తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేర్ హౌసింగ్ కార్పోరేషన్ ఇంఛార్జి ఎండీ ఉదయ్ కుమార్ మరియు ఆగ్రోస్ ఎండీ రాములుతో సమావేశం నిర్వహించి, వరి కొనుగోళ్ళు, వరి సేకరణ, తరలింపు మరియు నిల్వలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టవలసిన తక్షణ చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో వడ్ల సేకరణకు ఏర్పాటు చేసిన అన్ని కొనుగోలు కేంద్రాలలో అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచాలని, కోతలు మరియు సెంటర్లకు వస్తున్న ధాన్యాన్ని బట్టి అవసరమైతే మరిన్ని క్లీనర్లు ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధించి పౌరసరఫరాల శాఖ మరియు మార్కెటింగ్ శాఖ అధికారులతో సమన్వయంతో పనిచేస్తూ రైతులకు కొనుగోళ్ళలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆగ్రోస్ ఎండీ రాములుని ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని గోదాముల నిల్వ సామర్థ్యము, ప్రస్తుతం ప్రాంతాల వారీగా అందుబాటులో ఉన్న గోదాముల నిల్వ సామర్ధ్యం, వెంటవెంటనే కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలింపుకు తీసుకోవాల్సిన చర్యలపై మార్కెటింగ్ మరియు వేర్ హౌసింగ్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. తరుచూ సివిల్ సప్లై అధికారులతో సమన్వయం చేసుకొంటూ వారికి వివరాలు అందచేస్తూ ధాన్యం తరలింపులో వారికి సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. ప్రస్తుతము 29.537 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యము అందుబాటులో ఉందని, కొనుగోళ్ళకు తగ్గట్లుగా నిల్వ సామర్ధ్యాన్ని అందుబాటులోకి తెచ్చేవిధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ జాయింట్ సెక్రటరీ గారు సోయాబీన్ ఉత్పత్తి చేసే రాష్ట్రాలయిన కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల వ్యవసాయ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో, ఇప్పటిదాకా జరిగిన సోయాబీన్ సేకరణ గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా శ్యామ్యూల్ మాట్లాడుతూ, ఇప్పటిదాకా రైతుల వద్ద నుంచి మద్ధతు ధరకు సోయాను సేకరించిన రాష్ట్రాలలో తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని, సేకరణలో సాంప్రదాయ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలను కూడా అధిగమించిందని తెలియజేస్తూ, తెలంగాణ ప్రభుత్వ కృషిని అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 47 సెంటర్ల ద్వారా సోయా సేకరణ జరుగుతుందని, రూ. 4892 మద్ధతు ధర చెల్లిస్తూ, ఇప్పటికి 118.64 కోట్ల విలువగల 24,252 మెట్రిక్ టన్నుల సోయా చిక్కుడును, 1464 మంది రైతుల నుండి సేకరించినట్లు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు మంత్రి తుమ్మల ఆదేశాలతో గతంలో ఉన్న ఎకరా పరిమితి 6.5 క్వింటాళ్ళ నుండి 10 క్వింటాళ్ళకు పెంచడం జరిగిందని, మన రాష్ట్రం నుండి సమీక్షలో పాల్గొన్న మార్క్ఫెడ్ అధికారులు తెలిపారు.
జిల్లా స్థాయిలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శనలకు ఆదేశాలు
ఆయా ప్రాంతాలలో ఉన్న డిమాండ్ను బట్టి ఎంపిక చేసిన పనిముట్లు/యంత్రాల సరఫరా త్వరలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్దరించడానికి కావాల్సిన నిధులు, పథక అమలు తీరుతెన్నులపై వ్యవసాయ కార్యదర్శి రఘునందన రావు, వ్యవసాయ డైరెక్టర్ గోపి, ఐఏఎస్ మరియు సహకార సంస్థల ప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమావేశం నిర్వహించారు. వ్యవసాయమంత్రి తుమ్మల ఆదేశాలతో ఈ యాసంగి నుండి రైతులకు అవసరమైన పనిముట్లను, యంత్రాలను, సబ్సిడీపై సరఫరా చేయడానికి, ప్రణాళిక సిద్దంచేసామని అందులో భాగంగా జిల్లాల వారీగా ఎక్కువ డిమాండ్ ఉన్న పనిముట్లను, యంత్ర పరికరాల జాబితా సిద్దం చేసినట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి తెలియజేశారు. అంతేగాక మంత్రి ఆదేశాల మేరకు త్వరలోనే జిల్లాల వారీగా యంత్ర పరికరాలు మరియు పనిముట్లు తయారీ దారుల సంస్థల సహకారంతో మార్కెట్లలో కొత్తగా వచ్చిన పరికరాలపై రైతులలో అవగాహన పెంపొందించే విధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా యంత్రాంగం ప్రదర్శనకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నామని తెలియజేశారు. ప్రస్తుతం వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రోటవేటర్స్, ఎమ్.బి నాగళ్ళు, కల్టివేటర్స్, తైవాన్ స్ట్రేయర్లు, బేలర్స్, పవర్ వీడర్స్, మొక్కజొన్న వొలుచు యంత్రాలు, ట్రాక్టర్లు, కిసాన్ డ్రోన్లు మున్నగువాటిని ప్రతిపాదించినట్లు తెలియజేశారు. రైతులకు అవగాహన కొరకు ఎగ్జిబిషన్లను ప్రభావవంతంగా నిర్వహించాలని, ఎగ్జిబిషన్ ఏర్పాటుకు కావాల్సిన నిధులు కూడా సమకూర్చుకోవాలని, అలాగే సంబంధిత గౌరవమంత్రి వర్యులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి రైతులందరికీ సౌకర్యంగా ఉండేలా జిల్లా స్థాయిలో స్థలాన్ని ఎంపిక చేసుకోవాల్సిందిగా సూచించారు. వ్యవసాయశాఖ వారు తయారు చేసిన ప్రతిపాదనలను పరిశీలించి, ఇది ఆరంభం మాత్రమేనని, వ్యవసాయయాంత్రీకరణ నిరంతర కార్యక్రమము అని, అందుకని ఎక్కడా, ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా పటిష్టంగా నిబంధనలు రూపొందించి, రైతులకు ఈ సీజన్ లోనే యంత్రాలను, పనిముట్లను అందచేయాలని, జిల్లా స్థాయి ఎగ్జిబిషన్లను కూడా వెంటనే ఏర్పాటుచేయాలని, వ్యవసాయ మరియు అనుబంధ రంగాల వారందరినీ ఈ ఎగ్జిబిషన్లో భాగస్వామ్యం చేయాలని కోరారు. ఎగ్జిబిషన్ సమాచారం అన్ని ప్రసారమాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి, రైతులను పెద్దఎత్తున పాల్గొనేటట్లు చేయాల్సిందిగా సూచించారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిపై ‘ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటినెన్స్ యాక్టు(ఎస్మా)’ను ప్రయోగించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అక్కడక్కడ రైతులను ఇబ్బబందులకు గురి చేస్తున్న సంఘటనలు తన దృష్టికి రావడంతో సోమవారం ఆయన అధికారులతో మాట్లాడారు. రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడినా, రైతులను గందరగోళానికి గురి చేసినా, వేధించినా కఠినంగా వ్యవహరించాలని నిర్ధేశించారు. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు.
రైతులకు ఈ ఏడాది వ్యక్తిగత యంత్రపరికరాలు ఇవ్వాలని.. డ్రోన్ల వినియోగం పెంచాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణకు రూ.187.68 కోట్లు కేటాయించింది. రూ87.50 కోట్లతో 875 యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి 40% రాయితీపై డ్రోన్లు ఇవ్వనున్నారు. డ్రోన్ల సాంకేతికతను ప్రోత్సహించేందుకురూ.35 కోట్లు, ఆర్కేవీవై పథకాలకు రూ.1,061 కోట్లు కేటాయించారు. 2024-25 ఏడాదిలో 4.50 లక్షల మట్టి నమూనాలు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. దీనికి రూ. 18.35 కోట్లు కేటాయించారు. డ్రై కెమిస్ట్రీ విధానంలో చేపట్టనున్న ఈ పరీక్షలకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ వినియోగించనున్నారు. ఆల్ఫా స్ప్రెక్ట్రోస్కోపి ద్వారా మట్టి నమూనాలను స్ప్రెక్టల్ లైబ్రరీలో భద్రపరుస్తారు. వాటి ఆధారంగా తర్వాత ఉపగ్రహ చిత్రాలతో మట్టి నమూనాలను విశ్లేషించి, రియల్టైమ్లో కృత్రిమ మేథ ద్వారా ఫలితాలు రాబడతారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు 43,402 కోట్లతో అగ్రికల్చర్ బడ్జెట్ను అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉందని, కూటమి ప్రభుత్వం హయాంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందని చెప్పారు. కేటాయింపులు ఇలా…. రాయితీ విత్తనాలకు రూ.240 కోట్లు అన్నదాత సుఖీభవకు రూ.4,500 కోట్లు భూసార పరీక్షలకు రూ.38.88 కోట్లు విత్తనాల పంపిణీకి రూ.240 కోట్లు ఎరువుల సరఫరాకు రూ.40 కోట్లు పొలం పిలుస్తోంది రూ.11.31 కోట్లు ప్రకృతి వ్యవసాయంకు రూ.422.96 కోట్లు డిజిటల్ వ్యవసాయంకు రూ.44.77 కోట్లు వ్యవసాయ యాంత్రీకరణకు రూ.187.68 కోట్లు వడ్డీ లేని రుణాలకు రూ.628 కోట్లు రైతు సేవా కేంద్రాలకు రూ.26.92 కోట్లు ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ రూ.44.03 కోట్లు పంటల బీమా పథకానికి రూ.1,023 కోట్లు వ్యవసాయ శాఖ రూ.8,564.37 కోట్లు ఉద్యావన శాఖ రూ.3469.47 కోట్లు పట్టుపరిశ్రమ రూ.108.4429 కోట్లు వ్యవసాయ మార్కెటింగ్ రూ.314.80 కోట్లు సహకార శాఖ రూ.308.26 కోట్లు ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంకు రూ.507.038 కోట్లు ఉద్యాన విశ్వవిద్యాలయంకు రూ.102.227 కోట్లు శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయంకు రూ.171.72 కోట్లు మత్స్య విశ్వవిద్యాలయంకు రూ.38 కోట్లు పశుసంవర్ధక శాఖకు రూ.1,095.71 కోట్లు మత్స్య రంగం అభివృద్ధి కోసం రూ.521.34 కోట్లు ఉచిత వ్యవసాయ విద్యుత్కు రూ.7241.30 కోట్లు ఉపాధి హామీ అనుసంధానంకు రూ.5,150 కోట్లు ఎన్టీఆర్ జలసిరికి రూ.50 కోట్లు నీరుపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు రూ.14,637.03 కోట్లు
తెలంగాణలో పత్తి జిన్నింగ్ మిల్లర్లు సమ్మె ప్రకటించిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సీఎండీ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడారు. సమ్మె కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు పడకుండా, పత్తిని తక్కువ ధరలకు అమ్మాల్సిన పరిస్థితి తలెత్తకూడదని, పత్తి జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు జరిపి, పత్తి కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. రైతులు ఇబ్బందులకు గురికాకుండా, కష్టాలు పడకుండా మరియు పత్తిని తక్కువ ధరలకు విక్రయించవలసిన అవసరం లేకుండా చర్యలు వెంటనే తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇది రైతుల ప్రయోజనాలను కాపాడడంలో కీలకమని మంత్రి తెలిపారు.
ధాన్యం సేకరణను రాష్ట్రవ్యాప్తంగా వేగవంతం చేయాలని, మిల్లర్లు సహకరించని చోట ధాన్యాన్ని నేరుగా గోదాములకు తరలించాలని తెలంగాణా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణపై మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం రాత్రి సివిల్ సప్లైస్ భవన్లో సమావేశమైంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు, నేరుగా … ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆన్లైన్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ… ”రానున్న 10-15 రోజులు కీలకమైనవి. కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చూడాలి. రాష్ట్రంలో ఇప్పటికే 30 లక్షల టన్నుల సామర్థ్యమున్న గోదాములను సిద్ధం చేశాం. మిల్లర్లు సహకరించనిచోట ధాన్యాన్ని నేరుగా గోదాములకు తరలించండి. ధాన్యం నిల్వకు, కస్టమ్ మిల్లింగ్కు అయ్యే అదనపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మిల్లర్లకు 100% బ్యాంకు గ్యారంటీ నిబంధన ఉండగా… తెలంగాణ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి 10 శాతమే పెట్టిందన్న విషయాన్ని రైస్మిల్లర్ల సంఘం అధ్యకక్షులు… మిల్లర్లకు తెలియజేయాలి. ఒకవేళ మనవద్ద మిల్లింగ్ సామర్థ్యానికి మించి కొనుగోళ్లు జరిగితే… మిగులు ధాన్యాన్ని కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలకు పంపించొచ్చు” అని సూచించారు. మిల్లర్లతో సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ను ఆదేశించారు.
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాపట్ల జిల్లా పర్చూరు, బాపట్ల ఎమ్మేల్యేలు ఏలూరి సాంబశివరావు, వేగేశన నరేంద్రవర్మ అక్కడి ఉద్యాన సాగుపై అధ్యయనం చేశారు. ఈ మేరకు ఏలూరి క్యాంప్ కార్యాలయం వెల్లడించింది. ”అక్కడి రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగులో తెగుళ్ల నివారణకు అవలంబించే విధానాలను ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఎందరో యువ రైతులు భిన్న సాగు పద్ధతులు పాటిస్తూ అద్భుత ఫలసాయం సాధిస్తున్నారని చెప్పారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ విధానాలు జలవనరుల సంరక్షణ, కివి, యాపిల్, స్ట్రాబెర్రీ వంటి పంటలను వారు సందర్శించారు. అనంతరం న్యూజిలాండ్ విద్యుత్తు శాఖ మంత్రి సిమియన్ బ్రౌన్తో ఏలూరి, వేగేశన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విద్యుత్తు వినియోగం, నిర్వహణ, నిర్మాణ పనులు వంటి అంశాలను మంత్రి ద్వారా తెలుసుకున్నారు. అంతకముందు న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తోనూ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు” అని పేర్కొంది. ఎమ్మెల్యేలతో పాటు ప్రవాసాంధ్రులు దిలీప్ మద్దుకూరి, జితేంద్ర నిమ్మగడ్డ, అశోక్ గోరంట్ల ఉన్నట్లు చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్లకు చెందిన ప్రముఖ మొక్కజొన్న శాస్త్రవేత్త బడ్డుపల్లి మారుతీ ప్రసన్న జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక టాస్ ఎం.ఎస్. స్వామినాథన్ అవార్డుకు ఎంపికయ్యారు. పురస్కారం కింద ఆయనకు రూ. లక్ష నగదు అందజేయనున్నారు. దిల్లీకి చెందిన ట్రస్టు ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ (టాస్) ఆధ్వర్యంలో వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న శాస్త్రవేత్తలకు ఏటా ఎం.ఎస్. స్వామినాథన్ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి సురేష్ప్రభు చేతుల మీదుగా దిల్లీలో డిసెంబరు 20న మారుతీ ప్రసన్న పురస్కారం అందుకోనున్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి అయిన ప్రసన్న ప్రస్తుతం కెన్యాలోని నైరోబీలో అంతర్జాతీయ మొక్కజొన్న పరిశోధనా కేంద్రం విబాగాధిపతిగా సేవలు అందిస్తున్నారు. గతంలో మెక్సికోలో ఇదే పరిశోధనా కేంద్రం సంచాలకుడిగా పనిచేశారు. ఉత్తర అమెరికా, ఆఫ్రికా దేశాల్లో మొక్కజొన్న దిగుబడులు పెంచడంలో ఆయన విశేష కృషి చేశారు. 1965 ఆగస్టు 31న బాపట్లలో జన్మించిన మారుతీ ప్రసన్న స్థానిక ఏజీ కళాశాలలో ఏజీ బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సులు చదివారు. దిల్లీలోని భారతీయ కృషి అనుసంధాన పరిషత్లో పీహెచ్డీ చేశారు. 1991లో అదే సంస్థకు చెందిన ఐఏఆర్ఐలో జన్యు శాస్త్రవేత్తగా చేరి రెండు థాబ్దాల పాటు సేవలు అందించారు. మొక్కజొన్నపై విశిష్ట పరిశోధనలు చేశారు. ఉత్తమ పరిశోధనలకు పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
ఆయిల్పామ్ రైతులకు స్థిరమైన ధరలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆయిల్పామ్ రైతులు, కంపెనీల యాజమాన్యాలు, ఆయిల్ఫెడ్, ఉద్యానశాఖ అధికారులతో గురువారం ఆయన సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయిల్పామ్ సాగు విస్తరణ పైన చర్చించారు.ఆయిల్పామ్ ధరలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, డైరెక్టర్ ఢిల్లీరావు, ఉద్యానశాఖ కమీషనర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
శనగ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని క్వింటాలుకు 300 రూపాయల సబ్సిడీని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, సంస్థ యం.డి. ఉదయ్ కుమార్ ప్రకటించారు. సబ్సిడీ రేపటి నుండే అమలు అవుతుందని తెలిపారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్, ఐఏఎస్, ఈ రోజు హైదరాబాద్ హాకాభవన్లో గల తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రాంతీయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ యాసంగి సీజన్లో రైతులకు కావాల్సిన శనగ జేజి 11, జాకీ రకాల విత్తనాలను 20000 క్వింటాళ్లు అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు. రాష్ట్ర రైతాంగం ప్రయోజనాల దృష్ట్యా శనగ విత్తనాలపై క్వింటాల్కి రూ.300 చొప్పున తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ తరపున రాయితీ ప్రకటించినట్లు తెలియజేశారు. క్వింటాల్కి రూ.9000/- ధర ఉండగా, రూ.300 రాయితీతో, రైతులు రూ.8700/- చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఈ రబీలో రైతులకు కావాల్సిన వరి విత్తనాలు, 50000 క్వింటాళ్ల వరి కెఎన్ఎం1638, ఆర్ఎన్ఆర్ 15048, జెజిఎల్ 27356, యంటియు 1010, కెఎన్ఎం 118, జెజిఎల్ 24423 రకాల విత్తనాలను సకాలంలో రైతులకు అందుబాటులో ఉండే విధంగా వీలైనంత త్వరగా గ్రామాలకు చేర్చాలని ఆదేశించారు. ఈ సీజన్లో 3 లక్షల ఎకరాలకు పైగా తెలంగాణ విత్తనాలు ఇవ్వాలని, వచ్చే వానాకాలం సీజన్కి 15 లక్షల ఎకరాలకు విత్తనాలు అందించే విధంగా పని చేయాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని ఆదేశించారు. పాత, మూస పద్ధతులు మానుకొని, కొత్త తరహాలో పద్ధతులు ఉపయోగించి తెలంగాణ సీడ్స్ని రైతులకు చేరవేయాలని, ఒకప్పటి బ్రాండ్ ఇమేజ్ను పునరుద్ధరించే విధంగా పని చేయాలని కోరారు. విత్తనోత్పత్తిలో రైతులను భాగస్వాములను చేస్తూ, సహకార సంఘాల ద్వారా అధిక విత్తనోత్పత్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సంస్థ రాష్ట్ర మేనేజర్లు మరియు ప్రాంతీయ అధికారులు పాల్గొన్నారు.
అచ్చెంనాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు
వ్యవసాయ శ్రామికుల కోసం, రైతాంగం కోసం ఎన్.జి. రంగా గారు చేసిన కృషి మరువలేనిదని ఎన్జీ రంగా 124వ జయంతి సందర్భంగా రంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, లాంలో జరిగిన జయంతి సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు అన్నారు. రైతుల కోసం పార్లమెంటులో వారు చేసిన ప్రసంగాలు, వారు చేసిన సంస్కరణలు మాకు ఆదర్శమన్నారు. అక్కడ పొలంలో డ్రోన్ ద్వారా మందులను పిచికారీ చేసే పద్ధతులను స్వయంగా చూసి అధికారులను అభినందించడం జరిగింది.. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, భవిష్యత్తులో రైతులంతా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని సూచించారు. నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు కృష్ణ దేవరాయలు మాట్లాడుతూ రైతుల సాగు ఖర్చులు, పిచికారీ ఖర్చులు, విత్తనాల ఖర్చులు, పెట్టుబడి ఖర్చులు సగం తగ్గేటట్లు శాస్త్రవేత్తలు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రైతు నాయకులు యలమంచిలి శివాజీ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వేంకటేశ్వర రావు, ఎన్జీ రంగా ఫౌండేషన్ కిషోర్, యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ డాక్టర్ శారదా జయలక్ష్మి దేవి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ పాలడుగు సత్యనారాయణ, రైతు నెక్కంటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న పత్తి కొనుగోళ్లు కార్యకలాపాలపై మార్కెటింగ్ శాఖ అధికారులతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులు జిన్నింగ్ మిల్లులను ఆకస్మిక తనిఖీలు చేయాలని, వరి కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా పర్యవేక్షించాలని, రైతులకు కావాల్సిన అన్ని మౌళిక సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్రంలో మేజర్ మార్కెట్ కమిటీలను ఆధునీకరించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. బుధవారం సెక్రటేరియట్లో జరిగిన పత్తి కొనుగోళ్లపై సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పత్తి కొనుగోళ్లపై సమగ్ర వివరాలు అందించే విధంగా ఒక వెబ్ పోర్టల్ తయారు చేయడం జరిగిందని, దీని ద్వారా సీసీఐ వారు ఇప్పటి వరకు ఎంత పత్తిని కొనుగోలు చేశారో, ఎంత పత్తిని రిజెక్ట్ చేశారో అన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగిందని మంత్రి అన్నారు. మార్కెటింగ్ అధికారులు, ప్రాంతీయ అధికారులు జిన్నింగ్ మిల్లులను ఆకస్మిక తనిఖీలు చేసి, రిపోర్టును డైరెక్టర్ మార్కెటింగ్ శాఖ వారికి అందించాలని ఆదేశించారు. ప్రధాన కార్యదర్శితో మాట్లాడి, వరి కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా పర్యవేక్షించాలని తెలిపారు. మార్కెటింగ్ సెంటర్లలో ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలను ఉపయోగించుకొని దగ్గరలోని సీసీఐ సెంటర్లలోనే పత్తిని అమ్ముకోవాలని రైతులకు సూచించారు. రైతులు పత్తిలో తేమశాతం 8 నుండి 12 మధ్యలో ఉంచుకున్నట్టయితే అధిక మద్ధతు ధరను పొందవచ్చని, అలాగే పత్తి అమ్ముకోవడంలో ఏమైనా సమస్యలు ఎదురయితే ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ చాట్ యాప్ (8897281111) ద్వారా తెలియజేయగలరని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ దండ రాజిరెడ్డి
విద్యార్థులకు, నిపుణులకు ఉద్యాన రంగంలో అవకాశాలు ఉన్నాయని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ దండ రాజిరెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఉద్యానరంగంపై ఆయన మాట్లాడుతూ… కోవిడ్ అనంతరం మానవ శరీర ఇమ్యూనిటీని పెంచేందుకు ఉద్యాన ఉత్పత్తులే కీలకమని, ఇటీవల వివిధ అధ్యయన సంస్థలు …. సైతం ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే సరాసరిన రోజుకు 400 గ్రాములు పండ్లు, కూరగాయలు తీసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ఖనిజలవణాలు, విటమిన్లకు కూరగాయలు, పండ్లు పుష్కల వనరులని, రోజురోజుకూ పెరుగుతున్న ఉద్యాన పంటల విస్తీర్ణం నేపథ్యంలో ఉద్యాన విద్యార్థులకు పుష్కలమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఉద్యాన విద్య పూర్తి చేసిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టీజీపీఎస్సీ ద్వారా ఉద్యాన అధికారులుగా నియమితులవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లఓ్యం ప్రకారం పామ్ ఆయిల్ తోటల విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో నర్సరీలు, పామాయిల్ తోటల నిర్వహణ, అలాగే పామాయిల్ పరిశ్రమలు వందలాది ఉద్యాన విద్యార్థులను నియమించుకోనున్నట్లు తెలిపారు. అలాగే ఉద్యాన పంటల ఆధారిత అంకుర సంస్థలు, స్టార్ట్ అప్స్ భారీగా మార్కెట్లో ఉన్నాయని స్వయం ఉపాధికి సైతం ఈ స్టార్ట్ అప్లు దోహదం చేస్తున్నాయని అన్నారు. ”వీటి స్థాపనకు సైతం ఉద్యాన విద్యల్లో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు. విజయవంతమైన ఎంటర్ప్రైన్యూర్ కెరీర్ ప్రారంభించారని” వైస్ ఛాన్స్లర్ డాక్టర్ రాజిరెడ్డి తెలిపారు. సేంద్రీయ ఉద్యాన పంటల క్షేత్రాలకు కన్సల్టెన్సుగా, హోటల్స్, రిసార్ట్స్, రియల్ ఎస్టేట్ రంగం, ఎయిర్పోర్ట్ సంస్థల్లో ల్యాండ్ స్కేప్ నిపుణులుగా, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ ల్యాండ్ స్కేపింగ్లలో ఉద్యాన విద్యార్థులకు అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని వైస్ ఛాన్స్లర్ డాక్టర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యాన విశ్వవిద్యాలయం, కళాశాలలు, డిప్లమా కాలేజీలు, ఇతర కళాశాలలో శాస్త్రవేత్తలుగా, ప్రొఫెసర్లుగా అవకాశం సైతం ఉన్నాయి. విత్తన పరిశ్రమ, పురుగుమందుల, తెగుళ్ల మందుల పరిశ్రమలలో సైతం వీరికి అవకాశాలు మెరుగేనని డాక్టర్ రాజిరెడ్డి తెలిపారు.
ఎదురయ్యే అన్ని సమస్యలను అధిగమిస్తూ… 2028 మార్చి నాటికల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని, త్వరగా పూర్తి చేయడమే కాదు… నాణ్యత కూడా చాలా ముఖ్యం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంగళవారం వెలగపూడి సచివాలయంలో పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష జరిపిన సందర్భంలో చంద్రబాబు అన్నారు. ఇటీవలవరకూ పోలవరం ఎడమకాలువ పనులు 77 శాతం పూర్తయ్యాయని, రూ. 960 కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, అధికారులు చెప్పారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్, సీఎంఓ కార్యదర్శి రాజమౌళి, ఈఎన్సి ఎం. వెంకటేశ్వరరావు, బావర్, మేఘా ప్రతినిధులు, ఇంజనీరింగు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
తెలంగాణా రాష్ట్రంలో పండించే బియ్యానికి డిమాండ్ పెరుగుతుందని…. మన దేశంలోని బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతో పాటు రెండు, మూడు దేశాలు మన తెలంగాణా రైతులు పండించే బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని పౌరసరఫరాల శాఖామంత్రి ఉత్తమకుమార్ రెడ్డి అన్నారు. మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులతో మంగళవారం హైదరాబాదు నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఉత్తమకుమార్ రెడ్డి ఈ విషయాన్ని చెప్పారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్తో పాటు ఎం.పీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కమీషనర్ డీ.ఎస్. చౌహాన్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు సాఫీగా సాగేలా ప్రజాప్రతినిధులు చూడాలి. రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ట రాకుండా చూడాలి. అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని ఉత్తమకుమార్ రెడ్డి అన్నారు
ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ ప్రభుత్వ కృషిని అభినందించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ప్రైవేట్ భాగస్వామ్యంతో సహజ మరియు సేంద్రియ వ్యవసాయం కొరకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. పామాయిల్ రైతులకు అధిక ధరలను అందించి, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో, ముడిపామ్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని తిరిగి విధించి దేశీయ పామ్ ఆయిల్ రైతులను ఆదుకొనేవిధంగా చర్యలను తీసుకోవాలని ఇటీవల మంత్రి తుమ్మల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గారిని కోరిన విషయం తెలిసిందే. దీనిపై 04.11.2024 నాడు లేఖ ద్వారా స్పందించిన కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ గారు ఎన్.ఎమ్.ఈ.ఒ.పి పథకంలో భాగంగా 64,040 హెక్టార్లలో ఆయిల్ పాం ప్లాంటేషన్ అత్యున్నత ప్రగతి సాధించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకంలో జాతీయ స్థాయిలో లక్ష్యాన్ని సాధించేందుకు తోడ్పడుతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ కృషిని అభినందించారు. 2024-25 సంవత్సరంలో 1,00,000 ఎకరాలకు ఆయిల్ పామ్ ప్లాంటేషన్ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని, ఇప్పటివరకు 24,581 ఎకరాలలో ప్లాంటేషన్ పూర్తిచేసినందుకు మంత్రికి అభినందనలు తెలపారు. మంత్రి సమర్థ నాయకత్వంలో కొత్తగా పామాయిల్ సాగు చేయడానికి ముందుకువస్తున్న రైతులను ప్రొత్సహిస్తున్నందున తెలంగాణా ప్రభుత్వం తప్పకుండా తమ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటుందని కేంద్ర మంత్రివర్యులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పామాయిల్ గెలల ధరల విధానం విషయంలో కేంద్ర అధికారుల బృందం త్వరలోనే రాష్ట్రంలో పర్యటించి, రాష్ట్ర ప్రభుత్వంతో మరియు పామాయిల్ రైతులతో సంప్రదింపులు జరుపుతుందని కేంద్ర మంత్రివర్యులు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు కోరిన విధంగా దేశంలోని పామాయిల్ రైతుల సంక్షేమం కోసం మరియు పామాయిల్ గెలల ధర పెరుగుదల కోసం ముడి పామాయిల్ పై ఎఫెక్టివ్ డ్యూటీని 27.5 శాతానికి పెంచడం జరిగిందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. అదేవిధంగా ఎన్.ఎమ్.ఈ.ఒ.పి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రివర్యులు విజ్ఞప్తి చేయడం జరిగింది. పామాయిల్ సాగులో తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సహాయ సహాకారాలకు కేంద్ర మంత్రి వర్యులు అభినందనలు తెలిపారు. అంతకుముందు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు పామాయిల్ గెలల ధరల విషయంలో పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఇటీవలన కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర పర్యటనకి వచ్చిన సందర్భంలో కూడా వివరించడం జరిగింది. మంత్రి వర్యుల కృషి వల కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచడం జరిగింది. దీని వలన పామాయిల్ రైతులకు అధిక ధర రావడంతో పాటు, కొత్తగా పామాయిల్ సాగు చేయాలనుకుంటున్న రైతులకు ప్రోత్సాహకరంగా మారింది. దిగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా సరాసరి క్రూడ్ పామాయిల్ ధరలు అక్టోబర్ నెలలో రూ.1,19,000 చేరి పామాయిల్ గెలల ప్రస్తుత ధర రూ. 19,144లకు చేరడం జరిగింది. ఈ నవంబర్ నెల మాసంలో క్రూడ్ పామాయిల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో రూ.1,25,000లుగా నమోదు కావడం జరుగుతున్నది. కావున క్రూడ్ పామాయిల్ ధరలు ఇదేవిధంగా కొనసాగితే పామాయిల్ గెలల ధర రూ. 20,000లకు పైన ఉండే అవకాశం ఉందని మంత్రి వర్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం క్రూడ్ పామాయిల్ ధరలను రూ. 1,25,000లు తగ్గకుండా ఉండేందుకు దిగుమతి సుంకాన్ని పెంచుతూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, గతంలో దిగుమతి సుంకం 44 శాతంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల గుర్తుచేశారు. పెరిగిన ధరల నేపథ్యంలో రాష్ట్రంలో చాలా మంది రైతులు పామాయిల్ సాగు వైపు చూసే అవకాశం ఉందని, కావున ఆయిల్ పాం కంపెనీలు ఇందుకోసం సన్నద్ధం కావాలని మంత్రి కోరారు. పామ్ ఆయిల్ సాగు చేయాలనుకునే రైతుల కోసం పామాయిల్ మొక్కలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పామాయిల్ రైతుల సంక్షేమం, ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎళ్లవేలలా కృషి చేస్తుందని, ఈ సందర్భంగా మంత్రివర్యులు పేర్కొన్నారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో సహజ మరియు సేంద్రీయ వ్యవసాయం కొరకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు (సిఓఇఎస్) రూ. 10 కోట్లు ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి 18.09.2024 నాడు లేఖ రాయడం జరిగింది. దీనికి కేంద్ర మంత్రివర్యులు స్పందిస్తూ, భారత ప్రభుత్వం మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హర్టీకల్చర్ (ఎం.ఐ.డి.హెచ్) పథకంలో భాగంగా సహజ మరియు సేంద్రీయ వ్యవసాయం కొరకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సులను ప్రమోట్ చేయడం జరుగుతుందన్నారు. నిర్ధేశించిన విధానాల ప్రకారం ధ్వైపాక్షిక సహాకారంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మంజూరు చేయబడుతుందన్నారు. అయితే ఈ రంగంలో అందుబాటులో ఉన్న నూతన మరియు అత్యాధునిక సాంకేతికతను అందించడానికి ప్రైవేట్ వ్యవస్థాపకులకు వారి స్వంత నిధులతో ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించడం జరుగుతుందని తెలిపారు. ఎంఐడిహెచ్ నిబంధనల ప్రకారం ఈ కేంద్రాలలో ఉధ్యానవన పంటలు చేపట్టే రైతులకు శిక్షణ మరియు సాంకేతిక పరిజ్ఞానంలో నిబద్ధతతో కూడిన సహాయసహకారాలు అందించడం జరుగుతుందన్నారు.
పశువులు, కోళ్ళ వైద్యానికి సంబంధించి సరికొత్త ప్రామాణిక మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. యాంటిబయాటిక్ తదితర ఔషధాల వినియోగాన్ని తగ్గించడం, దుర్వినియోగాన్ని అరికట్టే ప్రత్యామ్నాయ వైద్య చికిత్సలపై దృష్టి పెట్టి, సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతులకు పెద్దపీట వేసింది. నిర్హేతుకంగా యాంటీబయాటిక్స్ తదితర అల్లోపతి ఔషధాల వినియోగాన్ని కట్టడి చేయడంతో పాటు.. ఆరోగ్యదాయకమైన ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులను విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చే లక్ష్యంతో కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా పాడి పశువుల చికిత్సలో చీటికిమాటికి యాంటిబయోటిక్స్ను అతిగా వాడటం, దుర్వినియోగం చేయడం వలన పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు తదితర ఆహారోత్పత్తుల్లో మోతాదుకు మించి మిగిలిపోతున్నాయి. సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతులలో రైతులే స్వయంగా తయారు చేసుకుని వాడుకునేందుకు వీలుగా ఉండే చికిత్సా పద్ధతులకు పెద్ద పీట వేశారు. ఈ రంగంలో 20 ఏళ్లు కృషి చేసిన తమిళనాడుకు చెందిన ప్రొఫెసర్ ఎన్. పుణ్యస్వామి 22 రకాల పశువ్యాధులకు రూపొందించిన సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతులకు చోటు కల్పించారు. ముఖ్యమైన ఈ 22 రకాల జబ్బులకు (అల్లోపతి మందులు, యాంటీబయాటిక్స్ వాడనవసరం లేకుండా) రైతుల ఇళ్ళలో పోపు డబ్బాల్లో ఉండే మసాలా దినుసులు, పెరట్లో ఉండే మొక్కలతో ఆయుర్వేద మందులను రైతులే స్వయంగా తయారు చేసుకుని వాడుకోగలిగే పద్ధతులనుపొందుపరచిన ఒక చిరు పుస్తకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా తెలుగు మరియు ఇతర ప్రాంతీయ భాషలలో రూపొందించి ఎన్డిడిబి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచారు.
2022 జూలై వరకు వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కొన్ని ప్రైవేట్ సంస్థలు చేసుకున్న అవగాహన ఒప్పందాలను పునః పరిశీలన జరిపిన తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఉన్నందున ఈ అవగాహన ఒప్పందాలను రద్దు చేయడం జరిగిందని ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్థాస్ జానయ్య తెలిపారు. పిజెటిఏయుతో భాగస్వామ్యం ఉన్న ప్రైవేట్ సంస్థల ఒప్పందాలను నేడు రద్దు చేశారు. ప్రైవేట్ సంస్థలకు వ్యవసాయ విశ్వవిద్యాలయంతో ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాన్య ప్రజలు గమనించాలని సూచించారు. పిజెటిఏయు ఎలాంటి ప్రైవేట్ సంస్థలతో వ్యవసాయ విద్య కోర్సుల కోసం భాగస్వామ్యంగానీ, గుర్తింపు ఇవ్వడంతో గాని సంబంధం లేదని స్పష్టం చేశారు. కొన్ని ప్రైవేటు సంస్థలు పిజెటిఏయు పేరును వాడుకొని వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా మరియు బ్రోకర్ల ద్వారా సీట్లు ఇప్పిస్తామని, అలాగే పిజెటిఏయుతో అనుబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం దృష్టికి వచ్చిందని, ఈ విషయాలను నమ్మవద్దని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజాహిత ప్రకటన జారీ చేయడం జరిగింది.
ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో భారీ పెరుగుదలను నమోదు చేసి, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర గణాంకశాఖ నివేదిక వెల్లడి చేసింది. ఆక్వారంగంలో గత పన్నెండేళ్లుగా మొత్తం స్థూల ఉత్పత్తి విలువలో ఏపీ ఎక్కడా తగ్గలేదు. క్రమంగా ఉత్పత్తి పెరుగుతూనే ఉంది. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో వాటా (శాతంలో) రాష్ట్రం 2011-12 2022-23 ఆంధ్రప్రదేశ్ 17.7 40.9 పశ్చిమబెంగాల్ 24.6 14.4 ఒడిశా 3.9 4.9 బీహార్ 4.5 4.5 అస్సాం 5.5 4.1
‘ఉద్యాన’ ఉత్పత్తులలో వృద్ధి పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ఏపీ ఐదో స్థానంలో నిలిచింది. ప్రథమ స్థానంలో పశ్చిమబెంగాల్, తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, యూపీ, మహారాష్ట్ర ఉన్నాయి. గత 12 ఏళ్ళల్లో మధ్యప్రదేశ్ వాటా 6.3% నుంచి 10.9 శాతానికి, యూపీ 7.2 నుంచి 10.5కి చేరగా, మహారాష్ట్ర వాటా 10.4 నుంచి 9.9 శాతానికి తగ్గింది. ఏపీ వాటా 5.8 నుంచి 8.2 శాతానికి పెరిగింది. పండ్లు కూరగాయల ఉత్పత్తిలో ఏపీ వాటా సంవత్సరం వాటా (శాతంలో) 2011-12 5.8 2022-23 8.2
పశుగణ ఉత్పత్తిలో నాలుగో స్థానం మరోవైపు పశుగణ ఉత్పత్తిలో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. రాజస్థాన్ తొలి స్థానంలో ఉండగా, యూపీ, తమిళనాడు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మహారాష్ట్ర ఐదో స్థానం దక్కించుకుంది. జాతీయ స్థాయిలో పశుగణ ఉత్పత్తి విలువలో ఏపీ వాటా 2011-12 నుంచి 2022-23కు 7.0% నుంచి 7.8% మాత్రమే పెరిగింది.
రైతు భరోసా,, పంటల బీమా పథకాల్లో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) పరిజ్ఞానం అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఉన్నతాధికారులు.. ఈ రంగానికి చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయతల పెట్టిన రైతుభరోసా, పంటల బీమా పథకాల అమలులో ఏఐ పరిజ్ఞానం వాడాలని నిర్ణయించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ప్రతి కమతంలో రైతులు వేసిన పంటలను గుర్తించి, దాన్ని ఫొటో తీసి, వ్యవసాయ విస్తరణాధికారులు యాప్లో నమోదు చేస్తుండగా ఆ వివరాలను ధ్రువీకరణ చేసుకునేలా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు. శనివారం ఒక ప్రైవేట్ సంస్థ ప్రతినిధులు ఒక మండలంలో ఏఐ సహకారంతో పంటల విస్తీర్ణం, సర్వే నంబర్ల వారీగా పంటల సాగు, గత ఐదేళ్ల కాలంలో సాగు వివరాలు మాత్రమే కాకుండా ప్రస్తుతం వివిధ పంటల స్థితి, చీడపీడల తాకిడి వంటి విధానాలను వృద్ధి చేసిన అల్గారిథమ్ ప్రదర్శనను సైతం మంత్రి తుమ్మల తిలకించారు. ఇప్పటికే ఇక్రిశాట్, ఎన్ఆర్సీఎస్ సంస్థలు పైలట్ ప్రాజెక్టులో భాగంగా వానాకాలం పంటల సాగు వివరాలను సేకరిస్తున్నాయి. అన్ని సంస్థల నుంచి సమాచారం సేకరించిన తర్వాత రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా 'ఏఐ' సాయంతో సాంకేతికతను రూపొందించాలని కంపెనీలకు ఆయన సూచించారు. కృత్రిమ మేధను వ్యవసాయంతో అనుసంధానించేందుకు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, డైరెక్టర్ గోపి, జాయింట్ సెక్రటరీ ఉదయ్కుమార్లు గత రెండు నెలల నుంచి ఇదే పనిలో నిమగ్నమైనట్లు వెల్లడించారు. తుది నివేదిక అందగానే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అనుమతితో అన్ని పథకాల అమలులో ఏఐ సాంకేతికతను వినియోగించి రైతులకు వేగవంతమైన సేవలు అందించనున్నట్లు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
సంప్రదాయంగా వాడుతున్న రకాలను కాకుండా, గత ఐదేళ్లలో కొత్తగా వచ్చిన రకాలను సాగు చేసి, అపరాలు, నూనెగింజల ఉత్పత్తిలో రైతులు స్వయం సమృద్ధి సాధించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ దిల్లీరావు రైతులను కోరారు. అలాగే తెగుళ్లు, పురుగుల నివారణకు నష్ట పరిమితిని గుర్తించి శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన మందులను సరైన పద్ధతిలో పంటలపై పిచికారీ చేయాలని సూచించారు. రకరకాల మందుల మిశ్రమాన్ని వాడొద్దని హెచ్చరించారు. శుక్రవారం మంగళగిరిలోని వ్యవసాయ శాఖ కమిషనరేట్లో రాష్ట్ర, జిల్లా వ్యవసాయ అధికారులు, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో రబీ సీజన్లో అపరాలు, నూనెగింజల సాగుపై వర్క్షాప్ నిర్వహించారు. రైతులు నూతన యాజమాన్య పద్ధతులు అనుసరించేలా అవగాహన కల్పించే అంశాలపై చర్చించారు.
ఈ రోజు జలసౌధలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, వచ్చే 6 నెలలు చాలా క్రియాశీలమని, సత్తుపల్లి ట్రంకు, ట్రంక్ కెనాల్, యాతలకుంట వరకు పనులు పూర్తి చేసుకొంటే, వచ్చే పంటకాలానికి సాగునీరందించే అవకాశమున్నదని, దానికి సంబంధించి డిజైన్లు, టెండర్ల ప్రక్రియ వెంటనే చేపట్టాల్సిందిగా నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగారి చేతుల మీదుగా ఆగస్టు 15న ప్రారంభోత్సవం చేసుకున్న ఈ పథకం, మన శాఖకు అత్యంత ప్రాధాన్యత అని, ఈ ప్రాజెక్ట్కు అవసరమైన నిధులు కానీ, పరిపాలన అనుమతులు ఇచ్చే బాధ్యత తాను తీసుకొంటానని, అధికారులు త్వరితగతిన పనులు ఆరంభించాలని ఆదేశించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిని ప్రతీ 15 రోజులకు సమీక్షించి, తనకు ఎప్పటికప్పుడు వివరాలు అందచేయాల్సిందిగా సెక్రటరీ ప్రశాంత్ పాటిల్ని ఆదేశించారు.
మార్కెట్కు మరియు జిన్నింగ్ మిల్లులకు వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలని, వాట్స్ యాప్ సేవల (8897281111) ద్వారా వెయిటింగ్ టైమ్, పేమెంట్ స్టేటస్, కంప్లయింట్ ఫోరం, ఇతర సేవలను రైతులు వినియోగించుకోవాలని, జిల్లా అధికారులు, సెక్రటరీలు రైతులకు అందుబాటులో ఉండాలని, అకాల వర్షాలు వస్తున్నందున మార్కెటింగ్, వ్యవసాయ అధికారులు, సిసిఐ అధికారులు అప్రమత్తంగా ఉండి, రైతు తీసుకువచ్చిన పంటలు తడవకుండా కావాల్సిన చర్యలు వెంటనే తీసుకోవాలని, పత్తి కొనుగోళ్ళ విషయములో అవకతవకలు జరిగితే తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో జరిగిన మార్కెటింగ్ శాఖ సంచాలకులు, అధికారులతో సమీక్షలో తెలిపారు.
‘సదర్’ అనగానే దున్నరాజుల విన్యాసాలు… యాదవులు తమ జీవనాధారమైన ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలతో వేడుక జరిగే ప్రాంతానికి వచ్చి చేసే సందడి.. దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం, దున్నలపై నిలబడి హాకీ కర్రతో చేసే నృత్యాలు ప్రధానాకర్షణ. దీపావళి రెండోరోజున హైదరాబాద్లో ‘సదర్’ సమ్మేళనాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఐక్యతను చాటుతారు.*మొదలైంది ఇలా…* సుమారు 80 ఏళ్ల క్రితం దివంగత సలంద్రి న్యాయం చౌదరి మల్లయ్య యాదవ్ సదర్ వేడుకలను ప్రారంభించారు. నారాయణగూడ వైఎంసీఏ కూడలిలో ఇది మొదలైంది. ఆ తర్వాత మల్లయ్య యాదవ్ కుటుంబ సభ్యులు, పూర్వీకులు ఏ సంప్రదాయాన్ని అనుసరించారో దాన్నే నేటికీ పాటిస్తున్నారు. కాచిగూడ, నింబోలిఅడ్డ, ఖైరతాబాద్, సైదాబాద్, మారెడ్పల్లి, పాతబస్తీలలో కూడా సదర్ సందడి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశీ ప్రతినిధులు కూడా దున్నరాజు విన్యాసాలు వీక్షించడానికి వస్తుంటారు. పంజాబ్, హరియాణ, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా దున్నరాజులను తీసుకొస్తారు. ఈసారి హరియాణ నుంచి ముర్రా జాతికి చెందిన 3 వేల కిలోల భారీకాయంతో ఉండే ‘ఘోలు-2’ దున్నరాజు వచ్చాడు. ప్రపంచంలో ఎత్తైన దున్నరాజు బాహుబలి (స్కంద సినిమా ఫేం), చేతక్ మహారాణా ప్రతాప్, వీరా మిల్క్ టీత్ ఛాంపియన్ ఇలా మరెన్నో మేలిమిజాతి దున్నరాజులు కనువిందు చేయనున్నాయి.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం బుధవారం జరిగింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమించిన ఉపకులపతి ప్రొఫెసర్ అల్ధాస్ జానయ్య అధ్యక్షతన రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో ఈ సమావేశం జరిగింది. అనేక కీలకంశాలను పాలకమండలిలో చర్చించి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. పాలకమండలి ఆమోదించిన ముఖ్యమైన నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నూతనంగా విత్తన విభాగం ఏర్పాటు చేసి దానికి ఒక సంచాలకుడి స్థాయి అధికారిని నియమించి రాష్ట్రంలో ఒక విత్తన నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని, తద్వారా తెలంగాణలోని ప్రతి రెవిన్యూ గ్రామంలో కనీసం ఐదు నుంచి పది మంది అభ్యుదయ రైతులకు పిజెటిఏయు రూపొందించిన నాణ్యమైన విత్తనాలను ప్రతి ఏటా సరఫరా చేయాలని పాలకమండలి నిర్ణయించింది. ఇందుకు గాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కెవివై) పథకం నుంచి ప్రత్యేక నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది.
గత 13 ఏళ్ల నుండి ఇంచార్జి పాలనతో నడుస్తున్న స్థానాల్లో పూర్తిస్థాయి అధికారులను నియమించాలన్న అంశానికి పాలక మండలి ఆమోదం తెలిపింది.
వ్యవసాయ విద్యకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఇటీవల భారీగా పెంచిన ప్రత్యేక కోట సీట్లకు.. భారీగా తగ్గించిన ఫీజులకు పాలకమండలి ఆమోదం తెలిపింది.
వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాధిపతుల పదవికాలంను మూడేళ్లుగా నిర్ణయిస్తూ… ప్రతీ మూడేళ్లకోసారి రొటేషన్ పద్ధతిన, సీనియార్టీ ఆధారంగా విభాగాధిపతులను నియమించాలని పాలకమండలి నిర్ణయించింది. ప్రస్తుతం ఒకసారి విభాగాధిపతిగా నియామకం అయితే అతను లేదా ఆమె పదవి విరమణ పొందే వరకు ఆ పదవిలో కొనసాగే వారు. దీనివల్ల ఇతర సీనియర్లకు అవకాశం కలగకుండా పోతుందని పాలకమండలి భావించి దేశంలో ఉన్న ఇతర విశ్వవిద్యాలయాలలో మాదిరిగా ఈ రొటేషన్ పద్ధతిలో విభాగ అధిపతులను నియమించాలని నిర్ణయించింది.
వివిధ కళాశాలలో అనుబంధ పీఠాధిపతుల (అసోసియేట్ డీన్) నియామకం, అలాగే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాల అనుబంధ పరిశోధనా సంచాలకుల (అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్) సీనియార్టీ ప్రాతిపదికన నియామకం చేపట్టాలని మరియు వారి పదవీ కాలాన్ని రెండేళ్లుగా నిర్ణయిస్తూ.. అలాగే మరో రెండేళ్ల వరకు పొడిగించే వెసులుబాటును కల్పిస్తూ అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే విధంగా పాలకమండలి ఈ మేరకు నిర్ణయించింది.
ఇటీవల యు.జి.సి ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా జాతీయ మరియు అంతర్జాతీయ అనుభవం కలిగిన ప్రముఖ వ్యవసాయ శాస్త్ర నిపుణులను ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్గా ఏడాది కాలపరిమితితో మూడేళ్ల వరకు నియమించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. దీనివల్ల జాతీయ, అంతర్జాతీయ సంస్థలలో పేరెన్నిక కలిగిన నిపుణుల యొక్క నైపుణ్యతను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధన, పరిశోధనలలో ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నది.
గత 7, 8 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లుల చెల్లింపులను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు నాలుగు దపాలుగా విడుదల చేయాలని పాలకమండలి నిర్ణయించింది.
వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రస్తుత ఉద్యోగులు మరియు పెన్షనర్లకు గత ఐదేళ్ల క్రితం నుంచి నిలిపివేసిన యూనివర్సిటీ ఆరోగ్య కేంద్ర సేవలను పునరుద్ధరిస్తూ ఉపకులపతి అల్దాస్ జానయ్య ఇటీవల తీసుకున్న నిర్ణయానికి పాలకమండలి ఆమోదముద్ర వేసింది.
వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ డిసెంబర్లో విశ్వవిద్యాలయ వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ, రైతుల భాగస్వామ్యంతో నిర్వహించాలని పాలకమండలి నిర్ణయించింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక అంశాలపై నవంబరు 6 నుంచి నాలుగు రోజుల పాటు మేథోమథనం చేయనున్నారు. ప్రాజెక్టును సకాలంలో నిర్మించేందుకు ఎదురయ్యే సాంకేతిక సవాళ్ళను పరిష్కరించడంపై నిపుణులు చర్చించనున్నారు. డ్యాంల భద్రత, నిర్మాణం, జియోటెక్నికల్ అంశాల్లో విశేష అనుభవం ఉన్న డేవిడ్ బి. పాల్, రిచర్డ్ డోన్నెల్లీ, గియాస్ ఫ్రాంక్ డి సిస్కో, సీస్ హించ్బెర్గర్లతో కూడిన విదేశీ బృందంతో సంబంధిత అధికారులు, నిపుణులు నవంబరు 6 నుంచి 9వ తేదీ వరకు మేథోమధనం చేయనున్నారు.
ఆయిల్పామ్ గెలల ధర టన్నుకు గరిష్టంగా రూ. 20 వేలు కల్పించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులతో కలిసి కేంద్ర వ్యవసాయ మంత్రిని త్వరలో కలవనున్నట్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తన మూడు రోజుల మలేసియా పర్యటనలో అక్కడి ఆయిల్పాం సాగు విధానాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసినట్లు తెలిపారు. పొట్టిరకం, అధిక దిగుబడిని అందించే ఆయిల్పాం మొక్కలను తెలంగాణకు ఇవ్వాల్సిందిగా అక్కడి ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. అక్కడ నర్సరీల్లోనే నిర్దేశిత రకానికి చెందని (ఆఫ్ టైప్) మొక్కల గుర్తింపు, గ్యానోడెర్మా వ్యాధి నివారణ చర్యలు తీసుకుంటున్నారని, ఈ విధానాలను మన రాష్ట్రంలోనూ అమలు చేస్తామన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో ‘3ఎఫ్ ఆయిల్ పామ్’ ప్రాసెసింగ్ సంస్థ రూ. 300 కోట్లతో తమ వ్యాపారాన్ని విస్తరించనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించారు. ఆ సంస్థ ఎండీ సంజయ్ గోయెంక, డైరెక్టర్ ఆశిశ్ గోయెంక ఆదివారం సీఎం చంద్రబాబును కలిసి వరద బాధితుల సహాయార్థం రూ. కోటి చెక్కును సీఎంఆర్ఎఫ్కు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జాతీయ నూనె గింజల పరిశోధనల సమీక్ష మరియు ప్రణాళికల రూపకల్పనకు ఉద్దేశించిన రెండు రోజుల జాతీయ సదస్సు ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాటర్ టెక్నాలజీ సెంటర్లో ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కుసుమ మరియు అవిసెలు పంటలపై పరిశోధనలు చేస్తున్న ప్రముఖ శాస్త్రవేత్తలు 150 మంది పాల్గొని వివిధ పరిశోధన అంశాలు మరియు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై కూలంకుషంగా చర్చించారు. ఈ కార్యక్రమంను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) మరియు జాతీయ నూనె గింజల పరిశోధన సంస్థ (ICAR-IIOR)లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంకు డా. టి.ఆర్. శర్మ (ICAR-DDG, న్యూ ఢిల్లీ) అధ్యక్షత వహించి ప్రస్తుతం ఇండియా 1.7 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి నూనెలని దిగుబడి చేసుకుంటున్నదని, దీన్ని తగ్గించడానికి జాతీయ నూనె గింజల మిషన్ని భారత ప్రభుత్వం ప్రారంభించిందన్నారు కావున మనం చేసే పరిశోధనలు నూనె గింజ పంటల సాగును పెంచి, రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలన్నారు. ముళ్ళు లేని కుసుమ రకాలను వృద్ధి చేయాలన్నారు. అన్ని పరిశోధన సంస్థలు సంయుక్తంగా పరిశోధనలు చేయడం వల్ల కుసుమ మరియు అవిసెలలో చాలా నూతన రకాలను వృద్ధి చేయడం జరిగిందని శర్మ వివరించారు. డా. సంజీవ్ గుప్త (ICAR-DDG, న్యూ ఢిల్లీ) మాట్లాడుతూ చాలా ప్రాంతాలలో కుసుమ మరియు అవిసె పంటలకు ప్రాముఖ్యత పెరిగిందన్నారు. ముఖ్యంగా ఈ నూనె గింజలలో లైనోలేనిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అన్నారు. కాబట్టి ఈ పంటల సాగు ఇంకా పెంచి రైతులకు ప్రోత్సాహం అందించాలని సూచించారు. డా.మాథూర్ (డైరెక్టర్, IIOR) గత సంవత్సరం కుసుమ మరియు అవిసెలలో చేపట్టిన పరిశోదన ఫలితాలను క్లుప్తంగా వివరించారు. డా. జెల్లా సత్యనారాయణ (డీన్ అఫ్ అగ్రికల్చర్, PJTAU) మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం చాలా వరకు కుసుమ సాగును ప్రోత్సహిస్తూ రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంను అందిస్తుందన్నారు. విశ్వ విద్యాలయం చీడ పీడలను తట్టుకునే రకాలను వృద్ధి చేయడమే కాకుండా కుసుమ నూనె కూడా ఉత్పత్తి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కుసుమ మరియు అవిసెలు సాగు చేస్తున్న రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రతినిధులు, ప్రధాన శాస్త్రవేత్తలు, వివిధ రాష్ట్రాలకు చెందిన 150 మంది శాస్త్రవేత్తలు, విద్యార్థులు మరియు రైతులు పాల్గొన్నారు.
తెలంగాణా రాష్ట్రం లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక్కదానికే ఏ గ్రేడ్ తో కూడిన ఐకార్ గుర్తింపు ఉందని ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య స్పష్టం చేశారు.విద్యార్థులు, తల్లితండ్రుల ప్రయోజనార్ధం ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు తెలిపారు. గుర్తింపులేని ప్రైవేటు కళాశాలల తో PJTAU కు ఎలాంటి సంబధం లేదని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం లో సీట్లు ఇప్పిస్తామని ప్రచారం చేసుకునే దళారుల మాటలు విద్యార్థులు , వారి తల్లిదండ్రులు నమ్మి మోసపోవద్దని తెలిపారు. అలాంటి వ్యక్తులు, సంస్థలతో విశ్వవిద్యాలయానికి ఎలాంటి సంబంధం, భాగస్వామ్యం లేదని వివరించారు. ప్రవేశాల సమయం లో అప్రమత్తం గా ఉండాలని విద్యార్థులు, తల్లితండ్రులకి ఆయన సూచించారు. ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయం లో ప్రత్యేక కోటాలో ఫీజులు భారీగా తగ్గించడమే కాకుండా… సీట్లు కూడా పెంచామని.. పెంచిన సీట్లను కౌన్సెలింగ్ ద్వారా ప్రతిభ ఆధారం గానే PJTAU రెగ్యులర్, ప్రత్యేక కోటా లో ప్రవేశాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.ఎటువంటి మధ్య దళారీలు, కన్సల్టెంట్ ల పైన ఆధార పడవద్దని, వారి మాయ మాటలని నమ్మ వద్దని ఉపకులపతి మరోసారి సూచించారు. ఇతర అనధికారిక వెబ్ సైట్ లలో లభ్యం అయ్యే సమాచారానికి విశ్వవిద్యాలయానికి సంబంధం లేదని తెలిపారు. పెంచిన ప్రత్యేక కోటాసీట్ల భర్తీ కోసం ప్రస్తుతం ఆన్లైన్ లో దరఖాస్తులు నవంబర్1 వ తేదీ వరకు స్వీకరిస్తున్నామని.. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రవేశాలకి సంబంధించిన సమాచారం కొరకు తల్లితండ్రులు, విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్ సైట్ www.pjtsau.edu.in మాత్రమే చూడవలసింది గా ఉప కులపతి జానయ్య సూచించారు.
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు మార్క్ ఫెడ్, మార్కెటింగ్ అధికారులతో ధాన్యపు కొనుగోళ్ళు, పత్తి కొనుగోళ్ళు, ఇతర పంటల కొనుగోళ్ళ మీద పూర్తి స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా మార్క్ఫెడ్ అధికారులతో సమావేశమై ఖరీఫ్ కొనుగోళ్ళపై ఆరా తీశారు. మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, పెసర కొనుగోళ్ళు పూర్తి కావచ్చాయని, ఇప్పటికే 8.03 కోట్లు విలువ గల 924.85 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని, ఇంకా ఒకట్రెండు మార్కెట్లలో మాత్రమే పెసరు పంట వస్తుందని, అంతేకాకుండా 35.86 కోట్లు వెచ్చించి 4,793 రైతుల వద్ద నుండి 7330.50 మెట్రిక్ టన్నలు సోయాచిక్కుడు కొనుగోలు చేశామని, ఇంకా 50,000 టన్నులు వచ్చే మార్కెట్లకు అవకాశాముందని మార్కెఫెడ్ అధికారులు మంత్రికి తెలియజేశారు. పంట కొనుగోలు పూర్తి కాగానే, ఎక్కడ ఏ మార్కెట్లలో ఎక్కువ రేటు ఉందో విచారించి, డిస్పోసల్ చేసేవిధంగా ప్రణాళిక చేసుకోవల్సిందిగా, తద్వారా మార్క్ఫెడ్ ఆదాయం పెంచే విధంగా చూడాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. ఎరువుల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి ప్రతియేటా మార్క్ఫెడ్కు నిర్వహణ ఖర్చులు, రవాణా ఖర్చులను సహేతుక పద్దతుల ద్వారా నిర్వహించి, ప్రతి ఏటా పెరిగే ఖర్చుల భారాన్ని తగ్గించే విధంగా ప్రయత్నించాలని, రైతులకు ఇబ్బంది రాకుండా వచ్చే యాసంగిలో కూడా ఎరువుల సరఫరా సక్రమంగా అయ్యేటట్లు చూడాలని మంత్రి ఆదేశించారు. ఆ తరువాత రాష్ట్రంలో పత్తి కనీస మద్దతు ధర (MSP) కార్యకలాపాలపై మార్కెటింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ మరియు మార్కెటింగ్ అధికారులతో సమీక్షించారు పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించేందుకు మరియు రైతులకు అవసరమైన మద్దతు ధర అందించేందుకు మంత్రి పలు సూచనలు చేశారు. పత్తి MSP కొనుగోలుకు సంబంధించి నాణ్యత ప్రమాణాలపై రైతులకు మార్కెట్ యార్డుల్లో, కొనుగోలు కేంద్రాల వద్ద నిరంతరము అవగాహన కల్పించాలని, మార్కెటింగ్ అధికారులు, ఉన్నతాధికారులు నిరంతరము ఆయా మార్కెట్యార్డులలో, కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబంధనల ప్రకారం పత్తిని కొనుగోలు జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పత్తి రైతులు తేమ విషయంలో పడుతున్న ఇబ్బందులను CMD, CCI గారితో మాట్లాడి వారి దృష్టికి తీసుకెళ్లాలని, పత్తిలో తేమశాతం ఎక్కువ ఉన్నా కూడా CCI వారే కొనుగోలు చేసేలా చూడాలన్నారు. పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వారి సమస్యలు వెంటనే పరిష్కరించే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పత్తి రైతులకు అవసరమైన మద్దతు అందించి, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా ధాన్యపు కొనుగోలు ఆరంభమైనందున, అన్ని కొనుగోలు కేంద్రాలలో అవసరమైనంత మేర టార్ఫలిన్ అందుబాటులో ఉంచాలని, డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్లు, సన్నబియ్యం నిర్ధారణ చేసే పరికరాలు ప్రతీ కొనుగోలు కేంద్రానికి చేరాయా లేదా అనేది చూసుకోవాల్సిందిగా అడిషనల్ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లను ఆదేశించారు.
8897281111 వాట్స్ యాప్ నెంబర్ ద్వారా పత్తి కొనుగోలు సంబంధిత సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్దమైందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పత్తి రైతులు తమ పంటను అమ్ముకోవడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని వాట్స్ యాప్ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. 8897281111 అనే వాట్స్ యాప్ నెంబర్ ద్వారా పత్తి రైతులు, పత్తి కొనుగోలు సంబంధిత సేవలు అంటే రైతు పత్తి అమ్మకం, అర్హత, అమ్మకాల వివరాలు, చెల్లింపు స్థితి, ్పు్పు| సెంటర్లలో వేచి ఉండే సమయం, కొనుగోలు వివరాలు వంటి అంశాలను రైతులు తమ ఇంటి వద్దనే ఉండి ఈ వాట్స్ యాప్ చాట్ ద్వారా తెలుసుకొనే వెసులుబాటు కలుగుతుందని మంత్రి తెలిపారు. పింజ రకము (BB MODE) ఒక క్వింటాలుకు రూ.7521/- , (పింజ పొడువు (మి. మీ) 29.5 నుండి 30.5, మైక్రోనీర్ విలువ 3.5 నుండి 4.3)గా, పింజ రకము (BB SPL) ఒక క్వింటాలుకు రూ. 7471/- (పింజ పొడువు (మి. మీ) 29.01 నుండి 29.49, మైక్రోనీర్ విలువ 3.6 నుండి 4.8)గా, పింజ రకము (MECH) ఒక క్వింటాలుకు రూ 7421/- పింజ పొడువు (మి. మీ) 27.05 నుండి 28.5, మైక్రోనీర్ విలువ 3.5 నుండి 4.7 గా పత్తికి కనీసం మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. పత్తిలో తేమ శాతము 12% మించకుండా ఉండి, 8% నుండి 12% మద్య ఉన్న పత్తికి మాత్రమే మద్దతు ధర లభిస్తుంది. తేమ శాతం ఎక్కువ ఉన్న పత్తికి తక్కువ మద్దతు ధర లభిస్తుంది. కావున రైతులు తమ పత్తిని పూర్తిగా ఎండబెట్టి తేమ శాతం తక్కువగా ఉందని నిర్దారించుకున్న తర్వాతనే ప్రభుత్వ కొనుగోళ్ల కేంద్రాల వద్ద అమ్ముకోవాలని మంత్రి సూచించారు. ఈ పత్తి సీజన్లో రైతులు వారి పత్తిని సులభంగా విక్రయించేందుకు మార్కెటింగ్ శాఖ అన్నీ రకాల ఏర్పాట్లు చేస్తుందని, రైతులందరూ మార్కెటింగ్ శాఖ తీసుకొచ్చిన వాట్స్ యాప్ చాట్ ఉపయోగించి ఎలాంటి ప్రయాసలు పడకుండా పత్తిని అమ్ముకోవాలని మంత్రి రైతులను కోరారు. అలాగే రైతులకు ఎటువంటి ఫిర్యాదులున్నా కూడా ఈ వాట్సాప్ చాట్ ద్వారా తెలియపరిస్తే, మార్కెటింగ్ శాఖ వారు సత్వరమే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటారని మంత్రి తెలియజేశారు.
పశుగణన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. 21వ అఖిల భారత పశుగణనలో భాగంగా అక్టోబరు 25 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు రాష్ట్రంలోని 1.50 కోట్ల కుటుంబాలకు చెందిన పశువుల వివరాలను ఇందులో నమోదు చేయనున్నారు. వ్యవసాయ పరికరాల వివరాలనూ సేకరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, భూమిలేని కుటుంబాలకు ప్రధాన ఆదాయవనరుగా ఉన్న పశుసంవర్ధక రంగాన్ని మెరుగుపరచడానికి అవసరమయ్యే నిధులు, పథకాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణకు ఇది ఉపయోగపడుతుందని పశుసంవర్ధకశాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, డైరెక్టర్ దామోదరనాయుడు పేర్కొన్నారు. జిల్లాల పశుసంవర్థక అధికారులతో గురువారం వారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు భాగస్వామ్యంతో కేంద్రం రూపొందించిన యాప్ ఆధారంగా పశుగణన నిర్వహిస్తారని వివరించారు. ప్రధానంగా గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలు, కోళ్లు, పకక్షులతో సహా 16 రకాల పెంపుడు జంతువుల సమాచారం సేకరిస్తారు. 17,244 గ్రామాలు, పట్టణాల్లోని 3,929 వార్డుల్లో గృహ, గృహేతర వ్యక్తుల నుంచి వివరాలు తీసుకుంటారు. 5,390 మంది సిబ్బంది, 1,237 మంది పర్యవేక్షకులు, 45 మంది స్క్రూటినీ అధికారులు, ఇతర సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు. వీరికి ట్రావెలింగ్ కిట్లు, 60 వేల వాల్పోస్టర్లు, 1.50 కోట్ల గృహస్టిక్కర్లు, 8 వేల ఐడీ కార్డులు అందించారు. పశుగణన పూర్తి అయిన ఇంటి తలుపుపై స్టిక్కర్ వేస్తారు.
తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మలేషియా పర్యటనలో భాగంగా ఈ రోజు మలేషియా దేశ వ్యవసాయ శాఖా మంత్రి వర్యులు మహ్మద్ బిన్ సాబుతో వారి కార్యాలయంలో సమావేశమయ్యారు. తెలంగాణాలో అగ్రి ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పడానికి మరియు పెట్టుబడులకు ముందుకు రావాల్సిందిగా కోరారు. ఫెల్డా చైర్మన్ అహ్మద్ షాబేరి చీక్ మరియు ప్రతినిధులతో సమావేశమై ఆయిల్ పామ్ రంగంలో వారు సాధించిన ప్రగతిని, తెలంగాణ రాష్ట్ర ఆయిల్ పామ్ రైతులకు ప్రయోజకరంగా వుండే పద్ధతులపై చర్చించారు. మలేషియాలో భారత హై కమిషనర్ బి.ఎన్. రెడ్డి గారి ఆహ్వానం మేరకు వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. యాంత్రీకరణకు సంబంధించి తెనాసియా ప్రైవేట్ లిమిటేడ్ (Palmpro) కంపెనీని సందర్శించి, వివిధ రకాల యంత్రాలు, పనిముట్లు, వాటి పనివిధానంను పరిశీలించారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని జాతీయ స్థాయిలో అత్యుత్తమ పది సంస్థలలో నిలపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య పిలుపునిచ్చారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయం 37వ ర్యాంకులో ఉందని రానున్న మూడేళ్లలో విశ్వవిద్యాలయం పది లోపు ర్యాంక్ సాధించాలని ఆయన సూచించారు. ఈ మధ్యనే ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన ఆల్దాస్ జానయ్య ఈరోజు రాజేంద్రనగర్లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఉద్యోగులు, విద్యార్థులతో సమావేశం అయ్యారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ ఉప కులపతి సహా ఇప్పటికి తాను 15 బాధ్యతలు చేపట్టానని వివరించారు. తనకు ఈ అవకాశం కల్పించిన కులపతి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రికి జానయ్య ధన్యవాదములు తెలిపారు. సమష్టి కృషితో విశ్వవిద్యాలయాన్ని ముందుకి తీసుకెళదామని పిలుపునిచ్చారు. జనవరిలోగా విశ్వవిద్యాలయ అధికారుల పదవులని భర్తీ చేస్తామన్నారు. సాంకేతిక అర్హత లేకపోయినా కొన్ని ప్రయివేటు సంస్థలు వ్యవసాయ కోర్సులలో ప్రవేశాలు చేపట్టడం దురదృష్టం అన్నారు. సామాన్యులకి వ్యవసాయ విద్యని అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు ప్రత్యేక కోటా సీట్లు భారీగా పెంచి, ఫీజులు సగానికి తగ్గించామని వివరించారు. విశ్వవిద్యాలయంలోని ఖాళీలని ప్రభుత్వ విధానాలకి అనుగుణంగా భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామని జానయ్య తెలిపారు. బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటుమన్నారు. తనకి ఎవరితోనూ వ్యక్తిగత విబేధాలు లేవని, విశ్వవిద్యాలయం చట్టం తనకు బైబిల్ అని స్పష్టం చేశారు. తాను పూర్తి ప్రజాస్వామిక విధానాలని అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకుంటానని వివరించారు. ఇదే మాతృక విశ్వవిద్యాలయం అని, త్వరలోనే వజ్రోత్సవం (Diamond Jubilee) నిర్వహిస్తామని జానయ్య ప్రకటించారు. టాసా అధ్యక్షులు ప్రొఫెసర్ బి. విద్యాసాగర్, బోధనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి అమృత రెడ్డి, విద్యార్థుల ప్రతినిధులు పూజ, బాలకోటి, పూర్వ విద్యార్థుల ప్రతినిధి కవిరాజ్లు ప్రసంగించారు. జానయ్యని అభినందించారు. ఆయన సారధ్యంలో విశ్వవిద్యాలయం అభివృద్ధిలో సాగాలని, తమ అంశాలని సానుకూలంగా పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మలేషియా పర్యటనలో భాగంగా తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు FGV కంపెనీ వారి సీడ్ గార్డెను, నర్సరీలను, అధునాతన సాంకేతిక పద్దతులతో నడపబడుతున్న విత్తన కేంద్రాన్ని సందర్శించి, అక్కడ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. FGV కంపెనీ నుండి తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే Seedlings ను చాలా వరకు తెప్పించడం జరిగిందని, భవిష్యత్తులో రాష్ట్రంలోనే స్వంతముగా సీడ్ గార్డెన్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామని, దానికి FGV కంపెనీ వారు సహాయ సహకారాలు అందజేయాలని కోరగా, దానికి కంపెనీ ప్రతినిధులు తప్పకుండా రాష్ట్ర భాగస్వామ్యంతో పని చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలియజేశారు. తర్వాత FGV కంపెనీ వారి రిఫైనరీ కర్మాగారాన్ని సందర్శించి అక్కడ తయారు చేసే వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. రిఫైనింగ్ సమయములో కంపెనీ వారు తీసుకొనే జాగ్రత్తలు, వివిధ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా గల డిమాండ్ గురించి సోదాహరణంగా మంత్రి వర్యులతో పాటు అధ్యయన బృందానికి తెలియజేశారు.
పోలవరం సాగు నీటి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి 2027 జూలై నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థలు, జల వనరుల శాఖ అధికారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వెలగపూడి, సచివాలయంలో బుధవారం జల వనరుల శాఖపై మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీరు నరసింహమూర్తి, మేఘా, బావర్ సంస్థల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. 1,396.60 మీటర్ల పొడవైన డయాఫ్రమ్వాల్ డిజైన్లను ఆప్రై సంస్థ… పోలవరం ప్రాజెక్టు అథారిటీకి, విదేశీ నిపుణుల ప్యానెల్కు అందజేసిందని అధికారులు ఆయనకు తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో నిపుణుల ప్యానెల్.. డిజైన్లపై వర్క్షాపు నిర్వహించి చర్చిస్తుందని, ఆ డిజైన్లను వచ్చే నెల 24 నాటికి ఆమోదిస్తామని వివరించారు. కొత్త వాల్కు రూ. 960.34 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర జలసంఘం ఆమోదించిందని, దానిని 2025 జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులతో పాటు కాంట్రాక్టు సంస్థలు వెల్లడించాయి. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులను 2025 నవంబరులో ప్రారంభించి 2027 జూలై నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నాయి. భూసేకరణ సహా కీలకమైన పనులన్నీ 2025 జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.
ఆయిల్ పామ్ విస్తరణావకాశాలు మరియు ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వహణ, సాగులో అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు, ఆయిల్ పామ్ ఉత్పాదకాలు మున్నగువాటి గురించి శాస్త్రీయ అధ్యయనానికి తెలంగాణా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, డైరెక్టర్, ఉద్యానశాఖ మరియు ఎండీ ఆయిల్ ఫెడ్ శ్రీమతి యాస్మిన్ బాషా గారు మరియు వారి బృందం మలేషియా పర్యటనలో భాగంగా ఈ రోజు మలేషియా ప్లాంటేషన్ మరియు కమోడిటీస్ మంత్రి వర్యులు శ్రీ జోహరి అబ్దుల్ ఘని గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా మన మంత్రివర్యులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వము ఆయిల్ పామ్ సాగుకోసం అందిస్తున్న ప్రోత్సహకాలు, ప్రస్తుత పరిస్థితి మరియు రానున్న రోజుల్లో ఆయిల్ పామ్ పరిశ్రమ అభివృద్దికి గల అవకాశాలు వివరించి, ఆయిల్ పామ్ సాగులో అగ్రగామి దేశాలలో ఒకటిగా ఉన్న మలేషియా నుంచి సహకారం అందించగలరని కోరారు. మలేషియా మంత్రి వర్యులు మాట్లాడుతూ, 143 కోట్ల జనాభా గల దేశానికి ఆహారం అందించడం చాలా గొప్ప విషయమని, ప్రపంచ దేశాలు అన్నీ భారతదేశం ఆ దిశలో అవలంబిస్తున్న విధివిధానాలను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పామ్ఆయిల్ వృద్దికి తాము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని, ఆ దిశలో త్వరలోనే వారి బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తారని తెలియజేసారు. పర్యటనలో భాగంగా మంత్రివర్యులు MATRAOE చైర్మన్ డాటో సెరి రీజల్ మెరికన్ గారిని కలిసి మలేషియాతో వ్యవసాయపరంగా గల వ్యాపార అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ గారు ఇండియాతో వ్యాపారాభివృద్ధికి తమదేశం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది, వ్యాపార పరంగానే కాక ఇండియాతో తమకు సామాజికంగా, చారిత్రకంగా కూడా బంధము ఉన్నదని తెలియజేస్తూ, Broken Riceకు తమ దేశంలో అత్యంత డిమాండ్ ఉందని తెలియజేయగా, మన రాష్ట్రం నుండి Broken Rice సరఫరాకు గల అవకాశాలను పరిశీలించి త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. వెంటనే మంత్రివర్యులు HACA MD శ్రీ చంథ్రేఖర్ రెడ్డి గారిని టెలిఫోన్లో సంప్రదించి మన రాష్ట్రంలో Broken Rice ఎగుమతి చేయడానికి, దానికి సంబంధించిన Economicsను పరిశీలించి, మన వరి రైతులకు అదనపు ప్రయోజనం కలిగితే, వచ్చే యాసంగి కల్లా ఎగుమతి చెయ్యడానికి సిద్ధంగా ఉండాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సాయంత్రం పర్యటనలో భాగంగా మలేషియా పామ్ ఆయిల్ బోర్డును సందర్శించి, పామ్ ఆయిల్ రంగంలో వాళ్ళ అనుభవాలను MPOB చైర్మన్ డా. అహ్మద్ పర్వేజ్ గులామ్ ఖాదీర్ గారు పర్యటన బృందంతో పంచుకున్నారు. MPOB ఆయిల్ పామ్ సాగులో ఒక నూతన ఒరవడిని సృష్టించిందని, అంతేగాక ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చే ప్రాంతాలలో పంట విస్తరణకు కావాల్సిన సాంకేతిక సహాయం అందిస్తుందని మంత్రివర్యులకు తెలియజేశారు.
రైతులకు మరింత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్లను అందించాలని డ్రోన్ల తయారీదారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఒకే దఫాలో ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారీతో పాటు పైరు ఎదుగుదలను పరీక్షించేలా డ్రోన్ల సాంకేతిక పరిజ్ఞానం పెంచాలన్నారు. దాని వల్ల రైతులకు ఖర్చు తగ్గుతుందని నిన్న జరిగిన డ్రోన్ల సమ్మిట్లో ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు కూడా పాల్గొన్నారు.
టన్ను ధర రూ. 3,576/- కేసీపీ చక్కెర కర్మాగారం 2024-2025 సీజన్కు చెరకు ధర టన్నుకు రూ. 3,576/-గా ప్రకటించింది. కర్మాగార ఆవరణలో శుక్రవారం యూనిట్ హెడ్ యలమంచిలి సీతారామదాస్ అధ్యక్షతన చెరకు రైతు సంఘం నేతలతో జరిగిన సమావేశంలో చెరకు గానుగాడు ప్రస్తుత సీజన్కు ధర సబ్సిడీతో కలిసి రూ. 3,576/-గా ప్రకటించారు. యాంత్రీకరణకు అనువుగా సాగు చేసిన రైతులకు టన్నుకు రూ. 3,676/- సబ్సిడీతో కలిపి చెల్లించనున్నట్లు సీతారామదాస్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెప్టెంబరులో అకాల వర్షాలు, వరదలకు నష్టపోయిన రైతులకు సంఘం విన్నపం మేరకు రూ. 40.89 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. రానున్న సీజన్కు ఈ సంవత్సరం నవంబరు నుంచి 2025 ఫిబ్రవరి వరకు నాటే చెరకు తోటలకు ఎకరానికి రూ. 10,000/- సబ్సిడీ ఇవ్వనున్నట్టు తెలిపారు. సబ్సిడీతో పాటు సంప్రదాయ పద్ధతుల్లో నాటిన తోటలకు టన్నుకు రూ. 400/- లేదా యాంత్రీకరణ అనువుగా వేసిన తోటలకు టన్నుకు రూ. 500/- సబ్సిడీగా ప్రకటించారు. రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని విరివిగా చెరకు సాగు చేసి తోడ్పడాలని కోరారు.
పంట వేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతనే రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రబీ నుండి రైతులకు రూ.7,500 ఇస్తామని మంత్రి తెలియచేసారు. పంటల బీమాకు సంబంధించి ప్రతి రైతు పంటకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని కూడా చెప్పారు.
తెలంగాణలో మిద్దెతోటల సాగుకు అన్నివిధాలా ప్రోత్సహం అందిస్తున్నామని రాష్ట్ర ఉద్యానశాఖ సంచాలకురాలు షేక్ యాస్మీన్ బాషా తెలిపారు. సిక్కిం రాష్ట్ర ఉద్యానశాఖ అదనపు సంచాలకుడు బిజు పెరియార్ గురువారం తమ బృందంతో కలిసి తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా మిద్దెతోటల పెంపకాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన యాస్మీన్ బాషతో సమావేశమై మిద్దెతోటల సాగు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తోటల సాగుకు శిక్షణా శిబిరాలను నిర్వహిస్తూ పెంపకందారుల అనుమానాలను నివృత్తి చేస్తున్నామన్నారు.
పశుసంవర్థకశాఖ కొత్త డైరెక్టర్ దామోదర్నాయుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పశుపోషణ లాభదాయకంగా చేయడానికి చర్యలు తీసుకుంటామని పశుసంవర్థక శాఖ నూతన డైరెక్టర్ టి. దామోదర్నాయుడు చెప్పారు. విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దామోదర్నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పాడి రైతులకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు.
జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంకి ప్రొ|| అల్దాస్ జానయ్య గారిని, కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి ప్రొ|| రాజి రెడ్డి గారిని వైస్ఛాన్సలర్లుగా రాష్ట్ర గరవ్నర్ నియమించారు.
దీపావళి పండుగ ముంగిట ప్రధాని మోదీ కర్షకులకు తీపి కబురు చెప్పారు. ఆరు రబీ పంటలకు మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. పంటల మద్దతు ధరలను ఉత్పాదక వ్యయం కన్నా 5 రెట్లు అధికంగా ఉండేలా చూస్తామన్న హామీకి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం గోధుమ, శనగ, మసూర్ దాల్, ఆవాలు, బార్లీ, కుసుమ పంటల మద్దతు ధరలను పెంచింది. వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే 2025-26 మార్కెటింగ్ ఏడాది కోసం ఈ ధరలను నిర్ణయించింది.
దిల్లీ, కాన్పుర్, రోపార్లలో ఉత్కృష్ట కేంద్రాల ప్రారంభం
కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం.. సుస్థిర నగరాల అభివృద్ధి కోసం కేంద్ర విద్యాశాఖ భారీ కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు దిల్లీ, కాన్పుర్, రోపార్లలో ఉత్కృష్ట కేంద్రాల (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)ను వర్చువల్ పద్ధతిలో మంగళవారం ప్రారంభించింది. దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఈ కేంద్రాలు సూచించిన పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించనున్నాయి. ఇందులో భాగంగా పరిశోధనలు, అంకుర సంస్థలకు తోడ్పాటు కోసం వచ్చే నాలుగేళ్లలో రూ. 990 కోట్లు ఖర్చుచేయనున్నట్లు కేంద్రం తెలిపింది. పంజాబ్, హరియాణా సహా రైతులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వ్యవసాయం లాభసాటిగా మార్చే పరిశోధనలను ఐఐటీ రోపార్ ఉత్కృష్ట కేంద్రం పర్యవేక్షించనుంది.
కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్ఐపిహెచ్ఎం) దేశంలోనే పేరెన్నికగల వ్యవసాయ శిక్షణా సంస్థ. సేంద్రియ / ప్రకృతి సేద్య పద్ధతులపై రైతులు, ఎఫ్పిఓలు/ సహకార సంఘాల నిర్వాహకులు, రైతు శాస్త్రవేత్తలుగా ఎదిగి స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు లోతైన శాస్త్రీయ అవగాహన, ఆచరణాత్మక శిక్షణ కల్పించడానికి ఎన్ఐపిహెచ్ఎం 3 నెలల సర్టిఫికెట్ కోర్సు తెలుగు/హిందీ భాషల్లో నిర్వహించనుంది. నూటికి నూరు శాతం రసాయనాలు లేకుండా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయాన్ని లాభదాయకంగా చేయదలచిన వారికి ఇది సదవకాశం. నవంబర్ 27 నుంచి వచ్చే మార్చి 5 వరకు ఈ కోర్సు ఉంటుంది. వివిధ కేంద్ర వ్యవసాయ సంస్థలతో కలసి ఎన్ఐపిహెచ్ఎం నిర్వహించే ఈ కోర్సులో 3 థలుంటాయి. మొదట 21 రోజులు రాజేంద్రనగర్లోని ఎన్ఐపిహెచ్ఎం ఆవరణలో శాస్త్రీయ అంశాల బోధన. తర్వాత అభ్యర్థి ఎంపిక చేసుకున్న ప్రాంతంలో 2 నెలలు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు. ఆ తర్వాత ఎన్ఐపిహెచ్ఎంలో 10 రోజుల తుది థ శిక్షణ ఉంటాయి. ఇంటర్ లేదా టెన్త్ తర్వాత వ్యవసాయ డిప్లొమా చేసిన 18 ఏళ్లు నిండిన అన్ని సామాజిక వర్గాల స్త్రీ, పురుషులు అర్హులు. గ్రామీణ యువతకు ప్రాధాన్యం. కోర్సు ఫీజు: రూ. 7,500./-లు శిక్షణా కాలంలో ఉచిత వసతి కల్పిస్తారు. భోజనానికి రోజుకు రూ. 305/-లు అభ్యర్థి చెల్లించాలి. ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ ఇస్తారు. దరఖాస్తులను నవంబర్ 22 లోగా పోస్టు/మెయిల్ ద్వారా పంపవచ్చు. ఇతర వివరాలకు కోర్సు కోఆర్డినేటర్ డా.కె. దామోదరాచారి (9542638020)ని సంప్రదించవచ్చు. అడ్రస్: To The Director, Plant Health Management, National Institute of Plant Health Management (NIPHM), Rajendranagar, Hyderabad – 500 030 mail: dirphmniphm-ap@nic.in or asomicroniphm2019@gmail.com
నిపుణులతో చర్చించి సాగుపై నిర్ణయం : మంత్రి తుమ్మల ఏలూరు జిల్లా కామవరపుకోటలో మంత్రి తుమ్మల పర్యటన వక్క పంట సాగుకు తెలంగాణ అనువైన ప్రాంతమని, నిపుణులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ పంట రైతన్నలకు సిరులు కురిపిస్తుందని, తెలంగాణలో సైతం సాగును ప్రోత్సహిస్తామన్నారు. ఏపీలోని ఏలూరు జిల్లా కామవరపు కోటలో ఆదివారం వాణిజ్య పంట అయిన వక్క సాగును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ పంట సాగు చేస్తున్న రైతులతో సాగు పద్ధతులు,ఆ దాయ వ్యయాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో దీని విస్తరణ అవకాశాలపై నిపుణులతో చర్చించారు. వక్క సాగుకు అనుకూల నేలలు, వాతావరణ పరిస్థితులు, నీటి వినియోగం తదితర అంశాలపై నిపుణులతో చర్చించి సాగును ప్రోత్సహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో తుపాన్ల ముప్పు పొంచి ఉంది. సాధారణంగా అక్టోబరు, నవంబరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ నెలల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పటానికి పరిస్థితులు అనుకూలించి అవి క్రమేపి వాయుగుండాలు, తుపాన్లుగా మారుతాయి. పంటలు చేతికొచ్చే సమయాల్లో తుపాన్లు వస్తే పంటలు నష్టపోవలసి వస్తుంది. కాబట్టి రైతులు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ కోరింది.అక్టోబరు-డిసెంబరు మధ్యలో రాష్ట్రంపై ప్రభావం చూపిన కొన్ని తుపాన్లుసంవత్సరం తీరం దాటిన ప్రాంతం ప్రభావితమైన జిల్లాలు2014 అక్టోబరు (హుద్హుద్) విశాఖపట్నం విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం2016 డిసెంబరు (వార్ధా) చెన్నై సమీపంలో నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప2018 అక్టోబరు (తిత్లీ) పలాస సమీపంలో శ్రీకాకుళం, విజయనగరం2018 డిసెంబరు (పెతాయ్) కాకినాడ సమీపంలో కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి2021 సెప్టెంబరు (గులాబ్) కళింగపట్నం విశాఖ, విజయగనరం, శ్రీకాకుళం2022 డిసెంబరు (మాండౌస్) మహాబలిపురం సమీపంలో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప2023 డిసెంబరు (మిచౌంగ్) బాపట్ల చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు
ప్రకృతి వ్యవసాయం చిన్న, సన్నకారు రైతుల జీవితాలను మారుస్తోందని, రైతుల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింతగా విస్తరిస్తున్నట్లు రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ఛైర్మన్ టి. విజయకుమార్ అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలపై సంపూర్ణ అవగాహన కోసం నీతి ఆయోగ్ గౌరవ సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ రమేష్చంద్ నేతృత్వంలో ఎనిమిదిమంది సభ్యులతో కూడిన బృందం గురువారం ఏలూరు, కృష్ణాజిల్లాల్లో పర్యటించింది. తొలుత కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం, ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ శిక్షణా భవనంలో విజయకుమార్ బృంద సభ్యులకు ఏపీసీఎన్ఎఫ్ గురించి పవర్ పాయింట్ ప్రెజెటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో 2016లో 40 వేల మంది రైతులతో మొదలైన ప్రకృతి వ్యవసాయం ఇప్పటికి 10 లక్షల మంది రైతుల వరకు చేరుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆదర్శనీయమని నీతి ఆయోగ్ గౌరవ సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ చంద్ ప్రశంసించారు. వ్యవసాయ, రైతుసంక్షేమ మంత్రిత్వశాఖ కమిషనర్ డాక్టర్ ప్రవీణ్కుమార్ సింగ్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను బలోపేతం చేయడానికి మరిన్ని పరిశోధనలు చేయాలన్నారు.
తెలంగాణా రాష్ట్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఈ సారి మిల్లర్లకు కేటాయించవద్దని పౌరసరఫరాల సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు ఇచ్చే ధాన్యంలో తేమ నిబంధనను 17 నుంచి 14 శాతానికి తగ్గించాలని, సన్న బియ్యం మిల్లింగులో 67% బియ్యం రావని నిబంధనలు మార్చాలని, సన్న బియ్యం సరఫరాలో క్వింటాలుకు రు. 300 పరిహారం.. కస్టోడియన్ మిల్లింగ్, రవాణా ఛార్జీలు పెంచాలని కొంతమంది మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమస్యలు పరిష్కారం కానిదే ధాన్యాన్ని మిల్లింగ్కు తీసుకోమని కొంతమంది మిల్లర్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వ శాఖల, సంస్థల పరిధిలోని గోదాములలో నిల్వ చేయాలని పౌర సరఫరాల శాఖ చేసిన ప్రతిపాదనను తెలంగాణ వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిసింది. తాజాపరిణామాల నేపథ్యంలో ధాన్యం నిల్వ చేసే విషయమై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సంప్రదింపులు జరిపారు. పౌర సరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి డిఎస్ చౌహాన్ కూడా మంత్రి తుమ్మలతో మాట్లాడారు.
తెలంగాణాలో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 6 వరకు కురిసిన భారీ నుండి అతిభారీ వర్షాల వలన రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాలలో 79,574 ఎకరాలలో పంటనష్టం సంబవించినట్లు అధికారులు నిర్ధారించగా, దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రిగారి ఆదేశాలతో కేవలం నెల రోజుల వ్యవధిలోనే పంటనష్టపోయిన రైతులకు పరిహారం కింద రూ. 79.57 కోట్ల నిధులు విడుదలయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. అత్యధికంగా పంటనష్టం ఖమ్మం జిల్లాలో (28,407 ఎకరాలు), తరువాత మహబూబాబాద్ (14,669), సూర్యాపేట (9,828 ఎకరాలు)లలో సంభవించినట్లు, మిగతా 22 జిల్లాలకు సంబంధించి అత్యల్పంగా పంటనష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు నిర్ధారించారు. పంటనష్ట పరిహారం ఎకరానికి 10 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాలలోనే జమ అయ్యేటట్లు అధికారులు ఏర్పాటు చేసినట్టు మంత్రివర్యులు తెలియజేశారు.
పప్పుధాన్యాలు పండించే రైతులకు తిప్పలు తప్పడం లేదు. పప్పుదినుసుల నిల్వకు తగిన వసతులు, మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడంతో పప్పుధాన్యాలు పండించే రైతులు నష్టపోతున్నారని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఒక నివేదికను విడుదల చేసింది. పప్పుదినుసుల సాగులో స్వయం సమృద్ధిని సాధించేందుకు అవకాశాలున్నా కూడా ప్రభుత్వాలు తగిన కృషి చేయడం లేదు కాబట్టే ఇప్పటికి కూడా మనం దిగుమతుల మీద ఆధారపడుతున్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. పంటల మార్పిడి ద్వారా పప్పుదినుసులను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని, గిడ్డంగులతో పాటు ఇతర నిల్వ సౌకర్యాలు కల్పించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా మార్కెటింగ్ సదుపాయాలు ఉండాలని, సాగులో కొత్తవంగడాలను, స్వల్పకాలిక రకాలను ప్రోత్సహించాలని ఆ నివేదికలో పేర్కొంది. వీటితో పాటు అవసరమైన చర్యలు పొందుపరిచిన నివేదికలోని విషయాలను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) వెల్లడించింది.
అనేక ఆటుపోట్లను తట్టుకొని సాగు చేస్తున్న రైతులకు రూపాయిలో మూడోవంతు కూడా దక్కడం లేదని ఆర్బిఐకి నిపుణుల బృందం నివేదిక అందించింది. కూరగాయల ద్రవ్యోల్బణంపై.. రైతు నుంచి రిటైలర్ వరకు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నిపుణుల బృందం రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) కోసం అధ్యయనం చేసింది. రైతు నుంచి వ్యవసాయ మార్కెట్లో దిగుబడులు కొనుగోలు చేసే ట్రేడర్లు, హోల్సేల్ వ్యాపారులు, రిటెయిలర్ల కమీషన్లు, రవాణా, లోడింగ్, అన్లోడింగ్, నిల్వ ఛార్జీల రూపంలో ఖర్చులు ఎక్కువ అయ్యి ధరలు పెరిగి.. వినియోగదారునిపై భారం పడుతుంది. రైతు చేతికి దిగుబడి వచ్చినప్పటి నుంచి వినియోగదారుడిని చేరే వరకు అవసరమైన వాల్యూ చెయిన్ సరిగా లేకపోవడంతో దళారులు దోచుకోవడానికి అవకాశం ఏర్పడిందని నివేదిక వెల్లడించింది. ఇలాంటి పరిణామాల వలన అటు రైతూ, ఇటు వినియోగదారూ ఇద్దరూ నష్టాలే ఎదుర్కొంటున్నారు. కాబట్టి సరఫరా వ్యవస్థలోపాలను సరిచేయాలని సూచించారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 18వ విడత నిధులను, మహారాష్ట్రలోని వాషిమ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు. 9.4 కోట్ల మంది రైతుల ఖాతాలలో 20 వేల కోట్లు పంపిణీ చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ ద్వారా నిధులను జమ చేశారు. అర్హులైన రైతులకు ఒక్కొక్కరికి 2000 రూపాయలు చొప్పున వారి వారి బ్యాంకు ఖాతాలలో జమ అవుతాయి. www.pmkisan.gov.in వెబ్సైట్ను ఓపెన్ చేయగానే కొన్ని ఆఫ్షన్లు కనిపిస్తాయి. ఇందులో బెనిఫిషరీ లిస్ట్ కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలను సెలెక్ట్ చేస్తే ఆ గ్రామంలోని లబ్దిదారుల జాబితా వస్తుంది. ఆ జాబితాలో పేరు ఉందంటే ఆ రైతు బ్యాంకు ఖాతాలో 2000 రూపాయల డబ్బులు జమ అవుతాయి.
రైతుల ఆదాయం, ఆహార భద్రతను మెరుగు పరిచేందుకు కేంద్రం పీయం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషోన్నత యోజన పథకాలను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అందుకోసం 1,01,321 కోట్ల రూపాయలు కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం లభించినట్లు మంత్రి పేర్కొన్నారు. పీయం-ఆర్కేవీవైలో భాగంగా నేల సారం, పంటల వైవిధ్యం, వ్యవసాయ యాంత్రీకరణ… వంటి వివిధ చర్యల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించాలని నిర్ణయించాం అని మంత్రి అన్నారు. నూనెగింజల ఉత్పత్తిలో దేశానికి స్వావలంబన చేకూర్చేందుకు ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్’ ఏర్పాటుకు రూ. 10,103 కోట్లు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. ఈ మిషన్ ద్వారా రానున్న ఏడేళ్ళలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నాం అని మంత్రి అన్నారు. ఈ మిషన్లో భాగంగా నూనెగింజల సాగును 40 లక్షల హెక్టార్లకు విస్తరించనున్నాం అని మంత్రి చెప్పారు.
శ్రీ బి ఉదయ్ భాస్కర్ 01 అక్టోబర్ 2024న నాబార్డ్, తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం యొక్క చీఫ్ జనరల్ మేనేజర్ (CGM)గా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీ ఉదయ్ భాస్కర్కు డెవలప్మెంట్ బ్యాంకింగ్లో 31 సంవత్సరాల గొప్ప అనుభవం ఉంది. ఆయన బాపట్ల వ్యవసాయ కళాశాల, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (ప్రస్తుతం ANGRAU)లో వ్యవసాయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. 1993లో కర్ణాటక రాష్ట్రంలో నాబార్డ్లో చేరిన శ్రీ ఉదయ్ భాస్కర్ జార్ఖండ్, కర్ణాటక, APలోని ప్రాంతీయ కార్యాలయాలు మరియు ముంబైలోని ప్రధాన కార్యాలయంలో వివిధ హోదాల్లో సేవలందించారు. ఆయన నాబార్డ్లో గ్రామీణ మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్, రీఫైనాన్స్, క్రెడిట్ ప్లానింగ్, వ్యవసాయ రంగ అభివృద్ధి ప్రాజెక్టులు, MSME సెక్టార్, గ్రామీణ సహకార సంస్థల అభివృద్ధి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, తదితర రంగాలలో వివిధ రకాలైన పోర్ట్ఫోలియోలను వివిధ ఉన్నత స్థానాల్లో నిర్వహించారు. ఆయన నాబార్డ్, వరంగల్ (పూర్వం AP) లో జిల్లా అభివృద్ధి అధికారిగా (DDM) కూడా పనిచేశారు. జిల్లాలో వాటర్షెడ్ మరియు గిరిజన అభివృద్ధి ప్రాజెక్టుల అమలు, గ్రామీణ జీవనోపాధి కార్యక్రమాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల (FPOs) స్థాపన మరియు అభివృద్ధి, గ్రామీణ వ్యవస్థాపకత అభివృద్ధి, SHG- బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ వంటి మహిళా సాధికారత కార్యక్రమాలు, ఆర్ధిక సమ్మేళనం, మొదలైన అనేక కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించారు.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల నాలుగు నెలల సీజన్లో అనేక అసాధారణ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈసీజన్లో 108 శాతం వర్షపాతం నమోదు అయ్యింది. సీజన్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (24 గంటల వ్యవధిలో 11.5 నుంచి 20.45 సెం.మీ.) కురిసిన సందర్భాలు 2,632, అత్యంత భారీ వర్షాలు, కుంభవృష్టి (20.45 సెం.మీ. కంటే ఎక్కువ) కురిసిన సందర్భాలు 473 వరకూ ఉన్నాయి. గత ఐదేళ్ళతో పోలిస్తే ఈ సంఖ్య క్రమేపి పెరుగుతోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు జులై, ఆగస్టు నెలల్లో కురుస్తున్నాయి. గడచిన ఐదేళ్ళుగా పరిశీలిస్తే పశ్చిమ తీరం, ఈశాన్య తూర్పు, ఉత్తర భారతంలో వర్షాల తీవ్రత పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది కేరళ నుంచి గుజరాత్ వరకు పశ్చిమ తీరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిస్సా, బీహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, అసోం, మేఘాలయ వంటి చోట్ల వర్ష బీభత్సం కనిపించింది. దానికి వాతావరణంలో మార్పు ఒక్కటే కారణమని చెప్పలేమని, అక్కడ స్థానిక పరిస్థితులు, పట్టణీకరణ, భారీ ఎత్తున నిర్మాణాలు, పరిశ్రమలు, వాహన కాలుష్యం వంటివి కూడా కారణాలుగా చెప్పవచ్చని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ, సముద్ర అధ్యయన విభాగాధిపతి ఆచార్య సునీత అన్నారు. అయితే వర్షాల తీవ్రత పెరగడంపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆమె చెప్పారు.
పామాయిల్ రైతులకు అధిక ధరలను అందించి, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో, ముడిపామ్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని తిరిగి విధించి దేశీయ పామ్ ఆయిల్ రైతులను ఆదుకొనేవిధంగా చర్యలను తీసుకోవాలని ఇటీవల తెలంగాణా వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గారిని కోరిన విషయం తెలిసిందే. ఇందుకనుగుణంగా, కేంద్రప్రభుత్వం ఇటీవల ముడి పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 5.5 % నుండి 27.5 % కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనివలన ముడిపామాయిల్ గెలల ధర రూ. 14,392 నుండి అమాంతం రూ. 2651 పెరిగి ప్రస్తుతం రూ. 17,043 చేరుకుంది. పెరిగిన ధరలు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయి. దీనివలన రైతులకు ఈ నెలలో అదనంగా రూ. 12 కోట్లు లబ్ధి చేకూరనుంది. గతంలో ముడిపామ్ ఆయిల్ దిగుమతిపై సుంకం ఎత్తివేయడం వలన ఆయిల్ పామ్ గెలల ధర తగ్గి రైతులు నిరాశ పడడమే కాకుండా, కొత్తగా ఆయిల్ పామ్ వైపు సాగు వేయాలనుకున్న రైతులపై ప్రతికూల ప్రభావం చూపించిందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 44,444 ఎకరాల పామ్ ఆయిల్ తోటల నుండి సాలీన 2.80 లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెలల దిగుబడి రావడం జరుగుతుంది.. ఈ ధరల పెరుగుదల వలన 9,366 మంది ఆయిల్ పామ్ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. పామ్ ఆయిల్ దిగుమతిపై భారత ప్రభుత్వానికి సంవత్సరానికి 80 వేల కోట్ల రూపాయల విదేశిమారక ద్రవ్యం ఖర్చవుతుందని, దిగుమతి సుంకాలు విధించడం వలన దేశంలోని పామ్ ఆయిల్ రైతులు, ముఖ్యంగా తెలంగాణ పామ్ ఆయిల్ రైతులు ప్రయోజనం పొందుతారని, అంతేకాకుండా గెలల ధరల పెరుగుదల వలన నూతనంగా రైతులు పామ్ ఆయిల్ వైపు మొగ్గు చూపే అవకాశం ఏర్పడనుందని మంత్రివర్యులు పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం (31) జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు (14) కంపెనీలకు అనుమతులివ్వడం జరిగిందని, ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2.23 లక్షల ఎకరాలను ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకురావడమైందన్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో రాష్ట్రంలో చాలా మంది రైతులు పామాయిల్ సాగు వైపు చూసే అవకాశం ఉందని, కావునా ఆయిల్ పాం కంపెనీలు ఇందుకోసం సన్నద్ధం కావాలని మంత్రిగారు కోరారు. పామ్ ఆయిల్ సాగు చేయాలనుకునే రైతుల కోసం పామాయిల్ మొక్కలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పామాయిల్ రైతుల సంక్షేమం, ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎళ్లవేలలా కృషి చేస్తుందని, ఈ సందర్భంగా మంత్రివర్యులు పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం కింద ఈనెల 5వ తారీఖున రైతుల బ్యాంకు ఖాతాలో రూ. 2000/-లు జమ కానున్నాయి. దేశంలోని 9.5 కోట్ల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ. 2000/-ల చొప్పున బదిలీ చేస్తారు. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయలు వెచ్చించనుంది. ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్రమోడి మహారాష్ట్రలోని వాషిమ్ నుండి అక్టోబర్ 5న రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు. కొత్తగా ఈ పథకంలోకి అర్హత పొందాలనుకునే రైతులు అక్టోబరు 5 లోపు బ్యాంకు ఖాతా యొక్క లి-దిగిబీ ని పూర్తి చేయడం తప్పనిసరి. లి-దిగిబీ తో పాటు పి.యం. కిసాన్ లబ్దిదారుడు భూమి ధృవీకరణను పొందడం కూడా అవసరం. రైతుల బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానించడం కూడా చాలా ముఖ్యం.
రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా కానుకగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అక్టోబరు 5వ తేదీన నిధులను విడుదల చేయబోతుంది. అర్హులైన రైతులందరికి వారివారి ఖాతాలలోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ (డిబిటి) రూపంలో దీనిని కేంద్రప్రభుత్వం జమ చేయనుంది. ఈ విధానంలో లబ్దిదారులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను జమ చేయడం వల్ల ఏలాంటి జాప్యం లేకుండా తక్షణమే ఆర్థికంగా ఆదుకున్నట్లు అవుతుంది. రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయిన వెంటనే రిజిస్టర్డ్ ఫోన్ నంబరుకు మెసేజ్ అందుతుంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్లోని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) శాస్త్రవేత్త జూకంటి అరవింద్కుమార్ ప్రపంచ మొక్కల జీవ, వృక్ష శాస్త్రం పరిశోధకుల్లో స్థానం సంపాదించారు. ప్రపంచ జాబితాలో దేశంలోని ఐకార్ నుంచి 22 మందికి అవకాశం దక్కగా అందులో అరవింద్కుమార్ ఒకరు. అమెరికాలోని స్టాన్ఫర్డ్ వర్సిటీ వ్యవసాయ విభాగాధపతి జాన్ పీఏ అయోడినిస్ నేతృత్వంలో ఈ పరిశోధనలు సాగాయి. 2023-24లో చేసిన పలు అధ్యయనాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. నారాయణఖేడ్కు చెందిన అరవింద్కుమార్ 2012లో ఐకార్లో చేరారు 2017 నుంచి రాజేంద్రనగర్లోని వరి పరిశోధన సంస్థలో ఆయన పనిచేస్తున్నారు. జాబితాలో చోటు లభించడంపై శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఆయనకు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో త్వరలో సాగు నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని, నవంబరు మొదటి వారానికల్లా వాటిని పూర్తి చేస్తామని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇప్పటికే ఎన్నికలకు ఉత్తర్వులు వెలువడ్డాయని, ఓటర్ల జాబితాలు నవీకరిస్తున్నారని శుక్రవారం మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిర్వీర్యమైన సాగు నీటి వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టి, వాటికి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పారు. చివరి ఎకరా వరకు నీరు అందించేలా సాగునీటి సంఘాలను సమన్వయం చేసుకుంటూ జలవనరుల శాఖ పని చేస్తుందన్నారు.
‘నేషనల్ లైవ్స్టాక్ మిషన్’ కింద రూ. కోటి రుణం రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తం అందుకున్న తొలి రైతు! మారుమూల పల్లెలోని ఓ రైతు ఇంట జాతీయ పథకం సిరులజల్లు కురిపించింది. చిన్న పరిశ్రమల ఏర్పాటులో రైతులకు ప్రోత్సాహకాన్ని అందిస్తున్న ‘నేషనల్ లైవ్స్టాక్ మిషన్’ను సద్వినియోగం చేసుకోవడంతో రూ. కోటి రుణం మంజూరైంది. ఇందులో 50 శాతం రాయితీ కాగా… రూ. 50 లక్షలను ఆయన తిరిగి చెల్లించాలి. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని అరికెల గ్రామ పంచాయతీ, గోసువారిపల్లెకు చెందిన రైతు చిన్నరెడ్డెప్పరెడ్డి… గొర్రెల పెంపకం యూనిట్ ఏర్పాటు నిమిత్తం ఈ మొత్తం అందుకున్నారు. ఈ చెక్కును మదనపల్లె సబ్కలెక్టర్ మేఘనస్వరూప్ రైతుకు గురువారం అందజేశారు. ‘రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని ఓ మారుమూల ప్రాంత రైతు సద్వినియోగం చేసుకోవడం ఆహ్వానించదగినది. ఏ పథకం కిందనైనా ఓ రైతు ఇంత మొత్తంలో రుణం అందుకోవడం రాష్ట్రంలో ఇదే తొలిసారి’ అని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారుల సలహాలు, సూచనలు తీసుకుని అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మదనపల్లె పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ, ఏడీఏ రోహిణి, పశువైద్యాధికారి లారెన్స్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్తు సంస్థ కొత్తగా వ్యవసాయ పంపు సెట్ల విద్యుదీకరణ పథకాన్ని రూపొందించింది. రూ. 508.95 కోట్ల విలువైన ఈ పథకానికి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట, సరూర్నగర్, మెదక్, వికారాబాద్, యాదాద్రి, నారాయణపేట్, రాజేంద్రనగర్, గద్వాల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్నగర్ ఆపరేషన్ సర్కిళ్లకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ప్రస్తుత విద్యుత్తు లైన్లకు దూరంగా ఉన్న పొలాలకు ఈ పథకంలో ప్రాధాన్యమివ్వనున్నారు. ఈ పథకం కింద 25 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ నుంచి నాలుగైదు హెచ్పీ పంపు సెట్లకు కనెక్షన్ ఇవ్వనున్నారు. 25కేవీఏ ట్రాన్స్ఫార్మర్, దానికి అవసరమైన 11 కేవీ కండక్టర్, ఎల్టీ కేబుల్, పోల్స్ వంటివి ఏర్పాటు చేయాలంటే దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంది. ఒక్కో కనెక్షన్కు రూ. 75 వేల వ్యయం కానుంది. ఒక వ్యవసాయ కనెక్షన్కు రైతు చెల్లించేది రూ. 5 వేలు మాత్రమే. మిగిలిన రూ. 70 వేలను ప్రభుత్వం రాయితీ కింద భరించనుంది. దీనికి సంబంధించిన పనులన్నీ సంస్థ పరిధిలోనే జరుగుతాయి.
మన భారత దేశానికే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మన తెలంగాణ విత్తనం ప్రాముఖ్యత పొందాలని, దానికి తగ్గట్లుగా ప్రభుత్వ ప్రయత్నాలకు మీరందరూ కలిసి రావాలని FICCI భవన్లో జరిగిన సీడ్మెన్ అసోసియేషన్ 29వ AGM లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 1995వ సంవత్సరంలో 20 నుంచి 30 మందితో ఆరంభమైన ఈ సీడ్మెన్ అసోసియేషన్ నేడు 507 మంది సభ్యులతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి చెందిన అన్ని విత్తన కంపెనీలకు ప్రాతినిధ్యము వహిస్తుంది. మన తెలంగాణాను విత్తనోత్పత్తిలో అగ్రస్థానంలో ఉంచిన అందరికీ, రాష్ట్రములో ఉన్న 5 లక్షల మంది విత్తన ఉత్పత్తి రైతులకు మంత్రి శుభాకాంక్షలు తెలియచేశారు. విత్తనోత్పత్తి చేసే రైతులకు పంట రుణాలను సాధారణ రైతుల కంటే 30% నుండి 50% మేర పెంచి ఇవ్వాల్సిందిగా బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏ ఒక్క రైతూ కూడా ఫలానా కంపెనీ విత్తనం వలన పంట నష్టపోయాం అనే మాట రాకుండా విత్తన కంపెనీలు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడానికి ప్రయత్నం చేయాలని, మీ ప్రయత్నాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి మాట ఇచ్చారు.
జాతీయ లైవ్స్టాక్ మిషన్ ద్వారా 50 శాతం రాయితీపై గొర్రెలు, మేకలు, కోళ్ళు, పందుల పెంపకం యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. 20 లక్షల నుంచి కోటి రూపాయల వరకు యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని, యూనిట్ వ్యయంలో 50% రాయితీ లభిస్తుందని, 40% బ్యాంకు రుణం, రైతు 10% శాతం వాటా చెల్లించాల్సి ఉంటుందని మంత్రి తెలియచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినియోజిక వర్గంలో యూనిట్లు ఏర్పాటు జరిగేలా చూస్తామన్నారు. ఔత్సాహిక గ్రామీణ యువతకు ఈ పథకంపై అవగాహన కల్పించడం ద్వారా రైతులను వ్యాపారవేత్తలుగా చేస్తామని మంత్రి తెలిపారు.
తెలంగాణా వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోద్రేజ్ అగ్రోవెట్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు రిఫైనరీ ఏర్పాటుపై సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో TGICC డైరెక్టర్, ఆయిల్ఫెడ్ ఎండి, మార్క్ఫెడ్ ఎండి మరియు డిపార్ట్మెంటల్ అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ఆయిల్ పామ్ యూనిట్ల ప్రస్తుత పరిస్థితి, ప్రాసెసింగ్ సామర్థ్యం, మరియు రాబోయే రోజుల్లో ఉన్న అవకాశాలపై చర్చ జరిగింది. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ మరియు ప్రాసెసింగ్ యూనిట్ల మెరుగుదలపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
జాతీయ వ్యవసాయ, వ్యయ ధరల కమీషన్ (సీఏసీపీ).. 1970-71 నుంచి ప్రతి యేటా రాష్ట్రాల వారీగా విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ యంత్రాంగాల్లోని క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో అన్ని పంటల సాగు వ్యయంపై సర్వే చేయించి, వాటి నివేదికల ఆధారంగా మద్దతు ధరలపై నిర్ణయం తీసుకుంటుంది. గతంలో ఈ సర్వే పంటల సాగు వ్యయాలకే పరిమితమయ్యేది. ఇకపై కృషి పరపేరక్ష సర్వే (కేపీఎస్) విధానంలో పంటల దిగుబడుల హెచ్చుతగ్గులను సైతం అంచనా వేయాలని కేంద్రం నిర్ణయించింది. క్షేత్రస్థాయి సిబ్బంది… ఎంపిక చేసిన రైతులు వేసిన పంటల దిగుబడుల్లో హెచ్చు, తగ్గుల వివరాలను సేకరిస్తారు. గత రెండు, మూడేళ్లతో పాటు ప్రస్తుత సంవత్సరం పంటల దిగుబడులు ఎలా ఉన్నవో తెలుసుకుంటారు. ఈ నివేదికలను క్రోఢీకరించి .. దేశవ్యాప్తంగా ఆయా పంటల దిగుబడులు పెరిగితే కేంద్ర ప్రభుత్వం వాటి ఎగుమతులకు అవకాశం కల్పిస్తోంది. తగ్గితే ఎగుమతులను నిషేధిస్తుంది.
తెలంగాణ రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకాన్ని దసరా పండుగ రోజున ప్రారంభించి… అదేరోజున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకంలో భాగంగా పెట్టుబడి సాయం కింద ఖరీఫ్, రబీ రెండు సీజన్లు కలిపి రు. 15 వేలు జమ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. అందులో భాగంగా తొలి విడత కింద రూ. 7,500/-లు దసరా రోజున రైతుల ఖాతాలలో పడనున్నాయి. రైతు భరోసాను కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే వర్తింప చేయాలనే నిబంధనను ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇక ఎన్ని ఎకరాలలోపు సాయం అందించాలనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.
ఏనుగులు మందలుగా విరుచుకుపడి పంటల్ని సర్వనాశనం చేయడం, మనుషుల్ని తొక్కి చంపడం వంటి ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. ఏనుగులు దాడిచేసి పంటలను నాశనం చేశాక వాటిని తరమడం కంటే వాటి రాకను ముందే గుర్తించి అప్రమత్తమైతే చాలావరకు నష్టాన్ని నివారించగలుగుతాం. ఈ దిశగా కేరళలోని అమృత యూనివర్సిటీ ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ని ఉపయోగించి ‘అమృత ఎలిఫెంట్ వాచ్ టెక్నాలజీ’ని రూపొందించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన జీపీఏఐ సదస్సులో దానికి సంబంధించిన త్రీడీ నమూనాను ప్రదర్శించింది. ఏనుగులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేస్తారు. రాత్రిపూట పనిచేసేందుకు వీలుగా ఇన్ఫ్రారెడ్ సపోర్ట్ ఉన్న కెమెరాలు వాడతారు. వాటిలోని సెన్సర్లు కెమెరా పరిధిలోకి వచ్చే జంతువుల కదలికల్ని గుర్తిస్తాయి. అవి ఏనుగులయితే అవి ఏ ప్రాంతంలో ఉన్నాయి? ఎటువైపు వెళ్తున్నాయి? వంటి వివరాలన్నీ కొన్ని సెకన్ల వ్యవధిలోనే విశ్లేషించి మెసేజ్ రూపంలో స్థానికులకు, రైతులకు మొబైల్ ఫోన్లలో పంపిస్తాయి. ఏనుగుల ఫోటోలు, వీడియోలు 5-10 సెకన్లలో అటవీశాఖ అధికారులకు చేరతాయి. కాబట్టి అవసరమైన చర్యలు వెంటనే తీసుకునేందుకు అవకాశాలు ఉంటాయి.
ఈ ఖరీఫ్ సీజనులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ఏర్పాటు చేస్తున్నామని, కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాలకు సొమ్ము జమ చేస్తామని పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ సంబంధిత అధికారులతో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో అన్నారు. అక్టోబరు 1 నుంచి ధాన్యం సేకరణ మొదలవుతుంది కాబట్టి రవాణాకు ఇబ్బంది లేకుండా అధిక సంఖ్యలో లారీలు, పూర్తి స్థాయిలో గోతాలు సిద్ధం చేస్తున్నామని వివరించారు.
ఈ ఖరీఫ్ సీజను నుంచే తెలంగాణా రాష్ట్రంలో సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500/-లు బోనస్ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు ఈసారి సన్న వడ్లు భారీగా వస్తాయని పౌరసరఫరాల సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబరు నుంచి జనవరి వరకు రైతుల నుంచి సన్నవడ్లు కేంద్రాలకు రానున్నాయి. సుమారు 50 లక్షల టన్నుల సన్నవడ్లు కొనుగోలు కేంద్రాలకు రావచ్చని పౌరసరఫరాల సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు.
భారత పాడి పరిశ్రమ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాల ఉత్పాదకతను మరింత పెంచేందుకు ‘శ్వేత విప్లవం 2.0’ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. మహిళా సాధికారత, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా దానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. 67,930 ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల కంప్యూటీకరణ కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను విడుదల చేశారు. శ్వేత విప్లవం 2.0 కింద రాబోయే ఐదేళ్ళలో డెయిరీ కో-ఆపరేటివ్ సొసైటీల ద్వారా పాల సేకరణ 50 శాతం పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు నిధులు సమకూరుస్తుంది.
వాతావరణ సమాచారాన్ని మరింత పక్కాగా అందించాలనే లక్ష్యంతో 2,600 కోట్ల రూపాయలతో రూపొందించిన ‘మిషన్ మౌసం’ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తెలియచేశారు. వాతావరణ, సముద్ర అధ్యయన విభాగం 75వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న మహాపాత్ర విలేకరులతో అన్నారు. దేశంలో ఏ ప్రాంతంలో ప్రకృతి విపత్తు సంభవించినా వెంటనే తెలుసుకునేందుకు ఉపయోగపడే ప్రస్తుతం పనిచేస్తున్న 39 రాడార్లకు తోడు మరో 50 డాప్లర్ వెదర్ రాడార్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, మచిలీపట్నంలలో కూడా కొత్త రాడార్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఈ నెల 22, 23 తేదీల్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కీలక శిఖరాగ్ర సభ ‘ఫూచర్ 2024’ జరగనుంది. ఈ నేపథ్యంలో అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ గ్రోనింగెన్ (నెదర్లాండ్స్)కు చెందిన డాక్టర్ ప్రజల్ ప్రధాన్ సారథ్యంలోని పరిశోధకుల బృందం ఒక అధ్యయనం నిర్వహించింది. నగరాలు, నగర పరిసర ప్రాంతాల్లో ఇళ్ళపైన, ఖాళీ స్థలాలలో చేపట్టే వ్యవసాయ కార్యకలాపాలనే అర్బన్ అగ్రికల్చర్గా చెప్పవచ్చు. నగర, పట్టణ ప్రాంతాల్లో ఇంటి పంటలు, మిద్దె తోటలు, పెరటి తోటలు, పశుపోషణ, పాడి పరిశ్రమ, కోళ్ళు, చేపల పెంపకం.. వంటి కార్యకలాపాలన్నీ ఈ అర్బన్ అగ్రికల్చర్ కోవలోకే వస్తాయి. ‘అర్బన్ అగ్రికల్చర్’ సుస్థిర అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుంది. కాని ప్రతికూల ప్రభావాన్ని బాగా తగ్గించే అర్బన్ అగ్రికల్చర్ పద్ధతులను పాటించగలిగినప్పుడే దాని ప్రయోజనాలు ఒనగూడతాయని డాక్టర్ ప్రజల్ ప్రధాన్ స్పష్టం చేశారు. అర్బన్ అగ్రికల్చర్ వల్ల ఆహారం, విద్య, సాంఘిక సదుపాయాలను కల్పించడంతో పాటు జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు సుస్థిరత ఎలా ఎలా చేకూరుతుందో శాస్త్రబద్ధంగా ఈ అధ్యయనం రుజువులు చూపించింది అని డాక్టర్ ప్రధాన్ వివరించారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమం ‘పరివర్తన్’లో భాగంగా, చిన్న రైతులకు సాయం చేసేందుకు ప్రైవేట్ రంగ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిద్ధం అయ్యింది. వార్షిక ఆదాయం రూ. 60,000 కంటే తక్కువగా ఉన్న 5 లక్షల మంది చిన్న రైతుల ఆదాయం పెరిగే కార్యక్రమాలను 2025వ సంవత్సరంలోగా చేపట్టాలని బ్యాంకు నిర్ణయించింది. నిరర్ధకంగా ఉన్న 2 లక్షల ఎకరాలను వ్యవసాయానికి అనువుగా మార్చడం ఇందులో ప్రధానమైనది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచే కార్యక్రమాలను చేపడతామని, 25000 మందికి ఉపకార వేతనాలు అందిస్తామని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అధికారులు వెల్లడించారు.
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఊతం ఇచ్చి రైతులు ఆదాయం పెరిగేందుకు వీలుగా ఉల్లి మరియు బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధరలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాకుండా ఉల్లిపై ఎగుమతి సుంకాన్ని 40 శాతం నుంచి 20 శాతానికి తగ్గించినట్లు కేంద్ర పేర్కొంది.
దేశ వ్యవసాయరంగానికి ఆయువుపట్టైన నైరుతి రుతుపవనాల తిరోగమనం ఈ నెల 19-25 మధ్య నుంచి ప్రారంభం కావచ్చని జాతీయ వాతావరణ విభాగం గురువారం వెల్లడించింది. దేశ వాయవ్య ప్రదేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాల తిరోగమనానికి అనుకూల వాతావరణం ఉందని వెల్లడించింది. సాధారణంగా జూన్ 1న దేశంలోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు జులై 8 నాటికి దేశమంతటా విస్తరించి వర్షాలను అందిస్తాయి. తిరిగి సెప్టెంబర్ 17 నుంచి తిరోగమిస్తూ అక్టోబరు 15 నాటికి పూర్తిగా నిష్క్రమిస్తాయి. ఈసారి నైరుతి రుతుపవన కాలంలో దేశంలో 836.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం 772.5 మి.మీ. కంటే ఎనిమిది శాతం ఎక్కువ. అయినప్పటికీ తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో 16 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మరోవైపు దేశ వాయవ్య (4 శాతం) మధ్య (19 శాతం), దక్షిణాది (25 శాతం) ప్రాంతాల్లో సాధారణాన్ని మించి వర్షాలు కురిశాయి.
ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 19 జిల్లాలలో 5.64 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 3 లక్షల మంది రైతులు రూ. 1244 కోట్ల మేర నష్టపోయారు. వరదల కారణంగా 2.03 లక్షల మంది రైతులకు చెందిన 4.6 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిని రూ. 1104 కోట్ల విలువైన 4.80 లక్షల టన్నుల దాన్యం ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని అధికారులు అంచనా వేశారు. నష్టపోయిన రైతులకు అదనపు సాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో భూములకు సంబంధించి, ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకురావడం, భూముల రీసర్వే, ల్యాండ్ టైటిల్ అమలు, అధికారలకు నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక అకాడమీ ఏర్పాటు, భూ వినియోగపాలసీ, భూముల రీసర్వే చేపట్టి శాశ్వత ప్రాతిపదికన భూధార్ కార్డుల అందజేత వంటి పలు సిఫార్సులతో ధరణి కమిటీ ముసాయిదా నివేదికను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి అందచేసింది.
ఇటీవల సంభవించిన వరదల వలన పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు హామీ ఇచ్చారు. వరి పంట సాగు చేసి వరదల వలన పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి పదివేల రూపాయలు అందిస్తాము కాబట్టి రైతులు అధైర్యపడవద్దు అని ఆయన కోరారు. ఇందుకు సంబంధించి ఏలూరు సీ.ఆర్. రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో వరద బాధితులు, వరదలకు నష్టపోయిన రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నెల 17వ తేదీ లోపు నష్టపరిహారంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
గతవారం రోజులుగా నిలకడగా ఉన్న పత్తి ధరలు ఈ రోజు అమాంతంగా పెరిగి క్వింటాలుకు రూ. 7800/- అయ్యింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకి రూ. 7800/-ల చొప్పున పత్తిని కొనుగోలు చేశారు. ఈ రోజు 131 క్వింటాళ్ళ విడి పత్తిని రైతులు జమ్మికుంట మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. కనిష్ట ధర రూ. 7400/-, గరిష్ట ధర రూ. 7800/-లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి గింజలకు, పత్తి బేళ్లకు గిరాకీ పెరిగిన కారణంగానే పత్తి ధరలు పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తాజాగా రైతులకు శుభవార్త అందించింది. రైతులకు ఆధార్ తరహాలో ఐడి కార్డులను జారీ చేయాలంటూ కేంద్రం నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయరంగాన్ని డిజిటలైజ్ చేసే లక్ష్యంతో అక్టోబర్ నెల నుంచి వీటిని జారీ చేయనున్నారు. దానిని పైలెట్ ప్రాజెక్టుగా ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో అమలు చేయడం జరిగింది. మరో 19 రాష్ట్రాలలో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు రాష్ట్రాలు కూడా అంగీకరించాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ స్కీములు, కనీస మద్దతు ధరకు పంటల అమ్మకం, కిసాన్ క్రెడిట్ కార్డు వంటి వాడకాలలో ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
భారీవర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రతిరైతుకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గంలో వర్షాల కారణంగా ముంపుకు గురైన పంటలను మంత్రి పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి, ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అధిక వర్షాల కారణంగా వ్యవసాయ, ఆక్వా రంగాలకు తీవ్ర నష్టం జరిగిందని ఈనెల 10లోగా పంట నష్టం లెక్కించి, అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారని మంత్రి అన్నారు. ఈ క్రాప్తో సంబంధం లేకుండా పంట నష్టం జరిగిన ప్రతిరైతును ఆదుకుంటామని మంత్రి అన్నారు.
రైతు రుణమాఫీ గురించి ఎన్నికలలో వాగ్దానం చేసిన విధంగానే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు మూడు విడతలలో రెండులక్షల రూపాయల వరకు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అర్హులైనా రుణమాఫీ కాని రైతుల వివరాలను సేకరించి, త్వరలోనే వారికి కూడా రుణమాఫీ వర్తింప చేసేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇకపోతే రైతుబంధు విషయంలో ప్రజలకు ఇప్పటికీ అపోహలు ఉన్నాయి కాబట్టి పంటలు సాగు చేసిన రైతులకు, కౌలు రైతులకు, సాగులో ఉన్న భూమికీ రైతుబంధు పథకం వర్తింపజేసేలా విధివిధానాలు రూపొందిస్తున్నామని మంత్రి తెలియజేశారు.
ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వరద సాయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రూ. 3,300 కోట్లు విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులు విడుదల చేసినట్లు ప్రకటించింది. గత రెండు రోజులుగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్తోపాటు కేంద్ర బృందం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే.
దేశంలో పెరుగుతున్న జనాభాకు కావాల్సిన ఆహార భద్రతను కల్పిస్తూ… మారుతున్న వాతావరణాలకు అనుగుణంగా పరివర్తన చెందే సామర్థ్యాలను భారత్ వ్యవసాయ రంగం కలిగి ఉందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ అన్నారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో రెండు రోజుల పాటు సమున్నతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమున్నతి ఎఫ్పీఓ (రైతు ఉత్పత్తుల సంఘం)-2024 సదస్సును మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మన శీతోష్ణస్థితి మార్పులను తట్టుకోగలిగే సాగు కోసం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, సమగ్ర వ్యవసాయ రంగానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నాబార్డ్ సీజీఎం భవాని శంకర్ మాట్లాడుతూ… దేశంలో సుస్థిర వ్యవసాయ విధానాలు పాటించేలా చేసేందుకు, భారతీయ వ్యవసాయ క్షేత్రాల నుంచి ప్రపంచ స్థాయి ఉత్పత్తులను విపణిలోకి తీసుకెళ్లడం, సుస్థిర, శీతోష్ణస్థితి అనుకూల ఎఫ్పీఓల నిబంధనలపై నాబార్డ్ పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎన్ఏఎఫ్పీఓ)తో కలిసి సమున్నతి ‘భారత్ ఎఫ్పీఓ ఫైండర్’…. జాతీయ వేదికను ప్రారంభించారు. భారత్ ఎఫ్పీఓ ఫైండర్ సుస్థిర వ్యవసాయానికి ఎంతో తోడ్పడుతుందని సమున్నతి వ్యవస్థాపకుడు, సీఈఓ అనిల్ కుమార్శర్మ, డైరెక్టర్ ప్రవేశ్ శర్మ చెప్పారు.
కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, ప్రాంతీయ భాషలలో వివరాలు తెలియచేసి, అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచే పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. అందుకు సంబంధించి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అందించిన వివరాలు…
వ్యవసాయ విద్యను బలోపేతం చేసేందుకు రూ. 2,291 కోట్లతో భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తారు. వ్యవసాయ విద్యలో ప్రకృతిసాగు, వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగే వంగడాలను రూపొందించే విధానాలకు చేయూతనిస్తారు.
ఆహారం, పశువుల దాణాలకు పనికొచ్చే పంటల జన్యు మూలాలను మెరుగుపరుస్తారు. పప్పుదినుసులు, నూనెగింజల పంటలు మరింత దిగుబడినిచ్చేలా మెరుగుపరుస్తారు. పురుగులు, చీడపీడల నివారణపై పరిశోధనలు నిర్వహిస్తారు.
పాడి పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచి, వాటి ఉత్పాదకత పెంచేందుకు వీలుగా పశువుల ఆరోగ్య నిర్వహణ, పశువైద్య విద్యకి ప్రాధాన్యమిస్తారు.
ఉద్యాన పంటల సాగును సుస్థిరంగా మార్చేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వాతావరణానికి తట్టుకొని నిలబడగలిగే పంటలను ప్రోత్సహిస్తారు. కూరగాయలు, పూలు, పండ్లు, పుట్టగొడుగుల సాగుకు చేయూతనిస్తారు.
కృషి విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేయడం ద్వారా స్థానిక భాషల్లో రైతులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తారు. వీటికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను అందుబాటులో ఉంచుతారు.
దేశవ్యాప్తంగా ఉన్న సహజ వ్యవసాయ వనరులను పరిరక్షిస్తారు. దాని కింద రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, భూగర్భ జలాలను సంరక్షిస్తారు.
డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ పథకం కింద రైతుల వివరాలు నమోదు చేస్తారు. భూముల పట్టాల రిజిస్ట్రీని నిర్వహిస్తారు. సాగు చేసిన పంటల వివరాలు, జియో స్పేషియల్ డేటా, కరవులు, వరదల పర్యవేక్షణ, వాతావరణ/శాటిలైట్ డేటా, భూగర్భ జలాలు, ఉపరితల జలాల లభ్యత సమాచారాన్ని సేకరించి రైతులకు అందుబాటులో ఉంచుతారు. పంట భూముల స్థితిగతులు, దిగుబడుల అంచనాలు, పంట రుణాలు, ఏఐ, బిగ్డేటా లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కొనుగోలుదారులతో రైతులను అనుసంధానం చేయడం, మొబైల్ ఫోన్ల ద్వారా రైతులకు అవసరమైన కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవడం లాంటి కార్యక్రమాలు చేపడతారు. ఆధార్ తరహాలో 11 కోట్ల మంది రైతులకి డిజిటల్ గుర్తింపునిస్తారు.
భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరద నీటిని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నిల్వ చేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండడంతో గేట్లు ఎత్తి, నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఆ నీటిని వీలైనంత వరకు ఎత్తిపోయాలని, రోజుకు ఒక టి.ఎం.సి తగ్గకుండా నంది, గాయత్రి పంప్ హౌస్ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లను నింపాలని మంత్రి సూచించారు. మిడ్మానేరు, లోయర్ మానేరు డ్యామ్తో పాటు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ వరకు జలాశయాల్లోకి కూడా నీటిని ఎత్తిపోయాలని మంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలో భారీవర్షాలు, వరదల నేపథ్యంలో పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టొద్దని, రైతులకు అండగా నిలవాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు కోరారు. వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్యశాఖ కాల్సెంటర్లను కొనసాగించాలని, పశువులు మృత్యువాత పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో పెసలును మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు శుక్రవారం నుంచి మార్క్ఫెడ్ ద్వారా ఏడు జిల్లాల్లో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, నారాయణపేట, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాలలో వీటిని ప్రారంభిస్తామన్నారు. గురువారం సచివాలయంలో ఆయన పెసర సాగుపై సమీక్ష నిర్వహించారు. మార్క్ఫెడ్ ఎండీ వి. శ్రీనివాస్రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ”రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్లో 64,175 ఎకరాలలో ఈ పంట సాగయింది. మొత్తం 17,841 టన్నుల వరకు దిగుబడి రావచ్చని అంచనా. పెసర సాగు అధికంగా ఉన్న ఏడు జిల్లాల్లో తొలివిడతగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. కేంద్రం నిర్దేశించిన విధంగా క్వింటాలుకు రూ. 8,682 మద్ధతు ధరతో మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తుంది. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించి పంటకు మద్దతు ధర పొందాలి” అని మంత్రి కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశంతో జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ చిన్ననీటి వనరుల విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెరువులను సమీపంలోని నదులు, రిజర్వాయర్ల జలాలతో నింపేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నారు.
రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తేనే సెస్ తొలగిస్తామని స్పిన్నింగ్, జిన్నింగ్ వ్యాపారులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జౌళి శాఖామంత్రి సవిత స్పష్టం చేశారు. రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తి పంటను కొనుగోలు చేయాలని కోరుతూ సీసీఐ, కేంద్రానికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. పత్తి దిగుబడుల పెంపు, వ్యర్థాల నిర్వహణ, నూతన వంగడాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లర్లు, అచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో తగిన చర్యలు చేపట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు స్పష్టం చేశారు.
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తూంది. కానీ ఆ వ్యయాన్ని తగ్గించేందుకు రైతులు కూడా పీయం కుసుమ్ యోజన కింద సౌర విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసుకుని, సౌర పంపు సెట్లను ప్రోత్సహించాలని, రైతులు సుస్థిర అభివృద్ధిపై అధికారులు దృష్టిసారించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. సేంద్రియ వ్యవసాయంపై ప్రధానంగా దృష్టి సారించాలని, లేదంటే మితిమీరి వాడుతున్న రసాయనిక ఎరువుల వల్ల భూమి నిస్సారమయ్యే ప్రమాదం ఉందని హనుమకొండ కలక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా గవర్నర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి వనరులవారీగా నీటి వినియోగదారుల సంఘాలకు త్వరలోనే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఎన్నికలు జరగకపోవడంతో పూడికతీత పనులు, మరమ్మత్తులు, కాలువ గట్ల బలోపేతం వంటి క్షేత్రస్థాయి ముఖ్యమైన పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే నీటి తీరువా వసూలు కూడా ఆగిపోయింది. ఇప్పుడు సాగునీటి సంఘాలకు తిరిగి ఊపిరిలూదడం ద్వారా నీటి వనరుల సంరక్షణ, నిర్వహణకు ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి, ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ప్రధాని, ఆర్థికమంత్రి, జలశక్తి మంత్రులతో పలు దఫాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చల అనంతరం ఇవాళ్టి క్యాబినెట్ భేటీలో కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టుకు అవసరమైన నిధులన్నీ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే పెండింగ్ నిధులనూ త్వరలోనే ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది.
ఆయిల్పామ్ పంటను పెద్ద ఎత్తున సాగు చేయిస్తామని, రైతులను అన్నివిధాలా ప్రోత్సహిస్తామని, పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఆయిల్ పామ్ కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. 2024-25లో లక్ష ఎకరాల లక్ష్యాన్ని కంపెనీలకు నిర్దేశిస్తే కంపెనీలు కేవలం 12,488 ఎకరాల్లోనే ఆయిల్ పామ్ పంటను వేయించాయి. లక్ష్యసాధన కోసం ప్రభుత్వం కంపెనీలకు సహకరిస్తున్నప్పటికీ కంపెనీల నిర్లక్ష్యం కొనసాగుతుంది. కంపెనీల పనితీరులో మార్పు రాకపోతే ఒప్పందాలను రద్దు చేసి ఇతరులకు ఇస్తామని వ్యవసాయశాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంపెనీలను హెచ్చరించారు.
టమాట ధరలు తగ్గుతున్న నేపథ్యంలో, ధరల మద్దతు పథకం కింద టమాట రైతులని ఆదుకునేందుకు గాను ఈ రోజు నుంచి అనంతపురం మార్కెట్లో టమాట సేకరణ ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. సేకరించిన టమాటాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ రైతు బజార్లలో అమ్మేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. టమాట ధరల తగ్గుదలపై మార్కెటింగ్ శాఖ అధికారులు, జిల్లా సంయుక్త కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
అర్హులై ఉండి రేషన్ కార్డు లేక, ఇతర కారణాల వలన రుణమాఫీ వర్తించని రైతుల వివరాల నమోదుకు ‘రైతు భరోసా పంట రుణమాఫీ యాప్’ ను తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించింది. ఈ యాప్ను అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, డివిజన్, మండల అధికారులు, విస్తరణ అధికారులకు పంపించింది. వారు రుణ మాఫీ వర్తించని రైతుల ఇళ్ళకు వెళ్ళి క్షేత్రస్థాయి సమాచారం సేకరించి యాప్లో నమోదు చేయాలనే మార్గదర్శకాలను వ్యవసాయశాఖ జారీ చేసింది. మంగళవారం నుంచి సర్వే ద్వారా యాప్లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది.
అన్నదాతలకు ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు ఆదుకోవాలన్నా, పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్నా, మద్దతు ధర లభించాలన్నా ఈ-పంట సమాచారం తప్పనిసరి కాబట్టి రైతులు తాము సాగు చేసిన పంటల వివరాలను వ్యవసాయ, ఉద్యానాధికారుల వద్ద నమోదు చేసుకోవడంలో అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ అధికారులు రైతులకు తెలియచేశారు. 2024-25 ఖరీఫ్ సీజనుకు సంబంధించి రైతులు సాగు చేసిన పంటల సమాచారాన్ని వీఏఏలు, వీహెచ్ఏలు మరో ఇరవై రోజులలో నమోదు చేయాలి. గడువు మీరితే యాప్లో సమాచారం స్వీకరించక సాగుదారులు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
పోలవరం ఆలస్యమైతే మరో సీజన్ కోల్పోతాము కాబట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కోరారు. ఢిల్లీలోని శ్రమ శక్తి భవన్లో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంథ్రేఖర్, రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కలిసి పోలవరంపై సుమారు 50 నిమిషాలు కూలంకషంగా చర్చించారు.
రుణమాఫీకి అన్ని అర్హతలు ఉండి… మాఫీ కాని రైతులకు న్యాయం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. రేషన్ కార్డులు లేకపోవడం, ఆధార్ కార్డుల్లో తప్పలుండడం, బ్యాంకు, ఆధార్ వివరాల్లో తేడాలుండడం, పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోవడం, అసలు – వడ్డీ లెక్కల్లో తేడాలు ఉండడం కారణంగా చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని గుర్తించి, స్పెషల్ డ్రైవ్కు శ్రీకారం చుట్టింది. ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టే బాధ్యతను మండల వ్యవసాయ అధికారులకు అప్పగిస్తూ వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ అధికారులు రైతుల ఇంటింటికి తిరిగి ఫిర్యాదులు స్వీకరించాలని, అవసరమైన చర్యల గురించి రైతులకు వివరించాలని డైరెక్టర్ గోపి ఆదేశాలు జారీచేశారు.
పంటలను ఆశిస్తున్న చీడపీడలను గుర్తించి త్వరితగతిన నివారణ సలహాలు, సూచనలు అందించేలా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ DPPQS, ICAR శాస్త్రవేత్తల సహకారంతో నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్ (NPSS) మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఆడిటోరియంలో గురువారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతులమీదుగా ఈ యాప్ను ఆవిష్కరించారు. రైతులు ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లోని స్టోర్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తమ పంటపొలాల్లో చీడపీడలను ఫొటోలు తీసి NPSS యాప్లో అప్లోడ్ చేయాలి. వెంటనే ఆ తెగుళ్ళను గుర్తించటంతోపాటు సమగ్ర సస్యరక్షణ సూచనలు రైతులకు అందుతాయి. దేశవ్యాప్తంగా చీడపీడల సమాచారం ఫరీదాబాద్లోని DPPQS కేంద్ర కార్యాలయంలో నిక్షిప్తం చేసి ఉండటం వల్ల ఏ ప్రాంతంలోని చీడపీడల గురించి అడిగినా వెంటనే సూచనలు అందుతాయి.
2014 నుండి 2019 వ సంవత్సరం వరకు ట్రాక్టర్లు, పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్లు మరియు వివిధ రకాల యంత్ర పరికరాలను రైతులకు రాయితీపై అందించడం వలన యాంత్రీకరణలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. మరలా తిరిగి రాయితీలను పునరుద్ధరించి రైతులను ప్రోత్సహించటానికి గాను వ్యక్తిగత రాయితీపై యంత్ర పరికరాలను అందివ్వాలని వ్యవసాయశాఖా మంత్రి అచ్చెం నాయుడు ప్రకటించారు. ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చే పరికరాల్లో కృత్రిమ మేథనూ జోడించాల్సి ఉంది. ఇప్పటికే ఆధునిక సాంకేతికతతో డ్రోన్లు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. వరి రైతులకు రాయితీపై టార్పాలిన్లు సరఫరా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
తెలంగాణా ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించి చేసిన వాగ్ధానాలకు అనుగుణంగా ఇప్పటికే రెండు విడతల రుణమాఫీని అమలు చేసింది. లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేసేందుకు రేపు నిధులను విడుదల చేయనుంది. మూడో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రేపు ఖమ్మం జిల్లా వైరా మండలంలో ప్రారంభించి, అర్హులైన రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమచేయనుంది. జులై 18న మొదటి విడత రుణమాఫీ, జూలై 30న రెండో విడత రుణమాఫీ, రేపు మూడో విడత రుణమాఫీ చేసి కేవలం నెల రోజులలో తాము చేసిన వాగ్ధానాన్ని తెలంగాణా ప్రభుత్వం నిలబెట్టుకొంటుంది.
రైతులందరికీ శుభవార్త. తొలివిడతగా ఈ నెల 18 వ తేదీ నాటికి అర్హులైన రైతులందరికీ లక్ష రూపాయల మేరకు రుణమాఫీ కానుంది. రుణ మాఫీకి రేషన్ కార్డు నిబంధన పెట్టారన్న అంశంపైన ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. పాస్ బుక్ ఆధారంగానే రైతు కుటుంబానికి రూ. 2 లక్షల పంట రుణ మాఫీ వర్తిస్తుందని చెప్పారు. కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.
తెలంగాణా ప్రభుత్వం పంటల రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 13 వరకు తీసుకున్న పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తుంది. రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్కార్డు ప్రామాణికం అని తెలిపింది. రుణ మాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయనున్నారు. రుణమాఫీ నగదును నేరుగా లబ్దిదారుల రుణఖాతాల్లోనే జమ చేస్తారు. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్ము విడుదల చేయనున్నారు. రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయబోతుంది. రైతు సమస్యలుంటే 30 రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
గత కొన్ని సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది రైతులు పాటిస్తున్న సుస్థిర వ్యవసాయానికి, అందుకు మార్గదర్శకంగా నిలిచిన ప్రకృతి వ్యవసాయ సంస్థకు ప్రతిష్ఠాత్మక గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ అవార్డు లభించింది. పోర్చుగల్లోని లిస్బన్లో ఏపీసీఎన్ఎఫ్ తరఫున రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక వైస్ఛైర్మన్ టి. విజయ్కుమార్, ప్రకృతి వ్యవసాయ మహిళా ఛాంపియన్ రైతు నెట్టెం నాగేంద్రమ్మ ఈ అవార్డును అందుకున్నారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు 2014-15లో అప్పటి సీయం చంద్రబాబు ఈ సంస్థను నెలకొల్పి నిధులు సమకూర్చారు. 2018లో యూఎన్ఈపీ అవార్డు సైతం ఈ సంస్థకు దక్కింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సహజ విధానాల ద్వారా సుస్థిర వ్యవసాయం సాధ్యమని నిరూపించినందుకు పోర్చుగల్కు చెందిన ప్రముఖ దాతృత్వ సంస్థ గుల్బెంకియన్ పౌండేషన్ తాజా పురస్కారాన్ని అందజేసింది.
2024-25 ఖరీఫ్ సీజనులో పప్పుధాన్యాల సాగు 50 శాతానికి పైగా పెరగటంపై కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఆనందం వ్యక్తం చేశారు. ఖరీఫ్ పంటల పరిస్థితిపై అధికారులతో సమీక్ష జరిపిన సందర్భంలో ఈ విషయాన్ని వెల్లడించారు. పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నాము కాబట్టి ఈ దిశగా రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పప్పుధాన్యాలలో ముఖ్యంగా కంది సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం… గడచిన వారాంతానికి పప్పుధాన్యాల సాగు 36.81 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఇది గత సంవత్సరం 23.78 లక్షల హెక్టార్లతో పోల్చుకుంటే 50 శాతం పెరుగుదల నమోదు అయ్యింది.
గోదావరి నదిపై కడుతున్న పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే ఉత్తరాంధ్రకు నీరు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందుకుగాను పురుషోత్తమ పట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా 2,500 క్యూసెక్కుల గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు అందిస్తామని అనకాపల్లి పర్యటనలో చంద్రబాబు అన్నారు. పోలవరం ఎడమకాలువ 214 కి.మీ. మేర నిర్మించాలి. ముందు 800 కోట్ల రూపాయలతో 93 కి.మీ. వరకు కాలువను నిర్మించుకుంటే 2.2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందివ్వటానికి అవకాశం ఉంది కనుక ఈ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు.
కృష్ణా బేసిన్లో ఎగువన కురుస్తున్న వర్షాలతో ఆలమట్టికి క్రమంగా వరద పెరుగుతూ ఉంది. బుధవారానికి ఆలమట్టి నీరు 84,645 క్యూసెక్కులకు చేరింది. ఇంకో 40 టి.యం.సీలు వస్తే గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలే అవకాశం ఉంది. నారాయణపూర్లో మరో 10 టి.యం.సీలకు మాత్రమే అవకాశం ఉంది. తుంగభద్రలోకి కూడా కొంత ప్రవాహం పెరిగింది. అయితే ఈ ప్రాజక్ట్ నిండటానికి మరో 80 టి.యం.సీలు అవసరం. గోదావరి బేసిన్లోని ప్రాజెక్ట్లలోకి నీటి ప్రవాహాలు నామమాత్రంగానే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజనులో 6.62 లక్షల క్వింటాళ్ళ విత్తనాలపై 309 కోట్ల రూపాయల రాయితీని రైతులకు అందించనుంది. ఇందులో 3.15 లక్షల క్వింటాళ్ళ వేరుశనగ, 95 వేల క్వింటళ్ళ పచ్చిరొట్ట విత్తనాలు, 2.29 లక్షల క్వింటాళ్ళ వడ్లు, 22,150 క్వింటాళ్ళ పప్పుధాన్య విత్తనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 3.50 లక్షల క్వింటాళ్ళ విత్తనాలు పంపిణీ చేశారు. గతంలోని రాయితి పథకాలను తిరిగి పునరుద్ధరిస్తారని రైతులు ఎదురు చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల ద్వారా వ్యవసాయ రంగానికి రూ. 2.64 లక్షల కోట్ల రుణాలు అందజేయనున్నారు. ఇందులో పంట రుణాల క్రింద 1.66 లక్షల కోట్లు అందజేయనున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కూడా రుణ లక్ష్యం గత సంవత్సరంతో పోల్చుకుంటే 26% పెంచారు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, మత్స్య, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయంలో మౌలిక సౌకర్యాల కల్పనకు రు. 32,600 కోట్ల రుణాలు అందించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన 2024-25 రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
ఎన్నడూలేని విధంగా తెలంగాణా ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో 60 వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికే కేటయించడానికి రెడీ అవుతున్నది. ఈ సొమ్మును ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడానికి, పంటల బీమాకు పెద్ద పీట వెయ్యడానికి, రైతు బీమాకు సంబంధించి ప్రీమియం బాధ్యత సర్కారు వహించడానికి, ఉద్యాన పంటల సాగులో కొత్త ఊపును తేవడానికి కేటాయించడానికి సిద్ధం అవుతున్నారు. వీటన్నింటితో పాటు పామాయల్ సాగు కోసం వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయడం కూడా జరిగింది. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి తగిన ప్రాముఖ్యత ఇవ్వడానికి సిద్ధం అయ్యింది. ఇప్పటికే వ్యవసాయ శాఖ తన ప్రాధాన్యతలను ఆర్థిక శాఖకు తెలియచేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో డ్రిప్పు ఇరిగేషన్ సౌకర్యాలకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు పరచిన రాయితీలను గత ప్రభుత్వం రద్దు చేసినందువలన రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. దాని ప్రభావం పంట దిగుబడులు మీద కూడా పడి పంట దిగుబడులు తగ్గాయి. మరలా వ్యవసాయరంగానికి పూర్వ వైభవం రావాలంటే డ్రిప్పు ఇరిగేషన్కు గతంలో అందించిన 90 శాతం సబ్సిడీని మరలా ప్రస్తుత ప్రభుత్వం పునరుద్ధరించే ఆలోచన చేయాలని తె.దే.పా. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు సీతారామయ్య, విజయబాబు తదితరులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖామంత్రి అచ్చెంనాయుడిని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందచేసే రైతు భరోసాను ఎన్ని ఎకరాలకు అందివ్వాలనే దానిపై రైతులతో సమావేశాలు నిర్వహించి నిర్ణయించాలని తెలంగాణా రాష్ట్ర మంత్రి వర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో రోజుకు మూడు సమావేశాలు నిర్వహించాలని ప్రణాళిక వేసుకున్నారు. స్థిరాస్థి, బంజరు, ఇతర సేద్య యోగ్యం కాని భూములకు రైతు భరోసా సాయం ఇవ్వరాదని పేర్కొంది. రైతుల అభిప్రాయాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.
నూజివీడు మార్కెట్ యార్డు ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్థసారథి మామిడి రైతులు, వ్యాపారులు, అధికారులు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చ జరిగింది. వచ్చే మామిడి సీజనుకు నూజివీడులో మామిడి మార్కెట్ యార్డు ఏర్పాటుకు, అభివృద్ధికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని, ఫ్రూట్ కవర్లు అందించటానికి చర్యలు తీసుకుంటామని, మామిడి రైతులకు అవసరమయిన అన్ని సౌకర్యాలు కల్పించటానికి, నూజివీడు మామిడికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకు రావడానికి తగిన చర్యలు వ్యవసాయ శాఖ మంత్రితో సంప్రదించి తీసుకుంటామని రైతులకు మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం 11-12-2018 నుంచి 9-12-2023 మధ్య తీసుకున్న అప్పులకే రుణమాఫీ వస్తుందని తెలంగాణ రైతుసంఘం ఉపాధ్యకక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. కాబట్టి బ్యాంకర్లు రైతులను అప్పులు చెల్లించాలని, రెన్యూవల్ చేసుకోవాలని, బుక్ అడ్జెస్ట్మెంట్ చేసుకోవాలని రైతులపై వత్తిడి తేవద్దు అని బ్యాంకర్లకు మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 15 లోపు ఏ ఒక్క రైతూ బ్యాంకు రుణాలను చెల్లించవద్దు. ఒకవేళ చెల్లించి మరలా రుణం తీసుకుంటే అవి కొత్త రుణాలుగా మారతాయి. కాబట్టి కొత్త రుణాలకు రుణమాఫీ వర్తించదు కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకర్లు పెట్టే ఒత్తిడిని పట్టించుకోవద్దని మల్లారెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు.
ఐ.ఏ.ఎస్. అధికారులు సచివాలయంకే పరిమితం కాకుండా అవకాశం ఉన్నప్పుడు పొలాలకు వెళ్ళి రైతులతో కలిసి రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని బుధవారం వెలగపూడి సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖలు, జలవనరుల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఐ.ఏ.ఎస్.లను ఆదేశించారు. పాతవిధానంలోనే రైతు భాగస్వామ్యంతోనే బీమా అమలు చేయాలని, పంట కాలువలలో గుర్రపుడెక్క తొలగించి పూడిక తీయాలని, సాగునీటికి కొరత లేకుండా చూడాలని, వృధాగా పోయే గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు అందించాలని, ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను నడిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
రాజేంద్రనగర్లోని గ్రామీణాభివృద్ధి సంస్థలో తెలంగాణాలోని అన్ని జిల్లాల వ్యవసాయ, ఉద్యాన అధికారులతో వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పెండింగులో ఉన్న రైతుబీమా క్లెయిమ్ల పరిష్కారం గురించి, ఆయిల్పామ్ ప్రాజెక్ట్పై క్షేత్రస్థాయిలో సమన్వయం గురించి చర్చించడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా పంటరుణాల మాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలకు వచ్చే మూడు నెలలలో 50 వేల నుంచి 60 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించనుందని మంత్రి తెలియజేశారు. ఎరువుల నాణ్యత, విత్తన నాణ్యత, భూసార పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన సమీకృత ప్రయోగశాలల భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు.
ఐదేళ్ళ తరువాత గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు పారుతున్నాయి. ఇందుకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం కుండి కాలువ నుంచి 16 పంపుల ద్వారా 5600 క్యూసెక్కుల నీరు ఈరోజు విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న భారీవర్షాల వలన నీటి ప్రవాహం పెరుగుతున్నందువలన నీటిని ఈ రోజు విడుదల చేయడం జరిగిందని అధికారులు తెలియచేశారు. గోదావరి జలాలు కృష్ణాడెల్టాలో పారితే వరి దిగుబడులు పెరుగుతాయని 2016 ఖరీఫ్ సీజనులో ఋజువయ్యింది. కాని 2019 నుంచి 2023 వరకు గోదావరి జలాలు లేక వరి దిగుబడులు తగ్గాయి. మళ్లీ ఈ ఏడాది పట్టిసీమ నీరు అందుతుందనే వార్త రైతుల్లో ఆనందం నింపుతోంది.
గోదావరి ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీరు పెరుగుతుండటం వలన ఎత్తిపోతల పథకాల వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపి పెరుగుతూ ఉంది. సీతానగరం మండలంలోని గోదావరి ఎడమ గట్టున పురుషోత్తమపట్నం, పుష్కర, తొర్రిగడ్డ, సత్యసాయి తదితర ప్రాజెక్టుల వద్ద సోమవారం నాటికి నీటిమట్టం 14.2 మీటర్లకు చేరింది. మోటార్లు ఆన్ చేస్తే నీరు విడుదలయ్యేలా ప్రవాహం చేరింది. జులై రెండో వారానికల్లా ప్రాజెక్టుల నుంచి మెట్ట ప్రాంతానికి సాగు నీరు విడుదల చేసేలా కార్యాచరణ ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణా రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత రైతులకు వరప్రదాయిని అయన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు సోమవారం తెరుచుకున్నాయి. తెలంగాణ మరియు మహారాష్ట్రకు చెందిన ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో బాబ్లీ ప్రాజెక్ట్కు ఉన్న 14 గేట్లను ఎత్తివేశారు. గేట్లు ఎత్తిన సమయంలో ప్రాజెక్ట్లో 0.2 టి.యం.సీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభమైన జులై 1వ తేదీ నుంచి బాబ్లీ గేట్లను తెరచి అక్టోబరు 28వ తేదీన మూసి వేస్తారు. ఈపరిణామంతో నిజామాబాద్ రెంటల్ మండలం కందకుర్తి, త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సాగు భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్లతో పాటు భూసమస్యల పరిష్కార భాద్యతలను తహసీల్దార్లు, సంయుక్త సబ్ రిజిస్ట్రార్లు నిర్వహిస్తున్నారు. అయితే రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ల సేవలతోనే వారి సమయం గడచిపోతుంది. కాబట్టి భూసమస్యల పరిష్కారంలో వేగం తగ్గిపోతుంది. ఈ క్రమంలో మండల స్థాయిలో పనిని విభజించి సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ధరణి రిజిస్ట్రేషన్లను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇది అమలయితే తహసీల్దార్లకు మాత్రమే ఉన్న ధరణి లాగిన్ను డిప్యూటీ తహసీల్దార్లకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
నరేంద్రమోడీ మూడవసారి ప్రధానమంత్రి అయిన తరువాత మొదటిసారిగా ఏర్పాటు చేసిన ‘మన్-కీ-బాత్’ కార్యక్రమంలో అరకు కాఫీ గురించి ప్రస్తావిస్తూ అరకు కాఫీ అద్భుతం అన్నారు. దేశీయంగా తయారవుతున్న అనేక ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి అరకు కాఫీ రుచి గురించి ప్రపంచ దేశాలు సందర్శిస్తున్న సందర్భంలో విదేశీ ప్రతినిధులతో ప్రధాని నరేంద్రమోడి ప్రస్తావిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీని విస్తృతంగా ఉత్పత్తి చేస్తున్నారు. మంచి రుచి, సువాసనకు అరకు కాఫీ పెట్టింది పేరు. సుమారు లక్షాయాభైవేల గిరిజన కుటుంబాలు మమేకమయిన మన అరకు కాఫీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొండం మన అదృష్టం. ఇప్పటికే అరకు కాఫీకి ఎన్నో గ్లోబల్ అవార్డులు లభించాయి. 2016లో ఒకసారి విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి అరకు కాఫీ రుచి చూసే అవకాశం దొరికింది. రుచి అద్భుతంగా ఉంది అని మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అరకు కాఫీ గురించి ప్రధాని మోడి ఎక్స్లో చేసిన పోస్టుపై స్పందించి, ప్రధానితో కలిసి మరోసారి అరకు కాఫీ రుచిని ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులలో సుదీర్ఘ కాలం పాటు రైతులు నిరసనలు తెలియచేసిన పరిస్థితులలో ప్రభుత్వం దిగివచ్చి రైతుల కోరిక మేరకు ఆ నల్ల చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు హామీ ఇచ్చి నిరసనలను విరమింప చేశారు. కాని ఇప్పటి వరకు ఏలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రధాని ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సంయుక్త కిసన్ మోర్చా డిమాండ్ చేసింది. ఇందుకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల రైతుల మద్దతు కూడగట్టేందుకు చేపట్టిన యాత్ర నిన్న హైదరాబాదు చేరుకున్న సందర్భంలో నిన్న సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. నిరసనలో పాల్గొన్న రైతులపై కాల్పులు జరిపిన సందర్భంలో అక్కడ లభించిన తూటాలను రైతు నాయకుడు సుర్జీత్సింగ్ ప్రదర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రంలో ఇచ్చిన హామీలలో భాగంగా పంట రుణమాఫీ గురించిన మార్గదర్శకాలను మూడు, నాలుగు రోజులలో విడుదల చేయనున్నారు. కుటుంబానికి రెండు లక్షల రూపాయలకు మించకుండా పంట రుణాలను మాఫీ చెయ్యాలనే యోచనలో ఉన్నారు. బంగారం తాకట్టుగా పెట్టి రుణాలు తీసుకున్న రుణాలు ఈ పరిధిలోకి రావని స్పష్టంచేశారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ మార్గదర్శకాల ప్రకారం తీసుకున్న పంటరుణాలు మాత్రమే మాఫీ అవుతాయి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీడుభూములకు గోదావరి జలాలను అందించటమే మా ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేస్తాము. మీ తాతముత్తాతలకు సంబంధించిన భూమికి ఇచ్చే పట్టాదారు పుస్తకాలపై గత ప్రభుత్వం జగన్ బొమ్మను వేసుకొంది. మేము అలా చేయము. ఎవరి బొమ్మ వేయం. అన్ని పట్టాదారు పాస్ పుస్తకాలు మారుస్తాం. రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తాం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారు రైతులకు హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షలకు పైబడి ఉన్న కౌలు రైతుకు రైతు భరోసా కోసం.. సబ్ కమిటీలో విధివిధానాలు ఖరారు చేసి, కౌలు రైతుల గుర్తింపుకు సంబంధించిన చర్చ జరుగుతుంది.
ఈ సీజన్ నుంచే కౌలు రైతులకు కూడా రైతుభరోసా (రైతుబంధు) అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై క్యాబినెట్ సబ్కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరాకు ఏడాదికి రూ. 15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్నది. అయితే, కౌలు రైతులను ఏ విధంగా గుర్తిస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులు ఉండగా, కౌలు రైతులు 25 లక్షల పైబడి ఉంటారని కౌలురైతు సంఘాల నేతలు చెప్తున్నారు.
2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన కౌలు రైతు చట్టంలో పొందుపరచిన విధివిధానాల ప్రకారం కౌలు రైతులను గుర్తిస్తారు. కౌలు రైతుకు ఇచ్చిన భూమి విస్తీర్ణంకు సంబంధించి కౌలుదారు మరియు యజమాని ఇద్దరూ ఒప్పంద పత్రంపై సంతకాలు చేయాలి. ఆ ఒప్పందం గ్రామసభ ఆమోదం పొందాలి.
ఇప్పటి వరకు భూమి కౌలు అనేది కేవలం నమ్మకాల మీదనే ఉంటుంది. కాని రైతు భరోసా పొందాలంటే నమ్మకం కంటే చట్టబద్ధం ముఖ్యం కాబట్టి కౌలుదారు యజమాని నుంచి చట్టపరంగా భూమిని కౌలుకు తీసుకుని ఒప్పంద పత్రంపై ఇరువురూ సంతకాలు చేసి ఒప్పందపత్రానికి చట్టభద్రత కల్పించాలి.
ఇందుకు సంబంధించిన విధివిధానాల కొరకు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. జూలై 15 లోపు పూర్తి సమాచారంతో నివేదిక ఇవ్వాలని సబ్ కమిటీని ఆదేశించింది. కాబట్టి త్వరలో సబ్ కమిటీ పని మొదలు పెట్టబోతుంది.
”ఏంటి బాబాయ్ ఏదో దిగులుగా వున్నావ్?” అడిగాడు సుబ్బారావు రామయ్యను. ”ఏమి చెప్పమంటావు నాయనా మా అబ్బాయికి పెళ్లి చేసి నాలుగేళ్లు అయింది. ఇప్పటి వరకు నా కోడలికి కడుపులో కాయ కాయలేదు. అసలు నాకు మనవణ్ణో లేదా మనవరాలినో చూసే భాగ్యం ఉందో లేదో తెలియడం లేదు. అదే నా బాధ! ఇప్పటికే నా కోడలికి వైద్య పరీక్షలు జరిగాయి. ఆమెలో ఏ లోపం లేదని డాక్టర్లు చెప్పారు. ఇక మా అబ్బాయి తనలో ఏ లోపం లేదని అంటున్నాడు. ఏం చేయాలో తెలియడం లేదు! బస్తీకి వెళ్లి పెద్ద డాక్టర్ను కలిసి రమ్మని చెప్పినా వాడు నా మాట వినడం లేదు అని నిట్టూర్చాడు.
”అయితే నేను ఒక సలహా ఇస్తాను పాటిస్తావా బాబాయ్! ఇప్పుడు కడక్నాథ్ అనే కారు నలుపు కోళ్లు వస్తున్నాయి. వీటి మాంసంలో ఇతర కోళ్లు ముఖ్యంగా మన నాటుకోళ్ల మాంసం కంటే అనేక పోషకాలు ముఖ్యంగా ఇనుము చాలా ఎక్కువగా వుంటాయట! ఈ మాంసంలో పురుషుల లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఔషధ లక్షణాలు కూడా ఉంటాయని మొన్న ఒక సైంటిస్ట్ చెబితే విన్నాను. ఎలాగూ మనం వారంలో రెండు మూడు సార్లు బ్రాయిలర్ చికెన్ వండుకుంటున్నాం కదా! ఇప్పటి నుండి వారానికి 4-5 సార్లు రెండు నెలల పాటు కడక్నాథ్ కోడి మాంసాన్ని ఇంట్లో వండించి మీ వాడితో తినిపించు. ఇది అందరికీ మంచిదే ఈ వయస్సులో నీకు కూడా.. అంటూ నవ్వాడు సుబ్బారావు. కావాలంటే మరికొంత సమాచారం తెలుసుకొని నీకు చెప్పగలను. అయినా కొంత ఖరీదైనప్పటికీ దీని ప్రత్యేక రుచి, సువాసన, పోషక విలువలను గుర్తిస్తే ఈ ధర అంత ఎక్కువేమీ కాదని చెప్పగలను.
నాలుగు నెలల తర్వాత – స్వీట్ ప్యాకెట్తో రామయ్య సుబ్బారావు ఇంటికి వచ్చి ‘ఒరేయ్ సుబ్బారావు నువ్వు చెప్పిన చిట్కా బాగా పనిచేసినట్లుంది. మా కోడలు మొన్న లేడీ డాక్టర్తో పరీక్షలు చేయించుకుంది. మా కోడలకు ఇప్పుడు మూడో నెల! ఇప్పుడు మా కోడలేకాక అందరమూ మునుపటి కన్నా అన్ని విధాలా ఎక్కువ ఆరోగ్యంగా, బలంగా ఉన్నాము! అంతా నువ్వు చెప్పిన కడక్నాథ్ కోడి మాంస మహత్యం మరి! అని నాకు స్వీట్ ప్యాకెట్ ఇస్తూ ఇవాళ మా కోడలు కడక్నాథ్ చికెన్ బిర్యాని వండింది అంటూ సుబ్బారావును భోజనానికి రమ్మని ఆహ్వానించి వెళ్ళాడు!
మానసిక, శారీరక వత్తిళ్ల వల్ల ఇటీవల యువతలో లైంగిక సామర్థ్యం సన్నగిల్లుతోందని వైద్య అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. వత్తిళ్లు తగ్గించుకొని, మంచి పోషణ ద్వారా తమ శరీర పుష్టిని, వ్యాధినిరోధక శక్తిని, లైంగిక పటిష్ఠతను పెంచుకొనుటలో కడక్నాథ్ కోళ్ల ఉత్పత్తుల పాత్రను కూడా గుర్తించాలి.
ఈ కడక్నాథ్ కోళ్ల ప్రత్యేకత, పెంపకం, మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం! కారు నలుపు రంగులో వుండుట వల్ల వాటిని కాలిమసి కోళ్లు అని కూడా పిలుస్తారు. మధ్యప్రదేశ్లోని ధర్ మరియు ఘాబువా జిల్లాల నుండి ఇవి, ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ జాతి కోడిపిల్లలు, పెట్టలు, పుంజులు హైదరాబాదులో కూడా లభిస్తున్నాయి. వీటి పెరుగుదల వేగం, శరీర తూకం, గుడ్ల ఉత్పాదక సామర్థ్యం ఇతర బ్రాయిలర్ కోళ్లు, కొన్ని నాటుకోళ్ల కంటే కొంత తక్కువగా ఉంటుంది. ఈ కోళ్ల మాంసంతో పాటు గుడ్లలో కూడా ఉండే అదనపు పోషకాలు, కొన్ని ఔషధ ధాతువుల కారణంగా, వీటి మాంసం ధర, గ్రుడ్ల ధర కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఉత్పత్తి ఖర్చుతో పాటు గిరాకీలు పెరుగుట వల్ల ప్రస్తుతం బ్రతికిన కోడి ధర కిలోకి 500 నుండి 550 రూపాయలు, మాంసం ధర 1000 నుండి 1200 రూపాయలు, గ్రుడ్లు ధర 15-16 రూపాయల వరకు ఉంటున్నాయి.
వీటి చర్మం నల్లగా ఉండి, మాంసం, రక్తం ముదురు రంగులో అంత ఆకర్షణీయంగా కనిపించక పోవుట వల్ల క్రొత్త వినియోగదారుల్ని ఈ మాంసం ఆకర్షించుటలో వెనుకబడింది. అయితే ఒకసారి రుచి చూసిన తర్వాత ఏ అభ్యంతరమూ వుండదు. లేత గోధుమ రంగులో ఉండే వీటి గ్రుడ్ల పరిమాణం కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ అందులో 11.67 శాతం నాణ్యమైన మాంసకృత్తులు, ఇతర ముఖ్య పోషకధాతువులు ఎక్కువగానే ఉంటాయి.
కడక్నాథ్ కోళ్ల వెంట్రుకలు, చర్మం నల్లగా వుండుటకు మాంసము, రక్తము ముదురు రంగులో వుండుటకు వీటిలో ఎక్కువగా వుండే మెలనిన్ అనే నల్ల వర్ణ ధాతువుతో పాటు ఇతర మాంసాలలో కంటే సుమారు 10 రెట్లు ఎక్కువగా వుండే ఐరన్ కూడా కారణమని, వీటి వల్లనే ఇవి పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయని అనుభవజ్ఞులు, నిపుణులు చెబుతున్నారు. కడక్నాథ్ కోడి మాంసంలో అధికంగా ఉండే నల్లని మెలనిన్ పిగ్మెంట్ వల్ల బొల్లి (చర్మపు వ్యాధి) వ్యాధిగ్రస్తులకు ఇది బాగా ఉపయోగపడగలదు. కడక్నాథ్ జాతి కోళ్ల మాంసం తక్కువ క్రొవ్వు (0.73-2.8%), 18 రకాల ఎమైనో ఆమ్లాలు కలిగిన ప్రోటీన్స్ (25.47%), మరియు అతి తక్కువ కొలెస్టెరాల్ కలిగి గుండెకు ఆరోగ్య భద్రతను ఇస్తుంది. ఈ మాంసంలో ఉండే కొన్ని యాంటి ఆక్సిడెంట్సు మరియు ఇతర పోషకాల వల్ల వినియోగదారులలో రక్తపుష్టితో పాటు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతున్నదని అధ్యయనాలలో తెలిసింది.
కడక్నాథ్ కోళ్లు 22-25 వారాలకు యుక్త వయస్సుకు వస్తాయి. వీటిలో పెట్టలు 1.2 నుండి 1.5 కిలోలు, పుంజులు 1.8 నుండి 2.2 కిలోల వరకు తూకానికి, 5-6 నెలల వయస్సుకు వస్తాయి. ఇవి సంవత్సరానికి 110 నుండి 120 గ్రుడ్లను మాత్రమే ఉత్పత్తి చేయగలవు. ఇవి సుమారు 10 సంవత్సరాల వరకు బ్రతుకుతాయి. వీటిలో వ్యాధి నిరోధక శక్తి కొంత ఎక్కువే అయినప్పటికీ 1-3 రోజుల వయస్సులో రానిఖెట్ (మారెక్స్) వ్యాక్సిన్, 14-16 రోజుల వయస్సులో ఐ.బి.డి. వ్యాక్సిన్, 21-30 రోజులకు రానిఖెట్ వ్యాక్సిన్, మరల 35-40 రోజుల వయస్సులో ఐ.బి.డి. వ్యాక్సిన్ చేయించుట మంచిది.
నానాటికి వినియోగదారుల నుండి ఈ కడక్నాథ్ కోడి మాంసానికి పెరుగుతున్న గిరాకీ దృష్ట్యా శాస్త్రీయంగా ఫారాలలోనే కాక గ్రామీణ పెరళ్లలో కూడా వీటి పెంపకం మంచి లాభదాయకం కాగలదు. పండ్ల తోటలు, ఫారమ్ హౌస్లు, డెయిరీ మరియు జీవాల ఫారాల ఆవరణల్లో కూడా కడక్నాథ్ కోళ్ల పెంపకాన్ని చేపట్టవచ్చును. సాధారణంగా ఇతర కోళ్లకు పాటించే యాజమాన్య పోషణ పద్ధతులను పాటిస్తే సరిపోతుంది. నమ్మకమైన సరఫరా దారుల నుండి కొనుగోలు చేసిన కోడిగ్రుడ్లను పొదిగిస్తే 65 నుండి 70 శాతం వరకు పిల్లలు జన్మించగలవు. తొలుత 50 నుండి 100 కోడి పిల్లలతో వీటి పెంపకాన్ని ప్రారంభించి క్రమేపీ సంఖ్యను వేలకు పెంచుట మంచిది.
మార్కెటింగ్: మార్కెట్లోని ఇతర కోడి మాంసాల కంటే కడక్నాథ్ కోడి మాంసం ధర 3 నుండి 4 రెట్లు అధికంగా వుండటం, ఈ మాంసం రంగు ఆకర్షణీయంగా వుండకపోవడం మరియు ఎముకల బరువు ఎక్కువగా వుండుట వంటి కారణాల వల్ల మార్కెట్లో వినియోగదారులలో అవగాహన పెంచుటకు ప్రత్యేక ప్రచార వ్యూహాలను అమలు చేయాలి. నిపుణులు, అనుభవజ్ఞులతో వండించిన బిర్యానీలు, కూరలు, ఫ్రైలను ఎగ్జిబిషన్లు, విందులు, వినోద స్థలాలలో తక్కువ ధరకు విక్రయించి ప్రజలకు వీటి రుచిని అలవాటు చేయాలి. వంటల పోటీలలో కడక్నాధ్ చికెన్ మరియు గ్రుడ్లను ప్రవేశపెట్టవచ్చును. ప్రత్యేక డిస్కౌంట్సు, పండుగలు (జాతరలు, సంక్రాంతి, దసరా పర్వదినాలు) సందర్భాలలో నల్లని ఈ కోళ్లను డిస్కౌంట్స్తో విక్రయించి వినియోగవర్గాలను ఆకర్షించవచ్చును.
వ్యూహాత్మక శాస్త్రీయ బ్రీడింగు పద్ధతుల ద్వారా కడక్నాధ్ కోళ్ల పెరుగుదల వేగాన్ని శరీర బరువును గ్రుడ్ల ఉత్పత్తిని, మెరుగుపరచి వీటి లాభదాయకతను పెంచే కృషి చేయాలని మన విశ్వవిద్యాలయాలు పరిశోధనా సంస్థలను కోరుచున్నాను. అదేవిధంగా అంతర్గత సంపర్కం వల్ల గానీ, విచక్షణా రహిత క్రాస్ బ్రీడింగ్ వల్ల గానీ ఈ జాతి యొక్క సహజత్వం ఈ జాతి జన్యు స్వచ్ఛత నశించకుండా, జాతి అంతరించకుండా పరిరక్షించవలసిన అవసరం కూడా వుంది.
మన ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న గ్రామీణ పెరటి పరిశ్రమలో కడక్నాథ్ కోళ్లను ప్రవేశపెట్టి లబ్దిదారుల ఆదాయాలతో పాటు, వినియోగదారుల ఆరోగ్యాలను కూడా మెరుగుపరచవచ్చు.
మామిడిని సాగు చేసే రైతులు పూత ప్రారంభమైనప్పటినుండి పురుగులు తెగుళ్ల యాజమాన్యం మరియు పోషకాల యాజమాన్యంను సరైన సమయంలో చేస్తూ అధిక దిగుబడి మరియు నాణ్యమైన దిగుబడిని పొందటానికి ప్రయత్నం చేస్తున్నారు. కాని కోత అనంతరం తగిన శ్రద్ధ తీసుకోకపోవడం వలన తర్వాత సంవత్సరం దిగుబడిపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మామిడి కోత తర్వాత నిర్లక్ష్యం చేయకుండా రైతులందరూ సరైన యాజమాన్యం చేపట్టాలి.
మామిడి తోటల్లో కోత అనతరం తీసుకోవలసిన చర్యలు
1. కొమ్మ కత్తిరింపులు
మామిడిలో పూత రావటం అనేది వాతావరణంతో పాటు కొమ్మల వయస్సుపై కూడా ఆధారపడి ఉంటుంది. పూత వచ్చే సమయానికి కొమ్మలవయస్సు దాదాపు 4-5 నెలలు ఉండాలి. అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న కొమ్మలపై పూత రాదు. కాబట్టి కాయ కోత వెంటనే కత్తిరింపులు చేస్తే కొత్త చిగుర్లు పెరిగి పూత వచ్చేటప్పటికి కొమ్మల వయస్సు పూత రావటానికి అనువుగా ఉంటుంది.
కొమ్మ కత్తిరింపులను కాయ కోత చేపట్టిన నెల రోజుల తర్వాత మొదలు పెట్టాలి. కాయలు పెరిగిన పూత కాడలను తొలగించి అక్కడనుండి కొమ్మలను కనీసం 10-15 సెం. మీ. వెనక్కి కత్తిరించాలి. అలాగే బాగా కిందకు వేలాడిన కొమ్మలను తీసేయాలి. చెట్టు లోపలి భాగంలో అడ్డదిడ్డంగా ఒకదానిపై ఒకటిగా పెరిగిన కొమ్మలను తీసివేస్తే చెట్టు లోపల భాగాలలో గాలి, వెలుతురు ప్రసరణకు అనువుగా ఉంటుంది. అదేవిధంగా చెట్టు లోపల భాగంలో నిటారుగా పెరిగే 2-3 కొమ్మలను (గొడుగు కొమ్మలు) కత్తిరించాలి. కత్తిరింపులు చేసినపుడు కొమ్మలు చీలిపోకుండా జాగ్రత్తగా కత్తిరించాలి. అయితే కాపుకు వచ్చిన చెట్లలో 25% కన్నా ఎక్కువ కొమ్మలు కత్తిరిస్తే దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే తెగులు సోకిన కొమ్మలు, ఎండిన కొమ్మలు ఉంటే తీసివేయాలి. కత్తిరించిన కొమ్మలకు శిలీంద్రాలు, బాక్టీరియా వంటి సూక్ష్మ జీవులు సోకకుండా తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి.
కత్తిరింపుల వలన లాభాలు
చెట్టుకు గాలి, వెలుతురు బాగా సోకి దిగుబడి పెరుగుతుంది.
తోటలో అంతర కృషి పనులు చేయటానికి అనువుగా వుంటుంది
నాణ్యమైన పండ్ల ఉత్పాదకత పెరుగుతుంది
చెట్టు ఎత్తును అదుపులో ఉంచుకోవచ్చు
ప్రతి సంవత్సరం నిలకడగా కాపు కాస్తుంది.
చీడ పీడల బెడద తగ్గుతుంది.
2. ఎరువుల యాజమాన్యం
కోత తర్వాత చెట్టు తన ఆహార నిల్వలను కోల్పోతుంది కాబట్టి కోత అనతరం తప్పనిసరిగా చెట్టుకు పోషకాలు అందించాలి. కొమ్మ కత్తిరింపులు చేపట్టిన వెంటనే ప్రతి చెట్టుకు వయస్సును బట్టి సిఫార్సు చేసిన ఎరువులను వేసుకోవాలి. కాపుకు వచ్చిన తోటల్లో కత్తిరింపులు తర్వాత తొలకరి వర్షాల సమయంలో ఎరువులు వేసుకొంటే మొక్కకి పోషకాలు అందుతాయి ఒక వేళ వర్షాలు లేనట్లయితే నీటి తడులు ఇచ్చుకోవాలి. ఎరువులను తొలకరిలో అంటే జులై – ఆగష్టు నెలల్లో చెట్లు పాదుల్లో సమంగా చల్లి నేలలో కలిసేలా తిరగబెట్టాలి. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎరువులను వర్షాకాలం మొదట్లో ఒకసారి మరలా వర్షాకాలం చివర్లో రెండవసారి వెయ్యాలి. వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో వర్షాకాలం చివర్లో ఒకేసారి వేసుకోవాలి.
పది సంవత్సరాలు వయస్సు దాటిన ప్రతి చెట్టుకు 1 కిలో నత్రజని, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాష్ ను ఇచ్చే ఎరువులను వేయాలి. సేంద్రియ ఎరువులు మరియు జీవన ఎరువులను ఎక్కువగా వేసుకొంటే మంచిది. సేంద్రియ ఎరువులు చెట్టుకు 50 కిలోల పశువుల ఎరువు లేదా వర్మీ కంపోష్టు 20 కిలోలు తో పాటు 1 కిలో వేపపిండి, 250 గ్రా. చొప్పున అజిటోబాక్టర్ లేదా అజోస్పైరిల్లం ను 25 0 గ్రా. ఫాస్ఫోబాక్టర్, 100 గ్రా. ట్రైకోడేర్మావిరిడిని కూడా వేసుకోవాలి.
మామిడిలో సూక్ష్మపోషకాల లోప లక్షణాలు కనిపిస్తే కొత్త చిగుర్లు వచ్చిన తర్వాత 5 గ్రా. జింక్ సల్ఫేట్, 2 గ్రా. బోరాన్, 2 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్, 2 గ్రా. కాల్షియం సల్ఫేట్ను 1 లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని 15 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. మొక్కలకు అందించే పోషకాలను సేంద్రియ ఎరువుల రూపంలో అందిస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి.
3. కలుపు యాజమాన్యం
మామిడిలో కోత తర్వాత వర్షాలు పడి కలుపు సమస్య ఎక్కువుగా వుంటుంది. కలుపును ఎప్పటికప్పుడు నివారిచుకోవాలి. లేకపోతే మామిడిని ఆశించే చాలా పురుగులు కలుపు మొక్కలపై నివాసం ఏర్పరుచుకొని వాటి జీవిత చక్రాలు పూర్తి చేసుకొని మామిడిపై ఆసిస్తాయి. కలుపును సమర్ధవంతంగా నివారిచాలంటే తొలకరి వర్షాలు పడిన తర్వాత నేలను 2 సార్లు దున్నుకొని పచ్చిరొట్ట పైర్లు వేసుకోవాలి. జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద, నవధాన్యాలు వంటి పంటలను తోటల్లో చల్లుకొంటే వర్షాలకు అవి పెరిగి కలుపు మొక్కలు రాకుండా చేస్తాయి. ఈ పచ్చి రొట్ట పైర్లు పూత థకు రాగానే వాటిని మళ్ళీ నేలలో కలియ దున్నాలి. ఈ విధంగా చేయటం వలన మల్చింగ్గా పనిచేసి కలుపు రాకుండా చేయటమే కాకుండా అవి కుళ్ల్లి సేంద్రియ ఎరువుగా మారి నేల సారవంతం పెరుగుతుంది. అంతే కాకుండా కలుపు నివారణకు చేసే ఖర్చు తగ్గుతుంది. ఈ విధంగా తక్కువ ఖర్చుతో కలుపు నివారించుకోవాలి.
4. పురుగులు, తెగుళ్ల యాజమాన్యం
కాయ కోత అనతరం లోతు దుక్కులు దున్నుకొంటే నేలలో ఉండే పురుగుల గుడ్లు మరియు నిద్రావస్థ థలు బయటపడి నాశనమౌతాయి.
తేనెమంచు పురుగు ఉదృతి కొత్త చిగుర్లు వచ్చే సమయం నుండి ప్రారంభమవుతుంది. వీటి ఉధృతిని అరికట్టాలంటే చెట్ల కొమ్మలను పలచన చేయాలి. అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు కత్తిరించి చెట్టుకు గాలి, వెలుతురు బాగా సోకేలా చేయాలి. ఎండిన కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగించాలి. తోటలో కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
అక్టోబర్లో వర్షాలు లేనట్లైతే ఒకసారి చెట్ల పాదుల్లో నీటితడులు ఇవ్వటం వలన కూడా భూమిలో ఉండే గుడ్లు బయట పడతాయి.
తోటలో రాలిన కాయలను ఏరి నాశనం చేయాలి.
ప్రతి 2 నెలలకు ఒకసారి వేప నూనె 3000 పిపియం 3 మిల్లీ లీ. ఒక లీటరు నీటికి చొప్పున కలిపిన ద్రావణాన్ని చెట్ల కొమ్మలు, మొదలు బాగా తడిచేలా పిచికారి చేయాలి. దీనివలన కొమ్మల పగుళ్ళలో దాక్కొని ఉన్న పురుగు కోశస్థ థలు నాశనమై వాటి ఉధృతి తగ్గుతుంది.
పిండి పురుగులు నివారణకు చెట్ల మొదలు నుండి 1 అడుగు ఎత్తులో 25 సెం.మీ. వెడల్పు ఉన్న 400 గేజు మందం ఉన్న పాలీథీన్ షీటుతో చుట్టాలి. ఇలా చేయటం వలన నేలలో ఉండే పిల్ల పురుగుల థలు చెట్టుపైకి పాకకుండా ఉంటాయి. చెట్ల పాదుల్లో వేపపిండి వేయటం వలన కూడా వీటిని నివారించుకోవచ్చు.
పండు ఈగ ఆశించిన కాయలు రాలి ఉంటే వాటిని వెంటనే ఎరివేసి నేలలో లోతుగా కప్పటమో లేదా కాల్చివేయటం చేయాలి.
ఆకు ముడత పురుగులు అల్లిన గూళ్ళను తొలగించి వాటిని కాల్చేస్తే ఆ గూడులో ఉండే గుడ్లు, పిల్ల పురుగు థలు నాశనం అయ్యి తోటలో వాటి ఉధృతి తగ్గుతుంది.
తోటలో మిత్ర పురుగులను రక్షించటం వలన హానికర పురుగుల ఉధృతి అదుపులో ఉండి పంట నష్టం తగ్గుతుంది.
సాధ్యమైనంత వరకు రసాయన మందుల పిచికారీ తగ్గించుకోవాలి. వీటికి బదులు పురుగులు, తెగుళ్ళు ఆశించకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని జీవ సంబంధిత మందులు అయినటువంటి వేపనూనె, కానుగ నూనె, బవేరియా బాసియానా, మెటారైజియం వంటి సురక్షితమైనవి వాడుకొని నివారించుకోవాలి.
డా. కె. రాధారాణి, ప్రధాన శాస్త్రవేత్త (హార్టీకల్చర్), డా. బి. కనక మహాలక్ష్మి, ప్రధాన శాస్త్రవేత్త (ప్లాంట్ పాథాలజీ) జి. శాలిరాజు, శాస్త్రవేత్త, (ఎంటమాలజీ), మామిడి పరిశోధనా స్థానం, నూజివీడు. ఫోన్: 9948977535
తల్లిదండ్రులు పిల్లల వికాసంపైన అత్యంత ప్రభావం చూపుతారు. శైశవథ మొదలుకొని జీవితాంతం వరకు కుటుంబ బాంధవ్యాల వివిధ ప్రభావాలు వ్యక్తి వికాసం మీద ఎంతగానో ఉంటాయి. పిల్లల పెరుగుదల, వికాసంతోబాటు వారి అవసరాలు కూడా మారుతూ ఉంటాయి. తల్లిదండ్రులకు, పిల్లలకు గల అనుబంధం కూడా దానికి అనుగుణంగా మారుతూ ఉన్నప్పుడే వారు సరైన దృక్పథంతో ప్రవర్తించగలరు.
పిల్లలు కుటుంబ స్థాయికి, సంఘ సమరూపత పొందటం నేర్చుకోవాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. దీని ఫలితంగా వచ్చే కొన్ని మానసిక ఒత్తిడులను తట్టుకొని పెద్దలు కోరిన విధంగా ప్రవర్తించినప్పుడు తల్లిదండ్రులు పిల్లల మధ్యగల సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. అంతేగాక, తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఎటువంటి అనుబంధం ఉన్నదనే విషయం, తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల గల ధోరణిని బట్టి ఉంటుంది. వాంఛనీయమైన తల్లిదండ్రుల పిల్లలు అనుబంధం వాత్సల్యపూరితమైన బాంధవ్యం తల్లిదండ్రులకు వారి పిల్లల మీద భద్రత, నమ్మకం ఉన్నప్పుడే వారి పిల్లలకు తల్లిదండ్రుల మీద విశ్వాసం పెంపొందుతుంది. ఈ విధమైన అనుకూల బాంధవ్యం ఉన్నప్పుడే పిల్లలు బాధ్యతాయుత ప్రవర్తన కలిగి ఉంటారు.
పిల్లల పెంపకం అన్నది ఒక కళ. తల్లిదండ్రుల పెంపక విధానాలపై పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. చిన్నప్పటి పెంపకం విధానాలపైనే పిల్లల భావి జీవితాలకు పునాది ఏర్పడుతుంది. తల్లిదండ్రుల పెంపక విధానాలలో లోపమున్నట్లయితే వాటి పర్యవసానాలు, దుష్పరిణామాలు పిల్లలు అనుభవించాల్సి ఉంటుంది. కనుక, ప్రతి తల్లిదండ్రి పెంపక విధానాల గురించి వాటి పరిణామాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
పిల్లల పెంపక విధానాలు – వాటి పరిణామాలు
* విమర్శలతో పెంచబడిన బిడ్డ, తనను తాను దోషిగా తలుస్తాడు.
* స్నేహ భావంతో పెంచబడిన బిడ్డ, ఇతరుల మీద ప్రేమ అభిమానాన్ని పెంచుకొంటాడు.
* పిల్లలను పెంచే విధానం తల్లిదండ్రుల దృక్పథాల మీద ప్రేమ, అభిమానాన్ని పెంచుకొంటాడు.
* పిల్లలను సక్రమ పద్ధతిలో పెంచితే వాళ్ళు మంచి అలవాట్లను, ఉత్తమ లక్షణాలను నేర్చుకొని కుటుంబంలోను సంఘంలోను ఉపయోగపడే వ్యక్తులుగా రూపొందగలరు. కాబట్టి పెంచటంలో తల్లిదండ్రులకు సరియైన దృక్పథాలు ఉండటం ఎంతో అవసరం.
తల్లిదండ్రుల దృక్పథాలు ముఖ్యంగా మూడు రకాలు: 1) స్వీకారం, 2) తిరస్కారం 3) అతి సంరక్షణ
స్వీకారం: తల్లిదండ్రులు ప్రేమగా చూడటమే ప్రతిబిడ్డకు జీవితంలో ప్రాథమిక అవసరం. తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి. ఇది వారు భారమైన విధి అని భావించకుండా ప్రకృతి సిద్ధమైన బాధ్యతగాను, ఆనందమయమైన కార్యంగాను గుర్తించాలి. పిల్లలను వారి అందచందాలు చూచిగాని, తెలివితేటలను చూచిగాని ప్రేమించకూడదు. బిడ్డలు ఎటువంటి వారయినా, ఎలాంటి గుణగణాలు ఉన్నా వారిని తల్లిదండ్రులు ఆత్మీయతతో ఆదరించి, సమభావంతో పెంచాలి. ఈ విధంగా పెంచిన బిడ్డలను స్నేహ సహకార స్వభావాలు, నిశ్చిలబుద్ధి ఉండి స్వయం శక్తితో సంతోషంగాను, సుఖంగాను వృద్ధిలోకి రాగలరు.
స్వీకారం వలన తల్లిదండ్రులకు, బిడ్డలకు కూడా ఆనందంగా ఉంటుంది. స్వీకారం తిరస్కారం దృక్పథాలు తల్లిదండ్రులలో సాధారణంగా కన్పించే లక్షణాలని మానసిక మనోవిజ్ఞాన పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మానసిక పరిపక్వత ఉన్న తల్లిదండ్రులలో స్వీకారం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు స్వేచ్ఛ ఉన్నప్పుడే వారిలో సృజనాత్మక శక్తి సహకరించడం, ఆత్మవిశ్వాసం, సర్దుబాటుతత్వం లాంటి లక్షణాలు అలవాటవుతాయి. పిల్లలు, బాధ్యత, నమ్మకం, విధులు నిర్వహించడంలో నైపుణ్యం అలవాటు చేసుకొంటారు.
తల్లిదండ్రులు ఎక్కువ జోక్యం చేసుకొంటే పిల్లలు స్వార్ధపరులుగా, మొండిగా తయారవుతారు. అంతేకాక అటువంటి పిల్లలు, తల్లిదండ్రుల మరియు ఇతరులు కూడా వారిపైనే శ్రద్ధ చూపాలి అనే భావనలో ఉంటారు. ఇటువంటి పిల్లలను క్రమశిక్షణలో పెట్టినా ఓర్పులేక కోపాన్ని వెళ్ళబుచ్చుతారు. సాంఘికంగా అంటే ఇతరులు తమ గురించి ఏ విధంగా అనుకుంటారనే విషయం కూడా చాలా ముఖ్యమైనది. తమను జట్టులో గాని, సమూహాలలో గాని ఇతరులు స్వీకరించే విధానాన్ని బట్టి, ఇతరులు వారిపట్ల చూపే ఆదరాభిమానాలను బట్టి, వారి తప్పులను క్షమించి వారి ప్రయత్నాలను మెచ్చుకోవడాన్ని బట్టి, ఇతరులు తమ గురించి ఏ విధంగా భావిస్తున్నారో పిల్లలు తెలుసుకోగలరు.
సాంఘికంగా అంగీకారం పొందే వ్యక్తి చురుకుగా ఉంటాడు. మనసులోని మాటను పైకి చెప్తాడు. ఇతరుల కార్యక్రమాలలో సహకరిస్తాడు. ఇతరులకు సహాయం చేయటం, ఇతరులతో మర్యాదగా ఉండటం, విషయాలను పరిశీలించటం, విచారించడం మొదలైనవి సాంఘికంగా అంగీకరింపబడే వ్యక్తి లక్షణాలు. అటువంటి వ్యక్తి సమూహంలో నాయకత్వాన్ని వహిస్తాడు. ఇతను నిజాయితీ పరుడుగా ఉంటాడు. ప్రవర్తనలో ఒక మెట్టుపైన ఉంటాడు. తాము చేపట్టిన బాధ్యతలను స్వశక్తితో చక్కగా నెరవేరుస్తాడు.
ఈ దృక్పథం తల్లిదండ్రుల, పిల్లల బంధాన్ని బలపరుస్తుంది. పిల్లల అభివృద్ధికి అభ్యాసనకు ఎన్నో విధాల సహకరిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల మధ్య చక్కని అవగాహన, ఆరోగ్యవంతమైన అనుబంధం ఏర్పడుతుంది. ఇటువంటి పిల్లలు తల్లిదండ్రులను సంతోషపరచాలని చూస్తారు.
తిరస్కారం: తల్లిదండ్రులు బిడ్డల పట్ల తిరస్కారాన్ని చాలా విధాలుగా వ్యక్తపరుస్తారు. కొందరు బిడ్డల పట్ల బాహ్యంగా శత్రు భావాన్ని చూపుతారు. మరికొందరు వారిని నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది తల్లిదండ్రులు తిరస్కార భావం, ద్వేషం బాహ్యంగా చూపకుండా మనస్సులోనే ఉంచుకొని వారికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఇవ్వక అన్ని విషయాలలోను ఆటంకపరుస్తారు. ఇలా చేయటం వల్ల పిల్లలలో క్రోధం, అణకువ, పిరికితనం, అశాంతి మొదలైన కొన్ని అవాంఛనీయమైన గుణాలు ఏర్పడతాయి.
తల్లిదండ్రుల నిర్లక్ష్యం, పిల్లలలో ఏమి చేయలేని పరిస్థితిని కల్పించి భద్రతను, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. దీని వలన నిద్రలో పక్కతడపటం, గోళ్ళు కొరకటం, సరిగా తినకపోవటం లాంటి ప్రవర్తనా సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం కోరుకోవడం వలన వస్తాయని తెలుస్తోంది. ఎటువంటి బాధ్యతలు లేనివారుగా తయారవుతారు. బిడ్డలను పెంచడంలో తిరస్కారం లేక అతి సంరక్షణ అవలంబించితే పిల్లల అభివృద్ధి కుంటుపడుతుంది.
అతి సంరక్షణ వలన తల్లి, పిల్లల మధ్య అనుబంధం ఎక్కువయి, వారు తల్లిదండ్రుల మీద ఎక్కువగా ఆధారపడతారు. దీని వలన వారు స్వశక్తితో ఏ పని చేయరు, చేయవలసి వచ్చినా భయపడతారు. అంతేకాక వారిలో ఇతర కార్యాలపైన ఉత్సాహం త్వరగా కలవలేరు. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనలేక, ఇంటికే పరిమితమైపోతారు. దీనితో ఏ కార్యక్రమాన్ని చేపట్టాలన్నా విశ్వాసాన్ని కోల్పోతారు. ఇందువలన వారిలో ఆత్మవిశ్వాసం, సహనం, ఉత్సాహం తగ్గిపోతుంది. విమర్శలను తట్టుకోలేరు.
ఈ కాలంలో తల్లిదండ్రులు వివిధ కారణాల వల్ల ఒక బిడ్డను కని వారిని అతిగారాబంగా పెంచుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల అవసరాలను తీరుస్తూ వారికి ప్రేమ, వాత్సల్యాలతో కూడిన వాతావరణాన్ని ప్రసాదిస్తూ పిల్లల అభివృద్ధికి దోహదపడాలి తప్ప, అతి జాగ్రత్తతో పెంచి పిల్లలను ఎందుకూ పనికిరాని వాళ్ళుగా తయారు చేయకూడదు. తల్లిదండ్రులు ఈ దృక్పథాల ప్రభావాన్ని గుర్తించి పిల్లలను సక్రమంగా పెంచాలి.
డా. పి. శ్రీదేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, మానవ అభివృద్ధి మరియు కుటుంబ అధ్యయన విభాగం, సామాజిక విజ్ఞాన కళాశాల, సైఫాబాద్, హైదరాబాద్.
డా. బి. ప్రశాంతి, టీచింగ్ అసోసియేట్, ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, సామాజిక విజ్ఞాన కళాశాల, లాం, గుంటూరు.
పశువులలో ఈనిన తరువాత వచ్చే అజీర్తి లేదా వాతం వలన పాల దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారు. పశువు ఈనిన తరువాత మొదటి రోజు నుండి మొదటిసారి ఎదకు వచ్చేకాలం, అంటే సుమారుగా 45 నుండి 60 రోజుల వరకు ఉన్నటువంటి పశువులను ఈనిన పశువులుగా పరిగణించవచ్చు. ఈ రెండు నెలలు పాల ఉత్పత్తికి ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ సమయంలో పశువు అనారోగ్యం బారిన పడితే, రైతాంగం నష్టపోవలసి వస్తుంది.
రైతులు నాశిరకం పశువులను, సరైన సమయాలలో అంటే పాల దిగుబడికి తగిన జాగ్రత్తలు పాటించని యెడల, రైతులు తీవ్ర నష్టానికి గురౌతారు. అధిక పాలదిగుబడి ఇచ్చే సంకరజాతి ఆవులకు, గ్రేడెడ్ జాతి ముర్రా గేదెలకు జన్యుపరంగా పాల ఉత్పాదక శక్తి ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ పశువులకు అన్ని పశువులకంటే అధిక శక్తి అవసరం. అంటే తినే ఆహారం అరలపొట్టలో సరిగా జీర్ణమై, పశువుకి శక్తినిస్తేనే రైతుకు పాల దిగుబడి ఉంటుంది.
