొందుతానని జయపాల్‌రెడ్డి అంటున్నాడు.

ఎక్కడికి అక్కడే మార్కెట్లు సృష్టించుకోవాలి

మార్కెట్‌ గురించి దూరం ఆలోచించకుండా ఈ పద్ధతులు పాటించే వారు తమ ప్రాంతాలకు సమీపములోనే మార్కెట్‌ను సృష్టించుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ జీవితాలను కొనసాగించవచ్చు. ఇష్టం లేకుండా ఒకరి దగ్గర ఉద్యోగం చేయకుండా తమ కాళ్ళపై తామే నిలబడుతూ ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాలకు ఇదే సరైన దారి కాబట్టి ఈ దారిలో నడవటానికి లక్షల మందికి అవకాశం ఉంది కాబట్టి నిరుద్యోగులు ఈ దిశగా ఆలోచన చేయాలని జయపాల్‌ రెడ్డి కోరుతున్నాడు. 

నాణ్యమైన ఉత్పత్తులు వినియోగదారులకు అందించడము ముఖ్యం

ప్రస్తుత సమాజంలో ఎక్కువ మంది ప్రజలకు ఆరోగ్యం గురించి, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలనే విషయాల గురించి అవగాహన పెరిగింది. ఇంకా పెరుగుతూనే ఉంది కాబట్టి ఈ పరిస్థితులను మనము అనుకూలంగా మలచుకోవాలంటే నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించగలిగితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయనే దానికి తానే ఉదాహరణ అని జయపాల్‌ రెడ్డి అంటున్నాడు. తాను మొదటలో బియ్యం, కూరగాయలను వినియోగదారులకు ఇవ్వడంతో మొదలు పెట్టి ప్రస్తుతం మామిడి కాయలు, ఆవు పాలు, ఆవు నెయ్యి లాంటి ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మగలుగుతున్నాడు. ఒక పంట కాలానికి తాను పొందే 4000 కిలోలపైగా దేశీ రకం బియ్యం, నెలకు 50 నుండి 60 లీటర్ల నెయ్యి, నెలకు 800 నుంచి 900 లీటర్ల ఆవు పాలు, సంవత్సరానికి సుమారుగా 5000 కిలోల మామిడి కాయలు నేరుగా వినియోగదారులకు అమ్మగలుగు తున్నాను. నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ వినియోగదారులకు నమ్మకం కలిగించగలిగితే ఉజ్వల భవిష్యత్తుకు అవకాశాలు మెండుగా ఉంటాయని జయపాల్‌ రెడ్డి నిరూపిస్తున్నాడు.