కరోనా ప్రభావం తగ్గిపోతున్నది. చలికాలపు పంటలు చేతికొచ్చే సమయం. వేసవిలో ఎండలు సాధారణం కంటే ఎక్కువ వుంటాయనే ప్రెడిక్షన్లు. ఇలాంటి పరిస్థితుల్లో ఏప్రిల్ (రేవతి, అశ్విని, భరణి కార్తె తొలి రోజులు)లో వివిధ పంటలలో ఆచరించవలసిన పనులను గురించి తెలుసుకుందాం. పంటల నమ్ముకునేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి కూడా తెలుసుకుందాం.
వరి: వార్తల్లో విశేషంగా వినిపిస్తూ, రాజకీయాలతో ముడిపడిన పంట. నవంబరులో విత్తిన వరి పంట కోతలు ఏప్రిల్లో ఉంటాయి. కొన్ని చోట్ల ఈ నెలలో ఈదురుగాలులు, వడగండ్ల వానలు వచ్చి తయారైన పంట దెబ్బతినవచ్చు. వీటి నుండి వీలైనంత వరకు తప్పించుకోవాలంటే, పంట తయారైన వెంటనే కోయాలి. యంత్రాల సహాయం తీసుకుంటే పని తొందరగా అవుతుంది. పిలక, పూత, పాలుపోసుకొను, గింజ గట్టిపడుథ వరకు భూమిలో తేమ తగ్గకుండా ఉంచితే నూక శాతం బాగా తగ్గి, గట్టి బియ్యం ఎక్కువగా వస్తాయి. పంట కోసినాక ఏప్రిల్ ఎండల్లో తెగ ఎండితే, ఎక్కువగా నూకలొస్తాయి. కాబట్టి వడ్లను మోతాదుగానే ఆరనివ్వాలి. రైతులకు మేలు చేయాలంటే ప్రభుత్వాలు రైతుల దగ్గర కొని ఎక్స్పోర్ట్ చేయడానికి అపార అవకాశాలున్నాయి. అప్పుగా ఎక్స్పోర్ట్ చేసి, తర్వాత వడ్డీతో సహా వసూలు చేసుకుంటే నష్టాలు అంతగా ఉండవు. లాభాలు కూడా రావచ్చు. కొద్దిపాటి నష్టాలున్నా ప్రభుత్వాలు భరిస్తే ఆ ప్రభుత్వాలకు రైతుల్లో మహామంచి పేరొస్తుంది. పాతబియ్యానికి ఎక్కువ ధర వస్తుంది. వీలున్న రైతులు, రైతు సంఘాలు వడ్లను నిల్వ చేసి, పాతవయినాక బియ్యం చేసి అమ్మవచ్చు. వరి నిల్వకు పల్లెల్లో ఖాళీగా ఉన్న రూములు/ఇండ్లు వాడవచ్చు. ఎడగారు (రాయలసీమ), కత్తెర (తెలంగాణ), షష్ఠికం (ఉత్తరకోస్తా) పంటల పేరుతో ఈ నెలలో వరి విత్తే రైతులు, వరికి బదులుగా పశుగ్రాసాలు, పూలు అధిక ధరలు పలికే కూరగాయలు పంట పెట్టవచ్చు. ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఎక్కువ భూమిలో సాగు చేయవచ్చు. స్వంత అవసరాలకు వీలైనంత వరకు సేంద్రియ పద్ధతిలో పండించాలనే రైతులకు ఈ నెల గొప్ప సదవకాశం. కనీసం పాతిక లేక అర ఎకరంలో సేంద్రియ పద్ధతిలో పండించి ఎక్కువగా ఉన్న పంటను అధిక ధరలకు అమ్ముకోవచ్చు. ప్రతి సంవత్సరం, విస్తీర్ణాన్ని కొద్దికొద్దిగా పెంచుతూ పోతూ, కొన్నేళ్ళల్లో మొత్తం సేంద్రియ పద్ధతిలోకి అదీ దిగుబడులు తగ్గకుండా పండించవచ్చు. మనుషుల, పంటల మరియు భూమి ఆరోగ్యంతో పాటు డబ్బు లాభాలు స్వంతం చేసుకోవచ్చు. ఇండ్ల ముందరకొచ్చి వడ్లను బియ్యం చేసే చిన్న మిషన్లను ప్రభుత్వాలు సబ్సిడీమీద ఇస్తే పెద్ద మిల్లుల మీద ఆధారపడడం తగ్గి రైతులు బాగుపడతారు.