పశువు చూడి సమయంలో అరలపొట్ట యొక్క పనితీరు తగ్గి, ఆకలి మందగిస్తుంది. ఈనిన తరువాత ఆరోగ్యమైన పశువులలో సుమారుగా 5 వారాలకు తిరిగి మామూలు పనితనం పొందుతుంది. అరల పొట్ట పనితనం తగ్గడం వలన, అరల పొట్టలోని ద్రవంలో మార్పుతో పాటు కాలేయంలో మార్పులు ఏర్పడతాయి. దీని వలన ఆకలి మందగించడం, పాల ఉత్పత్తి తగ్గడం మరియు పోషకాహారం లోపం వలన, శరీర నిల్వలపై పశువు ఆధారపడి పాలను ఇస్తుంది. దీని మూలంగా పలురకాల జీవక్రియ వ్యాధులు లేక ఉత్పాదక వ్యాధులు బారిన పడతాయి.
పశువు ఎదకు సరిగా రాకపోవడం వంటివి జరుగుతాయి. మొదటి మూడు ఈతల వరకు శరీర నిల్వలపై ఆధారపడుతుంది. కానీ దాని సామర్థ్యానికి తగినంత పాలు ఇవ్వలేకపోతుంది. తరువాత ఈత నుండి పాల దిగుబడి అతిగా తగ్గడంతో పాటు, శరీరాకృతిలో కూడా మార్పు కనబడి బక్కచిక్కి పోతుంది. పశువులలో అజీర్తి వంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు, ఈనిన తరువాత పశువులలో వచ్చే వ్యాధులు ముఖ్యంగా మాయవేయకపోవడం, పొదుగువాపు వ్యాధి, గడ్ల మాయ గర్భాశయ వ్యాధులు మరియు మాయ తినడం వలన కూడా అజీర్తి సంభవిస్తుంది.
పశువులు ఈనిన రెండునెలల వెంటనే సంభవించు అజీర్తిని రైతు కొద్దిపాటి నైపుణ్యంతో గుర్తు పట్టవచ్చు. పశువు క్రిందటి ఈతలో కంటే తక్కువ తినటం, పాల దిగుబడి తగ్గటం వంటి లక్షణాలను బట్టి రైతు కనిపెట్టవచ్చు. మూత్ర పరీక్ష ద్వారా ఉత్పాదక వ్యాధులు (పాలజ్వరం, ఎండువాతం మొదలైనవి) గుర్తుపట్టవచ్చు.
నివారణ చర్యలు
* ఈనిన తరువాత పశువులలో వచ్చే అజీర్తికి నివారణగా, చివరి రెండు లేదా మూడు నెలల వ్యవధిలో సమతుల్యమైన ఆహారం ఇవ్వాలి. అలాగే అదనపు కాల్షియం ఇవ్వరాదు.
* పశువు ఈనే ముందు (12 గంటల ముందు), ఈనిన వెంటనే మరియు ఈనిన తరువాత (12 గంటల తరువాత) మూడు సార్లుగా కాల్షియం జెల్ను నోటిద్వారా త్రాగించాలి. దీని వలన పశువులలో పాలజ్వరం నివారించవచ్చు.
* శక్తినిచ్చే ఆహారపదార్థాలు ముఖ్యంగా గ్లిజరిన్, కిటోనిల్ జెల్ లేదా ఈ-బూస్టర్ వంటి రైతు ఇంటి దగ్గరే పశువుకు దాణాలో కలిపి లేదా నోటిద్వారా ఇవ్వాలి. దీనివలన ఎండువాతం నుండి నివారించవచ్చు.
రసాయనిక వ్యవసాయం వలన సంభవించిన, సంభవిస్తున్న అనర్ధాల నుండి బయటపడడానికి అనేకమంది నిపుణులు, శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు, కొన్ని సంస్థలు రసాయనాలు అవసరం లేని వివిధ రకాల సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులకు చేరవేస్తున్నారు. వీటిలో ఫుకుఓక ప్రకృతి వ్యవసాయ పద్ధతి, భాస్కరసావే పద్ధతి, చౌహాన్క్యూ పద్ధతి, నమ్మళ్వార్ పద్ధతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతి, సుభాష్పాలేకర్ జీరోబడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ పద్ధతి లాంటి వాటిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. వీటన్నింటిలో సుభాష్ పాలేకర్ జీరోబడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ పద్ధతి చాలా వేగంగా రైతులోగిళ్ళకు చేరింది. ఇంకా చేరుతూనే ఉంది అని చెప్పవచ్చు. సుభాష్ పాలేకర్ వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ ఈ పద్ధతి గురించి ప్రచారం చేయడంతోపాటు, కొన్ని ప్రభుత్వాలు ఈ పద్ధతిని ప్రోత్సహించడం మరియు రైతులు అమలుపరచటానికి అనుకూలంగా ఉండడం, ఈ పద్ధతిలో మన దేశీయ జాతి గోవు ప్రముఖ పాత్రను పోషించటం లాంటి వివిధ రకాల కారణాల వలన మిగతా పద్ధతులతో పోల్చుకుంటూ సుభాష్ పాలేకర్ జీరోబడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ పద్ధతి చాలా వేగంగా రైతు లోగిళ్ళకి చేరిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే సుభాష్పాలేకర్ వలననే రసాయన వ్యవసాయం వలన జరిగిన, జరిగే నష్టాలు వేగంగా రైతులు తెలుసుకుంటున్నారు. రసాయన రహిత వ్యవసాయం ఇంత వేగంగా రైతులకు తెలియడంలో సుభాష్ పాలేకర్ జీరోబడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ పద్ధతి ప్రధాన పాత్ర పోషించింది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ పద్ధతిని సుభాష్ పాలేకర్ ప్రచారం చేయకుండా ఉండి ఉంటే రసాయన రహిత వ్యవసాయం రైతులోగిళ్ళకు చేరటానికి చాలా సమయం పట్టేది కావచ్చు. పాలేకర్ వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవడం, వారి పుస్తకాలు చదివిన వారు, వారి సభలకు హాజరయ్యి ఈ పద్ధతుల గురించి తెలుసుకున్న చాలామంది రైతులు తమ రసాయనిక సేద్యాన్ని ప్రకృతి వ్యవసాయ బాట పట్టించారు. ఇంకా పట్టిస్తున్నారు. వ్యవసాయేతర ఉద్యోగ, వ్యాపారం లాంటి వేరే రంగాలలో ఉన్న వారు కూడా సుభాష్ పాలేకర్ జీరోబడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ పద్ధతుల గురించి తెలుసుకుని ఈ బాట పట్టారు. ఇంకా పడుతూనే ఉన్నారు. ఈ కోవకే చెందుతారు కృష్ణాజిల్లా, తరకటూరులో, వికారాబాద్ సమీపములో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రకృతి సాగు చేస్తున్న విజయరామ్.
వాస్తవానికి విజయరామ్ ఆర్టిస్ట్ (బొమ్మలు గీస్తుంటారు). ఆర్టిస్ట్గా తన వృత్తిని కొనసాగిస్తూ హైదరాబాదు నగరంలో ఇందిరాపార్కు సమీపంలో ఒక మిఠాయి దుకాణాన్ని నడుపుతూ వస్తున్న సమయంలో నీటి యొక్క విలువను తెలుసుకుని నీటి సంరక్షణకు సంబంధించిన సమాచారాన్ని మిఠాయి దుకాణంకి వచ్చిన వినియోగదారులకు తెలియచేస్తూ ఉండేవారు. అందుకు సంబంధించి చార్టులను తయారు చేయించి అవసరమైన వారికి ఆ చార్టులను ఉచితంగా అందిస్తూ ఉండేవారు. ఆవిధంగా తన ఆలోచనలని సామాజిక రంగాలవైపు కూడా మళ్లించి కొనసాగుతున్న క్రమంలో 2010వ సంవత్సరంలో సుభాష్పాలేకర్ గారి జీరోబడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ పద్ధతి గురించి తెలుసుకొని తాను కూడా గో-ఆధారిత వ్యవసాయం చేయాలనే తలంపుతో అటువైపు అడుగులు వేసి ప్రకృతి వ్యవసాయంలో అడుగు పెట్టారు. ఈ పద్ధతిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనే తలంపుతో సుభాష్పాలేకర్ గారి ద్వారా సదస్సులు ఏర్పాటు చేయడంలో తనవంతు పాత్రను పోషించారు…. పోషిస్తూన్నారు.
గోఆధారిత వ్యవసాయంలో ప్రధానమయినవి మన దేశీయ జాతి గోవులు, మన పురాతన నాటు విత్తనాలు కాబట్టి తన సాగులో ఈ పద్ధతులను అమలుపరచడంతో పాటు అంతరించి పోతున్న మన పురాతన విత్తనాలను అభివృద్ధి చేసి వాటి లభ్యత పెంచాలనే తలంపుతో మన పురాతన విత్తనాల సేకరణకు నడుంబిగించి వాటిని సేకరిస్తూ అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. వీటన్నింటికిగాను కృష్ణాజిల్లా తరకటూరులో, వికారాబాద్ సమీపంలో పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వివిధ రకాల పంటలు పండిస్తూ వస్తున్నారు. ఇందుకుగాను మన దేశీయ జాతులు ఒంగోలు, గిర్ లాంటి ఆవులను మరియు ఎద్దులను పోషిస్తూ వాటి వ్యర్థాలను తన పంటలసాగులో వినియోగిస్తున్నారు. ఆవు పాల ద్వారా మన తాత, ముత్తాతలు పాటించిన పద్ధతులతో నాణ్యమైన ఆవు నెయ్యిని తయారు చేసి అవసరమైన వారికి అమ్ముతూ వస్తున్నారు.
వరి, చెరకు, ఉల్లి, పసుపు, అల్లం, వివిధ రకాల కూరగాయలు అరటి మొదలగు పంటలతో పాటు 5 అంచెల పద్ధతిలో వివిధ రకాల పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. దుక్కిలో ఘనజీవామృతం అందించడంతో పాటు జీవామృతాన్ని భూమికి అందిస్తుంటారు. అవసరాన్ని బట్టి జీవామృతం, నీమాస్త్రం, పుల్లటి మజ్జిగ లాంటి వాటిని పంటలపై పిచికారి చేస్తూ ఆరోగ్యకరమైన దిగుబడి పొందుతుంటారు. పంట దిగుబడిలో నాణ్యతకు, పోషకాలకు ప్రాముఖ్యతని ఇస్తూ ఎంత దిగుబడి వచ్చిందనే దానిని పట్టించుకోకుండా వచ్చిన దిగుబడి నాణ్యమైనదా కాదా అనే కోణంలో ఆలోచిస్తూ పంటల సాగు కొనసాగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో నాటు విత్తనాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి కాబట్టి తాను సాగు చేసే పంటలన్నింటికీ నాటు విత్తనాలనే ఉపయోగిస్తున్నారు. నాటు విత్తనాలను తన పంటల సాగులో వినియోగించడంతోపాటు తోటి రైతులకు కూడా అందచేస్తుంటారు. మన పురాతన విత్తనాలు అంతరించి పోతున్నవి కాబట్టి అందుబాటులో ఉన్న పురాతన విత్తనాలను ప్రత్యేకించి వడ్లను ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి సేకరించి వాటిని పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో అభివృద్ధిపరచి తోటి రైతులకు అందచేసి మన పురాతన విత్తన నిధిని కాపాడుటలో విజయరాం ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. పురాతన వడ్లలో పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి వీటిని ఆహారంగా తీసుకుంటే జబ్బులు వచ్చే అవకాశాలు ఉండవు అని తెలుసుకొని పురాతన విత్తనాల అభివృద్ధి మరియు పంపిణీని ఒక ఉద్యమంగా చేస్తున్నారు.
ప్రకృతి వ్యవసాయంలో అడుగుపెట్టి, దేశీయ జాతి గోసంతతిని, మన పురాతన విత్తనాలను అభివృద్ధిపరుస్తూ తోటి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు నడిపిస్తూ పంట దిగుబడులు ముఖ్యం కాదు, నాణ్యమైన దిగుబడులు ముఖ్యం అంటూ విజయరాం ముందుకు నడుస్తున్నారు. మరిన్ని వివరాలు 83746 62262 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
ఐదు అంచెల సాగు విధానం
ఐదు అంచెల సాగు విధానాన్ని సుభాష్ పాలేకర్ బాగా ప్రచారం చేశారు. ఈ విధానంలో 36 అడుగుల దూరంలో మామిడి, నేరేడు లాంటి పెద్దగా ఎదిగే మొక్కలు పెంచుకొంటూ వాటి మధ్యలో వివిధ రకాల మొక్కలను, కూరగాయలు, ఆకుకూరలను 4 అంచలుగా సాగు చేయడం దాని ప్రధాన ఉద్దేశ్యం. ఈ విధానం 36 * 36 అని కూడా ప్రసిద్ధి చెందింది. ఈ 36 * 36 విధానం ప్రచారంలోకి వచ్చిందేకాని క్షేత్రస్థాయిలో విజయం సాధించిన వారు పెద్దగా లేరు. కారణం ఈ విధానంలో దిగుబడులు సక్రమంగా రావడం లేదు అని తెలుసుకుని విజయరాం ఈ విధానానికి వేరే రూపం ఇచ్చారు. అంటే 36 కి బదులుగా 50 అడుగుల దూరం పాటిస్తే అన్ని అనుకూలంగా ఉంటాయని అనుభవ పూర్వకంగా తెలుసుకుని 50 * 50 అడుగుల దూరంలో 5 అంచెలుగా వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. 50 అడుగుల దూరంలో మొదటి అంచెలో నేరేడు, మామిడి, పనస, బాదం లాంటి పెద్దగా ఎదిగే వృక్షాలు 50 అడుగులలో సగం అంటే 25 అడుగుల దూరంలో రెండో అంచెగా బత్తాయి, నిమ్మ, నారింజ లాంటి మొక్కలు, 25 అడుగులలో సగం అంటే 12 1/2 అడుగుల దూరంలో 3వ అంచెగా బొప్పాయి, అరటి లాంటి మొక్కలు, 12 1/2 లో సగం 6 1/4 లో 4వ అంచగా మునగ, అవిశ లాంటి మొక్కలు 61/4 అడుగులకు మధ్యలో సొర, బీర, కాకర, బెండ లాంటి కూరగాయలతోపాటు తోటకూర, గోంగూర, చుక్కకూర లాంటి ఆకుకూరలు, పసుపు, అల్లం, చేమ దుంపలాంటి పంటలు పండిస్తున్నారు. వీటన్నింటిని పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతోనే పండిస్తున్నారు. 5 అంచెల విధానంలో లైనుకి లైనుకి 6 1/4 అడుగుల దూరం ఉంటుంది. లైనుకి లైనుకి మధ్య ఒక కాలువ చేసుకుని ఆ వచ్చిన మట్టి లైనులో ఎత్తుగా వేసుకోవడం వలన కలుపు సమస్య తగ్గడంతో పాటు లైనులో ఉన్న మొక్కలకు పోషకాలు బాగా అంది అవి ఆరోగ్యంగా పెరుగుతూ ఎలాంటి కషాయాలు, ద్రావణాలు అవసరం పడటంలేదు. తప్పనిసరి పరిస్థితులలో నీమాస్త్రం, పుల్లటిమజ్జిగ, జీవామృతం లాంటివి పంటపై పిచికారి చేస్తుంటారు. విజయరాం పండించే అన్ని పంటలకు నీటిని అందించటానికి ఎలాంటి డ్రిప్పు, స్ప్రింక్లర్ లాంటి విధానాలను ఉపయోగించకుండా కాలువల ద్వారానే నీటిని అందిస్తుంటారు. 5 అంచెల విధానంలో కాలువ ద్వారా నీటిని అందిస్తూ ఆ కాలువలలో అరటి, బొప్పాయి లాంటి ఆకులు మల్చింగ్గా ఉపయోగిస్తుంటారు.
1) వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి.
2) రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన సందర్భంలో, నిర్ణీత ఫార్మాట్లో ఉన్న బిల్లు (రసీదు) అనగా దుకాణదారుని పేరు, అడ్రస్, సీడ్ లైసెన్స్ నంబరు, స్త్రఐఊ నంబరు మొదలగునవి ఉన్న రసీదును మాత్రమే అంగీకరించాలి.
3) రసీదుపై విత్తన కంపెనీ పేరు, విత్తన రకం పేరు, లాట్ నెంబరు, గడువు తేదీ మరియు డీలర్ సంతకము తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
4) కొనుగోలు చేసిన విత్తన ప్యాకెట్, సంచి, డబ్బాలపై సీలు ఉందా లేదా అని సరిచూసుకోవాలి. విత్తన ప్యాకెట్లపై ముద్రించిన సమాచారాన్ని బిల్లులో ఉన్న వివరాలతో సరిచూసుకోవాలి.
5) కొనుగోలు చేసిన దుకాణం నుంచి రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి.
6) విత్తన ప్యాకెట్ మరియు బిల్లును పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవడం తద్వారా జన్యు స్వచ్ఛత లోపాల వల్ల లేదా మొలక శాతం తక్కువైనప్పుడు తగిన పరిహారం కోరే హక్కు రైతుకు ఉంటుంది.
7) లూజుగా ఉన్న సంచులు మరియు పగిలిన ప్యాకెట్లు, డబ్బాల్లో ఉన్న విత్తనాలను కొనుగోలు చేయరాదు.
8) గడువు దాటిన విత్తనాలను ఎట్టి పరిస్థితులలో కొనరాదు.
9) బిజి-3 పేరుతో చలామణి అవుతున్న HT విత్తనాలకు జిఇఏసి (GEAC) అనుమతి లేనందున ఈ రకం విత్తనాలను కొనడం, అమ్మడం మరియు సాగు చేయడం నేరము.
10) బీటీ కాటన్ విత్తన ప్యాకెట్లపై జి ఇ ఏ సి అప్రూవల్ నెంబర్ తేదీ, సదరన్ జోన్ అనగా తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయుటకు అనువైనదో కాదో విత్తన ప్యాకెట్పై ఉన్న సమాచారంతో సరి చూసుకోవాలి.
11) గ్రామాల్లో రాత్రికి రాత్రి వచ్చి అనధికారికంగా విక్రయించే నకిలీ విక్రయదారుల నుండి ఎట్టి పరిస్థితుల్లో విత్తనాలు కొనుగోలు చేయరాదు.
12) అనధికారికంగా, బిల్లు లేకుండా కలుపు మందును తట్టుకొనే H.T. (B.T.) ప్రత్తి విత్తనాలు అమ్ముతున్నట్లయితే సంబంధిత మండల వ్యవసాయ అధికారి లేదా జిల్లా వ్యవసాయ తనిఖీ బృందంకు ఫిర్యాదు చేయవలెను.
13) కలుపు మందును తట్టుకొనే బి టి (B.T.) ప్రత్తి పంట సాగుకు మన దేశంలో ప్రభుత్వ అనుమతి లేదు. స్త్రజూజ్పు అనుమతి లేని కలుపు మందు తట్టుకొనే ప్రత్తి విత్తనాలు సాగు చేసినా, అమ్మినా చట్టరీత్యా నేరము.
14) కలుపు మందును తట్టుకొనే ప్రత్తి విత్తనాలు ఉత్పత్తి చేసిన మరియు రైతులు పంట పొలాల్లో సాగు చేసినా, విత్తన చట్టం 1966, పర్యావరణ పరిరక్షణ చట్టం (జూఆజు) 1986 ప్రకారము నేరము.
15) అటువంటి వ్యక్తులపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకొనబడును. మన రాష్ట్ర ప్రభుత్వము ఆ.ఈ. యాక్ట్ ప్రకారం సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకొనబడుతున్నవి. కనుక రైతు సోదరులు ఇటువంటి ప్రత్తి విత్తనాలు సాగు చేయకూడదని కోరుచున్నాను.
16) నకిలీ విత్తనాలు / నకిలీ ప్రత్తి విత్తనాలు / కలుపు మందును తట్టుకొనే బి.టి. విత్తనాలు మరియు లూజు విత్తనాలను అమ్ముతున్నట్లు నమ్మశక్యమైన సమాచారం తెలపడము ప్రతి ఒక్కరి బాధ్యత మరియ వారి వివరాలు గోప్యంగా ఉంచబడును.
17) ఇట్టి సమాచారాన్ని మండల / డివిజన్ / జిల్లా వ్యవసాయాధికారికి తెలియచేయండి. – వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం
అంటువ్యాధులు ఒక జీవి నుండి మరొక జీవికి సోకి, వ్యాధిని వ్యాప్తి చేస్తాయి. ముఖ్యంగా బాక్టీరియా వలన మరియు వైరస్ వలన ఈ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.
బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధులు
చిటుకురోగం: చిటుక వేసేంతలోనే గొర్రెలు క్రిందపడి చనిపోతాయి. అందుకని ఈ వ్యాధిని చిటుక వ్యాధి అని లేక నెత్తిపిడుగు వ్యాధి అని లేదా గడ్డిరోగం అని పిలుస్తారు.
కారణాలు: బ్యాక్టీరియా వల్ల మరియు తొలకరి వర్షాలు తరువాత పెరిగిన గడ్డి తినడం వలన ఈ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా జూన్ నుండి జులై నెలలలో ఎక్కువగా సంక్రమిస్తుంది.
లక్షణాలు: * ఎటువంటి లక్షణాలు కనపడకుండానే జీవాలు ముఖ్యంగా గొర్రెలు మరణిస్తాయి. * నీరసంగా ఉండి, గిలగిలా కొట్టుకుని, గాలిలోకి ఎగిరి క్రిందపడి చనిపోతాయి.
చికిత్స, నివారణ: * వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి.* వ్యాధి సోకిన మందను, ఇతర మందల నుండి దూరంగా ఉంచి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. * స్థానిక పశువైద్యని వెంటనే సంప్రదించాలి.
కాలిపుండువ్యాధి: మేత సమయంలో మందలోని కొన్ని గొర్రెలు నడవలేక కుంటుతూ కనిపిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో తడిచిన నేలలో తిరిగినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి.
* ఎర్రగా కందిన భాగం ఉబ్బి, చీము పట్టి నల్లగా కమిలిపోతాయి.
* ఆ భాగం చెడు వాసన వస్తుంది.
* వ్యాధి తీవ్రంగా సోకిన థలో గిట్టలు వూడిపోతాయి.
చికిత్స, నివారణ: * మందలో వ్యాధి లక్షణాలను గమనించిన వెంటనే దగ్గరలోని పశువైద్యుని పర్యవేక్షణలో పెన్సిలిన్ మరియు నొప్పి నివారణ మందులు వాడాలి. * వ్యాధి సోకిన గిట్టలను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి పశువైద్యుని సలహాలు పాటించాలి.
వైరస్ వలన వచ్చే వ్యాధులు
గాలికుంటు వ్యాధి: ఈ వ్యాధి గాలి ద్వారా సోకుతుంది. కనుక గాలికుంటువ్యాధి అని పిలుస్తారు. ఈ వ్యాధి సోకిన జీవాలలో నోరు మరియు గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి.
కారణాలు: ఈ వ్యాధి ఫుట్ అండ్ మౌత్ వైరస్ వలన సోకుతుంది.
లక్షణాలు:
* తీవ్రమైన జ్వరం (104-106 డిగ్రీ ఫారెన్హీట్) ఉంటుంది.
* నోటిలో, నాలిక మీద, గిట్టల మధ్య భాగంలో పుండ్లు ఏర్పడతాయి.
* నోటి నుండి చొంగ కారుతుంది.
* నోటిలోని పుండ్ల వలన జీవాలు, సరిగా మేత మేయవు. కాలిపుండ్లు వలన కుంటుతూ నడుస్తాయి.
* వ్యాధి సోకిన గొర్రె పిల్లలు ఎక్కువగా చనిపోతాయి.
చికిత్స, నివారణ: * నోటిలో పుండ్లను మరియు కాలిలోని పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి బోరిక్ గ్లిసరిన్ ఆయింట్మెంటును పెట్టాలి. జి నోటి పుండ్ల వలన గొర్రెలు మేత మేయవు కనుక జీవాలకు గంజి లేక అంబలిని గ్లూకోజ్తో కలిపి త్రాగించాలి. * వ్యాధి సోకిన జీవాలను మంద నుండి వేరు చేయాలి. జి వ్యాధి నిరోధక టీకాలను ఇప్పించాలి.
నీలినాలుక వ్యాధి (బ్లూటంగ్)
ఈ వ్యాధిని మూతివాపు, మూతి పుండ్లువ్యాధి అని పిలుస్తారు.
కారణాలు: * ఈ వ్యాధి వైరస్ వలన కలుగుతుంది. * దోమ కాటు వలన ఈ క్రిములు గొర్రెలోని శరీరంలోనికి ప్రవేశించి వ్యాధిని కలుగచేస్తాయి.
లక్షణాలు: * అధిక జ్వరం, గొర్రెలలో చొంగకారుతూ, పెదవులు మరియు చిగుళ్ళు వాచి, పెదవుల లోపల భాగం ఎర్రబడి, చిన్న చిన్న గుల్లలుగా ఏర్పడతాయి. * గిట్టల మధ్య భాగం ఎర్రగా ఉంటుంది. సరిగా నడవలేక మేత సరిగా మేయకుండా, నీరసించి పోతాయి. * నాలుక నీలి రంగులో మారుతుంది.
చికిత్స, నివారణ: వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే పశువైద్యుని సంప్రదించాలి. * తగు నొప్పి నివారణ మందులు, యాంటిబయోటిక్ మందులు వాడాలి. * నోటిలోని పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో కడిగి జింక్ పౌడర్ నీటితో రుద్దాలి.
పుర్రురోగం (పి.పి.ఆర్):
ఈ వ్యాధిని ముసర వ్యాధి లేక పెద్ద రోగమును పోలి ఉంటుంది. ఈ వ్యాధి ముఖ్యంగా ఫిబ్రవరి నుండి మే సమయంలో ఎక్కువగా వస్తుంది. మేక పిల్లలకు తీవ్రంగా సోకుతుంది.
కారణాలు: ఈ వ్యాధి వైరస్ వలన సంక్రమిస్తుంది. కొత్తగా కొనుగోలు చేసిన మేకలను మందలో చేర్చిన తరువాత ఈ వ్యాధి ప్రబలుతుంది.
లక్షణాలు:
* వ్యాధి సోకిన మేకలలో జ్వరం తీవ్రంగా ఉంటుంది.
* జీవాలు సరిగా మేయకపోవడం, పలుచగా పారుతూ ఉంటాయి.
* నోటిలో, పెదవులు, నాలుక వాచి పొక్కులు ఏర్పడతాయి.
* చూడితో ఉన్న జీవాలు ఈసుకుని పోతాయి.
* డీహ్రైడ్రేషన్ సంభవించి, జీవాలు మరణిస్తాయి.
చికిత్స నివారణ: * వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే దగ్గరలోని పశువైద్యుని సంప్రదించి, వారి పర్యవేక్షణలో సరైన చికిత్స అందించాలి. * గ్లూకోజు మరియు ఎలక్ట్రోలైట్స్ కలిపిన నీటిని ఞ గంజిని త్రాగించాలి.
ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం ఆనందంగా జీవితాన్ని గడపడమే. ఆరోగ్యం సక్రమంగా లేకుంటే ఆనందంగా జీవితాలను గడపలేము అనే విషయం అందరికి తెలిసిందే. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నపుడే ఎలాంటి ఆనందమయినా పొందగలం. మన ఆరోగ్యం మనం తినే ఆహారం, పీల్చే గాలి, త్రాగే నీటిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ మూడింటిలో మనం తినే ఆహారం విషయం గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం మనం తినే ఆహారం చాలా వరకు రైతులు రసాయన వ్యవసాయం చేసి పండిస్తున్నదే కాబట్టి విష రసాయన అవశేషాలు ఉన్న ఆహారాలు తినడము వలన మన ఆరోగ్యాన్ని పాడు చేయడములో రసాయన అవశేషాలు ఉన్న ఆహారాలు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా చాలామంది రైతులు సేంద్రియ బాటపట్టి విష రసాయనాలు లేకుండా సేంద్రియ ఆహారాలను పండిస్తున్నారు. వినియోగదారులు కూడా వారికున్న అవకాశాలను బట్టి సేంద్రియ ఆహారాలను తినడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. సేంద్రియ ఆహారానికి ఉన్న ప్రాముఖ్యత గమనించి తాము సేంద్రియ ఉత్పత్తులను తినడంతో పాటు సమాజానికి కూడా నాణ్యమయిన సేంద్రియ ఉత్పత్తులు అందించడంలో తన వంతు పాత్రను పోషిద్దాము అనే లక్ష్యంతో సేంద్రియ సాగులో అడుగు పెట్టారు సునంద.
సునందది వ్యవసాయ నేపథ్యం. అయినా కాని ఉన్నత చదువులు చదివి అధ్యాపక వృత్తిలో ప్రవేశించి కొనసాగుతున్న క్రమంలో ఆసీఫాబాదు జిల్లాకు చెందిన రవికుమార్తో వివాహం జరిగింది. రవికుమార్ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అప్పట్లో వీరి కుటుంబం హైదరాబాదు నగరం ఆల్వాలు ప్రాంతంలో నివాసం ఉండేది. ఎం.ఎస్సీ. కెమిస్ట్రీ పూర్తి చేసిన సునంద పీహెచ్.డి. పూర్తి చేసి ఏదైనా కాలేజీలో లెక్చరర్గా మరలా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుండగా భర్త రవికుమార్ వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడటము జరిగింది. అంతేకాకుండా వీరిపిల్లలు కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో అనునిత్యం సతమతమవడం ప్రత్యక్షంగా అనుభవించారు. అదే సమయంలో రవికుమార్ ప్రాణ స్నేహితుడు క్యాన్సర్తో మరణించడం జరిగి భార్యా, పిల్లలను అనాథలను చేయడము సునంద మనసుని కలచి వేసింది. ఎంత డబ్బున్నా కాని ఆరోగ్యం సక్రమంగా లేకుంటే అంతా వృథా అని ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. ఈ పరిణామాలన్నీ అనారోగ్య సమస్యలకు కారణాలు వెతకడానికి ప్రేరేపించి కారణాలు తెలుసుకోగా, ప్రధానంగా ప్రస్తుతం తమ కుటుంబ సభ్యులు ఎదుర్కొనే అనారోగ్య సమస్యలకు కారణాలు చాలావరకు తాము తినే ఆహారంలో ఉండే విషరసాయన అవశేషాలు అని గ్రహించి తాము విష రసాయన అవశేషాలు లేని ఆహారాన్ని తినాలని నిశ్చయించుకుని అటువైపు అడుగులు వేయడం జరిగి, మొదటగా తాము ఉపయోగించే నూనెను మార్పు చేసి మార్కెట్లో దొరికే రిఫైండ్ నూనెకు బదులుగా కోల్డ్ ప్రెస్డ్ నూనెను ఉపయోగించడం మొదలు పెట్టారు. చాలా వరకు అనారోగ్య సమస్యలు దూరం అవటం గమనించిన తరువాత తాము తినే ఆహారాలను చాలా వరకు సేంద్రియ పద్ధతులతో పండించినవే తినడం మొదలుపెట్టారు. ఈ మార్పుల వలన తమ కుటుంబసభ్యులు ఎదుర్కొనే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం ప్రత్యక్షంగా తెలుసుకోగలిగారు. అదే సమయంలో కరోనా మహమ్మారి వలన లాక్డౌన్ ప్రకటించడం జరిగి హైదరాబాదు నుంచి తమ కుటుంబాన్ని రవికుమార్ సొంత ఊరు అసీఫాబాదు జిల్లా విజయనగరంకి మార్చడం జరిగింది.
వీరి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు మరియు కరోనా సమయంలో ప్రపంచం మొత్తం ఎదుర్కొన్న ఇబ్బందులు కక్షుణ్ణంగా అధ్యయనం చేసిన సునంద ఆదాయం కంటే ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం అని తెలుసుకుని తాను వ్యవసాయ రంగంలో దిగి పూర్తి సేంద్రియ పద్ధతులలో వివిధ రకాల పంటలు పండించాలనుకుంటున్నానని భర్త రవికుమార్కు తెలియచేయగా రవికుమార్ ఆనందంగా సునంద నిర్ణయాన్ని స్వాగతించి తను మాత్రం సాఫ్ట్వేర్ ఉద్యోగ రంగంలో కొనసాగుతూ, తన ఖాళీ సమయాన్ని వ్యవసాయంలో సునందకు సహకారం అందిస్తూ సునందని పూర్తిగా వ్యవసాయరంగంలో దించడం జరిగింది.
తమ సొంత పొలం 8 ఎకరాలలో సేంద్రియ పద్ధతులతో వివిధ రకాల పంటల సాగు మొదలు పెట్టారు. సేంద్రియ పద్ధతులకు సంబంధించిన సమాచారం కొరకు వివిధ రకాల పుస్తకాలు చదవడం, సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన రైతులను కలవడం, రైతుల యొక్క వీడియోలను యూట్యూబ్లో చూడడము, సేంద్రియ పద్ధతులను ప్రచారం చేస్తున్న నిపుణులను కలసి వివరాలు తెలుసుకోవడం లాంటివి చేస్తూ సేంద్రియ సాగు మొదలు పెట్టి అనుభవం గడించే కొలది తాము పాటించే పద్ధతులలో మార్పులు చేసుకుంటూ వస్తూ సుమారు 30 రకాల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తూ ఆరోగ్యకరమయిన దిగుబడులు సాధిస్తూ వస్తున్నారు. వచ్చిన దిగుబడిని హోల్సేల్గా అమ్మినట్లయితే సరైన ధర రావడం లేదు కనుక సేంద్రియ సాగులో లాభాలు ఆర్జించాలంటే పంట ఉత్పత్తులకు విలువ జోడింపు మరియు నేరుగా వినియోగదారులకు అమ్మకం చేయడమే సరైన దారి అని నమ్మి తమ పంట ఉత్పత్తులకు విలువ జోడించి అనగా వడ్లను బియ్యం చేసి, కందులు, పెసలు, మినుములు లాంటివి పప్పులు చేసి… ఈ విధంగా తాము పండించే పంటలను సాధ్యమైనంతవరకు విలువ జోడించి నేరుగా వినియోగదారులకు అమ్మడం మొదలు పెట్టారు. తాము పాటించే సాగు పద్ధతులు మరియు తాము పండించే పంటల వివరాలు ఎక్కువమంది ప్రజలకు తెలియ చేయడానికి సామాజిక మాధ్యమాలను సరైన పద్ధతిలో వినియోగించుకుంటూ రోజురోజుకు వినియోగదారుల సంఖ్య పెంచుకుంటూ వస్తున్నారు.
తమ ఈ ప్రయాణంలో అనేకమంది వినియోగదారులు సమకూరడంతో పాటు అనేక మంది సేంద్రియ రైతులు కూడా తమ ఉత్పత్తులకు ఆశాజనకమయిన ధర లభించడానికి గాను సునందను కలవగా తాము పండించే ఉత్పత్తులతో పాటు తోటి సేంద్రియ రైతులు పండించిన ఉత్పత్తులను కూడా కలిపి వినియోగదారులకు అందించగలిగితే అటు వినియోగదారులకు ఇటు రైతులకు ఇద్దరికీ ఉపయోగకరంగా ఉంటుందని గ్రహించి తోటి సేంద్రియ రైతులు పండించిన ఉత్పత్తులను కూడా వినియోగదారులకు అమ్మకం చేయడం మొదలు పెట్టారు.
వివిధ రకాల పంటల సాగులో వివిధ రకాల సేంద్రియ పద్ధతులను పాటిస్తూ ఆరోగ్యకరమయిన దిగుబడి సాధిస్తున్న క్రమంలో తోటి రైతులు కూడా సేంద్రియ పద్ధతుల గురించి సునందను సంప్రదించటము మొదలయ్యింది. తన సేంద్రియ సాగు అనుభవాలు ఎక్కువమందికి చేరాలంటే హైదరాబాదు సమీపంలో పంటల సాగు మొదలు పెడితే ఫలితాలు బాగా ఉంటాయని, దానికి తోడు హైదరాబాదు మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ కాబట్టి తాము ఆర్థికంగా కూడా ఉద్యోగం చేస్తే వచ్చే ఆదాయాన్ని వ్యవసాయం చేస్తూ కూడా పొందవచ్చు అని తోటి యువతకు ప్రత్యేకించి మహిళలకు చూపించాలనే లక్ష్యంతో ఉన్న సునంద హైదరాబాదు శివారు ప్రాంతాలు తిరిగి శంషాబాదు సమీపంలోని పెదవేడు గ్రామంలో 25 ఎకరాలు వివిధ రకాల పండ్ల తోటను 2023 ఆగస్టు నెలలో కౌలుకు తీసుకుని తమ కుటుంబాన్ని ఆ పొలంలోకి మార్చారు. రవికుమార్ ఉద్యోగ బాధ్యతలు కూడా హైదరాబాదులోనే కాబట్టి అన్నీ అనుకూలంగా ఉంటాయని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం సునందగారు కౌలుకి తీసుకుని సాగు చేస్తున్న 25 ఎకరాల తోటలో మామిడి, సపోట, బత్తాయి మొదలగు వివిధ రకాల పండ్ల మొక్కలు దిగుబడిని ఇస్తున్నాయి. వచ్చిన దిగుబడిని నేరుగా వినియోగదారులకు, కొంత భాగం దిగుబడిని సేంద్రియ ఉత్పత్తులు అమ్మకం చేసే దుకాణాలకు అమ్మకం చేస్తూ వస్తున్నారు. తాము పండించే పంట దిగుబడులతో పాటు తోటి రైతులు పండించే నాణ్యమయిన సేంద్రియ ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేస్తూ తోటి రైతులకు తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. మరిన్ని వివరాలు 7799544705కు ఫోను చేసి తెలుసుకోగలరు.
కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి
ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి అనే విషయం అందరికి తెలిసిందే. మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయ రంగం, అదీను సేంద్రియ వ్యవసాయ రంగంలో కుంటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా ఉండాలి. సేంద్రియ సాగులో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు లాంటి వాటిని సొంతంగా తయారు చేసుకోవడంతో పాటు పంట ఉత్పత్తులకు విలువ జోడింపు మరియు మార్కెటింగ్ లాంటి విషయాలలో కూడా కుటుంబ సభ్యుల సహకారం తప్పని సరి అవుతుంది. కాని ప్రస్తుత పరిస్థితులను పరిశీలించినట్లయితే చాలామంది మహిళలకు వ్యవసాయరంగం అంటే పెద్దగా ఇష్టం ఉండడం లేదు. కాబట్టే మగవారు వ్యవసాయం అంటే మక్కువ ఉన్నా కూడా తమ ఇంటి మహిళలకు వ్యవసాయరంగం అంటే ఇష్టం లేకపోవడం వలన వ్యవసాయరంగంలో అడుగు పెట్టలేక పోతున్నారు. కొంతమంది మగవారు అయితే తమ ఇంట్లోని మహిళల ఇష్టాలను పట్టించుకోకుండా వ్యవసాయరంగంలోకి అడుగు పెట్టి తమ మక్కువను తీర్చుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చాలావరకు ఇలా ఉంటే సునంద గారి మనస్తత్వం ఇందుకు భిన్నంగా తోటి మహిళలకు స్ఫూర్తినిచ్చేదిగా ఉంది. ఉన్నత చదువులు చదివి కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి కుటుంబ బాధ్యతల నిమిత్తం ఉద్యోగం మానివేసి కుటుంబ బాధ్యతల నుంచి కొంచెం బయట పడ్డ తరువాత మరలా ఉద్యోగంలో చేరదామనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్న సమయంలో ఆదాయం కంటే ఆరోగ్యం ముఖ్యం అని తెలుసుకుని తన కుటుంబ సభ్యుల ఆరోగ్యం కాపాడడం ఒక ఇల్లాలిగా తన బాధ్యత అని గుర్తించి ఉద్యోగ ప్రయత్నాలు మానివేసి, తమ కుటుంబాన్ని నగరాన్నుంచి గ్రామానికి మార్చి వ్యవసాయరంగం అదీను శారీరక శ్రమ ఎక్కువగా ఉండే సేంద్రియ వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టవలసి వచ్చింది. పరిస్థితులకు అనుకూలంగా తన లక్ష్యాన్ని మార్చుకుని ప్రత్యక్ష వ్యవసాయరంగంలోకి దిగిన సునందకు భర్త రవికుమార్ కృతజ్ఞతలు తెలియచేశారు. అదేవిధంగా తాను ఉద్యోగం చేస్తూ, అవసరమయితే పంటల సాగు కొరకు తన డబ్బును ఇవ్వడముతో పాటు పంటల సాగు, విలువ జోడింపు మరియు మార్కెటింగ్ లాంటి విషయాలలో తన వంతు పాత్ర పోషిస్తున్న భర్త రవికుమార్కు సునంద కృతజ్ఞతలు తెలియచేశారు. భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ముందుకు సాగుతుంటే ఆరోగ్యకరమయిన, ఆనందకర జీవితం పెద్ద కష్టం కాదు అని సునంద, రవికుమార్లు నిరూపిస్తున్నారు.
(గమనిక: సునంద గారు సాగు చేసే పంటలు, పాటించే పద్ధతుల గురించి ‘రైతునేస్తం’ యూట్యూబ్ ఛానల్లో ఆవిడ మాటల్లోనే వినగలరు.)
ఇటీవల కాలం వరకు దేశ వ్యవసాయ రంగంలో కాస్త లాభాలనిచ్చే రంగంగా ఆక్వా పరిశ్రమ పేరుగాంచింది. అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యలకు గిరాకీ ఉండటం, దేశీయ మార్కెట్లో చేపల వినియోగం పెరగటం వల్ల వాటిని సాగు చేసే రైతులకు ఆకర్షణీయమైన ప్రతిఫలం లభించింది. చేపల చెరువులకు కౌలు ఎకరాకు 50 వేల రూపాయలకు, రొయ్యల చెరువులకు కౌలు ఎకరాకు లక్ష రూపాయల వరకు చేరింది. దాదాపు 30 శాతం చెరువుల్ని కౌలు రైతులు సాగు చేస్తున్నారు. గత కొద్ది నెలలుగా చేపలు, రొయ్యల్ని సాగు చేస్తున్న రైతులు, కౌలు రైతులు తమకు లభిస్తున్న ధరల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల ఎగుమతులు మందగించడంతో రైతులకు లభిస్తున్న ధరలు ఉత్పత్తి వ్యయం కన్నా తక్కువగా ఉంటున్నాయని వారు వాపోతున్నారు. దాణా ధరలు, కూలీల రేట్లు, విద్యుచ్ఛక్తి ఛార్జీలు పెరగటం వల్ల ఉత్పత్తి వ్యయం పెరగటం, ఉత్పత్తులకు లభిస్తున్న ధరలు మాత్రం పదేళ్ళ కింద స్థాయిలోనే ఉండటం వల్ల తమకు గిట్టుబాటు కాకపోవడం వల్ల ‘పంటవిరామం’ ప్రకటించే అవకాశముందని ఉత్పత్తిదార్ల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. రొయ్య, చేపపిల్లల్ని సరఫరా హేచరీలు తమ కార్యకలాపాలను తగ్గిస్తున్నాయి. దాణాను సరఫరా చేసే కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. రైతులు కొంతమంది రెండవ, మూడవ పంటలను మానివేయటము, వేసే పిల్లల సంఖ్యను తగ్గించడం చేస్తున్నారు. ఎగుమతిదార్లు కొనుగోళ్ళు ఆపు చేయడం వల్ల ధరలు తగ్గాయి. కొనుగోలు చేసే వ్యాపారులు ఒక ‘సిండికేట్’గా ఏర్పడి ధరల్ని తగ్గిస్తున్నారని రైతులు ఆందోళన చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇలాంటి సంక్షోభాలేర్పడటం ఆక్వా పరిశ్రమకు కొత్తకాదు. కరోనా ప్రబలినప్పుడు ఎగుమతులు తగ్గటం, ధరలు పడిపోవటం జరిగింది. కాని దాని ప్రభావం తగ్గగానే మళ్ళీ ఎగుమతులు పెరిగాయి. రైతులు సాగుని పెంచారు. 2022తో పోలిస్తే 2023లో ప్రపంచ రొయ్యల ఉత్పత్తి కొంత తగ్గింది. 2024లో అది మళ్ళీ పుంజుకుంటుందనే ఆశాభావం వ్యక్తమయింది. అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం అదుపు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వినిమయదారులు తమ నెలవారీ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో రొయ్యలు వంటి అధిక ధర ఉన్న ఉత్పత్తులను తక్కువగా కొంటున్నారు. రొయ్యల్లో ‘కొలెస్ట్రాల్’ ఎక్కువగా ఉంటుందనే ప్రచారం కూడా గిరాకీ తగ్గటానికి కారణం కావచ్చు.
వేగంగా పెరిగిన గిరాకీ, ఉత్పత్తి
సాంప్రదాయంగా, సహజంగా సముద్ర జలాల్లో రొయ్యలు, చేపలు లభ్యమౌతుంటాయి. ఇప్పుడు వాటిని చెరువుల్లో పెంచటం మొదలైన తార్వత కూడా వాటిని ‘సముద్ర ఉత్పత్తులు’గా, ‘సముద్ర ఆహారం’గానే పరిగణిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1950-51లో దేశంలో చేపల ఉత్పత్తి 7.5 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేయబడింది. 2021-22లో దేశంలో చేపల ఉత్పత్తి 162.5 లక్షలకు పెరిగింది. 71 సంవత్సరాల్లో దేశంలో చేపల ఉత్పత్తి 22 రెట్లు పెరగటం విశేషం. 1970లో దేశంలో రొయ్యల ఉత్పత్తి కేవలం 20 టన్నులుగా నయోదైంది. తాజా అంచనాల ప్రకారం దేశంలో దాదాపు 9 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తయ్యాయి. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో సాధించిన అద్భుత ప్రగతి వల్ల దేశంలో హరిత, శ్వేత విప్లవాలతో పాటు నీలి విప్లవం కూడా సంభవించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దేశంలో చేపల తలసరి లభ్యత 8.9 కిలోలకు పెరిగింది. దేశంలో ఉత్పత్తయ్యే చేపల్లో కొద్ది భాగమే ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. కాని దేశంలో ఉత్పత్తయ్యే రొయ్యల్లో 90 శాతానికి పైగా ఎగుమతి అవుతున్నాయి. అందువల్ల తలసరి రొయ్యల వినియోగం దేశంలో కొన్ని గ్రాములకే పరిమితమైంది. 2022-23లో దేశం నుండి 17,35,286 మెట్రిక్ టన్నుల సముద్ర ఆహార ఉత్పత్తులు దేశం నుండి ఎగుమతయ్యాయి. వాటి విలువ 63,969.14 కోట్ల రూపాయలు (8.09 బిలియన్ల అమెరికన్ డాలర్లు)గా ఉంది. 2023-24లో సముద్ర ఆహార ఉత్పత్తుల విలువ 9.25 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. కాని 2023 ఏప్రిల్ నుండి 2024 జనవరి వరకు జరిగిన సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతి విలువ అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో జరిగిన ఎగుమతుల విలువ 7.5 శాతం తగ్గినట్లు అధికార గణాంకాలు తెలుపుతున్నాయి. ఐతే ఎగుమతుల పరిమాణం మాత్రం తగ్గలేదు. ‘వనామీ’ రకం రొయ్యల ధర అంతర్జాతీయ మార్కెట్లో తగ్గటం వల్ల ఎగుమతుల విలువ తగ్గింది. దక్షిణ అమెరికాలోని ఈక్వడార్ దేశంలో వాణిజ్య స్థాయిలో రొయ్యల సాగు జరుగుతున్నది. 11 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తితో భారతదేశాన్ని రెండవ స్థానానికి నెట్టి వేసింది. భారత దేశంలో రొయ్యల ఉత్పత్తి చిన్న చిన్న కమతాల్లో జరుగుతుండగా ఈక్వడార్లో పెద్దపెద్ద కంపెనీలు సగటున 250 హెక్టార్ల విస్తీర్ణంలో రొయ్యల ఉత్పత్తిని చేపట్టాయి. ఈక్వడార్ పోటీలో ఉండి అధిక మొత్తంలో వనామీ రొయ్యల్ని ఎగుమతి చేయడం వల్ల ధరలు తగ్గాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
పెరిగిన చేపలు, రొయ్యల సాగు
2023లో ప్రపంచంలో 186.6 మిలియన్ మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరిగినట్లు అంచనా వేశారు. సాంప్రదాయంగా సముద్రాలు, నదులు, జలాశయాలు, వాగులు వంటి జలవనరుల నుండి వలలు, బోట్లు, మరబోట్లు వంటి సాధనాల సాయంతో పట్టినవి 90.6 మిలియన్ మెట్రిక్ టన్నులుండగా, కృత్రిమంగా తవ్విన చెరువుల్లో పిల్లలను వేసి, మంచి నిర్వహణతో ఉత్పత్తి చేసిన చేపలు96.6 మిలియన్ మెట్రిక్ టన్నులుగా లెక్కించారు. 2022లో ప్రపంచంలో రొయ్యల ఉత్పత్తి 94 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. అందులో 38 లక్షల టన్నుల రొయ్యలను సహజ వనరుల నుండి పట్టుకోగా, 56 లక్షల టన్నుల రొయ్యలను కృత్రిమంగా నిర్మించిన చెరువుల్లో సాగు చేసి ఉత్పత్తి చేశారు. 2023లో ప్రపంచ సాగర ఆహార ఉత్పత్తుల విలువను 155.32 బిలియన్ డాలర్లుగా అంచనా కట్టారు. ఇలా చేపలు, రొయ్యల ఉత్పత్తిలో సాగు ద్వారా ఉత్పత్తి చేసినవి సహజ వనరుల నుండి పట్టిన వాటికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తున్నది. భారతదేశంలో కూడా ఇదే ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నది. 1980-81లో భారతదేశంలో సముద్ర వనరుల నుండి 15.55 లక్షల టన్నుల చేపల్ని పట్టగా కేవలం 8.87 లక్షల టన్నులు మాత్రమే అంతర్గత జలవనరుల నుండి, కృత్రిమ సాగు నుండి లభించాయి. 2000-01లో సముద్ర వనరుల నుండి 28.11 లక్షల టన్నుల చేపల్ని పట్టగా అందుకు సమానంగా 28.45 లక్షల టన్నుల చేపలు అంతర్గత జలవనరుల నుండి, కృత్రిమ సాగు నుండి లభించాయి. 2021-22లో సముద్ర వనరుల నుండి 41.27 లక్షల టన్నుల చేపల్ని పట్టగా, 121.21 లక్షల టన్నుల చేపలు అంతర్గత జలవనరుల నుండి, కృత్రిమ సాగు నుండి లభించాయి. సముద్ర వనరుల నుండి ఒక వంతు చేపలు లభించగా, అంతర్గత వనరుల నుండి, ముఖ్యంగా కృత్రిమ చెరువుల ద్వారా మూడొంతులు ఉత్పత్తయ్యాయి. సహజ వనరుల్లో పట్టే చేపల కన్నా, కృత్రిమ చెరువుల్లోనే ఎక్కువగా చేపలు ఉత్పత్తవుతున్నాయి. మొత్తం చేపల ఉత్పత్తిలో దాదాపు 30 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది. 11.4 శాతం వాటాతో పశ్చిమ బెంగాల్ రెండవ స్థానంలోనూ, 6.4 శాతం వాటాతో కర్నాటక మూడవ స్థానంలోనూ, 6.1 శాతం వాటాతో ఒడిస్సా నాల్గవ స్థానంలోనూ చేపల ఉత్పత్తిలో ప్రముఖంగా ఉన్నాయి. 5.4 శాతం వాటాతో గుజరాత్, 5.1 శాతం వాటాతో కేరళ, 5 శాతం వాటాతో తమిళనాడు రాష్ట్రాలు కూడా ముఖ్యమైన చేపల ఉత్పత్తి కేంద్రాలుగా ఉన్నాయి. గుజరాత్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు సముద్ర వనరుల నుండి చేపలు లభిస్తుండగా ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, కర్నాటక రాష్ట్రాల్లో అంతర్గత జలవనరుల నుండి, కృత్రిమ సాగు నుండి ఎక్కువగా చేపలు ఉత్పత్తవుతున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో అంతర్గత జల వనరుల నుండి, కృత్రిమ సాగు నుండి 3.9 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తయ్యాయి. రొయ్యల ఉత్పత్తిలో కృత్రిమ సాగుదే ప్రధాన పాత్రగా ఉన్నది. మొదట్లో చైనా, థాయ్లాండ్లలో ప్రారంభమైన రొయ్యల సాగు భారతదేశానికి పాకింది. ముందుగా నల్లటైగర్ రొయ్యలతో ప్రారంభైన సాగు ఆ రకం రొయ్యలకు వైరస్ తెగుళ్ళు ఎక్కువగా సోకటం వల్ల వనామీ రొయ్యల సాగు ప్రాచుర్యంలోకి వచ్చిందిప్పుడు. దేశంలో 108,526 హెక్టార్లలో వనామీ రొయ్యల సాగు జరుగుతుంది. 20-21లో 815,745 టన్నుల వనామీ రొయ్యలు ఉత్పత్తయ్యాయి. చేపల సాగులాగానే వనామీ రొయ్యల సాగులోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం వనామీ సాగు విస్తీర్ణంలో 66.3 శాతం వనామీ రొయ్యల ఉత్పత్తిలో 77.8 శాతం వాటాలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి. గుజరాత్, తమిళనాడు, ఒడిస్సా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కూడా కొంతమేరకు వనామీ రొయ్యల ఉత్పత్తి జరుగుతున్నది. భారతదేశంలో నల్ల టైగర్ రొయ్యల్ని 58,196 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. 27,616 టన్నుల నల్లటైగర్ రొయ్యలు ఉత్పత్తవుతున్నాయి. పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్నాటక, ఒడిస్సా రాష్ట్రాల్లో ఈ నల్లటైగర్ రొయ్యలు సాగవుతున్నాయి.
సంక్షోభ సూచికలు
రొయ్యలు, చేపల సాగులో సమస్యలు కొత్తకాదు. అనేక వైరస్ జబ్బులు వాటిని ఆశిస్తాయి. తెగుళ్ళ బెడద, మార్కెట్ ఒడిదుడుకుల వల్ల రొయ్యల సాగులో నాలుగైదేళ్ళకోసారి నష్టాలొస్తుంటాయి. ఐతే మిగిలిన సంవత్సరాల్లో ఆకర్షణీయమైన లాభాలుంటాయి. ఉప్పు కయ్యలకు సమీపంలోని చేలల్లోకి కావలసినప్పుడు ఉప్పు నీటిని పంపే అవకాశముండి, మురుగు నీటిని బయటకి పంపే సౌకర్యం ఉన్న చేలను చెరువులుగా మార్చి, హేచరీల నుండి పిల్లల్ని, కంపెనీల నుండి దాణాను, మందులను కొని, శ్రామికుల సాయంతో రైతులు, కౌలుదార్లు రొయ్యల సాగుని చేస్తున్నారు. కిలో రొయ్యల ఉత్పత్తికి దాణా ఖర్చు రూ. 90 నుండి 100 వరకు అవుతున్నది. పిల్లల ఖర్చు, విద్యుచ్ఛక్తి బిల్లు, కూలీల ఖర్చు, మందులు వగైరా ఇతర ఖర్చులన్నీ కలిపి దాదాపు రెండువందల వరకు ఉత్పత్తి వ్యయం అవుతున్నది. ఇక కౌలు, వడ్డీ, ఇన్సూరెన్స్ వంటి వాటిని లెక్కిస్తే ఉత్పత్తి వ్యయం కిలోకి రూ. 250 లకు చేరుతుంది. ప్రపంచ మార్కెట్లో ధరలు తగ్గటం, ఎగుమతిదార్లు కొనుగోలు చేయకపోవటం, ప్రాసెసర్లు క్రియాశీలకంగా లేకపోవటం వల్ల వ్యాపారలు చాలా తక్కువ ధరలకు మాత్రమే రైతులు, కౌలుదార్లు కొనుగోళ్ళు చేసారు. ఉత్పత్తి వ్యయం కన్నా తక్కువ ధరకు అమ్మవలసి రావటంతో చాలామంది రైతులు, కౌలుదార్లు నష్టపోయారు. కొత్త పంట వేయటానికి ఆసక్తి, పెట్టుబడి లేక ఉత్పత్తి తగ్గటానికి చర్యలు తీసుకుంటున్నారు. కొందరు పంట వేయడం మానివేస్తే మరి కొందరు పిల్లల్ని తక్కువ సంఖ్యలో వేస్తున్నారు.
ఎగుమతులపై ఆధారపడ్డ రొయ్యల సాగు పరిస్థితి అలా ఉంటే దేశీయ మార్కెట్పైనే ఎక్కువగా ఆధారపడుతున్న చేపల సాగు పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. చేపల దాణా కూడా కిలోకి 50 రూపాయల వరకు చేరింది. ఒక కిలో బరువు పెరగటానికి చేపలకు 1.1 కిలోల దాణా అవసరమౌతుంది. ఇక విద్యుత్ ఛార్జీలు, కూలీల ఖర్చులు, మందుల ఖర్చు, పెట్టుబడిపై వడ్డీ వంటి ఇతర ఖర్చులన్నీ కలిపితే కిలో చేపల ఉత్పత్తి వ్యయం రూ. 100లు దాటుతున్నది. శీలావతి రకం చేపలకు కిలోకి వంద రూపాయలు మాత్రమే లభిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కిలోకి రూ. 120 ల ధర లభిస్తే తప్ప తమకు గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. రొయ్యల చెరువుల కన్నా చేపల చెరువుల్ని ఎక్కువ లోతు తవ్వాలి. మంచి నీరు రావటానికి, మురుగు నీరు బయటకు పోవటానికి ఏర్పాట్లు ఉండాలి. చేపలకు ఆక్సిజన్ లభించటానికి ఏరేటర్లు వంటి యంత్రాలను వాడాలి. వీటికయ్యే పెట్టుబడిపై వడ్డీ కూడా గణనీయంగా ఉంటుంది. ఆక్వాపరిశ్రమవల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. సముద్ర తీరానికి చేరువలో ఉండే మడ అడవులు తగ్గిపోతున్నాయి. ఈ దీర్ఘకాలిక సమస్యలు ఇలా ఉండగా చేపల రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితులేర్పడటం వల్ల చేపల సాగు కూడా తగ్గవచ్చు. పది ఎకరాల లోపు సాగు చేసే రైతులకు యూనిట్కు రూ. 1.50 చొప్పున విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆ పరిమితిని మించితే యూనిట్కు నాలుగు రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం మరికొంత రాయితీని ఇవ్వాలని చేపలు, రొయ్యలను సాగు చేసే రైతులు కోరుతున్నారు.
సమస్యలు తాత్కాలికమే
ఆక్వారంగంలో ప్రస్తుతమున్న సమస్యలు దీర్ఘకాలం ఉండే అవకాశాలు లేవు. జంతువులన్నిటిలోనూ చేపలే అత్యంత సమర్ధవంతమైనవిగా దాణాను తమ శరీర బరువుగా మార్చుకుంటాయి. ఒక కిలో బరువు తమ శరీరంలో పెరగటానికి 1.1 కిలోల దాణా సరిపోతుంది. మాంసానికి పెంచే కోళ్ళు ఒక కిలో శరీర బరువు పెరగటానికి 1.7 కిలోల దాణా అవసరమౌతుంది. అదే పశువులు ఒక కిలో బరువు పెరగటానికి 6.6 కిలోల దాణా అవసరమౌతుంది. అత్యంత సమర్ధవంతంగా దాణాను వినియోగించుకొని బరువు పెరగగలిగిన చేపలకు గిరాకీ పెరుగుతున్నది. 2005 నుండి 2021 మధ్య దేశంలో చేపల తలసరి వినియోగం 81 శాతం పెరిగింది. ప్రస్తుతం 8.9 కిలోల తలసరి చేపల వినియోగం 2030 నాటికి 19.8 కిలోలకు పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మాంసాహారాలన్నిటిలోనూ పోషక విలువలు అత్యధికంగా చేపల్లో ఉన్నాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. వాటి ధరలు కోడి మాంసం ధరలకు సమానంగా ఉన్నాయి. అలాగే రొయ్యల ధరలు వేటమాంసం ధరల స్థాయిలో ఉన్నాయి. దేశంలో ప్రజల సగటు ఆదాయాలు పెరిగేకొద్దీ మాంసాహారానికి గిరాకీ పెరుగుతుంది. ఇప్పుడు ఎగుమతులకే పరిమితమయిన రొయ్యలకు దేశీయ మార్కెట్లో కూడా గిరాకీ ఏర్పడే అవకాశాలున్నాయి. రొయ్యల ధరలు గత 30 సంవత్సరాల్లో తగ్గాయి. 1994 ఏప్రిల్లో కిలో రొయ్యల ధర అంతర్జాతీయ మార్కెట్లో 12.73 డాలర్లుగా ఉంది. నవంబరు 2009లో అత్యల్పంగా కిలోకి 7.5 డాలర్లకు తగ్గింది. ఆగస్టు 2014లో గరిష్టంగా కిలోకి 19.25 డాలర్లకు పెరిగింది. అక్టోబరు 2023లో వాటి ధర కిలోకి 8.6 డాలర్లకు తగ్గింది. ఇలా రొయ్యల ధరల్లో అంతర్జాతీయ మార్కెట్లో ఆటుపోట్లు సాధారణమే. అప్పుడే ధరలు కొంత పెరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం తగ్గి, వడ్డీ రేట్లు తగ్గి, పెరుగుదల నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.1 శాతం పెరుగుదలను 2024లో నమోదు చేస్తుందనీ, 2025లో అది 3.2 శాతంగా ఉంటుందని ప్రపంచంలో ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత దేశంలో ఆర్థిక ప్రగతి 6.5 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ జోస్యం చెప్పింది. 2023లో సముద్ర ఆహార ఉత్పత్తులు 20.7 మిలియన్ టన్నులుగా ఉన్నాయనీ అవి ఏటా 7.8 శాతం వృద్ధిరేటుతో 2032 నాటికల్లా 41.4 మిలియన్ టన్నులకు చేరతాయని ప్రభుత్వ మత్స్య శాఖ అంచనా వేసింది. వాటి విలువ 2024లో 21.04 బిలియన్ డాలర్లుగా ఉందనీ, 2028 నాటికల్లా వాటి విలువ 29.37 బిలియన్ డాలర్లకు చేరుతుందనీ ఆశిస్తున్నారు. స్థానిక, ప్రపంచ మార్కెట్లలో చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఆహార ఉత్పత్తులకు గిరాకీ పెరగటం ద్వారానే సాధ్యపడుతుంది. ప్రస్తుతం తాత్కాలిక సంక్షోభంలో ఉన్న ఆక్వా పరిశ్రమ త్వరలో బయటపడి రైతులకు లాభాలను, వినిమయ దారులకు ఆరోగ్యాన్నీ అందిస్తుందని ఆశిద్దాము.
సహజంగా గేదెలు ఏడాది పొడవునా ఎదకు వస్తాయి, కాని వేసవి కాలంలో ఎక్కువ ఉష్ణోగ్రత వలన మరియు పచ్చిమేత లభ్యత తక్కువగా ఉండడం వల్ల ఎద లక్షణాలు రైతుకు ప్రస్ఫుటముగా కనపడక, రైతు గేదెలను సరైన సమయములో చూలి కట్టించలేకపోవుట వలన చూడి కట్టే శాతం చాలా తక్కువగా ఉంది, రైతులు ఆర్థిక నష్టాలకు గురి అవుతారు.
గేదెలలో యుక్తవయస్సు ఆలస్యముగా రావడం, మూగ ఎద, తక్కువ ఎద లక్షణాలు మరియు ఈనిన తరువాత చూడి కట్టించుకాలం ఎక్కువగా ఉండడం వలన గేదెలు తక్కువ సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన జంతువులుగా పరిగణించబడతాయి. గేదెలు వేసవిలో చూడి సరిగ్గా కట్టకపోవడానికి పలు కారణాలు మనం పేర్కొనవచ్చు. వాటిలో ముఖ్యమైనవి పోషకాహార లోపం, పర్యావరణ, హార్మోన్ల అసమతుల్యత మరియు యాజమాన్య లోపం.
వేసవిలో గేదెలు చూడి కట్టకపోవడానికి గల కారణాలు
1. వాతావరణము: ఆవులు కంటే గేదెలు యొక్క శరీరం మందంగా, నలుపు రంగులో ఉండడం మరియు స్వేద గ్రంథులు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ ఉష్ణతాపానికి గురవుతాయి. వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండడం వలన పొలాల నీటి కుంటలలోని మురికి నీరు ఎక్కువగా తాగుతాయి. దీనివలన జలగ పురుగుల బారిన పడి రక్తహీనత మరియు దీర్ఘకాలిక విరోచనాలతో బాధపడడం వల్ల శక్తిహీనతకు గురై, ఎద లక్షణాలు సరైన విధంగా చూపించలేవు.
2. పోషక ఆహార లోపము: వేసవిలో అధిక వేడి కారణంగా గేదెలు మేతను తక్కువగా తీసుకుంటూ ఉంటాయి. శరీరములో శక్తి నిలువలు, పొడి పదార్థాన్ని జీర్ణించుకొనే శక్తి మరియు మాంసకృత్తులకు శరీర శక్తికి ఉండే నిష్పత్తి తగ్గుతాయి. అసమతుల్య పోషకాల వలన అండాశయములు స్పందించే స్వభావం తగ్గుతుంది, అందువల్ల అండాశయ స్థబ్దత, అండోత్పత్తిలో వ్యత్యాసాలు సంభవించి పశువులు తిరిగి పొర్లుతుంటాయి.
వేసవిలో పచ్చిమేత కొరత వలన ఎండు గడ్డి ఎక్కువగా మేపుట వల్ల కూడా ఖనిజ లవణాల లోపాలు ఏర్పడి, పశువుల్లో తాత్కాలిక వంధ్యత్వం ఏర్పడుతుంది.
3. యాజమాన్య పద్ధతులు: గేదెలు సంవత్సరం పొడవునా ఎదకు వచ్చే స్వభావం ఉన్నప్పటికి, వేసవిలో పునరుత్పత్తి ప్రక్రియకు విఘాతం కలగడం వల్ల, ఈతల మధ్య వ్యవధి పెరుగుతుంది. సాధారణంగా ఆవులతో పోలిస్తే ఎద లక్షణాలు తక్కువగా చూపుతాయి, ఈ సమస్య వేసవిలో మరింత జటిలం అవుతుంది. చాలావరకు గేదెలు వేసవి కాలంలో మూగ ఎదను చూపుతాయి, ఎద లక్షణాలు అయినటువంటి అరవటం, ఇతర పశువులపై ఎక్కటం, పశుమానం నుంచి స్రావాలు కారటం, చిరు ఉచ్చపోయటం వంటి లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తాయి, అంతేకాకుండా ఎదలక్షణాలు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటాయి. వేకువజామున లేదా రాత్రి సమయంలో మాత్రమే ఎద లక్షణాలను చూపుతాయి. ఈ కారణాలు వల్ల రైతులు ఎదను గమనించలేకపోతున్నారు. అందువలన చూడి కట్టించడానికి అధిక సమయం పడుతోంది.
వేసవిలో యాజమాన్య పద్ధతులు
వేసవిలో యాజమాన్యం పద్ధతులలో మార్పు చేసుకొన్న ఎడల గేదెలను విజవంతముగా చూడి కట్టించవచ్చు. వేసవిలో పశువులను సూర్యుని యొక్క ప్రత్యక్ష కిరణాలు నుండి కాపాడుట అనునది ప్రధానమైన సమస్య. దీనిని అధిగమించాలంటే పశువులకు చెట్ల కింద నీడ కల్పించి, తరుచుగా చల్లని నీళ్లతో కడగాలి లేదా కొద్దిసేపు పశువులను చెరువులు లేదా కాలువ నీటిలో ఈత కొట్టించవలెను. పశువుల కొట్టాల చుట్టూ గోనె పట్టాలు కట్టి వాటిని తరచూ చల్లని నీటితో తడుపుతూ ఉన్నచో గేదెలకు చల్లని వాతావరణము కల్పించవచ్చు. పశువుల మేపు సమయమున ఎండ తీవ్రత నుండి కాపాడుటకు పశువులను ఉదయం మరియు సాయంత్రం సమయంలో మాత్రమే ఆరుబయటకు మేపుకు వదలవలెను. ఇలా చేయటం వలన పశువుల పునరుత్పత్తిపై ప్రతికూల ప్రభావమును తగ్గించవచ్చు మరియు పశువుల పాల దిగుబడిని పూర్తి సామర్థ్యం మేర సాధించవచ్చు.
ఎద లక్షణాలను గుర్తించే అవకాశము మెరుగుపరచడం
పశువు యొక్క ఎదను సరిగ్గా గుర్తించకపోవుట వలన ఈనిన తర్వాత చూడి కట్టే కాలాన్ని పెంచుతూ రైతుకు ఆర్థికంగా నష్టము చేకూరుస్తుంది. సాధారణ రోజుల్లో మనము గమనించే పశు ఎద లక్షణాలు వేసవికాలంలో అంతగా గమనించలేము కావున చల్లని సమయాలలో ముఖ్యంగా పొద్దున మరియు రాత్రుల సమయంలో రైతులు ఎక్కువగా గమనించాలి.
వేసవిలో గేదెలలో పునరుత్పత్తిపై ప్రతికూల ప్రభావమును తగ్గించుట మరియు మూగ ఎదలను సరిగ్గా గుర్తించుట వలన సరైన సమయంలో చూడిని కట్టించడం ద్వారా పాల దిగుబడిని పెంచుకొనవచ్చు. సరైన ఎదకు రాని పశువులలో ఎద చక్రం క్రమబద్ధీకరించుట అను విధానమును పాటించవచ్చు. ఈ విధానం వలన పశువులను మనకు అనుకూల సమయంలో ఎదకి తెప్పించవచ్చు. పశువు ఈనిన తరువాత 90 రోజులలో ఎదకు రాని ఎడల ఈ విధానమును పాటించినచో మంచి ఫలితాలను పొందవచ్చును. ఎక్కువ పశువులు ఉన్న రైతులు ఈ విధానమును అవలంబించుటవలన సంవత్సరం పొడుగునా పాల ఉత్పత్తిని సాధించవచ్చు. పాడి పశువు దాని పునరుత్పత్తి కాలంలో ప్రతి సంవత్సరం ఒక దూడ పుట్టేటట్లు చేయవచ్చు. ఈ విధంగా పశుసంపదను పెంచుకోవచ్చు. ఈ విధానమును ఆచరించే ముందు పశువులను మంద నుంచి విడిగా ఉంచాలి. పశువులు గర్భందాల్చలేదని నిర్ధారించుకోవాలి. వాటికి నట్టల నివారణ, సమీకృత దాణ మరియు లవణ మిశ్రమమును అందించాలి. ఏ విధమైన గర్భకోశ వ్యాధులు గాని లోపాలుగాని ఉండకూడదు.
ఎద క్రమబద్ధీకరణ పద్ధతులు
ఎద చక్రం క్రమబద్ధీకరించడానికి చాలా రకాల విధానాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా రెండు పద్ధతులను అవలంబిస్తాము.
1. జి.పి.జి. పద్ధతి
ఈ పద్దతిలో మొదటి రోజున 5 మి.లీ. రిసెప్టాల్, గైనారిచ్ (బుసరెలిన్ అసిటేట్) కండకు ఇవ్వాలి. ఆ తర్వాత ఆరు రోజులకు 5 మి.లీ. లుటాలైజ్ (డైనోప్రాస్ట్ ప్రోమితమైన్) లేదా 2 మి.లీ. క్లోప్రోస్టినాల్ గాని ఇవ్వాలి. ఒకరోజు వ్యవధితో మళ్లీ 5 మి.లీ. బుసరెలిన్ అసిటేట్ ఇవ్వాలి తరువాత రోజు రెండు పూటలా ఎద ఇంజక్షను చేయించాలి.
2. రెండు డోసుల ప్రొస్టాగ్లాండిన్
ఈ పద్ధతిలో రెండు సార్లు 5 మి.లీ. డైనోప్రాస్ట్ ప్రోమితమైన్ లేదా 2 మి.లీ. క్లోప్రొస్టినాల్ గాని పదకొండు రోజుల వ్యవధిలో ఇస్తారు. రెండవ డోసు ఇచ్చిన తరువాత 48-72 గంటలలో పశువు ఎదకు వస్తుంది. రెండు పూటలా ఎద ఇంజక్షను చేయించడం మంచిది, లేదా రెండవ డోసు ఇచ్చిన తరువాత 72 గంటలకు ఒక ఎద ఇంజక్షను మరియు 96 గంటలకు మరియొక ఎద ఇంజక్షన్ చేయించడం ఉత్తమం. ఎదచక్రం క్రమబద్ధీకరించుట పద్ధతిని పాటించడం వలన రైతు సకాలంలో పశువులను ఎదకు తెప్పించి చూడి కట్టించి ఆర్థికంగా లాభాన్ని పొందవచ్చు. రాత్రి సమయంలో మంచి మేతను అందించుట, పశువులకు ఉదయము, సాయంత్రము సమయంలో మాత్రమే మేపుకు విడువుట వలన పశువులపై ఎండ తీవ్రత ప్రతికూల ప్రభావాన్ని తగ్గించవచ్చు. అంతేకాకుండా లేతగా ఉండే పచ్చి మేతను మాగుడు గడ్డిని, ఎండు చొప్పను తిన్నంత అందించుట వలన చల్లని నీటిని, లవణ మిశ్రమం అందించుట వలన ప్రత్యుత్పత్తి సామర్థ్యం వేసవిలో కూడా మెరుగుగా ఉంటుంది. సరైన పోషణ అందించుటతో పశువులలో ఎద లక్షణాలను మంచి వేసవిలో కూడా గమనించవచ్చు. పశువుల మేపులో ఉండే లవణములు మరియు శక్తి లోపాన్ని ప్రత్యేకమైన దాణా అందించుట వలన నివారించవచ్చు. రాత్రి సమయంలో పీచు ఎక్కువగా ఉండే మేతను ఇవ్వడం వల్ల దేహములో ఉత్పత్తి అయ్యే వేడి తీవ్రతను తగ్గించవచ్చు. వేసవిలో మేలైన యాజమాన్య పద్ధతులు ఉపయోగించి పశువులను చూడి కట్టించడం వల్ల సంవత్సరం పొడవునా పాల దిగుబడి ఉండడం వలన, రైతు ఆర్థికంగా మెరుగుపడతారు.
డా. బి. చంద్ర ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్; డా. చందన,M.V.Sc., ఫోన్: 80742 44537, ఎన్.టి.ఆర్. పశువైద్య కళాశాల, గన్నవరం, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్.
మనందరికి ఆరోగ్యం తప్పనిసరి. ఆరోగ్యం లేని జీవితాలలో ఆనందం ఉండదు. కాబట్టి ఎవరికైనా ఆరోగ్యం తప్పనిసరి అనే విషయం అక్షర సత్యం. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి గాలి, నీటితో పాటు మంచి ఆహారం తీసుకోగలగాలి. మన ఆరోగ్యం ప్రధానంగా ఈ మూడింటిపైనే ఆధారపడి ఉంటుంది. మంచి ఆహారం కావాలంటే సాధ్యమయినంత వరకు వేరే వారి మీద ఆధారపడకుండా తామే సొంతంగా పండించుకుని తింటేనే మంచి ఆహారం దొరుకుతుందనే పరిస్థితులు ప్రస్తుత సమాజంలో నెలకొన్నాయి. మనం తినే అన్ని రకాల ఆహారాలు అందరం పండించుకోలేము కాబట్టి ఎవరికి అవకాశం ఉన్నంత వరకు వారు పండించుకోవటానికి కొంతమంది ఔత్సాహికులు ప్రయత్నిస్తున్నారు. కాబట్టే ఇంటి పంటదారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. వివిధ రంగాలలో ఉన్నవారు ఎవరికి అవకాశం ఉన్నంత మేరలో వారు కొన్ని మొక్కలు పెంచుకుంటున్నారు. ఇంట్లో మొక్కలు పెంచుకోవటం వలన ఆరోగ్యకరమయిన ఆహారం సొంతంగా పండించుకొని తినడముతో పాటు శారీరక శ్రమకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంటిపంటలో గడిపిన సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది కాబట్టి మన శక్తి పెరుగుతుంది కాబట్టి మన రోజు వారి పనులలో సామర్థ్యం పెరిగి ఫలితాలు మంచిగా ఉంటాయనడములో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని గ్రహించి ఖమ్మం పట్టణానికి చెందిన శ్రీనివాస్ తమ ఇంట్లో ఏ మాత్రం స్థలాన్ని వదలకుండా వివిధ రకాల మొక్కల పెంపకం చేస్తున్నాడు.
శ్రీనివాస్ది సాఫ్ట్వేర్ రంగం. కరోనా తరువాత ఆరోగ్యం యొక్క విలువ తెలుసుకుని ఆరోగ్యకరమయిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలంటే ఇంటి పంటే సరైన దారి అని నమ్మి 2022 వ సంవత్సరం ఆగస్టు నెలలో తమ ఇంటి మేడ మీద, బాల్కనీలో, మిద్దె మీద వివిధ రకాల మొక్కల పెంపకం మొదలు పెట్టి కొనసాగిస్తున్నాడు. మొక్కల పెంపకంతో పాటు అక్వేరియంలో చేపల పెంపకం మరియు కొన్ని రకాల పకక్షులను కూడా పెంచడానికి తగిన ఏర్పాట్లు చేసుకుని పెంపకం చేస్తున్నాడు. పకక్షులకు అవసరమయిన గింజలు కోసం సజ్జ, జొన్న లాంటి విత్తనాలను తమ ఇంటి పంటలో చల్లి వాటి ద్వారా వచ్చే దిగుబడిని పకక్షులకు ఆహారంగా అందిస్తూ వస్తున్నాడు. చేపలు మరియు పకక్షులు పెంపకం వలన మనసుకు ఆహ్లాదం కలిగి రోజు మొత్తం ఆనందంగా గడపడం శ్రీనివాస్ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు.
తమ ఇంటిపంటలో అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో పాటు వివిధ రకాల పూలమొక్కలు పెంచుతున్నాడు. నీడపడే ప్రదేశంలో ఇండోర్ ప్లాంట్లని పెంపకం చేస్తున్నాడు. తనకు కొత్త రకాల మొక్కలంటే మక్కువ ఎక్కువ కాబట్టి ఏ కొత్తరకం మొక్క లేదా విత్తనం కనిపించినా వదలకుండా తన ఇంటి పంటలో పెంపకం మొదలు పెడుతుంటాడు. మొక్కల పెంపకానికి గ్రోబ్యాగ్స్, ప్లాస్టిక్ కుండీలను మాత్రమే వినియోగిస్తున్నాడు. మొక్కలలో పరపరాగ సంపర్కం సక్రమంగా జరగాలంటే సీతాకోకచిలకలు, తేనెటీగల లాంటివి కావాలి కాబట్టి వీటిని ఆకర్షించడానికి గాను పసుపురంగు పూవులుపూసే పూల మొక్కలను పెంపకం చేస్తున్నాడు. ఇంటిపంటలో నెమటోడ్స్ సమస్య రాకుండా ఉండటానికి గాను బంతి మొక్కలను పెంపకం చేస్తున్నాడు. సంవత్సరం పొడవునా ఇంటి పంట అందంగా కనిపించడానికి అవసరమయిన వివిధ రకాల పూల మొక్కలను పెంచుతూ ఇంటి పంట అందంగా కనిపించడానికి అవసరమయిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటున్నాడు కాబట్టే తమ ఇంటి పంట 365 రోజులు అందంగా ఉంటుందని శ్రీనివాస్ అంటున్నాడు.
మొక్కలు ఆరోగ్యంగా పెరగటానికి మరియు మంచి దిగుబడిని ఇవ్వడానికి అవసరమయిన సేంద్రియ పదార్థాలను సమయానుకూలంగా అందిస్తూ ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా ఇంటి పంటను కొనసాగిస్తున్నాడు. తోటి ఇంటి పంటదారులతో ప్రతినిత్యం కలుస్తూ మెలకువలు తెలుసుకుంటూ అతి తక్కువ సమయంలో ఇంటి పంటలో నైపుణ్యం సాధించి అనేకమంది ప్రశంసలు పొందుతున్నాడు. కొత్తగా ఇంటి పంటను మొదలు పెట్టాలనుకునే వారికి శ్రీనివాస్ మార్గదర్శి కాగలడు అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమగా పేరుగాంచిన కోళ్ల పెంపకం యజమానులకు వేసవిలో సవాలుగా మారింది. చలి, వర్షాకాలంలో అధికంగా కోళ్ల దిగుబడి పెరుగుతూ రైతులకు లాభాల బాటలో ఈ పరిశ్రమ కొనసాగుతుంటుంది. కానీ వేసవి కాలం రాగానే రైతులు భయపడి త్వరగా ఇతర రాష్టాలకు ఎగుమతి చేస్తారు. ఎందుకంటే ఎండ తీవ్రత పెరిగేకొద్దీ కోళ్లు చనిపోతున్నాయి. వేసవికాలం ఆరంభం మార్చి నుంచి జూన్ వరకు కొనసాగే వేడి వాతావరణం కోళ్ల పరిశ్రమను నష్టాలలోకి తీసుకొని పోతుంది. అంతేగాక బ్రాయిలర్, లేయర్లను ఎగుమతి చేసి ఫారాలను ఖాళీగా ఉంచుతారు. ఏటేటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడదెబ్బకు గురై 25-90 శాతం వరకు చనిపోతున్నాయి. ఇందుకోసం రైతులు తగు జాగ్రత్తలతో పశుసంవర్థక శాఖ అధికారులతో సంప్రదించి ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే ఆర్థిక నష్టం రాకుండా చేసుకోవచ్చును.
వేడిమి వల్ల కోళ్లలో వచ్చే లక్షణాలు ఏమిటి?
కోడి శరీరం చలిని తట్టుకునే విధంగా పూర్తిగా ఈకలతో కప్పబడి ఉంటుంది. వాటి శరీరంలో చెమట గ్రంథులు లేకపోవడం వలన ఉష్టోగ్రత 105-107 డిగ్రీల ఫారన్ హీట్ ఉంటుంది. వాతావరణ ఉష్టోగ్రత 107 డిగ్రీల ఫారన్హీట్ వరకు కోళ్లకు సదుపాయంగా ఉంటుంది. ఆ పై కోడి యొక్క దేహ రసాయన ప్రక్రియ దెబ్బతింటుంది.
ముఖ్యంగా వాతావరణ ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కోళ్లు ఆయాసపడుతూ తక్కువ మేత తింటూ ఎక్కువ నీళ్లు తాగుతాయి. అలాంటప్పుడు వడబెబ్బకు గురై చనిపోయే ప్రమాదం ఉంటుంది. గుడ్ల ఉత్పత్తి కూడా బాగా పడిపోతుంది.
వేడిమి వాతావరణము వల్ల కోళ్ల ఉత్పత్తి తగ్గుతుంది మరియు పెరుగుదల ఉండదు. అంతేగాక కోళ్లు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే కోళ్లు ఆయాసపడుతుంటాయి. దీంతో దాణా తక్కువగా తింటాయి.
లేయర్ కోళ్లులో కోడిగుడ్డు పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. పౌష్టిక మైన దాణా పెట్టిన గుడ్ల సైజు పెరగదు మరికొన్ని అసలు గుడ్లు పెట్టవు.
బ్రాయిలర్ కోళ్లు చనిపోతే రైతు ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోతాడు. వేసవిలో ఈ కోళ్ల ఎదుగుదల ఎక్కువగా ఉండదు. దీని వల్ల మాంసం ఉత్పత్తి తగ్గుతుంది.
ఎండ వేడికి కోళ్లు, పిల్లలు నీరసంగా కనిపిస్తాయి. నీళ్ల విరేచనాలు అవుతాయి. సరిగ్గా నిలబడలేవు. వణుకుతుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించగానే కోళ్ల ఫారం యజమానులు అప్రమత్తమై తగిన మందులు వేయించాలి.
కోళ్లలో మెడలు వాల్చడం, సన్నగా మూలగడం, కళ్లనుంచి నీరు కారడం వంటి లక్షణాలున్న కోళ్లను వెంటనే ఇతర కోళ్ల నుంచి వేరు చేసి సరైన చికిత్స అందించాలి.
వేసవిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల అనేక వ్యాధులకు గురయ్యే అవకాశాలుంటాయి. అంటు వ్యాధులు కూడా వస్తాయి. దీంతో మందుల కొనుగోలుకు అధికంగా ఖర్చులు పెట్టాల్సి వస్తుంది.
10 అడుగుల ఎత్తులో నిర్మించబడిన షెడ్ల కన్నా ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్న వాటిలో ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది.
కొన్ని జాతుల జన్యు సంబంధం మీద కూడా వాటి ప్రాణ నష్టం ఆధారపడి ఉంటుంది.
40 వారాల కన్నా తక్కువ వయస్సు గల కోళ్లలో మరియు కొత్తగా ఈకలు రాల్చిన కోళ్లలో ప్రాణనష్టం ఎక్కువ.
వేసవిలో కోళ్ళ దాణాలో తీసుకోవలసిన జాగ్రత్తలు
ముఖ్యమయిన జాగ్రత్త యేమిటంటే పోషకాలున్న దాణా పెట్టాలి. ఒకేసారి ఎక్కువగా దాన వేయ కూడదు.
వేసవిలో కోళ్లు తక్కువ మేత తింటాయి. ఉష్ణోగ్రతలు పెరిగినకొద్దీ నీరు ఎక్కువగా తాగుతాయి. నీటిని ఎక్కువగా తాగుతుండడంతో దాణా తక్కువగా తీసుకుంటాయి. ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్న సమయంలో దాణా ఇస్తే ప్రయోజనం ఉంటుంది. ఒకేసారి ఎక్కువ పరిమాణంలో దాణా ఇచ్చినా ప్రయోజనం ఉండదు.
దాణాను కొద్దిగా తడిపి పెట్టడం ఉత్తమం. ఎక్కువ తడిపితే దాణాకు బూజుపట్టే ప్రమాదం ఉంది.
వేసవిలో కోళ్లు పగటిపూట సరిగా తినవు. కాబట్టి ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం నాలుగు గంటల తర్వాత దాణా ఇవ్వాలి. కోళ్లకు నిత్యం ఉదయం నాలుగు గంటలకు 70 శాతం, రాత్రి 9 గంటలకు 30 శాతం దాణాను ఇవ్వాలి. మధ్యాహ్నం వేడిమి సమయంలో ఇవ్వకూడదు.
దాణాలో అవసరమైన మోతాదులో విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండేలా చూసుకోవాలి. మాంసకృతులు తగ్గించాలి.
ఒత్తిడికి లోనైన కోళ్లకు సి విటమిన్ ఎక్కువ ఇవ్వాలి. ఒక టన్ను దాణాలో వంద గ్రాములు విటమిన్-సి, 50 గ్రాములు విటమిన్ – ఈ ఉపయోగించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగును. అంతే కాకుండా విటమిన్-సి వాడడం వల్ల గుడ్డు పొట్టు గట్టిగా ఏర్పడును. విటమిన్-ఈ ఫలధీకరణ శాతాన్ని, గుడ్ల ఉత్పత్తిని పెంచును. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీటిలో విటమిన్-సి కలిపినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ విటమిన్-ఈ మాత్రం ముందు జాగ్రత్తగా ఇవ్వాలి. టీకాలు వేయుటకు రెండు వారాల ముందుగా ఇవ్వడం ఎంతైనా మంచిది.
మిథియోనిన్ అనే అమైనో ఆమ్లం కోళ్ల దాణాలో ఉపయోగించడం వల్ల ఎండ వేడి నుంచి కాపాడి గుడ్డు పొట్టు సాధారణంగా ఏర్పడుటకు సహాయపడును.
అమ్మోనియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్ 0.25 శాతం ఇవ్వడం వల్ల కోళ్లు ఎక్కువగా నీరు తాగును. దీంతో శరీర ఉష్ణోగ్రత తగ్గించవచ్చు.
వేసవిలో కోళ్లకు నీరు విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
తక్కువ నీరు ఇవ్వడం ఉత్తమం.
కోళ్లు వేసవిలో ఎక్కువగానే నీళ్లు తాగుతాయి. దాణా, నీటి నిష్పత్తి 1:2 ఉంటుంది. ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు 1.4 నిష్పత్తి ఇవ్వాలి. కోళ్లకు వీలైనంత వరకు చల్లని నీటిని ఇవ్వాలి. అందువల్ల షెడ్లలో అదనంగా నీటి తొట్టెలు ఏర్పాటు చేసి అవసరం మేరకు నీటిని అందించాలి.
కోళ్లు తాగే నీటిలో ఎల్లక్ట్రోలైట్లు – విటమిన్స్ వంటివి కలిపితే అవి వత్తిడికి గురి కాకుండా చూడాలి.
నీళ్ల ట్యాంకులు చల్లదనంగా ఉండేలా చూసుకోవాలి. నీటి ట్యాంకుల మీద గోనే సంచులు కప్పి వాటిని ఎప్పటికప్పుడు తడుపుతూ ఉండాలి. దీనివల్ల ట్యాంకుల్లోని నీరు వేడెక్కదు. లేదంటే 2000 లీటర్ల నీళ్ల ట్యాంక్లో 20 కేజీల మంచు గడ్డలు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల సమయం లో వేసి ఉంచడం వలన నీటి ఉష్ణోగ్రతను 22 నుంచి 24 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తగ్గించుకోవచ్చు.
నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు నియంత్రించాలంటే శుభ్రమైన నీటిని ఇవ్వాలి.
ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కోళ్లపైన నేరుగా నీటిని పిచికారి చేయవచ్చు.
వేసవిలో కోళ్లకు షెడ్ల నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
సూర్యరశ్మి తగలకుండా ఉండాలంటే కోళ్ల షెడ్లను తూర్పు, పడమరగా నిర్మించాలి. వెడల్పు 30 అడుగులకు మించకుండా ఉండాలి.
వేసవికాలంలో కోళ్ల షెడ్డు పైన గడ్డి, స్పింక్లర్స్ అమర్చి అరగంటకు ఒకసారి షెడ్డుపైన నీళ్లు చల్లాలి. దీంతో షెడ్డులోపల చల్లదనం చేకూరుతుంది. కోళ్లు మృత్యువాతనుంచి తప్పించుకోవచ్చు. షెడ్డుకు గాలి వచ్చే దిశలో పలుచని గోనె సంచులు లేదా గ్రీన్ నెట్ లాంటివి కట్టాలి. వాటిపై పది నుంచి పదిహేను సార్లు నీళ్ళు చల్లాలి. ఇలా చేయడం వల్ల వడగాల్పులు నేరుగా షెడ్డులోకి వెళ్ళకుండా ఉంటుంది. తడిచిన గ్రీన్ నెట్ వల్ల షెడ్డులోకి చల్లని గాలి వీస్తుంది. షెడ్డు లోపలి భాగంలో ఫాగర్స్ అమర్చి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అరగంటకోసారి నీళ్లు వదిలినచో కోళ్లపై తుంపరగా పడటం వల్ల కోడికి చల్లదనం ఇస్తుంది.
కోళ్ల ఫారాలు ఇరుకుగా ఉండకూడదు.షెడ్డులో ఎప్పుడు తేమ లేకుండా పొడిగా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. లిట్టర్ ఎత్తును తగ్గించి షెడ్డులో దుమ్ము దూళీ లేకుండా చూసుకోవాలి.
ఉష్ణోగ్రత తగ్గించేందుకు షెడ్డు పైన గడ్డిని దట్టంగా వేసిదానిపై అప్పుడప్పుడూ నీళ్లు చల్లుతుండాలి. దీంతో షెడ్డులోపల ఉష్ణోగ్రత తగ్గుతుంది. షెడ్డు కప్పుపై తెల్లని రంగు వేసి కూడ కొంత వరకు ఉష్ణోగ్రతను తగ్గించవచ్చును.
షెడ్డు చుట్టూ పది అడుగుల దూరంలో నీడనిచ్చే చెట్లు పెంచాలి.
షెడ్లలో కోళ్లను డీప్ లిట్టర్ పద్దతిలో లేదా కేజెస్లో నిర్దేశించిన సంఖ్యలోనే ఉండాలి. కేజెస్లో పెద్దకోడికి 0.75 వరకు చదరపు అడుగులు, డీప్ లిట్టర్ అయితే రెండు చదరపు అడుగుల స్థలంలో ఉంచాలి.
వేసవిలో కోళ్లకు ఆరోగ్య విషయములో తీసుకోవలసిన జాగ్రత్తలు
వాతావరణం చల్లగా ఉన్నప్పడే కోళ్ల ముక్కులు కత్తిరించిడం, టీకాలు వేయించడం, నట్టల నివారణ మందులు ఇవ్వడం వంటి పనులను పూర్తి చేయాలి. కోళ్ల వయస్సు ఎండ తీవ్రతను బట్టి దాణాలో ఆమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, మోతాదును పెంచాలి.
ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదు గంటల సమయంలో కోళ్లను పట్టుకోవడం, కలత చెందించడం వంటివి చేయకూడదు. వేసవిలో ఉదయం పూట మాత్రమే టీకాలు వేయాలి.
ఒకవేళ వేడిమికి ప్రాణనష్టం జరుగు తూ ఉంటే పది నుంచి 20 గ్రాముల దాణా తగ్గించాలి. దాణా మీద బూజు పట్టకుండా కొంచెం నీటిని చిలకరించాలి.
వేసవిలో ఎండ తీవ్రత పెరిగిన కొద్దీ వేడిగాలులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి ఎక్కువగా వ్యాధుల భారీన పడతాయి. కొక్కర, మారెక్స్, ఆర్డి, బర్డ్ప్లూ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఎండాకాలంలో వచ్చే వ్యాధుల నివారణకు ముందుగానే టీకాలు వేయించాలి.
మృత్యువాతకు గురైన కోళ్లను ఎక్కడ పడితే అక్కడ వేయరాదు. మృత్యువాత పడ్డ కోళ్లను 7 లేదా 8 ఫీట్ల గుంత తవ్వి పూడ్చాలి. ఇలా చేయడం ద్వారా ఒక ఫామ్ నుంచి మరొక ఫామ్కు ఈ వ్యాధులు వ్యాపించవు.
ఇలా వేసవిలో కోళ్ల పెంపకం దారులు అప్రమత్తంగా ఉంటూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కోళ్ల పెంపకాన్ని లాభసాటిగా చేయవచ్చు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలో విపరీతమైన ఎండలు, వడగాడ్పులు, అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు. మే నెలలో కూడా అధిక ఎండలు, అకాల వర్షాలు, వడగండ్ల వానలు కొనసాగే అవకాశం. మార్కెట్లలో, కళ్లాలలో కొన్ని చోట్ల తడిచి ముద్దవుతున్న ధాన్యం. మామిడి మొదలయిన పండ్ల తోటలు, కూరగాయల పంటలకు అక్కడక్కడ గాలులతో కూడిన వర్షాలతో నస్టాలు. దీనికి తోడు మే 13న జరిగే ఎన్నికల కొరకు అభ్యర్థుల ప్రచార హోరు. ఈ నేపథ్యంలో మే (భరణి, కృత్తిక, రోహిణి మొదటి భాగం)లో వివిధ పంటలలో చేయవలసిన కార్యక్రమాలు, చేతికొచ్చిన పంటలను అమ్ముకునేటప్పుడు మెళకువలు, ఇందులో రైతు ప్రజా సంఘాల పాత్ర మొదలయిన విషయాల గురించి…
వరి: యాసంగి/రబీ పంట మే మాసంలో మార్కెట్కు ఎక్కువగా వస్తుంది. వెంటవెంటనే మార్కెట్లలో కళ్ళాల్లో ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా అకాల వర్షాలకు తడిసి ముద్దవకుండా అమ్ముడుబోయే ఏర్పాట్లు జరగాలి. ప్రకటించిన ధరల డబ్బులు రైతులకు వెంటవెంటనే అందేటట్లు ఏర్పాట్లు జరగాలి. రైతు ప్రజా సంఘాలు ఈ విషయంలో రైతులకు బాగా సహాయపడే అవకాశముంది. ఎలక్షన్ జరుగుతున్న నెల కాబట్టి, రైతుల అభివృద్ధికి ఎక్కువగా సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తులకు, పార్టీలకు ఓటు వేయండి. నిజంగా మేలు చేసేదెవరు, ఒట్టి మాటలతో కాలం వెల్లదీసే వారెవరనే విషయాలను రైతు ప్రజా సంఘాల నెలవారీ సమావేశంలో విశదంగా చర్చించండి. నిర్ణయాత్మక తీర్మానాలను ఆచరణలో ఓటు ద్వారా చేసి చూపించండి. వడ్లుగా కాకుండా బియ్యం చేసి అమ్మడం లాభదాయకం. రాబోయే ఖరీఫ్ పంటకు నార్లు పోయడం ఈ నెల కడవారంలో రోహిణి కార్తె (25.5.24 నుండి 7.6.24 వరకు)లో మొదలవుతుంది. ఈ సమయంలో నీరున్న వాళ్ళు నార్లు పోసుకుని, లేత నారు నాటితే చీడపీడలు తక్కువగా ఆశించి, దిగుబడి బాగా ఎక్కువగా వస్తుంది. వీలయినంత త్వరగా మంచి ధరవచ్చే నాణ్యమైన విత్తనాలను ముందే సేకరించి పెట్టుకోండి. నాటే సమయంలో కూడా నీరు పుష్కలంగా ఉండాలి. నీటిలభ్యత నమ్మకం లేనిచోట, నారుపోయడం నిదానించి, తర్వాత నీటి లభ్యత మెరుగైనాక నారుపోసి, నాటుకోవడం మేలు. ముదురునారు నాటితే దిగుబడి తగ్గుతుంది. రకాల ఎంపికలో, బాగా పండి, మంచి ధర పలికే తెలిసిన రకాలను ఎంపిక చేసుకోండి. కొత్త రకాలను, కొద్దిపాటి భూమిలో పరీక్షించి, అవి బాగా పండి, మంచి ధరవ స్తే తర్వాతి పంటలలో, వీటి విస్తీర్ణాన్ని పెంచవచ్చు. ఈ సంవత్సరం వరికి బోనస్ లేనట్లే. వచ్చే ఖరీఫ్ పంటకిస్తామని తెలంగాణలో ప్రకటించినారు. మిగతా రాష్ట్రాల్లో కూడా అలా ప్రకటిస్తే రైతుకు లాభం.
ప్రత్తి: ప్రత్తి ధరలు రూ. 7000-రూ. 7500 మధ్య నడుస్తున్నాయి, రూ. 8000 వరకు రావచ్చు. ముంగారి పత్తిని రోహిణి కార్తెలో మే కడవారంలో, మంచి వర్షం వచ్చినాక లేక నీటితడులిచ్చి విత్తుతారు. రోహిణిలో విత్తిన పత్తిలో చీడపీడల బెడద ముఖ్యంగా గులాబిరంగు పురుగు ఉధృతి తక్కువ. ప్రత్తిని అధిక సాంద్రత విధానంలో 80þ20 సెం.మీ. (ఎకరాకు 25,000 మొక్కలుండేటట్లు) విత్తుకోవచ్చు. వర్షాధారంలోనూ, నీటి తడులిచ్చి కూడా అధిక సాంద్రతలో పండించవచ్చు. ఈ విధానంలో పంట త్వరగా పూర్తవుతుంది. తర్వాత పంటగా నువ్వులు, శనగ, వేరశనగ, పెసర, మినుము సాగు చేయవచ్చు. నీటి ఆధారమున్నచోట దిగుబడి బాగా ఎక్కువ ఉంటుంది. అధిక సాంద్రతలో విత్తనానికి అనువైనరకం: ఎల్.హెచ్.డి.పి.ప్రత్తి-5: ఇది సూటి రకం. శాఖీయ కొమ్మలు లేకుండా ఉంటుంది. జిన్నింగ్ శాతం 37.6. పింజ పొడవు 27.5 మి.మీ. పంటకాలం 140-150 రోజులు. దిగుబడి: 10-11 క్వి/ఎ. పచ్చదోమ, బాక్టీరియా ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. ప్రత్తి కొత్త రకాలు: ఎన్.డి.ఎల్.హెచ్.2056-4, ఎన్డి.ఎల్.హెచ్.3104-4 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడులో సాగుకు అనుకూలమైనవి. అధిక దిగుబడి, పురుగులు, రోగాలను తట్టుకుంటాయి. 160 రోజుల పంట.
మొక్కజొన్న: పురుగులు రోగాలు తక్కువగా ఉండి అత్యధిక దిగుబడులు సాధించడానికి మే చివరి వారం నుండి జూన్ మొదటి వారం వరకు విత్తాలి. భూమిలో సరిపడినంత తేమ లేకపోతే, తడి ఇచ్చి విత్తాల్సుంటుంది. తేమ తక్కువ కాకుండా నీటి తడులను ఇవ్వగలిగితే అత్యధిక దిగుబడులు సాధ్యమవుతాయి. పలు ప్రైవేట్ హైబ్రిడ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటికి 40-50 క్వి/ఎ. గింజ దిగుబడినివ్వగల సామర్థ్యముంది.
అల్లం: మే నెలలోపల విత్తడం పూర్తి చేయవలసిన పంట. తెలంగాణకు అనుకూలమైన రకాలు. మారన్, రియోడిజెనెరో, హిమాచల్ మొ||. ఆంధ్రప్రదేశ్కు అనువైన రకాలు: రియెడిజెనెరో, మారన్, నడియా మొ|| నిదానంగా విత్తితే దుంపకుళ్ళు ఎక్కువ. దిగుబడి తక్కువ.
పసుపు: స్వల్పకాలిక రకాలు (6-7 నెలల్లో త్రవ్వకానికి వచ్చే రకాలు) ఆంధ్రప్రదేశ్లో మే రెండవ పక్షంలో నాటడానికి అనుకూలం. తెలంగాణాలో జూన్ మొదటి పక్షంలో నాటడానికి కనుకూలం. మంచి రకాలు: సృజన్, సుదర్శన్, ప్రగతి, ప్రతిభ మొ||.
నువ్వులు: అధిక దిగుబడులకొరకు నువ్వు పంటను కోస్థా ఆంధ్రలో మే 15 నుండి 31 వరకు, రాయలసీమలో మే-జూన్ నెలల్లో, తెలంగాణాలో మే మొదటి పక్షంలో విత్తుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత అధిక దిగుబడినిస్తున్న రకం: జగిత్యాలతిల్-1 (జె.సి.ఎస్-1020): 90-125 రోజుల పంట. దిగుబడి: 5-8 క్వి/ఎ. ఖరీఫ్, రబీ, వేసవి కాలాల్లో సాగుకు అనుకూలం. విత్తనోత్పత్తి చేపట్టి మంచి ధరలకు అమ్ముకోవచ్చు.
కొత్తిమీర: ఎండాకాలంలో పాక్షిక నీడలో కొద్ది నీళ్లతో, అత్యధిక ఆదాయాన్నివ్వగల్గిన పంట. ఎకరాకు లక్షకుపై మాటే. పంట జాగ్రత్తగా పెట్టాలి. కొత్తిమీరకనుకవైన రకాలు: సురుచి: తొలికోత విత్తిన 35-55 రోజులకు. హరితగృహాలలో బాగా ఎదుగుతుంది. దిగుబడి 1.0-1.8 ట/ఎ. యాసంగి/రబీ దిగుబడి 6.0-7.2 ట/ఎ. ఎ.జి.సి.ఆర్-1: వేసవిలో 50% నీడనిచ్చే షేడ్నెట్ క్రింద దిగుబడి బయట పొలం కంటే 3 నుండి 4 రెట్లు అధికం. అర్కఇషా: ఎక్కువ సార్లు కోతకొస్తుంది (మల్టీకట్). విశాలమైన ఆకులు, గుబురు మొక్కలు, మంచి వాసన, ఎక్కువ రోజుల వరకు తాజాగా ఉంటుంది. చల్లగా ఉంచితే 21 రోజులు నిల్వ చేయవచ్చు. ఆకు దిగుబడి 4.0-4.8 ట/ఎ. (3 కోతల్లో, 70 రోజుల్లో) ఆకులో విటమిన్ సి: 167 మి.గ్రా./100 గ్రా. ఆకుకు. పెరటితోటల్లో కూడా కొత్తిమీరను ఆరోగ్యం కొరకు పండించవచ్చు.
పొదీనా: ఎండాకాలంలో ఇంకొక మంచి ఆదాయ పంట పొదీనా. దీనిని వేర్ల ద్వారా, కాండపు ముక్కల ద్వారా ప్రవర్థనం చేయవచ్చు. ఎకరాకు 3-4 క్వింటాళ్ళ తీగ ముక్కలు కావాలి. మన దేశంలో జపాన్ పొదీనాకు ఎక్కువ ప్రాచుర్యం ఉది. మంచి రకాలు: కోసి, సక్షమ్, హిమాలయ, శిలిక్. ఆకుకూరగాను, తైలం ఉత్పత్తికి ఉపయోగం. నాటిన 120 రోజుల నుండి కోత ప్రారంభవుతుంది. దిగుబడి: 15-20 ట/ఎ. పెరటి తోటల్లో కూడా పండించవచ్చు. ఆరోగ్యదాయకం.
ఆకుకూరలు: పెరటితోటల్లోనూ, మిద్దెతోటల్లోనూ, కొద్దిగా నీళ్ళు, కొద్దిగా భూమి ఉన్న సాధారణ పొలాల్లోనూ ఆకుకూరలను, ఉత్పత్తి చేయవచ్చు. పాలకూర, తోటకూర, ఎర్రతోటకూర, చుక్కకూర, మెంతికూర, గోంగూర, పొన్నగంటి కూర, సొయకూర, కొయ్యగూర మొదలయినవి. మునగాకు కూడా ఆకుకూరగా ప్రాచుర్యంలో కొస్తున్నది. ఆరోగ్యంతో పాటు అగ్గువకే ఆకుకూరలు ఎండాకాలంలో దొరుకుతున్నందున కొనడం ఎక్కువయింది.
పూలు: ఈ నెలలో నారుపోయదగిన పూలు – కనకాంబరం. మే-జూన్ నెలల్లో నారుపోసుకుని, ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో నాటుకోవాలి. నాటిన తర్వాత 2 సం|| వరకు లాభదాయకంగా పూత తీసుకోవచ్చు. 2 సంవత్సరాలలో పూత దిగుబడి 1500-2000 కిలోలు. పూలకాడల్లో పూలు తెంపడం అయిపోయాక, పూల గుత్తులను, ఎండిన కొమ్మలను తీసి వేస్తూ ఉంటే సంవత్సరం పొడవునా పూలను పొందవచ్చు. వర్షాకాలంలో దిగుబడి తక్కువగా ఉంటుంది.
టమాట: ఎండలు, వడగాల్పులు మే మొదటి వారం వరకు విపరీతంగా ఉన్నాయి. అక్కడక్కడ వడగండ్ల వానలు, అకాల వర్షాలు పడి, పంట దెబ్బతిన్నది. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. దిగుబడి తగ్గితే ధరలు పెరగవచ్చు. జూన్-జూలైలో ఎక్కువ ధరలుండే సూచనలు కనబడుతున్నాయి. తర్వాతి ధరలు జూన్-జూలైల్లో కురిసే వర్షాల మీద ఆధారపడతాయి.
కీరదోస, బెంగుళూరు మిర్చి: సాలాడ్గా ఉపయోగం, చైనీస్ ఫుడ్లలో బాగా వాడటం వలన వీటికి మంచి గిరాకీ ఏర్పడింది. పాలీహౌస్లలో, నెట్హౌస్లలో, షేడ్నెట్లలో వీటిని పెంచడం బాగా పెరుగుతున్నది.
కందగడ్డ: ఖరీఫ్ పంటను ఏప్రిల్ నుండి జూన్ వరకు, మేలో కూడా నాటితే నవంబరు నుండి జనవరి వరకు త్రవ్వకానికి తయారవుతుంది. మంచిరకాలు: గజేంద్ర: 6-8 నెలల పంట. దిగుబడి 26-28 ట/ఎ. శ్రీత్రిపుర: 9-10 నెలల పంట. దిగుబడి: 14 ట/ఎ.
మామిడి: తయారైన కాయలను మందులు వేయకుండా చెట్ల క్రింద వరి లేక బోద గడ్డిలో మాగబెట్టితే ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చు. ఆ విధంగా బోర్డు పెట్టుకోవాల్సుటుంది. ఈ పండ్లు పుల్లగా ఉండకుండా, తియ్యగా, కమ్మగా ఉంటాయి.
ఫ్రెంచ్బీన్స్: ఎండాకాలంలో పంట సరిగా ఎదగదు. పాక్షిక నీడ ఉండాలి. కొండ ప్రాంతాల్లో చల్లగా ఉన్న ప్రాంతాల్లో ఎదుగుతుంది. వెజ్బిరియానీలో వాడకం ఎక్కువ. మంచిరేటొస్తుంది. పాక్షిక నీడ ఉన్న తోట పంటలలో, సాగుచేసి మంచి ఆదాయం పొందే వీలుంది. అనుకూలమైన రకాలు: అర్కకోమల్: 70 రోజులకు కాయకోత కొస్తుంది. కాయ దిగుబడి 4.0-4.8 ట/ఎ. కాయనాణ్యత చాలా బాగుంటుంది. రవాణాను తట్టుకుంటుంది. పంత్ అనుపమ: 55-65 రోజుల్లో మొదటికోత. గింజ త్వరగా పట్టదు. కాయలు ఆకుపచ్చగా ఉంటాయి. ఆకుమచ్చ తెగులును కొద్దిగా తట్టుకుంటుంది. వెర్రి తెగులును కూడా తట్టుకుంటుంది. కాయదిగుబడి 3-6 ట/ఎ.
జొన్న: జొన్న పంటను ఇదివరకు తెలంగాణ ప్రభుత్వము ఎకరాకు 8-8.5 క్వింటాళ్లు మాత్రం మద్దతు ధరకు (రూ.3180/క్వి) కొంటామనేవారు. ఇప్పుడు ఎకరాకు 12 క్వింటాళ్ళ దాకా కొంటామంటున్నారు.
చింతచిగురు: చింతచిగురు చిల్లరగా హైదరాబాదులో 100 గ్రా. రూ. 80 నుండి 100 దాకా అమ్ముతున్నారు.
అకాల వర్షాల్లో నష్టపోయిన పంటలు: వరి, మొక్కజొన్న, జొన్న, నువ్వులు, మామిడి, బొప్పాయి.
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు: టన్ను ధర కనీసం 550 డాలర్లు (సుమారు రూ. 46000) గా ఉంటే ఎగుమతులకు అంగీకరిస్తారు. ఎగుమతి సుంకం 40% ఉంటుంది. మొత్తం 770 డాలర్లు (సుమారు రూ. 64000) రైతులకు ఎంతవరకు ఉపయోగమో గమనించాలి.
9 లోగా సంపూర్ణంగా రైతు భరోసా: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు అందరి ఖాతాల్లోకి మే 9వ తేదీలోగా జమచేస్తామంటున్నారు. మంచి పని.
మనసుండాలి-ధైర్యముండాలి-మార్గమదే సాధ్యం: ప్రతి సంవత్సరం ఎండలు, వానలు, గాలులు, వడగండ్లు, కడగండ్లు, రైతుల మొరల ఆలకింపే లేదు. 75 ఏండ్లయింది స్వతంత్రమొచ్చి. మార్కెట్ యార్డుల్లో ధాన్యం మొలకలు వస్తూనే ఉన్నాయి. టెక్నాలజీలు అభివృద్ధి చెందుతున్నాయి. ఆ ఊర్లో పంటలు నా ఊర్లోనే, ఏ రైతు పంటలనారైతు పొలం దగ్గరే కొంటే అతనికెన్ని బాధలు తప్పుతాయి. ప్రభుత్వాల విధానాలలో మార్పులు తేవాల్సిన అవసరముంది. రైతులను వ్యాపారులు మోసగించకుండా కాపాడడానికి ప్రతి జనావాసం/కుగ్రామం/గ్రామం/పెద్ద ఊర్లలో రైతు ప్రజాసంఘాలను సులభంగా ప్రోత్సహించవచ్చు. అవి రైతులకు అన్ని విధాలా అండగా ఉండేటట్లు తీర్చిదిద్దవచ్చు. ఇప్పటికే ఉన్న వ్యవసాయ, తదనుబంధ శాఖల అధికారులను ఉపయోగించి వీటిని ఏర్పాటు చేయవచ్చు. పండిన సరుకును వీడియోకాన్ఫరెన్స్ల ద్వారా అమ్మే విధానం సులభతరం చేయవచ్చు. మార్కెట్లకే వెళ్లాలి. అక్కడ దళారీలకు కొంత మేపాలనేది మార్చాలి. ఇండ్ల దగ్గరే మంచి రేటుకు బాధలు లేకుండా అమ్ముకునేందుకు యంత్రాంగం సహకరించే విధంగా మార్పులు జరగాలి. బాధలు తగ్గాలి. పనితనం పెరగాలి. రైతుల జీవితాలు గాలిలో పెట్టిన దీపాలు గాకుండా కాపాడాలి. అందుకు గొప్ప మనసుతో, పట్టుదలతో ప్రభుత్వాలు సహకారమందించాలి. మార్పుతప్పకుండా వస్తుంది.
వివిధ రకాల కారణాల వలన ఇటీవల కాలంలో ఇంటిపంటను నిర్వహించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఇంటి పంటపై శ్రద్ధ ఉన్నవారు ఎవరికి అవకాశం ఉన్న ప్రాంతంలో అంటే పెరటిలో, బాల్కనీలో, మిద్దెమీద, గోడల మీద… ఎక్కడ అవకాశం ఉంటే ఆ స్థలంలో అవకాశం ఉన్న మొక్కలు పెంచుతూ ఉంటున్నారు. కొంతమందికి ఇంటిపంట మీద ఆసక్తి ఉన్నా కూడా వివిధ రకాల కారణాల వలన ఇంటి పంటను మొదలు పెట్టడం వాయిదా వేసుకుంటూ పోతుంటారు. ఇలా వాయిదా వేసుకుంటూ పోయేవారికి వేరేవారి నుంచి స్ఫూర్తి లభించిందంటే వాయిదాలను ప్రక్కకు నెట్టి కార్యాచరణలోకి దిగుతారు. కొత్తగా ఇంటి పంటను మొదలు పెట్టే అనేకమందికి అప్పటికే ఇంటిపంటను నిర్వహిస్తున్న ఇంటి పంటదారులు స్ఫూర్తిని కలిగించి ఉండవచ్చు. కాని ఇంటిపంట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారి నుంచి స్ఫూర్తిని పొంది ఇంటి పంటను మొదలు పెట్టిన వారు ఎక్కువ మంది మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంటారని నిస్సందేహంగా చెప్పవచ్చు. హైదరాబాదు నగరం అమీరుపేటలో గత ఆరు సంవత్సరాల నుంచి మిద్దెతోటను పెంచుతున్న తనకు రఘోత్తమరెడ్డి గారే స్ఫూర్తి అని అప్పారావు అంటున్నాడు.
అప్పారావు గారికి గత 15-20 సంవత్సరాల నుంచి ఇంటిపంట మీద మక్కువ ఉన్నా కూడా ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు కాబట్టి ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలు తిరగవలసి వస్తుంది కాబట్టి ఉద్యోగంలో కొనసాగిన కాలంలో పెద్ద మొత్తంలో మొక్కల పెంపకం చేపట్టకుండా కేవలం కొన్ని మొక్కలను మాత్రం పెంచుకుంటూ వస్తూ 6 సంవత్సరాల క్రితం తన ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన తరువాత పెద్ద మొత్తంలో మొక్కల పెంపకం మొదలు పెట్టాడు. హైదరాబాదు నగరం అమీరుపేటలో మిద్దెమీద ఇంటిపంటను నిర్వహిస్తున్నాడు. తనకు ఇంటిపంటమీద మక్కువ పెరగటానికి ఇంటి పంట నిపుణుడు రఘోత్తమరెడ్డిగారే స్ఫూర్తి అని అప్పారావు వివరిస్తున్నాడు.
తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచాలనే లక్ష్యంతో అప్పారావు ఇంటిపంటను నిర్వహిస్తున్నాడు. ఇందుకుగాను చిన్న చిన్న కంటెయినర్లను ఎక్కువగా మొక్కల పెంపకానికి ఉపయోగిస్తున్నాడు. చిన్న కంటెయినర్లు అయితే తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు. మట్టి మిశ్రమం తక్కువగా పడుతుంది. అంతేకాకుండా కంటెయినర్ బరువు కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక చోట నుండి ఇంకో చోటకి మార్చాలంటే సులభంగా ఉంటుంది. ఇలాంటి అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి తమ మిద్దెతోటలో చిన్న కంటెయినర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు.
మొక్కల పెంపకానికి ఉపయోగించే మట్టిమిశ్రమంలో 30 శాతం మట్టి, 30 శాతం వర్మికంపోస్టు, 30 శాతం కోకోపిట్ లేదా ఇసుక మిగిలిన 10 శాతం వేపపిండిని ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా మట్టి మిశ్రమం తయారు చేసుకుని మొక్కల పెంపకం చేపట్టి తరువాత అవసరాన్ని బట్టి పోషకాలను అందిస్తుంటాడు. వారి ఇంటి పంటలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు, పూల మొక్కల పెంపకం చేస్తుంటారు. అరుదైన రకాలను దూర ప్రాంతాల నుంచి తెప్పించి పెంపకం చేయడం అప్పారావు గారికి ఇష్టం కాబట్టి ఇతర దేశాల నుంచి కూడా విత్తనాలను తెప్పించి మొక్కల పెంపకం చేస్తున్నారు. వారి ఇంటి పంటలో 15 నుంచి 20 రకాల వంగ, 50 నుంచి 60 రకాల టమాటతో పాటు పొట్టి అరటి, చిన్న కంటెయినర్లో పెరిగే మునగ, సంపంగి, డ్రాగన్ ఫ్రూట్, బత్తాయి, నిమ్మ మొక్కలతో పాటు అరుదైన పూల మొక్కలు, ఆకుకూరలు అనేకం ఉన్నాయి.
ఉద్యోగ బాధ్యతల నుంచి పదవీ విరమణ పొందిన తరువాత తన పూర్తి సమయాన్ని ఇంటి పంటపై పెట్టి ఇంటి పంట దారుల సంఖ్య పెంచడంలో తనవంతు పాత్రను పోషిస్తున్నాడు. రఘోత్తమరెడ్డి గారి నుంచి స్ఫూర్తిని పొందిన అప్పారావు ఇంటి పంటను మొదలు పెట్టి విజయవంతంగా కొనసాగిస్తూ అనేకమందికి స్ఫూర్తిని కలిగిస్తున్నాడు.
పెంచుకుందాం… పంచుకుందాం…
అప్పారావు ఇంటి పంటను నిర్వహించడంతోపాటు ఇంటిపంటదారుల సంఖ్య పెరగటానికి విపరీతంగా కృషి చేస్తున్నాడు. ఇందుకుగాను వివిధ ప్రాంతాల నుంచి అరుదైన రకాల విత్తనాలను, మొక్కలను తెప్పించి తన ఇంటి పంటలో పెంపకం చేసి విత్తనాలను అభివృద్ధి చేసి భారతదేశం మొత్తం అడిగిన వారికి ఉచితంగా అంటే రవాణా ఖర్చులు కూడా తానే భరిస్తూ విత్తనాలను పంపిణీ చేస్తున్నాడు. తన దగ్గర విత్తనాలను తీసుకున్న వారు అవకాశం ఉంటే వారి దగ్గర ఉన్న విత్తనాలను అప్పారావు గారికి పంపిస్తుంటారు. వాటిని అప్పారావు గారు అవసరమయిన వారికి ఉచితంగా పంపిస్తుంటారు. ఈ విధంగా పెంచుకుందాం… పంచుకుందాం… అనే భావనతో ముందుకు సాగుతున్నారు.
వెంకట సుబ్బయ్య రెండెకరాల చిన్న రైతు. వృద్ధాప్యం వల్ల సొంతంగా వ్యవసాయం చేయలేక, కౌలుకు ఇచ్చినా సమయానికి కౌలు సొమ్ములు వసూలయ్యే అవకాశాలు అంతంత మాత్రంగానే వుండుటవల్ల, ఆ భూమిని అమ్మి కొంత మనవరాలి పెళ్లికి ఖర్చు చేసి, మిగిలిన సొమ్ముతో రెండు పాడి గేదెలు కొని పాల ఉత్పత్తి విూద జీవనాన్ని సాగిస్తూ వున్నాడు. అయితే గత వేసవిలో సంభవించిన అగ్నిప్రమాదంలో ప్రేమగా పెంచుతున్న రెండుగేదెలూ అగ్నికి ఆహుతై పోగా ఆ పేద వృద్ధ దంపతుల జీవితాలు బజారున పడ్డాయి. అప్పుడు కానీ అతనికి పశువుల బీమా ఒకటి వుంటుందనీ, ఇలాంటి ప్రమాదాల వల్ల జరిగే నష్టాలకు పరిహారం లభిస్తుందనీ, ఆ పరిహారంతో మరో రెండు గేదెల్ని కొనుగోలు చేసి పాల ఉత్పత్తిని కొనసాగించవచ్చునని!
నాగయ్య, మల్లన్న, సుబ్బన్న ముగ్గురు సోదరులు. హర్యానాకు వెళ్లి ఆరు పాడిగేదెల్ని కొనుగోలు చేశారు. అక్కడి రైతుల సూచన మేరకు ఆ పశువుల్ని రవాణా బీమాతో మొత్తం బీమా చేశారు. అయితే దురదృష్టవశాత్తు వేగంగా హైవే మీద వస్తున్న ఈ వాహనాన్ని వేరొక వాహనం వెనుక నుండి ఢీకొట్టటం వల్ల డ్రైవర్, క్లీనరు, అటెండరుతో పాటు ఆరు పశువులూ ప్రాణాలు కోల్పోయి, ఈ విషయాన్ని ఫోను ద్వారా ఇన్సూరెన్సు కంపెనీకి తెలియపరచి, సమీపంలోని ఇంటర్నెట్ కేంద్రం ద్వారా కూడా ఇన్సూరెన్సు కంపెనీ వారికి తెలియపరచగా ఆ కంపెనీ వారి సమీప శాఖ అధికారులు స్థలానికి వచ్చిపశువులతో పాటు ప్రమాద దృశ్యాలను యజమానులతో కలిపి ఫోటోలు తీసుకుని, పశువైద్యుని చేత శవాలకు పోస్ట్మార్టములు చేయించి, తమ నివేదికని ఆంధ్రప్రదేశ్లోని ఇన్సూరెన్స్ కంపెనీ వారికి, యజమానుల సంతకాలు తీసుకున్న పత్రాలతో పంపారు. ఇది జరిగిన ఇరవై రోజులకు బీమా చేయించిన మొత్తానికి చెక్కులు ఆ యజమానులకు అందాయి.
* * *
భర్తను కోల్పోయిన రమణమ్మ తన 50 సెంట్ల భూమిని విక్రయించి ఆ సొమ్ముతో రెండు గేదెల్ని కొని పాల ఉత్పత్తి ద్వారా జీవిస్తూ ఉంది. ఆమె తన ముర్రా గేదెలకు ఇన్సూరెన్సు కూడా చేయించింది. అయితే ఈ గేదెలు ఊరి సమీపంలోని కాలువ మీద నడిచే బల్లకట్టు తీగెలో రింగులు తిరిగిన కొమ్ము బిగుసుకు పోయి, నీళ్లలో మునిగి చనిపోయింది. ఈ విషయమై ఇన్సూరెన్స్ కంపెనీ వారికి వెంటనే ఫిర్యాదు కూడా చేసింది. కానీ పశువు చెవికి బిగించిన ఇన్సూరెన్స్ పోగు నాలుగు నెలల క్రితమే ఊడిపోయి అదృశ్యమైన విషయాన్ని ఇన్సూరెన్సు కంపెనీకి తెలియపరచని కారణంగా చనిపోయిన పశువుకు నష్టపరిహారం చెల్లించుటకు నిరాకరించారు.
* * *
రంగయ్య ఏడాదికి ఇన్సూరెన్స్ చేయించిన తన గేదెను ప్రక్క గ్రామంలోని సుబ్బారావుకు ఆరు నెలల క్రితం విక్రయించాడు. నెలక్రితం సుబ్బారావు గొడ్ల పాకలో పాముకాటుకు ఇన్సూరెన్సు చేసిన గేదె మరణించింది. సుబ్బారావు ఇన్సూరెన్సు కంపెనీకి ఫిర్యాదు చేసి, పరిహారం కోసం కోరాడు. అయితే యాజమాన్య బదిలీ విషయాన్ని ముందుగా ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియపరచనందువలన రంగయ్య, సుబ్బారావులకు ఎవరికీ నష్టపరిహారం చెల్లించబడలేదు.
* * *
నాలుగేళ్ల క్రితం విస్తృతంగా వ్యాపించిన లంపీస్కిన్ డిసీజ్ కారణంగా మరణించిన మూడు ఆవులకు సుబ్బరామయ్యకు బీమా చేయించి మొత్తం లక్షాయాభై వేల రూపాయలు అవి మరణించిన నెలరోజుల్లో అందాయి.
* * *
పాపారావు తన గేదెను ఇన్సూరెన్సు తన వూరి పాల కేంద్రం ద్వారా చేయించాడు. ఇన్సూరెన్సు చేయించిన 20 రోజులకు ఆ గేదె చనిపోయింది. చనిపోయిన గేదె చెవికి బిగించిన చెవి పోగును తీసుకొని ఇన్సూరెన్సు కంపెనీ శాఖకు వెళ్లగా ”మీరు కట్టవలసిన ప్రీమియం మొత్తం ఇప్పటి వరకు మాకు చేరలేదు. మీకు నష్టపరిహారం రాదు” అని స్పష్టం చేశారు. పాపారావు తన వూరి పాలకేంద్రంలో విచారించగా తన బీమాపత్రం- ప్రీమియం, ఇంకా పాల కేంద్రంలోనే ఉన్నట్లు తెలిసింది. దీనిపై గ్రామంలో పెద్ద రగడ జరిగింది.
* * *
రామభద్రయ్య నిండు చూడి గేదె ఈనలేక తీవ్రంగా నొప్పులు పడ్తూ వుంది. దాని బాధ చూడలేక పొరుగున వున్న వెంకయ్య సాయం కోరగా, మరో నలుగురి సాయంతో చాలా మోటుగా గర్భంలో నుండి ఎటువంటి శుభ్రతా జాగ్రత్తలు తీసుకొనకుండా బలంగా దూడను బైటకు లాగారు. ఈ మోటుతనం వల్ల విపరీత రక్త సావ్రం జరిగి, దూడతో సహా తల్లి కూడా మృతి చెందింది. స్థానికంగా పట్టభద్రుడైన పశువైద్యుని సేవలు లభ్యమైనప్పటికీ, నాటు పద్ధతిలో దూడను బైటకు లాగే ప్రయత్నం చేయుట, యజమాని యొక్క నిర్లక్ష్యాన్ని చాటిన కారణంగా ఇన్సూర్ చేయబడిన ఈ పశువుకు కూడా నష్టపరిహారం లభించలేదు.
పైన పేర్కొన్న సంఘటనల్ని గమనిస్తే మనకు పశువుల బీమా అంటే ఏమిటో, దానివల్ల కలిగే ప్రయోజనాలేమిటో తీసుకోవలసిన జాగ్రత్తల్ని పాటించకపోతే కలిగే నష్టాలేమిటో కొంతవరకు అర్థమౌతుంది.
పశువుల బీమా అంటే ఒక నిర్ణీత మొత్తాన్ని (ప్రీమియమ్)ను ఇన్సూరెన్సు కంపెనీ (ఇన్సూరర్)కు చెల్లించుట ద్వారా నిర్ణీత నిబంధనలను పాటిస్తూ, నిర్ణీత కాలంలో జరిగే ప్రాణ నష్టానికి, ఉత్పాదకతకు జరిగే నష్టాలకు ఇన్సూర్డ్ మొత్తానికి లోబడి నష్టపరిహారం పొందుటకు బీమా చేయించిన వ్యక్తిని బీమా కంపెనీకి మధ్య జరిగే పరస్పర ఒప్పందమని చెప్పవచ్చును. నిర్ణీత నమూనాలో వ్రాసుకున్న (ముద్రించబడిన) ఈ ఒప్పంద పత్రాన్ని బీమా పత్రంగా పేర్కొంటారు.
పశువు యొక్క మార్కెట్ విలువకు దగ్గరగా, కొన్ని పరిమితులకు లోబడి పశువు యొక్క బీమా సొమ్ము మొత్తం నిర్ణయించబడుతుంది. అందులో 3 నుండి 4 శాతం వార్షిక ప్రీమియం ఉంటుంది. ప్రభుత్వాలు, కొన్ని పాల సహకార సంఘాలు, ప్రైవేటు డెయిరీలు ఈ ప్రీమియం సొమ్ములో 30 నుండి 70 శాతం వరకు భరిస్తున్నాయి. ఒకేసారి మూడు సంవత్సరాలకు బీమా చేయిస్తే 25% రాయితీ లభిస్తుంది. పూర్తిగా శాశ్వత గొడ్డుతనాన్ని, శాశ్వత అంగవైకల్యం జరిగినప్పుడు, పశువైద్యుడు చేసిన నిర్ధారణ మేరకు 75 శాతం వరకు నష్టపరిహారం పొందాలంటే అదనంగా ఒక శాతం ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది.
వయస్సు పెరిగేకొద్దీ విలువలు పెరిగే దూడలు, పడ్డలకు వాటి మరణ సమయానికి వున్న విలువను చెల్లించే విధంగా కూడా ప్రత్యేక బీమా సదుపాయాలు కూడా వున్నాయి.
బీమా వల్ల ప్రయోజనాలు
1. శాస్త్రీయమైన క్రొత్త పద్ధతులలో పశువుల పెంపకాన్ని, పోషణను, నిర్వహణను ధైర్యంగా అమలు చేయుటకు బీమా భరోసా ఇస్తుంది.
2. బీమా చేయించే ముందు, ఒకవేళ పశువు మరణించిన తర్వాత జరిపే వైద్య పరీక్షలు, శవపరీక్షల వల్ల స్థానికంగా వున్న అనారోగ్యాలకు కారణాలు గుర్తించి, వ్యాధులు, సమస్యల నివారణకు పటిష్టమైన శాస్త్రీయ చర్యలు చేపట్టుటకు అవకాశం ఉంటుంది.
3. బీమా చేయించిన పశువు యొక్క గుర్తుల రికార్డు మరియు చెవిపోగుల ఆధారంగా తప్పిపోయిన, దొంగిలించబడిన పశువుల్ని గుర్తించుట సులభతరం అవుతుంది.
4. బీమా చేయించిన పశువుకు పట్టభద్రునిచే శాస్త్రీయ వైద్య పరీక్షలు, చికిత్సలు చేయించుట వల్ల నాటువైద్యాలు, మొరటు వైద్యాలపై ఆధారపడే అలవాటు తగ్గుతుంది.
5. బీమా చేయించే ముందు జరిపే గర్భకోశ పరీక్షల వల్ల గొడ్డుబోతు సమస్యల్ని గుర్తించి సకాలంలో సరియైన చికిత్సలు జరిపి వాటి ఉత్పాదకతను పెంచే అవకాశాలు ఉంటాయి. చూడివిగా గుర్తించబడిన పశువులు కబేళాల దారిపట్టకుండా నివారించవచ్చు.
బీమా నిబంధనలు
1. బీమా చేసే సమయానికి పశువు పరిపూర్ణ ఆరోగ్య స్థితిలో ఉన్నట్లు పట్టభద్రుడైన పశువైద్యుడు మాత్రమే నిర్ధారణ చేయాలి.
2. బీమా చేసిన ఆరోగ్య దృవీకరణ పత్రముతో పాటు చెల్లించవలసిన ప్రీమియం మొత్తం ఇన్సూరెన్సు కంపెనీకి అందిన 15 రోజుల తర్వాత మాత్రమే బీమా అమలులోకి వస్తుంది.
3. బీమా చేయబడిన పశువుకు సరియైన పోషణ, రక్షణ, ఆదరణ మరియు సకాలంలో వైద్య సదుపాయాలు అందినట్లు ఇన్సూరెన్సు కంపెనీ సంతృప్తి చెందినప్పుడే బీమా నష్టపరిహారం అందుతుంది. సకాలంలో టీకాలు వేయించుట, దూడలు, జీవాలకు డివార్మింగ్ చేయుట తప్పనిసరి.
4. ప్రమాదాలు, రోగాలు బారిన పడిన పశువులకు సత్వరమే పశువైద్య పట్టభద్రుని చేత వైద్య సేవలు అందించాలి.
5. ఉద్దేశపూర్వకంగా నిర్దయకు, క్రూరత్వానికి, వధకు గురైన పశువులకు పరిహారం లభించదు. అయితే సుదీర్ఘ బాధ నుండి మరియు ప్రమాదకరమైన అంటురోగాల బారి నుండి విముక్తి కలిగించే ఉద్దేశంతో పంచానామ జరిపిన తర్వాత జరిపే కారుణ్యవధకు గురైన పశువుకు పరిహారం అందవచ్చను.
6. బీమా కంపెనీ వారు నమోదు చేసుకున్న గుర్తుల్ని (కొమ్ముల కొలతలు) మార్చరాదు. చెవికి బిగించిన నెంబరు పోగును తొలగించరాదు. ఏ కారణం వల్లనైనా ఊడిపోయిన పోగు గురించిన సమాచారాన్ని వెంటనే వ్రాతపూర్వకంగా ఇన్సూరెన్సు కంపెనీకి తెలియపరచి, అందుకు ఆధారాలను జాగ్రత్తగా పదిలపరచుకోవాలి. బీమా చేయబడి మరణించిన పశువు యొక్క చెవిపోగు స్పష్టంగా కనిపించే విధంగా యజమాని మరియూ ఇద్దరు సాకక్ష్యులతో తీసిన ఫోటోను క్లెయిమ్ పరిష్కారం పూర్తయే వరకు భద్రపరచుకుంటే మంచిది.
7. బీమా చేయబడిన పశువును వేరొక వ్యక్తి, లేదా సంస్థకు బదిలీ చేసినా, విక్రయించినా, ఆ సమాచారాన్ని బీమా కంపెనీకి లిఖితపూర్వకంగా తగిన ఆధారాలతో తెలియపరచాలి.
క్లెయిమ్ చేయు విధానం: పశువు మరణించిన తర్వాత శవాన్ని కదల్చరాదు. వెంటనే ఈ విషయాన్ని సంబంధిత పశువైద్యునితో పాటు కంపెనీ వీరికి స్వయంగా లేదా ఫోనుద్వారా తెలియపరచుటతో పాటు వ్రాతపూర్వకంగా వాట్సప్, ఇమెయిల్ ద్వారా కూడా తెలియపరచాలి. 24 గంటల వరకు వేచి చూచిన తర్వాత స్థానిక పెద్దల సమక్షంలో పంచనామా జరిపి, వారితోపాటు పశువును చెవిపోగు స్నష్టంగా కనిపించే విధంగా ఫోటోలు తీసి చెవి పోగును జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. 24 గంటలలోగా పశువైద్యుడు వస్తే శవపరీక్ష జరుపుటకు ఆయనకు సహకరించాలి.
ఇన్సూరెన్స్ కంపెనీవారి నుండి అందిన నమూనా దరఖాస్తు, పశువైద్యుని ధృవీకరణ, వైద్య రికార్డులతో చెవిపోగును జత చేసి ఇన్సూరెన్సు కంపెనీ వారికి సమర్పించి రసీదును పొందాలి లేదా ఆధారాలను భద్రపరచుకోవాలి.
సరైన కారణం తెలుపకుండా ఏ క్లెయిమునూ తిరస్కరించే అధికారం ఇన్సూరెన్స్ కంపెనీ వారికి ఉండదు. ఒప్పందకాల పరిమితిలో పరిహారం చెల్లించని కంపెనీలపై అవసరమైతే నియమిత యాంబుట్స్మ్యాన్ లేదా వినియోగదారుల ఫోరం నుండి న్యాయ సహాయం పొందవచ్చు.
గత కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి బీభత్సాలు రైతాంగం జీవితాలను ఆర్థికంగా ఛిద్రం చేస్తున్నందున, ప్రకృతి విపత్తుల వల్ల పాడి రైతు నష్టాలను కొంతమేరకైనా ఆదుకుంటున్న ”పశువుల బీమా – రైతుకు వరం” అని అందరూ గ్రహించాలి.
జాజికాయ (మిరిస్టికా ఫ్రాగ్రెన్స్) అనే శాస్త్రీయ నామంతో పిలవబడే ఈ మొక్క ఇండోనేసియాలోని మొలక్కాస్ దీవులు దీని పుట్టినిల్లు. దీనిని సాధారణంగా ఇండోనేసియా మరియు గ్రెనెడౌ వంటి దేశాలలో విరివిగా సాగు చేస్తున్నారు. దీనిని మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తమిళనాడులోని కర్టల్లామ్లో స్వాతంత్య్రానికి పూర్వం తెచ్చి వారి సుగంధద్రవ్య పంటల తోటలో నాటారు. తద్వారా మన దేశంలో ప్రాచుర్యంలోకి ఈ పంట వచ్చింది. మన దేశంలో దీని సాగు వాణిజ్య సరళిలో కేరళలోని త్రిశూర్, ఎర్నాకుళం, కొట్టాయం జిల్లాలలో, తమిళనాడులోని కన్యాకుమారి మరియు తిరునల్వేలి జిల్లాల్లో, మహారాష్ట్రలోని దపోలి, వెంగుర్లా ప్రాంతాలలో సాంప్రదాయబద్ధంగా సాగు చేస్తూ వస్తున్నారు. కానీ దీని సాగుకు మన తెలుగు రాష్ట్రాలలో కోస్తా ప్రాంతాలు కొబ్బరి మరియు వక్క తోటలలో అంతర పంటగా/ప్రత్యామ్నాయ పంటగా దీని సాగు చేయడం ద్వారా లాభసాటి సేద్యం సాధ్యమవుతుంది. ఈ మొక్క రెండు రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలను ఇస్తుంది. జాజికాయ మరియు జాపత్రి రెండూ కూడా ఈ మధ్యకాలంలో అన్ని రకాల వంటలలో అతి ముఖ్యమైన స్థానం సంపాదించుకొంది. దీని సాగు చేయడం ద్వారా వీటి గిరాకీని అందిపుచ్చుకోవడమే కాకుండా లాభాలను పొందవచ్చు.
అవసరమైన వాతావరణం మరియు నేలలు
గాలిలో తేమ అధికంగా ఉండే ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. వర్షపాతం సంవత్సరం పొడవునా 1500 మిల్లీ మీటర్లు అంతకన్నా ఎక్కువ పొందే ప్రాంతాలలో సాగు చేపట్టవచ్చు. సముద్ర మట్టం నుంచి 1300 మీ. ఎత్తైన ప్రాంతాలలో కూడా సాగుచేపట్టవచ్చు. ఉష్ణోగ్రతలు 25-35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు అనుకూలం. పొడి వాతావరణం ఉండే ప్రాంతాలలో సాగు చేపట్టరాదు. సారవంతమైన ఒండ్రునేలలు, ఎర్ర గరప నేలలు మరియు ఇసుక గరప నేలలలో సాగు చేపట్టవచ్చు. నీరు నిల్వ ఉండే మరియు మురుగు సౌకర్యం సరిగాలేని నేలలలో సాగు చేపట్టరాదు.
అందుబాటులో ఉన్న మేలైన రకాలు: కొంకణ్ సుగంధ, కొంకణ్ స్వాద్, కొంకణ్ శ్రీమంతీ, IISR కేరళీ, IISR విశ్వశ్రీ.
నాటడం మరియు నాటుకునే సమయం
సాధారణంగా విత్తనం ద్వారా ప్రవర్ధనం చేసిన వాటిని నాటుకోవడానికి వినియోగిస్తారు. కానీ ఈ పంట యొక్క పుష్పాలు (ఆడ మరియు మగ పుష్పాలు) ఒక మొక్కపైన కాకుండా వేరు వేరు మొక్కల పైన వస్తాయి. కావున విత్తనం ద్వారా ప్రవర్ధనం చేసినట్లు అయితే నాటిన మొక్కలలో 50 శాతం మగ మరియు 50 శాతం ఆడ మొక్కగా మారడానికి ఆస్కారం ఉంది. మనం విత్తనం ద్వారా పెంచిన మొక్కలను నాటినచో సరైన నిష్పత్తిలో ఆడ మరియు మగ మొక్కలు ఉండకపోవడం మూలాన లాభసాటి సాగు సాధ్యమవదు. దీనిని నివారించడానికి మనం కొమ్మ అంట్లు లేదా మొగ్గ అంట్లు చేసిన మొక్కలను ప్రతి 20 ఆడ మొక్కలకు, ఒక మగ మొక్కను నాటటడం ద్వారా పంటను లాభసాటిగా మరియు మంచి దిగుబడులను పొందడానికి ఆస్కారం ఉంది. 12-18 నెలల వయస్సు గల మొక్కలను వరుసల మధ్య ఎనిమిది మీటర్లు మరియు మొక్కల మధ్య ఎనిమిది మీటర్లు ఉండేలా చూసుకొని కొబ్బరి మొక్కల మధ్యలో నాటుకోవాలి. అదే వక్క తోటలలో ప్రతి మూడు వరుసల తర్వాత ఒక జాజికాయ పంటను ఏక పంటగా నాటుకోవాలంటే ఈ మొక్కలకు నీడ అవసరం అందుకు అనుగుణంగా నీడనిచ్చే మొక్కలుగా మోదుగ, సిల్వర్ ఓక్ లేదా గ్లైరిసీడియా 5-6 నెలలు ముందుగా నాటుకోవాలి. వర్షాలు ఆరంభమైనప్పుడు లేదా వర్షాకాలం ముగుస్తున్న సమయంలో నీటి వసతి గల ప్రాంతాలలో నాటుకోవడం అనుకూలం. దీని కోసం 60 సెం.మీ. వెడల్పు, 60 సెం.మీ. పొడవు, లోతు గల గుంతల్లో పశువుల ఎరువు, కంపోస్ట్ కలిపి నాటుకోవాలి.
ఎరువుల యాజమాన్యం
మంచి ఎదుగుదల మరియు రాబడి కోసం సమగ్ర ఎరువుల యాజమాన్యం అత్యంత కీలకం. సేంద్రియ ఎరువులు పది కిలోలు ప్రతి మొక్కకు వేసుకోవాలి. ఎదిగిన 15 సంవత్సరముల వయస్సు కలిగిన మొక్కలకు గరిష్టంగా 50 కిలోలు వేసుకోవాలి. 20 గ్రా. నత్రజని, 18 గ్రా. భాస్వరం, 50 గ్రా. పొటాషియం ప్రతి మొక్కకు మొదటి సం||లో అందించాలి. ఎదిగిన లేదా 15 సం|| వయస్సు మొక్కలకు 500 గ్రా. నత్రజని, 250 గ్రా. భాస్వరం, 1000 గ్రా. పొటాషియం ప్రతి సం|| ప్రతి మొక్కకు అందించాలి. ఎరువులను 2 దఫాలుగా మొదట మే-జూన్ మరియు రెండవసారి సెప్టెంబర్-అక్టోబర్ మాసంలో సేంద్రియ ఎరువులతో పాటు వేసుకోవాలి. మొక్క వేర్లు తక్కువ లోతులలో ఉండటం వలన ఎరువులను మొక్క కాండం నుంచి 1-5 మీటర్ల దూరంలో మాత్రమే వేసుకోవాలి. పొలంలో కలుపు లేకుండా నివారించుకోవాలి. దీనికోసం అంతరకృషి క్రమం తప్పకుండా చేసుకోవాలి. అందించే ఎరువులను సేంద్రియ ఎరువుల రూపంలో అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
కోత మరియు కోతానంతర చర్యలు
విత్తనం ద్వారా వృద్ధి చేసిన మొక్కలు నాటిన 7-8 సంవత్సరాల తర్వాత మరియు కొమ్మంట్లు లేదా మొగ్గంట్లు నాటిన తోటలలో 4-5 సంవత్సరాల తర్వాత పూత మరియు కాత మొదలవుతుంది. 15-20 సంవత్సరాల వయస్సుగల తోటలు స్థిరమైన దిగుబడులను అందిస్తాయి. మొక్కలు సంవత్సరానికి 6 సార్లు కొత్త చిగుర్లు తొడగటం గమనించవచ్చు. అందులో మే-జూన్ మరియు సెప్టెంబర్ మాసంలో వీటి తీవ్రత గణనీయంగా అధికంగా ఉంటుంది. ఇందులో మగ జాతి మొక్కలు సంవత్సరం పొడవునా పుష్పిస్తాయి. కానీ ఆడ జాతి మొక్కలు సంవత్సరంలో 7 మాసాల కాలం పాటు మాత్రమే పుష్పిస్తాయి. అత్యధికమైన మగ మరియు ఆడ పుష్పాలను మొక్కలపై జూలై మరియు అక్టోబర్ మాసంలో గమనించవచ్చు. కీటకాలు మరియు గాలి ద్వారా పరాగ రేణువుల రవాణా జరిగి ఫలదీకరణం జరిగి కాయ ఏర్పడుతుంది. కోతకు వచ్చిన కాయలలో పగుళ్లు ఏర్పడి లోపల ఉన్నటువంటి జాపత్రి, రకాన్ని బట్టి ముదరు ఎరుపు/ఊదారంగు/పసుపు వర్ణంలో కన్పించిన వెంటనే కోసుకోవాలి. కోసిన వెంటనే జాజికాయ మరియు జాపత్రిని వేరు చేసి జాపత్రిని 10-15 రోజుల పాటు ఎండనివ్వాలి. ఎండిన జాపత్రి పెలుసుగా మరియు ఎరుపు లేదా తేలిన పసుపు వర్ణంలోకి మారుతుంది. జాజికాయ 4-8 వారాల పాటు ఎండలో లేదా కృత్రిమ పద్ధతుల ద్వారా ఓవెన్ డ్రైయర్ ఉపయోగించి లోపల విత్తనం శబ్దం చేసే వరకు ఎండనివ్వాలి. తర్వాత కాయలను పగలకొట్టి విత్తనం తీసి మార్కెట్టుకు తరలించాలి. ఇందులో జాజికాయ మరియు జాపత్రి మాత్రమే కాకుండా కాయలో ఉండే గుజ్జు లేదా తోలును ఊరగాయలు, జామ్ మరియు జెల్లీ తయారీలో వినియోగించవచ్చు.
దిగుబడి
ప్రతి కాయ సగటున 60 గ్రా. బరువు. అందులో విత్తనం 6-7 గ్రా. జాపత్రి 3-4 గ్రా. మిగిలినది గుజ్జు ఉంటుంది. పూర్తిగా వృద్ధి చెందిన మొక్క నుండి సగటున 2000-3000 కాయలను ప్రతి సంవత్సరం కాస్తుంది. సంవత్సరానికి 65% ఆడ జాతి మొక్కలను కలిగిన తోటల నుండి 800 కిలోల జాజికాయ మరియు 100 కిలోల జాపత్రి, ప్రతి హెక్టారుకు దిగుబడిని పొందవచ్చు. కొమ్మంట్లు లేదా మొగ్గంట్లు నాటిన తోటలలో మరింత అధిక దిగుబడిని తొందరగానే పొందవచ్చును.
సస్యరక్షణ చర్యలు
సాధారణంగా ఎండు తెగులు మరియు వడలు తెగులుతో పాటుగా కాయ కుళ్ళు గమనించవచ్చు. ఎండు తెగులు ఆశించిన మొక్కలలో ఎదిగిన మరియు ఎదుగుతున్న కొమ్మలలో చిగుర్లు నుండి కొమ్మలు ఎండిపోవడం గమనించవచ్చు. ఆశించిన కొమ్మలను కత్తిరించి, కత్తిరించిన చోట బోర్డియక్స్ పేస్ట్ పూసినచో నివారించవచ్చు. వడలు తెగులు ఆశించిన కొమ్మలు మరియు ఆకులలో వడలు లక్షణాలు గమనించినచో 1% బోర్డో మిశ్రమం పిచికారి చేయాలి. కాయకుళ్ళు ఆశించిన చెట్లలో కాయ పగుళ్లు మరియు జాపత్రి కుళ్ళడం గమనించవచ్చు. 1% బోర్డో మిశ్రమం పిచికారీ చేసి నివారించవచ్చు.
డా. సిలారు రఘువీర్, అక్కుర్తి నీరజ, గండికోట బ్రాహ్మణి,
డా. చంద్రమోహన్ రెడ్డి, ఉద్యాన కళాశాల, అనంతరాజుపేట,
శెలవు దినం కావడంతో అయిదో తరగతి చదివే టిట్టు సైకిల్ తీసుకుని సరదాగా రోడ్డు మీదికి వెళ్ళాడు. కొత్త సైకిల్ కావడంతో ఉత్సాహంగాను, సంతోషంగానూ ఉంది. రోడ్డు పక్కనున్న పచ్చటి తైలం చెట్లు చూస్తూ ఊరికి చాలా దూరం వెళ్ళిపోయాడు. ‘ఎలాగూ ఊరి బయటికి వచ్చాము కదా, మైలు దూరంలో ఉన్న కొండవరకు వెళ్లి వద్దాము’ అని అనుకున్నాడు.
రోడ్డు పక్కన ఓ అవ్వ చెరుకులు అమ్ముతూ కనిపించింది. డబ్బులిచ్చి ఓ పెద్ద చెరుకు గడ కొనుక్కున్నాడు. దారిలో తిందామని దాన్ని నాలుగు ముక్కలుగా చేయించి సైకిల్ వెనుక పెట్టుకున్నాడు.
కొద్ది దూరం పోయేసరికి దారిలో కార్లు, పెద్దపెద్ద వాహనాలు నిలబడి ఉండటం కనిపించింది. ‘ఏమి జరిగిందా’ అని ఆతృతగా చూశాడు. అడవిలో నుంచి రెండు ఏనుగులు రోడ్డుకడ్డంగా వచ్చాయని చెప్పుకుంటున్నారు.
సర్రున బండ్ల సందుల్లో దూరి ఏనుగులున్న చోటికి వెళ్లి చూశాడు.
చెరుకు లారీకి అడ్డంగా ఒక పెద్ద ఏనుగు, మరో గున్న ఏనుగు నిలబడి ఉన్నాయి. లారీ వెనుక బండ్లన్నీ నిలబడి పోయాయి.
లారీ డ్రైవర్ ఎంతసేపు హారన్ కొట్టినా అవి పక్కకి తొలగడం లేదు. తొండం ఎత్తి ఘీంకారం చేస్తూ లారీ చుట్టూ తిరగసాగాయి. డ్రైవర్ కానీ, క్లీనర్ కానీ ధైర్యం చేసి లారీనుంచి దిగి వాటిని తరిమే ప్రయత్నం చేయడం లేదు.
ఏమి చేస్తే అవి పక్కకి తొలుగుతాయని ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న ప్రయాణీకులంతా ప్రణాళికలు వేయసాగారు. కొందరు ఫైర్, పోలీస్ స్టేషన్లకు, ఫారెస్టు వారికి ఫోన్ లు చేస్తున్నారు.
‘వాటిని పక్కకి పంపడం ఎలా’ అని టిట్టు కూడా ఆలోచనల్లో పడ్డాడు. చెరుకు తింటూ ఆలోచిద్దామని గడను తీస్తూ ఉంటే తళుక్కున మెరుపులాంటి ఆలోచన వచ్చింది.
వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్లు చూసేట్లుగా తన సైకిల్ వెనుక ఉన్న చెరుకు గడ ముక్కలని దూరంగా రోడ్డు పక్కకి విసిరేశాడు.
అంతే…లారీ డ్రైవర్కి చక్కటి పరిష్కారం దొరికినట్లయింది. వెంటనే క్లీనర్కి చెప్పి లారీ పైకి ఎక్కించాడు. ఏనుగులు గమనించేట్లు అందినన్ని చెరుకు గడ కట్టలు తీసి రోడ్డు పక్కన ఉన్న పచ్చికలో వేయించాడు.
క్లీనర్ అలా మూడు కట్టలు పడేసినా ఏనుగులకు చీమ కుట్టినట్లుగా కూడా అనిపించలేదు. చూసీ చూడనట్లు ఉండిపోయాయి. నిరాశపడ్డాడు క్లీనర్. ”ప్రయత్నించి చూద్దాం, మరో మూడు కట్టలు విసిరేయ్” అని చెప్పాడు డ్రైవర్. అలాగే మరో మూడు కట్టలు పచ్చికలో పడేశాడు క్లీనర్.
మొత్తం ఆరు కట్టలు పచ్చికలో పడ్డాక కానీ, ఆ ఏనుగుల్లో కదలిక రాలేదు. తృప్తిగా ఏనుగులు చెవులాడిస్తూ చిన్నచిన్నగా చెరుకు గడల కోసం పచ్చికలోకి వెళ్ళాయి. ”హమ్మయ్య” అని ఊపిరి పీల్చుకున్నారు అక్కడి జనం.
ఏనుగుల అడ్డు తొలగడంతో వాహనాలన్నీ సర్రుసర్రున బయలుదేరాయి. కార్లలో వెళ్తున్న పిల్లలు ఏనుగును చూస్తూ ”ఏనుగమ్మ… ఏనుగు!” అని చప్పట్లు కొడుతూ వెళ్ళారు.
ట్రాఫిక్ జామ్ సమస్య తీరిపోవడంతో లారీ డ్రైవర్ నవ్వుతూ టిట్టును దగ్గరికి పిలిచాడు. చెరుకు గడల మోపును బహుమానంగా ఇచ్చాడు. టిట్టు దాన్ని సైకిల్ వెనక పెట్టి, గట్టిగా కట్టి… టాటా చెప్పి సైకిల్ని ఇంటి వైపు తిప్పాడు.
చెరుకు గడలను ఇంటికి తీసుకు వెళ్ళిన టిట్టు కడుపారా తనే తినకుండా, చుట్టుపక్కల పిల్లోళ్ళకి కూడా పంచాడు. పిల్లోల్లందరూ తియతియ్యటి చెరుకును ఆడుతూపాడుతూ ‘జ్యాంజ్యాం’ అని తిన్నారు.
– ఆర్.సి.కృష్ణస్వామి రాజు, ఫోన్: 9393662821
‘ప్రజాశక్తి’ ఆదివారం అనుబంధం స్నేహ 17-12-2023లో ప్రచురింపబడింది.
మనది వ్యవసాయక దేశం. ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారనే విషయం అందరికి తెలిసిందే. గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే ఎక్కువమంది రైతులు పంటల సాగుతో పాటు పాడిని కూడా పోషిస్తూ ఉండేవారు. పంట వ్యర్థాలను పశువులకు, పశువుల వ్యర్థాలకు పంటలకు అందిస్తూ కొనసాగేవారు. పాడి పశువులతో పాటు అవకాశం ఉన్న రైతులు కోళ్ళు, గొర్రెలు, మేకల పెంపకం లాంటివి కూడా కొనసాగిస్తూ ఉండేవారు. అప్పట్లో వాతావరణ కాలుష్యం తక్కువగా ఉండేది. ప్రజలకు గాని, పశువులకు గాని విష రసాయనాలు లేని ఆహారం అందుబాటులో ఉండేది కాబట్టి తినే ఆహారం ద్వారా అనారోగ్య సమస్యలు పెద్దగా వచ్చేవి కావు. కాని కాలం గడిచే కొలది పరిస్థితులలో వివిధ రకాలు మార్పులు సంభవించి తినే ఆహారంతో పాటు, త్రాగే నీరు, పీల్చే గాలి, పండించే నేల .. అన్నీ కలుషితం అయ్యాయి కాబట్టి ప్రజలతో పాటు పశు పక్ష్యాదులకు కూడా అనారోగ్య సమస్యలు ఏఏటికాయేడు పెరుగుతూ వస్తున్నాయి. పశు పక్ష్యాదులలో మిగతా వాటితో పోల్చుకుంటే గొర్రెలలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టే గొర్రెల పెంపకందారులు తమ విలువైన గొర్రెలను నష్టపోవలసి వస్తుంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా గొర్రెల పెంపక విధానంలో మార్పులు చేసుకొని మెళకువలు పాటిస్తే గొర్రెల పెంపకంలో విజయం సాధించవచ్చని తోటి రైతులకు తెలియచేయడానికి నల్లగొండకు చెందిన అభ్యుదయ రైతు అంజిరెడ్డి కృషి చేస్తున్నాడు.
అంజిరెడ్డి గారివి వ్యవసాయ మూలాలు. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన తరువాత ప్రత్యక్షంగా వ్యవసాయ రంగంలోకి దిగి వివిధ రకాల పంటలు పండిస్తూ, తన పంటల సాగులో ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా కేవలం సేంద్రియ పద్దతులను మాత్రమే పాటిస్తూ ఆరోగ్యకరమైన పంట దిగుబడులు సాధిస్తూ వస్తున్నాడు.
అంజిరెడ్డి ప్రతినిత్యం లాభసాటి వ్యవసాయం గురించి ఆలోచిస్తూ పంటల సాగును లాభాల బాట పట్టించడానికి అవసరమయిన వివిధ రకాల మార్గాల గురించి ఆలోచించి సమీకృత వ్యవసాయం రైతులకు లాభసాటిగా ఉంటుందని గ్రహించి తన పంటల సాగుని కొనసాగిస్తూనే గొర్రెల పెంపకాన్ని చేపట్టాలని తలంచి అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మొదలుపెట్టాడు. అంజిరెడ్డి గారి పెద్దలు గతంలో గొర్రెల పెంపకం చేపట్టారు కాబట్టి ఆ అనుభవం అంజరెడ్డిగారికి బాగా ఉపయోగపడింది. దానికి తోడు ప్రభుత్వం కూడా గొర్రెల పెంపకానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న విషయం తెలుసుకుని విచారించగా ఎన్ఎల్ఎం (నేషనల్ లైవ్ స్టాక్ మిషన్) స్కీము ద్వారా కేంద్ర ప్రభుత్వం గొర్రెల పెంపకానికి ప్రోత్సాహకాలను అందిచటాన్ని తెలుసుకున్న అంజిరెడ్డి తాను ఈ స్కీము ద్వారా ప్రభుత్వ సహాయాన్ని పొంది గొర్రెల పెంపకం చేపట్టినట్లయితే అన్నివిధాలుగా ప్రయోజనం ఉంటుందని గ్రహించి అటువైపు అడుగులు వేసి ఎన్ఎల్ఎమ్ స్కీముకు అవసరమయిన అర్హతలను పొంది 2023 వ సంవత్సరంలో గొర్రెల పెంపకంలో అడుగు పెట్టాడు.
ఎన్ఎల్ఎమ్ స్కీమ్లో కోటి రూపాయల ప్రాజెక్ట్ వివరాలు
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ లోని ఒక కోటి రూపాయల ప్రాజెక్టును అంజిరెడ్డిగారు ఎంపిక చేసుకుని అందుకుగాను ముందుగా బ్యాంకు వారి నుంచి (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కోటి రూపాయల లోనుకు సంబంధించిన అనుమతి పొందడం జరిగింది. కోటి రూపాయల లోనుకు గాను అవసరమయిన గ్యారంటీలను అంజరెడ్డి గారు బ్యాంకు వారికి చూపించిన తరువాత గొర్రెల పెంపకంలో అనుభవం ఉండటానికి సంబంధించిన ధృవపత్రాన్ని అందచేయడముతో పాటు ఎన్ఎల్ఎమ్ స్కీములోఇంకొక అర్హత అయినవంటి 5 ఎకరాల భూమిని కూడా చూపించడం జరిగింది. కోటి రూపాయల ప్రాజెక్టుకు గాను కనీసం 5 ఎకరాల సొంత భూమి లేదా కౌలు (కనీసం 7 సంవత్సరాలు) పొలం అయినా సరిపోతుంది. కోటి రూపాయలు ప్రాజెక్టు క్రింద 500 ఆడ గొర్రెలు మరియు 25 మగ గొర్రెలు (పొట్టేళ్ళు)ను పోషించవలసి ఉంటుంది. అంజిరెడ్డి గారికి అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి కోటి రూపాయల ప్రాజెక్టును మొదలు పెట్టారు. అలాంటి అవకాశాలు లేని వారికి కూడా తక్కువ అంటే 100 గొర్రెలు, 200 గొర్రెలు, 300 గొర్రెలు లకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా అందుబాటులోకి తెచ్చారు అని అంజిరెడ్డి గారు వివరించారు. కోటి రూపాయల ప్రాజెక్టులో 50 లక్షల రూపాయల సబ్సిడీ ఉంటుంది. సబ్సిడీలో సగం అయినటువంటి 25 లక్షల సబ్సిడీని అంజిరెడ్డి గారు అందుకోవడం జరిగింది. త్వరలో మిగతా 25 లక్షలు సబ్సిడీని కూడా అందుకుంటాను అని అంజిరెడ్డి గారు వివరిస్తున్నారు.
గొర్రెలకు మేత
ఎన్ఎల్ఎమ్ గైడ్లైన్స్ ప్రకారం కనీసం 5 ఎకరాల పొలం ఉండాలి. కాని అంజిరెడ్డి గారి అభిప్రాయం ప్రకారం 525 గొర్రెలు మరియు వాటికి పుట్టే పిల్లలకు స్టాల్ ఫీడింగ్ చెయ్యాలంటే కనీసం 15 ఎకరాల పొలంలో పశుగ్రాసాలను పెంచుకోవాలి. అందులో ఏడు ఎకరాల సూపర్ నేపియర్ లాంటి ధాన్యపు జాతి పశుగ్రాసాలను, ఏడు ఎకరాల థరథగడ్డి/హెడ్జ్లూసర్న్ లాంటి పప్పుజాతి పశుగ్రాసంతో పాటు ఒక ఎకరంలో అవిశ, మునగ లాంటివి సాగు చేయాలి అని అంటున్నాడు. కాని తాము ప్రస్తుతానికి 4 ఎకరాలలో సూపర్ నేపియర్, 5 ఎకరాలలో హెడ్జ్లూసర్న్, రెండు ఎకరాలలో చిలకడ దుంపలను పశుగ్రాసాలుగా సాగు చేస్తున్నాము. ఈ పశుగ్రాసం సరిపోవడం లేదు కనుక ప్రక్కనే అందుబాటులో ఉన్న పొలం ఆరు ఎకరాలను కౌలుకు తీసుకుని జూన్ తరువాత పశుగ్రాసాలను సాగు చేయాలనే ప్రణాళికతో ఉన్నాడు. వీటితో పాటు వేరుశనగ, శనగ మొదలగు పంట వ్యర్థాలను, దానా కింద మొక్కజొన్న తవుడు, నూకలు లాంటివి అందిస్తూ వస్తున్నాడు. వీటన్నింటితోపాటు పొలంలో అందుబాటులో ఉన్న మునగ, సుబాబుల్, వేప ఆకులను అవసరాన్ని బట్టి అందిస్తున్నాడు. షెడ్లో అక్కడక్కడ మినరల్ మిక్చర్ ఇటుకలను వ్రేలాడదీస్తుంటాడు.
గొర్రెలు: అందుబాటులో ఉన్న వివిధ రకాల గొర్రెలలో మాచర్ల చుక్క రకాన్ని పోషించాలని నిర్ణయించుకొని ఆ రకం గొర్రెలు దొరికే ప్రదేశాలు తిరిగి వివిధ ప్రాంతాలలో నేరుగా రైతుల దగ్గర నుంచి, సంతలలో, ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఎన్ని అందుబాటులో ఉంటే అన్ని కొనుగోలు చేయడం జరిగింది. ప్రస్తుతానికి మొత్తం 500 పైగా గొర్రెలు 25 పొట్టేళ్ళతో పాటు 100కు పైగా పిల్లలు ఉన్నాయి. మాచర్ల చుక్క రకం గొర్రెలకు మంచి మార్కెట్ ఉండడముతో పాటు మన వాతావరణానికి బాగా తట్టుకుంటాయనే ఆలోచనతో ఈ రకం గొర్రెలను ఎంపిక చేసుకున్నాడు. అమ్మకానికి సిద్ధం అయిన గొర్రెలను అవకాశాన్ని బట్టి లైవ్ వెయిట్ కిలో 400 నుంచి 450 రూపాయల చొప్పున స్థానికంగానే అమ్మకం చేసుకుంటూ వస్తున్నాడు.
గొర్రెలకు వసతి సౌకర్యం
ఎన్ఎల్ఎమ్ గైడ్ లైన్స్ ప్రకారం ఆడ గొర్రెలకు ఒక్కొక్క దానికి 10 చదరపు అడుగులు, మగ గొర్రెల (పొట్టేళ్ల)కు ఒక్కొక్క దానికి 15 చదరపు అడుగుల స్థలం కావాలి. కాని నేను మొత్తం 9000 చదరపు అడుగుల షెడ్ నిర్మాణం చేసుకున్నాను. భూమి మీద గొర్రెల పెంపకం చేపట్టినట్లయితే గొర్రెలకు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు కూలీల ఖర్చు ఎక్కువగా అవుతుంది. కాబట్టి నేను ఎత్తులో ఎలివేటెడ్ షెడ్ని నిర్మాణం చేసుకున్నాను. ఎత్తులో షెడ్ నిర్మాణం చేసుకోవడం వలన పెట్టుబడి పెరుగుతుంది కాని భవిష్యత్తులో చాలా రకాల ప్రయోజనాలు ఉటాయి కాబట్టి ఖర్చు ఎక్కువ అయినా ఆలోచించకుండా ఈ విధంగా నిర్మించుకున్నాను. షెడ్ని ఉత్తర, దక్షిణ దిక్కులలో నిర్మించుకుంటే తూర్పు నుంచి మా పొలం నుంచి చల్లని గాలులు వీస్తుంటాయి కాబట్టి షెడ్ని ఉత్తర, దక్షిణాలలో నిర్మించుకుంటే తూర్పు నుంచి వచ్చే చల్లగాలులు షెడ్లోకి బాగా రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ విధంగా నిర్మించుకోవడం జరిగింది. చలికాలంలో చల్లనిగాలులు, వర్షాకాలంలో వచ్చే వర్షాల నుంచి రక్షణ కొరకు షేడ్ నెట్లు ఏర్పాటు చేసుకున్నాను. గొర్రెలు ఎక్కడానికి మరియు క్రిందకు దిగటానికి వీలుగా ర్యాంపును నిర్మించుకున్నాను. గొర్రెల మేతకు మరియు నీటి వసతి కొరకు షెడ్లో తగిన ఏర్పాట్లు చేసుకున్నాను. ఎండు మేతలు అంటే వేరుశనగ చెత్త, శనగ చెత్త లాంటి వాటిని నిల్వ చేసుకోవడానికి గాను 5 లక్షల ఖర్చుతో వేరుగాఇంకొక షెడ్ని ప్రక్కనే నిర్మించుకున్నాను అని అంజిరెడ్డి వివరించాడు.
గొర్రెల పెంపకం విజయవంతం కావడానికి అవసరమయిన మెళకువలను చాలా వరకు పాటిస్తూ అంజిరెడ్డి ముందుకు సాగుతున్నాడు. మరిన్ని వివరాలు 99482 55544 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
ప్రతి ఆర్థిక వ్యవస్థలోనూ వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు అనే మూడు విభాగాలుంటాయి. అన్ని దేశాల్లోనూ జాతీయాదాయంలో వ్యవసాయరంగపు వాటా తగ్గుతూ వస్తుంది. పరిశ్రమల వాటా మధ్యస్తంగా ఉండగా, సేవారంగపు వాటా పెరుగుతూ అత్యధిక స్థాయికి చేరింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయరంగపు వాటా 15 నుండి 16 శాతం మధ్య కదలాడుతున్నది. సేవారంగపు వాటా 60 శాతం వాటాగా, పరిశ్రమల వాటా 25 శాతం కన్నా తక్కువగా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అతి పెద్దదైన అమెరికాలో వ్యవసాయరంగపు వాటా ఒక శాతం కన్నా కూడా తక్కువగా ఉంది. పరిశ్రమల వాటా 17.88 శాతం కాగా, సేవా రంగపు వాటా 77.6 శాతంగా ఉంది. రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా దేశాదాయంలో వ్యవసాయరంగపు వాటా 7.1 శాతంగానూ, పారిశ్రామిక రంగపు వాటా 38.3 శాతంగానూ, సేవా రంగపు వాటా 54.6 శాతంగానూ ఉన్నాయి. పేద దేశాల్లో వ్యవసాయరంగపు వాటా ఎక్కువగా ఉండగా, ధనిక దేశాల్లో సేవా, పారిశ్రామిక రంగాలు ముఖ్యమైనవిగా నిలుస్తున్నాయి. నేటి పరస్పరాధార ప్రపంచంలో వస్తువులు, సేవలు ఒక దేశం నుండి మరెన్నో దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రపంచాదాయంలో 56.3 శాతం ఎగుమతి, దిగుమతి వాణిజ్యం ద్వారా లభిస్తున్నట్లు 2021 సంవత్సరపు లెక్కలు తెలుపుతున్నాయి. అత్యధికంగా చైనా ఎగుమతుల ద్వారా చైనా దేశం 3.4 ట్రిలియన్ డాలర్లను ఆర్జిస్తున్నది. ప్రతి దేశమూ తన ఎగుమతుల్ని పెంచుకోవాలని చూస్తుంది. అదే సమయంలో తమ పౌరులకవసరమైన వస్తువుల్ని, సేవలను దిగుమతి చేసుకుంటున్నది. 2023లో భారతదేశపు ఎగుమతుల విలువ 770 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. భారతదేశపు ఎగుమతులకన్నా దిగుమతుల విలువ సుమారుగా 124 బిలియన్ డాలర్లు ఎక్కువ. దాదాపు చైనా, ఇండియాల జనాభా సమంగా ఉన్నా చైనా ఎగుమతులు భారత్ ఎగుమతులతో పోలిస్తే ఐదు రెట్లుగా ఉన్నాయి. జాతీయాదాయాల్లో కూడా ఈ రెండు దేశాల మధ్య ఇంతే అంతరం ఉంది. భారతదేశం వస్తువాణిజ్యంలో 269 బిలియన్ డాలర్ల కొరత ఉంది. ఐతే సేవారంగ వాణిజ్యంలో భారత్కు 145 బిలియన్ డాలర్ల మిగులు ఉండటం వల్ల వాణిజ్య లోటు 124 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎగుమతుల్ని పెంచుకొని వాణిజ్య లోటుని తగ్గించుకోవాలని అన్ని దేశాల్లాగే భారతదేశం కోరుకుంటుంది. 2030 కల్లా భారత ఎగుమతులు మూడు రెట్లు పెరిగి 2000 బిలియన్ డాలర్లుకి చేరుతుందని వాణిజ్య శాఖామాత్యులు పీయూష్ గోయల్ ప్రకటించారు. 2022-23లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 53 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2030 కల్లా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్ని 100 బిలియన్ డాలర్లకు చేరుకోవాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. ఎగుమతుల్ని పెంచడానికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నది. కాని ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే నెపంతో పలు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్ని నిషేధించటం, ఆంక్షల్ని విధించటం జరిగింది. ఇలా ఆంక్షలు విధిస్తూపోతే ఎగుమతుల లక్ష్యాలు ఎలా నెరవేరతాయి?
ఆహారోత్పత్తిపై ‘ఎల్నినో’ ప్రభావం
వాతావరణ పరిస్థితుల్ని ‘లానినో’, ‘ఎల్నినో’లుగా విభజిస్తారు. 2022-23లో వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా నమోదైంది. ఆహారోత్పత్తి 329.6 మిలియన్ టన్నులుగా తుది అంచనాలు వెల్లడయ్యాయి. 2022-23 వ్యవసాయ సంవత్సరంలో ‘లానినో’ పరిస్థితులే ఉన్నాయి. కాని 2023-24 వ్యవసాయ సంవత్సరంలో ‘ఎల్నినో’ పరిస్థితులుండవచ్చనే అనుమానాన్ని వాతావరణ శాఖ అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఇండియన్ మెటీరిలియోలాజికల్ డిపార్టుమెంటు (భారత వాతావరణ శాఖ) 2023-24లో వర్షపాతం 96 శాతం ఉండవచ్చని అంచనా వేసింది. వాస్తవంగా నైరుతీ రుతుపవనాలు ముగిసే సరికి సాధారణ వర్షపాతంలో 94 శాతమే కురిసిందని వాతావరణ శాఖ గణాంకాలు ప్రచురించింది. ఈశాన్య రుతుపవన కాలంలో కూడా సాధారణం కన్నా 9 శాతం తక్కువ వర్షపాతం కురిసింది. తాజాగా వాతావరణ శాఖ 2024-25లో ఎల్నినో ప్రభావం అంతరించి పోతుందనీ, సాధారణ వర్షపాతం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ వర్షం కురుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. గతంలో ‘ఎల్నినో’ ప్రభావం రెండు మూడు సంవత్సరాలున్న అనుభవం దేశానికుంది. ఒక్క సంవత్సరం తక్కువ వర్షపాతం కురవటంతో వ్యవసాయ ఉత్పత్తులు, ముఖ్యంగా ఆహారోత్పత్తి కొంతవరకు ప్రభావితమైంది.
ముఖ్యంగా వరి ధాన్యపు ఉత్పత్తిలో తగ్గుదల నమోదైంది. 2022-23లో బియ్యం ఉత్పత్తి 135.76 మిలియన్ టన్నులుగా నమోదై రికార్డుని నెలకొల్పింది. 2021-22లో ఉత్పత్తైన 129.47 మిలియన్ టన్నులతో పోలిస్తే 2022-23లో అదనంగా 6.28 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తయ్యాయి. అంతకుముందు ఐదు సంవత్సరాల సగటు బియ్యం ఉత్పత్తితో పోలిస్తే 15.37 మిలియన్ టన్నుల బియ్యం అధికంగా ఉత్పత్తయ్యాయి. అంత రికార్డు స్థాయిలో బియ్యం ఉత్పత్తి కావటంతో ఎగుమతులు ఊపందుకున్నాయి. నిల్వలు కూడా పెరిగాయి. 2023-24లో ఎనిమిదేళ్ళు వరసగా పెరిగిన తర్వాత బియ్యం ఉత్పత్తి 123.8 మిలియన్ టన్నులకు తగ్గింది. 2022-23తో పోలిస్తే బియ్యం ఉత్పత్తి 11.96 మిలియన్ టన్నులకు తగ్గింది. కాని గోధుమ ఉత్పత్తి 2022-23లో ఉత్పత్తి అయిన 110.6 మిలియన్ టన్నుల కన్నా 1.3 శాతం పెరిగి 112 మిలియన్ టన్నులకు పెరిగింది. ముడి ధాన్యాల ఉత్పత్తి 2022-23లో 57.3 మిలియన్ టన్నులు కాగా 2023-24లో 50 మిలియన్ టన్నులకు తగ్గుతుందని అంచనా వేశారు. మొక్కజొన్న ఉత్పత్తి కూడా 2022-23లో 38 మిలియన్ టన్నులుండగా 2023-24లో 32.4 మిలియన్ టన్నులకు తగ్గుతుందని అంచనా వేసారు. కంది ఉత్పత్తి 2022-23 స్థాయిలోనే 2023-24లో కూడా ఉంటుందని భావిస్తున్నారు. మినుముల ఉత్పత్తి కూడా గత సంవత్సరం స్థాయిలోనే ఉంటుందని అంచనా వేశారు. మొత్తం ఖరీఫ్ కాలంలో అపరాల ఉత్పత్తి గత సంవత్సరం కన్నా కొంత తక్కువ ఉండవచ్చని అంచనాలు తెలుపుతున్నాయి. రబీకాలంలో అపరాల ఉత్పత్తి గత సంవత్సర స్థాయిలోనే ఉంటుందని ఆశిస్తున్నారు. వరి మొక్కజొన్న, ముతకధాన్యాలు, అపరాల ఉత్పత్తి తగ్గటం వల్ల మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 309.1 మిలియన్ టన్నులకు తగ్గే సూచనలున్నాయి. వరి సాగు విస్తీర్ణం 2023-24 ఖరీఫ్లో 41.1 మిలియన్ హెక్టార్లుగా అంచనా వేయబడింది. 2022-23లో ఖరీఫ్ వరి విస్తీర్ణం ఖరీఫ్లో 40.43 మిలియన్ హెక్టార్లతో పోలిస్తే 6.7 లక్షల హెక్టార్లు పెరిగింది. కానీ రుతుపవనాల్లో వర్షపాతం తగ్గటం, కొన్ని సమయాల్లో వర్షాభావం, మరికొన్ని సమయాల్లో అధిక వర్షాల కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గాయి. రబీలో కూడా వరి విస్తీర్ణం తగ్గకున్నా దిగుబడులు తగ్గాయి. నీటి ఎద్దడి కారణంగా బియ్యం దిగుబడులు ఖరీఫ్, రబీ కాలాల్లో తగ్గాయి. సహజంగా దిగుబడులు, ఉత్పత్తి తగ్గినప్పుడు ధరలు పెరుగుతాయి. కాని ప్రభుత్వ విధానాల వల్ల రైతులకు లభించే ధరలు పెరగలేదు.
వ్యవసాయ ఎగుమతుల్లో తగ్గుదల
2022లో భారతదేశం గోధుమ ఎగుమతుల్ని నిషేధించింది. మే 13వ తేదీన గోధుమ ఎగుమతుల్ని నిషేధించిన తర్వాత ఆగస్టులో గోధుమ ఉత్పత్తులైన గోధుమ పిండి, మైదా, సెమోలినాల ఎగుమతిని కూడా నిషేధించింది. 2022 జులైలో బియ్యం ఎగుమతులపై 20 శాతం ఎగుమతి పన్నుని విధించింది. జులై 2023లో బాస్మతీయేతర బియ్యం ఎగుమతుల్ని నిషేధించింది. వెంటనే ఉప్పుడు బియ్యం ఎగుమతిపై 20 శాతం పన్ను విధించింది. పంచదార ఎగుమతుల్ని 60 లక్షల టన్నులు దాటకూడదనే ఆంక్షలను 2022లో విధించి 2023లో కూడా కొనసాగించారు. డిసెంబరు 2023లో ఉల్లి ఎగుమతుల్ని నిషేధించి కొనసాగిస్తున్నారు. ఇటీవల కొన్ని దేశాలకు పరిమిత స్థాయిలో ఎగుమతుల్ని చేయటానికి సడలించింది. 2021-22, 2022-23లో ఉత్పత్తి ఎక్కువగానే ఉన్నా ఆంక్షలు పెట్టటం వల్ల ధరలు తగ్గి రైతులు రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారు. రష్యా-యుక్రెయిన్ల మధ్య యుద్ధం మొదలైన తర్వాత గోధుమ ధరలు పెరిగినా ఆ ప్రయోజనం గోధుమ రైతులకు దక్కకుండా గోధుమ, గోధుమ ఉత్పత్తుల ఎగుమతులను నిషేధించింది. అలాగే అంతర్జాతీయంగా బియ్యం ధరలు పెరుగుతున్నా 2022లో ఎగుమతి పన్ను విధించి, 2023లో ఎగుమతుల్ని నిషేధించి రైతులకు గిట్టుబాటు ధరలు రాకుండా తొక్కి పెట్టింది. పంచదార ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగినా, దేశంలో నిల్వలున్నా ఎగుమతులపై పరిమితుల్ని విధించి చెరకు రైతుల ప్రయోజనాల్ని దెబ్బతీసింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించే బాధ్యత రైతులదేనన్నట్లుగా వారికి కనీస మద్దతు ధరలు మాత్రమే దక్కాలిగాని, గిట్టుబాటు ధరలు లభించకూడదనే కక్షతో రైతుల్ని నష్టపరుస్తున్నారు. వ్యాపారులు, దళారీలపై ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతుల్ని దోచుకోవటానికి అవకాశం కల్పిస్తున్నారు. సేకరణ వ్యవస్థను నిర్వీర్యం చేసి రైతులను ధరలు తగ్గినప్పుడు ఆదుకోకుండా, ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగినా దేశంలో వాటిని తొక్కిపెట్టి తీరని నష్టం రైతులకు కలిగిస్తున్న ప్రభుత్వ విధానాలు బ్రిటిష్ పాలకుల రోజుల్ని గుర్తు చేస్తున్నాయి. ఎగుమతుల్ని నిరుత్సాహపరుస్తూ దేశ ప్రయోజనాల్ని దెబ్బతీస్తున్నది. ఎగుమతుల్ని పెంచాలని ప్రకటించే లక్ష్యాలకు అర్థం లేకుండా పోతున్నది.
2022 ఏప్రిల్-సెప్టెంబరుల మధ్య వ్యవసాయ ఎగుమతులు 26.7 బిలియన్ డాలర్లుండగా, 2023లో ఇదే సమయంలో అవి 23.6 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 2022-23లో వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు 39.24 బిలియన్ డాలర్లుండగా, వాణిజ్య శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం 2023-24లో మొదటి తొమ్మిది నెలల్లో ఈ ఎగుమతులు 24.93 బిలియన్ డాలర్లకు తగ్గింది. పూర్తి సంవత్సరంలో 32 బిలియన్ డాలర్ల కన్నా తక్కువ స్థాయిలోనే ఎగుమతులుండే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు 20 శాతం తగ్గుదల ఉండటం ఆత్మహత్యా సదృశంగా కనిపిస్తున్నది. బాస్మతీ బియ్యం ఎగుమతుల విలువ తగ్గలేదు కాని నాన్-బాస్మతీ బియ్యం ఎగుమతులు సగానికి తగ్గిపోయాయి. గోధుమ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇతర గింజ ధాన్యాల ఎగుమతులు కూడా సగానికి పడిపోయాయి. పంచదార ఎగుమతుల విలువ సగానికి పడిపోయింది. పొగాకు, నూనె గింజలు, నూనె తీసిన పిండి, పండ్లు, కూరగాయలు, మాంసం, మద్యం, డెయిరీ ఉ్పత్తులు, పత్తి ఎగుమతులు మాత్రం గత సంవత్సర స్థాయిలోనే 2023-24లో కూడా ఉన్నాయి.
తగ్గని నిల్వలు
బియ్యం నిల్వలు 2018-19 ప్రారంభంలో 22.6 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. అవి 2019-20 ప్రారంభంలో 33.9 మిలియన్ టన్నులకు పెరిగాయి. 2021-22 ప్రారంభంలో 29.5 మిలియన్ టన్నులకి, 2020-21 ప్రారంభంలో నిల్వలు బాగా పెరిగి రికార్డు స్థాయిలో 37 మిలియన్ టన్నులకు చేరాయి. 2022-23 ప్రారంభంలో బియ్యం నిల్వలు 34 మిలియన్ టన్నులుగా ఉండగా, 2023-24 ప్రారంభానికి ఆ నిల్వలు 32.5 మిలియన్ టన్నులకు స్వల్పంగా తగ్గాయి. బాస్మతీ, నాన్-బాస్మతీ రకం బియ్యాలు కొంత మేరకు ఎగుమతి అయినా నిల్వల స్థాయి తగ్గలేదు. దేశంలో వినియోగంతో పాటు ఎగుమతులు జరుగుతున్నా ఉత్పత్తి ఏటేటా పెరుగుతుండటం వల్ల ప్రారంభ నిల్వలు సంతృప్తికర స్థాయిలోనే ఉన్నాయి. 2022 జులైలో నాన్-బాస్మతీ రకం బియ్యం ఎగుమతులపై 20 శాతం ఎగుమతి సుంకం విధించారు. ఆ సుంకాలు చెల్లించి కూడా ఎగుమతిదార్లు సుమారుగా 15 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసారు. 2023-24 ప్రారంభంలో కూడా 32.5 మిలియన్ టన్నుల బియ్యం నిల్వలున్నా జులై 2023లో నాన్-బాస్మతీ రకం బియ్యం ఎగుమతుల్ని నిషేధించింది. ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. 2023 ఆగస్టు ఒకటవ తేదీకి బియ్యం నిల్వలు 37.6 మిలియన్ టన్నులకు చేరాయి. వాస్తవానికి అవసరమైన నిల్వలు 13.5 మిలియన్ టన్నులు మాత్రమే.
ఖరీఫ్ పంట మార్కెట్లోకి వచ్చేలోగా ప్రజాపంపిణీ వ్యవస్థ అవసరాలకు ఆ నిల్వలు సరిపోతాయి. అవసరమైన నిల్వల కన్నా దాదాపు మూడు రెట్లు నిల్వలున్నా నిషేధం పెట్టటం, ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించడం సమర్థనీయమైన చర్యలు కావు. ప్రైవేటు వ్యాపారస్తులకు ఎగుమతి చేసే అవకాశం లేకపోవడంతో బియ్యం ధరలు పెరగలేదు. కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ కోఆపరేటివ్ ఎక్సో ్పర్ట్ లిమిటెడ్’ అనే సంస్థను నెలకొల్పి దాని ద్వారా చుట్టుపట్ల ఉన్న దేశాలకు పరిమితంగా బియ్యం ఎగుమతులు చేయించింది. 2023-24 సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు, మలేసియా, ఇండోనేషియా, వియత్నాం, ఇరాన్ దేశలకు 567 మిలియన్ అమెరికన్ డాలర్లు విలువైన బియ్యాన్ని ఎగుమతి చేయటం జరిగింది. ఇవికాక ఇతర ఏషియా ప్రాంతంలోని దేశాలకు మరో 341 మిలియన్ డార్ల విలువైన బియ్యాన్ని ఎగుమతి చేసారు. తెల్ల బియ్యం ఎగుమతితో పాటు గోధుమల్ని కూడా ఎగుమతి చేసారు. 14,184 టన్నుల గోధుమలు, 5326 టన్నుల గోధుమ పిండి, 15,226 టన్నుల మైదా ఎగుమతి జరిగింది. నూకల్ని మాలీ దేశానికి ఒక లక్ష టన్నులు, సెనెగెల్కు 5 లక్షల టన్నులు, జాంబియాకి 50 వేల టన్నులు, ఇండోనేషియాకు 2 లక్షల టన్నులు, భూటాన్కి 48,804 టన్నుల మేరకు ఎగుమతి చేశారు. ఇలా భారత ప్రభుత్వ స్థాయిలో ఉన్న ఒప్పందాలు, అవగాహనలను అమలు పరచటానికి పరిమితంగా వరి, గోధుమ, నూకల ఎగుమతులు జరిగాయి.
రాజకీయ కారణాలు
2024 పార్లమెంటు ఎన్నికల ముందు ధరలు పెరిగి, ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందేమోననే భయంతో ప్రభుత్వం గోధుమ, వరి ఎగుమతుల్ని నిషేధించింది. కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నదాన యోజన’ కింద దాదాపు 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారధాన్యాల నందించే పథకాన్ని ప్రారంభించింది. దాన్ని పొడిగించుకుంటూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావటానికి ఈ ఉచిత ఆహార ధాన్యాల పథకం ఉపయోగపడిందని విశ్లేషించి, పార్లమెంటు ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని రాబోయే ఐదు సంవత్సరాల వరకు కొనసాగిస్తామని అధికార పార్టీ ప్రకటించింది. దీనితో పాటు ”భారత్’ అనే బ్రాండుతో కిలో బియ్యం 29 రూపాయలకు అమ్మటానికి ఒక ప్రభుత్వ సంస్థని రంగంలోకి దించింది. నిసేధాలు, ఎగుమతి పన్నుల వల్ల దేశంలో గోధుమలు, వడ్లు ధరలు తగ్గేలాగా చేసింది. మధ్యదళారీలు చౌకగా గోధుమల్ని, వడ్లను కొని వాటి ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముతున్నారు. కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్రాలు ఆహారధాన్యాలను ఉచితంగా కానీ, తక్కువ ధరకు గానీ పేద ప్రజలకు అందిస్తున్నాయి. అవి ఆహార ధాన్యాలను తక్కువ ధరకు కొనటం ద్వారా వారి ఆర్థిక లోటుని అదుపులోకి తెచ్చుకుంటున్నారు. తాజాగా మార్కెట్ ధరల్లో సగానికి ‘భారత్’ బ్రాండ్ బియ్యాన్ని, గోధుమ పిండిని అమ్మి వినిమయదారుల మెప్పు పొందటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. వాస్తవానికి ఆహారధాన్యాల కొరత లేకున్నా వాటి ఎగుమతుల్ని నిషేధించటం ద్వారా వాటి ధరల్ని క్వింటాలుకి ఐదారు వందలు తగ్గేలా చేసి, వినిమయదారలకు, మధ్యదళారీలకు లాభాన్ని చేకూర్చే విధానాలను ప్రభుత్వం అనుసరించింది. రాజకీయ నాయకుల ప్రజాకర్షక పథకాలకు చౌకగా ఆహార ధాన్యాలు లభించటం కూడా ఈ విధానాల వల్ల వీలయింది. రైతుల ఆదాయాలను రెండు లక్షల కోట్ల రూపాయల వరకు తగ్గించి ఆ మేరకు మధ్యవర్తలకు, ప్రభుత్వాలకు, వినిమయదారులకు లాభం కలిగించింది. దానితో పాటు దాదాపు 10 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని దేశం కోల్పోయింది. రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల ఆదాయాన్ని తగ్గించి, ఎగుమతుల్ని దెబ్బతీయటం అసమంజసం.
భారతదేశం దిగుమతి చేసుకునే వివిధ రకాల నూనెలలో 80% భాగాన్ని పామ్ఆయిల్ ఆక్రమించింది. థాయ్లాండ్, ఇండోనేసియా, మలేషియా, కొలంబియా, నైజీరియా దేశాలలో పామాయిల్ విరివిగా సాగు చేసి మన దేశంతో సహా ఇతర దేశాలకు పామాయిల్ను ఎగుమతి చేస్తున్నాయి. ఈ పరిస్థితిని నిలువరించడానికి జాతీయ ఆహార భద్రతా మిషన్ క్రింద పామాయిల్ సాగు ప్రోత్సహిస్తుంది. దేశంలో 3.7 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తే ఆంధ్రప్రదేశ్లో 1.85 లక్షల ఎకరాలకు ఈ పంట విస్తరించి పామాయిల్ సాగులో మొదటి స్థానంలో ఉంది. విస్తరిస్తున్న సాగుతో పాటు పామాయిల్ ఉత్పత్తి సైతం పెరుగుతూ వివిధ రకాల ఉపఉత్పత్తులు వ్యర్థాలు పామాయిల్ పరిశ్రమల నుండి లభ్యమవుతున్నాయి.
పామ్ గెలల నుండి ఆయిల్ను వేరు చేసే ప్రక్రియలో 10-12% నూనె ఉత్పత్తి కాగా మిగిలిన 80-90% ఉపఉత్పత్తులుగా మరియు వ్యర్థాలుగా లభిస్తున్నాయి. ఖాళీ గెలలు 20-25%, పామ్ గుజ్జు పీచు 12-15%, విత్తనం – 25-30%, విత్తనంపై పెంకు – 5% గా ఉండి మిగిలిన భాగం నీటిలో కరిగే వ్యర్థాల రూపంలో బయటకు విడుదల అవుతుంది. పామ్ గింజల నుండి వచ్చే నూనెను పామ్ కెర్నల్ నూనెగా మరియు నూనె తీయగా మిగిలిన చెక్కను పామ్ కెర్నల్ కేకుగా పిలుస్తారు. ఈ పామ్ కెర్నల్ కేకులో ఎక్కువ ప్రొటీను శాతం (30-35% సిపి) ఉండి పశువులకు మేపడానికి అనుకూలంగా ఉంటుంది. పామాయిల్ మడ్డి అనేది పామ్ ఆయిల్ మిల్లు నుండి వచ్చే వ్యర్థం (Palm Oil Mill Effluent-POEM)లోని నీటిని వేరు చేయగా మిగగిలిన ఘనపదార్థం. ఈ POEMలో పామ్ గెలల పీచు, గుజ్జు పీచు, పెంకులు, ఇతర పదార్థాలు, నీరు, నీటిలో కరిగే పదార్థాలు ఉంటాయి. నేరుగా బయటకు వదిలినట్లయితే ఈ ఆంజూఖ నేల పైన పొరలను ఏర్పరిచి భూమి యొక్క సారాన్ని హరిస్తుంది. ప్రాసెస్ చేసి నీటిని వేరు చేసి మిగిలిన వ్యర్థాన్ని వివధ రకాలుగా వినియోగిస్తూ ఉంటాయి. ఈ ఆంజూఖ మరియు పామాయిల్ మడ్డిని బయోఫర్టిలైజర్ (జీవ ఎరువు)గా, వానపాముల ఎరువు తయారీకి, సూక్ష్మశైవలాల ఉత్పత్తికి, బయోడీజిల్, బయోగ్యాస్ ఉత్పత్తికి అనుకూలం. కానీ కొన్ని ప్రాంతాలలో ఈ మడ్డినే అవగాహన లేని రైతులకు పామ్ కెర్నల్ కేకుగా విక్రయిస్తూ ఉంటారు.
అనేక రకాల వ్యర్థాలు, ఉపఉత్పత్తులు, రసాయనాలు ఉండటం చేత ఈ మడ్డిని ప్రాసెస్ చేసిన తరువాత మాత్రమే పశువులకు ముఖ్యంగా పందులకు, కోళ్ళకు మేపుకోవడానికి అనుకూలం. ఇటీవలి కాలంలో కొందరు పాడి రైతులు అతి తక్కువ రేటుకు ఎక్కువ మొత్తంలో లభ్యం అయ్యే ఈ మడ్డి పదార్థాన్ని పశువుల మేతగా వాడుతూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. విడుదల అయ్యే పదార్థాలను బట్టి ఈ మడ్డిలోని పోషక విలువలు మారుతూ ఉంటాయి.
థాయ్లాండ్ మలేషియా దేశాలలో జరిగిన పరిశోధనల ప్రకారం ఈ మడ్డిలోని పోషక విలువలు – ఘన పదార్థాం – 90-92%, బూడిద – 10-12%, ప్రోటీను – 8-10%, క్రొవ్వులు – 18-20%, పీచు పదార్థం – 17-19%.
ఈ క్రూడ్ మడ్డిని వివిధ రకాల బాక్టీరియా, ఫంగస్లతో పెర్మెంట్ చేయడం వలన దీనిలోని పోషక విలువలు (ప్రోటీను పెరగడం, పీచు పదార్థం తగ్గడం) పెరిగి పందులకు, కోళ్ళకు మేతగా వినియోగించవచ్చు.
ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల ప్రకారం పాడి పశువులకు ఇచ్చే దాణాలో గరిష్టంగా 10% క్రూడ్ మడ్డి 20% వరకు ప్రాసెస్ (ఫెర్మెంటెడ్) మడ్డి వాడటం శ్రేయస్కరం 5 కిలోల దాణా అందించే పశువులకు గరిష్టంగా 1 కిలో మడ్డి వరకు మేపవచ్చు. కానీ కొందరు అతి తక్కువ రేటుకు ఎక్కువ మొత్తంలో లభ్యం అవుతుండటం వలన రోజుకు 5-6 కిలోలు ఒక పశువుకు మేపుతున్నారు. ఈ విధంగా మేపడం వలన ఈ మడ్డిలో ఉండే క్రొవ్వులు పశువు తినే గడ్డిపై పేరుకు పోయి సూక్ష్మజీవుల ద్వారా జరిగే అరుగుదలను ప్రభావితం చేస్తాయి. అంతేకాక ఈ మడ్డిని మేపినపుడు పాలలో వెన్నశాతం తాత్కాలికంగా పెరిగినప్పటికీ పాలనాణ్యత తగ్గుతుంది. మరియు పశువులు తిరగ కట్టడం, ఈసుకు పోవడం, అజీర్తి చేయడం వంటి అనారోగ్య లక్షణాలు గమనించవచ్చు.
పామాయిల్ మడ్డిని ప్లాస్టిక్ డ్రమ్ములలో గరిష్టంగా 7 రోజులు నిలువ చేసుకొని మేపుకోవచ్చు. దీని నిలువ కాలం మడ్డిలో ఉండే తేమ శాతంపై ఆధారపడి ఉంటుంది.
చెడిపోయిన, బూజు పట్టిన, దుర్వాసన వెదజల్లే మడ్డిని పశువుకు మేపడం ద్వారా వివిధ రకాల విషాలు పశువు కాలేయం పనితీరును దెబ్బతీయడంతో పాటు పాలలో సైతం దుర్వాసన మరియు టాక్సిన్ అవశేషాలుగా విడుదల అవుతుంటాయి.
మోతాదుకు మించి మేపడం వలన పశువు గడ్డి, దాణా తగినంతగా తీసుకోలేకపోతుంది.
పామాయిల్ మడ్డి ఎక్కువగా మేపిన గేదెల నుండి వచ్చే పాలను తీసుకున్న వారు కూడా అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.
కావున రైతులు ఈ సమస్యలను పరిగణలోకి తీసుకొని నిపుణుల సలహా మేరకు మాత్రమే ఈ పామాయిల్ మడ్డిని పశువులకు మేపుకోవాలి.
ఆర్.కె. సౌజన్య లక్ష్మి, (ఫోన్: 90306 65100), సైంటిస్ట్ కృషి విజ్ఞాన కేంద్రం, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, లాం, గుంటూరు – 522034. డా. యం. యుగంధర్ కుమార్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఞ హెడ్, కె.వి.కె. గుంటూరు.
తేనెటీగలు శ్రమ జీవులు. ఇవి జీవవైవిధ్యంలో ప్రముఖ పాత్ర వహించి మానవాళి మనుగడకు చాలా అవసరమైన జీవులు. వీటి నుండి తేనె మరియు ఇతర ఉపఉత్పత్తులు అయినటువంటి మైనము, పుప్పొడి, రాజాహారం, తేనెటీగల విషం మరియు ప్రొపోలిస్ లభ్యమవుతాయి. అంతేకాకుండా పంట దిగుబడులు పెంచడంలో తేనెటీగలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తేనెటీగల పెంపకం వల్ల ఆదాయంతో పాటు నాణ్యమైన పంట దిగుబడులు పొందవచ్చు. ముఖ్యంగా ఉద్యాన పంటలు గల రైతులకు అదనపు ఆదాయ వనరులుగా కూడా ఉపయోగపడుతుంది.
తేనెటీగలు-పెంపకం-ప్రాముఖ్యత
1. తేనెటీగల పెంపకానికి ఎలాంటి సొంతభూమి అవసరం లేదు.
2. ఏ విధమైన వ్యవసాయ పనులకు ఇది అడ్డురాదు.
3. తేనె ఉత్పత్తి ద్వారా రైతులకు ఆర్థిక వెసులుబాటు
4. తేనెను ఉపయోగించుట వలన ఆహార సమతుల్యత పెరుగుతుంది.
5. గృహవైద్య ప్రక్రియలకు ఉపయోగపడుతుంది.
6. తేనె నిల్వ మరియు విక్రయం సులభం
7. తేనెటీగల పెంపకానికి శారీరక శ్రమ అవసరం లేదు. కనుక స్త్రీలు, పిల్లలు కూడా చేయవచ్చు.
8. తేనెటీగలకు నిత్యం చేయవలసిన పని ఉండదు. కావున కూలీలు ఎక్కువగా అవసరం ఉండదు.
9. పెంపకానికి భారీ పెట్టుబడితో పనిలేదు.
10. తేనెటీగల పెంపకానికి పెట్టె, ఫ్రేములు తదితర పరికరాల అవసరం ఉంటుంది. తద్వారా వడ్రంగికి భృతి చేకూరుస్తుంది.
11. తేనెటీగల పెంపకం వలన పరపరాగ సంపర్కం అధికమై, పంటలలో ఫలదీకరణ జరిగి అధిక దిగుబడులు పొందవచ్చు.
12. ఇది అన్ని విధాల అందరూ చేపట్టదగిన పరిశ్రమ.
ఇన్ని విధాలుగా లాభదాయకంగా ఉన్న తేనె పరిశ్రమ ఈ మధ్యకాలంలో తేనెటీగల సంఖ్య తగ్గిపోతుంది. కావున వీటి సంఖ్య పెంపొందించడం, పరిరక్షించడం వాటి ఆవాసాలు మరియు వైవిధ్యంను కాపాడుట ద్వారా సుస్థిరతను సాధించవచ్చు. కావున ప్రతీ సంవత్సరం మే 20వ తేదీని ప్రపంచ తేనెటీగల దినోత్సవంగా గుర్తించడం జరిగింది. మొదటిసారిగా 2018వ సంవత్సరంలో సాల్వేనియా ప్రభుత్వం మరియు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సంయుక్తంగా మే 20 వ తేదీని ప్రపంచ తేనెటీగల దినోత్సవంగా పరిగణించడం జరిగింది.
ప్రపచ వ్యాప్తంగా 20,000 రకాల తేనెటీగలు మరియు పరపరాగ సంపర్కంలో పాల్గొనే ఇతర కీటకాలు మానవుల చర్యల వలన ఆవాసాలు కోల్పోవడం, పురుగుమందుల ప్రభావం, వాతావరణ మార్పుల వలన వీటి సంఖ్య తగ్గుతుంది. కాబట్టి వీటి సంఖ్య పెంచవలసిన అవసరం యువతపై ఆధారపడి ఉంది. కావున 2024 ప్రపంచ తేనెటీగల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం తేనెటీగల మనుగడ యువతతో ముడిపడి ఉంది. దీని ముఖ్యాంశాలు యువతను తేనెటీగల పెంపకంలో పాల్గొనేలా ప్రోత్సహించడం మరియు పర్యావరణ పరిరక్షణ చేయడం వల్ల యువత భవిష్యత్ తరాల రథసారధులుగా ఉంటారు.
ఈ సంవత్సరం ముఖ్యంగా యువతను తేనెటీగల ప్రాముఖ్యత గూర్చి, పర్యావరణ సమతుల్యత మరియు జీవవైవిధ్య పరిరక్షణ గూర్చి అవగాహన కల్పించడం. యువతను తేనెటీగల పెంపకంలో పాల్గొనే విధంగా చేసి వారిని ఉత్సాహపరిచి భవిష్యత్తరాలకు పర్యావరణ నాయకులుగా మరియు ప్రపంచ వ్యాప్తంగా సానుకూల ప్రభావంతో సాధికారత సాధించేవిధంగా ప్రోత్సహించాలి.
వైవిధ్యమైన వ్యవసాయంను చేయుట ద్వారా, పురుగుమందులు వాడకం తగ్గించుట ద్వారా, పరాగ సంపర్కంలో పాల్గొనే కీటకాల సంఖ్యను పెంపొందించి ఆహార నాణ్యత, దిగుబడి తద్వారా మానవాళికి మరియు పర్యావరణానికి ప్రయోజనం చేకూరుతుంది.
ఈ విధంగా తేనెటీగలు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా మద్దతు వలన సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఆకలి బాధ నుండి భూమిపై జీవించడానికి తోడ్పడతాయి.
డా. వి. సునీత డా. ఐ. అరుణశ్రీ (9701051104) డా. ఎమ్. అనురాధ, డా. వి. రవీందర్ రెడ్డి, అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం, రాజేంద్రనగర్, హైదరాబాద్-500 030
అనంతజీవకోటితో పాటు మనిషి కూడా జీవనం కొనసాగించాలంటే గాలి, నీరు, ఆహారం తప్పనిసరి. గాలి, నీరు ప్రకృతి నుంచి ఉచితంగా లభిస్తున్నాయి. కాబట్టి వాటిని ప్రక్కన పెట్టి ఆహారం విషయం గురించి మాట్లాడుకుంటే.. మనం తినే ఆహారాన్ని స్వేదం చిందించి, సేద్యం చేసి అష్టకష్టాలు పడుతూ, నష్టాలను భరిస్తూ రైతు పండిస్తున్నాడు. మన దేశ జనాభా ఏఏటికాయేడు పెరుగుతూనే ఉంది. అయినా కాని పెరుగుతున్న జనాభాకు అవసరమయిన ఆహారాన్ని మన రైతులు పండించగలుగుతున్నారు. మన ఆహార అవసరాలను తీర్చడంతో పాటు వేరే దేశాలకు కూడా మన రైతులు పండించిన ఆహారాలను ఎగుమతి చేయగలుగుతున్నాము. మన దేశంలో చాలామంది రైతులు తాము నష్టాల ఊబిలో కూరుకు పోతూ కూడా తమ కాడిని ఆపకుండా కొనసాగిస్తున్నారు. కాబట్టే మనకు కడుపు నిండా ఆహారం దొరుకుతుంది. రైతు కాడి ఆపితే మనం అకలితో అలమటించవలసిందే. కాబట్టి రైతు కాడి ఆపకూడదు. మనిషి ఉన్నంత కాలం రైతు వ్యవసాయం చేయవలసిందే. ఏమయినా ఆగవచ్చు కాని వ్యవసాయం ఆగకూడదు అనే విషయం అక్షర సత్యం. కాని ఆ వ్యవసాయం చేసే రైతు ఆర్థికంగా బలపడుతున్నాడా? లేదా? అంటే చాలామంది రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ రైతు పంటల సాగుని కొనసాగించలేడు కాబట్టి రైతులను లాభాల బాట పట్టించడానికి అవసరమయిన చర్యల గురించి ఎవరి పరిధిలో వారు ప్రయత్నిస్తున్నారు. బాపట్ల జిల్లా, మార్టూరు మండలం, బొబ్బేపల్లికి చెందిన శరత్ కూడా రైతును లాభాల బాట పట్టించడానికి తనవంతు పాత్రను పోషిస్తున్నాడు.
శరత్ది వ్యవసాయ నేపథ్యం. అయినాకాని అందరిలాగే ఉన్నత చదువులు చదివిన తరువాత వ్యవసాయ రంగానికి దూరంగా ఉద్యోగ రంగంలో స్థిరపడాలని ఎంబిఏ వరకు చదువుకుని తన అభీష్టం మేరకు ఉద్యోగ (సాఫ్ట్వేర్) రంగంలో ప్రవేశించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సందర్భంలో సమాజం గురించి, ప్రజల గురించి ఆలోచించడం మొదలయ్యింది. ప్రజలందరికి గాలి, నీరు తరువాత ఆహారం తప్పనిసరి. కాని ఆ ఆహారం పండించే రైతుకు సమాజంలో సరైన గౌరవం దక్కడం లేదు అని గ్రహించాడు. దానికి తోడు రసాయనాలతో పంటల సాగు కొనసాగిస్తుండడం వలన రసాయనిక అవశేషాలు ఉన్న ఆహారాలు తిన్న ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ రెండింటికి సరైన పరిష్కారం తాను నేరుగా వ్యవసాయరంగంలో అడుగుపెట్టడమే అని తెలుసుకుని, చేస్తున్న ఉద్యోగాన్ని వదలి 2016వ సంవత్సరంలో పంటల సాగులో అడుగు పెట్టాడు.
తన ప్రధాన లక్ష్యం విష రసాయనాలు లేని ఆహారాన్ని ప్రజలకు అందించాలి కాబట్టి అందుకు అనుగుణంగా సేంద్రియ సాగు పద్ధతులు అవలంబించాలని గట్టిగా నిర్ణయం తీసుకుని అందుకు సంబంధించిన సమాచారాన్ని వివిధ మార్గాల ద్వారా తెలుసుకుని మొదటగా బొప్పాయి సాగును సేంద్రియ పద్ధతులతో సాగు చేయడం మొదలు పెట్టాడు. 2016 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం బొప్పాయి సాగును కొనసాగిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం సుమారు రెండు ఎకరాలలో బొప్పాయి సాగులో ఉంది. ఇందుకు గాను దుక్కిలో పచ్చిరొట్టపైర్లు వేసి పచ్చిరొట్ట పైర్లు పూత థలో భూమిలో కలియదున్ని అనంతపురం నుంచి కొనుగోలు చేసిన బొప్పాయి మొక్కలను 2023 వ సంవత్సరం ఆగస్టు మాసంలో నాటించాడు. భూమిలో సేంద్రియ పదార్థం పెరగడానికి అవసరమయిన చర్యలు తీసుకున్నాడు కాబట్టి బొప్పాయి ఆరోగ్యంగా పెరుగుతుంది. క్రమం తప్పకుండా జీవామృతాన్ని మరియు వివిధ రకాల జీవన ఎరువులను భూమికి అందించటంతో పాటు చీడపీడల నివారణకుగాను వేపనూనె, వేప కషాయం, జీవసంబంధిత కీటకనాశనులు, థపర్ణి కషాయం, అగ్నాస్త్రం లాంటి వాటిని అవసరాన్ని బట్టి పిచికారి చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం పంట ఆరోగ్యంగా ఉంది. పంటను గమనించినట్లయితే ఎకరానికి 25 టన్నుల వరకు దిగుబడి వచ్చేలా ఉంది.
2016వ సంవత్సరంలో శరత్ మొట్టమొదట సేంద్రియ పద్ధతులతో బొప్పాయి పంటను సాగు చేసి మంచి దిగుబడులు సాధించాడు. కాని మార్కెటింగ్ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తాను పండించిన బొప్పాయి పండ్లను వ్యాపారస్తులకు అమ్మడానికి ప్రయత్నించగా అప్పుడు ఉన్న రేటు ఆశాజనకంగా లేకపోవడం వలన కొంత బొప్పాయి దిగుబడిని వ్యాపారస్తులకు అమ్మి కొంత బొప్పాయిని ఒంగోలు, చిలకలూరిపేట, గుంటూరు లాంటి పట్టణాలలో నేరుగా వినియోగదారులకు అమ్మడం మొదలు పెట్టాడు. సేంద్రియ పద్ధతులతో పండించడం వలన బొప్పాయి రుచి బాగా ఉండి వినియోగదారులు మరలా మరలా కొనడం మొదలు పెట్టారు. ఆశాజనకమయిన ధరలకు నేరుగా వినియోగదారులకు అమ్మకం చేయడం తెలుసుకొన్న శరత్ బొప్పాయితో పాటు ఇతర సేంద్రియ రైతుల దగ్గర నుంచి కూరగాయలు మరియు ఇతర ఆహారాలను సేకరించి నేరుగా వినియోగదారులకు అమ్మకం చేయడం మొదలు పెట్టాడు. ఎలాంటి రసాయనాలు అందించకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతులతో పండించిన ఆహారాలను మధ్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా వినియోగదారులకు అమ్మకం చేయడమే సరైన దారి అని తెలుసుకుని మార్టూరులో సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాల దుకాణాన్ని ఏర్పాటు చేసి ఆ దుకాణం ద్వారా తాను పండించిన సేంద్రియ ఉత్పత్తులతో పాటు ఇతర రైతులు పండించిన సేంద్రియ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మకం చేస్తూ వస్తున్నాడు.
శరత్ లక్ష్యం తాను ప్రత్యక్షంగా వ్యవసాయం చేసి ఎలాంటి విష రసాయనాలు ఉపయోగించకుండా పంటలు పండించి తన పంటల సాగుని లాభాల బాట పట్టించడంతో పాటు తోటి రైతులను కూడా లాభాల బాట పట్టించడం కాబట్టి సేంద్రియ సాగులో తాను తెలుసుకున్న మెళకువలను తోటి రైతులకు కూడా తెలియ చేస్తూ తోటి రైతులను కూడా సేంద్రియం వైపు మల్లించడానికి తన వంతు కృషి నిరంతరం చేస్తూ ఉన్నాడు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి శరత్ దగ్గర సలహాలు తీసుకుంటున్న రైతులు చాలా వరకు తమ పద్ధతులు మార్చుకుంటూ తమ రసాయనిక సేద్యాన్ని సేంద్రియంలోకి మార్చుకుంటూ వస్తున్నారు.
గతాన్ని ఒక్కసారి గమనించినట్లయితే చాలామంది రైతులు పంటల సాగుతో పాటు పాడి పశువులు, ఆవులు, ఎద్దులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు లాంటి వాటిని పోషిస్తూ వారికి తెలియకుండానే సమీకృత వ్యవసాయ విధానాన్ని అనుసరించారు. కాని రాను రాను వివిధ రకాల కారణాల వలన రైతులు ఏక పంట విధానానికి అలవాటు పడ్డారు. ఏక పంట విధానం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఏక పంట విధానం వలన చీడపీడల ప్రభావం పంటలపై పెరగడంతో పాటు ప్రతికూల పరిస్థితులలో ఆ ఏక పంటలో నష్టం వచ్చినట్లయితే రైతులు ఆర్థికంగా నష్టపోవలసి వస్తుంది. కాబట్టి రైతులు తిరిగి సమీకృత వ్యవసాయ బాట పట్టవలసిందే అని గ్రహించిన శరత్ సమీకృత వ్యవసాయంలో భాగంగా నాటు కోళ్ళను పెంచుతూ, ఆవులను పోసిస్తున్నాడు. భవిష్యత్తులో చేపలను కూడా పెంచాలనే యోచనలో ఉన్నాడు.
తన సేంద్రియ పంటల సాగుని లాభాల బాట పట్టించడంతో పాటు తోటి రైతులు కూడా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనే లక్ష్యం శరత్ నిర్దేశించుకున్నాడు కాబట్టి అందులో భాగంగా ఇటీవల గాంఢీవ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ను ప్రారంభించాడు. ఇందులో రైతులను సభ్యులుగా చేర్చుకున్నాడు. ప్రస్తుతానికి 300 మందికి పైగా రైతులు గాంఢీవ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలో సభ్యులుగా ఉన్నారు. ముందు ముందు ఇంకా సభ్యుల సంఖ్య పెరుగుతుందని వివరించాడు. రైతులకు అవసరమయిన శిక్షణా తరగతులు నిర్వహించటము, పంటల సాగుకు అవసరమయిన వ్యవసాయ ఉత్పాదనలను తక్కువ ధరలో రైతుకు అందుబాటులో ఉంచటం, రైతులు పండించిన ఉత్పత్తులను ఆశాజనకమయిన ధరలకు ఎక్కడ వీలుంటే అక్కడ అమ్మకం చేయడం లాంటివి ఈ కంపెనీ ద్వారా చేస్తాము అని శరత్ వివరించాడు.
సేంద్రియ సాగుపై అవగాహన పెరిగిన తరువాత అనేకమంది ఉద్యోగ రంగం నుంచి వ్యవసాయ రంగంలో అడుగు పెట్టారు కాని అతికొద్దిమంది మాత్రమే వ్యవసాయరంగంలో కొనసాగుతున్నారు. ఎక్కువ మంది వ్యవసాయ రంగాన్ని వదలి తిరిగి వేరే రంగాలకు వెళ్ళారు. కాని శరత్ పట్టువదలని విక్రమార్కుడిలా పట్టుబట్టి సేంద్రియ సాగులో కొనసాగుతూ సాగుని లాభాల బాట పట్టించడానికి తన వంతు కృషిని చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నాడు. మరిన్ని వివరాలు 95533 01949 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
సాధారణంగా పశువులలో వచ్చు కామెర్లనే ఇక్టిరస్ లేదా జాండీన్ అని కూడా అందురు. ఇది సాధారణంగా కాలేయవ్యాధులలో అతిప్రధానమైన లక్షణం. ఇది సాధారణంగా బైలిరుబిన్ అనునది రక్తంలో >2.0 mg/d గ్రా. ఉన్నపుడు కనిపించును. దీనివలన శ్లేష్మపొరలు, అన్నిరకాల కణజాలాలు మరియు కణజాల ద్రవాలు పసుపురంగులోనికి మారి కంటిలోని స్ల్కీరా యందు పసుపురంగు స్పష్టంగా కనిపించును. ఇది కాలేయ వ్యాధులు, రక్తంలోని ఎర్రరక్తకణాలు అధికంగా విచ్ఛిన్నమయినపుడు లేదా పైత్యరసము ప్రేగులోనికి చేర్చు నాళము మూతపడినపుడు లక్షణంగా కనిపించును.
సాధారణంగా జాండీస్ను మూడు రకాలుగా విభజించవచ్చును. ఇవి హీమోలైటిక్, టాక్సిక్ మరియు అబ్స్ట్రక్టీవ్ జాండీస్ రకాలు. హీమోలైటిక్ జాండీస్కు గల ముఖ్యమైన కారణాలు ఎర్రమూత్రవ్యాధి, ఎనాప్లాస్మోసిస్, ట్రిపనోసోమియాసిస్, ఈక్వైన్ వైరల్ ఎనీమియా, క్లాస్ట్రీడియల్ వ్యాధులు మొదలగునవి. ఈ వ్యాధుల కారణంగా అనేకమైన ఎర్రరక్తకణాలు ఒకేసారి విచ్ఛిన్నమై కామెర్లను కలుగజేయును. సాల్మొనెల్లా, లెప్టోస్పైరా, ఇన్ఫెక్షియస్ కెనైన్ హెపటైటిస్, పాష్పరస్ వంటి విషపదార్థాలు, క్రొటలేరియా వంటి విషపు మొక్కల కారణంగా కాలేయ కణాలు దెబ్బతిని నాశనము అగును. అందువలన వచ్చే కామెర్లను టాక్సిక్ జాండీస్ అందురు. పరాన్నజీవులు అగు ఫేషియోలా హెపాటికా, ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్; గొర్రెలలో బద్దెపురుగులు; కొలాంజైటిస్, కోలిసిస్టైటిస్, ప్యాంక్రియాటైటిస్, పైత్యరస నాళికలోనికి చిన్నచిన్న రాళ్ళు చేరటం, కణితులు వంటి కారణాల వలన కలుగు కామెర్లను అబ్స్ట్రక్టీవ్ జాండీస్ అందురు. ఇది ముఖ్యంగా పై కారణాల వలన పైత్యరస నాళిక మూతపడుట వలనవచ్చును. కామెర్ల సమయంలో శ్లేష్మపొర కొన్నిసార్లు చర్మం పచ్చగా కనిపించును. మూత్రము చిక్కటి, పచ్చటి ద్రవములాగ రావటము; పాలు పసుపు రంగులోనికి మారటం పైన తెలిపిన విధంగా బైలిరూబిన్ మోతాదు పెరుగుట, క్రొవ్వు కలిగిన మలవిసర్జన చేయటం, ఆకలి మందగించుట లేదా అసలే లేకపోవటం, శరీర బరువు తగ్గటం, కుక్కలలో వాంతులు కలుగుట జరుగును. దీని నిర్ధారణ మూత్ర పరీక్ష (హే పరీక్ష), సీరం పరీక్ష (వాండెన్ బర్గ్ పరీక్ష) మరియు ఇక్టిరస్ ఇండెక్స్ (రోగి యొక్క ప్లాస్మా రంగును స్టాండర్డ్ పొటాషియం డైక్రోమేట్ ద్రవాలతో పోల్చి కనుగొనవచ్చును. చివరగా జాండీస్ యొక్క కారణాన్ని గుర్తించి, చికిత్స మరియు నివారణ చర్యలు చేపట్టి, విశ్రాంతి ఇచ్చి, క్రొవ్వు లేని, ఉప్పు లేని ఆహారం ఇచ్చినచో పశువులలో కామెర్లను నియంత్రించవచ్చు.
డా. ఎం. జీవనలత (9490292468), అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్,
డా. ఎం. కె. శ్రీకాంత్ (9652655255), పశువైద్యాధికారి, రాజేంద్రనగర్
అల్లం ఒక ముఖ్య వాణిజ్య పరంగా సాగు చేయు దుపం జాతికి చెందిన సుగంధ ద్రవ్యపు పంట. ఈ పంట సుగంధ ద్రవ్యంగానే కాకుండా ఔషధముగా ప్రసిద్ది చెందినది. తాజా అల్లాన్ని వంటకాల్లో విరివిగా వాడతారు. వ్యాపారంగా పచ్చి అల్లంగా, ఎండు అల్లంగా, శొంఠి అల్లంగా, అల్లం పొడిగా, అల్లం నూనెగా, అల్లం కలకండగా, అల్లం బీరుగా, అల్లం వైన్గా, అల్లం పానీయంగా, అల్లం పొరలు/బెరడుగా మొ|| రూపాలలో విక్రయించబడుతుంది.
అల్లం జింజర్ అపిసినేల్ అను శాస్త్రీయ నామము కల్గి జింజిబరెసి అను కుటుంబ జాతికి చెందిన పంట. దక్షిణ ఈశాన్య ఆసియాలో ఉనికి ఆనవాలు గుర్తించడమైనది.
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1771 హెక్టార్లలో సాగవుతూ 12729 టన్నుల దిగుబడి సాధిస్తున్నది. ఇక జిల్లాల పరంగా చూస్తే మెదక్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో విస్తారంగా సాగవుతుంది.
వాతావరణం : తేమతో కూడిన వేడి వాతావరణం అల్లం సాగుకు అనుకూలం. సముద్ర మట్టానికి 1500 మీ. ఎత్తు వరకు గల ప్రదేశాలలో అల్లం పంటను సాగు చేయవచ్చును. దుంపలు మొలకెత్తుటకు దుంపలు నాటిన తర్వాత ఒక మాదిరి వర్షపాతం అవసరము. మొక్క పెరుగుదల థలో మంచి వర్షాలు చాలా అవసరము. దుంపలు త్రవ్వడానికి 28 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనుకూలం. ఉష్ణోగ్రతలు తగ్గించుటకు అల్లం పంటను తోటలలో (మామిడి, కొబ్బరి, జామ, మొ||) పాక్షిక నీడ ఉన్న ప్రాంతాల్లో పండించవచ్చును. నీటి వసతి ఉండి 1000-1500 మి.మీ. వర్షపాతం ఉన్న ప్రదేశాలు అల్లం సాగుకు అనుకూలం.
నేలలు : అల్లం పంట అభివృద్ధికి నీరు నిలువని, ఇసుకతో కూడిన బంక నేలలు, ఎర్రనేలలు, నల్ల మట్టి నేలలు, లేటరైట్ నేలలు అనుకూలం. అల్లం వేర్లు మరియు దుంపలు 25 సెం.మీ లోతు వరకు విస్తరించి ఉంటారు. కావున 30 సెం.మీ లోతుగల సారవంతమైన నేలలు అనుకూలం.
ఉదజని సూచిక 6.0 నుండి 7.0 వరకు ఉన్న నేలలు అల్లం అధిక దిగుబడికి అనుకూలం.
నేల తయారి: భూమిని రెండు సార్లు వేసవిలో దున్నుకోవాలి. పెద్ద మట్టి గడ్డలు రోటోవెటర్తో కరిగించాలి. విత్తుటకు ముందు 3 నుండి 4 సార్లు భూమి గుల్లగా అయ్యే వరకు దున్నుకొని సిద్ధం చేసుకోవాలి.
విత్తే కాలం : రాష్ట్రంలో ఏప్రిల్ మొదటి వారం నుండి మే నెలాఖరు వరకు విత్తుకోవాలి. మే నెలలో విత్తుకోవాలంటే నీటి వసతి ఉండాలి. ప్రాంతాల వారిగా విత్తే సమయంలో పెద్దగా మార్పులు ఉండవు, దుంపలు విత్తేందుకు వర్షపాతం లేదా నీటి వసతి కావాలి. దుంపలను మే నెలలో అనగా నైఋతి ఋతు పవనాలకు ముందుగానే విత్తుకోవడం చాలా మంచిది. దీని వలన వర్షాలు పడే లోపల మొక్కలు బాగా నిలదొక్కుకొని పెరిగి వుంటారు. తర్వాత అధిక వర్షాలు పడినా మొక్కలు నిలదొక్కుకుంటారు. విత్తడం ఆలస్యం అరుతే దుంప కుళ్ళు ఎక్కువగా రావడమే కాకుండా దిగుబడులు తగ్గుతాయి.
విత్తన పరిమాణం మరియు మోతాదు: ఆరోగ్యకరమైన చీడపీడలు ఆశించని దుంపలను విత్తనానికి ఎంపిక చేసుకోవాలి. మొలకొచ్చిన దుంపలను 20-25 గ్రా|| బరువు ఉండేవిధంగా 2.5 నుండి 5 సెంమీ పొడవు ఉండే విధంగా ముక్కలు చేయాలి, ప్రతి ముక్కకు 2 నుండి 3 మొలకెత్తు కణుపులు కల్గియుండాలి. విత్తన మోతాదు ఒక్కో ప్రాంతానికి మారుతూ ఉంటుంది. తెలంగాణలో అరుతే రకాన్ని బట్టి ఎకరాకు 600 నుండి 800 కిలోల విత్తనపు దుంపలు అవసరము ఉంటుంది. మెట్ట ప్రాంతాలలో ఎకరాకు 600 నుండి 700 కిలోల విత్తనం నాటుకోవచ్చును. ఎత్తైన గిరిజన ప్రాంతాలలో 900-1000 కిలోల విత్తనం ఎకరాకు అవసరము ఉంటుంది.
విత్తన శుద్ది: అల్లం విత్తన దుంపలకు ఖచ్చితంగా విత్తన శుద్ది చేసుకోవాలి. లీటరు నీటికి 10 గ్రా|| ట్రెకోడెర్మా విరిడి అను ఫార్ములేషన్ను కలిపిన ద్రావణంలో 30-40 ని||లు నాన బెట్టాలి. తద్వారా దుంపలకు విత్తన శుద్ధి అవుతుంది.
మళ్ళ తయారీ మరియు నాటడం : అల్లంను ఈ విధములుగా నాటుకోవచ్చు. 1) సమతల బెడ్ విధానము 2) బ్రాడ్ రిడ్జ్ విధానము.
సమతల బెడ్ విధానము : ఈ పద్ధతిలో 4þ4 మీటర్ల వైశాల్యం గల సమతల మడులు తయారు చేస్తారు. ఈ మడులలో 30 సె.మీ. దూరంతో వరసలు ఏర్పాటు చేసుకోవాలి. దుంపలను 10-15 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. నాటిన వెంటనే తేలికపాటి నీరివ్వాలి. ఈ విధానము తేలికపాటి నేలలకు అనుకూలం.
వెడల్పు గట్టు పద్దతి (బ్రాడ్ రిడ్జ్ విధానము): ఈ పద్ధతి మధ్యస్తం నుండి బరువైన నల్లరేగడి నేలలకు అనుకూలం. ఈ పద్దతిలో 20-30 సెం.మీ.ల ఎత్తైన 75 నుండి 100 సెం.మీ. వెడల్పైన బోదెలు/గట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. దుంపలను 30 సెం.మీ. వరుసలలో, మొక్క మొక్కకు మధ్య 10-15 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. విత్తిన వెంటనే తేలికపాటి నీరివ్వాలి. ఈ పద్దతి ద్వారా 20-30% వరకు అధిక దిగుబడి వస్తుందని నిరూపితమైనది. విత్తన దుంపలను నాటేటప్పుడు మొలకెత్తిన బుడిపెలు పైకి ఉండు విధంగా నాటుకోవాలి. అల్లం విత్తన దుంపను నాటటానికి 10 రోజుల ముందు (విత్తన శుద్ది చేయుటకు ముందు) మంచి నీటిలో 24 గంటలు నానబెట్టడం వలన మంచి మొలక శాతం పెరుగుతుంది. ఇలాంటి మొక్కలు నాటిన 2-3 వారాలలో మొలకెత్తుతారు.
ఎరువులు: అల్లం దుంప జాతికి చెందినది కావున భూమి నుండి ఎక్కువ పోషకాలను గ్రహిస్తుంది కావున సరైన ఎరువుల మోతాదును అందించవలసి ఉంటుంది.
అంతర పంటలు : అల్లం నీడను ఇష్టపడే మొక్క కావున 50% నీడ నిచ్చే తోటల పంటలలో (మామిడి, కొబ్బరి, బొప్పారు, నిమ్మ, ద్రాక్ష, ఆరటి, కంది, ఆముదం) మొక్కల మధ్య పెంచవచ్చును. వరుసల మధ్య మొక్కజొన్న, అలసంద మరియు ఆముదం లాంటి మొక్కలు పెంచి పంటకు కావలసిన నీడను కల్పించాలి. నీడనిచ్చే నెట్స్ క్రింద కూడా అల్లం సాగు చేయవచ్చు. అల్లంలో టమాట లేక మిరప పంటను కూడా పండించవచ్చు.
అంతర కృషి: అల్లం పంటలో అంతరకృషిలో భాగంగా మల్చింగ్, నీడనివ్వడం, కలుపు నివారణ మరియు మట్టిని ఎగదోయుట మొదలగునవి.
అ) మల్చింగ్: అల్లంలో మల్చింగ్ చాలా ముఖ్యమైనది దీనివల్ల తేమను నిల్వ చేయడాన్ని, చినుకులు పడినప్పుడు మట్టి చెదిరిపోకుండా కాపాడుతూ, కలుపు పెరుగుదల నియత్రించుతూ మొలక శాతం వృద్ది చెందేవిధంగా దోహదపడుతుంది. మల్చింగ్ కోసం ఎవైనా ఎండు ఆకులు లేక గడ్డిని ఉపయోగించవచ్చును.
ఆ) నీడనివ్వడం: అల్లం పంట నీడలో చక్కగా మొలకెత్తుతారు. నీడ కొరకు కంది లేక మొక్కజొన్న లేక ఆలసంద లేక ఆముదం పంటలను సాళ్ళలో లేక నీటి కాలువలలో విత్తుకోవాలి.
ఇ) కలుపు నివారణ : తోటలలో కలుపు లేకుండా చూసుకోవాలి.
ఈ) మట్టి ఎగదోయుట: సెప్టెంబర్ మాసంలో కొక్కిలతో మొక్క కాండం వద్ద కలుపు తీయాలి. దీని ద్వారా పీచు వేర్లు తెగి కొత్త వేర్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. దీని ద్వారా దుంపలు మంచిగా ఊరుతూ అధిక దిగుబడి వస్తుంది.
నీటి యాజమాన్యం: వేసవిలో నాటిన తొలి రోజుల్లో 4 రోజులకు ఒకసారి, వర్షాకాలం చివరిలో 7 రోజులకు ఒకసారి, అక్టోబర్ మాసం నుండి వారానికొకసారి నీరు పెట్టాలి. అల్లం పంటకు నీటి తడులు మరియు తేమ ఉండే విధంగా చూసుకోవాలి. నీరు నిలువకుండా మురుగు నీటి కాలువల ద్వారా నీరు తీసివేయాలి. లేనిచో దుంప కుళ్ళు సమస్య తీవ్రమవుతుంది. డ్రిప్లో మైక్రోజెట్స్ ద్వారా కావలసిన నీటిని అందిస్తూ అధిక దిగుబడులు సాదించవచ్చని పరిశోధనలలో తేలినది.
పంటకోత: సాధారణంగా అల్లం పంట కాలపరిమితి 9-10 నెలలు. సాధారణంగా అల్లం దుంపలు ఏప్రిల్-మే నెలల్లో నాటుకొంటే నవంబర్, డిసెంబరు, జనవరి మాసాలలో త్రవ్వకానికి వస్తారు. ఆకులు పసుపుపచ్చగా మారి ఎండిపోవడం, ఆకులు మొక్కల మధ్య కాండం ఎండిపోవడాన్ని బట్టి దుంపలు పక్వానికి వచ్చినట్లుగా గుర్తించవచ్చు. కాలపరిమితి పూర్తరునా సరే ఊరకున్నా లేక మార్కెట్లో రేటు లేకున్నా అల్లాన్ని త్రవ్వకుండా నేలలోనే ఉంచి నీరు కట్టాలి. తరువాత సంవత్సరం త్రవ్వి తగిన దిగుబడులను పొందవచ్చు. ఫిబ్రవరి – మార్చిలో నీడ ఏర్పాటు చేసి ఒకటి రెండు తడులు ఇస్తే ఆదనంగా 20 క్వి. దిగుబడి వస్తుంది ఏప్రిల్-మే మాసాలలో తవ్వి మార్కెట్ చేస్తే విత్తనంగా మంచి ధర పొందవచ్చు. త్రవ్విన తరువాత దుంపల మీద గల వేర్లు, పొలుసులు, మట్టిని తీసివేసి శుభ్రపరచి మార్కెట్ చేయాలి. అల్లాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి పంటకోత యొక్క సమయాన్ని నిర్ణరుంచాలి. ప్రధానంగా అల్లాన్ని వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. పచ్చి అల్లం కొరకు దుంపలు విత్తిన 6 మాసాల తరువాత త్రవ్వడం ప్రారంభించాలి. ఎండు అల్లం కొరకు ఆకులు పసుపు రంగుకు మారి ఎండిపోవడం ప్రారంభించినపుడు అంటే నాటిన 8 నెలల తరువాత కోత ప్రారంభించాలి. నిల్వ వుండే అల్లం కొరకు (దుంపలు నిల్వ వుండే) నాటిన 7 నెలల తర్వాత కోత ప్రారంభించాలి, అలస్యమరుతే దుంపలో పీచు ఎక్కువ అవుతుంది.
విత్తన దుంపల ఎన్నిక మరియు నిలువ: త్రవ్విన తరువాత, తదుపరి పంట కొరకు కొంత అల్లాన్ని విత్తన దుంపలుగా ఎంపిక చేసుకొని నిలువ చేయాలి. నిలువలో పురుగులు, తెగుళ్ళ వలన దుంపకు నష్టం జరుగుతుంది. సాధారణంగా పొలుసు పురుగులు మొలకెత్తుతున్న మొగ్గ భాగాలను ఆశించి నష్టపరుస్తారు. అల్లం త్రవ్వకం తరువాత కొన్ని పద్దతులను పాటించడం వలన విత్తన దుంపలను తాజాగా నష్టపోకుండా నిలువ చేయవచ్చు.
కె. సాధన, సెల్: 9940236076; డా. ఎం.ఆర్. భానుశ్రీ, డా. బి. పుష్పావతి, వ్యవసాయ కళాశాల, పాలెం, ప్రొఫెసర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం
మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ప్రకృతి వ్యవసాయం ఆంధ్రప్రదేశ్లో వేగంగా రైతు లోగిళ్ళకు చేరుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో ప్రకృతి వ్యవసాయ విభాగాన్ని ప్రారంభించి అందులో క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించుకొని వారి ద్వారా వివిధ రకాల పద్ధతులలో వివిధ రకాల పంటలు సాగు చేయిస్తూ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వచ్చిన క్షేత్రస్థాయి ఫలితాలను తోటి రైతులకు ప్రత్యక్షంగా చూపిస్తూ ఎక్కువ మంది రైతులను ప్రకృతి వ్యవసాయ బాట పట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగం వారు కొత్తగా A గ్రేడ్ మోడల్ని ప్రవేశపెట్టారు. ఈ మోడల్లో ఒక ఎకరంలో 5 ఎకరాలకు అవసరమయిన విత్తనాన్ని ఉపయోగించి 5 ఎకరాలలో వచ్చే దిగుబడిని ఒక ఎకరంలో పొందడం ఈ మోడల్ యొక్క విశిష్టత. ప్రకృతి వ్యవసాయ విభాగం మెంటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఝాన్సీలక్ష్మి ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, గాదెపాలెం గ్రామంలో ఒక ఎకరం పొలంలో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగం రూపొందించిన A గ్రేడ్ మోడల్ విధానంలో పలు పంటల సాగు చేస్తున్నారు.
ఝాన్సీ లక్ష్మిది వ్యవసాయ నేపథ్యం. వివిధ పంటల సాగులో వారికి అనుభవం ఉంది. రసాయనిక వ్యవసాయం చేస్తున్న వీరు ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని తమ రసాయనిక వ్యవసాయాన్ని ఏడు సంవత్సరాల క్రితం ప్రకృతి వ్యవసాయంలోకి మార్చారు. రసాయనిక వ్యవసాయం చేస్తున్న సమయంలో పెట్టుబడులు పెరగడముతో పాటు తమ ఆరోగ్యాలు దెబ్బతినడము గమనించిన వీరు ఈ సమస్యల పరిష్కారానికి గాను తమ రసాయనిక సాగుని ప్రకృతి వ్యవసాయంలోకి మార్చారు. ప్రస్తుతం వీరు ప్రకృతి వ్యవసాయ విభాగంలో మెంటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారి ఉద్యోగ బాధ్యతలలో భాగంగా ఒక ఎకరం పొలంలో A గ్రేడ్ మోడల్ పంటల సాగు మొదలు పెట్టారు.
దుక్కిలో ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం అందించి 30 రకాల విత్తనాలను PMDSపద్ధతిలో చల్లుకోవడం జరిగింది. 45 రోజులు పెరిగిన పంటను పశువులకు మేతగా అందించి పొలాన్ని దున్నకుండానే 5 రకాలు ప్రధాన పంటలుగా, 20 రకాలు బయోడైవర్సిటి పంటలుగా ట్రాక్టరు గొర్రుతో పొలంలో ఎద బెట్టడం జరిగింది. మామూలుగా అయితే PMDS పంటలను పచ్చిరొట్టగా భూమిలో కలియదున్నుతారు. కాని తాను పశువులకు మేతగా అందించారు. పోషకాలు గల పచ్చిమేతను పశువులకు మేతగా అందించడం వలన దిగుబడి పెరగడముతో పాటు పాలలో వెన్న శాతం పెరగడము వీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. జు గ్రేడ్ మోడల్లో వేసే ఐదు ప్రధాన పంటలకుగాను శనగ 30 కిలోలు, ధనియాలు 2 కిలోలు, వరిగలు ఒక కిలో, గోరు చిక్కుడు కొంచెం, పొద్దు తిరుగుడు కిలోన్నర విత్తనాలు అవసరంపడింది. ఈ పంటలన్నీ కూడా సుమారు 90 రోజులలో దిగుబడి అందించేవి కాబట్టి అన్ని పంటలు ఒకేసారి దిగుబడి పొందవచ్చు అనే ఉద్దేశ్యంతో ఈ పంటలను ఎంపిక చేసుకున్నారు. వీటితో పాటు బయోడైవర్సిటి పంటలుగా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పెసర, అలసంద, పిల్లిపెసర మొదలగు 20 రకాల విత్తనాలను కూడా మిశ్రమ పంటలుగా వేయడం జరిగింది. అన్ని పంటలకు కలిపి క్రమం తప్పకుండా 15 రోజులకు ఒకసారి ద్రవ జీవామృతాన్ని పంటలపై పిచికారి చేస్తుంటారు. చీడపీడల నివారణకు గాను పక్షిస్థావరాలు, పసుపు రంగు జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకున్నారు. అవసరాన్ని బట్టి అగ్నాస్త్రం, థపర్ణి కషాయాలను పంటపై చీడపీడల నివారణకు పిచికారి చేస్తున్నారు. పూత నిలవటానికి మరియు దిగుబడి పెరగటానికి గాను అవసరాన్ని బట్టి పుల్లటి మజ్జిగను పిచికారి చేస్తున్నారు. రక్షక పంటలుగా సరిహద్దులో జొన్న మరియు సజ్జ పంటలను వేసుకున్నారు.
A గ్రేడ్ మోడల్లో వేసిన అన్ని పంటలు ప్రస్తుతం పూత, పిందె థలో ఉన్నాయి. దిగుబడి రావడానికి కొంత సమయం పడుతుంది. పంటలను గమనించినట్లయితే దిగుబడులు ఆశాజనకంగా రావచ్చు. ఎలాంటి రసాయనాలు అందించకుండా పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ ఆరోగ్యకరమయిన పంటలు పండిస్తున్నారు.
మన దేశ వ్యవసాయ పరిశ్రమల్లో కోళ్ళ పెంపకం ఒక ముఖ్యమైన భాగము. కోళ్ళ పరిశ్రమ పెరుగుతున్న జనాభా యొక్క పోషణ మరియు మాంసకృతుల అవసరాలను అందించడానికి కీలక పాత్ర వహిస్తున్నది. అయితే, ఇతర వ్యవసాయ రంగాల మాదిరిగానే, కోళ్ళ పెంపకం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. కోళ్ళ రైతులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లలో, కోళ్ళ మందలలో దుర్గుణాల ఉనికి సూక్ష్మమైన మరియు సంక్లిష్టమైన ఆందోళనగా నిలుస్తూ వాటి నిర్మూలన రైతులకు ఒక ప్రధాన నిర్వహణ సమస్యగా మారింది. దుర్గుణాలు కోళ్ళు ప్రదర్శించే అవాంఛనీయ ప్రవర్తనలు అవి కోళ్ళ ఆరోగ్యం, ఉత్పాదకత మరియు సంక్షేమాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. దుర్గుణాలు ఒక్క సారి మందలో అభివృద్ధి చెందిన తర్వాత అవి వేగంగా మంద అంతటా వ్యాపించి వాటి నియంత్రణ మరియు నిర్మూలన చాలా కష్ట సాద్యంగా మారుతుంది. ఫలితంగా, ఈ దుర్గుణాలు (చెడు అలవాట్లు) పౌల్ట్రీ రైతులకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి.
కోళ్లలో తరచుగా కనిపించు దుర్గుణాలు
ఈకలు మరియు చర్మాన్ని పొడవడం, పీకడం: ఇది కోళ్లలో ఒక తీవ్రమైన చెడు అలవాటు, కోళ్ళు ఒకదానికొకటి ఈకలు, చర్మం మరియు మలద్వారం ప్రాంతాన్ని పొడుచుకుని పీకుతుంటాయి. పొడుచుకోవడం వల్ల ఏర్పడిన గాయాల ద్వారా వివిధ రకాల రోగాలు మరియు అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది అంతేకాకుండా ఈ గాయాలు ఇతర కోళ్లను తిరిగి పొడవడానికి ప్రేరేపిస్తాయి. ఇలా ఆ గాయాలను తిరిగి మందలోని ఇతర కోళ్ళు పొడవడం ద్వారా అవి తీవ్రతరమయ్యి చివరికి కోళ్ళ మరణానికి దారితీస్తాయి. ఈ సమస్యలు ప్రదానంగా కోళ్ళ గృహ వ్యవస్థ లో కావాల్సిన స్థలం లేక రద్దీ పెరగడం వలన, పేలవమైన యాజమాన్య పద్ధతుల కారణంగా మరియు ముఖ్యంగా పోషకాహార లోపాలు (మాంసకృత్తుల లోపాలు, భాస్వరం లోపం మరియు అధిక శక్తి తక్కువ పీచు పదార్థము ఉన్న దాణా) వలన తలెత్తుతాయి.
గుడ్లను కుక్కడం మరియు తినడం: కోళ్ళు తమ స్వంత లేదా ఇతర కోళ్ళ గుడ్లను తినే ప్రవర్తనను అలవర్చుకుని మంద అంతటా వ్యాపింపజేస్తాయి. ఈ ప్రవర్తన, ఒకసారి మందలో కనిపించిన తర్వాత, త్వరగా వ్యాపించి ఒక నిరంతర సమస్యగా మారుతుంది, దీని నిర్వహణ మరియు నివారణ కోళ్ళ పెంపకంలో ప్రధాన అంశంగా మారుతుంది. ఈ దురలవాటు కోళ్ళ ఉత్పాదకత మరియు ఆర్థిక సాధ్యతను ప్రభావితం చేసి రైతుకు గణనీయమైన ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది.
కోళ్లలో గుడ్లను తినే అలవాటు అవి గుడ్లు పెట్టడానికి ఏర్పరిచిన గూళ్ళ యొక్క పేలవమైన నిర్వహణ వలన కలగవచ్చును, పోషకాహార లోపాల వలన కోళ్ళు పెట్టే గుడ్లలో పగుళ్లు మరియు చీలికలు ఉన్నపుడు కోళ్ళు ఆ గుడ్లను పొడిచే అవకాశం ఎక్కువ అలాగే కోళ్ళు నిత్యం గురయ్యే ఒత్తిడికి ప్రతిస్పందనగా కూడా ఈ దుర్గుణము ఉద్భవించవచ్చు.
గుడ్లను దాచిపెట్టుట: గుడ్డు దాచడం అనేది పెరటి కోళ్లలో అప్పుడప్పుడు గమనించే ప్రవర్తన, ఇక్కడ కోళ్లు తమ గుడ్లను నియమించబడిన గూళ్ళు, గూడు పెట్టెల్లో కాకుండా ఇతర ప్రదేశాలలో పెట్టడానికి ఎంచుకుంటాయి. గుడ్డు దాచడం అనేది అడవి కోడి యొక్క సహజ ప్రవృత్తి, కొన్ని పెరటి కోళ్లలో కూడా ఈ ప్రవృత్తి జన్యుపరంగా సంక్రమించడం వల్ల అవి గుడ్లను దాచి పెట్టవచ్చును. గుడ్లు పెట్టడానికి సరైన గూళ్ళు మరియు గూడు పెట్టెల్లో లేకపోవుట, అధిక రద్దీ వలన కూడా కోళ్లలో ఈ ప్రవర్తన గమనించవచ్చును. దీనివలన రైతులకు కోళ్ళు పెట్టిన గుడ్లను గుర్తించడం మరియు సేకరించడం సవాలుగా మారుతుంది, ఫలితంగా సేకరించిన గుడ్ల సంఖ్య తగ్గి దిగుబడి పడిపోతుంది.
నివారణ మరియు నిర్వహణ
మెరుగైన గృహవ్యవస్థ మరియు సరిపడా నేల స్థలం కేటాయించడం: కోళ్ళలో దుర్గుణాలకు దోహదపడే ప్రదాన కారకం అధిక రద్దీ. తగినంత స్థలం, తగినన్ని దాణా మరియు నీటి తొట్టెలు కల్పించడం ద్వారా పొడుచుకునే సమస్యను నివారించవచ్చును. సరైన గాలి ప్రసరణ మరియు మెరుగైన జీవన పరిస్థితులను కలిగిన గృహవ్యవస్థను అందించడం ద్వారా కోళ్ళలో ఒత్తిడిని తగ్గించి అవాంఛనీయ ప్రవర్తనలను అరికట్టవచ్చును.
సమతుల్య పోషణను అందించడం: దుర్గుణాలను నివారించడంలో కోళ్లకు సమతుల్య దాణా అందేలా చూసుకోవడం చాలా ముఖ్యం. మాంసకృత్తుల లోపాలు, భాస్వరం లోపము మరియు దాణాలో శక్తినిచ్చు పదార్థాలు మరియు పీచు పదార్థాల హెచ్చుతగ్గులు లేకుండా పశువైద్యుల సలహా మేరకు నిర్దిష్ట పోషణ సమతుల్యత కలిగిన దాణాను కోళ్లకు అందించాలి.
కోళ్ళ ముక్కులు కత్తరించడం ద్వారా పొడుచుకునే సమస్యను నివారించవచ్చు: నాలుకను జాగ్రత్తగా వెనక్కి నెట్టి పై ముక్కు 2/3వ వంతు మరియు దిగువ ముక్కును 1/3వ వంతు ముక్కులు కత్తిరించు యంత్రం సహాయంతో కత్తిరించాలి.
దుర్గుణాలు కలిగిన కోళ్లను, గాయపడిన కోళ్లను గమనించి వెంటనే మంద నుండి వేరు చేయాలి.
సుస్థిర అభివృద్ధి, సాంకేతిక ముందంజ, వినియోగదారుల ప్రాముఖ్యతలే సూచికలుగా నేడు పాడిపరిశ్రమ అనేక సవాళ్ళు ఎదుర్కొంటూ ముందడుగు వేస్తోంది.
ప్రపంచ ఆహార వ్యవస్థలోనే తనదైన ప్రత్యేక ముద్ర వేస్తున్న పాడిపరిశ్రమ అటు వినియోగదారుల మారుతున్న అవసరాలు, పర్యావరణ సంరక్షణలే ప్రాతిపదికగా సాంకేతికత జోడిస్తూ, సుస్థిర అభివృద్ధి దిశగా అడుగులేస్తోంది. సుమారు 55 సం|| క్రితం హైదరాబాద్లోని లాలాపేటలో నిర్మించిన విజయ పాల ఉత్పత్తుల కర్మాగారం కాకుండా, ఇటీవల రావిర్యాలలో రూ. 450 కోట్లతో నిర్మించిన మెగా డెయిరీ ఇందుకు నిదర్శనం. అయితే పాల ఉత్పత్తి, ఉత్పాదకతలపరంగానూ, పాడి పశువుల పరంగానూ ఎన్నో సవాళ్ళు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాశిలో ఎక్కువగా ఉన్న పశువుల ఉద్గారాలు, మీథేన్ వలన, పర్యావరణ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దానికై సమతుల ఆహారం అందిస్తూ, ఇట్టి ఉద్గారాలను తగ్గించవచ్చని గుజరాత్లో ఎన్డిడిబి క్షేత్ర స్థాయిలో నిరూపించింది. సమతుల ఆహారం పశువులకు అందించడం వలన 15-21% మీథేన్ వాయువులను నియంత్రించవచ్చు.
అలాగే, పశువుల పేడ విషయంలోనూ సరియైన నిర్వహణా పద్థతులు అవసరం. బయోగ్యాస్ ఉత్పత్తికై పేడ వినియోగం, మిగిలిన ‘స్లర్రీ’తో భూసారం పెంపొందించడం తప్పక చేపట్టాలి.
నానాటికీ తరిగిపోతున్న పశుగ్రాస భూములను సద్వినియోగం చేసుకోవాలి. ఉన్న భూమిలో పశుగ్రాసాల పెంపకం ప్రణాళికా బద్ధంగా చేపట్టాలి.
డెయిరీ ఫార్మ్ వ్యర్థాలతో సేంద్రియ శక్తి ఉత్పత్తి, ‘బ్రికెట్స్’ లాంటి ఇంధనాల ఉత్పత్తి చేయడం విలువ జోడింపుకు సహకరిస్తాయి.
నీటి సద్వినియోగం, నీటి నాణ్యత పరిరక్షణ ముఖ్యంగా వాననీటి సంరక్షణ, నీటి పునర్వినియోగం, నీటిని పరిమితంగా వాడుకోగల యంత్రాల వినియోగం, పశువులు కడగగా విడుదలయ్యే నీటిని పశుగ్రాసాల పెంపకానికి వినియోగించడం అవలంబించాలి.
పెద్ద డెయిరీలలో పాల పొడి తయారీ ప్రక్రియలో ఆవిరి ఏర్పడుతుంది. దీనిని తిరిగి నీరుగా మార్చి, వివిధ అవసరాలకు వాడడం చేపట్టాలి.
ముఖ్యంగా డెయిరీలలో నీటి దుబారాని అరికట్టాలి. నీటి మీటర్ల వినియోగం, ప్రతి షిఫ్ట్లో నీటి వాడకం పరిశీలించడం, నీటి వినియోగ నియంత్రణకు సహకరిస్తుంది.
పాల ఉత్పత్తి పెంపుదలకు అజొల్లా వినియోగం, అవిసె ఆకులను మేపడం, చెట్ల మధ్య పశుగ్రాసాల పెంపకం నేడు చాలా అవసరం.
పెద్ద డెయిరీ ఫారాల్లో రోబోటిక్ మిల్కింగ్ పార్లర్ల వినియోగం, పశువుల్లో పలు వ్యాధులను తట్టుకొనే జన్యువుల గుర్తింపు, అభివృద్ధి, సెక్స్డ్ సెమెన్ పరిజ్ఞానం, పిండమార్పిడి ప్రక్రియ లాంటి ఎన్నో సాంకేతికతలను ఎప్పటికప్పుడు ‘అప్డేట్’ చేసుకోవాలి.
వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా బాదాం, పసుపు, సోయా, ఓట్స్ పాల తయారీ మార్కెటింగ్ చేయాలి. తక్కువ చక్కెర పానీయాలు, విటమిన్లతో పుష్టీకరించడం, క్లీన్ లేబెల్స్తో పాల ఉత్పత్తుల అమ్మకాలు, సాంప్రదాయ ఉత్పత్తులతో ఆధునిక ఉత్పత్తుల మేళవింపు, కొత్త రుచుల కోసం పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, డెయిరీలు ఉత్పత్తులను తాజా, నాణ్యతతో, సరసమైన ధరలో అందించగలగాలి.
సాంకేతికతను ఆహ్వానించని ఏ డెయిరీ మనగలదు. వినియోగదారుని అభిరుచి మేరకు అడుగు వేసినపుడే పాడి పరిఢవిల్లుతుంది. రైతు కష్టం నిజం అవుతుంది.
– మధుసూదనరావు, ఉప సంచాలకులు, విజయ డెయిరీ, ఆదిలాబాద్, 9121160553
ఆరోగ్యవంతమైన పశువులు ఈనిన తరువాత మొదటి పది రోజులవరకు ఎర్రటి స్రావాలు వేస్తూ క్రమముగా ఆ స్రావాలు పూర్తిగా ఆగిపోతాయి. కాని ఈ మధ్య కాలంలో మనం గమనించినట్లు అయితే ఈనిన పశువులలో గర్భాశయము వాపుకు గురై మొదటి పది రోజులలో తెల్ల మట్టు వేయడం మనం ఎక్కువగా గమనించవచ్చు. ఈ వ్యాధి సంక్రమించిన పశువులలో గర్భాశయం వాపుకు గురై, దుర్వాసన కలిగి, ఎరుపు-గోధుమ రంగులో నీటి లాంటి లేదా జిగట, తెల్లని, చీము కలిగిన స్రావాలు యోని నుంచి ద్రవిస్తూ వుంటాయి, మరియు ఆరోగ్యం క్షీణించడం, పాల దిగుబడి తగ్గి, జ్వరంతో కూడిన లక్షణాలు కనబడతాయి. దీనివల్ల పశువులు ఎదకు ఆలస్యంగా రావడమేకాక, ఎదకు వచ్చినప్పుడు ఎన్నిసార్లు చూడి కట్టించినా చూడి కట్టవు. ఈ వ్యాధి ఈనిన తర్వాత 30 శాతం పశువులలో చూడవచ్చు. ఈ వ్యాధి చికిత్సకు 5000-7000 రూ. ఖర్చవుతుంది, అదే అశ్రద్ద వహించినచో పశువు ప్రాణానికే ప్రమాదము వాటిల్లవచ్చు. మరలా ఆ పశువుని ఇంకో పశువుతో భర్తీ చేయడానికి 75,000-90,000 రూ. ఖర్చవుతుంది. అందువల్ల లక్షణాలను త్వరగా గుర్తించి తగు చికిత్స చేయించుకున్నట్టయితే రైతు పాల ఉత్పత్తిని పెంచుకొని ఆర్థికంగా లాభం పొందవచ్చు.
కారణాలు
ఇది సాధారణంగా అసహజమైన మొదటి లేదా రెండవ థ ప్రసవాన్ని అనుసరిస్తుంది. ప్రత్యేకించి దూడ అడ్డం తిరిగినప్పుడు దూడను బయటకు తెచ్చే దీర్ఘకాలిక ప్రయత్నము లేదా యోనికి నష్టం వాటిల్లినప్పుడు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితికి గర్భాశయ జడత్వం, ఈసుకొని పోవడం, ప్రేరేపిత లేదా అకాల కాన్పు, ఈనడం కష్టమవ్వడం, మెయ్య, ఈనిన వెంటనే సకాలములో మాయ వేయకపోవడం వంటివి కూడా ముఖ్య కారణములుగా పేర్కొనవచ్చు. వేలాడే మాయని లాగడం, బరువు కట్టడం వల్ల గర్భకోశం చిరిగి, రక్తస్రావమై పశువులకు ప్రమాదం సంభవిస్తుంది. సూక్ష్మజీవులు గర్భకోశంలోనికి వెళ్ళడం వల్ల వ్యాధి సోకి, ఆ పై రక్తంలోకి చేరడం ద్వారా పశువు యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది.
లక్షణాలు
వ్యాధి తీవ్రత ఎక్కువగా వున్న పశువులలో గర్భాశయం ఎక్కువ వాపుకి గురై, పశువులు ఎరుపు-గోధుమ రంగులో, జిగటగా మరియు దుర్వాసన కలిగిన మట్టు పోస్తుంటాయి. సాధారణంగా పశువులలో ప్రసవానతరం రెండు వారాలవరకు ఎర్రటి రంగులో, నీరులాంటి, ఎటువంటి దుర్వాసన లేని స్రావాలు సాదారణంగా గమనించవచ్చు. ఈ రెండింటి మధ్య తేడాను గమనించుకుంటూ ఉండాలి. ఈనిన తర్వాత ఎర్ర మట్టు వేయడం సహజం, అదే ఎరుపు – గోధుమ రంగులో వచ్చినట్లైతే లోపల గర్భంలో ఇన్ఫెక్షన్ వున్నట్లు. ఈ వ్యాధిలో పశువులు జ్వరం కలిగి వుండి, నాడి వేగంగా కొట్టుకోవడంతో పాటు మేత సరిగా తీసుకోకపోవడం, శరీరంలో నీటి శాతం తగ్గి నీరసముగా ఉండడము, పారుడు వంటి లక్షణాలను చూపిస్తాయి. యోని మరియు మానం ఎరుపు రంగులోకి మారి, వాపుకి గురై వుండి, పిండం పొరలు తరచుగా గర్భాశయ గోడలకు గట్టిగా అతుక్కొని వున్నట్టయితే పశువు యొక్క ఆరోగ్యం పూర్తిగా విషమించిందని అర్థంచేసుకోవచ్చు. తరచుగా ఈ జబ్బున పడిన పశువులు పశువైద్యుడిని సంప్రదించేలోపు క్రింద పడిపోయి, మేత తీసుకోకుండా లేవలేని స్థితిలో వుంటాయి. ఈ ఇన్ఫెక్షన్ గర్భాశయము నుండి పొట్ట భాగంలోకి ప్రవేశించడం వలన ఆవు యొక్క ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం మొదలవుతుంది. తీవ్రమైన వ్యాధిని కలిగి లేవలేని స్థితిలో వున్న పశువుల రక్తంలో కాల్షియం తగ్గిపోవడం మరియు చనిపోయే అవకాశం ఉంటుంది.
చికిత్స
మంచి పోషకవిలువలతో కూడిన సమతుల్య ఆహారంతో పాటు అత్యవసర చికిత్స చాలా అవసరం. వ్యాధి కారక క్రిములను చంపడానికి ప్రయత్నించడం కంటే పశువు యొక్క శరీరధర్మానికి మద్దతివ్వడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, పశువు ఈనడానికి వెచ్చని మరియు సౌకర్యవంతమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ పరిస్థితిలో మొదటి థలో స్రావాలను, మరియు నొప్పిని తగ్గించుటకు అవసరమైన చికిత్సను అందించాలి. కాల్షియం అవసరమైన వాటికి ఇవ్వడం, యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ చేయించి, ఫలితానుసారం చికిత్సను అందించాలి. వీలైనంత వరకు ఈనిన 45 రోజుల లోపు గర్భంలోకి మందులు ఎక్కించకుండా కండకు మాత్రమే వేసుకోవడం ఉత్తమం.
ఈ పశువుల యొక్క ఆరోగ్య పురోగతిని ఆకలిని తిరిగి పొందుట, పారడం ఆగిపోవుట మరియు గర్భాశయం నుంచి వచ్చే స్రావాల యొక్క దుర్గంధం తగ్గి, దళసరిగా, మరింత స్పష్టంగా కోడిగుడ్డు సొనలా మారడం ద్వారా మనం గుర్తించవచ్చు.
నివారణ
ఈ పరిస్థితిని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. దూడ అడ్డం తిరిగినప్పుడు, లేదా గర్భాశయ జడత్వం మొదలగు సమస్యలు గమనించినప్పుడు, దూడను లాగకుండా, దీర్ఘకాల ప్రయత్నాలు తగ్గించి, మానంకి ఎటువంటి నష్టం వాటిల్లకుండా, వెంటనే పశువైద్యున్ని సంప్రదించడం ఆవశ్యకం. ఈసుకుపోయిన వాటిని ఇతర పశువులనుంచి దూరంగా వుంచి, కారణాలను తెలుసుకొని తగు చర్యలను తీసుకోవాలి.
పశువులు మాయ సరిగ్గా వేయకపోవడం వల్ల ఈ సమస్యని తరచుగా చూస్తాము. వేలాడే మాయని బలవంతముగా లాగడం లేదా బరువు కట్టడం వల్ల గర్భాశయము లోపల ఎక్కువ రక్తస్రావము జరిగి పశువులు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈనిన తర్వాత 24 గంటల వరకు మాయవేయని పరిస్థితులలో డాక్టర్ గారి సలహా మేరకు వైద్యం చేయించాలి. ఎక్స్ ప్లాంటా, రిప్లాంటా వంటి పౌడర్లను రోజు 50 గ్రా. నోటి ద్వారా అందించుట వలన గర్భకోశ చలనాలు పెరిగి మాయ దానికంతటకు అదే పడిపోతుంది. పావు కేజీ నువ్వులు అర కేజీ బెల్లంతో కలిపి మూడు, నాలుగు రోజులు తినిపించాలి. యాంటీబయాటిక్స్ 3-5 రోజులు వాడుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, ఈ సమస్యని పూర్తిగా కాకపోయినా, కొంతవరకైనా నివారించవచ్చు. రోజుకి 50 గ్రా. ఖనిజలవణ మిశ్రమమును దాణాలో అందించాలి.
మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్, అండవాహికలో చీము చేరడం, అండాశయ అతుకులు ఏర్పడడం, ఊపిరితిత్తులలో నీరు చేరడం, కాలేయం, మూత్రపిండాలు లేదా మెదడులో చీము గడ్డలు అభివృద్ది చెందడం వంటివి ఈ వ్యాధి యొక్క పర్యవసానాలు. ఈ పరిస్థితి నుండి కోలుకున్న పశువుల యొక్క పునరుత్పత్తి శక్తి తగ్గే అవకాశం ఉంది, కాబట్టి వాటిని తదుపరి గర్భాశయం మరియు అండాశయంలో ఏదైనా మార్పులు లేదా వ్యాధుల కోసం పర్యవేక్షించుకోవాలి. ఏదైనా సమస్య తలెత్తినట్లయితే, వెంటనే పశువైద్యున్ని సంప్రదించి సకాలంలో తగిన చికిత్స చేయించుకోవాలి.
కె. గ్రీష్మా రెడ్డి, 8309205772, పి.హెచ్.డి. విద్యార్థిని, బి. చంద్ర ప్రసాద్, 9490724881, సహాయ అద్యాపకులు, పశు గర్భకోశ శాస్త్ర మరియు ప్రసూతి విభాగము, పశువైద్య కళాశాల, గన్నవరం
ఈసారి వేసవి పగటి ఉష్ణోగ్రతలు సరాసరి 40 డిగ్రీల సెంటిగ్రేడ్ మించి నమోదు అవుతున్నాయి. వేసవికాలంలో ఎండల తీవ్రత, అధిక ఉష్ణోగ్రత, వేడిగాలులు వీచడం వలన ఉష్ణతాపానికిగురై పాడి పశువులు తీవ్ర అనారోగ్యానికి, అసౌకర్యానికిలోను కావడమే కాకుండా వడదెబ్బకు గురవుతూ ఉంటాయి. ఆవులు కంటే గేదెలు ఉష్ణతాపానికి ఎక్కువగా గురవుతాయి. గేదెలు నలుపు వర్ణంలో ఉడటంవలన నలుపు ఉత్తమ ఉష్ణగ్రహకము కావడము వలన ఈ ప్రభావము ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పశుపోషకులు వేసవికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే,పాడిపశువులు అనారోగ్యానికి గురికాకుండా వడదెబ్బబారిన పడకుండా సంరక్షించుకోవచ్చు.
వడదెబ్బ
అధిక ఉషోగ్రత, గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, పశువుల షెడ్లలో అధికసంఖ్యలో కిక్కిరిసి ఉండటం, ఉక్కపోత, నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం వలన పశువు వడదెబ్బకు గురవుతుంది. దాహం పెరుగుతుంది. పశువు తూలుతూనడుస్తూ పడిపోవడం, రొప్పుతూ, శ్వాస కష్టమవడంతో ఒక్కొకసారి అపస్మారక స్థితికి వెళ్ళి మరణిస్తాయి.
పశువులలో ఉష్ణోగ్రత ప్రభావం
పశువు శరీర ఉష్ణోగ్రత 38-39.3 డిగ్రీల సెంటీగ్రేడ్ అయిన పాడి పశువుల సౌకర్యవంతమైన ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే. ఈ ఉష్ణోగ్రతకు మించి వాతావరణ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఉష్ణ తాపానికి గురవుతాయి.
దీని వలన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. నోటినుండి చొంగకారుతుంది. జీర్ణక్రియకు, నెమరువేయడానికి కావలిసిన లాలాజలం లభించదు. ముట్టె ఎండిపోవడం, చర్మం సున్నితత్వం కోల్పోయి మందంగా అవడం గమనించవచ్చు. దాహం అధికంగా ఉండటంతో ఎక్కువనీరు తాగుతాయి. తాగిన నీరు చెమట రూపంలో బయటకు వచ్చి ఎలోక్ట్రోలైట్స్ నష్టపోయి జీవక్రియలు మందగిస్తాయి. మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం వల్ల మూత్రం తక్కువగా పోస్తుంది. శ్వాస, గుండె, నాడీ వేగం పెరుగుతుంది.
మేత సరిగా తినక పోవడం వలన శరీరంలో గ్లూకోజ్ నిలువలు తగ్గిపోతాయి.పశువు క్రమంగా నీరసించి, బలహీనంగా మారతాయి. పశువు సరిగ్గా నడవలేక తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి. జీవక్రియ తగ్గిపోవడం, ఆకలి మందగించడం, ఆహరం తక్కువగా తీసుకోవడం వలన పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది.
వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వలన ఇతర వ్యాధులు, పరాన్నజీవులు ఆశించే అవకాశం పెరుగుతుంది. పునరుత్పత్తి సామర్థ్యం మందగించును. కొన్ని సమయాల్లో దాహంతో ఉన్న పశువులు మురికి గుంటలలో ఉన్న నీటిని తాగడం వల్ల పారుడు వంటి జీర్ణకోశ వ్యాధులు సంభవిస్తాయి.
అధిక వేడివల్ల హార్మోన్ల ఉత్పతి సమతుల్యత లోపించడం వల్ల పునరుత్పత్తి కుంటుపడుతుంది. చూడి పశువులలో గర్భస్రావాలు సంభవించే అవకాశాలున్నాయి. పశువులు సకాలంలో ఎదకురావు, వచ్చినా ఎద లక్షణాలు స్పష్టంగా కనిపించవు. చూలు కట్టే అవకాశం తగ్గుతుంది. ఈతల మధ్య కాలం పెరుగుతుంది. పునరుత్పత్తి సక్రమంగా ఉండదు.
వడదెబ్బకు గురైన పశువులకు ప్రథమచికిత్స
వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే ప్రదేశంలోకి తీసుకెళ్ళి శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి పలుమార్లు నీటితో కడగటం, తల, నుదుటి మీద మంచుముక్కలు ఉంచడం లేదా చల్లని గోనే సంచిని దానిపై కప్పాలి. వెంటనే పశువైద్యున్ని సంప్రదించాలి. పశువైద్యుని పర్యవేక్షణలో గ్లుకోస్ సెలైన్, సోడియం క్లోరైడ్ అందించాలి. శరీర ఉష్ణోగ్రతలు తగ్గించడానికి సోడియం సలిసిలైట్, పారాసిట్మాల్ ఇంజక్షన్లు వేయించాలి.
వేసవి యాజమాన్య పద్ధతులు
ఎండ తీవ్రత నుండి రక్షించడానికి పశువుల పాకను ఎత్తైన ప్రదేశంలో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేవిధంగా ఏర్పాటు చేసుకోవాలి. పాకాల ఎత్తు 12-14 అడుగులు ఉండేలా నిర్మించుకోవాలి. సూర్యరశ్మి నేరుగా పడకుండా దీర్ఘఅక్షం తూర్పుపడమరలుగా నిర్మించుకోవాలి. పాకాల చుట్టూ సుబాబుల్, అవిశ చెట్లను నాటడం వలన నీడతో పాటు పశుగ్రాసం లభిస్తుంది.
పాకాల పైకప్పుభాగాన తాటాకుతోగాని వరి గడ్డితో గాని కప్పి తరచు తడుపుతూ ఉండాలి. పాకలను కడగడం, చుట్టూ పరిసరాలలో నీళ్ళు చల్లడం వల్ల షెడ్డు లోపలి వాతావరణం చల్లగా ఉంటుంది. చల్లని నీటితో పశువుల్ని రోజుకు 2-3సార్లు కడగాలి. శుభ్రమైన చల్లని త్రాగునీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి.
రైతు ఆర్దిక స్థోమత మరియు పశువుల సంఖ్యను బట్టి పాకల్లో ఫ్యాన్లను లేదా తుంపర్లను వెదజల్లే యంత్రాలను కూడాఏర్పాటుచేసుకోవచ్చు. కప్పుపై భాగంపై తెల్లని రంగు వేయించడం వల్ల సూర్యకిరణాలు పరివర్తనం చెందుతాయి.
వేసవిలో మేత
ఎండవేడివల్ల పాడిపశువు ఎక్కువగా మేత తినలేదు. వేసవితాపంతో జీర్ణక్రియ, సన్నగిల్లుతుంది. అందువల్ల సులువుగా జీర్ణించుకునే పిండిపదార్థాలైన గంజి, జావ లాంటి పదార్థాలు ఇవ్వడం మంచిది.
ఎక్కువ శాతం పచ్చిగడ్డి ఇవ్వాలి. ఒకవేళ మాగుడు గడ్డి సమృద్దిగా ఉంటే అందించవచ్చు. పచ్చిగడ్డిని ఉదయం సమయాలలో, ఎండుగడ్డిని రాత్రిసమయాలలో విభజించి ఇవ్వాలి. అధిక పాలను ఇచ్చేపశువులకు పశు దాణ నీటితో కలిపి ఇవ్వాలి. అందుబాటులో ఉండే సమీకృత దాణ ఇవ్వడంవలన తక్కువ మోతాదులో అన్ని పోషకాలను సమకూర్చవచ్చు. మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వడం మంచిది.
మేపు కొరకు పశువుల్ని ఎండవేళల్లో కాకుండా ఉదయంపూట 6 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు మేత కొరకు పశువులను బయటకు పంపడంమంచిది.
ఆరోగ్య పరిరక్షణ
వ్యాధినిరోధక శక్తి తగ్గడం వల్ల ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది కావున నివారణకై పశువులలో ముందుగానే గాలికుంటు వ్యాధి, గొంతువాపు, జబ్బవాపు వ్యాది నివారణ టీకాలు వేయించాలి.
దాహంతో ఉన్నపశువులు మురుగునీరు త్రాగటం వల్ల పారుడు వంటి జీర్ణకోశ రోగం వచ్చే అవకాశం ఉంది కావున ఎల్లవేళల మంచి చల్లని త్రాగునీరు అందుబాటులో ఉంచాలి.
అంతర పరాన్నజీవుల నిర్మూలనకు నట్టల నివారణ మందులు క్రమంతప్పకుండా త్రాగించాలి.బాహ్య పరాన్నజీవుల నిర్మూలనకు బ్యూటాక్స్ మందు తగుపాళ్ళలో నీటిలో కలిపి పశువుశరీరంపై పిచికారిచేయాలి. పరిసరాలనుపరిశుభ్రంగా ఉంచాలి.
పశుపోషకులు ముందుగానే పై జాగ్రత్తలు పాటించడం వలన పశువుల ఆరోగ్యం కాపాడటంతోపాటు, పాల దిగుబడి తగ్గకుండా, ఆర్దికంగా నష్టం వాటిల్లకుండా చూడవచ్చు.
ప్రతిమనిషికి అన్నింటికంటే ముఖ్యం ఆనందం. ఆనందం కావాలంటే ఆరోగ్యం తప్పనిసరిగా ఉండాలి. ఆరోగ్యం సక్రమంగా లేకుండా వివిధ రకాల అనారోగాలతో ఇబ్బందులు పడేవారు ఆనందంగా తమ జీవితాన్ని కొనసాగించలేరు. ఎన్ని లక్షల కోట్లు డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం సక్రమంగా లేకుంటే అన్ని లక్షల కోట్లు వృథా అనే విషయం అందరికి తెలిసిందే కాని వాస్తవాన్ని గ్రహించలేకపోవచ్చు. కాని ఆ విషయం కరోనా తరువాత అందరికి తెలిసి వచ్చింది. లక్షల కోట్లు డబ్బు ఉన్న వాళ్ళు కూడా కంటికి కనిపించని చిన్న వైరస్ దెబ్బకు భయపడి ఇల్లుదాటి బటకు రాలేదు అనే విషయం మన అందరం ప్రత్యక్షంగా చూశాము. కరోనా వల్ల ఆరోగ్యం యొక్క విలువ ప్రతి ఒక్కరూ బాగా గ్రహించగలిగారు. సంపాదన కోసం ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి ఎంత సంపాదించినా కాని ఆరోగ్యం సరిగ్గా లేకపోతే సంపాదించిన సొమ్ము ఎందుకు పనికిరాకపోవచ్చు. కాబట్టి సంపాదన కంటే ఆరోగ్యం ముఖ్యం. కాని కొన్ని కనీస అవసరాలకు సంపాదన తప్పనిసరి కాబట్టి కనీస అవసరాల కొరకు తప్పనిసరిగా సంపాదన కోసం ప్రయత్నించాల్సిందే. కొంతమంది కుటుంబ ఆర్థిక పరిస్థితులు కనీస అవసరాల కొరకు భార్యా, భర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయవలసిన అవసరము లేకపోవచ్చు. అలాంటి పరిస్థితులలో భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరి ఉద్యోగం ద్వారా వచ్చిన ఆదాయం తమ అవసరాలకు సరిపోయినట్లయితే ఇంకొకరు తమ సమయాన్ని కుటుంబం కోసం, కుటుంబ ఆరోగ్యం కోసం కేటాయించినట్లయితే ఆరోగ్యంగా, ఆనందంగా తమ జీవితాలను కొనసాగించవచ్చు. ఈ విషయాన్ని గ్రహించిన పద్మిని గారు తన భర్త సాంబశివరావుగారి ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం తమకు సరిపోతుంది కాబట్టి తాను ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా తన పూర్తి సమయాన్ని తమ కుటుంబం కోసం మరియు కుటుంబ ఆరోగ్యం కోసం కేటాయిస్తున్నారు.
పద్మిని గారిది వ్యవసాయ నేపథ్యం. తన చిన్నతనం నుంచి తండ్రితో కలిసి పొలాలకు వెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వ్యవసాయ మూలాలు ఉన్న ప్రతి ఒక్కరికి వ్యవసాయం అన్నా, మొక్కలన్నా, పచ్చదనం అన్నా మక్కువ ఎక్కువగా ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. ఈ కోవకే చెందిన పద్మిని గారికి కూడా చిన్నతనం నుంచి మొక్కలన్నా, పచ్చదనం అన్నా చాలా మక్కువ కాబట్టి ఉన్నత చదువులు చదివిన పద్మిని ఎలాంటి ఉద్యోగ ప్రయత్నం చెయ్యకుండా తన భర్త సహాయ సహకారాలతో ఇంట్లో మొక్కలు పెంచుతూ ఉంటారు. భర్త ఉద్యోగ భాధ్యతల రీత్యా వివిధ ప్రాంతాలు తిరుగుతున్న సమయాలలో కూడా ప్రతి చోట మొక్కలు పెంచుతూ ప్రాంతం మారినపుడు అన్ని మొక్కలను తమతో పాటు రవాణా చేస్తూ ఉండేవారు. వేరేప్రాంతానికి మారవలసి వచ్చినపుడు ఇంటి సామను కంటే మొక్కలకు సంబంధించిన సామాను ఎక్కువగా ఉండేది. అయినా కాని ఏ మాత్రం ఆలోచించకుండా తాము మారిన కొత్త ప్రాంతానికి మొక్కలను కూడా మారుస్తూ వచ్చి నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాదు, మదీనాగూడలో సొంత ఇంటిని నిర్మించుకొని ఆ ఇంటి మిద్దెమీద వివిధ రకాల మొక్కల పెంపకం చేస్తూ వస్తున్నారు.
మిద్దె మీద మొక్కల పెంపకం చెయ్యాలి కాబట్టి ఇంటి నిర్మాణ సమయంలోనే నీరు స్లాబులోకి ఇంకకుండా జాగ్రత్తలు వహించారు. స్లాబు మీద కూడా స్టాండ్లు ఏర్పాటు చేసి స్టాండ్ల మీదనే వివిధ రకాల కుండీలు, బకెట్ల లాంటివి ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. తాను ఇంటిపంటను చేసేది తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కాబట్టి మొదటగా తమ ఆహారాలకు అవసరమయిన కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని రకాల పండ్లకు ప్రాముఖ్యతను ఇచ్చి కొన్ని రకాల పూల మొక్కలు కూడా పెంచుతున్నారు. తమ ఇంటి అవసరాలకు అవసరమయిన కూరగాయలు, ఆకుకూరలు సగానికి పైగా తామే సొంతంగా పండించుకుంటూ మిగతావి బయట మార్కెట్లో కొనుగోలు చేసుకుని ఉపయోగించుకుంటున్నారు. పండ్ల విషయానికొస్తే జామ, దానిమ్మ, యాపిల్బేర్, అంజూర లాంటి పండ్లను సొంత మిద్దె తోట నుంచి పొందుతూ కొన్ని రకాలను బయట నుంచి కొనుగోలు చేస్తుంటారు.
ప్రతిరోజు ఉదయం, సాయంకాలం కలిపి మూడు నుంచి నాలుగు గంటలు మిద్దెతోటకు కేటాయించి మొక్కలకు అవసరమయిన పనులను తానే సొంతంగా చేస్తూ శారీరక శ్రమకు అవకాశం ఇస్తున్నారు. మొక్కల పెంపకానికి ఎలాంటి రసాయనాలను ఉపయోగించకుండా కేవలం సేంద్రియ పదార్థాలను ఉపయోగిస్తుంటారు. విత్తనాలను కూడా తామే సొంతంగా తమ ఇంటి పంట నుంచి సేకరిస్తూ ఉపయోగిస్తుంటారు. మిరప, టమాట, వంగ లాంటి మొక్కలను కూడా సొంతంగా నారు పోసుకుంటుంటారు. కొమ్మల ద్వారా అభివృద్ధి చేయగల మొక్కలను కూడా సొంతంగా అభివృద్ధి చేసుకుని ఉపయోగిస్తూ ఉంటారు. చీడపీడల నివారణ కొరకు తప్పనిసరి పరిస్థితులలో ఎగ్ఎమినో యాసిడ్ లాంటివి పిచికారి చేస్తుంటారు. మొదటగా చీడపీడలు ఆశించిన ఆకులను, కొమ్మలను కడగడం లేదా అంతవరకు తుంచడం చేస్తుంటారు. మొక్కలకు పోషకాలకు గాను కిచెన్లో వృథాగా పడవేసే కూరగాయల, పండ్ల తొక్కలు, బియ్యం కడిగిన నీటిని ఉపయోగిస్తుంటారు. సంవత్సరంలో ఒకటి లేదా రెండుసార్లు పశువుల ఎరువు లేదా మేకల ఎరువును అందిస్తుంటారు. తోటి ఇంటి పంటదారులతో ప్రతినిత్యం సంభాషణలు జరుపుతూ అవసరమయిన సమాచారాన్ని తెలుసుకుంటూ ఉంటారు.
మనం ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినగలగాలి. ఆరోగ్యకరమైన ఆహారానికి కొంతలో కొంత సరైన దారి ఇంటి పంట అని గ్రహించిన పద్మిని తన చదువు అయిన తరువాత ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా తన సమయాన్ని కుటుంబ సభ్యుల కోసం, ఇంటిపంటకోసం కేటాయించి తోటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి
ఇంటి పంటకు అవసరమయిన కుండీలు, ఎరువులు, ద్రావణాలు, విత్తనాలు, మొక్కలు మొదలగు వాటి కొరకు వివిధ ప్రాంతాలు తిరగవలసి వస్తుంది. అలాంటి సమయాలలో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి అవుతుంది. కొన్నిసార్లు ఇంటి పంట అవసరాలకు దూర ప్రాంతం వెళ్ళవలసి వచ్చినప్పుడు అవి కొనుగోలు చేసే ధర కంటే రవాణాకు ఎక్కువ ఖర్చు పెట్టవలసి రావడంతో పాటు సమయాన్ని కూడా ఎక్కువగా కేటాయించవలసి వస్తుంది. అలాంటి సమయాలలో పద్మిని భర్త సాంబశివరావు తోడుగా ఉంటూ ఏ మాత్రం విసుగు చెందకుండా ఎంత దూరం అయినా రావడంతో పాటు డబ్బును, సమయాన్ని కేటాయించడానికి ఏమాత్రం వెనుకాడడు కాబట్టి తాను విజయవంతంగా ఇంటి పంటను నిర్వహించగలుగుతున్నాని భర్త సాంబశివరావుకి పద్మిని కృతజ్ఞతలు తెలియచేశారు.
ఆరోగ్యం విలువ అనంతం
గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే గతంలో మనిషి పుట్టింది సంపాదన కోసమే అన్నట్లు ప్రవర్తించారు. కాబట్టే తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి సంపాదన కోసం తాపత్రయ పడ్డవారు చాలామంది ఉన్నారు. కాలం గడిచే కొలది డబ్బు అందరికి అందుబాటులోకి రావడంతో పాటు కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న తరువాత ఆరోగ్యం విలువ చాలా వరకు ప్రతి ఒక్కరికి తెలిసి వచ్చింది. ఎదైనా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. పోయినప్పుడే దేని విలువ అయినా తెలిసేది అనే విషయం అక్షర సత్యం. కాబట్టే ఆరోగ్యంగా ఉన్నపుడు ఆరోగ్యం విలువ తెలుసుకొనని వారు ఆరోగ్యం పాడైపోయిన తరువాత ఆరోగ్యం విలువ గుర్తించగలుగుతున్నారు కాని కొన్ని సమయాలలో ఎంత గుర్తించినా ప్రయోజనం ఉండటం లేదు. కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు ఎంత ఖర్చు పెట్టినా కూడా బాగు చేసుకోలేకపోతున్నారు. బాగా డబ్బు ఉన్న వాళ్లు కూడా వచ్చిన రోగాల నుంచి బయట పడలేక ఇబ్బందులు పడిన వారి గురించి మనం ప్రతినిత్యం వింటూనే ఉంటాము. ఇలాంటి సందర్భాలు ఎదురైనపుడు ఆరోగ్యం విలువ అనంతం అని అర్థం అవుతుంది. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన పద్మిని తమ కనీస అవసరాలు తన భర్త సంపాదనతో తీర్చుకోగలుగుతున్నారు కాబట్టి తన సమయాన్ని కుటుంబ ఆరోగ్యం కోసం కేటాయించాలని నిర్ణయించుకొని ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయలేదు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి గాలి, మంచి నీరుతో పాటు మంచి ఆహారం తినగలగాలి. గాలి, నీరు ప్రకృతి నుంచి లభిస్తున్నాయి కాబట్టి తమ పరిధిలో ఉన్న ఆహారాన్ని ఎలాంటి విష రసాయనాలు లేకుండా తామే ఇంటి అవరణలోనే పండించుకోవాలనే లక్ష్యంతో ఎక్కువ ప్రాంతాలు తిరిగినా, ఎన్ని ఇళ్లు మారినా కూడా ఇంటి పంటను వదలకుండా కొనసాగిస్తూ తమ కుటుంబానికి అవసరమయిన కొంత ఆహారాన్ని తమ పరిధిలో పండించుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ ఆరోగ్యంగా, ఆనందంగా తమ జీవితాలను కొనసాగిస్తున్నారు.
సాధారణంగా వేసవి నెలల్లో అడపాదడపా కురిసే వానలను సద్వినియోగం చేసుకొని మాగాణి, మెట్ట, బీడు భూములను దున్నుకోవాలి. వీటినే వేసవి దుక్కులు అంటారు. ప్రస్తుతం యాసంగి దాదాపు ముగియటంతో రైతులకు పంటలన్నీ చేతికంది వేసవి వచ్చేసింది. ఇలాంటి తరుణంలో చాలా ప్రాంతాల్లో రైతు సోదరులు వానాకాలం లేదా యాసంగి పంట తీసుకున్న తర్వాత మళ్ళీ వర్షాకాలం వరకు భూమిని దున్నకుండా వదిలివేయటం వల్ల కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమిలో సత్తువ లేకుండా చేస్తున్నాయి. దీనివల్ల భూసారం తగ్గిపోవటమే కాకుండా నీరు భూమిలోని లోపల పొరల నుంచి గ్రహించబడి ఆవిరైపోతుంది.
ప్రయోజనాలు
పంటకోత అనంతరం పొలాన్ని అలా వదిలివేయకుండా వర్షాలకు ముందే భూమిని దున్నటం వల్ల తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకి భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. లోతు దుక్కుల వల్ల భూమి పైపొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. ఇలా చేయడం వల్ల భూమిలో తేమశాతం పెరిగి, భూసారాభివృద్ధి, పురుగులు, తెగుళ్ళ యాజమాన్యం, కలుపు మొక్కల నివారణ వంటి ప్రయోజనాలు సమకూరుతాయి.
భూసారాభివృద్ధి, తేమశాతం పెరుగుదలలో కీలకపాత్ర
వేసవి దుక్కులు లోతుగా వాలుకు అడ్డంగా దున్నుకోవాలి. వాలుకు అడ్డంగా దున్నుకోవటం వల్ల వాన నీరు భూమిలోకి ఇంకేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో పాటు భూమి ఎక్కువ తేమను గ్రహించి నిల్వ చేసుకొనే సామర్థ్యం పెరుగుతుంది. దీని ప్రభావం పంట దిగుబడి మీద కేంద్రీకృతమవుతుంది. వేసవి దుక్కులు దున్నే ముందు పొలంలో గొర్రెలను, పశువుల మందలను తోలటం వల్ల అవి విసర్జించే వ్యర్థాలు భూమిలోకి చేరి సేంద్రియ పదార్థాలుగా తయారై అవి భూసారాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి.
వేసవి దుక్కులు దున్నే ముందు పశువుల పెంటపోగు, కంపోస్టు ఎరువు, చెరువు మట్టిని వెదజల్లటం వల్ల నేల సారవంతమై పంట దిగుబడి పెరగటంతో పాటు తేమశాతం పెరుగుతుంది. సాధారణంగా రైతులు పంట చేతికందగానే పంటల నుండి వచ్చే ఎండు ఆకులు, చెత్త, చెదారం కాల్చి వేయకుండా అవకాశమున్నవారు లోతు దుక్కులు చేయటం వల్ల పంట చెత్త, చెదారం, ఎండు ఆకులు నేల పొరల్లో కలిసిపోయి కుళ్లిపోయి ఎరువుగా మారి భూసారం పెరిగి పంటలకు కావలసిన పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి.
వేసవి దుక్కులతో పురుగులు, తెగుళ్ళ నివారణ
వేసవి కాలంలో చాలా వరకు భూమి ఖాళీగా ఉంటుంది. అలాంటి సమయంలో పంటలను ఆశించే అనేక రకాల పురుగులు పంటకోత థల్లో వాటి నిద్రావస్థ థలను నేలలో, చెత్తా చెదారంలో, కొయ్యకాడల్లో గడుపుతాయి. తెగుళ్ళను కలుగజేసే శిలీంద్రాలు మొదలైనవి భూమి లోపల ఆశ్రయం పొందుతాయి. వీటి శిలీంద్ర బీజాలు భూమిలో నిల్వ ఉంటాయి. వేసవి లోతు దుక్కుల వల్ల నిద్రావస్థ థలో భూమిలో ఉన్న చీడ పురుగుల గ్రుడ్లు, లార్వాలు, ప్యూపాలను పకక్షులు, కొంగలు తిని నాశనం చేస్తాయి. అదే విధంగా వేసవి దుక్కుల వల్ల భూమి లోపల పొరల్లో ఉన్న శిలీంద్ర బీజాలు మట్టితో పాటు నేలపైకి వస్తాయి. ఇవి అధిక ఉష్ణోగ్రతకు గురై వ్యాధి కలుగజేసే శక్తిని కోల్పోతాయి.
వేసవి దుక్కులతో కలుపు నిర్మూలన
సాధారణంగా పంటలేని సమయంలో కలుపు మొక్కలు పెరుగుతాయి. ఈ కలుపు మొక్కలు నేలలోని నీరు, పోషకాలను ప్రత్యక్షంగా గ్రహించి పంట దిగుబడిని తగ్గిస్తాయి. అదేవిధంగా అనేక రకాల పురుగులకు, శిలీంధ్రాలకు ఆశ్రయాన్ని కల్పించటం ద్వారా పరోక్షంగా పంట నష్టానికి కారణమవుతాయి. కాబట్టి వేసవి లోతు దుక్కుల వల్ల లోతుకు పాతుకుపోయిన కలుపు మొక్కలు, వాటి విత్తనాలు నేలపై పొరల్లోకి చేరటం వల్ల ఉష్ణోగ్రతకు గురై నశిస్తాయి. దీనివల్ల తదుపరి పంటలో కలుపు తాకిడి తక్కువగా ఉంటుంది. అందువల్ల అప్రమత్తంగా ఉండి వేసవి జల్లులను ఆసరా చేసుకొని వేసవి దుక్కులు చేపడదాం!
ఇతర వివరములకు సంప్రదించవలసిన ఫోన్ నెం. 8978672595
పుట్టగొడుగుల పెంపకం అనేది మీరు తక్కువ పెట్టుబడి మరియు తక్కువ స్థలంతో ప్రారంభించగల అత్యంత లాభదాయక వ్యవసాయ వ్యాపారాలలో ఒకటి. భారతదేశంలో పుట్టగొడుగుల పెంపకం చాలా మందికి ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా క్రమంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా, చైనా, యుఎస్, ఇటలీ మరియు నెదర్లాండ్స్ పుట్టగొడుగుల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి. భారతదేశంలో, పుట్టగొడుగుల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. తరువాత త్రిపుర, కేరళ ఉన్నాయి. పుట్టగొడుగులు అందరికి అత్యంత ఇష్టమైన ఆహారాలలో ఒకటి ఎందుకు అనగా వాటి రుచి వలన మాత్రమే కాకుండా అవి కలిగి ఉన్న ప్రయోజనాల కోసం కూడా. దీనిని ఫ్రెష్గా, ఊరగాయ, ఎండబెట్టిన లేదా పొడి చేసిన మొదలైన వివిధ రూపాల్లో తినవచ్చు.
పుట్టగొడుగులలో నీరు 90% కంటే ఎక్కువ ఉంటుంది మరియు 1% కంటే తక్కువ కొవ్వు అలానే విటమిన్ బి, రాగి మరియు సెలీనియంను కలిగి ఉంటాయి. సాధారణంగా కూరగాయలు, పాలు మరియు ఇతర ఆహార ఉత్పత్తులు రేడియేషన్ లేదా ప్రత్యక్ష చేరిక ద్వారా విటమిన్-డి ను కలిగి ఉంటాయి. కానీ, పుట్టగొడుగులు అత్యంత ప్రత్యేకమైనవి ఎందుకనగా అవి సహజంగానే విటమిన్-డిను కలిగి ఉంటాయి.
పుట్టగొడుగులలో రకాలు
పుట్టగొడుగులు కొండ ప్రాంతాలలో సులభంగా పండుతాయి. ఎందుకనగా తేమ సమృద్ధిగా ఉంటుంది, అలానే మనం పుట్టగొడుగులను కృత్రిమంగా కూడా పెంచవచ్చు. అలా చేయడానికి సరైన ఉష్ణోగ్రత మరియు తేమతో కూడిన వాతావరణాలు అవసరం. వెరైటీలను కక్షుణ్ణంగా గుర్తించాలి. ఎందుకంటే వాటిలో కొన్ని ఫుడ్ పాయిజనింగ్ లేదా అలెర్జీకి కారణం అయ్యే రకాలు కూడా ఉంటాయి.
భారత్లో వినియోగించే కొన్ని ప్రధాన రకాలు:
బటన్ పుట్ట గొడుగు: దీని శాస్త్రీయ నామం అగారికస్ బిస్పోరస్. ఇది అగరికేసి కుటుంబానికి చెందినది. ఐరోపా మరియు ఉత్తర అమెరికాలో ఎక్కువగా సాగు చేస్తారు. ఇది రెండు రకాలు. తెలుపు మరియు గోధుమ, వీటిలో తెలుపు బటన్ పుట్టగొడుగు సాధారణంగా భారతదేశంలో పండిస్తారు. ఐసీఆర్-డైరెక్టరేట్ ఆఫ్ మష్రూమ్ రీసెర్చ్ ప్రకారం మొత్తం పుట్టగొడుగుల సాగులో ఈ రకాన్నే 85% వరకు ఉపయోగిస్తున్నారు. ఇది తినుబండారాలలో మరియు కూరలలో ఉపయోగించే అత్యంత రుచికరమైన రకం.
షిటేక్ పుట్టగొడుగు: షిటేక్ పుట్టగొడుగులు తూర్పు ఆసియాకు చెందినవి మరియు ఆసియా దేశాలలో అధికంగా వినియోగించ బడుతున్నాయి. ఇవి ఆకురాల్చే మరియు కఠినమైన చెక్క చెట్ల కలపపై అనగా ఓక్, చెస్ట్ నట్ మరియు మాపుల్ మొదలైన వంటి వాటిపై సులభంగా పెరుగుతాయి. వీటికి తేమ మరియు వెచ్చని వాతావరణం అవసరం. కొన్ని సందర్భాల్లో ఇవి అలెర్జీకి అంటే దురదలాంటి వాటికి కారణం కావచ్చు. కానీ వేడి చేయడం ద్వారా అలెర్జీ వంటి వాటిని పూర్తిగా తొలగించవచ్చు. వీటిని ఆసియా వంటకాల్లో మరియు సాంప్రదాయ మందులలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఆయిస్టెర్ పుట్టగొడుగు: ఆయిస్టెర్ పుట్టగొడుగులు ప్లూరోటస్ జాతికి చెందినవి. దీనిని భారతదేశంలో ”థింగ్రి” అని పిలుస్తారు. ఫ్యాన్ ఆకారంలో ఉండే టోపీని కలిగి ఉంటుంది. కుళ్లిపోయిన కలప లేదా గడ్డి మీద సులభంగా పెరుగుతాయి.
వరిగడ్డి మీద పెరిగే పుట్టగొడుగు: పేరులో ఉన్నట్టుగానే ఇవి వరిగడ్డిపైన పెరుగుతాయి. వీటిని కూరలలో ప్రధానంగా ఉపయోగిస్తారు. ఇవి పండించడం కూడా చాలా సులువు.
సాగు విధానం:
పుట్టగొడుగుల పెంపకానికి ప్రాథమిక అవసరాలు ఎరువు/కంపోస్టు, స్పాన్లు, సరైన ఉష్ణోగ్రత మరియు చెమ్మ. వీటి పెరుగుదలకు అనుకూల పరిస్థితులు అనగా 80%-90% సాపేక్ష తేమ, తగినంత వెంటిలేషన్, ఉష్ణోగ్రత పరిధి 20-28 డిగ్రీల సెంటీగ్రేడ్ స్పాన్ రన్ సమయంలో అలానే 12-18 డిగ్రీల సెంటీగ్రేడ్ పునరుత్పత్తి సమయంలో ఉండాలి. తొలుత వారం రోజుల పాటు ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేటట్లు మరియు తరువాత వారాలకు 16 డిగ్రీల సెంటీగ్రేడ్కు తగ్గించుకోవాలి. కార్బన్డైయాక్సైడ్ గాఢత 0.08-0.15% ఉండేలా చూసుకోవాలి. అయితే పైన పేర్కొన్న సూచనలు పాటించడం ద్వారా పిన్హెడ్లు కొద్ది రోజుల్లోనే కనిపించడం ప్రారంభిస్తాయి. క్రమంగా అవి బటన్ థకు పరిణతి చెందుతాయి. పుట్టగొడుగుల పెంపకం కోసం ఈ క్రింద పేర్కొన్న థలను అనుసరించాలి.
కంపోస్టు తయారీ విధానం:
సాధారణంగా గోధుమ గడ్డి, గుర్రపు ఎరువు, కోళ్ల ఎరువు, రైస్ బ్రాన్ (వరి పొట్టు), జిప్సం మొదలైనవి పుట్టగొడుగుల పెరుగుదల కోసం కంపోస్టుగా ఉపయోగిస్తారు. పచ్చి కంపోస్టుకు వర్షం లేదా బాహ్య తేమ దరిచేరకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకనగా అవి అవాంఛనీయ సూక్ష్మజీవులను పరిచయం చేస్తాయి. తరిగిన గోధుమ గడ్డి లేదా రైస్ బ్రాన్ను గుర్రపు పేడతో కలిపి, కొంచెం నీటిని చల్లి ఒక కుప్పలా చేసి కిణ్వప్రక్రియకు అనుమతించాలి. వేడితో పాటు కిణ్వ ప్రక్రియ రసాయన సమ్మేళనాలను చిన్న చిన్న భాగాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. అప్పుడప్పుడు తిరగ వేయడం మరియు నీరు పోయడం వంటివి చేయడం వలన కంపోస్టు ఎండిపోకుండా చూసుకోవచ్చు. జిప్సం వేయడం ద్వారా జిడ్డును తొలగించవచ్చు మరియు ఇది ఎక్కువ గాలిని అనుమతిస్తుంది. 15 నుండి 20 రోజుల్లో కంపోస్టు మొత్తం సిద్ధం అవుతుంది. తరువాత దీనిని బెడ్లా ఉపయోగించుకోవచ్చు. తరువాత దీనిని చెక్క ట్రేలపై పరచి స్పాన్ను విత్తుకోవాలి.
స్పానింగ్:
స్పాన్ అనగా అగర్ లేదా గింజలపై పెరిగే మైసీలియం. స్పానింగ్ అనేది విత్తే ప్రక్రియ లేదా కంపోస్టులో మొక్కలను కలపడం. పుట్టగొడుగు తదుపరి విత్తనంగా పనిచేసే బీజాంశాలను ఉత్పత్తి చేస్తుంది కానీ మొలకెత్తడం మరియు పెరుగుదల అనిశ్చితి కారణంగా సాధారణంగా ఉపయోగించబడవు. స్పాన్లు కంపోస్టుతో పూర్తిగా కలిపి, వార్తాపత్రికతో కప్పాలి మరియు చెమ్మ మెయింటైన్ చేయడం కొరకు తగినంత నీరు కలపాలి. సాగు కాలం అంతటా తేమ ఉండేలా చూసుకోవాలి. క్రమంగా తెల్లని మైసీలియం పెరుగుదలను మనం గమనించవచ్చు.
కేసింగ్:
కేసింగ్ అనేది ఒక రకమైన క్రిమిరహిత మట్టి లేదా డ్రెస్సింగ్ ఆవు ఎరువును కలిగి ఉంటుంది. ఇది స్పాన్ కలిపిన కంపోస్టు మీద వేయాలి. కంపోస్టు ఉపరితలంపై మైసీలియం పెరుగుదలను మనం గమనించినపుడు దీనిని అందించాలి. ఇది అందించిన 15 నుంచి 20 రోజుల తర్వాత ఉపరితలంపై కనిపించేలా పుట్టగొడుగు తలలు లేదా పిన్నులు ప్రారంభమవుతాయి. ఇవి నిర్దిష్ట సమయంలో పక్వం చెందుతాయి. క్యాప్ తెరుచుకోకముందే వీటిని కోసివేయాలి. క్యాప్ తెరిచిన పుట్టగొడుగులు (క్యాప్ తెరిచిన తర్వాత గొడుగులా కనిపిస్తాయి) అవాంఛనీయమైనవి మరియు తక్కువ నాణ్యతగా పరిగణించబడతాయి.
కోత మరియు కోత అనంతర యాజమాన్యం
చేతులతో మట్టి నుండి తీస్తారు లేదా తలలను చిన్న కత్తితో కట్ చేస్తారు. ప్రాథమిక ప్రాసెసింగ్లో పుట్టగొడుగులను అంటుకున్న మట్టి లేదా కంపోస్టును తొలగించడం కొరకు కడగడం జరుగుతుంది మరియు వాటిని కొన్ని నిమిషాలు బ్లాంచింగ్ చేయడం వలన చెడు ఎంజైమ్లను క్రియారహితం చేయవచ్చు. రంగు పాలిపోవడాన్ని నివారించడానికి ఉప్పు నీరు లేదా సిట్రిక్ ఆమ్లంను క్యానింగ్ లేదా ప్యాకేజింగ్ ముందు ఉపయోగిస్తారు.
వై. రామ్మోహన్, కొట్టం సుష్మ, ఆర్. సుభాష్, డి. దివ్య భారతి, నవీన్ యాదవ్, పిహెచ్.డి విద్యార్థులు, ఉద్యాన కళాశాల, అనంతరాజుపేట, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం. ఫోన్: 9160477365
దోమలు, ఈగలు, కందిరీగలు, పేలు, పిడుదులు, గోమార్లు, చిరుపేల వంటి అనేక కీటకాల వల్ల పాడి పశువులు, దూడలతో పాటు పనిచేసే పశువులు కూడా తీవ్ర అసౌకర్యానికి, బాధకు, వ్యాధులకు గురౌతున్నాయి. ఈ కీటకాల బెడద వల్ల దూడలలో ఎదుగుదల, పాడిపశువులలో పాల ఉత్పాదకశక్తి పనిచేసే పశువుల్లో పనిసామర్థ్యం క్షీణిస్తున్నాయి. కొన్ని రకాల ఈగలు, జోరీగలు, పిడుదులు అనేక బాక్టీరియా, వైరస్ మరియు బెబీసియోసిస్, ట్రిపనజోమియాసిస్ మరియు థెయిలీరియాసిస్ వంటి ప్రాణాంతక వ్యాధి క్రిముల వాహకాలుగా ఈ వ్యాధుల వ్యాప్తికి కారణం అవుతున్నాయి. ఈ కీటకాల బెడదవల్ల పశువులు సరిగ్గా మేయనందున అవి రక్తహీనతకు లోనై, వాటి సహజమైన వ్యాధి నిరోధక శక్తిని సైతం కోల్పోతున్నాయి. అశ్రద్ధకు గురైన పుండ్లు, గాయాల మీద వాలిన ఈగలు పెట్టిన గ్రుడ్లు పురుగులుగా మారి పుండ్లను మరింత ప్రమాదకరంగానే కాక తీవ్రమైన బాధను, రక్తస్రావాన్ని మరియు మరణాలకు కూడా కారణం అవ్వడాన్ని గమనించవచ్చు. మన పాడికమతాలలో పాలుపిండే సమయాలలో దోమలు కలిగించే చికాకు వల్ల అవి చిందులు వేయటం, తద్వారా పాలపాత్రలోకి బయటి మలినాలు ప్రవేశించుటవల్ల పాలనాణ్యత, జీవిత కాలాలు క్షీణించటం, అటువంటి పాలతో చేసిన వంటకాల రుచి, నాణ్యతలు క్షీణించటం మనం చూస్తూ వుంటాము.
ఇటీవల కొన్ని సంవత్సరాలుగా మన పశువులలో తీవ్రంగా వ్యాపిస్తున్న లంపీడిసీజ్ వైరస్ వ్యాప్తికి, గాలికుంటు వ్యాధి మరియు ఇతర వ్యాధుల వ్యాప్తిలో అనేక రకాల కీటకాలు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి.
పశువుల చర్మపు పొరల్లోకి ప్రవేశించి, చర్మం మృదుత్వాన్ని, సున్నితత్వాన్ని, స్పర్శజ్ఞానాన్ని క్షీణింపచేస్తూ చర్మం మొద్దుబారి, పగుళ్లుబారటాన్ని కలిగించే డేమోడెక్టివ్ మేంజ్మైట్స్ వల్ల కలిగే (ఒకేతరహా పొడిగజ్జి) చర్మవ్యాధి వల్ల అవి పడే బాధ వర్ణనాతీతం!
కీటకాల బెడద లక్షణాలు: పశువుల మీద పరిసరాలు, పరికరాల మీద కనిపించే వివిధ రకాల ఈగలు, జోరీగలు, పిడుదులు, గోమార్లు ఈ సమస్య తీవ్రతను ప్రదర్శిస్తాయి. ముఖ్యంగా చెవులు, కొమ్ములు, చంకల సందులు తోక మొదళ్లకు ప్రక్కన వృషణాల మీద కనిపించే పిడుదులు పీల్చే రక్తం, కలిగించే బాధ కారణంగా పశువు నీరసంగా, నిస్సత్తువగా, హుషారు లేకుండా మందంగా కనిపిస్తాయి.
పశువు చికాకుగా, ఆందోళనగా, కాళ్లను, తోకను, మెడను పదే పదే కదులుస్తూ, సమస్య తీవ్రమైతే పదేపదే కూర్చొని లేస్తూ బాధ, ఆందోళన, చికాకుల్ని ప్రదర్శిస్తుంది.
పేలు, పిడుదులు, గోమార్లు కలిగించే దురద వల్ల గడ్డివాములకు, స్తంభాలకు, చెట్లకు శరీరాన్ని రాస్తూ కనిపిస్తాయి. కొన్ని సందర్భాలలో దురద ప్రదేశాన్ని పళ్లతో కొరుక్కుని తమకు తామే సమస్యను తీవ్రతరం చేసుకుంటూ ఉంటాయి.
తేనెటీగలు, మరికొన్ని ఇతర కీటకాల నుండి విడుదలయ్యే విషపదార్థాల వల్ల చర్మం విూద దొద్దుర్లు ఏర్పడి, ఎర్రగా వాచిపోవటం, సమస్య తీవ్రమైతే ప్రాణాంతకమయ్యే ముప్పు కూడా ఉండవచ్చు.
వెంట్రుకల విూద పేలు పెట్టిన గ్రుడ్లు కూడా కనిపించవచ్చు. ఇవి కీటకాలుగా పెరిగి ఇతర పశువులకు వ్యాపించగలవు.
అశ్రద్ధ వల్ల ముదిరిపోయిన పుండ్లు, గాయాలలో చేరిన ఈగల లార్వాలు సుమారు ఒక సెంటీమీటరు పొడవైన తెల్లని పురుగులుగా పుండ్లలో కదిలాడుతూ వుంటాయి. ఇవి పుండును తొలుస్తూ రక్తస్రావాన్ని కలిగిస్తూ కనిపిస్తాయి.
చికిత్స: పురుగులు పట్టిన పుండ్ల నుండి వాటిని ఫోర్సెప్స్తో తీసివేసి, మొదటి రెండు రోజులు మైలుతుత్తుం+బోరిక్పౌడర్+జింక్ ఆక్సైడ్ పౌడర్ డ్రెస్సింగ్ చేసి, ఆ తర్వాత హిమాక్స్ లేదా ఛార్మిల్ వంటి బహుమూలికా ఆయింట్మెంట్లతో డ్రస్సింగ్ను పుండు మానే వరకు కొనసాగించి, అవసరమైన యాంటిబయొటిక్ ఇంజక్షన్లు వాడాలి. వేపనూనె మరియు టర్పంటైన్ ఆయిల్తో కూడా పురుగులు నశిస్తాయి.
డెమోడెక్టివ్మేంజ్ (పొడి గజ్జి) భాగాన్ని 0.1-0.2 శాతం డెల్టామెత్రిన్ లేదా సైపర్మెత్రిన్ లేదా అమిత్రాజ్ ద్రావణంతో పగుళ్లలోపలి వరకు లోషన్ వెళ్లే విధంగా శుభ్రం చేసి, ఐవర్మెక్టిన్ ఇంజక్షను దూడలకు 2 నుండి 3 మి.లీ., పెద్ద పశువుకు 7-8 మి.లీ. చర్మం క్రిందకు వారం వ్యవధిలో రెండు సార్లు చేస్తే సరిపోతుంది. అదనంగా లెవామొజోల్ మరియు విటమిన్ ఇంజక్షన్లు కూడా వాడవలసి ఉంటుంది. ఇంతేకాక పశువు అలంకరణ సామాగ్రి, గొలుసులు, తాళ్లు, గుంజలు, నేల మరియు పరిసరాలపై కూడా డెల్టామెత్రిన్, సైపర్మెత్రిన్ లోషన్లతో శుభ్రపరచి కీటకాలను సమూలంగా నిర్మూలించాలి.
పిడుదులు, పొడిగజ్జిని కలిగించే చిరు పేల నిర్మూలనకు పశువుల వెన్ను విూద ప్రయోగించే ద్రవ రూప మందులు కూడా ఇప్పుడు లభిస్తున్నాయి.
కీటకాల బెడద నివారణ: సకాలంలో సమస్యను గుర్తించి నిర్మూలనా చర్యలను పటిష్టంగా అమలు చేయాలి.
పశువుల్ని, పాకల్ని, పరిసరాలను ఎల్లప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉంచాలి. వేసవికి ముందు పశువుల వెంట్రుకల్ని పూర్తిగా కత్తిరించుట, లేదా షేవింగ్ చేయుట మంచిది.
పాకలలోని దోమల నిర్మూలనకు వేపాకు, సాంబ్రాణి ధూపాలు వేయటం, పాకలచుట్టూ దోమతెరల్ని ఏర్పాటు చేయటం లేదా సీలింగ్ ఫాన్లు ఏర్పాటు చేయటం మంచిది.
పాకల్ని, పరిసరాలను డి.డి.టి., గమాక్సిన్, డెల్టామెత్రిన్, సైపర్మెత్రిన్ వంటి కీటకనాశకాలతో స్ప్రే చేయాలి.
పొడిగజ్జి (మేంజి) కీటకాల నిర్మూలనకు, పశువు మీద కాక, పశువు యొక్క అలంకరణ బెల్టులు, గొలుసులు, త్రాళ్లు, గుంజలు, స్తంభాలను కూడా కీటక నాశకాలతో శుభ్రపరచుట చాలా అవసరం.
పశువుల వ్యర్థాలు, మేత వ్యర్థాలను మండే ఎండలో ఎండబెట్టి కూడా వాటిలోని కీటకాలను నిర్మూలించవచ్చు.
పశువుల ఆవరణలో ఒక గుంజను పాతి దానికి కొబ్బరి తాడును చుట్టి, దానిమీద కీటకనాశక పౌడర్లను చల్లుతూ ఉంటే దురదల ఉపశమనానికి అవి గుంజకు రాసుకున్నప్పుడు కీటకనాశకాల వల్ల చర్మం విూది కీటకాలు చాలావరకు నశిస్తాయి.
అలవాటుగా పశువులకు వాడే మోకులు, శిగమారలు, గొలుసుల్ని మరుగుచున్న నీటితో శుప్రరుస్తూ ఉండాలి.
పశువుల పాకలలో ప్రతి పశువుకు కనీసం 35-40 చదరపు అడుగుల స్థలాన్ని ఏర్పాటు చేసి ఇరుకుగా లేకుండా విశాలంగా ఉండి గాలి, వెలుతురు సోకేవిధంగా వసతిని ఏర్పాటు చేయాలి. కీటక బెడదతో బాధపడే పశువును వెంటనే మంద నుండి వేరు చేయాలి.
అవకాశం ఉంటే ఒక తొట్టెలోని నీటిలో కీటకనాశక మందును నిర్ణీత మోతాదులు కలిపి, జీవాలను, దూడల్ని అందులో 1-2 నిముషాలపాటు ముంచటం ద్వారా కూడా చర్మం మీద ఉండే బాహ్యపరాన్న జీవుల్ని నిర్మూలించవచ్చు.
ఒక మంద లేదా అవరణలోని పశువులన్నింటి విూద ఉండే కీటకాలను ఒకేసారి నిర్మూలిస్తే తప్ప ఈ కీటకాల బెడద సులువుగా సమసిపోదని గ్రహించాలి.
పంటల సాగు లాభదాయకంగా ఉండాలంటే సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు మంచి దిగుబడులు పొంది వచ్చిన దిగుబడులను ఆశాజనకమయిన ధరలకు అమ్ముకోగలగాలి. ఈ మూడింటిలో మార్కెట్ ధర అనేది రైతు చేతుల్లో ఉండదు అనే విషయం అందరికి తెలిసిందే. ఇంక మిగిలిన రెండు అంశాలు మాత్రమే రైతు చేతులలో ఉంటాయి. సాగు ఖర్చులు తగ్గించుకోవాలంటే సొంతంగా శ్రమించడముతో పాటు రసాయనిక వ్యవసాయం బదులుగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అవలంభించినట్లయితే సాగు ఖర్చులు తగ్గుతున్నాయని అనేకమంది సేంద్రియ రైతుల అనుభవాలు చెబుతున్నాయి. పంట దిగుబడులు పెరగడము అనేది విత్తన నాణ్యత మరియు నేల సారం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నాణ్యమయిన విత్తనాలు వేసుకోవడం అనేది రైతు చేతులలో ఉంటుంది కాని నేల సారం మరియు నేల రకం రైతు చేతులలో ఉండదు. అందుబాటులో ఉన్న నేలలోనే పంటల సాగు చేపట్టవలసి ఉంటుంది. కాబట్టి మనం సాగు చేసే నేలను బట్టి సాగు చేసే పంటలను ఎంపిక చేసుకున్నట్లయితే కొంతలో కొంత ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం చౌటపాలెం గ్రామానికి చెందిన రైతు సురేష్ తన భూమిలో ధనియాల పంటను సాగు చేశారు.
సురేష్ది వ్యవసాయ నేపథ్యం. వారి ప్రాంతంలో శనగ పంటను ఎక్కువగా వేస్తుంటారు. అందరి రైతుల మాదిరిగానే చాలా సంవత్సరాలు పంట మార్పిడి చేయకుండా శనగ పంటను సాగు చేస్తూ రసాయన పద్ధతులు పాటిస్తూ వస్తున్నాడు. కాబట్టి తన పొలం చౌడు బారిపోయింది. దానికితోడు ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉంటాయని నిపుణులు తెలియచేయడంతో ఇలాంటి పరిస్థితులలో తన పొలంలో ధనియాల పంటను సాగు చేయడానికి సిద్ధం అయ్యాడు. అంతకుముందు రసాయనిక వ్యవసాయం చేసిన సురేష్ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల యొక్క ఉపయోగాలను ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ద్వారా తెలుసుకుని 4 సంవత్సరాల క్రితం తన రసాయనిక వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయానికి మార్చాడు. గత రెండు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయ విభాగంలో ICRPగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
దుక్కిలో PMDS పద్ధతి ప్రకారం 35 రకాల విత్తనాలను చల్లుకోవడం జరిగింది. వివిధ రకాల కారణాల వలన మొక్కలు సరిగ్గా పెరగకపోవడంతో పంట మొత్తాన్ని దున్ని మరలా 12 రకాల విత్తనాలను పచ్చిరొట్టగా వేసి పచ్చిరొట్ట పైరు రెండున్నర నుంచి మూడు అడుగులు పెరిగిన తరువాత ట్రాక్టరు సహాయంతో పచ్చిరొట్టను భూమిలో కలియదున్నాడు. పశువుల ఎరువుకు ట్రైకోడెర్మావిరిడే, సూడోమోనాస్, VAMలు కలిపి దుక్కిలో అందించడం జరిగింది. నేల చౌడుబారి పోవడం మరియు ఈ సంవత్సరం వర్షాలు సక్రమంగా ఉండకపోవచ్చని తెలుసుకుని ఈ పరిస్థితులలో తమ నేలకు ధనియాలు సరైన పంట అని తెలసుకుని 82 సెంట్ల భూమిలో 8 కిలోల ధనియాలు, 100 గ్రాముల పొద్దుతిరుగుడు, కిలోన్నర జొన్న, 50 ఆముదం విత్తనాలు, కొంచెం దోస, కొంచెం ఆవాలు విత్తనాలను బీజామృతంలో విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోవడం జరిగింది. ధనియాలు విత్తనాలు విత్తిన 9 నుండి 11 రోజుల మధ్యలోనే మొలకలు వచ్చాయి. మొలక వచ్చిన 15 రోజులలో నీమాస్త్రం, మరలా తరువాత 10 రోజులకు జీవామృతం, తరువాత 10 రోజులకు థపర్ణి కషాయం, తరువాత బూడిద తెగులు నివారణకు ఆవుపేడ+మూత్రం+ఇంగువ ద్రావణంతో పాటు అవసరాన్ని బట్టి అగ్నాస్త్రం, థపర్ణి కషాయాలు పిచికారి చేసుకున్నాడు. వీటితో పాటు చీడపీడల ఉధృతి తగ్గటానికి గాను లింగాకర్షక బుట్టలు, పసుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయడంతో పాటు ఆకర్షిక పంటలుగా ఆముదం లాంటివి, సరిహద్దు పంటలుగా జొన్న పంట వేయడం జరిగింది.
చౌడుబారిపోతున్న తన భూమిని కాపాడుకుంటూ, అవశేషాలు లేని పంట దిగుబడుల కోసం సేంద్రియ వ్యవసాయం చేస్తూ నలుగురికి స్ఫూర్తినిస్తూ సాగుతున్నారు. మరిన్ని వివరాలు 9989481681కి ఫోను చేసి తెలుసుకోగలరు.
మన ప్రధాన వృత్తి వ్యవసాయం. ఒకప్పుడు 90 శాతానికి పైగా, ప్రస్తుతం 60 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇంత ఎక్కువమంది ఆధారపడుతున్న వ్యవసాయరంగం పరిస్థితి బాగానే ఉంది. కాని ఆ వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి బాగా లేదు అని చెప్పవచ్చు. స్వేదం చిందించి సేద్యం చేసి పంటలు పండించి మన ఆకలి తీర్చే రైతులలో 90 శాతానికి పైగా రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టే మనం ప్రతినిత్యం అన్నదాతల ఆత్మహత్యల గురించి వింటున్నాము. ఈ పరిస్థితులు మారవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశంలో రైతు వర్గం చాలా పెద్ద వర్గం కాబట్టి అంత పెద్ద వర్గాన్ని ఆదుకునే సత్తా ప్రభుత్వానికి కాని వేరే సంస్థలకు కాని లేదు అనే విషయం అక్షర సత్యం. కాబట్టి రైతులే ఎవరికి వారు తమ పంటల సాగును లాభాల బాట పట్టించటానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. లాభసాటి పంటల సాగుకు సంబంధించిన ఆలోచనలు రైతులందరూ చేయలేకపోయినా కాని కొంతమంది అభ్యుదయ రైతులు తమ మెదడుకు పదను పెడతూ అనునిత్యం లాభసాటి వ్యవసాయం గురించి ఆలోచిస్తూ తమకు వచ్చిన ఆలోచనలను అమలు పరుస్తూ ముందుకు నడుస్తూ వచ్చిన ఫలితాలను తోటి రైతులకు తెలియ చేస్తుంటారు. ఈ కోవకే చెందుతాడు యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండలం వంచెగూడెం గ్రామంలో సమీకృత వ్యవసాయం చేస్తున్న ఫణికుమార్.
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా, మాచర్ల ప్రాంతానికి చెందిన ఫణికుమార్ది వ్యవసాయ నేపథ్యం. చిన్నతనం నుండి పంటల సాగులో తన కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటాడు. వ్యవసాయంలో తన వంతు పాత్రను పోషించేవాడు. ఉన్నత చదువులు చదివిన ఫణికుమార్ తన చదువు పూర్తి కాగానే హైదరాబాదు నగరం రావడం, వివిధ కార్యక్రమాలు చేపట్టడం లాంటివి చేసి తన లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండలం, వంచెగూడెం గ్రామంలో వంద ఎకరాలకు పైగా భూమిని కౌలుకు తీసుకొని సమీకృత వ్యవసాయం చేస్తున్నాడు. 125 ఎకరాలకు పైగా భూమిలో సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని సాగు చేస్తూ నాణ్యమయిన పశుగ్రాసాన్ని గోశాలలకు అమ్మకం చేస్తున్నాడు. సూపర్ నేపియర్ సాగుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని గత సంచిక (రైతునేస్తం మార్చి నెల సంచిక)లో విపులంగా వివరించడం జరిగింది. ఫణికుమార్ సాగు చేస్తున్న సమీకృత వ్యవసాయంలో భాగంగా నారిసువర్ణ జాతి గొర్రెల పెంపకం, సోనాలి రకం కోళ్ళ పెంపకం మరియు బయోటాయిలెట్లలో ఉపయోగించే బాక్టీరియాల గురించిన సమాచారాన్ని ఈ సంచికలో వివరిస్తున్నాము.
నారి సువర్ణ జాతి గొర్రెల పెంపకం
అనునిత్యం అన్ని రంగాలలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలలో జరిగే మార్పులు కొద్దిగా నిదానంగా జరుగుతాయి అనే విషయం అందరికి తెలిసిందే. గతంతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలలో కూడా మార్పులు రావడములో కొంచెం వేగం పెరిగిందని చెప్పవచ్చు. రైతులకు లాభాలు ఆర్జించి పెట్టే వ్యవసాయ అనుబంధరంగాలలో గొర్రెల పెంపకం మొదటి వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. గొర్రెల పెంపకం అనేది చాలా వరకు కులవృత్తిగా కొనసాగుతూ వస్తుంది. ఇటీవలకాలంలో మిగతా వర్గాల వారు కూడా గొర్రెల పెంపకంలో అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు.
ప్రభుత్వం కూడా గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహిస్తుంది. కాని గొర్రెలలో వచ్చే వివిధ రకాల ఆనారోగ్య సమస్యలు మరియు ఇతర సమస్యల వలన గొర్రెలు పెంపకం చేసే రైతులందరూ లాభాలను ఆర్జించలేక పోతున్నారు. ఈ సమస్యలకు సరైన పరిష్కారం కొరకు అందుకు సంబంధించిన ప్రభుత్వ సంస్థలు పరిశోధనలు చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఆ బాటలో నడిచిన మహారాష్ట్రకు చెందిన నింబాకర్ యూనివర్సిటీ వారు 30 సంవత్సరాల నుంచి పరిశోధనలు చేసి నారి సువర్ణ రకం గొర్రె జాతిని అభివృద్ధి చేశారు. నారి సువర్ణ జాతి గొర్రెలు అన్ని రకాల వాతావరణాలకు మరియు కరువును తట్టుకోగలవు అని శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకున్న ఫణికుమార్ 8 ఆడగొర్రెలను, 4 మగ గొర్రెలను కొనుగోలు చేసుకుని పోషిస్తున్నాడు. వీటికి సంబంధించిన లాభనష్టాలు తెలుసుకోవాలంటే 2024 డిసెంబర్ వరకు వేచి ఉండవలసిందే అని ఫణికుమార్ అంటున్నాడు. వీటికి పశుగ్రాసంగా సూపర్ నేపియర్, థరథగడ్డి, జనుము, మొక్కజొన్న, జొన్న లాంటి మేతలను అందిస్తూ దాణాను కూడా అందిస్తున్నాడు. తమ పొలంలో పగలు మొత్తం తిరుగుతూ అందుబాటులో ఉన్న పచ్చిగడ్డిని తింటూ తిరుగుతుంటాయి కాబట్టి శారీరకంగా దృఢంగా ఉంటున్నాయి. ఈ జాతిని అభివృద్ధి పరచి మన స్థానిక జాతులతో సంపర్కం చేసి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉండే జాతి గొర్రెలను భారీ మొత్తంలో పెంపకం చేయాలనే లక్ష్యంతో ఫణికుమార్ ముందుకు సాగుతున్నాడు.
సొనాలి జాతి నాటు కోళ్ళ పెంపకం
కొంచెం అటూఇటుగా వ్యవసాయ అనుబంధరంగం అయిన కోళ్ళ రంగంలో కూడా అనేక మార్పులు సంభవించాయి. ఇంకా సంభవిస్తూనే ఉన్నాయి. మనం పూర్వం నుంచి పెంపకం చేస్తూ వస్తున్న నాటు కోళ్ళను వివిధ రకాలుగా అభివృద్ధి చేసి ఎక్కువ గ్రుడ్లను అందివ్వడంతో పాటు త్వరగా బరువు పెరిగే జాతులను అభివృద్ధి చేశారు. అభివృద్ధి పరచిన వివిధ రకాల నాటుకోళ్ళ జాతులలో సోనాలి రకంకు ఉన్న విశిష్టత వలన ఫణికుమార్ గారు సొనాలి రకం నాటుకోళ్ళను కూడా పెంపకం చేస్తున్నాడు.
ఇందుకు గాను ఒకరోజు వయస్సు ఉన్న పిల్లలను కొనుగోలు చేసుకుని పోషిస్తూ వస్తున్నాడు. మొదట బ్యాచ్లో 3000 పిల్లలను కొనుగోలు చేసుకొని 2023 నవంబరు నుంచి బహిరంగంగా తిరుగుతూ పెరుగుతున్నాయి. పొలంలో అందుబాటులో ఉండే చీడపీడలను, పురుగులను, గడ్డిని తినడముతో పాటు అన్ని రకాల గడ్డి మొక్కలను, గడ్డి ముక్కలతో పాటు దాణాను అందిస్తూన్నారు. జనవరి నుండి అమ్మకం మొదలు పెట్టాడు. బరువుతో సంబంధం లేకుండా కోడి 350/-ల చొప్పున ఇప్పటి వరకు 2500 కోళ్లను అమ్మకం చేశారు. వారు కొనుగోలు చేసేటప్పుడు పుంజులు, పెట్టలు రెండు కలిపి కొనుగోలు చేశారు. జాతిని అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ విధంగా మగవి, ఆడవి కలిపి కొనుగోలు చేయడం జరిగింది. సొనాలి జాతి కోడి పెట్టలు సంవత్సరానికి 200 వరకు గ్రుడ్లను పెడతాయి. మొదటగా పెట్టిన గ్రుడ్లు చిన్నవిగా ఉంటాయి. కాబట్టి వాటిని అమ్మకం చేస్తూ వస్తున్నాడు. పెద్ద సైజు గ్రుడ్లు పెట్టిన తరువాత వాటిని సహజ సిద్ధంగా పొదిగించటానికి సిద్ధం అవుతున్నాడు. వీరికున్న నాలుగు నెలల సొనాలి జాతి కోళ్ళ పెంపకం అనుభవంలో రోగాల వలన ఒక్క కోడి కూడా మరణించలేదు. కోళ్లకు అవసరమైన టీకాలను సమయానుకూలంగా అందిస్తూ వచ్చారు. వీటిని పొలంలో సహజసిద్ధంగా పెంపకం చేస్తున్నారు కాబట్టి రోగాలు ఆశించే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఫణికుమార్ వివరిస్తున్నాడు.
బయోటాయిలెట్స్లో ఉపయోగించే బాక్టీరియా తయారీ
గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే గ్రామాలలో చాలావరకు ఇళ్ళలో టాయిలెట్స్ ఉండేవి కావు. కాబట్టి బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన జరిగేది. ఆ సమయం పందులు స్వచ్ఛభారత్ కార్యకర్తల పాత్రను పోషించేవి. ఆ తరువాత ఇళ్ళలో టాయిలెట్స్ ఏర్పాటు చేసుకున్నారు. టాంక్ నిండగానే ఖాళీ చేయవలసి వస్తుంది. అదేవిధంగా రైళ్ళలో కూడా మలవిసర్జన చేసినపుడు అన్ని ప్రాంతాలు అశుద్ధంగా ఉండేవి.
ఈ సమస్యల పరిష్కారానికి మలమునే ఆహారంగా తినగలిగే బాక్టీరియాను డిఆర్డిఓ వాళ్లు అభివృద్ధి పరచి మదర్ కల్చర్ను లైసెన్స్ ఉన్న సంస్థలకు సరఫరా చేస్తుండడము తెలుసుకున్న ఫణికుమార్ ఇందుకు సంబంధించిన లైసెన్స్ను పొంది బ్యాక్టీరియాను అభివృద్ధి పరచే యూనిట్ను ఆలేరు సమీపంలో ప్రారంభించారు. డిఆర్డిఓ వారు అందించు మదర్ కల్చర్కు ఆవుపేడను ఆహారంగా అందిస్తూ బయోటాయలెట్స్లో ఉపయోగించే బ్యాక్టీరియాను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం రైల్వేలకు మరియు కొంతమందికి సరఫరా చేస్తున్నారు. భవిష్యత్తులో అందరూ బయో టాయలెట్స్ను నిర్మించుకోవలసిన అవసరం పడుతుంది కాబట్టి ఇలాంటి యూనిట్లు అనేకం ప్రారంభించవలసిన అవసరం ఉందని ఫణికుమార్ అంటున్నాడు.
వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను ఆదరించడముతో పాటు సాగులో పెట్టుబడులు తగ్గించుకుంటూ, కొత్త పంటల సాగువైపు అడుగులు వేస్తూ, సొంత మార్కెటింగ్ చేసుకొంటే పంటల సాగు లాభసాటి కాగలదని ఫణికుమార్ ప్రత్యక్షంగా నిరూపిస్తున్నాడు. మరిన్ని వివరాలు 9866469096 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
గొర్రెలలో మగవాటిని, ఆడవాటిని విడివిడిగా ఉంచాలి
గొర్రెల పెంపకంలో రైతులు ఎదుర్కొనే సమస్యలలో రోగాల వలన గొర్రెలు చనిపోవడం అనేది అతిపెద్ద సమస్య. గొర్రెల పెంపకందారులందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మనుషులతో సహా ఏ జీవి అయినా ఆరోగ్యంగా ఎదగాలంటే రోగనిరోధక శక్తి అతిముఖ్యం. ఈ విషయం కరోనా తరువాత అందరికీ తెలిసి వచ్చింది. రోగనిరోధక శక్తి బాగా ఉన్న వారిని కరోనా ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదు. రోగనిరోధక శక్తి సక్రమంగా లేని వారిని మాత్రం కరోనా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందనే విషయం అందరికి తెలిసిందే. ఈ విషయాన్ని కక్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే రోగనిరోధక శక్తి యొక్క ప్రాముఖ్యత అర్థం అవుతుంది. గొర్రెల విషయానికొస్తే రోగాల వలన గొర్రెలు చనిపోవడము అనేది మనం ప్రతినిత్యం వింటున్న సమస్య. రోగనిరోధక శక్తి సక్రమంగా లేకపోవటము వలన చిన్న చిన్న రోగాలను తట్టుకోలేని గొర్రెలు మృత్యువాత పడుతున్నాయి. రోగనిరోధక శక్తి పెరగాలంటే డెలివరి అయిన తరువాత ఆడ గొర్రెలకు కొన్ని నెలలు విశ్రాంతిని ఇవ్వాలి. ఆ విశ్రాంతి సమయంలో ఆడగొర్రెలలోని అన్ని అవయవాలు తిరిగి శక్తిని పుంజుకుంటాయి. కాని ప్రస్తుతం గొర్రెల మందలు పరిశీలించినట్లయితే డెలివరి అయిన వెంటనే గొర్రెలను మందలలో తోలుతుంటారు. ఆ మందలో మగ గొర్రెలు కూడా ఉంటాయి కాబట్టి వాటికి ఉన్న పశుప్రవృత్తి వలన మగ, ఆడ గొర్రెల మధ్య సంపర్కం జరిగి ఆడ గొర్రెలకు అవసరమయిన విశ్రాంతి లేకుండానే మరలా గర్భం దాల్చుతుంటాయి. ఆవిధంగా గర్భం దాల్చడం వలన జన్మించిన గొర్రె పిల్లలలో రోగనిరోధక శక్తి సక్రమంగా ఉండదు కాబట్టి అలాంటి గొర్రెపిల్లలు త్వరగా రోగాల బారిన పడటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆడ గొర్రెలను, మగగొర్రెలను విడివిడిగా పోషించడమే ఈ సమస్యకు సరైన పరిష్కారం అంటున్నాడు ఫణికుమార్. అందుకనే వీరు మగ గొర్రెలను, ఆడ గొర్రెలను విడివిడిగా పెంచుతున్నారు.
2010 తర్వాత మళ్ళీ 2023 నుండి పసుపు ధరలు పెరగటంతో పసుపుని పండించే రైతులు సంతోషిస్తున్నారు. 2010లో అంతర్జాతీయ మార్కెట్లో పసుపు ధరలు కిలోకు 2.07 డాలర్లుగా గరిష్ట స్థాయిని నమోదు చేసాయి. అప్పటి నుండి మళ్ళీ ఆ స్థాయి ధరలు లభిస్తాయనే ఆశతో రైతులు పసుపుని సాగు చేస్తున్నారు. క్వింటాలుకి 15 వేల రూపాయల ధర 2010లో దేశంలోని పసుపు రైతులకు లభించింది. ఆ తర్వాత క్వింటాలు ధర 6 వేల రూపాయలకు మించలేదు. కొందరు రైతులు, వ్యాపారులు పసుపు పంటను నిల్వ చేసి, నష్టపోయారు. 2022-23 నుండి పసుపు ధరలో కొంత కదలిక వచ్చింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే పసుపు ఎగుమతులు 11 శాతం వృద్ధి చెందాయి. అనేక సంవత్సరాల పాటు పసుపు ధరలు నిరాశాజనకంగా ఉండటం వల్ల రైతులు పసుపు సాగుని తగ్గించారు. 2021-22లో 3.49 లక్షల హెక్టార్లలో పసుపు పంట సాగయింది. 13.34 లక్షల టన్నుల పసుపు ఆ సంవత్సరం ఉత్పత్తయినట్లు అంచనా. ఆ సంవత్సరం 1.53 లక్షల టన్నుల ఎగుమతి ద్వారా దేశం 1784 కోట్ల రూపాయలు ఆర్జించింది. అదే సంవత్సరం 0.24 లక్షల టన్నుల కొన్ని రకాల పసుపు దిగుమతయింది. అందుకు 246 కోట్ల రూపాయలు ఖర్చవగా, నికరంగా రూ. 1538 కోట్ల విదేశీ మారకద్రవ్యం దేశానికి లభించింది. యునైటెడ్ ఆరబ్ రిపబ్లిక్, నేపాల్, ఒమన్, సౌదీ అరేబియా, సిరియా, యునైటెడ్ కింగ్డమ్, మలేసియాలు ముఖ్యంగా భారత్ నుండి పసుపుని దిగుమతి చేసుకున్నాయి. గత రెండు థాబ్దాలుగా పసుపు విస్తీర్ణం పెరుగుతుండగా దిగుబడుల్లో తగ్గుదల కనిపిస్తున్నది. 2015-16లో దేశపు సగటు ఉత్పత్తి హెక్టారుకి 5100 కిలోలుండగా 2021-22లో అది 3818 కిలోలకు తగ్గింది. 2021-22లో క్వింటాలు సగటు ఉత్పత్తి వ్యయం రూ. 8373 కాగా ధర మాత్రం రూ. 6100 గానే ఉంది. నష్టాలను భరించలేక గత రెండేళ్ళలో రైతులు వేరే పంటలకు మళ్ళారు. 2022-23లో పంట విస్తీర్ణం 12 శాతం తగ్గినట్లు అంచనా వేశారు. విస్తీర్ణం తగ్గటం, ఎగుమతి గిరాకీ పెరగటం వల్ల 2023లో పసుపు ధరలు 70 శాతం పెరిగాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో కిలోకు 1.58 డాలర్లు పలుకుతున్నది. దేశీయ మార్కెట్లో క్వింటాలు ధర 15 వేల రూపాయలు దాటింది. ఇంకా పెరగవచ్చనే ఆశాభావంతో ఫ్యూచర్స్ మార్కెట్లో క్వింటాలు ధర 16 వేల రూపాయల్ని దాటింది. నాణ్యతను బట్టి రైతులకు క్వింటాలు ధర 16 వేల రూపాయల్ని దాటింది. నాణ్యతను బట్టి రైతులకు క్వింటాలుకి 12 వేల నుండి 16 వేల రూపాయలు లభిస్తున్నాయి. అనేక సంవత్సరాల చేదు అనుభవం తర్వాత ఈ సంవత్సరం పసుపు రైతులు ఎంతో కొంత లాభాలను పొందుతున్నారు. గత రెండేళ్ళుగా నిల్వ పెట్టిన రైతులు, వ్యాపారులు లాభానికి అమ్ముకోగలుగుతున్నారు. రాబోయే సంవత్సరంలో పసుపు సాగు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిరాశలో మిర్చి రైతులు
2022-23లో మిర్చి పంటకు గరిష్ట స్థాయిలో ధరలు పలికాయి. ఒక రైతుకి క్వింటాలుకి 81 వేల రూపాయల ధర లభించినట్లు వార్తలొచ్చాయి. బ్యాడిగి రకానికి క్వింటాలుకి 50 వేల రూపాయలు, తేజ రకానికి 35 వేల రూపాయలు, ఇతర రకాలకు 25 వేల రూపాయలకు పైగా ధరలు లభించాయి. 2023-24 సీజనులో రైతులు మిర్చి పంట విస్తీర్ణాన్ని పెంచారు. ఉత్పత్తి పెరుగుతుందనే అంచనాలతో ధరలు సగానికి సగం తగ్గాయి. క్వింటాలుకి రూ. 10 వేల నుండి రూ. 15 వేల మధ్య ధరలు లభిస్తుండటంతో రైతులు నష్టపోతున్నామని వాపోతున్నారు. వాణిజ్య పంటల్లో ధరలు ఆటుపోట్లకు గురికావటం, సర్వసాధారణమై పోయింది. గత సంవత్సరం పత్తి, మిర్చి ధరలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ రెండింటి ధరలు తగ్గాయి.
ప్రపంచ మిర్చి ఉత్పత్తిలో భారత దేశానికి 40 నుండి 45 శాతం వాటా ఉంటున్నది. దేశంలో తెలుగు రాష్ట్రాలు ముఖ్య ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఉత్పత్తి ఎక్కువవుతుందనే అంచనాలు రావడం వల్ల దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ధరలు పతనమయ్యాయి. 2023 డిసెంబరులో క్వింటాలు మిర్చి ధర 315 డాలర్లుండగా 2024 మార్చికి 230 డాలర్లకు తగ్గింది. భారత దేశం నుండి ఎండుమిర్చిని దిగుమతి చేసుకునే దేశాల్లో థాయ్లాండ్, మలేసియా, శ్రీలంకలు ముఖ్యమైనవి. పచ్చిమిర్చి ఎక్కువగా యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్డమ్లకు ఎగుమతి అవుతున్నాయి. థాయ్లాండ్లో కూడా ఎండుమిర్చిని బాగానే పండిస్తున్నారు. ప్రపంచ ఎండుమిర్చి ఉత్పత్తిలో ఆదేశానికి ఏడుశాతం వాటా ఉన్నది. ఈ సంవత్సరం ఆదేశంలో ఎండుమిర్చి ఉత్పత్తి ఆశాజనకంగా ఉండటం వల్ల అక్కడకు జరిగే ఎగుమతులు తగ్గవచ్చనే అనుమానంతో ఎగుమతిదార్లు కొనుగోళ్ళు తగ్గించారు. బంగ్లాదేశ్, చైనా, ఇథియోపియా, బెనిన్, ఐవరేకోస్ట్, మయన్మార్ వంటి దేశాల్లో ఎండుమిర్చి ఉత్పత్తి పెరిగే అంచనాలుండటం వల్ల ఆదేశాలు కూడా ఎగుమతి మార్కెట్లో భారత ఎండుమిర్చితో పోటీపడే అవకాశం ఉంది. గుంటూరు మార్కెట్కు రోజుకి లక్ష టిక్కీలు (35 కిలోలవి) రావటం వల్ల మార్కెట్ ధరలు తగ్గుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. చాలామంది రైతులు పంట కల్లాల నుండి మార్కెట్కు తరలించడం వల్ల సరఫరాపై నియంత్రణ ఉండటం లేదు. రైతులకు కొద్ది నెలల పాటు తాత్కాలికంగా నిల్వ చేసే సదుపాయాలు కూడా లేకపోవటం వల్ల ఇలా జరుగుతున్నది. వ్యాపారుల మధ్య ఐక్యత వల్ల రైతులకు ధరల్ని తగ్గిస్తున్నారని మిర్చి రైతులు ఆందోళన చేస్తున్నారు. మొదటి రకం మిర్చికే ధరలు సరిగా రాక పోవటం వల్ల, నాశిరకం మిర్చి ధరలు పదివేల రూపాయలకన్నా తక్కువ పలుకుతున్నాయి.
వాణిజ్య పంటల ధరల్లో సాలెగూడు సామ్యం
మార్కెట్ వ్యవస్థలో ఏ వస్తువు, ఏ సేవలకైనా చెల్లించాల్సిన ధరలు సాలెగూడులా కనిపిస్తాయి. గిరాకీని మించిన సరఫరా ఉన్నప్పుడు మార్కెట్ ధరలు తగ్గటం, కొరత ఏర్పడటం వల్ల మరుసటి సంవత్సరం ధరలు పెరగటం, మళ్ళీ సరఫరా పెరగటంతో ఆ తర్వాతి సంవత్సరం ధరలు తగ్గటం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల ధరల్ని, సరఫరా, గిరాకీలను పరిశీలిస్తే అవి ఒక సాలె గూడులా కనిపిస్తాయి. ఫ్యాక్టరీల్లో తయారయ్యే వస్తువుల విషయంలో సరఫరా, గిరాకీల మధ్య ఉన్న వ్యత్యాసాలను తక్కువ సమయంలో సరిచేయవచ్చు. కాని వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో సరఫరాను పెంచాలంటే కొన్ని ఉత్పత్తుల విషయంలో నాలుగైదు నెలలు, మరికొన్ని ఉత్పత్తుల విషయంలో పది, పన్నెండు నెలల సమయం అవసరమౌతుంది. అందువల్లనే వ్యవసాయ ఉత్పత్తుల ధరల సరళి సాలెగూడుల్ని తలపిస్తాయి. ఒక వ్యవసాయ ఉత్పత్తిని పూర్తిగా దేశీయంగా వినియోగిస్తే సాలెగూడులు చిన్నవిగా కనిపిస్తాయి. గింజధాన్యాలు, పప్పుధాన్యాల విషయంలో ఈ సరళి కనిపిస్తుంది. కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో ఎగుమతులు, దిగుమతుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు దేశీయ మార్కెట్ ధరలపై అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాటి ధరల సరళిని గమనిస్తే పెద్ద సాలెగూడులా కనిపిస్తాయి. పత్తి, మిర్చి, పసుపు, వంటనూనెలు, సుగంధద్రవ్యాల విషయంలో ఎగుమతి, దిగుమతులు ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి కాబట్టి, వాటి ధరల సరళిలో సాలెగూడు ఆకారం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులు, అందులో ఎగుమతి, దిగుమతి ప్రభావం ఎక్కువ వున్న ఉత్పత్తుల విషయంలో ధరల్లో ఆటుపోట్లు ఎక్కువగా ఉండటం వల్ల వాటి ధరల సరళిలో సాలెగూడు ఆకారాన్ని స్పష్టంగా గమనించవచ్చు
వాణిజ్య పంటలపై రైతులకు మోజు ఉండటానికి కారణం లాభాపేక్షయే. ఒక పది శాతం రైతులకు మంచి దిగుబడులు వచ్చిన సీజనులో ధరలు అధికంగా లభిస్తాయి. ఒక నలభై శాతం రైతులకు అధిక దిగుబడులు వచ్చిన సీజనులో తక్కువ ధరలు లభిస్తాయి. మరో నలభై శాతం రైతులకు తక్కువ దిగుబడులు లభించిన సమయంలో ఎక్కువ ధరలు లభిస్తాయి. మిగిలిన 10 శాతం రైతులకు తక్కువ దిగుబడులు వచ్చిన సంవత్సరాల్లో తక్కువ ధరలు లభిస్తాయి. మొదటి పదిశాతం మంది లాభాలార్జిస్తే చివరి పది శాతం రైతులు నష్టాలపాలై, అప్పుల్లో కూరుకుపోతారు. 80 శాతం మంది రైతులు రెండు, మూడు రకాల్లో ఉండి, మధ్యస్తంగా ఉండి, కొద్ది లాభాల్లో గానీ, కొద్ది నష్టాల్లో గానీ ఉండిపోతారు. ఐదేళ్ళ పాటు ఒకే పంటను సాగు చేసిన రైతులు ఒక సంవత్సరంలో మంచి లాభాలు, ఒక సంవత్సరంలో భారీ నష్టాలు, మూడు సంవత్సరాల్లో ఖర్చులు మాత్రమే రాబట్టుకునే పరిస్థితి ఉంటుంది. రెండు మూడు వాణిజ్య పంటలను మార్చి మార్చి సాగు చేసే రైతులు రాబోయే సీజన్లో మార్కెట్ను అంచనా వేయగల శక్తిని బట్టి లాభనష్టాలు ఉంటాయి.
గొర్రెదాటు వైఖరి
ఒక సంవత్సరం ఏయే వాణిజ్య పంటలకు మంచి ధరలు లభిస్తాయో తర్వాత సంవత్సరం చాలామంది రైతులు ఆ పంట సాగుని చేపట్టటం జరుగుతున్నది. విస్తీర్ణం పెరుగుతున్నట్లు అంచనా రాగానే మార్కెట్ ధరలను వ్యాపారులు తగ్గించేస్తారు. వాతావరణ పరిస్థితులు ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయి. ధరల్ని ఉత్పత్తి అంచనాలు, ఎగుమతి దిగుమతి అవకాశాలు నిర్దేశిస్తాయి. వాతావరణాన్ని, ధరల్ని సరిగా అంచనా వేయలేని రైతులు ప్రస్తుత ధరలను బట్టి రాబోయే పంట కాలంలో వేయాల్సిన పంటలను ఎంచుకుంటారు. ఎక్కువమంది రైతులు ప్రస్తుతం ధరలు బాగున్న పంటలను సాగు చేయటానికి ఇష్టపడుతున్నారు. దానితో ఉత్పత్తి పెరగటం వల్ల తర్వాతి పంట కాలంలో ధరలు తగ్గటం సాధారణంగా జరుగుతుంది. తరచుగా వాణిజ్య పంటల రైతులు నష్టపోతున్నందువల్ల వాటికి కూడా కనీస మద్దతు ధరల్ని ప్రకటించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఇటీవలి కాలంలో ఢిల్లీలో మహాపంచాయత్ నిర్వహించిన రైతు సంఘాలు అన్ని పంటలకు కనీస మద్దతు ధరల్ని నిర్ణయించాలని కోరారు. ప్రస్తుతం కనీస మద్దతు ధరల్ని ప్రకటిస్తున్న 21 పంటలకు చట్టబద్ధ గారెంటీలను కోరారు. రైతు సంఘాల కోర్కెలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించటం లేదు. రైతు ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేయటానికి ప్రయత్నించింది. రైతులు పంటలను మార్కెట్కు తెచ్చే సమయంలో వ్యాపారులు కుమ్మక్కై ధరల్ని తగ్గిస్తున్నందుకు కొంతమేరకు మార్కెట్లో ప్రభుత్వ సంస్థలు కొనుగోళ్ళు చేయటానికి నిధులు కేటాయించాల్సిన అవసరాన్ని రైతు నాయకులు నొక్కి చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై కూడా క్రియాశీలకంగా వ్యవహరించటం లేదు.
భవిష్యత్లో ధరలు
ప్రస్తుతం పసుపు ధరలు పదమూడేళ్ళ తర్వాత గరిష్ట స్థాయికి చేరితే, మిర్చి ధరలు గత సంవత్సరపు ధరలతో పోలిస్తే సగానికి పడిపోయాయి. పత్తి ధరలు కూడా గత సంవత్సరంతో పోలిస్తే తగ్గాయి. పత్తి, వరి, మొక్కజొన్నల ధరలు కనీస మద్దతు ధరల స్థాయికి ఇంచుమించుగా ఉన్నాయి. బియ్యం ఎగుమతులపై విధించిన ఆంక్షల వల్ల వరి ధాన్యం ధరలకు కళ్ళెం పడింది. కాని సన్నరకం వడ్ల ధరలు కొంత ఆకర్షణీయంగా ఉన్నాయి. మొక్కజొన్న ఉత్పత్తి గత సంవత్సరంతో పోలిస్తే తక్కువగా ఉండటం వల్ల ధరలు కనీస మద్దతు ధరకు పైనే కదలాడుతున్నాయి. సరఫరా కన్నా గిరాకీ ఎక్కువగా ఉండటం వల్ల పసుపు ధరలు మరికొంత పెరగవచ్చనే అంచనాలు మార్కెట్లో వినిపిస్తున్నాయి. మిర్చి ధరల పతనం కూడా తాత్కాలికమే అని విశ్లేషకులు అంటున్నారు.2021-22లో భారతదేశంలో మిర్చిని 6.94 లక్షల హెక్టార్లలో సాగు చేసారని గణాంకాలు తెలుపుతున్నాయి. ఆ సంవత్సరం ఉత్పత్తిని 15.78 లక్షల టన్నులుగా అంచనా వేశారు. సగటు దిగుబడి హెక్టారుకి 2689 కిలోలుగా లెక్క కట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు లక్షల టన్నులు, తెలంగాణలో 4.33 లక్షల టన్నులు, మధ్యప్రదేశ్లో 3.03 లక్షల టన్నులు, కర్నాటకలో 1.85 లక్షల టన్నులు, ఒడిస్సాలో 0.69 లక్షల టన్నుల మిర్చి ఉత్పత్తయినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఆ సంవత్సరం 5.57 లక్షల టన్నుల మిర్చి ఎగుమతుల ద్వారా రూ. 8581 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని దేశం ఆర్జించింది. 2022-23లో మిర్చి ఎగుమతులు 5.8 లక్షల టన్నులకు పెరిగాయి. 2023-24లో కూడా ఎగుమతి ఐదు లక్షల టన్నుల స్థాయి కన్నా తగ్గకపోవచ్చు. 2023 నవంబరులో కురిసిన అధిక వర్షాల వల్ల మధ్యప్రదేశ్లో మిర్చి పంట బాగా దెబ్బతిన్నట్లు వార్తలొచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో కూడా వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో మిర్చి పంట నష్టపోయింది. ఐనా కొన్ని ప్రాంతాల్లో దిగుబడులు బాగా ఉన్నందువల్ల, సరకు మార్కెట్లకు చేరటం వల్ల వ్యాపారులు ధరల్ని తగ్గించారు. రైతుల్ని కొన్నాళ్ళు సరుకుని నిలవపెట్టి, ఆలస్యంగా మార్కెట్కు తీసుకురమ్మని అధికారులు సలహా ఇస్తున్నారు. కాని అప్పుల్ని తీర్చాల్సిన అవసరం, నిలవపెట్టే సౌకర్యాలు, సామర్థ్యం లేకపోవటంతో రైతులు సరుకుని మార్కెట్కు తెస్తున్నారు. ఎగుమతి ఆర్డర్లు ఎక్కువగా లేకపోవటంతో వ్యాపారులు ఉత్సాహంగా కొనుగోళ్ళు చేయటం లేదు.
వాస్తవంగా మిర్చి, పత్తి పంటల విషయంలో సరఫరా పెరగలేదు. ఐతే వివిధ దేశాల్లో నెలకొని ఉన్న ఆర్థిక సమస్యల కారణంగా కొనుగోళ్ళు, దిగుమతి ఆర్డర్లు మందగించాయి. బట్టలకు, నూలుకి ఆర్డర్లు తగ్గినందువల్ల స్పిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోళ్లను నిలిపివేశాయి. నిల్వలను వాడుతూ తాజా కొనుగోళ్ళను తగ్గించటం వల్ల మార్కెట్ నిస్తేజంగా ఉంది. మిర్చి విషయంలోనూ కొనుగోళ్ళు మందగించడం వల్ల ధరలు తగ్గుతున్నాయి. ఎగుమతుల మార్కెట్లో ఉన్న అనిశ్చితి వల్ల వ్యాపారులు కొని, నిలవ పెట్టటానికి కూడా జంకుతున్నారు. కొద్దిమంది రైతులు ధైర్యం చేసి, శీతల గిడ్డంగులలో నిల్వ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తం ఉత్పత్తిలో దాదాపు 30 శాతం ఎగుమతి జరిగే మిర్చి పంట విషయంలో ఎగుమతులు మందగించటం వల్ల నైరాశ్యం నెలకొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తమ సంస్థల ద్వారా కొనుగోళ్ళు జరిపి, మార్కెట్ను నిలబెట్టే ప్రయత్నం చేయాలి. రైతులు, కౌలుదార్లు తక్కువ ధరలకు అమ్మి నష్టపోవలసి వస్తున్నది. పత్తి, మిర్చి వంటి పంటల్లో కూలీల వినియోగం ఎక్కువ. కూలి రేట్లు ఏటేటా పెరగటం వల్ల ఉత్పత్తి వ్యయం అధికమౌతున్నది. ఒక క్వింటాలు మిర్చి ఉత్పత్తి వ్యయం పదివేల రూపాయలు దాటుతున్నది. ప్రస్తుతం లభిస్తున్న ధరల వల్ల సగంమంది రైతులు నష్టాల పాలవుతున్నారు. పసుపు ధరలు పెరుగుతున్నందువల్ల రాబోయే సంవత్సరం (2024-25)లో ఆ పంట విస్తీర్ణం బాగా పెరిగే అవకాశం ఉంది. కాని పత్తి, మిర్చిని పండించే రైతులు ఆ రెండు పంటలను మార్చి, మార్చి వేస్తుంటారు. ఈ రెండు పంటలకు ధరలు తగ్గటం వల్ల వాటి బదులు ఏ పంటలు వేయాలో తెలియని స్థితిలో మెట్ట ప్రాంత రైతులుంటారు. గత పదేళ్ళుగా పసుపు రైతులెదుర్కున్న పరిస్థితుల్ని ఈ సంవత్సరం మిర్చి, పత్తిని సాగు చేసే రైతులు, కౌలుదార్లు ఎదుర్కొంటున్నారు. వాతావరణ అనిశ్చితికి తోడు మార్కెట్ మాంద్యం కూడా ఎదురైతే రైతులు గట్టెక్కడం కష్టమే.
సంవత్సరం పొడవునా వివిధ మాసాల్లో రైతులు ఆచరించవలసిన పద్ధతులు నెలవారీగా కింద పేర్కొనబడ్డాయి. పశుపోషక రైతులు వీటిని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాలకు, పరిస్థితులకు అనుకూలంగా పాటించగలరు.
జనవరి : ఆవులు, గేదెలు చాలా వరకు ఈని పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. కొన్ని డెయిరీలు పాల సేకరణ తగ్గించడం, సేకరణ ధర తగ్గించడం చేస్తున్నాయి. అయితే ఈ నెలలో ఈ సమస్య దానంతట అదే సమసిపోయి పాల ఉత్పత్తి మళ్ళీ మామూలు స్థితికి చేరుకుంటుంది. అప్పుడు డెయిరీలు ఒకదానికొకటి పోటీ పడి పాలు సేకరిస్తాయి. ఈ నెలలో చలెక్కువ కాబట్టి పాలు త్వరగా చెడిపోవు. పుట్టిన దూడల్ని బాగా పోషించాలి. చలి, తేమ, గాలి ఎక్కువగా ఉంటే న్యుమోనియా, డయేరియాకు లోనవుతాయి. అందుకని షెడ్డులో పరిశుభ్రమైన వాతావరణం చాలా ముఖ్యం. అలాగే ఆవులు, గేదెలు ఈనిన తరువాత రెండు, మూడు నెలలకల్లా చూడి కట్టించాలి. దీనికి మేలైన ఆబోతులు, దున్నల ఘనీభవించిన వీర్యాన్ని ఉపయోగించాలి. గాలికుంటు వ్యాధి నివారణ టీకాలివ్వడానికి ఇది అనువైన సమయం. ఆరు నెలలకొకసారి ఈ టీకాలివ్వాలి. దూడల్లో గజ్జి సోకకుండా చూడాలి.
ఫిబ్రవరి : ఆవులు సంవత్సరం పొడవునా చూడి కడుతూ, ఈనుతూ, పాలిస్తూ ఉంటాయి. అదే గేదెలు ఎక్కువగా జూలై నుండి అక్టోబరు వరకు ఈనుతాయి. ఈనిన రెండు, మూడు నెలలకల్లా చూడి కట్టించాలి. ఇలా చేస్తే 13, 14 నెలల కల్లా మళ్ళీ ఈనుతాయి. ఈతల మధ్యకాలం ఎక్కువ ఉంటే, వట్టిపోయి ఉండే కాలం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో పాడి పశువులను వృథాగా మేపాల్సొస్తుంది. ఇది పాడి పరిశ్రమకు నష్టదాయకం. దీన్ని చూసుకుని ఈ నెలలో చేయాల్సిన కార్యక్రమాలు చేపట్టాలి. దూడలకు మూడు నెలలు నిండగానే పాలు మాన్పించాలి. దాణా, పచ్చిమేత, ఎండు మేత ఎక్కువగా మేపాలి. అప్పుడే అవి త్వరగా పెరుగుతాయి. ఫిబ్రవరి నెల చలికాలం కిందే లెక్క. చలి నుండి పశువుల్ని కాపాడాలి. పరిశుభ్రమైన నీరు పశువులకు ఎల్లవేళలా లభించేలా చూడాలి.
మార్చి : మార్చి నుండి వేసవి కాలం మొదలౌతుంది. షెడ్డులో, బయట ఎండ వేడిమి లేకుండా చూడాలి. షెడ్డు చుట్టూరా వేప, దిరిసెన మొదలగు చెట్లుంటే మంచిది. షెడ్డు చుట్టూ ఉన్న యార్డులో పశువులు చెట్టు నీడన ఉండే అవకాశముంది. ఇలా తిరిగే పశువుల్లో ఎద లక్షణాలు కూడా తేలిగ్గా గుర్తించి చూడి కట్టించవచ్చు. పచ్చిమేత తగ్గితే, సైలేజిగా నిలువ ఉంచిన మేతను ఈ నెలలో ప్రారంభించవచ్చు. మొదట కొద్దికొద్దిగా వేసి తరువాత సరిపడా పెంచవచ్చు. పాలు పిండే ముందు సైలేజి మేపకూడదు. లేదా పాలలో సైలేజి వాసన వచ్చే అవకాశముంది. వేసవిలో పాలు త్వరగా చెడిపోతాయి. పాల క్యాను చుట్టూ తడిగుడ్డ చుట్టి, క్యాన్ను చల్లని ప్రదేశాలలో ఉంచాలి. వీలైనంత త్వరగా పాల సేకరణ కేంద్రానికి గాని, పాల శీతలీకరణ కేంద్రానికి గాని పంపాలి.
ఏప్రిల్ : ఈ నెలలో ఎండ ఎక్కువగా ఉంటుంది. పచ్చిమేత తక్కువగా ఉంటుంది. సైలేజి, ఎండుమేత, దాణాతోపాటు పాడి పశువులకు సరిపడా మేపాలి. మేత సరిపడా ఉంటే పశువులు బాగా పాలిస్తాయి. అలాగే ఎదకు వచ్చి చూడి కడతాయి. షెడ్డులో చల్లని వాతావరణం ఉండేలా చూడాలి. దానికి షెడ్డుపైన గడ్డి కప్పాలి. షెడ్డు ప్రక్కన గోనె పట్టాల్ని కాని, తడికలను కాని కట్టి వాటిపై నీళ్ళు చల్లాలి. పశువులపై కూడా మధ్యాహ్నం పూట ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నప్పుడు రోజూ రెండు మూడుసార్లు నీళ్ళు చల్లితే మంచిది. ముఖ్యంగా సాయంత్రం పాలు పిండే ముందు పశువును మొత్తం, పొదుగునూ చల్లటి నీటితో కడిగితే మంచిది. అలాగే పశువులు తాగటానికి పరిశుభ్రమైన చల్లని నీరు ఎల్లవేళలా లభ్యమయ్యేలా చూడాలి. షెడ్డు పొడవు తూర్పు పడమరలవైపుండాలి. అప్పుడు ఉదయం, సాయంత్రం షెడ్డులోకి ఎండరాక షెడ్డు వేడెక్కదు. ఈగలు, దోమలు, పిడుదులు, గోమార్లు లేకుండా చూడాలి.
మే : మే నెలలో ఎండలెక్కువగా ఉంటాయి. వడగాలులు కూడా వీస్తాయి. వాటి నుంచి పశువులను రక్షించాలి. పచ్చిమేత సరిపడా లేకపోతే సైలేజి, ఎండుమేత పెట్టాలి. అవసరమైతే దాణా పెంచాలి. షెడ్డుపైన స్ప్రింక్లర్లు పెడితే, షెడ్డులోపల చల్లగా ఉంటుంది. షెడ్డులో ఫ్యాన్లు కూడా ఉండాలి. మధ్యాహ్నం పూట కూలర్లు కూడా అమర్చవచ్చు. వేసవిలో పాలధరలెక్కువగా ఉంటాయి. అందువలన ఈ సమయంలో పాల ఉత్పత్తి అధికంగా ఉంటే పాడి పరిశ్రమ చాలా లాభదాయకం. ఈనెల చివరలో గొంతువాపు వ్యాధికి టీకాలివ్వాలి. వర్షాకాలం మొదట్లో కల్లా పశువుల్లో ఈ వ్యాధికి నిరోధక శక్తి ఏర్పడుతుంది.
జూన్ : జూన్ మాసంలో నైరుతీ రుతుపవనాలతో వర్షాలు మొదలౌతాయి. షెడ్డులో తేమ లేకుండా చూడాలి. లేదా పశువులకు వ్యాధులు సోకుతాయి. గొంతువాపుకు టీకాలివ్వకపోతే ఈ నెలలో ఇవ్వాలి. అలాగే గాలికుంటు వ్యాధి నివారణ టీకాలిచ్చి ఆరు నెలలయితే మళ్ళీ ఇవ్వాలి. పచ్చిమేత లభించడం ఈకాలంలో మొదలవుతుంది. పశువులకు పచ్చిమేత ఎక్కువగా మేపి దాణా తగ్గిస్తే లాభదాయకం. వాతావరణం చల్లబడడంతో పశువులు ఎక్కువగా ఎదకొస్తాయి. ఉదయాన ఎదకొచ్చిన పశువులను సాయంత్రం, అలాగే సాయంత్రం ఎదకొచ్చిన పశువులకు మరుసటి ఉదయం మేలు జాతి ఆబోతుల వీర్యాన్ని కృత్రిమ గర్భోత్పత్తి ప్రక్రియ ద్వారా ఉపయోగించాలి. సైలేజిని గుంటనించి కాని, పై నుంచి కాని తీస్తే, తీసిన వెంటనే కప్పి వేయాలి లేదా చెడిపోయి మేపుకు పనికిరాదు.
జూలై : ఈ నెలలో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. అయితే ఒక్కోసారి అనావృష్టి పరిస్థితులు వస్తాయి. అది గమనించి పాడి పశువులకు సరైన పోషణ ఇవ్వాలి. పశువులకు పరిశుభ్రమైన నీరు ఎల్లవేళలా లభ్యమయ్యేలా చూడాలి. వేసవిలో ఈనిన పశువులు ఇప్పుడు ఎదకొస్తాయి. వాటిని చూడి కట్టించాలి. ఈనిన రెండు, మూడు నెలలకు చూడి కట్టిస్తే ఆవుల్లో ప్రతి సంవత్సరం, గేదెల్లో 13, 14 నెలలకు ఈతలుంటాయి. ఇది లాభదాయకమైన పద్ధతి. పాడిపశువు ఈనితేనే పాలివ్వడం మొదలెడుతుంది. పశువుల షెడ్డు పరిశుభ్రంగా ఉంచాలి. ఎప్పటికప్పుడు పేడ, మూత్రం తొలగించాలి. లేదా పశువులు వాటిపై పడుకుని పొదుగు వాపు వ్యాధికి గురయ్యే అవకాశముంది. ఈ నెల నుండి గేదెలు ఎక్కువగా ఈనుతాయి. వాటికి సరిపడా పోషణ ఇవ్వాలి. దూడల్ని పొడి ప్రదేశంలో ఉంచాలి. లేదా డయేరియా, న్యుమోనియా వచ్చే అవకాశం ఉంది. దూడలకు నట్టల నివారణ మందులు తాగించాలి.
ఆగస్టు : ఈనబోయే గేదెలకు, ఆవులకు ఒకటి రెండు నెలల ముందు నుంచి ఒకటి రెండు కిలోల దాణాను అదనంగా ఇవ్వాలి. అప్పుడు వాటిలో ఈనిన తరువాత పాలెక్కువగా ఇచ్చే శక్తి నిలవలుంటాయి. దూడ కూడా కడుపులో బాగా పెరిగి, పుట్టిన తరువాత ఆరోగ్యం గాను, బలంగాను ఉంటుంది. ఈ నెలలో పచ్చిమేత పుష్కలంగా ఉంటుంది. అందువలన పచ్చిమేతను ఎక్కువగా మేపి దాణా, ఎండుమేత తగ్గించవచ్చు. పాడి పరిశ్రమలో మూడింట రెండొంతుల ఖర్చు మేపు మీదే ఉంటుంది. కొత్తగా ఈనిన పశువులకు, మొదటి, రెండవ ఈతలోని పశువులకు ఒకటి, రెండు కిలోల దాణా అదనంగా పెట్టాలి. మొదటి రెండు ఈతల్లోని పశువులు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అందుకని వాటి పోషణావసరాలు ఎక్కువ.
సెప్టెంబరు : ఈ నెలలో గేదెలెక్కువగా ఈనుతాయి. ఈనబోయే పశువులకు రోజూ ఒకటి, రెండు కిలోల దాణా పెట్టాలి. ఈనేటప్పుడు పరిశుభ్రమైన వసతి కల్పించాలి. కింద వరిగడ్డి, గోనె పట్టాలు వేసి ఉంచాలి. జూలై, ఆగస్టు నెలలలో ఈనిన పశువులు ఈనెలలో ఎదకివస్తాయి. వాటికి చూడి కట్టించాలి. పాడికి చూడే ఆధారం. ఈ నెలలో పాడి పశువులు బాగా పాలిస్తాయి. వాటికి సరిపడా మేపాలి. షెడ్డులో తేమ ఎక్కువగా లేకుండా పొడిగా ఉండేటట్లు చూడాలి. షెడ్డులో వర్షం పడకుండా చూడాలి. పేడ, నీటిని ఎప్పటికప్పుడు తీసివేయాలి. ఈగలు, దోమలు, పిడుదులు, గోమార్లు లేకుండా చూడాలి. షెడ్డు పొడిగా ఉంటే పొదుగు వాపు వ్యాధి సోకే అవకాశం కూడా తక్కువ. ఇప్పటికే టీకాలివ్వకుంటే గాలికుంటు, గొంతువాపు వ్యాధులకు టీకాలిప్పించాలి. ఈ నెలలో దూడలెక్కువగా పుట్తాయి. పుట్టగానే శుభ్రంగా తుడిచి, బొడ్డు కత్తిరించి, టింక్చర్ అయోడిన్ రాసి, జున్నుపాలు పట్టించాలి. షెడ్డులో ఖనిజలవణ మిశ్రమంగల రాళ్ళను వేలాడదీస్తే, దూడలు వీటిని నాకుతాయి. పశువుల ఫారాన్ని కొత్తగా పెట్టే వారికిది మంచి సమయం.
అక్టోబరు : ఆవులు సంవత్సరం పొడవునా ఈనుతాయి. గేదెలెక్కువగా జూలై నుండి అక్టోబరు వరకు ఈనుతాయి. అక్టోబరులో ఈనబోయే ఆవులకు, గేదెలకు ఇప్పుడు దాణా రోజూ ఒకటి, రెండు కిలోలివ్వాలి. ఈనబోయే ఒకటి రెండు నెలల ముందుగా వట్టిపోనివ్వాలి. ఈనేటప్పుడు పశువైద్యుని సహాయం తీసుకోవాలి. ఈనగానే తేలిగ్గా జీర్ణమయ్యే జావలాంటిది పెడితే మంచిది. తల్లి నుండి దూడను వేరు చేసే పద్ధతి పాటిస్తే, ఈనిన వెంటనే గాని లేదా మూడు నాలుగు రోజులకు గాని దూడను వేరు చేయవచ్చు. పాలు పిండినప్పుడు దూడ శరీర బరువులో 10 శాతం పాలు తాగించాలి. నేటి దూడలే రేపటి ఆవులు. దూడల్ని బాగా పోషిస్తే త్వరగా పెరిగి, పెద్దవై, చూడికట్టి ఈనుతాయి. దూడల్ని పొడి వాతావరణంలో ఉంచితే డయేరియా, న్యుమోనియా వంటి వ్యాధులు రావు. జీవభద్రత చర్యలు చేపట్తే వ్యాధులు సోకే అవకాశాలు తగ్గుతాయి.
నవంబరు : నవంబరు నాటికి గేదెలు చాలావరకు ఈని ఉంటాయి. ఇవి మళ్ళీ ఎదకొచ్చి కట్టడానికిది మంచి సమయం. అలాగే పాలు ఇప్పుడు అధికంగా ఇస్తాయి. ఈ పశువుల్లో పొదుగు వాపు వ్యాధి వచ్చే అవకాశమెక్కువ. ఈ వ్యాధి నివారణకు షెడ్డులో పారిశుధ్యం చాలా ఆవశ్యకం. షెడ్డులో తేమ లేకుండా చూడాలి. పేడవేసిన వెంటనే తీసివేయాలి. పశువులకు పచ్చిమేత బాగా మేపాలి. అలాగే దాణా కూడా. ఇవి అధిక పాల దిగుబడితో తగ్గిపోయిన శరీర నిలువలు పుంజుకుని పశువులు బరువు కోల్పోకుండా చూస్తాయి. అలా అయితేనే పాలిచ్చే పాడికాలం సరిపడా ఉంటుంది. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఈనిన పశువులకు ఈనిన నెలన్నర, రెండు నెలలకు ఈ నెలలో చూడి కట్టించాలి. ఈ నెలలో వర్షాల వలన ఈగలు, దోమలు, పిడుదులు, గోమార్లు ఎక్కువగా ఉండి రోగాల్ని కలిగిస్తాయి. వాటిని నివారించాలి. పాలు పిండగానే చనులను టీట్ డిప్లో ముంచితే పొదుగువాపు వ్యాధి సోకే అవకాశం తగ్గుతుంది.
డిసెంబరు : ఈ నెలలో పాడి పశువులు పాలు బాగా ఇస్తాయి. పాల ఉత్పత్తి ఎక్కువ కావటంతో కొన్ని డెయిరీలు పాల సేకరణ తగ్గిస్తుండడం, పాల సేకరణ ధరను తగ్గిస్తుండడం చేస్తుంటాయి. ఇది గమనించి రైతులు ప్రత్యామ్నాయ మార్గాలకై ప్రయత్నించాలి. ఎందుకంటే పాలు రెండు, మూడు గంటల కంటే నిలువ ఉండవు. పాల సేకరణ కేంద్రాలు పాలు చెడి పోయాయని ధర చెల్లించవు. ఒక్కొక్కసారి పాలు తీసుకోవు. వీలైనచోట నేరుగా వినియోగదారులకు, హోటళ్ళకు, మిఠాయి దుకాణాలకు అమ్మటం లాభదాయకం. అలాగే పాలను రైతు ఇంటిదగ్గరే సేకరించే ఏర్పాటు చేసుకోవాలి. రైతే పాలను మరొక చోటుకు సరఫరా చేయాలంటే శ్రమతో కూడుకున్నపని. సరఫరా చేసిన పాలకు సొమ్ము సక్రమంగా వచ్చేటట్లు చూసుకోవాలి. ఆ సొమ్ముతో దాణాకు, కూలీలకు, ఇతరత్రా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నెలలో చలెక్కువగా ఉంటుంది. పాడి పశువుల్ని, దూడల్ని చలికి, తేమకు గురికాకుండా చూడాలి. పాడి పరిశ్రమలో యంత్రాల వినియోగం ఎక్కువవుతోంది. పాలు పిండే యంత్రాలు, పశుగ్రాసాన్ని ముక్కలుగా కత్తిరించే యంత్రాలు, బల్క్ కూలర్లు, నీటి తొట్టెలు, మేత వేసే బండ్లు, మిల్కింగ్ పార్లర్లు, షెడ్డును శుభ్రం చేసే యంత్రాలలాంటివెన్నో ఉపయోగిస్తున్నారు. వీటి వలన కూలీల వినియోగం బాగా తగ్గుతుంది. పాలు పరిశుభ్రంగా ఉంటాయి. డెయిరీ ఫారాల్లో సిసి కెమేరాలు, కంప్యూటర్ల వినియోగం కూడా పెరుగుతోంది.
మనది వ్యవసాయక దేశం. ఒకప్పుడు 90 శాతానికి పైగా ప్రస్తుతం 60 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో వ్యవసాయం చేయడము చాలా కష్టంగా ఉండడముతో పాటు వ్యవసాయంలో ఆర్థికంగా ఫలితాలు సక్రమంగా లేకపోవడము, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నవారు శారీరక శ్రమ తక్కువ చేస్తూ ఆర్థికంగా ఎదగడం లాంటి పరిణామాలు ప్రత్యక్షంగా చూసిన చాలామంది వ్యవసాయరంగాన్ని వదలి ఉద్యోగ, వ్యాపార రంగాలకి వలసలు పోవడం జరిగింది. కానీ కాలం గడిచేకొలది, ఆరోగ్యంపై అవగాహన పెరిగే కొలది ఆరోగ్యంగా ఉండాలంటే ఉద్యోగ, వ్యాపార రంగాల కంటే వ్యవసాయ రంగమే సరైనదారి అని నమ్మి ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చే కొంతమంది ఉద్యోగ, వ్యాపార రంగాల నుంచి వ్యవసాయ రంగంవైపు అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా సేంద్రియ సాగు గురించి అవగాహన పెరిగిన తరువాత మనం ఆరోగ్యంగా ఉండాలంటే సేంద్రియ ఉత్పత్తులు తప్పనిసరిగా తినాలనే అవగాహన ప్రజలలో పెరగడము మొదలైన దగ్గరి నుంచి వ్యవసాయ రంగంలో అడుగు పెట్టేవారి సంఖ్య ఏఏటికాయేడు పెరుగుతూనే ఉంది. ఒక రంగం అనేకాకుండ ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, సేవా రంగం ఇలాంటి రంగాల నుంచే కాకుండా ఉన్నత చదువులు చదివే విద్యార్థుల కూడా తమ విద్య పూర్తి అయిన తరువాత వ్యవసాయ రంగంలో అడుగు బెడుతున్నారు. ఇలాంటి వారితో పాటు ఆర్థిక అవసరాల నిమిత్తం సొంత పొలం ఉన్నా కాని వ్యవసాయ రంగాన్ని వదలి వేరే రంగాలకు వెళ్ళిన వారు ఆర్థికంగా ఇబ్బందులు లేని స్థాయికి ఎదిగిన తరువాత తమ మూలాలను వెతుక్కుంటూ తిరిగి వ్యవసాయ రంగంలో ప్రవేశించారు. ఇంకా ప్రవేశిస్తూనే ఉంటారు. ఈ కోవకు చెందుతాడు బాపట్ల జిల్లా వేమూరు మండలం, జంపని గ్రామానికి చెందిన శ్రీనివాసరావు.
శ్రీనివాసరావుది వ్యవసాయ నేపథ్యం. అయినా కాని చదువు పూర్తి కాగానే అందరిలాగానే వ్యవసాయాన్ని వదిలి వేరే రంగాలకు వెళ్లడం జరిగింది. అందులో భాగంగా కొన్ని సంవత్సరాలు మలేషియాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం, కొంతకాలం బంధువులకు సంబంధించిన రైల్వే కాంట్రాక్టు పనులు చూసుకోవడం జరిగింది. ఎన్ని చేసినా కాని తృప్తి లేకుండాపోయింది. తాను ఏదో కోల్పోయిన భావం కలుగుతుంది. తనకు తృప్తి కావాలంటే తిరిగి వ్యవసాయ రంగంలో అడుగు పెట్టాల్సిందేనని గ్రహించి వ్యవసాయరంగంలో అడుగు పెట్టడం జరిగింది. తరువాత కుటుంబంలో జరిగిన కొన్ని పరిణామాల వలన తన సమయాన్ని మొత్తం పూర్తిగా వ్యవసాయంలో కేటాయించవలసి వచ్చి, సేంద్రియ పద్ధతులు పాటించాలని భావించి గత 6 సంవత్సరాల నుంచి పూర్తి సేంద్రియ పద్ధతులతో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం 9 ఎకరాలలో వరితో పాటు ఒక ఎకరంలో నిమ్మ, ఒక ఎకరంలో ఐదు అంచెల విధానంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తూ సమీకృత వ్యవసాయంలో భాగంగా నాటుకోళ్ళను కూడా పెంచుతూ, నీటికుంటలో వర్షాకాలంలో చేపలు కూడా పెంపకం చేస్తున్నాడు.
నిమ్మ: ఒక ఎకరంలో నిమ్మతోట సాగులో ఉంది. దాని వయస్సు 15 సంవత్సరాలు. కాని గత 6 సంవత్సరాల నుంచి పూర్తి సేంద్రియ పద్ధతులు పాటిస్తూ నిమ్మ మొక్కలను సాగు చేస్తున్నాడు. నిమ్మ తోట సాగు అనుభవంలో కొత్తగా నిమ్మ తోట పెట్టేవారు 18þ18 లేదా 18þ15 అడుగుల దూరం పాటించి నిమ్మ మొక్కలు నాటుకుంటే అనుకూలంగా ఉంటుందని అంటున్నాడు. గుంతలలో బాగా మాగిన పశువుల ఎరువు, వేపపిండి, ఆముదం పిండి, జీవామృతం కలిపిన మిశ్రమాన్ని వేసి మొక్కలు నాటుకోవాలి. తమ పొలంలో నాటు నిమ్మ మరియు బాలాజి రకం నిమ్మ రెండు రకాలు ఉన్నాయి కాని ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు నాటు నిమ్మ రకం అనకూలంగా ఉంటుందని అంటున్నాడు. అవసరాన్నిబట్టి పైపాటుగా అప్పుడప్పుడు మాగిన పశువుల ఎరువు, వేపపిండి, ఆముదపు పిండి, వేరుశనగ పిండిల మిశ్రమాన్ని మరియు ద్రవజీవామృతాన్ని భూమికి అందిస్తుంటాడు. చీడపీడల నివారణకు మరియు మంచి దిగుబడికి గాను వేపనూనె, పుల్లటి మజ్జిగ, నీమాస్త్రం, పంచగవ్య, సప్తధాన్యాంకుర కషాయం, చౌహాన్ క్యూ పద్ధతిలో ఉన్న ం.క. ద్రావణం లాంటి వాటిని అవసరాన్ని బట్టి పిచికారి చేస్తుంటాడు. అన్ని అనుకూలంగా ఉంటే నిమ్మ మొక్కలు నాటిన తరువాత 3వ సంవత్సరం దిగుబడి మొదలయ్యి క్రమంగా దిగుబడి పెరుగుతూ చెట్టు బాగా ఎదిగిన తరువాత ఎకరం నుంచి 100 నుంచి 150 బస్తాల నిమ్మకాయల దిగుబడి పొందవచ్చు. మార్కెట్లో ఉన్న ధరలను బట్టి ఆదాయం వస్తుందని వివరించాడు.
ఐదు అంచెల పద్ధతి: ఒక ఎకరం పొలాన్ని ఐదు అంచెల పద్ధతికి కేటాయించి 50 అడుగుల పొడవు మరియు వెడల్పును ఎంపిక చేసుకున్నాడు. ప్రస్తుతం మామిడి, కొబ్బరి, అరటి, మునగ, జామ లాంటి మొక్కలు నాటించాడు. మిగతా మొక్కలు మరియు వివిధ రకాల కూరగాయలు త్వరలో మొదలు పెట్టబోతున్నాడు. ఐదు అంచెల పద్ధతికి గాను అడుగు ఎత్తులో బెడ్లు చేసుకొని బెడ్లపై మొక్కలు నాటించాడు. నీటి వసతి కొరకు కాలువలు ఉన్నా కాని వివిధ రకాల మొక్కలకు నీటి అవసరాలు వివిధ రకాలుగా ఉంటాయి కాబట్టి నీటిని కాలువ ద్వారా కాకుండా డ్రిప్పుద్వారా అందిస్తే అనుకూలంగా ఉంటుందని శ్రీనివాసరావు అంటున్నాడు.
నాటుకోళ్ళు: సేంద్రియ సాగులో ఆర్థికంగా ఫలితాలు రావాలంటే సమీకృత వ్యవసాయం సరైన దారి అని తెలుసుకున్న శ్రీనివాసరావు నాటుకోళ్ళ పెంపాకన్ని కూడా చేపట్టాడు. మొదట 50 కోళ్ళతో మొదలయితే సంవత్సరంలో 500 కోళ్ళు అయినాయి. అందులో 100 కోళ్ళు అమ్మగా ప్రస్తుతం 400 కోళ్ళు ఉన్నాయి. ఈ కోళ్ళన్నీ కూడా ఐదు అంచెల పద్ధతి వేసిన పొలంలో తిరుగుతూ ఉంటాయి. అదనంగా ఆవుల పేడ మరియు కొంత దాణాని కూడా అందిస్తున్నాడు. సక్రమంగా చేసుకుంటే నాటుకోళ్ళు మంచి ఆదాయ వనరే… కానీ కోళ్ళకు వచ్చే వ్యాధులపై సరిగ్గా అవగాహన లేకపోవడం, పొలం మొత్తాన్ని ఒంటరిగా చూసుకోవలసి రావడము, బయట నుంచి వచ్చే వారి వలన కోళ్ళకు జబ్బులు వచ్చే అవకాశాలు ఉండడము లాంటి కారణాల వలన తాను సక్రమంగా కోళ్ళ పెంపకాన్ని చేయలేకపోతున్నానని అంటూ, ఒక వ్యక్తిని కోళ్ళ పెంపకానికి కేటాయించగలిగితే స్వయం ఉపాధిగా కోళ్ళ పెంపకం మంచి అవకాశం అని శ్రీనివాసరావు అంటున్నాడు.
వీటన్నింటితోపాటు ఎకరం పొలం అంటే 200 అడుగుల పొడవు మరియు వెడల్పుతో చెరువు తవ్వించాడు. ఆ చెరువు తవ్విన మట్టిన ఐదు అంచెల విధానంలో బెడ్లకు ఉపయోగించాడు. చెరువు కట్ట మీద కొబ్బరి మొక్కలు మధ్యలో ఎర్రచందనం, శ్రీగంధం మొక్కలతో పాటు పైనాపిల్ మొక్కలు, వివిధ రకాల కూరగాయ మొక్కలు సాగు చేస్తున్నాడు. వేసవి కాలంలో చెరువులో నీటిని పంటల సాగుకు వినియోగిస్తూ వర్షాకాలంలో చెరువులో బాగా నీరు ఉన్నప్పుడు కొన్ని చేపలను కూడా పెంపకం చేస్తుంటాడు. వీటన్నింటితో పాటు గట్ల మీద అవకాశం ఉన్న చోట కంది మొక్కలు నాటి వచ్చిన దిగుబడిని సొంతంగా ఉపయోగించుకోవడముతో పాటు మిగిలిన వాటిని బంధువులకు, తెలిసిన వారికి అమ్మి అదనపు ఆదాయం గడిస్తున్నాడు.
సేంద్రియ సాగుకు ముఖ్య వనరు అయినటువంటి దేశీయ జాతి ఆవులను నాలుగింటిని పోషిస్తూ వాటి వ్యర్థాలను పంటల సాగులో వినియోగిస్తున్నాడు. పాలను అమ్మకం చేయకుండా సొంతానికి ఉపయోగించుకోగా మిగిలిన పాలను పుల్లటి మజ్జిగ తయారు చేపించి పంటలకు పిచికారి చేస్తుంటాడు. మరిన్ని వివరాలు 73374 53266 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొన్నట్లయితే గతంలో మహిళలను పలు రకాల వివక్షలకు బలిచేశారు. మహిళలను అన్ని విధాలుగా అణచి వేశారు. ఇంకా కొన్ని ప్రాంతాలలో ఇప్పటికి కూడా మహిళలను అణచి వేస్తూనే ఉన్నారు. మహిళలను బానిసలుగా, ఆటబొమ్మలుగా, విలాస వస్తువులుగా చూసిన సమాజం మనది. అప్పట్లో గ్రంథాలు వ్రాసినవారు అందరూ కూడా మగవారే కాబట్టి ఆడవారిని 'అణచి వేయడానికి, మగవాడు చెప్పినట్లు ఆడటానికి మాత్రమే ఆడమనిషి పుట్టింది' అనే విధంగా గ్రంథాలలో వ్రాశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకొంతమంది అయితే ఆడమనిషి పిల్లలను కనే యంత్రం మరియు భర్తకు సేవ చేసే పనిమనిషి మాత్రమే అన్నట్లు ప్రవర్తించారు. ఇంకా కూడా కొన్ని చోట్ల అలానే ప్రవర్తిస్తున్నారు. దానిని అవకాశంగా తీసుకుని కొంతమంది మగవారు మహిళలకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకపోగా చులకనగా చూడటం మొదలయ్యింది. ఆడమనిషి ఇల్లు దాటి బయటికి వచ్చిందంటే హేళనగా చూడటం, డబ్బు సంపాదన కోసం ఇల్లుదాటి ఆడమనిషి బయటకు వచ్చింది కాబట్టి డబ్బులు ఆశచూపి లొంగదీసుకోవచ్చు అనే భావనను మనసులో పెట్టుకున్న మగవారు అనేకమంది ఉన్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకొంతమంది మగవారు అయితే ఆడమనిషి కనిపిస్తే అవకాశం ఉంటే గిల్లుదామని, గిచ్చుదామని, ఎక్కడపడితే అక్కడ పట్టుకుందామని ప్రయత్నించే మగవారు బస్పులో, రైళ్లలో, రద్దీ ప్రదేశాలలో, ఆఫీసులలో ఉంటూనే ఉంటారు. ఇలాంటి పనికిమాలిన చేష్టలు చేస్తూ మహిళలను ఏడిపించే మగవారు తమ అక్కకో, చెల్లికో, కూతురుకో, భార్యకో ఇలాంటి పరిస్థితులే వేరే మగవారి నుంచి ఎదురైతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించగలిగితే ఎలాంటి వెధవ పనులు చేయరు. ఇలాంటి మగవారు పైకి మాత్రం నీతులు చెబుతూ బయటకు మాత్రం మంచిగా నటిస్తూ ఆడమనిషిని విలాస వస్తువుగానే చూస్తూ అణగదొక్కాలనే చూస్తుంటారు. ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత సమాజంలో కూడా కొంతమంది అభ్యుదయ భావాలు గల మగవారు ఆదర్శంగా ఆలోచించి ఆడమనిషి కూడా మగవారితో సమానము అని భావించి వారికి అవకాశం ఇస్తే మగవారిలాగానే అన్ని రంగాలలో ముందడుగు వేయగలరని నమ్మి ఆడవారి ప్రతిభని సమాజానికి తెలియచేయాలనుకునే జ్ఞానవంతులు తమ కుటుంబంలోని మహిళలకు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను ఇచ్చి ప్రోత్సహిస్తూ ఆడవారిని ఎదగనిస్తూ సరైన సహకారం అందిస్తే మహిళలు ఏరంగంలోనైనా, చివరకు వ్యవసాయ రంగంలో కూడా రాణించగలరని నిరూపిస్తున్నారు. ఈ కోవకు చెందిన అభ్యుదయ భావాలున్న యుగేష్ ఆదర్శంగా ఆలోచించి తన భార్య ఐశ్వర్యను ప్రోత్సహించి వ్యవసాయ రంగంలో అడుగుపెట్టించి అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు సాగటానికి తనవంతు ప్రయత్నాన్ని చిత్తశుద్ధితో చేస్తున్నాడు.
యుగేష్ ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగ బాధ్యతలు కొనసాగిస్తున్న క్రమంలో తన అర్థాంగి ఐశ్వర్య గృహిణి బాధ్యతలు నిర్వహిస్తుంది. ఉన్నత చదువులు చదివిన ఐశ్వర్య తన ఖాళీ సమయాన్ని చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్నకుండీలు లేదా సిరామిక్ పాట్లలో పెట్టి ఆన్లైన్లో అమ్మకం చేయడం మొదలు పెట్టింది. అవి అమ్మకం చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతూ ఉండేది. ఐశ్వర్యకు మొక్కల మీద ఉన్న శ్రద్ధను గమనించిన భర్త యుగేష్ తన భార్యకు ప్రోత్సాహాన్ని అందిస్తే వ్యవసాయ రంగంలో కూడా రాణించగలదని గ్రహించి తాను ఉద్యోగం కొనసాగిస్తూనే ఐశ్వర్యను పంటల సాగులో అదీను సేంద్రియ సాగులోకి ప్రోత్సహించటం జరిగింది.
తమకు సొంత పొలం లేదు కాబట్టి హైదరాబాదు శివారులో ఐదున్నర ఎకరాల భూమిని కౌలుకి తీసుకుని నాలుగున్నర సంవత్సరాలు ఆ భూమిలో వివిధ రకాల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేయడంతో పాటు, నాటు కోళ్ళను కూడా పెంచుతూ నాటు కోడి మాంసం మరియు నాటుకోడిగ్రుడ్లు అమ్మకం చేస్తూ వస్తున్నారు. వీరి నివాసగృహానికి పొలం దూరంగా ఉండటంతో నిర్వహణ ఇబ్బందిగా ఉందని గ్రహించి ఆ పొలాన్ని వదలి వేసి ఇంటి సమీపములోనే 2023వ సంవత్సరం జనవరి నెలలో ఎకరంన్నర పొలాన్ని కౌలుకి తీసుకుని ఆ పొలంలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, కోళ్ళ పెంపకం, స్ట్రాబెర్రీ సాగు మొదలు పెట్టి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం స్ట్రాబెర్రి సాగు మరియు కొన్ని రకాల ఆకుకూరల సాగుతో పాటు నాటుకోళ్ళ పెంపకం కొనసాగుతుంది.
స్ట్రాబెర్రి: అర ఎకరంలో స్ట్రాబెర్రి పంట సాగులో ఉంది. ఇందుకుగాను స్ట్రాబెర్రి మొక్కలను ఒక్కొక్కటి 13/-ల చొప్పున పూణే నుంచి కొనుగోలు చేయడం జరిగింది. దుక్కిలో కోడి ఎరువు, ఆవుల ఎరువు, వర్మికంపోస్టు మిశ్రమాన్ని అందించి అర ఎకరం పొలాన్ని బెడ్లు చేసుకున్నారు. బెడ్కి బెడ్కి మూడు అడుగుల దూరం పాటించి బెడ్లపై మల్చింగ్ షీటు పరచారు. మల్చింగ్ షీటుకు అడుగు దూరంలో బెజ్జాలు చేసుకుని ఆ బెజ్జాలలో మరలా సేంద్రియ ఎరువు మిశ్రమాన్ని అందించి నవంబరు నెలాఖరులో అర ఎకరానికి గాను 5000 మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు ఆరోగ్యంగా లేకపోవడంతో సుమారు 2000 మొక్కలు చనిపోగా మిగిలిన 3000 మొక్కలను పోషిస్తూ వచ్చారు. మొక్కలు నాటిన తరువాత 10 నుంచి 15 రోజుల వ్యత్యాసంలో రెండుసార్లు సేంద్రియ ఎరువుల మిశ్రమాన్ని అందించారు. వారానికి 200 లీటర్ల చొప్పున జీవామృతాన్ని డ్రిప్పు ద్వారా అందిస్తూ వస్తున్నారు. జీవ సంబంధిత కీటకనాశనులను ఒకసారి డ్రిప్పుద్వారా నేలకు అందించారు. వివిధ రకాల చీడపీడల నివారణకు పుల్లటి మజ్జిగ, అగ్నాస్త్రం, గంజి ద్రావణం,, నీమాస్త్రం మొదలగు వాటిని ప్రతి మూడు రోజులకు ఏదో ఒకటి పిచికారి చేస్తూ వస్తున్నారు. వీటన్నింటితో పాటు ఎర పంటలుగా ఆముదము, టమాట మొక్కలు, దీపపు ఎర, లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని పూర్తి సేంద్రియ పద్ధతులు పాటిస్తూ జనవరి మొదటి వారంలో మొదట దిగుబడి పొందగలిగారు. పిబ్రవరి మొదటి వారం వరకు 3000 మొక్కల నుండి 30 కిలోల దిగుబడి పొందారు. పంటను గమనించినట్లయితే ఇంకా 50 కిలోల వరకు దిగుబడి వచ్చేలా ఉంది. కిలో 600/-ల నుంచి 800/-ల వరకు అమ్మకం చేస్తూ వస్తున్నారు. వచ్చిన దిగుబడిని అమ్మటానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు.
నాటుకోళ్ళు: వీరు వ్యవసాయ రంగంలో అడుగుపెట్టినప్పటినుంచి నాటు కోళ్ళను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వీరి దగ్గర సోనాలికా, అసిల్ క్రాస్, వనరాజా, కడక్నాథ్, గిన్నె కోళ్ళు మొదలగు రకాలు అన్నీ కలిపి 250 వరకు ఉన్నాయి. వీటి నుండి ప్రతి రోజు 40 వరకు గ్రుడ్ల దిగుబడి పొందుతూ ఒక్కొక్క గ్రుడ్డును 13 నుంచి 14 రూపాయల వరకు అమ్మకం చేస్తున్నారు. గ్రుడ్లతో పాటు నాటుకోడి మాంసాన్ని కూడా అమ్ముతున్నారు. లైవ్ వెయిట్ అయితే నాటుకోడి కిలో 450/- లకు, కడక్నాథ్ కిలో 750/-లకు, కోడిమాంసం అయితే నాటుకోడి మాంసం కిలో 650/-లకు, కడక్నాథ్ కోడి మాంసం కిలో 850/-లకు అమ్మకం చేస్తున్నారు. నెలకు 70 నుంచి 80 కిలోల మాంసం అమ్మకం చేస్తున్నారు.
రెండు ఆవులను కూడా పోషిస్తూ వాటి వ్యర్థాలను పంటల సాగుకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని రకాల ఆకుకూరలు సాగులో ఉన్నాయి. భవిష్యత్తులో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరల సాగుతో పాటు ఇంటిపంట నిర్వహించే వారికి అవసరమయిన మొక్కలను సరఫరా చేయడానికి వీలుగా నర్సరీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. భర్త యుగేష్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఐశ్వర్య అతి క్లిష్టమైన సేంద్రియ వ్యవసాయ రంగంలో అడుగుపెట్టి పట్టుదలతో ముందుకు సాగుతూ కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లభిస్తే మహిళలు వ్యవసాయ రంగంలో కూడా రాణింగలరని నిరూపిస్తున్నారు. మరిన్ని వివరాలు 7671075270 / 6302308300 నెంబర్లకు ఫోను చేసి తెలుసుకోగలరు.
దీపపు ఎర : స్ట్రాబెర్రి పంటకు ఒకానొక సమయంలో పొగాకు లద్దె పురుగు విపరీతంగా ఆశించింది. ఆ పురుగు నివారణకు వివిధ రకాల కషాయాలు, జీవ సంబంధిత పురుగు మందులు పిచికారి చేయడంతో పాటు భవిష్యత్తులో ఆ సమస్య రాకుండా ఉండటానికి దీపపు ఎరలను ఏర్పాటు చేశాము. బల్బు క్రింద బక్కెట్లు ఏర్పాటు చేసి బక్కెట్లో 70% నుంచి 80% నీటిని నింపి బక్కెట్ పైన బల్బును వేలాడదీసి సాయంకాలం 6 గంటల తరువాత బల్పును వెలిగించి రాత్రి ఒంటి గంటకు బల్బు ఆగిపోయేలా ఏర్పాటు చేసుకున్నాము. ఈ విధంగా చేయడం వలన తరువాత పొగాకు లద్దె పురుగు సమస్య స్ట్రా బెర్రి పంటకు రాలేదు అని ఐశ్వర్య వివరించారు.
కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి
ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి. మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలలో మహిళల సహకారం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాంటి వ్యతిరేక పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత సమాజంలో భర్త సహకారంతో ఐశ్వర్య వ్యవసాయ రంగంలో అదీను సేంద్రీయ వ్యవసాయ రంగంలో అడుగు పెట్టి వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. ఆడవారిని బయటకు పంపడానికే వ్యతిరేకించే పరిస్థితులనుంచి, ‘మగవారితో పోల్చుకుంటే ఆడవారు ఎందులోనూ తక్కువ కాదు’ అని అనేక మంది మహిళలు నిరూపిస్తున్నారు. సమాజంలో బుద్ధి లేని మగవారి నుంచి ఎదురయ్యే అనేక సమస్యలను ఎదుర్కొంటూ వివిధ రంగాలలో మహిళలు రాణించగలుగుతున్నారు. ఏ రంగంలో మహిళలు విజయం సాధించినా అందుకు ప్రధాన కారణం తమ కుటుంబంలోని పురుషుల సహకారం, ప్రోత్సాహం అందడం వలననే సాధ్యమవుతుంది. అన్ని రకాలుగా తమ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా తన భర్త యుగేష్ నుంచి మంచి సహకారం, ప్రోత్సాహం అందడం వలన నేను ఈ రంగంలో ముందుకు సాగ గలుగుతున్నానని తన కుటుంబసభ్యులకు ఐశ్వర్య కృతజ్ఞతలు తెలియజేశారు.
కాడి, మేడి బాగుకోసం నిరంతరం తపించే రైతు సేవాతత్పురుడు తుమ్మల నాగేశ్వరరావు.
సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నా ఏనాడూ వ్యవసాయం వదలలేదు. ఆ మూలాలు మరవకపోవటం విశేషం. నరనరాన మట్టితో మమేకమైన జీవిత వాసనలు జీర్ణించుకున్నారు. రాజకీయ జీవితంలో ఆటుపోట్లు ఉన్నా, కష్ట సమయంలో వ్యవసాయంలో సేదతీరారు. దానిలో పండిపోయి రైతు శాస్త్రవేత్త కాగలిగారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులకు తన సంప్రదాయ వారసత్వ విజ్ఞానం జోడించి మార్కెట్కు ధీటుగా పలు పంటలు సాగు చేస్తూ తోటి రైతులకు మార్గదర్శిగా నిలిచారు. ఆధునిక జీవనశైలికి భిన్నంగా గ్రామీణ ప్రాంత రైతు జీవితాన్నే కోరుకున్నారు. రైతు జీవితాన్ని పూర్తిగా స్వేచ్ఛగా ఆస్వాదించారు. ఏనాడూ రైతు స్వభావాన్ని వదులు కోలేదు. స్వేదవేదాన్ని ఔపోసన పట్టారు. దాన్ని ఆత్మ సౌందర్యాన్ని వంట బట్టించుకుని ఆ పరిమళ భరితమైన సుగంధాన్ని నలుగురికి పంచారు. ఏడు పదుల వయసులో మరలా వ్యవసాయ మంత్రిగా సేవచేసే అవకాశం దొరికింది. తనకు ఇష్టమైన శాఖలో తనదైన ముద్ర వేసేందుకు ప్రణాళికా బద్ధంగా పనిచేయాలనే దృఢసంకల్పంతో తుమ్మల నాగేశ్వరరావు ముందుకు సాగుతూ ఉన్నారు. రైతులు కూడా తోటి రైతు నాయకత్వంలో తమకు కష్టనష్టాలు ఇక ఉండవనే భరోసాతో ఉన్నారు. దీనికి సాక్ష్యంగా మూడు రాష్ట్రాల ఆయిల్పామ్ రైతులు వారి సాగు సమస్యలు గురించి చర్చించటానికి రావటాన్ని ఉదహరించవచ్చు.