జొన్న: హైదరాబాద్లో జొన్న పిండి కిలో 70 రూపాయలకు రిటైల్గా అమ్ముతున్నారు. రైతుకు మంచి ధర వస్తుంది. జనవరిలో విత్తిన జొన్నలో కంకినల్లి, గింజబూజు ఆశించే అవకాశమున్నది. వీటి నివారణకు తగిన సస్యరక్షణ చర్యలు ఏప్రిల్లో తీసుకోవాలి.
సజ్జ: పంట కోతలు ఈ నెలలో ఉంటాయి. పిలక కంకుల కంటే, ప్రధాన కాండపు కంకి ముందుగా కోత కొస్తుంది. అందువలన కనీసం రెండుసార్లయినా కంకులు కోయాలొస్సుంది.
పెసర, మినుము: ఈ పంటల కోతలు ఏప్రిల్లో ఉంటాయి. ఊరి సంఘాలు రిటైల్గా అమ్మకాలు మొదలుపెడితే, మధ్యవర్తుల లాభాలు కూడా రైతులకే దక్కుతాయి. ఊరందరి వినియోగదారులకు తక్కువ ధరకు, పెసరపప్పు, మినపప్పు దొరుకుతుంది.
వేరుశనగ: డిశంబరులో విత్తిన వేరుశనగను ఏప్రిల్లో భూమిలో నుండి తీయాల్సుంటుంది. కాయలు తెగిపోకుండా భూమినుండి బయటకు తీయాలంటే, భూమిలో తగినంత తేమ ఉండాలి. ట్రాక్టరుతో నడిచే బ్లేడు గుంటక లేక వేరుశనగ డిగ్గర్ను వాడవచ్చు. పారనాగలి (నాగలి చివర పార ఉన్నది) కూడా ఉపయోగించవచ్చు. తక్కువ ధర వేరుశనగ డిగ్గర్లను ప్రాచుర్యంలోకి తేవాల్సిన అవసరముంది. సబ్సిడీలో సప్లయి చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాయలను చెనిగి చెట్ల నుండి వేరుచేయడానికి స్ట్రిప్పర్ను ఉపయోగించి త్వరగా పని ముగించవచ్చు. ప్రతి ఊరిసంఘం అద్దె పాత్రిపదికన యంత్రాలను రైతులకు సప్లయి చేయవచ్చు. సబ్సిడీ మీద ఇలాంటి యంత్రాలను ఇంకా ఎక్కువగా ఇచ్చి ప్రోత్సహించాలి. ఈ నెలలో పండిన కాయలను విత్తనానికి వాడాలంటే, నీడలో ఆరబెట్టాలి. ఎండలు తీవ్రంగా ఉండుట వలన ఎండలో ఆరబెడితే మొలకశాతం బాగా తగ్గుతుంది. కాయలను నిల్వ చేయాలంటే తేమ శాతం 9 కంటే తక్కువ ఉండాలి. పచ్చికాయగా అమ్ముకోవాలంటే, మట్టి లేకుండా శుభ్రం చేసి అమ్మితే ఎక్కువ రేటొస్తుంది.
కొత్తిమీర: ఎండవేడి ఎక్కువగా ఉన్నందున ఏప్రిల్, మే నెలలో కొత్తిమీర సరిగా ఎదగదు. కొంత నీడ, కొంత ఎండ ఉంటే ఎండాకాలంలో కొత్తిమీర బాగా వస్తుంది. షేడ్నెట్లు సబ్సిడీలో దొరుకుతుంటే తీసుకొని మంచి కొత్తిమీర పంట తీయవచ్చు. ఆర్థిక సంవత్సరంలో తొలి నెల నుండి ఏప్రిల్, మే నెలల్లో కూడా సబ్సిడీ మీద షేడ్నెట్లు దొరికే విధంగా ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకుంటే రైతులుకు మేలు జరుగుతుంది. చౌడు భూముల్లో సాధారణ రకాల కొత్తిమీర సరిగా ఎదగదు. కో-2 అనే రకం చౌడు భూముల్లో కూడా వస్తుంది. సాధారణ నేలల్లో విత్తడానికి అధిక ఆకుదిగుబడినిచ్చే రకాలు: ఆర్.సి.ఆర్-446, ద్వా-3, పంత్హరితిమా, హిస్సార్ ఆనంద్, సాధన, కో-1, కో-2, కో-3.