పామాయిల్.. వంట నూనెగా సుపరిచితం. పామాయిల్ చరిత్ర చూస్తే ఏడాదికి మన దేశం దిగుమతి చేసుకునే పామాయిల్ చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంది. 2022 – 23 ఏడాదికిగాను మన దేశం 164 లక్షల టన్నుల వంట నూనెలు దిగుమతి చేసుకుంటే అందులో 59 శాతం పామాయిల్దే సింహభాగం. ఏడాదికి మన దేశం లక్షా 38 వేల కోట్ల రూపాయల విలువైన వంట నూనెలు దిగుమతి చేసుకుంటే అందులో 85 వేల కోట్లు పామాయిల్ వాటా. అంతలా డిమాండ్ ఉన్న పామాయిల్ చరిత్ర చూస్తే 5 వేల సంవత్సరాల క్రితం పామాయిల్ సాగు మొదట ఆఫ్రికా దేశాల్లో మొదలైంది. దక్షిణ ఆఫ్రికాలో మొదలైన పామాయిల్ సాగు ప్రపంచమంతా విస్తరించింది. పారిశ్రామిక విప్లవంతో యంత్రాల కందెనగా పామాయిల్ వాడేవారు. దాంతో బ్రీటీష్ వ్యాపారులచే ఆఫ్రికా నుంచి పామాయిల్ ఎగుమతులు మొదలైయ్యాయి. ఇండోనేషియా, మలేషియా, నైజీరియా, ధాయ్లాండ్ దేశాలు పామాయిల్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి.
ఇక మన దేశంలో పామాయిల్ సాగు విషయానికోస్తే 1886లో కోల్కతాలోని నేషనల్ రాయల్ బొటానికల్ గార్డెన్లో ఆయిల్పామ్ను పరిచయం చేశారు. మహారాష్ట్ర అసోషియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్సెస్ పూణె వారు కాలువ గట్లు, ఇంటి ఆవరణ, అటవీ భూముల్లో 1949 నుంచి 1959 వరకు నాటారు. తరువాత కేరళలో ప్లాంటేషన్ ఆఫ్ కేరళ లిమిటెడ్ ఆధ్వర్యంలో, ఆ తరువాత అండమాన్ ఫారెస్ట్ అండ్ ప్లాంటేషన్ ఆధ్వర్యంలో 1984 వరకు పెద్దఎత్తున నాటారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రకారం దేశంలో 22 రాష్ట్రాల్లో 27 లక్షల హెక్టార్లల్లో ఆయిల్ పామ్ సాగుకు అవకాశాలున్నట్లు నివేదిక రూపొందించారు. దేశంలో ఆయిల్ పామ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, గుజరాత్, చత్తీస్ ఘడ్, మిజోరం, అస్సాం, ఒడిషాలో సాగు చేస్తున్నారు. విస్తీర్ణంలో మొదటి స్థానం ఏపీ దే కావటం విశేషం.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఆయిల్ పామ్ సాగుకు బాటలు ఎన్టీఆర్, తుమ్మల నాగేశ్వరరావు కలసి వేశారని చెప్పవచ్చు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్న సమయంలో నాటి ఖమ్మం జిల్లాలో పెదవేగి నుంచి ఓ ఆయిల్ పామ్ మొక్క తెప్పించి నాటి అప్పుడు జిల్లా మంత్రిగా ఉన్న తుమ్మల ఆయిల్ పామ్ సాగుకు శ్రీకారం చుట్టారు. దీని సాగుకు ఎకరంలో 57 మొక్కలు నాటాలి. తెలంగాణలో సబ్సీడీ మీద ఉద్యాన శాఖ వారు మొక్కలు అందిస్తారు.
నాలుగు సంవత్సరాల వరకు రాయితీల రూపంలో ఎకరాకు 50వేలు రైతులకు అందుతాయి. మొక్కలు పాతిక నుంచి నలభై సంవత్సరాల పాటు దిగుబడి ఇస్తాయి. నాలుగో ఏట నుంచి పంట దిగుబడి వస్తుంది. అంతర పంటలుగా కోకో, జాజికాయ తదితర ఉద్యాన పంటలు సాగు చేయవచ్చు. దిగుబడి మొదలైన తరువాత నెల నెల ఆదాయం ఉంటుంది. గత ఏడాది టన్ను గెల ధర 20 వేల వరకు పలికింది.
గతంలోకి తొంగి చూస్తే ఆయిల్ పామ్ సాగుతో రైతును రాజు చేసిన ద్వయం ఎన్టీఆర్, తుమ్మల అని చెప్పవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు తెలంగాణలో తొలిసారిగా ఆయిల్పామ్ సాగుకు శ్రీకారం చుట్టిన ఘనత నేటి మంత్రి తుమ్మల కావటం విశేషం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయిల్పామ్ తొలి మొక్కను తొలుత తన వ్యవసాయ క్షేత్రం దమ్మపేట మండలం గండుగులపల్లిలో నాటి తనలో ఉన్న అభ్యుదయ రైతును వెలికితీసి పట్టం కట్టారు. తుమ్మల ప్రేరణతో మరికొంత మంది ఔత్సాహిక రైతులు ఆయిల్పామ్ సాగు చేపట్టారు. అలా మొదలైన ఆయిల్పామ్ సాగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 50 వేల ఎకరాలకు పైగా సాగు చేయటం విశేషం. అశ్వారావుపేటలో ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెరిగింది. ఆయిల్పామ్ సాగుకు బాటలు వేసిన తుమ్మల కేసీఆర్ క్యాబినేట్లో మంత్రిగా ఉన్న సమయంలో దమ్మపేట మండలం నూతన ఆయిల్పామ్ ఫ్యాక్టరీ నెలకొల్పారు. దాంతో రైతులకు ఇది వరంగా మారింది. వ్యవసాయం చేయడమే కాదు తోటి రైతులను రాజుగా మార్చి తెలంగాణ వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు క్యాబినేట్లో ఆమోదం చేయించి తుమ్మల చరిత్రలో నిలిచారు. వారిలో రైతు సేవా తత్పరతకు ఇది నిలువెత్తు నిదర్శనం.
ఇప్పుడు గెల ధర 12 వేలుగా ఉంది. ఒక ఉద్యమస్ఫూర్తితో తెలంగాణలో 9 జిల్లాలకు ఆయిల్పామ్ సాగు విస్తరించింది. వేల ఎకరాల నుంచి లక్షల ఎకరాలకు పెరిగింది. గెల ధరలు పడిపోవటంకు దిగుమతుల సుంకం 17.5 నుంచి 12.5 శాతంకు తగ్గించటం కారణం. మరో వైపు సాగు వ్యయం పెరగటం ఆందోళన కలిగించే అంశం. ఆయిల్ పామ్సాగుకు సంభందించి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం అందరూ తుమ్మలనే ఎంచుకుని, వారిలో ఆప్త బంధువును చూసుకోవటం తుమ్మల మీద రైతులకు ఉన్న గురి, నమ్మకం తెలియచేస్తున్నాయి. ఈ క్రమంలో జుఆ ం|ఉఓజూఈ చైర్మన్ రాఘవరావు మంత్రిని కలిసి రైతుల కోసం కలసి రాజకీయాలకు అతీతంగా సాగుదాం అని పిలుపు ఇవ్వటం, దానికి మంత్రి తుమ్మల సానుకూలంగా స్పందించి అందరం కలసి కేంద్ర రైతు వ్యతిరేఖ విధానాలకు వ్యతిరేకంగా పోరాడడం జరుగుతుందని చెప్పటం విశేషం. ఇది తుమ్మల పట్ల రైతులకు ఉన్న విశ్వసనీయతకు నిజాయితీకి నిర్భీతికి లభిస్తున్న ఆదరణ అని చెప్పక తప్పదు.
మరీ ముఖ్యంగా తుమ్మల రైతును మహారాజు చేయటం కోసం, యువత పొలం బాట పట్టడం కోసం, వ్యవసాయం లాభసాటి వ్యాపకం చేయటం కోసం అహరహం శ్రమించి అందరి సహకారంతో ఆచరణతో విజయాలు సాధించేవరకు ఉమ్మడిగా ఒక్కటిగా రైతే మంత్రంగా నడుద్దామని పిలుపు నివ్వడం ఒక మంచి పరిణామంగా భావించవచ్చు. భవిష్యత్లో రైతుకు, వ్యవసాయ సమాజానికి తుమ్మలే ఒక ఆశాకిరణంగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు విరజిమ్మేలా కృషి చేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఎటువంటి అనుమానం అక్కరలేదు. సందేహపడలిసిన అవసరం లేదని ఘంటాపధముగా చెప్పవచ్చు.
పాడి రైతులు సాధారణంగా ఎదుర్కొనే సమస్యలలో ముఖ్యమైనది పాల ఉత్పత్తి తగ్గిపోవడం! ఇందుకుగల కారణాలను తెలుసుకుని సకాలంలో దిద్దుబాటు చర్యలు తీసుకొనకపోతే పాల ఉత్పత్తి మరలా పూర్వస్థితికి పెరిగే అవకాశాలు మరింతగా తగ్గుతాయని ప్రతి పాడి రైతూ గ్రహించాలి. ఇందుకు ప్రతి పాడి పశువు యొక్క రోజువారీ (పూటవారీ) పాల ఉత్పత్తి మరియు వీలైతే వెన్న శాతాలను రికార్డు చేసుకునే అలవాటు చేసుకోగలిగితే మరింత మంచిది. ఈ రికార్డుల వల్ల పశువును విక్రయించినప్పుడు, కొనుగోలు చేసినప్పుడు సరియైన సమాచారం వల్ల పశువులకు మెరుగైన ధరలు పొందే అవకాశాలు ఉండగలవు.
పాల ఉత్పత్తి నిలిచిపోయినా, తగ్గిపోయినా ఆస్థితిని ‘ఎగలెక్షియా’ అని అంటారు. పాల ఉత్పత్తి తొలి మూడు ఈతలలో క్రమేపీ పెరుగుతూ ఆ తర్వాత 4-5 ఈతల వరకు స్థిరంగా అదే థలో కొనసాగి, వయసు మీరినప్పుడు క్రమేపీ తగ్గిపోతుంది. పాల దిగుబడి ఈనిన తొలి మూడు నెలల్లో క్రమంగా పెరిగి, ఆ తర్వాత 3-4 నెలలు నిలకడగా ఉండి, చూడి ఆఖరిథ చేరే నాటికి క్రమక్రమంగా తగ్గిపోతుంది. మంచి పాడి పశువు ఎక్కువ రోజులు గరిష్ట స్థాయిలో పాలను అందిస్తుంది. గరిష్ట స్థాయిలో బహు కొద్ది రోజులు మాత్రమే పాలనిచ్చి, ఆ తర్వాత వేగంగా దిగుబడిని తగ్గిస్తే అది లాభదాకమైన పాడి పశువు కాకపోవచ్చును. సాధారణంగా ఈ విధంగా వేగంగా ఉత్పాదక శక్తిని కోల్పోయే పశువులే ఎక్కువగా సంతలకు విక్రయానికి వస్తూ ఉంటాయి. ఈ విషయంలో పశువుల కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి.
పాల ఉత్పత్తి చాలా సున్నితమైన జీవన ప్రక్రియ. వాతావరణం, మేత, నిర్వహణ, మానసిక వత్తిడి (దూడను కోల్పోవటం) అలవాటు పడిన నిర్వాహకుడు దూరం కావటం వంటి అనేక ప్రతికూలతలవల్ల కలిగే వత్తిళ్లు (స్ట్రెస్లు) పాల ఉత్పత్తితో పాటు చేపును కూడా తగ్గిస్తాయి.
ఎదకు వచ్చే సమయంలోనూ, చూడిథలోనూ పాల ఉత్పత్తికి దోహదపడే హార్మోన్ల స్థాయిలలో జరిగే మార్పులు కూడా పాల ఉత్పత్తిని తగ్గిస్తాయి. గర్భస్థ స్థితిలో పాల ఉత్పత్తికి అవసరమ్యే ప్రోటీన్లు, చక్కెరలు, మినరల్స్ మరియు విటమిన్స్ వంటి ధాతువులు గర్భాశయ అభివృద్ధికి మరియు గర్భస్థ పిండం ఎదుగుదలకు తరలిపోవుట వల్ల పాల ఉత్పత్తి క్షీణిస్తుంది. అనుభవం లేని కొందరు నిర్వాహకులు ఎదవల్ల తెల్లవారుఝామున ఎదలక్షణాలలో భాగంగా అరుస్తూ వుంటే, వాస్తవాన్ని గ్రహించకుండా నిద్రాభంగం కలిగించిందని హింసిస్తే, ఆ బాధ, ఆందోళనల వల్ల కూడా పాల ఉత్పత్తి మరింతగా క్షీణించవచ్చును.
చూడి ఆఖరి రెండు నెలలు పొదుగు వృద్ధికి కీలకమైనవి. ఈ థలో పాల గ్రంథులు, పాలనాడులు, పొదుగులోనే రక్త సరఫరా వ్యవస్థ వృద్ధి చెందవలసి ఉంటుంది. ఇందుకు అవసరమైన అదనపు పోషక పదార్థాలన్నీ పశువుకు అందటంతో పాటు వాటిని సమర్ధవంతంగా వినియోగించుకోగలిగి ఉండాలి. కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం వంటి ఖనిజాలు, విటమిన్ డి వంటి ఇతర ధాతువులు కూడా సరియైన పరిమాణంలోనూ, దామాషాలోనూ లభ్యమైనప్పుడే పశువుకు ఆశించిన స్థాయిలో వినియోగపడగలవు.
పొదుగు నుండి సులువుగా పాలు బైటకు రావడానికి వీలుగా రొమ్ములు నిక్కపొడుచుకుని వుండే స్థితిని చేపు అంటారు. దూడరొమ్ముల్ని కుడిచినప్పుడు, రొమ్ములు పొదుగు మరియు మడి భాగాలను సున్నితంగా ఆహ్లాదం కలిగించే విధంగా నిమిరినప్పుడు, ఈ స్పర్శ స్పందనల వల్ల మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుండి విడుదలయ్యే ఆక్సిటోసిన్ అనే హార్మోనువల్ల రొమ్ములు నిక్కపొడుచుకుని పాలనాళాలు తెరుచుకుని పాల విడుదల సులభతరం కాగలదు. ఈ విధంగా ఏర్పడ్డ చేపుథ సాధారణంగా 4 నుండి 6 నిమిషాలు మాత్రమే కొనసాగి, ఆ తర్వాత క్రమంగా తగ్గిపోతుంది. పశువు ఆందోళనలకు, చికాకులకు లోనైతే ఇంతకంటే ముందుగానే చేపు ముగిసిపోయి, పాలను ఎగచేపుకోవచ్చు. కొన్ని తల్లులు తెలివిగా మధ్యలోనే ఎగచేపుకుని ఆ తర్వాత వదిలే దూడకు ఇవ్వడానికి మరల చేపుకు రావచ్చును. అందుకే పొదుగులోని మొత్తం పాలను 4-5 నిముషాలలో పిండుకోగల్గాలి. పాలను పిండే పద్ధతి పశువుకు బాధ కల్గించకుండా ఆహ్లాదంగానూ పొదుగుభారాన్ని తగ్గించే విధంగానూ వుండాలి. పాలు పిండే సందర్భంలో ఈగలు, దోమలు, గోమార్ల వల్ల అసౌకర్యాలు, సమీపంలో రణగొణధ్వనుల చికాకు లేకుండా చూసుకోవాలి. పొదుగు, రొమ్ముల మీద ఏర్పడ్డ స్వల్పగాయాలు, పుండ్లు, పగుళ్లు సైతం చేపుపై ప్రభావాన్ని చూపగలవు.
బాలింత పశువుల్ని, రవాణాలో పశువుల్ని ఎక్కువ దూరాలు నడిపించి వత్తిడి కలిగించినా, ఎండ, చలి వంటి తీవ్ర వాతావరణ ప్రతికూలతలు ఏర్పడినా, కొన్ని పూటలు లేదా రోజులు పాలుపిండటం ఆపినా, పాల ఉత్పత్తి క్షీణిస్తుంది. రోజులో 30 లీటర్లకంటే ఎక్కువ పాలనిచ్చే ఆవులు, రోజుకు 20 లీటర్ల కంటే ఎక్కువగా పాలిచ్చే గేదెలకు వీలైతే మూడుసార్లు కూడా పాలు పిండటం మంచిది. ఇందువల్ల ఖాళీ అయిన పొదుగులో మరో 10-15 శాతం అదనంగా పాలు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి.
వివిధ రకాల అనారోగ్యాలలో మనకు కనిపించే ప్రథమ లక్షణం- పాల ఉత్పత్తి తగ్గిపోవటం! అజీర్తి, కడుపు ఉబ్బరం, పారుడు, పొదుగువాపు, గర్భవాతం వంటి సందర్భాలలో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఎదకు వచ్చిన పశువును చూడి కట్టించక పోయినా, ఏ కారణం వల్లనైనా చూడి నిలవక పోయినా, అండాశయం నుండి తయారైన కార్పస్ లూటియం అనే తాత్కాలిక గ్రంథి స్థిరపడిపోయి, దాని నుండి విడుదలయ్యే హార్మోను పాల ఉత్పత్తితో పాటు చేపును కూడా నిరోధించవచ్చును. దీనినే మనం నాలుగుశేర్లు లేదా నాలుక సేర్లు అని వ్యవహరిస్తారు. ఈ సమస్యను మంచి పోషణ మరియు కొన్ని బహుమూలికా మందులతో సులువుగానే పరిష్కరించుకోవచ్చును. అవసరమైతే నిపుణుడి సహాయం పొందాలి. రక్తంలో కాల్షియం శాతం తగ్గిపోయే పాలజ్వరం, చక్కెర శాతం తగ్గే కీటోసిస్ వంటి అనారోగ్య స్థితుల్లో పాలఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. మెయ్య దిగటం, ఈనిన తర్వాత మాయ గర్భంలోనే 24 గంటలకు మించి నిలిచిపోవటం వంటి సందర్భాలలో కూడా పాల ఉత్పత్తి తగ్గిపోతుంది.
పాల ఉత్పత్తి – చేపులపై కొన్ని మందుల ప్రభావం!
వివిధ ఆరోగ్య సమస్యలకు వాడే యాంటిబయోటిక్స్, బాధనివారణ మందులు పాలఉత్పత్తి మీద ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. ముఖ్యంగా నోటి ద్వారా వాడే యాంటిబయోటిక్స్, సల్ఫామందుల వల్ల జీర్ణశక్తికి దోహదపడే పొట్టలోని మేలు చేసే సహజమైన బాక్టీరియా నశించుట వల్ల జీర్ణశక్తి తగ్గి పాల ఉత్పత్తి క్షీణిస్తుంది. కొన్ని సందర్భాలలో వాడే కార్టిజోన్ ఇంజక్షన్ల వల్ల పాల ఉత్పత్తి పూర్తిగా క్షీణించే పరిస్థితి కూడా రావచ్చు. ఇటువంటి కార్టిజోన్ మందుల్ని వాడక తప్పని పరిస్థితి ఏర్పడితే వాటిని పశువైద్యుని సూచనల మేరకు పరిమితంగా నిర్ణీత మోతాదులో మాత్రమే వాడి, థలవారీగా తగ్గిస్తూ నిలిపివేయాలి.
పొదుగు వాపు వ్యాధిని సకాలంలో గుర్తించి పూర్తిగా అదుపు చేయకపోతే పొదుగులోని పాలగ్రంథులు నశించి, వాటి స్థానంలో పీచు కండపెరిగి పొదుగు శాశ్వితంగా ధ్వంసమైపోయే ప్రమాదం ఉంది. గత ఈత ముగింపు థలో పొదుగులో నిలిచిపోయిన పాలలోకి ప్రవేశించిన సూక్ష్మక్రిములు, చూడి థలో మరింతగా వృద్ధి చెంది క్రమక్రమంగా పాలగ్రంథుల్ని ధ్వంసం చేసే ముప్పు ఉంటుంది. దీనిని నివారించడానికి ఈతలో ఆఖరిసారి పాలు పిండిన తర్వాత పొదుగు లోపలకు దీర్ఘకాలం పనిచేసే సమర్ధవంతమైన యాంటిబయోటిక్ను ఎక్కించటం మంచిది. దీనినే ‘డ్రై కౌథెరపీ’ అని అంటారు.
ట్రిపనసోమియాసిస్, బెబీసియోసిస్, థెయిలీరియోసిస్, మైకోప్లాస్మోసిస్ వంటి వ్యాధి కారక క్రిములు రక్తంలో ఉండి పైకి వ్యాధి లక్షణాలను కలిగించకపోయినప్పటికీ, ఈ క్రిములు రక్తకణాలపై చూపే విధ్వంస పరిణామాలు, విడుదల చేసే విషపదార్థాలవల్ల కూడా పాల ఉత్పత్తి తగ్గిపోవచ్చును. సకాలంలో సూక్ష్మదర్శినితో రక్తపరిశీలన చేసి ఈ వ్యాధి క్రిములను పూర్తిగా అదుపు చేయవలసి ఉంటుంది.
పోషణ: పశువు కనీస జీవిత అవసరాలను తీర్చుటకు, అది ఉత్పత్తి చేసే పాల పరిమాణంతో పాటు వెన్నశాతం, చూడిదైతే గర్భస్థ పిండం ఎదుగుదలతోపాటు గర్భం-పొదుగు, కటి అవయవాల వృద్ధికి అనుగుణంగా అదనంగా పరిపూర్ణమైన ఆహారాన్ని అందించవలసి ఉంటుంది. లేని ఎడల ఈ అత్యవసర అవసరాలకు తరలిపోయే పోషకాలు, పాల ఉత్పత్తికి లభ్యంకాక పాలఉత్పత్తి క్షీణించవచ్చును.
పశువుకు లభించే పచ్చిగ్రాసాలలో రెండు వంతులు చిక్కుడు జాతికి చెందని పారా నేపియర్ వంటి గ్రాసాలు రెండు పాళ్లు, చిక్కుడు జాతికి చెందిన బెర్సీమ్, ల్యూసర్న్ వంటి గ్రాసాలు ఒక పాలు, ముక్కలు చేసి రోజుకు 35 నుండి 45 కిలోలు పశువు శరీర తూకాన్ని బట్టి అందించాలి. రోజుకు 5-6 లీటర్ల పాల ఉత్పత్తికి ఇవి మాత్రమే సరిపోగలవు. అయితే నాణ్యమైన మేతలు అంతగా లభ్యం కానందున సుమారు 16 శాతం ప్రోటీన్లు, 65-70 శాతం ఇతర పోషకాలతో పాటు, తగినన్ని ఖనిజాలు, విటమిన్లు కలిగిన సమీకృత దాణాలను, జీవన మనుగడకు పశువుకు 1.0 నుండి 1.5 కిలోలు. అదనంగా ప్రతి కిలో ఆవుపాలకు 2.0 కిలోలు గేదెపాలకు 2.5 కిలోలు చొప్పున మేపవలసి ఉంటుంది. మేతల్ని-దాణాలను ఆకస్మికంగా మార్పు చేయకూడదు. ఈ మార్పు క్రమక్రమంగా థలవారీగా చేస్తే మంచిది. దాణాలో వంట సోడా 30-50 గ్రాములు కలిపి 4-5 రోజులు వాడవచ్చు. మునగ ఆకు, అవిసె ఆకు, బొప్పాయి కాయల్ని మేపుట ద్వారా కూడా ప్రయోజనం ఉంటుంది.
పాలదిగుబడి పునరుద్ధరణ: సమస్యను గుర్తించిన వెంటనే నష్ట నివారణ చర్యల్ని చేపట్టాలి. పోషణ, నిర్వహణ లోపాలను వెంటనే సరిదిద్దాలి. కొన్ని ప్రసిద్ధ ఆయుర్వేద ఉత్పత్తి సంస్థలు అందించే బహుమూలికా మందులు, హోమియో మాత్రలు కూడా పాలఉత్పత్తి పునరుద్ధరణకు ఉపయోగపడుతున్నాయి. వీటిని పశువైద్య నిపుణుల సూచనల ప్రకారం వాడాలి.
పాలు నిలిచిపోయినప్పుడు, చేపు లేనప్పుడు, తొందరపడి చేపు ఇంజక్షను (ఆక్సిటోసిన్) చేయుట ఏ మాత్రమూ మంచిది కాదు. ఇందువల్ల పశువు శాశ్వతంగా గొడ్డుమోతుగా మారిపోవటమే కాక, ప్రజారోగ్యరీత్యా ఈ ఇంజక్షన్ల వాడకం నిషేధించబడింది. అంతర్గతంగా ఆక్సిటోసిన్ ఉత్పత్తిని ప్రేరేపించేందుకు సున్నితంగా పొదుగు, రొమ్ములు, బాహ్యజననేంద్రియాలపై మృదువైన మర్దన వంటి చర్యలు, ప్రేమ పూర్వకంగా చేసే నిమురు, అలవాటుపడిన ప్రశాంత స్థలంలో పాలుపిండటం, పాలుపిండే ముందు చేపుకు దూడల్ని వదలటంతో పాటు గంటలు కొట్టటం, మృదువైన సంగీతాన్ని వినిపించటం, పాలు పిండే స్థలాన్ని, మనుషుల్ని అలవాటు చేయటం (కంటిషన్డ్ రిఫ్లెక్స్) వంటి చర్యల్ని చేపట్టవచ్చు.
సాధారణంగా మన ప్రభుత్వాలు, బ్యాంకులు వారివారి సంక్షేమ పథకాల అమలును ఫిబ్రవరి-మార్చి నెలల్లో ముమ్మరం చేస్తాయి. ఇందుకు కేటాయించే నిధులు మార్చి నెలాంతంలో మురిగిపోవటం మరియు పంపిణీ లక్ష్యాలను మార్చి నెలాంతానికి నిర్దేశించడం కారణాలుకాగా, వేసవి తాపం, సుదూర ప్రాంతాల మధ్య పశువుల రవాణా, యాజమాన్యాల మార్పు వంటి కారణాల వల్ల లబ్దిదారులు ఆశించిన మేరకు పాలఉత్పత్తి జరుగదు. కాబట్టి పాడిపశువుల పంపిణీ పథకాలను జనవరి నెలాంతంలోగా ముగించాలని ప్రభుత్వ అధికారులకు ఒక అనుభవజ్ఞునిగా నా సూచన!
2023-24 సంవత్సరంలో భారతదేశంలో పత్తి ఉత్పత్తి 295.1 లక్షల బేళ్ళకు తగ్గుతుందని ప్రభుత్వ, వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత 15 సంవత్సరాల్లో ఇదే కనిష్ట స్థాయి ఉత్పత్తిగా నమోదవుతుందని ఈ అంచనాలు తెలుపుతున్నాయి. 2013-14లో దేశంలో 398 లక్షల బేళ్ళ ఉత్పత్తయింది. అత్యధికంగా ఆ సంవత్సరంలో 117 లక్షల బేళ్ళ పత్తి విదేశాలకు ఎగుమతి అయింది. ఇటీవలికాలంలో 2021-22లో 338 లక్షల బేళ్ళ పత్తి గరిష్టంగా ఉత్పత్తయింది. 2022-23లో ఉత్పత్తి 336 లక్షల బేళ్ళకు తగ్గగా, 2023-24లో 300 లక్షల బేళ్ళ కన్నా తక్కువ స్థాయికి దిగజారటం ఆందోళన కలిగిస్తున్నది. 2022లో పత్తిధర క్వింటాలుకి రూ. 8,000 నుండి రూ. 10,000 మధ్య కదలాడింది. ఉత్పత్తి తగ్గుతున్న నేపథ్యంలో ధరలు మరింత పెరుగుతాయని రైతులు ఆశించారు. కాని 2023 నవంబరు నుండి ప్రారంభమైన సీజనులో ధరలు కనీస మద్దతు ధర కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాయి. మధ్య పింజ పత్తికి క్వింటాలుకి రూ. 6620, పొడుగు పింజ పత్తికి రూ. 7020 గా కనీస మద్దతు ధరలుగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వర్షాల వల్ల తడిసి, తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తికి క్వింటాలుకి రూ. 5000 నుండి రూ. 6000 కన్నా ఎక్కువ ధరలు లభించటం లేదు. తేమ శాతం తక్కువగా ఉండి, నాణ్యమైన పత్తికి కూడా కనీస మద్దతు ధరల కన్నా ఎక్కువ ధరలు లభించటం లేదు.
అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితి
ప్రపంచ వ్యాప్తంగా కూడా పత్తి ఉత్పత్తిలో స్తబ్ధతే నెలకొన్నది. గింజ తీసిన పత్తి ఉత్పత్తి 2017-18లో అత్యధికంగా 27 మిలియన్ మెట్రిక్ టన్నులుగా నమోదైంది. 2018-19 లో 25.98 మిలియన్ మెట్రిక్ టన్నులు, 2019-20లో 26.13 మిలియన్ మెట్రిక్ టన్నులు, 2020-21లో 24.32 మిలియన్ మెట్రిక్ టన్నులు, 2021-22లో 26.44 మిలియన్ మెట్రిక్ టన్నులుగా పత్తి ఉత్పత్తి అంచనా వేశారు. 2022-23లో 23.5 మిలియన్ మెట్రిక్ టన్నులు, 2023-24లో 23.4 మిలియన్ మెట్రిక్ టన్నులు పత్తి ఉత్పత్తయినట్లు అంతర్జాతీయ పత్తి సలహా కమిటీ ప్రకటించింది. గత ఆరేడేళ్ళగా పత్తి ఉత్పత్తిలో ప్రగతి లేనట్లుగా ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఐతే పత్తి వినియోగంలో కూడా తగ్గుదల కనిపిస్తున్నది. 2021-22లో పత్తి వినియోగం 25.18 మిలియన్ మెట్రిక్ టన్నులుగా నమోదైంది. అది 2022-23లో 23.79 మిలియన్ మెట్రిక్ టన్నులకు తగ్గింది. వరుసగా రెండు, మూడేళ్ళుగా ఉత్పత్తి కన్నా వినిమయం తక్కువగా ఉండటం వల్ల ఎంతో కొంత నిల్వలు పెరుగుతున్నాయి. వినిమయం తగ్గటానికి వివిధ దేశాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు కొంత కారణమైతే, కృత్రిమ దారాల వినిమయం పెరగటం, నూలు దారాలతో కృత్రిమ దారాలను కలిపి వాడటం కూడా కారకాలే. మన దేశంలో బట్టలకు వాడుతున్న దారాల్లో 73 శాతం వాటా నూలు దారాలదే. కృత్రిమ దారాల వాటా 27 శాతం మాత్రమే. కాని ప్రపంచ స్థాయిలో చూస్తే 62 శాతం వాటా నైలాన్, పోలియెస్టర్, ఏక్రిలిక్, రేయాన్ వంటి కృత్రిమ దారాలదే. 38 శాతం వాటా మాత్రమే నూలు దారాలది. శీతోష్ణ స్థితుల్లో ఉండే తేడాల వల్ల వివిధ దేశాల్లో నూలు దారాలు, కృత్రిమ దారాలు, ఉన్ని, తోలు, పట్టు వంటి వివిధ మూలపదార్థాల నుండి బట్టలు తయారవుతున్నాయి. వచ్చే ఐదారేళ్ళలో నిపుణుల అంచనాల ప్రకారం నూలు దారానికి గిరాకీ సాలీనా 2.7 శాతం పెరుగుతుందనీ, కృత్రిమ దారాలకు గిరాకీ మాత్రం సాలీనా 7.4 శాతం చొప్పున పెరుగుతుందనీ తెలుస్తున్నది. 2022లో యుక్రెయిన్-రష్యాల యుద్ధం మొదలైన తర్వాత ముడిచమురు ధరలు బారెల్కి 100 డాలర్లు దాటాయి. అప్పుడు ముడి చమురు నుండి తయారయ్యే కృత్రిమ దారాలు ధరలు కూడా పెరిగాయి. వాటికనుగుణంగానే నూలు ధరలు కూడా పెరిగాయి. అందువల్లనే పత్తికి గిరాకీ తగ్గి, వినిమయం తగ్గి ఉండవచ్చు. 2023లో ముడి చమురు ధరలు 75 డాలర్లకు తగ్గటంతో కృత్రిమ నూలు ధరలు, పత్తి నూలు ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ధరలు కూడా మందగించాయి.
ఉత్పాదకతలో ప్రతిష్ఠంభన
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు పత్తిని 43 లక్షల హెక్టార్లలో సాగు చేసేవారు. హెక్టారుకి 132 కిలోల సగటు దిగుబడితో 23 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయింది. 2013-14 కల్లా ఉత్పత్తి 17 రెట్లు పెరిగి 398 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయింది. పత్తి పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. దిగుబడులు కూడా నాలుగైదు రెట్లు పెరిగాయి. 1970వ థకంలో సంకరజాతి పత్తి విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. 1980-81లో కూడా పత్తి సగటు దిగుబడి హెక్టారుకి 169 కిలోలే. అప్పటికి సంకర జాతి రకాలు కేవలం ఐదు శాతం విస్తీర్ణంలోనే సాగయ్యాయి. 2000-01 నాటికి 45 శాతం పత్తి విస్తీర్ణంలో సంకర పత్తి రకాలు సాగయ్యాయి. అప్పటికి పత్తి దిగుబడులు హెక్టారుకి 308 కిలోలకు చేరుకున్నాయి. 21వ శతాబ్దం ప్రారంభంలో ‘బాసిల్లస్తూరెంజెన్స్’ (బి.టి.) జన్యువుని సంకర రకాల్లో ప్రవేశ పెట్టటం మొదలైంది. బి.టి. సంకర రకాలను రైతులు బాగా ఆదరించడంతో 2007-08 కల్లా సగటు దిగుబడులు హెక్టారుకి 580 కిలోల వరకు పెరిగింది. 2013-14 కల్లా పత్తి విస్తీర్ణంలో 97 శాతం వరకు బి.టి. సంకర రకాలను సాగు చేసారు. హెక్టారుకి 565 కిలోల సగటు దిగుబడితో పత్తి ఉత్పత్తి గరిష్టంగా 398 లక్షల బేళ్ళకు చేరింది. సంకర జాతి రకాలకు అధిక దిగుబడినిచ్చే శక్తి ఉంది. అయితే పత్తి పంటకు కాయతొలిచే పురుగుల బెడద ఎక్కువగా ఉండేది. సంకర జాతి రకాల్లో బి.టి. జన్యువుని ప్రవేశపెట్టటం వల్ల కాయతొలిచే పురుగులను చాలావరకు నియంత్రించటం సాధ్యపడింది. పురుగు మందుల ఖర్చు కూడా గణనీయంగా తగ్గింది. అయితే రసం పీల్చే పురుగులపై ఇప్పటికీ రసాయనాలను వాడుతున్నారు. అలాగే బి.టి. జన్యువు ప్రభావం 90 రోజుల వరకే ఉంటుంది. ఆలస్యంగా పంటనాశించే గులాబీ రంగు కాయతొలిచే పురుగులపై బిటి జన్యువు ప్రభావం తక్కువగా ఉంటుంది. వాటి నివారణకు పురుగు మందుల వాడకం తప్పటం లేదు. అయినా కూడా గులాబీ రంగు కాయతొలిచే పురుగుల వల్ల నష్టం తప్పటం లేదు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో గులాబీరంగు కాయతొలిచే పురుగు బెడద తీవ్రంగా ఉంది. గత పది సంవత్సరాలుగా పత్తి సాగులో కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏదీ అందుబాటులోకి రాలేదు. హెక్టారు దిగుబడులు 500 కిలోలకు అటూఇటూ కదలాడుతున్నాయి. ఇక పత్తి ఉత్పత్తి పత్తి సాగు విస్తీర్ణంపైన, ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల తాకిడి పైన ఆధారపడుతున్నది.
తెలుగురాష్ట్రాల్లో పత్తి సాగు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013-14 నాటికి పత్తిసాగు 23.89 లక్షల హెక్టార్లలో జరిగింది. హెక్టారుకి 555 కిలోల సగటు దిగుబడితో 78 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయింది. 2014-15లో తెలంగాణాలో 17.13 లక్షల హెక్టార్లలో పత్తి సాగయింది. హెక్టారుకి 501 కిలోల సగటు దిగుబడితో 50.5 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయింది. ఆంధ్రప్రదేశ్లో పత్తి సాగు 8.21 లక్షల హెక్టార్లలో జరిగింది. 549 కిలోల హెక్టారు సగటు దిగుబడితో 26.5 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయింది. 2021-22లో తెలంగాణాలో పత్తి సాగు 23.59 లక్షల హెక్టార్లలో జరిగింది. 432 కిలోల సగటు దిగుబడితో 59.95 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయింది. ఆంధ్రప్రదేశ్లో పత్తి సాగు 6.06 లక్షల హెక్టార్లకు తగ్గింది. హెక్టారుకి 450 కిలోల దిగుబడితో 16.04 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయింది. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణాలో పత్తిసాగు పెరగ్గా, ఆంధ్రప్రదేశ్లో మాత్రం తగ్గింది. దేశపు సగటు దిగుబడి తగ్గినట్లుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పత్తి దిగుబడులు తగ్గాయి. 2022-23, 2023-24లో కూడా ఈ రెండు రాష్ట్రాల్లోనూ పత్తి సాగు ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైంది. 2021-22లోనూ, 2022-23లోనూ పత్తికి మెరుగైన ధరలు లభించడం వల్ల పత్తి సాగుపట్ల ఆసక్తి పెరిగింది. కాని వర్షాభావం వల్ల కొన్ని థల్లోనూ, అధిక వర్షాల వల్ల మరికొన్ని థల్లోనూ పత్తి పంట దెబ్బతిన్నది. సగటు దిగుబడులు 500 కిలోలలోపే ఉన్నాయి. ఈ సంవత్సరం ధరలు కూడా తగ్గటంతో చాలామంది రైతులు నష్టపోయే అవకాశం కనిపిస్తున్నది. ఈ సంవత్సరం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాపై సేకరణ బాధ్యతలు పెరిగాయి. తెలంగాణాలో నల్గొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, నాగర్కర్నూల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో పత్తిసాగు ఎక్కువగా కేంద్రీకృతమైంది. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో పత్తి సాగు ఎక్కువగా జరుగుతున్నది. ఈ జిల్లాలన్నిటిలోనూ రెండొంతుల విస్తీర్ణంలో పత్తిని వర్షాధారంగానూ, ఒకవంతు విస్తీర్ణంలో నీటి వసతితోనూ సాగు చేస్తున్నారు. 2022-23లో తెలంగాణాలో 20.25 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరిగినట్లు అంచనాలున్నాయి. 58.54 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయినట్లు అంచనా వేసారు. ఆంధ్రప్రదేశ్లో 2022-23లో 6.02 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరిగినట్లు, 17.85 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తి అయినట్లు అంచనాలున్నాయి. 2023-24లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పత్తి ఉత్పత్తి తక్కువగా ఉండవచ్చని ప్రాథమిక అంచనాలున్నాయి.
సాపేక్షికంగా తగ్గిన పత్తి ధర
సాంకేతిక అభివృద్ధి కారణంగా వస్తువులు, సేవల వాస్తవ ధరలు తగ్గటం సహజంగా జరుగుతున్నది. కంప్యూటర్ల వాస్తవ ధరలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు సంపన్నులు మాత్రం వాడగలిగిన సెల్ఫోన్లను ఇప్పుడు పేద ప్రజలు కూడా వాడగలుగుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల విషయం కూడా అంతే. ప్రస్తుత ధరల్ని ద్రవ్యోల్బణ సూచీతో భాగిస్తే వచ్చే వాస్తవ ధరలు వరి, గోధుమ, పప్పులు, వంట నూనెల వంటి ఏ వ్యవసాయ ఉత్పత్తి విషయంలోనైనా తగ్గటం మన అనుభవంలో అర్థమవుతుంది. అయితే ఏ పంట సాగులో దిగుబడులు పెరిగి, వాస్తవ ఉత్పత్తి వ్యయం తగ్గుతుందో ఆ పంట ఉత్పత్తి ధరలు బాగా తగ్గుతున్నాయి. కోడిగుడ్డు ఉత్పత్తి వ్యయం బాగా తగ్గటం వల్ల, దాని వాస్తవ ధర వేగంగా తగ్గి, అందరికీ అందుబాటులోకి రావటం మనందరి అనుభవం. అమెరికన్ మార్కెట్లో గత 50 సంవత్సరాల్లో ముఖ్య ఉత్పత్తుల ధరల్లో వచ్చిన మార్పుల్లో పత్తి వాస్తవ ధరలు బాగా తగ్గినట్లు తెలుస్తున్నది. 1973లో మొక్కజొన్న ధర బుషెల్కు 2.17 డాలర్లుగా ఉండేది. అది 2012లో గరిష్టంగా 6.92 డాలర్లకు చేరి, 2024లో 4.55 డాలర్లుగా ఉంది. 50 సంవత్సరాల్లో దాని ధర 2.09 రెట్లు పెరిగింది. మరో ముఖ్యమైన పంట సోయాచిక్కుడు ధర బుషెల్కు 1973లో 6.95 డాలర్లుగా ఉండేది. అది 2012లో గరిష్టంగా 14.62 డాలర్లకు చేరి, 2024లో 12.42 డాలర్లుగా ఉంది. 50 సంవత్సరాల్లో దాని మార్కెట్ ధర 1.79 రెట్లు పెరిగింది. పత్తి ధర 1973లో పౌండుకి 60 సెంట్లుగా ఉండేది. అది 2011తో గరిష్టంగా 1.36 డాలర్లకు చేరి, 2024లో 81 సెంట్లుగా ఉంది. పత్తి మార్కెట్ ధర 50 సంవత్సరాల్లో 1.35 రెట్లు మాత్రమే పెరిగింది. మొక్కజొన్న, సోయాచిక్కుడు, పత్తి వాస్తవ ధరలు బాగా తగ్గాయి. కాని ఈ మూడింటిలో పత్తి ధర అన్నిటి కన్నా బాగా తగ్గింది. పత్తి సాగులో వచ్చిన సాంకేతిక మార్పులు వినిమయదారులకే లాభించాయి కాని రైతులకుకాదు. అమెరికాలోనైనా, చైనాలోనైనా, పశ్చిమాఫ్రికాదేశాల్లో ఐనా, భారత్, పాకిస్తాన్లలో ఐనా పత్తిని పండిస్తున్న రైతులకు అరకొరా లాభాలు, అప్పుడప్పుడు నష్టాలే మిగులుతున్నాయి. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ, సరఫరాల సమతుల్యతను బట్టి ధరలు నిర్ణయించబడతాయి. కాని ఇప్పుడు సరఫరా తగ్గినా చైనా వంటి దేశాలు పత్తి దిగుమతిని తగ్గించటం వల్ల గిరాకీ లేక మార్కెట్లో మాంద్యం కనిపిస్తున్నది. చైనాలో పత్తి వినియోగం ఎక్కువ కనుక పత్తిని దిగుమతి చేసుకొని నిల్వ పెట్టుకుంటుంది. కాని ఆ దేశం ప్రస్తుతం ఎదుర్కుంటున్న ఆర్థిక సమస్యల వల్ల పత్తి దిగుమతుల్ని పరిమితం చేసింది. చైనా తర్వాత బంగ్లాదేశ్, వియత్నాం, టర్కీ, ఇండోనేషియాలు పత్తిని దిగుమతి చేసుకునే దేశాలు. పత్తిని ఎగుమతి చేసే దేశాల్లో అమెరికా, బ్రెజిల్, ఉజ్బెకిస్తాన్, పశ్చిమాఫ్రికాలోని బుర్కినాఫాసో, బెనిన్, కామేరూన్ వగైరా దేశాలతో పాటు ఇండియా కూడా ఉంది. భారత్లో ఉత్పత్తి తగ్గుతున్నట్లుగా కాక ఇతర దేశాల్లో మెరుగైన పరిస్థితులుండటం వల్ల కూడా మార్కెట్లో ధరలు పెరగకపోతుండవచ్చు. ఏదైనా రెండు మూడు నెలలు గడిస్తే గాని పత్తి మార్కెట్లో కదలిక ఉండకపోవచ్చు. కాని ఈలోగా చాలామంది రైతులు తెగనమ్ముకోవాల్సిరావచ్చు.
పత్తిసాగులో లాభ, నష్టాలు
పత్తి మార్కెట్ ఎప్పుడూ అనిశ్చితికి పెట్టింది పేరే. జూదప్రియులకు కాటన్ మార్కెట్ ఆడటం ఇష్టమైన వ్యాపకం. ‘ఓపెనింగ్’, ‘క్లోజింగ్’ ధరలపై పెట్టే పందాలతో తలకిందులైన కుటుంబాలు వేల సంఖ్యలో ఉంటాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలోని నల్లనేలల్లో పండించే పత్తిని ఇంగ్లాండ్ తరలించటానికే బ్రిటిష్ కాలంలో రైలు మార్గాలను నిర్మించారనే వాదం కూడా ఉంది. బొంబాయి నగరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందటానికి అక్కడ ఏర్పడిన నూలు మిల్లులే కారణంగా చెబుతారు. పత్తి నుండి గింజను వేరు చేయటం, బేళ్ళగా నొక్కి, రవాణా చేయటం, పత్తి నుండి నూలు దారం తీయటం, దారం నుండి బట్టలు నేయటం, బట్ట నుండి దుస్తులు తయారు చేయటం, వాటిని దేశవిదేశాల్లో అమ్మటం అన్నీ వాణిజ్యీకరణకు దోహదపడ్డాయి. స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మాగాంధీ రాట్నం వడకటం, ఖాదీ బట్టల తయారీ దేశభక్తికి చిహ్నాలుగా నిలిచాయి. పత్తి సాగు సాంప్రదాయకంగా వర్షాధారంగా నల్ల నేలల్లో ఎక్కువగా జరిగేది. నీటి వసతిని కల్పించడం, సంకర జాతి రకాలను వాడటం వల్ల పత్తిసాగు కూడా ఒక వాణిజ్య కార్యక్రమంగా మారింది. 50 సంవత్సరాల క్రితం గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీగా పెట్టుబడి పెడుతూ, సస్యరక్షణను ఒక క్రమ పద్ధతిలో చేస్తూ వ్యవసాయాన్ని ఒక జూదంగా మార్చారు. స్వంత భూమితో పాటు పొలాల్ని కౌలుకి తీసుకొని, వాణిజ్య స్థాయిలో పత్తి సాగుని విస్తరించారు. రైతులే కాకుండా ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కూడా పత్తిసాగులో పెట్టుబడులు పెట్టారు. ఏ ఇద్దరు కలిసినా ‘పత్తి వేశావా?’ అనే పలకరింపు సర్వసాధారణంగా ఉండేది. కొందరు లాభించగా, మరికొందరు నష్టపోయారు. తెల్లదోమ, కాయతొలిచే పురుగుల ఉధృతి పెరిగి కొన్ని సంవత్సరాల్లో పత్తి సాగు చేసిన రైతులంతా భారీగా నష్టపోయారు. వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పత్తి సాగు నల్లనేలల నుండి ఎర్రనేలలకు, ఇసుక నేలలకు కూడా పాకి, వాతావరణం, మార్కెట్ అనుకూలిస్తే లాభాలొచ్చాయి. లేకుంటే నష్టాలొచ్చాయి. బి.టి. పత్తి రకాలు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలపాటు రైతులు కుదుటపడ్డారు. కాని మళ్ళీ కొత్త పురుగులు, రోగాలు ప్రబలుతున్నాయి. అనావృష్టి, అతివృష్టి ప్రతి సంవత్సరం ఏదో ప్రాంతంలో విలయతాండవం చేస్తున్నాయి. ఎన్నో ఉపద్రవాలు, అనిశ్చితి పరిస్థితుల్లో రైతులు ఆశాభావంతో పత్తిని సాగు చేస్తున్నారు. ఒక క్వింటాలు పత్తి ఉత్పత్తి వ్యయం రూ. 6000 నుండి రూ. 9000 వరకు వివిధ రాష్ట్రాల్లో భిన్నంగా ఉంది. కాని పత్తి ధరలు రూ. 7000 లకు అటూఇటూగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చాలామంది రైతులు నష్టపోతున్నారు. ధరలు రూ. 8000 నుండి రూ. 10,000 వరకు ఉంటాయనే ఆశాభావంతో రైతులు సాగు చేసారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా క్రియాశీలకంగా కొనుగోళ్ళు చేస్తేనే ప్రస్తుతం ఉన్న ధరలైనా నిలుస్తాయి. రెండు మూడు నెలలు నిలవ చేస్తే క్వింటాలు ధర రూ. 8000లు దాటవచ్చు. చాలా కొద్దిమంది రైతులే తమ పంటను నిల్వ చేసుకునే స్థితిలో ఉన్నారు. పత్తిరైతులు నష్టపోవటం ఇది మొదటిసారే కాదు, చివరి సారీ కాదు. భవిష్యత్లో ధరలు పెరుగుతాయనీ, రైతులు నిలదొక్కుకుంటారనీ ఆశిద్దాము.
జీవాల పెంపకం అనేది కులవృత్తిగా తెలుగు రాష్ట్రాలలో తరతరాలుగా వస్తున్నది. ఇప్పుడు అనేక వర్గాల వారు కూడా గొర్రెలు మరియు మేకల పెంపకాన్ని వృత్తిగా ఎంచుకొని జీవిస్తున్నారు. అయితే ఈ జీవాల పెంపకం అనేది చాలా వరకు ఆరుబయట మేపే ప్రక్రియ. దీని వలన జీవాలు రాత్రి, పగలు కూడా, ఎండ, వాన మరియు చలిగాళ్లు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండి అనేక రకమైన వ్యాధులు సంక్రమించి తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నాయి.
ముఖ్యంగా శీతాకాలంలో తీవ్రమైన చలి గాలులకు గురవడం వలన పి.పి.ఆర్, గాలి కుంట వ్యాధి, నీలి నాలుక, దొమ్మరోగం మరియు నిమోనియా వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాధులకు వివిధ రకముల సూక్ష్మాతి సూక్ష్మజీవులు (వైరస్) మరియు సూక్ష్మజీవులు (బ్యాక్టీరియా) కారణం.
ముఖ్యంగా ఈ కాలంలో పి.పి.ఆర్ వ్యాధి జీవాలలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. పి.పి.ఆర్ వ్యాధి కారకం పారామిక్సో వైరస్ కుటుంబానికి చెందిన మారబిల్లి (ఖళిజీలీరిజిజిరి ఖీరిజీతిరీ) జాతి వైరస్ వలన కలుగుతుంది. దీనిని ముసర వ్యాధి, పారుడు రోగం, లేక గోట్ ప్లేగ్ అని కూడా అంటారు. వ్యాధి సోకిన పశువులను మందలోకి ప్రవేశించడం వలన, దగ్గు తుంపర్ల వలన లేక వ్యాధి సోకిన పశువుల మలమూత్ర విసర్జ కాల వలన ఇతర పశువులకు ఈ వ్యాధి సోకుతుంది.
జీవాలలో ఈ వ్యాధులు వ్యాప్తి చెందితే అధిక మరణాలు సంభవించి రైతులకు తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తాయి. పశుశాలాల్లో లేక జీవాల కొట్టాల్లో లేక ఫారాల్లో జీవాల్లో తీవ్రమైన జ్వరం, దగ్గు, ముక్కు మరియు నోటి నుండి నీరు కారటం లేదా చీము కారడం నోటిలో మరియు ముక్కుల్లో పుండ్లు అవ్వడం లేక కాళ్ల గిట్టల మధ్య పుండు ఏర్పడడం, పలుచటి రక్తంతో కూడిన విరోచనాలు మరియు పశువులు మేత తీసుకోకుండా, నెమరు వేయకుండా ఉండడాన్ని గమనించినప్పుడు రైతులు సరైన సమయంలో వ్యాధి సోకిన జీవాలను వేరు చేసి పశు వైద్యుని సంప్రదించి సరైన చికిత్స చేయించి, వ్యాధి నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించి ఈ కాలంలో లాభాలను పొందవచ్చును.
శీతాకాలంలో పశుశాలాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు నివారణ చర్యలు
* వ్యాధి సోకిన పశువులను మంద నుండి వేరు చేయాలి.
* నీరసించి ఉన్న జీవాలకు తేలికగా జీర్ణమయ్యే గంజి లాంటి ఆహారాన్ని అందించాలి.
* క్రొత్తగా కొనుగోలు చేసిన జీవాలను వేరుగా ఉంచి వ్యాధులు లేవని నిర్ధారించాకే మందలోకి కలపాలి.
* పశువైద్యని సంప్రదించి సరైన చికిత్స ఇప్పించాలి.
* స్థానికంగా వచ్చే వ్యాధులకు పశువైద్యని సంప్రదించి వ్యాధి నిరోధక టీకాలను తప్పనిసరిగా వేయించాలి.
* ముఖ్యంగా పి.పి.ఆర్, నీలి నాలుక (బ్లూ టంగ్) వ్యాధులకు శీతాకాలానికి ముందే టీకాలు వేయించాలి.
* టీకాలు వేసే వారం రోజుల ముందు నట్టల మందులు తప్పనిసరిగా వేయించాలి.
* దోమలు, ఈగల బెడద కోసం వేపాకు పొగ కొట్టాల్లో వేయాలి.
* రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పశువులుగా ఒకచోట ఉండడం వలన తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉన్నది. కావున ఫారాలలో పరదాలు కట్టడం ద్వారా చలి ఒత్తిడిని తగ్గించవచ్చు.
* వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గాలి ధారాళంగా ఉండే విధంగా చూసుకోవాలి.
* జీవాలకు సమీకృత దాణా పచ్చ గ్రాసం మరియు పరిశుభ్రమైన నీరు ఎల్లప్పుడూ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
డా. ఎస్. వంశీకృష్ణ, ఎం.వీ.ఎస్సీ, పీహెచ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ హెడ్, వెటర్నరీ మైక్రోబయాలజీ విభాగం, పశువైద్య కళాశాల, మామ్నూర్, వరంగల్, పి.వి. నర్సింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాయలం, ఫోన్: 8712908696
చెల్లమ్మాళ్ చదివింది ఆరో తరగతే. కానీ వ్యవసాయంలో శాస్త్రవేత్తల్ని సైతం ఆకట్టుకొనే ప్రయోగాలు చేశారు.
సేంద్రియంగా కొబ్బరి సాగులో, పంటల యాజమాన్యంలో ఆమెది అయిదు థాబ్దాల అపారమైన అనుభవం ఈ ఏడాది ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికైన చెల్లమ్మాళ్ వందలాది రైతులకు స్ఫూర్తిప్రదాత.
దక్షిణ అండమాన్ ప్రాంతంలో ‘కామాచ్చి చెల్లమ్మాళ్’ అంటే ఎవరన్నట్టు చూస్తారు. కానీ ‘నారియల్ అమ్మ’ అనగానే వెంటనే గుర్తుపట్టేస్తారు. రంగఛంగ్ గ్రామానికి చెందిన అరవయ్యేడేళ్ళ చెల్లమ్మాళ్ జీవితం మొత్తం కొబ్బరి తోటలతోనే పెనవేసుకుపోయింది. ఇక సాగు అనుభవం అయిదు థాబ్దాలకు పైనే. మొదట్లో పంటకు చీడపీడలు, సరైన దిగుబడి లేకపోవడం వల్ల ఆమె ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారు. భూమి సారం తగ్గిపోవడానికీ, వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడానికీ కారణం రసాయనాల వాడకమేనని గ్రహించారు. ”రసాయనాల వాడకం వల్ల మట్టిలో సారం తగ్గిపోతుంది. అది మన ఆరోగ్యాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మట్టిలో కోల్పోయిన పోషకాల్ని భర్తీ చెయ్యడం చాలా కష్టం. కాబట్టి రైతులందరూ సేంద్రియ సాగువైపు మళ్ళాలి” అంటారామె. మాటలకే పరిమితం కాకుండా… తన పది ఎకరాల పొలంలో వివిధ ప్రయోగాలను ఆమె చేపట్టారు. వర్షాకాలం తరువాత పొడిగా ఉండే వాతావరణంలో… మట్టిలో తేమ నిలవడం కష్టం. ఈ సమస్యను అధిగమించడానికి కొబ్బరాకులు, కొబ్బరి పీచును కుళ్ళబెట్టి, ఇతర ఆకులతో పాటు మట్టిని కప్పి ఉంచడం మొదలుపెట్టారు. మట్టిలో తేమ క్షీణించిపోకుండా నిలవడంతో పాటు కలుపు మొక్కల నివారణకు కూడా అది ఎంతో ఉపకరించింది. చీడపీడల నివారణకు వాడే హానికరమైన రసాయనాలకు స్వస్తి చెప్పి… వివిధ సేంద్రియ పదార్థాలతో ‘ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజిమెంట్’ వ్యూహాన్ని అమలు చేశారు. మరోవైపు అంతర పంటల పెంపకాన్ని చేపట్టారు. ”ఒకప్పుడు కేవలం కొబ్బరి మాత్రమే సాగు చేసేదాన్ని. కొన్నిసార్లు దిగుబడి తగ్గడం, మార్కెట్లో ధరలు పడిపోవడం వల్ల నష్టపోవాల్సి వచ్చేది. అందుకే… ఒకే పంట మీద ఆధారపడకూడదనుకున్నాను. కొబ్బరితో పాటు దాదాపు 460 తాటి చెట్లు పెంచుతున్నాను. అరటి, వేరు శెనగ, పైనాపిల్, మిర్చి, కంద, చిలగడ దుంపలు, ఆకుకూరలు, పువ్వులు… అలా రకరకాల పంటలు వేశాను” అని వివరించారామె. ప్రస్తుతం ఏటా 27 వేలకు పైగా కొబ్బరికాయల దిగుబడి వస్తోంది.
చెల్లమ్మాల్ చేసిన కొత్త ప్రయోగాలు, ఆచరించిన వినూత్న పద్ధతులు మంచి ఫలితాలు ఇవ్వడంతో పాటు తోటి రైతులకు స్ఫూర్తిగానూ నిలిచాయి. సుమారు 150 మందికి పైగా రైతులు ఈ పద్ధతులు అనుసరించేలా చేశారామె. ఆమె ప్రభావంతో… వారందరూ సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గుచూపారు. అలాగే రకరకాల పంటలు పండిస్తున్నారు. ”ఇలా చేయడం వల్ల ఏడాది పొడుగునా ఆదాయం ఉంటుంది. ఒక పంట దెబ్బ తిన్నా… మరొకటి ఆదుకుంటుంది” అంటారు చెల్లమ్మాళ్. వివిధ ప్రాంతాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆమె సాగు విధానాల్ని పరిశీలించి అభినందించారు. గతంలో కొబ్బరి అభివృద్ధి బోర్డుతో సహా పలు సంస్థల నుంచి పురస్కారాలు అందుకున్న ఆమెకు కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ని ప్రకటించింది.
చెల్లమ్మాళ్కు వ్యవసాయంలో ఆమె కుమారుడు రామచంద్రన్ సాయం చేస్తున్నారు. తన తల్లికి వచ్చిన ఈ పురస్కారం తమకు మరిన్ని ప్రయోగాలు చెయ్యడానికి స్ఫూర్తినిస్తోందని ఆయన చెబుతున్నారు. ”ఇప్పుడు ఆగ్రో-టూరిజం’ను ప్రమోట్ చెయ్యడానికి ప్రణాళికలు వేస్తున్నాం. మా పొలంలో రకరకాల పంటలు వేస్తున్నాం. సుగంధ ద్రవ్యాల్ని సాగు చేస్తున్నాం. ఫిష్ ఫార్మింగ్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఆగ్రో-టూరిజానికి మంచి అవకాశం ఉంది. అది స్థానికుల్నీ, విద్యార్థుల్నీ మాత్రమే కాదు… పర్యాటకుల్ని కూడా ఆకర్షిస్తుందని మేం భావిస్తున్నాం” అని ఆ తల్లి కొడుకులు చెబుతున్నారు. చెల్లమ్మాళ్ మునుపటి ప్రయోగాల మాదిరిగానే ఈ ఆగ్రో టూరిజం ఆలోచన కూడా మరింతమంది రైతులను ఆ బాటలో మళ్ళిస్తుందనడంలో సందేహం లేదు.
నేను మారుమూల పల్లెటూర్లో నివసిస్తున్నాను. నాకు ‘పద్మశ్రీ’ పురస్కారం వచ్చిందని ఎవరో చెప్పినప్పుడు… ఎంతో సామాన్యురాలినైన నాకు అంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఎలా ఇస్తారనుకున్నాను. నన్ను ఆట పట్టిస్తున్నారనుకున్నాను. తరువాత అండమాన్ అధికారి ఒకరు అది నిజమేనని చెప్పారు. ఇప్పుడు నా నోట మాటలు రావడం లేదు. – కామాచ్చి చెల్లమ్మాళ్
బేలేరు రైతుబిడ్డకు ‘పద్మ’ పురస్కారం
కేరళ భూమిపుత్రుడు సత్యన్నారాయణకు జేజేలు
వారి స్ఫూర్తి అందరికీ ఆదర్శం
కేరళ కాసర్ఘడ్ ప్రాంతంలోని బెలేరు గ్రామ రైతు 50 సంవత్సరాల సత్యన్నారాయణ బేలేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హోరెత్తుతున్న పేరు. అతను వరి రైతు కాదు.
రబ్బరు, వక్క పండిస్తారు. అయినా వరి కుటుంబం అంతా ఒక్కటిగా ఒక్కసారిగా వారి వైపు దృష్టి సారించారు. ఎందుకో తెలుసా?
తల్లిదండ్రులు, అన్నతో ఉన్న 5 ఎకరాలలో రబ్బరు, వక్క పంటలు సాగు చేస్తూ ఉమ్మడి వ్యవసాయం చేస్తూ ఉన్నా తనకున్న మక్కువతో 650 వరి రకాల విత్తనాలను సేకరించి, సంరక్షిస్తూ వరి జర్మ్ ప్లాజంకు కేంద్రబిందువై శాస్త్రవేత్తలను, రైతులను, జన్యుసంపద సంరక్షించే కేంద్రాలను అందరినీ తనవైపు ఆకర్షించారు. పెద్దగా చదువుకోలేదు. మొన్ననే 12వ తరగతి అక్షరాస్యతా మిషన్ ద్వారా పూర్తి చేశారు. 2024 పద్మశ్రీ పురస్కారంకు ఎంపికై చరిత్ర సృష్టించారు. వీరి ఉమ్మడి కుటుంబ వ్యవసాయ భూమి వాలు కలిగి ఉంది. దీనితో వరి సాగు కష్టం. దీనితో సత్యన్నారాయణ వరి రకాల సంరక్షణకు తన పెరటినే కేంద్రం చేసుకున్నారు. గ్రోబ్యాగ్స్లో విత్తనాలు నాటి, మొలకెత్తిన తరువాత మొక్కలను కుండీలలోకి మార్చటం చేస్తూ తన అభిరుచిని సాకారం చేసుకోవటంకు శ్రీకారం చుట్టారు. వంద గ్రాముల విత్తనాలతో కేరళ వరి రకాల సంరక్షణతో మొదలైన కార్యక్రమం నేడు పొడుగు, పొట్టి రకాలు, నలుపు, ఎరుపు వడ్లు, తక్కువ కాలం, ఎక్కువ కాలంలో పంట కొచ్చే రకాలు… ఇలా విభిన్న ప్రాంతాల, పలు వాతావరణ పరిస్థితుల్లో పండే 650 రకాల వరి విత్తనాలను లాభాపేక్ష లేకుండా సంరక్షిస్తూ ఉండటం మామూలు విషయం కాదు. వీరికున్న జీవ వైవిధ్యం, పర్యావరణ స్పృహకు శాస్త్ర సమాజం జేజేలు పలికింది. ఇటు శాస్త్రవేత్తలు, అటు వివిధ ప్రాంత రైతులు వారి దగ్గరున్న రకాల విత్తనాలు ఇచ్చి తోడ్పాటు అందించారు. సత్యన్నారాయణ కూడా తను సేకరించి భద్రపరుస్తూ ఉన్న విత్తనాలను తోటి రైతులకు అందిస్తూ వరి జన్యు సంపదను అంతరించి పోకుండా కృషి చేస్తున్నారు. 2021లో వీరికి ప్లాంట్ జీనోమ్ సేవియర్ ఫార్మర్ పురస్కారం అందుకున్నారు.
‘నమస్తే కిసాన్’ అనే దేశీ విత్తనాల సాగును ప్రోత్సహిస్తున్న సంస్థ మరియు సికిందరాబాద్ (వెస్ట్) రోటరీ క్లబ్వారు సంయుక్తంగా డిసెంబర్ 24న హైదరాబాద్ (షేక్పేట్)లోని నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర తదితర పొరుగు రాష్ట్రాల నుండి సుమారు 150 మందికి పైగా అభ్యుదయ రైతులు, గోప్రేమికులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని తాము పండించిన వివిధ రకాల వరి విత్తనాలు, చిరుధాన్య విత్తనాలు, ఆకుకూరలు, కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు. ఐటి రంగంలోనూ, బిజినెస్ రంగంలోనూ ఉన్నత విద్యలను అభ్యసించిన యువకులు, విశ్రాంత ఉన్నతాధికారులు, ప్రొఫెసర్లు, ఆధ్యాత్మిక వేత్తలు, గోప్రేమికులు, దేశీ రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని సేంద్రియ వ్యవసాయం, దేశీ విత్తనాల ఉత్పత్తిలో తమ అనుభవాలను సభికులకు ఆసక్తికరంగా వివరించారు.
దేశీయ విత్తనాలను ”భద్రపరచు, సంరక్షించు మరియు విస్తరించు” (Conserve – Protect and Propagate) అనే లక్ష్యంతో కొందరు యువ కర్షకులు నిర్వహిస్తున్న ”నమస్తే కిసాన్” ఎంతైనా ప్రశంసనీయమని సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పూనాకు చెందిన యోగి చంద్రకాంత్ కులకర్ణి మహరాజ్ – నిర్వాహకులను అభినందించారు.
సేంద్రీయ కర్షకుడు – రాష్ట్రపతి పురస్కార గ్రహీత మరియు దేశీ విత్తన సంరక్షణ ఉద్యమకారుడు రఘువీర్, బ్రిగేడియర్ గణేశం (పల్లెసృజన), శ్రీమతి సూర్యకళ (మన వూరు-మన బాధ్యత), సుబ్రహ్మణ్యరాజు (గోఆధారిత వ్యవసాయదారుల సంఘం), రొటేరియన్ ఏకాంబరరెడ్డి (ఛైర్మన్ నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీ), రొటేరియన్ శ్రీమతి పద్మినీ ప్రసాద్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (తిరుపతి) విశ్రాంత డీన్ శ్రీమతి జ్యోతి తదితరులు ఈ కార్యక్రమంలో ఆసక్తికరమైన పలు అంశాలపై ప్రసంగించారు.
సంగం డెయిరీ విశ్రాంత అధికారి, వ్యవసాయ పాత్రికేయుడు, గోసేవకుడు డా. అహోబలరావు తన ప్రసంగంలో గోశాలల ఆర్థిక సమస్యల పరిష్కారానికి తమ తమ గోశాలలలోని ఎంపిక చేసిన గోవులను, విశిష్ఠమైన అత్యున్నతమైన దేశీ జాతి పశువుల ఉత్పత్తికి ఏవిధంగా వినియోగించుకోవచ్చో వివరించుటతోపాటు, సులువుగా సేంద్రీయ ఎరువుల తయారీకి మరింత సమర్థవంతమైన ఉత్పత్తికి, పంపిణీకి, వినియోగాలకు యువరైతు క్లబ్బుల ఏర్పాటుకు కొన్ని సూచనలు చేశారు. దేశీ పశువుల ఉత్పత్తి – దేశీ విత్తనాల ఉత్పత్తి మరియు సహజ కీటక నాశకాల వినియోగం – ఈ మూడూ ఒకే వ్యవస్థలో సమన్వయంగా కొనసాగినప్పుడే కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగిన ఈరోజుల్లో రైతుకూ, దేశానికి మేలు చేకూరగలదని ఆయన అన్నారు. దేశీ విత్తనాల ఉత్పత్తిలో అత్యంత ప్రతిభ కనబరచిన రైతులను, డాక్టర్ అహోబలరావును నిర్వాహకులు సత్కరించారు.
ఈ దేశీ విత్తనాల పరస్పర మార్పిడి కార్యక్రమంలో పాల్గొనదలచినవారు నమస్తే కిసాన్ ఫోన్ నం. 7516841687 మరియు 1800-202-0120 (టోల్ ఫ్రీ) నెంబర్లలో సంప్రదించవచ్చునని నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ‘నమస్తే కిసాన్’ వ్యవస్థాపకులు దుర్గాప్రసాద్ బృందం ఎంతైనా అభినందనీయులు. వివిధ రకాల విత్తనాలతో పాటు రోబోటిక్ వ్యవసాయ యంత్రాల ప్రదర్శన సందర్శకులను విశేషంగా అలరించింది.
జంతు సంబంధిత ఉత్పత్తులన్నింటిలో ధరలు అత్యంత వేగంగా, స్థిరంగా పెరిగేవి గొర్రెలు-మేకల మాంసాలు మాత్రమే. గత నాలుగు థాబ్దాల కాలంలో మాంసం ధరలు సుమారు 80 రెట్లు పెరిగాయి. ఇందుకు జీవాల పెంపకంలో పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు మరియు అనేక సమస్యలతో పాటు పెరుగుతున్న వినియోగదారుల అభిరుచులు, వారి కొనుగోలు శక్తి కూడా కారణాలుగా భావించవచ్చును.
ఇప్పుడిప్పుడే సాంప్రదాయక జీవాల పెంపకదారుల సామాజిక వర్గాలతో పాటు, అనేక ఇతర అగ్రకులాలవారు, విద్యాధికులే కాక, ఐ.టి. రంగంలో పనిచేస్తూ ఈ రంగంలోకి ప్రవేశిస్తున్న విద్యాధికులు కూడా ఈ రంగంపట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లైవ్ స్టాక్ డెవలప్మెంట్ మిషన్ క్రింద మేతల పెంపకానికి తగినంత భూమి మరియు ఇతర వసతులు కల్గిన యువతకు సబ్సిడీగా 50 శాతం, మరో 50 శాతం బ్యాంకులు అందిస్తున్న రుణ సదుపాయాలు, పౌల్ట్రీ రంగం ఎదుర్కొంటున్న మార్కెట్ ఒడిదుడుకులు, పాడి రంగంలో ఆలస్యంగా మాత్రమే కనిపించే రాబడులవంటి ప్రతికూలతలు జీవాల పెంపకం ముఖ్యంగా గొర్రెల పెంపకంలో లేకపోవటం, పెట్టిన పెట్టుబడికి కొన్ని నెలలోనే ఆదాయాలు కనిపించటం వంటి సానుకూలతలు గొర్రెల పెంపకంలో ఆసక్తిని పెంచుతున్నాయి.
నెల్లూరు జొడిపి, మాచర్ల, నాగావళి మరియు డక్కన్ జాతులు మరికొన్ని గుర్తింపు లేని జీవాలు మన తెలుగు రాష్ట్రాలలో అనాదిగా మాంసం ఉత్పత్తికి దోహదపడుతూ ఉన్నాయి.
ప్రస్తుతం అనూహ్యంగా పెరిగిన నిర్వహణ ఖర్చులు, కూలీలు, ఇతర సమస్యల వల్ల అంతగా లాభదాయకం కాని సాంప్రదాయ నాటు జీవాల మీద ఆధారపడుట కంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందుతూ వున్న డార్పర్ జాతి గొర్రెల పెంపకాన్ని చేపట్టుట వల్ల లాభాలు గణనీయంగా పెరుగుతాయనటంలో అతిశయోక్తి లేదు.
ఆస్ట్రేలియా, అమెరికా, ఆఫ్రికా తదితర దేశాలలో అత్యంత లాభదాయక జీవంగా గుర్తింపు పొందిన డార్పర్ జాతి గొర్రెలు – వాటి విశిష్టత, పెంపకంలో మెళకువలను గురించి చర్చిద్దాము. పుట్టినప్పుడు 3.5 నుండి 4.00 కిలోల బరువుతో నాలుగు నెలల వయస్సుకు 36 కిలోల శరీర తూకం, అందులో 50 నుండి 55 శాతం మాంసాన్ని ఇవ్వగల డార్పర్ జాతికి సాటి జాతి ఇప్పటి వరకు మన దేశంలో లేదనే చెప్పవచ్చును. అంతేకాక డార్పర్ జాతి ఆడగొర్రెలు 5 నెలలు వయస్సుకు పొట్టేళ్లు 9 నెలలకు ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. సగటున రోజుకు 200-250 గ్రాముల వరకు శరీర బరువును పెంచుకోగల్గిన ఈ గొర్రెలు, మగవి 9 నెలల్లో 100 కిలోలు శరీర తూకాన్ని అందుకోగలవు. ఆడవి ప్రతి రెండు సంవత్సరాలకు మూడు సార్లు ఈని మంచి పాల ఉత్పత్తితో పిల్లలను ప్రేమగా పెంచుకోగలవు. కాబట్టి పిల్ల థలో మరణాల శాతం కూడా తక్కువే. ఈనిన తర్వాత 90-100 రోజులలో ఎదకు వచ్చి చూడి కట్టగలవు. మందలో సగటున ప్రతి మూడు ఈతలలో ఒకసారి కవల పిల్లలకు జన్మనిచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటి జీవిత కాలం 10-12 సంవత్సరాలలో 7 సంవత్సరాలు సమర్ధవంతమైన ప్రత్యుత్పాదక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
దక్షిణ ఆఫ్రికాకు చెందిన డార్సెట్హార్న్, పర్షియాకు చెందిన పర్షియన్ బ్లాక్హెడ్ గొర్రె జాతుల కలయికగా డార్పర్ జాతి ఉద్భవించి, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల మాంసం అవసరాలను చాలావరకు తీరుస్తూ ఉంది. ప్రస్తుతం ఈ జాతి గొర్రెలు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కూడా లభ్యమౌతున్నాయి. ఇవి మేసే ప్రతి నాలుగు కిలోల మేత (పొడి) ఒక కిలో మాంసంగా మారుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
మగవి 60 సెంటిమీటర్లు, ఆడవి 50 సెంటీమీటర్ల ఎత్తు కలిగి, తెలుపు శరీరం, నల్లని తల, మెడ, కాళ్ల మీద నలుపు మచ్చలు కలిగిన ఈ జాతిలో పూర్తిగా తెలుపు, పూర్తి నలుపు వర్ణాలు కలిగినవి కూడా ఉండవచ్చును. ఆడ-మగ రెండింటిలోనూ కొమ్ములు వుండవు. తోక 6-8 అంగుళాల వరకు వుండవచ్చు. ఇది ఉన్ని జాతి కాదు. వీటి ఉన్ని సులువుగా రాలిపోతుంది. చర్మం కొంత మందమైనప్పటికీ మార్కెట్లో ఇతర జాతి గొర్రెల చర్మాలకంటే నాణ్యమైనదిగా గుర్తింపు పొందింది. మాంసం పోగుల మధ్య సమానంగా విస్తరించిన క్రొవ్వు వల్ల ఈ మాంసాన్ని వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆడగొర్రెలు, వయసుమీరిన గొర్రెల మాంసం కూడా ఇంచుమించు పొట్టేళ్ల మాంసంతో సమాన రుచి, నాణ్యత కలిగి ఉంటుంది.
డార్పర్ గొర్రెలలో వ్యాధి నిరోధక శక్తితో పాటు ఈగలు, దోమలు, పిడుదులు, గోమార్లు తదితర బాహ్య కీటకాలను, అంతర్గత పరాన్న జీవుల ధాటిని తట్టుకోగల శక్తి, నాసిరకం గ్రాసాలు, ఆకుల్ని సైతం సమర్ధవంతంగా జీర్ణించుకోగల శక్తి కూడా ఎక్కువే. అన్ని రుతువుల ప్రతికూలతల వత్తిడిని సమర్ధవంతంగా ఈ జాతి గొర్రెలు తట్టుకోగలవు.
డార్పర్ గొర్రెల మేపు: 15 శాతం మాంసకృత్తులు, 75 శాతం ఇతర పోషకాలు కలిగిన గ్రాసాలు-మేతలను శరీర బరువులో తేమలేని రూపం ఆధారంగా 2 నుండి 3 శాతం అందిస్తే సరిపోతుంది. సూపర్ నేపియర్, లూసర్న్, మొక్కజొన్న, జొన్న, పిల్లిపెసర వంటి గ్రాసాలను మరియు విధిగా కొంత ఎండుమేతతో పాటు మినరల్ మిక్చర్తో పాటు తవుడు, మొక్కజొన్న, నూనెచెక్కలు కలిగిన సమీకృత దాణాలను రోజుకు 75-80 గ్రాములు అందిస్తే సరిపోతుంది. మంచి పచ్చిక బీళ్లు ఉంటే సమీకృత దాణాల అవసరం కూడా అంతగా ఉండదు. ఉడికించిన ఉలవలు, చిలకడ దుంపల్ని మేపుట ద్వారా కూడా పెరుగుదల వేగవంతం కాగలదు. ఎల్లవేళలా శుభ్రమైన త్రాగునీటిని అందుబాటులో ఉంచాలి. మేపుల మధ్య 4-5 గంటలు మేపులేకుండా, నెమరు వేయుటకు అవకాశం ఇస్తే జీర్ణసామర్థ్యం పెరుగుతుంది.
గొర్రెల పెంపకం ద్వారా పేదల అభ్యున్నతికి పాటు పడుతున్న మన ప్రభుత్వాలు కృత్రిమ గర్భోత్పత్తి మరియు శ్రేష్టమైన పిండదానాల ద్వారా ఈ డార్పర్ జాతి గొర్రెల సంఖ్యను వేగంగా పెంచి మన గ్రామీణ పెంపకందారులందరికీ ఆర్థిక పరిపుష్టిని కలిగించవచ్చును.
భారతదేశంలో ప్రజలకు సగటున 2400 కిలోకేలరీల శక్తి, 60 గ్రాముల మాంసకృత్తులు, 50 గ్రాముల కొవ్వు పదార్థాలు రోజుకి అవసరం అని జాతీయ ఆహార పర్యవేక్షణ బోర్డు సిఫార్సు చేసింది. తాజా అంచనాల ప్రకారం దేశంలో ప్రజలకు సగటున 2500 కిలోకేలరీల శక్తి, 60 గ్రాముల మాంసకృత్తులు, 52 గ్రాముల కొవ్వు పదార్థాలు లభ్యమౌతున్నట్లు తెలుస్తున్నది. మాంసకృత్తుల లభ్యత సిఫార్సు మేరకు ఉన్నా, కేలరీలు, కొవ్వు పదార్థాల విషయంలో అవసరం కన్నా లభ్యతే ఎక్కువగా ఉన్నాయని అర్థమవుతుంది. అయినా దేశం ఆహార భద్రత, ఆకలి సూచీల విషయంలో ప్రపంచ దేశాల్లో భారత్ చాలా వెనకబడటం ఆలోచించదగ్గ విషయం. తీవ్రమైన ఆర్థిక అసమానతల వల్ల చాలామంది గ్రామీణ, పట్టణ పేదలు అవసరానికి తగ్గ పోషకాహారాన్ని పొందలేకపోతుండవచ్చు. కొనుగోలు శక్తితో పాటు అవగాహన కూడా లోపించటం వల్ల పోషకాహార లోపం వల్ల పిల్లలు ఎదగలేకపోవటం, బక్కచిక్కి ఉండటం, చనిపోవడం వంటి సూచికల వల్ల ఆకలి సూచీలో దేశం వెనకబడుతున్నది.
కొవ్వు పదార్థాల లభ్యత
కొవ్వు పదార్థాలు పాలు, పాల పదార్థాలు, కొన్ని చేపలు, మాంసం, రొయ్యలు వంటి జంతు సంబంధ వనరుల ద్వారా లభ్యమౌతున్నా, ముఖ్యంగా మొక్కల ద్వారా లభించే గింజలు, ఎండుపళ్ళు, కాయల నుండే ఎక్కువగా లభిస్తున్నాయి. వంటనూనెల గిరాకీ గత 73 సంవత్సరాల్లో బాగా పెరిగింది. 1950లో దేశంలో వంటనూనెల తలసరి వినియోగం సంవత్సరానికి కేవలం నాలుగు కిలోలే. ఇప్పుడది 19 కిలోలకు పెరిగింది. ఆహార ధాన్యాల లభ్యత 1950లో సంవత్సరానికి 170 కిలోలుండగా ఇప్పుడు అది 220 కిలోలకు పెరిగింది. పప్పు ధాన్యాల లభ్యత కొంతమేరకు తగ్గింది. కాని కూరగాయలు, ఎండుపళ్ళు లభ్యత పెరగటం వల్ల మాంసకృత్తుల లభ్యత తగ్గలేదు. కేలరీల శక్తి లభ్యత కొద్దిగా పెరగ్గా, మాంసకృత్తుల లభ్యత స్థిరంగా ఉండగా, కొవ్వు పదార్థాల లభ్యత మాత్రం నాలుగైదు రెట్లు పెరిగింది. వంటనూనెల వినియోగం అవసరాన్ని మించి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సు ప్రకారం సంవత్సరానికి ఒక్కొక్కరికి 12 కిలోల వంటనూనెలు సరిపోతాయి. దానితో పోలిస్తే ప్రస్తుత వినియోగం 55 శాతం ఎక్కువగా ఉంది. మాంసాహారం ఎక్కువగా తీసుకునే అమెరికా, యూరోప్ దేశాల్లో కూడా వంట నూనెల వాడకం ఎక్కువ. ఆఫ్రికన్ దేశాల్లో వంటనూనెల వాడకం బాగా తక్కువ. భారత్ వంటి పేదదేశంలో వంట నూనెల వాడకం ప్రపంచ సగటు వినియోగంతో సమానంగా ఉంది. మాంసాహార వాడకం భారత్లో తక్కువే ఐనా, పాలు, పాలపదార్థాల వాడకం ఎక్కువగా ఉండటం వల్ల కొవ్వు పదార్థాల లభ్యతలో కొరత లేదు. దేశంలో స్థూలకాయులు, మధుమేహ పీడితులు పెరుగుతున్న సందర్భంలో వంటనూనెల వాడకంపై నియంత్రణ అవసరం. కాని ఆదాయాలు పెరుగుతున్నకొద్దీ వంటనూనెల వాడకం పెరుగుతున్నది. ధరలు పెరిగినప్పుడు వాడకం తగ్గటం, ధరలు తగ్గినప్పుడు వాడకం పెరగటం జరుగుతున్నది. 1994లో ప్రపంచ వాణిజ్య ఒప్పందం జరిగినప్పటి నుండీ దిగుమతులపై ఆంక్షలు, సుంకాలు తగ్గటం వల్ల వంటనూనెల ధరలు సాపేక్షికంగా తగ్గాయి. ఫలితంగా గిరాకీ హెచ్చింది. వాడకం పెరిగింది. 1950లో 4 కిలోలు, 1990లో 7 కిలోలుగా ఉన్న వంటనూనెల తలసరి వాడకం ఇప్పుడు 19 కిలోలకు చేరుకున్నది. కేంద్ర ప్రభుత్వాలకు ఒక దీర్ఘకాలిక వ్యూహం లేకుండా ప్రపంచ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు దిగుమతి సుంకాలను పెంచడం, ధరలు పెరిగినప్పుడు దిగుమతి సుంకాలను తగ్గించడం చేస్తున్నాయి. నూనె గింజల ఉత్పత్తిదారుల ప్రయోజనాలను విస్మరించి, వినిమయదారుల మెప్పుకోసం దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల వంటనూనెల వాడకం పెరుగుతున్నది.
ప్రపంచ మార్కెట్ పరిస్థితి
2022లో ప్రపంచ వంటనూనెల మార్కెట్ విలువ 21,260 కోట్ల అమెరికన్ డాలర్లుగా అంచనా వేయబడ్డది. ఇది ప్రతి సంవత్సరం 4.8 శాతం చొప్పున పెరిగి 2027 నాటికి 26,890 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా వేశారు. ప్రపంచంలో ఉత్పత్తవుతున్న నూనెల్లో సోయా చిక్కుడు వాటా 30 శాతంగా ఉంది. 27 శాతం వాటాతో పామోలిన్ ఆయిల్, 15 శాతం వాటాతో ఆవాలనూనె, 10 శాతం వాటాతో పొద్దు తిరుగుడు గింజలనూనె వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాలను ఆక్రమిస్తున్నాయి. వేరుశనగ నూనె వాటా 5 శాతం గానూ, పత్తిగింజల నూనె వాటా 4 శాతంగానూ, ఆలివ్ నూనె వాటా 3 శాతంగానూ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన వంటనూనెలన్నీ కలిపి 6 శాతం వాటాను కలిగి ఉన్నాయి. సోయాచిక్కుడు నూనె ఉత్పత్తిలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు, బ్రెజిల్, అర్జెంటీనా, మెక్సికోలు అగ్రస్థానాల్లో ఉన్నాయి. ఆ దేశాల నుండే ఎక్కువగా సోయాచిక్కుడు నూనెల ఎగుమతులు జరుగుతున్నాయి. ఇక పామోలిన్ ఆయిల్ ఉత్పత్తిలో ఇండోనేషియా, మలేసియాలు అగ్రస్థానానికి పోటీపడుతున్నాయి. ఎగుమతుల విషయంలో కూడా ఆదేశాలే ప్రముఖంగా నిలుస్తున్నాయి. ఆవనూనె ఉత్పత్తిలోనూ, ఎగుమతుల్లోనూ కెనడా ముందువరసన నిలుస్తున్నది. పొద్దుతిరుగుడు గింజల నూనె ఉత్పత్తి ఎక్కువగా రష్యా, యుక్రెయిన్లలో జరుగుతున్నది. మధ్యధరా దేశాల్లో ఉత్పత్తవుతున్న ఆలివ్ ఆయిల్కు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది. ఆరోగ్య ప్రయోజనాలు బాగున్నాయనే నమ్మకంతో అత్యధిక ధర పలుకుతున్నది. ఆసియా, ఆఫ్రికాల్లో సాగయ్యే వేరుశనగ పప్పులనూనె వాటా క్రమేపీ తగ్గుతుంది. అనేక దేశాల్లో ఉత్పత్తవుతున్న పత్తిగింజల నూనెను కొన్ని దేశాల్లో వంట నూనెగానూ, మరికొన్ని దేశాల్లో ఇతర అవసరాలకు వాడుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సేంద్రియ పద్ధతుల్లో ఉత్పత్తయిన వంటనూనెలకు గిరాకీ పెరుగుతూ 2022లో 270 కోట్ల అమెరికన్ డాలర్లకు చేరింది. వంటనూనెలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో కొన్ని వాటిని బయోడీజిల్ ఉత్పత్తికి వినియోగిస్తున్నాయి. మొక్కజొన్న నుండి, చెరకు నుండి ఇథనాల్ తయారవుతున్నట్లుగా, వంటనూనెల నుండి బయోడీజిల్ తయారీ ఊపందుకుంటున్నది. ముడి చమురు కొరత భవిష్యత్తులో సమస్య కానుందనే భయంతో పెట్రోల్లో ఇథనాల్ను, డీజెల్లో బయోడీజిల్ను పది నుండి 20 శాతం వరకు కలుపుతున్నాయి. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి కూడా బయోడీజిల్ ఉపకరిస్తుందనే ఉద్దేశ్యంతో ధనిక దేశాలు వంటనూనెలను బయోడీజిల్ తయారీకి వాడుతున్నాయి. ముడిచమురు, వంటనూనెల ధరల మధ్య ఉండే వ్యత్యాసం తగ్గే కొద్దీ బయోడీజిల్ రంగం నుండి వంటనూనెలకు గిరాకీ పెరుగుతున్నది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఏర్పడే అనావృష్టి, అతివృష్టి పరిస్థితుల కారణంగానూ, దేశాల మధ్య యుద్ధాల కారణంగానూ వంటనూనెల ధరల్లో హెచ్చుతగ్గులుంటున్నాయి. 2022లో రష్యా, యుక్రెయిన్ల మధ్య యుద్ధం ప్రారంభం కాగానే వంట నూనెల ధరలు 30 శాతం పెరిగాయి. పొద్దు తిరుగుడు గింజల నూనె ఎగుమతులు తగ్గటం వల్ల, పామాయిల్ ధరలు టన్నుకి రెండు వేల డాలర్లకు చేరుకున్నాయి. 2023 నవంబరు నాటికి వాటి ధరలు వెయ్యి డాలర్లకు తగ్గాయి. ముడిచమురు ధరల లాగానే వంటనూనెల ధరల్లో భారీ హెచ్చు తగ్గులుంటున్నాయి. ఈ రెండింటినీ అధిక మొత్తంలో దిగుమతి చేసుకుంటున్న భారతదేశం భారీగా విదేశీమారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తున్నది.
నిరంతర కొరతలో భారతదేశం
వంటనూనెల విషయంలో భారతదేశం అనేక థాబ్దాలుగా కొరతను ఎదుర్కొంటూ దిగుమతులపై ఆధారపడుతున్నది. 1984లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఎన్నికైన తర్వాత నూనెగింజల ఉత్పత్తిని ప్రోత్సహించటానికి ఒక టెక్నాలజీ మిషన్ని ఏర్పాటు చేశారు. దిగుమతి సుంకాలను పెంచి, నూనె గింజల పంటలకు మద్దతు ధరను పెంచారు. 1990 నాటికి నూనె గింజల ఉత్పత్తి పెరిగి, వంటనూనెల దిగుమతి తగ్గింది. వంటనూనెల దిగుమతి ఖర్చుకి దీటుగా నూనెతీసిన చెక్క, పిండి ఎగుమతుల ద్వారా ఆదాయం లభించడంతో, దేశం స్వయం పోషకత్వాన్ని సాధించిందని గర్వంగా చెప్పుకున్నాము. కాని అప్పుడు దేశంలో వంటనూనెల తలసరి వినియోగం సంవత్సరానికి ఏడు కిలోలు మాత్రమే. 1994లో ప్రపంచ వాణిజ్య ఒప్పందం తర్వాత దిగుమతి సుంకాలను తగ్గించడం, ప్రపంచ మార్కెట్లో పామోలిన్ ఆయిల్ చౌకగా లభించడంతో దిగుమతులు బాగా పెరిగాయి. నూనెగింజల ధరలు దేశీయంగా తగ్గటం వల్ల రైతులకు నూనెగింజల పంటల సాగుపై ఆసక్తి తగ్గింది. 1980ల్లో వేసిన పామాయిల్ తోటల్ని 2000 ప్రాంతంలో రైతులు తీసివేసారు. ప్రపంచ మార్కెట్లో నూనెగింజలు, వంటనూనెల ధరలు పెరగటంతో ప్రభుత్వాలు మళ్లీ పామాయిల్ తోటలను పెంచటానికి మద్దతునందిస్తున్నాయి. అనేక కొత్త రాష్ట్రాలకు, జిల్లాలకు పామాయిల్ సాగుని విస్తరిస్తున్నది. సాంప్రదాయంగా పండించే వేరుశనగ, ఆవ, సోయాచిక్కుడు, నువ్వులు, అవిసె, కుసుమలను ఎక్కువగా వర్షాధారంగా పండిస్తున్నారు. కాని పామాయిల్ను మాత్రం నీటి వసతితోనే పండిస్తున్నారు. వాటి దిగుబడులు హెచ్చుగా ఉండటం వల్ల రైతులు ఉత్సాహం చూపుతున్నారు. అయినా పామాయిల్ తోటలు ఇండోనేషియా, మలేషియాల్లో వర్షాధారంగానే పెరుగుతుండటం వల్ల ఉత్పత్తి వ్యయం తక్కువ. ప్రపంచ మార్కెట్లో పామాయిల్ ధరలు తగ్గినప్పుడు దేశంలో పామాయిల్ ఉత్పత్తిని కొనసాగించడానికి ప్రభుత్వాల మద్దతు అవసరమౌతుంది. పామాయిల్ ఉత్పత్తి కొంత పెరిగినా, ఇతర నూనెగింజల ఉత్పత్తిలో చెప్పుకోదగ్గ పెరుగుదల లేకపోవటంతో వంటనూనెల విషయంలో దిగుమతులపైనే ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది. దేశంలో 287.6 లక్షల హెక్టార్లలో 2021-22 సంవత్సరంలో నూనెగింజల సాగు జరిగింది. నూనెగింజల ఉత్పత్తి 385 లక్షల టన్నులుగా నమోదైంది. హెక్టారుకి 1339 కిలోల సగటు దిగుబడి నమోదైంది. దేశీయంగా వంటనూనెల ఉత్పత్తి 12.64 మిలియన్ టన్నులుగా ఉంది. 14.07 మిలియన్ టన్నుల వంటనూనెలు దిగుమతి జరిగింది. మొత్తం వంటనూనెల వినియోగంలో52 శాతం దిగుమతుల ద్వారా లభించాయి. మొత్తం దిగుమతులకు ఒక లక్షానలభై వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి.
భవిష్యత్తులో లక్ష్యాలు
దేశంలో వంటనూనెలు, ఆయిల్పామ్ ఉత్పత్తిని పెంచటానికి ఒక జాతీయ మిషన్ పనిచేస్తున్నది. తమ వ్యూహం, మద్దతు వల్ల దేశంలో నూనెగింజల సాగు, ఉత్పత్తి, వంటనూనెల తయారీ ఊపందుకుంటాయని ఈ మిషన్ కొన్ని లక్ష్యాలను నిర్దేశించింది. నూనెగింజల సాగు 2025-26 కి 322.8 లక్షల హెక్టార్లకు, 2030-31కి 338.1 లక్షల హెక్టార్లకు పెరుగుతుందని అంచనా వేసింది. సగటు దిగుబడి 2025-26కి 1676 కిలోలకు, 2030-31కి 1781 కిలోలకు పెరుగుతుందని ఆశిస్తున్నారు. ఫలితంగా నూనెగింజల ఉత్పత్తి 2025-26కి 541 లక్షల టన్నులకు, 2030-31కి 602 లక్షల టన్నులకు చేరుకుంటుందని భావిస్తున్నారు. వంటనూనెల దేశీయ ఉత్పత్తి 2025-26 నాటికి 18.5 మిలియన్ టన్నులకు, 2030-31 నాటికి 22.8 మిలియన్ టన్నులకు పెరుగుతుందని ఊహిస్తున్నారు. అందువల్ల వంటనూనెల దిగుమతి 2025-26 నాటికి 9.5 మిలియన్ టన్నులకు, 2030-31 నాటికి 7.2 మిలియన్ టన్నులకు తగ్గుతుందని అచంనా వేశారు. దిగుమతుల విలువ 2025-26 నాటికి 95 వేల కోట్లకు, 2030-31 నాటికి 70 వేల కోట్లకు తగ్గుతాయని ఆశిస్తున్నారు. మొత్తం వంటనూనెల వాడకంలో దిగుమతుల వాటా 2025-26 నాటికి 36 శాతానికీ, 2030-31 నాటికి 23 శాతానికి తగ్గుతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం సగంపైగా దిగుమతుల ద్వారా వంటనూనెలు లభిస్తుంటే 2030-31 నాటికి పావు వంతు కన్నా తక్కువ స్థాయికి దిగుమతులుంటాయని భావించడం అత్యాశగానే కనిపిస్తున్నది. స్వాతంత్య్రం లభించినప్పటి నుండీ అనేక పథకాలు, మిషన్లు ప్రవేశపెట్టినప్పుడు భారీ లక్ష్యాలను ప్రకటించాయి. కాని అవి పాక్షికంగానే నెరవేరాయి. పథకాలు, మిషన్లు రూపొందించే అధికారులకు ఎగుమతి, దిగుమతి విధానాలను నిర్ణయించే అధికారం ఉండదు. దేశంలో నూనెగింజల ఉత్పత్తిని పెంచాలంటే రైతులకు నూనెగింజల సాగు గిట్టుబాటు కావాలి. 2023లో పామాయిల్ ధర టన్నుకి 980 డాలర్లుగా ఉంది. 2022లో 1276 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకున్న ధరలు ఈ సంవత్సరంలో 27 శాతం తగ్గాయి. దేశంలోకి దిగుమతి అవుతున్న ముడి పామ్ ఆయిల్, ముడి పొద్దుతిరుగుడు గింజనూనె, ముడి సోయాచిక్కుడు గింజ నూనెలపై గతంలో 2.5 శాతం దిగుమతి సుంకం ఉండేది. ఇప్పుడు దానిని పూర్తిగా తీసివేసారు. ఈ వంట నూనెలపై అగ్రికల్చరల్ సెస్ని 5 శాతానికి తగ్గించారు. మనదేశం దిగుమతి చేసుకుంటున్న వటనూనెల్లో 62 శాతం వాటా పామ్ ఆయిల్దే. సోయాచిక్కుడు గింజల నూనె వాటా 22 శాతం, పొద్దుతిరుగుడు గింజల నూనె వాటా మరో 15 శాతంగా ఉన్నాయి. ఈ మూడు రకాల వంటనూనెలు తక్కువ సుంకంతో దిగుమతి కావడం వల్ల దేశీయంగా నూనెగింజల ధరలు పెరగటం లేదు. ప్రస్తుతం వేరుశనగ ధర క్వింటాలుకి రూ.6724 గా ఉంది. కనీస మద్దతు ధర రూ. 6373తో పోలిస్తే మార్కెట్ ధర కొంచెం ఎక్కువగా ఉంది. కాని ఆవాల మద్దతు ధర క్వింటాలుకి రూ. 5450/- కాగా మార్కెట్ ధర రూ. 5,268గా ఉంది. అలాగే సోయాచిక్కుడు ధర రూ. 4494/- కూడా మద్దతు ధర రూ. 4600 కన్నా తక్కువగా ఉంది. ఇలా ముఖ్యమైన నూనెగింజల ధరలు మద్దతు ధరలకు కొంచెం అటూ ఇటూగా ఉంటున్నాయి. కనీస మద్దతు ధరల కన్నా పదిశాతం ఎక్కువగానైనా మార్కెట్ ధరలుంటే రైతులకు గిట్టుబాటుగా ఉంటుంది. అలా ఉండాలంటే దిగుమతులపై 10 శాతమైనా దిగుమతి సుంకాలుండాలి. వినిమయదారులకు తక్కువ ధరలకు వంటనూనెలు లభించాలని ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని సున్నా శాతానికి తగ్గించింది. వినిమయదారులకు తక్కువ ధరకు వంటనూనె లభిస్తుంటే రైతులకు గిట్టుబాటు ధరలు లభించవు. ఇలా రైతుల, వినిమయదారుల ప్రయోజనాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ప్రభుత్వం ఎవరి పక్షాన నిలుస్తుందో అనేదానిపై వారిమధ్య ఆదాయ పంపిణీ ఉంటుంది. గత మూడు థాబ్దాలుగా ప్రభుత్వం వినిమయదారుల పక్షాన నిలవటం వల్ల నూనెగింజల్ని పండించే రైతులకు గిట్టుబాటు ధరలు లభించలేదు. ఫలితంగా రైతులకు ఆ పంటపై ఆసక్తి తగ్గి, ఉత్పత్తిని పెంచలేదు. దిగుమతుల్ని తగ్గించి, దేశీయంగా నూనెగింజల ఉత్పత్తిని పెంచాలంటే, కొంతవరకు వినిమయదారుల్ని బాధించక తప్పదు.
అడవులలో పెరిగే చెట్లు మరియు రోడ్ల వెంబడి పిచ్చి పిచ్చిగా పెరిగే మొక్కలు అన్నీ ఆరోగ్యంగా పెరుగుతుండడం అందరికి తెలిసిందే. ఈ మొక్కలకు ఎవరు బయట నుండి ఎటువంటి పోషకాలు అందించకుండానే వాటంతటవే ఎదుగుతూ ఎలాంటి చీడపీడలు ఆశించకుండా ఆరోగ్యంగా పెరగడం గమనించదగ్గ విషయం. అంటే అవి పెరిగే మట్టిలో నుంచి పోషకాలను తీసుకుంటాయి కాబట్టి మట్టిలో అన్ని రకాల పోషకాలు అందుబాటులో ఉంటాయనే విషయం ఇక్కడ అర్థమౌతుంది. కాబట్టి మట్టి ద్రావణంతోనే తెగుళ్ళు మాయం అని డిసెంబర్ 6న ‘నాబార్డు’ సహకారంతో ‘రైతునేస్తం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జిల్లా, కీసర మండలం, కుందనపల్లి గ్రామం ప్రాకృతిక రైతు, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ సాగు, మిశ్రమాలు, కషాయాల తయారీ మరియు పంట ఉత్పత్తులకు విలువ జోడిరపుపై జరిగిన అవగాహన సదస్సులో ప్రాకృతిక రైతు చింతల వెంకటరెడ్డి అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిలక్ష్మి, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.
భూమి పైపొర అంటే రెండు, మూడు అంగుళాల మందం ఉన్న మట్టిని పై మట్టిగా తీసుకోవాలి. అదే విధంగా భూమిపై నుండి ఒక అడుగు వదలివేసి రెండవ అడుగునుండి ఎంత లోతుగా అవకాశం ఉంటే అంత లోతులో సేకరించే మట్టిని లోపలి మట్టిగా భావించాలి. పై మట్టి 15 కేజీలు మరియు లోపలి మట్టి 15 కేజీలు తీసుకొని మొత్తం 30 కిలోల మట్టిని 200 లీటర్ల నీటిలో కలిపి కొద్దిసేపు తిప్పినట్లైతే అందులో జిగట వస్తుంది. అప్పుడు దానిని తేరుకునేలాగ చేసి వడపోసుకొని అన్ని పంటలపై పిచికారి చేసుకొని వివిధ రకాల చీడపీడలను నివారించుకోవచ్చని వివరిస్తూ తాను పాటించే పద్ధతులను చింతల వెంటకరెడ్డి విపులంగా వివరించారు.
సేంద్రియ సాగులో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు మరియు ద్రావణాల గురించి వాటి తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ వ్యవసాయ శాఖ ఏ.డి. డి. ఆదిలక్ష్మి వివరించడం జరిగింది. పంట ఉత్పత్తులకు విలువ జోడిరపునకు సంబంధించిన సమాచారాన్ని వాటికి సంబంధించిన యంత్రపరికరాలను, విలువ జోడిరపు వలన రైతులకు లభించే అధిక ఆదాయం గురించి రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వేంకటేశ్వరరావు వివరించారు. చింతల వెంకటరెడ్డి గారి వ్యవసాయ క్షేత్రాన్ని ప్రత్యక్షంగా తిలకించారు. మట్టి ద్రావణం తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు. అనంతరం హాజరైన రైతులకు సర్టిఫికెట్లు అందజేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరి కోతలూ, నూర్పిడిలూ ముమ్మరంగా జరుగుతున్నాయి. మద్దతు ధర కంటే ఎక్కువ రేటు పెట్టి కొంటామన్న హామీలు ఇంకా మొదలు కాలేదు. తుపాన్లు, అకాలవర్షాల వలన, రెండు తెలుగు రాష్ట్రాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది. పెంచిన రైతు బంధు సహాయం కూడా ఇంకా మొదలు కాలేదు. చలికాలం పంటల సాగు కూడా మొదలయింది. ఈ నేపధ్యంలో జనవరి (పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ కార్తెలు) లో వివిధ పంటలలో చేయవలసిన వ్యవసాయ పనులను గూర్చి, పండిన పంటను అమ్ముకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన మెలకువలను గురించి…
వరి: వర్షాకాలపు వరి పంట కోతలు కొన్ని చోట్ల పూర్తి అవగా, ఇంకొన్ని చోట్ల నడుస్తున్నాయి. తుపాన్ల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా నష్టం వాటిల్లింది. తెలంగాణాలో తూర్పు ప్రాంత జిల్లాల్లో కూడా బాగా నష్టం జరిగింది. వడ్ల సేకరణ ఇంకా మొదలు కాలేదు. త్వరగా ప్రొక్యూర్మెంటు చేసి, రైతుల బాధలు తగ్గించడం అత్యవసరం. మద్దతు ధర కంటే అధికంగా ఇస్తామన్న ధరను తెలంగాణాలో అమలు త్వరగా చేస్తే రైతుకు మేలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా సేకరణ ధర పెంచాల్సిన అవసరముంది. ఎక్కువ ధర పెట్టి కొన్న ధాన్యాన్ని కర్ణాటక వంటి రాష్ట్రాలకు పంపే అవకాశమున్నందున, సేకరణ ధర పెంచి తెలుగు రైతులకు మేలు చేయవచ్చునని నా అభిప్రాయం. వరి పంటను ఇతర దేశాలకు ఎగుమతికి అనుమతించి మన రైతులకు ఇంకా ఎక్కువ మేలు చేయవచ్చు. చలికాలం వరిని జనవరి మొదటి వారం లోపల విత్తితేనే అధిక దిగుబడులు సాధ్యం. నిదానిస్తే దిగుబడి బాగా తగ్గుతుంది. మొలకెత్తిన విత్తనాలను ప్రధాన పొలంలో తయారు చేసిన భూమిలో బురదనీటిలో వెదజల్లడం లేక డ్రమ్సీడర్ ద్వారా విత్తడం చేయవచ్చు. కొత్తరకాలను, వాటికి మంచి ధర వస్తుందో, రాదో తెలియని రకాలను, కొద్ది విస్తీర్ణంలో పరీక్షించడానికి మాత్రమే సాగు చేయాలి. పండించిన పంటకు మంచి లాభాలొస్తాయని నిరూపణ అయిన రకాలను విస్తారంగా పంట పెట్టవచ్చు. ప్రస్తుతం వరికి మంచి గిరాకీ ఉంది.
మొక్కజొన్న: దుక్కి దున్నకుండా వరి మాగాణులలో నేరుగా విత్తడానికి ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర ప్రాంతంలో జనవరి మొదటివారం వరకు అనుకూలం. ఆ తరువాత విత్తితే దిగుబడులు బాగా తగ్గుతాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాలు మొక్కజొన్నను జనవరిలో విత్తడానికి అంత అనుకూలం కాదు. నవంబరు-డిసెంబరు నెలల్లో విత్తిన మొక్కజొన్న పంటలో అంతర కృషి, పైపాటి ఎరువులు వేయుట, సస్యరక్షణ, కలుపు నివారణ జనవరిలో చేయాల్సి ఉంటుంది. సస్యరక్షణలో ముఖ్యంగా కాయతొలుచు పురుగు, కత్తెర పురుగులు సమస్యాత్మకము. వీటిని వెంటనే అదుపు చేయాల్సి ఉంటుంది.
జొన్న: సెప్టెంబరు, అక్టోబర్లలో విత్తిన, మాఘీ, రబీజొన్న కోతలు జనవరిలో ఉంటాయి. చలికాలం జొన్న విత్తడం తెలంగాణలో డిశంబరులోపు పూర్తి చేయాలి. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆలస్యంగా జనవరిలో కూడా విత్తుతారు. అవి ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాలు. అనుకూలమైన రకం: పర్భని శక్తి (ఐ.సి.ఎస్.ఆర్-14001). నీటి తడులతో విత్తన దిగుబడి 28-32 క్వి/ఎ. చొప్ప దిగుబడి 1.6-2.0 ట/ఎ. తెల్లగింజ. 120 రోజుల పంట. ఎకరాకు 3 కిలోల విత్తనం సరిపోతుంది. చేను మీద పడిపోదు. విత్తనాలను తయారు చేసి అమ్ముకుంటే రైతుకు మంచి లాభాలుంటాయి. జొన్న మార్కెట్ ధరలు మద్ధతు ధరల కంటే బాగా ఎక్కువగా ఉన్నాయి.
సజ్జ: రెండు తెలుగు రాష్ట్రాల్లో సజ్జ పంటను జనవరిలో విత్తవచ్చు. విత్తనోత్పత్తి కూడా చేపట్టవచ్చు. హైబ్రిడ్లతో సమానమైన గింజ దిగుబడినివ్వగలిగిన కాంపోజిట్ రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాంపోజిట్ విత్తనాల నుండి పండించిన విత్తనాలను రైతులు తిరిగి విత్తుకోవచ్చు. అనుకూలమైన కాంపోజిట్ రకాలు: ఎ.బి.వి-04, రాజ్-171, ఐ.సి.టి.పి-8203. సజ్జ మద్దతు ధర: రూ.2500/క్వి.
రాగి: ఈ పంటను నీటి పారుదల సౌకర్యమున్న చోట 2 తెలుగు రాష్ట్రాల్లో, జనవరిలో విత్తవచ్చు. నారుపోసి, నారు ఎదిగినాక నాటవచ్చు. విత్తనోత్పత్తి కూడా చేపట్టవచ్చు. వానాకాలం, చలికాలం, వేసవిలలో పండే అధిక దిగుబడి (14-15 క్వి/ఎ.) నివ్వగలిగిన రకాలు: భారతి, ఇంద్రావతి, సువర్ణముఖి, తిరుమల.
పెసర: నవంబర్లో విత్తిన పెసర జనవరిలో కోతకొస్తుంది. పెసర మద్దతు ధర రూ.8558/- క్వి. వరి మాగాణుల్లో పెసరను జనవరిలో విత్తవచ్చు. ఫిబ్రవరిలో విత్తితే అత్యధిక దిగుబడులొస్తాయి. విత్తే సమయంలో ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కంటే పై నుంటే మొక్క మొలుస్తుంది. తక్కువగా ఉంటే మొలక మొలవడం నిదానమవుతుంది. అందువలన ఉష్ణోత్రలు పెరిగేదాక ఆగి విత్తడం మంచిది. జనవరిలో విత్తడానికనువైన రకాలు: టి.ఎం-96-2, డబ్ల్యు.జి.జి-42 (యాదాద్రి), ఎల్.జి.జి-460, ఎల్.జి.జి-410, ఎల్.జి.జి-407, ఎం.జి.జి-351 (శ్రీరామ).
మినుము: అక్టోబరు-నవంబరులలో విత్తిన మినుము జవనరిలో కోతకొస్తుంది. జనవరిలో విత్తాలంటే 15 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలుంటే మొక్క మొలుస్తుంది. తక్కువ ఉంటే నిదానంగా మొలుస్తుంది. పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకాలు: అన్ని కాలాలకు అనువైన పాలిష్ రకాలు: టి.బి.జి-104, జి.బి.జి-1. మద్దతు ధర రూ. 6950. మార్కెట్ ధరలు దీనికంటే అధికంగా ఉన్నాయి.
నవ్వులు: నువ్వు పంటలో అత్యధిక దిగుబడులు సాధించాలంటే కోస్తా జిల్లాల్లో డిశంబరు 15 నుండి జనవరి 15 వరకు, తెలంగాణలో జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు, రాయలసీమలో జనవరి 2-3 వారాలలో విత్తుకోవాలి. అన్ని ప్రాంతాల్లో అత్యధిక దిగుబడినిచ్చే రకం: జగిత్యాల తిల్-1 (జె.సి.ఎస్-1020). 5-8 క్వి/ఎ. పంటకాలం: 85-90 రోజులు. తెల్లగింజ. శ్వేత, హిమ, రాజేశ్వరి రకాలకంటే ఎక్కువ దిగుబడినిస్తుంది. బూడిద తెగులును, ఆకుమచ్చ తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. ఈ రకం విత్తనాలకు మంచి డిమాండు ఉంది. విత్తనోత్పత్తి చేసి లాభపడవచ్చు. మద్ధతు ధర రూ. 8635/క్వి.
ప్రొద్దుతిరుగుడు: వరి మాగాణుల్లో ప్రొద్దుతిరుగుడు విత్తడానికి డిశంబరు ఆఖరివారం నుండి జనవరి మొదటి వారం వరకు అనుకూలం. భూమి తయారు చేసి విత్తాలంటే జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 వరకు విత్తడం మేలు. విత్తనోత్పత్తికి కూడా ఈ సమయాలలో విత్తడం అనుకూలం. బైబ్యాక్ అగ్రిమెంట్లు కుదుర్చుకొని హైబ్రిడ్ ప్రొద్దుతిరుగుడు విత్తనోత్పత్తి చేపట్టడానికి కూడా ఈ సమయంలో విత్తడం అనుకూలం. వివిధ కంపెనీల ప్రొద్దుతిరుగుడు హైబ్రిడ్లను కూడా అగ్రిమెంట్ల ద్వారా ఈ నెలలో ఉత్పత్తి చేపట్టి అధిక దిగుబడి పొందవచ్చు.
వేరుశనగ: వేరుశనగ విత్తనాలకు విపరీతమైన డిమాండు ఉన్నది. పచ్చికాయలుగా అమ్మడానికి అనుకూలమైన రకాలు: విశిష్ట (టి.సి.జి.ఎస్-1694), కదిరి-7, కదిరి-9, నిత్యహరిత. ఈ రకాల విత్తనాలను ఎంత ఉత్పత్తి చేసినా చాలడం లేదు. విత్తుకునే సీజన్ వచ్చినపుడు విత్తనాల కొరత తీవ్రంగా ఉన్నది. కదిరి లేపాక్షి (కె-1812) రకం అధిక దిగుబడినిస్తున్నప్పటికి వీటి గింజలతో తయారైన పదార్థాలు వగరుగా ఉన్నందున ఈ రకాన్ని కొనడానికి కొందమంది తయారీదారులు విముఖత చూపిస్తున్నారు. నవంబరు, డిశంబరు నెలల్లో విత్తిన వేరుశనగ పంటలో అంతరకృషి, కలుపుతీయుట, సస్యరక్షణ ఈ నెలలో చేపట్టాల్సుంటుంది. చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేరుశనగ ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది. తేమ తక్కువై పంట ఎదగలేదని నీటి తడులు ఇస్తూ పోతే అధిక తేమకు పంట దిగుబడి బాగా పడిపోతుంది.
చెరకు: మోడెం/కార్శి తోటలు పెంచుట, కొత్త తోటలు నాటుట జనవరిలో ఉంటాయి. భూమిలో సరిపడినంత తేమ ఉన్నపుడు కార్శి/మోడెం తోటల్లో సాళ్ళ మధ్య దున్ని భూమి గుల్లబారేలా జనవరిలో చేయాల్సి ఉంటుంది. కొత్తగా చెరకు నాటుకోవాలనే రైతులు, భూమిని లోతుగా దున్ని దుక్కి చేయాలి. పురుగులు, రోగాల బారిన పడని నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. అత్యధిక దిగుబడినిచ్చే రకాలు: ఆంధ్రప్రదేశ్కు: స్వల్పకాలిక రకం: 2009ఎ107 (వశిష్ట): దిగుబడి 50-52 ట/ఎ. చక్కెర 20%. బెండు ఉండదు. పూత పూయదు. నీటి ముంపును, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. మధ్యకాలిక రకం: 86ఎ146: దిగుబడి 61.2 ట/ఎ. చక్కెర 18.5%. బెండు ఉండదు, పూత పూయదు. నీటి ముంపును, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఎర్రకుళ్లు తెగులును సహజ పరిస్థితుల్లో తట్టుకుంటుంది. తెలంగాణకు: స్వల్పకాలిక రకం: 2003వి46 (భరణి): దిగుబడి 50 ట/ఎ. చక్కెర 18%. బెండు లేదు. పూత పూయదు. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఎర్రకుళ్ళు తెగులును తట్టుకుంటుంది. మధ్యకాలిక రకం: 97ఆర్401: దిగుబడి 58 ట/ఎ. చక్కెర 18.5%. బెండు లేదు. కొద్దిగా పూత పూస్తుంది. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఎర్రకుళ్ళు తెగులును కొద్దిగా తట్టుకుంటుంది.
టమాట: ప్రస్తుతం టమాట ధరలు చిల్లరగా కిలోకు 20/- అమ్ముతుండగా రైతు దగ్గర 10 రూపాయల వరకు అమ్ముతున్నది. జనవరిలో నారు పోసి, తర్వాత నాటిన పంట చేతికొచ్చే సమయానికి ధరలు కొద్దిగా పెరగవచ్చు. జూన్-జూలై ప్రాంతంలో ధరలు పెరిగే అవకాశముంది. వాతావరణంలో విపరీత మార్పులొస్తే, అధిక అకాల వర్షాలు, వడగండ్లు వచ్చి పంటలు ఒక ప్రాంతంలో దెబ్బతింటే, మిగతా అన్ని ప్రాంతాల్లోనూ, రేట్లు పెరిగే అవకాశముంది.
వంగ: టమాటతో పోలిస్తే వంకాయల ధరలు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశముంది.
బఠాణీలు, ప్రెంచ్బీన్స్, కొత్తిమీర: చలికాలంలో అధిక దిగుబడి కారణంగా ఈ పంటల ధరలు తక్కువగా ఉండే అవకాశముంది. ధనియాల కొరకు పెంచిన పంట నూర్పిడి మార్కెట్లో అమ్ముట జనవరిలో ఉంటాయి.
బెండ: దిగుబడులు చలికి తగ్గుతాయి. ధరలు ఎక్కువగా ఉండే అవకాశముంది.
బూడిద గుమ్మడి, బీర: వీటిని జనవరి, ఫిబ్రవరి నెలల్లో విత్తవచ్చు. అనుకూలమైన బీర రకాలు: జగిత్యాల లాంగ్, అర్కసుజాత. అనుకూలమైన బూడిద గుమ్మడి రకాలు: బి.హెచ్-24, బి.హెచ్-25.
గుమ్మడి, పొట్ల: వీటిని జనవరి కడవరకు విత్తవచ్చు. మంచి గుమ్మడి రకాలు: పూసా అలంకార్, పూసా విశ్వాస్. నేలపై పెంచడానికనువైన పొట్ల రకం: కో-2.
ఎఫ్.పి.ఓలు మొత్తం భారతదేశంలో చాలా కొద్ది చోట్లనే సక్సస్ అవుతున్నాయి. మిగతా అన్ని చోట్ల ఫెయిలవుతున్నాయి. వీటిపై ఖర్చు చేస్తున్న వేల కోట్ల రూపాయల ప్రజాధనం అనుక్ను ఫలితాలను సాధించలేక నిరుపయోగమవుతున్నది. ఇంత ప్రజాధనాన్ని ప్రతిపల్లె / జనావాసంలో రైతు ప్రజాసంఘాల ఏర్పాటుకు వినియోగించుకుంటే సుమారు 6 లక్షల పైచిలుకు ఉన్న గ్రామాలు, పల్లెలు, మరియు ఇతర జనావాసాలలో రైతు ప్రజాసంఘాలనేర్పాటు చేసి ఉండేవాళ్లం. ఒక్కొక్క జనావాసం/పల్లె సంఘానికి ఒక లక్ష రూపాయలు మంజూరు చేసినా ప్రతి గ్రామంలోను ఇలాంటి సంఘాలేర్పడి ఉండేవి. నేను స్వతంత్రంగా 28 సంవత్సరాలుగా కృషి చేసి, రైతు ప్రజా సంఘాలనేర్పాటు చేశాను. నా స్వంత ఖర్చులతో తిరిగి ప్రయత్నించాను. 800 పైచిలుకు ప్రదేశాలలో, సంఘాలు/సమాఖ్యలు ఏర్పాటుకు ప్రయత్నించడం జరిగింది. అందులో పోయినవిపోను 250 దాకా ఫోనులో కాంటాక్ట్లో ఉన్నాయి. 60కి పైగా నడుస్తున్నాయి.
రైళ్లు నడవాలంటే పట్టాలెంత ముఖ్యమో, పల్లె ప్రాంతాలు, జనావాసాలు, గ్రామీణాభివృద్ధి, ప్రజలు కోరుకున్న విధంగా ఉండాలంటే రైతు ప్రజా సంఘాలు, పార్టీలకతీతంగా ఉండడం అంత ముఖ్యం.
మారుమూల ప్రాంతాలతో సహా అన్ని జనావాసాల్లో ఈ సంఘాలు ఏర్పాటు చేయడం వలన, ప్రజలందరి అభివృద్ధికి తగిన సూచనలు సలహాలు ఇవ్వగలిగిన సంస్థలు ప్రతిచోట ఏర్పడతాయి. ఇవి స్వయం సమృద్ధాలు. స్వతంత్రంగా నిర్ణయాలు నిష్పక్షపాతంగా తీసుకుంటాయి. చిన్న చిన్న సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించుకోవడానికి ఉపయోగపడతాయి. సభ్యులకవసరమైన చిన్న చిన్న డబ్బు అవసరాలను కూడా తీర్చగల్గుతాయి.
ఎవరికీ అన్యాయం జరగకుండా పారదర్శకంగా, అన్యాయాలను ప్రతిఘటిస్తాయి. దిక్కులేని వారికి సహాయకారిగా ఉంటాయి. ఏ పార్టీవారైనా, పార్టీలకతీతమైన సంస్థల ఏర్పాటుకు సహకరించడం వలన చిరస్థాయి కీర్తిని పొందవచ్చు. ఈ రైతు ప్రజా సంఘాలు, వ్యవసాయ, అనుబంధ శాఖల విస్తరణ కార్యక్రమాలకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ప్రతి కుగ్రామానికి విస్తరణ కార్యక్రమాలు సులభంగా అందుతాయి. అన్ని జనావాసాలలో ఇలాంటి సంఘాలు ఏర్పాటు చేయడం ఆచరణ సాధ్యం. వ్యవసాయ అనుబంధ శాఖల వారందరికి శిక్షణలను ట్రెయినర్స్ ట్రైనింగ్ పద్ధతిలో ఇవ్వడం సాధ్యమే. అపార అనుభవాన్నుపయోగించుకోవడానికి ఏ పార్టీ వారైనా, స్వతంత్రులైనా ముందుకు రావచ్చు. అన్ని జనావాసాలలో రైతు ప్రజాసంఘాల ఏర్పాటుకు సహకరించి చిరస్థాయి కీర్తిని పొందండి. తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించిన ప్రపోజల్స్కు సానుకూలంగా స్పందిస్తే ఇంకా ఎక్కువ ప్రజాదరణ పొందే అవకాశముంది. ఇది రానున్న ఎలక్షన్లలో ఓట్లను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. పార్లమెంటు, పంచాయతి ఎలక్షన్లలో ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఎలక్షన్లలో మెజారిటి సాధనకు కూడా ఉపయోగపడుతుంది.
ఆంధ్రప్రదేశ్లో మినుమును అన్ని కాలాల్లో ఏటా 10.02 లక్షల ఎకరాల్లో సాగు చేస్తూ 4.25 లక్షల టన్నుల దిగుబడి చేస్తున్నారు. ఈ సంవత్సరం లోటు వర్షపాతం కారణంగా రబీ కాలం మినుము పంట సాగు ఆలస్యం అవుతుంది. పంట వేశాక లోటు వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత వలన రసం పీల్చే పురుగుల ఉదృతి పెరిగే అవకాశం ఉన్నది. అదేవిధంగా వైరస్ తెగుళ్ళు అయినటువంటి పల్లాకు తెగులు, మొవ్వు కుళ్ళు తెగులు మరియు బొబ్బర తెగులు పంటను ఆశించడానికి అనుకూల వాతావరణం ఉన్నది. వీటిని దృష్టిలో పెట్టుకొని మినుము పంటలో సమగ్ర సస్యరక్షణ పద్దతులను తెలుసుకొని ముందు నుంచి తగిన చర్యలు చేపట్టి అధిక దిగుబడిని పొందవచ్చు.
మినుము పంటను ఆశించు పురుగులు – వాటి నివారణ చర్యలు
1. చిత్త పురుగులు ( Flee Beetles):
పైరు రెండు ఆకుల థలో ఉన్నప్పుడు ఈ పురుగులు పంటను ఆశిస్తాయి.
ఆకుల అడుగు భాగము నుంచి తినడం వలన చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడుతాయి.
2. మారుక మచ్చల పురుగు:
పంట పూత, పిందే థలో ఉన్నప్పుడు ఈ పురుగు పంటను ఆశిస్తుంది.
పూత థలో పూలన్నీ గూడు చేసుకొని లోపల ఉంటూ లోపలి పదార్థాలను తింటాది.
కాయ థలో కాయలన్నీ గూడు చేసి కాయలను రంధ్రం చేసుకొని లోపలి గింజలను తింటాది.
నివారణ చర్యలు: పంట పూమొగ్గ థలో 5 మి.లీ వేపనూనె లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే తల్లి పురుగు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. వేప సంబంధిత మందులు వికర్షకాలుగా పనిచేయడం వలన తల్లి పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు, అంతేగాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పగలి చనిపోతాయి.
3. పొగాకు లద్దె పురుగు:
పిల్ల పురుగులు ఆకులోని పత్రహరితాన్ని గోకి తినడం వలన ఆకులు తెల్లగా జల్లెడ లాగ మారిపోతాయి.
గొంగళి పురుగులు ఆకులని రంద్రాలు చేసి పువ్వులను, పిందెలను తినడం ద్వారా పంట నష్టం వాటిల్లుతుంది.
పొగాకు లద్దె పురుగు నివారణ చర్యలు:
గుడ్ల సమూహము, మొదటి థ పిల్ల పురుగులు ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి.
ఆముదం పంటను ఎర పంటగా ఎకరాకు 50-100 మొక్కల చొప్పున వేసుకోవాలి. లద్దె పురుగులు ఆశించిన ఆముదం మొక్కలను నాశనం చేయాలి.
లద్దె పురుగులు నివారణకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి.
4. తామర పురుగు:
తామర పురుగులు ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీలుస్తాయి.
ఇవి మోవ్వుకుళ్లు మరియు ఆకు ముడత తెగులు కలుగచేసే వైరస్కి వాహకంగా ఉంటూ తెగులును వ్యాపింప చేస్తాయి.
5. తెల్లదోమ:
దీ ఆకుల నుంచి రసాన్ని పీల్చే ఈ తెల్ల దోమ పల్లాకు తెగులు కలుగ చేసే వైరస్కు వాహకంగా ఉంటూ పల్లాకు తెగులు వ్యాప్తికి దోహద పడుతుంది.
మినుము పంటను ఆశించు తెగుళ్ళు – వాటి నివారణ చర్యలు
1. పల్లాకు తెగులు:
మొదటగా తెగులు సోకిన ఆకులపైన చిన్నని లేత పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. క్రమేణా ఈ మచ్చలు పెద్దవిగా అయిపోయి ఆకు అంతా పసుపు రంగులోకి మారిపోతుంది.
తొలి థలోనే తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పైరు మొత్తం పసుపురంగులోకి మారి పూత మరియు పిందే ఏర్పడకుండా ఆకులు వాడిపోయి ఎండి రాలిపోతాయి.
పంటను పూత మరియు పిందె థలో ఈ తెగులు ఆశిస్తే మొక్క తక్కువ పూతను కలిగిఉండి కాయలు పసుపురంగులోకి మారి వంకరలుగా తిరిగి గింజలు లేకుండా తాలు కాయలుగా మారిపోతాయి.
బెమీసియ టబాసి అనే తెల్లదోమ వైరస్ వాహకంగా ఉంటూ తెగులు సోకిన కలుపు మొక్కలు మరియు ఇతర పంటల నుంచి మినుము పంటకు వ్యాపింపచేసి తీవ్ర నష్టాన్ని కలుగచేస్తాది.
యాజమాన్యం:
పల్లాకు తెగులును తట్టుకొనే TBG104, PU31, LBG787, LBG904, VBN8 రకాలు సాగు చేసుకోవాలి.
పంటను విత్తుకొనే ఒక రోజు ముందు విత్తన శుద్ధి చేస్తే పంట తొలి థలో వైరస్ ను వ్యాపింపచేసే తెల్లదోమ బారి నుండి కాపాడవచ్చు.
ఎకరాకు 15 పసుపు రంగు జిగురు అట్టలు అమర్చాలి.
తెగులు సోకిన మొక్కలను మరియు కలుపు మొక్కలను పీకి నాశనం చేయాలి.
వైరస్కు ఎలాంటి మందులు లేవుకావున వైరస్ వాహకం అయినటువంటి తెల్లదోమను నివారించాలి.
2. ఆకుముడత, మొవ్వుకుళ్ళు తెగులు:
ఈ తెగులు లక్షణాలు ఆకుల ఈనెలు, కాండం మరియు మొవ్వుల మీద గమనించవచ్చు.
తెగులు సోకిన మొక్కలోని ఆకుల అడుగుభాగంలో ఈనెలు క్షీణించడం ద్వారా ఎరుపు/గోధుమ రంగులో మారిపోయి క్రమేణా ఆకుల తొడిమలకు మరియు కాండంకు వ్యాపిస్తుంది.
తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు వెనుకకు ముడుచుకుపోయి రాలిపోవడం జరుగుతుంది.
తొలి థలోనే ఈ తెగులు ఆశిస్తే మొక్కల తలలు మాడిపోయి గిడసబారి ఎండిపోతాయి.
ఈ తెగులు పంట ముదురు థలో ఆశిస్తే తక్కువ కాయలను కలిగిఉండి కాయలు క్షీణించి దిగుబడి తగ్గుతుంది.
ఈ వైరస్లు ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు తామరపురుగుల ద్వారా వ్యాపిస్తాయి.
యాజమాన్యం
పొలం గట్ల మీద మరియు పంటపొలంలో కలుపు మొక్కలు ముఖ్యంగా వయ్యారిభామను పీకి తగలపెట్టాలి.
ఎకరాకు 15 నీలం రంగు జిగురు అట్టలు అమర్చాలి.
3. సీతాఫలం తెగులు / బొబ్బర తెగులు
తెగులు ఆశించిన మొక్కలలో ఆకులు పెద్దవిగా అయిపోయి ఆకులపై ఉబ్బెత్తుగా అయి మడతలు పడుతాయి ఇవి చూడటానికి సీతాఫలం కాయలాగా అగుపిస్తాయి కావున దీనిని సీతాఫలం తెగులు అంటారు.
ముదురు ఆకులలో ఈ ముడతలు ఎక్కువగా ఉండి ఆకు మందంగా తయారవుతాది.
తెగులు సోకిన మొక్కలలో పూత ఆలస్యంగా వచ్చి పూల మొగ్గలు చిన్నవిగా ఉండి కాయలు ఏర్పడవు.
పెనుబంక, తెల్ల దోమల ద్వారా తెగులు సోకిన మొక్కల నుంచి ఆరోగ్యకరమైన మొక్కలకు వ్యాపింప చేస్తుంది.
యాజమాన్యం: ఈ తెగులు ఎక్కువగా విత్తనం ద్వారా వ్యాపిస్తుంది కావున ఆరోగ్యకరమైన వైరస్ లేని మొక్కల నుంచి సేకరించిన విత్తనాన్ని ఎంచుకొని విత్తుకోవాలి
వైరస్ తెగుళ్ళు సమగ్ర సస్యరక్షణ:
ఈ ముడురకాల వైరస్ తెగుళ్ళు రసం పీల్చు పురుగులు అనగా తెల్లదోమ, తామరపురుగు మరియు పెనుబంక ద్వారా వ్యాపిస్తాయి కావున వీటిని నివారిస్తే వైరస్ తెగుళ్ళును నివారించగలము.
రసం పీల్చు పురుగుల నివారణకు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి.
పొలం లోపల మరియు గట్లమీద కలుపుమొక్కలు పీకి తగలబెట్టాలి.
వైరస్ తెగులు సోకిన మొక్కలను పెరికేసి తప్పనిసరిగా కాల్చివేయాలి.
దీ పొలం చుట్టూ మొక్కజొన్న కాని జొన్న కాని లేదా సజ్జలను నాలుగు వరుసలలో రక్షణ పంటగా వేసుకుంటే రసంపీల్చే పురుగులను పంటలోపలికి రాకుండా నివారించవచ్చు.
ఒక ఎకరా పొలంలో కనీసం 15 చొప్పున పసుపు, నీలం మరియు తెలుపు రంగు జిగురు అట్టలను అమర్చితే రసం పీల్చే పురుగులను కొంతవరకు నివారించవచ్చు మరియు వాటి ఉధృతిని అంచనావేసి రసాయనిక మందులను పిచికారి చేయవచ్చు.
విత్తిన 20 రోజులకు 5 మీ.లీ. వేపనూనెను లేదా 5% వేపగింజల కషాయాన్ని పిచికారి చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు పంటను ఆశించకుండా నివారించవచ్చు మరియు ఆప్పటికే పంటలో ఉన్న గ్రుడ్లును నాశనం చేయవచ్చు.
4. సర్కోస్పోరా ఆకు మచ్చ తెగులు
తెగులు సోకిన ఆకులపై గోధుమ రంగు చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి.
అనుకూల వాతావరణ పరిస్థితులలో అనగా గాలిలో అదిక తేమ శాతం, అధిక వర్షాలు, అధిక మొక్కల సాంద్రత ఉన్నప్పుడు చిన్న మచ్చలు కలిసిపోయి పెద్దవిగా మారి మచ్చల అంచులు ముదురు గోధుమరంగులో, మచ్చ లోపలి భాగం తెలుపు రంగులో మారిపోతాయి.
తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులన్నీ ఎండి రాలిపోతాయి.
5. కొరినోస్పోరా ఆకు మచ్చ తెగులు
పూతథలో ఆకులపైన చిన్న చిన్న గుండ్రని గోధుమ రంగు వలయాకార మచ్చలు ఏర్పడుతాయి.
అవి క్రమేణా పెద్దవిగా మారి మచ్చలోపలి భాగం కుళ్లిపోయి రంధ్రాలుగా మారుతాయి, తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులన్నీ ఎండి రాలిపోతాయి.
6. బూడిద తెగులు:
గాలిలో అధిక తేమ శాతం, మబ్బులతో కూడిన వాతావరణం గల రబీ సీజన్లో బూడిద తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటది.
విత్తిన 30-35 రోజులలో ముదురు ఆకుల పైభాగాన చిన్నని బూడిద వంటి తెలుపు మచ్చలు ఏర్పడి క్రమేణ పెద్దవిగా మారి ఆకు అడుగుభాగాన, కొమ్మలు మరియు కాయలను వ్యాపిస్తాయి.
తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకు అంతా తెలుపురంగు బూడిదతో కప్పబడి క్రమేణా పసుపు రంగులోకి మారి ఆకులన్నీ రాలిపోతాయి.
గమనిక: మినుము పంటను ఆశించే వివిధ రకాల చీడపీడలు, తెగుళ్ళ నివారణకు సరైన చర్యలు చేపట్టి నివారించుకోవాలి.
డా. డి. విజయ్ కుమార్ నాయక్ ఐఖఐ (సస్యరక్షణ విభాగం); డా. కే. కిరణ్ కుమార్ రెడ్డి ఐఖఐ (సేద్య విభాగం); డా. ఎస్. లోకేష్ బాబు ఐఖఐ (విస్తరణ విభాగం); డా. ఆర్.సుజాత ఐఖఐ (గృహ విభాగం); హరి సాదు ఐఖఐ (మత్స్య విభాగం); డా. జి.ఎల్. శివజ్యోతి, సమన్వయ కర్త, కృషి విజ్ఞాన కేంద్రం, నెల్లూరు. ఫోన్ : 99485 42942
విచక్షణా రహితంగా యాంటిబయోటిక్స్ వాడటం వల్ల మనుషులలోనే కాక పశువులు-పకక్షులు, కోళ్లు, చేపలలో కూడా అనేక వ్యాధుల్ని కలిగించే వందల రకాల బాక్టీరియా క్రిములు కాలక్రమంలో ఈ యాంటిబయోటిక్స్ను తట్టుకోగల శక్తిని పుంజుకుని, యాంటిబయోటిక్ రెసిస్టెన్సును పొంది మొండిగా మారిపోతున్నాయి. ఇందువల్ల ప్రజారోగ్యంతో పాటు, అనేక జంతువులు, చేపలు, రొయ్యల వంటి ఆక్వారంగంలోని జీవులు కూడా ప్రాణాలను కోల్పోతున్నాయి. క్షయ, ఆంథ్రాక్స్, బ్రూసెల్లోసిస్, గర్భవాతం, పొదుగువాపు, న్యుమోనియా మరియు అనేక నిర్ధిష్టత లేని అంటువ్యాధులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఏటా ప్రపంచవ్యాప్తంగా సామర్థ్యాన్ని కోల్పోయిన యాంటిబయోటిక్స్ పనిచేయకపోవుటవలన ఏటా సుమారు 60 నుండి 70 లక్షల మంది మనుషులు ప్రాణాలు కోల్పోతున్నట్లు ఒక అంచనా! ఇక ఈ కారణంగానే మృత్యువాత పడుతున్న పశువులు, ఇతర జంతువుల గురించి సరైన అంచనా లేదు. గత నాలుగేళ్లుగా లక్షల ప్రాణాలను హరిస్తున్న కోవిడ్-19 మరియు లంపీస్కిన్ డిసీజ్లో విచక్షణా రహితంగా ఒకేసారి 3-4 రకాల యాంటిబయోటిక్స్ను వాడుట వల్ల ఈ ముప్పు మరింతగా ఎక్కువయింది.
విశ్వప్రాణదాత సర్ లూరిస్పాశ్చర్ ఎనిమిదిన్నర థాబ్దాల క్రితం కనిపెట్టిన పెన్సిలిన్ గత కొన్నేళ్ల వరకు ప్రపంచవ్యాప్తంగా కొన్నివందల కోట్ల మానవ ప్రాణాలను గనేరియా, న్యుమోనియా మరియు కొన్ని వందల రకాల ఇతర బాక్టీరియా వల్ల వచ్చే అనేక వ్యాధులబారి నుండి కాపాడింది. ఇదే పెన్సిలిన్ పొదుగువాపు, న్యుమోనియా వంటి వ్యాధుల్ని కలిగించే స్ట్రెప్టోకాకస్, స్టెఫలోకాకస్ వంటి ఎన్నో రకాల ప్రాణాంతక బాక్టీరియాల బారి నుండి కూడా కాపాడింది. ఇంతటి మహోన్నతమైన పెన్సిలిన్తో పాటు ఆ తర్వాత మన తెలుగువాడైన డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావుగారు రూపొందించిన ఆరియోమైసిన్ అనే అత్యంత సమర్ధవంతమైన గ్రామ్ (-) మరియు గ్రామ్ (+) రకాల బాక్టీరియాను అదుపు చేసి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రాణాలను కాపాడింది. అయితే ఈనాడు ఇదే ఆరియోమైసిన్ తన సమర్ధతను, ప్రాభవాన్ని కోల్పోయి కనుమరుగై పోయింది. ఇదే బాటలో క్లోర్టెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్, ఎమాక్సీసిల్లిన్, స్ట్రెప్టోమైసిన్, క్లాక్సోసిల్లిన్, జెంటామైసిన్, సెఫటాక్సిమ్ మరియూ ఎన్నో రకాల సల్ఫా మందులు కూడా నానాటికీ నిర్వీర్యమైపోతూ, అత్యంత సమర్ధత అనుభవాలు కలిగిన వైద్యుల్ని సైతం నిస్సహాయుల్ని చేస్తున్నాయి. ఒకప్పుడు అద్భుతంగా పనిచేసిన టెర్రామైసిన్ (ఆక్సీటెట్రాసైక్లిన్) ఈనాడు ఏ మాత్రమూ నమ్మదిగిన స్థాయిలో లేదు.
ఈ దుస్థితికి తగిన విద్యార్హతలు, చిత్తశుద్ధి, నిబద్ధత లేని ప్రజావైద్యులు, పశువైద్యులతో పాటు, సరియైన అవగాహనలేని వైద్యసిబ్బంది, మిడిమిడి విజ్ఞానంతో పశువుల వైద్యాన్ని చేపడుతున్న కుహానా నాటువైద్యులు, డాక్టర్లతో పాటు ప్రజావైద్య మరియు పశువైద్యులు కూడా కారకులేనని చెప్పక తప్పదు. కొందరు పశుపోషకులు కావాలని అవసరం లేని అదనపు యాంటీబయోటిక్స్ను తమ పశువులకు వాడవలసిందిగా వైద్యుల మీద వత్తిడి తెస్తున్నారు. లేదా స్వయంగా మిడిమిడి పరిజ్ఞానంతో వాడుతున్నారు. వాస్తవానికి ఇటువంటి అరకొర పరిజ్ఞానుల వల్లనే జంతువులలోని బాక్టీరియా మొండిగా మారుతూ మనుషులలో కూడా ప్రవేశించి మొండి వ్యాధుల్ని కలిగిస్తున్నాయి.
ఇదే ధోరణి ఇంకా కొనసాగితే ప్రాణాంతక అంటురోగాలబారి నుండి మానవాళిని, జంతుజాలాన్ని రక్షించుట మరింత కష్టతరం కావచ్చు. చివరకు వ్యవసాయరంగంలో కూడా ఒక థలో ఈ యాంటి బయోటిక్స్ వాడకం పెరిగి, అదృష్టవశాత్తు ఇప్పుడు కొంత తగ్గింది. చేపల చెరువులలో వాడే యాంటిబయోటిక్స్ సైతం ఈ సమస్యను జటిలం చేస్తున్నాయి.
మనుషుల్లో కోవిడ్-19, పశువుల్లో లంపీస్కిన్ డిసీజ్ వ్యాధులు ఉధృతంగా ప్రబలిన రోజుల్లో 3-4 రకాల యాంటిబయోటిక్స్ను అత్యధిక మోతాదుల్లోనూ లేదా నిర్దేశించిన మోతాదు కంటే తక్కువగా ఒకేసారి వాడటం. ఈ మందులు వాడిన తర్వాత మరణించిన రోగుల్ని సమర్ధవంతంగా దహనం చేయటం లేదా భూమిలో లోతుగా పూడ్చటం వంటి కనీస జాగ్రత్తల్ని సైతం పాటించకపోవడం వంటి చర్యలు కూడా కొంతవరకు యాంటిబయోటిక్ రెసిస్టెన్స్ సమస్య తీవ్రతకు కారణమయ్యాయి.
ఇటువంటి రెసిస్టెన్స్ కేవలం బాక్టీరియాలోనేకాక అనేక వైరస్, ఫంగస్ మరియు ప్రేగులు-ఇతర అవయవాలలో అనేక వ్యాధుల్ని కలిగించే పరాన్నజీవులలో కూడా కనిపిస్తూ ఉంది. అందుకే అనేక నట్టల మందులతోపాటు సర్రా, బెబీసియోసిస్ మరియు థెయిలీరియాసిస్ వంటి రక్త వ్యాధుల చికిత్సకు వాడే మందులు కూడా పూర్వపు సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. ఇప్పుడు డి.డి.టి., గమాక్సిన్ వంటి కీటకనాశకాలు కూడా సంతృప్తికరంగా పని చేయని విషయం మనం చూస్తూనే ఉన్నాము.
ఏవిధంగా ఈ రెసిస్టెన్స్ కలుగుతోంది?
వ్యాధిక్రిముల్ని సమర్ధవంతంగా నిర్మూలించలేని మోతాదులో వాడటం, వాడవలసినంత వ్యవధుల లోపల, కావలసినంత దీర్ఘకాలం పాటు పశువు శరీరంలో ఈ మందుల పరిమాణం లేకపోవటం, కల్తీ మందులు, కాలం చెల్లిన మందుల్ని వాడటం, ఒకేసారి అనేక మందుల్ని కలిపి వాడటం, రోగస్రావాలు, కృళ్లిపోయిన అవయవాలలో పెరిగిపోయే క్రిముల పట్ల అశ్రద్ధవహించటం వంటి చర్యలు అనేక బాక్టీరియాలు, ఇతర క్రిములలో రెసిస్టెన్స్ను పెంచుతున్నాయి. కాలం చెల్లిన యాంటిబయోటిక్స్ మందుల్ని చికిత్సలో మిగిలిన మందుల్ని బాధ్యతారహితంగా జలవనరులలోనూ, బహిరంగ ప్రదేశాలలో పెంచుట వల్ల కూడా ప్రకృతిలోని క్రిములు రెసిస్టెన్స్ను పొందగల్గుతున్నాయి. యాంటిబయోటిక్ అవశేషాలు కలిగిన జంతువుల మాంసాన్ని, వ్యర్థాలను కుక్కలు, పిల్లులు, ఇతర జంతువులు తినడం వల్ల కూడా ఇన్ఫెక్షన్లతో పాటు, రెసిస్టెన్స్ సమస్య కూడా తలెత్తే ముప్పు ఉంటుంది. ఈ సమస్య జంతుప్రదర్శనశాలలోని మాంసాహార జంతువులలో ఎక్కువగా కనిపించవచ్చు.
ఈ సమస్య నివారణ ఎలా?
సాధారణంగా ప్రతిజీవికీ అనేక రోగక్రిముల దాడి నుండి తమకుతామే సమర్ధవంతంగా ఎదుర్కోగలిగే సహజ శక్తి ఉంటుంది. అందుకే అనాదిగా ఏ యాంటిబయోటిక్ సాయం లేకుండా ఎన్నో ప్రాణులు బ్రతకగల్గుతున్నాయి. వైద్యుడు ఈ అవకాశాన్ని తెలుసుకుని, పశువు తనంతట తానుగా క్రిముల్ని ఎదిరించే అవకాశం కొంతవరకు ఇవ్వాలి. అవసరమైతే వ్యాధి నిరోధక శక్తిని పెంచే వెవామెజోల్ వంటి ఇంజక్షన్లతో చికిత్సను ప్రారంభించవచ్చు. అందుకని అనవసర జాప్యం చేయాలని చెప్పుట నా ఉద్దేశం కాదు. ఆకలి మందగింపు, అజీర్తి, నీరసం, దగ్గు స్వల్ప గాయాలు వంటి చిన్న సమస్యలకు సైతం యాంటిబయోటిక్స్ వాడవలసిన అవసరం ఉండకపోవచ్చు. వ్యాధి తీవ్రతను అర్థం చేసుకున్న తర్వాత వీలైతే రక్తం, స్రావాలు, పాలు, రసి, చీము నమూనాలలోని క్రిములు ఏ నిర్ధిష్టమైన యాంటిబయోటిక్కు లొంగుతాయో తెలిపే యాంటిబయోటిక్ సెన్సిటివిటీ పరిక్షలు జరిపిన తర్వాత నిర్దుష్టంగా పనిచేయగల యాంటిబయోటిక్ను ఎంపిక చేసుకోగల్గితే మంచిది. మన పశుచికిత్సలో పొదుగువాపు, గర్భవాతం క్రిములకు ఈ విధమైన నిర్ధారణ చాలామంచిది. ఇందువల్ల వేగంగా వ్యాధి నయం కావటమే కాక అనేక సందర్భాలలో వైద్య ఖర్చులు తగ్గి, ప్రాణాలకు, దాని ఉత్పాదకతను కూడా మేలు జరుగుతుంది. యాంటిబయోటిక్ సెన్సిటివిటీ టెస్టుల్ని వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించగల వ్యవస్థ చాలా అవసరం.
తులసి, వెల్లుల్లి, వేప, పసుపు, కలబంద వంటి అందుబాటులో వుండే వృక్ష సంబంధిత ఔషధాలు అనాదిగా వాడుకలో ఉన్నప్పటికీ, వీటికి వ్యతిరేకంగా ఏ బాక్టీరియా రెసిస్టెన్స్ను పొందిన దాఖలాలు లేవు.
అర్హత కలిగిన వైద్యుడు లేదా మందుల ఉత్పత్తిదారుడు సూచించిన మోతాదులో, సూచించిన విధంగా, సూచించినన్ని రోజులపాటు మందుల్ని క్రమం తప్పకుండా వాడాలి.
పదేపదే యాంటిబయోటిక్స్ను, వైద్యుల్ని మార్చుట తగదు. చికిత్సకు వినియోగించిన మందులు, వ్యాధి లక్షణాలు, చికిత్సా వివరాల గురించి, దృఢమైన పుస్తకంలో (ఒక పాత డెయిరీలో) రికార్డు చేయించుకుంటే ఆ పశువుకే కాక, సాటి ఇతర పశువుల చికిత్స కూడా భవిష్యత్తులో సులభం కాగలదు.
పశువైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ విచక్షణా రహితంగా, అసమంజసంగా తాము వాడుచున్న లేదా సూచిస్తున్న యాంటిబయోటిక్స్ వల్ల పశుసంక్షేమానికే కాక ప్రజారోగ్యానికి, ప్రజల ప్రాణాలకు జరుగుతున్న హానిని గుర్తించి బాధ్యతతో వ్యవహరించాలి.
డా. యం.వి.జి. అహోబలరావు, హైదరాబాద్. ఫోన్: 93930 55611
కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ప్రపంచంతో పాటు మన దేశంలో కూడా అనేకమంది కరోనాతో అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డారు. కరోనా బారినపడి ఆరోగ్యాలను చెడగొట్టుకున్నవారు, మరణించిన వారి విషయాలను పక్కన పెడితే చాలామంది కరోనా వలన ఉపాధి కోల్పోయారు. తాము చేస్తున్న ఉద్యోగ, వ్యాపార సమస్యల వలన ఉపాధిని కోల్పోయి వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల వైపు అడుగులు వేశారు. కరోనా సమయంలో అన్ని రంగాలు ఆగినా కాని వ్యవసాయ రంగం ఆగలేదు కాబట్టి ఎలాంటి విపత్తులు సంభవించినా కాని ఆగని రంగం వ్యవసాయం అని పరోక్షంగా అర్థం అయ్యింది. అందువలననే చాలామంది వ్యవసాయ రంగంవైపు అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. ఇదేకోవకు చెందుతాడు నల్లగొండ జిల్లా, తిరుమలగిరి సాగర్ మండలం, ఎర్ర చెరువు తండాకు చెందిన రామావతు బాలకృష్ణ.
బాలకృష్ణది వ్యవసాయ నేపథ్యం. వారి పెద్దలు వివిధ రకాల పంటలు సాగు చేస్తూ, పశువుల పెంపకం, గొర్రెల పెంపకం, కోళ్ళ పెంపకం లాంటివి కొనసాగిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. బాలకృష్ణ వ్యవసాయ రంగానికి దూరం జరిగి ఎంటెక్ పూర్తి చేసి 2015వ సంవత్సరంలో విప్రో సంస్థలో రేడియో ఫ్రీక్వెన్సీ విభాగంలో ఇంజనీరుగా ఉద్యోగం సంపాయించి అందులో కొనసాగుతున్నాడు. ఉద్యోగంలో సరైన తృప్తి లేకపోవడముతో పాటు సమయ పాలన కూడా సక్రమంగా లేకపోవడం, ఎక్కువ పని గంటలు, రాత్రి పూట కూడా పని చేయవలసిన పరిస్థితులను ఎదుర్కోలేక ఉద్యోగం నుంచి బయటపడాలని ఆలోచించే సమములో కరోనా రావడము జరిగింది. కరోనా వలన ఇంటి వద్దనే కొన్ని రోజులు గడపవలసి వచ్చింది. ఆ సమయములో సొంత పొలంలో పంటల సాగుపై శ్రద్ధ పెట్టి తన స్వయం ఉపాధిగా ఉద్యోగం కంటే వ్యవసాయమే సరైన దారి అని నిర్ణయించుకుని వ్యవసాయంలో అడుగుపెట్టాడు. తన చదువుకు న్యాయం చేకూరాలంటే తోటి రైతులకు భిన్నంగా పంటల సాగు చేయాలనే తలంపుతో సేంద్రియ సాగుపై అవగాహన తెచ్చుకొని తాను పండించే పంటలలో సేంద్రియ సాగు పద్ధతులు అమలు పరచాలని నిర్ణయం తీసుకున్నాడు. సేంద్రియ సాగులో అత్యంత ముఖ్యమైన వనరు అయినటువంటి మన దేశీయ జాతి ఆవులను వేరే వారి నుండి దానంగా పొంది వాటి వ్యర్థాలను తన పంటల సాగులో వినియోగిస్తున్నాడు. ప్రస్తుతం మూడు ఆవులు మరియు మూడు ఎద్దులు కలిపి మొత్తం 6 పశువులను బాలకృష్ణ పోషిస్తున్నాడు.
సేంద్రియ సాగులో బాలకృష్ణకి 4 సంవత్సరాల అనుభవం ఉంది. తన అనుభవంలో మిరప, ప్రత్తి, కంది, పెసర, వేరుశనగ పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో పండించాడు. ఇంకా పండిస్తూనే ఉన్నాడు. తన సేంద్రియ సాగు అనుభవంలో ఎకరానికి మిరప 12 క్వింటాళ్లు, ప్రత్తి 8 క్వింటాళ్లు, వేరుశనగ 10 క్వింటాళ్లు, పెసలు 5 క్వింటాళ్లు అధిక దిగుబడిని సాధించాడు. ఈ సంవత్సరమే కంది పంట సాగు మొదలు పెట్టారు. ప్రస్తుతం మిరప ఎకరంన్నరలో, కంది రెండు ఎకరాలలో, ప్రత్తి మూడు ఎకరాలలో సాగులో ఉంది. వీరు సాగు చేసే పంటలకు రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి గొర్ల ఎరువు, ఆవుల ఎరువు మిశ్రమానికి వివిధ రకాల జీవన ఎరువులు, జీవశిలీంద్ర నాశినులు, వేపపిండి, ఆముదపు పిండి లాంటివి కలిపి దుక్కిలో అందిస్తుంటాడు. పంట మార్పిడి తప్పనిసరిగా చేస్తుంటాడు. ఈమెళకువలతో పాటు పూర్తి సేంద్రియ పద్ధతులు పాటిస్తూ, ఎలాంటి విష రసాయనాలు అందించకుండా తమ పంటల సాగుని కొనసాగిస్తున్నాడు.
మిరప: ఎకరంన్నరలో మిరప పంట సాగులో ఉంది. గత నాలుగు సంవత్సరాల నుంచి మిరప పంటను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నాడు. ఈ సంవత్సరం ఎకరంన్నరకు గాను 9093 మరియు సూరజ్ రకాలను ఎంపిక చేసుకుని విత్తనాన్ని బీజామృతంతో విత్తన శుద్ధి చేసికుని, నారు పోయించాడు. 45 రోజులు పెరిగిన నారుని బీజామృతంలో వేర్లను ముంచి ప్రధాన పొలంలో నాటించాడు. దుక్కిలో 4 ట్రక్కుల పైన పేర్కొన్న ఎరువును అందించాడు. మొక్క నాటిన 20 రోజుల నుంచి ప్రతి 15-20 రోజులకు ఎకరానికి 200 లీటర్లకు తగ్గకుండా ద్రవజీవామృతాన్ని నేలకు అందిస్తుంటాడు. అదేవిధంగా అవకాశాన్ని బట్టి వేస్ట్డికంపోజర్ ద్రావణాన్ని కూడా పైరుకు అందిస్తుంటాడు. చీడపీడల నివారణకు వేప గింజల కషాయం, అగ్నాస్త్రం, థపర్ణి కషాయం, ఎగ్ఎమైనో యాసిడ్, ఫిస్ ఎమైనోయాసిడ్ లాంటివి ఉపయోగిస్తుంటాడు. అవసరాన్ని బట్టి మొలకల ద్రావణాన్ని కూడా సొంతంగా తయారు చేసుకొని పంటపై పిచికారి చేస్తుంటాడు. పంచగవ్యను భూమికి అందించటంతో పాటు పంటపై కూడా పిచికారి చేస్తుంటాడు. ఈ పద్ధతులు పాటిస్తూ గత సంవత్సరం ఎకరానికి 1200 కిలోల దిగుబడి సాధించి అందులో 800 కిలోల వరకు కిలో ఎండుమిరప కాయలు 350 నుంచి 400 రూపాయలు, కారం 450 నుంచి 500 రూపాయల చొప్పున సుమారు 800 కిలోల వరకు నేరుగా వినియోగదారులకు అమ్మకం చేశాడు. 400 కిలోలు కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసి అవసరమైనపుడు అమ్మకం చేస్తున్నాడు.
మిరపతో పాటు ప్రత్తి, కంది పంటలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నాడు. అవకాశం ఉంటే రబీలో పెసర మరియు వేరుశనగ పంటలను సాగు చేయాలనే ఆలోచలో ఉన్నాడు. వేరే వారు దానంగా అందించిన పశువులను పోషిస్తూ వాటి ద్వారా వచ్చిన పాలను సొంతానికి ఉపయోగించుకుంటూ వాటి వ్యర్థాలను తన పంటల సాగులో ఉపయోగిస్తున్నాడు. శారీరకంగా శ్రమిస్తూ, ఆరోగ్యకరమయిన పంటలు పండిస్తూ, తెలివిగా మార్కెటింగ్ చేసుకుంటే సేంద్రియ సాగులో ఫలితం తప్పనిసరిగా ఉంటుందని బాలకృష్ణ ప్రత్యక్షంగా నిరూపిస్తున్నాడు. మరిన్ని వివరాలు 99127 37380 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
మనది వ్యవసాయక దేశం అయినప్పటికీ, ఎక్కువమంది ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధరంగాలపై అధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నా కూడా రైతులందరూ ఆర్థికంగా విజయం సాధించగలుగుతున్నారా? అని అడిగితే సమాధానం లేదు అని వస్తుంది. వివిధ రకాల కారణాల వలన ఎక్కువమంది రైతులు తమ పంటల సాగులో దిగుబడులు అయితే సాధించగలుగుతున్నారు కాని ఆర్థికంగా లాభాలు ఆర్జించలేకపోతున్నారు. తమ పంటల సాగుని లాభాల బాటలో నడిపించుకోవడానికి కొంతమంది రైతులు సేంద్రియ బాట పడుతున్నారు. సేంద్రియ బాటపట్టిన రైతులందరూ లాభాలు ఆర్జించగలుగుతున్నారా? అంటే సమాధానం లేదు అని వస్తుంది. రసాయనిక వ్యవసాయంతో పోల్చితే సేంద్రియ సాగులో అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను అశ్రద్ధ చేయకుండా సద్వినియోగం చేసుకోగలిగితే సేంద్రియ సాగులో విజయం తథ్యం అని నిరూపిస్తున్నాడు ఏలూరు జిల్లా, ఉంగుటూరు గ్రామానికి చెందిన గద్దె వెంకటరత్నం (రత్నాజి).
రత్నాజీది వ్యవసాయ నేపధ్యం. తోటి రైతుల లాగానే తమ పంటల సాగులో రసాయనాలు కూడా వినియోగిస్తూ సాగుని కొనసాగిస్తుండగా 2006వ సంవత్సరములో తమ ప్రక్క పొలంలో గోశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గోశాల పరిధిలో భూపతిరాజు రామకృష్ణంరాజు గారు గో-ఆధారిత వ్యవసాయం మొదలు పెట్టి రత్నాజీ గారిని కూడా అడగడము జరిగింది. గో-ఆధారిత వ్యవసాయంతో కాలుష్యం తగ్గుతుందని గ్రహించిన రత్నాజీ 2008 వ సంవత్సరం నుంచి తాను పండించే పంటలను గో-ఆధారిత వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం మొదలు పెట్టాడు. ఇందుకుగాను మొత్తం 9 దేశీయ జాతి ఆవులను పోషిస్తూ వాటి వ్యర్థాలను తమ పంటల సాగులో వినియోగిస్తున్నాడు. తమ సొంత పొలం 9 ఎకరాలతో పాటు కొంత పొలాన్ని కౌలుకి తీసుకుని వరి పంటతో పాటు ఎకరంన్నర విస్తీర్ణంలో సమీకృత వ్యవసాయం చేస్తున్నాడు.
ప్రస్తుతం కుజూ పటాలియా, తులసిబోసో, పిఎల్ఏ 1100 మొదలగు రకాలు సాగులో ఉన్నాయి. విత్తనాన్ని బీజామృతంతో విత్తనశుద్ధి చేయడముతో పాటు నారును కూడా బీజామృతంలో ముంచి బీహారు కూలీల చేత నాటించారు. దుక్కిలో వివిధ వర్గాలకు చెందిన వివిధ రకాల విత్తనాలను ఎకరానికి 18 నుంచి 20 కిలోల విత్తనాలను పచ్చిరొట్టగా చల్లి అవి పెరిగి పూత వచ్చే సమయంలో ఆపచ్చిరొట్టను రోటావేటరు సహాయంతో భూమిలో కలియదున్ని ఆఖరి దుక్కిలో ఎకరానికి 200 కిలోల ఘనజీవామృతం అందించి బీహారు కూలీల సహాయంతో నారు నాటించారు. ఈ పద్ధతిలో కాలిబాటలు ఉండడముతో పాటు మొక్కలకు గాలి వెలుతురు బాగా అందుతాయి కాబట్టి చీడపీడల ప్రభావం చాలా తక్కువగా ఉండడము రత్నాజీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. దుక్కిలో పచ్చిరొట్ట మరియు ఘనజీవామృతం అందిస్తూ వస్తూండడము వలన తమ భూమిలో సేంద్రియ కర్బనం పెరిగి మొక్కలు బాగా రోగనిరోధక శక్తితో పెరుగుతున్నాయి. దానికి తోడు జీవవైవిధ్యాన్ని కాపాడటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి రత్నాజీగారి పొలంలో మిత్ర పురుగుల నిష్పత్తి అనుకూలంగా ఉండడమ వలన చీడపీడల ప్రభావం చాలా తక్కువగా ఉండటము రత్నాజీ గమనించాడు. రెండు సంవత్సరాల క్రితం పంటపై ఆశించే చీడపీడల నివారణకు వివిధ రకాల కషాయాలు మరియు ద్రావణాల పిచికారి అవసరముండేది. కాని గత రెండు సంవత్సరాల నుంచి చీడపీడల కొరకు ఏవిధమైన చర్యలు చేపట్టనవసరం పడటము లేదు. నారు నాటడం, నేలకు జీవన ఎరువులు, జీవ శిలీంద్రనాశినులు, జీవ కీటకనాశినులు కలిపిన ఘనజీవామృతం, ద్రవజీవామృతం లాంటివి క్రమం తప్పకుండా అందిస్తూ ఉన్నారు. అయినా కాని ఎకరానికి మన పురాతన వరి వంగడాలు అయితే 25 నుంచి 30 బస్తాలు, పిఎల్ రకం ఎకరానికి 44 బస్తాల దిగుబడి సాధిస్తున్నారు.
తమ పంటల సాగులో పెట్టుబడులు తగ్గించుకోవటానికి వివిధ రకాల జీవన ఎరువులు, జీవ శిలీంద్ర నాశినులు, జీవకీటక నాశనులు ఎన్ఐపిహెచ్ఎం నుంచి మదర్ కల్చర్ సేకరించి తానే సొంతంగా ఇంటి దగ్గరే వాటిని అభివృద్ధి పరచుకొని పంటల సాగులో వినియోగిస్తున్నాడు. జీవామృతం, ఘనజీవామృతం, పంచగవ్య, నీమాస్త్రం, అగ్నాస్త్రం, థపర్ణికషాయం లాంటి వాటిని సొంతంగా తయారు చేసుకుంటూ అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటున్నాడు. వచ్చిన వడ్ల దిగుబడిని ఒక సంవత్సరంపాటు నిల్వ ఉంచి పాతబడిన తరువాత బియ్యం పట్టించి కిలో బియ్యం 70/-లకు అమ్మకం చేసుకుంటూ వస్తున్నాడు. మార్కెట్లో ధర ఇంకా అధికంగా ఉన్నా కాని అందరికీ అందుబాటులో ధర ఉండాలన్న లక్ష్యంతో కిలో 70/-ల చొప్పున మాత్రమే అమ్మకం చేస్తున్నాడు. 75 కిలోల వడ్ల బస్తాను మరపట్టించి 56 కిలోల ముడిబియ్యాన్ని పొందుతూ కిలో రూ. 70/- చొప్పున అమ్మకం చేస్తూ బస్తా వడ్ల నుంచి రూ. 3,920/-లు ఆదాయం పొందుతున్నాడు.
ఎకరంన్నర పొలంలో ఇండోనేషియా మోడల్ సమీకృత వ్యవసాయాన్ని చేస్తున్నాడు. 70 సెంట్లలో వరి సాగు చేస్తూ దాని ప్రక్కనే 5 మీటర్ల వెడల్పు, రెండు మీటర్ల లోతు కందకం త్రవ్వి అందులో నీటిని నింపి కొరమేను, శీలావతి, కట్ల, రూప్చంద్ లాంటి చేపలను పెంచుతూ దాని ప్రక్కనే ఇంకో 40 సెంట్లలో వివిధ రకాల పండ్ల మొక్కలు, వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో పాటు ఇంటికి అవసరమైన పసుపు, అల్లం లాంటి పంటలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నాడు. రాబోవు రోజులలో ఇంటికి అవసరమైన ఔషధ మొక్కలను కూడా సాగు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. గత సంవత్సరం ఈ ఎకరంన్నర సమీకృత వ్యవసాయం నుంచి మూడున్నర లక్షల ఆదాయం పొందడం జరిగింది.
తాము సాగు చేసే వరి పొలంలో అజొల్లాకూడా దానంతట అదే పెరుగుతూ ఉంటుంది. అజొల్లా వలన వరిపైరులో కలుపు సమస్య తగ్గడంతో పాటు గాలిలోని నత్రజని మొక్కలకు అందుతుంది కాబట్టి పంట ఏపుగా పెరుగుతుంది. పశువులకు దాణాగా అజొల్లాను అందించడంతో పాటు చేపలకు కూడా అజొల్లాను ఆహారంగా అందిస్తున్నాడు. మిగతా వారు పెంచే చేపలతో పోల్చితే తాము పెంచే చేపలను కిలోకు 30 నుంచి 40 రూపాయలు ఎక్కువ ధరకు అమ్మినా కూడా వినియోగదారులు తాము పెంచే చేపలను కొనుగోలు చేయడం రత్నాజీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు.
సేంద్రియ సాగులో అందుబాటులో ఉన్న అన్ని పద్ధతులను అమలుపరుస్తూ వచ్చిన దిగుబడిని అదేవిధంగా అమ్మకం చేయకుండా విలువజోడించి మంచి ధరకు వినియోగదారులకు నేరుగా అమ్మకం చేయడంతో పాటు సమీకృత వ్యవసాయ పద్ధతులను కూడా అమలు పరుస్తూ అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసకోగలిగితే సేంద్రియ సాగు విజయం తధ్యం అని రత్నాజీ నిరూపిస్తున్నాడు. మరిన్ని వివరాలు 9948796638 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
కోడి గ్రుడ్లు మరియు మాంసములో నాణ్యమైన ప్రోటీన్తోపాటు మానవశారీరక విధులకు, ఆరోగ్యానికి మరియు శ్రేయస్సుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు నిక్షిప్తమై ఉంటాయి. ఇంతటి పోషకాహార ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, కొన్ని నిరంతర అపోహలు చాలా మంది వినియోగదారులను తమ ఆహారంలో గ్రుడ్లు మరియు మాంసాన్ని చేర్చకుండా అడ్డుకుంటున్నాయి.
అపోహ: గ్రుడ్లు మాంసాహారము. శాఖాహారులు తినకూడదు?
వాస్తవము: కోడి గ్రుడ్లు రెండు రకాలు. ఫలధీకరణం చెందిన గ్రుడ్లు (పిండం కలిగి ఉంటాయి) మరియు వంధ్య గ్రుడ్లు (పిండము లేని గ్రుడ్లు). మార్కెట్లు, రెస్టారెంట్లు మొదలైన వాటిలో వంధ్య గ్రుడ్లు మాత్రమే వినియోగదారులకి లభిస్తాయి. ఈ గ్రుడ్లను టేబుల్ గ్రుడ్లు అని పిలుస్తారు. వీటిలో ఎటువంటి పిండము లేదా ప్రాణము ఉండదు కావున వీటిని పాలతో సమానమైన ఆహారంగా పరిగణించవచ్చు. ఫలధీకరణం చెందిన గ్రుడ్లును ప్రదానంగా పొదిగించి (హాచింగ్) కోడిపిల్లలను చేయడానికి ఉపయోగిస్తారు, ఇవి వినియోగం కోసం మార్కెట్లో అందుబాటులో ఉండవు.
అపోహ: మగ మరియు ఆడ కోళ్ళ మధ్య సంభోగం జరిగిన తర్వాత మాత్రమే గ్రుడ్లు ఉత్పత్తి చేయబడతాయి.
వాస్తవము: స్త్రీలలో మాదిరిగానే, ఓవా లేదా గ్రుడ్ల విడుదలకు కారణమయ్యే సాధారణ ఋతుచక్రాలు, కోళ్లలో కూడా లైంగిక పరిపక్వత వచ్చిన తర్వాత క్రమం తప్పకుండా ఓవా లేదా గ్రుడ్లను ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఇదొక సహజ ప్రక్రియ దీనికి మగ కోడి యొక్క అవసరము ఉండదు. కావున మగ మరియు ఆడ కోళ్ళ మధ్య సంభోగం తో సంబంధం లేకుండా కోళ్ళు గ్రుడ్లను ఉత్పత్తి చేస్తాయి.
అపోహ: ప్లాస్టిక్ గ్రుడ్లు మార్కెట్లో ఉన్నాయి మరియు అవి మానవ ఆరోగ్యానికి హాని చేస్తాయి.
వాస్తవము: సాధారణంగా వేసవి కాలంలో కోళ్ళు దాణా తీసుకోవడం తగ్గిస్తాయి (సుమారు రోజుకు 110 గ్రాముల నుండి 70 గ్రాములకు) కావున కోడి గ్రుడ్డు లోని పెంకు తయారీకి కావాల్సిన కాల్షియమ్ తగినంత మోతాదులో లభించదు. వేసవి ఒత్తిడి వలన గుడ్డు పెంకు తయారీలో కీలక పాత్ర వహించే బైకార్బొనేట్ ఆయాన్లను కూడా కోడి తన శరీరం నుండి కోల్పోతుంది, అందువలన వేసవి కాలం లో గ్రుడ్ల యొక్క పెంకు భాగము బలహీనంగా మరియు పల్చగా ఉండి గ్రుడ్లకు సాగే గుణాన్ని కలిగి త్వరగా పాడవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ సాగే గుణం వలన అనేకమంది వీటిని ప్లాస్టిక్ గ్రుడ్లు అని అపోహపడుతున్నారు కానీ వాస్తవానికి ఒక ప్లాస్టిక్ గ్రుడ్డు తయారీకి అయ్యే ఖర్చు, ఒక కోడి సాధారణంగా గ్రుడ్లు పెట్టడానికి అయ్యే ఖర్చు కంటే చాలా ఎక్కువ. అంతే కాకుండా సహజ గ్రుడ్డుతో సమానమైన కూర్పు కలిగిన నకిలీ గ్రుడ్లను తయారు చేయగలిగే నైపుణ్యత, దానికి కావలిసిన సమర్ధత లేవనటంలో ఎలాంటి సందేహమూ లేదు.
కావున, పైన తెలిపిన గ్రుడ్లు మరియు మాంసం గ్రురించి శాస్త్రీయ-ఆధారిత సత్యాలను గుర్తించి పాడి పశువుల నుండి లభించే పాల మాదిరిగానే, మార్కెట్లో లభించే కోడి గ్రుడ్లు (వంధ్య గ్రుడ్లు) కూడా శాఖాహారమే అన్న విషయాన్ని మనందరం గుర్తించి మన సమతుల ఆహారంలో అంతర్భాగంగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా కొన్ని రకాల వ్యాధులు కోడి మాంసము మరియు గ్రుడ్లను తినడం వలన వ్యాపిస్తాయనే అపోహలకు తావివ్వకుండా అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడకబెట్టిన గ్రుడ్లను మరియు మాంసాన్ని ఆహారంలో చేర్చడం ద్వారా శరీర వృద్ధికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, మరియు ఆరోగ్యకరమైన కొవ్వుల సంపదను పొందవచ్చు.
అపోహ: మాంసపు కోళ్ళు (బ్రాయిలర్ కోళ్ళు) వేగంగా పెరగడం కోసం కోళ్లకు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇవ్వబడతాయి, ఇది మానవ వినియోగానికి మంచిది కాదు.
వాస్తవము: వేగంగా పెరిగి అధిక మాంస ఉత్పత్తి చేసే బ్రాయిలర్ కోళ్ళ రకాలను అభివృద్ధిచేయడం కోసం గత 2 నుండి 3 థాబ్దాలుగా జంతుజన్యుశాస్త్రం మరియు పోషణలో కొనసాగించిన చాలా పరిశోధనలు విజయవంతమైనవి. సమతుల్య పెంపకం మరియు స్థిరమైన జన్యు పురోగతితో పాటు మేలైన యాజమాన్య పద్దతుల ద్వారా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రాయిలర్ కోళ్ల రకాలు కేవలం 38-40 రోజుల వ్యవధిలో 2.5 కిలోల వరకు పెరుగుతున్నాయి. అంతేకాని, వేగంగా పెరగడానికి ఎటువంటి స్టెరాయిడ్లు లేదా గ్రోత్ హార్మోన్లు అవసరం లేదు, పైగా స్టెరాయిడ్ హార్మోన్ల వాడకం వల్ల రాబడి కంటే ఉత్పత్తి ఖర్చు ఎక్కువ అని శాస్త్రీయ పరిశోధనల ద్వారా నిరూపించబడినది. కాబట్టి, మెరుగైన ఉత్పత్తి కోసం హార్మోన్లను ఉపయోగించడం ఆర్థికంగా కూడా కోళ్ళ రైతులకు సాధ్యం కాని పని.
అపోహ: కోడి గ్రుడ్లు మరియు మాంసం తినడం వల్ల కరోనా, బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులు మనుషులకు వ్యాపిస్తాయి
వాస్తవము: మనదేశంలో, ఏ పక్షి కూడా కరోనావైరస్ బారిన పడినట్లు కనుగొనబడలేదు, అలాగే కోడి మాంసము లేదా గ్రుడ్డు ద్వారా కరోనావైరస్ లేదా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుంది అని అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. మన భారతీయ ఆహారపు అలవాట్లలో భాగంగా అధిక ఉష్ణోగ్రతలో ఉడకబెట్టిన/బాగావండిన కోడి మాంసము తీసుకోవడం జరుగుతుంది. ఈ అధిక ఉష్ణోగ్రతలో చాలా వ్యాధికారక క్రిములు మనుగడ సాగించలేవు. అంతేకాక మన దేశపు వంటకాల్లో మెరుగైన యాంటీమైక్రోబయల్, యాంటీ-ఆక్సిడేటివ్ గుణాలు కలిగిన అల్లం, వెల్లుల్లి, పసుపు మొదలైనవి వాడటం వలన క్రిమి రహిత ఆహారాన్ని (కోడి మరియు గ్రుడ్లు) తినడానికి వీలు పడుతుంది.
డా|| ఎన్. దీపక్, సహాయ ఆచార్యులు, కోళ్ళ శాస్త్ర విభాగము
డా|| వి. తేజస్విని, సహాయ ఆచార్యులు, పశు జన్యు శాస్త్ర విభాగము, శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వ విద్యాలయము, తిరుపతి.
పశువులలో అంటువ్యాధులు ప్రబలడం వలన రైతులకు అనేక విధాలుగా నష్టములు కలుగుతుంటాయి. కాబట్టి వ్యాధి సోకిన తరువాత చికిత్స చేయించుటకు ఖర్చు పెట్టుటకు బదులు వ్యాధులు రాకుండా నివారణా చర్యలు చేపట్టడం ఎంతో లాభదాయకం. ఈ నివారణా చర్యలు 3 దశలలో చేపట్టాలి.
మొదటి దశలో వ్యాధికారక సూక్ష్మజీవులు పశువులకు సోకక ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని ”బయో సెక్యూరిటీ” పద్ధతులంటారు. వాటిలో ముఖ్యమైనవి:
పశువుల ఫారం చుట్టూ బలమైన కంచె నిర్మించాలి. దానివలన బయట పశువుల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించవచ్చు. ఫారం గేటు దగ్గర ‘ఫుట్బాత్’లను ఏర్పాటు చేసుకోవాలి. ఫుట్బాత్ అంటే 4 అంగుళాలు లోతు కలిగిన సిమెంట్ తొట్టె వంటిది. దీనిలో ప్రతిరోజు క్లోరిన్, ఫినాయిల్ వంటి క్రిమిసంహారక మందులను ఉంచాలి. బయట నుండి ఎవరు వచ్చినా ఈ ఫుట్బాత్లో కాళ్ళు ముంచి రావాలి. దీని వలన బయట నుండి వ్యాధికారక క్రిములు లోపలికి రావు. పెద్ద ఫారాలలో బయట నుండి వచ్చే వాహనాలకు ‘వెహికల్ బాత్’ కూడా ఉంటుంది.
ఏవైనా కొత్త పశువులను కొన్నప్పుడు వాటిని వెంటనే పాత పశువులతో కలుపరాదు. కొత్త పశువులను ఫారం బయట విడిగా కనీసం 30 రోజుల పాటు ఉంచాలి. దానిని ‘క్వారంటైన్’ అని అంటారు. దీని వలన పశువులలో అంతర్లీనంగా ఉన్న వ్యాధులు బయట పడే అవకాశం ఉంటుంది. మొదట 3 వారాలలో ఏ వ్యాధి బయట పడకపోతే, 22వ రోజున అన్ని పశువులకు క్షయ, జోన్స్ వ్యాధి, బ్రూసెల్లోసిస్ వ్యాధుల కొరకు పరీక్షించాలి. 23వ రోజు అంతరపరాన్న జీవుల నిర్మూలనకు డివార్మింగ్, 24వ రోజు గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు కలిసిన ‘ట్రయోవాక్’ టీకాను ఇచ్చి 30 రోజులు పూర్తైన తరువాత అన్ని పశువులు ఆరోగ్యంగా ఉంటే పాత పశువులలో కలపవచ్చు.
పశువులలో వ్యాధినిరోధక శక్తి పెంచే పద్ధతులు చేపట్టాలి. వీటిలో ముఖ్యమైనవి టీకాలు వేయడం. ఆయా ప్రదేశాలలో ఏటా వచ్చే వ్యాధులకు నెల ముందుగానే టీకాలు వేయించాలి. పశువుల ఫారానికి కనీసం 1 కిలోమీటరు దూరం చుట్టూ వ్యాధినిరోధక ప్రదేశం ఏర్పాటు చేయడం మంచిది. పశువులకు శాస్త్రీయ పద్ధతిలో సమతుల్యమైన ఆహారం, మంచి గృహవసతి అందించినచో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మంచి రోగ నిరోధక శక్తి కలిగిన పశువులు సులభంగా వ్యాధులకు గురికావు.
ఇక వ్యాధి నివారణ చర్యలలో రెండవ దశ– వ్యాధికారక పశువులను గుర్తించి మంద నుండి వేరు చేయడం.
వ్యాధి సోకిన పశువులలో జ్వరం, ముక్కులు, కళ్ళ వెంట నీరు కారడం, నోటి నుండి విపరీతమైన చొంగ కారడం, పారడం, మేపు తినకపోవడం, నెమరు వేయలేకపోవడం. మిగిలిన పశువుల నుండి విడిపోయి వేరుగా నీరసంగా పడుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇటువంటి పశువులను మంద నుండి దూరంగా ఉంచి చికిత్స చేయించాలి. వ్యాధి పూర్తిగా తగ్గినదని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే మిగిలిన పశువులతో కలపాలి.
కొన్నిసార్లు పశువులలో వ్యాధులు ఉన్నప్పటికీ ఎటువంటి బాహ్యలక్షణాలు కనబడవు. బయట చూడడానికి ఆరోగ్యవంతమైన పశువులలాగే ఉంటాయి. వీటిని కారియర్స్ అంటారు. సాధారణంగా బ్రూసెల్లోసిస్, క్షయ, జోన్స్ వ్యాధి, ఐబిఆర్ అను వ్యాధులు కొన్ని పశువులలో అంతర్లీనంగా ఉండి మిగిలిన పశువులకు క్రమంగా వ్యాపిస్తూ ఉంటాయి. ఇటువంటి పశువులు చాల ప్రమాదకరం. కావున ప్రతి సంవత్సరం ఒక్కసారైన మందలో ఉన్న అన్ని పశువులను పై వ్యాధుల కొరకు పరీక్షించవలెను. ఒకవేళ ఏదైనా పశువు ఈ పరీక్షలలో పాజిటివ్గా నిర్ధారణ అయితే అటువంటి పశువును వెంటనే మంద నుండి తీసివేయాలి.
వ్యాధి నివారణలో మూడవ దశ– చనిపోయిన పశువులను నాశనం చేసే పద్ధతులు:
కొన్నిసార్లు అంటువ్యాధుల వలన పశువులు చనిపోవచ్చు. ఒకవేళ ఏదైనా పశువు అంటువ్యాధులతో చనిపోతే, రైతులు సాధారణంగా ఊరి బయట, రోడ్ల పక్కన, కాలువలలో పడవేస్తుంటారు. దీనివలన వ్యాధికారక క్రిములు సులభంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వ్యాపిస్తుంటాయి. కాబట్టి చనిపోయిన పశువులను వ్యాధికారక క్రిములతో సహా నాశనం చేయవచ్చు. సాధారణంగా పూడ్చి వేయడంతో కాని కాల్చడం వలన కాని వ్యాధికారక క్రిములను కళేబరంతో సహా నాశనం చేయవచ్చు.
పూడ్చి వేసే పద్ధతిలో పశువుల సైజును బట్టి కనీసం 6 అడుగుల లోతు గోతిని తీయాలి. పశువులతో పాటు ఆ ప్రదేశంలో పశువు తిన్న మేత, నీరు, 5 అంగుళాల వరకు మట్టి శుభ్రంగా తీసి గోతిలో వెయ్యాలి. వీటి మీద మట్టి, సున్నం, బ్లీచింగ్ పౌడర్ కలిపి పూడ్చాలి. పూడ్చునపుడు పై భాగాన ముళ్ళ కంచెలు వేస్తే కుక్కలు, నక్కలు కళేబరాన్ని తిరిగి తోడకుండా ఉంటాయి. ఫారంలో నేల సిమెంట్ కాంక్రీట్ అయితే క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసి ఎండబెట్టాలి.
ఇక పశువును కాల్చే పద్ధతిలో పశువు శరీర సైజును బట్టి గోతిని తీయాలి. గోతి మీద ఇనుపరాడ్లు క్రాస్ (þ) ఆకారంలో ఉంచాలి. దీని మీద కళేబరాన్ని ఉంచి క్రింద గోతిలో కట్టెలు పెట్టి మండించాలి. దీని వలన కళేబరం ఎటువంటి అవశేషాలు లేకుండా పూర్తిగా కాలిపోతుంది. నేడు పెద్ద పట్టణాలలో కళేబరాన్ని ఉపయోగించుకునే ప్లాంటులను నిర్మిస్తున్నారు. ఈ ప్లాంటులలో కళేబరం నుండి క్రొవ్వు, ఎముకలు మొదలైన వాటిని వేరు చేసి మిగిలిన వానిని పూర్తిగా కాల్చేస్తారు. పట్టణాల చుట్టుప్రక్కల రైతులు ఈ ప్లాంటులను వినియోగించుకోవచ్చు.
ఈ విధంగా వ్యాధి నివారణ చర్యలు మూడు దశలో చేపడితే అంటు వ్యాధులు ప్రబలకుండా, పశువులు చనిపోకుండా, పశువుల ఉత్పత్తి కోల్పోకుండా నివారించి పశువుల పెంపకం లాభసాటిగా చేయవచ్చు.
డా. చంద్రావతి, ఎం.వి.ఎస్సీ, పిహెచ్.డి., సహాయ ఆచార్యులు, పాథాలజీ విభాగము, పశువైద్య కళాశాల, మామునూరు, వరంగల్
కొద్దిగా సూర్యరశ్మి, సారవంతమైన మట్టి మిశ్రమం, కాస్తంత స్థలం ఉంటే చాలు. అందమైన కుండీల్లో మొక్కలను సైతం ఈ హ్యాంగింగ్ బాస్కెట్లలో ఆకర్షణీయంగా పెంచుకోవచ్చు. వివిధ వర్ణాల పూలతో కనువిందు చేస్తాయివి.
వేలాడే కుండీల్లో నాటే మొక్కల్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. పెద్ద కుండీల్లో పెంచేందుకు ఒకే జాతి మొక్కలను, మరీ చిన్న కుండీలైతే ఒకే జాతి మొక్కలతో పాటు, ఒకే ఆకారంలో ఆకులు, పూలు అందించే వాటిని ఎంపిక చేసుకోవాలి. బహువార్షికాలను నాటితే చలి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సూర్యరశ్మి, నీటిని ఒకే మోతాదులో తీసుకునే మొక్కలను గుంపుగా పెంచుకోవాలి. ఈ మొక్కల మధ్య సమతుల్యం బాగుంటుంది.
రంగులూ ముఖ్యమే: ఎరుపు, పసుపు లేదా ఆకుపచ్చ, ఊదా రంగు మొక్కలను ఎంచుకోవాలి. ఏకవర్ణ మొక్కలు కావాలనుకుంటే ఎరుపు మేలు. ఏకవార్షిక పూల రకాలుగా ఆకుపచ్చ ఆకులున్నవి బాగుంటాయి. కుండీల రంగు, వాటిని వేలాడదీసే ప్రాంతం, బయటి వాతావరణాన్ని బట్టి మొక్కల వర్ణాన్ని ఎంపిక చేసుకోవాలి. వేలాడే, పాకే లతలుగా ఎదిగే మొక్కలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
ఎలాంటి కుండీలంటే: ఇనుప పళ్లాలు, వెడల్పాటి సీసాలు, ప్లాస్టిక్, సిరామిక్ కుండీలు, చెక్క పెట్టెలు, మట్టి కుండలు.. ఇలా ఏదయినా వాడుకోవచ్చు. నీళ్లు బయటకు వెళ్లకపోతే మొక్క త్వరగా చనిపోతుంది. కాబట్టి వాటికి రంధ్రాలు ఉండాలి. మొక్క పెరిగేకొద్దీ కుండీ బరువూ ఎక్కువవుతున్నప్పుడు గొలుసులు, తాడుతో వాటికి ఊతమివ్వాలి. మొక్కను ఇసుక లేదా పెర్లైట్లో పెంచాలా అనేది నిర్ణయించుకోవాలి. దీనివల్ల వేర్లకు గాలి అంది బాగా పెరుగుతాయి. తేమా చక్కగా అందుతుంది. పద్ధతి ప్రకారం రెండు వంతుల పీట్ మాస్ ఒక్కోవంతు చొప్పున ఇసుక, పెర్లైట్ వాడాలి. ద్రవరూప ఎరువులు వాడితే మేలైన ఫలితాలు ఉంటాయి. పిచికారి చేయడం కన్నా మొక్కలు నాటేముందు మట్టిలో ఎరువులు కలపడం మేలు. మొక్కలన్నింటిని కుండీల్లో నాటాకే అనుకున్న ప్రదేశంలో వేలాడదీయాలి. 10-14 అంగుళాల వ్యాసార్థం ఉన్న కుండీలను ఎంచుకోవాలి. వీటిలో ఒక్కోదానిలో మూడు మొక్కలను నాటుకోవచ్చు.
మొక్కలకు ప్రతిరోజూ నీరు పోయాలి. మట్టి మిశ్రమం పైభాగం నుంచి 25 శాతం తేమను కోల్పోయినప్పుడు నీటిని పిచికారి చేయాలి. వారానికోసారి ద్రవరూప ఎరువులను అందించాలి. ఎత్తుగా పెరిగిన వాటిని ఆకృతి ప్రకారం కత్తిరించుకోవాలి. మొక్క నాటే ముందు మట్టిని, పరికరాలను స్టెరిలైజ్ చేయాలి లేదా 1:10 నిష్పత్తితో తయారు చేసిన క్లోరిన్ నీటితో తడపాలి. వాటి వేళ్లు ఉండల్లా చుట్టుకుపోతే బయటకు తీసి సరిచేసి మళ్లీ నాటాలి. కొత్తగా నాటిన మొక్కల్ని నాలుగైదు వారాల వరకు నేరుగా సూర్యరశ్మిలో ఉంచి తరువాత అనుకున్న ప్రదేశంలో వేలాడదీయాలి.
రసాయనిక వ్యవసాయం వలన జరిగిన, జరుగుతున్న అనర్థాల నుండి బయట పడటానికి సేంద్రియ సాగు పద్ధతులను నిపుణులు, అధికారులు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు ప్రచారం చేయటం జరిగింది. ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నారు. అనేకమంది సేంద్రియ సాగు పద్ధతుల గురించి వివరిస్తున్నాకాని, సుభాష్పాలేకర్ గారు చెబుతున్న జీరోబడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతి ఎక్కువమంది రైతు లోగిళ్ళకు చేరిందనుకోవచ్చు. సేంద్రియ సాగు పై బాగా అవగాహన వచ్చిన తరువాత కొత్తగా సేంద్రియ సాగు చేపట్టేవారు కానీ, అప్పటికే రసాయనిక వ్యవసాయం చేస్తూ తమ సాగుని సేంద్రియంలోకి మార్చుకుంటున్నవారు కాని ఎక్కువగా సుభాష్ పాలేకర్ గారి జీరోబడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతులకు ప్రభావితం అయ్యారు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కేవలం సుభాష్ పాలేకర్ గారు ప్రచారం చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పంటల సాగు చేస్తున్న రైతులు కాలం గడిచే కొలది వివిధ రకాల కారణాల వలన సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు తోడు మిగతా సేంద్రియ సాగు పద్ధతులను కూడా జోడించి రసాయనరహిత వ్యవసాయాన్ని చేస్తూ ఆరోగ్యకరమైన దిగుబడులు సాధిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం మండలం, నరేంద్రపురం గ్రామానికి చెందిన ప్రగడ రాంబాబు కూడా సుభాష్ పాలేకర్ గారు చెపుతున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు ప్రభావితమయ్యి తన రసాయనిక సేద్యాన్ని సేంద్రియ సాగులోకి మార్చాడు.
రాంబాబుది వ్యవసాయ నేపథ్యం. వివిధ రకాల పంటల సాగులో రాంబాబుకు 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. అందరిలాగానే రసాయనాలు వినియోగిస్తూ పంటలు సాగు చేస్తున్న సందర్భంలో స్నేహితుల ద్వారా సుభాష్ పాలేకర్ గారు ప్రచారం చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకుని, తన రసాయనిక సేద్యాన్ని సేంద్రియంలోకి మార్చాలని తలంచి మెల్లమెల్లగా రసాయనాలు తగ్గిస్తూ సేంద్రియ పద్దతులను అమలు పరస్తూ 4 సంవత్సరాలు మిశ్రమ సేద్యం చేసి, సేంద్రియ సాగు గురించి, సేంద్రియ సాగులో అమలు పరచవలసిన పద్ధతుల గురించి పూర్తి అవగాహన వచ్చిన తరువాత తన పంటల సాగుని 6 సంవత్సరాల క్రితం పూర్తిగా సేంద్రియంలోకి మార్చి గత 6 సంవత్సరాల నుంచి తనకున్న 4 ఎకరాల భూమిలో వివిధ రకాల పంటలు పూర్తి సేంద్రియ పద్ధతులతో పండిస్తున్నాడు.
సొంత భూమి 4 ఎకరాలలో శాశ్వత పందిర్లు ఏర్పాటు చేశాడు. 141/2þ141/2 అడుగుల దూరంలో రాతి స్థంభాలు ఏర్పాటు చేసుకుని, జి.ఐ. వైరుతో పందిరి ఏర్పాటు చేసుకున్నాడు. 4 ఎకరాల భూమిని వివిధ భాగాలుగా చేసుకుని 15 నుంచి 20 రకాల కూరగాయలు మరియు కొన్నిరకాల ఆకుకూరలు సీజన్ను బట్టి సాగు చేస్తూ సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు వినియోగదారులకు, సాధ్యమైనన్ని ఎక్కువ రకాల కూరగాయలు, ఆకుకూరలు అందించడానికి వీలుగా తన పొలాన్ని ప్రణాళిక ప్రకారం సాగుకి సిద్ధం చేస్తుంటాడు. సేంద్రియ సాగులో పంట మార్పిడి మరియు అంతర, మిశ్రమ పంటలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి కాబట్టి రాంబాబు తప్పనిసరిగా ఈ మెళకువలు పాటిస్తుంటాడు. అందులో భాగంగా గట్ల వెంబడి, పందిరికి, పందిరికి మధ్య పోటీ ఇచ్చే స్థంభాలకు కూడా అవకాశం ఉన్న కూరగాయలు పండిస్తుంటాడు. పంట మార్పిడిలో భాగంగా సంవత్సరంలో రెండు పంటలు కూరగాయల పంటలు పండిస్తూ మూడవ పంటగా వరి లేదా మొక్కజొన్న లేదా అపరాల పంటలు సాగు చేస్తుంటాడు.
18 రకాల పచ్చిరొట్ట విత్తనాలను పచ్చిరొట్టగా వేసి పూత రాక ముందు రోటోవేటరు సహాయంతో భూమిలో కలియదున్నడముతో పాటు గొర్రెల ఎరువు, సొంత పశువుల ఎరువును దుక్కిలో అందిస్తుంటాడు. అవకాశం ఉన్నప్పుడు భూమి ఖాళీగా ఉన్నప్పుడు గొర్రెల మందలను లేదా పశువుల మందను కట్టిస్తుంటాడు. సేంద్రియ సాగులోకి మారిన మొదటలో దుక్కిలో ఘనజీవామృతం తప్పనిసరిగా అందిస్తుంటాడు. కాని ప్రస్తుతం ఘనజీవామృతాన్ని దుక్కిలో అందించకుండా పశువుల ఎరువుపై ద్రవ జీవామృతం చల్లి ఆ ఎరువును దుక్కిలో వేస్తుంటాడు. పంట వేసిన తరువాత క్రమం తప్పకుండా భూమికి జీవామృతాన్ని, సొతంగా తయారు చేసుకున్న జీవన ఎరువులు, జీవశిలీంద్రనాశనులను వెంచర్ ద్వారా అందిస్తుంటాడు. సమగ్ర సస్యరక్షణలో భాగంగా సరిహద్దుపంటలుగా బెండ లాంటి కూరగాయలను, ఎర పంటలుగా బంతి లాంటి పంటలను సాగు చేస్తుంటాడు. రసం పీల్చు పురుగుల నియంత్రణకు పసుపు మరియు బులుగు రంగు జిగురు అట్టలు, కాయతొలుచు పురుగు, ఆకుతొలుచు పురుగు, కాండం తొలుచు పురుగు లాంటి చీడపీడల నివారణకు లింగాకర్షక బుట్టలు, తీగజాతి కూరగాయలలో వచ్చే ఫ్రూట్ ఫ్లై నివారణకు ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఏర్పాటు చేస్తుంటాడు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా చీడపీడల ప్రభావం ఉంటే నీమాస్త్రం, థపర్ణి కషాయం, పంచగవ్య, వేపగింజల ద్రావణం లాంటివి ఉపయోగిస్తూ ఆరోగ్యకరమైన దిగుబడులు సాధిస్తున్నాడు.
సేంద్రియ సాగులో దిగుబడి సాధించడము ఒక పరీక్ష అయితే పొందిన ఆరోగ్యకరమైన దిగుబడిని ఆశాజనకమయిన ధరలకు అమ్మటం మరో పెద్ద పరీక్ష. సేంద్రియ పద్ధతులతో పండించిన కూరగాయలు మరియు ఆకుకూరలకు మామూలు మార్కెట్లో సాధారణ ధరే పలుకుతుంది కాని ప్రత్యేక ధరకు అమ్మకం చేయలేక పోతున్నారు. దానిని గ్రహించిన రాంబాబు తన చుట్టు ప్రక్కల ప్రాంతాలలో తన సాగు పద్ధతుల గురించి ప్రచారం చేయడం జరిగింది. తన సాగు పద్ధతులను చూడటానికి అనేకమంది వినియోగదారులు ప్రత్యక్షంగా రాంబాబు పొలాన్ని సందర్శించి నమ్మకం కుదిరిన తరువాత రాంబాబు దగ్గర కూరగాయలు మరియు ఆకుకూరలు కొని వాటి రుచి చూసిన తరువాత మరలా మరలా కొనుగోలు చేస్తుండడము మొదలయ్యింది. ఈ విధంగా 800 కుటుంబాలకు అవసరమయిన కూరగాయలను అందించగలిగే స్థాయికి రాంబాబు ఎదిగాడు. 8 వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి 800 కుటుంబాలకు, రోజు కొన్ని కుటుంబాలు చొప్పున వారంలో అన్ని కుటుంబాలకు వారానికి సరిపోను కూరగాయలు నేరుగా ఇంటి వద్దకు చేరవేస్తున్నాడు. ప్రస్తుతం 14 రకాల కూరగాయలు సాగులో ఉన్నాయి. గత సంవత్సరం శీతాకాలంలో 22 రకాలకు పైగా కూరగాయలు మరియు ఆకుకూరలను నేరుగా వినియోగదారులకు అందించగలిగాడు. సాధ్యమయినంతవరకు తాను పండిస్తూ, తాను పండించ లేనివి తోటి సేంద్రియ రైతుల వద్ద నుంచి సేకరించి తోటి రైతులకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తున్నాడు.
పూర్తి సేంద్రియ పద్ధతులు పాటిస్తూ తమ భూమిని కాపాడుకుంటూ సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ ఒక మంచి ఉద్యోగంలో పొందే జీతానికి తగ్గకుండా ఒకరి కింద పని చేయకుండా సొంతంగా సంపాదించుకుంటున్నాడు. మరిన్ని వివరాలు 98487 57411కి ఫోను చేసి తెలుసుకోగలరు.
వివిధ రకాల కారణాల వలన ఇటీవల కాలంలో ఇంటి పంటను చేపట్టే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇంటి పంటవలన ప్రయోజనాలను గ్రహించిన చాలామంది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అంటే పెరట్లో, మేడ మీద, మెట్ల మీద, పిట్ట గోడల మీద.. ఈ విధంగా తమ అనకూలతను బట్టి కొన్ని మొక్కలను పెంచుతూ పోతున్నారు.
ఇంటి పంటను చేపట్టే వారిలో సొంత ఇంటిదారులతో పాటు అద్దెకు ఉండేవారు కూడా ఉన్నారు. సొంత ఇంటిదారులకు పెద్దగా ఇబ్బందులు ఉండవు కాని అద్దెకు ఉండే వారి విషయంలో అనేక సమస్యలు ఉంటాయి. ఇల్లు మారవలసిన సందర్భంలో మొక్కలను కుండీలతో కలిపి వేరే ఇంటికి మార్చడము చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని మొక్కలు పనికి రాకుండా పోయే అవకాశాలు ఉంటాయి. రవాణా ఖర్చులు, ఎగుమతి, దిగుమతి ఖర్చులు కూడా ఎక్కువగా అవుతుంటాయి. కాబట్టి ఇంటి పంటపై, పచ్చదనంపై మక్కువ ఉన్నవారు సొంత ఇంటి కలను తొందరగా సాకారం చేసుకోవాలని ఉంటారు. ఈ దారిలోనే నడచి తమకు పచ్చదనంపై ఉన్న మక్కువతో తమ సొంత ఇంటి కలను వేగంగా సాకారం చేసుకున్నారు విశాఖపట్టణం, మధురవాడకు చెందిన ఝాన్సీరాణి.
ఝాన్సీరాణి డిగ్రీ వరకు చదువుకుని కొన్ని రోజులు ఉద్యోగం చేసి పచ్చదనంపై ఉన్న మక్కువతో చేస్తున్న ఉద్యోగాన్ని మానివేసి, ప్రస్తుతం గృహిణి బాధ్యతలు నిర్వర్తిస్తూ తన పూర్తి సమయాన్ని కుటుంబానికి, తమ మిద్దెతోటకు కేటాయిస్తున్నారు. ఝాన్సీరాణికి పచ్చదనంపై మక్కువ చాలా ఎక్కువ. కాబట్టి అద్దె గృహాలలో ఉండే సమయంలో కూడా అవకాశం ఉన్న చిన్న ప్రదేశాన్ని కూడా వదలకుండా మొక్కలు పెంచుతుండేవారు. ఇళ్ళు మారవలసి వచ్చినప్పుడు మొక్కలను మార్చడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ఎంతో ప్రేమగా, ఎంతో కాలం నుంచి పెంచుకున్న కొన్ని మొక్కలు పాడై పోవడం ఝాన్సీరాణిని బాధిస్తుండేవి. ఇలాంటి అన్ని సమస్యలకు సొంత ఇల్లు సరైన పరిష్కారం అని నిర్ణయించుకుని చాలా వేగంగా సొంత ఇంటి కలను సాకారం చేసుకుని 3 అంతస్తుల సొంత ఇంట్లో మిద్దె మీద మిద్దె తోటను పెంపకం చేయడముతో పాటు మూడు అంతస్తులకు ఎక్కేదారిలో ఉండే అన్ని మెట్ల మీద మరియు ఇంట్లో అవకాశం ఉన్న అన్ని ప్రాంతాలలో చివరకు గోడలకు కూడా వృథాగా పడవేసే నూనె క్యాన్లను బిగించి అన్నింటిలో ఇండోర్ ప్లాంట్స్ పెంపకం చేస్తున్నారు.
ఝాన్సీరాణికి ఇంటిపంటలో 8 సంవత్సరాల అనుభవం ఉంది. ప్రస్తుతం 800 చదరపు అడుగుల విస్తీర్ణంలో మిద్దె మీద వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు., స్లాబు మీద నీరు పడితే స్లాబు పాడై పోతది కాబట్టి స్లాబు మీద నీరు పడకుండా స్టాండులు ఏర్పాటు చేసుకుని స్టాండుల మీద వివిధ సైజు ప్లాస్టిక్ కుండీలు, టబ్బులు ఏర్పాటు చేసుకుని ఆ టబ్బులలో బరువు తక్కువగా ఉండే సాయిల్ మిక్స్ని నింపి అందులో వివిధ రకాల మొక్కలు పెంపకం చేస్తున్నారు.
ప్రస్తుతం వారి మిద్దెతోటలో ఆకుకూరలు, కూరగాయలు, ఔషధ మొక్కలు, సుగంధ మొక్కలు, క్రోటాన్స్, పూలమొక్కలు, పండ్ల మొక్కలు లాంటి అవకాశం ఉన్న మొక్కలను వదలకుండా పెంపకం చేస్తున్నారు. మొక్కల నిర్వహణకు ఎక్కువగా ఫిష్ ఎమినో యాసిడ్, వేపనూనె, ఎగ్ ఎమినో యాసిడ్, ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూస్, థపర్ణి కషాయం, పంచగవ్య, అల్లం+ బెల్లం ద్రావణం, తాటికల్లు+ దాల్చిన చెక్క ద్రావణం, వెల్లుల్లి+ బెల్లం ద్రావణం లాంటి ఎన్నో రకాల ద్రావణాలను సొంతంగా తయారు చేసుకుంటూ మొక్కలకు ఉపయోగిస్తూ ఆరోగ్యకరమైన మిద్దె తోటను పెంచుతున్నారు.
మిద్దె తోటలో పండే పంటలపై తమతో పాటు ప్రకృతిలో ఉండే వివిధ రకాల పకక్షులకు కూడా అధికారం ఉందని నమ్మి తమ మిద్దెతోటలో వివిధ రకాల పకక్షులు నివశించడానికి, పకక్షులు తమ మిద్దెతోటను ఉపయోగించుకోవటానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి వివిధ రకాల పకక్షులు వాటికి ఇష్టమైన అంజూర, దానిమ్మ లాంటి పండ్లను తమకంటే ముందు పకక్షులే తింటుంటాయి.
అయినా కాని మేము ఏ మాత్రం బాధపడకుండా పకక్షులు కూడా ప్రకృతిలో భాగం కాబట్టి పకక్షులకు ఆహారం ఏర్పాటుకు తమకు అవకాశం దొరికినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. కేవలం 800 చదరపు అడగుల విస్తీర్ణంలో రెండు, మూడు రెట్లు ఎక్కువ మొక్కలు పెంచుతున్న వారి మిద్దె తోటను అనేకమంది ప్రముఖులు సందర్శించారు. ఇంకా సందర్శిస్తూనే ఉన్నారు. మరిన్ని వివరాలు 63025 09928 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
రసాయనిక వ్యవసాయం వలన జరిగిన, జరుగుతున్న అనర్థాల నుండి బయటపడటానికి అనేకమంది రైతులు సేంద్రియ బాట పట్టారు. ఇంకా పడుతూనే ఉన్నారు. సేంద్రియ సాగు బాగా వెలుగులోకి వచ్చిన తరువాత అప్పటికే పంటలు సాగు చేస్తూ రసాయనిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్న రైతులు సేంద్రియం వైపు అడుగులు వేయడంతో పాటు, కొంతమంది ఉద్యోగ, వ్యాపార రంగాల నుండి కొత్తగా వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. ఇంకా పెడుతూనే ఉన్నారు. వ్యవసాయ అనుభవం ఉండి సాగు పద్ధతులు మార్చుకున్న వారి విషయంలో పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి వారు కేవలం వారి సాగు పద్ధతులను మాత్రం మార్చుకున్నారు కాబట్టి అనుకూలంగా ఉంటే కొత్త విధానాలను కొనసాగిస్తారు. అనుకూలంగా లేకుంటే మరలా పాత విధానాలవైపు అడుగులు వేయగలరు. కాని ఉద్యోగ వ్యాపార రంగాల నుంచి వ్యవసాయంలో కొత్తగా అడుగు పెట్టిన వారి విషయంలో అందుకు భిన్నంగా ఉంటుంది. ఈ రెండు వర్గాలలో ఉద్యోగ రంగం నుంచి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి వచ్చిన వారి విషయంలో ప్రత్యేకత అవసరం. తాము చేస్తున్న ఉద్యోగాన్ని వదలి, వచ్చే ఆదాయాన్ని వదలి శారీరక శ్రమ పెద్దగా అవసరం లేకుండా కేవలం ఎ.సి. (సాఫ్ట్వేర్ రంగం) గదులకు, కుర్చీలకే పరిమితమయిన జీవనశైలి నుంచి పూర్తిగా శారీరక శ్రమ ఉండి, చెమటలు కక్కే నిండు వేసవిలో పనిచేయవలసిన జీవన శైలికి మారవలసి వస్తుంది కాబట్టి ఇలాంటి వారి విషయంలో తప్పనిసరిగా ప్రత్యేకత ఉంటుంది. ఇవన్నీ అధిగమించగలిగితే వాటన్నికంటే అతి పెద్ద సమస్య ఇంట్లోని పెద్దలు, మహిళలు. ప్రస్తుత సమాజాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో స్థిరపడ్డ మహిళలలో 99 శాతం పైగా మహిళలు వ్యవసాయం అంటే విముఖత చూపుతున్నారు. అతి తక్కువ మంది మహిళలు మాత్రమే వ్యవసాయ రంగం అంటే వ్యతిరేకత లేకుండా ఉన్నారు. ఇలాంటి వ్యక్తిగత సమస్యలను ఎదుర్కోగలమనే నమ్మకంతో ఇటీవలకాలంలో అనేకమంది ఉద్యోగ రంగం నుండి ప్రత్యేకంగా సాప్ట్వేర్ ఉద్యోగ రంగం నుండి సేంద్రియ సాగువైపు అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. సేంద్రియ సాగువైపు అడుగులు వేసిన వారు వివిధ రకాల కారణాల వలన తమ సాగుని లాభల బాటలో నడిపించుకోలేక వెనుతిరిగి పోతున్నారు. అతితక్కువ మంది మాత్రమే వివిధ రకాల ఒడిదుడుకులను తట్టుకుని, సమయానుకూలంగా తమ సాగు పద్ధతులను మార్చుకుంటూ, పంటల సాగుని లాభాల బాట పట్టించడానికి అవసరమయిన అన్ని రకాల మార్గాలను ఉపయోగించుకుంటూ మనసు ఉంటే మార్గాలు అనేకం ఉంటాయనే సూక్తిని నమ్ముతూ ముందుకు సాగుతున్నారు. ఇదే కోవకు చెందుతాడు సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన చండ్ర వెంకటేశ్వరరావు.
వెంకటేశ్వరరావుది వ్యవసాయ నేపథ్యం. అయినాకాని అందరిలాగానే వీరు కూడా ఉన్నత చదువులు చదివి వ్యవసాయ రంగానికి దూరం జరిగి ఉద్యోగరంగంలో ప్రవేశించి మంచి ఉద్యోగం, మంచి జీతంతో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. చదువుకు తగిన ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా ఉద్యోగంలో కొనసాగుతున్నా కూడా ఆరోగ్యసమస్యలు ఎదురవ్వడంతో తమ ప్రస్తుత జీవన శైలి గురించి పరిశీలించుకొని అనారోగ్య సమస్యల నుండి బయట పడాలంటే జీవనశైలిని మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించి ఆరోగ్యకరమైన జీవనశైలికి సేంద్రియ సాగే సరైన దారి అని నమ్మి కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా కూడా వారి సలహాలను ప్రక్కకు నెట్టి మంచి జీతం అందిస్తున్న ఉద్యోగాన్ని వదలి సేంద్రియ సాగులోకి అడుగు పెట్టడం జరిగింది.
వెంకటేశ్వరరావు వ్యవసాయ నేపథ్యంకి చెందినప్పటికి వ్యవసాయంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సందర్భాలు లేవు కాబట్టి చేస్తున్న ఉద్యోగాన్ని, ఏసి గదులను వదలి ఎండలో, మట్టితో పనిచేయడానికి సిద్దం అయ్యాడు కాబట్టి పట్టుదలతో ముందుకు వెళ్ళాలి అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. కాబట్టే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కాని ఎదుర్కొని మెల్లమెల్లగానే ఎదుగుతూ ముందుకు సాగుతున్నాడు. వ్యవసాయంలో శారరీక శ్రమ ఎక్కువ అనే విషయం తెలిసిందే. సేంద్రియ సాగులో శారీరక శ్రమ ఇంకా ఎక్కువగా ఉంటుంది. వెంకటేశ్వరరావు సేంద్రియ సాగులో అడుగు పెట్టినప్పుడు సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. కాబట్టి అవే పద్ధతులతో సేంద్రియ సాగులో అడుగుపెట్టి వరి మరియు వివిధ రకాల కూరగాయలు సాగు చేసుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో కేవలం సుభాస్ పాలేకర్ గారి పద్ధతులు మాత్రమే పాటించినట్లయితే తగిన ఫలితాలు రావడం లేదని తన అనుభవంతో తెలుసుకున్న వెంకటేశ్వరరావు సుభాష్ పాలేకర్ గారి పద్ధతులకు తోడు వేరే సేంద్రియ పద్ధతలను కూడా తన సాగులో అమలు చేయడం మొదలు పెట్టి సమయానుకూలంగా కొత్త కొత్త సేంద్రియ పద్ధతులను కూడా తెలుసుకుంటూ, తన సాగులో అమలుపరుస్తూ, ఏ ఒక్క సేంద్రియ పద్ధతిని గుడ్డిగా నమ్మకుండా అవకాశం ఉన్న వివిధ రకాల సేంద్రియ పద్ధతులను పాటిస్తూ వరి, కూరగాయలు, చెరకు లాంటి పంటలు పండిస్తున్నాడు.
వివిధ రకాల కారణాల వలన సేంద్రియ సాగులో అడుగుపెట్టిన మొదటలో తన సాగులో ఆశించిన లాభాలు రాకపోవడముతో, సాగుని లాభాల బాట పట్టించడానికి అవసరమైన మార్గాలను అన్వేషిస్తూ వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు మరియు సొంత మార్కెటింగ్ వ్యవస్థలతోనే సేంద్రియ సాగును లాభాల బాట పట్టించగలను అని నమ్మి కోదాడలో సేంద్రియ ఉత్పత్తుల అమ్మకం దుకాణం ఏర్పాటు చేసి తాను పండించిన ఉత్పత్తులతో పాటు తోటి సేంద్రియ రైతులు పండించిన ఉత్పత్తులను కూడా అమ్మకం చేయడం మొదలు పెట్టాడు. అయినా కాని ఆశించిన మొత్తంలో ఫలితాలు రాకపోవడముతో నూనె గానుగను ఏర్పాటు చేసి గానుగ నూనెను తీసి నేరుగా వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నాడు. కోదాడ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో అనేకమంది యువతకు గానుగ నూనె తీసే పద్ధతిపై శిక్షణ అందించి యువతకు స్వయం ఉపాధి మార్గం చూపించడంలో వెంకటేశ్వరరావు తనవంతు పాత్రను పోషించాడు. వీటన్నింటికి తోడు చెరకు రసం గురించి సర్వే చేసి చెరకు పండించి, చెరకు నుండి రసం తీసి అమ్మగలిగితే మంచి లాభం ఉంటుందని తెలుసుకుని సేంద్రియ పద్ధతిలో చెరకు పండిస్తూ ఆ చెరకును తానే సొంతంగా చెరకు రసం తీసి అమ్మకం చేస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నాడు.
చేస్తున్న ఉద్యోగాన్ని వదలి సేంద్రియ సాగులో అడుగు పెట్టి విష రసాయన రహిత వ్యవసాయాన్ని విజయవంతం చేస్తున్నాడు. ప్రస్తుతం వరి, చెరకు, వివిధ రకాల కూరగాయల సాగులో ఉన్నాయి. ఈ రోజు ఈ స్థాయికి రావడానికి వెంకటేశ్వరరావు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. పంటలను చీడపీడల నుంచి కాపాడుకుంటూ మంచి దిగుబడులు సాధించడానికి మార్గాలు అన్వేషిస్తూ, అమలుపరుస్తూ, పంట దిగుబడులను అదేవిధంగా అమ్మకుండా విలువ జోడింపుకు సంబంధించిన మార్గాలను అన్వేషిస్తూ, అమలు పరుస్తూ ముందుకు సాగుతూ మనసు ఉంటే మార్గాలు తప్పనిసరిగా ఉంటాయని వెంకటేశ్వరరావు నిరూపిస్తున్నాడు. మరిన్ని వివరాలు 9652111343కి ఫోను చేసి తెలుసుకోగలరు.
మన తెలంగాణ రాష్ట్రంలో పశువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ పాల ఉత్పత్తి తక్కువగా ఉండటానికి రెండు ముఖ్య కారణాలు కలవు. 1. నాశి రకము 2. పశు గ్రాసాల కొరత. మేలు జాతి పశువులకు సమృద్ధిగా పశుగ్రాసాలను ఇచ్చినపుడు వాటి ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. రాష్ట్రంలో పచ్చిమేతల కొరత తీవ్రంగా ఉంది. మొత్తం సాగు భూమిలో 8% పశుగ్రాసాల సాగుకు వినియోగించాలి.
పశువులకు కేవలం ఎండుగడ్డి దాణా ఇవ్వటం వలన వాటికి కావలసిన పోషక పదార్థాలు దొరకవు. పచ్చి మేతలో ఉండే విటమిన్లు ముఖ్యంగా విటమిన్-ఎ పశువుల పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, సక్రమంగా ఎదకు రావడానికి పాల ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడుతుంది. పచ్చిమేత తినని పశువులలో ఈ లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తద్వారా ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది.
పచ్చిమేతలో రెండు రకాలు: 1. కాయజాతి 2. ధాన్యపు జాతి పశుగ్రాసాలు.
చిరుధాన్యాలు, వివిధ పచ్చగడ్డి రకాలను ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటారు. ధాన్యపు జాతి మేతను పశవులకు ఎక్కువగాను, కాయజాతి మేతను తక్కువగాను మేపాలి. ఈ కాయజాతి, ధాన్యపుజాతి పశువుల మేతను 1:2 నిష్పత్తిలో మేపిన యెడల అవి పశువులకు సమీకృత ఆహారంగా ఉపయోగపడును. ధాన్యపు రకపు మేతలు పశువులకు శక్తిని, కాయజాతి మేతలు మాంసకృత్తులు అందిస్తాయి. సాధారణంగా రోజుకు ఆవు / గెదెకు 35-45 కిలోల పచ్చిమేత అవసరం.
మంచి పశుగ్రాసము లక్షణాలు:
రుచిగా ఉండాలి. ఎక్కువ మాంసకృత్తులు కలిగి ఉండాలి. తక్కువ కాలంలో కోతకు రావాలి. ఎక్కువ దిగుబడి ఇవ్వాలి. నీటి ఎద్దడిని తట్టుకోవాలి. పంటను ఏ థలో కోసినా రుచిగా ఉండాలి, ఎటువంటి విష పదార్థాలు ఉండకూడదు. తెగుళ్లు తట్టుకొనే శక్తిని కలిగి ఉండాలి.
దాణాను రెండు సమభాగాలుగా చేసి ఉదయం, సాయంత్రం పాలు పితికే ముందు వేయాలి.
మనం రోజుకు ఇవ్వవలసిన గడ్డిలో సగభాగం ప్రొద్దున నీళ్లు త్రాగించిన తర్వాత మిగతా సగభాగం సాయంత్రం పాలు పితికిన తరువాత అందించవలెను.
సాధారణ పశువులకు మేత: సాధారణంగా ఆవు / గేదెకి 35-45 కిలోల పచ్చిమేత, 6-7 కిలోల ఎండుగడ్డి 3 కిలోల దాణా అవసరము అవుతుంది.
సంకరజాతి పశువులకు మేత: సంకరజాతి పశువులకు – రోజుకు 6 నుండి 7 లీటర్ల పాలిచ్చే ఆవుకు పాలిచ్చే రోజుల్లో 20-25 కిలోల పచ్చిగడ్డి, 5-6 కిలోల ఎండుగడ్డి, 3-3.5 కిలోల దాణా అవసరం పడుతుంది.
పాడి పశువులకు పుష్కలంగా పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉంచాలి. ప్రతి పాడి పశువుకు రోజు 35-45 లీటర్ల నీరు త్రాగటానికి అవసరం అగును.
బహువార్షిక పశుగ్రాసాలు: హైబ్రిడ్ నేపియర్, పారగడ్డి, గినిగడ్డి, అంజన్ గడ్డి, స్టైలో హెమాటా, స్టైలో స్కాబ్రా వంటి పశుగ్రాసాలను పచ్చిమేతగా ఉపయోగించవచ్చు.
పశువుల దాణా మిశ్రమం: 100 కిలోల దాణా మిశ్రమాన్ని తయారు చేయడానికి కావలసిన దానా దినుసులు: జొన్నలు, మొక్కజొన్నలు – 30 కిలోలు, గోధుమ పొట్టు లేదా తవుడు – 32 కిలోలు, గానుగ పిండి 25 కిలోలు, బెల్లం మడ్డి – 10 కిలోలు, లవణ మిశ్రమం – 2 కిలోలు అవసరం అవుతువంది.
దాణా మిశ్రమాన్ని రోజుకు 6 నుండి 7 లీటర్ల పాలిచ్చే ఆవుకు 3-3.5 కిలోలు.
రోజుకి 6 నుండి 10 లీటర్ల పాలిచ్చే ఆవుకు 4-4.5 కిలోల దాణాను అందించినట్లయితే పాల దిగుబడి పెరుగుతుంది.
డా. కె. చిరంజీవి, డా. మహమ్మద్ అలిబాబా, డా. ఎం. గోవర్థన్, అన్ ఫామ్ రీసెర్చ్ సెంటర్, రంగారెడ్డి, అఖిల భారత సమగ్ర వ్యవసాయ పద్ధతుల పరిశోధనా విభాగం, రాజేంద్రనగర్.
ప్రపంచంలోని గ్రుడ్ల ఉత్పత్తిలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. ఈ అభివృద్ధిలో మన రాష్ట్ర పాత్ర గణనీయం. కోళ్ళ సంఖ్యలోను, గ్రుడ్ల ఉత్పత్తిలోను మన రాష్టం దేశంలోనే అగ్ర స్థానాన ఉంది. భారతదేశంలో లభించే కోడిగ్రుడ్లలో 35 శాతం ఉత్పత్తి మన రాష్ట్రంనుంచే జరుగుతోంది. దేశవాళీ కోడిగ్రుడ్ల ఉత్పత్తిలో చాలా వెనుకబడి ఉంది. అందుచేత గ్రుడ్ల దిగుబడి పెంచేందుకు, విదేశీ జాతులు, వాటినుండి వచ్చిన సంకర జాతులు మన దేశంలోకి దిగుమతి చేసుకోబడ్డాయి. వీటిలో వైట్ లెగ్ హార్న్ మరియు బాబ్ కాక్ జాతులు ముఖ్యమైనవి. సంకరజాతి కోళ్ళు మంచి యాజమాన్యంతో ఏడాదికి 290-320 గుడ్లు పెడతాయి. స్వచ్ఛమైన జాతులకన్నా హైబ్రిడ్ కోళ్ళు దాదాపు ప్రతి కోడి పెట్ట 40-60 గుడ్లు ఎక్కువ పెడుతుంది. ఈనాటి గణనీయమైన గ్రుడ్ల ఉత్పత్తి పెరుగుదలకు ఇదే ప్రధాన కారణం.
ఇదే తరహాలో 32 ఏళ్ల నుండి హరిప్రసాద్ మొదటిసారిగా డీప్ లిట్టర్ పద్దతిన రాజంపేటలో 1500 కోళ్ళతో బాబ్ కాక్ జాతిని ఎంచుకుని ఫారమును ప్రారంభించారు. ప్రస్తుతం 15000 కోళ్ళ కేజ్ వ్యవస్థకు తన కోళ్ళఫార్మ్ను మార్చుకున్నారు. డీప్ లిట్టర్ పద్దతి నుండి కేజ్ వ్యవస్థ తన ఫార్మ్ని అభివృద్ధి చేసారు. ఎందుకంటే డీప్ లిట్టర్ పద్దతి కన్నా కేజ్ వ్యవస్థ మెరుగైనది కాబట్టి. అంతేగాక దాణా మరియు వ్యాధుల విషయములో కూడా పాత పద్ధతి కన్నా కేజ్లో చాలా తక్కువ. 30 ఏళ్ల తన ప్రయాణములో అతని కోళ్ళ యాజమాన్యము గాని, టీకాల విషయములోగాని ఇలా ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఇప్పటికి కూడా మార్కెట్లో ఒడిదుడుకులను అధిగమించి కోళ్ళ ఫార్మ్ను హరి ప్రసాద్ విజవంతముగా చేస్తున్నారు.
బాబ్ కాక్ జాతి పిల్లలను జీరో రోజు నుండి చిత్తూర్ బాలాజీ హేచరీస్ నుండి కొనుగోలు చేస్తున్నారు. 72 వారాల వరకు పెంచుతున్నారు. తరువాత ఉత్పత్తిలో క్షీణత వలన కోళ్లను మార్కెట్ చేస్తున్నారు. బ్రాయిలర్ కోళ్ళు రావడం వలన లేయర్ కోళ్ళ మాంసంకి గిరాకీ తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్రుడ్లు పెట్టే కోళ్ళు ఒక్కసారిగా షాప్స్కి సరఫరా చేసినపుడు కోళ్ళు గ్రుడ్లు పెట్టడం మరియు బయటికి తీయడం వలన బరువు తగ్గడం లాంటివి ఉండడము వలన 72 వారాల తరువాత తక్కువ ధరలోనే అమ్ముడు పోతాయి. కాని గ్రుడ్ల ఉత్పత్తిలో చాలా వరకు ప్రాధాన్యత ఉన్నది అని చెప్పారు. మొదట్లో కోడి బరువు 1.9 కిలోలు ఉండి 280 గ్రుడ్లతో ఉండే బాబ్ కాక్ జాతిని ప్రస్తుతం 335 గ్రుడ్లతో 1.5 కిలోల బరువు వరకు పెరిగే విధముగా కోళ్లను అభివృద్ధి చేసారు అని తెలియచేయడం జరిగినది.
షెడ్ నిర్మాణం గురించి
షెడ్డు నిర్మాణానికి ఎంచిన స్థలం, మంచి నీటివసతి, విద్యుచ్చక్తి సరఫరా, మార్కెట్టుకు చేరువలో ఉండటం మున్నగు సదుపాయాలు కలిగి ఉండాలి అన్నారు. అందుకే రాజంపేటకు దగ్గరలోనే ప్రారంభించారు. షెడ్డు ఎత్తులో ఉండే విధముగా చేస్తే గాలి చలనం బాగా ఉంటుంది మరియు మరుగు నీరు నిల్వకు అవకాశం లేనటువంటి ప్రదేశాలను ఎన్నుకోవాలి అన్నారు. ఖర్చు తగ్గించే ప్రయత్నంలో షెడ్ను ఎలుకలకు, అగ్నిప్రమాదాలకు అనువుగా నిర్మించకూడదు.
ఇందుకుగాను కాంక్రీటు నేల, పక్కలకు అల్లిన ఇనుపతీగ, పై కప్పుకు రేకులు వాడటం మంచిది. సాధ్యమైనంత వరకు కోడి పిల్లలను, పెరిగే కోళ్ళను, గుడ్లు పెట్టే కోళ్ళను వేర్వేరు షెడ్లలో పెంచడం మంచిది. షెడ్డు వెడల్పు 25 నుండి 88 అడుగులకు మించకుండా ఉండాలి. కోళ్ళ సంఖ్యను బట్టి పొడవు ఎంతైనా ఉండవచ్చు. షెడ్డు పక్కగోడలు 1 అడుగు ఎత్తు ఉండి, ఆ పైన 6-7 అడుగుల ఎత్తు వరకు అల్లిన ఇనుపతీగను (వైర్ మెష్) అమర్చాలి. చూరు కనీసం 3-4అడుగులుండేటట్లు చూడాలి. పైకప్పును ఆస్బెస్టాస్ రేకులతో వేయడం మంచిది. షెడ్డులో ఎండపడకుండా ఉండడానికి షెడ్ను తూర్పు, పడమర దిశలో నిర్మించుకోవాలి.
కోడి పిల్లలు తెచ్చుకున్న తరువాత చేయవలిసిన పనులు
పుట్టినప్పటి నుండి 8 వారాల వయస్సు వచ్చే వరకు గల థను ”పిల్లథ లేదా స్టార్టరు థ అంటారు. ఈ థలో కోడి పిల్లలు సున్నితంగా ఉండి తక్కువ రోగ నిరోధక శక్తి కలిగి ఉంటాయి. కాబట్టి వాటి పోషణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వీలైనంతవరకు ఒక రోజు వయస్సు పిల్లలతో పరిశ్రమ ప్రారంభించటం మంచిది. కోడి పిల్లల రాకకు పది రోజుల ముందుగా షెడ్డులోనిబూజు, దుమ్ము దులిపి, గోడలకు సున్నం వేయించాలి. బ్రూడరు, మేత తొట్లు, నీటి తొట్లు కడిగి క్రిమి సంహారక మందుతో శుభ్రపరచాలి. వరి పొట్టు లేక వేరుశనగ పొట్టు 2-3 అంగుళాల మందంలో నేలపై పరచాలి (లిట్టరు). మొక్కజొన్న నూకను కాగితంపై పలుచగా చల్లాలి. బ్రూడరు చుట్టూ 2-3 అడుగుల దూరంలో 18 అం. ఎత్తుగా అట్టగాని, రేకులుగాని వృత్తాకారంలో దడిగా అమర్చాలి.
బ్రూడింగ్ చాలా ముఖ్యం
ప్రతిరోజు 2 లేదా మూడుసార్లు కోడిపిల్లల ఆరోగ్య అవసరాలను గమనించాలి. చిన్నపిల్లలను పెంచే షెడ్డుకు, పెద్ద కోళ్ళ షెడ్డుకు మద్య కనీసం 100 గజాల దూరం ఉండాలి. పెద్దకోళ్ళ షెడ్డులో పనిచేసే వ్యక్తి చిన్న పిల్లల షెడ్లో ప్రవేశించరాదు. ఎల్లప్పుడు లిట్టరు తడికాకుండా పొడిగా ఉండునట్లు జాగ్రత్తపడాలి. నాటు జాతికోళ్ళను షెడ్డు ఆవరణలోనికి రానీయకూడదు. షెడ్డు ద్వారంలో క్రిమి సంహారక మందు ఉంచిన తొట్టి ఉంచి షెడ్లోకి ప్రవేశించే ముందు పాదాలను ఆ ద్రావణంలో తడపాలి. ఈదరగాలి సోకకుండా షెడ్డుకు ఇరువైపుల గోనె పట్టాలను లేదా ప్లాస్టిక్ పరదాలను అవసరమున్నంత మేరకు వేలాడదీయాలి.
కోళ్ల పోషణ
కోళ్ళకు కావలసిన పోషణ పదార్థాలన్నింటిని తగుపాళ్ళ మిశ్రమం తయారు చేసుకోవాలి. రైతులు తమ ప్రాంతంలో తక్కువ ధరకు దొరికే దినుసులు ఉపయోగించి మిశ్రమం తయారు చేసుకోవచ్చు. దీనివల్ల 72 వారాల్లో 300-320 గ్రుడ్లు వరకు దిగుబడినిచ్చే అవకాశం ఉన్నది.
16-18వ వారం నుంచి గ్రుడ్ల ఉత్పత్తి ప్రారంభమై 25-26వ వారం వరకు 90శాతం లేదా అంతకు మించి గ్రుడ్లు దిగుబడి ఉండే అవకాశం ఉంది. పోషణలో భాగముగా మొక్క జొన్న, జొన్న, రాగులు, పగిలిన బియ్యం, చేపల మీల్, వేరుశనగ కేక్ ఇలా పదార్థాలను ఎంచుకుని స్వయముగా ఒక దాణా తయారీ మిషన్ సహాయంతో దాణా తయారు చేసుకోవడంతో పాటు ప్రోబయోటిక్ పౌడర్లు కూడా తక్కువ ఖర్చుతో తయారు చేసుకుంటున్నారు.
ఈ థలో ఏ విధమయిన ప్రయాస కలుగకుండా చూసుకోవడం, అతిముఖ్యం. టీకాలు, ముక్కులు రెండవసారి కత్తిరించటం మున్నగు కార్యక్రమాలు కోళ్ళు గ్రుడ్లు పెట్టే థకు చేరకముందే పూర్తి చేయాలి.ఈ థలో కోళ్ళకు రోజుకు 14 నుంచి 16 గం. వెలుతురు అవసరం. అనగా పగటి వెలుతురుతోబాటు అదనంగా 4-5 గంటలు వెలుతురు రాత్రుల్లో ఇవ్వాల్సి ఉంటుంది (వారానికి 1 గంట చొప్పున). కాబట్టి 19-20వ వారం నుంచి క్రమంగా వెలుతురు సమయాన్ని 24 వారాలకు 16 గంటలు వచ్చేవరకు పెంచాలి. షెడ్లోని వెలుతురు, కోళ్ళ గ్రుడ్ల ఉత్పత్తికి దోహదం చేస్తుంది కాబట్టి, ఈ విషయాన్ని విస్మరించకూడదు అని చెప్పారు.
మార్కెటింగ్:
మొదట్లో మద్రాసుకు గ్రుడ్లు, కోళ్ళు అమ్మకం చేసేవారు. తరువాత లోకల్గానే మార్కెట్ చేస్తున్నారు. గ్రుడ్డు ధర గరిష్టంగా 5.40/-గా హోల్సేల్ అమ్మకం చేసున్నారు.
72 వారాల తరువాత కోళ్లను డిమాండ్ను బట్టి లోకల్గా రాజంపేట టౌన్లో మరియు నెల్లూరుకు తరలిస్తున్నారు. మాంసం కోసం కోళ్లు పెంచే వారితో పోలిస్తే లేయర్ల మాంసం పరముగా డిమాండ్ తక్కువ అని తెలియచేసారు.
ముఖ్యంగా టీకాల విషయములో తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి అని తెలియచేసారు. కంపెనీ వారు ఇచ్చే పట్టికను వారు అనుసరించడం చేస్తున్నారు.
కొత్తగా కోళ్ళ పరిశ్రమను ప్రారంభించాలనుకునే వారికి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకము ద్వారా 50% సబ్సిడీతో ప్రభుత్వం చేయూతను ఇస్తున్నది. మొత్తము పద్ధతి అంత ఆన్లైన్లోనే అప్లై చేయవలిసి ఉంటుంది. ఆసక్తిగల వారు దగ్గరలో ఉన్న పశువైధ్యాదికారిని సంప్రదించగలరు. లేదా NLM వెబ్ సైట్ https://nlm.udyamimitra.in సందర్శించగలరు.
భారతదేశంలో విస్తారంగా ఉన్న పశుసంపద ఒక ముఖ్యమైన జీవనోపాధి, ఇతర ఆదాయాలకు అనుబంధంగా, ఉపాధి అవకాశాలను అందిస్తుంది. పాడిపశువులు గ్రామీణ ప్రజల సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గడిచిన 30-40 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు మన దేశవాళీ ఆవుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది, దీనికి ముఖ్య కారణం వీటి యొక్క తక్కువ పాల ఉత్పాదక శక్తి. పాలలోని మాంసకృత్తుల పైన జరిపిన పరిశోధనల ఆధారంగా పాలను ఏ1 మరియు ఏ2 పాలుగా విభజించడం జరిగినది. వీటిలో ఏ2 పాలు ఏ1 పాలకంటే మెరుగైనవని తేలింది. మనదేశీయ ఆవుల పాలు ఏ2 రకం కిందకు వస్తాయి అదే విదేశీ ఆవుల పాలు ఏ1 క్రింద పరిగణించబడతాయి. ఏ2 పాలను నగరంలో ఎక్కువ ధరకు అమ్మి రైతులు లాభాన్ని పొదుతున్నారు. అంతేకాక దేవవాళీ పశువులలో వేడిని తట్టుకునే శక్తి మరియు తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి. వ్యాధినిరోధక శక్తి మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితులు తట్టుకునే శక్తి వలన, వీటిని వేరే దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతోంది. పాలు, ఆవు పేడ (సేంద్రియ ఎరువు), ఆవు మూత్రం (ఔషధ విలువలు), పెరుగు మరియు నెయ్యి మొదలగు వాటి సరఫరా ద్వారా దేశీయ పశువులు జాతీయ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ జనాభా యొక్క అవసరాలకు అనుగుణంగా జంతు ఉత్పత్తులకు గిరాకీ అనేక రెట్లు పెరిగింది. దీని మూలంగా, పశువుల ఉత్పాదక శక్తి నాటకీయంగా రూపాంతరం చెంది తద్వారా వాటి యొక్క సామర్థ్యం మరియు ఉత్పాదకత మెరుగుపడబడుతోంది.
గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోన్న వివిధ పరిశోధనల మూలంగా సాంకేతికతను అందిపుచ్చుకొని మనం ముందుకు వెళ్తున్నాము. వీటి ద్వారా పశువుల ఉత్పాదకతలో గణనీయమైన అభివృద్ధి సాధించబడుతోంది. పిండ బదిలీ అనేది మేలు జాతి ఆవు నుండి పిండాన్ని సేకరించి, గర్భధారణ కాలాన్ని పూర్తి చేయడానికి మరొక ఆవులోకి బదిలీ చేసే ప్రక్రియ. ఈ పద్ధతిని జన్యుపరంగా విలువైన ఆడ పశువుల ఉత్పత్తి అభివృద్ధికి, వ్యాధులను అరికట్టుటకు, ప్రణాళికాబద్ధమైన సంయోగం, వ్యవసాయ ఆదాయాన్ని పెంచడానికి మొదలగు వాటికి చాలా విరివిగా వినియోగిస్తున్నారు. అల్ప పునరుత్పత్తి రేట్లు మరియు ఈతకు ఈతకు మధ్య ఎక్కువ కాలం ఉన్నటువంటి పశువులలో ఈ పిండమార్పిడి ప్రక్రియ పశువులకు చాలా ఉపయోగపడుతుంది.
చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ ప్రక్రియ అంత విస్తృతంగా వాడుకలో లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ ప్రక్రియ కొరకు ఉండవలసిన సాంకేతిక నైపుణ్యాలు లేకపోవుట మరియు అధిక వ్యయ కారణాల చేత ఈ ప్రక్రియ అంతగా ప్రాచుర్యం పొందలేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ సాంకేతిక వాణిజ్యపరంగా అందుబాటులో లేనప్పటికీ, పిండమార్పిడి సాంకేతికత చిన్న జాతుల సంరక్షణ మరియు అభివృద్ధి అవకాశాలను అందిస్తుంది.
సాధారణంగా ఒక ఆవు తన జీవిత కాలంలో సహజ పద్ధతిలోనైనా లేదా కృత్రిమ గర్భోత్పత్తి విధానాన్ని ఉపయోగించినా 8 నుంచి 10 దూడలకు జన్మనిస్తుంది. కానీ పిండ మార్పిడి ప్రక్రియ ద్వారా ఒక మేలుజాతి ఆవు నుంచి 50-100 పిండాలను అభివృద్ధి చేసి, 30-40 దూడలను పొందవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా తక్కువ సమయంలోనే మంచి జాతి పశువులను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేయవచ్చు. ఈ విధానాన్ని ఒంగోలు, గిర్, పుంగనూరు మరియు సాహివాల్ వంటి దేశీయ పశుజాతులని అభివృద్ధి పరిచేందుకు మన రాష్ట్రంలో అనుసరిపస్తున్నారు,
పిండోత్పత్తి మరియు పిండ మార్పిడి
ఒక మేలు జాతి ఎద్దు వీర్యాన్ని ఒక మేలు జాతి ఆవు గర్భంలో ప్రవేశపెట్టి పిండాలను సేకరించి మరొక ఆవు గర్భంలోకి ప్రవేశపెడతారు. మేలు జాతి ఆవులను ముఖ్యంగా వాటి యొక్క పాల ఉత్పత్తిని బట్టి ఎంపిక చేస్తారు. ఆవుల నుండి దూడలకు సంక్రమించే అవలక్షణాలు కలిగివుండనివి, ఎటువంటి రోగాలు లేనివి, నిర్ణీత సమయానికి ఎదకు వచ్చేవి మరియు జన్యు పరంగా లోపాలు లేని పశువులను ఎంపిక చేస్తారు.
పై ప్రక్రియలో లింగ నిర్ధారిత వీర్యాన్ని కూడా ఉపయోగించవచ్చు. అభివృద్ధి చెందిన పిండాన్ని తక్కువ పాలు ఇచ్చే ఆవుల గర్భంలో ప్రవేశపెడతారు. ఈ రకంగా తక్కువ పాలు ఇచ్చే ఆవుల గర్భంలో ఎక్కువ పాలు ఇచ్చే మేలు రకం దూడను పొందవచ్చు. దీని ద్వారా పుట్టే దూడలకు పూర్తిగా ఏ ఆవు నుంచి అండాలను సేకరించామో ఆ ఆవు యొక్క లక్షణాలు వస్తాయి. మామూలుగా ఒక సంవత్సరంలో లింగ నిర్ధారిత వీర్యం వాడినా లేదా ఎద్దుతో దాటించినా ఒక దూడ మాత్రమే జన్మిస్తుంది. కానీ ఈ ప్రక్రియలో 100 పిండాలను తయారు చేయగలిగి, వాటిని తక్కువ పాల ఉత్పత్తి కలిగిన ఆవుల గర్భంలో ప్రవేశపెడితే 40 దూడల వరకు పొందవచ్చు. పై పద్ధతిలో వచ్చిన పిండాలను తగిన ఆవులు అందుబాటులో ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు బదిలీ చేయవచ్చు. ఒకవేళ ఆవులు అందుబాటులో లేకపోతే వాటిని ద్రవ నత్రజనిలో నిలువ చేసి మరల ఎప్పుడయినా బదిలీ చేయవచ్చు.
పిండ మార్పిడి వలన ఉపయోగాలు
ఈ పద్ధతి ద్వారా తక్కువ సమయంలో జన్యుపరంగా మేలు జాతి దూడలను పొందవచ్చు. మేలు జాతి ఆవులను అభివృద్ధి చేసి తద్వారా పాల ఉత్పత్తిని పెంచవచ్చు. పాల ఉత్పత్తిని బట్టి మేలు జాతి ఆవులను ఎంపిక చేసి వాటిలో పిండ మార్పిడి ప్రక్రియ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ దూడలను పొందవచ్చు. వాటి నుండి వచ్చిన దూడలు ఎక్కువ పాలను ఇచ్చే గుణాలను కలిగి ఉంటాయి.
కృత్రిమ గర్భధారణ చేసినప్పుడు 50 శాతం ఆడ దూడలు లేదా 50 శాతం మగ దూడలు జన్మించే అవకాశం ఉంటుంది. మగ దూడలను పెంచడం వలన రైతులకు వ్యయప్రయాస మరియు ఆర్థికంగా నష్టపోతారు. పిండమార్పిడి ప్రక్రియకు లింగ నిర్ధారిత వీర్యాన్ని జోడిస్తే 90 శాతం ఆడ దూడలను పొందవచ్చు, మరియు వాటి సంతతిని గణనీయంగా పెంచడం వలన రైతుకు లాభదాయకంగా ఉంటుంది.
కొన్నిరకాల అవలక్షణములు అనగా అండాశయ తిత్తులు, మెయ్య మొదలగునవి తల్లి నుండి దూడలకు జన్యుపరంగా సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పిండ మార్పిడి పద్ధతిలో మేలు రకమైన పశువులను ఎంపిక చేయుట వలన ఇలాంటి అసాధారణతలను అధిగమించవచ్చు.
దేశీయ గోజాతులు ఎన్నో ఉపయోగకరమైన లక్షణాలను కలిగిఉన్నప్పటికీ, విదేశీ ఆవులతో పోల్చితే తక్కువ పాల ఉత్పత్తి ఇవ్వడం వలన వీటి సంతతి అభివృద్ధి సరియైన రీతిలో జరగనందున, వాటిని కోల్పోయే స్థితిలో ఉన్నాము. పుంగనూరు, సాహివాల్ మరియు రెడ్ సింధీ మొదలగు జాతి ఆవుల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతున్నది. కనుమరుగవుతున్న ఈ జాతులను మనం ఈ పిండ మార్పిడి ప్రక్రియ ద్వారా వాటి యొక్క సంఖ్యను వేగంగా పెంచగలము. ఒక ఆవు కొనుగోలుకు చేసే ఖర్చు కన్నా ఈ పద్ధతిలో దూడ పుట్టడానికి అయ్యే ఖర్చు తక్కువగా ఉంటుంది. పైగా ఈ పద్ధతిలో పుట్టిన దూడలు మేలు జాతి పశువుల నుంచి వచ్చినవి కాబట్టి పుట్టుకతో వచ్చు అసాధారనతలు ఉండవు మరియు ఇవి కావలసిన లక్షణాలను కలిగి ఉంటాయి. వ్యాధినిరోధక శక్తి మరియు పాల దిగుబడి ఎక్కువగా ఉన్న పశువులను పెంచడం వలన రైతులు ఆర్థికంగా లాభపడతారు. దీ
డా. కె. గ్రీష్మారెడ్డి (8309205772), పిహెచ్డి. విద్యార్థిని, మందా శ్రీనివాస్, ప్రొఫెసర్, పశుగర్భకోశ శాస్త్ర, ప్రసూతి విభాగము, ఎన్.టి.ఆర్ విశ్వవిద్యాలయం, గన్నవరం, శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి.
పంటలకు హానీ చేసే శిలీంద్రాలను నాశనం చేసి, పంటలను తెగుళ్ళు రాకుండా కాపాడును.
వాడే పద్ధతి: 100 కిలోల సేంద్రియ ఎరువు, అరకిలో నల్లబెల్లం, 1 కిలో ట్రైకోడెర్మావిరిడి, 5 కిలోల వేపపిండి, చెట్టు నీడన గానీ, పాకలో గానీ, పొరలు పొరలుగా ఎరువు, వేపపిండి, ట్రైకోడెర్మావిరిడి వేస్తూ బెల్లపు నీరు చిలకరించి, గుట్టలో తగిన తేమ ఉండేటట్లు చూడాలి. గుట్టపైన తడిపిన గోనె సంచి కప్పి నాలుగు రోజులుంచితే ఎరువంతయు బూజు పట్టినట్లు అగును. చేలో తేమ ఉన్నప్పుడు ఈ ఎరువు వేరు వ్యవస్థ దగ్గరగా, సాయంత్రపు సమయంలో చల్లాలి. పండ్లతోటలలో సంవత్సరానికి కనీసం రెండుసార్లు, ఇతర పంటలకు ఒకసారి చల్లాలి. అవసరమైతే మోతాదు పెంచుకోవచ్చును. చెట్లు/మొక్కల మొదళ్లలో 1 శాతం శిలీంద్రం కలిపిన నీరు పోయాలి.
విత్తనశుద్ధి: 10 గ్రా. ట్రైకోడెర్మావిరిడి, 10 మి.లీ. నీటిలో పేస్టుగా చేసి విత్తనాలకు పట్టించి ఆరబెట్టి విత్తుకోవాలి. పసుపు దుంపలు, చెరకు ముచ్చెలు, నారు వగైరాలకు అరకిలో శిలీంద్రం 50 లీటర్లు నీటిలో కలిపి అందులో అరగంట ఉంచి నాటాలి.
వాడే పద్ధతి: పైన ట్రైకోడెర్మావిరిడి భూమికి వెదజల్లే పద్ధతి దీనికి కూడా పాటించాలి. పంటపై పిచికారీ చేసినప్పుడు 1 కిలో, 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కానీ రెండు రోజుల ముందు 1 కిలో నల్లబెల్లం, 2 లీటర్ల నీటిలో కలిపి తయారు చేసిన పానకంలో 1 కిలో సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ నానవేసి, పిచికారి చేసిన మంచి ఫలితాలుంటాయి.
విత్తనశుద్ధి: 10 గ్రాములు, కిలో విత్తనానికి, దుంపలు, చెరకు ముచ్చెలు, నారు వగైరాలకు అరకిలో సూడోమోనాస్ 50 లీటర్ల నీరు కలిపిన ద్రావణంలో అరగంట ఉంచి విత్తాలి.
నివారించే తెగుళ్లు: ఎండు తెగులు, అగ్గితెగులు, నారుకుళ్లు, ఆకుమచ్చ, పొడతెగులు వగైరాలు పంచగవ్యలో కలిపి సాయంత్రం సమయంలో పిచికారీ చేసినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి.
బవేరియా బాసియానా (శిలీంద్రం)
అన్ని పంటలపై వచ్చే శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, గొంగళి పురుగు, కాయతొలిచే పురుగు, కొమ్మ, కాండం తొలిచే పురుగులపై సమర్ధవంతంగా పనిచేసే శిలీంద్రము, పంచగవ్యలో కలిపి వాడినప్పుడు దీని సామర్థ్యం బాగా పెరిగింది.
వాడే పద్ధతి: మొక్క పెరిగే థలో 2 కిలోల బవేరియా బాసియానా 100 లీటర్ల నీటిలో కలిపి, దానికి 3 లీటర్ల పంచగవ్య కలిపి పిచికారీ చేయాలి. మొక్కల అన్ని భాగాలు తడిచేటట్లు పిచికారీ చేయాలి. వంగలో మొక్క పెరిగే థలో 2 సార్లు పిచికారీ చేసిన కొమ్మ, కాయ తొలిచే పురుగులు రాలేదు. ప్రస్తుతం చాలా మంది వంగరైతులు వాడుతున్న మందు బవేరియా బాసియానా 2 కిలోలు మరియు 3 లీటర్ల పంచగవ్య సాయంత్రం సమయంలో పిచికారీ చేయాలి.
వర్టిసీలియం లెకానీ (శిలీంద్రం)
అన్ని పంటలపై వచ్చే పేనుబంక, నల్లి, తెల్లదోమ, రసం పీల్చే పురుగులపై సమర్ధవంతంగా పనిచేయును. పంచగవ్యలో కలిపి వాడినప్పుడు సామర్థ్యం పెరిగినది.
వాడే విధానం: 2 కిలోల వర్టిసీలియం లెకాని 3 లీటర్లు పంచగవ్య, 100 లీటర్ల నీటిలో కలిపి సామర్థ్యం పెంచి సాయంత్రం సమయంలో పైరంతా తడిచేటట్లు పిచికారీ చేయాలి. మొదటి సారి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
మెటారైజియం (శిలీంద్రం)
చెదలు, చీమలు, దోమలు, వేరుపురుగు, ఈగలు వగైరా సమర్థవంతంగా నివారించే శిలీంద్రం.
వాడే పద్ధతి: ట్రైకోడెర్మా విరిడిలాగా 100 కిలోల కంపోస్టు, 5 కిలోల వేపపిండి, అర కిలో బెల్లపు నీరు, 2 కిలోల మెటారైజిమ్ కలిపి చేలో తగు తేమ ఉన్నప్పుడు భూమిపై వెదజల్లాలి. 2 కిలోల మెటారైజిమ్, 100 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయవచ్చు. మొదటి సారి వాడినప్పుడు వారంలో రెండుసార్లు పిచికారీ చేసిన మంచి ఫలితాలు వచ్చును. పంచగవ్యలో కలిపి పైరుపై చల్లవచ్చును.
ట్రైకోడెర్మా హార్జియానమ్ (శిలీంద్రం)
ట్రైకోడెర్మా విరిడి భూమిలోపల వాడితే ఇది భూమిపైన కాయకుళ్ళు రాకుండా వాడే శిలీంద్రం. దీనిని కూడా అరకిలో బెల్లం పానకంలో 2 కిలోల ట్రైకోడెర్మా హార్జియానమ్ 48 గంటలు నానబెట్టి వాడిన మంచి ఫలితాలు వచ్చును.
డా. ఎన్. కృష్ణ ప్రియ, అసిస్టెంట్ ప్రొఫెసర్, అగ్రికల్చర్ పాలిటెక్నిక్, ఊటుకూర్, కడప.
గతాన్ని ఒక్కసారి గమనించినట్లయితే రైతు కుటుంబానికి చెందిన వారిలో చాలామంది ఉన్నత చదువులు చదివి వ్యవసాయ రంగాన్ని వీడి ఉద్యోగ, వ్యాపార రంగాలకు వలసలు వెళ్ళారు. ఇంకా వెళుతున్నారు. కాబట్టే వ్యవసాయ రంగం మీద ఆధారపడే జనాభా తగ్గుతూ వస్తుంది. కాని రెండోవైపు పరిశీలించినట్లయితే అంతకు మునుపే వ్యవసాయరంగాన్ని వీడి ఉద్యోగ, వ్యాపార రంగాలకు వలసలు వెళ్ళినవారిలో కొంతమంది ఆర్థికంగా బలపడిన తరువాత తిరిగి వ్యవసాయరంగం వైపు తమ అడుగులు వేస్తున్నారు. దాని పర్యవసానమే ఇటీవల కాలంలో ఉద్యోగ రంగం నుండి ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగ రంగం నుండి వ్యవసాయరంగం వైపు అదీను సేంద్రియ వ్యవసాయ రంగం వైపు కొంతమంది అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. నల్లగొండ జిల్లా, కనగల్లు మండలం నరసింహపురం గ్రామానికి చెందిన జల్లా పుండరీకం ఇదే దారిలో నడిచి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి వ్యవసాయరంగంలోకి అడుగు పెట్టాడు.
వ్యవసాయ నేపథ్యానికి చెందిన పుండరీకర ఉన్నత చదువులు చదివి ఉద్యోగ రంగంలో ప్రవేశించి 20 నుంచి 25 సంవత్సరాల తన ఉద్యోగ జీవితంలో పలు దేశాలతో పాటు మన దేశంలోని ప్రముఖ నగరాలలో కూడా తన ఉద్యోగ సేవలు అందించవలసి వచ్చింది. మంచి జీతంతో విలాసవంతమైన సౌకర్యాలతో కుటుంబంతో ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్న క్రమంలో ఏదో అసంతృప్తి మనసులో కలిగి తమ అసంతృప్తికి సరైన పరిష్కారం వ్యవసాయరంగం అని తెలిసి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి వ్యవసాయంలో అడుగు పెట్టడం జరిగింది. తమ అంతిమ లక్ష్యం వ్యవసాయం అని గ్రహించి వెంటనే తమకు అనుకూలమైన పంట, అంటే అప్పటి వరకు మట్టి వాసనకు దూరంగా ఎసి గదులకు పరిమితమై ఉద్యోగాలు చేశారు కాబట్టి అలాంటి సౌకర్యాలను వదలి నేరుగా మట్టిలో కాలుపెట్టి 365 రోజులు శారీరక శ్రమ చేయడం కొంత ఇబ్బందిగా ఉండవచ్చు అని భావించి తమకు అనుకూలమైన పంటల కొరకు పరిశీలించి, పరిశోధించి తమ జీవన శైలికి అనుకూలమైన పంట మల్బరీ తోట పెంపకం, దానికి అనుసంధానంగా పట్టు పురుగుల పెంపకం సరైనదారి అని నమ్మి 2015వ సంవత్సరములో అటువైపు అడుగులు వేశారు. పట్టు పురుగుల పెంపకంలో రెండు విభాగాలు ఉంటాయి. అవి మల్బరీ తోట పెంపకం మరియు పట్టు పురుగుల పెంపకం. ఈ రెండింటి గురించి పుండరీకం అందించిన వివరాలు…
మల్బరీసాగు: మల్బరీలో అనేక రకాలు ఉన్నా కాని పట్టుపురుగుల పెంపకానికి అనువైన రకాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. వాటిలో కూడా కొన్ని మార్పులు చేసి మంచి రకాలను అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. సంబంధిత శాస్త్రవేత్తలు అభివృద్ధిపరచిన విక్టరి1 (ఙ1) రకాన్ని నాటుకోవడం జరిగింది. తన ఈ ఎనిమిది సంవత్సరాల అనుభవంలో లైనుకి, లైనుకి మరియు మొక్కకు, మొక్కకు 4þ4 లేక 3þ3 అడుగుల దూరం అనుకూలంగా ఉంటుంది.
ఈ రెండింటిలో కూడా 4þ4 బాగా ఉంటుంది. ఎందుకంటే మల్బరి మొక్క ఒకసారి నాటుకుంటే 20 సంవత్సరాలకు పైబడి దిగుబడిని ఇస్తుంది కాబట్టి అందుకు అనుకూలంగా నాటుకోవలసి ఉంటుంది. నాటిన తరువాత క్రమం తప్పకుండా ప్రూనింగ్ చేయవలసి ఉంటుంది. మొక్క పెరిగే క్రమంలో 8 అంగుళాలు పెరిగిన తరువాత మొక్కను ప్రూనింగ్ చేసినట్లయితే రెండు లేదా మూడు కొమ్మలు పక్కన రావడము జరుగుతుంది. పక్కకొమ్మలను మూడు అంగుళాలు పెరిగిన తరువాత మరలా ప్రూనింగ్ చేయాలి. మరలా పక్కకొమ్మలను మూడు అంగుళాలు పెరిగిన తరువాత మరలా ప్రూనింగ్ చేయాలి. వచ్చిన కొమ్మలను మరలా ప్రూనింగ్ చేయాలి. ఈ విధంగా ప్రూనింగ్ చేసుకుంటూపోతే మూడు నుంచి నాలుగు నెలల్లో 25 నుంచి 30 కొమ్మలుపైగా వచ్చి కోతకు సిద్ధం అవుతుంది. మొక్క వయస్సు పెరిగేకొలది మొక్క యొక్క వేరు వ్యవస్థ కూడా భూమిలో బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి భూమిలోని పోషకాలను సక్రమంగా వినియోగించుకొని మొక్క ఎదుగుదల ఆశాజనకంగా ఉంటుంది. ఒక ఎకరం విస్తీర్ణంలో సాగు చేసిన మల్బరి తోటలో లభించే మల్బరి ఆకుతో 200 నుంచి 250 ఈఓఉ (డిసీజ్ ఫ్రీ లార్వా) (ంశ్రీజూ ఈఓఉ= 500 లార్వాలు)లను పెంచవచ్చు. మల్బరి ఆకును సున్నితమైన పట్టుపురుగులకు ఆహారంగా ఇస్తాము కాబట్టి మల్బరి సాగుకు ఎలాంటి విష రసాయనాలు ఉపయోగించకూడదు. నికోటిన్ కలిగిన పుగాకు పదార్థాలను కూడా ఉపయోగించకూడదు. సేంద్రియ సాగులో వినియోగించే జీవ సంబంధిత కీటకనాశనులు, ఉదాహరణకు బవేరియా బాసియానా లాంటివి కూడా ఉపయోగించకూడదు కాబట్టి తాను వేపగింజల కషాయం, జీవామృతం, వేస్ట్డికంపోజరులను మాత్రమే మల్బరి సాగుకు ఉపయోగిస్తున్నాని, ఈ పద్ధతిలో మొత్తం 4 ఎకరాలలో మల్బరి సాగును పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నానని పుండరీకర వివరించాడు.
పట్టు పురుగుల పెంపకం: పట్టు పురుగుల పెంపకానికి షెడ్ తప్పనిసరి కాబట్టి తాను 100 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పులతో 2500 చదరపు అడుగుల షెడ్ను ఏర్పాటు చేసుకున్నాడు. ముందుచూపుతో పెద్ద షెడ్ను ఏర్పాటు చేసుకున్నాను కాని ప్రభుత్వ సబ్సిడీ పొందాలంటే 50 అడుగుల పొడవు 20 అడుగుల వెడల్పు అంటే 1000 చదరపు అడుగుల షెడ్ సరిపోతుంది. రెండున్నర ఎకరాలను ఒక యూనిట్గా సమకూర్చి ప్రభుత్వం వారు సబ్సిడీని అందచేస్తున్నారు. 1000 అడుగుల షెడ్ మరియు ఇతర సామాగ్రితో పాటు మల్బరి మొక్కలు, మొక్కలు నాటడానికి అయ్యే ఖర్చులు అన్నీ కలిపి ఒక యూనిట్ ధర 7,20,000/-గా నిర్ణయించి అందులో 50% అంటే రు. 3,60,000/- సబ్సిడీని అందిస్తున్నారు.
ప్రస్తుతం తన షెడ్లో 200 ఈఓఉ లు ఉన్నాయి. పట్టుపురుగుల పెంపకంలో 5 థలు ఉంటాయి. ప్రభుత్వ పరిశోధన సంస్థ వారు జనిటికల్లి మోడిఫైడ్ ఈఓఉ లను ఉత్పత్తి చేస్తున్నారు. కోళ్ళ పరిశ్రమలో ఉన్నట్టే ఇందులో కూడా హచరీస్ ఉంటాయి. గుడ్డు థ నుండి మొదటి రెండు థలు చాకీ సెంటర్ వాళ్లు నిర్వహిస్తుంటారు. చాకీ సెంటర్ వాళ్ళు 6 నుంచి 8 రోజులు పురుగు లార్వాలను పోషించి రైతులకు అందిస్తుంటారు. రైతుల దగ్గర పట్టు పురుగులు ఉండేది కేవలం 22 రోజులు మాత్రమే. రైతు దగ్గరకు వచ్చిన తరువాత మొదట 14 రోజులు అంటే 3వ థ 14 రోజులు మల్బరి ఆకులను పట్టుపురుగులకు ఆహారంగా ఇవ్వవలసి ఉంటుంది. 14వ రోజు నుంచి 16 రోజుల మధ్య పట్టు పురుగులు స్పిన్నింగ్కి వస్తాయి. స్పిన్నింగ్ 4 రోజులు ప్రక్రియ ఉంటుంది. స్పిన్నింగ్ పూర్తి అవగానే కకూన్ తయారవుతుంది. కకూన్ తయారయిన వెంటనే మార్కెట్ చేయవలసి ఉంటుంది. దేశం మొత్తం కకూన్ కొనుగోలు చేసే మార్కెట్లు ఉన్నాయి కాబట్టి రైతుకు అనుకూలమైన స్థలంలో కకూన్లను అమ్ముకోవచ్చు. మార్కెట్లో అమ్మిన ధరకు సంబంధం లేకుండా కిలోకు 75/- తెలంగాణ ప్రభుత్వం, కిలోకు 50/-లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనంగా అందచేస్తుంది. ఏ మార్కెట్లో అమ్మినా కాని ఆ మార్కెట్లో అమ్మిన రసీదును చూపించి అదనపు ధరను పొందవచ్చు. ప్రస్తుతం ఉన్న పంట 200 ఈఓఉ కి సంబంధించింది. కకూన్స్ని ఇటీవలే అమ్మకం చేశాను. 200 ఈఓఉ లకు గాను 120 కిలోలు మంచివి, 20 కిలోల జాలీవి కలిపి మొత్తం 140 కిలోల దిగుబడి పొందడం జరిగింది. మంచి కకూన్స్ని కిలో 495/-లు, జాలీ కకూన్స్కి కిలో 150/- ధర లభించింది. అదనంగా మొత్తం 140 కిలోలకు తెలంగాణ ప్రభుత్వం కిలోకు 75/- ల చొప్పున ఇవ్వడం జరిగిందని పుండరీకం వివరించాడు. పట్టు పురుగులు చాలా సున్నితమయినవి కాబట్టి షెడ్లో ఉష్ణోగ్రతలు మరియు తేమశాతాలను నియంత్రించవలసి ఉంటుంది. మొదటిలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కాని రెండు మూడు పంటలు తీసిన తరువాత అనుభవం పెరుగుతుంది కాబట్టి ఇబ్బందులు తగ్గుతాయి. కాబట్టి రైతులు నిరభ్యంతరంగా పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టవచ్చు అని పుండరీకం వివరించాడు. మరిన్ని వివరాలు 94907 54201 కి ఫోను చేసి తెలుసుకోవచ్చు.
కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి
ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి. మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయరంగం, అదీను సేంద్రియ వ్యవసాయరంగంలో కుటుంబ సభ్యుల సహకారం ఎక్కువగా అవసరం పడుతుంది. ప్రస్తుత సమాజాన్ని గమనించినట్లయితే వ్యవసాయరంగంలోకి అడుగుపెట్టడానికి మహిళలు వెనుకంజ వేస్తున్నారు. కుటుంబంలోని మగవారికి వ్యవసాయరంగం అంటే మక్కువ ఉన్నా కాని ఆ కుటుంబంలోని మహిళలు వ్యతిరేకంగా ఉండటం వలన చాలామంది మగవారు వ్యవసాయరంగంలోకి అడుగుపెట్టడానికి వెనుకంజ వేస్తున్నారు. కొంతమంది మగవారు తమ కుటుంబంలో మహిళల ఇష్టాన్ని పెడచెవిని పెట్టి తాము వ్యవసాయ రంగంలో దిగి కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నా కూడా తమ పంటల సాగుని కొనసాగిస్తున్నారు. పుండరీకరకి ఇలాంటి బాధలు ఏమీ లేవు. పుండరీకం ఉద్యోగం వదలి వ్యవసాయరంగంలో అడుగు పెట్టాలన్న నిర్ణయాన్ని తన అర్థాంగి జ్యోతి ఆనందంగా అంగీకరించింది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుండరీకం పట్టుపురుగుల పెంపకంలో అడుగుపెట్టగలిగాడు. ఈ రంగంలో అడుగు పెట్టిన తరువాత వీరి అనుభవంలో తెలిసిన విషయం ఏమిటంటే పట్టుపురుగుల పెంపకంలో విజయం సాధించాలంటే కుటుంబసభ్యులు అందరు కలసి ప్రత్యక్షంగా పనిచేయవలసి ఉంటుందని గ్రహించారు. అందుకు అనుకుగుణంగా ప్రతిరోజు జ్యోతి పొలానికి వచ్చి పట్టు పురుగులకు మల్బరీ ఆకులను ఆహారంగా అందించడము, కూలీల చేత పని చేయించడం లాంటి విషయాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి తాను ఇంతకాలం ఈ రంగంలో కొనసాగగలిగాను. లేకుంటే ఈ రంగంలో కొనసాగటం కష్టంగానే ఉండేది. తన ఈ విజయంలో తన అర్థాంగి జ్యోతి పాత్ర చాలా ఉంది, తాను సహకారం అందించడము వలననే పట్టుపురుగుల పెంపకంలో కొనసాగ గలుగుతున్నానని వివరిస్తూ, సహకారం అందిస్తున్న కుటుంబ సభ్యులకు, ప్రత్యేకించి తన అర్థాంగి జ్యోతికి పుండరీకం కృతజ్ఞతలు తెలియజేశారు.
పట్టుదల తప్పనిసరి
ఏరంగంలోనైనా విజయం సాధించాలంటే పట్టుదల తప్పనిసరి అనే విషయం అందరికి తెలిసిందే. కాని మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయరంగంలో పట్టుదల పరిమాణం చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయరంగం ఎక్కువగా వాతావరణం మీద ఆధారపడుతుంది. వ్యవసాయరంగం విజయంలో మన పాత్ర కంటే ప్రకృతి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం వ్యక్తిగతంగా ఎంత ప్రయత్నించినా కాని ప్రకృతి అనుకూలించనట్లయితే ఫలితాలు ప్రతికూలంగా వస్తాయి. కాబట్టే వ్యవసాయరంగంలో పట్టుదల పరిమాణం చాలా ఎక్కువ అవసరముంటుంది. పట్టుపురుగుల పెంపకం గురించి ఆలోచిస్తే మల్బరి మొక్కల పెంపకం, పట్టుపురుగుల పెంపకం రెండూ కూడా ప్రకృతి మీద ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుంది. మనం ఎంత ప్రయత్నించినా కూడా ప్రకృతి అనుకూలించనట్లయితే రైతులు నష్టపోవలసి వస్తుంది. పట్టుపురుగులు చాలా సున్నితమయినవి. అతిజాగ్రత్తలు తీసుకుని వీటిని పెంచవలసి ఉంటుంది. సరైన అవగాహన లేకుండా పట్టు పురుగుల పెంపకం చేపట్టినట్లయితే ఫలితాలు ప్రతికూలంగా ఉండేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టే చాలామంది పట్టుపురుగుల పెంపకాన్ని చేపట్టి కొనసాగించలేక వెనుదిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సందర్భంలో పుండరీకర అన్నీ ఆలోచించి పట్టుపురుగుల పెంపకం రంగంలోకి అడుగుపెట్టాడు. ముందుగానే అన్ని రకాలుగా పరిశీలించి, పరిశోధించి, అనేకమంది పట్టు పురుగుల పెంపకం చేసే రైతులను కలసి, అనేకమంది శాస్త్రవేత్తలు, అధికారులను కలసి వారి అభిప్రాయాలను సేకరించి ఈ రంగంలో అడుగుపెట్టి ఎదురయ్యే అనేక ఒడిదుడుకులను అధిగమిస్తూ గత 8 సంవత్సరాల నుంచి పట్టుపురుగుల పెంపకాన్ని పట్టుదలతో కొనసాగిస్తున్నాడు.
1. గాయాలు ఉండి, రక్తము కారుతుంటే, ఆర్నికా 200 రోజుకు 10 మాత్రలు రక్తం ఆగే దాకా తినిపించాలి.
2. బొరాక్స్ 30 లేదా మెర్క్ సాల్ 30 ఒకదాని తర్వాత మరొకటిగా, ఉదయం 10 మాత్రలు, సాయంత్రం 10 మాత్రలు తినిపించాలి.
3. క్రియోసోటమ్ 30 లేదా చెమోమిల్ల రోజుకు 5 మాత్రలు తినిపించాలి.
4. కాల్కేరియా కార్బ్ 1M మందు 5 చుక్కలు ఒకే పర్యాయం, కొద్దిపాటి దాణాలో పెట్టి తినిపించాలి.
అల్లోపతి:
1. పటిక నీళ్ళతో నోరు కడిగి, 10% బోరోగ్లిసరిన్ను రోజుకు రెండు సార్లు నోటిలో పూయాలి.
2. నొప్పి ఉంటే ఆక్సికామ్ వెట్ (OXYCAM VET) వంటి ఇంజక్షన్లు చేరుంచాలి.
3. బీకామ్ఎల్ (BEELCOM-L) వంటి ఇంజక్షన్లు చేరుంచాలి.
4. డైరోలిన్-ఎల్ బోలస్ (DIROLIN – L BLUS) వంటి మందును తినిపించాలి.
5. మినరల్ మిక్చర్ తినిపించాలి.
6. పశువైద్యనిపుణులచే, పెరుగుదలలో హెచ్చుతగ్గులున్న దంతాల పైభాగాన్ని, ఆకురారు వంటి ఒక సాధనం టూత్రాస్ప్తో అరగదీరుంచాలి.
7. కదిలిన పళ్ళను అవసరం మేరకు పశువైద్య నిపుణుని సలహా మేరకు పీకించాలి.
గమనిక: మీ దగ్గరలోని పశువైద్యుని సంప్రదించిన తరువాతనే పై అల్లోపతి వైద్య విధానాలను అనుసరించగలరని మనవి. డాక్టర్ ములగలేటి శివరామ్, ఔ.ఙ.ఐబీ., కూరాడ గ్రామం,
రైతులు వ్యవసాయంతో పాటు కోళ్ల పెంపకం, చేపల పెంపకంతోపాటు కౌజు పిట్టల పెంపకం కూడా చేస్తున్నారు. ఇవి చూడటానికి పిచ్చుకల మాదిరిగా ఉంటూ కాస్త పెద్దగా ఉంటాయి. ఇవి రుచిగా ఉంటాయి. అలాగే ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి. అందుకే వీటిని తినడానికి మాంసపు ప్రియులు ఇష్టపడతారు. దాంతో మార్కెట్లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. రైతులు వీటిని పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
షెడ్డులో పెంచుకోవడానికి జపనీస్ క్వయిల్ అనువైన రకం. ఈ జపనీస్ క్వయిల్ను మాంసం, గ్రుడ్లు ఉత్పాదన కోసం పెంచుకోవచ్చు. మిగతా కోళ్ల రకాలతో పోలిస్తే కౌజు పిట్టలకు వ్యాధి నిరోధకత చాలా ఎక్కువ. ఎటువంటి టీకాలు అవసరం లేదు. ఇకపోతే ఈ పిట్టలను ఐదు వారాలకే మాంసం కోసం అమ్ముకోవచ్చు. లేదంటే ఆరోవారం నుంచి గ్రుడ్లు పెడతాయి.
ఐదు వారాల వయస్సులో ఇవి 100-200 గ్రా. వరకు బరువు తూగుతాయి. వీటి మాంసంలో మాంసకృత్తులు మిగతా కోళ్ల మాంసం కంటే అధిక మోతాదులో లభిస్తాయి. దేశంలోని మొత్తం కోళ్ల సంఖ్యలో 1.8 శాతం కౌజు పిట్టలున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, పెరిగిన తలసరి ఆదాయం, కలిగిన అవగాహన వల్ల నేడు రైతులు ప్రత్యామ్నాయ కోళ్ల పట్ల మక్కువ చూపిస్తున్నారు. ఇవి బూడిద రంగులో ఉంటాయి. బయట మార్కెట్లో పిల్లలు లభ్యం అవుతాయి. పిల్లలు 7-9 గ్రాముల బరువు ఉండి సున్నితంగా ఉంటాయి. వీటికి మొదటి వారంలో 95-99 ఫారెన్హీట్ డిగ్రీల వరకు వేడిని అందించాలి.
మొదటి వారంలో తీసుకునే జాగ్రత్తలు దాదాపు కోడి పిల్లల బ్రూడింగ్ మాదిరిగానే చేసుకోవాలి. కాకపోతే కౌజు పిట్టలు చిన్నపాటి శరీరం వలన వాటికి మామూలు ఇతర కోడి పిల్లల కంటే అధిక ఉష్ణోగ్రతను అందించాలి.
ఒక బ్రూడర్ 100-150 అంగుళాలు వెడల్పుగా ఉండే దానిలో 250-300 వరకు పిల్లలను ఉంచవచ్చు. మొదటివారం తర్వాత నుంచి ఉష్ణోగ్రతను ఐదు ఫారన్హీట్ డిగ్రీల చొప్పున తగ్గిస్తూ అది 70-75 ఫారన్హీట్ డిగ్రీలు వచ్చేవరకు బ్రూడింగ్ చేయాలి. దాదాపు మూడు వారాల వయస్సు వచ్చేసరికి ఈకలు బాగా పెరిగిన తరువాత ఆడ కౌజులను వేరు చేయవచ్చు.
సాధారణంగా మగవాటి కన్నా కూడా ఆడ కౌజులు ఎక్కువ బరువు పెరుగుతాయి. ఐదు వారాలు జాగ్రత్తగా పెంచితే మంచి లాభాలను పొందవచ్చు. గ్రుడ్ల కోసం అయితే ఆరోవారం నుంచి పధ్నాలుగు వారాల వరకు ఇవి గ్రుడ్లు పెడతాయి. ఏడాదికి దాదాపు 250 నుండి 270 గ్రుడ్లను ఉత్పత్తి చేస్తాయి. గ్రుడ్లు 10 నుండి 12 గ్రాముల బరువు ఉండి, పెంకు కొంచెం నల్లని మచ్చలతో ఉంటుంది.
పోషణ పరంగా కోడిగ్రుడ్డు కంటే రెండు శాతం అధిక మాంసకృత్తులు ఇందులో లభ్యమవుతాయి. కౌజు పిట్టలకు, మిగతా కోళ్ల కంటే కొంచెం అధిక మోతాదులో మాంసకృత్తులు అవసరం.
బయట మార్కెట్లో ప్రత్యేకంగా కౌజు పిట్టల దాణా లభిస్తే దొరికిన దాణాకి కొద్ది మోతాదులో అవసరం మేరకు సోయా చెక్కని కలిపి వాడుకోవాలి. దాణా విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అవి మంచి సైజు పెరుగుతాయి. కాస్త జాగ్రత్త పడాలి అప్పుడే కౌజు పిట్టల పెంపకంలో ఆదాయాన్ని పొందవచ్చు. 4 నుండి 5 వారాల్లో ఒక్కో పిట్ట 500 గ్రాముల వరకు దాణా తీసుకుంటుంది.
దాణా కోసం 15 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఒక్కో కౌజు పిట్టను 5 వారాల పాటు పెంచేందుకు 26 రూపాయల ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం హోల్సేల్ వ్యాపారులకు ఒక్కో కౌజు పిట్టను 50 రూపాయలకు విక్రయించవచ్చు. వీటి గ్రుడ్లను అమ్మటం ద్వారా ఆదాయం పొందవచ్చు.
కౌజు పిట్టల పెంపకం చేపట్టాలనుకునేవారు వారానికి ఒక బ్యాచ్ వచ్చేలా షెడ్లును నిర్మించుకుని వాటిని విభాగాలు చేసుకోవాలి. నాలుగు బ్యాచ్లుగా చేసుకొని ఒక్కో బ్యాచ్లో 500 పకక్షులు పెంచుకుంటే నెలకు ఖర్చులు పోను 2000 పకక్షులపై 48 వేల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. ఇక గ్రుడ్లు ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కలుపుకుంటే ఆ మొత్తం ఇంకా ఎక్కువగానే ఉంటుంది.
కౌజు పిట్టల పెంపకంలో ముందుగా మార్కెట్పై స్టడీ చేయటం అవసరం. గ్రుడ్లు, మాంసానికి ఎక్కడ ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకోవాలి. పెంపకం కోసం పదే పదే పకక్షులను కొనుగోలు చేయకుండా ఒక బ్యాచ్ని కొనగానే వాటి నుండి వచ్చే గ్రుడ్లను పొదిగించి బ్రీడర్స్ను తయారు చేసుకోవటం వల్ల పకక్షుల కోసం తిరిగి ఎవరి వద్దకో వెళ్లాల్సిన పని ఉండదు.
తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ లాభాలు సంపాదించాలనుకునే వారికి కౌజు పిట్టల బిజినెస్ బాగా ఉపయోగపడుతుంది. చికెన్లో కన్నా ఎక్కువ ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఇందులో లభిస్తుండటంతో ఇటీవల కాలంలో ఈ కౌజు పిట్ట మాంసానికి బాగా గిరాకీ పెరిగింది.
హోటళ్లు, రెస్టారెంట్లలో స్పెషల్ కౌజు పిట్టల మాంసం లభిస్తుండటంతో వీటి పెంపకం దారులు ప్రస్తుతం లాభాలబాట పడుతున్నారు. కౌజు పిట్టల బ్రీడర్స్ను ప్రస్తుతం హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పశువైద్య కళాశాలలో అందిస్తున్నారు. అయితే అవి కావాలనుకునే వారు 2 నెలల ముందుగా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటి పెంపకం చేపట్టాలనుకునే వారు ముందు 200 పకక్షులతో ప్రారంభించి తరువాత పెంచుకోవటం ఉత్తమం.
ఆంధ్రప్రదేశ్లో 26కి గాను 20కి పైగా జిల్లాల్లో కరువు విపరీతంగా ఉంది. నిండిన జలాశయాలు లేనిచోట, తెలంగాణాలో కూడా వర్షాలు లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరులేక కాలువ నీటితో పంటలు పెట్టలేదు. వర్షాకాలపు పంటలు పండక రైతులు బాగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో నవంబర్ (స్వాతి కడరోజులు, విశాఖ, అనూరాధ కార్తెలు)లో వివిధ పంటలలో చేయవలసిన పనుల గురించి…
కొత్తిమీర/ధనియాలు: అధిక ధనియాలు మరియు కొత్తిమీర దిగుబడులు సాధించడానికి రెండు తెలుగు రాష్ట్రాలలో అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు విత్తుట వాతావరణ రీత్యా అనుకూలం. ఒత్తుగా ఉన్న మొక్కలను పీకి కొత్తిమీరగా అమ్మవచ్చు. బిపి, షుగరు, మూత్ర పిండాల రోగాలు, కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గడానికి మంచిదని కొత్తిమీర వినియోగం అన్ని కాలాలలోనూ పెరుగుతున్నది. ధరలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. మంచి విత్తనదిగుబడికి అనుకూలమైన రకాలు: హిస్సార్ సురభి, గుజరాత్ ధనియా, సింపోస్-33, ధనియాల ధరలు మార్కెట్లో ఆశాజనకంగా ఉన్నాయి.
జొన్న: ఇప్పుడు జొన్న తినే వాళ్లు పెరుగుతున్నారు. సరిపడినంత పంట మార్కెట్లో లేక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉదాహరణకు హైదరాబాదు రీటైల్ మార్కెట్లలో మంచి క్వాలిటీ జొన్న పిండి ధర కిలోకు రూ. 90. పూర్వం జొన్న రకాలు తక్కువ దిగుబడినిచ్చేవి (10-12 క్వి/ఎ.). ఇప్పుడు 20-25 క్వి/ఎ. అంతకంటే ఎక్కువ దిగుబడి నిచ్చే రకాలు అందుబాటులోకొచ్చాయి. ఉదా: పర్భనిశక్తి (ఐ.సి.ఎస్.ఆర్-14001): గింజ దిగుబడి నీటి ఆధారంగా 28-32 క్వి/ఎ. వర్షాధారంగా 16-20 క్వి/ఎ. రెండు తెలుగు రాష్ట్రాలలోను, మహారాష్ట్రలోనూ పండించవచ్చు. ఐరన్, జింకు, ప్రోటీన్లు ఎక్కువ. తెల్లగింజ రకం. చలికాలం/యాసంగిలో (నవంబర్లో కూడా) విత్తవచ్చు. నీటి సౌకర్యముండాలి. ఐ.సి.ఎస్.హెచ్-14002: హైబ్రిడ్. తెల్లగింజ. చలికాలం/యాసంగిలో విత్తవచ్చు. నీటి ఆధారంగా గింజ దిగుబడి 28-32 క్వి/ఎ. వర్షాధారంగా 16-20 క్వి/ఎ. నీటి ఆధారంతో ఈ నెలలో విత్తవచ్చు. ఐరన్, జింక్ ఎక్కువ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మహారాష్ట్రలోనూ విత్తుటకుపయోగం. చొప్ప దిగుబడి కూడా ఎక్కువ. ఎన్.టి.జె-5: గింజ దిగుబడి నల్ల నేలల్లో 20-25 క్వి/ఎ. తేలిక నేలల్లో 14-16 క్వి/ఎ. జొన్న మద్ధతు ధర: హైబ్రిడ్: రూ. 3180/క్వి. మల్దండి: రూ. 3225/క్వి. జొన్నను నీటి సౌకర్యంతో ఈనెలలో విత్తవచ్చు.
మొక్కజొన్న: అత్యధిక దిగుబడులు సాధించాలంటే విత్తడానికి అనుకూలమైన సమయం అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు. ఈ సమయంలో విత్తడానికి సిఫారస్ చేయబడిన ప్రైవేటు హైబ్రిడ్లు: 100-120 రోజులవి: 900 ఎం. గోల్డ్, ఎన్.కె-6240. 90-100 రోజులవి: కోహినూర్, ప్రభల్. 90 రోజులలోపువి: పయనీర్-3342, ఎం.ఎం.హెచ్-133. తీపిమొక్కజొన్న కాంపోజిట్లు (రైతు పండించిన విత్తనాలను తిరిగి విత్తుకోవచ్చు): ప్రియ, మాధురి, విన్ఆరంజ్, అల్మోరా. తీపిమొక్కజొన్న హైబ్రిడ్లు (రైతు పండించిన విత్తనాలు తిరిగి విత్తితే దిగుబడి బాగా పడిపోతుంది): షుగర్-75, బ్రైట్ జీన్. తీపిమొక్కజొన్న గింజలలో చక్కెర 20-24 శాతం ఉంటుంది. బేబీకార్న్కు అనువైన కాంపోజిట్లు: మాధురి తీపి మొక్కజొన్న, హిమ్-129, హిమ్-123, వి.ఎల్-42. బేబికార్న్కు అనువైన హైబ్రిడ్లు: హిమ్-128, ప్రకాశ్, హెచ్.ఎం-4. పేలాల రకాలు: అంబర్ పాప్కార్న్, పెర్ల్ పాప్కార్న్, వి.ఎల్. అల్మోరా పాప్కార్న్. క్వాలిటీ ప్రోటీన్ రకాలు: ఇందులో రెట్టింపు లైసిన్ మరియు ట్రిప్టోఫిన్ అనే అమైనోఆమ్లాలుంటాయి. అంబర్శక్తి, హెచ్.క్యు.పి.ఎం-7, వివేక్ క్యు.పి.ఎం-9. పశుగ్రాస రకాలు: ఎ.పి.ఎఫ్.ఎం-8, గంగ-5, విజయ కాంపోజిట్. వరిమాగాణుల్లో మొక్కజొన్న: దుక్కి దున్నే ఖర్చు మిగులుతుంది. నెలరోజుల పంటకాలం కలిసొస్తుంది. బరువైన తేమను నిలుపుకొనే నేలల్లోనే ఈ పద్ధతి పాటించాలి. కోస్తా జిల్లాల్లో నవంబరు నుండి జనవరి మొదటి వారం వరకు, రాయలసీమ, తెలంగాణలలో నవంబరు నుండి డిశంబరు వరకు విత్తవచ్చు. ఆ తర్వాత విత్తితే దిగుబడులు బాగా తగ్గుతాయి. మొక్కజొన్న మద్ధతు ధర: రూ. 2090/క్వి.
శనగ: ఈ పంట మద్ధతు ధర రూ. 5335/క్వి. మద్ధతు ధర కంటే, మార్కెట్ ధర అధికంగా ఉంది. ఈ పంట అధిక దిగుబడికి ఆంధ్రప్రదేశ్లో అక్టోబరు 15 నుండి నవంబరు 15 లోగా విత్తాలి. తెలంగాణాలో అక్టోబరు మొదటి నుండి నవంబరు 15 లోగా విత్తాలి. అత్యధిక దిగుబడులనిచ్చే ఎండుతెగులును తట్టుకునే రకాలు: నంద్యాలగ్రామ్-857 (ఎన్.బిఇ.జి-857): దేశవాళీరకం. దిగుబడి 1-2 నీటి తడులతో 12-14 క్వి/ఎ. వర్షాధారంగా 7-9 క్వి/ఎ. 90-105 రోజుల పంట. తమిళనాడు, కర్ణాటకల్లో కూడా సాగు చేయడానికి అనుకూలం. నంద్యాల గ్రామ్-452 (ఎన్.బిఇ.జి.-452): దేశవాళి రకం. దిగుబడి 1-2 నీటి తడులతో 10-12 క్వి/ఎ. వర్షాధారంగా 7-9 క్వి/ఎ. ధీర (ఎన్.బిఇ.జి-47): దేశవాళీ రకం. 90-105 రోజులు. దిగుబడి 1-2 నీటి తడులతో 10-12 క్వి/ఎ. వర్షాధారంగా 7-9 క్వి/ఎ. యంత్రంతో కోయడానికి అనుకూలం. నంద్యాల గ్రామ్-119 (ఎన్.బిఇ.జి-119): కాబూలీ రకం. లావు గింజ. 90-100 రోజులు. దిగుబడి 1-2 నీటి తడులతో 10 క్వి/ఎ. వర్షాధారంగా 6-8 క్వి/ఎ.
పెసర: వరి తర్వాత వేసే పెసర పంటను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో విత్తవచ్చు. అనుకూలమైన రకాలు: టి.ఎం-96-2: గింజ లావుగా మెరుస్తూ ఉంటుంది. అధిక తేమను బూడిద తెగులును తట్టుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు అనుకూలం. డబ్లు.జి.జి.-37(ఏకశిల): తెలంగాణకు అనుకూలం. గింజలు పచ్చగా మెరుస్తుంటాయి. ఎల్లోమొజాయిక్ తెగులును తట్టుకుంటాయి. దిగుబడి 5-6 క్వి/ఎ. ఎల్.జి.జి-407: ఆంధ్రప్రదేశ్కు అనుకూలం. మెరుపుగింజ. మధ్యస్థలావుగింజ. పల్లాకు, నల్లమచ్చ తెగుళ్ళను తట్టుకుంటుంది. బెట్టను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. దిగుబడి: 5- క్వి/ఎ. పెసర మద్దతు ధర: రూ. 8558/క్వి.
మినుము: వరి తర్వాత పంట పెట్టడానికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ నెలలో మినుము విత్తవచ్చు. అనుకూలమైన పల్లాకు తెగులును తట్టుకునే మధ్యస్థ లావు గింజ గల పాలిష్ రకాలు: టి.బి.జి-104: దిగుబడి: 8-9 క్వి/ఎ. 70-75 రోజులు. జి.బి.జి-1: దిగుబడి: 8-9 క్వి/ఎ. 70-75 రోజులు. మినుము మద్ధతు ధర రూ. 6950/క్వి. మార్కెట్ ధర మద్ధతు ధర కంటే ఎక్కువగా ఉంది.
వరి: సన్నబియ్యానికి భారతదేశంలోను, ప్రపంచమంతా మస్తు గిరాకీ ఉంది. ఎంత పండించినా మంచి రేటుకు అమ్ముకునేందుకు అవకాశమున్నా ఉపయోగించుకోవడం లేదు. ఉదాహరణకు అమెరికాలో సన్నబియ్యం రెండు రెట్లు ఎక్కువ ధర పెట్టినా సూపర్ మార్కెట్లలో సరిగా దొరకడం లేదు. కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు బియ్యాన్ని పంచుదామంటే వారికి బియ్యం లభ్యం కాలేదు. తెలంగాణలో బియ్యం నిల్వలు మూలుగుతున్నాయి. దీనికదనంగా ఖరీఫ్ పంట చేతికొస్తున్నది. దాన్ని ప్రొక్యూర్ చేసి నిల్వ చేయడానికి స్థలం దొరకడం కష్టయ్యే పరిస్థితులు. ఈ విరుద్ధ పరిస్థితులన్నీ సులభంగా అధిగమించవచ్చు. రైతులు ఇంకొంత ఎక్కువ ఆదాయం పొందడానికి, ప్రపంచ మరియు భారతదేశ ప్రజలకు మంచి బియ్యం సులభంగా అనుకూలమైన ధరల్లో లభించేందుకు, రాజకీయ నాయకుల ఆలోచనా విధానంలో మార్పులు రావాలి. సన్నబియ్యాన్ని పండించడాన్ని బాగా ప్రోత్సహించాలి. ఎక్కడికయినా పంపించుకునే హక్కు రైతులకు, ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి. మన దేశ స్ట్రాటజిక్ అవసరాలకు మించి ఉన్న సరుకునంతా ఎగుమతి చేసుకోవడానికి ఫ్రీగా పర్మిషన్ ఉండాలి. రైతులు, వినియోగదారులు దీనివలన లాభపడతారు. వీలయినంతవరకు కంట్రోల్స్ తీసివేయడం మంచిదని నా అభిప్రాయం. విదేశీ మారక ద్రవ్యం కూడా ఎక్కువగా సంపాదించవచ్చు. ఖరీఫ్ పంట కోతలు నవంబరులో ఎక్కువగా ఉంటాయి. వరి తయారైన వెంటనే కోసి, తుపాన్ల వలన కలిగే నష్టాల నుండి కాపాడాలి. వరి మద్ధతు ధర సాధారణ రకాలకు రూ 2185/క్వి. ఏ గ్రేడ్ రకాలకు రూ. 2203/క్వి. వర్షాభావ పరిస్థితుల వలన రిజర్వాయర్లలో నీరులేనిచోట, రబీలో వరి పంట వేయలేకపోతే ఆరుతడి పంటలు కూరగాయలు, పూలు, పశుగ్రాసాలు పండించాలి. చలికాలం/యాసంగిలో, అత్యధిక దిగుబడికి డిశంబరు రెండవ పక్షం నుండి, జనవరి మొదటి వారంలోపు వరినారు పోయడం అనుకూలం. చలికాలపు పంట కడథలో నీటి లభ్యత కష్టమయ్యే పరిస్థితులుంటేగాని, రబీ పంట తర్వాత అపరాలు, కూరగాయలు పండించాలంటే గాని నవంబరులో నారు పోయవచ్చు. ఈ నారు చలి తీవ్రత వలన మెల్లగా ఎదుగుతుంది. పంటకాలం 10-12 రోజులు ఎక్కువవుతుంది. దిగుబడి కూడా సుమారు 15 శాతం వరకు తగ్గుతుంది. మీ ప్రాంతంలో పండించగల్గిన మంచి ధర వచ్చే సన్నగింజ రకాలను సాగు చేసి మంచి ధరల కోసం ప్రభుత్వాలపై ఆధారపడడం తగ్గించుకోండి.
గోధుమ: రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నవంబరు 15 లోగా విత్తవచ్చు. అనుకూలమైన రకాలు: రవ్వకు: ఎం.ఏ.సి.ఎస్-2846. 120-130 రోజులు. దిగుబడి: 12 క్వి/ఎ. చపాతీకి: ఎం.ఏ.సి.ఎస్-2496. 110-125 రోజులు. దిగుబడి: 15 క్వి/ఎ. బ్రెడ్ తయారీకి: డి.డబ్ల్యు.ఆర్-162. 126-134 రోజులు. దిగుబడి: 15 క్వి./ఎ.
రాగి: ఆంధ్రప్రదేశ్లో రబీ పంటగా నవంబరు-డిశంబరు నెలల్లో విత్తవచ్చు. నారు పెంచి కూడా నాటవచ్చు. రాగి మద్ధతు ధర: రూ. 3846/క్వి. అన్ని కాలాలలోను (ఖరీఫ్, రబీ, వేసవి) పండించడానికి అనుకూలంగా ఉండి, అగ్గితెగులును తట్టుకుని, అధిక దిగుబడినిచ్చే రకాలు: ఇంద్రావతి: 14-15 క్వి/ఎ. పాముపొడ తెగులును కూడా తట్టుకుంటుంది. కాల్షియం, ఐరన్, జింక్ ఎక్కువ. 115-120 రోజుల పంట. సువర్ణముఖి: 14-15 క్వి/ఎ. 105-110 రోజులు. పంట చివరి థలో వచ్చు బెట్టను తట్టుకుంటుంది. వరి మాగాణుల్లోనూ సాగుకు అనుకూలం. తిరుమల: 14-15 క్వి/ఎ. 115-120 రోజులు. గింజ నాణ్యత ఎక్కువ. చొప్ప దిగుబడి కూడా ఎక్కువ.
ప్రత్తి: నవంబరులో మార్కెట్కు ఎక్కువగా వస్తుంది. ప్రత్తి మద్దతు ధర మీడియమ్ స్టేపుల్ రూ. 6620/క్వి. లాంగ్ స్టేపుల్ రూ. 7020/క్వి. పంట ఖర్చులు పెరుగుతున్నందున ఈ ధరతో రైతులు సంతృప్తి చెందడం లేదు. మార్కెట్ ధరలు కూడా 7000-8000 మధ్యనే ఉన్నాయి. ఇప్పటికే రైతులు ప్రత్తి పండించడం తగ్గించారు. ధరలు బాగుంటేనే వచ్చే సీజన్లో ప్రత్తిని ఎక్కువగా సాగు చేస్తారు. లేకుంటే విస్తీర్ణాన్ని తగ్గించే అవకాశముంది. దిగుబడి తగ్గవచ్చు. దిగుమతి చేసుకున్న ప్రత్తి ట్రాన్స్పోర్టు ఖర్చులు కలుపుకుంటే, మన రైతులకిచ్చే దానికంటే ధర బాగా ఎక్కువవుతుంది. అందువలన మద్ధతు ధర పెంచి మన రైతులకు మేలు చేసి దేశ అవసరాలకు కావలసినంత ప్రత్తి ఇక్కడే పండించుకునేటట్లు చేయాలి. పంట ఎక్కువగా పండితే ఎగుమతి చేయాలి.
కంది: నవంబర్ నెలలో ఈ పంటపై ముఖ్యంగా మారుకా మచ్చల పురుగు, కాయతొలుచు పురుగు, కాయఈగ ఆశించే అవకాశముంది. తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కంది మద్ధతు ధర: రూ. 7000/క్వి.
బఠాణి: ఈ పంటను నవంబరు 15 వరకు విత్తి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి దిగుబడులు పొందవచ్చు. సాధారణ రకాల కంటే దాదాపు రెట్టింపు గింజ దిగుబడినిచ్చే రకం: పంత్ అనుపమ (ఐ.పి-3), కాయకు 7 గింజలు. పచ్చికాయ దిగుబడి: 100క్వి/ఎ.
కీరదోస: కీరదోసను సాలాడ్గా వాడడం ఎక్కువయినందున చలికాలంలో కూడా ధర తగ్గడం లేదు. పాలీహౌస్లలో ఈ పంట సాగు చేసి మంచి లాభాలు పొందవచ్చు.
పూలు: కార్తీక సోమవారాలలోను, కార్తీక పౌర్ణమిరోజు నోములు, పూజలున్నందున పూలకు మంచి గిరాకీ ఉంటుంది. దీపావళికి కూడా పూల వినియోగమెక్కువ. పూజలెక్కువగా ఉండే రోజులకు 2-3 రోజుల ముందునుండే పూలను కొని ప్రిజ్లలో పెట్టుకునే అలవాటుంటుంది. దీనిని గమనించి పూలను తెంపడం, మార్కెట్కు తరలించడం పండుగకు 2-3 రోజుల నుండి పండుగ రోజులోపల పూర్తి చేయాలి. ధరలు అప్పుడే ఎక్కువగా ఉంటాయి.
పశుగ్రాస పంటలు: ఈ నెలలో విత్తదగిన పశుగ్రాస పంటలు: మొక్కజొన్న, జొన్న, జనుము, లూసర్న్, ఓట్స్్, అలసంద, పిల్లిపెసర.
గెనుసుగడ్డ/చిలగడదుంప: నవంబరులో తీగలను నాటవచ్చు.
పూలు: పాలీహౌస్లలో కార్నేషన్, గులాబీ సాగు ఈనెలలో చేపట్టవచ్చు. గులాబీ, మల్లె, జెర్బెరా, చామంతి పూల మొక్కలను ఈ నెలలో నాటవచ్చు.
మిరప: రబీ పంటగా అక్టోబరు, నవంబరు నెలల్లో నారుపోసి, 6 వారాల నారును నాటవచ్చు. మంచి రకాలు: ఎల్.సి.ఏ-625, ఎల్.సి.ఏ-620, ఎల్.సి.ఏ-436, ఎల్.సి.ఏ-424, కాశీఅభ.
విలువలు – రైతు ప్రజా సంఘాలు: ప్రజాజీవితంలో విలువలను పెంచి ప్రజల అభివృద్ధి రాజకీయాలకతీతంగా జరిపేందుకు సహాయపడగల రైతు ప్రజా సంఘాల ఏర్పాటుకు సహకరిద్దాం. నీతి, న్యాయం, ధర్మం, నిలబెట్టాలంటే అభివృద్ధిలో అందరూ కులమతాలకతీతంగా ఉత్సాహంగా పాల్గొనేందుకు రైతు ప్రజాసంఘాలను అన్ని ఆవాస ప్రాంతాల్లో ప్రోత్సహిద్దాం.
వ్యవసాయంలో మహిళల పాత్ర చాలా ముఖ్యమైనది. విత్తనం నాటడం నుండి పంట కోత వరకు అన్ని వ్యవసాయ కార్యకలాపాలలో మహిళల పాత్ర విడదీయలేనిది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కుటుంబ వ్యవసాయంలో మహిళలు లేకుండా పంట పండించడం అసాధ్యమని చెప్పవచ్చు. మన దేశంలో సుమారు 78 శాతం మహిళలు వ్యవసాయం ద్వారా ఉపాధి పొందుతున్నారు. 70 శాతం వ్యవసాయ పనులలో మహిళలు ముందుండి పని చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో సుమారు 50% మహిళలు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పండిస్తున్న వివిధ ఆహార ఉత్పత్తులలో 60% మహిళలు ఉత్పత్తి చేస్తున్నవే. అనాదిగా మహిళలు వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నప్పటికీ మహిళా సాధికారత ముఖ్యంగా ఆర్థిక సాధికారత అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ముఖ్యంగా మహిళల్లో ఆర్థిక సాధికారత, ఆరోగ్యం, పోషకాహార భద్రత, వ్యవసాయంలో బరువు పనులు, ముఖ్యంగా చాకిరి తగ్గించడం వంటి అంశాలపైనా ఈ రోజు ప్రపంచ దేశాలు ఎంతో కృషి చేస్తున్నాయి. మన దేశంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను వివిధ కార్యక్రమాలలో భాగస్వామ్యులు చేయడంతోపాటు, మహిళా సంఘాల ద్వారా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు స్థాపించడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి.
ఆహారం, సౌందర్య సాధనాలు మరియు ఔషధ పరిశ్రమలకు పసుపు అత్యంత విలువైన మరియు ముఖ్యమైన ముడిసరుకు. భారతదేశంలో సుమారు 0.29 మిలియన్ హెక్టార్లలో పసుపు సాగు చేస్తున్నారు. తద్వారా ఏటా 1.1 మిలియన్ టన్నుల పసుపు ఉత్పత్తి జరుగుతుంది. ఇది ప్రపంచంలోని మొత్తం పసుపు ఉత్పత్తిలో సుమారు 70 శాతం. తెలంగాణ రాష్ట్రంలో 0.3 మిలియన్ టన్నుల పసుపును సుమారు 49,000 హెక్టార్లల లో సాగు చేయడం ద్వారా ఉత్పత్తి చేస్తున్నాము. తెలంగాణ వాటా దేశ పసుపు ఉత్పత్తిలో సుమారు 29.5%. పూర్వపు నాలుగు జిల్లాలు కరీంనగర్ (29%), ఆదిలాబాద్ (23%), వరంగల్ (22%), నిజామాబాద్ (18%) రాష్ట్రంలోని పసుపు ఉత్పత్తిలో 92% వాటాను కలిగి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటి ప్రాజెక్టులు, 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా మరియు వ్యవసాయ మరియు ఇతర అనుబంధ రంగాల సబ్సిడీల వలన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పసుపుతో పాటు ఇతర వ్యవసాయోత్పత్తుల పెరుగుదలకు ఎంతో దోహదం చేశాయి. ఇక్కడ మనం ఒక సామెతను గుర్తు చేసుకోవాలి ”ధాన్యం ప్రాసెసింగ్, ధాన్యం ఉత్పత్తికి సమానం”. కావున పండించిన పంటలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చి, విలువ జోడించి నాణ్యమైన ఆహార పదార్థాలు మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి చేసి సరసమైన ధరలకు ప్రజలకు అందించవలసిన అవసరం ఉంది. తద్వారా క్షేత్రస్థాయిలో పంట నష్టాలను తగ్గించి, ఇటు ఉత్పత్తిదారుడుకి మరియు వినియోగదారుడికి లాభంచేకూర్చేవిధంగా మహిళల ద్వారా పసుపుకు విలువ జోడించవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల కూరలలో మరియు వివిధ రకాల ఆహార పదార్థాలలో పసుపు పొడి విరివిగా వినియోగిస్తున్నాం. మనం మార్కెట్లో చూసే చాలా రకాల ఆహార పదార్థాలలో పసుపు పొడి తో పాటు వాటి నుండి తీసిన ఓలియోరెసిన్, నూనె మరియు కర్క్యుమిన్ రంగు పదార్థాలను వివిధ రకాల మసాలాలు, ఊరగాయలు, సాస్ మరియు గ్రేవీస్, పొడి చేర్పులు, బేకింగ్ మిశ్రమాలు, టేస్ట్ మేకర్స్, మాంసాహార ఉత్పత్తులలో, బేకరీ, స్నాక్స్, చాక్లెట్, పానీయాల, సౌందర్య సాధనాలు, రోగనిరోధక ఏజెంట్, ఫార్మాస్యూటికల్స్ అప్లికేషన్స్, సబ్బులు, జీవ పురుగుమందు మరియు టూత్ పేస్ట్ తయారీలో భాగంగా పరిశ్రమల ముడిసరుకుగా ప్రపంచవ్యాప్తంగా విరివిగా వినియోగిస్తున్నారు.
నిర్మాణం: మహిళలు వారి యొక్క గ్రామాలలో అందుబాటులో ఉన్న చిన్న పాటి 150 నుండి 250 చదరపు మీటర్ల షెడ్ లేక గోడౌన్ వంటి నిర్మాణంలో గాని లేదా పాత ఇల్లు, బిల్డింగ్ వంటి నిర్మాణంలో చిన్న చిన్న మార్పులు చేసి పసుపు పొడి యంత్రాలను వాటి సామర్థ్యం ఆధారంగా ఎంపిక చేసుకుని శుభ్రమైన పరిసరాలలో పసుపు కొమ్ములను పసుపు పొడిగా మార్చి మంచి అందమైన, సౌలభ్యంగా ఉండే ప్లాస్టిక్ కవర్, డబ్బాలు లేదా సీసాలలో నింపి మార్కెటింగ్ చేసినట్లయితే మంచి లాభం ఉంటుంది.
యంత్రాలు: నెలకు 15 టన్నుల పసుపు పొడి తయారు చేయడానికి ఈ క్రింది యంత్రాలు అవసరం. మార్కెట్లో చాలా రకాల కంపెనీలు వాటి సామర్థ్యము, నిర్మాణం మొదలైన అంశాలపై నా ఆధారపడి వాటి ధరలు ఉంటాయి.
మనదేశంలో పసుపు కొమ్ములు లేదా పసుపు పొడి వ్యాపారం ప్రారంభించాలంటే కేంద్ర ఆహార భద్రత ప్రామాణిక సంస్థ (FSSAI) నుండి లైసెన్సు తీసుకోవాలి. అంతేకాకుండా సంస్థ నిర్దేశించిన ప్రమాణాలు పాటించాలి.
Turmeric powder
కేంద్ర ఆహార భద్రత ప్రామాణిక సంస్థ (FSSAI) ప్రకారం మిరపకాయలు మరియు పసుపు పొడిలో ఈ క్రింద ప్రమాణాలు ఉండాలి.
పసుపు పంటలకు విలువ జోడించడం వలన కలిగే లాభ నష్టాల పైన వ్యాపార (SWOT) విశ్లేషణ
బలాలు:
తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో పసుపు యొక్క ప్రధాన ఉత్పత్తిదారు.
వివిధ జిల్లాలలో సారవంతమైన నేలలు ఉండడం
విస్తృత అనుకూలత/ఆమోదయోగ్యత/ దేశీయ ఞ ఎగుమతి మార్కెట్లు రెండింటికీ అనువైన మరియు అవసరమైన పసుపు రకాలను మన రాష్ట్రంలో సాగు చేస్తున్నాము.
రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో రైతులు మరియు వారి కుటుంబ సభ్యులకు పసుపు ప్రాథమిక ప్రాసెసింగ్ థలో చేపట్టవలసిన పసుపు తవ్వడం, శుభ్రపరచడం, రైజోమ్లను వేరు చేయడం, ఉడకబెట్టడం, ఎండబెట్టడం వంటి వాటిపైన విశేష అనుభవం ఉన్నది.
హైదరాబాద్ మరియు దక్షిణాది రాష్ట్రాల్లో ఆహార, ఫార్మాస్యూటికల్, న్యూట్రాస్యూటికల్, ఆయుర్వేద, కాస్మోటిక్ వంటి తయారుచేసే కంపెనీలు ఎక్కువ మోతాదులో వస్తున్నాయి కాబట్టి వాటికి పసుపు ఒక ముఖ్యమైన ముడిసరుకు.
అన్ని రకాల రవాణా వ్యవస్థలు దేశం నలుమూలల నుండి మన రాష్ట్రానికి అభివృద్ధి చెంది ఉండటం వలన పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులను సులభంగా మార్కెట్ చేసుకోవచ్చు
వేగవంతమైన పట్టణీకరణ మరియు పెరుగుతున్న టైర్-|| & టైర్ -3 నగరాలు
గ్రామీణ ప్రాంతాలలో కూడా సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు పెరుగుతున్న అనుకూల వాతావరణం, ఆహారశుద్ధి పాలసీలు
వివిధ ప్రాంతాల ప్రజల రుచికి తగినటువంటి ఆహార పదార్థాలు, ఇతర స్నాక్స్, తిను బండారాలు మొదలైనవి తయారు చేసే ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్ అందుబాటులో ఉండడం
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన గ్రామీణ యువతీ యువకులు అధికంగా ఉండడం
ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రైతుల ఆదాయం రెట్టింపుతో పాటు పంట కోత అనంతరం నష్టాలను తగ్గిస్తుంది. అన్ని కాలాలకు అనుగుణంగా పండే వ్యవసాయ ఉత్పత్తులను విలువ ఆధారిత పదార్థాలుగా మార్చడం ద్వారా అన్ని సమయాలలో ప్రజలకు అందుబాటులో ఉంచవచ్చు.
బలహీనతలు
వర్షాధార పరిస్థితులు, పంట వైవిధ్యం లేకపోవడం
మెరుగైన ఫుడ్ ప్రాసెసింగ్ మిల్లుల నిర్వహణ పద్ధతులను అవలంబించలేదు తద్వారా ఉత్పత్తి చేసిన ఆహార పదార్థాలలో నాణ్యత లోపించడం, ఎక్కువ కాలం నిలువ చేయలేకపోవడం
వివిధ జిల్లాలలో పండించే పసుపు పంటకు అనువైనటువంటి ఆహార శుద్ధి పరిశ్రమలు లేకపోవడం.
ఎక్కువ మొత్తంలో ఆహారశుద్ధి పరిశ్రమలు పట్టణ ప్రాంతాలలో నెలకొల్పడం
మార్కెట్లోకి ఎక్కువ మోతాదులో పంట చేతికి వచ్చినప్పుడు ధరల ఆటుపోట్లకు లోనవ్వడం
ప్రకృతి విపత్తుల వల్ల కొన్ని సందర్భాల్లో పంట కోత సరైన నిల్వ చేసే గోడౌన్లు లేకపోవడం అనంతరం తీవ్ర నష్టం జరగడం
అవకాశాలు
జీవ సంబంధ కారకాలు, వాతావరణ (తేమ, అధిక లేదా చల్లని ఉష్ణోగ్రత) మార్పులను తట్టుకొనే వంగడాలను తయారు చేయడం
పండించిన మొత్తం పసుపు కొమ్ములు ఎక్కువ కాలం నిల్వ చేయడం, వివిధ రుచులతో కూడిన నాణ్యమైన ఆహారపదార్థాలను ప్రజలకు అందించడం కోసం సరికొత్త టెక్నాలజీ వృద్ధి చెందే అవకాశం
తక్కువ కాలవ్యవధి కలిగిన వంగడాల అభివృద్ధి
గ్రామీణ మార్కెట్ల అభివృద్ధి మరియు విత్తనం నుండి తయారు చేసిన ఆహార పదార్థాలు వినియోగదారుడి వంటశాలకు చేరే వరకు విలువ గొలుసు (VALUE CHAIN)ను అభివృద్ధి పరచడం
భవిష్యత్తులో భౌగోళిక ప్రయోజనాలు, రవాణా సౌకర్యాల మూలంగా తెలంగాణలో ఉత్పత్తి చేసిన ఆహార పదార్థాలకు మరింత గిరాకీ ఉండే అవకాశం ఉంది.
తలసరి ఆదాయం పెరగడంతో వినియోగదారుడు నాణ్యమైన ఆహారం కోసం వెతకటం
ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఆహార పదార్థాలకు మరింత విలువ ఉండడం
తగినంత ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటే రిటైల్ ధరల ద్రవ్యోల్బణంపై మంచి నియంత్రణ ఉంటుంది
అపాయాలు
వాతావరణ మార్పులు, ప్రతికూల పరిస్థితులు ముఖ్యంగా సరైన సమయంలో తగినంత వర్షపాతం లేకపోవడం మరియు అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురవడం.
తక్కువ ఉత్పాదకత
ఈ ప్రాంతంలో కొత్త తెగుళ్లు మరియు వ్యాధులు
చిన్న మరియు మధ్య తరహా యూనిట్లలో నాణ్యత లోపించడం, ఎక్కువ కాలం నిలువ చేయలేకపోవడం
కల్తీ మరియు నాణ్యత లోపించడం
బహుళజాతి కంపెనీలు మరియు రిటైల్ సంస్థల నుండి తీవ్ర పోటీ ఉండడం.
మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న మరియు సూక్ష్మతరహా ఆహారశుద్ధి పరిశ్రమలు మరియు మహిళలు నడుపుతున్నటువంటి అసంఘటిత కుటీర పరిశ్రమలను అధికారికంగా నమోదు చేసి వాటి ఆధునీకరణకు కావలసిన శాస్త్రీయ సాంకేతిక మద్దతుతో పాటు, వ్యాపార అభివృద్ధికి కావాల్సిన ఆర్థిక సహాయం అందించడం కోసం ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అధికారికీకరణ, ఒక జిల్లా ఒక రకమైన ఆహార ఉత్పత్తి కేంద్రం వంటి విధానాలతో స్థానిక పంటలకు విలువ జోడించుట, రైతులకు గిట్టుబాటు ధర అందించడం, ఆయా ప్రాంత ప్రజలకు కావలసిన నాణ్యమైన ఆహార పదార్థాలను అందించడం, గ్రామీణ మహిళలు, స్వయం సహాయక బృందాలు, డ్వాక్రా బృందాల ఉపాధి అవకాశాలను పెంపొందించడం వంటి ముఖ్య ఉద్దేశాలతో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రారంభించిన పథకాలను రాష్ట్రంలోని మహిళా రైతులు, స్వయం సహాయక బృందాలు మరియు డ్వాక్రా బృందాలు ఉపయోగించుకుని రేపటి మహిళా సాధికారత కొరకు అడుగులు వేయవచ్చు.
కేంద్ర ప్రాయోజిత ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (PM-FME) స్కీం మరియు ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ODOP) పథకాల ద్వారా నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాలలో ఉన్నటువంటి సూక్ష్మ మరియు చిన్న తరహా ఆహారశుద్ధి మిల్లులు ముఖ్యంగా గత మూడు నాలుగు సంవత్సరాల నుండి లేదా అంతకంటే ఎక్కువ కాలం నుండి నడుస్తున్నటువంటి పసుపు పొడి మిల్లులు, కారం పొడి, మరియు మసాలా దినుసుల మిల్లులు మొదలైనటువంటి యూనిట్ యజమానులు PM-FME పథకం కింద అప్లికేషన్ పెట్టుకుంటే వారి యూనిట్ సాంకేతిక అభివృద్ధి మరియు మార్కెటింగ్ సదుపాయాలు అభివృద్ధి కోసం సుమారు 10 లక్షల క్రెడిట్ లింక్ కల్పించి 3.5 లక్షల సబ్సిడీ సదుపాయం లభిస్తుంది. పెట్టుబడి కోటి రూపాయల వరకు ఉన్నా ప్రభుత్వం నుండి 10 లక్షల సబ్సిడీ సాయం అందుతుంది. 10 లక్షల లోపు ఉంటే 3.5 లక్షల సబ్సిడీ సాయం లభిస్తుంది. పైన పేర్కొన్న నిజామాబాద్ జిల్లాలో పసుపు ఎక్కువగా పండిస్తున్నారు కావున ఈ జిల్లాలో కొత్త కుటీర పరిశ్రమలు మహిళలు ఒక బృందంగా ఏర్పడి పసుపుకు విలువ జోడిస్తే బాగా లాభం ఉంటుంది. ఈ కొత్త పరిశ్రమ ఏర్పాటుకు సుమారు 10 లక్షల పెట్టుబడి పెట్టినట్లయితే 3.5 లక్షల సబ్సిడీ సాయం లభిస్తుంది. తద్వారా నెలకు 15 టన్నుల పసుపు పొడి తయారు చేసి అమ్మవచ్చు. దేశవ్యాప్తంగా మహిళలు మరియు మహిళా సంఘాలు నడుపుతున్నటువంటి సుమారు 31,195 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, సుమారు 174.88 కోట్ల వ్యయంతో వివిధ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పారు. తద్వారా 17026 స్వయం సహాయక మహిళా బృందాలు లబ్ది పొందుతున్నారు. కావున మన రాష్ట్రంలో కూడా మహిళలు, డాక్రా సంఘాలు, పొదుపు సంఘాలు మరియు ఇతర సహకార సంఘాలు ముందుకు వచ్చి పసుపు పొడి మరియు ఇతర ఆహారశుద్ధి పరిశ్రమలను PM-FME పథకం కింద నెలకొల్పి ఆదాయంతోపాటు మహిళా సాధికారత దిశగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఎ. పోశాద్రి, యం. సునీల్ కుమార్, జి. శివ చరణ్, డి. మోహన్ దాస్, కె. రాజశేఖర్, వై. ప్రవీణ్ కుమార్, కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్. ఫోన్: 9492828965
ఎలినినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం వాతావరణ తాపాలు గణనీయంగా పెరగటంతో పాటు తీవ్ర వర్షాభావాల వల్ల ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలలో పంటభూములు బీటలు పడి ఇప్పటికే వేసిన వరి, మిరప, ప్రత్తి, శనగ, వేరుశనగ వంటి అనేక పంటలు ఎండిపోతూ, తీవ్రమైన నష్టాలకు గురైన పేద, మధ్య తరగతి రైతుల గుండెలు ఆగిపోతున్నాయి. ఈ దుస్థితికి కేవలం ప్రకృతి మాత్రమే కారణం కాదు. అందుబాటులోని పరిమిత నీటిని సద్వినియోగం చేసుకొనటంలోనూ, జలవనరుల ప్రాజెక్టు గేట్ల నిర్వహణలోనూ మన అధికార యంత్రాంగం తగినంత ముందు చూపును ప్రదర్శించక పోవుటలోనూ, పై రాష్ట్రాల నుండి మనకు రావలసిన సాగు నీటిని సమర్ధవంతంగా సాధించుటలోనూ, వర్షపు నీటిని ఒడిసిపట్టుటకు ఇంకుడు గుంటలు, చెక్డామ్స్ వంటి గత ప్రభుత్వాలు చేపట్టిన పథకాల ప్రోత్సాహాన్ని కొనసాగించుటలోనూ, డ్రిప్ ఇరిగేషన్ వంటి నీటి పొదుపు విధానాలను ప్రోత్సహించడంలోనూ మన ప్రభుత్వాల నిర్లక్ష్యాలు కూడా కారణమే! ముందు చూపు లేకుండా అతి ఉదారంగా 24 గంటల విద్యుత్ సరఫరా వంటి జనాకర్షక పథకాల వల్ల భూగర్భ జలాలు దుర్వినియోగమై రానున్న రోజుల్లో తీవ్రనీటి ఎద్దడికి మన పాలకులే కారకులౌతున్నారనుటలో అతిశయోక్తి లేదు.
ఈ సంవత్సరం ఇప్పటికే సుమారు 30-40 శాతం వరి సాగు ఉత్పత్తి క్షీణించి వరిగడ్డికి తీవ్ర కొరత ఏర్పడింది. రాబోయే వేసవికి ఈ సమస్య మరింత జటిలం కానుంది. ఆకలి, దాహాలు తీర్చుకొనుటకు అడవుల నుండి వన్యమృగాలు పంట భూములు, జనావాసాలలోకి ప్రవేశించి తీవ్రంగా ఆస్తి నష్టాలను, ప్రాణహానినీ కలిగించే ప్రమాదం కూడా ఉంది. కనీసం పాడి, పశుపోషణ, జీవాల పెంపకం, పెరటికోళ్ల పెంపకరంగాలలో నైనా సామాన్య రైతులకు కొంతైనా ఊతం లభిస్తే, వారు కొంతమేరకైనా ఉపశమనం పొందగల్గుతారు.
ఒక్కొక్క పాడి పశువు ధర లక్ష రూపాయలు దాటుతున్న ఈ రోజుల్లో అన్నార్తితో పశువుల ఉత్పత్తిపాటు ప్రాణాలు నష్టపోకుండా పటిష్ఠమైన ప్రణాళికలను రూపొందించాలి. పోషణ లోపాల వల్ల కృంగి కృశించి మరణించే పశువులకు భీమా కంపెనీలు పరిహారాన్ని చెల్లించే అవకాశాలు కూడా అంతగా ఉండవని గ్రహించాలి. పశువుల మేతగా ఉపయోగపడే అరటి, మామిడి, నేరేడు, మారేడు, మునగ, అవిసె, మర్రి, రావి, సుబాబుల్ తదితర ఆకులను సైతం సేకరించి తాజాగా లేదా మాగుడు గడ్డిగా కూడా వినియోగించవచ్చును. కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల వ్యర్థాలను సైతం మంచి మేతగా మేపవచ్చు.
నీటి కొరత వల్ల పశువుల్ని, పాకల్ని శుభ్రపరచటం తగ్గుతుంది. కాబట్టి పొదుగువాపు తదితర ప్రమాదకరమైన అంటురోగాలు ప్రబలే అవకాశాలు ఎక్కువైతాయి. పెరుగుచున్న వాతావరణ వేడి వల్ల పచ్చిపాలు త్వరగా పులిసిపోయి, విరిగిపోయి, పాల ఉత్పత్తిదారులు మరియు పాలసేకరణ సంస్థలు నష్టాలను చవిచూడవలసి ఉంటుంది. ఈ విషయాలలో ప్రత్యేక చర్యలు కూడా అవసరమే.
ఇక పశుపోషణ సమస్యల గురించి ఆలోచిస్తే, వర్షాభావ పరిస్థితుల వల్ల పంటపొలాలు, బీళ్లు బీటలు బారి నేలతల్లి పచ్చదనాన్ని కోల్పోయిన దృశ్యాలు ప్రతి చోటా కనిపిస్తున్నాయి. గత ఖరీఫ్లో కూడా మన వరిసాగు విస్తీర్ణం చాలా ప్రాంతాలలో తగ్గిపోయింది. పైగా ఇప్పటి వరి వంగడాలన్ని పొట్టివి కావటం వల్ల, వాటి పరిమాణం తగ్గటమే కాక వాటిలో రసాయనాల సాంద్రత ఎక్కువగా ఉండి పశువులకు గతి లేక మేపవలసిన పరిస్థితి. వాస్తవానికి నాణ్యమైన వరి గడ్డిలో కూడా పశువులకు ఉపయోగపడే పోషక పదార్థాలు అంతంత మాత్రమే కూడా! ఎండుమేతల మీద ఆధారపడే పశువుల త్రాగునీటి అవసరాలు దాదాపు రెట్టింపుకు పెరుగుతాయని కూడా గ్రహించాలి. కాబట్టి ప్రస్తుతం నీటి ఎద్దడి, విద్యుత్ కోతల కారణంగా ప్రతి పాడి రైతూ కనీసం మూడు రోజులకు సరిపడే శుభ్రమైన త్రాగునీటిని నిల్వ చేసుకోగల్గితే చాలా మంచిది.
పచ్చిమేత: ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రతిరైతు పిల్లిపెసర, జనుము వంటి గ్రాసాల సాగును ప్రారంభించాలి. ఇందువల్ల మంచి పచ్చిమేత లబించుటతోపాటు రాబోయే కాలానికి భూసారాలు సైతం మెరుగౌతాయి.
సూపర్నేపియర్, పారా, మేతమొక్కజొన్న, మేతజొన్న, హెడ్జ్ ల్యూసర్న్, స్టైలో హెమాటా, సిరాట్రో, వెల్వెట్ బీన్స్ తదితర గ్రాసాలను బావుల క్రింద, సాగు చేయగల్గితే సొంత పశువుల అవసరాలు తీరటమేకాక, లాభసాటి ధరలకు ఇతరులకు కూడా విక్రయించి అదనపు ఆదాయాలు పొందవచ్చును.
అత్యధికంగా విటమిన్లు, ఖనిజాలు, మాంసకృత్తులు కలిగిన అవిసె, మునగ, సుబాబుల్, నేరేడు, మామిడి తదితర చెట్ల ఆకులు కూడా దూడలు పడ్డలతో పాటు పెద్దపశువుల పోషక అవసరాలను చాలా వరకు తీర్చగలవు. కరవు కాలంలో పశువులకు హైడ్రోపోనిక్ గ్రాసాలు, అజొల్లా వంటి సాంప్రదాయేతర మేతలు ఎంతగానో ఉపయోగపడి, పాల ఉత్పత్తిని కాపాడగలవు.
కేవలం పశువుల పాకలలోపల, మిద్దెల మీద, వరండాలలో సైతం 100 చదరపు గజాల స్థలంలో ఏర్పాటు చేసిన అరలలో అమర్చిన వంద ట్రేలలో పెరిగే మొలకల గ్రాసాలు 8-10 పశువుల మేత అవసరాలను తీర్చగలవు. విత్తిన కేవలం 7-8 రోజుల్లోనే 8-10 అంగుళాల ఎత్తుకు దట్టంగా పెరిగే ఈ మొలకలలో పశువులకు అవసరమైన చాలా విటమిన్లు, ఖనిజాలు, మాంసకృత్తులు, ఇతర పోషకాలు సమృద్ధిగా లభ్యమై పశువుల పోషకాహార అవసరాలను చాలావరకు తీర్చగలవు. ఈ హైడ్రోపోనిక్ గ్రాసాలను పెద్ద పశువులతో పాటు పెరిగే దూడలు, పడ్డలు, గొర్రెలు, మేకలకు, కోళ్లకు కూడా మేపవచ్చును.
అధిక శాతం అంటే కనీసం 80-85 శాతం మొలకెత్తే సామర్థ్యం కలిగిన, మొక్కజొన్న, జొన్న, శనగ, ఉలవ, బార్లీ, ఓట్స్, గోధుమ, అలసంద వంటి గింజలను ఎంపిక చేసుకోవాలి. అరలలో అమర్చిన సుమారు 24”þ18”þ4” కొలతలు కలిగిన దృఢమైన ప్లాస్టిక్ ట్రేలలో తాలు గింజలను తొలగించి, శుద్ధిచేయబడిన గింజలను ట్రేకు అర కిలో చొప్పున, ఒక రోజు మూట కట్టి నానబెట్టిన గింజల్ని పరవాలి. వీటిని రోజుకు రెండుసార్లు తుంపర నీటితో గానీ, వాటర్ స్ప్రింక్లర్ల స్ప్రేలతో కానీ తడుపుతూ 8-9 రోజులు పెంచితే అట్టకట్టిన పచ్చటి మేత మొలకలు తయారౌతాయి. ఒక్కొక్క యూనిట్లో 4-5 వరుసలలో అమర్చిన 16-20 ట్రేల నుండి వరుస క్రమంలో గ్రాసాన్ని సేకరించి నేరుగా పశువులకు మేపవచ్చును. అత్యంత పుష్టివంతమైన ఈ మొలకల దాణాలు ఎండుమేతలతోపాటు వాడి ఖరీదైన సమీకృత దాణాలపై ఖర్చును చాలా వరకు తగ్గించుకోవచ్చు.
మన ప్రభుత్వాలు వెంటనే తమ పరిధిలోని పాడి రైతులకు హైడ్రోపోనిక్ గ్రాసాల ఉత్పత్తికి అవసరమైన సామాగ్రిని, విత్తనాలను సబ్సిడీ ధరలకు అందించి మేలు చేయగల్గితే పాల ఉత్పత్తిదారులకు సత్వర మేలు చేకూరగలదు. గోశాలలు, గోసదన్లు, పశు పునరావాస కేంద్రాలలో విస్తృద స్థాయిలో హైడ్రోపోనిక్ గ్రాసాల ఉత్పత్తిని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
అజొల్లా సాగు: పశువుల పాకలు ఇంటి ఆవరణలు మిద్దెల మీద కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న నీటి మడులలో వివిధ జాతులకు చెందిన ఫెర్న్ నాచును పెంచి మంచి పుష్టికరమైన మేతగా అన్ని పశువులకు మేపవచ్చును. ప్రత్యేకంగా ధృఢమైన నీరుఇంకని ధృఢమైన ప్లాస్టిక్ టార్పాలిన్తో ఏర్పాటైన 6’þ4’þ9” మడులలో సారవంతమైన నల్లరేగడి మన్నును ఆపైన మినల్ మిక్చర్ కలిపిన పశువుల పేడ గుజ్జు ఏర్పాటు చేసి, ఆపైన 4-5 అంగుళాలు నీటిని నింపి ఎంపిక చేసిన, నాణ్యమైన 1.0-1.5 కిలోల అజొల్లా విత్తనాన్ని పరచాలి. 8-10 రోజుల్లో జాగ్రత్తగా ఒక్కొక్క మడిలో నుండి 80 శాతం అజొల్లాను సేకరించి నీటితో శుభ్రపరచి, పశువులకు మేపవచ్చును. ఎనిమిది మడులను ఏర్పాటు చేస్తే వరుస క్రమంలో రోజుకు ఒక మడి నుండి సేకరించిన 6-7 కిలోల పచ్చిగ్రాసం (ఎండుమేతలతో మేపితే) ఒక పశువు అవసరాన్ని తీర్చగలదు. రోజుకు 20-25 కిలోల అజొల్లా మేత ఒక సాధారణ పాడి పశువు ఆహార అవసరాలను చాలా వరకు తీర్చగలదు. అదనంగా 2-3 కిలోల వరిగడ్డిని అందిస్తే సరిపోతుంది. ఖరీదైన దాణాల అవసరం కూడా దాదాపు సగానికి తగ్గిపోగలదు. అజొల్లా మడులను పశువులు, కుక్కలు, పకక్షుల నుండి కాపాడుట చాలా అవసరం. తీవ్రమైన ఎండ తగల కుండా కూడా చూడాలి. ప్రతినెలా మడులను మినరల్ మిక్చర్ కలిపిన శుభ్రమైన ఒకరోజు మాగిన పేడ గుజ్జుతో బలవర్ధకం చేయాలి. 4-5 నెలలకు ఒకసారి మడులలోని మట్టిని తొలగించి సేంద్రియ ఎరువుగా పంటలకు, తోటలకు వినియోగించుకోవచ్చు.
మాగుడు గడ్డి సైలేజి: వివిధ రకాల పచ్చిగ్రాసాలు, చెట్ల ఆకులు, చిక్కుడు, బీర, బెండ వంటి మొక్కల ఆకులు, కాండాలు, గుర్రపు డెక్క వంటి కలుపు మొక్కల్ని సేకరించి, వాటిలో తేమ శాతం 40 శాతానికి తగ్గేవరకు ఆరబెట్టి తేమ ప్రవేశించకుండా పటిష్టంగా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ షీట్ పరచిన గోతులలో నింపి, గాలి చొరకుండా దట్టించి, పైన ప్లాస్టిక్ షీటును కప్పి, ఆపైన మట్టితో నింపి పేడతో అలికి నిల్వ చేస్తే మరింత పుష్టివంతమైన, సులువుగా జీర్ణమయ్యే పుష్టివంతమైన మేతగా మారి సంవత్సర కాలానికి పైగా నిల్వ ఉంటుంది.
యూరియా నీటితో మాగవేసిన గడ్డి: మాంసకృత్తులుగానీ, ఖనిజాలు, విటమిన్లు గానీ లేని వరిగడ్డి వంటి నాసిరకం పంట వ్యర్థాలను 4 శాతం యూరియా ద్రావణం మరియు మినరల్ మిక్చర్తో కలిపి గాలి సోకకుండా పది రోజులకు పైగా గట్టిగా దట్టించి నిల్వ చేస్తే ఈ వ్యవసాయ వ్యర్థాలలోని మాంసకృత్తుల శాతం పారా వంటి నాణ్యమైన పచ్చిమేతల స్థాయికి పెరుగుతుంది. దీనిని దూడలకు తప్ప ఇతర పశువులన్నింటికీ మేపవచ్చును.
పశుగ్రాసాల దిగుమతి: అవసరమైతే పొరుగు రాష్ట్రాల నుండే కాక విదేశాల నుండి కూడా బేళ్లుగా చేసిన ఎండుగ్రాసాలను దిగుమతి చేసుకుని మన రైతులకు సబ్సిడీ ధరలకు అందించుటకు ముందుగా తగిన ఏర్పాట్లు చేయాలి.
పశువుల పునరావాస కేంద్రాల ఏర్పాటు: ఆకలితో అలమటించి మృత్యువాత పడకుండా ఉండే పేదల పశువులకు కరవు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయవలసిన అవసరం కూడా ఉంది.
సక్రమమైన నిర్వహణలో ఉన్న గోశాలలకు, ధార్మిక సంస్థలకు అవసరమైన సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలి. పశుగ్రాసాల కొరత తీరేవరకు పాడి పశువులు-పనిపశువుల పంపిణీ వంటి సంక్షేమ పథకాల అమలును నిలిపివేస్తే మంచిది.
పరిమితంగా లభ్యమయ్యే పచ్చిగ్రాసాలు వృథాకాకుండా మేత తొట్లు, గడ్డికోత మిషన్ల వంటి సాధనాలను సబ్సిడీ ధరకు, అవసరమైన వారికి ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి.
జలలభ్యత మీదనే మన విద్యుత్ సరఫరా చాలావరకు ఆధారపడ్డ విషయం అందరికీ తెలిసిందే. పశువుల నిర్వహణలో విద్యుత్ సరఫరా ఆధార పడినందున మరియు విద్యుత్ సరఫరావేళలు, విద్యుత్ ధరలు అందుబాటులోనూ, అనుకూలంగానూ ఉండనందున ప్రతిరైతు తన మిద్దెలు, పశువుల షెడ్ల మీద సోలార్ విద్యుత్ ప్యానళ్లను అమర్చుకొని నిరంతరం అతిచౌకగా విద్యుత్ను పొంది తమ అవసరాలు తీర్చుకోగలరు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకో వలసిందిగా సూచిస్తున్నాను.
మనది అధిక జనాభా కలిగిన దేశం. మన దేశం అధిక జనాభాలో చైనాను దాటి ఇటీవలే ప్రథమ స్థానానికి ఎగబాకింది. జనాభా పెరుగుదలతో పాటు నిరుద్యోగుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తూంది. పెరుగుతున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చూపించే అంత మొత్తంలో పరిశ్రమలు లేదా వ్యవసాయేతర మార్గాలు రాగలవా? అంటే సమాధానం ప్రశ్నార్థకమే. పెరుగుతున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపించే సత్తా మన దేశంలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకే ఉందనే విషయం అక్షర సత్యం. ఈ విషయాన్ని అనేకమంది రైతులు నిరూపించారు. ఇంకా నిరూపిస్తూనే ఉన్నారు. ఈ కోవలో చేరింది శ్రీకాకుళం జిల్లా, బూర్జ మండలం, రామన్నపేటకు చెందిన వరలక్ష్మి.
వరలక్ష్మిది వ్యవసాయ నేపథ్యం. వారికి కేవలం అర ఎకరం పొలం మాత్రమే ఉంది. అర ఎకరం పొలంలో వరి పంట సాగు చేస్తూ జీవితాలను కొనసాగిస్తుండగా సుభాష్పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి వినడం జరిగింది. ఈ పద్ధతుల గురించి ఇంకా ఎక్కువ అవగాహన కలిగించుకునేందుకు గాను వరలక్ష్మి బావగారు గుంటూరులో ఏర్పాటు చేసిన సుభాష్ పాలేకర్ గారి అవగాహనా సదస్సుకు హాజరయ్యి అన్ని విషయాలను కక్షుణ్ణంగా తెలుసుకుని తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూ, భూమి ఆరోగ్యం కాపాడాలంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతులే సక్రమమైనవి అని తెలుసుకుని ఈ వ్యవసాయ పద్ధతిని తమ జీవనోపాధిగా మలుచుకోవాలని నిర్ణయించుకుని 2018వ సంవత్సరంలో 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పంటల సాగు మొదలు పెట్టారు.
అక్టోబర్ 14, 2023న కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్లో భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి చేతులమీదుగా ‘రైతునేస్తం పురస్కారం’ అందుకుంటున్న శ్రీమతి పనస వరల/. చిత్రంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, శ్రీమతి ముప్పవరపు రాధ, రైతునేస్తం ఛైర్మన్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తదితరులు
5 ఎకరాలలో మొదటి పంటగా వరి పంటని సాగు చేస్తుంటారు. దుక్కిలో ఘనజీవామృతం అందించడంతో పాటు ఎకరానికి 30 కిలోల వివిధ రకాల విత్తనాలను పిఎమ్డిఎస్ (ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ పద్ధతి) పద్ధతిలో చల్లి అవి పూతకు వచ్చే సమయంలో భూమిలో కలియదున్ని వరి సాగు మొదలు పెడతారు. ప్రస్తుతం 5 ఎకరాలలో స్వర్ణ రకం వరి సాగులో ఉంది. ఈ రకానికి చీడపీడల బెడద తక్కువగా ఉండడంతో పాటు ఆహారంగా తినడానికి కూడా బాగా ఉంటాయి కాబట్టి ఈ రకాన్ని ఎంచుకున్నారు. 5 ఎకరాలకు గాను ఒక ఎకరంలో లైను నాటు పద్ధతి, మిగతా 4 ఎకరాలలో మామూలు నాట్లు వేసే పద్ధతిని పాటించి వరి నారుని నాటించారు. నారు నాటే ముందు కూడా పశువుల ఎరువు మరియు ఘనజీవామృతంను దమ్ములో అందించారు. నారు నాటిన తరువాత క్రమం తప్పకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి ఎకరానికి 200 లీటర్ల చొప్పున జీవామృతాన్ని అందిస్తూ వస్తుంటారు. చీడపీడల నివారణకు గాను కాలి బాటలు తీయడం, పక్షి స్థారాలు ఏర్పాటు చేయడం, పసుపు రంగు జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేస్తుంటారు. గట్లపై ఎర పంటలుగా బంతి లాంటి పంటలు కూడా సాగు చేస్తుంటారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా చీడపీడలు ఆశించినట్లయితే నీమాస్త్రం, అగ్రాస్త్రం, బ్రహ్మాస్త్రం, జిల్లేడు కషాయం లాంటి వాటిని పిచికారి చేస్తుంటారు.
మామూలు నారు నాటే పద్ధతితో పోల్చుకుంటే లైనులో నారు నాటే పద్ధతిలో మొక్కలకు గాలి, వెలుతురు సక్రమంగా అందించడం వలన చీడపీడల బెడద తక్కువగా ఉండడం, దుబ్బు బాగా చేసి, ఎక్కువ పిలకలు రావడం, వచ్చిన అన్ని పిలకలు వెన్ను వేయడం వారు ప్రత్యక్షంగా చూశారు. పిలకలు ఎక్కువగా రావడము వలన దిగుబడి ఎకరానికి 3 బస్తాల వరకు పెరగడముతో పాటు, కోత సులభంగా ఉండడము, కోత కోసిన తరువాత వాటిని ప్రక్కకు పడవేసినప్పుడు అవి దుబ్బుల మీద పడడం జరిగి వర్షం లాంటి ఇబ్బందులు ఏర్పడినా కూడా వడ్లు పాడవకుండా ఉండేందుకు అవకాశాలు ఉంటాయని వరలక్ష్మి అంటున్నారు.
వరి పంట అయిన తరువాత రబీ సీజనులో మినుము, పెసర లాంటి అపరాల పంటలు, గోరుచిక్కుడు లాంటి కూరగాయ పంటలు వేస్తుంటారు. గట్ల మీద వివిధ రకాల ఆకుకూరలు, వంగ, బెండ, టమాట, బీర, కాకర లాంటి కూరగాయల పంటలు సాగు చేస్తుంటారు. గట్ల మీద వేసిన కూరగాయలను సొంతానికి ఉపయోగించుకుని మిగిలిన వాటిని నేరుగా వినియోగదారులకు అమ్మకం చేస్తుంటారు. వాటి మీద వచ్చిన ఆదాయం వరి మరియు అపరాల పంటలకు పెట్టుబడిగా సరిపోతుంది. కాబట్టి వరి మరియు అపరాల పంటలలో వచ్చిన దిగుబడి మొత్తం నికర ఆదాయంగా మిగులుతుందని వరలక్ష్మి అన్నారు.
ఎకరానికి 22 నుండి 25 బస్తాల వడ్లను పండించి, వడ్లను అదేవిధంగా అమ్మకుండా కొన్ని రోజులు నిల్వ ఉంచి పాతవి అయిన తరువాత బియ్యం పట్టించి 25 కిలోల బస్తాను 1400/-ల చొప్పున నేరుగా వినియోగదారులకు అమ్ముతూ వస్తున్నారు. అపరాలు అయిన పెసర, మినుములను కూడా అదేవిధంగా అమ్మకుండా వాటిని పప్పు పట్టించి నేరుగా వినియోగదారులకు ఆశాజనకమైన ధరలకు అమ్మకం చేస్తూ మంచి ఆదాయం గడిస్తున్నామని వరలక్ష్మి తెలియజేశారు.
వారి గ్రామంలో ఎన్పియం షాపు ఏర్పాటు చేసి ఆ షాపు ద్వారా తమ పంట ఉత్పత్తులను అమ్మకం చేయడంతో పాటు ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే వివిధ రకాల ఎరువులు, కషాయాలు, ద్రావణాలను తోటి రైతులకు అమ్మకం చేసి ఆదాయం గడిస్తున్నారు. కుటుంబ సభ్యుల సహకారం ఉండి, అందుబాటులో ఉన్న అన్ని వనరులను సక్రమంగా ఉపయోగించుకోగలిగితే స్వయం ఉపాధిగా ప్రకృతి వ్యవసాయం సరైనదారి అని వరలక్ష్మి కుటుంబం నిరూపిస్తున్నారు. మరిన్ని వివరాలు 9390307751 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
పశువులలో వచ్చు వివిధ రకాల ముఖ్యమైన వ్యాధులలో పొదుగువాపు వ్యాధి ఒకటి. ఇది వివిధ రకాల వ్యాధి కారకాల ద్వారా కలిగి, రైతులకు ఆర్థిక నష్టాన్ని కలిగించును. ఇది పాడి పశువులు అనగా ఆవులు, గేదెలలో చూడవచ్చు. అధిక పాల దిగుబడినిచ్చు పాడి పశువులలో అధికంగా చూడవచ్చును. దీనిని బొవైన్ మాస్టైటిస్ లేదా మామ్మైటిస్ అని కూడా అంటారు. ఇది మేకలు మరియు గొర్రెలలో కూడా గమనించవచ్చు. ఈ వ్యాధి ముఖ్యంగా వ్యాధికారక అనుకూల పరిస్థితులు అనగా పొదుగుకు గాయాలు, పుండ్లు, పగుళ్లు మొదలగునవి, అపరిశుభ్ర వాతావరణ పరిస్థితులు, మోటు పద్ధతిలో పాలు పితుకుట మరియు పాలను పూర్తిగా పిండివేయకపోవటం, అపరిశుభ్ర పాత్రలు, పాలు పితికే వ్యక్తులు మరియు వారి ఆరోగ్య పరిస్థితి వంటి అననుకూల పరిస్థితులలో వ్యాధికారకము పశువుల పొదుగు కణజాలాన్ని చేరి వ్యాధిని కలుగజేయును.
ఈ వ్యాధి కారకాలు ముఖ్యంగా స్ట్రెప్టోకోకస్, స్టెఫైలోకోకస్, కొరిని బ్యాక్టీరియమ్ పయోజినస్, ఈ.కొలై. సూడోమోనాస్, పాశ్చురెల్లా మల్టోసిడా, బ్రూసెల్లా అబార్టస్, మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్, ఆక్టినోమైసిస్ బోవిస్, ఆక్టినోబాసిల్లస్ లిగ్నిరేసి, నొకార్డియా, మైకోప్లాస్మా మరియు క్రిప్టోకోకస్ నియోఫార్మెన్స్ మొదలగునవి.
ఈ వ్యాధి కారకాలు, పశువులలో వ్యాధికి అనుకూల పరిస్థితులు కలిగినపుడు, టీట్కెనాల్ ద్వారా పాల పొదుగును చేరి అచ్చటి కణజాలాన్ని చేరి, మొదట ఇన్వేసివ్ ఫేజ్, తరువాత ఇన్ఫెక్షియస్ ఫేజ్ మరియు ఇన్ఫ్లమేటరీ ఫేజ్ ద్వారా పొదుగు కణజాలాన్ని నాశనం చేసి పాల దిగుబడిని మరియు పాల నాణ్యతను గణనీయంగా తగ్గించి, ఆ యొక్క వ్యాధిగ్రస్థ పశువులు పాల ఉత్పత్తికి పనికిరాకుండా చేసి రైతులకు లాభాలను తగ్గించి, ఆర్థికంగా నష్టాలను కలగుజేయును. పశువులలో ఈ వ్యాధి అనారోగ్యాన్ని, దాని తీవ్రతను అనుసరించి వ్యాధి లక్షణాలు పర్ఎక్యూట్, ఎక్యూట్, సబ్ ఎక్యూట్, క్రానిక్ మరియు సబ్ క్లీనికల్ రకాలుగా ఉండును.
పర్ఎక్యూట్ మాస్టైటిస్: ఈ రకంలో వ్యాధి తీవ్రంగా ఉండి శరీర వ్యవస్థలు ప్రభావితం కావటం వలన, వ్యాధిగ్రస్థ పశువు అధిక జ్వరం కలిగి (106-107 డిగ్రీల ఫారెన్హీట్), సరిగా మేత మేయక శ్వాస కష్టంగా తీసుకొనుట, పొదుగు నుండి పాలు రాకుండా, రక్తం కలిగిన ద్రవాలు వచ్చును.
ఎక్యూట్ మాస్టైటిస్: ఈ రకంలో పొదుగు వాపు కలిగి ఉండి, పాలలో మార్పులు కనిపించును. స్వచ్ఛమైన పాలకు బదులుగా పశువు పచ్చగా లేదా గోధుమ రంగులో ఉండి, గడ్డలు కలిగి ఉండును. వ్యాధి కారకము ఒక క్వార్టర్కి గాని మొత్తం నాలుగు క్వార్టర్స్కు గాని సోకును. దీని వలన పొదుగులోని క్రియాశీలత లోపించును. ఈ పరిస్థితిని వెంటనే గమనించి సరైన చికిత్స చేయుట వలన ఆరోగ్యం కలుగును.
సబ్ ఎక్యూట్ మాస్టైటిస్: ఇది కష్టతరమైన రకం, పొదుగు కణజాలంయందు మార్పు ఉండదు. కాని పాలలో మార్పు ఉండును. ఈ యొక్క పాలను పరీక్షలు చేయుట వలన, వ్యాధికారక సూక్ష్మజీవులను కనుగొనవచ్చు.
క్రానిక్ మాస్టైటిస్: ఈ రకం, వ్యాధి యొక్క చివరిథలో చూడవచ్చు. ఈ రకంలో పొదుగువాపు చెంది, గట్టిగా ఉండును మరియు పొదుగులో గడ్డలు కూడా కలుగును. పాలు పసుపు పచ్చద్రవంగా లేదా తెల్ల ముద్దగా ఉండి, కొన్నిసార్లు చెడువాసన కలిగి ఉండును.
సబ్క్లీనికల్ మాస్టైటిస్: ఈ రకంలో పాల పొదుగులోమరియు పాలయందు కంటికి కనిపించే మార్పులు ఏమీ ఉండవు. కొన్ని పాలల్లో తెల్లరక్తకణాలు (ల్యూకోసైట్స్) సంఖ్య పెరిగి, వ్యాధికారక సూక్ష్మజీవులను కలిగి ఉండును. ఈ రకం యందు, పాల చేపులో తేడాలు (తగ్గుట) మరియు పొదుగు యొక్క పరిమాణం తగ్గుట గమనించాలి. దీనిని కాలిఫోర్నియన్ మాస్టైటిస్ టెస్ట్ ద్వారా కనుక్కోవచ్చు.
ఎలర్జిక్ మాస్టైటిస్: కొన్ని సందర్భాలలో పాలు పితికేటపుడు, అకస్మాత్తుగా చన్నులు వాచిపోవటం జరుగుతును. ఈ రకంలో సూక్ష్మజీవుల ప్రమేయం ఉండదు. కాని మొదట ఈత పడ్డలలో, ఈనిన 10-20 రోజులలోపు గమనించవచ్చు. సాధారణంగా పాలు పితికేటపుడు అకస్మాత్తుగా చనుమొనలు కొన్ని క్షణాలలోనే 3-4 రెట్లు అధికంగా వాచిపోయి, చన్నుల చుట్టు ఒక వలయం లాగా ఏర్పడి ఉండును.
వ్యాధి నిర్ధారణ అనునది వ్యాధి లక్షణాలు, వ్యాధి చరిత్ర, పాల పరీక్షలు అనగా భౌతిక, రసాయనిక మరియు మైక్రోబయోలాజికల్ పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. పొదుగును పరీక్షించుట, అనగా పొదుగు పరిమాణము, ఆకారము, వాపు, నొప్పి, ఎర్రగా మారటం మొదలగు లక్షనాలను గమనించిన వెంటనే పశువైద్యాధికారిని సంప్రదించాలి.
పాలలో వ్యాధికారక సూక్ష్మజీవులను ప్రయోగశాలలో గుర్తించి వాటిపై ఏ మందులు పనిచేస్తాయో సెన్సిటివిటి టెస్ట్ ద్వారా తెలుసుకొని, సాధ్యమైనంత త్వరగా చికిత్స చేయించటం ఉత్తమము. వ్యాధి నివారణకు ఉపయోగించే మందుల అవశేషాలను తగ్గించాలంటే రైతులు, పశువైద్యాధికారి చేత నిర్ధారించబడిన, సరైన మందులు, సక్రమమైన సమయంలో సరైన మోతాదులో వాడాలి.
నివారణ చర్యలు:
వ్యాధిని గమనించిన వెంటనే వ్యాధిగ్రస్త పశువులను ఇతర ఆరోగ్యకరమైన పశువుల నుండి వేరుచేయవలెను. పశువులనుండి పాలు పితికేటపుడు పొదుగును శుభ్రం చేయాలి. పాలు పితికే వ్యక్తి చేతులను ఆంటీసెప్టిక్ ద్రావణంతో శుభ్రం చేయాలి. పొదుగులో పాలను పూర్తిగా పితికి వేయవలెను. ఆ తరువాత అరగంట వరకు పశువును నిలబడేటట్లు చూసినట్లయితే, ఆ సమయానికి చనురంధ్రాలు బిగుసుకుని, సూక్ష్మజీవులు పొదుగులోకి ప్రవేశించకుండా ఉండును. చీము లేదా రక్తం కనిపించినట్లయితే పశువైద్యాన్ని సంప్రదించి వెంటనే వైద్యము చేయించాలి. పశువుల కొట్టమును ఎల్లపుడు పొడిగా, పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
డా. ఎం. జీవనలత (9490292468), అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ హెడ్,
డా. ఎం. కె. శ్రీకాంత్ (9652655255), పశువైద్యాధికారి, రాజేంద్రనగర్.
మానవుల ఆహారంలో గత కొన్ని థాబ్దాల్లో చాలా మార్పులు సంభవించాయి. గింజధాన్యాలు, పప్పుధాన్యాల ప్రాముఖ్యత కొంత తగ్గుతుండగా పండ్లు, కూరగాయలు, వంటనూనెలు, పాలు, గ్రుడ్లు, మాంసం వంటి అనుబంధ పదార్థాల వాటా క్రమేపీ పెరుగుతున్నది. సాంప్రదాయ పంటల సాగు గిట్టుబాటుగా లేకపోవటం వల్ల ఉద్యానవన పంటలు, పశుపోషణ, కోళ్ల పెంపకం వంటి అనుబంధ వ్యాపకాలవైపు పెట్టుబడులు మళ్ళుతున్నాయి. నీటివసతితోపాటు శ్రామికుల లభ్యత పష్కలంగా ఉన్న ప్రాంతాల్లో కూరగాయల సాగు వాణిజ్యస్థాయిలో జరుగుతున్నది. 1951లో దేశంలో 28.4 లక్షల హెక్టార్లలో కూరగాయల్ని సాగు చేసినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. హెక్టారుకి 5.8 టన్నుల దిగుబడితో 165 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తయ్యాయి. తలసరి కూరగాయల ఉత్పత్తి, లభ్యత రోజుకి 88 గ్రాములు మాత్రమే. 2021-22లో కూరగాయల సాగు 113.5 లక్షల హెక్టార్లలో జరగ్గా హెక్టారుకి 18 టన్నుల సగటు దిగుబడితో 2048 లక్షల టన్నులు ఉత్పత్తయినట్లు తాజా అంచనాలు సూచిస్తున్నాయి. ఏడు థాబ్దాల కాలంలో కూరగాయల విస్తీర్ణం నాలుగు రెట్లు పెరిగింది. హెక్టారు దిగుబడి 2.72 రెట్లు పెరిగింది. ఉత్పత్తి 11 రెట్లు పెరిగినందువల్ల తలసరి లభ్యత రోజుకి 400 గ్రాములకు ఎగబాకింది. 2021లో ప్రపంచంలో ఉత్పత్తయిన 1150 మిలియన్ టన్నుల్లో భారతదేశం వాటా సుమారు 18 శాతంగా ఉంది. అల్లం, బెండకాయల ఉత్పత్తిలో భారత్కు ప్రథమ స్థానం ఉండగా, బంగాళాదుంప, ఉల్లిపాయలు, కాలీఫ్లవర్, కాబేజీ, వంకాయ వంటి అనేక కూరగాయల ఉత్పత్తిలో రెండవ స్థానంలో నిలిచింది. దేశీయ అవసరాలను తీర్చడంతోపాటు 2021-22లో 6986 కోట్ల రూపాయల విలువైన తాజా కూరగాయల్ని, దాదాపు ఎనిమిదివేలకోట్ల రూపాయల విలువైన శుద్ధి చేసిన కూరగాయల్ని ఎగుమతి చేయడం జరిగింది. ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి, మిశ్రమ కూరగాయల్ని శుద్ధి చేసి, ఎగుమతి చేస్తున్నది. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు కూరగాయల ఉత్పత్తిలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తూ, సగానికి పైగా కూరగాయల్ని పండిస్తున్నాయి. ప్రపంచ సగటు దిగుబడితో పోలిస్తే ఆలుగడ్డ, కాలీఫ్లవర్ల విషయంలోనే భారతదేశపు సగటు దిగుబడి ఎక్కువ. కాబేజీ, వంగ, బెండ, ఉల్లిగడ్డ, టమాటాల దిగుబడి ప్రపంచ సగటు దిగుబడితో పోలిస్తే దేశంలో తక్కువగానే ఉంది. మొత్తం కూరగాయల సగటు దిగుబడి ప్రపంచ సగటు దిగుబడితో పోలిస్తే తక్కువగానే ఉంది.
ముఖ్యమైన కూరగాయలు
మొత్తం కూరగాయల ఉత్పత్తిలో 28.9 శాతం వాటాతో ఆలుగడ్డదే అగ్రస్థానం. 11.3 శాతం వాటాతో టమాట రెండవ స్థానంలోనూ, 10.3 శాతం వాటాతో ఉల్లిగడ్డ మూడవ స్థానంలో నిలిచాయి. 8.1 శాతం వాటాతో వంకాయ, 5.5 శాతం వాటాతో కర్రపెండలం, 5.4 శాతం వాటాతో కాబేజి, 4.6 శాతం వాటాతో కాలీఫ్లవర్, 3.9 శాతం వాటాతో బెండకాయ, 2.4 శాతం వాటాతో బఠానీ, 0.8 శాతం వాటాతో చిలగడదుంపలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన కూరగాయలన్నింటికీ కలిపి 18.8 శాతం వాటా ఉంది. 1961లో దేశంలో 3.75 లక్షల హెక్టార్లలోనే బంగాళాదుంపను సాగు చేయగా, 7.25 టన్ను సగటు దిగుబడితో 27.19 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. 2022-23 సంవత్సరంలో దేశంలో బంగాళాదుంప సాగు 23.5 లక్షల హెక్టార్లకు పెరిగింది. బంగాళా దుంప విస్తీర్ణం 6.27 రెట్లు పెరగటం ఒక విశేషమైతే, ఉత్పత్తి సుమారుగా 22 రెట్లు పెరిగి 597.4 లక్షల టన్నులకు చేరింది. ఉత్పాదకత కూడా 3.5 రెట్లు పెరిగి హెక్టారుకి 25.4 టన్నులకు చేరింది. బంగాళాదుంప ఉత్పత్తి 22 రెట్లు పెరగటం కూరగాయల ఉత్పత్తి వేగంగా పుంజుకోవటానికి దోహదపడింది. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలు ఆలుగడ్డ ఉత్పత్తిలో అగ్రస్థానాల్లో ఉన్నాయి. 1961లో టమాటా కేవలం 50 వేల హెక్టార్లలో మాత్రమే సాగయింది. హెక్టారుకి 9 టన్నుల చొప్పున దిగుబడి 4.64 లక్షల టన్నులే. 2022-23లో టమాట సాగు 19.28 రెట్లు పెరిగి 8.64 లక్షల హెక్టార్లకు విస్తరించింది. దిగుబడి కూడా 2.65 రెట్లు పెరిగి 23.87 టన్నులకు చేరింది. ఉత్పత్తి 44.4 రెట్లు పెరిగి 206.2 లక్షల టన్నులకు చేరింది. ఇంత విరివిగా ఉత్పత్తి పెరగటంతో టమాట సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు టమాట ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. మరో ముఖ్యమైన పంట ఉల్లిగడ్డను కూడా 1961లో కేవలం 1.2 లక్షల హెక్టార్లలోనే సాగు చేశారు. హెక్టారుకి 10 టన్నుల దిగుబడితో కేవలం 12 లక్షల టన్నుల ఉల్లిగడ్డలు ఉత్పత్తయ్యాయి. 2022-23 సంవత్సరంలో ఉల్లిసాగు విస్తీర్ణం 4.83 రెట్లు పెరిగి 5.8 లక్షల హెక్టార్లకు విస్తరించింది. సగటు దిగుబడి 53.45 టన్నులకు చేరటం ద్వారా 7.48 రెట్ల వృద్దిని నమోదు చేసింది. ఫలితంగా ఉల్లి ఉత్పత్తి 310.1 లక్షల టన్నులకు పెరిగి 25.84 రెట్లకు చేరింది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలు ఉల్లి ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచాయి. టమాట ఉత్పత్తి 62 సంవత్సరాల్లో 44 రెట్లు, ఉల్లి ఉత్పత్తి 26 రెట్లు, ఆలుగడ్డ ఉత్పత్తి 22 రెట్లు పెరగటం కూరగాయల ఉత్పత్తిని పెంచటానికి దోహదపడ్డాయి. ఈ మూడు రకాల కూరగాయలు దేశమంతటా వినిమయదారుల ఆదరణను చూరగొని, లభ్యతమైతున్నాయి. వీటి ధరలు తగ్గినప్పుడు రైతులు, పెరిగినప్పుడు వినిమయదారులు గగ్గోలు పెడుతుంటారు. ప్రభుత్వాలు కూడా వీటి ఎగుమతుల్ని నియంత్రించడం ద్వారా ధరల్ని అదుపులో ఉంచే ప్రయత్నాలను చేస్తుంటాయి. వంగతోటల సాగు 1961లో 1.50 లక్షల హెక్టార్లలో జరిగి, హెక్టారుకి 7 టన్నుల దిగుబడితో 9.9 లక్షల టన్నుల ఉత్పత్తి నమోదైంది. 2022-23లో వంగతోటల సాగు 7.6 లక్షల హెక్టార్లకు విస్తరించింది. మొత్తం ఉత్పత్తి 126.1 లక్షల టన్నులకు పెరిగి, 16.59 టన్నుల సగటు దిగుబడిని దేశం సాధించింది. దిగుబడి 2.37 రెట్లుకి చేరుకోవడం, విస్తీర్ణం 5.07 రెట్లు పెరగటం వల్ల ఉత్పత్తి 12.74 రెట్లు పెరిగింది. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్లు వంకాయ ఉత్పత్తిలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్లలో కూడా వంకాయ ఉత్పత్తి గణనీయమైన స్థాయిలోనే ఉంది. కర్రపెండలాన్ని కూడా కూరగాయల్లో లెక్కించినా, దానిని వరి బియ్యానికి ప్రత్యామ్నాయంగానే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వాడుతున్నారు. కేబేజి ఉత్పత్తి 1961లో 2.88 లక్షల టన్నులు మాత్రమే. 2022-23లో అది 9.95 లక్షల టన్నులకు పెరిగింది. పశ్చిమ బెంగాల్, ఒరిస్సాలు ఈ కూరగాయను అధికంగా పండిస్తున్నాయి. కాలీఫ్లవర్ ఉత్పత్తి 1961లో 4.13 లక్షల టన్నులుంటే, 2023కి అది 8.8 లక్షల టన్నులకు పెరిగింది. పశ్చిమబెంగాల్, బీహార్, హర్యానా, ఝార్ఖండ్ రాష్ట్రాలు ఈ కూరగాయను ఎక్కువగా పండిస్తున్నాయి. బెండకాయల ఉత్పత్తి 1961లో 7.75 లక్షల టన్నులుండగా, 2022-23లో 33.24 లక్షల టన్నులకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాలు ఈ కూరగాయను ఎక్కువగా పండిస్తున్నాయి. ఇలాగే బఠానీ, చిలగడదుంప, తీగ పంటలైన బీర, సొర, పొట్ల, కాకర, దొండ, బీన్స్, చిక్కుడు వంటి కూరగాయల ఉత్పత్తిలో కూడా ఎంతో కొంత వృద్ధి ఉండటం వల్లనే, దేశం కూరగాయల లభ్యత విషయంలో స్వయం సమృద్ధిని కలిగి ఉంది. ఐతే జనాభా పెరుగుదల సంవత్సరానికి 1.5 శాతం ఉండగా, కూరగాయలకు గిరాకీ సంవత్సరానికి మూడు శాతం కన్నా ఎక్కువగా పెరుగుతూ ఉండటం వల్ల కూరగాయల విస్తీర్ణంతో పాటు దిగుబడులు కూడా పెరుగుతున్నా సరిపోవటం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల సాగు
కూరగాయల సాగు, ఉత్పత్తి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు కొంత వెనకబడే ఉన్నాయి. 2017లో భారత ప్రభుత్వం ప్రచురించిన స్టాటిస్టికల్ ఇయర్ బుక్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 2.44 లక్షల హెక్టార్లలో కూరగాయల సాగు జరిగింది. 28.54 టన్నుల హెక్టారు దిగుబడితో 69.81 లక్షల టన్నుల కూరగాయల ఉత్పత్తయి, దేశంలోని రాష్ట్రాలలో పదవ స్థానంలో నిలిచింది. తెలంగాణాలో 1.39 లక్షల హెక్టార్లలో కూరగాయల్ని పండించారు. 19.78 టన్నుల సగటు దిగుబడితో 27.54 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తయి, దేశంలోని రాష్ట్రాలలో 15వ స్థానంలో నిలిచింది. తెలంగాణా ఉద్యానవన శాఖ అంచనాల ప్రకారం కూరగాయల తలసరి లభ్యత రోజుకి 250 గ్రాములు మాత్రమే. జాతీయ పోషక విలువల అధ్యయన సంస్థ ప్రకారం రోజుకి 32.5 గ్రాములు అవసరం. దానితో పోలిస్తే 23 శాతం కొరత ఉన్నట్లు అర్థమౌతున్నది. టమాట, వంగ, కాబేజి, కాలీఫ్లవర్, దోస, కారట్, ముల్లంగి పంటల్లో తెలంగాణ కొంత మిగులు కలిగి ఉంటే, ఉల్లి, ఆలుగడ్డ, ఆకుకూరలు, కాకర, బీర, పచ్చిమిర్చి, బెండ, సొర, బీన్స్, కాప్సికం, చేమ, కందలతో పాటు ఇతర కూరగాయల విషయంలో కొరతను ఎదుర్కుంటున్నది. కూరగాయల ఉత్పత్తిని పెంచటానికి ‘పంటకాలనీ’లను ప్రోత్సహిస్తామని ఉద్యానవన శాఖ కార్యాచరణ ప్రకటించింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో 36.5 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తయినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. 2017 కి అది 27.34 లక్షల టన్నులకు తగ్గగా తాజా అంచనాల ప్రకారం 2022-23లో 13.05 లక్షల టన్నులకు మరింత తగ్గింది. కూరగాయల భారీ దిగుమతులపై రాష్ట్రంలోని నగరాలన్నీ ఆధారపడుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ పండ్ల ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానానికి చేరుకున్నది. 7.5 లక్షల హెక్టార్లలో పండ్ల తోటలుండగా 180 లక్షల టన్నుల పండ్లు ఉత్పత్తయినట్లు అంచనా వేశారు. కాని కూరగాయల ఉత్పత్తి మాత్రం 64.46 లక్షల టన్నులకే పరిమితమై, తొమ్మిదవ స్థానంలో నిలిచింది. 2020-21లో ఆంధ్రప్రదేశ్లో కూరగాయల సాగు 2.64 లక్షల హెక్టార్లలో జరిగి, 75.38 లక్షల టన్నులు ఉత్పత్తయినట్లు రాష్ట్ర ఉద్యాన వన శాఖ ప్రకటించింది. కానీ తర్వాతి రెండు సంవత్సరాల్లో కూరగాయల ఉత్పత్తి 2020-21 స్థాయిని అధిగమించలేదు. టమాట, మిర్చి, కాప్సికం, బెండ, వంగ, కొన్ని ఆకుకూరల విషయంలో మిగులు ఉత్పత్తి ఉన్నా, ఇతర కూరగాయల విషయంలో కొరత ఉంది. పండ్లు, చేపలు, రొయ్యలు, గ్రుడ్ల వంటి ఉత్పత్తుల విషయంలో అగ్రస్థానంలో ఉన్నా కూరగాయల విషయంలో దేశంలో 9, 10 స్థానాల్లోనే నిలుస్తున్నది. కూరగాయల తలసరి లభ్యత జాతీయ సగటుకి సమీపంలోనే తారసలాడుతున్నది.
సాగు లాభదాయకత
కూరగాయల సాగు విస్తీర్ణంలో పెరుగుదల కనిపిస్తుందంటే వాటి సాగు లాభదాయకంగా ఉందనే విషయం స్పష్టమౌతున్నది. వరి పంటలో నికరాదాయం హెక్టారుకి 50 నుండి 60 వేల రూపాయల ఆదాయం నికరంగా లభిస్తుండగా, కూరగాయల పంటల నుండి హెక్టారుకి ఒక లక్షల రూపాయల నుండి లక్షన్నర రూపాయల వరకు నికరాదాయం లభించే అవకాశముంది. పలు అధ్యయనాలు ఈ విషయాన్ని స్పష్టం చేసాయి. అయితే ప్రతి సీజన్లోనూ ఇది జరుగుతుందని చెప్పలేము. వర్షాబావం, అధిక వర్షాలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు, కొన్నిసార్లు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. మార్కెట్లో కూరగాయ ధరలు ఒక్కోసారి పతనమై, ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉంటుంది. కానీ నాలుగైదు సీజన్ల సగటు ఆదాయాలను లెక్కిస్తే సాంప్రదాయంగా పండించే గింజధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలతో పోలిస్తే కూరగాయ పంటల ద్వారా రెట్టింపు ఆదాయం లభిస్తుందనే అవగాహన కలుగుతుంది. కూరగాయల ధరల సూచీ సాంప్రదాయ పంటల ధరలతో పోలిస్తే వేగంగా పెరిగింది. 2012లో 100గా ఉన్న కూరగాయల ధరల సూచీ 2023 ఆగస్టు నాటికి 250కి పెరిగింది. 2012లో వడ్ల మద్దతు ధర క్వింటాలుకి రూ. 1250గా ఉండగా, అది 2023కి రూ. 2183 కి పెరిగింది.
11 సంవత్సరాల వ్యవధిలో వరి మద్దతు ధర 75 శాతం పెరిగింది. ఇదే సమయంలో కూరగాయల ధరల సూచీ 150 శాతం పెరిగింది. ప్రజల ఆహార అలవాట్లలో వచ్చిన మార్పుల కారణంగా కూరగాయలకు గిరాకీ స్థిరంగా పెరుగుతున్నది. కూరగాయల సాగు కూడా అనేక కొత్త పుంతలు తొక్కుతున్నది. ఎత్తైన బెడ్లు తయారు చేయటం, వాటిపై ప్లాస్టిక్ షీట్లను పరచడం, బిందు, తుంపర సేద్యాల ద్వారా నీరు సరఫరా చేస్తూ, మొక్కలకు అవసరమైనప్పుడు కర్రల ఊతాన్నందిస్తూ, పందిళ్ళపై పాకించటానికి వేర్వేరు పదార్థాలను వాడుతూ, సూక్ష్మపోషక పదార్థాలను అందిస్తూ అనేక మెరుగైన సేద్యపు పద్ధతులను వాడుతున్నారు. వీటన్నిటికీ అదనపు పెట్టుబడిని పెడుతున్నారు. అనేక కూరగాయల్లో సంకర రకాలను వాడుతున్నారు. నర్సరీలో పెరుగుతున్న మొక్కలను అధిక ధరకు కొనుగోలు చేసి, సమయాన్ని ఆదా చేస్తున్నారు. ఈ చర్యలన్నీ దిగుబడులను పెంచటానికి ఉపయోగపడుతున్నాయి. అధునాతనమైన షేడ్నెట్లు, గ్రీన్హౌస్లను కూడా కొందరు వినియోగిస్తున్నారు. కూరగాయల సాగులో వ్యవసాయం పెట్టుబడి సాంద్రత కల్గిన వాణిజ్యంగా మారుతున్నది. కొందరు దిగుబడి తగ్గినా సేంద్రియ పద్ధతుల్లో నాణ్యమైన, ఆరోగ్యకరమైన కూరగాయల్ని పండిస్తున్నారు. సేంద్రియ కూరగాయలకు మార్కెట్ గిరాకీ క్రమేపీ పెరుగుతున్నది. రసాయనిక ఎరువుల్ని, పురుగుమందుల్ని ఎక్కువగా వాడకుండా ‘బాధ్యతాయుత’ వ్యవసాయం చేస్తున్న రైతులు, సేంద్రియ కూరగాయలకు ఎక్కువ ధరను చెల్లించటానికి సిద్ధపడుతున్న వినిమయదారులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహిస్తున్నారు. శాఖాహారం, వీగన్ ఉద్యమాలు కూడా ప్రపంచమంతటిలాగానే భారతదేశంలో కూడా బలపడుతున్నాయి. ఈ పరిస్థితులన్నీ కూరగాయలకు మరింత గిరాకీని పెంచేలా ఉన్నాయి. కూరగాయల సాగు మరింత విస్తీర్ణాన్ని ఇతర పంటల నుండి ఆకర్షించవచ్చు. కూగరాయల ఎగుమతి అవకాశాలు కూడా భవిష్యత్లో మరింత పెరగవచ్చు. ఇప్పటికి కేవలం మూడు శాతం కూరగాయలనే శుద్ధి చేసి, విలువను జోడిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడుతున్న ప్రవాస భారతీయుల సంఖ్య పెరిగే కొద్దీ తాజా కూరగాయలు, శుద్ధి చేసిన కూరగాయలకు ఎగుమతి అవకాశాలు పెరగవచ్చు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూరగాయల సాగుకి ప్రోత్సాహకాలనందించి స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తాయని ఆశిద్దాము.
ఈ మధ్యకాలంలో ఆవులలో ముఖ్యంగా ఒంగోలు ఆవులలో తిరిగి పొర్లడం అనే సమస్య మనం ఎక్కువగా గమనించవచ్చు. దీనికి కారణం ముఖ్యంగా గర్భవాతం, ఆరోగ్యం సరిగా లేకపోవడం, అండాశయ తిత్తులు మొదలైనవి.
పాడి పశువులలో అండాశయ ప్రాబల్యం 9-16 శాతం వరకు ఉంటుంది.
దీని వలన ఈతకు మరియు గర్భధారణకు మధ్య వ్యవధి 20-30 రోజులు పెరుగుతుంది.
ఆవులలో ఈతల సంఖ్య పెరిగేకొద్ది అదేవిధంగా అధిక పాల ఉత్పత్తి కారణంగా ఈ అండాశయ నీటి తిత్తులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వేసవిలో తీవ్రమైన వేడి ఒత్తిడి కారణంగా ఆవులలో అండాశయ తిత్తులు ఏర్పడుట అధికమవుతుంది.
లక్షణాలు:
ఎదకు-ఎదకు మధ్య సమయం ఎక్కువగా లేదా తక్కువగా ఉండటం మనం గమనించవచ్చు. ఎద సమయం 2-3 రోజులు ఉంటుంది.
మట్టు ఎక్కువ పరిమాణంలో తరుచుగా వేస్తూ ఉంటుంది.
తోక మొదలులో లావుగా, ఎత్తుగా ఉంటుంది.
ఆవుకి మేపు సరిగా లేనప్పుడు సానుకూల శక్తి సమతుల్యత దెబ్బ తినడం వలన, హార్మోనుల సమతుల్యత ఏర్పడి మగ పశువు వలే దేహదారుఢ్యం సంతరించుకుంటుంది.
పైన తెలిపిన లక్షణాలు ఎక్కువ కాలం ఉన్నట్లు అయితే గర్భంలోకి మట్టు చేరి గర్భం యొక్క పరిమాణం పెరుగుతుంది. దీని వలన పరీక్ష చేసిన యెడల చూడి పశువుగా భావించే అవకాశం ఉంటుంది.
కారణాలు:
హార్మోన్ల సమతుల్యం దెబ్బతినడం వలన అండాశయం నుండి విడుదల అవ్వవలసిన అండం విడుదల అవ్వకుండా, అండాశయం మీద పుటిక పెద్దగా పెరిగి నీటితిత్తుగా పరిణామము చెందుతుంది.
శరీరంలో జీవక్రియలు అసమానతలకు లోనయినప్పుడు, మరియు గర్భవాతం ఎక్కువ రోజులు ఉన్న యెడల, పశువును ఎప్పుడూ కట్టేసి మేపడం వలన, ఒంట్లో కొవ్వు శాతం పెరిగి పోవడం వలన మరియు జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
మాంసకృత్తులు అధికంగా ఉన్న దాణా ఎక్కువ మోతాదులో ఇవ్వడం వలన (ఉదా: ఉలవలు)
ఈస్ట్రోజన్లు అధికంగా ఉన్న గడ్డి జాతులు (ఉదా: పిల్లిపెసర, చెరకు దవ్వ) అధిక మోతాదులో మేపడం వలన.
నివారణ:
ఆవు ఈనిన తరువాత 3-5 నెలలలో తప్పనిసరిగా చూడి కట్టే విధంగా చూసుకోవాలి.
పాలు ఇస్తుంది కదా అని ఎక్కువ మంది రైతులు చూలి కట్టించడం మీద దృష్టి పెట్టకుండా ఎక్కువ కాలం దూడకు వదులుతారు.
ఎప్పుడూ పాకలో కట్టే ఉంచకుండా పొద్దున, సాయంత్రం కనీసం రెండు గంటలు ఆవులను తిరగనివ్వాలి.
సరైన మోతాదులో మేత మరియు దాణా అందించాలి.
సూర్యరశ్మి ఎక్కువ సేపు పశువు యొక్క శరీరంకు తగిలే విధంగా చూసుకోవాలి.
దీని వలన పశువుకు విటమిన్-డి అందుతుంది. ఒంట్లో కొవ్వు శాతం నియంత్రణలో ఉంటుంది. దీనివలన పశువులలో జీవక్రియ ఆరోగ్యవంతంగా జరుగుతుంది.
త్వరితగతిన (3-5 నెలలు) చూలి కట్టిస్తే పాల దిగుబడి తగ్గిపోతుందనే అపోహను రైతు సోదరులు విడనాడి సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించినచో ఆవులలో అండాశయ నీటితిత్తుల సమస్యను అధిగమించి ఆర్థికంగా లాభపడతారు.
పుట్టిన ప్రతి జీవీ మరణించవలసిందే. మరణం నుంచి ఏ జీవీ తప్పించుకోలేదు. ఈ అనంతకోటి జీవరాశిలో మనం కూడా ఉన్నాము కాబట్టి మనుషులమైన మనం కూడా ఏదో ఒక రోజు మరణించవలసిందే. మరణాన్ని ఎవరూ ఆపలేరు. కాకపోతే ప్రస్తుతం ఉన్న వైద్య సౌకర్యాలు, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం, మన జాగ్రత్తలతో మరణాన్ని వాయిదా వేయవచ్చు కాని మరణాన్ని మాత్రం ఆపలేము. మనందరికి మరణం తప్పదు కాబట్టి మనమందరం ఏదో ఒక రోజు మరణించవలసిందే కాబట్టి, మరణిద్దాం. కానీ క్యాన్సర్తో మాత్రం మరణించవద్దు అంటున్నాడు హైదరాబాద్, అల్వాల్కు చెందిన కటకం విజయ్.
విజయ్ది వ్యవసాయ నేపథ్యం కాదు. వారి తండ్రి, తాతలకు వ్యవసాయంతో ప్రత్యక్ష అనుబంధం లేదు. ఉన్నత చదువులు చదివిన విజయ్ ప్రయివేటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయములో కొన్ని వ్యక్తిగత కారణాల వలన ప్రభుత్వ ఉద్యోగం తప్పనిసరి అయ్యి, పట్టుదలతో చదివి కేవలం రెండు నెలలు శిక్షణతో సిండికేట్ బ్యాంకులో మంచి ఉద్యోగం సాధించి కొనసాగిస్తుండగా తన సమీప బంధువులు, స్నేహితులు కొందరు క్యాన్సర్ బారిన పడి మరణించడం జరిగింది. తన పెదనాన్న మరియు బావ క్యాన్సర్ బారిన పడి చనిపోవడం విజయ్ అతి సమీపము నుంచి చూడడం జరిగింది. ఈ సమయములో క్యాన్సర్ కారకాల గురించి పరిశీలించడం జరిగి అవకాశము ఉన్న ఏ మాధ్యమాన్ని వదలకుండా క్యాన్సర్ గురించి కక్షుణ్ణంగా అధ్యయనం చేసి తాను తెలుసుకున్న విషయం… ”వివిధ రంగాలకు చెందిన అనేకమంది వ్యక్తుల బాధ్యతారాహిత్య ప్రవర్తనల కలయికే క్యాన్సర్కి ప్రధాన కారణం”
అని విజయ్ చెబుతున్నాడు. మనం రోడ్డు మీద తినే బజ్జీలు, పునుగుల దగ్గర నుంచి, ఫార్మాలిన్ లాంటి రసాయనాలు కలిపిన పాలు, విష రసాయనాలతో పండించే ఆహార పదార్థాలు… ఈ విధంగా చెప్పుకుంటూపోతే వివిధ రంగాలకు చెందిన అనేకమంది వ్యక్తుల యొక్క బాద్యతా రాహిత్యమే క్యాన్సర్కి కారణమని విజయ్ అర్థం చేసుకున్నాడు.
సిండికేట్ బ్యాంకులో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో తన పెదనాన్న మరియు స్నేహితులు క్యాన్సర్తో మరణించడాన్ని గమనించిన విజయ్ తనవంతుగా క్యాన్సర్ సమస్యకు కొంతలో కొంత పరిష్కారం సమాజానికి అందించాలని తలచి కుటుంబ సభ్యుల అంగీకారంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదలి సేంద్రియ సాగులో అడుగు పెట్టాడు. సమాజంలో ఉన్న క్యాన్సర్ సమస్యకు మనం తినే ఆహార పదార్థాలలో ఉండే విష రసాయనాలు కూడా కారణమని తెలుసుకుని తనవంతుగా విష రసాయన అవశేషాలు లేని ఆహార పదార్థాలను సమాజానికి అందించాలనే లక్ష్యంతో చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదలి ఏ మాత్రం అవగాహన లేని వ్యవసాయరంగంలో అదీను సేంద్రీయ వ్యవసాయరంగంలో 8 సంవత్సరాల క్రితం అడుగుపెట్టాడు.
సొంత పొలం లేదు కాబట్టి హైదరాబాదు శివారు ఘట్కేశర్ సమీపములోని అవిశాపూర్లో పొలం కౌలుకు తీసుకుని సేంద్రియ సాగు మొదలు పెట్టాడు. వరి, మామిడి, వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల సాగుతో పాటు కొన్ని నాటుకోళ్ళను కూడా పోషించుకుంటూ వస్తున్నాడు. సేంద్రియ సాగులో వివిధ రకాల పద్ధతులున్నాయని గ్రహించి ఏదో ఒక పద్ధతి పైనే గుడ్డిగా ఆధారపడకుండా అన్ని రకాల పద్ధతులలో తనకు అనుకూలమైన అంశాలను తన పంటల సాగులో అమలు పరుస్తూ ముందుకు సాగుతున్నాడు. ఏమాత్రం అనుభవం లేని రంగం, అదీను శారీరక శ్రమ ఎక్కువ అవసరమున్న సేంద్రియ సాగును ఎంచుకున్నాడు కాబట్టి మొదటలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. సేంద్రియ సాగులో చీడపీడల నివారణ పెద్ద సమస్యగా ఉంటుంది. చీడపీడల నివారణకు వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు క్రమం తప్పకుండా పంటలపై పిచికారి చేయవలసి ఉంటుంది. కషాయాలు, ద్రావణాలు తయారు చేయడానికి, తయారు చేసిన వాటిని పంటలపై పిచికారి చేయడానికి మానవ వనరుల అవసరం ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో మానవ వనరుల కొరత ఉన్న పరిస్థితులలో ఎక్కువ మానవ వనరులు అవసరమైన సాగు పద్ధతులను పాటించడం అంటే కత్తి మీద సాము చేస్తున్నట్లే. అయినా కాని ఏ మాత్రం వెనుకంజ వేయకుండా పట్టుదలతో ముందుకు సాగుతూ ఆరోగ్యకరమైన దిగుబడులు తీయగలుగుతున్నాడు. తీసిన దిగుబడులను మధ్యవర్తులకు అందించినట్లయితే ధర ఆశాజనకంగా ఉండడము లేదు. దానికి పరిష్కారంగా నేరుగా వినియోగదారులకు అమ్మకం చేయటానికిగాను సికింద్రాబాదు అల్వాలు ప్రాంతంలో సేంద్రియ ఉత్పత్తుల అమ్మకపు దుకాణాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కొంతమందికి నేరుగా ఇళ్ళ వద్దకు సేంద్రియ ఆహారాలను చేరవేస్తున్నారు.
8 సంవత్సరాల ప్రయాణంలో వినియోగదారుల నమ్మకాన్ని చూరగొని, వినియోగదారుల సంఖ్యను ఏరోజుకారోజు పెంచుకుంటూ పోతున్నారు. వినియోగదారులకు అవసరమయిన వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువ సంఖ్యలో అందించాలంటే ఇంకా ఎక్కువ పొలం అవసరం పడటాన్ని గుర్తించి ఇటీవల హైదరాబాదు శివారు శామీర్పేటలో పండ్ల తోటను కౌలుకు తీసుకున్నారు. ఆ తోటలో జామ, సీతాఫలం, మునగ లాంటి పంటలు దిగుబడినిస్తున్నాయి. వీటికి తోడు వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయల సాగు మొదలు పెట్టి మొత్తం 10 ఎకరాలపైగా భూమిలో పూర్తి సేంద్రియ పద్ధతులతో వివిధ రకాల ఆహార పంటలు పండిస్తున్నారు.
వినియోగదారులకు సంవత్సరం పొడవునా కూరగాయలు, ఆకుకూరలు అందించాలనే లక్ష్యంతో పొలాన్ని భాగాలుగా విభజించుకొని ఒక పొలంలో దిగుబడి పూర్తి అయ్యే సమయానికి వేరే పొలంలో దిగుబడి మొదలయ్యేలా ప్రణాళిక వేసుకుని సాధ్యమైనంత వరకు ఎక్కువ మొత్తం ఆహార ఉత్పత్తులను, ఎక్కువ రకాలు, ఎక్కువ రోజులు అందించాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నాడు. తమ వద్ద అందుబాటులో లేని వ్యవసాయ ఉత్పత్తులను తోటి సేంద్రియ రైతుల వద్ద నుంచి సేకరించి తోటి రైతులకు మంచి ధరను అందిస్తున్నారు.
సేంద్రియ సాగులో విత్తనానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి కొన్ని పురాతన వరి రకాలను సాగు చేస్తున్నారు. కూరగాయల విషయానికొస్తే మన పాత తరం వారు ఉపయోగించిన లేదా ప్రస్తుతం మన చుట్టుప్రక్కల అందుబాటులో లేని కూరగాయ విత్తనాలు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ నుంచి సేకరించి తన పొలంలో సాగు చేస్తూ అంతరించి పోతున్న విత్తనాలను కాపాడుతున్నాడు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంకరజాతి మరియ అభివృద్ధిపరచిన విత్తనాలలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడముతో పాటు ఆ విత్తనాల ద్వారా వచ్చిన పంటలో పోషకాలు సక్రమంగా ఉండటము లేదు కాబట్టి వాటిని ప్రక్కన పెట్టి మన పురాతన నాటు రకాలను ఉపయోగిస్తున్నారు. పురాతన నాటు రకాలలో పోషకాలు సక్రమంగా ఉంటాయి కాబట్టి తాము పండిచిన ఆహారం తినే వినియోగదారులకు ఆరోగ్యకర ఆహారాన్ని అందించవలసిన బాధ్యత తమదే అని భావించి అందుకు అవసరమయిన చర్యలు చేపడుతూ తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి ముందు సాగుతున్నాడు. మరిన్ని వివరాలు 93984 60227 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
నా అర్థాంగి రత్నక్రాంతి సహకారం వలననే
సేంద్రియ సాగులో కొనసాగగలుగుతున్నాను
మనదేశంలోని చదువుకున్న యువతలో ఎక్కువమంది అంతిమ లక్ష్యం లేదా స్వప్నం ప్రభుత్వ ఉద్యోగం. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించటానికి అవిశ్రాంతంగా ఏళ్ళకు ఏళ్ళు శ్రమిస్తూ ఉంటారు. అర్హత వయస్సు సమీపించే వరకు కూడా కొంతమంది తమ ప్రయత్నాలను ఆపరు. అర్హత వయస్సు అయిపోయిన వారు నిరాశతో వారి ప్రయత్నాన్ని ఆపి వేరే ఉపాధి అవకాశాలు వైపు అడుగులు వేస్తారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని కేవలం రెండు నెలల్లో సాధించి, కేవలం 8 నెలల్లో వదలి వేస్తానంటే ఏ మహిళా అంగీకరించకపోవచ్చు. కాని విజయ్ అర్థాంగి రత్నక్రాంతి పెద్ద మనసుతో అంగీకరించి, తాను ఉద్యోగాన్ని వదలి సేంద్రియ సాగులో ప్రవేశించడానికి ప్రోత్సహించడంతోపాటు ప్రస్తుత పంటల సాగులో తన వంతు పాత్రను పోషిస్తుంది కాబట్టే తాను ముందుకు సాగగలుగుతున్నానని వివరిస్తూ అన్ని సమయాలలో తన వెన్నంటి ఉండి తనను నడిపించిన తన అర్థాంగికి విజయ్ కృతజ్ఞతలు తెలియచేశారు.
వ్యవసాయం చేయడం కంటే
ప్రభుత్వ ఉద్యోగం సాధించడం సులభం
తన ఈ 8 సంవత్సరాల సేంద్రియ సాగు అనుభవంలో అనేక కష్టనష్టాలను భరించవలసి వచ్చింది. వ్యవసాయంలో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు సేంద్రియ సాగులో శారీరక శ్రమ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయినా కాని వెనుకంజ వేయకుండా ముందుకు సాగుతున్నాడు. వివిధ రకాల చీడపీడలను నివారిస్తూ, ప్రకృతివైపరీత్యాలను ఎదుర్కొంటూ స్వేదం చిందించి సేద్యం చేసి సాధించిన ఆరోగ్యకరమైన దిగుబడులను గిట్టుబాటు ధరలకు అమ్ముకోవడం పెద్ద సవాలు. అయినా కాని అన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ తన లక్ష్య సాధనలో ముందడుగు వేస్తున్నాడు. తన ఈ 8 సంవత్సరాల వ్యవసాయ అనుభవంలో వ్యవసాయం చేయడం కంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించటం సులభం అని గ్రహించినా కూడా వెనుకంజ వేయకుండా విజయ్ ముందుకు సాగుతున్నాడు.
సంవత్సరానికి రెండుసార్లు క్యాన్సర్ హాస్పిటల్ని సందర్శించండి
ఏదైనా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. కోల్పోయినప్పుడే దేని విలువైనా తెలుస్తుందనే విషయం మనకు మామూలే. కోల్పోవడము గురించి మాట్లాడితే కొన్ని కోల్పోతే మరలా, మరలా పొందవచ్చు. కానీ కొన్ని కోల్పోతే పొందే అవకాశాలు ఉండవు. అంటే అలాంటివి ఒకసారి కోల్పోతే మరలా పొందటానికి అవకాశము లేదు కాబట్టి అలాంటి వాటిని పోగొట్టుకోకుండా తప్పనిసరిగా కాపాడుకోవలసిందే. ఇంకా విపులంగా అర్థం కావాలంటే మన శరీరం ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వరం. మన శరీరంలోని అన్ని భాగాలు చాలా చాలా విలువైనవి. కాని మనము వాటి విలువను తెలుసుకోలేకపోతున్నాము. మనకు ఉచితంగా లభించాయి కాబట్టి మన శరీరంలోని అవయవాల యొక్క విలువ మనం తెలుసుకోలేకపోతున్నాము. ఉదాహరణకు కన్ను యొక్క విలువ కన్ను లేని వారిని అడిగితే చెప్పగలరు. అదేవిధంగా మిగతా శరీర అవయవాల విలువ తెలియాలంటే అవి పాడైపోయిన వారిని అడిగితేనే తెలుసుకునే పరిస్థితులలో మనం ఉన్నాం కాబట్టే మన అవయవాలను పాడు చేసుకునే జీవనశైలి వెనకాల మనం పరిగెడుతున్నాము.
ఈ విధంగా పరిగెడుతున్నామంటే మనకున్న జ్ఞానాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకోలేక పోతున్నాము. కొన్నికొన్నిసార్లు మన కంటే జంతువులు చాలా రెట్లు మేలు అనిపించేలా మనుషుల ప్రవర్తనలు ఉంటున్నాయి. ఇది సరైన పరిణామం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు తమ జ్ఞానాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా జీవించటానికి ఉపయోగించుకోవాలి. ఆరోగ్యం యొక్క విలువ తెలియాలంటే ప్రత్యేకించి క్యాన్సర్ సమస్య వలన ఉత్పన్నమయ్యే సమస్యల గురించి తెలియాలంటే సంవత్సరానికి రెండుసార్లు తమ సమీపములో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి కొంత సమయాన్ని కేటాయించండి. క్యాన్సర్ హాస్పిటల్ని సందర్శించిన తరువాత మీలో వచ్చే మార్పులను గమనించండి. మీకు మీరే ఆరోగ్యకర జీవనశైలి వైపు అడుగులు మొదలు పెడతారు. క్యాన్సర్ మహమ్మారితో ఇబ్బందులు ఎదుర్కొని మరణించిన మా బావ, మా పెద్దనాన్న పడ్డ ఇబ్బందులను నేను అతి సమీపము నుంచి చూడడముతోపాటు వారికోసం నేను కొన్ని రోజులు క్యాన్సర్ హాస్పటల్స్లో గడపడం జరిగింది. కాబట్టి నాకు ఆరోగ్యం మొక్క విలువ తెలిసింది కాబట్టి తోటివారికి తెలియ చేయాలనే లక్ష్యంతో క్యాన్సర్ హాస్పటల్ని సందర్శించండి అని చెబుతున్నానని విజయ్ వివరించాడు.
మనది వ్యవసాయక దేశం. ఒకప్పుడు 90 శాతానికి పైగా, ప్రస్తుతం 60 శాతానికి పైగా ప్రజలు మన దేశంలో వ్యవసాయం మరియు దాని అనుబంధరంగాలపై ఆధారపడి జీవితాలను కొనసాగిస్తున్నారు. స్వేదం చిందిస్తూ సేద్యం చేస్తూ పంటలు సాగు చేసి ప్రజల ఆకలిని తీర్చే చాలామంది రైతులు తమ కడుపులను కాల్చుకొంటున్నారనే విషయం అక్షర సత్యం. వ్యవసాయం చేసి పంటల సాగు చేస్తున్నారు కాని ఎక్కువమంది రైతులు తమ పంటలసాగులో ఆర్థికంగా నష్టాలను భరించవలసి వస్తుంది. పంటలసాగు లాభదాయకంగా లేకపోవడానికి వివిధ రకాల కారణాలున్నాకాని పెట్టుబడులు పెరగటంతోపాటు సరైన సమయంలో సక్రమంగా వ్యవసాయ పనులు చేయలేకపోవడం ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. వ్యవసాయం ఎక్కువగా వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి రైతులందరికి ఒకే సమయములో వ్యవసాయ పనులు మొదలు అవుతాయి కాబట్టి ఒకే సమయంలో అందరి పొలంలో వ్యవసాయ పనులు నిర్వహించడానికి కూలీలు అందుబాటులో ఉండకపోవడం అనే విషయం సర్వసాధారణం. అనుకున్న సమయానికి కూలీలు అందుబాటులో లేకపోవడం వలన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు కూలీలకు ఎక్కువ డబ్బు చెల్లించవలసి రావడమే కూడా జరిగి కూలీల ఖర్చు పెరిగి పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా కూలీల కొరతను అధిగమించడానికి ఫార్మ్ సంస్థ వారు ఒక రోబోను తయారు చేశారు.
మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం కొంచెం నిదానించిందని చెప్పవచ్చు. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఏదిఏమైనాకాని గతంతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో సాంకేతికపరమైన యంత్రాలు, పనిముట్లు వ్యవసాయరంగంలో ప్రవేశపెట్టడంలో కొంచెం వేగం పెరిగిందనవచ్చు. గతంలో పంటలసాగులో శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉండేది. ఒకప్పుడు పంటలపై ఏమైనా పిచికారి చేయాలంటే 10-15 లీటర్ల ట్యాంకును వీపున వేసుకుని నాజిల్ అమర్చిన రాడ్ను చేతులతో ముందుకు, వెనుకకు లాగుతుంటే ఆ పరికరానికి అమర్చిన నాజిల్ ద్వారా మందులు పంటలపై పిచికారి జరుగుతుంటాయి. వరి కోతకోయాలన్నా, కంది, పెసర, మినుము, శనగ, మొక్కజొన్న మొదలగు పంటలు కోయాలన్నా మానవ వనరులనే ఉపయోగించేవారు. కాని ఇటీవలకాలంలో ఇలాంటి పనులు చేయడానికి యంత్రాలు రావడం అనేది రైతులకు దొరికిన అదృష్టంగా భావించవచ్చు.
అయినా కాని మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయ రంగంలో యంత్ర పరికరాల అవసరాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ విషయాలను గుర్తించిన నిపుణులు, యువత, ప్రభుత్వాలు.. వ్యవసాయంలో కొత్త కొత్త యంత్ర పరికరాల ఆవిష్కరణ కొరకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల ఫలితమే వ్యవసాయంలో ఎన్నో కొత్త యంత్రాలు, పరికరాలు రావడం జరిగింది. ఇటీవలకాలంలో వ్యవసాయంలో ప్రవేశపెట్టిన కొత్త యంత్ర పరికరాల గురించి ప్రస్తావించవలసి వస్తే డ్రోన్ గురించి చెప్పుకోవచ్చు. ఇప్పుడు డ్రోన్ సరసన రోబో కూడా చేరింది. డ్రోన్తో కేవలం పిచికారి మాత్రమే చేయవచ్చు. కాని రోబోతో వివిధ రకాల వ్యవసాయ పనులు చేయవచ్చు అని వివరిస్తున్నారు ఫామ్ రోబో సంస్థ ప్రతినిధి రాధాకృష్ణ.
ఎద్దుల అరకతో, పవర్ వీడర్తో చేసే పనులయినటువంటి అంతర సేద్యం, రోటోవేటర్, కలుపు నివారణ కొరకు ఉపయోగించే గొర్రు, గుంటకల లాంటి వివిధ రకాల అంతర సేద్యం పనులు ఈ రోబోతో చేసుకోవచ్చు. మందుల పిచికారికి కూడా రోబోను ఉపయోగించు కోవచ్చు. ఈ రోబో సుమారు 500 కిలోల వరకు బరువు మోయగల సామర్థ్యం కలది కాబట్టి అంత బరువు గల వ్యవసాయ ఉత్పత్తులను, పశుగ్రాసాలను కూడా రవాణా చేసుకోవడము కొరకు ఈ రోబోను ఉపయోగించుకోవచ్చు. రోబో బ్యాటరీతో నడుస్తుంది కాబట్టి ఖర్చు కూడా చాలా తక్కువగా అవుతుంది కాబట్టి పంటల సాగులో పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడానికి మంచి ప్రత్యామ్నాయం రోబో అని చెప్పవచ్చు. రోబోను ఆపరేట్ చేయడం కూడా చాలా సులభంగా ఉంటుంది. చిన్న పిల్లలు వీడియో గేమ్ ఆడుతున్నట్లు ఈ రోబోను ఆపరేట్ చేయవచ్చు కాబట్టి ఎవరైనా రోబోను చాలా సులభంగా ఆపరేట్ చేయవచ్చని రాధాకృష్ణ వివరించాడు. మరిన్ని వివరాలు 9154153922 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
రసాయనిక వ్యవసాయం వలన జరిగిన, జరుగుతున్న అనర్థాలనుండి బయటపడటానికి సేంద్రియ సాగు వెలుగులోకి వచ్చింది. సేంద్రియ సాగు గురించి ప్రపంచం మొత్తం అనేకమంది అధికారులు, నిపుణులు, రైతులు, శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో ఎవరిపరిధిలో వారు కృషి చేస్తున్నారు. మన దేశంలో సేంద్రియ సాగు గురించి మాట్లాడుకుంటే గతంలో అంటే వ్యవసాయంలో రసాయనాలు ప్రవేశపెట్టకముందు మన రైతులందరూ సేంద్రియ సాగు పద్ధతులే పాటించారు. అప్పట్లో ప్రతిరైతు ఇంట్లో పాడి పశువులు, కోళ్ళు, గొర్రెలు, మేకలు లాంటివి తప్పనిసరిగా ఉండేవి. వాటి వ్యర్థాలను పంటల సాగుకు అందిస్తూ, పంట వ్యర్థాలను వీటికి అందిస్తూ మన రైతులు తమ జీవితాలను కొనసాగిస్తూ వస్తున్న క్రమంలో అప్పట్లో పెరుగుతున్న ప్రజల ఆహార అవసరాలను తీర్చే లక్ష్యంతో గ్రీన్ రెవల్యూషన్ పేరుతో వ్యవసాయంలో రసాయనాలు మరియు అధిక దిగుబడిని ఇచ్చు వంగడాలను ప్రవేశపెట్టడము జరిగింది. అనుకున్న లక్ష్యం నెరవేరి ప్రజల ఆకలి తీరింది కాని వివిధ రకాల కారణాల వలన రైతులు పాడికి దూరం జరగడముతోపాటు పంటల సాగులో విచక్షణారహితంగా రసాయనాలు వినియోగించడానికి అలవాటుపడ్డారు. విచక్షణారహిత రసాయనాల వినియోగం వలన నేల, నీరు, వాతావరణం కలుషితం అవటంతోపాటు ఆహార పదార్థాలలో ఉన్న విష రసాయనాలు ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా మన రైతులు తిరిగి సేంద్రియ సాగు వైపు మరలవలసిన అవసరాన్ని గురించి ప్రభుత్వాలు, అధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలు, రైతులు ఎవరిపరిధిలో వారు కృషి చేశారు. ఇంకా చేస్తున్నారు. వారందరిలో సుభాష్ పాలేకర్ గారిని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సుభాష్ పాలేకర్ గారు వివిధ ప్రాంతాలు తిరుగుతూ సేంద్రియ సాగు పద్ధతులను ప్రచారం చేయడం వలన సేంద్రియ సాగు గురించి ఎక్కువ మందికి తెలియడముతో పాటు కొంత మంది రైతులు సేంద్రియ బాట పట్టారనడములో ఎలాంటి సందేహం లేదు. సుభాష్ పాలేకర్ గారు తాను ప్రచారం చేసే సేంద్రియ సాగు పద్ధతికి సుభాష్పాలేకర్ జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ అని పేరుపెట్టి, ఈ పద్ధతిలో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు మరియు ద్రావణాల గురించి విపులంగా వివరించడం వలన సేంద్రియ బాటపట్టిన ఎక్కువమంది రైతులు ఈ కషాయాలను మరియు ద్రావణాలను వినియోగిస్తూ తమ పంటల సాగును కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో వివిధ రకాల కారణాల వలన కేవలం సుభాష్పాలేకర్ ప్రచారం చేస్తున్న కషాయాలు మరియు ద్రావణాలను మాత్రమే ఉపయోగించడం వలన కొంతమంది రైతులు సరైన ఫలితాలు సాధించలేక పోవడము వలన సుభాష్పాలేకర్ గారు ప్రచారంచేస్తున్న వివిధ రకాల కషాయాలు, ద్రావణాలతోపాటు ఇతర సేంద్రియ పద్ధతులను కూడా తమ సాగులో అమలు పరచడము మొదలు పెట్టి కొనసాగిస్తున్నారు. ఈ కోవకు చెందుతాడు కరీంనగర్ జిల్లా, చొప్పదండి మండలం పెదకుర్మపల్లికి చెందిన మల్లిఖార్జునరెడ్డి.
మల్లిఖార్జునరెడ్డిది వ్యవసాయ నేపథ్యం. వారి కుటుంబానికి వివిధ రకాల పంటల సాగులో అనుభవం ఉంది. ఉన్నత చదువులు చదివిన మల్లిఖార్జున రెడ్డి అందరిలాగానే వ్యవసాయ రంగానికి దూరం జరిగి సాఫ్ట్వేర్ ఉద్యోగ రంగంలో చేరడము జరిగింది. ఆ ఉద్యోగంలో కొనసాగుతున్న సమయంలో ఆరోగ్యంగా, తృప్తిగా జీవించాలంటే వ్యవసాయరంగమే సరైనదారి అని నమ్మి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి సొంత గ్రామం తిరిగివచ్చి వ్యవసాయరంగంలో అడుగుపెట్టాడు. తాను వ్యవసాయ రంగంలో అడుగు పెట్టింది ప్రత్యేకంగా ఆరోగ్యం కాపాడుకోవడానికి కాబట్టి సేంద్రియ సాగు పద్ధతుల గురించి ఆలోచిస్తూ అప్పట్లో సుభాష్ పాలేకర్ గారి పద్ధతులతో తన సేంద్రియ సాగును మొదలు పెట్టాడు. వీరి పొలంలో గతంలో వివిధ రకాల పంటలు పండించారు కాని ప్రస్తుతం ఉన్న అధిక నీటి వసతి వలన కేవలం వరి సాగుకు మాత్రమే వీరి పొలం అనుకూలంగా ఉండడం వలన మొత్తం 16 ఎకరాలలో వరిసాగును చేస్తూ వస్తూ మధ్యలో ఒకసారి వస సాగును కూడా చేశారు. తాను సాగుచేసే పొలానికి మొదటలో కేవలం సుభాష్ పాలేకర్గారు చెప్పిన వివిధ రకాల కషాయాలు మరియు ద్రావణాలను మాత్రమే ఉపయోగిస్తూ వస్తూ తరువాత, తరువాత తోటి రైతుల ద్వారా మరియు ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్న సమాచారంతో, సుభాష్పాలేకర్ గారు చెబుతున్న ద్రావణాలతో పాటు వేస్ట్డికంపోజరు, గో-కృపామృతం, జడాన్ పద్ధతి మొదలగు సేంద్రియ పద్ధతులను పాటిస్తూ తన సాగును కొనసాగిస్తున్నాడు.