పొదీన: మసాలా కూరల్లో విరివిగా వాడే పుదీనా ఆకుకు కూడా ఎండాకాలంలో మంచి గిరాకీ ఉంటుంది. రంజాన్ నెల కూడా ఏప్రిల్లో ఉన్నందున దీనికి మంచి గిరాకీ ఉండే అవకాశముంది. ఈ పంటను, కాండపు ముక్కల ద్వారా మరియు వేర్ల ద్వారా వ్యాప్తి చేస్తారు. ఎకరా పొలానికి 3-4 క్వింటాళ్ళ కాండపు ముక్కలు నాటడానికి అవసరముంటాయి. వరుసల మధ్య 45 సెం.మీ. కాండపు ముక్కలు నాటి, మట్టితో కప్పాలి. చిగురు వచ్చి తీగలుగా ఎదుగుతాయి. దిగుబడి: 15-20 టన్నులు/ఎకరాకు. అనువైన రకాలు: సక్షమ్, కోసి, శిలిక్, హిమాలయ.
పాలకూర: అత్యధిక పోషక విలువలు గలిగిన ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. ఇందులో ఇనుము, కాల్షియం, మాంసకృత్తులు, విటమిన్ ఎ, సి, పుష్కలంగా ఉంటాయి. అధిక దిగుబడి రావాలంటే ఉదజని సూచిక 7.0 కు దగ్గర గా ఉన్న భూములు అత్యంత అనుకూలం. అయినా ఉదజని సూచిక 10.5 ఉన్న అధిక క్షారనేలల్లో కూడా, ఈ పంట తీసుకోవచ్చు. అత్యధిక దిగుబడినిచ్చే రకాలు: ఊటీ-1: దిగుబడి 24 ట/ఎ., జాంనగర్ గ్రీన్ : దిగుబడి 16-19 ట/ఎ.
తోటకూర: అత్యధిక దిగుబడినిచ్చే రకాలు: పూసాకీర్తి: 22 ట/ఎ. పూసాకిరణ్: 14 ట/ఎ. ఎర్రతోటకూర రకాలు: అర్క సుగుణ, అర్క అరుణ, దిగుబడి: 3-5 ట/ఎ.
సిరికూర: కాండం కూడా కూరగా ఉపయోగపడుతుంది. దిగుబడి : 4-5 ట/ఎ.
మెంతికూర: ఆకు కోసం సంవత్సరమంతా సాగు చేయవచ్చు.విత్తిన 25-30 రోజులకు మొదటి కోత, తర్వాత 10-15 రోజుల కొకకోత 2-3 కోతలు తీసుకోవచ్చు. అనుకూలమైన రకాలు: గుజరాత్ మేథి, లాంమేథి-1 (ఎల్.ఎఫ్.సి-84), లాంమేథి-2 (ఎల్.ఎఫ్.సి-103).
టమాట: ప్రాజెక్టుల్లో చెరువుల్లో బాగా నీరున్నందున భూగర్భ జలాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. టమాట సాగు చేయడం రైతులకు బాగా వచ్చు. ఎక్కువ విస్తీర్ణంలో పంట పెట్టడం వలన దిగుబడి ఎక్కువగా వస్తున్నది. వాతావరణంలో ఎండ బాగా ఉంటే దిగుబడి బాగుంటుంది. మేఘావృతమైతే దిగుబడి బాగా పడిపోతుంది. ప్రస్తుతం ధరలు తక్కువగా ఉన్నాయి. మేఘావృతమైన వాతావరణం ఏర్పడితే తప్ప దిగుబడి తగ్గదు. ధరలు పెరగవు. మంచి ధరలు రావాలంటే విస్తీర్ణాన్ని నియంత్రించాలి. తక్కువ రేట్లున్నపుడు టమాటతో విలువ పెంచే పదార్థాలు (వాల్యూయాడెడ్ ప్రాడక్ట్సు) చేసి విక్రయించుకోవాలి.