జీవామృతం, వేస్ట్డికంపోజరు, గో-కృపామృతం, జడాన్ ద్రావణాలను పెద్ద మొత్తంలో అంటే ఒక్కొక్కటి 1000 నుంచి 1500 లీటర్ల వరకు తయారు చేసుకుంటూ వారానికి ఒకసారి ఏదో ఒక ద్రావణాన్ని తప్పనిసరిగా భూమికి అందిస్తున్నారు. ద్రావణాలను భూమికి అందించడానికి కూడా వివిధ పద్ధతులను పరిశీలించి, అన్ని రకాల పద్ధతులలో తక్కువ శ్రమతో ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉండే పద్ధతిని అవలంబిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా తన 16 ఎకరాల వరి పొలానికి పోషకాలను అందించగలుగుతున్నాడు. చీడపీడల నివారణకుగాను సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అయినటువంటి లింగాకర్షక బుట్టలు, పసుపురంగు జిగురు అట్టలు, దీపపు ఎరలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరాన్ని బట్టి వస కషాయాన్ని ఉపయోగిస్తున్నాడు. 16 ఎకరాలలో వివిధ రకాల వడ్లను సాగు చేస్తున్నాడు.
కేవలం పంటల సాగు మీద మాత్రమే ఆధారపడకుండా సమీకృత వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్న మల్లిఖార్జున రెడ్డి తాను కూడా సమీకృత వ్యవసాయం చేస్తూ, అందుకొరకు కొన్ని మేకలను, కొన్ని కోళ్ళను, పాడి పశువులను పోషిస్తూ వాటి కొరకు పశుగ్రాసాలుగా సూపర్నేపియర్ మరియు థరథగడ్డిలను పచ్చి పశుగ్రాసాలుగా సాగు చేస్తూన్నాడు. వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలను ఆదరిస్తూ, కుటుంబసభ్యుల సహకారంతో పూర్తి సేంద్రియ పద్ధతులతో తన పంటల సాగుని కొనసాగిస్తూ ఆనందకర, ఆరోగ్యకర జీవితానికి సరైనదారి ఇదే అని తోటి సమాజానికి చూపిస్తున్నాడు. మరిన్ని వివరాలు 9704090613 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
వస కషాయం
ఒక కిలో వస కొమ్ములను 25 లీటర్ల నీటిలో వేసి పొయ్యి మీద పెట్టి 4 నుండి 5 గంటలు ఉడకబెట్టాలి. ఈ విధంగా చేస్తే 17 నుంచి 18 లీటర్ల కషాయం తయారవుతుంది. తయారయిన వస కషాయాన్ని వడపోసుకుని గాలి చొరబడని క్యానులో నిల్వ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి 500 లీటర్ల నీటిలో 10 లీటర్ల వస కషాయాన్ని కలిపి పంటపై పిచికారి చేస్తున్నామని మల్లిఖార్జున రెడ్డి వివరించారు.
కుటుంబ సభ్యుల సహకారంతోనే సేంద్రియ సాగులో విజయం
ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి. మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయ రంగంలో అదీను సేంద్రియ సాగులో విజయం సాధించాలంటే కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి. ప్రస్తుత సమాజాన్ని గమనించినట్లయితే ఎక్కువమంది మహిళలు వ్యవసాయ రంగం అంటే వ్యతిరేకత చూపిస్తున్నారు. వ్యవసాయరంగం అంటే ఇష్టపడే మహిళలు అతి తక్కువ మంది ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే. అందుకనే కొంతమంది మగవారికి వ్యవసాయ రంగం అంటే మక్కువ ఉన్నా కాని తమ ఇంట్లోని మహిళలు వ్యతిరేకించడం వలన వారు వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టలేక పోతున్నారు. కొంతమంది మగవారు తమ ఇంట్లోని మహిళలను వ్యతిరేకించి వ్యవసాయరంగంలోకి అడుగుపెడుతున్నారు. మల్లిఖార్జున రెడ్డికి అలాంటి సమస్యలు ఏమీ ఎదురుకాలేదు. ప్రస్తుత సమాజంలో ఎక్కువమంది ఇష్టపడే సాఫ్ట్వేర్ రంగంలో మంచి జీతం పొందుతూ, ఎ.సి. గదిలో కూర్చొని చెమట పట్టకుండా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి శారీరక శ్రమ ఇమిడి ఉన్న వ్యవసాయ రంగంలో అదీను చెమటలు చిందించవలసిన సేంద్రియ సాగు రంగంలోకి అడుగుపెట్టటానికి మల్లిఖార్జున రెడ్డి అర్థాంగి మరియు తల్లిదండ్రులు ఆనందంగా అంగీకరించారు. కాబట్టే తాను ఈ రంగంలో గుర్తింపు పొందే స్థాయికి ఎదిగానని తనకు ప్రోత్సాహాన్ని అందించిన తల్లిదండ్రులకు మరియు తన అర్థాంగికి మల్లిఖార్జున రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
వినూత్నంగా వేస్ట్డికంపోజరు తయారి
మిగతా రైతులలా కాకుండా మల్లిఖార్జున రెడ్డి వేస్ట్ డికంపోజరు ద్రావణాన్ని తయారు చేస్తున్నాడు. 1500 లీటర్ల సామర్థ్యంగల ప్లాస్టిక్ డ్రమ్ములో 200 లీటర్ల వేస్ట్డికంపోజరు, 200 లీటర్ల జడాన్ మైక్రోబియల్ సొల్యూషన్, 10 కిలోల కొండ ప్రాంతం లేదా అడవిలో లేదా పెద్ద పెద్ద వృక్షాల కింద సేకరించిన మట్టి, 15 కిలోల బెల్లం వేసి మిగతా డ్రమ్మును నీటితో నింపి ప్రతిరోజు కలుపుతూ ఉంటే వారం రోజులలో వేస్ట్డికంపోజరు తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న వేస్ట్డికంపోజరు ద్రావణాన్ని క్రమం తప్పకుండా నేలకు అందించడంతో పాటు అవసరాన్ని బట్టి పంటలపై పిచికారి కూడా చేస్తుంటాడు.
మేకపెంటతో జీవామృతం
అందరిలా కాకుండా మల్లిఖార్జునరెడ్డి జీవామృతాన్ని వినూత్నంగా తయారు చేస్తున్నాడు. 1000 లీటర్ల సామర్థ్యంగల ప్లాస్టిక్ డ్రమ్ములో 100 కిలోల దేశీయ ఆవుపేడ, 10 లీటర్ల దేశీయ ఆవుమూత్రం, 20 కిలోల బెల్లం, 10 కిలోల శనగపిడి వేసి మిగతా డ్రమ్ముని నీటితో నింపుతారు. పాలేకర్గారు చెప్పిన ప్రకారం దొడ్లో మేత మేసిన ఆవు నుంచి కాకుండా కొండలమీద, అడవులలో తిరిగి మేసిన దేశీ ఆవుల యొక్క పేడ, మూత్రాలను తీసుకోవాలి. కాని ప్రస్తుత పరిస్థితులలో ఆవులు కొండమీద, అడవులలో తిరగడము లేదు కాబట్టి పరిష్కారం కొరకు కొండల మీద, అడవులలో తిరిగే మేకల పెంటను 20 కిలోలు సేకరించి దానిని ఒక గుడ్డలో లేదా గోనెసంచిలో మూటకట్టి ఆ గోనెసంచిని ఒక కర్రకు వ్రేలాడదీసి అది కూడా జీవామృతం ద్రావణంలో మునిగేలా చేసి ప్రతిరోజు మేక పెంట వేసిన గోనె సంచిని పిండుతూ ఉండాలి. ఈ విధంగా చేస్తే 48 గంటలలో జీవామృతం తయారవుతుంది. 7 నుంచి 10 రోజుల వరకు ఉపయోగిస్తుంటారు. నేలకు అందించటానికి యథాతథంగా పిచికారికి 1:3 నిష్పత్తిలో పిచికారి చేస్తున్నానని మల్లిఖార్జున రెడ్డి వివరించాడు.
జడాన్ ద్రావణం
అడవులలో లేదా పెద్ద, పెద్ద వృక్షాల కింద మట్టిని వేర్లతో కలిపి సేకరించిన రెండు దోసెల్ల మట్టి మరియు ఒక కిలో ఉడకబెట్టిన బంగాళా దుంప (ఆలుగడ్డ) లేదా ఒక కిలో ఉడకబెట్టిన బియ్యం తీసుకుని ఈ రెండింటిని ఒక మూటకట్టి ఆ మూటను కర్రకు కట్టి, 200 గ్రాముల కల్లుఉప్పు కలిపిన 200 లీటర్ల నీటిలో వ్రేలాడదీయాలి. వ్రేలాడ దీసిన సంచిని/గుడ్డను వీలునుబట్టి పిండుతూ ఉంటే 48 గంటల తరువాత ద్రావణం తయారవుతుంది. దానిని 10 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. వివిధ పంటలలో భూమికి పంపడంతో పాటు పంటపై అదేవిధంగా పిచికారి చేయవచ్చు. ఈ ద్రావణం కొరియాకి చెందిన ప్రముఖులు చౌహాన్-క్యూ గారి కుమారుడు జడాన్ గారు అభివృద్ధి పరచిన పద్ధతి అని మల్లిఖార్జున రెడ్డి వివరించాడు.
మామిడి తొందరగా కాపుకు రావటం, నాణ్యమైన ఉత్పత్తి మరియు అధిక దిగుబడి రావాలంటే మొక్కలు నాటినప్పటి నుండి వాటికి అందించే సమగ్ర ఎరువులపై ఆధారపడి ఉంటుంది.మొక్క వయస్సును బట్టి ఎరువులను అందించాలి.ఒక్కో మొక్కకు మొదటి సంవత్సరం 100 గ్రా. నత్రజని, 100 గ్రా. భాస్వరం, 100 గ్రా. పోటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం 100 గ్రా. చొప్పున నత్రజని, భాస్వరం, పోటాష్ ను పెంచుతూ 10వ సంవత్సరం నుండి ఒక్కో చెట్టుకు కిలో చొప్పున నత్రజని, భాస్వరం, పోటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి.మొక్కకు కావలసిని పోషకాలను సేంద్రియ ఎరువు రూపంలో ఎక్కువగా వేసుకోవాలి.
నాలుగు సంవత్సరాల వయస్సు లోపు ఉన్న మొక్కలకు సిఫార్సు చేసిన ఎరువులను 2-3 నెలలకు ఒకసారి దఫాలుగా ఇవ్వాలి.కాపుకు వచ్చిన చెట్లకు మామిడి కోత అయిన వెంటనే సిఫార్సు చేసిన ఎరువులలో 2/3 వ వంతు ఎరువులను వేయాలి. పిందె ఏర్పడిన తర్వాత సిఫార్సు చేసిన ఎరువులలో 4 వ భాగం ఇవ్వాలి. దీనివలన ఎక్కువ దిగుబడి రావటమే కాకుండా తర్వాత సంవత్సరం నిలకడగా కాపు రావడానికి దోహద పడుతుంది. ఎరువులతో పాటు ప్రతి చెట్టుకు 1 కిలో వేప పిండి, 250 గ్రా. చొప్పున అజిటోబాక్టర్ లేదా అజోస్పైరిల్లం, ఫాస్ఫోబాక్టర్, పోటాష్ సాల్యుబులైజింగ్ బాక్టీరియా వంటి జీవన ఎరువులను అందించాలి.
సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళు కాపుకు వచ్చిన ప్రతి చెట్టుకు జీవన ఎరువులతో పాటు 100 కిలోల పశువుల ఎరువు లేదా 25 కిలోల వర్మీకంపోష్టు వేసుకోవాలి.
ఎరువులను తొలకరిలో అంటే జులై-ఆగష్టు నెలల్లో చెట్లు పాదుల్లో సమంగా చల్లి నేలలో కలిసేలా తిరగబెట్టాలి. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎరువులను వర్షాకాలం మొదట్లో ఒకసారి మరల వర్షాకాలం చివర్లో రెండవసారి వెయ్యాలి.వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో వర్షాకాలం చివర్లో ఒకేసారి వేసుకోవాలి. మామిడి పిందె కట్టిన థ నుండి భుజాలు ఏర్పడేంత వరకు చాలా త్వరగా పెరుగుతాయి.ఈ దశ లో పోషకాలు అవసరం ఎక్కువగా వుంటుంది.నీటి వసతి ఉన్న తోటల్లో సిఫార్సు చేసిన ఎరువు మోతాదులో 4 వ వంతు కాయ గోళీకాయ సైజులో ఉన్నపుడు వేసుకోవాలి.
సూక్ష్మధాతు లోపాల నివారణ
చాలా మామిడి తోటల్లో సూక్ష్మధాతు లోపాలు కనిపిస్తున్నాయి. మన రాష్ట్రంలో చాలా తోటల్లో నేలలో సేంద్రియ పదార్దం తక్కువగా ఉంది. దీనివలన మొక్కకు కావలసిన పోషకాలు అందక దిగుబడులు తగ్గుతున్నాయి.
నేలలో సేంద్రియ పదార్దం బాగా పెరగడానికి మామిడి చెట్ల మద్య ఖాళీ స్థలంలో జీలుగ విత్తనాలు 10 కిలోలు ఎకరానికి లేదా జనుము 25 కిలోలు ఎకరానికి చొప్పున లేదా నవధాన్యాలు కానీ తొలకరిలో చల్లుకొని పూత థలో నేలలోకలియ దున్నాలి. ఇలా చేయటం వలన నేలలో సేంద్రియ పదార్దం పెరగటమే కాకుండా కలుపు సమస్య ఉండదు. పెట్టుబడి తగ్గుతుంది.సూక్ష్మధాతు పోషకాల లభ్యత పెరుగుతుంది. అలాగే మేలు చేసే సూక్ష్మ జీవులు పెరిగి నేల బాగా గుల్లబారుతుంది. దీనివలన నేలలోకి నీరు బాగా ఇంకి మొక్కకు అందుతుంది.
జింకు లోప లక్షణాలు:
జింకు లోపం సాధారనంగా చౌడు నేలల్లో కనబడుతుంది. జింకు లోపం ఉన్న తోటల్లో మొక్కల పెరుగుదల క్షీణించి, పాలిపోయి చనిపోతాయి. మొక్క పెరిగే థలో జింకు లోపిస్తే ఆకులు చిన్నగా మారి సన్నబడి పైకి లేదా కిందకి ముడుచుకు పోతాయి. కణుపుల మద్య దూరం తగ్గిపోయి ఆకులు గుబురుగా ఒకే చోట పెరుగుతాయి. మొక్కల పెరుగుదల క్షీణించి, కాయ పెరుగుదల, నాణ్యత మరియు దిగుబడి తగ్గుతుంది.
జింకు లోపాన్ని నివారించడానికి 5 గ్రా. జింకు సల్ఫేట్ను ఒక లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసి లోపాన్ని సవరించుకోవాలి.
బోరాన్ లోప లక్షణాలు
ఆకులు పొట్టిగా ఉండి ఆకు కొనలు నొక్కుకుపోయినట్లుగా మారి పెలుసుబారిపోతాయి.బోరాన్ లోపిస్తే కాయ పెరిగే థలో పగుళ్ళు ఏర్పడతాయి.
దీని నివారణకు ప్రతి మొక్కకు 100 గ్రా. బోరాన్ ను చెట్ల పాదుల్లో వేయాలి.అలాగే కొత్తగా చిగుర్లు వచ్చే థలో 1-2 గ్రా. బోరాన్ ను లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని 15 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారి చేసుకోవాలి.
ఇనుప ధాతు లోప లక్షణాలు
సున్నపు నేలల్లో పెంచిన తోటల్లో ఇనుము ధాతు లోపం ఎక్కువుగా కనిపిస్తుంది. ఇనుము లోపిస్తే ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి తెల్లగా మారుతాయి. ఆకుల పరిమాణం తగ్గుతుంది. ఇనుము లోపం తీవ్రత ఎక్కువైతే ఆకులు కొనలు నుండి ఎండుకొంటూ వస్తాయి. చెట్టు పెరుగుదల తగ్గి కాపు అంతగా రాదు. వచ్చినా కాయ నాణ్యత బాగుండదు. ఇనుము లోపం తీవ్రత చిన్న మొక్కలలో ఎక్కువైతే మొక్కలు చనిపోయే అవకాశం ఎక్కువుగా ఉంటుంది.
ఈ లోపాన్ని నివారించాలంటే 2.5 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్ మరియు 1 గ్రా. నిమ్మ ఉప్పు ఒక లీటర్ నీటికి కలిపిన ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో కొత్త చిగుర్లు వచ్చిన తర్వాత 2 సార్లు చెట్టు మొత్తం తడిచేలా పిచికారి చేయాలి.
పొటాషియం లోప లక్షణాలు
ఆకులు అంచులు మాడిపోవటం అనేది పొటాషియం లోపం యొక్క ప్రధాన లక్షణం. ఆకు అంచు మాడటం ఆకుకొన నుండి ప్రారంభమై క్రిందికి వ్యాపిస్తుంది. కాయ నాణ్యత తగ్గుతుంది. చెట్టు చీడపీడలను తట్టుకొనే శక్తి కోల్పోతుంది.
దీని నివారణకు చెట్టుకు సిఫార్సు చేసిన పోటాష్ ఎరువు మోతాదును చెట్ల పాదుల్లో వేసి కలియబెట్టాలి. రాలిన ఆకులను నేలలో కలిపి తిరగబెడితే కుళ్ళి సేంద్రియ పదార్ధం పెరిగి చెట్టుకు కావలసిన పొటాషియం మూలకం అందుతుంది.
అన్నిరకాల సూక్ష్మధాతు లోపాలు ఒకేసారి కనిపిస్తే జింకు సల్ఫేట్ 5 గ్రా., ఫెర్రస్ సల్ఫేట్ 2.5 గ్రా., బోరాక్స్ 2 గ్రా., కాల్షియం సల్ఫేట్ 2 గ్రా., మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రా. ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి సంవత్సరానికి 2 లేదా 3 సార్లు అంటే జూన్-జులై, సెప్టెంబర్-అక్టోబర్ మరియు డిసెంబర్-జనవరి నెలల్లో పిచికారీ చేసుకోవాలి.
అలాగే పూమొగ్గ తొందరగా ఏర్పడటానికి, విచ్చుకోవటానికి 10గ్రా. పొటాషియం నైట్రేట్ ను ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి అక్టోబర్ నెలలో పిచికారీ చేయాలి.
సస్య రక్షణ చర్యలు:
కాయ కోత అనతరం లోతు దుక్కులు దున్నుకొంటే నేలలో ఉండే పురుగుల గుడ్లు మరియు నిద్రావస్థ థలు బయటబడి నాశనమౌతాయి.
తేనెమంచు పురుగు ఉదృతిని అరికట్టాలంటే చెట్ల కొమ్మలను పలచన చేయాలి. అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు కత్తిరించి చెట్టుకు గాలి, వెలుతురు బాగా సోకేలా చేయాలి.
ఎండిన కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగించాలి.
తోటలో కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
అక్టోబర్లో వర్షాలు లేనట్లైతే ఒకసారి చెట్ల పాదుల్లో నీటితడులు ఇవ్వటం వలన కూడా భూమిలో ఉండే గుడ్లు బయట పడతాయి.
తోటలో రాలిన కాయలను ఏరి నాశనం చేయాలి.
ప్రతి 2 నెలలకు ఒకసారి వేప నూనె 3000 పిపియం 3 మిల్లీ లీ. ఒక లీటరు నీటికి చొప్పున కలిపిన ద్రావణాన్ని చెట్ల కొమ్మలు, మొదలు బాగా తడిచేలా పిచికారి చేయాలి. దీనివలన కొమ్మల పగుళ్ళలో దాక్కొని ఉన్న పురుగు కోశస్థ థలు నాశనమై వాటి ఉధృతి తగ్గుతుంది.
పిండి పురుగులు నివారణకు చెట్ల మొదలు నుండి 1 అడుగు ఎత్తులో 25 సెం. మీ. వెడల్పు ఉన్న 400 గేజి మందం ఉన్న పాలీతీన్ షీటుతో చుట్టాలి. ఇలా చేయటం వలన నేలలో ఉండే పిల్ల పురుగుల థలు చెట్టుపైకి పాకకుండా ఉంటాయి.
పండు ఈగ ఆశించకుండా ఉండడానికి కాయలు పక్వథకు చేరగానే ఆలస్యం చేయకుండా కోసుకోవాలి. అలాగే కాయలకు కవర్లు తొడగటం వలన పండు ఈగ బారి నుండి రక్షించవచ్చు.
ఒకవేళ అప్పటికే పండు ఈగ ఆశించి కాయలు రాలి ఉంటే వాటిని వెంటనే ఎరివేసి నేలలో లోతుగా కప్పటమో లేదా కాల్చివేయటం చేయాలి.
ఆకు ముడత పురుగులు అల్లిన గూళ్ళను తొలగించి వాటిని కాల్చేస్తే ఆ గూడులో ఉండే గుడ్లు, పిల్ల పురుగు థలు నాశనం అయ్యి తోటలో వాటి ఉధృతి తగ్గుతుంది.
తోటలో మిత్ర పురుగులను రక్షించటం వలన హానికర పురుగుల ఉధృతి అదుపులో ఉండి పంట నష్టం తగ్గుతుంది.
సాధ్యమైనంత వరకు రసాయన మందుల పిచికారీ తగ్గించుకోవాలి. వీటికి బదులు పురుగులు, తెగుళ్ళు ఆశించకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని జీవ సంబంధిత మందులు అయినటువంటి వేపనూనె, కానుగ నూనె, బవేరియా బాసియానా, మెటారైజియం వంటి సురక్షితమైనవి వాడుకొని నివారించుకోవాలి. స్థూల మరియు సూక్ష్మపోషకాలను సేంద్రియ రూపంలో అందుబాటులో ఉన్నవాటిని ఉపయోగిస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి.
డా. కె. రాధారాణి, ప్రిన్సిపల్ సైంటిస్ట్, డా. బికెఎం లక్ష్మి, ప్రిన్సిపల్ సైంటిస్ట్, డా. జి. స్రవంతి, సైంటిస్ట్, మామిడి పరిశోధనా సంస్థ, నూజివీడు.
రొయ్యల సాగులో ఉండేటటువంటి ఒడిదుడుకులు దృష్ట్యా, ముఖ్యంగా సాగులో వ్యాధులు ప్రబలుట, మార్కెట్ రేట్లలో హెచ్చుతగ్గులు వంటి కారణాల వల్ల రైతులు ప్రత్యామ్నాయ జాతుల పెంపకం వైపు మొగ్గుచూపుతున్నారు. ఉప్పు నీటిలో పెంపకానికి అనువైన ప్రత్యామ్నాయ జాతులలో పీతలు, పండుగప్పలు ముఖ్యమైనవి. పండుగప్పలో వ్యాధుల తీవ్రత తక్కువ. మాంసముకు అధిక డిమాండ్, ధర ఉండుట వల్ల రైతులు పండుగప్ప చేపల పెంపకం వైపు ఆకర్షితులవుతున్నారు. పండుగప్ప చేపల పెంపకం ఉప్పు నీటిలో, మంచినీటిలో కూడా చేపట్టవచ్చు. పండుగప్ప చేప పిల్లలను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్, చెన్నై మరియు ఆర్జిసిఏ సిర్కాలి (తమిళనాడు) వారు హేచరీలలో ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేస్తున్నారు. ముందుగా వీటిని నర్సరీలలో పెంపకం చేపట్టి, తరువాత పెంపకపు చెరువులలోకి మార్చుకొని సాగు చేయవచ్చు.
నర్సరీలలో చేప పిల్లల పెంపకము
కచ్చా నర్సరీలలో, హఫాలలో, సిమెంటు/ఎఫ్ఆర్పి ట్యాంకు, కేజ్లలో చేప పిల్లల పెంపకంను చేపట్టవచ్చు.
హేచరీల నుండి సుమారు 30-40 రోజులు వయస్సు గల పిల్లలను నర్సరీలలో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. నర్సరీలలో 1.5 సెం.మీ. పొడవు గల పిల్లలను 5-10 గ్రాములు వరకు పెంచుకోవచ్చు.
అలాగే ఫింగరులింగును 100-150 గ్రా.లు వరకు అడ్వాన్సుడు నర్సరీ పద్ధతిలో పెంచి వాటిని గ్రో అవుట్ పాండులోనికి బదిలీచేసి కల్చరు చేయడం వలన బ్రతుకుదల శాతం పెరిగి, సైజులో వ్యత్యాసాలు తగ్గి 10-12 నెలల కాలంలో 3-4 కిలోల బరువు గల చేపలను ఉత్పత్తి చేయవచ్చు.
చేపల పెంపక సమయాలల్లో అవసరాన్ని బట్టి 100% నీటి మార్పిడి చేయవలసి ఉంటుంది.
పండుగప్ప మాంసాహారి. ఆహారం సరిపడినంత దొరకకపోతే తోటి పండుగప్ప పిల్లలను తినివేస్తుంది (స్వజాతి భక్షణ). తద్వారా బ్రతుకుదల శాతం తగ్గి సైజులలో తేడాలు వస్తాయి. ఒకవేళ సరిపడినంత సహజ ఆహారం (జంతు ఫ్లవకాలు) లభించకపోతే ప్రతి రోజు చైనా గొరక, పాల చేప లేదా అందుబాటులో ఉన్న ఇతర చేపల మాంసాన్ని మెత్తని ముద్దగా చేసి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రోజుకు కిలో చొప్పున నీటితో కలిపి చెరువంతా చల్లుకోవాలి. 10 మి.మీ. పొడవు థ నుండి పండుగప్ప పిల్లలను కృత్రిమ మేతకు అలవాటు పరచవచ్చు కానీ 15-20 మి.మీ. పరిమాణంలో కృత్రిమ ఆహారానికి అలవాటు పడి బ్రతుకు శాతం బాగుంటుంది.
ఈ చేపలలో ఉన్న స్వజాతి భక్షణ లక్షణము బట్టి వీటిని ఎప్పటికప్పుడు వేరు చేస్తు ఉండాలి. దీనినే గ్రేడింగు అంటారు. ఎక్కువగా ఎదిగిన చేప పిల్లలను వేరొక నర్సరీలోకి మార్పిడి చేయుట వలన మిగిలిన చేపలు కూడా పెరుగుటకు దోహదమవుతుంది. ముఖ్యంగా 20-35 మి.మీ. సైజులో వారానికి ఒకసారి గ్రేడింగు చేయాలి. గ్రేడింగ్ సమయంలో తక్కువ ఒత్తిడి ఉండేలా చూసుకోవాలి. లేనిచో ఆహారము తక్కువగా తీసుకోవడం, శరీరంపై పొలుసులు ఊడి రంగు మారడం, నీటి పైభాగానికి వచ్చి గాలి పీల్చుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆక్సిజన్ లేకుండా ఎట్టి పరిస్థితులలోనూ గ్రేడింగు చేయరాదు. వేగంగా సున్నితంగా గ్రేడింగు చేయాలి. ఈ సమయమే పిల్లల పెంపకములో క్లిష్టమైన థ.
కృత్రిమ ఆహారాన్ని అలవాటు చేయటం, గ్రేడింగు అనే ఈ రెండు పనులు పండుగప్ప చేపల పెంపకంలో విజయానికి కీలకమవుతాయి.
40 రోజులు పూర్తయిన తరువాత నీటి మట్టాన్ని తగ్గించి వల సహాయంతో పట్టుబడి చేసి ఒకే సైజు గల పిల్లలను అడ్వాన్సుడు ఫింగర్లింగ్స్ తయారు చేయడానికి వేరొక నర్సరీకి గాని లేదా గ్రో అవుట్ చెరువులలోనికి గాని మార్చుకోవాలి.
చెరువులలో పండుగప్ప పెంపకము
రొయ్యల పెంపకము చేపట్టి చెరువులను యధాతథముగ పండుగప్ప చేపల పెంపకముకు ఉపయోగించవచ్చు.
పండుగప్ప చేపల పెంపకమునకు చెరువు మట్టి పి.హెచ్ 7 కంటే ఎక్కువ ఉండాలి. దీని కోసం హెక్టారుకు 500 కిలోల నుండి ఒక టన్ను వరకు అవసరం మేరకు సున్నము చల్లాలి. నీటి పి.హెచ్ 7.5 నుండి 8.5 ఉంచాలి. నీటిలో కరిగియున్న ఆక్సిజన్ 5 పి.పి.ఎం. మించి ఉండాలి. ఈ చేప ఎలాంటి సెలీ నీటిలోనైనా తట్టుకొని పెరుగుతుంది (0-30 పిపిటి). హానికర వాయువులైన అమ్మోనియం 0.1 పిపియం కన్నా తక్కువ మరియు హైడ్రోజన్ సల్ఫైడ్ 0.01 పిపియం స్థాయి మించి ఉండరాదు.
విత్తన ఎంపిక: సాధ్యమైనంత వరకు ఒకే సైజు పిల్లలను ఎంపిక చేసుకుంటే సైజులో వ్యత్యాసాలు లేకుండా ఉంటుంది. పొలుసులు ఊడిపోయి, నీరసంగా ఉన్న వాటిని చెరువులలో స్టాక్ చేయకూడదు. నర్సరీల ద్వారా పెంచిన పిల్ల అయితే సమస్యలు తక్కువగా ఉండి ఎదుగుదల ఒకే విధంగా ఉంటుంది. సాధారణంగా 100-250 గ్రా. బరువున్న పిల్లలను ఎకరానికి 1000 చొప్పున వేస్తే పెరుగుదల బాగుంటుంది.
మేతలు: 1-5 అంగుళాల పొడవు ఉన్న చైనా గొరక పిల్లలను లేదా గొరక చేప పిల్లలను ఆహారంగా వేయాలి. ప్రారంభంలో మొత్తం బయోమాస్లో సుమారు 10% ఆహారంగా ఇవ్వాలి. అధిక ప్రొటీన్ (45-55%) ఉన్న పెల్లెట్ ఫీడును చేప బయోమాస్ ఆధారంగా ఇవ్వాలి. 40-100 గ్రాములు బరువున్న చేపలకు 3% మేతను, 225 గ్రా. బరువున్న చేపలకు 2.5% మేతను, 450 గ్రాముల బరువున్న చేపలకు 2% మేతను, 680 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న చేపలకు 1.75% మేతను ఆహారంగా ఇవ్వాలి. పెల్లెట్ మేత పరిణామం కూడా చేప శరీర బరువును బట్టి పెంచుతూ వెళ్ళాలి.
చేప పొడి 55%, ఉడక బెట్టిన సోయా పిండి 15%, విటమిన్ సి, మినరల్ మిక్స్ర్లు ప్రధాన ముడి సరుకులుగా ఉపయోగించి, దేశీయ టెక్నాలజీతో తయారు చేసిన పెల్లెట్ మేతలు కూడా కొంతమంది రైతులు ఉపయోగించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
100-150 గ్రా. బరువు ఉన్న పిల్లలను వేస్తే 10-12 నెలల కాలంలో 3-4 కిలోల బరువు పెరుగుతాయి. 1000 పిల్లలు వేసిన ఎకరం చెరువులో మంచి మేత యాజమాన్యం చేస్తే 90% బ్రతుకుదల వచ్చి 3-4 టన్నులు ఉత్పత్తి వస్తుంది. ప్రతి 15 రోజులకు ఒక్కసారి 20 నుండి 30 శాతం నీటి మార్పిడి చేయాలి.
పండుగప్ప చేపల పెంపకంలో సాధారణంగా వచ్చే వ్యాధులు
పండుగప్ప చేపల సాగులో నీటి నాణ్యత సరిగాలేనపుడు అధిక ఒత్తిడి వల్ల చేపలు వ్యాధుల బారిన పడతాయి.
అధిక సేంద్రియ పదార్థములు చెరువులో పేరుకుపోయినప్పుడు ఇక్తియోబొడాసిస్, ట్రైఖోడైనా, మిక్సోబోలస్ వంటి పరాన్నజీవులు శరీరము మరియు శంఖులలో ఆవాసము ఏర్పరచుకుని కణజాలమును తినివేస్తూ ఉంటాయి. చేపలు ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మేతలు వృధా కాకుండా చూసుకోవాలి.
విబ్రియో పారాహిమోలైటికస్, విబ్రియో ఆల్జీనోలైటికస్ మొదలగు బాక్టీరియా జాతుల వల్ల తోక కొరుకుడు, వాజాల కొరుకుడు వ్యాధులు సోకుతాయి. స్ట్రేప్టోకోకస్ బాక్టీరియా వ్యాధి కేజ్ కల్చరులో పెరిగే పండుగొప్ప చేపలకు సోకుతుంది. ప్లవో బాక్టీరియం కాలుమ్నేర్ అనే బాక్టీరియా వలన పండుగప్ప చేపల శంఖులు కుళ్ళిపోతాయి. చేపలు ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మేతలు వృధా అవకుండా చూసుకోవాలి. ప్రోబయోటిక్స్ వాడుకోవాలి. సున్నము నీటి పీహెచ్ ఆధారంగా ఇవ్వాలి.
లింఫోసిస్టోసిస్ వ్యాధిని కలుగచేసే ఇరిడియో వైరస్లు చేప శరీరపు కణజాలములలోకి చేరి చిన్న చిన్న కణుపులను తల, తోక భాగములలో ఏర్పరుస్తాయి. దీని వలన నర్సరీలలో పిల్లలు అధిక సంఖ్యలో చనిపోతాయి. వైరల్ నెర్వస్ నెక్రొసిస్ వైరస్ చేప నాడీ వ్యవస్థను ధ్వంసము చేస్తుంది. దీని వలన శరీర కణజాలము సహజ రంగు కోల్పోయి పాలిపోయిన రంగు వస్తుంది. వైరస్ వ్యాధుల నివారణకు మందులు లేవు. నాణ్యమైన చేప పిల్లలను తక్కువ సాంద్రతలో వేసి మంచి పోషక విలువలు కలిగిన ఆహారం ఇచ్చి సాగు చేపట్టాలి.
నాసిరకం మేతలు, నిలువ ఉన్న మేతలు ఆడినప్పుడు చేపలు నల్లగా మారి వాటిలో ఎదుగుదల మందగిస్తుంది.
పండుగప్ప చేపల పెంపకంలో గల ఇబ్బందులు:
స్వజాతి భక్షణ: ఇది పండుగప్ప పెంపకంలో ఒక సమస్యగా ఉంటుంది. దీని కారణంగా గ్రేడింగ్ చేయడం అత్యవసరం. స్వజాతి భక్షణ తగ్గించుకోవడానికి పెంపకమును రెండు థలలో అంటే నర్సరీ, గ్రో అవుట్ పాండ్స్లో చేస్తారు.
చేప పిల్లల లభ్యత: పండుగప్ప చేప పిల్లలను ఈ మధ్యకాలంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్, చెన్నై మరియు ఆర్జిసిఏ సిర్కాలి వారు హేచరీలలో ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేస్తున్నారు. అయితే కావలసినంత చేప పిల్లలు లభ్యమవడం లేదు.
సహజ వనరుల నుండి సేకరించిన పిల్లలలో సైజు వ్యత్యాసాలు ఎక్కువ మరియు కావలసినంత సంఖ్య సరఫరా లేదు.
మేత అలవాట్లు: పండుగొప్ప చిరుథలో సర్వభక్షకిగాను ప్రౌఢ థలో మాంసాహారిగాను ఉంటుంది. అధిక ప్రోటీన్ గల కృత్రిమ ఆహారం లభ్యమవడం లేనందున మేత పెట్టటం సమస్యగా ఉంటుంది. దీ
కె. వీరాంజనేయులు, శాస్త్రవేత్త (మత్స్య విభాగము), డా. పి. లలిత కామేశ్వరి, ప్రధాన శాస్త్రవేత్త , డా. టి. క్రాంతి కుమార్, శాస్త్రవేత్త (ఉద్యాన విభాగము), డా. ఎస్. చిరంజీవి, శాస్త్రవేత్త (తెగుళ్ల విభాగము), డా. ఎస్. ఆదర్శ, శాస్త్రవేత్త (కీటక విభాగము), డా. ఆర్. ప్రవీణ్బాబు, శాస్త్రవేత్త (విస్తరణ విభాగము), కృషి విజ్ఞాన కేంద్రం, పందిరి మామిడి, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం. ఫోన్: 95533 64265.
ఆధునిక సంస్కృతిలో ప్లాస్టిక్ వినియోగం అత్యంత వేగంగా విస్తరిస్తూవుంది. భూమి, జలవనరులు, వృక్షజాలం, జంతుజాలాలతో పాటు మనుషుల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారిన ఈ విశృంఖల ప్లాస్టిక్ వినియోగాన్ని కట్టడి చేయకపోతే రాబోయే కాలంలో మానవుని మనుగడ సైతం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ సంచులు, ఒకసారి వాడి పారవేసే సీసాలు, గ్లాసులు మరియు ప్లాస్టిక్ షీట్స్, భోజనాల అనంతరం వాడి, భోజన వ్యర్థాలతో పాటు వదలివేసే ప్లాస్టిక్ పన్ను పుల్లలు, కప్పులు, ప్లాస్టిక్ చెంచాల వల్ల మూగజీవాలు పడే బాధను వర్ణించలేము. భోజనశాల, వంటశాలల వ్యర్థాలను ప్లాస్టిక్ సంచులలో నింపి వదిలి వేసినప్పుడు ఆ వ్యర్థాలతో పాటు తిన్న కుక్కలు, పిల్లులు, పశువుల పొట్ట, ప్రేగులలో ఉండలుగా చుట్టుకొని జీర్ణవ్యవస్థకు అడ్డంగా మారి అజీర్తిని, కడుపు ఉబ్బరాన్ని కలిగించి వాటికి తీవ్రమైన బాధను కలిగించి ప్రాణాలను హరిస్తున్నాయి. ఇటీవల ఒక పశువు శవ పరీక్ష జరిపినప్పుడు వాటి పొట్టలో 120 కిలోల ప్లాస్టిక్ ఉండలు చుట్టుకొని కనిపించింది.
ఇటీవల మన జాతీయ పోషకాహార సంస్థ వారు జరిపిన కొన్ని అధ్యయనాలలో ప్లాస్టిక్లో ఉండే బిస్పెనాల్-ఎ (బి.పి.ఏ) అనే రసాయనం మనుషులతో పాటు అన్ని జంతువులలో హార్మోన్ వ్యవస్థలపై తీవ్ర దుష్ప్రభావం చూపి, మగజాతిలో వీర్యకణాల ఉత్పత్తిని ఆడజాతిలో గర్భధారణ అవకాశాలను తీవ్రంగా కృంగదీస్తాయని ఎలుకలపై జరిపిన పరిశోధనలద్వారా నిరూపించుట జరిగింది. బి.పి.ఎ. వల్ల సంతతి యొక్క ఎదుగుదల, పాల ఉత్పత్తి మరియు ప్రత్యుత్పత్తి సామర్థ్యాలు కూడా క్షీణించగలవు.
డాల్ఫిన్స్, తిమింగలాలు, చేపలు, రొయ్యలు, తదితర జలచరాలు ఈ ప్లాస్టిక్ వల్ల అంతరిస్తున్నాయి. భూమి యొక్క పటిష్ఠత, తేమను పీల్చే శక్తి కూడా వందల సంవత్సరాల పాటు నేలలో నశించని ప్లాస్టిక్ వల్ల క్షీణిస్తూవుంది. కొండలవిూద విచక్షణా రహితంగా వదలివేస్తున్న ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లేట్స్ వల్ల నేల పటిష్ఠత తగ్గి కొండ చరియలు విరిగి పడటానికి కూడా కారణం అవుతున్నాయి. అనేక ప్రాంతాలలో ముఖ్యంగా పర్యాటకుల సందర్శనలు ఎక్కువగా ఉండే పర్వతాల నుండి భారీ వర్షాల కారణంగా విరిగి పడుతున్న కొండచరియల వల్ల జరుగుచున్న ప్రాణ నష్టాలకు, ఆస్థినష్టాలకు కూడా ప్లాస్టిక్ వల్ల పటుత్వం కోల్పోతున్న పర్వత నేలలే కారణంగా అనుమానించవచ్చు.
ఆహార, తదితర వ్యర్థాలను ప్లాస్టిక్ సంచులలో నింపి, మురుగు కాల్వలలో పారవేయుట వల్ల అవి కాల్వలలో మురుగు నీరు, వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారి చిన్న పాటి వర్షాలకే మన జనావాసాలు, రహదారులు జలమయమై తీవ్ర నష్టాలను కలిగిస్తున్నాయి.
ప్లాస్టిక్స్ తగలబడినప్పుడు విడుదలయ్యే అనేక విష వాయువులు, మనుషులు, జంతువులలో క్యాన్సర్స్ను కూడా కలిగించి ప్రాణాలను హరిస్తున్నాయి.
విందులలో భోజనాల బల్లల మీద పరచే ప్లాస్టిక్ షీట్లు, వడ్డనప్లేట్లు, గ్లాసులు, మొనదేలిన ప్లాస్టిక్ పుల్లలు, విరిగిన స్పూన్స్, ఫోర్కులను ఆహార వ్యర్థాలతో కలిపి విచక్షణారహితంగా బయట పారవేసిన్పుపడు వీటిని తిన్న పెంపుడు జంతువులతో పాటు వన్యప్రాణుల నోరు, జీర్ణాశయం, గుండె, ఊపిరితిత్తులు తదితర అవయవాలు తీవ్రంగా గాయాలపాలై సుదీర్ఘకాలం అవి బాధపడి మరణిస్తున్నాయనే వాస్తవాన్ని మనం గుర్తించాలి.
ఇప్పటికైనా మన ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో పాటు ప్రజలందరూ ప్లాస్టిక్స్ వల్ల జరిగే అనర్థాలను గుర్తించటమే కాక సమాజంలోని అన్ని వర్గాలలో అవగాహన పెంచే కృషి చేయాలి. దీనికి సంబంధించిన పోస్టర్లు, ప్రకటనలను ఫంక్షన్ హాల్స్, దేవాలయాలు, హోటల్సు, పార్కులు, పర్యాటక ప్రదేశాలలో ప్రస్ఫుటంగా ఏర్పాటు చేయాలి. ప్లాస్టిక్ సంచులు, షీట్సు, కప్పులు, ప్లేట్లు, గ్లాసులు తదితర సామాగ్రుల తయారీని నిషేధించి కట్టుదిట్టంగా అమలు చేయాలి.
ఆరోగ్యకరమైన గొర్రెల మంద కావాలంటే వాటికి సరైన పోషక ఆహారం మరియు మంచి యాజమాన్య పద్ధతులను విధిగా రైతులు పాటించాలి. గొర్రెలు పుట్టినప్పటి నుండి జాగ్రత్తగా పోషకాహారాలు సరియైన మోతాదులో సక్రమంగా ఇస్తే తక్కువ కాలంలో జీవాలు బరువు పెరిగి అధిక మాంస ఉత్పత్తిని ఇస్తాయి. ఆరోగ్యముగా, బలముగా గొర్రెలను పెంచాలంటే వాటికిచ్చే ఆహారములో సరిపడిన పిండిపదార్థములు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఖనిజలవణాలు మరియు విటమినులు ఉండేలా చూసుకోవాలి.
పిండిపదార్థాలు: గొర్రెలకు మనము పెట్టే గడ్డిలో తగిన మోతాదులో పిండిపదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి. శారీరక కార్యక్రమాల నిర్వహణకు కావలసిన శక్తి 50% వరకు ఈ పిండి పదార్థాల ద్వారా లభిస్తుంది. ఒకగ్రాము పిండిపదార్థం 4 కిలో కాలరీల శక్తిని ఇస్తుంది. గొర్రెల ఆహారములో ముఖ్యంగా పచ్చగడ్డి, ఎండుగడ్డి, చెట్ల ఆకులతో పాటు గింజ ధాన్యములైన జొన్న, మొక్కజొన్న, గోధుమ, రాగి, సజ్జల పొడి చేసుకొని తవుడుతో పాటు ఇవ్వడము వలన శక్తిలోపాన్ని నివారించవచ్చును. ఈ ధాన్యములను గొర్రెల బరువుకు తగినట్లుగా 250-300 గ్రా. వరకు ఇవ్వవలెను. ఈ విధంగా చేసుకున్న దాణాను ప్రతిరోజు పచ్చగడ్డితోపాటు ఒక్కింటికి 300 గ్రాముల చొప్పున నీటితో తడిపి ఉదయం/సాయంత్రం ఇవ్వడం వలన గొర్రెల ఆహారంలో శక్తిని సరియైన పాళ్ళలో అందించగలుగుతాము.
మాంసకృత్తులు: జీవాల శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, రోగనిరోధక శక్తికి, హిమోగ్లోబిన్ రవాణాకు ఇవి తోడ్పడతాయి. ఆహారంలో ఆమ్లాలు లోపిస్తే శరీర కణాలలో మాంసకృత్తుల ఉత్పాదకత తగ్గి గొర్రెలు ఆహారం తినడము, ఆహారాన్ని వినియోగించుకొనే సామర్థ్యం కూడా తగ్గుతుంది. మాంసకృత్తుల లోపాల వలన చిన్నజీవాల్లో బరువు తగ్గడము, రక్తహీనత, శరీరములో నీరు చేరడము, కండరాల బలహీనత వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి మాంసకృత్తులు అధికముగా లభ్యమయ్యే పచ్చిమేతలు బొబ్బర్లు, జనుము, పిల్లిపెసర, ఉలవలు, సుబాబుల్, అవిశె ఆకులను గొర్రెల ఆహారములో ఇస్తే మాంసకృత్తుల లోపాల్ని నివారించవచ్చు.
ఖనిజ లవణములు: గొర్రెల శరీరములో 22 రకాల ఖనిజలవణాలు అవసరం ఉంటుంది. వీటిలో అతిముఖ్యమైనవిగా 8 ఖనిజాలను గుర్తించారు. గొర్రెల ఆహారములో ఉప్పు (సోడియంక్లోరైడ్), కాల్షియంను సమృద్ధిగా అందించాలి. ఎముకల పొడిని దాణాలో కలిపి ఇవ్వడం వలన భాస్వరం లోపాలను నివారించవచ్చు. అప్పుడప్పుడు రాళ్ళ ఉప్పును దాణాలో కలిపితే సోడియం క్లోరైడ్ లోపాలను నివారించవచ్చు. ఖనిజలవణ మిశ్రమాలు పొడి రూపంలోను, ఇటుకల రూపంలోను లభ్యం అవుతున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న గొర్రెలకు ఒకే విధమైన లవణ మిశ్రం చేయడం కష్టమవుతుంది. ప్రాంతాలను, భూములను బట్టి వీటి లోపం ఉంటుంది. కావున రైతులు తమ ప్రాంతంలో ఉన్న లోపాలను గుర్తించి వాటికి సంబంధించిన ఖనిజలవణములను వాడవలెను.
విటమిన్స్: పచ్చికబయళ్ళలో సూర్యరశ్మి కలిగిన ప్రాంతాలలో విటమిన్ ‘ఎ’ మరియు ‘డి’ లోపాలు రావు. విటమిన్ బి12 తయారీకి కోబాల్టు ఖనిజలవణం అవసరము. 3 నెలల వయస్సు దాటిన గొర్రెల ఆహారంలో బి-కాంప్లెక్స్ విటమినుల అవసరం ఉండదు. 2-8 వారాల వయస్సు ఉన్న గొర్రె పిల్లల ఆహారములో విటిమన్ ఇ లేక సెలీనియం లోపిస్తే వాటిలో కండరాల జబ్బు వస్తుంది. కావున ఆహారంలో విటమినుల లోపం లేకుండా చూసుకోవాలి.
కొవ్వు పదార్థాలు: ఇవి శరీరముకు శక్తిని ఇస్తాయి. శరీరమునకు అత్యవసరమైన విటమిన్స్ ఎ, డి సక్రమంగా వినియోగపడేందుకు కొవ్వు పదార్థాలు దోహదపడతాయి. జీవాల సక్రమ పునరుత్పత్తికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. 1 గ్రాము కొవ్వు పదార్థం 9 కిలోక్యాలరీల శక్తిని ఇస్తుంది. వేరుశనగ పిండి, కొబ్బరిపిండి, నూనెగింజల చెక్క, గోధుమ మరియు వరి తవుడు మొదలగు ఆహార పదార్థాల్లో కొవ్వు పదార్థాలు ఉంటాయి. కావున వాటిని ఆహారములో భాగము చేయవలెను.
నీరు: నీరు ఆహారములోని వివిధ పోషక పదార్థాలను సంగ్రహించడానికి మరియు శరీరములోని వివిధ భాగాలకు పోషకాలను చేర్చడానికి, శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి, చర్మం సాగే గుణం కలిగి ఉండడానికి, వ్యర్థ పదార్థాల విసర్జనక్రమంలో దోహదపడుతుంది. కావున జీవాలకు తగినంత శుభ్రమైన నీరును అందించాలి.
మామిడి ఉష్ణ మండల మరియు ఉప ఉష్ణ మండల వాతావరణానికి అనుకూలం. ఉప ఉష్ణ మండల వాతావరణంలో చలి ఎక్కువైనప్పుడు ఉష్ణోగ్రతలు బాగా తగ్గినప్పుడు లేత కొమ్మలు, లేత ఆకులు అనారోగ్యానికి గురి అవుతాయి, మామిడి అధిక ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్ అల్పఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు వర్షపాతం 300 మి.మీ.వరకు, సముద్రమట్టం నుండి 1200 మీటర్ల ఎత్తు వరకు తట్టుకొని పెరగగలుగుతాయి. వర్షపాతం సమముగా సంవత్సరం అంతా ఉండడం ముఖ్యం. అధిక వర్షాలు, పూర్తి బెట్ట పరిస్థితులలో పూత, పిందె రాలడం జరుగుతుంది. పీహెచ్ 6 నుండి 7.5 వరకు బాగా అనుకూలం.
బాగా ప్రాచుర్యం పొందిన రకాలు
తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన రకాలు: పండూరి మామిడి, ఆల్ఫాన్సో, కొత్తపల్లి కొబ్బరి, చిన్న రసాలు, పెద్ద రసాలు, కేసరి, దసేరి, మల్లికా, నీలం, మెట్టవలస, బొబ్బిలి పీచు, బంగినపల్లి, హిమాయత్.
మామిడి గుజ్జు కొరకు: తోతాపురి.
2 లేదా 3 సార్లు కాపు వచ్చే పచ్చి మామిడి రకాలు: పునాస, రాయల్ స్పెషల్.
ఎక్కువ ధర గల రకాలు: మియాజకి, రెడ్ పాల్మార్, హర్ వంగ్యా, బనానా మాంగో, బారి 11, కటిమొళి
అంటుకట్టే పద్దతి, ఒకే మొక్కకు అనేక రకాలు అంట్లు కట్టడం
ఏదయినా విత్తన మొక్కకు (రూట్ స్టాక్) మనకు కావలిసిన మొక్క కొమ్మను (సయాన్) అంటు కట్టడం. 6 నెలల అనంతరం ప్రధాన పొలములో గుంతలు తీసి, ఎరువు వేసి, జీవన ఎరువులు మరియు జీవన శిలీంద్రనాసినితో కలిపి మొక్కలు పెట్టాలి. పెద్ద మొక్కలకు ఒక మొక్కకు అనేక రకాల అంటు కట్టవచ్చు. ఒక మొక్కకు గరిష్టముగా 300 రకాలు అంటు కట్టినారు
మొక్కల సాంద్రత
మొక్కల సాంద్రత పూర్వం ఒక ఎకరాకు 40 మొక్కలు. కోత కోయడం, తెగుళ్లు, కీటకాల నివారణకు పిచికారీ చేయడం కష్టం, ఖర్చు ఎక్కువ.
అధిక సాంద్రతలో 200 మొక్కలు, అత్యధిక సాంద్రతలో 400-600 మొక్కలు వేయుచున్నారు. అధిక సాంద్రత, అత్యధిక సాంద్రతలో వేసిన మొక్కలకు ప్రతి సంవత్సరం కొమ్మ కత్తిరింపులు విధిగా చేయాలి. కోత కోయడం, తెగుళ్లు, కీటకాల నివారణకు పిచికారీ చేయడం తేలిక.
ఆచ్ఛాదనా మరియు పచ్చిరొట్ట పంటలు
ఆచ్ఛాదన చేయడం వలన మొక్క వేరు వ్యవస్థ వద్ద తేమ ఉండి, సూక్ష్మజీవులు బాగా వృద్ధిచెంది, మొక్క ఆరోగ్యాన్ని కాపాడుతాయి. తీగజాతి మొక్కలు ఉత్తమం. ఉదా|| చిలకడ దుంప. అదనపు ఆదాయం మరియు పశువులకు మంచి ప్రోటీన్ గల పచ్చి మేత దొరుకుతుంది
వర్షాకాలంలో మట్టిలో పోషకాలు పెరగడం కోసం ధబోల్కర్ పద్దతిలో వివిధ రకాలు విత్తనాలను వేసుకొని 45 రోజుల తరువాత పూత థలో మట్టిలో కలియ దున్నాలి.
మామిడి పూతకు ముందు, తర్వాత అంతర పంటలు,
మామిడి పూతకు ముందు కీటకాలు, తెగుళ్ళ నిర్వహణ
మామిడి పూత థ మరియు పిందె థలో కీటకాలు ఆశిస్తాయి. కావున పూతకు ముందు కనీసం 10 రోజుల ముందుగా పూతకు వచ్చే విధముగా పసుపు రంగు పూలు కలిగిన పంటలు సన్ఫ్లవర్, ఆవాలు, జనుము వేసుకోవాలి. దీనివలన మిత్ర పురుగులు ఆకర్షింపబడి, కీటకాలను నివారిస్తాయి. కీటకముల వలన మొక్కల ఆకులు, పువ్వులు, కాయలకు కలిగిన గాయాల వలన ద్వితీయ సంక్రమణ ద్వారా తెగుళ్లు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.
రసం పీల్చు పురుగుల వ్యర్ధాల వలన ఆకులపై నల్లని మసి వలే ఉండి, కిరణజన్య సంయోగ క్రియ జరగకుండా ఉండడం వలన మొక్క ఆరోగ్యం దెబ్బ తింటుంది. సబ్బు నీరు పలుమార్లు పిచికారీ చెయ్యాలి.
మామిడి మొక్క ఎత్తు ఎక్కువుగాను, గుబురుగాను ఉన్నప్పుడు కీటకాలు నివారించడం కష్టం. బ్లాక్ త్రిప్స్ (నల్ల తామర) బెడద నివారణ కోసం, అవి ఆశించే మిర్చి పంటను కొద్దిగా వేసుకొని, పలుమార్లు పిచికారీ చేసి నివారించాలి.
నెల వారీగా చెయ్యవలసిన పనులు ఎరువులు, పోషకాల మరియు కీటకాల, తెగుళ్ళ నిర్వహణ
వివిధ ప్రాంతాలలో సీజన్లోను, రకమును బట్టి కోతల పనులు తేడాలుండడం వలన నెలవారీ పనులు సరైన సమయంలో చేపట్టాలి.
జూన్, జులై మామిడి కాయ కోత అనంతరం నీరు బాగా పెట్టి పోషకలోప నివారణ చేపట్టాలి. ఘన జీవామృతం వెయ్యాలి. ఘనజీవామృతం 2 టన్నుల / 1ఎ + జీవన బ్యాక్టీరియాలు, ఎన్పికె మరియు బవేరియా, మెటారైజియం ట్రైకోడెర్మాలు నేల ద్వారా ఎరువుతో ఇవ్వాలి. ఫ్రూట్ ఫ్లై ల్యూర్లను మార్చాలి.
ఆగష్టు, సెప్టెంబర్ కొమ్మ కత్తిరింపులు, తెగుళ్లు, పోషక లోప నివారణ చేపట్టాలి. కలుపు నివారణ పనులు చెయ్యాలి, పచ్చిరొట్ట ఎరువులు వెయ్యాలి. కాండం తొలుచు పురుగు, గమ్మోసిస్, విల్ట్ గమనించి నివారణ చెయ్యాలి. కాండం తొలుచు పురుగు నివారణకు తూజా పిచికారీ చెయ్యాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువ తేడాలుండడం వలన, మొక్కల భాగాలూ గాయపడడం వలన గమ్మోసిస్, విల్ట్ వంటి తెగుళ్ళు వస్తాయి.
కొమ్మ కత్తిరింపులు గాలి, సూర్యరశ్మి బాగా వచ్చేలా చెయ్యాలి. ఎండు కొమ్మలు తీసివేయాలి. గాయపడిన భాగాలకు ఆవు మూత్రము, ఇంగువ, పసుపు కాషాయం పిచికారీ చెయ్యాలి.
15 రోజుల అనంతరం మీనామృతం, కిడ్నీ బీన్స్ /రాజ్మా, ఉలవలు మొలకల కషాయం, అగ్నాస్త్రం, ఆవు మూత్రము, ఇంగువ, పసుపు కాషాయం పిచికారీ చెయ్యాలి. లేదా
మీనామృతం, కిడ్నీ బీన్స్ /రాజ్మా ఉలవలు మొలకల ద్రావణం. సూడోమోనాస్ లేదా బాసిల్లస్ సుబ్టిల్లీస్ మరియు బవేరియా, మెటారైజియం, వెర్టిసీలియం పిచికారీ చేయాలి.
అక్టోబర్, నవంబర్ పూత ముందు థ – నత్రజని, బోరాన్ పోషక లోపాలు లేకుండా చూసుకోవాలి. ఘన జీవామృతం 2 టన్నులు / ఎకరానికి వెయ్యాలి. కలుపు నివారణ పనులు చెయ్యాలి, పచ్చిరొట్ట ఎరువులు పూత థలో దున్నాలి.
కీటకాలు, లీఫ్ వెబ్, తెగుళ్లు లేకుండా ముందు జాగ్రత్తగా తగిన మందులు పిచికారీ చెయ్యాలి. పండు ఈగ నివారణకు పూత కాలం ముందు నుండి ఫ్రూట్ ఫ్లై ల్యూర్లను పెట్టుకోవాలి.
మీనామృతం, కిడ్నీ బీన్స్ /రాజ్మా మొలకల కషాయం, అగ్నాస్త్రం/ నేల వేము కషాయం, ఆవు మూత్రము, ఇంగువ, పసుపు కాషాయం పిచికారీ చెయ్యాలి. లేదా
మీనామృతం, కిడ్నీ బీన్స్ /రాజ్మా ఉలవలు మొలకల ద్రావణం. సూడోమోనాస్ లేదా బాసిల్లస్ సుబ్టిల్లీస్ మరియు బవేరియా, మెటారైజియం, వెర్టిసీలియం పిచికారీ చేయాలి.
డిసెంబర్, జనవరి మామిడి పూత పొడవుగా ఉంటే, చివర భాగములో ఆడ పూల సంఖ్య ఎక్కువుగా ఉంటుంది. ఎక్కువ కాయలు వచ్చే అవకాశం ఉంటుంది. పూత థలో- రసం పీల్చు పురుగులు, తేనె మంచు పురుగులు, సూఠీ మౌల్డ్, పౌడర్ మిల్డ్యూ ఆశిస్తాయి. ఫ్రూట్ ఫ్లై ల్యూర్లను మార్చాలి.
మీనామృతం, కిడ్నీ బీన్స్ / రాజ్మా మొలకల కషాయం, ఆగ్నాస్త్రం / నేల వేము కషాయం ఆవు మూత్రం, ఇంగువ, పసుపు కాషాయం కొబ్బరి నీరు, పిచికారీ చెయ్యాలి. లేదా
మీనామృతం, కిడ్నీ బీన్స్ /రాజ్మా ఉలవలు మొలకల ద్రావణం,. కొబ్బరి నీరు సూడోమోనాస్ లేదా బాసిల్లస్ సుబ్టిల్లీస్ మరియు బవేరియా, మెటారైజియం, వెర్టిసీలియం పిచికారీ చేయాలి.
ఫిబ్రవరి, మార్చి మామిడి కాయ పరిమాణం పెరిగే థ – నీరు బాగా పెట్టాలి. పోషకాలు, ఎరువులు అందచేయాలి. ఘన జీవామృతం 2 టన్నులు / ఎకరానికి వెయ్యాలి. ఫ్రూట్ ఫ్లె ౖల్యూర్లను మార్చాలి. రసం పీల్చు పురుగులు, పౌడరి మిల్డ్యూ ఆశిస్తాయి. మీనామృతం, సొయా బీన్ మొలకల కషాయం, అగ్నాస్త్రం, ఆవు మూత్రం, ఇంగువ, పసుపు కాషాయం పిచికారీ చెయ్యాలి లేదా మీనామృతం, సోయాబీన్, ఉలవలు మొలకల ద్రావణం. సూడోమోనాస్ లేదా బాసిల్లస్ సుబ్టిల్లీస్ మరియు బవేరియా, మెటారైజియం, వెర్టిసీలియం పిచికారీ చేయాలి.
ఏప్రియల్, మే మామిడి కాయ కోత కాలములో నీరు తక్కువగా పెట్టాలి లేదా కోతకు 15 రోజుల ముందుగా నీరు ఇవ్వరాదు. నీరు ఎక్కువైతే పండు తియ్యదనం, నిల్వ సామర్ధ్యం తగ్గుతుంది. ఫ్రూట్ ఫ్లై ల్యూర్లను మార్చాలి
మామిడి పూతకు అనుకూల పరిస్థితులు మరియు పంట కాలం
మామిడి పూత వాతావరణమును అనుసరించి వస్తుంది. శీతాకాలంలో రాత్రి అల్పఉష్ణోగ్రత18 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉన్నప్పుడు అనుకూలం. ఈ ఉష్ణోగ్రత మామిడి రకమును బట్టి కూడా మారుతుంది. అందువలన అన్ని ప్రాంతాలలో ఒకేసారి పూత రాదు. ఒకే ప్రాంతంలో అన్ని రకాలు ఒకేసారి పూతకు రావు. పూత మనకు కనబడడానికి కనీసం 20నుండి 30 రోజులకు ముందు అంతర్లీనంగా ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో గాలి వేగం గంటకు16 కి.మీ. లోపుగా ఉండాలి. ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉండాలి. గాలి వలన తోట చుట్టూ చెట్లు తక్కువ పూత వచ్చే అవకాశం ఉంది, కావున విండ్ బ్రేకర్స్గా చెట్లు పెంచడం మంచిది. ఈ కాలంలో సైక్లోన్ వలన పూత తక్కువ వచ్చే అవకాశం ఉంది. కానీ కొంతమంది దానిని వేరే విధముగా వక్రీకరిస్తున్నారు. పూతకు ముందు చెట్లకు నీరు ఉన్నప్పటికీ దాని ప్రభావం పూత మీద ఉండదు. ఈ కారణం పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అదే నిజమైతే కోస్తా, నీటి వనరులు ఉన్న ప్రాంతాలలో పూత రాకూడదు. కానీ అలా జరగడం లేదు. చీడ పీడలు లేకుండా, బోరాన్, నత్రజని వంటి పోషక లోపాలు లేకుండా చెట్లు ఉండేలా చూసుకోవాలి. వీటి ప్రభావం, పూత మరియు ఆడ పూల సంఖ్య మీద ఉంటుంది.
నైరుతి రుతు పవనాల ప్రదేశాలలో ముందుగాను, వరుసగా కేరళ, పశ్చిమ కర్ణాటక, తెలంగాణ, ఉత్తర ఆంధ్రప్రదేశ్లలో ఫిబ్రవరి నుండి జూన్ వరకు, ఈశాన్య రుతు పవనాల వలన దక్షిణ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు పాంతాలు అనంతరం ఉత్తర భారతదేశంలో ఆగష్టు వరకు మామిడి కోతకు వస్తుంది.
పండు ఈగ నిర్వహణకు ల్యూర్లు పెట్టడం
పండు ఈగ వలన, మామిడిలో నష్టం విపరీతంగా ఉన్నది. దీని నివారణకు పూత కాలం ముందు నుండి ఫ్రూట్ ఫ్లై ల్యూర్లను పెట్టుకోవాలి. ల్యూర్ లను ఆగష్టు వరకు ప్రతి నెల క్రమం తప్పకుండా మారుస్తూ ఉండాలి. చాలా మంది రైతులు కోతకు ఒక నెల ముందు మాత్రమే పెట్టుచున్నారు. దీనివలన ఎక్కువ ఫలితం ఉండదు. సామూహికంగా పెట్టడం వలన మెరుగయిన ఫలితాలు ఉంటాయి.
మామిడి పిందె దశ – కీటకాలు, తెగుళ్ల నిర్వహణ అకాల వర్షాలు – ఆంత్రాక్నోస్
మామిడి పిందె థ లేదా పూత ఫలదీకరణం చెందటం. దీనికి అనువైన ఉష్ణోగ్రత 25-30 డిగ్రీల సెంటీగ్రేడ్. ఈ ఉష్ణోగ్రతలో పువ్వులు కాయలుగా ఎక్కువగా మారుతాయి. మొదటి పూత కంటే రెండవసారి వచ్చిన పూతలో ఫలదీకరణ శాతం ఎక్కువగా ఉంటుంది
కీటకముల వలన మొక్కల ఆకులు, పువ్వులు, కాయలకు కలిగిన గాయాల వలన ద్వితీయ సంక్రమణ ద్వారా తెగుళ్లు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతల తేడా 15 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్నా లేదా వేసవి కాలంలో వర్షాలు వచ్చినప్పుడు తెగుళ్లు ఎక్కువగా సోకుతాయి.
అకాల వర్షాల వలన, మామిడి కాయల మీద మంగు మచ్చలు రావడం, క్రుళ్ళిపోవడం జరుగుతుంది. అకాల వర్షాల వలన ఆంత్రాక్నోస్ వంటి తెగుళ్ళు వస్తాయి, దీని నివారణకు సుడోమోనాస్ లేదా బాసిల్లస్ సుబ్టిల్లీస్ పిచికారీ చేయాలి.
మామిడి పండ్లు కోత, అనంతరం పాటించవలసిన జాగ్రతలు
మామిడి పండ్లు కోతకు 40శాతం రంగు వచ్చినవి ఎంపిక చేసుకొని కొయ్యాలి. కాయలు క్రింద పడేలా కోయకూడదు, దెబ్బలు తగలకుండా కొయ్యాలి. అనంతరం సొన కాయకు అంటుకోకూడదు. కాయముచ్ఛిక పొడవుగా ఉండాలి. కాయలను 52 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న నీటిలో 2 నిముషాలు ఉంచడం వలన అంత్రాక్నోస్ వ్యాప్తి నివారింపబడుతుంది. ఇత్లీన్ వాయువును పంపించి మరింత బాగా పక్వానికి వచ్చేలా చెయ్యడం ఆధునిక పద్దతి. టమోటాలు, ముగ్గిన అరటిపండ్లు ఉంచి పక్వానికి వచ్చేలా చెయ్యడం పూర్వ పద్దతి.
మామిడిలో తియ్యదనం పరీక్షించడానికి రిఫ్రాక్టోమీటర్ను ఉపయోగిస్తారు. దీనినే బ్రిక్స్ అంటారు. ఇది 20 కంటే ఎక్కువగా ఉంటే బావుంటుంది. పండూరికి బ్రిక్స్ 28 వరకు ఉంటుంది.
ప్రాసెసింగ్: పచ్చి మామిడి కాయలను తురిమి ఎండబెట్టి చూర్ణం చేసి ఆమ్ చూర్గా అమ్మవచ్చు.
మామిడి పండును శీతల గిడ్డంగులలో ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేము. కావున పండును జ్యూస్గా చేసి 80 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి చేసి వాక్యూమ్ ప్యాకింగ్ చేసి ఒక సంవత్సరానికి పైగా శీతలీకరణ లేకుండా నిల్వ ఉంచుకోవచ్చు.
మరిన్ని వివరములు కొరకు మా వెబ్సైట్ను వీక్షించండి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పశుసంవర్థక శాఖ గ్రామీణ స్థాయిలో పశుపోషణ ద్వారా ఆర్థిక పురోగతి కొరకు జాతీయ లైవ్ స్టాక్ మిషన్ నిధులతో 2021-2022 నుండి 2025-26 సంత్సరాల కాలపరిమితిలో ఔత్సాహిక రైతులను వ్యాపార సరళిలో ప్రోత్సహించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో గొర్రెలు, మేకల పెంపకం, కోళ్ళ పెంపకం, పందుల పెంపకం, పశుగ్రాస, దాణా తయారీలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా అసంఘటితంగా ఉన్న పశు సంవర్ధక రంగాన్ని వ్యవస్థీకృత రంగంలోకి తీసుకువచ్చి పాలు, గ్రుడ్లు మరియు మాంసం ఉత్పత్తిని పెంచి వారికి సరైన మార్కెటింగ్ సౌకర్యాలు గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా గ్రామీణాభివృద్ధికి దోహదం చేస్తుంది.
వివిధ ప్రాజక్టుల వివరాలు
గొర్రెలు, మేకల పెంపకం యూనిట్ పథకంలో 500 గొర్రెలు మరియు 25 పొట్టేళ్ళతో కూడిన యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా గొర్రె లేదా మేక పిల్లల ఉత్పత్తి మరియు పోషణ చేపట్టడం జరుగుతుంది. కోటి రూపాయలు, అంతకుమించి ప్రాజక్టు విలువ ఉన్నచో గరిష్టంగా రూ. 50 లక్షలు రాయితీ మంజూరు చేయబడును. అంతకన్నా తక్కువ ఉన్నచో, ప్రాజక్టు విలువలో 50 శాతం రాయితీ మంజూరు చేయబడును.
* కోళ్ళ అభివృద్ధి పథకంలో తక్కువ వ్యయంతో కూడిన సాంకేతికతతో 1000 పెట్టలు + 100 పుంజులు సామర్థ్యం గల పెరటి కోళ్ళ యూనిట్ కోడి పిల్లల ఉత్పత్తి యూనిట్ మరియు పొదుగు కోళ్ళ యూనిట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రూ. 50 లక్షల మొదలుకొని అంతకుమించి ప్రాజక్టు ఖరీదు ఉన్నచో గరిష్టంగా రూ. 25 లక్షలు రాయితీ మంజూరు చేయబడును. అంతకన్నా తక్కువ ఉన్నచో ప్రాజక్టు విలువలో 50 శాతం రాయితీ మంజూరు చేయబడును.
* పందుల పెంపకంలో 100 ఆడ పందులు మరియు 10 మగ పందులతో యూనిట్ ఏర్పాటు చేసి దీని ద్వారా పందిపిల్లల ఉత్పత్తి మరియు పోషణను చేపట్టడం జరుగుతుంది. రూ. 60 లక్షలు మొదలుకొని అంతకుమించి ప్రాజక్టు ఖరీదు ఉన్నచో గరిష్టంగా రూ. 30 లక్షలు రాయితీ మంజూరు చేయబడును. అంతకన్నా తక్కువ ఉన్నచో ప్రాజక్టు విలువలో 50 శాతం రాయితీ మంజూరు చేయబడును. అదేవిధముగా 50 ఆడ పందులు + 5 మగ పందుల యూనిట్ ఏర్పాటు కొరకు గరిష్టంగా రూ. 15 లక్షల వరకు రాయితీ అందించబడును.
* పశుగ్రాసం మరియు దాణా అభివృద్ధి పథకంలో సైలేజి తయారీ యూనిట్, పశుగ్రాస దిమ్మల తయారీ యూనిట్ మరియు సమీకృత దాణా తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సైలేజీ తయారీ యూనిట్ సమీకృత దాణా మరియు పశుగ్రాస దిమ్మల తయారీ యూనిట్లకు కోటి రూపాయలు మొదలుకొని అంతకుమించి ప్రాజక్టు విలువ ఉన్నచో గరిష్టంగా రూ. 50 లక్షల రాయితీ మంజూరు చేయబడును. అంతకన్నా తక్కువ ఉన్నచో ప్రాజక్టు విలువలో 50 శాతం రాయితీ మంజూరు చేయబడును.
ఈ కార్యక్రమముల ద్వారా గ్రామీణ స్థాయిలో పశూత్పత్తులైన పాలు, మాంసం మరియు గ్రుడ్ల ఉత్పత్తిని పెంచుకుని అధిక ఆదాయం పొందడం ద్వారా గ్రామీణ యువతకు ఉపాధిని కల్పించి సుస్థిరతను, ఆత్మనిర్భరతను సాధించవచ్చు. ఎగుమతుల ద్వారా విదేశీ మాదకద్రవ్యాన్ని కూడా ఆర్జిస్తూ దేశ ఆర్థిక పురోగమనంలో పాలు పంచుకోగలరు.
లబ్దిదారుల అర్హత
అనుభవం గల వ్యక్తిగత పోషకులు, రైతు ఉత్పాదకత సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, సెక్షన్-8 కంపెనీల నుండి అర్హతను బట్టి లబ్దిదారులను ఈ క్రింద చెప్పబడిన విధంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
లబ్దిదారుల ఎంపిక విధానము:
1. లబ్దిదారు సంబంధిత ప్రాజక్టు అంశంపై శిక్షణ పొంది ఉండాలి లేదా ప్రాజక్టు నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి.
2. లబ్దిదారుడు నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రాజక్టు నివేదికను తయారు చేసి పోర్టల్లో అప్లోడ్ చేయాలి.
3. రాయితీ కొరకు మిగిలిన యూనిట్ ఖరీదు కోసం బ్యాంక్ రుణంగా పొందడానికి అవసరమైన పత్రాలను సమర్పించి బ్యాంకు అనుమంతి పొంది ఉండాలి.
4. లబ్దిదారుడు తన సొంత భూమి లేదా కౌలు భూమిలో మాత్రమే ప్రాజక్టు ఏర్పాటు చేయవలెను.
5. వీటిని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీ పరిశీలిస్తుంది.
6. నిబంధనల ప్రకారం అర్హతలున్న వారిని ఎంపిక చేసి నేషనల్ లైవ్స్టాక్ మిషన్కు పంపిస్తారు.
సబ్సిడీ విడుదల చేయు విధానము
* 50 శాతం బ్యాక్ ఎండ్ మూలధన సబ్సిడి ప్రాజక్టు ప్రకారం రెండు దఫాలుగా విడుదల చేయబడుతుంది.
* బ్యాంక్ వారు మొదటి థ రుణాన్ని లబ్దిదారునికి అందించారు అనే విషయాన్ని అధికారులు ధృవీకరించుకొన్న తర్వాత మాత్రమే మొదటి దఫా సబ్సిడీ మొత్తాన్ని రుణం మంజూరు చేసిన బ్యాంక్ వారికి జమ చేయబడుతుంది. ఆ సబ్సిడీని బ్యాంకు వారు లబ్దిదారుడి ఖాతాలో జమ చేస్తారు.
* ప్రాజక్టు మొత్తం పూర్తయిన తరువాత అధికారులు ధృవీకరించుకొని రెండవ దఫా సబ్సిడీకి లబ్దిదారులను అర్హులుగా పరిగణిస్తారు.
మరిన్ని వివరాలకు సంప్రదించండి: దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంట్లను https://www.apurban.com/Tenders_Display.aspx నుండి పొందవచ్చు. సమగ్ర ప్రాజక్టు నివేదిక (DPR), సాంకేతిక తోడ్పాటు, ఇతర వివరముల కొరకు కె. దీపు (ఫోన్: 9704094969); డా లక్ష్మీనారాయణరెడ్డి (ఫోన్: 8790997387), డా. వై. సింహచలం, M.V.Sc., అదనపు సంచాలకులు, SMILE, విశాఖపట్నం. డా. ఆర్. అమరేంద్ర కుమార్, M.V.Sc., సంచాలకులు, పశుసంవర్ధశాఖ, ఆంధ్రప్రదేశ్. వారిని సంప్రదించగలరు.
రాష్ట్రంలోని ఔత్సాహిక రైతులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పశుసంవర్థక శాఖ వారు కోరుచున్నారు.
ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలకుగాను 21 జిల్లాల్లో తక్కువ వర్షపాతం. అన్నమయ్య, అనంతపురం జిల్లాలలో చాలా ప్రాంతాల్లో వర్షాలు లేక పంటలు విత్తనేలేదు. బెట్ట పరిస్థితుల వలన విత్తిన పంటలు చాలా జిల్లాల్లో దెబ్బతిన్నాయి. తెలంగాణలో కూడా నిండిన జలాశయాలు, చెరువులు, భూగర్భజలాలు బాగున్న చోట తప్ప వర్షాధార పంటలకు ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో చాలా వరకు బెట్ట దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ (హస్త, చిత్త, స్వాతి తొలి రోజులు)లో వ్యవసాయ పంటల్లో చేయవలసిన పనులను గురించి…
టమాట: పొడి వాతావరణం, ఎండలు బాగా కాయడం, టమాట దిగుబడికి మంచి అనుకూలం. జులై, ఆగస్టు మొదట్లో విపరీతంగా పెరిగిన టమాట ధరలు ఈ పంట విస్తీర్ణాన్ని పెంచేవిధంగా ఆశ జూపాయి. ఫలితంగా రైతుకు దక్కే ధర పత్తి కొండ మార్కెట్లో కిలో 40 పైసలకు పడిపోయింది. విస్తీర్ణాన్ని నియంత్రించి దిగుబడిని తగ్గించాల్సిన అవసరముంది. ఎగుమతులను, ప్రాసెసింగును బాగా పెంచాల్సిన అవసరముంది. జులై నుండి మార్చి వరకు టమాట విస్తీర్ణాన్ని తగ్గించాల్సిన అవసరమేర్పడింది.
వరి: సన్నబియ్యానికి ప్రపంచమంతా మంచి గిరాకీ ఉంది. ఎంత పండించినా ఎగుమతి చేసుకొని మంచి ధరలు పొందే అవకాశం ఉంది. ఎగుమతులను ప్రోత్సహించాల్సిన అత్యవసరమేర్పడింది. పండించే సత్తా కూడా రెండు తెలుగు రాష్ట్రాలతో సహా భారతదేశానికుంది. రాష్ట్రాలు, కేంద్రం ఈ అవకాశాలను సద్వినియోగ పరచుకొని రైతులను ప్రోత్సహించి సన్నబియ్యాన్ని ఎక్కువగా పండించడానికి తగిన ప్రోత్సాహకాలిచ్చి, రైతులకు మేలు చేయవచ్చు. ఫారిన్ ఎక్స్చేంజ్ని అధికంగా సంపాదించవచ్చు. ప్రభుత్వాల ఆలోచనా విధానంలో మార్పులు అత్యవసరం. వర్షాకాలం మొదట్లో విత్తిన స్వల్పకాల వరి రకాలు అక్టోబర్లో కోతకొస్తాయి. తయారైన పంటను వెంటనే కోసి, తుపాన్లబారి నుండి రక్షించాలి. వరి మద్దతు ధర సాధారణ రకాలకు రూ. 2185/క్వి. ఏ గ్రేడ్ రకాలకు రూ. 2203/క్వి. నిదానంగా జూన్, జులై, ఆగస్టులలో నారుపోసి నాటిన వరి, వివిధ థల్లో (గింజ గట్టిపడు, పాలుపోసుకొను, కంకి, చిరుపొట్ట, పిలకలు వేయు థల్లో) ఉంది. వివిధ రకాల పురుగులు, రోగాల బారి నుండి పంటను కాపాడడానికి అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్లో కూడా ఎక్కువ వర్షాలు పడతాయి. తుపాన్లు రావచ్చు. పడిన ఎక్కువ నీరు త్వరగా వెళ్ళిపోయేటట్లు గట్లను తెగ్గొట్టాలి. నష్టాన్ని తగ్గించాలి. రబీ పంటకు అక్టోబరులో నార్లు పోయడం అనుకూలం కాదు. చలికి పంటకాలం ఎక్కువవుతంది. పంట దిగుబడి తగ్గుతుంది. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేరుశనగ, పొద్దుతిరుగుడు పండించి మంచి ఆదాయం పొందవచ్చు. పెసర, మినుము, శనగ విత్తడానికి అక్టోబర్ నెల అనుకూలం.
జొన్న: వానాకాలం జొన్న కోతలు అక్టోబర్లో ఉంటాయి. క్వాలిటీ జొన్న రకాల పిండి ధరలు విపరీతంగా పెరిగాయి. జొన్నలు పండించడం తక్కువ, వినియోగం ఎక్కువగా ఉంది. జొన్నలో అత్యంత పోషక విలువలు కలిగి, దిగుబడులు బాగా ఎక్కువగా ఇచ్చేరకాలు: పర్భనిశక్తి (ఐ.సి.ఎస్.ఆర్-14001): దిగుబడి నీటి ఆధారంగా 28-32 క్వి/ఎ. వర్షాధారంగా 16-20 క్వి./ఎ. ఇతర రకాల కంటే 50% ఐరన్, జింక్ ఎక్కువ. ఐరన్ 45, జింకు 32 పి.పి.ఎమ్. ప్రోటీన్లు 11.9% రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, మహారాష్ట్రలో కూడా విత్తవచ్చు. తెల్లటిగింజ గలిగి ఉంటుంది. ఐ.సి.ఎస్.హెచ్-14002: హైబ్రిడ్. తెల్లటిగింజ. వరి మాగాణులలో కూడా పండించవచ్చు. చలికాలం/యాసంగికి అనుకూలం. గింజ లావుగా ఉంటుంది. నీటి ఆధారంగా 28-32 క్వి/ఎ. వర్షాధారంగా 16-20 క్వి/ఎ. దిగుబడినిస్తుంది. నీటిఆధారంగా ఈనెలలో విత్తవచ్చు. ఇతర రకాల కంటే 40% అధిక ఐరన్, జింక్ కలిగి ఉంటుంది. చొప్ప అధికంగా ఇస్తుంది. మొక్క 1.9 నుండి 2.0 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. ఐ.సి.ఎస్.వి-15013: ఎర్రగింజ. ఎగుమతికి అనుకూలం. గింజ దిగుబడి 30 క్వి/ఎ. చొప్ప 2.0-2.5 ట/ఎ. అక్టోబరులో రెండు తెలుగు రాష్ట్రాల్లో విత్తడానికి అనుకూలం. ఐరన్ 50 పిపిఎం, జింక్ 45-50 పిపిఎం. 2-3 తడుల నీరు ఇవ్వాల్సుంటుంది. చీడపీడల బెడద తక్కువ. పెట్టుబడి తక్కువ. మార్కెట్ సదుపాయం కొరకు ముందుగా మాట్లాడుకొని విత్తేందుకు ప్రయత్నించవచ్చు. ఇక్రిశాట్ వారిని సంప్రదించవచ్చు. ఎన్.టి.జె-5: నల్లనేలల్లో 20-25 తేలిక నేలల్లో 14-16 క్వి/ఎ. గింజ దిగుబడి. ఎం. 35-1 (మల్దండి): గింజ దిగుబడి 10-12 క్వి/ఎ. గింజ, చొప్ప అత్యంత నాణ్యంగా ఉంటాయి. మార్కెట్లో అత్యధిక ధర పలుకుతాయి. దిగుబడి తక్కువ. జొన్న మద్దతు ధర మల్దండి : రూ. 3225/క్వి. హైబ్రిడ్: రూ. 3180/క్వి.
శనగ: అత్యధిక దిగుబడులు సాధించాలంటే ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 15 నుండి నవంబరు 15 లోగా విత్తాలి. తెలంగాణలో అక్టోబర్ మొదటి నుండి నవంబరు 15 వరకు విత్తాలి. అత్యధిక దిగుబడులనిచ్చే రకాలు: నంద్యాల గ్రామ్-857 (ఎన్.బిఇ.జి-857): దేశవాళీ రకం. 90-105 రోజులు. వర్షాధారంగా 7-9 క్వి/ఎ. దిగుబడి. 1-2 నీటి తడులతో 12-14 క్వి/ఎ. ఎండుతెగులును తట్టుకుంటుంది. కర్ణాటక, తమిళనాడుల్లో కూడా సాగుకు అనుకూలం. నంద్యాల గ్రామ్-452 (ఎన్.బిఇ.జి-452): దేశవాళి రకం. 90-105 రోజలు. వర్షాధారంగా 7-9 క్వి/ఎ. 1-2 తడులతో 10-12 క్వి/ఎ. దీర (ఎన్.బిఇ.జి-47): దేశవాళి రకం. 90-105 రోజులు. వర్షాధారంగా 7-9 క్వి/ఎ, 1-2 నీటి తడులతో 10-12 క్వి/ఎ. నంద్యాలగ్రామ్-119 (ఎన్.బిఇ.జి-119): కాబూలీరకం. లావుగింజ. 90-100 రోజులు. వర్షాధారంగా 6-8 క్వి/ఎ. 1-2 నీటితడులతో 10 క్వి/ఎ. శనగ మద్దతు ధరలకంటే మార్కెట్ ధరలు అధికంగా ఉన్నాయి.
పెసర: వర్షాధార పెసర అక్టోబరులో కోతకు వస్తుంది. మద్దతు ధర రూ. 8558/క్వి. తెలంగాణాలో యాసంగి పెసర పంటను సెప్టెంబరు 15 నుండి అక్టోబరు కడవరకు, ఆంధ్రప్రదేశ్లో అక్టోబరులోను విత్తి అత్యధిక దిగుబడులు పొందవచ్చు. చలికాలం/రబీ/యాసంగికి అనువైన రకాలు: పల్లాకు తెగులును తట్టుకునే పెసర మెరుపు గింజ రకాలు: డబ్ల్యు.జి.జి-42 (యాదాద్రి) 4-6 క్వి/ఎ, డబ్ల్యు.జి.జి-37 (ఏకశిల) 5-6 క్వి/ఎ. టి.ఎం-96-2: 4-6 క్వి/ఎ.
మినుము: పల్లాకు తెగులును తట్టుకునే అధిక దిగుబడినిచ్చే మినుము పాలిష్ రకాలు: టి.బి.జి-104, జి.బి.జి-1 దిగుబడి 8-9 క్వి/ఎ. మినుము మద్దతు ధర రూ. 6950/- మంచి దిగుబడికి అక్టోబరులో విత్తవచ్చు. వర్షాకాలపు మినుము పంటకోతలు అక్టోబరులో ఉంటాయి. మార్కెట్ ధర, మద్దతు ధర కంటే అధికంగా ఉన్నాయి.
ఉలవ: ఈ పంట సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో విత్తుటకనుకూలం. అత్యధిక దిగుబడినిచ్చే రకాలు. క్రీడ హర్ష (సి.ఆర్.హెచ్.జి-19) 6.0-7.7 క్వి/ఎ. గింజ దిగుబడినిస్తుంది. గోధుమ రంగు గింజ. 80-85 రోజుల పంట. ఆంత్రాక్నోస్ మరియు బూడిద తెగుళ్ళను తట్టుకుంటుంది. 85-95 రోజుల పంట. క్రీడవర్ధన్ (సి.ఆర్.హెచ్.జి-22): నలుపు గింజ. గింజ దిగుబడి: 6.0-7.5 క్వి/ఎ. బూడిద, పల్లాకు, ఆంత్రాక్నోస్ తెగుళ్ళను తట్టుకుంటుంది. 85-90 రోజుల పంట.
కుసుమ: అత్యధిక దిగుబడులకు యాసంగిలో అక్టోబరు రెండవ పక్షం నుండి నవంబరు మొదటి పక్షం వరకు విత్తుట మేలు. అధిక దిగుబడి రకాలు: జె.ఎస్.ఎఫ్-414 (పూలె కుసుమ): 135 రోజులు, 8 క్వి/ఎ. నీటి పారదుల క్రింద అనుకూలమైన రకం. డి.ఎస్.హెచ్-185: 135 రోజులు, 7-8 క్వి/ఎ, ఎండుతెగులును తట్టుకునే హైబ్రిడ్. ఐ.ఎస్.ఎఫ్-764: 125-128 రోజులు, 6-8 క్వి/ఎ, బెట్టను కొంతవరకు తట్టుకుంటుంది.
సోయాచిక్కుడు: రబీ పంటగా అక్టోబరులో దీనిని ఆంధ్రప్రదేశ్లో మాత్రం విత్తవచ్చు. తెలంగాణలో విత్తితే దిగుబడి బాగా తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్కు అనుకూలమైన, అధిక దిగుబడి రకాలు. భీమ్ (ఎల్.ఎస్.బి.-18): దిగుబడి: 10-12 క్వి/ఎ. 105-110 రోజుల పంట. లేత పసుపు రంగు గుండ్రని గింజలు. మధ్యస్థ సైజు గింజ. భాసర్ (ఎల్.ఎస్.బి-22): దిగుబడి: 10-11 క్వి/ఎ. 105-110 రోజుల పంట. కోత ఆలస్యమైనా కాయ చిట్లదు. లేత పసుపు రంగు గుండ్రని గింజలు.
గోధుమ: చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పండించవచ్చు. అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు విత్తవచ్చు. అనుకూలమైన రకాలు: ఎం.ఏ.సి.ఎస్-2496: చపాతీకి అనుకూలం. 110-125 రోజుల పంట. దిగుబడి 15 క్వి/ఎ. బ్రెడ్ రకాలు: డి.డబ్ల్యు.ఆర్-162: 126-134 రోజుల పంట. దిగుబడి: 15 క్వి/ఎ. సోనాలిక: 120-134 రోజుల పంట. దిగుబడి 15 క్వి/ఎ. కొద్దిగా నీటి సౌకర్యముంటే కొద్దిగా ఆలస్యంగా కూడా విత్తవచ్చు. రవ్వ రకం: ఎం.ఏ.సి.ఎస్-2846: 120-130 రోజులు, దిగుబడి: 12 క్వి/ఎ.
సిరిధాన్యాలు: నీటి ఆధారముంటే అక్టోబరులో కూడా విత్తవచ్చు. సొంతంగా బియ్యం పట్టించి మార్కెటింగ్ చేసుకోగల్గితే ఆదాయం పెరుగుతుంది. మిక్సీలో బుచ్చి విధానం ద్వారా బియ్యం చేసుకోవచ్చు. ఆర్గానిక్ పద్ధతిలో పెంచి ప్రచారం చేసుకుంటే నమ్మకం పెరిగి, ఇంటి దగ్గరే లేక పొలం దగ్గరే వచ్చి కొనేందుకు వినియోగదారులు వస్తారు.
కొత్తిమీర / ధనియాలు: కొత్తిమీర వినియోగం అన్ని కాలాలలోనూ పెరుగుతున్నది. ధరలు కూడా ఆశాజనకంగా ఉంటున్నాయి. వానలు తగ్గి, చలివాతావరణం ఏర్పడితే, ధనియాల పంట కొరకు అక్టోబరులో విత్తడం మొదలు పెడతారు. చలివాతావరణంలో కొత్తిమీర ఎదుగుదల బాగుంటుంది. ధనియాల కొరకు పండించిన పంట నుండి ఒత్తుగా ఉన్న మొలకలను పెరికి కొత్తిమీరగా అమ్మడం మొదలైనాక కొత్తిమీర ధరలు తగ్గే అవకాశాలున్నాయి. అధిక విత్తన మరియు కొత్తిమీర దిగుబడులకు అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు విత్తుట అనుకూలం. అధిక గింజ దిగుబడి రకాలు: గుజరాత్ ధనియా, హిస్సార్ సురభి, సింపోస్-33. ధనియాల ధరలు మార్కెట్లో ఆశాజనకంగా ఉన్నాయి.
ప్రత్తి: మీడియమ్ స్టేపుల్ ప్రత్తి మద్దతు ధర రూ. 6620/క్వి. లాంగ్ స్టేపుల్ రూ. 7020/క్వి.గా ఉంది. ప్రత్తి పంటలో ఖర్చు పెరుగుతున్నందున, ఈ రేటుతో రైతులు తృప్తి పొందడం లేదు. అందువలన ప్రత్తి విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నారు. ఈ నెలలో ప్రత్తి మార్కెట్కు రావడం మొదలవుతుంది. ధరలు బాగుంటే ప్రత్తి పంట రాబోయే కాలంలో పండిస్తారు. లేకపోతే దిగుమతులే శరణ్యం కావచ్చు. బయటి దేశాల రైతులకిచ్చే దానికంటే, మన రైతులకు లాభమొచ్చేటట్లు చేయండి. మొదటి దఫా ప్రత్తి తీత తర్వాత గులాబీ రంగు పురుగు నివారణకు అవసరమైతే తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. తెల్లదోమకు పసుపు రంగు కార్డులు అమర్చుట, ఆకుమచ్చ, బాక్టీరియా నల్లమచ్చ, కాయకుళ్ళు తెగుళ్ళకు తగిన నివారణ చర్యలు అవసరమైతే చేపట్టాల్సి ఉంటుంది.
కంది: కంది పెరిగే థలో శనగపచ్చ పురుగు, ఆకుగూడు పురుగు, ఈకరెక్క పురుగు, ఎండుతెగుళ్ళు చవ్చే అవకాశముంది. ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
రైతులకు మేలు జరిగేటట్లు రాజకీయ నిర్ణయాలుంటే రైతులు పల్లె ప్రజలు బాగుపడే అవకాశాలుంటాయి. అలాంటి పార్టీలకు ప్రజాదరణ బాగుంటుంది. ఓట్లొస్తాయి. సన్నబియ్యానికి ప్రపంచమంతా మంచి గిరాకీ ఉంది. కర్ణాటకలో ప్రజలకు పంచుదామంటే బియ్యం లేక దానికి బదులు డబ్బులిస్తున్నారు. తెలంగాణలో బియ్యం దిగుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ధరలంతగా పెరగలేదు. రైతులు వినియోగదారులు బాగుపడాలంటే వరి పంట మీద కంట్రోల్స్ చాలావరకు తీసేస్తే రైతులకు ప్రభుత్వాలకు మంచిదనిపిస్తున్నది.
సలహాలు, సూచనలకు ప్రొఫెసర్ సల్లా నారాయణ స్వామి, ఫోను నెంబరు 9494408619 చైర్మన్, నారాయణ ఫౌండేషన్, హైదరాబాదు. ఇ-మెయిల్: profsnswamy@gmail.com, ఫేస్బుక్: SALLA Narayana Swamy
గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే, గతంలో ఎక్కువమంది డబ్బు సంపాదనే ధ్యేయంగా తమ జీవితాలను కొనసాగించారనే విషయం అక్షర సత్యం. అప్పట్లో డబ్బు ఎక్కువమంది దగ్గర అందుబాటులో ఉండేది కాదు కాబట్టి ఆవిధంగా ఆలోచించారు. ఆ ఆలోచనల ఫలితమే డబ్బు కోసం వ్యవసాయ రంగం నుంచి వేరే ఉద్యోగ వ్యాపార రంగాలకు వలసలు బాగా జరిగినవి. కాబట్టి వ్యవసాయరంగంలో ఒకప్పుడు 90 శాతం ఉండే జనాభా తగ్గి ప్రస్తుతం సుమారు 70 శాతం మంది వ్యవసాయం మరియు దాని అనుబంధరంగాలపై ఆధారపడి తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. వ్యవసాయ రంగం నుండి దూరం జరిగి ఉద్యోగ, వ్యాపార రంగాలలో స్థిరపడ్డ వారిలో చాలామంది ఆర్థికపరంగా ఇబ్బందులు లేని స్థాయికి చేరుకున్నారు. ఈ స్థాయికి చేరే క్రమంలో కొంతమంది వివిధ రకాల కారణాల వలన ఆరోగ్యాన్ని, తృప్తిని కోల్పోవలసి వచ్చింది. ఒకవిధంగా చెప్పాలంటే కొంతమంది తమ జీవితాలను ఫణంగా పెట్టి ఆర్థికంగా ఎదిగారు అని చెప్పవచ్చు. కాని జీవితంలో ఉండవలసిన ఆనందం, తృప్తి, ఆరోగ్యం లాంటివి సరైన పాళ్ళలో లేకపోవడము వలన వీటికొరకు కొంతమంది తిరిగి వ్యవసాయరంగంవైపు చూస్తున్నారు. ఆరోగ్యంగా జీవితాన్ని కొనసాగించాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తినడముతో పాటు, స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ, శారీరక శ్రమ తప్పని సరిగా చేయాలి. ఈమూడు అంశాలు కలిగిన రంగాలలో వ్యవసాయరంగం మొదటి వరుసలో ఉంటుంది. కాబట్టి జీవితంలో ఆరోగ్యం, తృప్తి, ఆనందం కావాలంటే వ్యవసాయరంగమే సరైన దారి గ్రహించిన చాలామంది వ్యవసాయరంగంవైపు అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. ఈ కోవకే చెందుతారు పల్నాడు జిల్లా బోయపాలెం గ్రామంలో 13 ఎకరాలలో డ్రాగన్ఫ్రూట్ పంటను సాగు చేస్తున్న పోలేశ్వరరావు.
పోలేశ్వరరావు గారిది వ్యవసాయ నేపథ్యం కాదు. వారి తండ్రికాని, వారి తాతలు కాని వ్యవసాయం చేయలేదు. వీరిది వ్యాపార ప్రస్థానం. పోలేశ్వరరావు గారు వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ అన్ని రకాల సౌకర్యాలతో జీవితాన్ని కొనసాగించటానికి అనుగుణంగా ఆర్థికంగా బలపడ్డారు. వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా ఒక స్థాయికి చేరుకున్నారు. అయినాకాని జీవితంలో ఏదో అసంతృప్తి ఉంది. తన అసంతృప్తికి కారణం తెలుసుకుని దానికి పరిష్కారం వ్యవసాయరంగమే అని గ్రహించి అటువైపు అడుగులు వేశారు. తాము వ్యాపారరంగంలో కొనసాగుతూ గుంటూరు సమీపములోని బోయపాలెం గ్రామంలో కొంత భూమిని కొనుగోలు చేసుకున్నారు. ఆ భూమిలో ఎలాంటి పంటలు సాగు చేయాలని ఆలోచించసాగి వివిధ రకాల పంటల గురించిన సమాచారాన్ని సేకరించి తమ ఆలోచనలకు, జీవనశైలికి అనుగుణంగా ఉండే పంట డ్రాగన్ఫ్రూట్ అని గ్రహించి డ్రాగన్ఫ్రూట్ సాగు చేయటానికి నిర్ణయం తీసుకున్నాడు.
పోలేశ్వరరావుగారు స్వతహాగా వ్యాపారవేత్త కాబట్టి అతని ఆలోచనలు తప్పనిసరిగా లాభాలు పొందాలనే ఉంటాయి. తగినంత పెట్టుబడి పెట్టడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి సాగుని త్వరగా లాభాల బాట పట్టించడముతో పాటు వ్యవసాయరంగాన్ని కూడా వ్యాపారసరళిలో చేసి లాభాలు గడించాలంటే డ్రాగన్ ఫ్రూట్ సాగు సరైనదారి అని గ్రహించి డ్రాగన్ ఫ్రూట్ సాగుకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మొదలు పెట్టి, అన్ని తెలుసుకున్న తరువాత డ్రాగన్ ఫ్రూట్ సాగుని వ్యాపారంగా చేయాలని తలచి అందుకు అనుగుణంగా మిగతా రైతులకు భిన్నంగా అంటే ఎకరానికి 8000 మొక్కలు వచ్చేలా పదమూడు ఎకరాలకు లక్షకు పైగా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను 2020 వ సంవత్సరం జూన్ నెలలో నాటించారు.
మన దేశంలో వివిధ ప్రాంతాలు తిరిగి పదికి పైగా డ్రాగన్ ఫ్రూట్ రకాలను సేకరించి 13 ఎకరాలలో నాటించాడు. మామూలుగా ఇప్పటివరకు డ్రాగన్ఫ్రూట్ సాగు చేసే రైతులు ఎకరానికి 5 నుంచి 8 లక్షల వరకు ఖర్చు చేసి ఎకరానికి 1600 నుంచి 4000 మొక్కల వరకు నాటించారు. కాని పోలేశ్వరరావు గారు పది అడుగులు ముందుకు వేసి ఎకరానికి 15 లక్షలకు పైగా ఖర్చు చేసి ఎకరానికి 8000 మొక్కలు వచ్చేలా నాటించాడు. వీరు వ్యవసాయాన్ని కూడా వ్యాపారంగా చూడాలి అనే లక్ష్యంతో, తనకు పెట్టుబడి ఇబ్బంది లేదు కాబట్టి తాను పెట్టుబడి పెట్టి వచ్చే ఫలితాలను తోటి రైతులకు చూపించగలిగితే ఇంకొంతమంది రైతులు ఈ బాటలో నడవడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని భావించి 13 ఎకరాలకుగాను లక్ష మొక్కలకు పైగా నాటించి సాగు చేస్తున్నాడు. డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఎక్కువ నీటిని తట్టుకోలేదు కాబట్టి బెడ్ తయారు చేసుకుని బెడ్లపై మాగిన పశువుల, గొర్రెలు, కోళ్ళ ఎరువులలో ట్రైకోడెర్మావిరిడే, సూడోమోనాస్, వేపపిండి లను కలిపి ఈ మిశ్రమాన్ని వేసి రెండు వరుసలు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను 2020వ సంవత్సరం జూన్ నెలలో నాటించాడు.
మొక్కలకు పోషకాలను అందించడానికి సంవత్సరానికి మూడుసార్లు ట్రైకోడెర్మా, సూడోమోనాస్, వేపపిండిలను కలిపిన పశువుల/గొర్రెల/కోళ్ళ ఎరువును అందించడంతో పాటు క్రమం తప్పకుండా జీవామృతం, నవధాన్యాల పిండి ద్రావణం, ఫ్రూట్ పర్మంటెడ్ జ్యూస్ ద్రావణాన్ని డ్రిప్పు ద్వారా పంపిస్తుంటాడు. అన్ని మెళకువలు సక్రమంగా పాటిస్తున్నారు. కాబట్టి మొక్కలు పెట్టిన 12 నెలల తరువాత మొదటి దిగుబడి మొదలయ్యింది. మొదటి సంవత్సరం 13 ఎకరాలకు గాను 10 టన్నుల దిగుబడి సాధించగలిగారు. ఈ సంవత్సరం జూన్ నెల నుండి దిగుబడి మొదలయ్యింది. ఆగస్టు 17వ తారీకు వరకు 30 టన్నుల దిగుబడి పొందారు. నవంబరు వరకు దిగుబడి వస్తుంది. పంటను గమనించినట్లయితే 13 ఎకరాలకు గాను ఇంకా 70 టన్నుల దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని పోలేశ్వరరావు గారు అంటున్నారు. వచ్చిన దిగుబడిని మార్కెట్ చేయడంలో ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదు. కాయలను సైజుల వారీగా గ్రేడు చేసి కిలో 80/- నుంచి 130/- రూపాయల వరకు అమ్మకం చేస్తూ వస్తున్నాడు. మరిన్ని వివరాలు 98485 90044 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
ఆరోగ్యం, తృప్తికి సరైనదారి
వ్యవసాయంలో శారీరక శ్రమకు అవకాశం ఉండటంతో పాటు కాలుష్యం లేని వాతావరణం అందుబాటులో ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగంలో ఉండేవారు ఆరోగ్యంగా ఉండటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. మన ఆరోగ్యం మన మానసిక స్థితిపై కూడా చాలావరకు ఆధారపడి ఉంటుంది. వ్యవసాయంలో పంటలు దిగుబడి సాధించిన తరువాత వచ్చే తృప్తికి వెలకట్టలేము. దానికి తోడు వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు, వ్యక్తులు, విద్యార్థిని, విద్యార్థులు మన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి తమ అభిప్రాయాలు వెల్లడించిన సమయంలో మనం పొందే తృప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. తాను వివిధ రకాల వ్యాపారాలలో కోట్లు సంపాయించిన సందర్భంలో పొందిన ఆనందం కంటే తాను డ్రాగన్ ఫ్రూట్ సాగుని ప్రారంభించిన తరువాత పొందే తృప్తి ద్వారా వచ్చిన ఆనందం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండటంతో పాటు తమ ఆరోగ్యం మెరుగు అవుతుంది కాబట్టి తృప్తికి, ఆరోగ్యానికి సరైనదారి వ్యవసాయమే అని తాను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను అని పోలేశ్వరరావు అంటున్నాడు.
గర్భసంచిలోని పిండానికి, తల్లికి మధ్య సంధానకర్తగా, తల్లి నుండి పోషకపదార్థాలను పిండానికి సరఫరా చేయడానికి మరియు పిండాన్ని రక్షించడానికి పిండం చుట్టూ ఏర్పడిన పొరను మాయ అంటారు. సాధారణంగా పశువు ఈనిన తర్వాత పిండం చుట్టూ ఏర్పడిన పొర నిరుపయోగమై తల్లి గర్భం నుండి వేరుపడి బయటకు రావడం జరుగుతుంది.
పశువు ఈనే సమయం సమీపించిన కొలది మాయ పరిపక్వత చెందుతుంది. పశువు ఈనిన తర్వాత పరిపక్వత చెందిన మాయను బయటకు విడుదల చేస్తుంది. పశువు ఈనే సమయానికి మాయ పరిపక్వత చెందక పోయినట్లయితే, ఈనిన తరువాత పశువు మాయను విడుదల చేయలేదు. రెండు లేక మూడు శాతం పశువులు మాయ వేయకపోవడం సాధారణ విషయంగా పరిగణించవచ్చు. 5 శాతానికి మించితే చూడిపశువుల యాజమాన్య పద్ధతులను పూర్తిగా పరిశీలించవలసి ఉంటుంది.
మాయవేయని పశువులను పరీక్షించినచో మానం ఉబ్బి, నొప్పిగా ఉంటుంది. నాడి మరియు శరీర ఉష్ణోగ్రత పెరుగుతాయి. పశువులు నీరసపడి మేత తినవు. పేడ వేసేటప్పుడు, మూత్రం పోసేటప్పుడు ముక్కుతాయి. పశువులు వెన్ను విరుస్తూ తరచుగా తోకను కదిలిస్తూ బాధపడుతూంటాయి. పాలదిగుబడి బాగా తగ్గుతుంది.
చూడిపశువులకు సరైన వ్యాయామం లేకపోవడం, పోషకాహార లోపం, కాల్షియం, సెలీనియం, అయోడిన్, విటమిన్ ఏ వంటి ఖనిజ లవణాలు మరియు విటమిన్ల తీవ్రమైన లోపాల వలన మాయ సరిగా వేయకపోవచ్చును. ఈనిన తరువాత ప్రతికూల పరిస్థితులలో గర్భకోశ చలనాలు సరిగా లేకపోవడం, హార్మోన్ల ఉత్పత్తిలో తేడాల వలన ఈనటం కష్టమవుతుంది. దానితోపాటు పశువు నీరసపడి బలహీనపడినప్పుడు మరియు ముసలితనం వల్ల పశువులు మాయ సరిగా వేయవు. ఈసుకొని పోయిన, నెలలు నిండకముందే ఈనిన పశువులలో మాయ పడకపోవడం అనేది సాధారణంగా కనిపిస్తుంది.
మాయ వేయని పశువుల్లో సాధారణంగా జ్వరం, పాలదిగుబడి తగ్గటం, క్రమంగా బలహీనపడటం, జనన మార్గంలో మంట, దుర్వాసనతో కూడిన రక్తం మరియు చీముకారటం వంటి లక్షణాలు గమనించవచ్చును. జ్వరం ఎక్కువగా ఉన్న పశువులలో మందుల ప్రభావం పెద్దగా కనిపించకపోవచ్చు. కొన్ని సందర్భాలలో మాయపడని పశువులు చనిపోవడం కూడా జరుగుతుంది.
మాయ కోసం ఉపయోగించు ఔషధ మొక్కలు
నువ్వుల మొక్కల ఆకులను సుమారు 250 గ్రాములు 1000 మిల్లీలీటర్ల నీటిలో బాగా కలిపి పశువులకు త్రాగించినచో 1 నుండి 2 గంటల్లో మావి మాయమవుతుంది.
నువ్వులు 100 గ్రాములు మరియు బెల్లం 100 గ్రాములు కలిపి బోలస్గా తయారు చేసి నోటి ద్వారా ఇవ్వాలి.
బడా గోస్కర్ మొక్కను 200 గ్రాములు 1000 మిల్లీలీటర్ల నీటిలో నానబెట్టి బాగా కలిపి పశువులకు ఇవ్వాలి.
పదార్థాలు: ముల్లంగి- 1 పూర్తి గడ్డ దినుసు, బెండకాయ – 1.5 కిలోలు, బెల్లం – అవసరం మేరకు, ఉప్పు-కావల్సినంత.
తయారు చేసే విధానం: ప్రతి బెండకాయను రెండు ముక్కలుగా కత్తిరించాలి. దూడ పుట్టిన రెండు గంటల లోపు ఒక పూర్తి దుంప ముల్లంగిని ఆవుకు తినిపించాలి. ప్రసవించిన 8 గంటల తర్వాతకూడా మాయ నిలకడ కొనసాగితే 1.5 కిలోల తాజా బెండకాయలు, బెల్లం మరియు ఉప్పుతో కలిపి తినిపించాలి. ఒకవేళ ప్రసవించిన 12 గంటల తర్వాత కూడా మాయ నిలుపుదల కొనసాగితే బేస్కు చాలా దగ్గరగా ఒక ముడిని కట్టి, ముడి కింద రెండు అంగుళాలు కత్తిరించి వదిలేయండి. ముడి లోపలికి వెళ్ళిపోతుంది. నిలుపుకున్న ప్లాసెంటాను చేతితో తొలగించటానికి ప్రయత్నించవచ్చు. నాలుగు వారాల పాటు వారానికి ఒకసారి ఒక పూర్తి గడ్డ దినుసు ముల్లంగిని తినిపించినచో మాయ పడిపోయే అవకాశం ఉంటుంది.
బాంబుసియా వల్గారిస్ (ఆకు): బాంబుసియా వల్గారిస్ ఆకులను కుండాబార్బర్తో కలిపి మావిని బయటకు పంపండంలో సహాయపడుతుంది. ఆకులను ఎండబెట్టి నీటిలో కలిపి పశువులకు నోటి ద్వారా ఇవ్వటం వల్ల మాయని నివారించవచ్చు.
వెర్నోనియా ఆమిగ్దాలినా (ఆకు): వెర్నోనియా ఆమిగ్దాలినా ఆకులు ఉప్పులో కలపడం ద్వారా ప్లాసెంటా నిలుపుదల చికిత్సకు ఉపయోగపడుతుంది. దీనిని పశువులకు నోటి ద్వారా ఇవ్వబడుతుంది.
రిసినస్ కమ్యూనిస్ (ఆకులు మరియు విత్తనాలు): రీజినల్ కమ్యూనిస్ యొక్క ఎండిన భాగాన్ని నీటిలో కలిపి ఆవుకు ఇవ్వవచ్చు. ఇది మావిని నివారించడానికి ఉపయోగపడుతుంది.
బ్రయోపిల్లం పిన్నటం (ఆకు): ఆకులు లేదా కాండం యొక్క రబ్బరు పాలు భాగాన్ని యురేరా పైప్సెలోడెండ్రంతో కలుపుకొని ఆవు గర్భాశయంలోకి పూస్తాము. ఇది మావిని నివారించడానికి ఉపయోగపడుతుంది.
డా. కె. కస్తూరి దేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డా. బి. శ్రీను, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ హెడ్, డా. జె. తేజ, అసిస్టెంట్ ప్రొఫెసర్, పశువైద్య కళాశాల, మామునూరు, వరంగల్. ఫోన్: 9491870887
2023 అక్టోబరు 16వ తేదీన జరుపుకునే ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ సందర్భంగా ఎంపికైన ప్రచారాంశం ‘నీరే ప్రాణం, నీరే ఆహారం, నీటి లభ్యత అందరికీ అందాలి’. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ఆవిర్భవించిన అక్టోబరు 16వ తేదీన ఆనవాయితీగా ఆహారోత్పత్తి, సరఫరా, పంపిణీ, వ్యాపారం వంటి అంశాలతో పాటు ఆకలి, దారిద్య్రం, ఆదాయ పంపిణీలో అసమానతలు, పేదరిక నిర్మూలన ప్రయత్నాలను కూడా చర్చించి, కార్యాచరణను తయారు చేసుకోవటం, ఆహారదినోత్సవ కార్యక్రమం లక్ష్యాలు. మానవాళి సమిష్టిగా సాధిస్తున్న పురోగతి, సాంకేతికాభివృద్ధి, సంపద, ఆదాయాల్లో వ్యత్యాసాలు తీవ్రమౌతున్నాయి. సంపన్నదేశాలు, పేదదేశాల మధ్య పెరుగుతున్న అంతరాలతోపాటు ప్రతిదేశంలోనూ వివిధ వర్గాల మధ్యతేడాలు కూడా నానాటికీ ప్రస్ఫుటమౌతున్నాయి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలను కూడా ప్రపంచ కుబేరులు, అగ్రరాజ్యాలే శాసిస్తున్నా కూడా కొంత మానవీయ కోణాన్ని అవి నిత్యం ప్రకటిస్తుంటాయి. మానవ జాతి పరిణామ క్రమంలో నాగరికత నేర్వకముందు తమ మనుగడ కోసం ఒకరినొకర్ని చంపటం, బానిసలుగా మార్చుకోవటం, క్రూరమైన శ్రమదోపిడీ చేయటం జరిగాయి. కాని వనరుల అభివృద్ధి, వినియోగంలో సామర్థ్యం పెరిగేకొద్దీ వాటి అవసరం తగ్గింది. తాము అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే ప్రయత్నంతో పాటు ఇతరులు కూడా ఆకలి బాధలు పడకూడదనీ, ప్రతి ఒక్కరికీ కనీస జీవన ప్రమాణాలు లభించాలనే తపన కూడా కొంతమేరకు కనిపిస్తున్నది.
ప్రపంచాభివృద్ధి లక్ష్యాలు
ఇరవై ఒకటవ శతాబ్ద ప్రారంభంలో ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా ఆకలిని, దారిద్య్రాన్ని పారదోలాలని సంకల్పించింది. 2015 వరకు కొంతమేరకు ఈ లక్ష్యాల దిశగా పయనించింది. రెట్టించిన ఉత్సాహంతో 2030 వరకు ప్రపంచంలో ఆకలి, పేదరికం వంటి రుగ్మతలను రూపుమాపి, పర్యావరణాన్ని మెరుగుపరచుకొని, వాతావరణ మార్పులను నిలవరించాలని మరింత బృహత్తర లక్ష్యాలతో ప్రపంచ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. కాని గత ఎనిమిదేళ్ళలో ఆశించిన ప్రగతి దూరంగా జరుగుతున్నది. స్వార్ధం, స్వప్రయోజనాలు పెచ్చరిల్లి, ఇతరుల గురించి ఆలోచించటం, సాయపడటం తగ్గుతున్నది. దేశాలమధ్య యుద్ధాలు, అంతర్యుద్ధాలు, మతాలు, తెగలు మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. తమ దేశ, వర్గ ప్రయోజనాలే తప్ప మానవాళి సమిష్టి లక్ష్యాల్ని పట్టించుకోవటం తగ్గింది. వాతావరణం వేడెక్కటాన్ని ఆపలేక, వర్షపాతాల్లో హెచ్చు తగ్గులు పెరగటంతో పేదదేశాలు, పేద ప్రజలు కనీస అవసరాల కోసం అల్లాడుతున్నారు. ఆకలి, దారిద్య్రం, నిరక్షరాస్యత, అనారోగ్యం విలయ తాండవం చేస్తున్న ప్రపంచంలో సమత, మమత, కరుణ, ఆర్థ్రతలను పెంచాలనే ప్రయత్నాలు సఫలమౌతాయా అనే ప్రశ్న ఉత్పన్నమౌతున్నది.
తగ్గని అన్నార్తుల సంఖ్య
ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ 2022 ప్రారంభంలో 82.8 కోట్ల మంది ప్రపంచంలో ఆకలితో బాధపడుతున్నట్లు అంచనా వేసింది. కోవిడ్-19 కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో ఆకలితో బాధపడేవారి సంఖ్య 15 కోట్లు పెరిగినట్లు లెక్కకట్టింది. 2022లో ‘ప్రపంచ ఆహార కార్యక్రమం’ 82.8 కోట్ల మంది అన్నార్తుల్లో 34.3 కోట్ల మంది తీవ్రమైన ఆకలి సమస్యను ఎదుర్కుంటున్నట్లుగా హెచ్చరించింది. రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన కొద్ది నెలల్లోనే తీవ్రమైన ఆకలిని ఎదుర్కుంటున్న వారి సంఖ్య 25 శాతం పెరిగినట్లు లెక్క గట్టింది. ఆహారపు ధరలు పెరగటం ఇందుకు కారణంగా చెప్పింది. ప్రపంచ జనాభాలో నాలుగు శాతం తీవ్రమైన ఆకలితో బాధపడుతుంటే, పదిశాతం ప్రజలు అర్ధాకలితో సతమతమౌతున్నారు. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అధ్యయనాల ప్రకారం ప్రపంచ జనాభాలో 29 శాతం ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనలేని స్థితిలో ఉన్నారని తేలింది. ప్రపంచంలోని పురుషుల్లో 27 శాతం ఆకలిని అనుభవిస్తుంటే, మహిళల్లో 31 శాతం దానికి బలవుతున్నారని గుర్తించింది. ఐదేళ్ళలోపు పిల్లల్లో 14.9 కోట్ల మంది ఆహారంలో తగిన పోషకాలు లేక సరిగా ఎదగలేక పోతున్నారు. 4.5 కోట్ల మంది చిన్నారులు బక్కచిక్కి పోతున్నారు. ఇందువల్ల ఐదేళ్ళలోపు చిన్నారులు మరణించే ప్రమాదం పెరుగుతున్నది. ఇప్పటి నుంచీ ఆకలి నిర్మూలన కార్యక్రమాలను ఉదృతం చేసినా, 2030 నాటికి 67 కోట్ల మంది అన్నార్తులుగా ఉంటారని జోస్యం చెప్పింది. 2030 నాటికి పూర్తిగా ఆకలిని నిర్మూలన అనే ప్రపంచ లక్ష్యం నెరవేరదని చెప్పింది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల మంది ఆకలి వల్ల మరణిస్తున్నారని అంచనా వేసింది. ప్రపంచ జనాభాకి అవసరమైన ఆహారం కన్నా 50 శాతం అదనంగా ఉత్పత్తవుతున్నా, ఎంతో వృథా అవుతున్నది. కొనుగోలు శక్తి లేక, పంపిణీలో అవకతవకల వల్ల 29 శాతం ప్రజలు వివిధ స్థాయిల్లో ఆకలిని ఎదుర్కోవటం వాంఛనీయం కాదు. పంపిణీని మెరుగుపరచడం, ఉదారంగా సాయాన్నందించడంతో పాటు సరఫరాని పెంచాల్సిన అవసరం ఉంది. పంటలు పండాలన్నా, జీవులు జీవించాలన్నా నీటి అవసరాన్ని అందరూ గుర్తిస్తారు. జీవరాశుల కోసం పరిశుభ్రమైన, కాలుష్యం లేని నీరు కావాలి. పంటల ఉత్పత్తికి ప్రపంచంలోని పలుప్రాంతాల్లో నీరు కీలకంగా మారింది. నీటి వనరుల్ని పెంచడం, దానిని సమర్ధవంతంగా వినియోగించడం రెండూ కీలకంగా మారాయి. అందుకే ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ 2023 ప్రపంచ ఆహార దినోత్సవానికి ‘నీరే జీవం, నీరే ఆహారం, దానిని అందరికీ అందుబాటులోకి తేవాలనే’ నినాదాన్ని ప్రచారాంశంగా ఎంచుకుంది.
దేశంలోనూ పెరుగుతున్న అన్నార్తులు
2017లో దేశ ప్రజల్లో 13.2 శాతం మంది ఆకలితో బాధపడినట్లు అంచనా వేశారు. 2018లో అన్నార్తుల శాతం 13.3 శాతంకి పెరిగింది. 2019లో అన్నార్తుల శాతం 14.6 కి చేరింది. 2020లో అది మరింత పెరిగి 16.3 శాతంగా నామోదైంది. 2022లో ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ‘ఆహార భద్రత, పోషక విలువలపై విడుదల చేసిన నివేదికలో భారత దేశంలో 22.43 కోట్ల మందికి సరైన ఆహారం లభించటంలేదని పేర్కొంది. ప్రపంచంలో అర్ధాకలితో బాధపడుతున్న వారిలో నాల్గవ వంతు భారతదేశంలోనే ఉన్నారని తెలిపింది. దేశ జనాభాలో 16 శాతం మంది అర్ధాకలితో ఉండటం ఆహార స్వయం సమృద్ధిని సాధించిన భారతదేశానికి ఒక మచ్చగా మిగిలింది. వయసులో ఉన్న స్త్రీలలో 53 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు కూడా ఆ నివేదిక పేర్కొన్నది. రోజుకి 7,000 మంది చొప్పున సంవత్సరానికి 25 లక్షల మంది ఆకలి వల్ల మరణిస్తున్నారని అంచనా కట్టింది.
యూరోప్లోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు ‘ప్రపంచ ఆకలి సూచీ’ని రూపొందించి, ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్నాయి. 2021 నివేదిక ప్రకారం అత్యంత ఆకలిగొన్న 116 దేశాల్లో భారతదేశానికి 101వ స్థానం లభించింది. 2022 నివేదిక ప్రకారం 121 దేశాల్లో 107వ స్థానంలో భారత్ ఉంది. ఐదేళ్ళ లోపు పిల్లల్లో 19.3 శాతం మంది పోషకాహారం లభించక బలహీనంగా ఉన్నట్లు ఆ నివేదిక తెలిపింది. ఇది ప్రపంచ దేశాలన్నిటిలోనూ అత్యధికం. ఐతే వయసుకి తగ్గ ఎత్తులేని వారి శాతంలో కొంత మెరుగుదల కనిపించింది. 2012-16 మధ్య వయసుకి తగ్గ ఎత్తులేని పిల్లల శాతం 38.7గా ఉంటే 2017-21 సంవత్సరాల మధ్య వారి శాతం 35.5కి తగ్గింది. శిశుమరణాల విషయంలో కూడా కొంత ప్రగతిని భారత్ సాధించింది. 2014 వ సంవత్సరంలో ఐదేళ్ళలోపు పిల్లల్లో 4.6 శాతం శిశు మరణాలుండగా 2020 సంవత్సరంలో శిశుమరణాల శాతం 3.3 శాతానికి తగ్గింది. శిశుమరణాల విషయంలోనూ, వయసుకి తగ్గ ఎత్తు విషయంలోనూ, కొంత అభివృద్ధి ఉన్నా, ఎత్తుకి తగ్గ బరువు విషయంలో సమస్య తీవ్రమౌతున్నందువల్ల భారతదేశం అట్టడుగు దేశాల్లోనే ‘ఆహార సూచీవిషయం’లో లెక్కించబడుతున్నది. ప్రపంచ ఆహార సూచీ తయారీలో నాలుగు అంశాలుండగా, అందులో మూడు ఐదేళ్ళలోపు పిల్లల ఆరోగ్యానికీ, పోషక విలువలకు సంబంధించడం వల్ల ‘ఆకలి సూచీ’ హేతుబద్ధమైనది కాదని భారత ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. 2022లో రూపొందించిన ‘ఆకలి సూచీ’ ప్రకారం దక్షిణాసియా దేశాల్లో ఒక్క ఆఫ్గనిస్తాన్ మాత్రమే భారతదేశం కన్నా వెనకబడి ఉన్నది. శ్రీలంకకు 64వ స్థానం, నేపాల్కు 81వ స్థానం, బంగ్లాదేశ్కు 84వ స్థానం, పాకిస్తాన్కు 99వ స్థానం లభించడం వల్ల ఆదేశాల్లో ఆకలి సమస్య భారత్లో కన్నా తక్కువగా ఉన్నట్లు ఆకలి సూచీ తెలిపింది. ఈ విధంగా భారతదేశాన్ని అభాసుపాలు చేయడానికి యూరోపియన్ స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నిస్తున్నాయని భారత ప్రభుత్వం విమర్శించింది. అయితే ఈ సూచీల తయారీని భారత గణాంకాలతోనే రూపొందిచినట్లు ఆ సంస్థలు బదులిచ్చాయి. 2020 నవంబరులో దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమర్పించిన గణాంకాలను క్రోడీకరించగా దేశంలో 9.27 లక్షల మంది చిన్నారులు తీవ్రమైన అర్ధాకలితో ఉన్నారని తేలింది. 2021 అక్టోబరులో దేశంలోని అంగన్వాడీ కార్యకర్తలు పొందుపరచిన కొలతల ఆధారంగా దేశంలో 17.76 లక్షల మంది చిన్నారులు తీవ్రమైన ఆకలితో ఉన్నారని, మరో 15.24 లక్షల మంది ఒక మోస్తరు ఆకలి సమస్యతో బాధపడుతున్నారని తేలింది. ఐదేళ్ళలోపు పిల్లల చేయి పైభాగంలో ఉన్న కండరపు కొలత 11.5 మిల్లీమీటర్ల కంటే తక్కువుంటే వారు తీవ్రమైన ఆకలి సమస్యను ఎదుర్కుంటున్నారనీ, ఆ కొలత 11.5 మిల్లీమీటర్ల నుండి 25 మిల్లీమీటర్ల మధ్యలో ఉంటే వారు ఒక మోస్తరు ఆహార కొరతను ఎదుర్కుంటున్నారని గుర్తిస్తారు. 25 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ కొలత ఉంటే వారికి ఆకలి సమస్య లేదని లెక్కిస్తారు. ఇవి కేంద్ర ప్రభుత్వ పథకం ‘పోషణ్ అభియాణన్’లో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు పిల్లల కండను కొలిచి, సమాచారాన్నిస్తున్నందు వల్ల విశ్వసించతగ్గవే. సమస్యను గుర్తించినప్పుడే పరిష్కారం వెతకగలము.
ఆశించిన పలితాలివ్వని పథకాలు
1975లో ప్రారంభించిన ‘ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ డెవలప్మెంట్ పథకం (ఐ.సి.డి.ఎస్)’ ద్వారా ఆరేళ్ళలోపు పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు పోషకాహారాన్నందించే పథకం అమల్లో ఉంది. ‘మిషన్ ఇంద్ర ధనుష్’ ద్వారా రెండేళ్ళలోపు పిల్లలకు 12 రకాల వేక్సిన్ల నిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం దేశవ్యాపితంగా ప్రవేశపెట్టినందువల్ల చిన్న పిల్లల బడి హాజరు, విద్యా ప్రమాణాలు మెరుగవుతాయని ఆశించారు. 2013లో ప్రవేశపెట్టిన ‘జాతీయ ఆహార భద్రతా చట్టం’ అమలు ద్వారా గ్రామీణ ప్రజల్లో నాల్గింట మూడొంతుల మందికి, పట్టణ ప్రజల్లో సగం మందికీ అతి తక్కువ ధరకే ఆహార ధాన్యాలను సరఫరా చేస్తున్నారు. 2017లో ప్రారంభించిన ప్రధానమంత్రి మాతృవందన పథకం ప్రసవించే తల్లులకు లాభాలను చేకూరుస్తున్నది. ఆహారాన్ని బలవర్ధకం చేసే పథకం ద్వారా కీలకమైన విటమిన్లు, ఇనుము, అయోడిన్, జింక్ వంటి ఖనిజలవణాలను బియ్యం, పాలు, ఉప్పులకు జోడించి, పోషక విలువల్ని పెంచుతున్నారు. 2018లో ప్రారంభించిన ‘పోషణ్ అభియాన్’ ద్వారా చిన్న పిల్లలు ఎత్తు పెరగటానికీ, బలాన్నందించడానికీ, మహిళల్లో రక్తహీనతను తగ్గించటానికి ప్రయత్నిస్తున్నది. ‘సరైన ఆహారం’ తీసుకునేలా ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ కూడా ప్రయత్నిస్తున్నది. కోవిడ్-19 సంక్షోభం తర్వాత ప్రధానమంత్రి ఉచిత ధాన్య పథకం కూడా మ్మురంగా అమలవుతున్నది. ఇన్ని బహుముఖ కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నా ఇంకా 16 శాతం ప్రజలు అర్ధాకలితో ఉండటం పిల్లల్లో బలహీనత తీవ్రంగా ఉండటం చూస్తే, దేశంలో ఆకలిని రూపుమాపటానికి మరిన్ని ప్రభావశీలమైన పథకాలు తేవాల్సిన అవసరం ఉంది. మానవులకు, ఇతర జంతుజాలానికీ, వృక్షాలకు నీటి అవసరం కీలకం. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ‘నీతి ఆయోగ్’ అంచనా ప్రకారం దేశంలో ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది మంచి నీరు లభించక మరణిస్తున్నారు. సురక్షితమైన తాగునీరు సరఫరా విషయంలో ప్రపంచ దేశాల్లో భారతదేశానికి 133వ స్థానం ఉంది. సురక్షిత మంచినీరు సరఫరా చేయడంలో ప్రభుత్వాల వైఫల్యం వల్ల దేశంలో మంచినీరు సరఫరా చేసే కంపెనీలకు లాభాలు దండిగా లభిస్తున్నాయి. పేద ప్రజలకు నీరుని కొనుగోలు చేసే శక్తి లేక కలుషిత జలాలను వాడటం వల్ల రోగాల బారిన పడి, మరణిస్తున్నారు. దేశంలో లభ్యమైతున్న నీటి వనరుల్లో 80 శాతం వ్యవసాయానికే వినియోగిస్తున్నా, సాగునీరు కొరత తీవ్రంగా ఉంది. నదుల అనుసంధాన కార్యక్రమానికి విద్యుచ్ఛక్తి కొరత అడ్డంకిగా ఉంది. ఆహార భద్రతకు నీటి సరఫరా కీలకంగానూ, నీటి సరఫరాకి విద్యుత్ ఉత్పత్తి అడ్డంకిగా నిలుస్తున్నాయి. దేశంలో నీటి వనరుల అభివృద్ధికీ, సద్వినియోగానికీ నిధుల్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. నదుల అనుసంధాన కార్యక్రమానికీ, విద్యుత్ ఉత్పత్తికీ ప్రాధాన్యత లభించాలి. పేదవర్గాల ప్రజలకు నీరు, ఆహారం సరఫరాపై కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా పేదల ఆదాయాలు పెరిగి, ఆహారాన్ని కొనుగోలు చేసే శక్తి సమకూరేలా కృషి చేయాలి. ఆహార భద్రత కన్నా మరే ఇతర సమస్య ముఖ్యం కాదు.
ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో అత్యధిక శాతం గేదెలు నిండుచూడిథలో ఉండి త్వరలో ఈనడానికి సిద్ధంగా ఉన్నాయి. పాడిపశువులకు ఇది చాలా క్లిష్టమైన సమయం. పాలు ఇవ్వడం లేదనే కారణంతో ఈథలో వీటి పోషణపట్ల అశ్రద్ధవహిస్తే, ఈనే సమయంలో ఎదురయ్యే సమస్యలతోపాటు ఆ తర్వాతి పాడి కాలంలో కూడా ఆశించిన స్థాయిలో పాల ఉత్పత్తిని పొందలేక యజమానులు తమకు తెలియకుండానే భారీ నష్టాలకు గురయ్యే ముప్పుఉండవచ్చు. నిండు చూడి థలో పోషకాహారలోపాలవల్ల ఎదురయ్యే సమస్యలలో పాలజ్వరము మరియు రక్తంలో చక్కెర శాతాలు క్షీణించుట వల్ల కలిగే కీటోసిస్ అనే వ్యాధులు చాలా ముఖ్యమైనవి. వీటికి అనుబంధంగా మెయ్యదిగుట, మాయ విసర్జన సకాలంలో జరుగకపోవుట, పుట్టేదూడలు బలహీనంగా తక్కువ శరీర తూకంతో జన్మించుట, తల్లుల నుండి దూడలకు సరిపడే జున్నుపాలను అందించకపోవుట వంటి ఇతర సమస్యలు కూడా ఎదురుకావచ్చు. పోషకాహార లోపం వల్ల ఎదురయ్యే ముఖ్యసమస్యలలో రక్తంలో కాల్షియం లోపం వల్ల వచ్చే పాల జ్వరము, చక్కెర హీనతవల్ల వచ్చే కీటోసిస్ వ్యాధులు ముఖ్యమైనవి. ఈ రెండు సమస్యలు ఈనే కొన్ని రోజుల ముందు నుండి ఈనిన తర్వాత కొన్ని రోజుల వరకు కనిపిస్తాయి. వీటి ప్రభావం తల్లుల పాల ఉత్పత్తితో పాటు, దూడల ఎదుగుదల విూద కూడా పడి రెండు తరాల ఉత్పాదకత విూద కనిపిస్తుంది.
పాలజ్వరము: వాస్తవనికి శరీర సాధారణ ఉష్ణోగ్రత 102-103 డిగ్రీల ఫారిన్హీట్ నుండి 96-98 డిగ్రీల కంటే తక్కువకు తగ్గిపోతుంది. శరీరం చల్లగా ఉండి, పశువు చాలా నీరసంగా ఉంటుంది. మెడ కండరాలలో పటుత్వం తగ్గుట వల్ల మెడను ముందుకు వంచి నేలవిూద ముట్టెను ఆన్చి ఉండటం, లేదా మెడను ప్రక్కకు ఛాతివైపు వంచి ముట్టె ఆన్చి ఉండటం కనిపిస్తుంది. పశువు ఎక్కువగా కూర్చొని ఉంటుంది. లేదా తీవ్రత పెరిగినప్పుడు అడ్డంగా పడిపోవటం జరుగుతుంది. నడ్డి ఆర్చివలె వంగి ఉంటుంది. పేడ గట్టిగా ఉండటం లేదా పూర్తి మలబద్ధకం కూడా ఉండవచ్చు. అధికపాలనిచ్చే పశువులలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
రక్తనమూనా పరీక్షలో కాల్షియం పరిమాణం చాలా దిగువకు పడిపోయి కనిపిస్తుంది. ఆశించిన స్థాయిలో పాల ఉత్పత్తి ఉండదు.
చికిత్స: కాల్షియం బోరోగ్లూకొనేట్ ఇంజక్షను 350-450 మిల్లీలీటర్లు నెమ్మదిగా మెడసిరలోకి ఎక్కించాలి. సిరలోకి ఇంజక్షనుకు ప్రత్యామ్నాయంగా ఒక్కొక్క చోట చర్మం క్రిందకు 100 నుండి 120 మిల్లీలీటర్లు మెడప్రక్క చర్మం క్రిందకు కూడా ఎక్కించవచ్చును లేదా నోటి ద్వారా వినియోగించదగిన వివిధ కాల్షియం ఉత్పత్తులు ద్రవరూపంలో లభ్యమౌతున్నాయి. వాటిని ఉత్పత్తిదారులు లేదా పశువైద్యుల సూచనలమేరకు పట్టించవచ్చును. వీటితోపాటు బి-కాంప్లెక్స్ ఇంజక్షన్లు ఇస్తే పశువు నీరసం నుండి కొంతవరకు బయట పడుతుంది. ఆ తర్వాత నమ్మకమైన ఖనిజలవణ మిశ్రమాన్ని దాణాలో కలిపి వాడాలి. జొన్నలు-సజ్జలు-మొక్కజొన్నలు-రాగుల నూకను నువ్వుల పిండిని మడ్డికూడుగా వండి వరితవుడు లేదా గోధుమ తవుడుతో కలిపి వరుసగా 4-5 రోజులు రోజుకు 2 నుండి 3 కిలోలు దాణాగా మేపినా వెంటనే పాల ఉత్పత్తి పెరిగే అవకాశాలు ఉంటాయి.
మునగ ఆకు, అవిసె ఆకు, తులసి, మారేడు వంటి ఆకులను మేతతో కలపి మేపితే పశువు త్వరగా మామూలు స్థాయికి వస్తుంది. పారా, నేపియర్, ల్యూసర్న్ వంటి మేలు జాతి పచ్చిమేతలు కూడా పాలజ్వరం ప్రభావాలను చాలా వరకు తగ్గించగలవు.
పాలజ్వరం నివారణ: ఈనడానికి రెండు నెలల ముందు నుండి పాలు పిండుట నిలిపివేయాలి. చూడి పశువుకు కూడా రోజుకు 20-30 గ్రాముల నాణ్యమైన ఖనిజ లవణ మిశ్రమాన్ని దాణాతో కలిపి మేపాలి. సవిూకృత దాణాను పశువు శరీర బరువును, ఇతర గ్రాసాల నాణ్యతలను గమనించి రోజుకు ఒకటి నుండి రెండు కిలోలు ప్రతి రోజూ మేపాలి. మేతలో తులసి, అవిసె, మల్బరీ, సుబాబుల్, మునగ వంటి ఆకుల్ని కలుపుట వల్ల చాలావరకు పోషకాహార లోపాలను నివారించవచ్చు.
చూడి థలో రెండు-మూడు నెలలకు ఒకసారి పరాన్నజీవుల నిర్మూలనకు అవసరమైన మందుల్ని లేదా కలబంద గుజ్జు, గాడిదగరప, పొట్ల ఆకులు, దానిమ్మ బెరడు మిశ్రమాలను బెల్లంతో కలిపి ముద్ద చేసి తినిపించవచ్చు. చూడి పశువులన్నింటికీ వేలంవెర్రిగా కాల్షియం ఇంజక్షన్లు చేయించుటకంటే నోటిద్వారా సహజసిద్ధమైన దాణాలు, మేతల్ని అందిస్తే సరిపోతుంది.
పైన పేర్కొన్న జాగ్రత్తల్ని పాటిస్తే పాలజ్వరంతోపాటు రక్తంలో చక్కెర హీనత వల్ల ఎదురయ్యే కీటోసిస్, మెయ్యదిగుటం, మాయ సకాలంలో విసర్జించకపోవుట, బలహీనమైన దూడలు జన్మించటం వంటి అనేక ఇతర సమస్యలు కూడా ఎదురుకావు.
దేశం ‘అమృత్ కాల్’ దిశగా అడుగులు ముందుకు వేయాలని బృహత్తర కార్యక్రమం తీసుకుంటున్న సమయంలో స్వామినాథన్ మృతి దేశానికి తీరని లోటు. ముఖ్యంగా స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల నుంచి వ్యవసాయ పరిస్థితులు తెలిసిన వ్యక్తి. శాస్త్రవేత్త. విధాన నిర్ణయాలలో పాలు పంచుకున్నారు. ఈ క్రమంలో వారు ఎక్కలేని ఎత్తులు లేవు. కాలానికి దీటుగా భారత వ్యవసాయ రంగాన్ని సిద్ధం చేసిన శాస్త్రవేత్త. అంతేకాదు వ్యవసాయ రంగ పరిశోధనలకు మార్గదర్శనం చేసిన క్రాంతదర్శి. వేలాది యువ పరిశోధకులకు మార్గదర్శి. లక్షలాది యువతకు ఆదర్శ మూర్తి. జీవించిన 98 సంవత్సరాలు దేశ సమగ్ర అభివృద్ధి కోసం ఆరాట పడ్డారు. తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృషి చేస్తూ వచ్చారు. ఇంతగా దేశ వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి లేరంటే అతిశయోక్తికాదు. అరుదైన శాస్త్రవేత్త. అపరాలు, నూనె గింజలు, చిరుధాన్యాల ఆవశ్యకత గురించి ఆలోచించవలసిన అవసరం, బాధ్యతను పరిశోధకులకు ఎరుకపరచిన వాడు. పర్యావరణహిత సుస్థిర వ్యవసాయ విధానాలు రూపకల్పనలో భాగస్వామ్యం అందుకున్న శాస్త్రవేత్త. సమాజ హితమే పరిశోధకుల లక్ష్యం కావాలని హితవు పలికారు. దేశ ఆహార భద్రత నుంచి ఆకలి లేని భారత్ మీదుగా, పోషణ భద్రత కోసం అహరహం శ్రమించి జీవించిన అరుదైన శాస్త్రవేత్త. 75 ఏళ్ల స్వతంత్ర భారత్లో అత్యంత ప్రభావశీలి అయిన శాస్త్రవేత్తగా డాక్టర్ ఎం.ఎస్. స్వామి నాథన్ నిలిచారు.
1947లో 38 కోట్ల జనాభాకి సరిపడ తిండి గింజలు పండించే పరిస్థితి దేశములో లేదు. ఆహార ధాన్యాల కొరత వలన 30% మంది ప్రజలు అర్ధాకలితో బ్రతికారు. స్వతంత్రము తరువాత. ఒక కంకి పండే మొక్క నుండి 5 కంకులు పండించాలి, అధిక దిగుబడి సాధించాలి అంటే హరిత విప్లవమే శరణ్యమని భావించి అప్పటి ప్రభుత్వ అధినేతలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారు. దీనికి నాయకత్వము చేపట్టి నేటి 145 కోట్ల మందికే గాక మరొక 50 కోట్ల జనాభాకి సరిపడ ఉత్పత్తి చేయగలిన స్థితిలో ఉన్నామంటే అది ఎం.ఎస్. స్వామి నాథన్ కృషి ఫలితమే.
ఇవన్నీ ఒక ఎత్తయితే పట్టుదలగా రైతుల జీవన ప్రమాణాలు మెరుగుదల కోసం ఆరాటపడి మద్దతు ధరలతో అండగా ఉండాలని పాలకుల మీద ఒత్తిడి తెచ్చారు. రైతు నాయకులకు కార్యకర్తలకు సంఘీభావంతో కదిలిన ఘటనలు వారి జీవితంలో చూడవచ్చు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తగా, హరిత విప్లవ పితామహుడుగా డా.ఎం.ఎస్. స్వామినాథన్ వ్యవసాయ రంగానికి చేసిన కృషి అందరికీ తెలిసిందే. అది చరిత్ర పుటలకెక్కింది. రైతుల కష్టాలకు కారణాలు, రైతుల ఆత్మహత్యల నివారణ, వ్యవసాయ ఉత్పాదకత, భూ సంస్కరణలు, నీటిపారుదల, రుణ సదుపాయం, పంటల భీమా, ఆహార భద్రత, ఉపాధి, తదితర అంశాలపై డాక్టర్ స్వామినాథన్ నేతృత్వంలోని ”నేషనల్ కమీషన్ ఆన్ ఫార్మర్స్” లోతైన అధ్యయనం చేసి, అత్యంత కీలకమైన సిఫార్సులతో నాటి యు.పి.ఏ. ప్రభుత్వానికి 2006 అక్టోబర్ 4న నివేదికను సమర్పించింది. 17 సంవత్సరాలు గడచిపోతున్నా ఆ నివేదికలోని రైతాంగం యొక్క ప్రయోజనాలతో ముడిపడిన సిఫార్సులు అమలుకు నోచుకోలేదు. వ్యవసాయ ఉత్పత్తులకు సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50% ఎక్కువగా కనీస మద్దతు ధర (MSP)ను నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వానికి చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం తక్షణం అమలు చేస్తే, డా. ఎం.ఎస్. స్వామినాథన్ గారికి ఘనమైన నివాళి అర్పించినట్లు కాగలదు.
ఇటీవలనే కొత్త పార్లమెంట్లోకి అడుగు పెట్టారు. అమృత మహోత్సవం నేపథ్యంలో అమృత్ కాల్ దిశగా దూసుకుపోవాలని సెలవిచ్చారు. అమృత్ కాల్ భారతదేశం అంటే ఆత్మహత్యలు లేని రైతు భారతం. స్వయం సమృద్ది భారతం. పోషకాహార లేమి లేని ఆరోగ్య భారతం. ఇటువంటి భారతమే స్వామినాథన్ కలలు కన్నారు. ఆ కలల సాకారం చేద్దాం. దీనికోసం అందరం సమష్టి కృషితో సాగుదాం. ఉమ్మడిగా ప్రతిజ్ఞ చేస్తూ స్వామినాథన్ కలలు కన్న నవ వ్యవసాయ భారత నిర్మాణానికి కదలటమే స్వామినాథన్కు నిజమైన నివాళి అని రైతునేస్తం విశ్వసిస్తోంది. ఆ ప్రయత్నంలో మా పరిధిలో మేము కూడా భాగస్వామ్యం అందుకుంటామని వినమ్రంగా తెలియజేస్తున్నాం.
ఆకు కూరలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా పాలకూరలో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండటంతో పాలకూరను ”మైన్స్ ఆఫ్ మినరల్స్” అని కూడా అంటారు. ఇలాంటి ఆకుకూరలు మనం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి ఇలాంటి ఆకు కూరలను మంచి పోషకాలతో పెంచుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిది కదూ!
ఈ మధ్యకాలంలో రైతులు అధిక దిగుబడి కోసం అకర్బన పోషకాలు ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడంతో ఆకు కూరలలో ఉండే పోషకాలు తగ్గిపోతాయి. వీటిని వినియోగించడంతో మనుష్యుల ఆరోగ్యానికి కూడా హానికరం.
ఇటీవలి సంవత్సరాలలో, వినియోగదారులు రసాయన రహిత కూరగాయలు ముఖ్యంగా ఆకు కూరల వాడకం గురించి మరింత అవగాహన కలిగి ఉన్నారు. అందువల్ల, రసాయనాల కనీస లేదా ఉపయోగం లేకుండా ఉత్పత్తి స్థాయిని కొనసాగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. రసాయనాలను నిరంతరాయంగా వాడటం వల్ల నేల క్షీణించి, నేల సమస్యలకు దారి తీస్తుంది. ఈ రోజుల్లో ఉత్పత్తిదారులు పోషకాహార పంటపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు అంటే, హెక్టారుకు దాని పరిమాణం కంటే దాని ఆహార విలువ పరంగా ఉత్పత్తుల నాణ్యత, సేంద్రియ ఎరువులపై అజ్ఞానంతో రసాయనిక ఎరువులు ఇష్టమొచ్చినట్లుగా వినియోగించడంతో, నేల హానికరంగా మారుతుంది. ఇది పోషక అసమతుల్యతకు దారి తీస్తుంది మరియు పర్యావరణ స్థిరత్వానికి ముప్పు కలిగిస్తుంది. గరిష్ట పంట దిగుబడి కోసం సేంద్రియ ఎరువుల కలయిక ద్వారా ఆదర్శ నేల పరిస్థితిని సృష్టించవచ్చని కూడా బాగా అర్థం చేసుకోవచ్చు.
ఈ కాలంలో ఎరువులు, పురుగుమందులు వంటి రసాయనాల వినియోగం మరియు గ్రోత్ రెగ్యులేటర్లు మొదలైనవి ఉత్పత్తి వ్యవస్థలో ఉపయోగించబడు తున్నాయి. రైతులు సమర్ధవంతమైన ఎదుగుదల కొరకు అధిక మొత్తంలో నత్రజని కలిగిన ఎరువులను వాడతారు. ఇలా వాడడం వల్ల ఆకుకూరల నాణ్యత క్షీణంచడం, వాటి నిలువ మరియు ఆకులలో రసాయన అవశేషాలు ఉండటం వలన వినియోగదారులకు హాని కలుగుతుంది. నేల సంతానోత్పత్తి మరియు పంట ఉత్పాదకత యొక్క అధిక స్థాయిని నిర్వహించడానికి, కొనసాగించడానికి, అకర్బన పోషకాల స్థాయిలను తగ్గించడం ద్వారా పంట ఉత్పత్తి వ్యవస్థలో చాలా ముఖ్యమైనవి. అదనంగా ఇది నేల, నీటి కాలుష్యాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అందువల్ల, రసాయనిక ఎరువులకు బదులుగా ప్రత్యామ్నాయంగా సాంప్రదాయేతర ఎరువులను ఉపయోగించడం అత్యవసరం. ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని, పంట, నేల కోసం మెరుగైన పెరుగుదల, దిగుబడి మరియు పోషకాల లభ్యత కోసం ఉత్తమ అకర్బన పోషకాలు మరియు జీవ ఎరువులతో దాని కలయికను పరిశీలించడానికి అధ్యయనం జరిగింది. అయితే 50% అకర్బన పోషకాలు, 50% బయోఫెర్టిలైజర్స్ కలిపి వేయడంతో పంట యొక్క పెరుగుదల, దిగుబడి మరియు నాణ్యత పెరుగుతుందని, ఇలా వీటిని వినియోగించడం ద్వారా ఆరోగ్యానికి మంచి పోషకాలు లభిస్తాయని అధ్యయనంలో వెల్లడయింది.
యస్. హిమబిందు (9515823630), ఎం.ఎస్సీ., కూరగాయల విభాగం, కాలేజ్ ఆఫ్ హార్టీకల్చర్, డా.యం. హనుమాన్ నాయక్, సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్, కూరగాయల పరిశోధనా స్థానం, డా. పి. ప్రశాంత్, పూల పరిశోధనా స్థానం, ఎ. మమతా, సైంటిస్ట్, కూరగాయల విభాగం, డా. యస్. ప్రణీత్ కుమార్, సైంటిస్ట్ (క్రాప్ ఫీసియోలజీ), శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం.
పాల ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశం మొదటి స్థానంలో ఉంది. ఆది నుంచి మనం పాడి-పంటలకు సమాన ప్రాముఖ్యతను ఇస్తూ జీవితాలను కొనసాగించాము. కాని, మధ్యలో వివిధ రకాల కారణాల వలన పాడిని కొంతవరకు అశ్రద్ధ చేయడం జరిగింది. ఈ విషయాలను గుర్తించిన అధికారులు, ప్రభుత్వాలు, నిపుణులు సరైన పరిష్కార మార్గాలను అన్వేషించి, కృషి చేసి పాడి పరిశ్రమ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టడం వలన ఫలితాలు ఆశాజనకంగా వచ్చాయి. దాని ఫలితమే పాల ఉత్పత్తిలో మనదేశం మొదటి స్థానాన్ని సాధించింది అని భారత పశుసంవర్ధక శాఖ కమీషనరు డా|| అభిజిత్ మిత్ర అన్నారు.
రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 20న హైదరాబాదులో రెడ్హిల్స్లోని తెలంగాణా రాష్ట్ర వాణిజ్య, వ్యాపార మండలి సమావేశ మందిరంలో గో-పోషణతోపాటుగా హోమియో, ఆయుర్వేద, అల్లోపతి వైద్య విధానాలపై జరిగిన అవగాహన సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ… ఒకప్పుడు మన దేశంలో ప్రజల కంటే పశు సంపద ఎక్కువగా ఉండేది. పశువులలో ప్రత్యేకించి గోవులకు మనం అధిక ప్రాముఖ్యతను ఇచ్చేవారము. గోవును గోమాతగా కొలుస్తున్న దేశం మనది. మన సంస్కృతిలోనే గోవుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఆవుని పాలు ఇచ్చే జంతువుగానే పుస్తకాలలో రాసుకున్నాము. అందువలననే ఆవు గురించి చదివిన ప్రతిసారి మొదటగా ఆవు పాలు ఇచ్చును అని చుదువుకుని చివరగా ఆవు పేడను, మూత్రాన్ని కూడా ఇచ్చును అని చుదువుతున్నాము. కాని ప్రస్తుతం ఆ పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం ఆవు పాల కంటే మూత్రం మరియు పేడలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వలసిన పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయంలో ఉపయోగించే వివిధ రకాల విష రసాయనాల వలన నేలలో సేంద్రియ పదార్థం తగ్గి, సూక్ష్మజీవుల సంఖ్య తగ్గి నేలలు జీవం కోల్పోయాయి. అందుకే రైతులకు పంటల సాగు లాభదాయకంగా లేకుండా పోయింది. ఇందుకు పరిష్కారం మన గోవులోనే ఉంది. ఆవు పేడ మరియు మూత్రాలలో పంటలకు ఉపయోగపడు వివిధ రకాల పోషకాలు, లవణాలు, సూక్ష్మజీవులు ఉన్నాయి కనుక వీటిని భూమికి అందించగలిగితే మన భూములు తిరిగి పూర్వ వైభవాన్ని పొందగలవు.
ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలకు మన దేశీయ గోజాతుల పేడ, మూత్రాలు పరిష్కారం చూపించగలవు కాబట్టి మనం ఆవు గురించి చర్చించేటప్పుడు మొదటగా పేడ, మూత్రాల గురించి చర్చించుకొని చివరగా పాల గురించి చర్చించుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి.
గోవులను కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉంది. పాడి పరిశ్రమతోనే ఆర్థిక స్వాలంబన, జాతి వృద్ధి, ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందనే విషయం అక్షర సత్యం. ఇన్ని రకాలుగా ప్రయోజనాలు ఉన్న పాడిపరిశ్రమను కాపాడడములో పశువైద్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పశువైద్యంలో వివిధ రకాల పద్ధతులు అంటే ఆయుర్వేదం, హోమియోపతి, అల్లోపతి, చిట్కా వైద్యం.. లాంటి ఎన్నో పద్ధతులను ప్రతి ఇంటికి చేర్చగలిగితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వివిధ రకాల పశువైద్య పద్ధతులను పాడి రైతు ముంగిట చేర్చడములో గో-సంజీవని పుస్తకం ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు కాబట్టి గో-సంజీవని పుస్తకం భారత దేశంలోని అన్ని భాషలలో ముద్రించవలసిన అవసరం ఎంతైనా ఉందని, తన మాతృభాష బెంగాళీలో ముద్రించినపుడు తనకు ఎంతో సంతోషం అని డా|| అభిజిత్ మిత్రా అన్నారు. ఈ కార్యక్రమంలో డా|| పున్నియ మూర్తి, ఆంధ్రప్రదేశ్ పశువైద్య విశ్వవిద్యాలయం డీన్ డా|| వీరభద్రయ్య, డా|| కృష్ణమాచారి, డా|| కృష్ణారెడ్డి, తెలంగాణ పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా|| ఎస్. రాంచందర్లతో పాటు రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా|| యడ్లపల్లి వేంకటేశ్వరరావు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది గోశాలల నిర్వాహకులు, గో-ప్రేమికులు, పశువైద్యులు, సేంద్రియ రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి 7 వేల రూపాయల విలువగల హోమియో మందుల కిట్ను ‘గోయల్ వెట్ ఫార్మా’ వారు ఉచితంగా అందజేయడం జరిగింది.
గోసేవలో భాగస్వాములము కావడము మా అదృష్టంగా భావిస్తున్నాము
మన దేశ ఆయువు పట్టు అయిన వ్యవసాయ రంగంలో కొనసాగడంతో పాటు వ్యవసాయ రంగానికి ప్రధాన భూమిక అయిన పశుసంపద అదీను మన దేశీయ గో-జాతుల సేవలో తాము భాగస్వాలము కావడము మా అదృష్టంగా భావిస్తున్నాము. 2017వ సంవత్సరము గో-సంజీవని పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. పశుపోషకుల నుంచి, రైతుల నుంచి, గో-ప్రేమికుల నుంచి, పశువైద్యుల నుంచి, గో-సంజీవని పుస్తకానికి మంచి స్పందన వచ్చింది. కాలానుగుణంగా వచ్చే మార్పులను కూడా ఈ వపుస్తకంలో పొందుపరిస్తే ఇంకా ప్రయోజనకారిగా ఉంటుందని భావించి కొన్ని ఉపయోగకర మార్పులతో నూతనంగా మరలా ముద్రించడము జరిగింది. నూతన ముద్రణ కూడా అందరికి బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. గో-సంజీవని పుస్తకం నూతన ముద్రణలో ప్రముఖ పాత్ర పోషించిన డా|| ములగలేటి శివరాం మరియు వారి బృందానికి కృతజ్ఞతలు. ఈ పుస్తకం ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ప్రముఖుల అభీష్టం మేరకు గో-సంజీవని పుస్తకాన్ని ఇతర భాషలలో ముద్రించటానికి తప్పనిసరిగా ప్రయత్నిస్తానని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వేంకటేశ్వరరావు అన్నారు.
గో-సంజీవని పుస్తకం నూతన ముద్రణ ఆవిష్కరణ
రైతునేస్తం పబ్లికేషన్స్ ద్వారా గతంలో ముద్రించిన గో-సంజీవని పుస్తకంలో సమాయనుకూలంగా వచ్చిన మార్పులనుచేర్చి ముద్రించిన గో-సంజీవని నవీకరించిన పుస్తకాన్ని ఈ సదస్సులో ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
తేనెటీగ యొక్క కాటు, కీటకాల కాటుకంటే భిన్నంగా ఉంటుంది. తేనెటీగలను కాలనీల రూపంలో (గుంపు) తరచుగా చూస్తుంటాం. అప్పుడప్పుడు వాటి యొక్క గుంపు చెదిరినప్పుడు సమీపంలో కట్టివేయబడిన మరియు సహజంగా తిరుగుతున్న జంతువులపై దాడి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తేనెటీగ కాటు నుండి వెలబడే స్టింగ్ (తేనెటీగ ముల్లు) యొక్క జలం అత్యంత విషపూరితమైన మూలకాలతో రూపొందించబడింది. అవి కుట్టిన తర్వాత గాయం చేసిన స్థానంలో పశువుకు నొప్పి, వాపు, దురద మరియు అలెర్జీ ఉండవచ్చు. లక్షణాలను ముందస్తుగా గుర్తించకుండా, తక్షణ చికిత్స చేయకపోతే, పశువుకు కాటు ప్రాణాంతకంగా మారవచ్చు. తేనెటీగ కాటు యొక్క ప్రతిచర్య తీవ్రత విషం యొక్క మోతాదు మరియు దానికి సంబంధించిన లక్షణాలపై ఆధారపడి ఉంటుంది.
తేనెటీగ కుట్టడం ద్వారా సాధారణంగా రెండు రకాల ప్రతిచర్యలు గమనించవచ్చు. ఒకటి స్థానిక ప్రతిచర్య మరియు ఇంకొకటి తీవ్రమైన దేహిక ప్రతిచర్య. దేహిక ప్రతిచర్యలో కాటు యొక్క విషం రక్త స్రావణంలోకి చేరుకుని తీవ్రతను పెంచుతుంది. రక్తం గడ్డకట్టడమే కాకుండా ఒక్కోసారి మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపిస్తుంది.
తేనెటీగ కుట్టిన జంతువులకు చికిత్స: తేనెటీగ కుట్టినప్పుడు అవి వాటి యొక& విషపు సంచిని మరియు స్టింగ్ (తేనెటీగ ముల్లు) జంతువు శరీరంలోకి ప్రవేశింపచేస్తాయి. అంటే అవి కుట్టిన తక్షణమే స్టింగ్ని కోల్పోయి చనిపోతాయని అర్థం. స్టింగ్లు ఒక నిమిషం పాటు లేదా దాన్ని తొలగించే వరకు శరీరంలోకి విషాన్ని పంపుతూనే ఉంటుంది. జంతువుపై స్టింగ్ను చూడగలిగితే, వాటిని దువ్వెన, కత్తి లేదా వేలిగోరుతో తొలగించవచ్చు. పట్టకార్లు లేదా వేళ్ళతో వాటిని బయటకు తీయవద్దు; ఎందుకంటే దాని వల్ల మరింత విషం లోపలికి చేరుకోబడుతుంది. స్టింగ్లను తొలగించి, గాయాన్ని శుభ్రం చేసిన తర్వాత, మీరు ఈ క్రింద వివరించిన నివారణ చర్యలలో మీకు అందుబాటులో కలిగిన ఏదైనా ఒక పద్ధతిని ఉపయోగించవచ్చు.
ఐస్గడ్డ: 20 నిమిషాల పాటు ఐస్గడ్డను కుట్టిన స్థానంలో పెట్టాలి. ఇది నొప్పిని తగ్గించి, ఆ ప్రాంతంలోని రక్తప్రసరణను నెమ్మదించి తద్వారా వాపును తగ్గిస్తుంది.
తేనె: గాయానికి ఒక చిన్న చుక్క తేనెను పూసి మరియు 30 నిమిషాల నుండి ఒక గంట వరకు చిన్న గుడ్డతో కప్పాలి.
లావెండర్ ఆయిల్: గాయమైన (కాటు ప్రదేశం) చోట ఒకటి లేదా రెండు చుక్కల లావెండర్ ఆయిల్ను వేయాలి. ఇది విషాన్ని వెంటనే తటస్తం చేయడానికి సహాయం చేస్తుంది.
వెల్లుల్లి రసం: ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను రసం వచ్చేల నలిపి గాయం మీద నొక్కాలి. తడిగా ఉన్న గుడ్డతో 20 నుండి 30 నిమిషాల పాటు కప్పి ఉండాలి.
బేకింగ్ సోడా, వెనిగర్: రెండింటిని కలిపి పేస్ట్ తయారు చేసి గాయం మీద 30 నిమిషాలు ఉంచాలి. ఇది తేనెటీగ ముళ్ళల్లో ఉన్న విషపూరితమైన పదార్థాలను తటస్థీకరించడంలో సహకరిస్తాయి.
టూత్ పేస్ట్: టూత్ పేస్ట్ కూడా స్టింగ్ యొక్క విష పదార్థాన్ని తటస్తం చేయడంలో సహాయ పడుతుంది. ఎక్కువ తేనెటీగల దాడికి గురైనట్లయితే, పశువైద్యుని ద్వారా అత్యవసర చికిత్సను అందించాలి. తేనెటీగ కాటు లక్షణాల యొక్క తీవ్రత, విషం పరిమాణం, జంతువు శరీర బరువు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లయితే యాంటిహిస్టమైన్లు, స్టిరాయిడ్స్, యాంటిబయటిక్ ద్రవాలు, ఆక్సిజన్ థెరపిని సుమారు 24-48 గంటల వరకు ఇవ్వాలి.
తేనెటీగ కాటు నివారణ
* తేనెటీగ కుట్టకుండా ఉండాలంటే వాటి దాడికి దారితీసే కారకాల గురించి తెలుసుకోవాలి.
* చెట్లు, పొదలు, నీటి మీటర్ పెట్టెలు వంటి ఎన్నో రకాల ప్రదేశాలలో తేనెటీగలు గూడు కట్టుకుంటాయి.
* పొదలు మరియు చెట్లను కత్తిరిస్తున్నప్పుడు అనుకోకుండా తేనెటీగ గూడును కొట్టినప్పుడు తరచుగా దాడులు సంభవిస్తాయి.
* తేనెటీగ గూళ్ళకు పశువులను దూరంగా ఉంచాలి.
* కలుపు తీసేటప్పుడు, ట్రాక్టర్లు, ఇతర పరికరాలు ఉపయోగించేటప్పుడు జంతువులను మేత కోసం బయటకు అనుమతించవద్దు.
* మీ జంతువులను తేనెటీగ కుట్టినట్లయితే వెంటనే జంతువును తేనెటీగల నుండి విడదీయాలి.
* మీ కుక్కను తేనెటీగ కుట్టినట్లయితే వెంటనే ఇంటి లోపలికి తీసుకురావాలి అది వేరే జంతువులకు హాని కలిగించకుండా ఉంటే, విడుదల చేయవచ్చు.
* వీలైతే షాంపూ నీటిలో కుక్కను ముంచాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి తగులుకున్న తేనెటీగలను తొలగించవచ్చు.
డా. మామిడాల లావణ్య (9849756473), ఎం.వి.ఎస్సీ, అసిస్టెంట్ ప్రొఫెసర్, డా. నల్లపాటి సాయి అంజన (9573684395), ఎం.వి.ఎస్సీ, పి.జి.డి.ఎ.డబ్ల్యు, అసిస్టెంట్ ప్రొఫెసర్, డా. పోతంశెట్టి ఆదివిష్ణుబాబు (9701963023), బి.వి.ఎస్సీ., హస్సన్ వెటర్నరీ కాలేజి,
”వాడిని ఇంటర్మీడియట్లో ఎమ్పిసి గ్రూప్లో చేర్చింది, బి.టెక్లో కంప్యూటర్ సైన్సు చదువుతాడని. సాఫ్ట్వేర్ ఇంజనీరు అయితే ఎయిర్ కండిషన్డ్ గదుల్లో ఉంటూ అమెరికా దేశంలో స్థిరపడతాడని. వీడేమో నా మాట వినకుండా అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సు చేరినాడు. హాయిగా జీవితాన్ని గడపకుండా మట్టి పిసుక్కునే వారికి సేవ చేయాలని ఎందుకు కోరుకుంటున్నాడో? వేళా పాళా ఉండదు,కయ్యిలమ్మిటా కాల్వలమ్మిటా తిరగాలి, పెద్దగా చదవని రైతులతో, మామూలు జనంతో కలిసి పనిచేయాలి. అదే సాఫ్ట్ వేర్ అయితే జీవితాన్ని అనుభవించ వచ్చు. విమానాల్లో ఎగురవచ్చు. మేధావులతో, బాగా డబ్బున్న వారితో కలిసి పని చేయవచ్చు” నిష్టూరపోయినాడు నారాయణరెడ్డి.
”మనకు నచ్చిన చదువు వాడు చదవాలని లేదు కదా. వాడికి నచ్చిన చదువు చదవనివ్వండి. అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. ఎవరి నుదిటిన ఏమి రాసి పెట్టి ఉందో…”అని ఈశ్వరమ్మ భర్తను ఓదార్చింది.
* * * * *
చిత్తూరు జిల్లా, పలమనేరు పట్టణానికి పాతిక మైళ్ళ దూరంలో ఉన్న చిన్న గ్రామమది. ఆ గ్రామం పక్కనే దండిగా పల్లెలున్నాయి. అక్కడి రైతులు కూరగాయ తోటలు పండిస్తారు. పది చదివిన తరువాత ఐ టి ఐ చదివిన నారాయణరెడ్డి బావి మోటార్లు రిపేరు చేస్తూ ఉంటాడు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు చదివిన ఈశ్వరమ్మ టైలరింగ్ చేస్తూ ఉంది. వీరి ఒక్కగానొక్క కొడుకు చిరంజీవి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
* * * * *
అప్పుడప్పుడే తెల్లారుతోంది. ఇంటి ముందరి గులాబీ తోటలోని గులాబీలు కోస్తూ ఉన్నాడు చిరంజీవి.
తక్కెడాయన, వాడి పెళ్ళాంతో కలిసి గంపలు, గోతాలు ఎత్తుకుని పరుగులు తీస్తున్నాడు.
”ఏమయ్యింది” అని అడిగినాడు.
”కూరగాయ పంటలు పండించే రైతులకు కొత్త కష్టం వచ్చి పడింది. రాత్రిళ్ళలో మాత్రమే దాడి చేసే దండు…. నత్తల దండు, రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది”
ఆశ్చర్యంగా వారి వైపు చూశాడు చిరంజీవి.
”పగులు కనబడవు, రాత్రిళ్ళలో పొలాల్లోకి వస్తున్నాయి. చేతికి అందాల్సిన పంటలు ధ్వంసం చేస్తున్నాయి.
ఊరికి ఉత్తరాన వుండే గుట్ట కింద మాకు నేల ఉంది. పది రూపాయలు సంపాదించుకుందామని టమోటా తోట వేసినాను. ఇప్పుడు ఈ నత్తల దయ్యాలు వచ్చి నోటికాడి కూడు లాగేస్తా ఉన్నాయి.
మా పంటే కాదు, ఊర్లో వాళ్ళ ఉర్లగడ్డ, మిరప, చిక్కుడు, బీర తోటలు కూడా నాశనం చేస్తున్నాయి”
చిన్నగా తక్కెడాయనతో కలిసి టమోటా తోట కాడికి బయలుదేరినాడు. పొలాల్లో నత్తల దాడి జరుగుతూ ఉందని తెలుసుకున్నాయేమో ఊరి కుక్కలు, భౌభౌమని అరుస్తూ ఉన్నాయి.
దబ దబా పరుగెత్తుకుంటూ వచ్చిన ఆడంగిలాయన ”ఏందబ్బా, నత్త నడక నడస్తా వుండారే, కొంపలు కొల్లేరు అయిపోతావుంటే…. పరిగెత్తండి… పరిగెత్తండి” అంటూ తోసుకుంటూ వెళ్ళినాడు.
పరుగులు తీస్తూ మబ్బులో గణేష్ బీడీ కట్టపై పేపరును తొక్కినాడు. ”అయ్యో..అయ్యో…దేముడి బొమ్మ తొక్కేసినానే ….” అంటూ ఆ పేపరుకు పడీపడీ మొక్కి, మళ్ళీ టమోటా తోటలోకి పరుగులు తీసినాడు.
చిన్నగా మంచు కురుస్తోంది.అప్పటికే కొంత మంది రైతులు పొలాల్లో చేరి ఉన్నారు. వాటిని ఏరి గంపల్లో, తట్టల్లో, గోతాములలో వేసుకుని దూరంగా పారేస్తున్నారు.
తోటలలో వున్న డ్రిప్ పైపుల్లో నుంచి నీరు సరిగా రాక పోవడం గమనించి కారణం అడిగాడు.
”నత్తలు కూరగాయలను తినడమే కాదు, డ్రిప్ పైపుల్లో కూడా దూరి నీళ్లను సరిగ్గా రానివ్వడం లేదు” అని బదులిచ్చినాడు తక్కెడాయన. చిరంజీవి బాధగా తలెత్తి చూశాడు.
వందలాది నత్తగుల్లలు గెనుమలపైన, పొలాల్లో కనిపించాయి. శత్రు సేనపై దాడి చేసే సిపాయిల్లాగా అవి టమోటా మొక్కలన్నిటినీ చుట్టుముట్టి ఉన్నాయి. తేమ వాతావరణం నత్తల మనుగడకు అనువుగా ఉందని గుర్తించాడు.
నత్తలు నడిచే దారిలో అవి విడిచిపెట్టిన జిగురు తివాచీ పరిచినట్లుగా ఉంది. ఊర్లోని పిల్లలు కొందరు జిగురు వెంబడే, కారులో పోయినట్లు ‘రుయ్ రుయ్’ మని శబ్దం చేసుకుంటూ ఆడుకుంటున్నారు.
”నత్తా నత్తా
ఎక్కడి కెళతావ్?
మెత్త మెత్త నడకతో
ఎంత దూరం పోతావ్?
నిన్ను పట్టి అత్తకి ఇస్తా!
కూర వండించి దుత్తలో పెడతా!!” అని పాడుతున్నాడు ఆడంగిలాయన.
నత్తలు పంటల్ని ఎలా నాశనం చేస్తున్నాయని అక్కడి రైతులను అడిగాడు.
వారు టమోటా చెట్లను చూపిస్తూ ఇలా చెప్పారు ”మొక్కల మొదళ్లలోని మృదువైన భాగాన్ని తినేస్తున్నాయి. మొక్కకు అందాల్సిన సూక్ష్మ పోషకాలు తగ్గి పంట ఎగబడి రావడం లేదు. మొక్కలకు రోగ నిరోధక శక్తి తగ్గి ఫంగస్ కారణంగా తెగుళ్లు సోకుతున్నాయి”
‘నత్తల వల్ల పంటకు నష్టం,రైతులకు కష్టం వచ్చింది కదబ్బా’ అని కొద్దిసేపు అక్కడే గెనుమ మీద కూర్చుని ఆలోచనలలో పడినాడు. తన చేతిలోని మొబైల్లోని నెట్ ద్వారా వాటిని ఎలా తరిమేయాలో చూశాడు. పరిచయమున్న అగ్రికల్చరల్ బి.ఎస్సీ చదువుతున్న సీనియర్లతో మాట్లాడినాడు. పలమనేరులోని వ్యవసాయ అధికారులతో మాట్లాడాడు. వాటిని ఎలా తరిమికొట్టాలో కొన్ని సలహాలు తీసుకున్నాడు.
రెండు మూడు వారాలు రైతులతో పాటే పొలాల్లోకి వెళ్ళాడు. కొన్ని మందులను డ్రిప్పుల ద్వారా, కొన్ని మందులను నేరుగా చల్లించినాడు.
కొద్దికొద్దిగా నత్త గుల్లల తాకిడి తగ్గింది. రైతులు చిన్నగా ఊపిరి పీల్చుకోగలిగినారు.
* * * * *
కొడుకు, రోజూ రైతులమ్మిట తిరగడం చూసిన నారాయణ రెడ్డి, భార్యతో ఇలా అన్నాడు ”చదువుకునే వాడు బుద్ధిగా చదువుకోకుండా, వాడికి ఊర్లో వాళ్ళతో ఏమి పని? ఎవరు ఎట్లపోతే మనకేమి? దారిన పడి వున్న చెత్తను నెత్తిపైన వేసుకుంటాడెందుకు?
సుఖ పడే లక్షణాలు లేవు వీడికి …జల్సాగా కాలు మీద కాలు వేసుకుని ఉద్యోగాలు చేసే చదువులు చదవకుండా కూలీ లెక్కన పొలాల్లో కష్టపడే చదువు చదువుతున్నాడు. రేపు పెండ్లి చేయాలన్నా కష్టం. అమెరికా అబ్బాయిలకే అమ్మాయిలు దొరకడం లేదు. మట్టిలో దొర్లా డాలకునే వీడికి పిల్లను ఎవరు ఇస్తారు”
”ఎందుకండీ అలా శాపనార్థాలు పెడతారు. మట్టిని నమ్ముకున్నవాళ్ళెప్పుడూ చెడిపోరు లెండి. అమెరికాలో ఉద్యోగం చేస్తేనే చేసినట్లా? మన ఊర్లల్లో చేస్తే ఉద్యోగాలు కావా”
”మా పెద్ద నాయన కొడుకు జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా లక్షలు సంపాదిస్తున్నాడు. మా మేనమామ అల్లుడు అమెరికాలో ఏకంగా పెద్ద బిల్డింగ్ కొనేసాడు. సింగపూర్లో వుండే మా పిన్ని మనుమడికి నెలకు నలభై లక్షల జీతమంట. కొడితే అలాంటి జాక్పాట్లు కొట్టాలి. రవిక గుడ్డల వ్యాపారం చేసేవాడికి, పట్టు చీరల వ్యాపారం చేసేవాడికి ఉన్నంత తేడా ఉంది”
”వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా సంపాదిస్తున్నారు అని ఆలోచిస్తూ కూర్చుంటే మనకి కడుపు మంట, కడుపులో మంట తప్పితే లాభమేముందండీ… ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. ఫారిన్లో వున్నా ఇండియాలో వున్నా ప్రతి మనిషీ కుడిచేత్తోనే కదా తింటాడు. అవీఇవీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి”
* * * * *
అప్పుడప్పుడే తెల్లారుతోంది. చల్లటి గాలులు మెల్లమెల్లగా వీస్తున్నాయి. ఇంటి దూలాల సందుల్లో, వాసాల ఇరుకుల్లో దాక్కుని వున్న ఊర పిచ్చుకలు కిచకిచ శబ్దాలు చేస్తున్నాయి.
దడదడమని ట్రాక్టర్లు ఇంటి ముందర వచ్చి నిలిచిన శబ్దం. అంతా గోలగోలగా ఉంది.
నిద్రబోతున్న నారాయణరెడ్డి ‘ఏమయ్యిందబ్బా’ అని ముఖానికున్న దుప్పటి తీసి చూసాడు. చిరంజీవి కంప్యూటర్ ముందర కూర్చుని మామిడి తోటల్లో అంతర పంటల సాగు గురించి వెదుకుతున్నాడు. ఈశ్వరమ్మ గాఢంగా గురకపెట్టి నిద్రపోతోంది.
బయట ఏమి జరుగుతోందో చూద్దామని ముఖం మీద నీళ్లు చల్లుకుని ఇంటి బయటికి వచ్చాడు.
ఇంటి ముందర పది ట్రాక్టర్లు నిలబడి ఉన్నాయి. ట్రాక్టర్ల నిండా ఎర్రెర్రని టమోటాలు కళకళ లాడుతూ కనిపించాయి. పండిన టమోటాలను పలమనేరు, బెంగుళూరు పట్టణాలకు తీసుకెళ్లి అమ్మడానికి వెళ్తున్నారు. ముప్పై మంది దాకా మగవారు ట్రాక్టర్ల నుండి దిగినారు.
ఎందుకొచ్చారని అడిగే లోగానే కొందరు ఇంటిలోకి వెళ్లి చిరంజీవిని ఎత్తుకొచ్చారు.
”జై చిరంజీవి… జైజై చిరంజీవి” అని అరుస్తూ ఉన్నారు.
టమోటాలతో చేసిన మాలను చిరంజీవి మేడలో వేసినారు. పలకలు కొట్టినారు, పాటలు పాడినారు, పులి అడుగులు వేసినారు, పూలు విసిరినారు, రంగురంగుల నీళ్లు చల్లినారు.
చిరంజీవిని పెద్ద బండ పైన నిలబెట్టినారు. ఆడంగిలాయన ఈలలు వేసింది వేసిందే ….
తక్కెడాయన గట్టిగా ”ఊరికి ఉపకారి బాబూ నువ్వు. ఎప్పుడూ లేనిది ఈసారి నత్తలతో యుద్ధం చేయాల్సి వచ్చింది. నత్తలవల్ల నష్టపోతున్నామని నీతో చెప్పినప్పుడు మాకు దైర్యం చెప్పినావు. ఎలా ఎదుర్కోవాలో నేర్పినావు. ఏ ఏ మందులు పిచికారీ చేయించాలో చెప్పినావు. దగ్గరుండి మందులను వాడించినావు. పొలాల చుట్టూ సున్నం వేస్తే నత్తల బాధ తగ్గుతుందని చిట్టి చిట్కాలు చెప్పినావు. ఆరుగాలం కష్ట పడిన మాకు ఖాళీ జేబులు మిగులుతాయని అనుకుంటే, మా జేబులు నిండుగా నింపుతున్నావు. ఈసారి టమోటా పంట మాకు దక్కిందంటే, ఇది అంతా నీ దయ బాబూ…. నీ పనులు కూడా పక్కన పెట్టి మా కోసం కష్టపడినావు” అంటూ పూలమాల వేసినాడు. ఎవరో దూరంగా టపాకాయలు పేల్చినారు.
చిరంజీవిని ఊరేగిస్తూ ప్రతి ట్రాక్టరు వద్దకూ ఎత్తుకెళ్ళి జేజేలు పలుకుతున్నారు. ఈ మధ్యనే పైటలేసిన ఆడపిల్లలు ఇండ్లనుంచి బయటికి వచ్చి చిరంజీవి వైపు మెచ్చుకోలుగా చూశారు.
అక్కడ గుమికూడిన ఆడవారిని చూస్తూ ఆడంగిలాయన పాట పాడినాడు.
ఇంతలో నారాయణరెడ్డి పక్కన వచ్చి నిలబడిన ఈశ్వరమ్మ ”ఏమండీ, మనవాడు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించి స్థిర పడి ఉంటే మనం, మన ఇంట్లో వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉండే వాళ్ళమేమో… ఇప్పుడు చూడండి…మన ఊర్లోని రైతుల ముఖాల్లో వెలుగులు….ఈ వెలుగులు మన ఊరి రైతులలోనే కాదు, వేలాది రైతులలో కూడా మన బిడ్డ వెలుగులు నింపుతాడండీ. ఎక్కడో దూరదేశాల్లో ఉద్యోగం చేస్తూ, అప్పుడప్పుడు సెల్లో హాయ్ హాయ్లు చెప్పడం కన్నా మన బిడ్డ మన దగ్గరలో ఉంటూ పదిమందికీ ఉపయోగపడితే దానికి మించిన సంతోషం మనకి ఇంకేమి ఉంటుందండీ?” అని సంతోషంగా చెప్పింది.
నారాయణరెడ్డి కన్నార్పకుండా ఊరేగింపునే చూస్తున్నాడు. ఊర్లోని అమ్మలక్కలు కంచు తట్టలో ఎర్ర నీళ్లు పోసి అందులో కర్పూరం వెలిగించి చిరంజీవికి దిష్టి తీస్తున్నారు. ఆ కర్పూరం వెలుగులో చిరంజీవి ముఖం మిలమిలా మెరుస్తోంది.
నారాయణరెడ్డి చేయి అతడికి తెలియకనే ఇంటి ముందరి గులాబీ చెట్టుకున్న పువ్వును కోసింది. కొడుకు మీదకి విసిరివేయడానికే పువ్వును కోసాడని అర్థం చేసుకున్న ఈశ్వరమ్మ ముసిముసినవ్వులు నవ్వుకొంది.
పశువులలో వచ్చు అతి ముఖ్యమైన బ్యాక్టీరియల్ వ్యాధులు క్షయ వ్యాధి. జోన్స్ వ్యాధి, ఆక్టినోమైకోసిస్, ఆక్టినో బాసిల్లాసిస్, ఆంత్రాక్స్, హిమరేజిక్ సెప్టిసీమియ బ్రుసెల్లోసిస్ మరియు క్లాస్ట్రీడియల్ వ్యాధులు.
క్షయవ్యాధి: దీనినే ట్యూబర్క్యులోసిస్ అందురు. ఇది మైకోబ్యాక్టీరియం అను వ్యాధి కారకము ద్వారా వస్తుంది. ఇది వ్యాధిగ్రస్త పశువుల పాలు వాటి దూడలు త్రాగుటవలన దూడలలో మరియు శ్వాస ద్వారా కూడ వ్యాపించును. వ్యాధిగ్రస్త పశువులు రోజు రోజుకు కృషించిపోవుట, పౌష్టికాహారము తీసుకున్నప్పటికి ఆరోగ్యం క్షీణించి పోవుట, తెమరుతో కూడుకొనిన మరియు విపరీతమైన దగ్గు వంటి లక్షణాలను కలిగి ఉండును.
జోన్స్ వ్యాధి : దీనినే పారాట్యుబర్ క్యులోసిస్ అని కూడా అందురు. ఇది మైక్రోబ్యాక్టీరియా పారాట్యుబర్ క్యులోస్ అను వ్యాధి కారకము ద్వారా కలుగును. కలుషిత ఆహార పదార్థాల ద్వారా వ్యాధి వ్యాప్తి జరుగును. వ్యాధి గ్రస్త పశువులు శారీరకంగా కృషించిపోవుట, పాలదిగుబడి తగ్గిపోవుట అబార్షన్స్, అధిక దాహరం ఉండి దుర్వాసన లేని, సాఫ్ట్గా మరియు పలుచగ విరోచనాలు ఉండును. సాధారణంగా జ్వరము ఉండదు.
ఆక్టినోమైకోసిస్ : దీనినే లంపీజా అని కూడా అందురు. ఆక్టినోమైసిస్బోవిస్ అను వ్యాధి కారకము సాధారణంగా పశువుల నోట్లో ఉండి, ఎప్పుడైన నోట్లో గాయాలైనపుడు, పళ్ళు వచ్చేటపుడు, ఈ వ్యాధి కారకము. ఆయా భాగాలలో చేరి వ్యాధిని కలుగజేయును. వ్యాధి లక్షణాలు, తొలిథలో క్రింది దవడ బయటివైపున నొప్పిలేని గడ్డలుగా వచ్చును. క్రమేన ఈ గడ్డలలో పసుపు పచ్చని, చిక్కని శ్లేష్మముతో కూడిన చీము చేరి, ఆ భాగము నొప్పిని కలిగించును. ఈ గడ్డలలో సల్ఫర్ గ్రాన్యూల్స్ అను పసుపు పచ్చని సూక్ష్మకణికలుంటాయి. ఈ వ్యాధితో బాధపడే పశువులు ఆహారం తీసుకోలేక, నీరసించిపోయి, నోటిలో దుర్వాసన మరియు పళ్ళు పదులైపోవుట, లాలాజలం / చొంగ ఎక్కువ కారుట వంటి లక్షణాలను చూపును.
ఆక్టినోబాసిల్లోసిస్ : దీనినే ఉడన్ టంగ్ లేదా నాలుక వాపు వ్యాధి అని కూడా అందురు. ఈ వ్యాధి కారకము అనగా ఆక్టినోబాసిల్లస్ లిగ్నిరేసి, లంపీజా కారకము మాదిరిగానే పశువు నోట్లో ఉండి, నోట్లో ఏవైన గాయాలు అయినపుడు, ఆ గాయము యొక్క ప్రదేశాన్ని చేరి వ్యాధిని కలిగించును. వ్యాధి లక్షణాలు ముఖ్యంగా అతిగా వాచిపోయి, గట్టిగా మారిన నాలుక మరియు ఇది నోటి నుండి బయటకు వేలాడుతుంది. అందువలన పశువు నోటిని పూర్తిగా మూయలేకపోవుట జరుగును. అంతేగాక లాలాజలం అధికంగా కారుట, శ్వాస తీసుకొనుట కష్టంగా ఉండి, నాలుకపైన పుండ్లు ఏర్పడి, వాటి నుండి చీముతో కూడిన పసుపు పచ్చని స్రావాలు కలిగి, సల్ఫర్ గ్రాన్యూల్స్ని కలిగి ఉండును.
ఆంత్రాక్స్ : దీనినే దొమ్మరోగము, ఊల్ సార్టర్స్ వ్యాధి, స్లీనిక్ ఫీవర్ అని కూడా అందురు. ఇది బాసిల్లస్ ఆంత్రాసిస్ అను వ్యాధి కారకము వలన కలుషిత పదార్థాలను తినటం వలన, కలుషిత గాలి పీల్చుట ద్వారా వ్యాపించును. ఈ వ్యాధిసోకిన పశువులు మరణాల బారినపడుతూ, అధిక ఉష్ణోగ్రత అనగా 107ఓFగా ఉండును. అంతేకాక గడ్డకట్టని, టారీ రంగులో ఉండే రక్తము అన్ని సహజ రంధ్రాలనుంచి కారుట చూడవచ్చును. ఈ యొక్క వ్యాధి సోకిన మరియు వ్యాధి లక్షణాలను చూపిన పశువులలో శవ పరీక్షలో పశువులను తెరువకుండా జాగ్రత్తగా డిస్పోజ్ చేయవలెను. ఎందుకనగ ఈ వ్యాధి సోకిన పశువులను కాని, వాటి ఉత్పత్తులను కాని తాకినపుడు మనుషులలో సోకును. ఈ వ్యాధి సోకిన మనుషులలో మాలిగ్నెంట్ పుస్ట్యూల్స్ లేదా మాలిగ్నెంట్ కార్బంకుల్స్ అనునవి శరీరంపై రావటం, ఊపిరితిత్తుల వ్యాధిని కలిగి ఉండటం చూడవచ్చును.
గొంతువాపు వ్యాధి: దీనినే హిమరేజిక్ సెప్టిసీమియా లేదా షిప్పింగ్ ఫీవర్ అని కూడా అందురు. ఇది పాశ్చురెల్లా మల్టోసిడా అని కారకము ద్వారా వచ్చును. ఈ కారకము పశువు శ్వాస నాళంలో జీవిస్తూ, కరువు కాటకాలు, తుఫానులు, అధిక దూరాలు రవాణా చేయునపుడు, పశువు ఒత్తిడికి గురైనపుడు ఈ కారకము ఊపిరితిత్తులను చేరి వ్యాధిని కలిగించును. ఈ వ్యాధి సోకిన పశువులు అధిక జ్వరము అనగా 104-106 ఓF ఉండి, భ్రాంకోన్యుమోనియా, కష్టంగా శ్వాస తీసుకోవటం వంటి వ్యాధి లక్షణాలను కలిగి ఉండును.
క్లాస్ట్రీడియల్ వ్యాధులు: ఇందులో అతి ముఖ్యమైనవి జబ్బువాపు వ్యాధి మరియు ఎర్రమూత్ర వ్యాధి. జబ్బు వ్యాధినే బ్లాక్లెగ్ లేదా నల్ల జబ్బు అనువు కూడా అందురు. వ్యాధి కారకము క్లాస్ట్రీడియంతో పైగా ఉండును. ఇది కలుషిత ఆహారము, గాయాల ద్వారా వ్యాప్తి చెందును. 6 నెలల నుండి 2 సంవత్సరాల వయస్సుగల పశువులలో చూడవచ్చును. ఈ వ్యాధి సోకిన పశువులు చనిపోయి కనిపించడం, 106 ఓF జ్వరము, కుంటుట, కండరాల వాపు, ముఖ్యంగ జబ్బు వాచిపోయి, ముట్టినపుడు నొప్పి కలుగకుండ ఉండి కిర్కిర్మను క్రిపిటేటింగ్ శబ్దాలు వచ్చును. బ్యాసిల్లరీ హీమోగ్లోబినూరియా లేదా ఎర్రమూత్ర వ్యాధి క్లాస్ట్రీడియం హీమోలైటికమ్ అను కారకము ద్వారా కలుగును. దీనివలన పశువు శరీర ఉష్ణోగ్రత 104-107 F గా / అధికంగా ఉండి, నలతగా ఉండును. ఈ వ్యాధి సోకిన పశువులలో ఎర్ర రక్త కణాలు చనిపోవటంవలన మూత్రం ఎర్రగపోవుట బయటకి కనిపించే శ్లేష్మపొరలు పాలిపోయి ఉండి పసుపు రంగును కలిగి ఉండును. ఇవేకాక పాలదిగుబడి తగ్గిపోవుట, ఆకలి లేకపోవుట, నెమరు వేయకపోవుట, మలబద్ధకం, వెన్ను వంగిపోయి కష్టంగా నడుచుట, నాడి మరియు శ్వాసవేగం అధికంగా ఉండటం వంటి లక్షణాలను చూపిస్తూ 12-24 గంటలలో మరణించును.
కోల్బాసిల్లోసిస్ : దీనినే పారుడు రోగము, తెల్లబేదులు, స్కోర్స్ లేదా వైట్ డయోడియ అని కూడా అందురు. ఈ వ్యాది అప్పుడే జన్మించిన లేగదూడలో సాధారణంగా వచ్చును. ఇది పశ్చిరేశియా కోలై అను వ్యాధి కారము వలన వస్తుంది. ఈ వ్యాధి 2 వారాలు వయస్సులోపు దూడలలో కూడా కలుగును. ఈ వ్యాధి సోకుట అనునది ముఖ్యంగా ఆహారం సరిగ అందించకపోవుట, ముర్రుపాలు సరిగ్గా త్రాగించకపోవుట, క్రిక్కిరిసి ఉన్న షెడ్లు, పాకలలో శుభ్రత లోపము, వాతావరణంలో తేడాలు, అధిక వేడి / చలి మొదలగు పరిస్థితులు, శారీరక మరియు భౌతిక ఒత్తిడి, ప్రతికూల వాతావరణం మరియు అపరిశుభ్రత పరిస్థితులలో జరుగును. గర్భాశయంలో ఉన్న శిశువుకు తల్లి రక్తం ద్వారా మరియు సరిగా కత్తిరించని నాభినాళం ద్వారా జీర్ణాశయం చేరి, వ్యాధినిరోధకశక్తి క్షీణించినపుడు, ఈ జీవి విడుదల చేయు విషపదార్థాల వలన అధికంగా పారుకొనుట మరియు నేలపై సాగిలపడుట వంటి వ్యాధి లక్షణాలను చూపును.
ఇలాంటి వ్యాధులు పశువుల్లో వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వ్యాధి సోకిన పశువులను మంద నుండి వేరుచేసి, సరైన చికిత్స అందించి, ఆరోగ్యంగా ఉన్న పశువులలో సరైన సమయంలో టీకాలు వేయించినట్లయితే మరియు అన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే పశువులలో వ్యాధులు రాకుండా నివారించవచ్చు.
పశువులకు సంభవించిన వ్యాధులలో చాలా శాతం వ్యాధులు కొన్ని రకాలైన బాక్టీరియా, వైరస్, ఫంగస్, బాహ్య మరియు అంతర పరాన్న జీవుల వలన సంక్రమిస్తాయి. ఈ సూక్ష్మజీవులు వ్యాధి సోకిన పశువుల నుండి వాటి యొక్క మలమూత్రాదులు, నోరు, ముక్కు, కన్ను, యోని నుండి వెలువడే స్రావాలు, ఉమ్మనీరు, వీర్యం, శ్వాస ద్వారా బయటకు విసర్జింపబడుతాయి. వీటి ద్వారా ప్రత్యేక్షంగా గాని లేదా పరోక్షంగాగాని కలుషితమైన ఆహారం, నీరు, గాలి తీసుకున్నపుడు కాని లేదా చర్మంలోని గాయాల ద్వారా కాని ఈ వ్యాధులు పశువుల నుండి ఇతర పశువులకు మరియు మనుష్యులకు ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉంది. ఇంకా కొన్ని చర్మ సంబంధమైన వ్యాధులు సోకిన పశువులను తాకడం వల్ల అవి మనుష్యులకు సోకవచ్చు. కొన్ని రకాలైన కీటకాల కాటువల్ల వ్యాధి కారక క్రిములు శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి.
వ్యాధి సోకిన పశువుల పాలను బాగా మరిగించకుండా కాని, మాంసాన్ని బాగా ఉడికించకుండా తినినపుడు కాని అన్ని రకాలైన వ్యాధులు మనుష్యులకు సంక్రమించే అవకాశం ఉంది. ఈ విధంగా వ్యాధి సోకిన పశువుల నుండి ఇతర పశువులకు మరియు మనుష్యులకు వ్యాప్తి చెందు వ్యాధులను సంక్రమిత వ్యాధులుగా పరిగణిస్తారు. మరీ ముఖ్యంగా జంతువుల నుండి మనుష్యులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అని వ్యవహరిస్తారు. ఇలాంటి సంక్రమిత వ్యాధులు తరచూ సంభవిస్తూ ఉండటం యజమానులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, వారుకూడా అనారోగ్యాల పాలవుతున్నారు.
ఈ వ్యాధి కారక క్రిములు పశువుల మరియు మనుష్యుల శరీరంలోకి పైన చెప్పబడిన ఏదో ఒక మార్గం ద్వారా ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. కాబట్టి వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశించకుండా కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే వ్యాధులు లేకుండా నివారించుకోవచ్చు.
పూర్వము దొడ్లలో లేదా చావిడిలలో పశువులను ఉంచటంవల్ల కొన్ని రకాల సూక్ష్మజీవులు ఎండతగలడంవల్ల చనిపోతూ ఉండేవి. ఈ నవీన యుగంలో పరిశ్రమ, జనసాంద్రత పెరిగిన కారణంగా కొద్దిపాటి స్థలంలోనే ఎక్కువ పశువులను 24 గంటలు ఉంచడం వల్ల తేమ పెరిగి వ్యాధికారక క్రిములు త్వరగా వృద్ధి చెందుతాయి. దీనివలన పశువులశాల పరిసరాలు, వాతావరణంలో సూక్ష్మజీవుల సాంద్రత పెరుగుతుంది.
ఈ వ్యాధికారక క్రిములను పూర్తిగా పరిసరాలనుండి తొలగించలేనప్పటికి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ వ్యాధులు మందలోని మిగిలిన పశువులకు మనుష్యులకు సోకకుండా అరికట్టవచ్చు. ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన జూనోటిక్ వ్యాధుల గురించి తెలుసుకుందాం.
బ్రూసెల్లోసిస్ : ఈ వ్యాధి మనరాష్ట్రమంతటా అన్ని జిల్లాల్లో వ్యాపించి ఉంది. ఈ వ్యాధి వల్ల చూలు నిలిచిన పశువులలో 7 నెలల తర్వాత గర్భస్రావం జరుగుతుంది. కొన్ని పశువులలో చూలు నిలిచినప్పటికీ వ్యాధికారక బాక్టీరియా పశువు ఈనినప్పుడు, మాయ ఉమ్మనీరు, పాలద్వారా బయటకు విసర్జింపబడి ఆ పరిసరాలను మొత్తం కలుషితం చేస్తాయి. ఈ వ్యాధి వల్ల పశువు గొడ్డుగా మారే ప్రమాదం ఉంది. వ్యాధి సోకిన ఎద్దులు లేదా దున్నపోతుల వీర్యం ద్వారా బాక్టీరియా వెలవడటం వల్ల వీటిని ఆవులు లేదా గేదెలు కట్టటానికి ఉపయోగించినట్లయితే వాటికి వీర్యం వ్యాధి సంక్రమిస్తుంది. తద్వారా మంద మొత్తం వ్యాధి బారినపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మందలోని మొదటిసారి కట్టిన పడ్డలలో కనుక గర్భస్రావం ఉన్నట్లయితే మొత్తం పశువులను వ్యాధి నిర్థారణకోసం పరీక్ష చేయించాలి. అంతేకాకుండా కొత్త పశువులను కొనేటపుడు ఈ వ్యాధి లేదని నిర్థారించుకున్న తర్వాతే ఆయా పశువులను కొనాలి.
ఈ వ్యాధి సోకిన పశువులలో అతిసన్నిహితంగా మెలిగే వారికి, రైతులకు, పశువైద్యులకు, మాంసం దుకాణాలలో పనిచేయువారికి, పచ్చిపాలు లేదా సరిగా మరిగించని పాలను / ఉత్పత్తులను వాడే వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వ్యాధి సోకిన వారిలో తరచూ జ్వరం రావడం, తలనొప్పి, అలసట, నీరసం, కీళ్ళ నొప్పులు, వెన్నెముక క్రింది భాగంలో నొప్పి, బరువు తగ్గిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మనుష్యులు, పశువులలో ఈ వ్యాధి నిర్థారక పరీక్షలు ఉచితంగా విబిఆర్ఐ నందు ఆధునిక పద్ధతులద్వారా జరుపబడుతున్నాయి. కాబట్టి ఈ వ్యాధి లక్షణాలు కనిపించినపుడు, కొత్త పశువులను కొనేటప్పుడు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి.
నివారణ చర్యలు : ఈనుకుపోయిన పశువు పిండాన్ని, గర్భస్రావాలను పూడ్చిపెట్టాలి. వ్యాధిసోకిన పశువులను మంద నుండి వేరుచేసి ఆంటీబయోటిక్ మందులను క్రమం తప్పకుండా ఇవ్వాలి.
బ్రూసెల్లా అబార్టస్ స్ట్రెయిన్-19 (S-19) & RB 51 (Live) వంటి టీకాలను 4-8 నెలల దూడలకు చర్మం క్రింద ఇవ్వాలి.
వి. లెప్టోస్పైరోసిస్
ఈ వ్యాధి లెప్టోసైరో అనబడు బాక్టీరియా వల్ల జంతువులకు మరియు మనుష్యులకు సంక్రమించు వ్యాధి. ఈ వ్యాధి కారక బాక్టీరియా ఎలుకలు, పందికొక్కుల వంటి జాతులలో బాగా వృద్ధి చెంది వాటి మూత్రం ద్వారా విసర్జింపబడుతుంది. పశువులలో ఈ వ్యాధి వలన గర్భస్రావం మరియు పొదుగువాపు వంటి లక్షణాలను మనం గమనించవచ్చు. కుక్కలలో ఈ వ్యాధి వలన తీవ్రమైన జ్వరం, వినికిడి లోపం, కంటిచూపు తగ్గిపోవడం, రక్తంతో కూడిన మూత్రం, పచ్చకామెర్లు, రక్తహీనత వంటి లక్షణాలు కనపడతాయి.
మనుష్యులలో ఆకస్మిక జ్వరం, బలహీనత, తలనొప్పి, కండరాల నొప్పులు, కాలేయ వాపు, కామెర్లు, మూత్ర పిండాలు సరిగా పనిచేయక పోవడం వంటి లక్షణాలు కనపడతాయి.
నివారణ చర్యలు : వ్యాధి సోకిన పశువులను మంద నుండి వేరుచేసి పెన్సిలిన్ / టిట్రాసైక్లిన్ / డాక్సిసైక్లిన్ వంటి ఆంటిబయాటిక్ మందులను వాడాలి. ఈ వ్యాధి కారక బాక్టీరియా మూత్రం ద్వారా విసర్జింపబడుతుంది. కావున కలుషితమైన ఈత కొలనులలో ఈత కొట్టటం లేదా త్రాగడం మానుకోవాలి. కుక్కలలో మోగావాక్ (ఖలివీబిఖీబిబీ-6) టీకాను 3 నెలల వయస్సులో ఇచ్చి, మళ్ళీ 21 రోజుల తర్వాత బూస్టర్ డోస్ను ఇవ్వాలి. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి టీకాను ఇస్తూ ఉండాలి. పశువులశాలల్లో, వరి పొలాలలో పనిచేయు వారికి ఎలుకల మూత్రం ద్వారా వ్యాధి సంక్రమించే అవకాశం ఉన్నందున వాటి నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
క్షయవ్యాధి (TB రోగం)
ఈ వ్యాధి మైకోబాక్టీరియా అనబడు బాక్టీరియా వల్ల అన్ని రకాల పశువులకు మరియు మనుష్యులకు కలుగు దీర్ఘకాలిక వ్యాధి ఈ బాక్టీరియా వలన శరీరంలోని అన్ని అవయవాలు ముఖ్యంగా ఊపిరితిత్తులు ఎక్కువగా దెబ్బతింటాయి. ఈ వ్యాధి సోకిన జీవరాశులు శ్వాస వదిలినపుడు, తుమ్మినపుడు, దగ్గినపుడు ఇవి గాలిలో కలిసిపోతాయి. ఈ బాక్టీరియాలో కలుషితమైన మేత, నీరు పాలను త్రాగడంవల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. వ్యాధిసోకిన మనుషులలో మరియు పశువులలో బరువు తగ్గిపోవటం, విపరీతమైన దగ్గు, ముక్కు నుండి నీరు కారటం వంటి లక్షణాలను మనం గమనించవచ్చు.
నివారణ చర్యలు : ఇది దీర్ఘకాలిక వ్యాధి కనుక ఈ వ్యాధి లక్షణాలు కనిపించినపుడు పశువులను పాకనుండి వేరు చేయాలి. ఈ వ్యాధికి 6-9 నెలలు చికిత్స చేయవలసి ఉంటుంది. దీనికి ఎక్కువ ఖర్చు అవుతుంది. కావున ఈ వ్యాధిని నివారించడానికి కల్లింగ్ చేయటం ఉత్తమం. ఈ వ్యాధికి పశువులలో ఎటువంటి టీకాలు లేవు.
ఎ. కుక్కకాటు వ్యాధి (Rabies)
ఈ వ్యాధి రేబీస్ వైరస్వల్ల జంతువులకు మరియు మనుష్యులకు సంక్రమించు ప్రాణాంతక వ్యాధులలో ఒకటి. ఈ వైరస్ యొక్క ప్రభావంవల్ల ముందుగా జ్వరం, ఆ తర్వాత కేంద్రనాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల జీవరాశువుల ఆసాధారణంగా ప్రవర్తిస్తాయి. మనుషులలో నీటిని చూసి బయపడి కండరాలలోని నరాలు దెబ్బతినడం వల్ల పక్షవాతం సోకి మింగలేకపోవడం, నీటిని చూసి బయపడటం, అధిక లాలాజలం, బలహీనత, కుక్కలు ఎక్కువగా అరవడం, కొరకటం, గోడలకు గుద్దుకోవటం వంటి లక్షణాలను మనం గమనించవచ్చు.
నివారణ చర్యలు : పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా ఆంటీరేబీస్ టీకాలు ఇప్పించాలి. వీధికుక్కల నియంత్రణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ కుక్క కాటు వేస్తే 24 గంటలలోపు టీకా వేయించుకోవాలి.
పైన తెలుపబడిన ఈ వ్యాధులే కాకుండా ఇంకా చాలా వ్యాధులు ఉదాహరణకు మెదడువాపు వ్యాధి, ఫ్లూ (Snfluenza) సిటుకోసిస్, లిస్టీరియోడిస్, Fever క్వెలీ జ్వరం (Fever), దొమ్మరోగం (Anthrax) వంటి వ్యాధులు జంతువుల నుండి మనుష్యులకు సంక్రమిస్తాయి.
నివారణ చర్యలు : ఒకసారి వ్యాధి సోకినట్లయితే మందలోని అన్ని పశువులకు మరియు మనుష్యులకు వ్యాధులు సంక్రమిస్తాయి. కనుక వ్యాధి వ్యాప్తిని నివారించడానికి తీసుకునే చర్యలు కాకుండా వ్యాధి సోకకుండా నివారణ చర్యలు పాటించటంవల్ల రైతులకు ఎక్కువ మేలు జరుగుతుంది. వ్యాధి నివారణలో వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం ఒక మైలురాయి వంటిది. కాబట్టి క్రమం తప్పకుండా అన్ని టీకా మందు డోసులను ఇప్పిస్తూ సరియైన పోషణ పద్ధతులను పాటించటం ద్వారా ఈ వ్యాధులను అరికట్టవచ్చు.
వ్యాధి సోకి చనిపోయిన పశువులను ఊరి బయట పారవేయకుండా కాల్చి వేయాలి లేదా భూమిలోపల లోతుగా గుంట తొవ్వి పూడ్చిపెట్టాలి. గుంటలను నదులకు, నీటి కుంటలకు దూరంగా త్రవ్వాలి. ఆ తరువాత గుంటలను సున్నముతో కప్పివేయాలి. పశువు చనిపోయిన ప్రదేశంలో బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. గడ్డి, చొప్ప మరియు పశు వ్యర్థాలను జాగ్రత్తగా తొలగించి కాల్చి వేయాలి.
ఆరోగ్యవంతమైన పశువులలో కూడా వ్యాధికారక సూక్ష్మజీవులు తక్కువ సంఖ్యలో ఉంటాయి. వీటి వృద్ధి చెందకుండా జాగ్రత్తలు పాటించాలి. పశువులను వర్షాకాలంలో, చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆరుబయట ఉంచకూడదు. ఎక్కువ పశువులను గుంపులు, గుంపులుగా తక్కువ స్థలంలో ఉంచకూడదు. పశువులను రవాణా చేయునపుడు అవి శారీరక ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి.
ఏవైనా పశువులలో వ్యాధి లక్షణాలు కనిపించినట్లయితే ఆ పశువులను మిగిలిన వాటికి దూరంగా ఉంచడమే కాకుండా వాటి మేత, నీరు మిగిలిన వాటితో కలవకుండా జాగ్రత్త వహించాలి. పశువుల పాకలను ఎప్పటికప్పుడు ఫినాయిల్ వంటి ద్రావకములతో శుభ్రం చేయాలి.
వ్యక్తిగత పరిశుభ్రత, పశువుల పరిశుభ్రత మరియు పరసరాల పరిశుభ్రత పాటించినట్లయితే చాలా వ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు.
డా|| కె. కవిత, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ,
కాలేజ్ ఆఫ్ వెటర్నరి సైన్స్, రాజేంద్రనగర్, హైదరాబాదు ఫోన్ : 9849381815
జెర్బెరా వాణిజ్యపరంగా సాగు చేసే పూల మొక్కలలో ముఖ్యమైనది. ప్రపంచంలోని అన్ని ప్రదేశాలలో ఇది పెరుగుతుంది. ఈ పుష్పాలు అందమైన వివిధ రంగులలో కనిపించటమే కాక వాటి రేకులు అమరికలో ప్రత్యేకతను ప్రదర్శిస్తాయి. పూవులు ఎక్కువ రోజులు తాజాగా ఉండటం కోసం వాటిని కోసిన తరువాత కాడలను నీటిలో ఉంచవలెను. జెర్బెరాను ఆఫ్రికన్డైసి లేదా గెర్బెరోడైసి అని పిలుస్తారు.
చాలా రాష్ట్రాలు హార్టీకల్చర్ మిషన్ కింద జెర్బెరా పూల సాగును ప్రోత్సహిస్తున్నాయి. రైతులకు డ్రిప్, మల్చింగ్, హాఫ్ హెచ్.పి. మోటార్ పంపు, షేడ్నెట్లను ఉచితంగా లేదంటే సబ్సిడి క్రింద అందజేస్తున్నాయి. మార్కెట్లో మంచిధర లభిస్తుంది. ఎక్కువ శ్రమ లేకుండా సాగు చేయవచ్చును. 28þ36 మీటర్ల (1000 చ.మీ.) షేడ్నెట్లో 3700-3800 వరకు జెర్బెరా మొక్కలు అవసరం అవుతాయి. 90 రోజుల తర్వాత జెర్బెరా పుష్పించడం మొదలవుతుంది. ఒక నెలలో 10 సార్లు పువ్వులను కోయవచ్చు. కోసిన ప్రతిసారీ 800-1000 పూలను షేడ్నెట్ నుండి తీయవచ్చు. ఒక జెర్బెరా పువ్వు ఖరీదు రూ. 5-6/- వరకు ఉంది. ఒక నెలలో 8 వేల నుండి 10 వేల వరకు ఈజీగా వస్తాయి. తద్వారా 40 వేల వరకు ఆదాయం వస్తుంది. అలా ఈ పంటను 5 లేదా 6 సంవత్సరాలపాటు కొనసాగించవచ్చు.
మొక్కల లక్షణాలు: జెర్బెరా మొక్కలు కాండం లేకుండా గుబురుగా పెరిగే బహువార్షికాలు. వీటి పుష్పాలు పసుపు, ఆరెంజ్, తెలుపు, గులాబి, ఎరుపు, స్కార్లెట్ రంగులలో లభ్యమవుతాయి. పూకాడలు చాలా పొడవుగా ఏవిధమైన ఆకులు లేకుండా ఉంటాయి.
వాతావరణం: జెర్బెరా మొక్కల పెరుగుదలకు ఉష్ణోగ్రత 25-30 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు గాలిలో తేమ శాతం 60% ఉండవలెను.
నేలలు: ఎర్రటి నేలలు చాలా అనుకూలం. పి.హెచ్ 5.5-6.5 మరియు ఇ.సి. 0.50 డి.ఎస్.యు/మీ. గా ఉండేటట్లు చూసుకోవాలి. నేలలు వదులుగా గాలి చొరబడేలా ఉంటే వేళ్లు సులభంగా భూమిలోనికి చొరబడి బాగా పెరుగుతాయి. దీనివేళ్ళు 50-70 సెం.మీ. లోతు వరకు వెళ్ళగలవు.
రకాలు: చాలా రంగులతో కూడిన పూలను మనం జెర్బెరాలో చూడవచ్చు. జెఫ్ఫ, సంగ్రియ, రోకుల, ఆఫ్రబ్, రోమెన, సలీన, టెకొర మరియు స్టార్లైట్ వంటి మొదలగు రకాలు గ్రీన్హౌస్లలో పెంచుతారు.
నేల తయారీ: మొక్కలు నాటే ముందు నేలను మీథైల్ బ్రోమైడ్ లేదా ఫార్మిలిన్ను 100 చ.మీ. లకు 7.5-10 లీ. చొప్పున పిచికారి చేసిన తరువాత 2 వారాల పాటు ప్లాస్టిక్తో కప్పి ఉంచాలి. తరువాత ఒక చ.మీ.కు. 100 లీ. నీటితో తడిపి రసాయనాల అవశేషాలు లేకుండా చూసుకోవాలి. 2 వారాల తరువాత మొక్కలు నాటుకోవాలి. ఇది పాలీహౌస్లో సాధారణంగా చేస్తారు.
బెడ్లు తయారీ: జెర్బెరాలను ఎత్తైన బెడ్లపై పెంచుతారు. దీనివల్ల నీరు నిల్వ ఉండకుండా ఉంటుంది. బెడ్లు 2 అడుగుల (60 సెం.మీ.) వెడల్పుతో 1.5 అడుగుల ’45 సెం.మీ.) ఎత్తుతో తయారు చేసుకోవాలి. బెడ్ల మధ్య దూరం 1.0 అడుగు (30 సెం.మీ.) ఉండాలి.
బెడ్లు వదులుగా ఉండటం కోసం 30 ట్రాక్టర్ల గులక ఇసుక (ఎర్ర మన్ను), 15 ట్రాక్టర్ల సేంద్రియ ఎరువులు ఒక ఎకరంలో వేసుకోవాలి. అనగా 1000 చ.మీ. పాలీహౌస్లో 8 ట్రాక్టర్ల గులక ఇసుక (ఎర్రమన్ను), 4 ట్రాక్టర్ల సేంద్రియ ఎరువులు సరిపోతాయి. బెడ్లను ఫ్యూమిగేట్ చేసిన తరువాత చ.మీ.కు/కిలో వేపపిండి వేసుకున్నట్లయితే నులిపురుగుల బెడద నుండి తప్పించవచ్చు.
ఎరువులు: బెడ్లు తయారు చేసిన తరువాత 100 చ.మీ.లకు భాస్వరం ఎరులు 2.5 కిలోలు, మెగ్నీషియం సల్ఫేట్ 1/2 కిలో, బయోజైమ్ గుళికలు 200 గ్రా., హ్యూమిక్ ఆసిడ్ 200 గ్రా. కలుపుకోవాలి. ఈ ఎరువులను 6 ఇంచుల వరకు భూమిలో కలియబెట్టి నీరు పెట్టాలి. మొక్కలు నాటే ముందు ఈసి మరియు పి.హెచ్ గమనించాలి.
నాటేదూరం: మొక్కలను నాటేటప్పుడు ఎల్లప్పుడు మొక్క క్రౌన్ భాగం భూమి పైన ఉండేట్లు చూసుకోవాలి. ఒక బెడ్లో 2 వరుసల మధ్య 30 సెం.మీ. దూరంలో, మొక్కకు మొక్కకు మధ్య దూరం 30 సెం.మీ. ఉండేటట్లు చూసుకొని నాటుకోవాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి భూమిని వదులు చేయటం వల్ల గాలి ప్రసారం జరిగి బాగా పెరుగుతాయి. మొక్కలు నాటిన తరువాత భూమిలో తేమ శాతం 6 వారాలు వరకు 80-90% ఉండేటట్లు చూసుకోవాలి. లేనిచో వాడిపోయే ప్రమాదం ఉంటుంది.
ప్రవర్ధనము: 3 నెలల కంటే ఎక్కువ వయస్సు మరియు 4 లేక 5 ఆకులు ఉన్న టిష్యూకల్చర్ మొక్కలను వాడుకోవాలి.
నీటి యాజమాన్యం: నీటి ఉదజని సూచిక 6.5-7 మరియు ఈ.సి. 0.5-1.0 ఖిఐ/ళీ2 ఉన్న కఠినత్వం 550 పిపియంగా ఉండాలి. మొక్కలు నాటిన వెంటనే 4 వారాల పాటు ఓవర్ హెడ్ (పైభాగం నుండి) సూక్ష్మ-స్ప్రింకర్లతో నీరు పెట్టాలి. తరువాత బిందుసేద్యం ద్వారా నీరు పెట్టాలి. బిందు సేద్యం ద్వారా ఒక్కొక్క మొక్కకు 500-700 మి.లీ./రోజుకి నీటిని వినియోగించుకుంటాయి. గాలిలో తేమ 90-92% మించరాదు. అంతకంటే ఎక్కువ అయితే పూల అమరిక అధ్వాన్నంగా ఉంటుంది.
అంతరకృషి: మొక్కలు పడిపోకుండా మట్టిని ఎగదోయాలి.
జిస్బడ్డింగ్ (చిన్న మొగ్గలను తీసివేయడం): మొక్కలను నాటిన 45 రోజుల తర్వాత క్వాలిటి సరిగా లేనటువంటి చిన్న మొదటి థ మొగ్గలను తీసివేయాలి.
పాత ఆకులను తీసివేయడం: రాలి పడిన ఆకులను, ఎండిన కొమ్మలను తీసివేయడం వల్ల రోగాలు రాకుండా నిరోధించవచ్చు.
కోతకోయడం: జెర్బెరా పంట కాలం 5 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు పూలు పూస్తూ ఉంటాయి. 2-3 వరుసల పుప్పొడి రేణువులు విచ్చుకోగానే పూలను కోయవచ్చు. 14-16 ఆకుల థలో మొక్కలు ఒక చ.మీ.కు 200 పుష్పాల వరకు పొందవచ్చు. పూలను ఉదయం లేదా సాయంత్రం కోయవచ్చు. జెర్బెరా పూల కాడలను వాలుగా కట్ చేసి 4 గంటల పాటు చల్లని నీటిలో ఉంచాలి. నీటి ఉష్ణోగ్రత 14-15 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండి లీటర్ నీటికి 7-10 మి.లీ. క్లోరైడ్/సిట్రిక్ యాసిడ్+ఆస్కార్బిక్ ఆసిడ్ 5 మి.లీ. గాని కలిపి నీటిలో 4 గంటల పాటు ఉంచవచ్చు. బాగా పండిన పువ్వు యొక్క కాడ 45-55 సెం.మీ. పొడవు, 10-12సెం.మీ. వ్యాసం ఉంటే మార్కెట్ విలువ బాగా ఉంటుంది. ఒక రోజుకి 700-1000 వరకు పూలను కోయవచ్చు.
నివారణ: తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి చీడపీడలను నివారించుకోవాలి.
ఇంకా వేరుకుళ్ళు, క్రౌన్ రాట్, ఫ్యూజేరియం కుళ్ళు వంటి తెగుళ్ళు కనిపిస్తాయి.
నివారణ: తగిన చర్యలు చేపట్టే తెగుళ్ళను నివారించుకోవాలి.
పూవులు కాల్షియం లోపం వల్ల వంగిపోవడం, కోత ముందు విరిగిపోవడం, లేత పూవులు వాడిపోవడం, ద్విముఖ పుష్పాలు మరియు పూలన్ని ఒకేసారి విచ్చుకోవడం, పొట్టి కాడలు ఉన్న మొక్కలు ఏర్పడటం జరుగుతుంది.
యాంత్రిక జీవనంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, సామాజికంగా గ్రామాలలో వ్యవసాయ కుటుంబాల్లో వస్తున్న మార్పులు, వ్యవసాయం, పాడి పరిశ్రమల్లో కూలీల కొరత, ప్రకృతి వైపరీత్యాలు, సకాలంలో సేవలందడంలో జాప్యం – వెరసి, పాడి కొంతమేరకు నిరాదరణకు గురవుతోంది అనేది నిజం!
అరకొర వసతులు, పెట్టుబడి లేమి, గిట్టుబాటు ధర లభించక పోవడం లాంటి అంశాలు పాడి ప్రాభవాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి.
నేడు క్షేత్రస్థాయిలో పశువుల నాణ్యత, పాలకు గిట్టుబాటు ధర, పశుఆరోగ్యం, పశుగ్రాస కొరత, దూడల మరణాలు, మేపుకు తగిన ఫలితాలు చాలా వరకు ప్రభావితం చేస్తున్నాయి.
ఈ అంశాలను కొంతమేరకు అధిగమించేలా విజయడెయిరీ అడుగులు వేస్తోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా కనిష్టంగా రూ. 50 వేలు, గరిష్టంగా రూ. 10 లక్షల వరకు ముద్ర పథకం ద్వారా ఋణ సదుపాయం కల్పించేలా ఒప్పందం చేసుకుంది. వాసిగల పశువులను రైతులు కొనుగోలు చేసేలా కొన్నిచోట్ల ఎన్డిడిబి వారి డెయిరీ సేవల విభాగం సహకారంతో మేలు జాతి పాడిపశువులను రైతులకు అందిస్తోంది. ఈతల మధ్య కాలాన్ని తగ్గించి, మేలు జాతి పెంపొందేలా 1962 సేవలు, గోపాల మిత్రల సేవలు అందేలా ఆదేశాలు జారీ అయినాయి.
పునరుత్పత్తి సమస్యల నివారణకు గ్రామాల్లో పశువైద్య శిబిరాల ఏర్పాటు జరుగుతోంది. అందుబాటులో ఉన్న బీమా సంస్థలచే ‘పశుబీమా’ కు సహకరిస్తుంది. పాల ఉత్పాదకత పెరిగేలా సబ్సిడిపై విజయ పశుదాణా, ప్రాంతీయ ఖనిజలవణ మిశ్రమాలను అందిస్తోంది.
ఈలాంటి ఒకే గొడుగు కింద సేవలు అందేసరికి, పాడిరైతుల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరిస్తోంది. ఇప్పటికే విజయ తెలంగాణ డెయిరీలున్న జిల్లాలో ఎస్బిఐ అధికారుల నిరంతర సమీక్షలతో రుణ జారీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. అంతేకాక, స్త్రీనిధి ద్వారా మహిళా సంఘాల సభ్యులకు పాడి పశువులకై రుణాలు అందిస్తున్నారు. ఆఖజూస్త్రఆ ద్వారా మినిడెయిరీ ఫారాలు, ఐశిబిదీఖితిచీ |దీఖిరిబి ద్వారా ఎస్బిఐ ద్వారా రూ. కోటి వరకు రుణాలు అందచేస్తున్నారు.
గిట్టుబాటు ధరలు
విజయ తెలంగాణ డెయిరీ కేజి వెన్నకు రూ. 810/-, ఆవుపాలు కేజీ ఘన పదార్థాలకు రూ. 350/- చెల్లిస్తుంది. బ్యాంక్ ఖాతా ద్వారా పాడిరైతులకు ప్రతి 15 రోజులకోసారి ఖచ్చితంగా పాల డబ్బులు చేరుతున్నాయి. ఇటీవల తీసుకొచ్చిన ‘పాలమిత్ర యాప్’ ద్వారా గ్రామ స్థాయిలో పాలనాణ్యత ధర సంక్షిప్త సందేశం ద్వారా రైతుకు చేరేలా చర్యలు తీసుకుంది. వెన్నశాతం మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలు, నాణ్యతా ప్రమాణాలు, సహకార సంఘాల ఏర్పాటు ఆవశ్యకత లాంటి అంశాలపై విజయ శిక్షణా కేంద్రం ద్వారా నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది.
సకాలంలో పాడి పశువులు ఎదకు రావడానికి గ్రామాల్లో గోపాలమిత్రల సేవలు వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈతల మధ్య కాలాన్ని తగ్గించి, ఏడాదికో దూడ పొందేలా విజయ డెయిరీ క్షేత్ర పర్యవేక్షకులు అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల విజయ శిక్షణ కేంద్రం డైరెక్టర్గా వీరోజిరావు చేరాక, పశుసంవర్ధక సేవలతో అనుసంధానం ఇంకా మెరుగైంది.
దాణా ఖర్చు తగ్గిస్తూ, పాల దిగుబడి పెంచడానికి అనువైన మార్గాలను రైతులకు తెలుపుతూ, 1962 అంబులెన్స్ సేవలు విజయ పాడి రైతుల దరి చేరేలా చర్యలు తీసుకున్నారు.
పాల ఉత్పత్తి వ్యయంలో ప్రధాన పాత్ర పోషించే జాతి, మేత, పునరుత్పత్తి అంశాలను పాడి రైతుకు వివరిస్తూ, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సేవలు విస్తృతమవుతున్నాయి.
పాల సేకరణ పరంగా సుదూర ప్రాంతాల్లో సైతం మినీ పాలశీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ, పాడి రైతుల పాలకు గిరాకీ కల్పిస్తోంది. నిర్వహణ భారం అధికమైనా, వినియోగదారులపై అదనపు భారం పడకుండా, పాడి రైతులకు పక్షానికోసారి పాలడబ్బులు చెల్లిస్తూ, పాడి రైతు శ్రేయస్సుకోరే సహకార డెయిరీ వ్యవస్థను కాపాడుకోవాలి. పాలసేకరణ మరింత పెంచి విజయ తెలంగాణ జెండా ఎగిరేలా చూడాల్సిన బాధ్యత ప్రతి పాడి రైతుపైనుంది.
మధుసూదనరావు, ఉపసంచాలకులు, విజయ డెయిరీ, ఆదిలాబాద్, ఫోన్: 91211 60553
వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలను ఆదరించడము మనదేశంలో సర్వసాధారణం. గతంలో చాలామంది రైతుల ఇళ్ళలో పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళ లాంటివి తప్పనిసరిగా ఉండేవి. కాని రానురాను వివిధ రకాల కారణాల వలన ఈ రంగాలన్నీ విడిపోయినవి. అతికొద్ది మంది రైతులు మాత్రమే నాటి దారిలో నడుస్తున్నారు. చాలామంది రైతులు కేవలం పంటల సాగునో, కేవలం పశుపోషణనో, కేవలం గొర్రెల పెంపకం, కేవలం కోళ్ళ పెంపకం కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల వలన రైతులు అన్ని సందర్భాలలో లాభాల బాటలో నడవలేకపోతున్నారు. దానికితోడు కొన్ని రకాల జాతులు ప్రత్యేకించి గొర్రెలలో కొన్ని రకాల జాతులు అంతరించి పోతున్నాయి. అంతరించిపోతున్న జాతులను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం తమ వంతు బాధ్యతగా రైతులకు సబ్సిడీలను అందిస్తూ అంతరిస్తున్న జాతుల అభివృద్ధికి కృషి చేస్తున్నది. కొంతమంది రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం ఎన్ఎల్ఎం స్కీం ద్వారా భారీ మొత్తంలో సబ్సిడిని అందిస్తూ గొర్రెలు, కోళ్ళు, పందుల పెంపకాన్ని ప్రోత్సహించడాన్ని తెలుసుకున్న ఖమ్మం జిల్లా, ముత్తగూడెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు అనుముల రామిరెడ్డి గొర్రెల పెంపకాన్ని చేపట్టి 50 లక్షల సబ్సిడీకి అర్హత పొందాడు.
రామిరెడ్డిది వ్యవసాయ నేపథ్యం. వారి తాత, తండ్రుల నుండి వ్యవసాయమే ప్రధాన వృత్తిగా చేస్తున్న కుటుంబం వారిది. వ్యవసాయంతో పాటు పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపకం లాంటి వాటిని కూడా పంటల సాగుకు అనుబంధంగా చేస్తూ వస్తున్నాడు. కాని కొన్ని రకాల కారణాల వలన ఇటీవలకాలంలో గొర్రెల పెంపకానికి దూరం జరిగి వివిధ పంటల సాగు, పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, వానపాముల ఎరువు తయారీ లాంటివి కొనసాగిస్తూ వస్తున్నాడు. వానపాముల ఎరువు తయారీ విషయానికొస్తే పెద్ద మొత్తంలో తయారు చేస్తూ తమ పంటల సాగులో వినియోగిస్తూ అవసరమైన వారికి అమ్మకం చేస్తూ లాభాలను గడిస్తున్నారు. ఆ ప్రాంతంలో అభ్యుదయ రైతు రామిరెడ్డి గారు అనడములో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో అవార్డులు, సత్కారాలు రామిరెడ్డి గారిని వరించాయి. తనకు వచ్చిన గుర్తింపు తోటి రైతులకు మరియు మన భూమిని కాపాడుకోవడానికి, సమాజానికి నాణ్యమైన పంట ఉత్పత్తులు అందచేయటానికి ఉపయోగడపాలని ఆలోచిస్తూ సమీకృత వ్యవసాయం చేయగలిగితే ప్రయోజనం ఉంటుందని ఆలోచించి అందులో భాగంగా తమకు అప్పటికే పశువులు, కోళ్ళు ఉన్నాయి కాబట్టి గొర్రెల పెంపకం మరలా చేపడితే, అదీను భారీ ఎత్తులో చేపడితే అన్ని రకాలుగా ఫలితాలు ఉంటాయని గ్రహించి అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ప్రభుత్వ ఎన్ఎల్ఎం స్కీం గురించి తెలుసుకుని అటువైపు అడుగులు వేశారు.
ఎన్ఎల్ఎం స్కీము గురించిన సమాచారాన్ని ఇండియన్ బ్యాంక్ వారి ద్వారా తెలుసుకుని అందుకు అవసరమైన నియమ నిబంధనలు తెలుసుకుని, ఎన్ఎల్ఎం స్కీములో పెద్ద ప్రాజెక్టు అయినటువంటి కోటి రూపాయల ప్రాజక్టును ఎంపిక చేసుకొని రెండు నెలలలో స్కీములో అర్హత పొంది 25 లక్షల రూపాయల సబ్సిడీ అందుకున్నారు. మిగతా 25 లక్షల సబ్సిడీ మూడు సంవత్సరాల తరువాత పొందుతాను అని రామిరెడ్డి వివరించాడు.
ఎన్ఎల్ఎం స్కీములో గొర్రెల పెంపకంతో పాటు, పాడి పశువులు, కోళ్ళ పెంపకం, పందుల పెంపకం లాంటి వాటిని కూడా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా అందరూ కూడా కోటి రూపాయల ప్రాజక్టు గురించి ఆలోచించకుండా రైతులు వారి వారి స్థాయిలను బట్టి ప్రభుత్వం సరళతరం చేసిన స్కీములను ఉపయోగించుకోవచ్చు. ఈ స్కీములో 20 లక్షల ప్రాజక్టు కూడా ఉంది. 20 లక్షల ప్రాజెక్టులో 10 లక్షల సబ్సిడీ, సొంత డబ్బులు రెండు లక్షలు, బ్యాంకులోను 8 లక్షలు పొందవలసి ఉంటుంది. కాబట్టి రైతులు వారి వారి పరిస్థితులను బట్టి ఎన్ఎల్ఎం స్కీమును ఉపయోగించుకోవచ్చు. రైతులందరికి అందుబాటులో ఉండాలనే, ప్రభుత్వం స్కీమును సరళతరం చేసిందని రామిరెడ్డి వివరించాడు.
పంటల సాగుకు అవసరమైనంత సేంద్రియ ఎరువు అందుబాటులో ఉంచడంతోపాటు, అంతరించిపోతున్న, తరిగిపోతున్న జీవ సంపదను అభివృద్ధి పరచాలనే ధ్యేయంతో ప్రభుత్వం ఎన్ఎల్ఎం స్కీము ద్వారా భారీ మొత్తంలో సబ్సిడీ అందిస్తుంది కాబట్టి అర్హత ఉన్న రైతులు ప్రభుత్వం అందించే సబ్సిడీని సద్వినియోగం చేసుకుని ఎన్ఎల్ఎం స్కీము లక్ష్యాలను నెరవేర్చాలని రామిరెడ్డి తోటి రైతులను కోరుకుంటున్నాడు. మరిన్ని వివరాలు 94403 54113 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
పశుగ్రాసాలు
ఎన్ఎల్ఎం స్కీము ద్వారా గొర్రెల పెంపకం చేపట్టిన వారు గొర్రెలను బయటకు తిప్పకుండా షెడ్లోనే పోషించాలి కాబట్టి అందుకు అవసరమైన పశుగ్రాసాలలో దుబ్బుజొన్న ప్రస్తుతం 6 ఎకరాలలో సాగులో ఉంది. మూడు ఎకరాలలో సూపర్ నేపియర్, 5 ఎకరాలలో హెడ్జ్లూసర్న్, రెండు ఎకరాలలో అవిశ మరియు పిల్లిపెసర లాంటి పశుగ్రాసాల పెంపకానికి ప్రణాళిక వేసుకున్నాడు. పశుగ్రాసాల పెంపకానికి గొర్రెల వ్యర్థాలను ఉపయోగిస్తారు కాబట్టి నాణ్యమైన పశుగ్రాసాలను తక్కువ సాగు ఖర్చుతో పొందవచ్చని రామిరెడ్డి వివరిస్తున్నాడు.
నియమ నిబంధనలు
ఎన్ఎల్ఎం స్కీములో కోటి రూపాయల ప్రాజెక్టుకు సంబంధించిన, రామిరెడ్డి గారు వివరించిన నియమనిబంధనలు:
సొంత డబ్బులు 10 లక్షలకు తగ్గకుండా పెట్టుబడి పెట్టాలి.
బ్యాంకు నుండి 40 లక్షలకు తగ్గకుండా లోను పొందాలి.
బ్యాంకు నుండి లోను పొందాలంటే బ్యాంకు వారికి తప్పనిసరిగా పట్టణ ఆస్తిని 60 లక్షల రూపాయలకు తగ్గకుండా గ్యారంటీగా చూపించాలి.
ఒక్కొక్క గొర్రెకు 16 చదరపు అడుగులకు తగ్గకుండా 525 గొర్రెలకు (500 ఆడగొర్రెలు+25 గొర్రెపొట్టేళ్ళు) సరిపోను షెడ్ని నిర్మించుకోవాలి.
525 గొర్రెలకు సరిపోను పశుగ్రాసాలు సాగు చేయాలి.
గొర్రెల పెంపకంలో అనుభవం ఉన్న ధృవీకరణ పత్రాన్ని సంబంధిత అధికారుల నుంచి పొందాలి.
5 ఎకరాలకు తగ్గకుండా సొంత పొలం లేదా 8 సంవత్సరాల కౌలు పొలం చూపించాలి.
షెడ్లో 525 గొర్రెల పెంపకానికి అవసరమైన నీటి వసతి, పశుగ్రాసాల మేపునకు సంబంధించి, దోమల నుండి రక్షణ లాంటి సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలి.
గొర్రెలను తప్పనిసరిగా షెడ్లోపలే మేపాలి. బయట కొండల మీద, అడవులలో మేపకూడదు.
ఇలాంటి నియమనిబంధనలను రామిరెడ్డి గారు పాటించి కేవలం రెండు నెలలో మొదటి విడత సబ్సిడీ అయిన 25 లక్షల రూపాయలను ఇటీవలే పొందడము జరిగింది. ప్రాజక్టును ఎలాంటి పొరపాట్లు చేయకుండా మూడు సంవత్సరాలు కొనసాగించి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చగలిగితే మిగతా 25 లక్షల సబ్సిడీని పొందవచ్చు అని రామిరెడ్డి ప్రస్తుత తన అనుభవాన్ని వివరించాడు.
మన దక్షిణాది రాష్ట్రాలలో అంతగా కనిపించకపోయినప్పటికీ రాజస్థాన్ రాష్ట్రంలో లాభదాయకమైనదేకాక అక్కడి గో ప్రేమికులు భక్తి భావంతో ఆదరించే రాథిజాతి పశువులు రాజస్థాన్ రాష్ట్రపు అధిక వేడిని, అనావృష్టిని, మేత కొరత తదితర ప్రతికూల పరిస్థితులలో పాల ఉత్పత్తితోపాటు వ్యవసాయ గ్రావిూణ రవాణాలోనూ ప్రసిద్ధిగాంచాయి. రాజస్థాన్ బికనీర్ జిల్లాలోని లుంకరాన్సర్ తాలూకాతో రాథిజాతి పశువుల ప్రధాన ఉత్పత్తి కేంద్రము అక్కడ నుండి ఈ పశువుల్ని దిగుమతి చేసుకోవచ్చు. ఈ జాతి ఆవును జమదగ్ని మహాముని ఆశ్రమంలో పూజలు అందుకుంటూ వుండేదని రాజస్థానీయుల నమ్మకం. ఈ ఆవులను రాజస్థాన్ రాణులు అని కూడా పిలుస్తారు.
సింథి, సాహివాల్ మరియు తార్పార్కర్ జాతి పశువుల జన్యుకలయిక ద్వారా స్థిరమైన జాతిగా రాథిజాతి ఆవిర్భవించిందని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. రాథిజాతి పశువులలో ఉపతెగలైన రాథి పశువులు పాల ఉత్పత్తికి, రాథ్ పశువులు పని చేయడానికి పేరుగాంచాయి. మధ్యస్థమైన శరీర బరువు కలిగిన రాథి పశువులు రోజుకు సగటున 5 నుండి 10 లీటర్ల పాలను, గరిష్ఠంగా రోజుకు ఇరవై లీటర్ల వరకు పాలను 4.4 నుండి 9.00 శాతం వెన్నతో అందిస్తూ యజమానులకు మంచి లాభాలను ఆర్జించగలవు. ఈత మొత్తంలో 1500 నుండి 3000 లీటర్ల పాలను వీటి నుండి ఆశించవచ్చు.
గోధుమ రంగు చర్మం విూద తెల్లని మచ్చలు చారలు కలిగి, విశాలమైన నుదురు ప్రకాశవంతమైన కళ్లు, ఆకర్షణీయమైన మధ్యస్థంగా వుండే గంగడోలు చిన్న మూపురం పొడవైన తోక కలిగిన ఈ పశువుల కొమ్ములు కొంత సన్నగా ప్రక్కకు, వెనక్కు తిరిగి వుంటాయి.
వ్యాధి నిరోధక శక్తితోపాటు మంచి శరీరదారుఢ్యం కలిగిన రాథి జాతి ఆవులు ఉత్పత్తి చేసే ఎ2 పాలు ఉన్నతమైన పోషక విలువలతోపాటు అనేక ఔషధ సుగుణాలను కలిగి మలబద్ధకం, అజీర్తి, కీళ్లవాతం, నరాలు-నాడీమండల సమస్యలు కలిగిన వారికి ఈ పాలలోని యాంటి ఆక్సిడెంట్సుతోపాటు ప్రత్యేక ఎమైనో ఆమ్లాలు ఎంతో మేలు చేస్తాయి. అందుకే దేశీ గోవుల ఎ2 పాలన్నింటిలో రాథిజాతి ఆవుపాలు ఉత్తమమైనవిగా గుర్తించబడ్డాయి.
పర్యావరణ మార్పులవల్ల ఏటేటా మన వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ వున్నాయి. కాబట్టి భవిష్యత్తులో నాణ్యమైన ఎ2 పాల ఉత్పత్తికి ఇతర దేశీ ఆవులకంటే మన తెలుగు రాష్ట్రాలలో ఎండ తీవ్రతను సమర్థంగా భరించగల ఈ రాథిగోవుల పెంపకం ద్వారా ఎక్కువ వెన్నతో ఎడాది పొడవునా సుస్థిరంగా పాలను ఉత్పత్తి చేయవచ్చును. ఈ ఆవుల పాలు, నెయ్యిలకు ఇతర పశువుల ఉత్పత్తులకంటే ఎక్కువ డిమాండుతోపాటు అధిక ధరలు కూడా కొనసాగుతున్నాయి. సింథి, సాహివాల్, గిర్ పశువులకంటే తక్కువ శరీర బరువులు కల్గిన రాథి ఆవుల నిర్వహణ ఖర్చులు కూడా తక్కువే. పిండమార్పిడి ద్వారా అత్యుత్తమ స్థాయి సెక్స్డ్ వీర్యం వల్ల అత్యంత విలువైన రాతి జాతి ఆవు పిండాలను ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తిచేసి, ప్రత్యేక సాంకేతిక పద్ధతిలో సేకరించి సాధారణ స్థాయి ఆవుల గర్భాలలో ప్రవేశపెట్టి తొమ్మిది నెలలు పెంచి, రోజుకు 15-20 లీటర్ల పాలను ఉత్పత్తి చేయగల ఎంతో లాభదాయకమైన గో సంతతిని పొందవచ్చును.
జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్డిడిబి) ఆనంద్ (గుజరాత్) వారు 2002 నుండి ఈ విశిష్ఠమైన గో సంతతి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ కృషిలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ మరియు కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖలు, విశ్వవిద్యాలయాలు పాలుపంచుకుంటున్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో రానున్న రోజుల్లో అత్యధిక వేసవి తాపాలను తట్టుకుంటూ విలువైన పాలను అందించుటలో రాథిజాతి గోవుల అవసరం వుంది.
పరిచయం : సాధారణంగా జూన్ లేదా జులై మొదలుకొని డిసెంబర్ వరకు గాలికుంటు, చిటుక వ్యాధి, నీలి నాలుక, ఫుట్ రాట్ (బురద పుండ్ల వ్యాధి), నిమోనియా, పిపీఆర్ (PPR) వంటి వ్యాధులు సోకుతుంటాయి. (PPR) అనేది వైరస్ వల్ల కలిగే వ్యాధి. ఈ వ్యాధికి చికిత్స లేదు. నిరోధమే ఉత్తమ మార్గం. గొర్రెలు మరియు మేకల పెంపకంలో అతి నష్టాన్ని కలిగించే వ్యాధి (PPR) దీన్నే మనం పారుడు రోగం అని అంటారు.
వ్యాధి బారినపడు పశువులు :
ఒక సంవత్సరము వయసు కలిగి ఉన్న మేక మరియు గొర్రె పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది.
వ్యాధిని ప్రభావితం చేసే అంశాలు :
ఈ వ్యాధి పారామిక్సో గ్రూప్కు చెందిన మార్టిల్లి వైరస్ వలన కలుగుతుంది.
వైరస్ వ్యాధిగ్రస్త పశువు యొక్క మల మూత్రములో మరియు ముక్కు మరియు కంటి నుండి వచ్చే స్రావాలలో అధికంగా ఉంటుంది.
సరిపడ గాలి మరియు వెలుతురు అందకపోవడం
వైరస్తో కలుషితమైన నీటిని మరియు ఆహారము తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి ఇతర పశువులకు వ్యాప్తి చెందుతుంది.
అధికంగా వర్షాలు పడినప్పుడు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది.
వ్యాధి సోకిన గొర్రెలు లేదా మేకలు సంతనుండి కొనుగోలు చేసి కొత్తగా మందలో కలిపినప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
వ్యాధి లక్షణాలు :
శ్వాసకోశ మరియు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు అనేవి మనకు కనిపిస్తాయి.
అధిక జ్వరం ఉంటుంది (104-1050ఓ)
ఆకలి మందగిస్తుంది, మేత మేయవు.
కంటిలోని శ్లేష పొరలు అనేవి ముదురు ఎరుపురంగుగా మారుతాయి.
ముక్కు నుండి పలుచటి స్రావాలు కారడం ప్రారంభమవుతుంది, వ్యాధి పెరిగే కొద్ది చీముగా మారుతుంది.
కూరగాయలు సాగు చేస్తున్న రైతులు ఆ పంట నుండి తగిన ఆదాయం పొందాలంటే ఆయా పంటలను బట్టి ఒక నెల నుండి 4 లేదా 5 నెలలు పడుతుంది. ఈ లోగా దానికి కావలసిన పెట్టుబడి కోసం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మేవారి దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పు చేయాల్సి వస్తుంది. ఒక వేళ ఆ పంటకు ఏదైనా నష్టం జరిగి పంట పోతే వడ్డీ పెరిగిపోయి చేసిన అప్పు తీర్చలేక, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం మనం రోజూ చూస్తూ ఉన్నాము. ఇటువంటి పరిస్థితిని అధిగమించడానికి రైతులు సంవత్సరం పొడగునా ఒక ప్రణాళిక ప్రకారం అన్ని కూరగాయలను సాగు చేసుకొంటే రోజువారీ ఆదాయంతో అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోయినా, ఇంకేవిధమైన నష్టం జరిగినా ఒకటి రెండు పంట రకాలను నష్టపోయినా మిగతా వాటి నుండి ఎంతోకొంత ఆదాయాన్ని పొందవచ్చు.
ప్రస్తుతం కూరగాయ పంటల సాగులో ఉండే సమస్యలు
ఒకే పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయటం వలన ఒక్కోసారి అధిక వర్షాల వలన పంట మొత్తం నష్ట పోవటం
ఆ ప్రాంతంలో ఉండే రైతులందరూ ఒకే పంటను వేయటం వలన మార్కెట్లో ధర పడిపోవటం
పంట కోతకు వచ్చేవరకు ఆదాయం ఉండదు.
ఒకే పంటను వేయటం వలన పురుగులు తెగుళ్ళ సమస్య అధికమవటం.
అధిక నష్టభయం.
సంవత్సరం పొడగునా అన్ని కూరగాయలను సాగు చేయటం ముఖ్య ఉద్దేశ్యం
ఉన్న కొద్దిపాటి పొలాన్ని సమర్ధవంతంగా వినియోగించడం.
అన్ని రకాల కూరగాయలను ప్రతిరోజూ అమ్మకానికి అందుబాటులో ఉంచడం.
రోజువారీ ఆదాయం పొందడం.
అధిక ఉత్పత్తితో పాటు మంచి నాణ్యమైన కూరగాయలను పొందడం.
భూసార, నీటి యాజమాన్యంను పంట సాగు భాగంగా చేయటం.
పంట ఉత్పత్తి మరియు మార్కెట్ నష్టాన్ని తగ్గించడం.
పురుగులు, తెగుళ్ళ ఉధృతిని అదుపులో ఉంచడం.
సంవత్సరం పొడగునా కూరగాయల సాగు ప్రణాళిక
పొలాన్ని తయారుచేసుకోవడం: ఉదాహరణకు ఒక రైతుకు ఒక అర ఎకరం పొలం వుంటే ఆ పొలాన్ని 4 అడుగుల వెడల్పు, ఒక అడుగు ఎత్తు మరియు 30 అడుగుల పొడవుతో మడులను ఏర్పాటు చేసుకోవాలి. ఒక మడికి ఇంకో మడికి మధ్య నడవటానికి, కలుపు తీయటానికి, సస్య రక్షణ, కోత వంటి పనులకు వీలుగా ఒక అడుగు దూరం ఉంచాలి. ఉన్న మడుల్లో 25% పందిరి లేదా తీగ జాతి కూరగాయలు పెంచుకోవటానికి వీలుగా పందిరి ఏర్పాటు చేసుకోవాలి. మిగతా 75% మడుల్లో మిగతా కూరగాయలను సాగుచేసుకోవాలి. మడుల్లో 50% ఎర్రమట్టి, 20% పశువుల ఎరువు, 10% కుళ్ళిన పచ్చిరొట్ట ఎరువు, 10% వర్మీ కంపోస్టు, 10% జీవన ఎరువులు వేసుకోవాలి. పొలం చుట్టూ అడుగు దూరంతో 3 వరుసలలో జొన్న, మొక్కజొన్న, కంది, ఆముదం వంటి పంటలను రక్షక పంటలుగా వేసుకొంటే పక్క పొలాల నుండి రసం పీల్చే పురుగుల వలస తగ్గుతుంది. ఈ పంటలకు ముందు ఒక వరుసలో మునగ, కూర అరటి, కర్వేపాకు పంటలను 9 అడుగుల దూరంతో వేసుకొంటే బహువార్షిక కూరగాయ పంటలను కూడా అమ్ముకోవచ్చు. అదే పొలంలో సొంతంగా సేంద్రియ ఎరువు తయారు చేసుకోవటానికి వీలుగా ఒక మూల గుంతను ఏర్పాటు చేసుకొని పంటకాలం పూర్తైన మొక్కలను మడుల్లో నుండి పీకి అవి ఎండిన తర్వాత ఆ గుంతలో వేసుకోవాలి. డ్రిప్ పద్ధతిలో నీటియజమాన్యం చేయటానికి వీలుగా ఒక నీటి టాంకును కూడా ఏర్పాటుచేసుకోవాలి.
ఒకే కూరగాయ పంటను ఒకే సారి ఒక్క చోటే వేసుకోకుండా తయారు చేసుకొన్న మడుల్లో 3 లేదా 4 చోట్ల కొన్ని రోజుల వ్యవధితో వేయాలి. ఇలా వేయటం వలన మొదట వేసిన పంట కోత కాలం పూర్తైన వెంటనే రెండోది కోతకి సిద్ధంగా ఉంటుంది. అలాగే రెండోది పూర్తైన సమయానికి మూడోది, ఆతర్వాత నాలుగోది కోతకు సిద్ధంగా ఉండి ఆ పంట సంవత్సరం పొడవునా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
మడుల్లో కూరగాయపంటలను వేసుకున్నపుడు ఒకే పంటగా కాకుండా అంతర పంటలు లేదా మిశ్రమ పంటలు (ఒకే స్థలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు) వేసుకుంటే పురుగులు తెగుళ్ళ బెడదను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు.
ఒకే స్థలంలో ప్రతీ సారీ అదే పంటను సాగు చేయకుండా పంట మార్పిడి చేస్తూ ఉండాలి. పంట మార్పిడి చేసినపుడు ఒకే కుటుంబానికి చెందిన పంటలను అలాగే ఒకే రకమైన పోషకాలు అవసరమున్న పంటలను ప్రతీ సారీ ఒకే స్థలంలో వేయకూడదు.నేలనుండి పోషకాలు తీసుకొన్న పంటలను నేలకు పోషకాలు అందించే పంటలైన లేగ్యూం కుటుంబానికి చెందిన చిక్కుడు జాతి పంటలతో పంటమార్పిడి చేసుకోవాలి.
అంతర పంటలు వేసుకున్నపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
త్వరగా పెరిగే పంటలను నెమ్మదిగా పెరిగే పంటల మధ్యలో వేయాలి. (ఉదా: కారెట్, ముల్లంగి వంటి పంటలను టమాట, వంగ వంటి పంటల మధ్యలో వేయాలి.)
పొడుగ్గా పెరిగే పంటల మధ్యలో పొట్టిగా పెరిగే పంటలను వేయాలి. (ఉదా: టమాట, వంగ, మిరప వంటి పంటల మధ్య ఆకుకూరలు)
లోతైన వేరువ్యవస్థ కలిగిన పంటల మధ్య పైపైన వేర్లు ఉండే పంటలను వేయాలి. (ఉదా: బెండ మధ్యలో ఉల్లి, వెల్లుల్లి పంటలు)
పురుగులు తెగుళ్ళు ఆశించకుండా పంటను కాపాడుట
చీడ పీడలను తట్టుకొనే రకాలను ఎంపిక చేసుకోవాలి.
విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి.
శనగపచ్చ పురుగు నుండి రక్షణకు బంతిని ఎర పంటగా వేయాలి.
ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి.
పసుపు, నీలం రంగుపూసిన అట్టలను ఎకరాకు 4-5 పెడితే వైరస్ తెగుళ్ళకు వాహకాలుగా పనిచేసే రసం పీల్చే పురుగులు దీనికి ఆకర్షింపబడి వాటి ఉధృతి తెలుస్తుంది.
చీడపీడలు ఆశించే మొక్కల భాగాలను ఎప్పటికప్పుడు తొలగించటం వలన మిగతా మొక్కలకు సోకకుండా తీవ్రతను తగ్గించవచ్చు.
కీటకాల లార్వాలను తినటానికి వీలుగా పొలంలో అక్కడక్కడ పక్షి స్థావరాలను (పంగల కర్రలు) ఏర్పాటు చేయాలి.
దీపపు ఎరలను పొలంలో అక్కడక్కడా పెట్టుకోవాలి.
ఈ ప్రణాళికను అనుసరించటం మొదట్లో కష్టం అనిపించినా సాధన చేస్తూ ఉంటె ఎలాంటి ప్రణాళిక వేసుకుంటే మార్కెట్ గిరాకీకి అనుగుణంగా ఏఏ కూరగాయ పంటలను సంవత్సరం పొడవునా పండించుకోవచ్చో సులభంగా అర్ధమవుతుంది. మొదట్లో కొన్ని ముఖ్యమైన పంటలతో మొదలు పెట్టి క్రమేపి పెంచుకొంటూ పోతూ ఉంటే ఈ ప్రణాళికను సమర్ధవంతంగా అమలు చేయవచ్చు. ఈ విధంగా వేసుకోవటం వలన రైతు ప్రతి రోజూ ఆదాయాన్ని పొంది అప్పుల బాధను అధిగమించవచ్చు.
డా. కె. రాధారాణి, ప్రధాన శాస్త్రవేత్త, డా.వై.యస్.ఆర్. హార్టీకల్చరల్ యూనివర్సిటీ
ప్రస్తుతం ప్రపంచంలో భారతదేశం అరటి సాగులో మొదటి స్థానంలో ఉంది. ఈ పంట ఎక్కువ దిగుబడి ఇవ్వడం ద్వారా రైతులకు, అలాగే అధిక పోషకాలతో కూడిన ఈ పండ్లను తినడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. కానీ భూసారం తగ్గడం, సరైన సమయాల్లో ఎరువులు వేయకపోవడం మరియు సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వలన పండు పరిమాణం, బరువు మరియు నాణ్యత తగ్గి రైతులకు మార్కెట్లో సరైన ధర లభించక నష్టం కలుగుతుంది. అందుకొరకు భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ, బెంగళూరు వారు ఒక కొత్త పద్ధతిని రూపొందించారు. అదే బంచ్ ఫీడింగ్ పద్ధతి. దీని ద్వారా కాయ బరువు మరియు పరిమాణం, ఇంకా నాణ్యతను పెంచవచ్చును. దీని వలన రైతులు అధిక దిగుబడి పొందచ్చును మరియు ఎగుమతులు కూడా పెరుగును.
బంచ్ ఫీడింగ్ మిశ్రమం తయారు చేయడం
ముందుగా 100 మి.లీ. నీటిలో 7.5 గ్రాముల నత్రజని ఎరులు, 7.5 గ్రాముల పొటాష్ ఎరులు కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని 500 గ్రాముల పేడలో బాగా కలపాలి. ఆ తర్వాత బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని పైన చూపిన విధంగా పాలిథిన్ సంచిలో పెట్టాలి. కాయలు కాసిన తర్వాత క్రింది పువ్వును కత్తిరించి, ఆ మిశ్రమం ఉన్న పాలిథిన్ సంచిలో కాయలు కాసిన కాడకు ఒక అడుగు దూరం వదిలి గట్టిగా కట్టాలి. దీని వలన కాయ బరువు మరియు పరిమాణం పెరగడం వలన అధిక దిగుబడులు పొందవచ్చును. భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ, బెంగళూరు వారు తెలిపిన ప్రకారం ఈ బంచ్ ఫీడింగ్ పద్ధతిని ఉపయోగించడం ద్వారా అధిక బరువు గెలలను పొందవచ్చు.
బంచ్ ఫీడింగ్ ఉపయోగాలు
ఇది కాయ పరిమాణం, నాణ్యతను పెంచడానికి (ప్రతి ఒక్క పండు) మరియు పోషకాలు మొక్కల యొక్క అనవసర భాగాలకు వృథా సరఫరా కాకుండా సహాయపడుతుంది. పండ్ల ఏకరీతి ఎదుగుదలకు తోడ్పడుతుంది. పోషక లోపాలను అధిగమిస్తుంది.
యల్లపు రామ్మోహన్, డా. ఎమ్. శివ ప్రసాద్, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం.
నీలి నాలుక వ్యాధిని, బ్లూ టంగ్ అని కూడా పిలుస్తారు, ఇది వైరస్ ద్వారా కలిగే వ్యాది. ఇది ప్రధానంగా గొర్రెలు మరియు మేకలను ప్రభావితం చేస్తుంది, కానీ పశువులు, జింకలు మరియు ఇతర రుమినెంట్లకు కూడా సోకుతుంది. క్యూలికోయిడ్స్ జాతికి చెందిన దోమలు కొరకడం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. బ్లూ టంగ్ వైరస్ (BTV) యొక్క వివిధ సీరోటైప్లు ఉన్నాయి మరియు అవి వివిధ స్థాయిలలో వ్యాధి తీవ్రతను కలిగిస్తాయి. ఈ వ్యాధి కారకం, వ్యాధి లక్షణాలు, రోగ నిర్దారణ, చికిత్స, నివారణ మరియూ వ్యాధి నియంత్రణ గురించి తెలుసుకుందాం.
1. వ్యాధి కారకం: నీలి నాలుక వ్యాధి బ్లూ టంగ్ వైరస్ (BTV) వల్ల వస్తుంది, ఇది రియోవిరిడే కుటుంబంలోని ఆర్బివైరస్ జాతికి చెందినది. BTV యొక్క బహుళ సెరోటైప్లు (29) ఉన్నాయి, ప్రతి సీరోటైప్ వివిధ స్థాయిల వ్యాధికారకతను కలిగి ఉంటుంది. భారతదేశంలో, సీరాలజీ మరియు/లేదా వైరస్ ఐసోలేషన్ ఆధారంగా కనీసం 22 సీరోటైప్లు గుర్తించబడ్డాయి. ప్రస్తుతానికి మన దేశంలో, BTV-1, 2, 3,4, 6, 9, 10, 12 16, 17, 18, 21, మరియు 23 అనే 13 సీరోటైప్లు గుర్తించబడ్డాయి.
2. వ్యాధి పుట్టుక: ఈ వైరస్ ప్రదానంగా క్యూలికోయిడ్స్ జాతికి చెందిన దోమల ద్వార గొర్రెలో ప్రవేశిస్తుంది. వైరస్ కీటకాల కాటు ద్వారా రక్తప్రవాహంలోకి ప్రవేశించిన తర్వాత, ఇది రక్త నాళాలు మరియు శోషరసాలను లైనింగ్ చేసే ఎండోథెలియల్ కణాలని నాశనం చేస్తుంది. ఇది వాస్కులర్ డ్యామేజ్, వాపు మరియు ఎడెమా మరియు హెమరేజ్లకు దారితీస్తుంది.
వైరస్ 5 నుండి 20 రోజులు పొదిగే వ్యవధిని కలిగి ఉంటుంది, ఈ సమయంలో వ్యాధి సోకిన జంతువులు ఎటువంటి క్లినికల్ సంకేతాలను చూపించకపోవచ్చు. పొదిగే కాలం తర్వాత, వ్యాధి లక్షణాలు కనిపించడం ప్రారంభించవచ్చు.
3. వ్యాధి లక్షణాలు:
నీలి నాలుక వ్యాధి యొక్క క్లినికల్ సంకేతాలు వైరస్ యొక్క వైరలెన్స్ మరియు పశువు యొక్క రోగ నిరోధక శక్తిని బట్టి మారవచ్చు. గొర్రెలు మరియు మేకలలో సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటాయి.
జ్వరం, నాలుక యొక్క వాపు మరియు సైనోసిస్ (నీలం రంగు మారడం), వ్యాధికి దాని పేరు ఇవ్వడం, ముఖం మరియు పెదవుల వాపు, అధికంగా ముక్కు కారటం, అధిక లాలాజలం, నోరు మరియు ముక్కు యొక్క శ్లేష్మ పొరలపై పూతల మరియు కోత, కాళ్ళ వాపు (కరోనిటిస్) కారణంగా కుంటితనం మరియు కదలడానికి అయిష్టత, గర్భిణీ జంతువులలో గర్భస్రావం. తీవ్రమైన కేసులు అధిక మరణాల రేటుకు దారి తీయవచ్చు, ముఖ్యంగా గొర్రెలలో, మరియు ప్రభావిత మందలలో గణనీయమైన ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది.
4. వ్యాధి నిర్ధారణ:
వ్యాధిని నియంత్రించడానికి మరియు నిర్మూలించడానికి మరియు జంతువులు మరియు వాటి ఉత్పత్తులను దేశాలు/ప్రాంతాల మధ్య సురక్షితమైన వ్యాపారాన్ని నిర్ధారించడానికి BT వ్యాధి నిర్ధారణ చాలా అవసరం. అయినప్పటికీ, వ్యాధి యొక్క రోగనిర్ధారణ క్లినికల్ సంకేతాలు మరియు గాయాల ఆధారంగా చేయబడ్డ, వ్యాధి యొక్క సమర్థవంతమైన నియంత్రణ మరియు నివారణకు యాంటిజెన్ లేదా యాంటీబాడీని గుర్తించడం ద్వారా ఖచ్చితమైన రోగ నిర్ధారణ అవసరం. BTV యాంటిజెన్ గుర్తింపు పద్ధతుల్లో పిండం కోడి గుడ్లు లేదా సెల్ లైన్లలో వైరస్ ఐసోలేషన్, రివర్స్-ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ (RT-PCR), రియల్ టైమ్ RT-PCR, ఇమ్యునోఫ్లోరోసెన్స్ టెస్ట్, శాండ్విచ్ ఎంజైమ్-లింక్డ్ ఇమ్యునోసోర్బెంట్ అస్సే (e-ELISA), డాట్ ఇమ్యునోపెరాక్సిడేస్ అస్సే, వైరస్ న్యూట్రలైజేషన్ టెస్ట్ మరియు ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ ద్వార చెయ్యవచ్చును.
కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్ (CFT), అగర్ జెల్ ఇమ్యునోడిఫ్యూజన్ (AGID), కాంపిటీటివ్ ELISA (c-ELISA), పరోక్ష ELISA (i-ELISA) మరియు సీరం న్యూట్రలైజేషన్ టెస్ట్ (SNT) ఉపయోగించి BTV యాంటీబాడీస్ కనుగొనబడతాయి.RT-PCR AGID మరియు c-ALISA సెన్సిటివ్గా గుర్తించబడ్డాయి మరియు అంతర్జాతీయ వాణిజ్యం కోసం BTVనిర్ధారణ కోసం OIE సిఫార్సు చేసిన పరీక్ష.
5. చికిత్స
నీలి నాలుక వ్యాధికి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు. ప్రభావిత జంతువులకు చికిత్స చేయడంలో సహాయక సంరక్షణ కీలకం. వాపు తగ్గించే మందులు (anti inflammatory drugs) నొప్పి ఉపశమనం (pain killers) మరియు శరీరంలోని నీరు బాగా క్షీణించిపోవడం వలన ద్రవ చికిత్స (fluid therapy) వంటి సహాయక చికిత్సను అందించాలి. నోటి వాపు ఉండడం వల్ల ఆహారం సరిగ్గా తీసుకోవు కాబట్టి, గంజి మరియు ORS లాంటివి తెలిగ్గా జీర్ణం అయ్యెటువంటివి వ్యాది తగ్గే వరకు ఇవ్వాలి. తీవ్రమైన సందర్భాల్లో, ద్వితీయ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి యాంటీబయాటిక్స్ ఎన్రోఫ్లోక్సాసిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి లేధా ఎన్రోఫ్లోక్సాసిన్ ద్రవం 3మి.లీ. మూడు రోజుల పాటూ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే బి కాంప్లెక్స్ మందులు కూడా మూడు రోజుల పాటూ ఇవ్వాల్సి ఉంటుంది.
6. నివారణ, నియంత్రణ
నీలి నాలుక వ్యాధికి నివారణ మరియు నియంత్రణ వ్యూహాలు వైరస్కు గురయ్యే ప్రమాదాన్ని తగ్గించడం మరియు క్యులికోయిడ్స్ మిడ్జ్ జనాభాను నియంత్రించడంపై దృష్టి సారిస్తాయి.
టీకాలు వేయించటం: ఈ వ్యాధి సోకకుండా నివారించుటే ముఖ్యము కాబట్టి బ్లూ టంగ్ వైరస్ యొక్క నిర్దిష్ట సెరోటైప్లకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. అవకాశం ఉన్న జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయడం వ్యాధి యొక్క తీవ్రతను తగ్గించడంలో మరియు వ్యాప్తిని నిరోధించడంలో సహాయపడుతుంది. BTV -1, -2, -10, -16 మరియు -23 కలిగిన పెంటావాలెంట్ ఇన్యాక్టివేటెడ్ అడ్జువాంటెడ్ వ్యాక్సిన్ భారతదేశంలో BT నియంత్రణ కోసం ఉపయోగించబడింది. మోదటి టీకా మూడు నెలల వయస్సులో బూస్టర్ టీకా ఒక నెల తర్వాత మరియు ప్రతి సంవత్సరం ఒక బూస్టర్ టీకా చేస్తే మంచిది.
వెక్టర్ నియంత్రణ: క్యూలికోయిడ్స్ జాతికి చెందిన దోమల జనాభాను తగ్గించడానికి చర్యలను అమలు చేయడం చాలా అవసరం. దోమల సంతానోత్పత్తి ప్రదేశాలను తగ్గించడానికి పురుగుమందులు, వికర్షకాలు మరియు పర్యావరణ నిర్వహణను ఉపయోగించడం ఇందులో ఉండవచ్చు.
ఐసోలేషన్ మరియు క్వారంటైన్: ప్రభావిత ప్రాంతాల నుండి జంతువుల కదలికను పరిమితం చేయడం వలన వ్యాధి సోకని ప్రాంతాలకు వ్యాపించకుండా నిరోధించవచ్చు.
పర్యవేక్షణ మరియు ఇంటెన్సివ్ సెరోలాజికల్ మరియు ఎంటమోలాజికల్ నిఘా: క్లినికల్ సంకేతాల కోసం జంతు జనాభాను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం మరియు సెరోలాజికల్ టెస్ట్లింగుల వ్యాప్తిని వెంటనే గుర్తించడం మరియు ప్రతిస్పందించడంలో సహాయపడుతుంది.
బయోసెక్యూరిటీ చర్యలు: పొలాల్లో బయోసెక్యూరిటీ ప్రోటోకాల్లను అమలు చేయడం వల్ల వైరస్ పరిచయం మరియు వ్యాప్తిని నిరోధించవచ్చు. ప్రజలు, వాహనాలు మరియు పరికరాల కదలికలను నియంత్రించడం ఇందులో ఉంది.
చివరిగా, జంతువుల ఆరోగ్యం మరియు ఆర్థిక నష్టాలపై దాని ప్రభావం కారణంగా గొర్రెలు మరియు మేకల పెంపకందారులకు నీలం నాలుక వ్యాధి ఒక ముఖ్యమైన ఆందోళన. వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి మరియు పశువుల జనాభాపై దాని ప్రభావాన్ని తగ్గించడానికి ముందస్తుగా గుర్తించడం, ప్రభావిత జంతువులను సత్వరమే వేరుచేయడం మరియు నివారణ చర్యలు మరియు సామూహిక టీకా కార్యక్రమాలను అమలు చేయడం చాలా అవసరం.
డా.ఎస్.వంశీ కృష్ణ,M.V.Sc., Ph.D. అసిస్టెంట్ ప్రొఫెసర్ & హెడ్, వెటర్నరీ మైక్రోబయాలజీ విభాగం, పశు వైద్య కళాశాల, మమ్నూర్, వరంగల్, పి.వి.నర్సింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం
పడితే కుప్పలు తెప్పలు పడకపోతే ఉరువెలే. ఇలా వుంది ఈసారి వానల పరిస్థితి. అన్నమయ్య, అనంతపురం జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో వానల్లేనట్లే. చాలా వరకు విత్తనాలు విత్తలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉత్తరానికి పోయ్యే కొద్దీ వర్షాలు ఎక్కువవుతూ వచ్చినాయి. అదీ గ్యాపులు గ్యాపులుగా, గోదావరి పరీవాహక ప్రాంతంలో వరదలు, వర్షాలు-వర్షాభావ పరిస్థితులు కూడా విపరీతంగా ఉన్నాయి. వర్షాలెక్కువయిన చోట కూడా బెట్టపరిస్థితులు ఎక్కువ కాలముంటున్నాయి. ఇలాంటి పరిస్థితులలో సెప్టెంబరు (పుబ్బ, ఉత్తర, హస్త తొలిరోజులు)లో చేయవలసిన వివిధ వ్యవసాయ కార్యక్రమాలను గురించి…
1. వరి : వర్షాకాలపు వరి పంట తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు థల్లో ఉంది. రోహిణి కార్తెలో, మే జూన్ నెలల్లో నారుపోసి నాటి, పైరు పెరుగుదల థనుండి, ఇంకా నారు పోయకుండా, పొలంలో విత్తకుండా ఉన్నవారు కూడా ఉన్నారు. నారు పోయని వారు, నేరుగా ప్రధాన పొలంలో వెదజల్లే పద్ధతిలో విత్తండి, లేక డ్రమ్ సీడర్ ద్వారా విత్తండి. ఎదిగిన నారు సిద్ధంగా ఉన్న వారు వెంటనే ప్రధాన పొలంలో నాటే ప్రయత్నం చేయండి. ముందు నాటిన వరిలో పైపాటి ఎరువులు వేయుట, సస్యరక్షణ, కలుపు నివారణ, ఈ నెలలో చేయాల్సుంటుంది. సస్యరక్షణ చర్యల్లో ముఖ్యంగా కాండము తొలుచు పురుగు, దోమ, బాక్టీరియా ఎండాకు తెగులు, మానిపండు తెగులు వంటి వాటిని గమనించి, ఎప్పటికప్పుడు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సెప్టెంబరు నెల వర్షాకాలానికి, చలి కాలానికి మధ్యలో ఉన్నందున, ఈ నెలలో విత్తే రకాలు, రెండు కాలాలలో పండేవైతేనే అధిక దిగుబడినిస్తాయి. ఒక కాలంలో మాత్రమే పండే రకాలు తక్కువ దిగుబడినిస్తాయి.
ప్రపంచ మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న సాంబమషూరి (బి.పి.టి.-5204)ని అత్యల్ప వర్షపాత మండలం (ఉమ్మడి కర్నూలు – అంనంతపురం జిల్లాల్లో) ఈ నెలలో విత్తడానికి సిఫారసు చేయబడినది. ఇప్పుడు విత్తితే 140-145 రోజుల్లో పంటే చేతికొస్తుంది. దిగుబడి 2.5 ట/ఎ. అదే విధంగా ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ సోన కూడ ఈ నెలలో విత్తితే దిగుబడి 2.6-2.8 ట/ఎ ఇస్తుంది. దీనిమీద కాండం తొలుచుపురుగు ఎక్కువగా ఆసిస్తుంది. కాబట్టి, తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లేకపోతే దిగుబడి బాగా తగ్గుతుంది. ఇవిగాక ఈ నెలలో విత్తడానికి ఆంధ్రప్రదేశ్కు, నెల్లూరు సోన (ఎన్.ఎల్.ఆర్-3041), నంద్యాల సోనా (ఎన్.డి.ఎల్.ఆర్-7), సస్య (బి.పి.టి-2411).
తెలంగాణాకు : కూనారంరైస్-1 (కె.ఎన్.ఎమ్-733), తెలంగాణ వరి-2 (డబ్ల్యు.జి.ఎల్.-677), తెలంగాణ వరి-3 (జె.జి.ఎల్- 21078), సన్న బియ్యానికి ప్రపంచమంతా షార్టేజి ఉంది. సన్న బియ్యాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. వీటి ఎగుమతిని ఫ్రీగా అనుమతించాలి. రైతు సంఘాల ద్వారా ఎగుమతులు జరిపితే రైతులకు ఎక్కువ మేలు జరుగుతుంది.
2. ప్రత్తి : క్రితం పంట ధరలు అంత ఆశాజనకంగా లేనందున ప్రత్తిపై రైతులకు మోజు తగ్గింది. విస్తీర్ణం తగ్గింది. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పశ్చిమ (హింగారి) ప్రాంతంలో తప్ప మిగతా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్తి విత్తడం పూర్తి అయింది. దేశవాళీ రకాలను సెప్టెంబరు 15 వరకు విత్తవచ్చు.
మంచి దేశవాళి రకం : శ్రీనంది : ఇది 160 రోజులపంట. 8-9 క్వి/ఎ ప్రత్తి దిగుబడి. పింజ పొడవు 22 మి.మీ. 20 నెంబరు నూలు వడకవచ్చు. అనువైన అమెరికన్ రకాలు : నరసింహ : 10-11క్విఎ. లాం-603:10-12 క్విఎ, లాం-604: 10-12 క్వి/ఎ.
వర్షాకాలంలో మే చివరి నుండి, ఆగస్టు వరకు విత్తిన ప్రత్తి పంటలో అంతరకృషి, కలుపు నివారణ విత్తిన 60-70 రోజుల్లో పై పాటి ఎరువులు వేయుట విత్తిన 100 రోజుల్లో పూర్తి చేయాలి. సస్యరక్షణ చర్యలు కూడా అవసరాన్ని బట్టి చేయాలి. వర్షాలు లేక బెట్ట పరిస్థితులేర్పడితే నీటి లభ్యతను బట్టి తడులు ఇస్తే దిగుబడి పెరుగుతుంది. అధిక వర్షాలొచ్చిన చోట అధిక నీటిని వెంట వెంటనే వెళ్ళిపోయ్యేటట్లు గట్లు తెగ్గొట్టాలి. పంట త్వరగా కోలుకొనేందుకు పైపాటి ఎరువులు, సస్యరక్షణ మందులు మామూలుగా వాడే దానికంటే ఎక్కువగా వాడాలి.
3. మిరప : మిరప ధరలు గరిష్ఠ స్థాయిలో ఇప్పటి వరకు ఉన్నాయి. వర్షాకాలపు పంట చేతికొచ్చేదాకా ధరలధికంగా ఉంటాయి. వర్షాకాలం మొదట్లో నాటిన పంట పచ్చికాయ దిగుబడి సెప్టెంబరులో చేతికొస్తుంది. ధరలు తగ్గుముఖం పట్టవచ్చు. కారం ఎక్కువగా ఉండే కాయల ధరలు అధికంగా ఉంటున్నాయి. అనుకూలమైన రకాలు.
కాశీ అభ : ఘాటు ఎక్కువ. ఆకుమచ్చ, ఆకు ముడత, రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది. ఎగుమతికి అనుకూలం. పచ్చిమిర్చికి అనుకూలం. ఈ రకం ఎక్కువ ప్రాచుర్యం పొందుతున్నది.
ఇతర రకాలు : ఎల్.సి.ఏ-625, ఎల్.సి.ఏ-620, ఎల్.సి.ఏ-436, ఎల్.సి.ఏ-424 అనే పబ్లిక్ రకాలు.
పలు ప్రైవేట్ రకాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆయా ప్రాంతానికి అనువైన రకాలనెంచుకోవాలి. 6 వారాల వయసుగలనారును ప్రధాన పొలంలో ఈ నెలలో నాటవచ్చు.
4. బెంగుళూరు మిర్చి / కూర మిరప : ఈ మిర్చి కూడా సెప్టెంబరులో నాటి అధిక దిగుబడి పొందవచ్చు. ఈ పంటను ముఖ్యంగా పాలీ హౌస్లలో, నెట్హౌస్లలో, ఎక్కువ దిగుబడి పొందే వీలున్నందున పండిస్తున్నారు. హైబ్రిడ్తో ఎకరాకు 40 టన్నుల దాకా బెంగుళూరు మిర్చి దిగుబడి సాధిస్తున్నారు. ఎరుపు, పసుపు రకాలు ఆకుపచ్చ రకాలకంటే అధిక ధర పలుకుతాయి.
5. టమాట : ఆగస్టు కడవారంలో టమాట ధరలు కిలో పదిరూపాయలకు పడిపోయినాయి. విస్తీర్ణం పెరగడం, పొడి వాతావరణం అధిక దిగుబడికి దారి తీసినాయి. అధిక దిగుబడితో ధరలు ఢమాల్మంటున్నాయి. వర్షాకాలంలో సెప్టెంబరు కడదాకా వానలు వచ్చే అవకాశముంది. విపరీత వర్షాలు, మేఘావృత వాతావరణం, వరదలు వంటి పరిణామాలొస్తే దిగుబడి తగ్గి ధరలు పెరిగే అవకాశముంది. ఇప్పటి నుండి డిశంబరు వరకు టమాట ధరలు ఒడిదుడుకులుగాను తర్వాత తక్కువగాను ఉండే అవకాశముంది.
6. క్యాబేజి : ఈ పంటలో స్వల్పకాలిక రకాలను ఆగస్టు రెండవ పక్షం నుండి సెప్టెంబరు కడవరకు నాటవచ్చు. మంచిరకం : ప్రైడ్ ఆఫ్ ఇండియా. గడ్డ 1.5-2.0 కిలోలుంటుంది. 60-80 రోజుల్లో గడ్డ కోత కొస్తుంది.
మిద్దెతోటలలో ఈ నెలలో పెంచడానికనువైన రకాలు : ప్రైడ్ ఆఫ్ ఇండియా, గోల్డెన్ ఏకర్.
7. కాలిఫ్లవర్ : ఈ పంటను సెప్టెంబరు నుండి నవంబరు వరకు నాటవచ్చు. సెప్టెంబరులో నాటడానికనుకూలమైన రకాలు / హైబ్రిడ్ : పూసా హైబ్రిడ్; ఇందాంఎర్లీ, అరవింద్, త్రిష మొ|| మిద్దె తోటల్లో పెంచడానికి అనుకూలమైనవి. పూస సింథటిక్, పూసా హిమజ్యోతి, సుహాసిని.
8. జొన్న : కిలో జొన్న పిండి హైదరాబాదులో రిటైల్గా రూ. 90 అమ్ముతున్నారు. క్వాలిటీ జొన్నలకు మంచి ధర వస్తున్నది. సెప్టెంబరులో మాఘీ జొన్నను విత్తే అలవాటు ఉమ్మడి కర్నూలు, కడప, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఉన్నది. అత్యధిక దిగుబడినిచ్చే మాఘీజొన్న రకాలు: ఎన్.టి.జె-5 : 18-20 క్వి/ఎ గింజ దిగుబడి. 95-100 రోజులు. పొట్టిజొన్న గింజ, చొప్ప నాణ్యంగా ఉంటాయి. అత్యధిక దిగుబడినిస్తున్న రకంగా పేరొందినది. మాఘీ పంటకు మాత్రమే సిఫారసు చేయబడినది. తెల్లగింజ.
ఎన్.టి.జె-4 : గింజ దిగుబడి 13-15 క్వి/ఎ. 90-98 రోజులు. మాఘీ, రబీ కాలాల్లో సాగు చేయవచ్చు. తెల్లగింజ.
9. ఉలవలు : సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో విత్తుటకు అనుకూలం. అత్యధిక దిగుబడినిచ్చే రకాలు : క్రీడ హర్ష (సి.ఆర్.హెచ్.జి-19): గింజ దిగుబడి : 6.0-7.7 క్వి/ఎ. గోధుమ రంగు గింజ. ఆంత్రాక్నోస్ మరియు బూడిద తెగుళ్ళను తట్టుకుంటుంది. 85-95 రోజుల పంట.
క్రీడ వర్థన్ (సి.ఆర్.హెచ్.జి-22) : నలుపు గింజ, గింజ దిగుబడి : 6.0-7.5 క్వి/ఎ. బూడిద, పల్లాకు, ఆంత్రాక్నోస్ తెగుళ్ళను తట్టుకుంటుంది.
10. కంది : చలికాలపు కందిని సెప్టెంబరు 15 నుండి అక్టోబరు 15 వరకు విత్తాలి. నిదానించి విత్తితే దిగుబడి బాగా తగ్గిపోతుంది. చలికాలంలో పండించి అనుభవమున్న వాళ్ళతోనే మంచి దిగుబడులొస్తాయి. అనుభవము లేకపోతే, తొలుత తక్కువ విస్తీర్ణంలో పంటబెట్టి, అనుభవమొచ్చాక రాబోయే సంవత్సరాలలో ఎక్కువ విస్తీర్ణంలో పంట చేపట్టవచ్చు.
11. అనుములు / అనపకాయలు : ఆగస్టు నుండి నవంబరు వరకు (సెప్టెంబరులో కూడా) ఈ పంటను విత్తి మంచి దిగుబడులు పొందవచ్చు. పచ్చిగింజలకు మంచి గిరాకీ ఉంటుంది. పొట్టు తీసిన గింజలు పితికి పప్పుగా బాగా ప్రాచుర్యం.
13. క్యారెట్ : ఆగస్టు నుండి నవంబరు వరకు ప్రతి 15 రోజులకొకసారి విత్తి ఎక్కువ కాలం మార్కెట్కు సప్లయి చెయ్యవచ్చు. అనుకూలమైన రకాలు : పూసాయమదగ్ని, పూసాకేసర్, చాన్టెనీ.
14. బీట్రూట్ : ఇది చౌడు భూముల్లో కూడా పండుతుంది. సెప్టెంబరులో విత్తవచ్చు. ఆగస్టు నుండి నవంబరు వరకు కూడా విత్తవచ్చు. అనుకూలమైన రకాలు : డెట్రాయిట్ డార్క్రెడ్, క్రిమ్సన్ గ్లోబ్, ఎర్లీ వండర్ మొ||
15. వెల్లుల్లి : పాయలను సెప్టెంబరు రెండవ పక్షం నుండి అక్టోబరు నెల పూర్తిగా నాటుకోవచ్చు. మంచి రకాలు : యమునా సఫేడ్ అగ్రిపౌండ్ వైట్
16. సిరిధాన్యాలు : ఆరోగ్య కారణాలరీత్యా వీటికి ప్రాముఖ్యత పెరుగుతున్నది. ధరలు కూడా బజార్లో ఎక్కువగానే ఉన్నాయి. పంట దిగుబడి తక్కువయినందున ఎకరాల లెక్కన చూస్తే రైతుకు ఆదాయం తక్కువగా ఉన్నది. నీటి తడులతో పంట పెట్టి, సేంద్రియ పద్ధతులు పాటిస్తే ఆరోగ్యకరమైన పంటను, కొద్ది ఎక్కువగా ఉత్పత్తి చేయవచ్చు. పంట మొదలు పెట్టినప్పటి నుండి, వినియోగదారులకు తెలియపరచడం ద్వారా మంచి ధరలకు అమ్ముకునే అవకాశముంది.
వీటి వినియోగాన్ని త్రివిధ దళాలలో ప్రోత్సహించినట్లయితే ఆరోగ్యవంతమైన వారితో రక్షణ వ్యవస్థను పటిష్ఠ పరచవచ్చు
17. పొద చిక్కుడు : సెప్టెంబరు నెలలో విత్తడానికనుకూలం. అనుకూలమైన రకాలు : కొంకణ్ భూషన్, అర్క విజయ, అర్కజయ మొ||
18. అలసందలు / బొబ్బెర్లు : పచ్చిరొట్టగా, పచ్చిమేతగా, పచ్చి కాయలను, గింజలను, కాయగూరగా, ఎండిన గింజలను పప్పుధాన్యంగా ఉపయోగించవచ్చు. ఈ నెలలో ఈ పంటను విత్తి మంచి దిగుబడులు సాధించవచ్చు. మంచిరకం : వి-240.
19. గులాబి పూలు : సెప్టెంబరు అక్టోబరు మాసాలు గులాబి అంట్లు నాటడానికి అత్యంత అనుకూలం వీలయిన వాల్లు ఈ నెలలోనే నాటండి. వీలు లేకపోతే జూన్ నుండి జవనరి వరకు ఏ నెలలోనైనా నాటండి.
20. చామంతి : ఆగస్టు-సెప్టెంబరు నెలలు నాటుటకు అనుకూలం.
21. గ్లాడియోలస్ : వీటి దుంపలు నాటడానికి అక్టోబరు అత్యంత అనుకూలం. నాణ్యమైన పూలను పొందవచ్చు. అక్టోబరు అనుకూలం కానివారు జూన్ నుండి నవంబరు వరకు సెప్టెంబరులో కూడా నాటవచ్చు.
ఆటోమాటిక్ ఎగుమతి విధానం : వ్యవసాయ పంటలకు ఒక ఎగుమతి విధానం నిర్ణయించాలి. మన రైతులు బాగుపడే విధంగా ఎగుమతి విధానం ఉండాలి. ప్రతి పంట ధర ఎంతకు పడిపోతే ఎగుమతులు ఫ్రీగా జరుపుకునేటట్లు ఓపెన్ పర్మిషన్ ఇవ్వాలి. అనేది నిర్ణయించాలి. దీనివలన రైతులు, ఉత్పత్తిదారులు కొంత ఊరట పొందడానికి వీలవుతుంది.
రైతు ప్రజా సంఘాలను వ్యవసాయోత్పత్తుల ఎగుమతి వ్యాపారంలో ప్రోత్సహిస్తే అతిదారుణంగా టమాటా మాదిరి పంటల ధరలు పడిపోకుండా కాపాడే దానికి వీలవుతుంది. అన్ని పంటలకు అత్యధిక, అత్యల్పబేస్ రేట్లను నిర్ణయిస్తే, దానిమీద ఎగుమతి, దిగుమతి విధాన నిర్ణయాలు సులభమవుతాయి.
ఈ విధాన నిర్ణయాలలో మన రైతులు బాగుపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రభుత్వాలకు మంచి ప్రజాదరణ ఉంటుంది. ఓట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
పంటలపైన, రైతు ప్రజా సంఘాలపైన అధిక వివరాలకు 9494408619కు ఫోను చేసి సంప్రదించవచ్చు.
ఆగస్టు 19వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధించి, తక్షణం అమల్లోకి తెచ్చింది. 2022లో గోధుమ ఎగుమతుల్ని, గోధుమ పిండి ఎగుమతుల్ని నిషేధించి, సాధారణ బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకాన్ని విధించారు. నూకల ఎగుమతుల్ని పూర్తిగా నిలిపివేశారు. 2023 ఫిబ్రవరి 14వ తేదీన కేంద్రప్రభుత్వం 2022-23 సంవత్సరానికి వ్యవసాయ ఉత్పత్తుల రెండవ ముందస్తు అంచనాలను ప్రకటించింది. రికార్డు స్థాయిలో 130.8 మిలియన్ టన్నుల బియ్యం, 112.2 మిలియన్ టన్నుల గోధుమలు ఉత్పత్తయినట్లు సగర్వంగా చెప్పారు. రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు ఉత్పత్తయినప్పుడు వాటి ఎగుమతులపై ఉక్కు పాదం మోపి, వాటి ధరల్ని తొక్కి పెట్టి, రైతుల్ని సంక్షోభంలోకి పెట్టారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశంలో బియ్యం వినియోగం 112 మిలియన్ టన్నులు, గోధుమ వినియోగం 99.8 మిలియన్ టన్నులు మాత్రమే. 19 మిలియన్ టన్నుల బియ్యం, 13 మిలియన్ టన్నుల గోధుమలు మిగులు ఉన్నా వాటి ఎగుమతుల్ని తొక్కి పెట్టి, ధరల్ని దించి, సేకరణ బాధ్యతల నుండి తప్పుకుని, అన్నదాతల ఆదాయాలను దాదాపు లక్ష కోట్ల రూపాయల మేరకు తగ్గించటం ప్రభుత్వ విదానాలను తేటతెల్లం చేసింది. జులై నెలలో బాస్మతీ, ఉప్పుడు బియ్యం మినహా బియ్యం ఎగుమతుల్ని నిషేధించి రైతు వ్యతిరేక వైఖరిని ప్రభుత్వం ప్రదర్శించింది. అనావృష్టి, అతివృష్టి వివిధ రాష్ట్రాల్లో వరి ఉత్పత్తులను ప్రభావితం చేసి, కొరత ఏర్పడ వచ్చనే అనుమానంతో బియ్యం ఎగుమతుల్ని నిషేధించామని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు. తాజాగా అమెరికా ప్రభుత్వ వ్యవసాయ శాఖతోపాటు దేశంలో విశ్లేషకుల అంచనా ప్రకారం వరి విస్తీర్ణం 47 మిలియన్ హెక్టార్ల నుండి 46.5 మిలియన్ హెక్టార్లకు మాత్రమే తగ్గుతుందనీ, బియ్యం ఉత్పత్తి గత సంవత్సరంకన్నా ఒక మిలియన్ టన్నులు మాత్రమే తగ్గవచ్చని తెలుస్తున్నది. ఈ పరిస్థితుల్లో బియ్యం ఎగుమతుల్ని అనుమతించి, ఎగుమతి సుంకాన్ని 25 శాతానికి పెంచితే ఉభయతారకంగా ఉండేది. వచ్చే ఖరీఫ్ పంట మార్కెట్కి వచ్చినప్పుడు ధాన్యం ధరలు తగ్గకుండా ఉంటాయి. ఆగస్టు 31వ తేదీన జరిపే సవిూక్షలో నిషేధాన్ని ఎత్తివేస్తారని ఆశిద్దాం.
ఉల్లిపై తొందరపాటు చర్య
బియ్యం విషయంలో తప్పుడు అంచనాలను, భయాల ఆధారంగా ఎగుమతుల్ని నిషేధించినట్లుగానే ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించడం కూడా రైతు వ్యతిరేక చర్యే. ఉల్లిని ఎక్కువగా పండించే మహారాష్ట్రలో రైతు సంఘాలు ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టారు. వాస్తవానికి ఆగస్టు 19వ తేదీన నాసిక్ జిల్లాలోని ‘లాసల్గావ్’ మార్కెట్లో ఉల్లి హోల్సేల్ ధర క్వింటాలుకి రూ. 2300గా ఉంది. రిటైల్ ధర సగటున రూ. 30.72లు కిలోకి ఉంది. నాణ్యమైన ఉల్లికి హర్యానాలో కిలోకి రూ. 53/-లుగా ఉండగా, మధ్యప్రదేశ్లో నాసి రకం ఉల్లికి కిలో ధర రూ. 10/-లుగా ఉండి ఉల్లిలో నీటి శాతంలో ఉండే వ్యత్యాస్యాన్ని బట్టి ధరల్లో తేడాలుంటాయి. టోకు ధర కిలోకి రూ. 23లుంటే ఎగుమతి ధర కిలోకి రూ. 25గా ఉంది. ఇదేవిూ ఆందోళనకరమైన పరిస్థితి కాదు. 2022 జులై నుండి 2023 జూన్ వరకు దేశంలో 31.12 మిలియన్ టన్నుల ఉల్లిగడ్డలు ఉత్పత్తయినట్లు అంచనా. 1.91 మిలియన్ హెక్టార్లలో ఉల్లి పంట సాగయింది. సగటున హెక్టారుకి 16.3 టన్నుల దిగుబడి వచ్చింది. దేశంలో ఒక్కొక్క కుటుంబానికి సగటున నెలకు 5 కిలోల ఉల్లిగడ్డల్ని వినియోగిస్తున్నారు. దేశంలో షుమారుగా 33 కోట్ల కుటుంబాలున్నాయి. సంవత్సరానికి దేశీయ ఉల్లి వినియోం 21 మిలియన్ టన్నులుగా లెక్క కట్టవచ్చు. అయినా మిగులు 10 మిలియన్ టన్నులకు పైగానే ఉంటుంది. ఏప్రిల్, మే మాసాల్లో వచ్చిన అకాల వర్షాల వల్ల ఉల్లిగడ్డల్ని కొంత తేమతోనే నిలవపెట్టారు. నిల్వలో కొంత మేరకు ఉల్లి గడ్డలు కుళ్ళిపోవటంవల్ల రైతులు నష్టపోయారు. సెప్టెంబరు మాసంలో కొంత మేరకు ధరలు పెరుగుతాయని రైతులు ఆశించారు. కాని ప్రభుత్వ నిర్ణయంవల్ల ఎగుమతులు తగ్గుతాయని భావిస్తున్నారు. ఫలితంగా ధరలు కూడా తగ్గవచ్చు. ప్రభుత్వ సంస్థ ‘నేఫెడ్’ షుమారుగా 3 మిలియన్ టన్నుల ఉల్లిగడ్డల్ని నిల్వ ఉంచింది. రోజుకి ఐదు వేల టన్నుల చొప్పున ఈ సంస్థ ఢిల్లీ మార్కెట్లో కిలో 25 రూపాయల రేటుకి అమ్మటం ద్వారా ఉల్లిగడ్డల ధరల్ని అదుపులో ఉంచాలని నిర్ణయించింది.
ఉత్పత్తిలో పెరుగుదల
ఉల్లి, వెల్లుల్లి వాడకంవల్ల తామస గుణం పెరుగుతుందని కొందరి నమ్మకం. 1961లో దేశంలో ఉల్లి వాడకం తక్కువగా ఉండేది. తలసరి ఉల్లి వినియోగం కేవలం 2.61 కిలోలు మాత్రమే. సంవత్సరానికి 2.61 కిలోలంటే నెలకు 218 గ్రాములే. కాని కాలక్రమేణా ఉల్లి వాడకం పట్ల ఆసక్తి పెరిగింది. ఉల్లిని వాడితే కూరల రుచి బాగుంటుందనీ, ఆరోగ్యం మెరుగవుతందనీ నమ్మకం పెరిగింది. 2020 నాటికి ఉల్లి తలసరి వాడకం 15 కిలోలు దాటింది. 60 సంవత్సరాల్లో తలసరి వాడకం ఆరు రెట్లుకన్నా ఎక్కువ పెరగటంవల్ల గిరాకీ పెరిగింది. 2020లో దేశంలో ఉల్లి ఉత్పత్తి 26.09 మిలియన్ టన్నులుగా అంచనా వేయబడ్డది. 2021లో 26.64 మిలియన్ టన్నులు, 2022లో 31.69 మిలియన్ టన్నులు, 2023లో 31.01 మిలియన్ టన్నులుగా అంచనా వేయబడ్డాయి. కాని ఈ ఉత్పత్తి పెరుగుదలకు విస్తీర్ణం పెరగటం ముఖ్యకారణమైంది. 2018-19లో సగటు దిగుబడి హెక్టారుకి 19.7 టన్నులుగా ఉంది. 2019-20లో దిగుబడి హెక్టారుకి 19.2 టన్నులకు తగ్గింది. 2020-21లో ఇంకా తగ్గి 16.4 టన్నులుగా నమోదైంది. 2021-22, 2022-23లో దిగుబడి 16.2 టన్నులకు తగ్గింది. 2015-16 నుండి 2018-19 వరకు సగటు దిగుబడి 20 టన్నులుగా ఉన్నది క్రమంగా 20 శాతం వరకు తగ్గింది. వాతావరణ పరిస్థితుల్లో ఏర్పడిన అననుకూలత వల్ల దిగుబడులు తగ్గాయి. ఐతే విస్తీర్ణం పెరుగుతూ ఉండటంవల్ల ఉత్పత్తి పెరిగింది. 2014-15 నుండి 2021-22 మధ్య సగటు విస్తీర్ణం 1.4 మిలియన్ హెక్టార్లు కాగా, సగటు ఉత్పత్తి 24 మిలియన్ టన్నులుగా ఉంది. 2021-22లో ఉల్లి విస్తీర్ణం 1.62 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. 2022-23లో మరింత పెరిగి 1.91 మిలియన్ హెక్టార్లకు చేరింది. ఉత్పత్తి పెరుగుతుండటంవల్ల సెప్టెంబరు, 2021 నుండి ఉల్లి ధరలు తగ్గుతున్నాయి. ఉల్లి సాగుకి మూడు సీజన్లున్నాయి. ఖరీఫ్ పంటను జులై-ఆగస్టులో విత్తి, అక్టోబరు నుండి నవంబరు నెలల్లో ఉల్లిగడ్డలను తీస్తారు. సుమారు 20 శాతం ఉత్పత్తి ఈ మాసాల్లో లభిస్తుంది. ఈ పంట అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో వినిమయదారుల అవసరాలను తీరుస్తుంది. రెండవ పంటను అక్టోబరు-నవంబరు నెలల్లో విత్తి, జనవరి నుండి మార్చి మధ్య తీస్తారు. 15 శాతం పంట ఈ సీజనులో లభిస్తుంది. జనవరి నుండి మార్చి వరకు ఈ పంట వినిమయదారుల అవసరాలను తీరుస్తుంది. డిసెంబరు-జనవరి మాసాల్లో నాటే రబీ పంట ముఖ్యమైనది. మొత్తం ఉత్పత్తిలో 65 శాతం రబీ పంట ద్వారా లభిస్తుంది. ఈ పంటను మార్చి నుండి మే మాసాల మధ్య తీస్తారు. ఎండాకాలంలో వచ్చే ఈ పంట ఏప్రిల్ నుండి సెప్టెంబరు వరకు వినిమయదారుల అవసరాలు తీరుస్తుంది. వేసవిలో వచ్చే ఈ పంటలో నీటి శాతం తక్కువగా ఉండి, నిల్వపెట్టడానికి అనువుగా ఉంటుంది. ఈ సంవత్సరం వేసవికాంలో వర్షాలు పడటంవల్ల నీటి శాతం ఎక్కువగా ఉన్న ఉల్లిగడ్డలనే నిల్వ చేయటంవల్ల, నిల్వలో కొంతమేరకు ఉల్లిగడ్డలు పాడయినట్లు వార్తలు వచ్చాయి. జూన్ మాసంలో ఉల్లిధరలు, 1.65 శాతం పెరిగాయి. జులై మాసంలో ధరలు 11.72 శాతం పెరిగాయి. జూన్ నుండి సెప్టెంబరు వరకు ఉల్లి ధరల్లో కొంత పెరుగుదల ఉండటం ప్రతి సంవత్సరం జరుగుతుంది. కొత్త పంట ఈ సమయంలో రాదు కాబట్టి నిల్వ ఖర్చుల కారణంగా ధరలు పెరుగుతుంటాయి. ఇదేవిూ ఆందోళన చెందాల్సి విషయం కాదు.
ద్రవ్యోల్బణంపై చింత
ప్రపంచ వ్యాప్తంగా ద్రవోల్బణం 5 శాతానికి పైగా ఉంది. భారతదేశంలో రిటైల్ స్థాయిలో ద్రవ్యోల్బణం జూన్, 2023లో 4.87 శాతంగా ఉంది. కాని జులై నెలలో 7.44 శాతానికి పెరిగింది. అధిక వర్షాల వల్ల కూరగాయ పంటలు దెబ్బతిని, వాటి ధరలు కిలోకి వంద రూపాయలు దాటాయి. టమోటా ధర కిలోకి రెండు వందలు దాటింది. ఐతే ఇది తాత్కాలికమే. 15 రోజుల తర్వాత టమోటా ధర రూ. 60లకు తగ్గింది. క్రమంగా ఇతర కూరగాయల ధరలు తగ్గవచ్చు. వాటితోపోలిస్తే ఉల్లి ధర తక్కువగా పెరిగింది. ఒక కుటుంబం తమ అవసరాలకు నెలకు ఇరవై వేలు ఖర్చు పెడుతుంటే, అందులో ఆహారానికి ఖర్చు పెట్టేది ఎనిమిది వేల రూపాయలుంటుంది. అందులో కూరగాయలకు వెచ్చించేది ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయలే. కూరగాయాల ఖర్చులో ఉల్లికి ఖర్చు పెట్టేది 13 శాతం మాత్రమే. ఉల్లి ధర పన్నెండు శాతం పెరిగితే దాని ప్రభావం మొత్తం రిటైల్ ద్రవ్యోల్బణంలో ఒకటి రెండు పాయింట్లు మించి ఉండదు. సెప్టెంబరులో ఉల్లి ధర రూ. 60లకు చేరుతుందనే భయంతో ప్రభుత్వం హడావుడిగా ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధించడం సమంజసం కాదు. దేశంలో ఉత్పత్తయ్యే ఉల్లిలో 10 నుండి 15 శాతం మాత్రమే ఎగుమతి అవుతుంది. 2020-21లో 1.58 మిలియన్ టన్నులు, 2021-22లో 1.54 మిలియన్ టన్నులు, 2022-23లో 2.53 మిలియన్ టన్నులు ఎగుమతయ్యాయి. ఎగుమతులు కొంచెమే అయినా దేశంలో ఉల్లి ధరలు నిలబడటానికి ఊతమిస్తున్నాయి. బంగ్లాదేశ్, మల్లేషియా, యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ దేశాలు మనదేశంనుండి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నాయి. ఎగుమతుల విషయంలో ప్రభుత్వ విధానాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. 2019లో ఎగుమతి ధర ఒక కనీస స్థాయిలోనైనా ఉంటేనే ఎగుమతుల్ని అనుమతించే విధానం ఉండేది. 2020 సెప్టెంబరు నుండి డిసెంబరు వరకు ఎగుమతుల్ని పూర్తిగా నిషేధించారు. 2021 జనవరి 1వ తేదీ నుండి ఉల్లి ఎగుమతుల్ని స్వేచ్ఛగా చేసుకోవచ్చని అనుమతించారు. ఉల్లి విత్తనాల ఎగుమతిపై మాత్రం 2023 చివరి వరకు కొన్ని ఆంక్షలను విధించారు. తాజాగా విధించిన 40 శాతం ఎగుమతి సుంకం డిసెంబరు 31 వరకు అమల్లో ఉంటుంది. దీనివల్ల రెండు పరిణామాలు ఏర్పడవచ్చు. భారత్ నుండి ఉల్లి ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవచ్చు. లేదా చాలా వరకు తగ్గవచ్చు. ఉల్లి దిగుమతులపై ఆధారపడే దేశాలు కొంత మేరకు ఎక్కువ ధర చెల్లించవచ్చు. కాని దీర్ఘకాల ఒప్పందాలు చేసుకున్న కంపెనీలకు అనేక ఇబ్బందులు ఎదురు కావచ్చు. భారత్ నుండి దిగుమతి చేసుకునే దేశాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చు. కాని ఖరీఫ్ పంట మార్కెట్లోకి వచ్చినప్పుడు ధరలు తగ్గవచ్చు. ఐదారు మిలియన్ టన్నుల ఉత్పత్తిపై కిలోకి రూ. 15 రూపాయల చొప్పున ఉల్లి రైతుల ఆదాయాలు 9,000 కోట్ల రూపాయల వరకు తగ్గవచ్చు. అంతేకాకుండా క్రిందటి రబీ పంటలో మిగిలిన ఐదారు మిలియన్ టన్నుల నిల్వపై లభించే ఆదాయం కూడా అదే విధంగా మరో 9000 కోట్ల రూపాయల మేరకు తగ్గవచ్చు. ఇలా మొత్తం దేశంలోని ఉల్లి రైతులు రూ. 15,000 నుండి 20,000 కోట్ల రూపాయలు నష్టపోవచ్చు. ఆ మేరకు వినిమయదారులు లాభించవచ్చు. ఎగుమతులున్నప్పటికంటే ఎగుమతులు లేనప్పుడు వినిమయదారులకు కిలోకి రూ. 15లు తక్కువ ధరకు నాలుగైదు నెలలపాటు లభించవచ్చు. ఇలా వినిమయదారుల ప్రయోజనాల కోసం ఎగుమతులపై ఆంక్షలు విధించినప్పుడల్లా రైతులు నష్టపోతున్నారు. ఏదైనా ఉత్పత్తి బాగా తగ్గినప్పుడు ఎగుమతుల్ని నియంత్రివచ్చు. కాని రికార్డు స్థాయిలో, గోధుమ, ఉల్లి ఉత్పత్తులు పండినప్పుడు ఎగుమతి ఆంక్షల్ని విధించడం సమంజసం కాదు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం కోసం రైతుల ప్రయోజనాలను బలిపెట్టకూడదు.
పునరాలోచన అవసరం
ఊహాజనితమైన అంచనాల ఆధారంగా తొందరపాటు చర్యలు చేపట్టటం సమంజసం కాదు. అహ్మద్నగర్, నాసిక్లలో రైతులు ఎగుమతి సుంకాలను ఎత్తివేయాలని ఆందోళన చేస్తున్నారు. కూరగాయల ధరలు పెరిగాయి. కాబట్టి శుద్ధి చేసిన కూరగాయల ధరలు కూడా పెరుగుతాయి. వాటి ఎగుమతిని కూడా నిషేదించే ప్రమాదం ఉంది. ఉల్లి ధరలు తగ్గితే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటక, గుజరాత్, రాజస్థాన్, బీహార్లలో ఉల్లి పండించే రైతులతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి రైతులు కూడా నష్టపోతారు. ఆంధ్రప్రదేశ్లో 0.75 మిలియన్ టన్నులు, తెలంగాణాలో 0.30 మిలియన్ టన్నుల ఉల్లి ప్రతి సంవత్సరం ఉత్పత్తవుతున్నది. ఒక్కోసారి ఉల్లి బాగా పండినప్పుడు రైతులకు రవాణా ఖర్చులు కూడా రావు. కిలోకి ఐదు రూపాయలు కూడా గిట్టని సందర్భాలున్నాయి. రైతుకి కిలోకి రూ. 25 నుండి 30 రూపాయలు లభించడం ఎప్పుడో కాని జరగదు. ఆ సమయంలో ఎగుమతిపై అదిక మొత్తంలో సుంకాలు వేయడం, నిషేధించడం న్యాయం కాదు. కొరతలేని సమయాల్లో కూడా ద్రవ్యోల్బణం నెపంతో రైతుల్ని దెబ్బతీయడం వాంఛనీయంకాదు. ఇలాంటి రైతు వ్యతిరేక విధానాలతో ప్రభుత్వాలు దుందుడుకు చర్యలకు పాల్పడినప్పుడు రైతులు ఐక్యంగా ఉద్యమించాలి. అహేతుకంగా రైతుల ఆదాయాలను దెబ్బతీసే ప్రయత్నాలను వ్యతిరేకించకుంటే ప్రభుత్వం మరిన్ని రైతు వ్యతిరేక చర్యలను చేపట్టే ప్రమాదం ఉంది.
డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త, (రిటైర్డ్ & కన్సల్టెంట్ ఇక్రిసాట్),
రసాయనిక వ్యవసాయం వలన జరుగుతున్న అనర్థాల నుండి బయట పడటానికి కొంతమంది రైతులు సేంద్రియబాట పట్టారు. ఇంకా పడుతూనే ఉన్నారు. పంట దిగుబడులలో ఉండే విషరసాయనాలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపటంతో పాటు నేల, నీరు, గాలి కలుషితమవుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా, వినియోగదారులకు ఎలాంటి రసాయన అవశేషాలు లేని ఆహార పదార్థాలను అందించాలని సేంద్రియ బాట పట్టిన రైతులు అన్ని కష్టనష్టాలను ఎదుర్కుంటూ తమ సేంద్రియ సాగును కొనసాగిస్తున్నారు. పూర్తి సేంద్రియ పద్ధతులతో పండించిన పంటలు వినియోగదారులకు చేరే సమయానికి అనేక చేతులు మారి, ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉండకపోవడంతోపాటు ఉత్పత్తుల నాణ్యత మీద కూడా ప్రభావం చూపించి కల్తీలకు అవకాశాలు మెండుగా ఉండి వినియోగదారులకు సరైన ఉత్పత్తులు సరైన ధరలకు దొరకడములేదు. సేంద్రియ రైతులు పడిన శ్రమకు సరైన ఫలితం దక్కడం లేదు. ఇటు రైతులు, అటు వినియోగదారులు ఇద్దరూ కూడా ఫలితాలు పొందకపోగా మధ్యలో ఉండే వ్యాపారులు ఆ ఫలితాలను పొందుతుండడం ప్రస్తుత సమాజంలో సర్వసాధారణమైంది. ఈ సమస్యకు పరిష్కారం సొంత మార్కెటింగ్ వ్యవస్థలే అని గ్రహించిన కొంతమంది సేంద్రియ రైతులు తాము పండించిన నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులను తామే నేరుగా వినియోగదారులకు అమ్మకం చేసి తమ సేంద్రియ సాగుని లాభాలబాటలో నడిపించుకోవడంతో పాటు నాణ్యమైన పంట ఉత్పత్తులను సరసమైన ధరకు వినియోగదారులకు అందిస్తున్నారు. ఈ బాటలోనే నడుస్తున్నారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో సేంద్రియ సాగు చేస్తూ, వివిధ రకాల పంటలు పండిస్తూ తమ పంట దిగుబడులను ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేసిన సేంద్రియ ఉత్పత్తుల అమ్మకం కేంద్రం ద్వారా నేరుగా వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నారు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు మరియు వీరి అర్థాంగి లక్ష్మి.
సేంద్రియ సాగుపై అవగాహన పెరిగిన తరువాత అనేకమంది రైతులు సేంద్రియ బాటపట్టారు. ఇంకా పడుతూనే ఉన్నారు. వేరేరంగాల నుంచి ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగ రంగం నుండి ఎక్కువ మంది యువత సేంద్రియ వ్యవసాయంపై మక్కువ చూపుతున్నారు. అయినాకాని సేంద్రియ బాట పట్టిన వారందరూ తమ పంటల సాగుని లాభాల బాట పట్టించలేకపోతున్నారు. పంటల సాగుతో పాటు పాడిపశువులను పోషించేవారు, కుటుంబ సభ్యులందరూ కలసి, ప్రత్యేకంగా కుటుంబంలోని మహిళలు వ్యవసాయంలో తమవంతు పాత్రను పోషిస్తూ ఉండేవారు, వచ్చిన పంట దిగుబడులకు విలువ జోడించేవారు, పంట దిగుబడులను వినియోగదారులకు నేరుగా ఆశాజనకమైన ధరలకు అమ్మేవారు, పంటల సాగులో రాజీపడకుండా, నాణ్యత విషయంలో రాజీపడకుండా నూటికి నూరు శాతం సేంద్రియ ఉత్పత్తులను అందించేవారు తప్పనిసరిగా తమ సేంద్రియ సాగును లాభాల బాట పట్టించుకుంటున్నారు. ఈ విషయాలను అశ్రద్ధ చేసేవారు తమ సాగులో నష్టాలను భరించవలసి వస్తుంది.
సేంద్రియ సాగుని లాభాల బాటలో నడిపించటానికి అవసరమైన అన్ని మెళకువలను బొమ్మిశెట్టి శ్రీనివాసరావు తు.చ. తప్పకుండా పాటిస్తున్నాడు. తాము 30 ఎకరాలకు పైగా పొలంలో చెరకు, పశుగ్రాసాలు, పండ్ల మొక్కలు, వరి, అపరాలు మొదలగు పంటలు పండించడంతోపాటు 30 పైగా గేదెలు మరియు కొన్ని దేశీయ జాతి ఆవులను పోషిస్తూ పశువ్యర్థాలను పంటలసాగులో వినియోగిస్తున్నారు. భార్యా, భర్తలిద్దరూ వారి పూర్తి సమయాన్ని వ్యవసాయం మరియు పశుపోషణకు కేటాయిస్తున్నారు. వారి పిల్లలు ఇద్దరూ కూడా తమకు అవకాశం ఉన్నప్పుడు తల్లిదండ్రులకు వ్యవసాయంలో సహకారం అందించడంతో పాటు తమ తల్లిదండ్రులు వ్యవసాయరంగంలో కొనసాగుతున్నందుకు గర్వంగా ఫీలవుతున్నారు. కేవలం పంటలసాగు మరియు పశుపోషణను కొనసాగిస్తున్న సమయములో లాభాలు ఆశాజనకంగా ఉండకపోవటముతో తమ సేంద్రియ సాగుని లాభాల బాటలో నడిపించాలంటే మార్గాల కోసం అన్వేషించి వారి పంట దిగుబడులకు విలువజోడింపు ఒక మార్గం అని భావించి వచ్చిన పంట దిగుబడులను ఉదాహరణకు వడ్లను బియ్యం పట్టించి, చెరకును బెల్లం చేసి అమ్మడం మొదలు పెట్టారు. తోటి రైతులు కూడా తమ సేంద్రియ ఉత్పత్తులను అమ్మకం చేసి పెట్టమని బొమ్మిశెట్టి శ్రీనివాసరావుగారిని అడగగా, తమతో పాటు తమ లాంటి పద్ధతులను పాటించే రైతులకు కూడా తోడ్పాటు అందివ్వాలనే తలంపుతో నాలుగు సంవత్సరాల క్రితం ఖమ్మం పట్టణంలో సేంద్రియ ఉత్పత్తుల అమ్మకం కేంద్రాన్ని ప్రారంభించి దాని ద్వారా నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా విక్రయిస్తున్నారు.
పంటల సాగుకు సంబంధించిన పనులను శ్రీనివాసరావుగారు పర్యవేక్షిస్తుండగా, పంట దిగుబడులను నేరుగా మరియు సేంద్రియ ఉత్పత్తుల అమ్మక కేంద్రం ద్వారా అమ్మకానికి సంబంధించిన పనులను శ్రీనివాసరావు గారి అర్థాంగి లక్ష్మి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. తమ దుకాణంలో స్వచ్ఛమైన, నాణ్యమైన గేదె మరియు ఆవు పాలు (పాల గురించి పూర్తి వివరాలకు బాక్స్ చూడగలరు), బియ్యం, కందిపప్పు, వేసవికాలంలో చెరకు రసం, బెల్లం, పసుపు, కారం లాంటి సేంద్రియ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు ఆశాజనకమయిన ధరలకు అమ్మకం చేస్తున్నారు.
పంటల సాగును లాభాల బాటలో నడిపించాలంటే అవసరమయిన మెళవకులను తు.చ. తప్పకుండా పాటిస్తూ వినియోగదారులకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని పొందుతూ తమ పంటల సాగుని లాభాల బాటలో నడిపిస్తున్నారు. మరిన్ని వివరాలు 9849312839 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
లీటరు పాలు 90 రూపాయలు
వీరు తమ పశువుల ద్వారా పొందిన పాలతోపాటు, తోటి రైతుల వద్ద నుంచి కూడా నాణ్యమైన పాలను సేకరించి గేదె పాలు లీటరు 90 రూపాయలు, దేశీయ జాతి ఆవుపాలు లీటరు 100/-ల చొప్పున రోజుకు రెండు పూటలా కలిపి 150 నుండి 200 లీటర్ల చొప్పున పాలను నేరుగా వినియోగదారులకు అందిస్తున్నారు. అంత ధర చెల్లించిన వినియోగదారులకు ధరకు తగినంత నాణ్యత ఉంటుంది కాబట్టి గత నాలుగు సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా కొనుగోలు చేస్తున్నామని, పాలకోసం కొన్ని సార్లు కొంత సమయం వేచి ఉండవలసి వస్తుంది, అయినా కాని, నాణ్యమైన పాల కోసం ఆ మాత్రం వేచి ఉండటము ఏ మాత్రం ఇబ్బంది కాదు అని వినియోగదారులు తమ అభిప్రాయాన్ని తెలియచేశారు.
ఈ సంవత్సరం జూలై మొదటి వారాంతం వరకు మన వాతావరణ శాఖ, ఎలినినో ప్రభావం వల్ల తీవ్ర వర్షాభావం ఉండవచ్చునని, నీటి ఎద్దడిని ఎదుర్కొనడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. అయితే వారి అంచనాలకు పూర్తి విరుద్ధంగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు, దాదాపు దేశంలోని అన్ని నదులకు వరదలు సంభవించుట మనం చూస్తున్నాము. మన తెలుగు రాష్ట్రాలలో గోదావరి, కృష్ణా నదులకు భారీగా వరద నీరు చేరటం, జూలై ఆఖరివారంలో ప్రారంభమైంది. వాగులు, కాల్వలు, చెరువులు పొంగుట, అనేక చోట్ల చెరువుగట్లు కూడా ధ్వంసం అగుటతో పాటు ప్రాజెక్టులకు కూడా ముప్పు వాటిల్లింది. వరంగల్, హైదరాబాద్ నగరాలలో కురిసిన భారీ వర్షాల వల్ల ఇటీవలకాలంలో మనం ఎన్నడూ చూడని విధంగా రోడ్లతో పాటు, భవనాలు కూడా ధ్వంసం అయ్యాయి. పదుల సంఖ్యలో జన నష్టంతో పాటు వేలాది మూగ జీవులు ప్రాణాలు కోల్పోయాయి. పిడుగుపాటు, వడగళ్ల వల్ల పశువులతో పాటు, జీవాల మందలు కూడా మరణించాయి. సుమారు రెండు వారాలుగా అనేక ప్రాంతాలలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల, పొలాలను ముంచి వేసిన వరద నీటి వల్ల పచ్చిక కుళ్లిపోయి పశువులకు మేత అందని పరిస్థితితో పాటు వరద నీటిలో కొట్టుకుపోయిన గడ్డి వాములు, వాన నీటితో తడిచి కుళ్లి-బూజుపడుతున్న గ్రాసాలు, దాణాల వల్ల పశువులు, జీవాలు, కోళ్ల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడింది. వాతావరణంలో అనూహ్యంగా, అకస్మాత్తుగా సంభవించే అతివృష్టి, పిడుగుపాటు, వరదలను ముందుగా ఖచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితుల్ని ప్రస్తుతం మనం చూస్తూ వున్నాము. కాబట్టి పశుపోషకులు, జీవాల పెంపకందారులు రాబోయే రెండు-మూడు నెలల వరకు చాలా అప్రమత్తంగా ఉండాలి. గతంలో నవంబరు నెలలో కూడా ఉప్పెనలు వచ్చి అనూహ్య నష్టాలను చవిచూచిన అనుభవాలను మనం మరచిపోకూడదు. అయినా వాతావరణ శాఖ సూచనలను విస్మరించకూడదు. సాధారణంగా వారి సూచనలు శాస్త్రీయ అధ్యయనాల మీదనే ఆధారపడి మాత్రమే ఉంటాయని అర్థం చేసుకోవాలి.
ఇక వరదలు, వానలు, పిడుగుపాట్లు, వడగళ్ల వానలు వల్ల సంభవించే నష్టాల గురించి చర్చిద్దాము.
ఆకస్మికంగా వచ్చే పిడుగు పాట్ల నుండి పశువులను, జీవాలను కాపాడుట ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాకపోవచ్చు. అయినా పిడుగుపాటుకు అవకాశాలు ఎక్కువగా ఉండే పెద్ద చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల వద్ద పశువుల్ని బంధించి ఉంచుట క్షేమం కాదు. వాటిని ఆరుబయలు ప్రదేశంలో కొంత స్వేచ్ఛగా ఉంచుట మంచిది. వడగళ్ల బారి నుండి రక్షించుటకు పశువుల్ని వీలైతే సిమెంటు శ్లాబులు క్రింద లేదా పటిష్టమైన రేకుల షెడ్ల క్రింద ఉంచి రక్షించాలి.
ఇప్పటి ఆకస్మిక వరదలలో వందలాది పశువులు, వేలాది జీవాలు వరద నీటిలో కొట్టుకుపోయిన వార్తల్ని దృష్టిలో ఉంచుకొని, పశువుల్ని, జీవాలను, ఎత్తయిన రక్షిత స్థలాలకు తరలించాలి. లోతట్టు ప్రాంతాలలోని పశువుల పాకలలోని పశువుల్ని సులువుగా విడుదల చేసి రక్షించుకునే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జులై 26న వచ్చిన వరదల నుండి పశువులను డాబా పైకి తరలించి రక్షించిన దృశ్యాలను కొన్ని ప్రాంతాలలో చూశాను. వీలైతే ఇటువంటి జాగ్రత్తలు కూడా మంచివే.
ముసురు రోజుల్లో సుదీర్ఘంగా రొచ్చు, బురద, పేడ వంటి అశుభ్రాల మీద నిలబడిన పశువుల గిట్టలు, కాళ్లు పుండ్లు పడటం సాధారణం! సత్వరమే తగిన చికిత్సలు చేయకపోతే ఫుట్రాట్ వంటి మొండి సమస్యలు తలెత్తి పశువులు, జీవాలు తీవ్రమైన బాధలకు గురౌతాయి. ఇటువంటి సందర్భాలలో కాళ్లను, గిట్టలను మైలుతుత్తుం (2%) ద్రావణంలో ముంచుట లేదా ఈ ద్రావణం గుండా నడిపించుట మంచిది. కాళ్లకు, గిట్టలకు వేపనూనె పూస్తే స్వల్పమైన పుండ్లు త్వరగా నయమౌతాయి.
అనేక రోజుల పాటు పడే వానల వల్ల ఏర్పడే చలి వాతావరణం, చిత్తడి పరిసరాల వల్ల దూడలు ప్రాణాల కోల్పోయే ముప్పు ఎక్కువ కాబట్టి వీటిని చలిగాలుల నుండి రక్షించే జాగ్రత్తలు తీసుకుని పొడివాతావరణంలో ఉంచాలి.
ఈ సంవత్సరం జూలై మాసంలో కూడా తీవ్రమైన ఎండలు కొనసాగి, ఆకస్మికంగా భారీ వానలు, వరదలు వచ్చాయి. ఈ ఆకస్మిక వాతావరణ మార్పుల వల్ల పశువులు-జీవాల సహజమైన వ్యాధినిరోధక శక్తులు క్షీణించి, అవి అనేక అంటురోగాలకు సులువుగా బలైపోతాయి. కాబట్టి వెంటనే వీటికి గురక, దొమ్మ, పి.పి.ఆర్., గాలికుంటు వంటి ఆయా ప్రాంతాలలో ఉనికిలో ఉన్న ప్రమాదకరమైన వ్యాధుల నివారణ టీకాలు ఒకేసారి ఒక ప్రాంతం లేదా మందలో కనీసం 90 శాతం పశువులు లేదా జీవాలకు టీకాలు వేయించాలి. అనేక అంటువ్యాధి క్రిముల్ని వ్యాపింపచేసే ఈగలు, దోమలు, గోమార్లు, పిడుదుల నివారణకు డి.డి.టి., గమాక్సిన్, డెల్టామెథ్రిన్, సైపర్మెథ్రిన్ వంటి కీటకనాశకాలను పాకలు, కొట్టాలు, పరిసరాలలో స్ప్రే చేసి ఈ స్థలాలను పొడిగా ఉంచాలి. ఇందుకు తాత్కాలికంగానైనా మురుగు పారుదల ఏర్పాట్లు చేయుట అవసరం.
ఇటీవల నాలుగు సంవత్సరాలుగా పశువులు, జీవాలకు తీవ్రమైన సమస్యగా ఎదురైన లంపీస్కిన్ డిసీజ్ వ్యాధి నివారణకు అవసరమైన టీకాలు, ఇతర ఆరోగ్య భద్రతా చర్యల్ని వెంటనే చేపట్టాలి.
ప్రస్తుతం మన గేదెలు ఎక్కువగా నిండు చూడి థలో ఉండి, స్వల్పకారణాలకే గర్భస్రావాలకు లోనయ్యే ముప్పు ఉంది. ఇందుకు మేత కొరత, పరిసరాల అశుభ్రతతో పాటు క్షీణించిన వ్యాధినిరోధక శక్తి, వత్తిళ్లను తట్టుకోగల శక్తి తదితర కారణాలను గుర్తించి, తగిన నష్టనివారణ చర్యల్ని వెంటనే చేపట్టాలి.
క్షీణించిన పరిశుభ్రత, పోషణ, యాజమాన్య నిర్వహణ తదితర కారణాల వల్ల, బాలింత పశువులలో పొదుగు వాపు వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇంతేకాక వరదలు ఇతర విపత్తుల వల్ల సకాలంలో నిర్ణీత సమయానికి పాలుపిండకపోతే పొదుగులు నిండిపోయి పొదుగువాపు ముప్పు ఎక్కువగా ఉంటుంది.
మేత సమస్య: వరదల వల్ల పశువులు ఎదుర్కొనే ప్రధాన సమస్య మేత కొరత, గడ్డివాములు వరదలలో కొట్టుకుపోవటం, మేతలు, గ్రాసాలు బూజుపట్టి ముక్కిపోయి వాటిని తిన్న పశువులు, జీవాలకు ప్రాణహాని జరగటం పరిపాటి. పచ్చికబీళ్లు వరద నీరు, బురదలలో మునిగిపోయి అందుబాటులో లేకపోవుట, పారా ల్యూసర్న్ వంటి పొట్టి రకం గ్రాసాలతో పాటు ఎదిగే థలో ఉన్న సూపర్ నేపియర్ వంటి పొడవు గ్రాసాలు కూడా చనిపోవటం జరగవచ్చు. ఇందువల్ల ఎదురయ్యే మేత సమస్యను ప్రత్యామ్నాయ మేతలు అంటే సుబాబుల్, మర్రి, రావి, అరటి తోట వ్యర్థాలు, మామిడి ఆకులు, నేరేడు, మారేడు, తుమ్మ, అవిసె, మునగ, వేప వంటి ఆకుల్నే కాక కొంత పరిమితంగా (అంటే మొత్తం మేతలో 25 శాతానికి మించకుండా) ఇప్పుడు విరివిగా లభిస్తున్న గుర్రపుడెక్కను కూడాను మేపవచ్చును. ఈ మేతల్ని అలవాటు చేయుటకు మొదట్లో వాటి మీద బెల్లం లేదా వరి తవుడును జల్లి మేపాలి. కూరగాయలు, ఆకుకూరల వ్యర్థాలు కూడా పశువులకు మంచి పోషకాలను అందించగలవు.
అజొల్లా-హైడ్రోపోనిక్ గ్రాసాల సాగును ఇంటి మిద్దెల మీద కూడా చేపట్టి నాటిన 7-8 రోజుల్లో కిలో విత్తు నుండి 7-8 కిలోల పుష్టివంతమైన పచ్చని మేతను పొందవచ్చును. ఎక్కువ మొలకెత్తే సామర్థ్యం కలిగిన జొన్నలు, మొక్కజొన్నలు, ఓట్స్, పెసలు, శనగలు, ఉలవల నుండి ట్రేలలో అత్యంత మేలైన పచ్చిగ్రాసాలు పొందవచ్చును.
అజొల్లా అనే ఫెర్న్ మొక్కను ప్లాస్టిక్ టార్పాలిన్తో ఏర్పాటు చేసిన నీటి మడుగులలో పెంచితే పచ్చిమేతల సాగుకు భారీ విస్తీర్ణమైన సాగుభూముల అవసరమే ఉండదు. వరి గడ్డితో పాటు హైడ్రోపోనిక్ గ్రాసాలను, అజొల్లాను మేపగల్గితే అన్ని రోజులలోనూ పశువుల ఆహార అవసరాలు చాలా వరకు తీరగలవు.
ప్రమాదాలు, రోగాలు, వరదల వల్ల పశువుల్ని కోల్పోయినప్పుడు జరిగే నష్టాలకు పరిహారం పొందుటకు వెంటనే పశువులన్నింటినీ బీమా చేయించి వాటి చెవులకు బిగించిన నెంబరు పోగులు ఊడిపోకుండా జాగ్రత్త వహించాలి.
విదేశీ పంటలు ప్రస్తుతం భారత్లో విస్తృతంగా సాగు చేస్తున్నారు. ఇండోనేషియా, సింగపూర్ దేశాలకే పరిమితమైన చెకుర్మనీస్, ప్రస్తుతం భారత్లో కూడా సాగు చేస్తున్నారు. దీన్ని శాశ్వత ఆకు కూరగా పిలుస్తారు. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని దిగుబడినిస్తుంది. మొక్కలో అధిక ఖనిజ లవణాలు, పోషక విలువలు ఉండటంతో ఔషధాల తయారీకి కూడా వాడుతున్నారు. ఇప్పటికే ఈ మొక్కలను కేరళలలో పెంచటం విశేషం.
కుటుంబం: యుఫోర్బియాసి
మూలం: ఇండో-బర్మా
సాధారణ పేర్లు: మల్టీవిటమిన్ గ్రీన్ / మల్టీమినరల్ / వెజటబుల్ ఆఫ్ 21వ సెంచరీ, స్టార్ గూస్బెర్రీ/ స్వీట్ లీఫ్ / ట్రోఫీకలస్
తెలుగు పేరు: చక్రముని
ఉపయోగాలు: ఈ మొక్క ఆకులలో విటమిన్-ఎ అధికంగా ఉండటం వల్లన కంటి సమస్యలని నివారిస్తుంది. మరియు జ్వరం నయం కావడానికి ఉపయోగిస్తారు. లేత ఆకులను సలాడ్, సూప్గా వాడటంతో పాటు, పశుమేతగా, పౌల్ట్రీఫీడ్గా కూడా వాడతారు. అయితే ప్రత్యేకంగా సాగు చేయలేని రైతులు దీన్నిఇంటి పెరటిలో కూడా పెంచుకునే వీలుంటుంది. ఈ మొక్కలను మీ ఇంట్లో కుండీల్లో కూడా సులభంగా పెంచుకోవచ్చు. కిచెన్ గార్డెన్లో హెడ్జ్గా బోర్డర్ లా నాటుకోవచ్చు. ఈ ఆకులను ప్రతి రోజు ఉదయం రెండేసి చొప్పున పిల్లలు, నాలుగు నుంచి ఐదు ఆకుల చొప్పున పెద్దలు తినడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు. మరికొన్ని చోట్ల నేల కోతను నివారించడానికి ఈ మొక్కల మట్టి బైండర్గా సాగు చేస్తున్నారు.
నేల మరియు వాతావరణం: చెకుర్మనీష్ మొక్క అన్ని రకాల నేలల్లో బాగా పెరుగుతుంది. మంచి వర్షపాతం ఉన్న వెచ్చని తేమతో కూడిన వాతావరణం ఆకులు మరియు కొమ్మల యొక్క విలాసవంతమైన మరియు రసవంతమైన పెరుగుదలకు బాగా సరిపోతుంది. ఇది కొంతవరకు నీడను తట్టుకోగలదు. కోయంబత్తూరు, కొల్లార్, కన్యాకుమారి, కేరళ రాష్ట్రం వంటి సమానమైన ఉష్ణోగ్రతతో తేలికపాటి తేమతో కూడిన పంటలలో ఈ పంట రావడం గమనించబడింది.
ప్రవర్థనం: కాండం కటింగ్ ద్వారా ప్రవర్ధనం చేయబడుతుంది మరియు తాజా విత్తనాల ద్వారా కూడా వేస్తారు.
మొక్కల అందుబాటు మరియు ధర: ఈ మొక్కలు వెంకటరామన్నగూడెం, హార్టీకల్చర్ రీసెర్చ్ స్టేషన్, డా. వై.యస్.ఆర్. హార్టీకల్చర్ యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో మొక్కను రూ. 25/-కు విక్రయిస్తున్నారు.
విత్తేదూరం: వరుస నుండి వరస దూరం 30 సెం.మీ. మరియు మొక్క నుండి మొక్క మధ్య దూరం 10-15 సెం.మీ.
దిగుబడి: ఒక మొక్కకు వార్షిక దిగుబడి 3 కిలోల ఆకులు మరియు హెక్టారుకు 30 టన్నుల ఆకులను సంవత్సరంలో పండించవచ్చు. దీ
డా. నాయుడు మాధవి, అసిస్టెంట్ ప్రొఫెసర్, హార్టీకల్చర్ విభాగం, ఎస్బివిఆర్ అగ్రికల్చరల్ కాలేజి, బద్వేల్, ఫోన్: 9494881824
అరటి అనగానే మనకు అరటి పండ్లు మాత్రమే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. లేదా అరటి ఆకులు అరటి పూవులు కూడా కొంతమందికి గుర్తుకు వస్తాయి. కాని అరటి చెట్టులోని అన్ని భాగాలు ఉపయోగపడతాయి. ఒక అరటి మొక్కను నాటినట్లయితే అనేక పిలకలు వస్తూనే ఉంటాయి. అరటి వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని గ్రహించి తమ ఇంటి ప్రక్కన కొంత స్థలాన్ని లీజుకు తీసుకుని వివిధ రకాల అరటి మొక్కలు పెంచుతున్నాడు విజయవాడకు చెందిన సురేష్.
సురేష్ది వ్యవసాయ నేపథ్యం. అయినాకాని ఉన్నత చదువులు చదివి వ్యవసాయానికి దూరం జరిగి విజయవాడలోని ఒక మల్టీస్పెషాలటీ వైద్యశాలలో ఐ.టి. మేనేజరుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. సురేష్కి వ్యవసాయం అన్నా, మొక్కలన్నా, పచ్చదనం అన్నా మక్కువ చాలా ఎక్కువ. తన మక్కువను తీర్చుకొనటానికి విజయవాడ మాచవరం డౌన్లో కొంత స్థలాన్ని లీజుకు తీసుకుని దాంట్లో వివిధ రకాల అరటి మొక్కలు సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం తన అరటి వనంలో 7 రకాల అరటి మొక్కలు ఉన్నాయి. కర్పూర, రెండు రకాల చక్రకేళి, ఎర్ర అరటి, పచ్చఅరటి, రెండు రకాల కూర అరటి మొక్కలను తెలిసిన రైతుల వద్ద నుంచి తెలిసిన ఇంటి పంట దారుల నుంచి సేకరించి 7 రకాల అరటి మొక్కలతో అరటి వనాన్ని పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాడు.
అరటి మొక్కలతోపాటు పడి మొలసిన కొన్ని రకాల మొక్కలను కూడా సురేష్ పెంచుతున్నాడు. వాటిలో నల్ల ఉమ్మెత్త, పారిజాతం, గురివింద మొక్కలు కూడా ఉన్నాయి. అరటి మొక్కలు పెరిగిన తరువాత ఆ మొక్కల కింద నీడ ఉండి నర్సరీ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి సురేష్ ఆవిధంగా కూడా అరటి మొక్కల నీడను కూడా సద్వినియోగం చేసుకుంటూ ఆ నీడలో కొన్ని రకాల మొక్కలను పెంపకం చేస్తూ తాను ఉపయోగించుకోవడంతో పాటు, ఇంటిపంటదారులకు, స్నేహితులకు, తెలిసిన వారికి ఉచితంగా అందచేస్తుంటాడు. కొన్నిసార్లు తానే రవాణా ఖర్చులు కూడా భరించి ఉచితంగా విత్తనాలు, మొక్కలు పంపిస్తుంటాడు. సురేష్ విత్తన నిధిని మెయింటేన్ చేస్తూ కొన్ని రకాల పురాతన, నాటు విత్తనాలను సంరక్షిస్తూ, వృద్ధి పరుస్తూ, తన వద్దలేని విత్తనాలను తోటి రైతుల వద్ద నుంచి, తోటి ఇంటి పంటదారుల నుంచి, తెలిసిన వారి నుంచి సేకరిస్తూ అవసరమైన వారికి అందిస్తుంటాడు. ఈ విధంగా పచ్చదనం పెంచడంలో తన వంతు పాత్రను పోషిస్తున్నాడు.
తన అరటి వనంలో అరటితో పాటు వివిధ రకాల మొక్కలను పూర్తి సేంద్రియ పద్ధతులతో పెంపకం చేస్తున్నారు కాబట్టి తేనెటీగలు తేనె తుట్టెలను పెడుతుంటాయి. ఈ తేనె టీగల వలన అరటి పంటలో పరపరాగ సంపర్కము సక్రమంగా జరిగి అరటి పండ్ల నాణ్యత, రుచి పెరగటంతోపాటు అరటి గెలలు కూడా పెద్దగా వస్తున్నాయి. గెలలో అన్ని కాయలు గట్టిపడి నాలుగు, ఐదు కాయలు పండి రంగు మారిన తరువాత గెలను కోసి ప్రకృతి సిద్ధంగా పండించి కొన్ని కాయలను తాము వినియోగించుకుంటూ మిగిలిన కాయలను అడిగిన వారికి అమ్మకం చేసి ఆదాయాన్ని కూడా పొందుతున్నాడు.
అరటి మొక్కలలో అన్ని భాగాలు ఉపయోగపడతాయి. అరటి ఆకులు అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు. అరటి గెలలో కాయలు పడిన తరువాత గెల చివరన మిగిలిన పువ్వులతో కూర చేసుకోవచ్చు. అరటి గెలలో కాయలు కోసిన తర్వాత మిగిలే దూటను కూడా కొంతమంది కూరగా చేసుకోవడానికి ఉపయోగిస్తుంటారు. అరటి బోదెలో దొప్పలను కూడా కార్తీక మాసంలో దీపాలు పెట్టి నీటిలో వదలటానికి ఉపయోగిస్తుంటారు. మిగిలి పోయిన అరటి బోదెను వేస్ట్డికంపోజరుతో కుళ్ళించినట్లయితే మంచి సేంద్రియ ఎరువు తయారవుతుంది. ఈ విధంగా అరటి మొక్కలోని ఏభాగం వృధా కాకుండా అరటి మొక్క మొత్తం ఉపయోగపడడంతో పాటు అరటి మొక్క నుండి ప్రతినిత్యం పిలకలు వస్తుంటాయి. ఆ పిలకలు ముదిరిన తరువాత తవ్వి మరలా నాటుకోవచ్చు. కాబట్టి అరటిని బహుళ ప్రయోజనకారి అని తెలుసుకున్న సురేష్ అరటి వనాన్ని సృష్టించాడు. మరిన్ని విరాలు 89850 68899 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
వర్షాకాలం పెరిగిన తేమ, వర్షపాతం మరియు తేమతో కూడిన పరిస్థితులను తెస్తుంది, ఇది జంతువులలో వ్యాధుల వ్యాప్తికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించగలదు. జంతువుల ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని కాపాడటానికి ఈ కాలంలో నివారణ చర్యలను అమలు చేయడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో జంతువులకు వచ్చే వ్యాధులను నివారించడానికి ఇక్కడ కొన్ని కీలక చర్యలు సూచించబడ్డాయి:
సరైన షెల్టర్ మరియు హౌసింగ్: జంతువుల ఆశ్రయాలు మరియు గృహ నిర్మాణాలు బాగా నిర్వహించబడుతున్నాయని, శుభ్రంగా మరియు సరిగ్గా వెంటిలేషన్ చేయబడిందని నిర్ధారించుకోండి. తగినంత వెంటిలేషన్ తేమను తగ్గించడానికి మరియు వ్యాధికారక పెరుగుదలను తగ్గించడానికి సహాయపడుతుంది. నీటి ప్రవేశాన్ని నిరోధించడానికి మరియు జంతువుల కోసం పొడి పరుపు ప్రాంతాలను నిర్వహించడానికి పైకప్పులు లేదా గోడలలో ఏవైనా లీకేజీలను మరమ్మతు చేయండి.
జీవ భద్రత, పరిశుభ్రత పద్ధతులు: వ్యాధి వ్యాప్తిని తగ్గించడానికి కఠినమైన బయోసెక్యూరిటీ మరియు పరిశుభ్రత ప్రోటోకాల్ను నిర్వహించండి. ఇందులో ఇవి ఉన్నాయి:
పరిమితం చేయబడిన యాక్సెస్: వ్యాధికారక కారకాలను ప్రవేశపెట్టే ప్రమాదాన్ని తగ్గించడానికి జంతువుల ఆవరణలోకి సందర్శకులు, అనధికార సిబ్బంది ప్రవేశాన్ని పరిమితం చేయండి.
ఫుట్బాత్లు మరియు హ్యాండ్వాషింగ్: ఎంట్రీ పాయింట్ల వద్ద ఫుట్బాత్లను అమలు చేయండి మరియు జంతువుల ఆవరణలోకి ప్రవేశించే వ్యక్తులందరికీ హ్యాండ్వాష్ సౌకర్యాన్ని అందించండి.
క్రిమిసంహారక: జంతువులతో సంబంధంలోకి వచ్చే పరికరాలు, దాణా తొట్టెలు, నీటి పాత్రలు మరియు ఇతర ఉపరితలాలను క్రమం తప్పకుండా శుభ్రపరచండి మరియు క్రిమిసంహారకం చేయండి.
వ్యర్థ పదార్థాల నిర్వహణ: వ్యాధికారక క్రిములను సంతానోత్పత్తి ప్రదేశంగా ఉపయోగపడే సేంద్రియ పదార్థాలు పేరుకుపోకుండా నిరోధించడానికి జంతువుల వ్యర్థాలను సరిగ్గా నిర్వహించండి మరియు పారవేయండి.
నీటి నిర్వహణ: జంతువులకు శుభ్రమైన మరియు కలుషితం కాని నీటి వనరులను నిర్వహించండి. కింది వాటిని పరిగణించండి:
నిలిచిపోయిన నీటిని నిరోధించండి: దోమలు మరియు ఇతర వ్యాధి వాహకాలను ఆకర్షించే విధంగా నిలిచిపోయిన నీరు ఏర్పడకుండా సరైన డ్రైనేజీని నిర్ధారించుకోండి.
క్లీన్ వాటర్ కంటైనర్లు: బ్యాక్టీరియా పెరుగుదల మరియు కలుషితాన్ని నివారించడానికి నీటి కంటైనర్లను క్రమం తప్పకుండా శుభ్రపరచండి మరియు క్రిమిసంహారకం చేయండి.
నీటి వనరుల నాణ్యత: కలుషితాలు లేకుండా మరియు జంతువుల వినియోగం కోసం సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి నీటి వనరుల నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించండి.
టీకాలు వేయడం మరియు నులిపురుగుల నివారణ: మీ జంతు జాతుల నిర్దిష్ట అవసరాలకు మరియు మీ ప్రాంతంలో ప్రబలంగా ఉన్న వ్యాధులకు అనుగుణంగా సమగ్రమైన టీకా, నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని అనుసరించండి. సరైన టీకా, నులిపురుగుల నిర్మూలన షెడ్యూల్ను నిర్ణయించడానికి, సకాలంలో పరిపాలనను నిర్ధారించడానికి పశువైద్యుడిని సంప్రదించండి.
పోషకాహార నిర్వహణ: రోగనిరోధక వ్యవస్థ మరియు జంతువుల మొత్తం ఆరోగ్యానికి తోడ్పడేందుకు బాగా సమతుల్య ఆహారాన్ని అందించండి. అచ్చు పెరుగుదల మరియు మైకోటాక్సిన్ కలుషితాన్ని నివారించడానికి ఫీడ్ పొడి పరిస్థితులలో నిల్వ చేయబడిందని నిర్ధారించుకోండి. ఫీడ్ నాణ్యతను పర్యవేక్షించండి మరియు ఏదైనా చెడిపోయిన లేదా కలుషితమైన ఫీడ్ను విస్మరించండి.
తెగులు, వెక్టర్ నియంత్రణ: వర్షాకాలంలో వృద్ధి చెందే తెగుళ్లు మరియు వ్యాధి వాహకాలను నియంత్రించడానికి చర్యలను అమలు చేయండి. జంతువులకు వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు, ఈగలు, పేలు, ఈగలు మరియు ఇతర తెగుళ్ల ఉనికిని తగ్గించడానికి తగిన పురుగుమందులు మరియు వికర్షకాలను ఉపయోగించండి.
పర్యవేక్షణ మరియు ముందస్తు గుర్తింపు: ఆకలి తగ్గడం, నీరసం, ప్రవర్తనలో మార్పులు, శ్వాసకోశ బాధ లేదా అతిసారం వంటి ఏదైనా అనారోగ్య సంకేతాల కోసం జంతువులను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. వ్యాధులను ముందస్తుగా గుర్తించడం వలన సత్వర పశువైద్య జోక్యం, తగిన చికిత్స ప్రోటోకాల్ల అమలుకు వీలు కల్పిస్తుంది.
వెటర్నరీ కేర్: వ్యాధి నివారణ, రోగ నిర్ధారణ మరియు చికిత్సపై మార్గదర్శకత్వం అందించగల పశువైద్యునితో మంచి పని సంబంధాన్ని ఏర్పరచుకోండి. జంతువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు తలెత్తే ఏవైనా ఆరోగ్య సమస్యలను వెంటనే పరిష్కరించడానికి రెగ్యులర్ వెటర్నరీ చెక్-అప్లు మరియు సంప్రదింపులు అవసరం.
రికార్డ్ కీపింగ్: టీకాలు, నులిపురుగుల నిర్మూలన, చికిత్సలు మరియు ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా సంఘటనల యొక్క ఖచ్చితమైన మరియు నవీకరించబడిన రికార్డులను నిర్వహించండి. జంతువుల ఆరోగ్య పోకడలను పర్యవేక్షించడానికి, వ్యాధి వ్యాప్తిని ట్రాక్ చేయడానికి మరియు సమర్థవంతమైన వ్యాధి నిర్వహణను సులభతరం చేయడానికి ఈ రికార్డులు విలువైనవి.
ఈ నివారణ చర్యలను అమలు చేయడం ద్వారా, జంతువుల యజమానులు, సంరక్షకులు వ్యాధి వ్యాప్తి ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు మరియు వర్షాకాలంలో జంతువుల శ్రేయస్సును ప్రోత్సహిస్తారు. సరైన జంతు ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని నిర్వహించడానికి క్రమమైన పర్యవేక్షణ, సకాలంలో పశువైద్య సంరక్షణ, మంచి పరిశుభ్రత పద్ధతులకు కట్టుబడి ఉండటం చాలా అవసరం. దీ
డా. ఎస్.వంశీ కృష్ణ, ఖ.ఙ.ఐబీ., ఆనీ.ఈ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఞ హెడ్, వెటర్నరీ మైక్రోబయాలజీ విభాగం, పశు వైద్య కలశాల, మమ్నూర్, వరంగల్, పి.వి.నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం, తెలంగాణ మొబైల్: 8712908696
భారత దేశం వ్యవసాయక దేశం. అనాదిగా మన ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఒకప్పుడు 90 శాతానికి పైగా ప్రస్తుతం 60 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధరంగాలలో కొనసాగుతున్నారు. సగానికి పైగా ప్రజలు మన దేశంలో వ్యవసాయ రంగంలో కొనసాగుతున్నా కూడా ఎంతమంది తమ పంటల సాగులో లాభాలు పొందుతున్నారు? అని అడిగితే అతితక్కువమంది రైతులు మాత్రమే తమ పంటల సాగుని లాభదాయకంగా కొనసాగిస్తున్నాము. ఎక్కువమంది వ్యవసాయంలో నష్టాలను భరించవలసి వస్తుందనే సమాధానం వస్తుంది. నష్టాలను భరిస్తూ పంటల సాగును ఎలా కొనసాగిస్తున్నారా అనే సందేహం రావచ్చు. ప్రతి రైతుకు తప్పనిసరిగా ఆశ ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా రాబోవు పంటకాలాలలో లాభాలు రాకపోవా అనే ఆశతో లేదా కొంతమంది గత్యంతరం లేక పంటల సాగుని కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. ఎక్కువమంది రైతులు వ్యవసాయంలో లాభాలు పొందలేకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ఏవిధమైన కారణాలు ఉన్నా కాని ప్రస్తుత పంటలసాగు రైతులందరికి లాభదాయకంగా లేదనే విషయం అక్షర సత్యం. ఈ సమస్యకు పరిష్కారం కొరకు మరియు తమ వ్యవసాయాన్ని లాభల బాటలో నడిపించడం కొరకు రైతు ప్రతినిత్యం ఆలోచిస్తూ, అన్వేషిస్తూ ఉంటాడు. ఈ ఆలోచనల, అన్వేషణల ఫలితంగా వివిధ రకాల పరిష్కార మార్గాలైన పెట్టుబడులు తగ్గించుకోవడం, కూలీ ఖర్చులు తగ్గించుకోవడం, పంట ఉత్పత్తులకు విలువ జోడించటం, పంట ఉత్పత్తులను సొంతంగా మార్కెట్ చేసుకోవడం, కొత్త పంటలవైపు ఆలోచనలు చేయడము లాంటి వివిధ రకాల పరిష్కార మార్గాలు రైతుల మెదడులో మొలుస్తుంటాయి. ఇన్ని రకాల పరిష్కార మార్గాలలో కొత్త పంటల విధానం గురించి ఎక్కువ మంది రైతులు మొగ్గుచూపిస్తుంటారు. దాని ఫలితమే ఔషధ పంటలు, అడవి ఆముదము, దూలగొండి, టేకు, శ్రీగంధం, చందనం, యాపిల్ బేర్, తైవాన్ జామ లాంటి వివిధ రకాల కొత్త పంటలు రావడము, కొన్నింటిలో రైతులు చేతులు కాల్చుకోవడం అందరికీ తెలిసిందే. ఈ కొత్త పంటలను సాగు చేయాలంటే మొక్కలు లేదా విత్తనాలకు మరియు మౌలిక వసతులకు ఎకరానికి యాభై వేలకు మించి, కొన్నింటికయితే ఎకరానికి ఇరవై వేల రూపాయలలోపే పెట్టుబడులు పెట్టవలసి రావచ్చు. కాని ఇటీవల వచ్చిన కొత్త పంటలు డ్రాగన్ ఫ్రూట్ మరియు ఖర్జూర పంటలు సాగు చేయాలంటే మాత్రం ఎకరానికి సుమారు 5 లక్షల వరకు పెట్టుబడి అవసరం పడుతుంది. అంత ఎక్కువ ఖర్చు పెట్టి డ్రాగన్ఫ్రూట్, ఖర్జూర లాంటి పంటల సాగు మొదలు పెట్టాలంటే ఒక సాధారణ రైతుకు సాధ్యమయ్యే పని కాదు అనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఆర్థిక స్తోమత కలిగిన రైతులు ఈ పంటల సాగును మొదలు పెడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మంచి పరిణామమే అని చెప్పవచ్చు. అంత పెట్టుబడి పెట్టి కొంతకాలం వేచిచూసి దిగుబడి వచ్చిన తరువాత, వచ్చిన దిగుబడిని మార్కెటింగ్ చేసిన తరువాత మాత్రమే ఆ పంట రైతులకు లాభసాటిగా ఉంటుందా? లేదా? అనే విషయాలను తెలియచేయడానికి, అలాంటి ఖర్చుతో కూడుకున్న కొత్త పంటలను సాగు చేయటానికి కొంతమంది అభ్యుదయ రైతులు ముందుకు వచ్చి డ్రాగన్ ఫ్రూట్, ఖర్జూర లాంటి పంటలు సాగు చేస్తున్నారు. ఈ కోవకే చెందుతాడు నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన శ్రీనివాసరెడ్డి.
శ్రీనివాసరెడ్డిది వ్యవసాయ నేపథ్యం. వారి తండ్రి, తాతల దగ్గర నుంచి వ్యవసాయం ప్రధాన వృత్తిగా చేసుకుని జీవితాలను కొనసాగిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి చిన్న తనం నుండి వ్యవసాయంలో తన వంతు పాత్రను పోషిస్తూ ఉండేవాడు. ఉన్నత చదువులు చదివిన శ్రీనివాస రెడ్డి ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగ బాధ్యతలలో చేరి ఇప్పటికి 31 వ సంవత్సరాలు పూర్తి అయ్యింది. బ్యాంకులో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా తన మనసులో తన ప్రధాన వృత్తి వ్యవసాయం గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. తాను త్వరలో ఉద్యోగ విరమణ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ విరమణ తరువాత తన పూర్తి సమయాన్ని వ్యవసాయ రంగంలో గడపాలనే ప్రణాళిక వేసుకుని అందుకు అనుగుణంగా అడుగులు వేయడం గత నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించాడు. తమకు సొంత భూమి ఉంది, చిన్నతనం నుండి పంటల సాగులో అనుభవం ఉంది కాబట్టి తన అనుభవాన్ని ఉపయోగించుకుని భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో స్థిరపడాలనే తలంపుతో వివిధ రకాల పంటల సాగు గురించి విచారించడం, క్షేత్రస్థాయి పరిశీలన చేయడం మొదలు పెట్టి వివిధ ప్రాంతాలలో, వివిధ రకాల పంటలను పరిశీలించిన తరువాత ఖర్జూర (డేట్స్) పంటను సాగు చేయాలనే నిర్ణయానికి వచ్చి అందుకు సంబంధించిన రైతులను కలిసి, ఖర్జూర పంటను పరిశీలించి తాను సేకరించిన సమాచారంతో ఖర్జూర పంట వేయాలని 2019 వ సంవత్సరములో నిర్ణయించుకుని 2019వ సంవత్సరం ఆగస్టు నెలలో ఖర్జూర మొక్కలు నాటించాడు. తరువాత డ్రాగన్ ఫ్రూట్ గురించి కూడా ఆలోచించి 2022 వ సంవత్సరములో డ్రాగన్ ఫ్రూట్ సాగును కూడా మొదలు పెట్టాడు.
ఖర్జూర: 10 ఎకరాలలో ఖర్జూర (డేట్స్) పంట సాగులో ఉంది. ఇందుకు గాను ఒక్కొక్క మొక్క 4250/- చొప్పున కొనుగోలు చేసి 2019వ సంవత్సరం ఆగస్టు నెలలో ఎకరానికి 76 మొక్కలు (ఆడ మొక్కలు+మగ మొక్కలు కలిపి) చొప్పున 10 ఎకరాలకు గాను 760 మొక్కలు నాటించాడు. ఖర్జూరలో చాలా రకాలు ఉన్నాయి కాని వీరు మాత్రం ఫ్రెష్ ఫ్రూట్ రకాలు అయిన బర్హి మరియు ఎలైట్ మొక్కలను ఎంపిక చేసుకుని నాటించాడు. ఎకరానికి 76 మొక్కల చొప్పున వచ్చేలా గుంతలు తీయించి మొక్కలు నాటించాడు. పశువుల ఎరువులో వేరు పురుగు సమస్య ఉంది కాబట్టి, ఆ పురుగులు లేత మొక్కలను తిన్నట్లయితే మొక్కలు చనిపోయే ప్రమాదం ఉందని భావించి గొర్రెల ఎరువును గుంతలలో వేయించాడు. ఒకవేళ వేరు పురుగులు లేత మొక్కలను పాడు చేసినా కూడా మొక్కలు చనిపోకుండా ఎదుగుదల తగ్గి మరుసటి సంవత్సరం ఇగురు పెట్టడం తాను ప్రత్యక్షంగా చూడడం జరిగిందని శ్రీనివాసరెడ్డి వివరించాడు. ఖర్జూర ఎడారి జాతి మొక్క కాబట్టి పోషకాలు మరియు చీడపీడల విషయంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు. కాని రెడ్ వీవిల్ పురుగు బయటకు కనిపించకుండా చెట్టులోపల గుడ్లు పెట్టి చెట్టును పాడు చేస్తుంది. మనం ఊహించకుండానే ఒక రోజు చెట్టు విరిగి పడిపోతుంది. ఈ పురుగును కనిపెట్టడం చాలా కష్టం. చెట్టు మొదలులో పదార్థం తింటూ చిన్న శబ్దం చేస్తుంది. జాగ్రత్తగా పరిశీలిస్తేనే మనం ఆ పురుగు చేసే శబ్దాన్ని వినవచ్చు. ఈ శబ్దాన్ని కుక్కలు కనిపెట్టి అక్కడ ఏదో ఉన్నట్లు పురుగు ఆశించిన చెట్టు వద్ద కుక్కలు తవ్వుతూ ఉంటాయి కాబట్టి ఆ పురుగును నివారించవలసి అవసరం ఎంతైనా ఉందని శ్రీనివాసరెడ్డి వివరించాడు. ఖర్జూర పండ్ల సాగులో పరపరాగ సంపర్కము చాలా ముఖ్యం కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు బాక్స్ చూడగలరు.
మొక్కలు నాటిన మూడవ సంవత్సరం అంటే గత సంవత్సరం 10 ఎకరాల నుంచి 1000 కిలోల దిగుబడి పొందాడు. ఈ సంవత్సరం అంటే మొక్కలు నాటిన నాలుగవ సంవత్సరం పది ఎకరాల నుంచి 10 టన్నుల పైగానే దిగుబడి పొంది కిలో 130/-ల చొప్పున అమ్మకం చేశాడు. మొక్కల వయస్సు పెరిగే కొలది దిగుబడి పెరుగుతుంది. దానికి తోడు ఈ మొక్కల జీవితకాలం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని శ్రీనివాసరెడ్డి వివరిస్తున్నాడు.
డ్రాగన్ఫ్రూట్: శ్రీనివాసరెడ్డి గారు ఖర్జూర (డేట్స్)తో పాటు 13 ఎకరాలలో డ్రాగన్ ఫ్రూట్ సాగును కొనసాగిస్తున్నాడు. ఇందులో మూడు ఎకరాలు ఖర్జూరలో అంతరపంటగా మరియు 10 ఎకరాలలో ఏక పంటగా డ్రాగన్ ఫ్రూట్ని సాగు చేస్తున్నారు. లైనుకి లైనుకి 12 అడుగులు, మొక్కకు మొక్కకు 10 అడుగుల దూరం పాటించి సిమెంటు స్థంభాలను ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క స్థంభానికి నాలుగు మొక్కల చొప్పున నాటించాడు. పాదులలో పశువుల ఎరువు చాలా ఎక్కువగా వేయించి ఎత్తు పాదులలో డ్రాగన్ మొక్కలు నాటించాడు. నీటి వసతి కొరకు డ్రిప్ ఏర్పాటు చేసుకున్నాడు. చాలామంది రైతులు అంటే మొదటలో డ్రాగన్ ఫ్రూట్ సాగు మొదలు పెట్టిన రైతులు స్థంభం పైన టైరు ఏర్పాటు చేసుకుని ఆ టైరులో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెరిగేలా ఏర్పాటు చేసుకున్నారు కాని అనుభవం పెరిగే కొలది డ్రాగన్ ఫ్రూట్ సాగు పద్ధతులలో అనేక మార్పులు సంభవించాయి. ఇంకా సంభవిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా స్థంభం పైన టైరును కాకుండా సిమెంటు రింగులను శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేయించాడు. డ్రాగన్ ఫ్రూట్ మొక్కకు కొమ్మలు చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఎక్కువ కొమ్మల బరువుకు టైరు తట్టుకోలేదు కాబట్టి సిమెంటు రింగులను ఏర్పాటు చేసుకున్నాడు.
మొక్కలు నాటిన ఎనిమిది, తొమ్మిది నెలలలో మొదటి పంట వచ్చింది కాని చాలా తక్కువగా వచ్చింది. ప్రస్తుతానికి రెండవ సంవత్సరం దిగుబడి పొందుతున్నాడు. అంటే మొక్కలు నాటిన 20 నెలలకు రెండవ పంట దిగుబడిని పొందుతున్నాడు. జులై 15 వరకు పది ఎకరాలకు గాను 10 టన్నుల వరకు దిగుబడి పొందడము జరిగింది. ప్రస్తుతం పంట పూత మరియు చిన్న మొగ్గ థలో ఉంది. శ్రీనివాస రెడ్డి సాగు చేసే రకం సియాన్ రెడ్ రకం. ఈ రకం దిగుబడి మొత్తం ఒకేసారి కాకుండా దఫాలు దఫాలుగా వస్తుంది. ప్రస్తుత పంటను గమనించినట్లయితే ఎకరానికి ఇంకా 4 టన్నుల వరకు దిగుబడి పొందే అవకాశం ఉంది. అంటే రెండవ సంవత్సరం ఎకరానికి 5 టన్నుల దిగుబడి పొందవచ్చు అని శ్రీనివాసరెడ్డి చెబుతున్నాడు.
మార్కెటింగ్ విషయానికొస్తే తాను పొందిన దిగుబడి మొత్తాన్ని సొంతంగా దారి పక్కన పండ్లు అమ్మేవారికి, కాలనీలలో, అపార్టమెంట్లలో కిలో 120/-లకు తగ్గకుండా అమ్మకం చేస్తున్నాడు. వచ్చిన దిగుబడిని అమ్మకం చేసుకోవడంలో శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదు. ఇకముందు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉండవు అనే ఆశాభావంతో ఉన్నాడు. ప్రస్తుతం గిరాకి తగ్గట్లుగా పండ్లు అందుబాటులో ఉండడం లేదు కాబట్టి కొన్ని సమయాలలో వియత్నాం నుండి డ్రాగన్ ఫ్రూట్ పండ్లను దిగుమతి చేసుకుంటున్నారు. మన దగ్గర కూడా సాగు విస్తీర్ణం పెరిగి పండ్లు అందుబాటులోకి వస్తే వియత్నాం నుంచి దిగుమతి చేసుకోవలసిన అవసరం లేకపోగా, మొదట ఖర్చు చేసిన పెట్టుబడులు సాధించిన తరువాత డ్రాగన్ ఫ్రూట్ రైతులు ధరలు తగ్గించే అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ సాగుకు మంచి భవిష్యత్ ఉందని శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడుతున్నాడు.
రుచి విషయానికొస్తే డ్రాగన్ ఫ్రూట్లో రెండు రకాలు ఉన్నాయి. వైట్ పల్ప్ మరియు పింక్ పల్ప్. తాను పింక్ పల్ప్ రకాన్ని సాగు చేస్తున్నాను కాబట్టి ఇది మంచి రుచిగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ని రుచి కోసం కాకుండా ఆరోగ్యం కోసం తినాలని, ప్రపంచం మొత్తం అదే విధంగా తింటున్నారు కాబట్టే ప్రపంచం మొత్తం డ్రాగన్ ఫ్రూట్ అందుబాటులో ఉంటుందని శ్రీనివాసరెడ్డి వివరించాడు.
ఖరీదైన పంటలు పెద్ద మొత్తంలో అంటే 20 ఎకరాలకు గాను కోటి రూపాయలకు పైగా పెట్టిబడి పెట్టి డ్రాగన్ ఫ్రూట్ మరియు ఖర్జూర పంటలను సాగు చేస్తూ, వీటి సాగులో ఉన్న సాధకబాధకాలను తోటి రైతులకు తెలియచేయడంతోపాటు తన పదవీ విరమణ తరువాత ఆరోగ్యకర వ్యాపకం కోసం ఈ పంట సాగును శ్రీనివాసరెడ్డి ఎంపిక చేసుకొని కొనసాగిస్తున్నాడు. మరిన్ని వివరాలు 99491 11198 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
పరపరాగ సంపర్కము
ఈ రకం ఖర్జూరాలో మగ మొక్కలు మరియు ఆడ మొక్కలు విడివిడిగా ఉంటాయి కాబట్టి 10 శాతం మగ మొక్కలు ఉండేలా మొక్కలు నాటుకుంటున్నారు. శ్రీనివాసరెడ్డి కూడా అదే నిష్పత్తిలో 10 శాతం మగ మొక్కలు నాటించాడు. మగ మొక్క నుంచి పూలు విచ్చుకొనే సమయంలో పరిశీలించి పుప్పొడిని సేకరించి ఆడ మొక్కలలోని పూలకు నైపుణ్యంతో అద్దవలసి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఏ మాత్రం తేడా వచ్చినా అంటే సేకరించిన పుప్పొడిని అద్దలేకపోతే కాయలు చిన్నవిగా ఉండి అందులో విత్తనం తయారవదు. అవి తినటానికి పనికిరావు. ఆడ మొక్కల పూవులలోని అన్ని పూవులకు పుప్పొడిని అద్దలేకపోయినట్లయితే పుప్పొడి తగిలిన కాయలలో విత్తనం తయారయ్యి ఆ కాయలు లావుగా అయ్యి తినటానికి తీపిగా ఉంటాయి. ఆడ పువ్వులు గెలలోని అన్ని కాయలకు పుప్పొడి అద్దినట్లయితే గెలలోని అన్ని కాయలలో విత్తనం ఉత్పత్తి అయ్యి, కాయలు లావుగా ఉండి మంచి రుచిని కలిగి ఉంటాయి. ఈ మొక్కలలో పరపరాగ సంపర్కము అతి కష్టమయినది కాబట్టి రైతులు ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా తగిన జాగ్రత్తలతో పుప్పొడిని సేకరించవలసి ఉంటుంది. కొన్ని సార్లు పుప్పొడి సరిపోనట్లయితే వేరే రైతుల వద్ద నుంచి పుప్పొడిని కొనుగోలు చేసుకుని ఉపయోగించవలసి ఉంటుంది. గత సంవత్సరం శ్రీనివాస రెడ్డి గుజరాత్లోని ఒక రైతు వద్ద నుంచి కొనుగోలు చేయడం జరిగిందని వివరించాడు. తేనెటీగల వలన ఖర్జూర పంటలో పెద్దగా ఉపయోగం లేకపోగా తేనెటీగలు పుప్పొడిని సేకరించుకొని పోతాయి కాబట్టి తేనెటీగల వలన పుప్పొడి కోల్పోవలసి రావచ్చు అని శ్రీనివాసరెడ్డి వివరించాడు. మగ మొక్కల నుంచి పుప్పొడి ఉత్పత్తి అయ్యే సమయములో మరియు పుప్పొడిని ఆడపూలపై అద్దే సమయములో భారీ వర్షాలు పడినట్లయితే పంటను నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖర్జూర సాగు రిస్కుతో కూడుకున్న పంట అని శ్రీనివాసరెడ్డి వివరిస్తున్నాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జూన్ ఆఖరి వారంలో అరకొర వర్షాలు. జూలై మొదటి పక్షంలో కూడా వర్షాలు ముఖం చాటేసాయి. జూలై మధ్య నుండి తెలంగాణాలో విపరీతమైన ఎడతెరిపి లేని వానలు. తద్వారా వరదలు, ఉత్తరాంధ్రలో విపరీత వర్షాలు. మధ్యాంధ్రలో సాధారణ వర్షాలు. దక్షిణాంధ్రలో తక్కువ వర్షాలు. అనంతపురం జిల్లాలో వర్షాలు రాక వాటి కోసం ప్రార్థనలు. వర్షాధార పంటలు విత్తడం జూన్, జూలై నెలల్లో సరిగా జరగలేదు. ఈ పరిస్థితుల్లో ఆగస్టు (పుష్యమి తొలి రోజులు, ఆశ్లేష, మఖ కార్తెలు)లో వివిధ పంటల్లో చేయవలసిన పనులను గురించి…
టమాట: ధరలు విపరీతంగా పెరిగినాయి. ఆగస్టు నెలలో కూడా అధిక ధరలే ఉండే అవకాశముంది. అధిక వర్షాలు, మేఘావృత వాతావరణం, వరదలు, ఈ పంట దిగుబడి తగ్గిపోవడానికి తద్వారా ధరలు ఎక్కువగా ఉండడానికి కారణమవుతున్నాయి. దేశమంతా ఇదే పరిస్థితి ఉన్నందున ధరలు ఎక్కువగానే కొనసాగవచ్చు. పొడి వాతావరణం, టమాట విస్తీర్ణత పెంపు, వర్షాధారపు పంట అందుబాటులోకి వస్తే ధరలు తగ్గుతాయి.
మిరప: ఈ పంట ధరలు కూడా బాగా అధికంగా ఉన్నాయి. కొత్త పంట వర్షాకాలంలో విత్తిన పంట చేతికొచ్చే దాకా వీటి ధరలు అధికంగానే ఉండే అవకాశం. మంచి రకాలు : ఎల్.సి.ఏ-424, ఎల్.సి.ఏ-436, ఎల్.సి.ఏ-620, ఎల్.సి.ఏ-625. కాశీఅభ: ఈ రకం బహుళ ప్రాచుర్యం పొందుతున్నది. ఆకుమచ్చ, ఆకుముడత, రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది. ఘాటు ఎక్కువగా ఉంటుంది. పచ్చిమిర్చికి అనువైనది. ఎగుమతికి కూడా మంచి అనుకూలం. ఇవి కాక పలు ప్రైవేట్ కంపెనీల విత్తనాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఆగస్టు నెలలో నారుపోయవచ్చు. ప్రధాన పొలంలో నేరుగా విత్తవచ్చు. నారుమడిలో సస్యరక్షణ, ప్రధాన పొలం తయారు చేసి విత్తుట, నాటుట, మొ|| పనులు ఆగస్టులో ఉంటాయి.
వంగ: ఆగస్టులో ఈ పంట నాటవచ్చు. ఆయా ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉన్న రకాలను ఎంపిక చేసుకొని నాటితే మంచి మార్కెట్ ఉంటుంది. ఆగస్టులో కూడా ఈ పంట ధరలు ఎక్కువగానే ఉండే అవకాశముంది.
క్యాబేజి, కాలీఫ్లవర్, క్యారట్, బీట్రూట్: ఈ పంటలను ఆగస్టు నెలలో విత్తవచ్చు. ఈ పంటల ధరలు కూడా ఆగస్టులో సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశముంది.
బీర, బూడిదగుమ్మడి: ఈ పంటలను ఆగస్టు మొదటి పక్షం వరకు విత్తి అధిక దిగుబడి పొందవచ్చు. వీటి ధరలు కూడా ఆగస్టులో సాధారణం కంటే అధికంగా ఉండే అవకాశముంది.
వరి: భారతదేశం వరి ఎగుమతులు ఆపినందున, ప్రపంచమంతా సన్న బియ్యానికి కొరత ఏర్పడింది. వలస వెళ్ళిన భారతీయులు 3 రెట్లు ఎక్కువ ధర పెట్టి కొనాలన్నా సన్న బియ్యం అమెరికా వంటి దేశాల్లో దొరకుట లేదు. అధిక వర్షాలకు నిండిన రిజర్వాయర్ల నీటిని సద్వినియోగ పరచుకొని సన్న బియ్యాన్ని దండిగా పండించి ప్రపంచానికి సప్లయి చేయడం వలన మన రైతులు లాభపడతారు. సన్నబియ్యం పండించడానికి రైతులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. నార్లు రెడీగా ఉన్న రైతాంగం వెంటనే ప్రధాన పొలం తయారు చేసి నాట్లు వేయాలి. ఎంత లేత నారు నాటితే అంత దిగుబడి పెరుగుతుంది. నాట్లు పెట్టిన వారు అధిక వర్షాలకు ముంపుకు గురై ఉంటే వర్షం నీరు త్వరగా వెళ్ళిపోయేటట్లు గట్లు కొద్దిగా తెగ్గొట్టాలి. మురుగు నీరు త్వరగా వెళ్ళేటట్లు ఇది తోడ్పడుతుంది. మొక్కలు బతికే ఉంటే సేంద్రియ విధాన పంటలో విత్తిన 40-60 రోజుల వయస్సున్న వరికి 5 లీటర్ల ద్రవజీవామృతం 100 లీటర్ల నీటికి కలిపి ఎకరా పొలంలో పిచికారి చేయాలి. 60-90 రోజుల పంటకు 10 లీ. జీవామృతం 100 లీ. నీటికి కలిపి ఎకరా పొలంలో పిచికారి చేయాలి. ఇది సాధారణ పరిస్థితుల్లో చేసే పిచికారీలకు అదనం. మొక్కలు పాడయిన చోట తిరిగి వరి పండించాలంటే లేక కొత్త పొలంలో వరి పండించాలంటే స్వల్ప, లేక మధ్యకాలిక రకాలను విత్తాలి. మొలకెత్తిన విత్తనాలను ప్రధాన పొలంలో నేరుగా వెదజల్లే పద్ధతితో గానీ, డ్రమ్ సీడర్నుపయోగించి గానీ విత్తాలి. ఇలా చేస్తే, నారు పెంచి నాటిన పంటకంటే వారం రోజులు ముందే కోతకొస్తుంది. వెదజల్లే పద్ధతిని అనుభవమున్న రైతులే చేపట్టాలి. అనుభవం లేకపోతే నారు సరిగా అతకదు. నారు సరిగా మొలవదు. పంట సరిగా రాదు. అనుకూలమైన సన్నరకాలు: తెలంగాణ సోన (ఆర్.ఎన్.ఆర్-15048), బిపిటి-5204 (సాంబమసూరి) ఈ రకాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. నూతన సన్న గింజ రకాలు: ఆంధ్రప్రదేశ్కు: ఎం.టి.యు-1280, 135 రో. 28 క్వి/ఎ, సుజాత (ఎం.టి.యు-1210): 135 రో, 26-28 క్వి/ఎ, తెలంగాణకు: తెలంగాణ వరి-3 (జె.జి.ఎల్-21078): 120 రో. 32-34 క్వి/ఎ. తెలంగాణ వరి-2 (డబ్లు.జి.ఎల్-697):135 రో., 28-32 క్వి/ఎ. కూనారమ్ రైస్-1(కె.ఎన్.ఎమ్-733): 120 రో. 28-30 క్వి/ఎ.
ప్రత్తి: విపరీత వర్షాలు కురిసిన చోట ప్రత్తి పంట బాగా దెబ్బతిన్నది. ఎక్కువైన నీరు పల్లానికి వెళ్లేటట్టు నీటికడ్డంగా ఉన్న మట్టిని పారలతో తొలగించాలి. సేంద్రియ వ్యవసాయంలో 10-15 లీ. జీవామృతాన్ని 150-200 లీ. నీటితో కలిపి మొక్కలపై పిచికారి చేయాలి. ఇది సాధారణ పరిస్థితుల్లో పిచికారీ చేసే దానికి అదనం. భూమిపై పొర కొద్దిగా ఆరిన తర్వాత అంతరకృషికి బ్యాటరీతో నడిచే మినీట్రాక్టర్లను వాడవచ్చు. దీనివలన ఖర్చు బాగా తగ్గుతుంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్లో వర్షాధారంగా, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆగస్టులో విత్తడం అలవాటు. నల్లభూముల్లో ఎక్కువ దిగుబడి వస్తుంది. మిగతా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో ఈ నెలలో ప్రత్తి విత్తరాదు. పురుగులు, రోగాలు అధికం. పంట దిగుబడి తక్కువ. మే నెలాఖరు నుండి జూన్, జూలై నెలల్లో విత్తిన ప్రత్తిలో అంతర సేద్యం, కలుపు నివారణ పైపాటి ఎరువులు వేయుట, సస్యరక్షణ ఆగస్టులో చేపట్టాల్సి ఉంటుంది. ఆగస్టు నెలలో బెట్ట పరిస్థితులేర్పడితే, వీలయిన చోట తడి ఇస్తే దిగుబడి పెరుగుతుంది.
రాగి: ఆగస్టు చివరి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పంటను విత్తుకోవచ్చు. అనుకూలమైన రకాలు: ఖరీప్, రబీ, వేసవిలలో (అన్ని కాలాలలో) పండి అధిక దిగుబడినిచ్చే రకాలు. భారతి: 12-16 క్వి/ఎ, 105-115 రోజులు, తిరుమల: 14-15 క్వి/ఎ, 115-120 రోజులు, చొప్ప దిగుబడి ఎక్కువ. సువర్ణముఖి: 14-15 క్వి/ఎ, 105-110 రోజులు, వరి మాగాణులకు అనుకూలం. పంట చివరి థ బెట్టను తట్టుకుంటుంది. ఇంద్రావతి: 14-15 క్వి/ఎ. 115-120 రోజులు, కాల్షియం, ఐరన్, జింకు ఎక్కువ. నారు పెంచి నాటుకోవచ్చు. నేరుగా ప్రధాన పొలంలో విత్తుకోవచ్చు. రాగి మద్దతు ధర: రూ. 3846/క్వి.
సోయాచిక్కుడు: కోస్తాంధ్రా ప్రాంతంలో ఈ పంటను ఆగస్టు-సెప్టెంబరులలో కూడా విత్తవచ్చును. మిగతా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ నెలలో విత్తరాదు. దిగుబడి బాగా తక్కువ. అధిక వర్షాలకు దెబ్బతిన్న ఖరీఫ్ సోయా పంటను కాపాడడానికి, మచ్చతెగుళ్ళ నివారణకు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పసుపురంగు సోయాబీన్ మద్దతు ధర రూ. 4600/క్వి.
ప్రొద్దు తిరుగుడు: ఈ పంటను బరువైన నేలల్లో ఆగస్టు కడ వరకు విత్తి మంచి దిగుబడులు పొందవచ్చు. ప్రొద్దుతిరుగుడు విత్తనాల మద్దతు ధర రూ. 6760/క్వి. ఎక్కువ దిగుబడినివ్వగల్గిన ప్రైవేట్ కంపెనీల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. జూలైలో విత్తిన పొద్దు తిరుగుడు పంటలో అంతర సేద్యం, కలుపు నివారణ, పైపాటి ఎరువులు వేయుట, కాలువలు, బోదెలు ఏర్పాటు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. జూన్లో విత్తిన పంటలో బెట్ట పరిస్థితులొస్తే తడి ఇవ్వాలి. చిలుకలు తిని పోకుండా కాపాడాల్సుంటుంది. శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, తామర పురుగులకు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎకరాకు 400 గ్రా. బోరాక్స్ 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేస్తే గింజల దిగుబడి బాగా పెరుగుతుంది.
నువ్వులు: తెలంగాణాలో నువ్వు పంటను ఆగస్టు రెండవ పక్షంలో విత్తి అధిక దిగుబడి పొందవచ్చు. భూమి తయారీ, ఎరువులు వేసి విత్తుట ఆగస్టులో పూర్తి చేయాలి. అనుకూలమైన రకాలు: జగిత్యాల తిల్-1 (జె.సి.ఎస్-1020), తెల్లగింజ. వానాకాలంలో నిదానంగా విత్తిన పంట. దిగుబడి 280-300 కిలోలు/ఎ. 85-90 రోజుల పంట. శారద (ఎలమంచిలి-66): లేత గోధుమ రంగు విత్తనాలతో ఎకరాకు 600 కిలోల వరకు దిగుబడి నిస్తుంది. 80-90 రోజుల పంట. నువ్వుల మద్దతు ధర: రూ. 8635/క్వి. మే లో విత్తిన నువ్వు పంట ఆగస్టులో కోతకొస్తుంది.
చెరకు: చెరకు పంట కాలం మరియు ఎదుగుదలను బట్టి జడచుట్లు ఆగస్టు నెలలో వేయాల్సి ఉంటుంది. ఈ నెలలో దూదేకుల పురుగులు ఎక్కువగా ఉండే అవకాశమున్న చోట తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తెలంగాణలో అడ్సాలి పంటగా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో చెరకు నాటవచ్చు. బడ్చిప్ పద్ధతిలో నాటితే విత్తనపు ఖర్చు నాలుగింట మూడువంతులు ఆదా అవుతుంది. ఈ పద్ధతిలో ముచ్చెలకు బదులుగా, చెరకు కన్నులను యంత్ర సహాయంతో వేరు చేసి విత్తనంగా వాడుతారు. కన్నులు తీయగా మిగిలిన చెరకును బెల్లం లేదా చక్కెర తయారీకి, మామూలుగా వాడవచ్చు. నీటి ముంపుకు గురైన చెరకు పంట నుండి అధిక నీటిని వీలయినంత త్వరగా తీసెయ్యాలి. పసుపునల్లి, పొలుసుపరుగు, దూదేకుల పురుగు (స్పైరెల్లా) తెల్లపేను (ఊలి ఎఫిడ్), తెల్లనల్లి, రసంపీల్చు పురుగుల ఉధృతి తగ్గడానికి చెరకుపై పక్కన ఉన్న 8 ఆకులను మిగిల్చి క్రింది ఆకులన్నింటినీ జడవలె చుట్టుకోవాలి. అవసరాన్ని బట్టి పురుగుల నదుపు చేయడానికి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
అందివచ్చిన మహదవకాశం – వదలుకోవద్దు: చెరువుల్లో, బావుల్లో రిజర్వాయర్లలో పుష్కలంగా నీరు. సన్న బియ్యానికి కూరగాయలకు ప్రపంచమంతా మంచిధరలు. రైతులు రైతు సంఘాలను ప్రోత్సహించి, ఈ పంటలను ఎక్కువగా పండించేటట్లు ప్రోత్సహించిన పార్టీలకు రైతుల్లో మంచి పేరు, పలుకుబడి వస్తుంది. దండిగా ఓట్లు వచ్చే అవకాశం. రైతు సంఘాల ద్వారా వడ్లను మరపట్టించి బియ్యంగా తయారు చేయడానికి ప్రోత్సాహకాలనందిస్తే, ఎగుమతి చేయడంలో రైతు సంఘాలకు సహకరిస్తే, రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునే దానికి బాగా వీలవుతుంది. మధ్యవర్తులు, దళారీలు పొందే లాభాలను రైతులకే అందించడానికి ఈ పద్దతి బాగా సహకరిస్తుంది.
ప్రతి పల్లె, జనావాసంలో రైతు ప్రజా సంఘాల ఏర్పాటుకుకనీస సపోర్టు ఇస్తే ఆర్థికంగా వారే ఎదగడానికి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులకు ఉత్పత్తిదారులకు అనుసంధానం ఏర్పడి, వినియోగదారులకు తక్కువ ధరల్లో పంటల ఉత్పత్తులు అందడానికి వీలవుతుంది. ఉత్పత్తి చేసే రైతులకు కూడా కొద్దిగా ఎక్కువ ఆదాయం వచ్చే దానికి వీలవుతుంది. అట్టడుగు ఆదాయం కల్గిన పట్టణ, గ్రామీణ ప్రజలందరి ఉన్నతికి, అభివృద్ధికి బాగా తోడ్పడుతుంది. ఈ పాలసీలను ప్రోత్సహించడం వల్ల పార్టీలకేమి ఉపయోగమంటే – ఎన్నికల్లో దండిగా ఓట్లు. దీనిని ఆచరణ సాధ్యం చేయడానికి సలహాలు, సూచనలకు ప్రొఫెసర్ సల్లా నారాయణ స్వామి, ఫోను నెంబరు 9494408619 చైర్మన్, నారాయణ ఫౌండేషన్, హైదరాబాదు. ఇ-మెయిల్: profsnswamy@gmail.com, ఫేస్బుక్: SALLA Narayana Swamy
తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ప్రధాన ఆహార పంట వరి. ఈ మధ్య కాలంలో వరిని సేంద్రియ పద్ధతిలో సాగు చేయటానికి రైతాంగం ఆసక్తి చూపుతున్నారు. దీని ద్వారా రసాయనిక ఎరువులు, పురుగు/తెగుళ్ళ మందుల వినియోగం తగ్గించి భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మరియు నేలలను అందించడమే ముఖ్య ఉద్దేశం. సేంద్రియ వరి సాగులో చీడపీడల యాజమాన్యంలో వివిధ పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ, గత కొన్ని సంవత్సరాలల్లో చేసిన పరిశోధనల ఆధారంగా, అధిక దిగుబడులు సాధించడానికి ఈ క్రింది పద్ధతులను అవలంభించండి.
కాండం తొలుచు పురుగు
నారు కొనలను త్రుంచి నాటుకొన్నట్లయితే గుడ్ల సముదాయాన్ని నివారించడం ద్వారా కాండం తొలుచు పురుగును నివారించు కోవచ్చు, అధికంగా ఉన్న నారును నేలలో కలిపి వేయాలి.
పురుగు ఉధృతి తెలుసుకోవడానికి మరియు నివారణకు ఎకరానికి 40 చొప్పున పక్షి స్థావరాలు, 8 చొప్పున లింగాకర్షక బుట్టలను పెట్టుకోవాలి.
పొలం గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి.
ట్రైకోగ్రామా జపానికం అనే గుడ్డు పరాన్న జీవిని ఎకరానికి 40,000 గ్రుడ్ల సముదాయం ఉన్న కార్డులను మూడు దఫాలుగా నాటిన 20 రోజుల నుండి పొలంలో విడుదల చేసుకొన్నట్లయితే కాండం తొలుచు పురుగును సమర్ధవంతంగా నివారించుకోవచ్చును.
పశువుల పేడ (5 కిలోలు), పశువుల మూత్రం (5 లీటర్లు) 4 రోజులు మురుగ బెట్టిన తర్వాత 150 గ్రాముల సున్నం కలుపుకొని 100 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరా పొలానికి పిచికారీ చేసుకోవాలి (లేదా)
ఆవుమూత్రం, పచ్చిమిర్చి మరియు వేప ఆకుల కషాయం ఎకరానికి 3-4 లీటర్ల కషాయం 100 లీటర్ల నీటిలో కలుపుకొని మొక్కలపై పిచికారీ చేయడం ద్వారా కాండంతొలుచు పురుగును నివారించవచ్చు (10 లీటర్ల మూత్రానికి, ఒక కిలో పచ్చిమిరపకాయల ముద్ద, 5 కిలోల వేపాకుల ముద్దను చేర్చి ఉడికించి చల్లారిన తరువాత గుడ్డతో వడగట్టి 3-4 దఫాలుగా వాడుకోవచ్చును).
ఆకుముడత
వేసవి దుక్కులు చేయడం ద్వారా సుప్తావస్థలో ఉన్న పురుగు గుడ్ల సముదాయాన్ని మరియు కలుపు విత్తనాలను నిర్మూలించవచ్చు.
వేప నూనె (1500 పి.పి.యం) లీటరు నీటికి 5 మి.లీ. కలుపుకొని నాటిన 20 మరియు 30 రోజులకు పిచికారి చేసుకవాలి (లేదా)
ఆవు మూత్రం, సీతాఫలం ఆకులు మరియు వేప ఆకుల కషాయం ఎకరానికి 2-3 లీటర్లు, 100 లీటర్ల నీటిలో కలుపుకుని మొక్కలపై పిచికారీ చేయడం ద్వారా ఆకు ముడత నివారించవచ్చు (10 లీటర్ల మూత్రానికి 2 కిలోల సీతాఫలం ఆకుల ముద్ద, 5 కిలోల వేపాకుల ముద్దను చేర్చి ఉడికించి చల్లార్చిన తర్వాత గుడ్డతో వడగట్టి 3-4 దఫాలుగా వాడుకోవచ్చు)
బాసిల్లస్ తురంజెన్సిస్ లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున కలుపుకొని నాటిన 30-40 రోజుల మధ్యలో పిచికారీ చేసుకొన్నట్లయితే ఆకుముడతను నివారించుకోవచ్చు.
ట్రైకోగ్రామా అనే గుడ్డు పరాన్న జీవిని ఎకరానికి 20,000 గ్రుడ్ల సముదాయం ఉన్న కార్డులను మూడు దఫాలుగా నాటిన 15 రోజుల నుండి పొలంలో విడుదల చేసుకొన్నట్లయితే ఆకుముడతను సమర్ధవంతంగా నివారించుకోవచ్చును.
దోమ పోటు
తట్టుకునే రకాలైన ఇంద్ర, అమర, కృష్ణవేణి, భావపురి సన్నాలు మరియు శ్రీధృతి రకాలను ఎంచుకోవాలి.
దోమపోటు నివారణకు కాలి బాటలు తీయడం (ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలిబాటలు తీసుకోవాలి), పొలానికి వైకల్పికంగా నీరు కట్టడం మరియు ఆరబెట్టడం చేయాలి.
మెటారైజియం లేదా బవేరియా లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలుపుకొని రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. వేప నూనె లీటరు నీటికి 5 మి.లీ. చొప్పున కలుపుకొని పిచికారి చేసుకొన్నట్లయితే నివారించుకోవచ్చు.
ఉదయం పూట వరి తవుడుతో (5-10 కి.) పాటు వేప నూనె ఒక లీటరు కలుపుకొని పొలంపై చల్లుకున్నట్యలితే దోమను కొంతవరకు తగ్గించుకోవచ్చు.
ఆవు మూత్రం, తూటికాడల కషాయం మొక్కల మొదళ్ళపై పడేటట్లు పిచికారి చేసుకోవడం ద్వారా దోమను నివారించవచ్చు (15 లీటర్ల మూత్రానికి, 10 కిలోల తూటికాడల ముద్దను చేర్చి ఉడికించి చల్లారిన తరువాత 100 లీటర్ల నీటిలో కలుపుకొని వాడుకోవచ్చు).
ఉల్లికోడును తట్టుకొనే రకాలైన కావ్య, దివ్య, ఎర్రమల్లెలు, పోతన మరియు శ్రీకాకుళం సన్నాలు వంటి రకాలను నాటుకోవాలి.
నివారణకు ఎకరానికి 600 మి.లీ. వేపనూనె (3000 పి.పి.యం) పిచికారి చేయాలి.
అగ్గి తెగులు, పొడ తెగులు, దుబ్బుకుళ్ళు, గోధుమ రంగు మచ్చ
తట్టుకునే రకాలైన సోనామసూరి, సోమశిల, విజేత, తరంగిణి, నెల్లూరు సోన వంటి రకాలను ఎంచుకోవాలి.
పొలంలో మరియు పొలం గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి.
సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున లేదా లీటరు నీటికి 20 గ్రాముల చొప్పున కలుపుకొని లేదా లీటరు నీటికి 30 మి.లీ. పంచగవ్య ద్రావణాన్ని కలుపుకొని 20 నిముషాలపాటు విత్తనాన్ని లేదా నారును శుద్ధి చేసుకోవాలి.
లీటరు నీటికి 30 మి.లీ. పశువుల మూత్రాన్ని కలుపుకొని 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకోవాలి.
ఎకరానికి 2 కిలోల చొప్పున సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ నేలకు వేసుకోవాలి.
పచ్చిరొట్ట పంటలను నేలలో కలియ దున్నుకోవాలి.
కాండంకుళ్ళు, దుబ్బుకుళ్ళు తెగులు
నీటిని ఎప్పటికప్పుడు బయటకు తీసివేయడంతో పాటు మురుగునీరు పొలంలో లేకుండా చూసుకోవాలి.
సేంద్రియ ఎరువులను నేలకు అందించడం ద్వారా తెగులు ఉధృతి తగ్గించవచ్చు.
మారేడు ఆకులు మరియు పశువుల మూత్రం మిశ్రమంతో తగ్గించవచ్చు (ఒక కిలో మారేడు ఆకులు తీసుకొని 5 లీటర్ల నీటిలో ఉడకపెట్టి చల్లారిన తర్వాత 5 లీటర్ల పశువుల మూత్రం మరియు 100 గ్రాముల సున్నం కలుపుకొని, దీనిని 100 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరా పొలానికి పిచికారి చేయాలి).
ఆకు ఎండు తెగులు
తట్టుకునే రకాలైన ఇంద్ర, అమర, పుష్యమి, స్వర్ణ, అక్షయ వంటి రకాలను ఎంచుకోవాలి.
పశువుల పేడ, ఇంగువ ద్రావణాలను (10 శాతం) పిచికారీ చేయడం ద్వారా ఎండు తెగులును నివారింవచ్చును (5 కిలోల పశువుల పేడ, 5 లీటర్ల మూత్రంతో పాటు 500 గ్రాముల బెల్లాన్ని కుండలోకి తీసుకొని 5 రోజుల పాటు కలుపుకొంటూ 5వ రోజు 100 గ్రాముల ఇంగువను కలపాలి. 10 లీటర్లకు 100 లీటర్ల నీటిని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి)
ఒక పొలం నుండి వేరొక పొలానికి నీరు పెట్టడం ఆపి వేయాలి.
పొలంగట్లపై పెద్ద చెట్లు లేకుండా చూసుకోవాలి.
అగ్గితెగులు
తెగులు సోకిన మొక్కలను పీకి వేసి పైపాటుగా సేంద్రియ ఎరువులు వాడుకోవాలి.
మజ్జిగ (1 లీటరు), పశువుల మూత్రం (1 లీటరు) 8 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.
వరిలో వచ్చే చాలా రకాల తెగుళ్ళను మారేడు ఆకులు మరియు పశువుల మూత్రం మరియు 100 గ్రాముల సున్నం కలుపుకొని, దీనిని 100 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరా పొలానికి పిచికారీ చేయాలి).
పురుగు, తెగుళ్ళ వ్యాప్తి నివారణకు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు
వేసవి దుక్కులు తప్పనిసరిగా చేసుకోవాలి.
నిరోధకశక్తి గల రకాలను ఎంచుకోవాలి.
మంచి విత్తనాన్ని ఎంచుకోవాలి.
విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి.
పంట అవశేషాలు పూర్తిగా కలిసిపోయేలా దమ్ము చేసుకోవాలి.
నారు కొనలను త్రుంచి నాటుకోవాలి.
ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలిబాటలు తీసుకోవాలి.
లింగాకర్షక బుట్టలతో పురుగు ఉధృతి తెలుసుకోవాలి.
వరి దుబ్బులు నేలలో కలిసేలా లోతు దుక్కి చేసుకోవాలి.
ఒక పొలం నుండి వేరొక పొలానికి నీరు పెట్టడం ఆపివేయాలి.
పొలం గట్లపై పెద్ద చెట్లు లేకుండా చూసుకోవాలి.
డా. కిరణ్ కుమార్ రెడ్డి (పంట ఉత్పత్తి విభాగము), డా.ఎస్. లోకేష్ బాబు, శాస్త్రవేత్త (విస్తరణ విభాగం), డా. విజయ్ కుమార్ నాయక్ (సస్య రక్షణ విభాగము), హరిసాదు, శాస్త్రవేత్త (మత్స్య విభాగం), డా. ఆర్. సుజాత, శాస్త్రవేత్త (గృహవిజ్ఞానం), డా. లలిత శివ జ్యోతి, ప్రోగ్రాం-కో ఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, నెల్లూరు. ఫోన్: 99485 42942
ఈ వ్యాధిని గొంతువాపు అనే కాకుండా గురక వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి ఆవుల్లో కన్నా గేదెలలో ఎక్కువగా వస్తుంది. మరియు 2-3 సంవత్సరముల వయస్సు గల గేదెలలో తరచుగా వ్యాధి వ్యాపిస్తుంది. వ్యాధి బారిన పడిన పశువులకు సరైన సమయములో చికిత్స అందించకపోతే 24-48 గంటలలో ఆ పశువు మరణించే అవకాశాలు ఎక్కువ.
వ్యాధి కారకము: ఈ వ్యాధి పాశ్చురెల్లా మల్టోసిడా మరియు పాశ్చురెల్లా హిమోలైటికా అనే గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలలో కలుగు ఒక ప్రాణాంతకమైన వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన గ్రామాలలోనే అదే పశువుకు మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఎందుకంటే వ్యాధికి సంబంధించిన సూక్ష్మక్రిములు ఆ గ్రామాల్లోని పాడి పశువుల యొక్క టాన్సిల్స్ మరియు నాసిగాగ్రస ప్రాంతంలో నివసిస్తూ ఉంటాయి. కాని వాతావరణ పరిస్థితులు సూక్ష్మక్రిములకి అనుకూలంగా లేకపోవడంలో ఈ వ్యాధి అనేది బయటపడదు.
ఎప్పుడైతే వాతావరణ పరిస్థితులు సడన్గా మారినప్పుడు, వేడి నుండి చల్ల వాతావరణంకి మారినప్పుడు మరియు భారీ వర్షాలు పడటం మరియు నీరు మరియు దాణా లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించటం, పాడి పశువుల శరీరంలో ఎక్కువ నట్టలు పెరగడం లేదా వేరే వైరల్ వ్యాధి వలన పశువు నిరోధకశక్తి తగ్గుతుంది. అలాంటప్పుడు సూక్ష్మక్రిములు ఎక్కువగా వృద్ధి చెంది వ్యాధిని కలిగిస్తాయి.
వ్యాధి వ్యాప్తి చెందు విధానం: వ్యాధి సోకిన పశువు యొక్క చొంగతో కలుషితమైన గడ్డి, నీరు మరియు గాలి ద్వారా ఆరోగ్యమైన పశుకు వ్యాపిస్తుంది.
వ్యాధి లక్షణాలు:
అధిక జ్వరం – 106-107 డిగ్రీల ఫారెన్హీట్
నోటి నుండి చొంగ కారుతుంది.
పశువు యొక్క గొంతు, మెడ ముందుకాళ్ళ మధ్య భాగంలో నీరు చేరుతుంది.
ఊపిరితిత్తుల్లో నీరు ఎక్కువగా చేరడం వలన శ్వాస తీసుకోవడంలో గురక శబ్దం వస్తుంది.
సూక్ష్మక్రిములు ప్రేగులలో స్థిరపడి విషపదార్థాలను విడుదల చేయడం వలన పేడ పలుచగా పెడుతుంది.
పాల దిగుబడి తగ్గుతుంది.
చికిత్స:
లక్షణాలు చూపించిన తొలిరోజున పశువైద్యాధికారిని సంప్రదించాలి.
సల్ఫాడిమిడిన్ 150 మి.గ్రా./ కిలో బరువు చొప్పున నరానికి ఈ మందును ఇవ్వాలి. ఒక మూడు రోజుల పాటు వాడాలి.
అంతేకాకుండా సెప్టిమోఫర్ సోడియం వంటివి ఇవ్వడం వలన మంచి ఫలితం ఉంటుంది.
దాంతోపాటుగా ఎన్ఎస్ఏఐడిఎస్, యాంటిపైరెటిక్స్ మరియు వాపు (నీరు) తగ్గించటం కోసం ఫ్రుస్మైడ్ని ఇవ్వాలి.
నివారణ:
వ్యాధి సోకిన పశువును వేరుగా ఉంచి చికిత్సని అందించాలి.
అలాగే వ్యాధి సోకిన పశువు మేత, నీరు ఇతర పశువులకు ఇవ్వరాదు.
వ్యాధి సోకిన గ్రామాల్లో ప్రతీ ఏడాది వర్షాకాలం ఆరంభంలో ప్రతీ ఏడాదీ ఒక్కసారి టీకాలు ఇవ్వాలి. (జూన్ మొదటి వారంలో టీకాలను వేయించాలి)
వ్యాధి సోకిన గ్రామాల్లో పశువుల శాఖలో 0.5% ఫినాల్ను పిచికారి చేయడం వలన సూక్ష్మజీవులు మరణిస్తాయి.
డా. ఎం. వెంకట ప్రసన్న,వెటర్నరీ డాక్టర్, మైదుకూరు – 516172
ప్రపంచ వ్యవసాయ రంగంలో సంక్షోభం ఏర్పడింది. ఒక కోణంలో ఆలోచిస్తే వ్యవసాయరంగం విధ్వంసానికి గురైంది. కార్పొరేట్ ఫుడ్ కంపెనీల ద్వారా బియ్యం మరియు గోధుమల వినియోగాన్ని నిరంతరం ప్రోత్సహిస్తుంది. దానికి తోడు శాస్త్రీయంగా అర్థంలేని చక్కెర మరియు చక్కెరలకు సంబంధించిన ఆహారాలను స్టేపుల్ ఫుడ్స్గా ప్రచారం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆహార అలవాట్లను ప్రభావితం చేస్తుంది. ఈ పరిణామం ప్రజలు మంచి పోషకాలు గలిగిన చిరుధాన్యాలను పక్కకు నెట్టి సక్రమమైన పోషకాలు లేని ఆహారాల ఎంపికకు దారి తీస్తుంది. గత మూడు థాబ్దాలుగా ప్రపంచ ఆరోగ్యరంగంలో జరుగుతున్న విపరీత పరిణామాలు, ఇబ్బందికర పోకడలు మా దృష్టిని అటువైపు మళ్ళించి పరిష్కార మార్గాలకు మమ్ములను ప్రేరేపించాయి.
ఆహార భద్రత కోసం మిల్లెట్ల సంభావ్యత
వ్యవసాయ విధ్వంసం మరియు ఆహార అసమతుల్యత నేపథ్యంలో, సుస్థిర ఆహార భద్రత కోసం చిరుధాన్యాలు ఒక ఆశాదీపంగా ఉద్భవించాయి. వాటి పర్యావరణ హిత మరియు పోషక సామర్థ్యంలో సాటిలేని, చిన్న మిల్లెట్లు కిలోగ్రాముకు 200 లీటర్ల నీటిని మాత్రమే డిమాండ్ చేస్తాయి. బియ్యానికి అవసరమైన 8000 లీటర్ల అధికంతో పోలిస్తే అదే ఉత్పత్తికి 40 రెట్లు తక్కువ నీటి వినియోగం అవసరం పడుతుంది. అంతేకాకుండా, మైనర్ మిల్లెట్లకు ఆకలిని తీర్చే సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది, అదే పరిమాణంలో ఉన్న బియ్యంతో పోల్చితే ఒక కిలోగ్రాము మిల్లెట్ల ఆహారం తినే వారి సంఖ్య చాలా ఎక్కువ. మిల్లెట్లు బంజరు భూముల్లో కూడా పండగలవు, బహుళ ఆనకట్టల నిర్మాణం లేదా సహజ పర్యావరణ వ్యవస్థలను తారుమారు చేయాల్సిన అవసరం లేని వాటిని నిజమైన ప్రపంచ పంటగా మారుస్తాయి.
సిరిధాన్యం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
సిరిధాన్యాలు పర్యావరణ ప్రయోజనాలకు మించి, అపారమైన ఆరోగ్య సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి. కోడో, ఫాక్స్టైల్తో సహా – ఐదు చిన్న మిల్లెట్లను సిరిధాన్యాలు అని పిలుస్తారు. బార్న్యార్డ్, బ్రౌన్టాప్, మరియు లిటిల్ మిల్లెట్లు – అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలను ప్రదర్శిస్తాయి. వీటి తక్కువ కార్బోహైడ్రేట్-టు-ఫైబర్ నిష్పత్తి సరైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది మరియు అనేక వ్యాధులను సమర్థవంతంగా తిప్పికొట్టడానికి కనుగొనబడింది. 1997 నుండి, మేము దీనిని ప్రధాన ఆహారంగా ఉపయోగించడం కోసం ప్రచారం చేసాము, ఈ చిన్న మిల్లెట్లు తీసుకురాగల గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలను ప్రత్యక్షంగా చూసాము. సిరిధాన్యాలతో కూడిన ఆహారాన్ని విస్తృతంగా స్వీకరించడం ప్రజారోగ్యాన్ని విప్లవాత్మకంగా మార్చగలదు. చివరకు ఆరోగ్య సంరక్షణ వ్యయంలో గణనీయమైన తగ్గింపుకు దారితీసింది.
అధిక మైనర్ మిల్లెట్ ఉత్పత్తిని ప్రోత్సహించడం
మిల్లెట్ల సామర్థ్యాన్ని గ్రహించడం. ఆహారం మరియు పోషకాహార భద్రత కోసం. వాటి ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం అవసరం. భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఆకర్షణీయమైన ధరలు మరియు విజయవంతమైన పంట దిగుబడితో ప్రోత్సహించబడిన చిన్న మిల్లెట్ ఫార్మింగ్ను రైతులు స్వీకరించడం ప్రారంభించారు. భారత ప్రభుత్వం మిల్లెట్ల పోషకాలను గుర్తించి, ప్రపంచ మిల్లెట్ ప్రచారానికి కూడా నాయకత్వం వహించింది. ఇప్పటికీ ఈ ప్రయాణం సులభం కాదు. కొత్త పంటల వ్యూహాలను అవలంబించేలా రైతులను ఒప్పించడం మరియు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని నగరవాసులను ప్రోత్సహించడానికి గణనీయమైన కృషి అవసరం. అయినప్పటికీ, ఈ రోజు మనం చూస్తున్న విజయాలు మన వ్యవసాయాన్ని కాపాడటంలో మరియు సమిష్టి బాధ్యత యొక్క శక్తిని ప్రతిబింబిస్తాయి.