వంగ: టమాట ధరల కంటే వంగ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఈ పంట కాలం ఎక్కువవడం వలన రైతులు ఈ పంటపై తక్కువ మొగ్గుచూపుతున్నారు. ప్రాంతాలవారీగా వేరు వేరు రకాలను ఇష్టపడుట వలన అన్ని ప్రాంతాలకు అనువైన రకాలు. ఉత్పిత్తి తక్కువ. టమాట రేట్లతో పోలిస్తే ఈ పంట రేట్లు ఒడిదుడుకులు లేకుండా మధ్యస్థంగా ఉంటున్నాయి. నల్ల రకాల కంటే తెల్ల వంకాయలకు ధర ఎక్కువ. పుచ్చులను తెల్లరకాలలో గుర్తు పట్టడం సులభం కావడం కూడా తెల్లవంకాయల గిరాకీకి కారణం.
కీరదోస: ఎండలు ముదిరేకొద్దీ ఈ పంటకు గిరాకీ ఎక్కువ. పాలీహౌస్లు, నెట్హౌస్ల విస్తీర్ణం మరియు దిగుబడి పెరుగుతున్నది. కీరదోసపై ప్రజాదరణ కూడా పెరుగుతున్నది. ప్రతి ఫంక్షన్లోను కీరదోస ముక్కలు సాలాడ్గా పెట్టడం అలవాటైపోతున్నది. అందువలన, ఇప్పట్లో ఈ పంటకు మంచి ధరలే ఉండే అవకాశమున్నది. అనుకూలమైన ఆడ, మగ వేర్పాటు లేని (పార్థినోకార్పిక్) రకాలు: సన్-9728, సన&-3019, కియోన్.
కూరమిరప/కాప్సికం/బెంగుళూరు మిర్చి: పల్లెల్లో కూడా ఫాస్ట్ ఫుడ్స్ తినడం పెరిగిపోవడం, చైనీస్ వంటకాలైన నూడుల్స్ వంటి వాటికి ప్రజలు ఆకర్షితులవడం ఈ పంటకు గిరాకీ పెంచుతున్నది. ఎండాకాలంలో శుభకార్యాలు, ఫంక్షన్లు ఎక్కువగా ఉంటాయి. దీనికితోడు అనుకూలమైన, అత్యధిక దిగుబడి (40ట/ఎ) నివ్వగల హైబ్రిడ్లు, హరిత గృహాల్లో పండించడానికి విత్తనాలు బజార్లో పుష్కలంగా దొరుకుతున్నాయి. కొన్ని మంచి హైబ్రిడ్లు: ఎరుపు: ట్రిపుల స్టార్, నతాషా, ఇన్స్పిరేషన్, బోంబె, పసరిల్లా. పసుపు: సన్యెజ్, ఓరోబెల్లి, బచ్చాట, స్వర్ణ, ఆకుపచ్చ: యమున, ఇంద్ర.
చేమగడ్డ: ఏప్రిల్లో కూడా వీటిని నాటవచ్చు. అరటి, కొబ్బరి వంటి తోటల్లో అంతర పంటగా దీనిని సాగు చేయవచ్చు. చేమ దుంపల పొలంలో మొదటి 2 నెలల్లో పంట పూర్తయ్యే ఫ్రెంచ్ బీన్స్, ముల్లంగి పంటలను అంతర పంటలుగా సాగు చేసి అధికాదాయాన్ని పొందవచ్చు. మంచి రకాలు: భావపురి (కె.సి.ఎస్-2): 8 నెలలు, 14 ట/ఎ. కె.సి.ఎస్-3: 5 నెలలు, 9.6 ట/ఎ. విత్తనంగా తల్లి దుంపల నుండి పిలకదుంపలు వాడినప్పటి కంటే ఎక్కువ దిగుబడి పొందవచ్చు. విత్తడానికి 300-400 కిలోలు/ఎకరానికి దుంపలు అవసరం.
అల్లం: ఈ పంట విత్తడానికి ఏప్రిల్ తొలివారం నుండి మే కడ వరకు అనుకూలం. జూన్-జులైల్లో గాలులతో కూడిన అధిక వర్షాలకు పడిపోకుండా అల్లం మొక్కలు నిలదొక్కుకోవాలంటే ముందుగా విత్తడం అవసరం. భూమిలో తేమ తగినంతగా లేకపోతే నీటి తడి ఇచ్చి లేకపోతే వర్షం బాగా పడినాక విత్తుకోవాలి. ఎక్కువ ఎండ, ఎక్కువ వేడి, ఎక్కువ తేమ ఉన్న ప్రాంతాలు అల్లం దిగుబడికి అత్యంత అనుకూలం. పాక్షికంగా నీడ ఉండే ద్రాక్ష, నిమ్మ, బొప్పాయి, మామిడి, కొబ్బరి, జామ తోటలు పందిరి కూరగాయ తోటల్లోను ఈ పంటను పండించవచ్చు. అధిక పచ్చి అల్లం మరియు ఎండు అల్లం కొరకు అనువైన రకాలు తెలంగాణకు : మారన్, రియోడిజనీరో. ఆంధ్రప్రదేశ్కు : వైనాడ్ లోకల్, రియోడిజనీరో.
పసుపు: ఈ పంట తవ్వి తీయడం ఏప్రిల్లో ఉంటుంది. ఉడకబెట్టడం, ఆరబెట్టడం, పాలిషింగ్, గ్రేడింగ్, మార్కెట్కు పంపుట ఈ నెలలో ఉంటాయి. ట్రాక్టరుతో త్రవ్వించడం వలన ఎక్కువ విస్తీర్ణంలోని పంటను వెలికి తీయవచ్చు. తక్కువ గాయాలు తగిలిన దుంపలు పొందవచ్చు. ఈ పద్ధతిలో భూమిలో మిగిలిపోయే దుంపలు కూడా తక్కువ.
నిమ్మ, బత్తాయి: కొమ్మ కత్తిరింపులు, వేరుమూలాల్నుండి పెరిగే కొమ్మలు, కాండంపై 2 అడుగుల వరకు పెరిగే కొమ్మలు, నీడన ఉన్న అనవసరమైన, ఎండిన పుల్లలను కత్తిరించాలి. కత్తిరించిన చోట బోర్డోపేస్టు పూసి తెగుళ్ళు సోకకుండా కాపాడవచ్చు.
పశువుల మేత: ఎండల్లో పచ్చిమేతకు మంచిగిరాకీ. ఈ నెలలో విత్తదగిన పశుగ్రాస పంట: జొన్న, పి.సి.-6 అనే రకం సున్నారపు నేలల్లో కూడా పెరుగుతుంది. ముందుగా విత్తిన పశువుల మేత పంటల నుండి, మేతను సేకరించి బాగా ఎక్కువ ధరకు ఎండాకాలంలో అమ్ముకునే వీలుంది.
మామిడి: ఈ పంటకు నీటి తడులను ఆపాలి. బాగా తయారైన లేత ఆకుపచ్చ రంగున్న కాయలు, అందులో కండ లేత పసుపు రంగుకు మారినటువంటి కాయలు కోయడానికి అనుకూలం. మామిడి కాయలను ఇథిలిన్ వాయువుతో మాగబెట్టవచ్చు. కాల్షియం కార్బైడ్ ద్వారా మాగబెట్టరాదు.
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి దేశీయ ఆవులను సబ్సిడీ రూపంలో ఇస్తే రైతుల, ప్రజల ఆరోగ్యానికి సేవ చేసినట్లవుతుంది.
పలు పంటలపైన, రైతు సంఘాలపైన సలహాలు, సూచనలు పొందగోరే వారు 9494408619 కు ఫోను చేయవచ్చు. సంఘాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఏర్పాటు చేయించుకోవచ్చు. ఫేస్బుక్లో SALLA NARAYANASWAMY/Profsnswamy అకౌంట్లలో పోస్టింగులలో వివిధ విషయాలపై వివరణలను, ఫొటోలతో సహా చూడవచ్చు. సలహాలు, సూచనలు రైతులకు ఉచితం.