మిల్లెట్ల వినియోగం, పర్యావరణ పునరుద్ధరణను ప్రోత్సహించడం
మిల్లెట్ల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం, వాటి వినియోగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి సమగ్ర వ్యూహం అవసరం. ఆరోగ్య పరిస్థితులు క్షీణిస్తున్న పట్టణ ప్రాంతాల్లో ఈ ప్రయత్నం చాలా కీలకం. రెసిడెన్షియల్ కోర్సులను నిర్వహించి మరియు ప్రత్యేకంగా మిల్లెట్ ఆధారిత భోజనాన్ని అందించే వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నాము. అటువంటి ఆహారం తీసుకున్న 10 నుండి 15 రోజులలో, ప్రజలు గుర్తించదగిన ఆరోగ్య మెరుగుదలను అనుభవించవచ్చు. ఈ ఫస్ట్హ్యాండ్ అనుభవం డిమాండ్ని ఉత్ప్రేరకపరచగలదు మరియు సరఫరాను పెంచుతుంది. అయితే, ఈ మార్గం సవాళ్లు లేనిది కాదు. మిల్లెట్లను కార్పొరేట్ వ్యవసాయ సంస్థలు క్రమపద్ధతిలో పక్కకు నెట్టి, ప్రతికూలంగా ‘ముతక ధాన్యాలు’గా చిత్రీకరించాయి. దీనిని ఎదుర్కోవడానికి, ఆహార భద్రత, ఆరోగ్య మెరుగుదల మరియు పర్యావరణ పునరుద్ధరణను మిళితం చేసే పర్యావరణ నమూనాను అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. మిల్లెట్లను, వాటికి అవసరమైన వ్యవసాయ పద్ధతులను స్వీకరించడం ద్వారా, ప్రస్తుత వ్యవసాయ ఆహార పద్ధతుల వల్ల కలిగే పర్యావరణ నష్టాన్ని మనం వెనక్కి తీసుకోవచ్చు.
మిల్లెట్ ప్రమోషన్ కోసం విద్య, పరిశోధన
మిల్లెట్ ఉత్పత్తి మరియు వినియోగాన్ని పెంపొందించడానికి భారత ప్రభుత్వం (స్త్రం| కానీ వ్యూహాత్మక విద్యా కార్యక్రమాలు మరియు అంకితమైన పరిశోధనా సంస్థలు) నుండి బలమైన విధాన మద్దతు అవసరం. విధాన నిర్ణేతలు ఆహార సార్వభౌమాధికారం మరియు భద్రతను నిలబెట్టడానికి పరిశోధనా సంస్థలకు మార్గనిర్దేశం చేయాలి.
మొదటగా: ప్రభుత్వం మిల్లెట్ ఆహారాలను వస్తు సేవల పన్ను (స్త్రఐఊ) నుండి మినహాయించడాన్ని పరిగణించాలి. ఇది మిల్లెట్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది, ఈ పోషకాలు అధికంగా ఉండే గింజలను ప్రజలకు మరింత సరసమైనవిగా చేస్తుంది.
రెండవది: ప్రస్తుతం రసాయన ఎరువుల కంపెనీలకు ఇస్తున్న సబ్సిడీలను చిరుధాన్య రైతుల వైపు మళ్లించాలి. ఈ ఆర్థిక దారి మళ్లింపు రైతులు మిల్లెట్ సాగుకు మారడానికి, పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.
మూడవదిగా: వర్షాధార వ్యవసాయం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ నిర్దిష్ట పరిశోధన మరియు అభివృద్ధి అవసరాలను మిల్లెట్ వంటి పంటలకు పరిష్కరించగలదు ఈ ప్రత్యేక దృష్టి స్థిరమైన మిల్లెట్ వ్యవసాయ పద్ధతులలో పురోగతిని రేకెత్తిస్తుంది.
నాల్గవది: ప్రభుత్వ సంస్థలు మిల్లెట్ ఆధారిత భోజనాన్ని అందించాలి, మిల్లెట్ను ఆహారంగా ఉపయోగించే సంస్కృతిని పెంపొందించాలి. ఈ ఆదేశం పెద్ద ప్రైవేట్ సంస్థలు, ఆర్మీకి విస్తరించాలి. పారామిలిటరీ బలగాలు మరియు పోలీసు విభాగాలును కూడా విస్తరించాలి.
ఐదవది: మిల్లెట్లను ప్రోత్సహించడం పాఠశాలల్లో ప్రారంభించాలి, మిల్లెట్లను మధ్యాహ్న భోజనంలో చేర్చడం ద్వారా ఈ పోషకమైన ధాన్యం వైపు క్రమంగా ఆహార మార్పును సులభతరం చేస్తుంది.
ఆరవది: మిల్లెట్ రైతులకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఉత్పత్తిని ప్రేరేపించగలవు మరియు మిల్లెట్ సాగుకు మారే వారికి ఆదాయ స్థిరత్వాన్ని అందించగలవు.
ఈ విధాన మార్పులతో పాటు, పరిశోధన మరియు విద్యపై బలమైన దృష్టి పెట్టాలి. మిల్లెట్లను అధ్యయనం చేసేందుకు ప్రత్యేక పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయాలి. ఈ కేంద్రాలు అమూల్యమైనవి. అధునాతన అభివృద్ధి కోసం. స్థిరమైన మిల్లెట్ వ్యవసాయ పద్ధతులు మరియు వాటి పోషక ప్రయోజనాలను మరింత నిశితంగా అధ్యయనం చేయడం కోసం చాలా అవసరం.
పైగా మిల్లెట్ల యొక్క ప్రాముఖ్యత మరియు వాటి ప్రయోజనాలను పాఠశాల మరియు కళాశాల స్థాయిలలో విద్యా పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టాలి. విద్యార్థులు వివిధ రకాల ధాన్యాలు, వాటి పోషకాల గురించి తెలుసుకోవాలి. మరియు పర్యావరణ స్థిరత్వంపై వాటి ప్రభావం తెలుసుకోవాలి. ఈ జ్ఞానం కొత్త తరం సమాచారం కలిగిన వినియోగదారులను మరియు మిల్లెట్ల పట్ల మక్కువగల వారిని ప్రోత్సహిస్తుంది.
అయితే, ఈ మార్పులను ప్రారంభించడంలో ప్రభుత్వం గణనీయమైన పాత్ర పోషిస్తుండగా, ఈ ప్రయత్నాల విజయం ప్రజల ఆమోదం మరియు మద్దతుపై కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్ల, విధాన మార్పులు మరియు విద్యా కార్యక్రమాలతో పాటు, మిల్లెట్ల ప్రయోజనాలను ప్రోత్సహించే ప్రజా చైతన్య ప్రచారాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. విధానం, విద్య, ప్రజల అవగాహన మధ్య సహకారం అందరికీ ఆరోగ్యకరమైన మరియు మరింత స్థిరమైన భవిష్యత్తుకు దారితీస్తుంది.
హిందూ సాంప్రదాయంలో అనాదిగా పితృకర్మల సందర్భంగానూ, పర్వదినాల సందర్భంగానూ మరియు దేవతలకు మొక్కుబడిగానూ గోవులను పేద బ్రాహ్మణులకు దానం ఇచ్చే ఆచారం కొనసాగుతూ ఉంది. అదే విధంగా గ్రామాలలోని తమ పితృదేవతల పేరిట ఆంబోతులను గ్రామఆస్తిగా దానం చేస్తూ వదిలే సాంప్రదాయం ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతూనే ఉంది. ఈ ఆంబోతు స్వేచ్ఛగా ఎవరి పొలాలలోకి ప్రవేశించి మేసినా, కొంత నష్టం చేసినా గ్రామ కట్టడిగా ఎవరూ అభ్యంతరం చెప్పేవారు కాదు. ఒకనాడు అనేక గ్రామాలలో 3-4 బ్రాహ్మణ కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలుగా ఉంటూ, పేదరికంలో ఉండి కొన్ని సందర్భాలలో ఆ కుటుంబాలలోని పిల్లలకు, వృద్ధులకు కూడా సరిపడిన పాలు ఉండేవి కావు.ఇటువంటి పేదలకు గ్రామ పెద్దల నుండి దానంగా అందిన గోవులు గృహావసరాలను తీర్చడమే కాక, దేవాలయ పూజారుల ద్వారా దేవతార్చనకు, ప్రసాదాల తయారీకి కూడా వినియోగపడేవి. అదనపు పాల విక్రయం ద్వారా కొంత ఆదాయం కూడా లభించేది. ఇందుకు గ్రామ పెద్దలు బ్రాహ్మణులు, పూజారుల వద్ద ఉన్న గోమాతలకు అవసరమైన మేతను కూడా ఉచితంగా అందించేవారు. అదేవిధంగా గత ఐదు థాబ్దాలుగా మన గ్రామాలకు కృత్రిమ గర్భోత్పత్తి సదుపాయాలు విస్తరించినందున అంతకు ముందు గ్రామాలలో వదిలే ఆంబోతుల వల్ల కలిగే పశుసంతతి కంటే మెరుగైన సంతతి జన్మించే అవకాశాలు ఏర్పడ్డాయి. అంతేకాక పూర్వపు కమతాలు విభజనలు పంపిణీల కారణంగా బాగా కుదించుకుపోవుట మరియు సేద్యపు ఖర్చులు అనేక రెట్లు పెరిగిపోవుట వల్ల, ఆంబోతులు తమ పొలాల మీద పడి ధ్వంసం చేస్తే ఆ నష్టాన్ని భరించే శక్తిని కోల్పోయి, ఈ ఆంబోతుల పట్ల విముఖతను చూపుతున్నారు. కొన్ని సందర్భాలలో హింసించి తరుముతూ చంపటానికి సైతం వెనుకాడటం లేదు. కీటకనాశక రసాయనాలు జల్లిన పైర్లలోకి ప్రవేశించిన వృషభరాజులు పొలాలలోనే మరణిస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం గోదానం పొందిన బ్రాహ్మణులు, పురోహితులు, అర్చకులు సైతం గోపోషణకు అవసరమైన కనీస వసతి – మేత- నిర్వహణ అవసరాలను సమకూర్చలేక వారి కుటుంబ అవసరాలకు ఇతరుల నుండి పాలను కొనుగోలు చేయుటకే మొగ్గు చూపుతున్నారు ఈ పరిస్థితి చిన్న చిన్న గృహాలలో నివసించే దానగ్రహీతలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాలలో చిన్న అపార్ట్మెంట్లలో నివసించే దానగ్రహీతలకు కనీసం ఒక చిన్న పుంగనూరు గోవును సైతం పెంచుట అసాధ్యం. అయితే మనం వీరికి గోదానాలు చేస్తూనే ఉన్నాము. మొన్న కోవిడ్ సందర్భంలో అనూహ్య స్థాయిలో సంభవించిన మరణాల వల్ల గోదానాల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే ఈ గోదానాలన్నీ ఒక తంతు మాత్రంగానే కొనసాగి, దానాన్ని స్వీకరించిన వెంటనే ఆ గోవును వేరొకరికి విక్రయించటమో, బదిలీ చేయటమో జరుగుతోంది తప్ప గోదానం యొక్క అసలు య్రోజనం కనిపించడం లేదు. ఇది గోవును దానంగా పొందిన బ్రాహ్మణుని ప్రమేయం లేకుండా లేదా అతనికి తెలియకుండానే ఈ గోవులు ఒక థలో కబేళాలకు తరలిపోతూ హిందువుల మత విశ్వాసానికి మనోభావాలకు, దాన ఉద్దేశానికి పూర్తి విరుద్ధంగా తీవ్రమైన అపచారాలకు బలి అవుతున్నాయి.
మరొకవైపు మన పట్టణ పరిసరాలు, గ్రామాలలో అనేక స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలు, గోప్రేమిక సంఘాలు అనేక గోశాలలను నిర్వహిస్తున్నాయి. వీటిలో అనాధ గోవులు-దూడలు-ఇతర వృద్ధ, వికలాంగ పశువుల సంఖ్య నానాటికీ పెరిగిపోతూ ఉన్నాయి. వీటికి సరియైన మేతల్ని, దాణాల్ని అందించలేక నిర్వాహకులు సతమతమౌతూ ఉన్నారు. దినదినానికీ పెరుగుతున్న గోసంతతికి అవసరమైన కనీస వసతి సౌకర్యాలు కూడా కుదించుకుపోతున్నాయి. హేతుబద్ధతలేని కొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల కారణంగా ఈ గోశాల నిర్వాహకులు తీవ్రమైన కూలీల సమస్యను కూడా ఎదుర్కొంటున్నారు. మనం పితృదేవతల పేర ఈ గోమాతల అన్నార్తిని తీర్చడానికి ధన రూపంగానూ, గ్రాసాల రూపంగానూ అందిస్తే, భారీ ఖర్చుతో పితృకార్యాల (దినాలు, తద్దినాలు, సంవత్సరికాలు) సందర్భంగా చేసే గోదానాల కంటే గోవుల ఆకలిని తీరుస్తూ, వాటికి మెరుగైన సౌకర్యవంతమైన జీవనాన్ని అందిస్తే మంచిది. ఇది పసుపు, కుంకుమలు అద్ది పూలమాలలతో గోవుల్ని పూజించుట, గోవుల చుట్టూ ప్రదక్షిణలు చేయుట కంటే మెరుగైన పుణ్యకార్యమని నా అభిప్రాయం. గోపూజల సందర్భంగా గోవుకు అందించే మేతలు, పళ్ళు, ఫలహారాలలో గానీ, పూలదండలలో గానీ ఎటువంటి ప్లాస్టిక్ మరియు తగరాలు, దారాలు వంటి హానికరమైన పదార్థాలు కలవకుండా జాగ్రత్త వహించండి. మన హిందూ సాంప్రదాయంలో జరిగే తద్దినాలు, స్మారకాలు సందర్భంలో భారీ ఖర్చుతో ఏర్పాటు చేసే భోజనాలు, తదితర ఏర్పాట్లతో పాటు దానమిచ్చే గోవుల కొనుగోలుపై వెచ్చిందలచిన సొమ్ములో కనీసం ఒక పదోవంతు వ్యయాన్ని అయినా మేతల రూపంలోగానీ, విరాళాల రూపంలోకానీ తమకు సమీపంలోని నిజాయితీతో, సమర్థతతో, గోప్రేమికుల నిర్వహణలో నడుస్తున్న గోశాలలకు విరాళంగా అందించవచ్చును. స్తోమతను బట్టి గోశాలలో అదనపు షెడ్లు, ఫ్యాన్లు, నీటి తొట్టెలు వంటి అదనపు నిర్మాణాలను తమ పెద్దల పేర ఏర్పాటు చేయవచ్చు. స్థోమత అవకాశాలను బట్టి పశుగ్రాసాల సాగుకు గోశాలలకు భూదానం చేయవచ్చును.
పై అంశాల ఆధారంగా గోశాలలలోని గోమాతల ఆకలిని, బాధలను తగ్గించగల్గితే అంతకంటే పుణ్యకార్యం వేరొకటి ఉండదని నా నమ్మకం. అందుకే గోదానం కన్నా గోవుకు దానమే మిన్న అని అంటాను. మరి మీరేమంటారు.
మన తెలుగు రాష్ట్రాలలో ఖరీఫ్లో పండించే పంటలలో వరి ప్రధాన పంట. వరిని ఖరీఫ్ పంటగా ఆంధ్రప్రదేశ్లో 12.5 లక్షల హెక్టార్లలో మరియు తెలంగాణలో 25.8 లక్షల హెక్టార్లలో పండిస్తున్నారు. రసాయన సేద్యంతో నష్టపోయిన రైతులు అధిక శాతం ప్రకృతి వ్యవసాయంలోకి మళ్లుతున్నారు గోఆధారిత సహజ ఎరువులు వాడుతూ ప్రకృతిలో లభ్యమయ్యే సహజ కషాయాలతో రైతులు భూసారాన్ని కాపాడుకుంటూ, చీడపీడల బెడద నుంచి ఉపశమనం పొందుతున్నారు. రాబోయే ఖరీఫ్లో వరి పంటలో పాటించవలసిన సహజ ఎరువుల వినియోగం మరియు రసాయన రహిత సస్యరక్షణ పద్ధతులను గురించి తెలుసుకుందాం.
1) వరి పంట పండించే ముందర మే నెలలో భూసారాన్ని మరియు కర్బన శాతం పెంచే పచ్చిరొట్ట పేర్లను (అపరాలు, జనుము, జీలుగ, పిల్లిపెసర, గడ్డిజాతి పంటలను) వేసుకుని 40-75 రోజుల వ్యవధిలో కోసుకుని భూమిలో కలియదున్నటం ద్వారా లేదా తినడానికి పశువుల మేతగా వాడుకోవచ్చు.
2) వరిలో తక్కువ కాలపరిమితి, అధిక దిగుబడినిచ్చే రకాలను ఎన్నుకుని ఖరీఫ్ లో వేసుకుంటే, రబీ వరి పంటకు తొందరగానే వెళ్ళవచ్చు. ఆలస్యమైనచో రబీలో అకాలవర్షాలు మరియు వడగండ్ల బెడద ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి రబీలో కూడా తక్కువ కాలపరిమతి రకాలు నవంబర్ లో వేసుకుని, తొందరగా పంట కోత తీయవచ్చు. ఈ పద్ధతిలో ప్రకృతి వైపరీత్యాలు తప్పించుకునే అవకాశం ఉంది.
3) బీజామృతంతో విత్తనశుద్ధి, నారుమడి శుద్ధి 5 లీటర్లు / 25-30 కిలోల విత్తనానికి, నారుమడికి వాడవచ్చు. ఈ పద్ధతి భూమిలో సూక్ష్మ జీవులను పెంచడంతో పాటు, విత్తనాలను, మొక్కలను చీడపీడల నుంచి కాపాడతాయి.
4) నీటిపారుదల క్రింద వరిని వరుసలలో విత్తే పద్ధతి, డ్రం సీడర్ పద్ధతిలో లేదా శ్రీ పద్ధతిలో వేసుకుంటే మంచిది. వర్షాధారంగా వేసే వరిలో నేరుగా వరుసలలో విత్తే పద్ధతిని (డైరెక్ట్ సీడింగ్) అనుసరించాలి. ఈ పద్ధతులలో భూమి అతి తక్కువగా కదుపబడుతుంది.
సహజ ఎరువుల యాజమాన్యం
1000-1500 కిలోల ఘన జీవామృతం కలిపిన పశువుల ఎరువు ఎకరానికి దుక్కిలో లేదా కరిగడిలో వేసుకోవాలి. అచ్చం ఘనజీవామృతాన్ని ఎకరానికి 400 కిలోలు రెండు సార్లుగా నాటిన 20 రోజులకీ, 40 రోజులకి వేసుకోవాలి. తరువాత ద్రవజీవామృతమును ఎకరానికి 800 లీటర్లు నాలుగు సార్లు నాటిన 30, 50,65 మరియు 80 రోజులకు సమభాగంగా చేసి (200 లీటర్లు ప్రతిసారి) భూమికి అందజేయాలి. పైపాటుగా 50 లీటర్ల ద్రవజీవామృతాన్ని 100 లీటర్ల నీటికి కలిపి నాలుగు సార్లు నాటిన 20, 35, 50 మరియు 65 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి.
గోఆధారిత సహజ ఎరువులతో పాటు, అజోల్లా ఎకరానికి 10-15 కిలోలు నాటిన 7 రోజులకు వేసిన ఎడల నత్రజని స్థిరీకరణతో పాటు కలుపు నివారణ కూడా జరుగుతుంది, సేంద్రీయ ఆచ్ఛాదన (మల్చ్) వలె ఉపయోగపడుతుంది, నీటి అవసరాన్ని తగ్గించి భూమిలో కర్భన శాత వృద్ధికి తోడ్పడుతుంది.
పంట ఎదుగుదల మరియు పిలకల అభివృద్ధికి, పంచగవ్య ఎకరానికి నాలుగు లీటర్లు పిలక థలో, సప్తధాన్యాంకుర కషాయం 250 మి.లీ. 100 లీటర్ల నీటికి కలిపి గింజ పాలు పోసుకునే థలో పిచికారీ చేస్తే, గింజ నాణ్యత మరియు దిగుబడి పెరుగుతుంది.
సస్యరక్షణ పద్ధతులు (రసాయన రహిత)
వరి పంట నాటే సమయంలో మొక్కల కొనలు తుంచుకోవాలి. పొలంలో ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ వెడల్పున తూర్పు – పడమర దిశగా కాలిబాటలు (అల్లీస్) ఏర్పాటు చేసుకోవాలి. గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి. బంతి / కంది / మొక్కజొన్న / కూరగాయలతో పాటు. గ్లైరిసీడియా వంటి మొక్కలను గట్ల మీద మరియు కంచే పంటగా వేసుకోవాలి. పసుపు పచ్చ జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు, పక్షి స్థావరాలు, లైట్ ట్రాప్స్ (దీపపు ఎరలు) అమర్చడం వంటి పద్ధతులను అనుసరించాలి. మురుగు నీరు నిలువకుండా చూసుకోవాలి. ఇతర పంటల అవశేషాలు ఉంటే తొలగించాలి.
వరి పంటను ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణకు పాటించవలసిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు
పురుగుల నివారణ:
కాండం తొలుచు పురుగు: నాటేటప్పుడు ఆకుల కొనలు తుంచడం, ట్రైకోగ్రామా గుడ్ల పరాన్నజీవులను ఎకరానికి నాలుగు కార్డుల చొప్పున 25వ రోజునుండి ప్రతి 10 పదిరోజులకు ఒక్కసారి చొప్పున 5సార్లు వదలాలి.
ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలను పెట్టాలి. ముందు జాగ్రత్త చర్యగా ఎకరానికి 200 లీటర్ల నీమాస్త్రం పిచికారీ చేయాలి. పురుగు నివారణకు 5% వేప కషాయం (శ్రీఐచజూ) 5 లీటర్లు 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. పిలక థలో మరియు అంకురం థలో 3 లీటర్ల అగ్నాస్త్రంను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఆకుముడుత పురుగు: తాడుతో మొక్కలపై లాగడం ద్వారా ఆకు గూడులు, పురుగులు పడిపోతాయి. ఎకరానికి ఒక లైట్ ట్రాప్ (దీపపు ఎర)ను అమర్చుకోవాలి. 5% వేప కషాయం లేదా నీమాస్త్రం పంట తొలిథలో ఎకరానికి 200 లీటర్లు పిచికారీ చేయాలి.
సుడిదోమ: పొలంలో కాలిబాటలు తప్పనిసరిగా తీయాలి. పసుపు పచ్చ మరియు తెల్లని జిగురు అట్టలు, ఎకరానికి 20-25 చొప్పున అమర్చాలి. తూటికాడ కషాయం 5-6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి మొక్కల పాదుల దగ్గర పిచికారి చేయాలి. పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి.
ఉల్లికోడు: ఎకరానికి ఒక లైట్ ట్రాప్ (దీపపు ఎర)ను అమర్చుకోవాలి. అగ్నాస్త్రం 5 లీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
తాటాకు తెగులు (హిస్పా): నాటేటప్పుడు ఆకుల కొనలు తుంచి నాటుకోవాలి. తొలిథలో ఎకరానికి 200 లీటర్ల నీమాస్త్రం పిచికారీ చేయాలి. తరువాత థలో ఎకరానికి 6 లీటర్ల బ్రహ్మాస్త్రం 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.
వరి ఆకు నల్లి: గట్ల మీద బంతి మొక్కలు నాటుకోవాలి. పంట మీద ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన ఐదు లీటర్ల కషాయం వంద లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.
పచ్చదోమ: పసుపు మరియు తెల్లని జిగురు అట్టలు, ఎకరానికి 20-25 చొప్పున అమర్చుకోవాలి. ఎకరానికి ఒక లైట్ ట్రాప్ (దీపపు ఎర) ను పెట్టాలి. ఎకరానికి 5 లీటర్ల వావిలాకు కషాయాన్ని 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.
కంపునల్లి (గంధీ బగ్): ఉదయం పూట ఎకరానికి 5% వేప కషాయం 5 లీటర్లు లేదా అగ్నాస్త్రంను 3 లీటర్లు చొప్పున 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.
తెగుళ్ల నివారణ:
అగ్గి తెగులు: బీజామృతంతో విత్తనశుద్ధి చేయాలి. గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. మారేడు పత్రం మరియు తులసి ఆకుల కషాయాన్ని ఎకరానికి 6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి లేదా ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి. పులిసిన మజ్జిగ 6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.
పొడ తెగులు: పొలంలో నీరు తక్కువగా ఉంచాలి. ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన ఐదు లీటర్ల కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి లేదా పులిసిన మజ్జిగ 6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.
బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు: ఎండిన అల్లం మరియు పాలతో కూడిన కషాయం 6 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి. తరువాత ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.
కాండం కుళ్ళు తెగులు: మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. బీజామృతంతో విత్తనశుద్ధి, నారుశుద్ధి చేయాలి. పైన వివరించిన విధంగా ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువలతో చేసిన కషాయాన్ని వాడి తెగులును నివారించవచ్చు.
టుంగ్రో వైరస్ తెగులు: గట్ల మీద కలుపు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎకరానికి ఒక లైట్ ట్రాప్ (దీపపు ఎర)ను అమర్చుకోవాలి. 5% వేప కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.
ఆకుమచ్చ తెగులు: పులిసిన మజ్జిగ 6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.
మానిపండు తెగులు: వరినాట్లు సకాలంలో వేసుకోవాలి. ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.
పైన వివరించిన కొన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్లో భాగంగా రైతు సాధికార సంస్థ వారు రూపొందించిన ప్రణాళికలోని అంశాల నుంచి వారికి కృతజ్ఞతలతో సేకరించడమైనది. ఈ పద్ధతులు కొన్ని వ్యవసాయ పరిశోధన పరంగా ద్రువీకరించబడాలి. సేంద్రియ రైతులు స్వతహాగా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నారు. రసాయన రహిత పద్ధతులు కావున పంటలకు నష్టం ఉండదు. నాణ్యత గల దిగుబడులు సాధించడానికి దోహదపడతాయి.
డా. ఎస్.ఎమ్. విద్యాశేఖర్, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్, ఫోన్: 98494 42221; డి.ఎల్.ఏ. గాయత్రి, ఎమ్. శ్రీనివాసరావు, వి.కే. సింగ్, కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ, హైదరాబాద్ మరియు రైతు సాధికార సంస్థ, వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో.
ప్రస్తుత కాలంలో వర్షాలు విరివిగా పడుతున్నాయి కాబట్టి రైతులు ప్రధాన చెరువును సిద్దం చేసుకొని, ఆలాగే చేప పిల్లలు పెంచే చెరువును కూడా సిద్దం చేసుకొని, మంచి నాణ్యమైన చేప పిల్లలను వృద్ధి చేసుకొని చేపల పెంపకంలో మంచి దిగుబడి పొందవచ్చును. చేప జాతి పిల్లలు, కావలసిన సమయంలో,కావలసిన పరిమాణంలో దొరకడం అనేది చేపల పెంపకంలో ఒక కీలకాంశం. గత కొన్ని సంవత్సరాలుగా, కార్ప్ చేపల నర్సరీ విషయంలో చెప్పుకోదగిన పురోగతి సాధించినప్పటికీ అవసరమైన సైజు చేపల విషయంలో ఇప్పటికీ కొరత ఉంది. చేప గుడ్లు పొదిగి, పిల్లలై కేవలం 72-96 గంటల వయసులో అప్పుడప్పుడే ఆహారం తీసుకోవడానికి అలవాటుపడే, (స్పాన్) థనుంచి, 15-20 రోజుల వయసు వచ్చేంత వరకు అంటే 25-30 మి.మీ.సైజు వచ్చే వరకు (ఫ్రై థ) నర్సరీలలో పెంచుతారు. ఆ తర్వాత ఈ ఫ్రైలను, దాదాపు 100 మి.మీ. సైజుకు (ఫింగర్లింగ్స్ థ) ఎదిగేంత వరకు మరో చెరువులో పెంచుతారు.
చెరువుల రకాలు : మంచి నీటి చేప క్షేత్రంలో ఉండే చెరువులు 3 రకాలు, పెంచే థను బట్టి వీటిని నర్సరీ, రేరింగ్ పాండ్, స్టాకింగ్ (గ్రో అవుట్) పాండ్గా పిలుస్తారు.
ప్రీ స్టాకింగ్ యాజమాన్య పద్ధతి : దీనిలో చేప పిల్లల పెంపకం జూన్ నెల నుండి సెప్టెంబర్, అక్టోబర్ నెల వరకు సాగుతుంది. దీని యందు చెరువు తయారీ అతి ముఖ్యమైనది. చెరువు తయారీ నందు చెరువు ఎండబెట్టడం, దున్నడం, సున్నం చల్లడం, నీరు పెట్టడం, ఎరువులు వాడడం అనే థలుంటాయి.
కలుపు మొక్కలు / నీటి మొక్కలు తొలగించుట:
వీటిని మనుషులు లేక యాంత్రిక పద్ధతుల ద్వారా నివారించుకోవాలి, గడ్డి చేపలను హెక్టారుకి (100-200) పెంచుట ద్వారా చాలా రకాలైన కలుపు మొక్కలను జీవపరంగా నివారించవచ్చు.
నర్సరీ కుంటలను ఎండబెట్టడం : అడుగు భాగం బాగా బీటలు వారునట్లు ఎండబెట్టాలి. ఫలితంగా వ్యాధికారక క్రిములు, పరాన్న జీవుల వివిధ థలు నశిస్తాయి. మట్టి కుంటల అడుగు భాగమును బాగా దున్నించాలి ఫలితంగా భూమిలో విష వాయువులు గాలిలో కలిసిపోతాయి. భూమిలో నత్రజని స్థిరీకరించబడుతుంది. ఫలితంగా నేల సారం పెరిగి సహజ ఆహరం / ప్లవకాలు వృద్ధికి దోహదపడుతుంది.
సున్నం వాడకం : సున్నం వాడకం వలన నేలలో నిక్షిప్తమై యున్న పోషకాలు విడుదలవుతాయి. కుంట నేలలో ఉన్న వ్యాధి కారక క్రిములు నశిస్తాయి. నేల పి.హెచ్ ని సమస్థితిలో ఉంచుతుంది. సున్నంనుండి స్పాను పెరుగుదలకు అవసరమైన కాల్షియం అందుతుంది. సాధారణ పరిస్థితులలో ప్రతినెల హెక్టారుకు 250 కిలోల సున్నం చల్లడం అన్ని విధాలా మంచిది.
నీరు పెట్టుట : నర్సరీలకు నీరు పెట్టునప్పుడు 80,100 మైక్రాన్ మెష్ గల రెండు పొరల సంచులలో వడకట్టి పెట్టాలి. నర్సరీ కుంటలతో మొదట నీరు 2 అడుగుల మేర పెట్టాలి.
మెన్యూరింగ్ : స్టాకింగ్ మూడు రోజుల ముందు మెన్యూరింగ్ చేసుకోవాలి. హెక్టారునకు 1000-2500 కిలోల పశువుల పేడను వివిధ దఫాలలో వాడాలి. సాధారణంగా సేంద్రియ ఎరువులైన పేడ, కోడి పెంట, రసాయనిక ఎరువులైన సూపర్ ఫాస్పేట్ / యూరియా వాడాలి.
దీని వలన చేప పిల్లలకు కావలసిన సహజ ఆహారం (ప్లాంక్టాన్) ఉత్పతైన నీటి రంగు గోధుమ రంగులోకి గాని, ఆకుపచ్చ రంగులోని గాని మారుతుంది.
స్టాకింగ్ యజమాన్యత పద్ధతి : ఓ స్పాను స్టాకు చేయునపుడు నర్సరీ లోతు (2 అడుగులు) తక్కువగా ఉండాలి. ఓ 5-8 మి. మీ సైజు గల స్పాను ను ఎకరానికి 20-50 లక్షల వరకు వదులుకోవచ్చు. ఓ ఒకే రకము / జాతికి చెందిన స్పానును మాత్రమే ఒక నర్సరీలో వేసి పెంచాలి.
స్పాను స్టాకు చేయు సమయం : స్పానుని చల్లని వేళలో ఉదయం గాని, సాయంకాలం గాని స్టాకు చేయాలి. మబ్బులు ఉన్నపుడు, ఎండగా ఉన్నప్పుడు స్టాక్ చేయరాదు.
స్పాను స్టాక్ చేయు విధానము :
నర్సరీ నీటికి అలవాటు చేయుట (ఎక్లిమటైజేషన్ )
స్పాను గల పాలిథీన్ బ్యాగులను నర్సరీ నీటిపై ఒక అరగంట ఉంచిన నర్సరీ నీటి ఉష్ణోగ్రత స్పాను గల బ్యాగు నీటి ఉష్ణోగ్రతకు సమానంగా ఉంటుంది.
స్పాను బ్యాగులను తెరచి నర్సరీ నీటిని కొద్ది కొద్దిగా స్పాను బ్యాగుకు కలిపిన పిదప క్రమంగా స్పాను బ్యాగు నీటి నుండి స్పాను నర్సరీ నీటిలోకి ప్రవేశిస్తుంది.
పోస్ట్ స్టాకింగ్ యాజమాన్య పద్ధతి:
అదనపు ఆహారం : ప్లవకాల సాంద్రతను బట్టి స్పాను స్టాక్ చేసిన 2 లేదా 3 వ రోజు నుండి అదనపు ఆహారంగా వేరుశెనగ చెక్క, పచ్చి తవుడు 1:1 నిష్పత్తిలో నర్సరీ నీటిపై చల్లాలి.
మేత ప్రణాళిక : మొదటి వారం శరీర బరువుకు సమానంగాను, రెండవ వారం మొదటి వారంకు రెట్టింపు మేత మరియు మూడవ వారం రెండవ వారం కు రెట్టింపు ఇవ్వాలి. మేతను రెండు సమ భాగాలుగా చేసి రోజులో రెండు దఫాలుగా ఇవ్వాలి. ప్రతి రోజు మేతను ఒక నిర్దిష్ట సమయంలో ఇవ్వాలి. 8వ రోజు నుండి 21 లేదా 28 రోజు వరకు మేతను పొడి రూపంలో వేరుశెనగ చెక్క, తవుడు ఇవ్వాలి. మబ్బులుగా ఉన్నప్పుడు, చిరుజల్లులు పడుతున్నప్పుడు మేతలు ఆపేయాలి.
నర్సరీ నీటి యాజమాన్యంలో రైతులు తీసుకొనవలసిన జాగ్రత్తలు :
నర్సరీ నీరు లేత ఆకుపచ్చగా ఉండే విధంగా ఎరువులు వాడాలి.
నీరు ముదురు ఆకుపచ్చగా ఉంటే నీటి మార్పిడి చేయాలి.
ప్రతి రోజు నర్సరీకి క్రొత్త నీరు పెట్టడం అన్ని విధాలా మంచిది.
మేతలను తగిన పరిణామంలో వాడుకోవాలి. నీటి పి.హెచ్ మార్పులు అధికంగా ఉంటే నీటి మార్పిడి చేయాలి. నర్సరీ నీటి పారదర్శకతను సెచ్చి డిస్క్లో ప్రతి 5 లేదా 6 రోజులకు ఒకసారి పరిశీలించాలి. దీని రీడిరగ్ 25-35 సెం. మీ ఉండాలి.
నమూనా సేకరణ ఆరోగ్య పరీక్షలు : క్రమం తప్పకుండా నర్సరీ నుండి చేప పిల్లలను సేకరించి ఆరోగ్య పరిశీలన చేయాలి. చేప పిల్లల శరీరం పొలుసులు, రెక్కలు పరిశీలించాలి.
చేప పిల్లల సాంద్రత పరిశీలన : స్పాను స్టాక్ చేసిన 12-15 వ రోజున లాగుడు వలతో పట్టి సాంద్రత పరిశీలించి బ్రతుకుదల అంచనా వేసుకోవాలి.
కె. వీరాంజనేయులు, శాస్త్రవేత్త (మత్స్య విభాగము), డా. పి. లలిత కామేశ్వరి, ప్రధాన శాస్త్రవేత్త & హెడ్, డా. టి. క్రాంతి కుమార్, శాస్త్రవేత్త (ఉద్యాన విభాగము), డా. ఎన్. చిరంజీవి, శాస్త్రవేత్త (తెగుళ్ల విభాగము),
డా.ఎస్. ఆదర్శ, శాస్త్రవేత్త (కీటక విభాగము), డా. ఆర్. ప్రవీణ్ బాబు, శాస్త్రవేత్త (విస్తరణ విభాగము), కృషి విజ్ఞాన కేంద్ర, పందిరిమామిడి, డాక్టర్ వైఎస్ ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఫోన్: 9553364265
ఎటియాలజీ, పాథోజెనిసిస్, క్లినికల్ సంకేతాలు, రోగ నిర్ధారణ, చికిత్స, నివారణ, నియంత్రణ
ఫుట్ రాట్ అనేది ప్రపంచవ్యాప్తంగా గొర్రెలు, మేకలను ప్రభావితం చేసే సాధారణ మరియు ఆర్థికంగా ముఖ్యమైన వ్యాధి. ఇది ఫ్యూసోబాక్టీరియం నెక్రోఫోరం (Fusobacterium necrophorum) మరియు డైచెలోబాక్టర్ నోడోసస్ (Dichelobacter nodosus, గతంలో Bacterioides nodosus అని పిలువబడేది) యొక్క ఏకకాల చర్యల వలన కలుగుతుంది. ఇది ఇంటర్డిజిటల్ చర్మం మరియు డెక్క యొక్క కొమ్ము యొక్క ఎపిడెర్మల్ కణజాలం యొక్క దీర్ఘకాలిక బ్యాక్టీరియా సంక్రమణ. అంతేకాకుండా, డెక్కపై గట్టి కెరాటిన్ పూత కూల్చివేయడం అనేది చాలా సందర్భాలలో కుంటితనానికి దారితీసే ప్రధాన లక్షణాలలో ఒకటి. ఫుట్రోట్ గొట్టం ఎపిడెర్మల్ కణజాలం, ఇన్ఫ్లమేటరీ ఎక్సుడేట్స్ మరియు నెక్రోసిస్ వాసన ద్వారా వేరు చేయబడుతుంది. చికిత్స ఖర్చు, మందులు మరియు పరికరాలు, మంద ఉత్పాదకత తగ్గడం మరియు బ్రీడింగ్ స్టాక్ అమ్మకాల నుండి వచ్చే నష్టాల కారణంగా గొర్రెల పరిశ్రమలో ఇది అత్యంత ముఖ్యమైన వ్యాధులలో ఒకటి. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా జంతు ఉత్పత్తిదారులకు గణనీయమైన ఆర్థిక కష్టాలను కలిగిస్తాయి. అందువల్ల, ప్రస్తుత కథనం గొర్రెలు మరియు మేకలలో ఫుట్ రాట్ వ్యాధికి సంబంధించిన ఎటియాలజీ, వ్యాధికారకత, క్లినికల్ సంకేతాలు, రోగ నిర్ధారణ, చికిత్స, నివారణ మరియు నియంత్రణ చర్యలను అన్వేషిస్తుంది.
ఎటియాలజీ
ఫుట్ రాట్ ప్రధానంగా ఫ్యూసోబాక్టీరియం నెక్రోఫోరం అనే బాక్టీరియం వల్ల వస్తుంది, తరచుగా డైచెలోబాక్టర్ నోడోసస్తో కలిసి ఉంటుంది. గొర్రెలలో, 90% కుంటి కేసులు ఫుట్ రాట్ (డైచెలోబాక్టర్ నోడోసస్) వలన సంభవిస్తాయి. ఈ బ్యాక్టీరియా బురదతో కూడిన పచ్చిక బయళ్ల వంటి తేమతో కూడిన వాతావరణంలో వృద్ధి చెందుతుంది. డైచెలోబాక్టర్ నోడోసస్ పెరుగుదలకు ఆక్సిజన్ అవసరం లేదని జీవి యొక్క జీవశాస్త్రం సూచించినప్పటికీ, వ్యాధికారకం 10 రోజుల వరకు గాలికి బహిర్గతమవుతుంది మరియు మట్టి సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది, కొత్త జంతువుల నిల్వ రేటు నాటకీయంగా డైచెలోబాక్టర్ నోడోసస్ యొక్క వేగాన్ని తగ్గిస్తుందని సూచిస్తుంది. ఒక మంద నుండి డి.నోడోసస్ వ్యాధి ప్రక్రియల యొక్క ప్రేరణ మరియు అభివృద్ధిని ఫ్యూసోబాక్టీరియం నెక్రోఫోరం నిర్వహిస్తుంది, అయితే డైచెలోబాక్టర్ నోడోసస్ ప్రసార ఏజెంట్. పాదాలు ఎక్కువగా పెరగడం, అనేక వారాలపాటు పునరావృతమయ్యే లేదా అధిక వర్షపాతం మరియు సాధారణంగా 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు వ్యాప్తి చెందడానికి ప్రధాన కారకాలు మరియు ఫుట్ రోగం ఎక్కువగా వ్యాప్తి చెందడానికి ముందస్తు కారకాలు. ఇన్ఫెక్షన్ సాధారణంగా డెక్క యొక్క సమగ్రత రాజీపడినప్పుడు సంభవిస్తుంది, బాక్టీరియా దాడి చేసి ఇన్ఫెక్షన్ని స్థాపించడానికి అనుమతిస్తుంది.
వ్యాధికారకం
ఫుట్ రాట్ అనేది గాయాలు, పగుళ్లు లేదా కోత ద్వారా డెక్కలోకి బ్యాక్టీరియాను ప్రవేశపెట్టడంతో ప్రారంభమవుతుంది. ఫ్యూసోబాక్టీరియం నెక్రోఫోరమ్ ప్రాథమిక ఆక్రమణదారుగా పనిచేస్తుంది, కణజాలాన్ని మృదువుగా చేస్తుంది మరియు డైచెలోబాక్టర్ నోడోసస్ లోతైన పొరలపై దాడి చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. బాక్టీరియా వాపు, నెక్రోసిస్ మరియు అంతర్లీన కణజాలం నుండి డెక్క కొమ్మును వేరు చేస్తుంది, ఇది కుంటితనానికి దారితీస్తుంది.
క్లినికల్ సంకేతాలు
కుంటితనం, బరువు పెరగడం, తగ్గడం, నడవడానికి లేదా నిలబడడానికి ఇష్టపడకపోవడం మరియు ప్రభావితమైన కాళ్ల నుండి దుర్వాసన రావడం వంటివి ఫుట్ రాట్ యొక్క క్లినికల్ సంకేతాలలో ఉన్నాయి. పెరిగిన మల ఉష్ణోగ్రత, పెరిగిన హృదయ స్పందన కూడా ఫుట్ రాట్ యొక్క సాధారణ లక్షణాలు. సోకిన జంతువులు తేలికపాటి నుండి తీవ్రమైన వరకు వివిధ స్థాయిలలో కుంటితనాన్ని ప్రదర్శిస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో, డెక్క వాపుగా మారవచ్చు, ప్రభావిత ప్రాంతం బాధాకరంగా, ఎర్రబడి, దుర్వాసనతో కూడిన ఉత్సర్గను వెదజల్లుతుంది.
వ్యాధి నిర్ధారణ
పాదం రోగం నిర్ధారించడం అనేది ప్రభావిత జంతువు యొక్క గిట్టల యొక్క సమగ్ర వైద్య పరీక్షను కలిగి ఉంటుంది. పశువైద్యుడు కుంటితనాన్ని అంచనా వేస్తాడు, లక్షణమైన గాయాల కోసం కాళ్ళను పరిశీలిస్తాడు మరియు ఏదైనా ఉత్సర్గ యొక్క వాసన మరియు స్థిరత్వాన్ని అంచనా వేస్తాడు. విలక్షణమైన దుర్వాసన ఉండటం మరియు డెక్క కొమ్ము మరియు అంతర్లీన కణజాలం మధ్య ప్రత్యేక విభజన ప్రధాన రోగనిర్ధారణ సూచికలు. ఫ్యూసోబాక్టీరియం నెక్రోఫోరం మరియు డైచెలోబాక్టర్ నోడోసస్ ఉనికిని నిర్ధారించడానికి యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్టింగ్ వంటి ప్రయోగశాల పరీక్షలు నిర్వహించబడతాయి.
చికిత్స
ఫుట్ రాట్ యొక్క చికిత్స సాధారణంగా దైహిక మరియు సమయోచిత విధానాలను కలిగి ఉంటుంది. చికిత్సలో ఐసోటోనిక్ సెలైన్ ద్రావణాన్ని ఉపయోగించి ప్రభావిత కాళ్లను పూర్తిగా శుభ్రపరచడం మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ 3% మరియు పోవిడోన్-అయోడిన్ 1% ఉపయోగించడం జరుగుతుంది. తీవ్రంగా సోకిన గొర్రెలకు యాంటీబయాటిక్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అవసరం కావచ్చు. పేరెంటరల్లీ, ఆక్సిటెట్రాసైక్లిన్ (10 mg/kg.IM)ను వరుసగా ఐదు రోజుల పాటు ఇవ్వవచ్చు, ఆ తర్వాత మెలోక్సికామ్ (0.5 mg/kg.IM) మూడు రోజుల పాటు ప్రతిరోజూ మూడుసార్లు ఇచ్చి కుంటితనాన్ని తగ్గించవచ్చు. అలాగే, టెట్రాసైక్లిన్ స్ప్రేతో గాయపడిన ప్రాంతాన్ని శుభ్రపరిచిన తర్వాత రెండవ మరియు మూడవ రోజున గాయపడిన డెక్క చుట్టూ వర్తించవచ్చు. సమయోచిత చికిత్సలలో బ్యాక్టీరియా భారాన్ని తగ్గించడానికి మరియు వైద్యంను ప్రోత్సహించడానికి జింక్ సల్ఫేట్ లేదా కాపర్ సల్ఫేట్ వంటి యాంటీ బాక్టీరియల్ పరిష్కారాలతో ఫుట్ బాత్ లేదా స్ప్రేలు ఉంటాయి. దెబ్బతిన్న కణజాలాన్ని తొలగించడానికి మరియు ఉపశమనాన్ని అందించడానికి ప్రభావితమైన గిట్టలను కత్తిరించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
నివారణ మరియు నియంత్రణ
పాదం రోగాన్ని నివారించడం అనేది ప్రధానంగా మంచి నిర్వహణ పద్ధతుల చుట్టూ తిరుగుతుంది. కింది చర్యలు వ్యాధిని నివారించడానికి మరియు నియంత్రించడంలో సహాయపడతాయి:
1. శుభ్రమైన మరియు పొడి పరిసరాలను ఉంచడం: ఎరువును క్రమం తప్పకుండా తొలగించడం మరియు గృహ మరియు పచ్చిక బయళ్లలో సరైన పారుదల, బాక్టీరియా కాలుష్యం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
2. రెగ్యులర్ డెక్క సంరక్షణ: రొటీన్ ట్రిమ్మింగ్ మరియు గిట్టలను తనిఖీ చేయడం వలన ఏవైనా సమస్యలను ముందుగానే గుర్తించి, పరిష్కరించడంలో సహాయపడతాయి, ఇది సంక్రమణ అవకాశాలను తగ్గిస్తుంది.
3. క్వారంటైన్ మరియు బయోసెక్యూరిటీ: కొత్తగా ప్రవేశపెట్టిన జంతువులను వేరుచేయడం మరియు పర్యవేక్షించడం ద్వారా వ్యాధి సోకిన వ్యక్తులను మంద లేదా మందలోకి ప్రవేశపెట్టకుండా నిరోధించవచ్చు.
4. ఫుట్బాత్లు: ఫార్మాలిన్ లేదా కాపర్ సల్ఫేట్ వంటి క్రిమిసంహారక మందులతో క్రమం తప్పకుండా ఫుట్బాత్లు చేయడం వల్ల ఫుట్ రాట్ వ్యాప్తిని నిరోధించడం మరియు నియంత్రించడంలో సహాయపడుతుంది.
5. జన్యు ఎంపిక: మెరుగైన డెక్క ఆరోగ్యం కోసం సంతానోత్పత్తి చేయడం వల్ల గొర్రెలు మరియు మేకలలో పాదాలకు తెగులు సోకే అవకాశం తగ్గుతుంది.
ప్రస్తుతం భారతదేశంలో గొర్రెలు మరియు మేకలలో పాదం రోగంకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ అందుబాటులో లేదు. గొర్రెలు, మేకలకు వచ్చే కాళ్లకుళ్లు వ్యాధి నివారణకు తగిన వ్యాక్సిన్ను అభివృద్ధి చేసేందుకు కొన్ని కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ముగింపు
ఫుట్ రాట్ వ్యాధి (కాళ్లకుళ్లు వ్యాధి) ప్రపంచవ్యాప్తంగా గొర్రెలు మరియు మేకల పెంపకందారులకు ఒక ముఖ్యమైన సవాలుగా ఉంది, ఇది ఉత్పాదకత మరియు ఆర్థిక నష్టాలను తగ్గిస్తుంది. ఎటియాలజీ, పాథోజెనిసిస్, క్లినికల్ సంకేతాలు, రోగనిర్ధారణ మరియు చికిత్స, నివారణ మరియు ఫుట్రాట్తో సంబంధం ఉన్న నియంత్రణ చర్యలను అర్థం చేసుకోవడం, సమర్థవంతమైన నిర్వహణకు కీలకం. రైతులు తమ మందలు మొత్తం ఆరోగ్యం మరియు తగిన నివారణ వ్యూహాలను అమలు చేయడం ద్వారా మరియు వ్యాధి సోకిన పశువులను సత్వరమే నిర్ధారించడం ద్వారా తమ మేకలను మరియు గొర్రెలను కాళ్లకుళ్లు వ్యాధి తీవ్రతను తగ్గించుకోగలరు.
డా. ఎస్. వంశీ కృష్ణ,M.V.Sc., Ph.D. అసిస్టెంట్ ప్రొఫెసర్ & హెడ్, వెటర్నరీ మైక్రోబయాలజీ విభాగం, పశు వైద్య కళాశాల, మమ్నూర్, వరంగల్, పి. వి. నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం, తెలంగాణ. మొబైల్: 87129 08696
డా|| రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం తునికిలో లార్జ్ స్కేల్ బ్యాగ్ ఫార్మింగ్కు సంబంధించిన ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగానికి మూలం కెవికె, తునికి ఛైర్మన్ టి. వినోద్రావు మెదడులో ‘బ్యాగ్ ఫార్మింగ్’ ఆలోచనరావడం, ఆ ఆలోచనకు కార్యరూపం దాల్చడంలో సేంద్రియ సాగులో మంచి దిగుబడులు సాధించటానికి అవసరమైన సలహాలు అందించిన హార్ట్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఎం.ఎస్. సుబ్రమణ్యం రాజుతో పాటు కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త యం. శ్రీనివాస్, కీటక శాస్త్రవేత్త పి. రవికుమార్, సేద్య విభాగ శాస్త్రవేత్త డా|| ఎన్. ప్రతాపరెడ్డి, వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త యం. ఉదయ్ కుమార్ మరియు కెవికె కి సంబంధించిన అనేకమంది క్షేత్రస్థాయి సిబ్బంది సహాయ సహకారాలతో ఈ పరిశోధన నిర్వహించబడింది. పరిశోధనా పద్ధతులు, ఫలితాలు క్రింద వివరించబడ్డాయి.
తక్కువ నీటి వనరులు, మురుగు నీటి పారుదల సౌకర్యం లేని, క్షార మరియు రాతి నేలలు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులలో కూడా బ్యాగ్ ఫార్మింగ్ ద్వారా సేంద్రియ పద్ధతులను అనుసరించి సహచర పంటల యొక్క పెరుగుదల, దిగుబడి మరియు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఈ యొక్క ప్రదర్శన చేపట్టబడింది. ఇక్కడ బ్యాగ్స్ని ఎరువులతో నింపిన తర్వాత రెండు వేర్వేరు పద్ధతులలో అనగా నిలువు మరియు సమాంతర స్థానంలో నేలపై పెట్టడం జరుగుతుంది. టమాటా మరియు క్యారెట్లను నిలువు సంచులలో సహచర పంటలుగా మరియు క్యాబేజీ, టమాట మరియు క్యాలీఫ్లవర్లను సమాంతర సంచులలో సహచర పంటలుగా పండిస్తారు. ఒక నిలువు సంచి నుండి దిగుబడి 2.55 కిలోలు (టమాట మొక్క నుండి దిగుబడి 2.3 కిలోలు మరియు క్యారెట్ 0.25 కిలోలు). ఒక సమాంతర సంచి నుండి దిగుబడి 3.2 కిలోలు (టమాట మొక్క నుండి దిగుబడి 2.4 కిలోలు మరియు క్యాబేజి బరువు 500 గ్రా. మరియు క్యాలీఫ్లవర్ పువ్వు బరువు 300 గ్రా.). ఈ పద్ధతిలో క్యాబేజి పంటను టమాటతో కలిపి సహచర పంటగా పండించినపుడు డైమండ్ బ్యాక్ మాత్ పురుగు యొక్క ఉధృతి తక్కువగా ఉంటుందని గమనించబడింది. కానీ, కొన్ని రకాల చీడపీడలు మరియు వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా కాలీఫ్లవర్ దిగుబడి చాలా తక్కువగా నమోదైంది. అన్ని పంటల నుండి బ్యాగ్ పద్ధతిలో పొందిన మొత్తం దిగుబడి 0.25 ఎకరాల్లో 3.5 టన్నులు.
పరిచయం:
ప్లాస్టిక్ సంచులు లేదా గ్రో బ్యాగ్స్ ఉపయోగించి టెర్రస్ లేదా రూఫ్ టాప్ గార్డెన్లలో కూరగాయలు, పండ్లు మరియు పువ్వులను పెంచడం బాగా ప్రాచుర్యం పొందింది. కానీ ప్రస్తుతం, బ్యాగుల ద్వారా కూరగాయల సాగు జనాదరణ పొందుతుంది. ఎందుకంటే అవి సారం లేని లేదా కూరగాయల పంటలు పండించడానికి అనువుగా లేని నేలల నుండి ఉత్పన్నమయ్యే అనేక సమస్యలను పరిష్కరిస్తున్నాయి. ప్రతి బ్యాగ్ని 50% ఎర్రమట్టి, 50% మాగిన పశువుల పేడని మరియు 100 గ్రా.ల వేపపిండితో నింపడం వల్ల అధిక దిగుబడులకు ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఎరువుల మిశ్రమం వదులుగా వుండటం వల్ల మురుగునీటి సౌకర్యం ఉండి, తగినంత గాలి వేరువ్యవస్థకు అందడం వల్ల మొక్క దృఢంగా పెరగడానికి తోడ్పడుతుంది. బ్యాగ్ల మన్నిక ప్రధాన లోపం, ఎందుకంటే అవి కేవలం రెండు సీజన్లను మాత్రమే తట్టుకోగలవు. మార్కెట్లో లభించే అన్ని గ్రోబ్యాగ్లు పర్యావరణ అనుకూలమైనవి కావు. ఎందుకంటే అవన్నీ బయో డిగ్రేడబుల్ కావు. పాలీప్లాస్టిక్తో చాలా గ్రో బ్యాగ్లు ఏర్పడుతాయి, కానీ అవి విచ్ఛిన్నం కావు. అప్పుడు గ్రోబ్యాగ్లను విసర్జించాల్సిన అవసరం వచ్చినపుడు అవి ఆందోళన కలిగిస్తాయి.
2022 రబీ సీజన్లో తెలంగాణ రాష్ట్రంలోని, తునికి, మెదక్ (జిల్లా) కృషి విజ్ఞాన్ కేంద్రం వ్యవసాయ క్షేత్రంలో 0.25 ఎకరాల విస్తీర్ణంలో బ్యాగ్ ఫార్మింగ్ పై ప్రదర్శన నిర్వహించబడింది. ఈ పద్ధతిలో వివిధరకాల కూరగాయలను ఉదాహరణకు టమాట మొక్కలను క్యారెట్ మొక్కలతో కలిపి నిలువు బ్యాగులలో పండించారు. ఆ బ్యాగులలో 15 కిలోల ఎర్రమట్టి, 15 కిలోల మాగిన పశువుల ఎరువు మరియు 100 గ్రా. వేపపిండి మిశ్రమాన్ని వేసారు. అదేవిధంగా టమాట, క్యాబేజి మరియు క్యాలీఫ్లవర్ మొక్కలను బ్యాగులలో అడ్డం వరుసలలో పెట్టి ఒక్కొక్క బ్యాగులో 25 కిలోల ఎర్రమట్టి మరియు 25 కిలోల మాగిన పశువుల ఎరువు నింపి సమాంతర స్థానంలో పెట్టి పండించారు.
ప్రదర్శన యొక్క హేతుబద్ధత:
తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలలోని నేలలు కూరగాయల సాగుకు అనుకూలమైనవి కావు. వాతావరణ మార్పుల కారణంగా అతి తక్కువ సమయంలో కురిసిన భారీ వర్షాలు చాలా వరకు కూరగాయల పంటలను పూర్తిగా నాశనం చేయడం వల్ల తీవ్రమైన కొరత మరియు ధరలు అందుబాటులో ఉండవు. ఈ వాతావరణ మార్పు వాస్తవికతో బ్యాగ్ ఫార్మింగ్ అనేది అనుకూలమైన పద్ధతి. కూరగాయల పెంపకంలో కలుపు తీయడం చాలా ఖరీదైనది. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాలలో మహిళా కూలీలకు భారీ సంఖ్యలో డిమాండ్ ఉంది. బ్యాగ్ ఫార్మింగ్లో ఈ సమస్య పరిష్కరించబడుతుంది. కూరగాయ పంటలలో తరచుగా ఎక్కువసార్లు కోత కోయాల్సి ఉంటుంది. అది కూడా బ్యాగ్ ఫార్మింగ్లో సులభతరంగా ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో బ్యాగ్ ఫార్మింగ్లో చాలా తక్కువ నీటి వినియోగం ఉంటుంది. ఎందుకంటే సీపేజ్ మరియు బాష్పీభవన నష్టాలు గణనీయంగా చాలా తక్కువగా ఉంటాయి. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న రైతులు బ్యాగ్ ఫార్మింగ్ను అవలంబించడం ద్వారా లాజిస్టిక్స్లో భారీ పొదుపుతో నగరంలోని వినియోగదారులకు అధిక నాణ్యత మరియు సరసమైన ధరలలో కూరగాయలను సరఫరా చేయవచ్చు. భవిష్యత్తులో రైతులు నేలను దున్నకుండా సేంద్రియ పద్ధతిలో బ్యాగ్ ఫార్మింగ్ చేయడం వల్ల, రసాయనిక ఎరువులు మరియు క్రిమిసంహారక మందులను వాడాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల నేలలో కార్బన్ను సమర్ధవంతంగా సంగ్రహించడం మరియు నిలుపుకోవడం వల్ల కార్బన్ క్రెడిట్స్ ప్రోత్సాహకాన్ని పొందవచ్చు. బ్యాగ్ ఫార్మింగ్ ద్వారా కూరగాయల పంటకోత నంతరం నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చు. కాబట్టి, పై వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ రాష్ట్రంలోని కృషి విజ్ఞాన కేంద్రం, తునికి, కౌడిపల్లి (మండలం), మెదక్ జిల్లాలో ఈ క్రింది లక్ష్యాలతో మొక్కల పెరుగుదల, దిగుబడి, ఆదాయం మరియు నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళ యొక్క ప్రభావాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క ప్రదర్శన చేయబడింది.
లక్ష్యాలు:
1. కూరగాయల సాగుకు అనువుగా లేనటువంటి రాతి నేలలను, మురుగునీటి పారుదల సౌకర్యం లేని నేలలు, క్షారనేలలు, సారవంతం లేని నేలలు మరియు తక్కువ నీటి వనరులు ఉన్న నేలలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం.
2. అధిక దిగుబడి మరియు నికర ఆదాయాన్ని ఉత్పత్తి చేయడం
3. నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళను నియంత్రించడానికి.
4. కాలానుగుణంగా మరియు ప్రతికూల కాలానుగుణ పరిస్థితులలో వివిధ పంటలలో సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రామాణీకరించడం.
అవసరమైన పదార్థాలు లేదా వస్తువులు:
ప్లాస్టిక్ సంచులు
పొలంలో మొత్తం 1318 సంచులు పెట్టడం జరిగింది. ఇందులో 945 సంచులు నిలువుగా, 373 సంచులను అడ్డంగా ఉంచారు.
సేంద్రియ ఎరువులు:
నిలువుగా ఉంచిన సంచులలో 30 కిలోల మీడియా (15 కిలోల ఎర్రమట్టి, 15 కిలోల మాగిన పశువుల ఎరువు మరియు 100 గ్రా. వేపపిండి) మరియు అడ్డంగా ఉంచిన సంచులలో 50 కిలోల మిశ్రమం (25 కిలోల ఎర్రమట్టి, 25 కిలోల మాగిన పశువుల ఎరువుల పేడ మరియు 100-200 గ్రా. వేపపిండితో) నింపుతారు.
విత్తనాలు లేదా నారు:
a. టొమాట – 945 మొక్కలు (ఒక సంచిలో 1 మొక్క)
b. క్యారెట్ – 200 గ్రా
c. క్యాబేజీ – 373 మొలకలు (ఒక సంచిలో 1 మొక్క)
d. కాలీఫ్లవర్ – 373 మొక్కలు (ఒక సంచిలో 1 మొక్క)
నాటే దూరం:
a. నిలువ సంచులు: వరుసల మధ్య దూరం 2 అడుగులు మరియు వరుసలోని సంచుల మధ్య దూరం 2 అడుగులు.
b. అడ్డం సంచులు: వరుసల మధ్య 3 అడుగులు మరియు వరుసలోని సంచుల మధ్య 2 అడుగులు.
బిందు సేద్యం: డ్రిప్ పైపులను బ్యాగులపై అమర్చి, బిందుసేద్యం పద్ధతిలో ఇరిగేషన్ ఇవ్వడం జరుగుతుంది.
ఊతం ఇవ్వడం (స్టేకింగ్): టమాట పంటకు ఊతం ఇవ్వడానికి వెదురుకర్రలు, స్త్ర| తీగను మరియు జనపనార తాడుని ఉపయోగించారు.
ఎరువుల మిశ్రమం తయారీ విధానం:
ఎర్రమట్టి, మాగిన పశువుల ఎరువును అవసరమైన పరిమాణంలో సేకరించి అ్పుఔ సహాయంతో బాగా కలపబడుతుంది.
సరిగ్గా కలుపబడిన మిశ్రమాన్ని అవసరమైన పరిమాణంలో బ్యాగులలో నింపబడుతుంది. తరువాత, పొలంలో అంతరం ప్రకారం సంచులను ఉంచుతారు. ఆ తర్వాత, బ్యాగులపై డ్రిప్ లైన్ వేయబడుతుంది. మరియు ప్రతి బ్యాగు వద్ద నీరందించడానికి డ్రిప్పర్ను అమర్చుతారు.
ఫలితాలు మరియు చర్చ:
గత కొన్ని సంవత్సరాల నుంచి పంటల సాగులో విచక్షణా రహితంగా రసాయనిక ఎరువులు మరియు పురుగు మందులు ఉపయోగించడం వలన నేలలు ఉత్పాదకతను కోల్పోయాయి. దానికి తోడు అనవసరంగా పొలాన్ని ఎక్కువగా దున్నడము, సేంద్రియ ఎరువులు సక్రమంగా ఉపయోగించకపోవడం, ఏక పంట విధానం, వ్యవసాయ వ్యర్థాలను సక్రమంగా వినియోగించలేకపోవడం లాంటి వివిధ రకాల కారణాల వలన నేలపై మట్టి కొట్టుకుపోవటం, నేలలో సేంద్రియ పదార్థం తగ్గటము, పోషకాలను వినియోగించుకొనే సామర్థ్యం తగ్గడం లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ రకమైన పేలవమైన క్షార మరియు కంకర నేలలలో బ్యాగ్ ఫార్మింగ్ అనుసరించడం ద్వారా మంచి దిగుబడిని ఉత్పత్తి చేయడానికి సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. సేంద్రియ పద్ధతిలో దిగుబడి మరియు నికర ఆదాయాన్ని అంచనా వేయడానికి 2022 రబీ సీజన్లో 0.25 ఎకరాల్లో ప్రదర్శన చేపట్టారు. ఈ పద్ధతిలో 20.11.2022న 1318 సంచులలో 945 సంచులులో (నిలువు స్థానం) టమాటా మొక్కలను నాటారు మరియు అదే సంచులలో 23.11.2022న క్యారెట్ విత్తనాలు (సుమారు 12 నుండి 15 మొక్కల కోసం) విత్తారు. మిగిలిన 373 సంచులలో (సమాంతర పద్ధతి), ప్రతి సంచిలో టమాటా, క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్లను ఒక్కో మొక్కను నాటారు.
ఎ. పోషకాల నిర్వహణ: మొదట్లో పంటకు అవసరమైన పోషకాల అవసరాలను తీర్చడానికి, ఎర్రమట్టి, మాగిన పశువుల పేడ మరియు వేపపిండి నుండి సరఫరా అయ్యే పోషకాలు సరిపోతాయి. పంట ఎదుగుదలకు తర్వాత థల్లో లీటరు నీటికి 20 మి.లీ. పంచగవ్య, 100 లీ. నీటికి కిడ్నీ బీన్ డికాషన్ 1 కిలో, కొబ్బరి నీరు 10 మి.లీ. లీటరు నీటికి, 5 మి.లీ. హ్యూమిక్ ఆసిడ్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయడం మరియు జీవామృతం (1:1 నిష్పత్తిలో), వేస్ట్డికంపోజర్ (1:1 నిష్పత్తిలో) కలిపి మొక్కల మొదట్లో పోయడం ద్వారా పోషకాల డిమాండ్ను తీర్చారు.
బి. మొక్కల పెరుగుదల మరియు దిగుబడులు
ప్రతి మొక్క సరాసరి 7 నుంచి 8 ప్రక్క కొమ్మలను ఉ్పత్తి చేస్తుంది మరియు ఫలదీకరణ శాతం 66%. మొత్తం పంట వ్యవధిలో ప్రతి మొక్క నుండి ఉత్పత్తి అయిన పండ్ల సగటు సంఖ్య 35 మరియు ప్రారంభంలో పండించిన 15 పండ్లు సగటు బరువు 90 గ్రా. మరియు తరువాత పండించిన పండ్ల సగటు బరువు 50 నుండి 55 గ్రా. ఒక మొక్క సగటు దిగుబడి 2.35 కిలోలు మరియు 1318 టమాట మొక్కల నుండి మొత్తం దిగుబడి 150 రోజుల వ్యవధిలో 3.06 టన్నులు. ఈ దిగుబడిని ఒక ఎకరం (8000 మొక్కల)కు లెక్కించినట్లయితే, అప్పుడు ఆశించిన దిగుబడి దాదాపు 24 టన్నులు. సేంద్రియ పద్ధతిలో ఈ దిగుబడి రసాయన పద్ధతి (15 నుండి 16 టన్నులు ఎకరాకు)లో సగటు దిగుబడి కంటే ఎక్కువ.
క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్ పంటలలో డైమండ్బ్యాక్ మాత్ మరియు రసంపీల్చే చీడపీడల ఉధృతి కారణంగా అత్యధికంగా పరుగుమందులను వినియోగించే పంటల జాబితాలో ఇవి కూడా ఉన్నాయి. సేంద్రియ పద్ధతిలో క్యాబేజీ పంటను పండించడం చాలా సవాలుతో కూడుకున్నది. కానీ, క్యాబేజీ పంట నుండి వివిధ సేంద్రియ పద్ధతులను అనుసరించి మొదటి గ్రేడ్ పంట 63% మరియు రెండవ గ్రేడ్ పంట 12% పొందడం జరిగింది. అదేవిధంగా క్యాబేజీని టమాట పంటతో కలిపి పండించినపుడు డైమండ్బ్యాక్మాత్ ఉధృతి తక్కువగా ఉందని గమనించడం జరిగింది. మిగిలిన 25% మొక్కల పెరుగుదల చిన్నదిగా ఉండి, క్యాబేజీ పరిమాణం కూడా చిన్నగా వుండి ఆకారం కోల్పోయింది. క్యాలీఫ్లవర్ పంట నుండి నాణ్యమైన దిగుబడి చాలా తక్కువగా వచ్చింది. దీని నుండి, మొదటి గ్రేడ్ పువ్వులు 30%, రెండవ గ్రేడ్ పువ్వులు 20.37% మరియు 49.5% పువ్వులు మార్కెట్కు పనికిరావు. ఈ యొక్క నాసిరకం దిగుబడికి ప్రధాన కారణం వదులుగా వుండే పువ్వులు ఏర్పడటం, పువ్వులు అధిక ఎండకు గురి కాకుండా ఆకులతో కప్పి వేసినా కూడా గులాబి రంగు పువ్వులు, చిన్న పువ్వులు మరియు పొగాకు లద్దె పురుగు ఉధృతి. 373 బ్యాగ్ల నుండి క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్ దిగుబడి వరుసగా 148 కిలోలు మరియు 56.4 కిలోలు.
క్యారెట్ విత్తనాలను 945 సంచులలో టమాట పంటకు తోడుగా విత్తినారు. 10-12 క్యారెట్ మొక్కలు పెరగడానికి అనుమతించిన సంచుల నుండి 500 నుండి 600 గ్రా.ల దిగుబడి మరియు 15 కంటే ఎక్కువ మొక్కలు పెరగడానికి అనుమతించిన సంచులలో క్యారెట్ వేర్లు అభివృద్ధి సరిగ్గా లేక ఒక్క సంచికి 180-200 గ్రా. దిగుబడి మాత్రమే వచ్చింది. అంతేకాకుండా, సంచులు దెబ్బతినడం వల్ల కొన్ని వేర్లు సూర్యరశ్మికి గురవుతాయి. మరియు ఆవేర్లు సరిగ్గా అభివృద్ధి చెందాక తక్కువ దిగుబడికి దారి తీస్తుంది. 945 బ్యాగుల నుండి మొత్తం నమోదు చేయబడిన క్యారెట్ దిగుబడి 236.25 కిలోలు.
సస్యరక్షణ:
పంట ఎదుగుదల సమయంలో వివిధ తెగుళ్లు మరియు వ్యాధులు గమనించబడ్డాయి. టమాట హైబ్రిడ్ ఆర్కాఅభేద్ ప్రారంభథలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు లక్షణాలు కనిపించలేదు. నాటిన 60-70 రోజులలో ఈ తెగులు లక్షణాలు గమనించబడింది. కానీ ఈ యొక్క తెగులుని 10 నుండి 15 రోజుల వ్యవధిలో క్రమం తప్పకుండా ఒక లీటరు నీటికి 5 మి.లీ. సూడోమోనాస్ ఫ్లోర్సెన్స్, 30 మి.లీ. పులియబెట్టిన మజ్జిగ కలిపి పిచికారి చేయడం ద్వారా నియంత్రణలో ఉంది. నాటిన 100 నుంచి 105 రోజులకు ఈ యొక్క తెగులు తీవ్రత మళ్ళీ పెరిగింది. ఈ సమయంలో, బాసిల్లాస్ సబ్బిలిన్ 1 గ్రా. లీటరు నీటికి 4 నుండి 5 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయడం వలన ఈ తెగులును సమర్ధవంతంగా నియంత్రించవచ్చు.
చీడపీడలలో ముఖ్యంగా గుండుసూది పురుగు యొక్క ఉధృతి శనగపచ్చ పురుగు మరియు పొగాకు లద్దె పురుగు కంటే ఎక్కువగా ఉంది. గుండుసూది పురుగు, శనగపచ్చ పురుగు మరియు పొగాకు లద్దె పురుగుల వల్ల వచ్చిన సగటు దిగుబడి నష్టం వరుసగా 3%, 2% మరియు 1% నాటిన వెంటనే లింగాకర్షక బుట్టలు మరియు దీపపు ఎరలను అమర్చడం ద్వారా ఈ కాయ తొలుచు పురుగులను సమర్ధవంతంగా నియంత్రించవచ్చు. నాటిన 60 రోజుల తర్వాత 10 నుంచి 15 రోజుల విరామంతో నాలుగు సార్లు లీటరు నీటికి సీతాఫలం+వేసనూనె 5 మి.లీ. చొప్పున, అదేవిధంగా బాసిల్లస్ థురింజెన్సిస్ 2 మి.లీ. మరియు బవేరియా బస్సియానా లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారి చేయడం ద్వారా నియంత్రించవచ్చు.
రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గిగంచడానికి, పది పసుపు మరియు పది నీలి రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయబడ్డాయి. అదేవిధంగా సీతాఫలం+వేపనూనె లీటరు నీటికి 5 మి.లీ. చొప్పున కలిపి క్రమం తప్పకుండా పిచికారి చేయడం వల్ల ఉధృతి తగ్గింది. టమాటలో పండించిన క్యారెట్లో ఎలాంటి చీడపీడలు కన్పించలేదు. కానీ ముఖ్యంగా మార్చి నెలలో అధిక ఉష్ణోగ్రత కారణంగా క్యారెట్లో పగుళ్ళు కన్పించాయి. టమాట, క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్ పంటలను 373 సంచులలో పండించారు. ఈ 373 క్యాబేజీ మొక్కల నుండి 63% మొదటి గ్రేడ్ నాణ్యమైన క్యాబేజీ పండించబడింది. రెండవ గ్రేడ్లో 12% అంటే డైమండ్ బ్యాక్ మాత్తో కొద్దిగా సోకినవి మరియు మిగిలిన 25% మొక్కలు చిన్నగా మరియు ఆకారం కోల్పోయిన క్యాబేజీలను ఉత్పత్తి చేసినవి. టమాట పంటతో కలిపి క్యాబేజీ సాగు చేస్తున్నప్పుడు డైమండ్బ్యాక్ మాత్ ఉధృతి తక్కువగా ఉంది. అన్ని పంటలకు ఇదే రకమైన సస్యరక్షణ చర్యలు అనుసరించబడ్డాయి.
ఆయా పంటలకు అనువైన ఉష్ణోగ్రత:
ఎ. టొమాట : 15-32 డిగ్రీల సెంటీగ్రేడ్
బి. క్యాబేజీ : చల్లని మరియు తేమతో కూడిన వాతావరణం అవసరం మరియు పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే మించకూడదు
సి. కాలీఫ్లవర్ : చల్లని మరియు తేమతో కూడిన వాతావరణం అవసరం మరియు పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే మించకూడదు
డి. క్యారెట్ : 18 – 24 డిగ్రీల సెంటీగ్రేడ్
ముగింపు
ఈ ప్రస్తుత ప్రదర్శన నుండి, టమోటా పంట దిగుబడి, పరిమాణం మరియు నాణ్యత సాంప్రదాయ పద్ధతి కంటే బ్యాగ్ ఫార్మింగ్లో మెరుగ్గా ఉంది. అదేవిధంగా టమాట మరియు క్యారెట్, టమాట, క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్ వంటి సహచర పంటల నుండి మంచి దిగుబడులు పొందవచ్చని నిర్ధారించబడింది. కానీ క్యాలీఫ్లవర్ పంట కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా నాణ్యత లేని పువ్వులను ఉత్పత్తి చేసాయి. బ్యాగ్ ఫార్మింగ్లో నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు లక్షణాలు కనబడలేదు. ఎందుకంటే సంచుల నుండి అదనపు నీరు బయటకు పోతుంది. బ్యాగుల నుండి నీటి ఆవిరి రేటు సాంప్రదాయ పద్ధతికంటే తక్కువగా ఉన్నందున దీనికి తక్కువ నీరు అవసరం.
తద్వారా కూరగాయ పంటలను పండించడానికి ప్రతికూల పరిస్థితులు ఉన్న నేలలలో కూడా బ్యాగ్ ఫార్మింగ్ ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు. రైతులు ఈ పద్ధతిలో చీడపీడలను మరియు కలుపు సమస్యను అరికట్టవచ్చు. బహుళ పంటలను పండించటం వల్ల ఏకపంట కంటే మెరుగైన ఆదాయాన్ని పొందవచ్చు.
యం. శ్రీనివాస్, శాస్త్రవేత్త (హార్టికల్చర్), డా. సాంబాది దత్తాత్రేయ నల్కర్, సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్, పి. రవి కుమార్ శాస్త్రవేత్త, (కీటక విభాగం), డా. ఎన్. ప్రతాప్ రెడ్డి, శాస్త్రవేత్త (సేద్య విభాగం), యం. ఉదయ్ కుమార్, శాస్త్రవేత్త (వ్యవసాయ ఇంజనీరింగ్), డాక్టర్ రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం, తునికి, మెదక్ (జిల్లా), తెలంగాణ-502 316, ఇ-మెయిల్: kvkmedak2@gmail.com
పెరుగుతున్న నిరుద్యోగులకు అవసరమయిన ఉపాధి అవకాశాలు చూపించే సత్తా మనదేశంలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకే ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు. మన దేశంలో జనాభాతో పాటు నిరుద్యోగుల సంఖ్య కూడా ఏఏటికాయేడు పెరుగుతూనే ఉంది. కొత్తగా స్థాపించే పరిశ్రమలు కాని, సేవా రంగాలు కాని, ప్రభుత్వ ఉపాధి అవకాశాలు గాని నిరుద్యోగులందరికి ఉద్యోగ అవకాశాలు చూపించలేకపోతున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి నిరుద్యోగ యువత వ్యవసాయం మరియు దాని అనుబంధరంగాలవైపు అడుగులు వేస్తున్నారు. కాని కొంతమంది అవగాహన లేకుండా ఎక్కువ పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు. అలా నష్టపోయిన వారిని చూసి కొంతమంది వెనుకంజవేస్తున్నారు. కాని అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తక్కువ పెట్టుబడితో ఉపాధి అవకాశాలను మొదలుపెట్టి జాగ్రత్తలు పాటించినట్లయితే తప్పని సరిగా ఫలితం పొందవచ్చు. తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టగలిగే లాభదాయకమయిన వ్యవసాయ అనుబంధ రంగాలలో నాటుకోళ్ళ పెంపకం ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. 100 కోళ్ళతో నాటుకోళ్ళ పెంపకం చేపట్టి కుటుంబ అవసరాలకు సరిపోను ఆదాయాన్ని పొందవచ్చు అంటున్నాడు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం, చిన్న ఆగిరిపల్లికి చెందిన శివనాగమల్లేశ్వరరావు.
2004 నుండి 2015 వరకు అంటే 11 సంవత్సరాల పాటు బ్రాయిలర్ కోళ్ళ పెంపకం చేపట్టి వివిధ రకాల కారణాల వలన బ్రాయిలర్ కోళ్ళ పెంపకాన్ని ఆపివేసి 2015 నుండి నాటు కోళ్ళ పెంపకం చేపట్టి కొనసాగిస్తున్నాడు. నాటుకోళ్ళతో పాటు గిన్నెకోళ్ళు కడక్నాథ్ కోళ్ళు, టర్కీకోళ్ళు, బాతుల లాంటి వాటిని కూడా పెంపకం చేస్తూ తనకు అనుభవం ఉన్న రంగంలో కొనసాగుతున్నాడు. బ్రాయిలర్ కోళ్ళ పెంపకానికి ఏర్పాటు చేసిన మౌలిక వసతులు ఉన్నాయి కాబట్టి కేవలం కోళ్ళను మాత్రమే కొనుగోలు చేసుకుంటే సరిపోతది కాబట్టి 2015వ సంవత్సరం కేవలం 70 నాటుకోళ్ళతో మొదలు పెట్టడం జరిగింది. కొత్తగా ఈ రంగంలో అడుగు పెట్టేవారు షెడ్ నిర్మాణానికి ఎక్కువ ఖర్చులు పెట్టకుండా తక్కువ ఖర్చుతో కోళ్ళు తడవకుండా షెడ్ ఏర్పాటు చేసుకుంటే పెట్టుబడి తగ్గించుకోవచ్చనే సలహా ఇస్తున్నాడు. కోళ్ళను ఫ్రీరేంజ్లో తిప్పినట్లయితే అందుబాటులో ఉన్న కలుపు గింజలు, పురుగులు, చిన్నచిన్న మొక్కలను తింటాయి కాబట్టి కోళ్ళకు రోగనిరోధక శక్తి పెరిగి జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి శివనాగమల్లేశ్వరారవు అదే పద్ధతిని అనుసరిస్తున్నాడు. దాణాగా గంట్లు, రాగులు, నూకలు, వడ్లు వంటివి అందిస్తున్నాడు.
మొదటలో కోళ్ళు పొదగటానికి ఎలాంటి కృత్రిమ పద్ధతులు ఉపయోగించకుండా ప్రకృతి సిద్ధమైన పద్ధతులనే అనుసరించాడు. ఈ పద్ధతిలో జననాల రేటు ఆశాజనకంగా ఉండకపోవటముతో 2018 వ సంవత్సరం 3500 పిల్లల ఉత్పత్తి సామర్థ్యం గల ఇంకుబేటరుకు అప్పట్లో 2,10,000/- లు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. బ్యాచికి 3500 గుడ్లకు గాను 3000 పిల్లలను పొందుతూ అందులో 500 పిల్లలను సొంతానికి ఉపయోగించుకుంటూ ప్రతి బ్యాచికి 2500 పిల్లల చొప్పున అమ్మకం చేసుకుంటూ వస్తున్నాడు.
అన్ని సక్రమంగా ఉంటే నాటుకోళ్ళు 5 నుంచి 6 నెలలలో రెండు నుండి రెండున్నర కిలోల వరకు ఎదుగుతాయి. కోళ్ళకు అందించే నీటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ప్రతిరోజు మంచి శుభ్రమైన నీటిని అందించటంతోపాటు నీటి పాత్రలను ప్రతిరోజు శుభ్రం చేస్తూ ఉండాలి. కోళ్ళ ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా డాక్టరును సంప్రదించి క్రమం తప్పకుండా సక్రమ సలహాలను పాటిస్తూ తోటి కోళ్ళ పెంపకందార్లును కూడా కలుస్తూ వారి అనుభవాలను తెలుసుకుంటూ ఉండాలి. ఆరోగ్య విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చూపించినా కూడా కోళ్ళను నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి కోళ్ళకు అందించే టీకాల విషయంలో ఎలాంటి అశ్రద్ధకు తావు ఇవ్వకుండా క్రమం తప్పకుండా తను పెంపకం చేసే కోళ్ళకు అన్ని టీకాలు సమయానుసారం అందిస్తూ వస్తున్నాడు.
మార్కెటింగ్ విషయంలో మధ్యవర్తుల మీద ఆధారపడకుండా సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నాడు. సామాజిక మాద్యమాలను సక్రమంగా వినియోగించుకోవటంతోపాటు కోళ్ళను ప్రకృతిసిద్ధంగా పెంపకం చేస్తున్నాడు కాబట్టి కోడి మాంసం రుచిని ఒకసారి చూసిన వారు ప్రక్కవారికి చెప్పడంతో పాటు మరలా, మరలా కొనుగోలు చేస్తుండడము వలన తాను పెంపకం చేసే కోళ్ళ మార్కెటింగ్ విషయంలో శివనాగమల్లేశ్వరరావు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదు. గత 19 సంవత్సరాల నుండి ఈ రంగంలో ఉన్నాడు కాబట్టి వినియోగదారులు నేరుగా కొనుగోలు చేయడంతోపాటు వేరే రకాల గురించి కూడా అడుగుతున్నారు కాబట్టి వినియోగదారులకు అన్ని రకాలను అందించాలనేధ్యేయంతో నాటుకోళ్ళతో పాటు కడక్నాథ్ కోళ్ళు, గిన్నె కోళ్ళు, టర్కీ కోళ్ళు, బాతుల లాంటివాటిని కూడా పోషిస్తూ వినియోగదారులకు ఎక్కువ రకాల కోళ్ళను అందుబాటులో ఉంచుతున్నాడు.
కోళ్ళ పెంపకం దగ్గర పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాముల నుంచి రక్షణకొరకు కొన్ని టర్కీ మరియు గిన్నె కోళ్ళను పెంచినట్లయితే పాముల సంచారం తగ్గుతుందని భావించి వాటి పెంపకం చేపట్టి కొనసాగిస్తున్న సమయంలో వినియోగదారులు వీటిని కూడా అడుగుతున్నారు కాబట్టి వాణిజ్యసరళిలో వాటిని పెంచుతున్నాడు. కాని కొత్తగా ఈ రంగంలో అడుగుపెట్టే వారు టర్కీ మరియు గిన్నె కోళ్ళను ఎక్కువ కొనుగోలు చేయకుండా ఒక్కొక్క రకం 10 చొప్పున కొనుగోలు చేసి పోషిస్తుంటే పాముల నుండి రక్షణ లభించడంతోపాటు వినియోగదారుల అవసరాలను పరిశీలించగలిగితే ముందుముందు వాటిని కూడా వాణిజ్యసరళిలో పెంపకం చేయవచ్చు అని కొత్తవారికి శివనాగమల్లేశ్వరరావు సలహా ఇస్తున్నాడు. మరిన్ని వివరాలు 9492979049 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
లేగదూడలలో అధిక మరణాలు కలుగ చేసే వ్యాధులలో ముఖ్యమైనది తెల్ల పారుడు వ్యాధి. ఈ వ్యాధి ఇ.కోలి అనే సూక్ష్మ క్రిమి ద్వారా వస్తుంది. ఈ సూక్ష్మ జీవి సహజ సిద్ధముగా దూడ పేగులలో ఉంటుంది. ఐతే ఈ సూక్ష్మజీవిలో కొన్ని రకాలు వ్యాధిని కలుగ చేసే స్వభావమును కలిగి ఉంటాయి. దూడలు అపరిశుభ్రమైన పొదుగు లేదా పాత్రలలో పాలు తాగినప్పుడు, ఒక్కసారిగా ఎక్కువగా పాలు తాగినప్పుడు, వెన్న ఎక్కువగా ఉన్న చివరి పాలు తాగినప్పుడు, చల్లగా ఉన్న పాలను తాగినప్పుడు, పాలు తాగే సమయాలలో వ్యత్యాసము ఉన్నప్పుడు, జున్నుపాలు సరిగా తాగనప్పుడు, దూడల వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు హానికర ఇ.కోలి సంఖ్య పెరిగి తెల్లపారుడు వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధి తీవ్రత గేదె మరియు సంకర జాతి దూడలలో ఎక్కువగా ఉంటుంది. వ్యాధి సోకిన దూడలు తెల్లగా పారతాయి. పారినప్పుడు బాగా దుర్వాసన వస్తుంది. దూడల శరీరము నుండి నీరు కోల్పోయి కనుగుంటలు బాగా లోపలికి పోయి ఉంటాయి. చర్మము ముడుతలు పడి ఉంటుంది. దూడ ఎక్కువగా పారి నీరసించి చనిపోతుంది. ఈ వ్యాధిని అరికట్టడానికి సాధారణముగా యాంటిబయోటిక్ మందులను వాడతారు. ఐతే నేడు అధికముగా యాంటిబయోటిక్ మందులను వాడడము వలన యాంటిబయోటిక్కు గూడా లొంగని ఇ.కోలి సూక్ష్మజీవి రకాలు కొత్తగా రూపాంతరము చెందాయి. ఇవి గనుక దూడలకు సోకితే ఎటువంటి యాంటిబయోటిక్ మందు పనిచేయక దూడ తప్పనిసరిగా చనిపోతుంది. ఇటువంటి సూక్ష్మజీవులు మనుషులకు గూడా అత్యంత ప్రమాదకరము. కాబట్టి వీటిని నివారించాలంటే ప్రత్యామ్నాయ మందులు అవసరము. ఇటువంటి ఒక ప్రత్యామ్నాయమే స్వీయ ప్రోబయాటిక్స్. స్వీయ ప్రోబయాటిక్స్ ను అదే జాతికి చెందిన ఆరోగ్యమైన దూడల పొట్టనుండి వేరుచేసి తయారు చేస్తారు. సాధారణ ప్రోబయాటిక్స్తో పోలిస్తే స్వీయ ప్రోబయాటిక్స్ వ్యాధి కారక సూక్ష్మజీవులను సమర్ధవంతముగా అరికడతాయి. స్వీయ ప్రోబయాటిక్స్ను అదే జాతికి చెందిన దూడలనుండి సంగ్రహించడము వలన ఇవి సులభముగా పేగుల లోపల చేరి పేగు గోడలకు అంటుకొంటాయి. ఇవి ఇతర హానికరమైన సూక్ష్మజీవులను పేగు గోడలకు అంటుకోకుండా చూస్తాయి. దీని వలన వ్యాధి కారక సూక్ష్మజీవుల పెరుగుదల జరగక అరికట్ట బడతాయి.
స్వీయ ప్రోబయాటిక్స్ మీద డిపార్ట్మెంట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, భారత ప్రభుత్వము వారు ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ను డిపార్ట్మెంట్ అఫ్ మైక్రోబయాలజీ, ఎన్. టి. ఆర్ పశువైద్య శాలకు మంజూరు చెయ్యడము జరిగినది. ఈ ప్రాజెక్ట్లో నెల లోపు ఆరోగ్యకరమైన, ఎటువంటి యాంటిబయోటిక్ మందులు వాడని లేగ దూడల నుండి లాక్టోబాసిల్లస్ అనే ప్రోబయాటిక్ సూక్ష్మజీవిని వేరు చెయ్యడము జరిగినది. ఈ విధముగా వేరు చేసిన వానిని అవి దూడలకు ఇచ్చినప్పుడు వాని పేగులలో అంటుకొనే శక్తి ఎలా ఉంది, అవి పేగులోని వాతావరణ పరిస్థితులను తట్టుకొని మన గలుగుతున్నాయా, యాంటిబయోటిక్ రెసిస్టెంట్ సూక్ష్మజీవులను సమర్ధవంతముగా అరికడుతున్నాయా, వీనిలో వేనికైనా యాంటిబయోటిక్ రెసిస్టన్స్ ఉందా, ఇవి ఇచ్చినప్పుడు ఏవైనా ఇతర సమస్యలు ఉన్నాయా అనే అంశాల మీద వివిధ పరీక్షలు నిర్వహించి వానిలో మూడు రకాల లాక్టోబాసిల్లస్లను గుర్తించడము జరిగినది. ఈ విధముగా గుర్తించిన మూడు రకాల లాక్టోబాసిల్లస్లను కలిపిన మిశ్రమ స్వీయ ప్రోబయాటిక్ మందును తయారు చెయ్యడము జరిగినది. ఈ విధముగా తయారు చేసిన మిశ్రమ స్వీయ లాక్టోబాసిల్లస్ దూడ పొట్టలో బాగా పెరగడానికి మానాన్ఒలిగోశాఖారైడ్ అనే ప్రీబయోటిక్తో కలిపి చివరిగా సిన్బయోటిక్ అనే మందును తయారు చెయ్యడము జరిగినది. ఈ విధముగా తయారు చేసిన సిన్బయోటిక్ దూడలలో పరీక్షించడము జరిగినది. సిన్బయోటిక్ మందును తీసికొన్న దూడలలో యాంటిబయోటిక్కు కూడా లొంగని ఇ.కోలి సూక్ష్మజీవి సమర్ధవంతముగా అరికట్టడము గమననించడం జరిగినది. అంతే కాకుండా మిగిలిన దూడల కంటే సిన్బయోటిక్ ఇచ్చిన దూడలలో అధిక వ్యాధి నిరోధక శక్తి, పెరుగుదల గూడా గమనించడము జరిగినది. ఆ విధముగా సిన్బయోటిక్ మందు పనితనము నిర్ధారించుకొన్న తరువాత ఈ మందును తెల్ల పారుడు కలిగిన దూడలలో ఇవ్వడము జరిగినది. సిన్బయోటిక్ మందు ఇచ్చిన దూడలలో రెండవ రోజు నుండి తెల్లపారుడు తగ్గి ఐదవ రోజుకు పేడ మామూలుగా మారడము గమనించడము జరిగినది. ఈ విధముగా యాంటిబయోటిక్ అవసరము లేకుండా స్వీయ ప్రోబయాటిక్స్తో తయారు చేసిన సిన్బయోటిక్ దూడలలో తెల్లపారుడు అరికట్ట వచ్చని నిరూపితమైనది.
దూడ పుట్టిన వెంటనే త్రాగించే జున్నుపాల ద్వారా వచ్చే వ్యాధి నిరోధక శక్తి రెండు వారాల వరకే ఉంటుంది. తరువాత దూడ లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి క్రమముగా వివిధ వ్యాధుల బారిన పడే అవకాశముంది. దూడలకు తెల్ల పారుడు రాకుండా ముందుగానే ఈ సిన్బయోటిక్ మందును వరుసగా రెండు వారాలు వాడితే ఈ వ్యాధి సమర్ధ వంతముగా అరికట్టబడడమే కాకుండా దూడలలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. యాంటిబయోటిక్తో పోలిస్తే ఈ మందు ఖర్చు గూడా బాగా తక్కువ. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, భారత ప్రభుత్వము మరియు డిపార్ట్మెంట్ అఫ్ మైక్రోబయాలజీ, ఎన్.టి.ఆర్ పశువైద్య కళాశాల వారి సహకారంతో తయారు చేసిన ఈ మందును రైతులకు అందించడము కొరకు మందు తయారీ టెక్నాలజీని తయారీ దారులకు మార్పిడి చేస్తున్నాము. కావున స్వీయ ప్రోబయాటిక్స్తో తయారు చేసిన సిన్బయోటిక్ త్వరగా పశుపోషకులు అందుతుందని ఆశిస్తున్నాము.
డా. ఎం. శ్రీవాణి, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, డిపార్ట్మెంట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్ట్, ఎన్.టి.ఆర్. పశువైద్య కళాశాల, గన్నవరం, కృష్ణా జిల్లా, ఫోన్: 995138 3366
‘రైతునేస్తం’ శిక్షణలో వ్యవసాయ శాఖ విశ్రాంత అదనపు సంచాలకులు డా|| కె. రామచంద్రం
హరితవిప్లవం పేరుతో అప్పటి పరిస్థితులకు అనుకూలంగా వ్యవసాయంలో రసాయనాలు ప్రవేశపెట్టడం జరిగింది. అప్పట్లో ఉన్న వ్యవసాయ పద్ధతులు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార పదార్థాలను అందించలేక పోవడంవల్ల ప్రజలు ఆకలితో అలమటించ వలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ విపత్కర పరిస్థితుల నుండి బయట పడడానికి వ్యవసాయంలో రసాయనాలు, అధిక దిగుబడినిచ్చే వంగడాలను ప్రవేశ పెట్టి ప్రజల ఆకలిని తీర్చగలిగారు. కాని వివిధ రకాల కారణాల వలన రైతులు విచక్షణా రహితంగా రసాయనాలు వాడడానికి అలవాటు పడడం వలన పెట్టుబడులు పెరిగి పంటల సాగు గిట్టుబాటు కాకపోవడంతో పాటు విచక్షణా రహిత రసాయనాల వాడకం వలన నేల, నీరు, గాలి, వాతావరణం కలుషితమై ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ సమస్యలన్నింటికి పరిష్కారం సేంద్రియ సాగే అని జులై 9న నాబార్డు సహకారంతో ‘రైతునేస్తం’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికారాబాదు జిల్లా కొత్తగడి గ్రామంలో మోహన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ సాగు, పంట ఉత్పత్తులకు విలువ జోడిరపుపై జరిగిన అవగాహన సదస్సులో వ్యవసాయ శాఖ విశ్రాంత అదనపు సంచాలకులు కె. రామచంద్రం అన్నారు. కార్యక్రమంలో సేంద్రియ రైతులు నారాయణ, మనోహరాచారి, మోహన్రెడ్డిలతో పాటు ‘రైతునేస్తం ఫౌండేషన్’ మేనేజరు ప్రసాదరావు పాల్గొన్నారు.
సేంద్రియ సాగు ఆవశ్యకత, సేంద్రియ సాగులో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు, ద్రావణాల తయారీ విధానం, వాటి ఉపయోగాలను మనోహరాచారి వివరించారు. కంది సాగు, కందిలో అంతర పంటల విధానం, కందులకు విలువ జోడిరచి కందిపప్పుగా అమ్మి తన సేంద్రియ సాగును లాభాల బాటలో నడిపిస్తున్న నారాయణ తన అనుభవాన్ని వివరించారు. దొండ, బొప్పాయి పంటల సాగు పద్థతులను క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా చూపిస్తూ రైతు మోహన్ రెడ్డి వివరించారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడిరపునకు సంబంధించిన సమాచారాన్ని, యంత్ర పరికరాల వివరాలను రైతునేస్తం ఫౌండేషన్ మేనేజరు ప్రసాదరావు వివరించారు. అనంతరం శిక్షణకు హాజరైన రైతులకు సర్టిఫికెట్లను అందజేశారు.
జులై 19వ తేదీన కేంద్ర ప్రభుత్వం నాన్-బాస్మతీ బియ్యం ఎగుమతుల్ని తక్షణం నిషేధించింది. గత సంవత్సరం ముందు గోధుమ ఎగుమతుల్ని నిషేధించింది. ఆ తర్వాత గోధుమ పిండి ఎగుమతుల్ని కూడా నిషేధించింది. బియ్యం నూకల ఎగుమతిని కూడా ఆపేసింది. నాన్-బాస్మతీ బియ్యం ఎగుమతులపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. పంచదార ఎగుమతులకు 6.1 మిలియన్ల టన్నుల పరిమితి నిర్ధేశించింది. ఆ మేరకు ఎగుమతులు పూర్తవడంతో పంచదార ఎగుమతులు కూడా నిలిచిపోయాయి. తాజాగా నాన్-బాస్మతీ బియ్యం ఎగుమతిని కూడా పూర్తిగా నిలిపివేసింది. ఈ చర్యలన్నిటివల్ల దేశంలో రైతులు కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నారు. వారికి గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఏర్పడినప్పుడల్లా కేంద్రప్రభుత్వం నిరంకుశ చర్యలతో విరుచుకుపడుతున్నది. పంటలు బాగా పండినప్పుడు వాటికి సేకరణ మద్దతుని అందించకుండా రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్నది. గిరాకీ ఉండి ఎగుమతి అవకాశాలున్నప్పుడు వారికి గిట్టుబాటు ధరలు లేకుండా చేస్తున్నది.
2020 నవంబరు నుండి 2021 నవంబరు వరకు ఉత్తర రాష్ట్రాల రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలనీ, కార్పొరేట్ శక్తుల ఆధిపత్యాన్ని పెంచే మూడు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక ఆందోళన నిర్వహించారు. ఆ ఆందోళనలను ఉక్కు పాదంతో అణిచివేయాలని ప్రయత్నించి, ప్రభుత్వం విఫలమైంది. చివరకు వారికి క్షమాపణ చెప్పి, కనీస మద్దతు ధరలకు చట్టభద్రత కల్పించటానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. కాని ఎన్నికల గండం గట్టెక్కిన తర్వాత ‘ఏరు దాటాక తెప్పతగిలేసిన’ చందంగా వాగ్దాన భంగం చేసింది. ఉద్యమ సమయంలో ఐక్యంగా ఉన్న రైతు సంఘాలు విరమించిన తర్వాత రాజకీయంగా విడిపోయాయి. మళ్ళీ ఉద్యమాలను చేపట్టలేకపోయాయి. గోధుమ ఎగుమతిని నిషేధించినప్పుడు దక్షిణ భారత రైతులు తమకేమీ నష్టం లేదని స్పందించరు. బియ్యం ఎగుమతుల్ని నిలిపివేస్తే ఉత్తర భారత రైతులు బాస్మతీ బియ్యం ఎగుమతిని నిషేధించలేదని ఊరట చెందుతున్నారు. రైతులు ఐక్యంగా లేక, కొద్దిపాటి ఐక్యతను రాజకీయ శక్తిగా మలచుకోలేక భంగపడుతున్నారు. దేశంలో తీవ్రమైన ఆర్థిక అసమానతలున్నా, దేశంలో 84 శాతం మంది ప్రజల వాస్తవాదాయాలు పడిపోతున్నా పేదలు ఎదిరించే పరిస్థితుల్లో లేరు. మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య వైరుధ్యాలను పెంచి, పోషిస్తూ పాలక వర్గాలు పబ్బం గడుపుకుంటున్నాయి. ఆరుగాలం శ్రమించే రైతులు, కూలీలు, కార్మికులు, అసంఘటిత రంగంపై జీవించే వారు పేదరికంలోకి జారిపోతుంటే పెట్టుబడిదార్లు, వ్యాపార వర్గాలు లాభాలు కొల్లగొడుతున్నారు. దేశంలో 145 మంది బిలియనీర్లున్నందుకు గర్విస్తూ, అంబానీ, అదానీలు ప్రపంచంలోఅత్యంత ధనికులుగా ఎగబ్రాకుతున్నందుకు చప్పట్లు చరుస్తూ, అలాంటి సంపద సృష్టి కర్తలను పూజిస్తూ దేశాన్ని పీడిస్తున్న నిరుద్యోగం, పేదరికం, పౌష్టికాహార లోపం సమస్యలే కాదన్నట్లు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. అత్యంత పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను విదిలిస్తూ, కటిక దరిద్రుల సంఖ్య తగ్గిందని సంతోషిస్తున్నాము. సాపేక్షిక పేదరికం, నైరాశ్యంలో ఉన్న రైతులు, గ్రామీణ, పట్టణ పేదలు, స్తంభించిన మధ్యతరగతి జీవన ప్రమాణాలు విధాన కర్తల దృష్టికి రావడం లేదు. కొందరి వద్ద పోగుబడుతున్న సంపద అశేష సంఖ్యలో ఉన్న పేదల జేబుల్లో నుండే వస్తుందనే కార్యకారణ సంబంధాల గురించి అవగాహన మేధావి వర్గాల్లో కూడా లోపించింది. సంపన్నుల పిడికిళ్ల నుండి జారే పెట్టుబడుల ద్వారానే పేదలు తమ ఆదాయాలను మెరుగుపరుచుకోవాలనే దృక్పథం పాలక వర్గాల్లో ఉంది.
బయటకు చెప్పే కారణాలు
దేశంలోని ప్రజలంతా వినిమయదారులే. ద్రవ్యోల్బణం వల్ల వాస్తవాదాయాలు ప్రభావితం అవుతున్నాయి. రెండేళ్ల పాటు కోవిడ్-19 కారణంగానూ, ఒక సంవత్సరంన్నరగా రష్యా-యుక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సమస్యగా మారుతున్నది. వడ్డీ రేట్లు పెరగటం వల్ల కొంత శాంతించినా, ఇంకా సమసిపోలేదు. ద్రవ్యోల్బణంలో మూడు విభాగాలున్నాయి. ఒకటి ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల వల్ల ఏర్పడేది. రెండవది మౌలిక ద్రవ్యోల్బణం. దీనిని ఇంగ్లీషులో ‘కోర్ ఇన్ఫ్లేషన్’ అని వ్యవహరిస్తారు. మూడవది ఆహార ద్రవ్యోల్బణం. వాతావరణంలో వస్తున్న మార్పులు, అతివృష్టి, అనావృష్టి, చీడ, పీడల వల్ల ఆకస్మికంగా కలిగే పరిణామాల వల్ల వ్యవసాయ ఉత్పత్తిలో హెచ్చుతగ్గులేర్పడుతున్నాయి. పంటలు నష్టపోయినప్పుడు, మిగిలిన కొద్ది పంటకు మంచి ధరలు లభిస్తాయి. పంటలు బాగా పండినప్పుడు ధరలు తగ్గుతాయి. ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వాలు ఆదుకోకుండా, పెరిగినప్పుడు అంకుశం విధిస్తే అన్యాయమే అవుతుంది. యుద్ధ ప్రభావం వల్ల ముడిచమురు ధరలు బారెల్కి వంద డాలర్లకు పెరిగి, తర్వాత 80 డాలర్లకు తగ్గింది. చమురు ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం పెట్రోల్, డీజెల్ ధరల్ని పెంచింది. కాని అవి తగ్గినప్పుడు వినిమయదారులకు అదే దామాషాలో ఉపశమనాన్ని కల్గించలేదు. పెట్టుబడిదారీ వ్యవస్థలో పోటీ సరిగ్గా ఉంటే మౌలిక ద్రవ్యోల్బణం తగ్గుతుంది. కాని గుత్తాధిపత్యం వల్ల కంపెనీల ఉత్పత్తుల ధరలు పెరిగి, లాభాలొస్తాయి. కాని మౌలిక ద్రవ్యోల్బణం అదుపులోకి రాదు. సాంకేతిక ప్రగతి, డిజిటల్ విప్లవాల వల్ల ద్రవ్యోల్బణం తగ్గాలి. కాని గుత్త సంస్థలు సాంకేతిక ప్రగతిని తమ లాభాల్ని పెంచుకోవటానికే వాడతాయి. వ్యవసాయ రంగంలో కూడా కొంత సాంకేతిక ప్రగతి ఉన్నా వాతావరణ ప్రభావం ఉత్పత్తిని ఎక్కువగా శాసిస్తున్నది. పాలక వర్గాలు చమురు ధరలు తగ్గించకుండా, గుత్త సంస్థల్ని నియంత్రించకుండా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో విఫలమౌతున్నాయి. కాని వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై మాత్రం ఉక్కుపాదాన్ని మోపుతున్నాయి. గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.8 శాతంగా నమోదైంది. ఒక సంవత్సర కాలంలో బియ్యం ధరలు 11 శాతం పెరిగాయి. ఒక నెలలో మూడు శాతం పెరిగాయి. ఉత్తర భారతంలో అధిక వర్షాలు, వింధ్య పర్వతాల క్రింద వర్షాభావం వల్ల ఉత్పత్తిని కొంత వరకు దెబ్బతీయవచ్చు. వీటిని సాకుగా చెప్పి బియ్యం ఎగుమతుల్ని నిషేధించారు.
కొరతలేని ఉత్పత్తి
800 కోట్ల ప్రపంచ జనాభాలో 300 కోట్ల మందికి వరి బియ్యమే ప్రధాన ఆహారం. అయితే బియ్యంలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల మధమేహం వంటి అనేక దీర్ఘకాల వ్యాధులు ప్రబలుతున్నాయనే ప్రచారం వల్ల బియ్యం వాడకాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు. బియ్యం ఉత్పత్తి, వినిమయాల మధ్య సమతూకం ఉంటున్నది. 2019-20లో ఉత్పత్తి 503.6 మిలియన్ టన్నులు కాగా వినిమయం 501.1 మిలియన్ టన్నులుగా ఉంది. 2020-21లో 518 మిలియన్ టన్నులు కాగా వినిమయం 509.9 మిలియన్ టన్నులుగా ఉంది. 2021-22లో ఉత్పత్తి 526 మిలియన్ టన్నులు కాగా, వినిమయం 522.7 మిలియన్ టన్నులుగా ఉంది. 2019-20లో 181.8 మిలియన్ టన్నుల బియ్యం నిల్వలుండగా 2021-22లో అవి 197 మిలియన్ టన్నులకు పెరిగాయి. 2022-23లో మాత్రం ఉత్పత్తి 517.6 మిలియన్ టన్నులు కాగా, వినిమయం 520.4 మిలియన్ టన్నులు కావటం వల్ల నిల్వలు 195.1 మిలియన్ టన్నులకు తగ్గాయి. 2023 జులైలో వెలువడ్డ అంచనాల ప్రకారం 2023-24లో ఉత్పత్తి 523.7 మిలియన్ టన్నులుండవచ్చనీ, వినిమయం 520 మిలియన్ టన్నులుండవచ్చనీ, నిల్వలు 198.5 మిలియన్ టన్నులకు పెరగవచ్చనీ తెలుస్తున్నది.
ఈ లెక్కలన్నీ ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ వెలువరించినవే. ఈ గణాంకాలు ప్రపంచ స్థాయిలో నిల్వలు తగ్గలేదని తెలుస్తున్నది. ఇక భారత్లో కూడా బియ్యానికి ఎటువంటి కొరత లేదు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 129.47 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తయ్యాయి. వినిమయం 109 మిలియన్ టన్నులు కాగా, ఎగుమతులు 22 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. గత నాలుగేళ్ళుగా బియ్యం నిల్వలు పెరిగాయే కాని తగ్గలేదు. బియ్యం సేకరణను సకాలంలో చేపట్టకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుత్సాహపరుస్తున్నాయి. ‘వరి వేస్తే ఉరే’ నన్న నినాదంతో రైతుల్ని బెదిరించటం మన స్మృతి పథం నుండి చెరిగిపోలేదు. వరి సాగుని తగ్గించాలనీ, అనవసరంగా వరి బియ్యం నిల్వలను నిర్వహించాల్సి వస్తుందని ప్రభుత్వ ప్రతినిధులు సూత్రీకరించారు. వారే ఇప్పుడు వరి బియ్యానికి కొరత ఏర్పడనున్నదనీ, అందుకే ఎగుమతుల్ని నిషేధించామని చెప్పటం హాస్యాస్పదంగా ఉంది. ఈ కొరత ఊహాజనితమేనని ఎగుమతిదార్ల సంఘం చెప్పింది.
ఆహారధాన్యాల నిల్వకు ప్రాతిపదిక
2023 మే చివరి నాటికి దేశంలో గోధుమ నిల్వలు 33.12 మిలియన్ టన్నులు, బియ్యం నిల్వలు 31.14 మిలియన్ టన్నులున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీకి 21.04 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల నిల్వ ఉంటే చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్, మే మాసాల్లో గోధుమ, రబీ వరి బియ్యం సేకరణలో గోదాములన్నీ నిండిపోతాయి. జులై 1వ తేదీకి 41.12 మిలియన్ టన్నులు, అక్టోబరు 1వ తేదీకి 30.77 మిలియన్ టన్నులు, జనవరి 1వ తేదీకి 21.41 మిలియన్ టన్నులు ఆహారధాన్యాల నిల్వ ఉంటే చాలని ప్రభుత్వం మార్గదర్శక సూత్రాలను ప్రకటించింది. జూన్ నుండి సెప్టెంబరు మాసాల మధ్య ప్రజాపంపిణీ వ్యవస్థకు 9.75 మిలియన్ టన్నుల బియ్యం, 7.5 మిలియన్ టన్నుల గోధుమ అవసరమని అంచనా వేసింది. పేదలకు ఉచితంగా అందించే ఆహారధాన్యాల పథకం కోసం 22.9 మిలియన్ టన్నుల బియ్యం, 10.2 మిలియన్ టన్నుల గోధుమలు సరిపోతాయి. ఇవి పోగా అక్టోబరు 1, 2023 నాటికి 10.3 మిలియన్ టన్నుల బియ్యం, 20.8 మిలియన్ టన్నుల గోధుమలు మిగిలి ఉంటాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 10.32 మిలియన్ టన్నుల బియ్యం, 20.52 మిలియన్ టన్నుల గోధుమలు సరిపోతాయి. అక్టోబరు-డిసెంబరు నెలల మధ్య ఖరీఫ్ వరి బియ్యం గోదాములకు చేరతాయి. అక్టోబరు 1వ తేదీకి సరిపోనూ ఆహార నిల్వలుంటున్నప్పుడు ఇంకా కొరత గురించి ఆందోళన ఎందుకు? ఖరీఫ్ వరి దిగుబడుల గురించి అనుమానం, ఆందోళన వల్లనే ఎగుమతుల్ని నిషేధించడం సమర్ధనీయం కాదు. బాస్మతి బియ్యం, ఉప్పుడు బియ్యం ఎగుమతులను ఆంక్షల నుండి మినహాయించారు. ఇప్పటికే ఎగుమతుల కోసం మార్గమధ్యంలో ఉన్న బియ్యం కూడా అనుమతించబడుతుంది. ఇప్పటికే ఎగుమతి ఒప్పందాలు కుదుర్చుకున్న బియ్యం ఎగుమతిని కూడా అనుమతించటం అవసరం. అంతర్జాతీయ వాణిజ్య సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది.
కోల్పోతున్న ఆదాయాలు
గత సంవత్సరం (2022) గోధుమలు, గోధుమ పిండి ఎగుమతుల్ని నిషేధించినప్పుడు గోధుమ ధరలు క్వింటాలుకి రూ. 2700/-నుండి 2200/-కి తగ్గాయి. ఫలితంగా గోధుమ రైతులు టన్నుకి రూ. 5000/-ల చొప్పున కనీసం 60 మిలియన్ టన్నులపై రూ. 30 వేల కోట్లు నష్టపోయారు. అలాగే నూకల ఎగుమతిని నిషేధించి, బియ్యం ఎగుమతులపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించటం వల్ల బియ్యం ధరలు క్వింటాలుకి వెయ్యి రూపాయలు తగ్గాయి. వరి సాగు చేసిన రైతులు 80 మిలియన్ టన్నుల బియ్యంపై 80 వేల కోట్ల వరకు నష్టపోయారు. ఎగుమతులపై నిషేధం, పన్నులు, సుంకాలు లేకుంటే వడ్లకు క్వింటాలుకి రూ. 2200 ధర లభించేది. కాని సేకరణ మద్దతు అందక, కనీస మద్దతు ధర కన్నా రెండు మూడు వందల రూపాయలకు తక్కువకే అమ్ముకోవాల్సి వచ్చింది. బస్తాకు 5 నుండి 10 కిలోలు అదనంగా తీసుకొని మిల్లర్లు లాభించారు. ఈ సంవత్సరం పూర్తి నిషేధం వల్ల వడ్లు, బియ్యం ధరలు ఇంకా తగ్గవచ్చు. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లోనే ప్రభుత్వ విధానాల వల్ల వరి, గోధుమ రైతులు లక్ష కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచామని గొప్పలు చెప్పుకోవటానికీ, వినిమయదారులు, పెట్టుబడిదార్లకు లాభాలనివ్వటానికీ రైతుల ఆదాయాలను పణంగా పెట్టారు. 2022-23లో 22 మిలియన్ టన్నుల నాన్-బాస్మతీ బియ్యం ఎగుమతయింది. ఈ సంవత్సరం దానిని 15 మిలియన్ టన్నులకు తగ్గించేలా ఎగుమతి సుంకాన్ని కొంత పెంచితే సరిపోయేది. కాని పూర్తి నిషేధం బియ్యం ధరలను క్రుంగదీస్తుంది. వడ్లకు గిరాకీ తగ్గి, రైతులు నష్టపోవడం ఖాయం. కొంత దిగుబడి ప్రకృతివైపరీత్యాల వల్ల తగ్గితే, మిగిలిన పంటకు కనీస మద్దతు ధర కూడా లభించకుండా రైతులకు ఖర్చులు కూడా రావు. ప్రపంచ మార్కెట్లో 40 శాతం నాన్-బాస్మతీ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న భారతదేశపు ప్రతిష్ట దిగజారుతుంది. భారత్ను నమ్మకమైన వ్యాపార భాగస్వామిగా గుర్తించరు. 2021-22లో భారత్ నుండి 50 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువగా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. 2022 ఏప్రిల్ నుండి డిసెంబరు వరకు ఎగుమతుల విలువ సుమారు 39 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే కేవలం 2.8 బిలియన్ డాలర్లే ఎక్కువ. దిగుమతుల విలువ కూడా 3.8 బిలియన్ డాలర్లు పెరిగాయి. వ్యాపార మిగులు తగ్గింది. గోధుమ, బియ్యం ఎగుమతుల్లో ఏర్పడిన అవకాశాలను కోల్పోవటం జరిగింది. ఈ పంటల్ని సాగు చేస్తున్న రైతులు ప్రభుత్వ విధానాల వల్ల ఆసక్తిని కోల్పోయి, ఉత్పత్తిని పెంచటంలో ఉత్సాహాన్ని చూపరు. ఎగుమతుల్ని అనుమతిస్తే రైతులు లాభించి మరింత ఎక్కువ పండిస్తారు. వినిమయదారులు, పెట్టుబడిదార్ల ప్రయోజనాల కోసం రైతుల్ని బలి చేయటం అవివేకమౌతుంది. కొరతలేకుండానే నిషేధం విధించి రైతులకు నష్టం కలిగించడం సమర్థనీయం కాదు.
డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త, (రిటైర్డ్ ఞ కన్సల్టెంట్ ఇక్రిసాట్)
జంతుపోషణ రంగాలన్నింటిలో సుస్థిరమైన వేగంతో అభివృద్ధి చెందుచున్న గొర్రెల పెంపకం దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రాముఖ్యతను పెంచుకుంటూ ఉంది. గత మూడు థాబ్దాల కాలంలో పాల ధరలు 3-4 రెట్లు, కోడిగ్రుడ్ల ధరలు మూడు రెట్లు, కోడి మాంసం ధరలు 4-5 రెట్లు మాత్రమే పెరగగా మాంసం ధరలు మాత్రము 8 నుండి 10 రెట్లు పెరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో కిలో మాంసం ధర రూ. 800 నుండి 1000 రూపాయల వరకు ఉంది. ప్రభుత్వం కూడా గ్రామీణ ఉపాధి మరియు సంక్షేమ పథకాల ద్వారా గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. అయితే కనుమరుగై పోతున్న పచ్చిక బీళ్లు, మేతకొరత, వన్యమృగాల నుండి జీవాలతో పాటు పెంపకందారులకు కూడా ఎదురౌతున్న ప్రాణాపాయాలు, తదితర కారణాల వల్ల పూర్వపు సాంప్రదాయ రీతిలో పూర్తిగా ఆరుబయలు బీళ్ల మీద ఆధారపడి జీవాలను పోషించే అవకాశాలు క్షీణించాయి. ఈ విధంగా కొండలు, గుట్టలు, అడవులలో తిరిగి గిట్టలు అరగ దీసుకుని మేసిన మేత వల్ల జీవాల పెంపకం లాభదాయకం కాదని గుర్తించిన పెంపకందారులు చేతి మేతతో పూర్తి సాంద్ర పద్ధతిలో ఎక్కువ పెట్టుబడితో జీవాల పెంపకాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే పోషణతో పాటు సరియైన ఆరోగ్య భద్రతా చర్యలు తీసుకొనకపోతే భారీ నష్టాలకు గురి కావలసి వుంటుందనే వాస్తవాన్ని జీవాల పెంపకం దారులందరూ గ్రహించాలి. ఇరుకైన వసతిలో దగ్గరదగ్గరగా మసలే గొర్రెలలో పి.పి.ఆర్. వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది.
మూడు థాబ్దాల వరకు మన పశువులను, జీవాలను భారీస్థాయిలో కబళించిన చీడపారుడు (రిండర్పెస్ట్) వ్యాధి పూర్తిగా కనుమరుగై పోయిందని ఊపిరితీసుకుంటున్న థలో అదే కోవకు చెందిన మరొక రకం వైరస్ వల్ల 1987లో తొలిసారి తమిళనాడు విల్లుపురం ప్రాంతంలో తలెత్తిన పి.పి.ఆర్. గొర్రెలలో అతివేగంగా వ్యాపిస్తూ మందలలో 30 నుండి 35 శాతం జీవాల ప్రాణాలను తీస్తూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ ప్రాణాంతక వ్యాధి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో భారీ ప్రాణనష్టాన్ని కలిగిస్తూ ఉంది. ఒక అంచనా ప్రకారం జాతీయ స్థాయిలో ప్రస్తుతం ఏటా ఈ వ్యాధి వల్ల సుమారు 600 కోట్లకుపైగా నష్టం జరుగుతూ ఉంది.
పశువులు, ఒంటెలు, కొన్ని వన్యప్రాణులలో కూడా ఈ వైరస్ వ్యాధి కనిపించినప్పటికీ వాటికి ఈ వ్యాధి ప్రాణాంతకం కాదు. అయినా అవి ఈ వైరస్ వాహకాలుగా వ్యాధి వైరస్ను తమ శరీరంలో పెంచి పోషిస్తూ వ్యాధి వ్యాప్తికి దోహదపడతాయి.
జనవరి-మార్చి నెలల మధ్య చలి తీవ్రతలు, ఇతర వాతావరణ పరిస్థితుల వల్ల ఈ వ్యాధి ఉనికి ఇతర మాసాలలో కంటే ఎక్కువగా ఉంటుంది. 4 నెలల నుండి 15 నెలల మధ్య వయస్సు జీవాలలో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి యొక్క నిద్రాణ థ 3 నుండి 7 రోజుల వరకు ఉంటుంది. గాలి, శ్వాస, నీరు, మేతల ద్వారా ఈ ఆర్.ఎన్.ఏ. రకం వైరస్ జీవాల శ్వాస వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది.
పి.పి.ఆర్. వ్యాధి లక్షణాలు: వేగంగా మందలలో వ్యాపించే ప్రమాదకరమైన వైరస్ వ్యాధి సోకిన గొర్రె లేదా మేక తీవ్రమైన జ్వరానికి లోనౌతుంది. ముక్కు నుండి కళ్ల నుండి స్రావాలు ధారగా కారుతూ ఉంటాయి. నోరు అంగుటి, నాలుక మీద పుండ్లు ఏర్పడతాయి. ప్రేగులలో విస్తరించిన వైరస్ వల్ల పారుడు ముఖ్య లక్షణంగా ఉంటుంది. శ్వాస వ్యవస్థలలోని మార్పుల వల్ల దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు ప్రదర్శించిన జీవాలలో మరణాల శాతం 30 నుండి 35 శాతం వరకు ఉండవచ్చు. శవపరీక్షలో పెద్ద ప్రేగుల లోపలి పొర మీద జీబ్రా మార్కు గుర్తులు, ప్రేగుల చుట్టూ ఉండే లింఫుగ్రంథులు వాచి వుండటం, శ్వాసనాళాలలో చీముతో కూడిన రసితో శ్వాసనాళాలు మూసుకు పోవటం వంటి మార్పులు కనిపిస్తాయి. రక్తంలోని సీరం పరీక్షల ద్వారా వైరస్ను ఖచ్చితంగా గుర్తించవచ్చు.
పి.పి.ఆర్. వ్యాధి చికిత్స: వ్యాధిని గుర్తించిన వెంటనే మంద నుండి వేరు చేయాలి. వైరస్ను నిర్మూలించే మందులు లేనప్పటికీ అనుబంధంగా శరీరంలోకి ప్రవేశించిన బాక్టీరియా వల్ల కలిగే ప్రమాదాన్ని నిరోధించుటకు ఆక్సీటెట్రాసైక్లిన్, సెఫటాక్సిమ్, జెంటామైసిన్ వంటి యాంటిబయోటిక్స్తో పాటు బి.కాంప్లెక్స్, డెక్ట్రోసెలైన్ లేదా నోటి ద్వారా కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రాల్ వంటి ద్రవాలు ఉపశమన అవకాశాలను మెరుగుపరచవచ్చు. పారుడు లక్షణాన్ని నివారించడానికి అనేక బహుఔషధ మాత్రలు – పౌడర్లు ప్రముఖ పశువుల మందుల ఉత్పత్తిదారుల నుండి లభ్యమౌతూ ఉన్నాయి.
పి.పి.ఆర్. నివారణ: మందలోకి ప్రవేశించే ప్రతి జీవాన్ని కనీసం వారం రోజులు వేరుగా ఉంచి పరిశీలించి ఆ తర్వాత మాత్రమే ఇతర జీవాలతో కలవనివ్వాలి. సంచార మందలు పయనించే మార్గాలకు గొర్రెల షెడ్లను కొంత దూరంలో ఏర్పాటు చేసుకోవాలి. గొర్రెల ప్రాంగణం ప్రవేశం వద్ద ఏర్పాటు చేసిన క్రిమిసంహార లోషన్ తొట్టెల గుండా మాత్రమే జీవాలు, నిర్వాహకులు ప్రవేశించాలి.
గొర్రెకు కనీసం 5-6 చదరపు అడుగుల వసతిని ఏర్పాటు చేస్తే మంచిది. ఈ వ్యాధి వైరస్ ప్రమాదకరమైనదే అయినా శరీరాల బయట కొన్ని గంటలు మాత్రమే సజీవంగా ప్రాణాంతకంగా జీవించి ఉండగలదు. అయితే శీతల పరచిన మాంసంలో అనేక రోజులు సజీవంగా ఉండి వ్యాధి వ్యాప్తికి కారకం కావచ్చు.
పి.పి.ఆర్. టీకాలు: టీకాలు పొందిన తల్లులకు జన్మించిన పిల్లలకు తల్లి నుండి రక్తంతోపాటు జున్నుపాల ద్వారా వ్యాధి నిరోధక శక్తి సంక్రమించి 4-5 నెలల వయస్సు వరకు రక్షణ కలిగిస్తుంది. కాబట్టి 5 నుండి 15 నెలల మధ్య వయస్సు జీవాలన్నింటికి 90 శాతం తగ్గకుండా టీకాలు వేయించాలి.
తెలంగాణా ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పి.పి.ఆర్. ఫ్రీజ్డ్రైడ్ వ్యాక్సిన్ను ఉచితంగా కూడా సరఫరా చేస్తున్నాయి. మనకు వి.బి.ఆర్.ఐ., ఐ.వి.ఆర్.ఐ., ఇండియన్ ఇమ్యునొలాజికల్స్ వారు ఉత్పత్తి చేసిన నమ్మకమైన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని భద్రపరచిన స్థితిని బట్టి ఫలితాలు ఉంటాయి. మిగిలిపోయిన వ్యాక్సిన్ను, సీసాలను పూర్తిగా నిర్ణీత పద్ధతిలో ధ్వంసం చేయని ఎడల వీటిలోని మిగిలిపోయిన బలహీనపరచిన సజీవవైరస్ మరల శక్తిని పుంజుకుని వ్యాపించి మందలకు ప్రమాదకరం కావచ్చు.
‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి ఖరము పాలు’ అంటూ వేమన గాడిద పాలను తృణీకరించాడు గానీ, గాడిద పాలకు గ్లోబల్ మార్కెట్లో గిరాకీ అంతకంతకూ పెరుగుతోంది. వేమన గాడిద పాలను సరిగా విలువ కట్టలేకపోయాడు. ఇప్పటి పరిస్థితులను అంచనా వేసి ఉన్నట్లయితే, ‘గరిటెడైనను చాలు ఖరము పాలు’ అంటూ పద్యాన్ని తిరగ రాసేవాడేమో.
ఎందుకంటే, గరిటెడు గాడిద పాల ధర కడివెడు గంగిగోవు పాల ధర కంటే ఎక్కువే మరి. మన దేశంలో గాడిద పాల వినియోగం చాలాకాలం నుంచే ఉన్నా, పాల కోసం గాడిదల పెంపకం పారిశ్రామిక స్థాయికి ఇంకా చేరుకోలేదు. ఆఫ్రికా, పశ్చిమాసియా, ఉపఖండ ప్రాంతాలను విడిచిపెడితే, ప్రపంచంలో మిగిలిన చాలా దేశాల్లో గాడిద పాల వినియోగం పారిశ్రామిక స్థాయికి చేరుకుంది. వయసు మళ్లే ప్రక్రియను గాడిద పాలు ఆలస్యం చేస్తాయనే నమ్మకం క్రీస్తుపూర్వం నాటి నుంచే ఉండేది. గాడిద పాల ఔషధ లక్షణాలపై తాజా వైద్య పరిశోధనల ఫలితాలు ఆ నమ్మకాన్ని బలపరుస్తున్నాయి.
సంచారజాతుల వారు గాడిదలను తోలుకుంటూ వీధుల్లో తిరుగుతూ, వాటి పాలను అమ్మడం భారత్లోనే కాదు, అర్జెంటీనా, చిలీ వంటి లాటిన్ అమెరికా దేశాల్లోనూ మామూలే. ఉబ్బసంతో బాధపడే చిన్న పిల్లలకు గాడిద పాలు పట్టడం మన దేశంలో చాలాకాలంగా కొనసాగుతున్న పద్ధతి. గాడిద పాలు తాగే పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే నమ్మకం కూడా ఉంది.గాడిద పాల ఔషధ విలువలపై జనంలో బాగా నమ్మకం ఉండటంతో వీటి ధర చాలా ఎక్కువ. లీటరు గాడిద పాల ధర దాదాపు రెండువేల రూపాయల వరకు ఉంటుంది.
ఔషధప్రాయమైన వినియోగం కోసం సుమారు 25-30 మిల్లీలీటర్ల మోతాదుల చొప్పున అమ్ముతుంటారు. ఒక్కో మోతాదు ధర రెండువందల రూపాయలకు పైమాటే. మన ఇండ్ల దగ్గరకు వచ్చే వారు ఒక చిన్న జండు బాంబ్ ఖాళీ గా ఉంది దాని నిండుగా గాడిద పాలు ఇస్తే వంద రూపాయలు తీసుకుంటాడు. మన దేశంలో గాడిద పాలను ఔషధప్రాయంగా మాత్రమే వినియోగిస్తారు. లాటిన్ అమెరికన్ దేశాల్లోనైతే ఔషధంగా మాత్రమే కాదు, తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా కూడా పిల్లలకు పడతారు.
డాంకీ మిల్క్ బ్యూటీ’, ‘డాంకీస్ అండ్ కో’ వంటి కంపెనీలు గాడిదపాలతో సౌందర్య సాధనాలు మొదలుకొని, నవయవ్వన ఔషధాల వరకు నానా ఉత్పత్తులను తయారు చేస్తూ మార్కెట్ను విస్తృతం చేసుకుంటున్నాయి.
మిల్క్సౌడర్, సబ్బులు, ఫేస్క్రీములు, కాన్సంట్రేటెడ్ యాంటీ ఆక్సిడెంట్ క్యాప్సూల్స్, ‘నేచురల్ వయాగ్రా’వంటి ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. యూరోపియన్ దేశాలతో పాటు చైనా, జపాన్, కొరియా వంటి ప్రాచ్య దేశాలు కూడా గాడిద పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి.
తాజా పరిశోధనల్లో తేలిన విశేషాలు
పోషక విలువల ప్రకారం తల్లిపాలకు దగ్గరగా ఉండేవి గాడిద పాలేనని ఆధునిక పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా గాడిద పాలలో లాక్టోజ్ దాదాపు తల్లిపాలకు సమానంగా ఉంటుందని, కొవ్వుశాతం చాలా తక్కువని పరిశోధకులు చెబుతున్నారు. స్థూలకాయం నుంచి బయటపడేందుకు కూడా గాడిదపాల వినియోగం శ్రేయస్కరమని వారు సూచిస్తున్నారు.
జనాభాలో దాదాపు 2-6 శాతం ప్రజలకు ఆవుపాలు సరిపడవని, ఆవు పాల వల్ల వారు అలెర్జీలతో బాధపడుతున్నారని, అలాంటి వారికి గాడిద పాలు మేలు చేస్తాయని ఐక్యరాజ్య సమితి అధ్యయనం తేల్చింది. గాడిద పాలలో విటమిన్-సి, బి, డి-12, ఇ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆవుపాలతో పోలిస్తే, గాడిద పాలలో విటమిన్-సి అరవై రెట్లు ఎక్కువగా ఉంటుంది.
కీలకమైన ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు కూడా పుష్కలంగా ఉంటాయని తాజా పరిశోధనల్లో తేలింది. గాడిద పాల వినియోగం ఫలితంగా ఉబ్బసం, సొరియాసిస్, ఎగ్జిమా వంటి వ్యాధులు నయమైనట్లు ఇటీవల సైప్రస్ వర్సిటీ శాస్త్రవేత్త, డెయిరీ సైన్స్ లెక్చరర్ డాక్టర్ ఫోటిస్ పాపడెమాస్ నిర్వహించిన పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. సైప్రస్తోపాటు ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, స్పెయిన్, హాలండ్, సెర్బియా, బోస్నియా వంటి దేశాల్లో పాల కోసం గాడిదల పెంపకం పరిశ్రమ స్థాయిలో కొనసాగుతోంది.
యూరోప్లో సేకరించిన గాడిద పాలలో దాదాపు సగానికి సగం సౌందర్య పోషణకు ఉపయోగపడే ఉత్పత్తుల తయారీకే తరలిపోతోంది. ఈ దేశాల్లో గాడిద పాలను నేరుగా తాగడంతో పాటు వివిధ ఆహార ఉత్పత్తులనూ తయారు చేస్తున్నారు. సైప్రస్లోనైతే గాడిద పాలతో మధువును కూడా తయారు చేస్తున్నారు. యూరోపియన్ దేశాల్లో గాడిద పాలతో తయారయ్యే చీజ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. దీని కిలో ధర 1350 డాలర్ల వరకు ఉంటుంది. గాడిద పాలతో చీజ్ తయారు చేయాలంటే, ఒక కిలో చీజ్ తయారీకి దాదాపు వంద కిలోల పాలు అవసరమవుతాయని స్విస్ షెఫ్ జీన్ మైకేల్ ఎవెక్వోజ్ చెబుతున్నారు.
వయసు మళ్లిన వారికి గాడిద పాలు బలవర్ధకమైన ఆహారంగా ఉపయోగపడతాయని ఒక పరిశోధనలో తేలిన విషయాన్ని ‘ఇంటర్నేషనల్ డెయిరీ జర్నల్’ వెల్లడించింది. అంత విస్తృతంగా కాకపోయినా, మన దేశంలోనూ గాడిద పాల గుణగణాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. గాడిద పాలలో యాంటీ-కేన్సర్ లక్షణాలు, లైంగిక సామర్థ్యాన్ని పెంచే లక్షణాలు ఉన్నాయని లక్నో యూనివర్సిటీ పరిశోధకులు కొద్ది సంవత్సరాల కిందటే వెల్లడించినా, పెద్దగా ప్రచారం లభించలేదు.
కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహకారంతో డాక్టర్ అయినాక్షి ఖరే నేతృత్వంలో లక్నో వర్సిటీ బృందం గాడిద పాలపై పరిశోధనలు సాగిస్తోంది. గాడిద పాలు ఎయిడ్స్ను పూర్తిగా నయం చేయలేకపోయినా, రోగుల జీవితకాలాన్ని పొడిగించేందుకు గణనీయంగా దోహదపడగలవని లక్నో వర్సిటీ పరిశోధకుడు దేశ్ దీపక్ చెబుతున్నారు.
గాడిద పాలలోని పోషకాల ప్రాముఖ్యత
1. ఇందులో పెద్ద మొత్తంలో బి, బి12, సి విటమిన్లతోపాటు న్యూట్రిన్లు ఉంటాయి.
2. తల్లి పాలతో సమానమైన స్థాయిలో కాలరీలు, మినరల్స్ ఉంటాయి. ఈ పాలు గేదె పాలతో సమానమైన బలం ఉంటుందని భావిస్తారు.
3. అప్పుడే పుట్టిన పిల్లల్లోని ఆస్తమా, శ్వాసకోశ వ్యాధుల నివారణకు గాడిద పాలతో పరిష్కారం అవుతుందని నమ్మకం ఉంది.
4. అప్పుడే పుట్టిన పిల్లలో క్షయ, ఆస్తమా, గొంతు సంబంధిత వ్యాధుల నివారణకు తయారుచేసే ఆయుర్వేద మందులలో గాడిద పాలను వినియోగిస్తారు.
5. గాడిద పాలలో ప్రొటీనులు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. కానీ మినరల్స్, విటమిన్లు అధిక పాళ్లలో ఉంటాయి.
6. ఆవుల వల్ల వచ్చే అలెర్జీ సంబంధిత వ్యాధులు గాడిద పాలతో నయమవుతాయి.
7. నవజాత శిశువులకు పూర్తి ఆహారాన్ని అందించడంతోపాటు వారిలోని చర్మవ్యాధులను నయం చేస్తుంది.
8. గాడిద పాలలో కాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో పిల్లల్లో ఎముకల పటిష్టత, విరిగిన ఎముకలను అతికించే స్వభావం అధికంగా ఉంటుంది.
9. తల్లిపాలతో పోల్చుకుంటే కనీసం 60 రెట్ల విటమిన్ సి ఉంటుంది. అందుకే గాడిద పాల కోసం ఎగబడుతున్నారు.
గాడిద పాలతో చేసిన ఛీజ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఛీజ్.. అని ప్రకటించింది సెర్బియాకు చెందిన ఒక సంస్థ. గాడిదల్లో అత్యంత శ్రేష్టమైన జాతి ‘బాల్కన్’. ఈ జాతి గాడిద పాల నుంచే చీజ్ను తయారు చేస్తారు. ముందస్తు ఆర్డరు ఇచ్చిన వాళ్లకే బాల్కన్ డాంకీ ఛీజ్ అందుతుంది.
నవయవ్వన సాధనం!
గాడిదపాలు నవయవ్వన సాధనం కాగలదా? అంటే, ఇప్పటి వరకు వెలువడిన తాజా పరిశోధనలు ఔననే అంటున్నాయి. అంతేకాదు, గాడిదపాలతో దీర్ఘాయువు కూడా సాధ్యమేనంటున్నారు. ఈక్వెడార్లో దాదాపు ఏడేళ్ల కిందట మారియా ఎస్తర్ డి కాపోవిల్లా అనే మహిళ తన 116 ఏళ్ల వయసులో మరణించింది. బాల్యం నుంచి ఆమె రోజూ గాడిద పాలే తాగేది. కాపోవిల్లా మృతి దరిమిలా శాస్త్రవేత్తలు గాడిద పాలలో దీర్ఘాయువు కలిగించే లక్షణాలపై సాగించిన పరిశోధనల్లోనూ ఆశాజనకమైన ఫలితాలే వచ్చాయి. గాడిద పాలలో ఇన్ని విశేషాలు ఉన్నా, మన దేశంలో గాడిద పాల ఉత్పత్తి పారిశ్రామిక స్థాయికి చేరుకోకపోవడం గమనార్హం.
మామిడి పంటకు మనదేశం ప్రసిద్ధి చెందినది. మామిడి సాగులో మనదేశం మొదటి స్థానంలో, ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో మనదేశం వాటా దాదాపుగా 65 శాతం వరకు ఉంది. ఉత్పత్తిలో మనదేశం ముందు ఉన్నప్పటికీ ఉత్పాదకతలో మిగతా దేశాలతో పోలిస్తే చాలా వెనకబడి ఉన్నాము. అంతే కాకుండా గత థాబ్దకాలంలో ఉత్పత్తి కూడా హెక్టారుకు 8.1 టన్నుల నుండి 5.5 టన్నులకు పడిపోయింది. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో రకాల లభ్యత మరియు వైవిధ్యం చాలా ఎక్కువ. వివిధ రకాల అవసరాలకు (పచ్చళ్ళు, రసాలు, కోత రకాలు మొదలైనవి) అనువైన రకాలు చాలా వున్నాయి. కాబట్టి ప్రపంచ మార్కెట్లో మన వాటా పెంచడానికి, ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడానికి కొన్ని యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా కత్తిరింపులు చేపట్టడం చాల అవసరం.
కత్తిరింపుల వలన లాభాలు
ప్రతి సంవత్సరం నిలకడగా కాపు కాస్తుంది.
చెట్టుకు గాలి వెలుతురు బాగా సోకి దిగుబడి పెరుగుతుంది.
తోటలో అంతర కృషి పనులు చేయటానికి అనువుగా వుంటుంది
నాణ్యమైన పండ్ల ఉత్పాదకత పెరుగుతుంది.
చీడ పీడల బెడద తగ్గుతుంది.
చెట్టు ఎత్తును అదుపులో ఉంచుకోవచ్చు
ఈ కత్తిరింపుల ప్రక్రియ మొక్క వయస్సును బట్టి చేపట్టాలి. లేత మొక్కలలో ఒకరకంగా, కాపుకు వచ్చిన తోటల్లో ఒకరకంగా, ముదిరిన తోటల్లో ఒకరకంగా చేయాలి.
లేత తోటలలో కత్తిరింపులు
మొక్కై వంగనదే మానై వంగదు అనే సామెత మన అందరికి తెలిసిందే. మొక్క థలోనే మామిడిని మంచి ఆకారంతో పెంచుకోవాలి. మొక్క నాటిన తర్వాత కాండం బలంగా పెరగడానికి ఒక మీటరు ఎత్తు వరకు పక్క కొమ్మలు లేకుండా పెరగనివ్వాలి. ఆ తర్వాత మొక్క మొదలు నుండి 70 సెం. మీ. ఎత్తులో కాండాన్ని అక్టోబర్-నవంబర్ నెలల్లో కత్తిరించాలి. తర్వాత అక్కడ నుండి ప్రధాన కొమ్మలు పెరుగుతాయి. నాలుగు వైపులా పెరిగిన 4 ప్రధాన కొమ్మలను మాత్రమే పెరగనిచ్చి 1 మీ. పొడవు పెరిగిన తర్వాత 70 సెం. మీ.కు కత్తిరిస్తే అక్కడనుండి ద్వితీయ కొమ్మలు పెరుగుతాయి. ప్రతి ప్రధాన కొమ్మపై 2-3 ద్వితీయ కొమ్మలను మాత్రమే సమాన దూరంలో పెరగనివ్వాలి. అలాగే ప్రతి ద్వితీయ కొమ్మపై 2 -3 తృతీయ కొమ్మలను పెరగనిచ్చి మిగతా కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. ఈ విధంగా చేయటం వలన చెట్టు నిటారుగా పెరగకుండా గుబురుగా పెరిగి దిగుబడి పెరుగుతుంది. ఈ కత్తిరింపులు చేసినపుడు ఎండిన కొమ్మలు, తెగులు సోకిన కొమ్మలు, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు తీసివేయాలి.
కాపుకు వచ్చిన తోటల్లో కత్తిరింపులు
మామిడి కాయలు కొమ్మల చివర్లలో గుత్తులుగా కాస్తాయి. కనీసం 6-8 వారాల వయస్సు పై బడిన కొమ్మలపై మాత్రమే పూత వస్తుంది. అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న కొమ్మలపై పూత రాదు. కాబట్టి కాయ కోత వెంటనే కత్తిరింపులు చేస్తే కొత్త చిగుర్లు పెరిగి పూత వచ్చేటప్పటికి వాటి వయస్సు 8 వారాలపైనే ఉంటుంది. కాపుకు వచ్చిన తోటల్లో రెండు సార్లు కత్తిరింపులు చేసుకోవాలి.
మొదటి కత్తిరింపులు
మొదటి కత్తిరింపులు కాయ కోత వెంటనే చేపట్టాలి. కాయలు పెరిగిన పూత కాడలను తొలగించి అక్కడనుండి కొమ్మలను కనీసం 10-15 సెం. మీ. వెనక్కి కత్తిరించాలి. అలాగే బాగా కిందకు వేలాడిన కొమ్మలను తీసేయాలి. చెట్టు లోపలి భాగంలో అడ్డదిడ్డంగా ఒకదానిపై ఒకటిగా పెరిగిన కొమ్మలను తీసివేస్తే చెట్టు లోపల భాగాలలో గాలి, వెలుతురు ప్రసరణకు అనువుగా ఉంటుంది. అదేవిధంగా చెట్టు లోపల భాగంలో నిటారుగా పెరిగే 2-3 కొమ్మలను కత్తిరించాలి. కత్తిరింపులు చేసినపుడు కొమ్మలు చీలిపోకుండా జాగ్రత్తగా కత్తిరించాలి. అయితే కాపుకు వచ్చిన చెట్లలో 25% కన్నా ఎక్కువ కొమ్మలు కత్తిరిస్తే దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే తెగులు సోకిన కొమ్మలు, ఎండిన కొమ్మలు ఉంటే తీసివేయాలి.
రెండవసారి కత్తిరింపులు
రెండవసారి కత్తిరింపులు పూతకు ముందు అంటే నవంబర్ – డిసెంబర్ నెలల మధ్యలో చేయాలి. ఈ కత్తిరింపులు 1-2 వారాల్లో పూర్తి చేయాలి. ఈ కత్తిరింపుల్లో భాగంగా పూతకు ముందు ఏవైన కొత్త చిగుర్లు వస్తే 10-15 సెం మీ. వెనక్కి (ముదురు భాగం వరకు) కత్తిరించాలి. లేకపోతే ఆ కొమ్మలపై పూత రాదు. అలాగే బాగా కిందకు వేలాడి నేలను తాకే కొమ్మలను తీసేయాలి. ఈ థలో కూడా చెట్టు మధ్యలో లోపలి భాగంలో వత్తుగా పెరిగిన కొమ్మలు లేదా కొమ్మ భాగాలు, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మ భాగాలను తీసేసి గాలి, వెలుతురు సోకేటట్లు చేయాలి. దీనివలన కాయలు పండిన తర్వాత మంచి రంగు సంతరించుకొని నాణ్యంగా ఉండి అధిక ధర పలుకుతాయి.
ముదిరిన తోటల్లో కత్తిరింపులు
మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మామిడి తోటలు 50-60 సంవత్సరాలు పైబడినవే ఉండటం వలన వాటి ఉత్పత్తి తగ్గి ఆదాయం రావటం లేదు. ఈ ముదురు తోటలు ఎత్తుగా ఉండడం వలన సస్య రక్షణ చర్యలు చేపట్టడానికి కూడా అనువుగా ఉండక దిగుబడులు తగ్గుతున్నాయి. అందువలన రైతులు వాటి యాజమాన్యం చేపట్టలేక ముదురు తోటలను తొలగించి వాటి స్థానంలో వేరే పంటలు అంటే నీటి వసతి ఉన్న వాళ్ళు ఆయిల్ పాం తోటలు నీటి వసతి లేని వాళ్ళు మళ్ళీ అంటు కట్టిన మామిడి మొక్కలను నర్సరీలనుండి తెచ్చుకొని వేసుకొంటున్నారు. మళ్ళీ కొత్తగా వేసుకోవటం వలన పెట్టుబడి ఎక్కవ అవటమే కాకుండా వాటి నుండి ఆదాయం పొందడానికి కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ నష్టాన్ని భరించాలంటే కొత్త మొక్కలు వేసుకోకుండా ఉన్న ముదురు తోటలని పూర్తిగా తొలగించకుండా వాటి వేరు వ్యవస్థను ఉపయోగించుకొని ఎక్కువ పెట్టుబడి లేకుండా ప్రూనింగ్ పద్ధతి ద్వారా వాటిని సులభంగా పునరిద్ధరించుకొని మంచి దిగుబడులు పొందవచ్చు.
బాగా ఎత్తుగా పెరిగిన ముదురు చెట్ల కొమ్మలను భూమట్టం నుండి అంటే ఎక్కడైతే కొమ్మలు ఏర్పడతాయో అక్కడ నుండి ఒక అడుగు ఎత్తు వరకు ఉంచి కత్తిరించాలి. అన్ని కొమ్మలు ఒకే సారి కత్తిరించకుండా ఒక వైపు ఉన్న కొమ్మలను ఉంచి వేరొక వైపు ఉన్న కొమ్మలను కత్తిరించుకోవాలి. ఇలా చేస్తే కత్తిరించిన కొమ్మలపై మళ్ళీ చిగుర్లు వచ్చే వరకు కావలసిన పోషకాలను మిగతా సగం కొమ్మల నుండి (కత్తిరించకుండా చెట్టుపై వదిలేసిన కొమ్మలు) పొందుతుంది. అంతే కాకుండా ఈ కొమ్మలనుండి ఎంతో కొంత దిగుబడిని పొందవచ్చు. కత్తిరించిన కొమ్మలపై కొన్ని వారాల తర్వాత చిగుర్లు వస్తాయి. ఇలా వచ్చిన చిగుర్లను ఒక్కో కొమ్మకు 4 వైపులా 25-30 సెం.మీ. దూరంలో వచ్చిన బలమైన కొమ్మలు మాత్రమే ఉంచి మిగతావి ఎప్పటికప్పుడు వచ్చినవి వచ్చినట్టే తీసేయాలి.
ఒకవేళ ముదురు తోటలు టెంకల ద్వారా పెరిగినవి అయితే ప్రూనింగ్ తర్వాత పెరిగిన కొమ్మలపై మనకు నచ్చిన లేదా ఆయా ప్రాంతాల్లో ఎక్కువ గిరాకీ ఉండే రకాలను గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. గ్రాఫ్టింగ్ చేసిన భాగం అతుక్కొన్న తర్వాత అతుకు కింద భాగం పై వచ్చిన చిగుర్లను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఇలా చేసిన చెట్ల నుండి 3 సంవత్సరాల్లో దిగుబడి పొందవచ్చు.
కత్తిరింపులు చేసేటప్పుడు కొంచెం ఏటవాలుగా చేయాలి. లేకపోతే వర్షం పడినపుడు నీరు కొమ్మలపై ఉండిపోయి శిలీంద్రాలు ఆశించి చెట్లు చనిపోయే అవకాశంఉంటుంది. కొమ్మలు కత్తిరించిన ప్రతి సారి కత్తిరించిన ప్రదేశంలో బోర్దో పేస్టు పూయాలి.
కత్తిరింపుల తర్వాత యాజమాన్యం
కొమ్మ కత్తిరింపుల తర్వాత చెట్టు వయస్సును బట్టి సిఫార్సు చేసిన ఎరువులను వేసి నీటి తడులు ఇవ్వాలి.
ఎక్కువుగా సేంద్రియ ఎరువు మరియు జీవన ఎరువులను వేసుకోవాలి. కాపుకు వచ్చిన తోటల్లో మొదటి కత్తిరింపుల తర్వాత తొలకరి వర్షాల సమయంలో ఎరువులు వేసుకొంటే మొక్కకి పోషకాలు అందుతాయి ఒక వేళ వర్షాలు లేనట్లయితే నీటి తడులు ఇచ్చుకోవాలి.
కొత్త చిగుర్లు వచ్చిన తర్వాత సూక్ష్మధాతు (జింకు, బోరాన్, ఇనుము మొదలైన) లోపాలు గమనిస్తే జింక్ 2-5 గ్రా., బోరాన్ 1-2 గ్రా. ఐరన్ సల్ఫేట్ 2 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రా. ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. నీటి యాజమాన్యాన్ని, పురుగులుా, తెగుళ్ల యాజమాన్యాన్ని సరైన సమయంలో చేసుకోవాలి.
కాబట్టి రైతులు ఈ విధంగా కత్తిరింపులు చేసుకొని తగిన యాజమాన్య చర్యలు చేపట్టినట్లైతే నాణ్యమైన దిగుబడి వచ్చి అధిక ఆదాయాన్ని పొందుతారు. దీ
డా. కె. రాధారాణి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ (హార్టి), డా. బి.కె.ఎం. లక్ష్మి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ (ప్లాంట్ పథాలజీ) మరియు డా. జి. స్రవంతి, సైంటిస్ట్ (ఎంటమాలజీ), మామిడి పరిశోధనా స్థానం, నూజివీడు.
పండ్లలో రారాజుగా మామిడిని పిలుస్తారు. మామిడి పండుకు ఉండే రుచి వలన ఆ పండుకు ఆపేరు వచ్చింది. మన దేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా మామిడి పండును బాగా ఇష్టపడుతుంటారు. కానీ అన్ని దేశాల వాతావరణాలు మామిడి పంటకు అనుకూలం కాదు కాబట్టి పండే దేశాల నుండి దిగుమతి చేసుకుని మామిడి పండ్ల రుచిని ఆస్వాదిస్తుంటారు. ప్రజలకు మధురానుభూతిని అందించే మామిడి పండు రైతులకు లాభాలను చేకూర్చుతుందా అంటే జవాబు కాదు అని వస్తుంది. మామిడి సాగు చేసే రైతులు చాలా వరకు సరైన లాభాలు ఆర్జించలేకపోతున్నారు. దిగుబడి ఉంటే ధర ఉండదు. ధర ఉంటే దిగుబడి ఉండదు. రెండూ ఉంటే ప్రతికూల వాతావరణ పరిస్థితుల వలన కాయలు రాలిపోతవి. సాధారణంగా మామిడి కాయలు మార్చి, ఏప్రియల్, మే, జూన్ మాసాలలో (కొన్ని రకాలు తప్ప) ఎక్కువ రకాలు దిగుబడులను ఇస్తాయి. కానీ ఈ మాసాలలో వాతావరణంలో మార్పులు జరిగి విపరీతంగా గాలులు రావడం జరుగుతుంది. గాలి ఎక్కువగా వచ్చిన సందర్భాలలో మామిడి కాయలు చాలా వరకు రాలిపోతుంటాయి. అలా రాలి పోయిన కాయలను రైతులు అయినకాడికి అమ్ముకొని ఎంతో కొంత వచ్చిందని సర్దుకుపోతుంటారు. అన్నీ ఒడిదుడుకులు తట్టుకుని దిగుబడిని మొత్తాన్ని సరైన ధరలకు అమ్ముకోగలిగితే మామిడి సాగు లాభదాయకంగా ఉంటుంది. లేదంటే మామిడి రైతులు నష్టాలు భరించవలసిందే. దానికి సరైన పరిష్కారం విలువ జోడింపే అని మామిడికి వివిధ రకాలుగా విలువ జోడించి మామిడితో అనేక రకాల ఉత్పత్తులు తయారు చేస్తూ తన మామిడి సాగును లాభాల బాటలో నడిపిస్తున్నాడు కృష్ణాజిల్లా జి.కొండూరు ప్రాంతానికి చెందిన ఎం. నారాయణ ప్రసాదు.
నారాయణ ప్రసాదుది వ్యవసాయ నేపధ్యమైనాకానీ ఇంజనీరింగు వరకు చదువుకుని తన ఇంజనీరింగ్ నైపుణ్యంతో వివిధ రకాల పరిశ్రమలకు సలహాలు ఇస్తుంటారు. వీరికి 50 సంవత్సరాల పైబడ్డ వయస్సు గల 50 ఎకరాల మామిడితోట ఉంది. అయినా కాని మామిడి సాగుపై అంత శ్రద్ధ పెట్టకుండా వచ్చిన కాడికి ఆదాయం పొందుతూ తన ఇంజనీరింగ్ వృత్తిలో కొనసాగుతున్న సమయంలో 2014 వ సంవత్సరంలో విజయవాడలో సుభాష్పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ పద్ధతిలో ప్రధానంగా ఒక దేశీ ఆవుతో 30 ఎకరాలు సాగు చేయగల పద్ధతి వారికి బాగా నచ్చి అటు వైపు ఆలోచించి తన మామిడి తోటలో సేంద్రియ పద్ధతులు పాటించాలని తలచి 2014 నుంచి తన మామిడి తోటలో పూర్తి సేంద్రియ పద్ధతులు పాటించడం మొదలు పెట్టి కొనసాగిస్తున్నాడు.
సేంద్రియ పద్ధతులు పాటించడము మొదలు పెట్టిన తరువాత అందుకు అవసరమైన దేశీయ ఆవుల పోషణ మొదలు పెట్టి వాటి వ్యర్థాలను తన మామిడి తోట సాగులో వినియోగిస్తున్నాడు. పాదులలో మాగిన పశువుల ఎరువు క్రమం తప్పకుండా అందించడంతో పాటు ఘనజీవామృతం, ద్రవ జీవామృతాలను కూడా అవసరాన్ని బట్టి క్రమం తప్పకుండా అందిస్తూ వస్తున్నాడు. చీడపీడల నివారణకు వేపనూనె, వేప కషాయం, పుల్లటి మజ్జిగలను పంటపై క్రమం తప్పకుండా ఉపయోగించడంతోపాటు లింగాకర్షక ఎరలను, పండుఈగ బుట్టలను కూడా ఏర్పాటు చేస్తుంటాడు. మామిడి తోటలో ఎత్తులో ఉన్న కాయలకు కవరు తొడగడము ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మధ్యస్థంగా ఉన్న కాయలకు కవరు తొడుగుతున్నాడు. కవరు తొడిగిన కాయలు నాణ్యత పెరిగింది కాబట్టి మంచి ధరకు అమ్మగలుగుతున్నాడు. యాజమాన్య పద్ధతులు సక్రమంగా పాటిస్తే పెద్ద వయస్సు ఉన్న మామిడి చెట్టు నుంచి కూడా మంచి దిగుబడిని సాధించవచ్చని నిరూపిస్తున్నాడు.
మామిడి సాగులో మంచి ఆదాయం రావాలంటే మామిడికాయల వృథాను తగ్గించగలగాలి. ఇందుకు గాను కొన్ని కాయలను ఆమ్చూర్ తయారు చేయడానికి, కొన్ని పండ్లను మామిడి తాండ్ర తయారు చేయటానికి, కొన్నింటిని మామిడి పండ్లుగా అమ్మకం చేస్తున్నాడు. ఏది ఏమయినా కాని తన మామిడి తోటలో సాధించిన దిగుబడి ఏమాత్రం వృథాకాకుండా పంట మొత్తాన్ని అమ్ముకోగలుగుతున్నాడు. తన మామిడి తోటలో తోతాపురి, రసాలు, బంగినపల్లి, అల్ఫోన్సా లాంటి మామిడి రకాలను సాగు చేస్తున్నాడు.
మామిడి తాండ్ర: సరైన ధరకు అమ్మకం చేయలేని మామిడి పండ్ల నుంచి మామిడి తాండ్రను తయారు చేస్తున్నాడు. ఇందుకు గాను అప్పట్లో 8 లక్షలు ఖర్చు చేసి డ్రయ్యరును కొనుగోలు చేసుకున్నాడు. మామిడి పండ్లను శుభ్రంగా కడిగి తొక్క తీసి మిక్సీ సహాయంతో మామిడి గుజ్జు చేసి అందులో పూర్తి సేంద్రియంగా తయారు చేసిన బెల్లాన్ని కలిపి అవసరమైనంత మందంలో ట్రేలలో పోసి ట్రేలను డ్రైయ్యరులో పెట్టినట్లయితే గంటకు రెండు లీటర్ల నీళ్ళు ఆవిరి అయిపోతాయి. అందులో ఉన్న నీటిశాతాన్ని బట్టి గట్టిగా తయారయిన తరువాత ట్రేల నుంచి తీసి అవసరమయినంత కొలతల ప్రకారం ముక్కలుగా కోసి మామిడి తాండ్రను అమ్మకం చేస్తున్నాడు. మామిడి కాయలకంటే రెండు, మూడు రెట్ల అధిక ధరకు మామిడి తాండ్రను అమ్మగలుగుతున్నారు.
ఆమ్చూర్ తయరీ: ఆమ్చూర్కి గిరాకి రోజురోజుకి పెరుగుతూ ఉంది. మన దేశంలోనే కాకుండా కొన్ని ఇతర దేశాలలో కూడా ఆమ్చూర్ని ఉపయోగిస్తున్నారు. పుల్లగా ఉన్న కాయలు ఆమ్చూర్కి ఉపయోగిస్తుంటారు. రాలిపోయిన కాయలు లేదా పండించడానికి అవకాశాలు లేని కాయలతో ఆమ్చూర్ తయారు చేస్తున్నారు. ఇందుకు గాను కాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి డ్రై చేస్తున్నాడు. మామిడి ముక్కలను డ్రై చేయడానికి తన ఇంజనీరింగ్ నైపుణ్యంతో సుమారు 8 లక్షల వ్యయంతో 60þ20 అడుగులలో పాలీ డ్రైయ్యరును తయారు చేసుకున్నాడు బయట కంటే ఈ డ్రయ్యరులో సుమారు 15 సెంటిగ్రేడు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టే త్వరగా ఎండుతున్నాయి. ఈ డ్రయ్యరును ఆమ్చూర్ తయారీకి, పొదీనా పొడి తయారీకి, అల్లంతో శొంఠి తయారీకి ఉపయోగిస్తున్నాడు. తన మామిడితోటలో అంతర పంటలుగా పొదీనా మరియు అల్లంలను సాగు చేస్తూ వాటిని పొడి చేస్తున్నారు. పచ్చి అల్లంకి మార్కెట్లో మంచి ధర లభించడం లేదు కనుక అల్లంని ఎండబెట్టి శొంఠి పొడిచేసి కిలో 150/-లకు అమ్మకం చేస్తున్నాడు. ఆమ్చూర్ పొడిని కిలో రూ. 300/- నుంచి రూ. 400/- లకు అమ్మకం చేస్తూ వృథా మామిడి కాయల నుంచి కూడా ఆదాయం పొందుతున్నాడు.
మామిడిపండ్లు మాగబెట్టుట: మామిడి పండ్లను మాగబెట్టటానికి 24 టన్నుల సామర్థ్యం గల గదిని నిర్మించుకుని ఆ గదిలో తన ఇంజనీరింగ్ ఆలోచనతో స్లాండ్లు ఏర్పాటు చేసుకుని మామిడి పండ్లను మాగబెడుతున్నాడు. ఇందుకుగాను తయారయిన కాయలను చెట్టు నుంచి చిక్కం సహాయంతో కోసి స్టాండ్లలో ఏర్పాటు చేసిన గడ్డిపై అమర్చి కొంతకుళ్ళిన టమాటాలు లేదా కుళ్ళిన అరటి పండ్లను ఆ గదిలో ఉంచడం జరుగుతుంది. ఈ కుళ్లిన అరటి లేదా టమాటాల నుంచి ఇథలిన్ అనే గ్యాసు ఉత్పత్తి అయ్యి మామిడి కాయలను పండించటానికి ఉపయోగపడుతుంది. హానికారకమైన కార్బైడ్ లాంటి పొడులను ఉపయోగించకుండా సహజ సిద్ధంగా పండించి నాణ్యత దెబ్బతినకుండా అట్టపెట్టెలలో స్టాక్ చేసి వినియోగదారులకు అందిస్తున్నాడు. కొంతమంది వినియోగదారులు నేరుగా తోట వద్దకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు.
అన్ని రకాల మెలకువలు పాటిస్తూ పూర్తి సేంద్రియ పద్ధతులతో మామిడి సాగు చేస్తూ దిగుబడి వృధా కాకుండా మామిడి పండ్లు, ఆమ్చూర్, మామిడి తాండ్రలుగా అమ్మకం చేస్తూ తన మామిడి సాగును లాభాల బాటలో నడిపిస్తున్నాడు.
మరిన్ని వివరాలు 95155 04531 కి ఫోను చేసి తెలుసుకోగలరు. – వై. శ్రవణ్ కుమార్, స్పెషల్ కరస్పాండెంట్
ఇటీవల కాలంలో పాడి పరిశ్రమను, జీవాల పరిశ్రమను మేత కొరత తీవ్రంగా వేధిస్తోంది. పచ్చిక బీళ్లు కనుమరుగైపోతున్నాయి. మేతకొరత వల్ల పశువుల్ని పోషించలేక అనేకమంది తమవద్ద ఉన్న మేలు జాతి పశువుల్ని సైతం వట్టిపోయిన వెంటనే కబేళాలకు తరలిస్తున్నారు. నిర్వహణ సమస్యల కారణంగా వేలాది ఎకరాల పంట భూములు తోటలుగానూ, రియల్ ఎస్టేట్ వెంచర్లుగానూ మారిపోతున్నాయి. మామిడి, జామ, నిమ్మ, సపోట, సీతాఫలం, బత్తాయి, కొబ్బరి వంటి తోటలలో చెట్లకు మధ్య వీలైతే చెట్ల నీడలో కూడా అనేక పశుగ్రాసాలను పెంచవచ్చును. ఈ విధంగా తోటలలో పచ్చిగ్రాసాల సాగును సిల్విపాశ్చర్ అని వ్యవహరిస్తారు. ఈ తోటలలో పశుపోషణ, గొర్రెల పోషణలను చేపడ్తే పండ్ల సాగు కంటే పశుగ్రాసాల ద్వారా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ వచ్చే స్థిరమైన నికర ఆదాయం ఎక్కువగా ఉంటాయి. అది ఎలాగో ఇప్పుడు చర్చిద్దాము.
భూసారాలు పెరుగుతాయి: పశువులు, గొర్రెల వ్యర్థాలతో భూమిలో కార్బన్ మరియు నత్రజని సహజరీతిలో పెరుగుటే కాక, భూమిలో నీటిని పీల్చుకొనే గుణం కూడా మెరుగుపడుతుంది. ఏటవాలు భూములేకాక వరదపీడిత ప్రాంతాలలో సారవంతమైన భూములు సైతం కోతకు గురయ్యే ముప్పు తగ్గుతుంది. లూసర్న్, బెర్సీమ్, అలసంద, పిల్లిపెసర, జనుము వంటి లెగ్యూమ్ జాతి గ్రాసాల వల్ల భూమిలో నత్రజని శాతం గణనీయంగా పెరిగి, రసాయన ఎరువుల అవసరాలు చాలా వరకు తగ్గుతాయి. ఈ గ్రాస పైర్ల సాగును 3-4 సంవత్సరాలకు ఒకసారి పంటమార్పిడి చేస్తే ఈ ప్రయోజనం మరింతగా ఎక్కువగా ఉంటుంది. పారా నేపియర్ వంటి గ్రాసాల వేర్లు భూమిని కోతకు గురికాకుండా పటిష్టపరుస్తాయి.
కార్మికుల లభ్యత పెద్ద సమస్యగా మారిన ఈ రోజుల్లో తోటల కాపలాదారుల్ని తోటలో కొన్నిజీవాలను లేదా ఒకటి, రెండు పాడి పశువుల్ని పెంచడానికి వెసులుబాటు కల్పిస్తే ఈ అదనపు ఆదాయం వల్ల వారు నమ్మకంగా స్థిరంగా అదే కమతంలో విశ్వాసంగా కొనసాగగలరు.
చెట్ల మధ్య పెరిగే గ్రాసాల వల్ల తోటలలో జీవవైవిధ్యం పెరుగుట ద్వారా పరాగసంపర్కము మెరుగుపడి ఫలసాయాలు పెరిగే అవకాశాలు ఉంటాయి.
చెట్లతో పాటు, చెట్ల మధ్య పచ్చగా పెరిగే గ్రాసాలకు అందించే సాగునీటి వల్ల తోటలలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. నేలరాలిన ఎండిన ఆకులు మరియు ఎండుగడ్డి రాపిడి వల్ల లేదా అగ్నిచోదకాల వల్ల మంటలు చెలరేగి తీవ్ర అగ్నిప్రమాదాలకు దారితీసి భారీనష్టాలను కలిగించటం ప్రతి వేసవిలోనూ మనం చూస్తూనే ఉన్నాము.
దూడలు, పడ్డలు, పాడి పశువులు, గొర్రెలు, మేకలకు ఎంతో విలువైన పోషకాలు సహజరూపంలో వివిధ రకాల గ్రాసాల ద్వారా లభిస్తాయి. సహజమైన పచ్చిమేతల వల్ల పశువుల ఎదుగుదలతో వాటి ఉత్పాదకత, ప్రత్యుత్పత్తి సామర్థ్యాలు గణనీయంగా పెరగటంతో పాటు ఖరీదైన సమీకృత దాణాల మీద ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి. మండు వేసవిలో సైతం చెట్ల నీడలోని చల్లని వాతావరణం వల్ల గేదెలు ఎదకు వచ్చి చూడి కట్టగలవు. ఇందువల్ల అవి రాబోయే పాలకొరత రోజుల్లో అధిక స్థాయిలో పాలను ఉత్పత్తి చేయగలవు. తోటలలో లభ్యమయ్యే పచ్చిమేతలవల్ల దూడలు కూడా ఆరోగ్యంగా ఉండి వేగంగా యుక్త వయస్సుకు వస్తాయి. గేదెల్ని చల్లదనం కొరకు ప్రత్యేకంగా చెరువులు, కాల్వలు, నదులలోకి వదలటం, స్ప్రింక్లర్లతో తడపటం వంటి అవసరాలు ఉండవు. గడ్డిపెరిగిన తోటలలో పెరిగే పశువులు, జీవాల ఎదుగుదల మరియు ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది.
మానవ వనరుల సద్వినియోగం: ప్రతి తోటలో సంరక్షకులుగా ఉండే కాపలాదారులతోనే గ్రాసాల సాగుకు అవసరమయ్యే మానవ వనరుల అవసరాలు చాలావరకు తీరగలవు. తోటలలో గ్రాసాల సాగును ప్రారంభించడానికి జూలై-ఆగస్టు నెలలు చాలా అనుకూలమైనవి. ప్రారంభానికి ముందు భూసార పరీక్షలు జరిపించి నేలకు అనుకూలమైన గ్రాసాలను ఎంపిక చేసుకొనుట మరియు భూమిలోని లోపాలను సరిదిద్దగల చర్యల్ని చేపట్టుట మంచిది. వాణిజ్య సరళిలో దూడలు, పడ్డలు, వట్టిపోయిన పశువుల పెంపకాన్ని జీవాల పెంపకాన్ని సిల్విపాశ్చర్కు అనుబంధంగా ప్రారంభిస్తే వాటి పోషణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.
ప్రస్తుతం చాలా తోటలలో డ్రిప్ మరియు స్ప్రింక్లర్ ఇరిగేషన్ సదుపాయాలు ఉన్నాయి. వాటినే వినియోగించుకుంటూ గ్రాసాలను సాగు చేస్తే గ్రాసాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. గ్రాసాలను కోసి మేపలేని సందర్భాలలో తోటలో పశువుల్ని, జీవాలను స్వేచ్ఛగా వదిలితే అవే మేస్తాయి. ఇందువల్ల వాటిని మేపవలసిన శ్రమ కూడా తగ్గుతుంది.
సిల్విపాశ్చర్కు – ఏఏ గ్రాసాలను ఎలా ఎంచుకోవాలి: నీటి ఎద్దడిని, వేసవి తీవ్రతలను తట్టుకుని, బురద నేలల్లో కూడా నశించకుండా ఉండే రకాలు, పోషక విలువలు ఎక్కువగా ఉండి, దంటు తక్కువగా ఉండే మృదువైన గ్రాసాలు, తక్కువ సూర్యరశ్మిలో చెట్ల నీడలో కూడా పెరగగలిగే రకాలు, ఎక్కువ సాగునిచ్చే రకాలు, విష స్వభావాలు లేని గ్రాసాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. పశువులు, జీవాలు, తొక్కినప్పటికీ నశించని అతివృష్టి, అనావృష్టులను తట్టుకోగల గుణం కూడా ఈ గ్రాసాలలో ఉండాలి.
అవిసె, సుబాబుల్, మల్బరీ చెట్లు కూడా చాలా పుష్టివంతమైన గ్రాసాలను అందిస్తాయి. కొబ్బరి, తమలపాకు తోటలు వాటి సాగుకు చాలా శ్రేష్ఠమైనవి. తోట హద్దుల మీద సుబాబుల్, నేపియర్ వంటి ఎత్తుగా పెరిగే గ్రాసాలను ఎంపిక చేసుకోవచ్చు.
పారాగాడ్డి, దీనానాధ్ గ్రాసాలు మరియూ అంజన్ గడ్డి, గరిక గడ్డి, లూసర్న్, బెర్సీమ్, జనుము, స్ట్రెలో హమాటా, పిల్లిపెసర, అలసంద, వెల్వెట్ బీన్స్, ఉలవ తదితర గ్రాసాలను సాగు చేస్తే ప్రతి 3-4 సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేస్తూ ఉండాలి.
తోటలలో చెట్ల మధ్య, గట్ల మీద, చేపల చెరువుల గట్ల మీదకూడా పశుగ్రాసాలను సాగు చేస్తూ పశువులు, జీవాల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ఆర్థిక, సాంకేతిక సహకారాలు అందించి ప్రోత్సహిస్తే పాడిపరిశ్రమకు జీవాల పెంపకానికీ రైతాంగానికీ, ఎంతో మేలు చేకూరగలదు.
ప్రకృతిలో పువ్వులు అత్యంత అద్భుతమైన సృష్టి. పువ్వులు సంతోషకరమైన భావోద్వేగాలను మరియు సానుకూల సామాజిక ప్రవర్తనను పెంపొందించడం ద్వారా మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. పువ్వులు అత్యంత ఒత్తిడి నుంచి ఉపశమనం కల్గించే స్వభావాన్ని కల్గి ఉంటాయి. భయం, ఆందోళనను తగ్గిస్తాయి. రైతులు పుష్పాలను రెండు రకాలుగా కోస్తారు. వాటిలో మొదటి రకం విడిపువ్వులు, రెండవ రకం కట్ ఫ్లవర్స్. విడిపుష్పాలు పూజలకు, పూలజడ, పూమాలల తయారీలో ఉపయోగిస్తారు. కాడలతో పాటుగా కోసే పుష్పాలను కట్ఫ్లవర్స్ అంటారు. శుభకార్యాలలో, వివాహ కార్యాలలో, అలంకరణకు మరియు వ్యక్తుల సన్మాన సభలలో బోకే రూపంలో అందిస్తారు.
కట్ఫ్లవర్స్ కోత సమయంలో, కోసిన తరువాత తగు జాగ్రత్తలు పాటిస్తే మరిన్ని రోజులు పూలను తాజాగా ఉంచడానికి వీలుపడుతుంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
పువ్వులను కత్తిరించటం ఉదయం లేదా సాయంత్ర సమయాలలో మాత్రమే చెయ్యాలి.
కటింగ్ టూల్స్ పదునైనవై ఉండాలి, కటింగ్ టూల్స్ని క్రమం తప్పకుండా శుభ్రపరచుకోవాలి.
కోసిన పూలను పరిశుభ్రమైన, నీడ ఉన్న ప్రదేశాలలో ఉంచాలి.
కోసిన పూలను శుభ్రమైన వెచ్చని నీటితో నింపిన బక్కెట్లలో పెట్టాలి. బక్కెట్లలో నీటి లోతు, కాడను కప్పడానకి తగినంత ఉండాలి.
నీటికి దిగువన కాడలపై ఉన్న ఆకులను తొలగించాలి.
పుష్పం తాజాదనాన్ని బయోటిక్, అబయోటిక్ ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తాయి. తాజాదనాన్ని ప్రభావితం చేసే ప్రధాన కారకాలు నీటి సంబంధాలు, పిండి పదార్థాల స్థితి (రిజర్వ్ ఫుడ్ మెటీరియల్), ఇథిలిన్ మరియు సూక్ష్మజీవులు. కట్ ఫ్లవర్స్ తల్లి మొక్క నుండి వేరు చేయబడిన తరువాత నీళ్లు, పోషక సహజ వనరులను కోల్పోతాయి. ఫలితంగా జీవక్రియ రిజర్వు చేసిన ఆహార పదార్థాల వ్యయంతో జరుగుతాయి. కాబట్టి కృత్రిమంగా పూలకి నీరుతో పాటు జీవన ప్రక్రియకు కావలసిన పదార్థాలను అందించడం ద్వారా మరికొన్ని రోజులు పూలు తాజాగా ఉంటాయి. వ్యాపారులు తాజాగా ఉంచడం కోసం ఎన్నో రకాల రసాయనాలను వాడుతారు. అలా కాకుండా మనకు సహజంగా లభించే పదార్థాలను ఉపయోగించడం వలన పూలను తాజాగా ఉంచడంతో పాటు వాతావరణాన్ని కూడా రక్షించుకోవచ్చు. ఇలా సహజ, సురక్షితమైన మరియు చవకైన సమ్మేళనాలు ఉపయోగించడం ఎంతో మేలు.
కట్ఫ్లవర్ తాజాదనాన్ని పెంచే కొన్ని సహజ పదార్థాలు:
చక్కెర: కట్ పువ్వులను తాజాగా ఉంచడానికి చక్కెర ఉపయోగిస్తారు. పూలు కత్తిరించి ఉంచిన నీటిలో చక్కెరను కలపడం వలన మరికొన్ని రోజులు పూలను తాజాగా ఉంచవచ్చును. తల్లి మొక్క నుండి వేరుపర్చిన కట్ఫ్లవర్స్కు శ్వాసక్రియ జరుపుకోడానికి చక్కెర తోడ్పడుతుంది. గులాబి మరియు కార్నేషన్ లాంటి పూలు ఉంచిన నీటిలో చక్కెర వాడటం వలన పూల యొక్క రంగును మరింత మెరుగుపరుస్తుంది. ఒక్క లీటరు నీటికి 10 గ్రాములు లేదా 20 గ్రాముల చక్కెరను ఉపయోగించాలి.
స్ప్రైట్, సెవన్ అప్: స్ప్రైట్, సెవన్ అప్ లాంటి కూల్డ్రింక్స్ కూడా పూల తాజాదనాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు. పూలను ఉంచిన నీటిలో సూక్ష్మజీవులను నియంత్రించటం చాలా ముఖ్యం. సూక్ష్మజీవుల సంఖ్య ఆసిడ్ వాతావరణంలో పెరగదు. స్ప్రైట్, సెవన్ అప్, కార్బొనేటెడ్ మరియు ఆమ్లీకృత నీరు కావడం వల్ల సూక్ష్మజీవుల పెరుగుదలను నియంత్రిస్తాయి. ఇలా సులువుగా మనకి అందుబాటులో ఉండే వాటి ద్వారా పూలను మరికొన్ని రోజులు తాజాగా ఉంచవచ్చు. ఒక్క లీటరు నీటికి 50 లేదా 100 మి.లీ. స్ప్రైట్ లేదా సెవన్ అప్ని కలపడం వల్ల మంచి ఫలితాలని పొందవచ్చు.
బ్లీచింగ్ పౌడర్, ఆస్పిరిన్, కర్పూరం: బ్లీచింగ్ పౌడర్, ఆస్పిరిన్, కర్పూరం బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రిస్తాయి. పూలు కత్తిరించి ఉంచిన నీటిలో వీటిని వాడడం వలన కట్పూలను తాజాగా ఉంచవచ్చు.
బ్లీచింగ్ పౌడర్ – 50 లేదా 100 మి.గ్రా. లీటర్ నీటికి కలపాలి.
ఆస్పిరిన్ – 250 లేదా 500 మి.గ్రా. లీటర్ నీటికి కలపాలి.
కర్పూరం – 150 లేదా 300 మి.గ్రా. లీటర్ నీటికి కలపాలి.
ఎసెన్షియల్ ఆయిల్స్: సుగంధ మొక్కల యొక్క పువ్వులు, గింజలు, ఆకులు, బెరడు, కలప, పండ్లు మరియు వేర్ల వంటి వివిధ భాగాల నుండి సేకరించిన నూనెలను ఎసెన్షియల్ ఆయిల్స్ అంటారు. ఎసెన్షియల్ ఆయిల్స్ అనేది సురక్షితమైన మరియు పర్యావరణ అనుకూల సహజమైన మొక్కల ఉత్పత్తి. ఇది కొన్ని క్రిములకు వ్యతిరేకంగా బలమైన యాంటిమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఎసెన్షియల్ ఆయిల్స్ను పూలు కత్తిరించి ఉంచిన నీటిలో తగిన మోతాదులో ఉపయోగించడం ద్వారా సూక్ష్మజీవుల సంఖ్యను నియంత్రించడానికి తోడ్పడుతుంది. అజోవాన్, థెమ్ ఆయిల్, జెరేనియం ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ లాంటివి మార్కెట్లో సులువుగా లభ్యం అవుతాయి.
పండ్ల సారం, హెర్బల్ పదార్థాలు: పుల్లని నారింజ సారం, యాపిల్ ఎక్స్ట్రాక్ట్ కట్ ఫ్లవర్స్ యొక్క తాజాదనాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. వాటిలో ఉండే మాలిక్ యాసిడ్ మరియు సిట్రిక్ యాసిడ్ నీటి యొక్క పీహెచ్ని తగ్గిస్తాయి. దాని ద్వారా పూకాడలు ఎక్కువ నీటిని గ్రహిస్తాయి మరియు బ్యాక్టీరియా పెరుగుదల తగ్గుతుంది. మెరింగ ఆకుసారం, మెంతకార్డీఫోలియా సారంలను కూడా ఉపయోగిస్తున్నారు.
ఈ విధంగా సహజంగా మరియు సులువుగా అందుబాటులో ఉండే పదార్థాలను ఉపయోగిస్తూ కట్ ఫ్లవర్స్ని తక్కువ ఖర్చుతో మరికొన్ని రోజులు తాజాగా ఉంచవచ్చు.
ఎ. సౌజన్య (9704886759), ఎం.ఎస్సీ., పూలవిభాగం, కాలేజ్ ఆఫ్ హార్టీకల్చర్, డా. కె. కళాధర్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ (హార్టీకల్చర్), డా. పి. ప్రశాంత్, సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్, పూల పరిశోధనా స్థానం, డా. యస్. ప్రణీత్ కుమార్, సైంటిస్ట్ (క్రాప్ ఫీసియోలజీ), శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయము.
తల్లిదండ్రులు తమ ఆస్తులను తమ పిల్లలకు వారసత్వంగా అదించడం మన సాంప్రదాయం అనే విషయం అందరికీ తెలిసిందే. ఎంత ఆస్తి ఉన్నా ఆరోగ్యం సక్రమంగా లేకుంటే ఉన్న ఆస్తిని ఆనందంగా అనుభవించలేరు. కాబట్టి ఆస్తి కన్నా ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం ఉన్నప్పుడే ఆస్తి వలన ఉపయోగం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించినట్లయితే మనం తినే ఆహారంలో ప్రత్యేకించి ఆకుకూరలు మరియు కూరగాయలలో విష రసాయన అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఈ సమస్యకు పరిష్కారంగా అవకాశం ఉన్నవారు ఇటిపంటను మొదలుపెట్టి తామే సొంతంగా కూరగాయలు, ఆకుకూరలతో పాటు కొన్ని రకాల పండ్లను పండించుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినగలుగుతున్నారు. ఇలాంటి వారు తమ వారసులకు తమ ఇంటితోపాటు మిద్దెతోటను వారసత్వంగా ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని మిద్దెతోట నిపుణులు రఘోత్తమరెడ్డి అంటున్నారు. రఘోత్తమరెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంటి పంటలు చేసే వారందరికి సుపరిచితమైన పేరు రఘోత్తమరెడ్డి.
వారసులకు మిద్దెతోటను వారసత్వంగా ఇవ్వాలనుకునేవారు మిద్దెమీద ఇటుకలతో మడులు నిర్మించుకోవాలి. అవి రెండు మూడు తరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటాయి. సాధారణంగా నలుగురు కుటుంబ సభ్యులు ఉండే ఒక కుటుంబానికి ఒకరోజుకు అవసరమయిన కూరగాయలు పొందాలంటే 16 చదరపు అడుగుల మడి సరిపోతుంది. అంటే 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు ఇటుకలతో మడి నిర్మించుకుంటే అందులో బెండ, టమాట లాంటి మొక్కలు 16 వరకు పెంచవచ్చు. ఈ 16 మొక్కలనుంచి ఒక కుటుంబానికి ఒక రోజుకి అవసరమైన కూరగాయలు పొందవచ్చు. లోతు విషయానికొస్తే కూరగాయల పెంపకానికి ఒక అడుగు లోతు మరియు పండ్ల మొక్కల పెంపకానికి రెండు లేదా మూడు అడుగుల లోతు మడులను నిర్మించుకుంటే అనుకూలంగా ఉంటుంది. ప్రతి రెండు మడుల తరువాత మూడవ మడి పండ్ల మొక్కల పెంపకంకుగాను ఎక్కువ లోతు గల మడి నిర్మించుకుని అందులో పండ్ల మొక్కలు పెంచుకుంటే వేసవికాలంలో నీడ ఏర్పడి కూరగాయలు, ఆకుకూరలు బాగా ఎదగడానికి అవకాశం ఉండటంతో పాటు, మిద్దెతోటలో చల్లదనం కూడా ఉంటుంది కాబట్టి వేసవికాలంలో వేడి నుంచి ఉపశమనం కోసం ప్రతి మూడవ మడి పండ్లమొక్కలకు కేటాయించాలి.
మట్టి మిశ్రమంగా నల్లమట్టి, ఎర్రమట్టిలలో ఏది అందుబాటులో ఉంటే అది ఉపయోగించుకోవచ్చు. ఎరువుగా బాగా మాగిన గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకల ఎరువులలో ఏది అందుబాటులో ఉంటే అది ఉపయోగించవచ్చు. రెండు వంతుల మట్టి ఒక వంతు బాగా మాగిన ఎరువును ఉపయోగించి విత్తనాలను నాటుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి మట్టి మొత్తాన్ని బాగా ఎండబెట్టినట్లయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇందుకుగాను మిద్దెతోటలో 30 శాతం దిగుబడితోను, 30 శాతం ఖాళీగా, 30 శాతం విత్తనాలను నాటినవిగా ప్రణాళిక వేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుంది. విత్తనాల గురించి కూడా ఎక్కువ ఇబ్బంది పడకుండా నాటు విత్తనాల కొరకు ప్రయత్నించి అవి దొరకనట్లయితే సంకర జాతి విత్తనాలను కూడా వేసుకుని ఆ దిగుబడి నుండి మరలా మనము విత్తనాలను సేకరించినట్లయితే కొన్ని రోజులకు అవి నాటు విత్తనాలుగా రూపాంతరం చెందుతాయని రఘోత్తమరెడ్డి వివరిస్తున్నాడు.
చీడపీడల గురించి కూడా పెద్దగా ఇబ్బందులు పడనవసరం లేదు. మొక్కలో రోగనిరోధక శక్తి తగినంత ఉన్నట్లయితే ఆ మొక్కలను చీడపీడలు అశించవు. పోషకాలు సక్రమంగా గల బాగా మాగిన పశువుల ఎరువు అందించి మంచి విత్తనాన్ని నాటినట్లయితే పెరిగే మొక్క తప్పనిసరిగా రోగనిరోధక శక్తితో పెరుగుతుంది. కాబట్టి అలాంటి మొక్కలకు చీడపీడలు ఆశించవు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పేను లాంటి చీడలు ఆశించిననట్లయితే పేను ఆశించిన ఆకులను తీసివేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
మొక్కలకు అందించే నీటి విషయంలో ఇంటి పంటదారులు తప్పనిసరిగా కామన్సెన్స్తో ఆలోచించాలి. మొక్కలకు నీరు అవసరం లేదు. కేవలం తేమ మాత్రమే అవసరం ఉంటుంది కాబట్టి మట్టిలోని తేమను గమనిస్తూ నీటిని అందించాలి. ఎక్కువ నీటిని అందించకుండా తగినంత నీటిని మాత్రమే అందించాలి. కాలాన్ని బట్టి నీటిని అందించవలసి ఉంటుంది. అన్ని కాలాలలో ఒకే రకమైన నీటి అవసరం ఉండదు. వివిధ కాలాలకు వివిధ రకాల నీటి అవసరాలు ఉంటాయి కాబట్టి కామన్సెన్స్ ఉపయోగించి నీటిని అందించవలసి ఉంటుంది.
దోసెడు మట్టి, పిడికెడు ఎరువు, ఒక విత్తనం ఉంటే మిద్దెతోటను ప్రారంభించవచ్చు. ఇటుకలతో మడులు కట్టుకోవడానికి ఇబ్బందులు పడేవారు ఫైబరు టబ్బులను కూడా కొనుగోలు చేసుకుని మిద్దెతోటను ప్రారంభించవచ్చు.
ఇవేమి లేకున్నా కాని సంకల్పం ఉండాలే కాని గ్రోబ్యాగ్స్ లేదా ఖాళీ సిమెంటు సంచులతో కూడా మిద్దెతోటను ప్రారంభించవచ్చు. తక్కువ ఖర్చుతో మిద్దెతోటను ప్రారంభించి అనుభవం గడించిన తరువాత శాశ్వత టబ్బులు లేదా శాశ్వత మడులకు మారినట్లయితే ఫలితాలు బాగా ఉంటాయి. ఏది ఏమయినా కాని మన తరువాత తరం వారు ఆరోగ్యంగా, ఆనందంగా మన ఆస్తిని అనుభవించాలంటే ఆస్తితోపాటు మిద్దెతోటను వారసత్వంగా అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని రఘోత్తమరెడ్డి గట్టిగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు 90001 84107 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
చిటుకు వేసేంతలోనే గొర్రెలు చనిపోతాయి. కావున ఈ వ్యాధిని చిటుకు రోగం, నెత్తి పిడుగు వ్యాధి లేదా గడ్డి రోగం అని పిలుస్తారు.
వ్యాధి ఎలా వస్తుంది?
క్లోస్ట్రిడియం సెర్ఫ్రింజన్స్ టైపు ఈ బాక్టీరియా తొలకరి వర్షాలు తరువాత పెరిగిన గడ్డిలో టాక్సిన్ విడుదల చేస్తుంది, ఆ టాక్సిన్ తినడం వలన ఈ వ్యాధి వస్తుంది. ఎక్కువగా జూన్ నుండి జూలై మాసాలలో వస్తుంది. కొదుమలలో (సంవత్సరం వయస్సుగల గొర్రెలు), వలస వెళ్ళు గొర్రెల్లో ఈ వ్యాధి ఎక్కువగా సంక్రమిస్తుంది.
వ్యాధి లక్షణాలు
ఎటువంటి వ్యాధి లక్షణాలు కనపడకుండానే, గొర్రెలు చనిపోతాయి.
చనిపోయే ముందుగా గొర్రెలు నీరసంగా ఉంటాయి, గొర్రెలు గిలగిలా కొట్టుకొని, గాలిలోకి ఎగిరి క్రిందపడి వెంటనే చనిపోతాయి.
జ్వరం, ఫిట్స్ వచ్చి చనిపోవటం జరుగుతుంది.
మేకల్లో పారుడు గమనించవచ్చు.
ఈ వ్యాధి ఎక్కువగా ఉదయం, మధ్యాహ్నం వేళల్లో కనపడుతుంది.
మందలోని సుమారు 5-10% గొర్రెలకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
వ్యాధిని ఎలా నివారించాలి?
వర్షాకాలం కంటే ముందే ఏప్రిల్, మే మాసాలలో మందలోని అన్ని గొర్రెలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించి ఈ వ్యాధిని నివారించుకోవాలి.
మందలోని గొర్రెలలో ఈ వ్యాధిని గమనించిన వెంటనే స్థానిక పశువైద్యుని సలహా తీసుకొని తగు జాగ్రత్తలు పాటించాలి.
తొలకరి వర్షాలకు మొలచి, వాడిపోయిన లేత గడ్డిని గొర్రెలకు మేపినచో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. కాబట్టి వాడిపోయిన గడ్డిని ఎక్కువగా మేపరాదు.
వ్యాధి సోకిన మందను, ఇతర మందుల నుండి దూరంగా ఉంచి, తగు జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి వ్యాప్తి ఆరికట్టవచ్చు.
చికిత్స: వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే, స్థానిక పశువైద్యుని పర్యవేక్షణలో యాంటిబయోటిక్ మందులు ఇంజక్షన్ల రూపేణా వాడాలి.
డా.టి.జశ్వంత్ రెడ్డి, శాస్త్రవేత్త (పశు వైద్య విభాగం), డా.కె.ఎల్.రావు (9989623824), కృషి విజ్ఞాన కేంద్రం, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం,
డా.యం. వెంకట ప్రసన్న, ఎంవిఎస్సి, పశువైద్యురాలు, మైదుకూరు
భూతద్ద్ధంలో చూసినా కనీకనబడనంత పరిమాణం (సుమారు 0.01 నుంచి 1.0 మి.మీ. పొడవు) ఉండే నులిపురుగులు.. పంటలకు చేసే హానీ, నష్టం మాత్రం రైతు… కనీ విననంత (ఎరగనంత) విపరీతంగా ఉంటుంది.
”ఎందెందు వెతికినా.. అందందే కలవు…” అనే సామెతలా.. ఇవి పర్వతాల ఎత్తు నుండీ… సముద్రాల లోతు వరకూ… ప్రాణి బ్రతకడానికి అవకాశమున్న ప్రతిచోట తమ ఉనికిని చాటుతాయి.
ఇవి మట్టిలో (లేదా) నీటిలో (మంచి నీరు, ఉప్పునీరు, మురుగునీరు)నే కాకుండా పరాన్నజీవులుగా మానవులు, జంతువులు, మొక్కలలో కూడా స్వేచ్ఛగా జీవిస్తాయి.
ఇవి కొన్ని వాటిలలో … ముఖ్యంగా పండ్లతోటలలో… జామతోటలలో… ఒక సంవత్సరం నుండి నాలుగు సంవత్సరాల తోటలలో 60 నుంచి 100 శాతం నష్టపరుస్తాయి. అదే జామ నర్సరీలలో అయితే.. 90 నుంచి 100 శాతం కూడా హాని చేస్తాయి.
నులిపురుగులలో కొన్ని బ్యాక్టీరియా, వైరస్లతో కలిసి కూడా పంటలను ఆశిస్తాయి.
నులిపురుగులు (మెలదోగైని జవానికా) అలసంద పంటలో… రైజొక్టినా అనే శిలీంద్రంతో కలిసి ఆశిస్తే పంటకి 83 శాతం నష్టం కలుగుతుంది. కానీ ఇవే నులిపురుగులలో మరో కుటుంబం (మెలడోగైనిహాప్లా) రైజోక్టినా శిలీంద్రంతో కలిసి ఆశిస్తే అలసంద పంటకి 98 శాతం హాని జరుగుతుంది.
మెలడోగైని ఇన్కాగినిటా అనే నులిపురుగులు ప్రత్తిపంటలో ఒంటరిగా ఆశిస్తే ప్రత్తి పంటకు నాలుగు శాతం (4%) నష్టం జరిగితే … ఇవే నులిపురుగులు లేకుండా ఫ్యుజేరియం అనే శిలీంధ్రం ఒక్కటిగా వస్తే ప్రత్తి పంటకు ఇదే 4 శాతం నష్టం కలుగుతుంది.
కానీ ఇవి రెండు కలిసి వస్తే మాత్రం .. నులిపురుగులు ప్రత్తి పంట వేరు వ్యవస్థ భౌతిక స్థితిని మార్పులకు గురి చేయడం వల్ల .. ఫ్యుజేరియం అనే శిలీంధ్రం మరింత ప్రమాదకరంగా పరిణమించి నష్టం 65 శాతానికి పెరుగుతుంది.
ఇలాగే.. తమలపాకులో ఎండుతెగులు కలిగించే శిలీంద్రం.. ఫైటోప్తోరా పారాసిటికాకు నులిపురుగు మెలడోగైని ఇన్కాగ్నిటా తోడైనా.. చెఱకులో వేరుకుళ్ళు కలిగించే ఫిథియం అనే శిలీంధ్రానికి రాడోఫిలస్ సిమిలిస్ అనే నులిపురుగు తోడైనా.. అగ్నికి ఆజ్యం పోసినట్లే! వీటి మిత్ర లాభం .. రైతుకు భేదం.
నులిపురుగులు ఆశించిన మొక్కలు.. గాలి వీచినా.. వర్షం పడినా.. సులువుగా పడిపోయేంత బలహీనం అయిపోతాయి.
కానీ వీటిని గుర్తించడం ఎంత కష్టం.. అంటే.. నేలలో పోషకాలు ఉన్నా సరే.. మొక్కలు పోషకాల లేమితో బాధపడుతున్న లక్షణాలు పైకి కనబడతాయి.
నేలలో మొక్కలకు సరిపడేంత నీరు (తేమ) ఉన్నా సరే… ఇవి ఎండిపోయినట్లు కనబడతాయి.
నులిపురుగులు ఆశించినపుడు పంటపై వీటి లక్షణాలు కూడా పోల్చుకోవడానికి వీలులేనంత కష్టంగా .. ఒక్కో పంటలో … ఒక్కొక్క లాగా ఉంటాయి.
సాధారణంగా చాలా పంటలలో వీటి నష్ట లక్షణాలు…. మొక్కల ఎదుగుదల ఆగిపోవడం, మొక్క ఎండిపోవడంగా ఉంటాయి.
బత్తాయి పంటలో లేత ఆకులు, కొమ్మలు ఎండిపోవటం, నిమ్మ తోటలలో నిమ్మ చెట్టు వేర్లు, కొనలు ఉబ్బడం జరుగుతుంది.
వేర్లు మోడు లాగా మారిపోవడం, వేర్లు గాయపడిన ప్రదేశాల్లో ఉబ్బటం వంటి లక్షణాలు మొక్కజొన్న పంటలో కనబడతాయి.
వరిలో వేర్లపై గోధుమరంగు చారలు, అరటిలో వేర్లు, దుంపలు కుళ్ళిపోవడం, కూరగాయ పంటలలో సాధారణంగా.. వేర్లపై బుడిపెలు ఏర్పడటం వంటి లక్షణాలు వ్యక్తం అవుతాయి.
నివారణ:
నేలను లోతుగా దుక్కి చేయాలి. వేసవి దుక్కులతో మట్టిని కలియబెట్టాలి.
వేరుశనగను చిరుధాన్యాలతో, అరటి, వంగ, ఉల్లి వంటి పంటలను ఒక ఏడాదిపాటు బంతిపూల పంటతో ”పంటమార్పిడి” చేయాలి.
ఉద్యానపంటల్లో.. ముఖ్యంగా జామలో.. నులిపురుగులు లేనివిగా నిర్ధారించబడిన నర్సరీల నుంచి మాత్రమే ఆరోగ్యవంతమైన మొక్కలను కొనుగోలు చేయాలి.
ఎయిర్లేయరింగ్ చేసిన అంట్ల మొక్కలనే వాడాలి.
అంట్లుకట్టడానికి మరియు నర్సరీలలో అంటుమొక్కలను పెంచడానికి నులిపురుగులు లేని స్వచ్ఛమైన మట్టిని వాడుకోవాలి.
అరటిలో పిలకల దుంపపై చర్మం పలుచగా చెక్కి విత్తనశుద్ధికి సంబంధించిన ద్రావణంలో ముంచి, నీడలో ఆరనిచ్చి, తరువాత నాటుకోవాలి.
జనుము పంట తర్వాత అరటి నాటుకోవాలి.
ఎకరాకు 100 కిలోల వేపపిండిని భూమిలో కలియదున్నాలి.
కూరగాయ పంటలలో ఒక కేజీ విత్తనానికి 15-20 గ్రా. చొప్పున సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్తో గాని, ట్రైకోడెర్మావిరిడితో గాని విత్తన శుద్ధి చేయాలి.
పశువుల ఎరువు (లేదా) సేంద్రియ పదార్థాలు (ఆముదం లేదా గానుగపిండి) ఒక హెక్టారుకి రెండు టన్నులు వేసి భూమిలో కలియదున్నాలి.
అలసంద, ఆముదం వంటి నులిపురుగు ఆకర్షక మొక్కలను ప్రధాన పంటల చుట్టూ వేసి, మొలిచిన 45 రోజుల తర్వాత తీసివేయాలి.
చెట్టు నీడన బాగా చివికిన పశువుల ఎరువు ఒక టన్ను తీసుకొని, దానికి 20 కిలోల వేపపిండి కానీ, ఆముదం పిండి కానీ కలిపి, దానితో పాటు 2 కిలోల చొప్పున పర్పూరియోసిల్లమ్ లిలాసినమ్, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ మరియు ట్రైకోడెర్మాహార్జినియమ్ కలిపి దానిని (మిశ్రమాన్ని) గోనెసంచులతో కప్పి, ప్రతిరోజూ నీటితో తడపాలి. ఈ విధంగా 30 రోజులు వృద్ధి చేసి మొక్కల దగ్గర 3 నుంచి 4 కిలోలు వేయాలి.
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నపుడు 100 గేజ్ కలిగిన పారదర్శక ప్లాస్టిక్ షీటును పొలంలో పరిచి 4 నుంచి 6 వారాల పాటు ఉంచి నులిపురుగులతో పాటు, కలుపు మొక్కలు కూడా నివారించవచ్చు.
కె. ఆంజనేయకుమార్ (83310 56106), వ్యవసాయాధికారి, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, డా. ఎన్టిఆర్ లైవ్స్టాక్ బిల్డింగ్, హెచ్సిఎల్ దగ్గర, గన్నవరం, కృష్ణా జిల్లా – 521102.
పాడిపరిశ్రమ తరువాత అత్యంత ఆదరణ పొందిన వ్యవసాయ అనుబంధరంగం జీవాల పెంపకం. ఒకప్పుడు కుల వృత్తిగా ఉన్నా ప్రస్తుత వాణిజ్య సరళిలో చాలామంది జీవనోపాధి కోసం గొర్రెల ఫారాలు ఏర్పాటు చేస్తున్నారు. రైతులు తమకు ఉన్న వనరులను బట్టి ఆరుబయట మేసే సంప్రదాయ విస్తృత పద్ధతిని అలాగే షెడ్లలో ఉంచి మేపే పాక్షిక సాంద్రపద్ధతులను పాటిస్తున్నారు.
వర్షాకాలంలో గొర్రెల పెంపకందారులకు కొంత గడ్డుకాలమే. ముఖ్యంగా ఆరుబయట తిరిగే జీవాలు పచ్చిగడ్డిని తింటూ, గుంటలలోని నీటిని తాగుతూ, తొలకరి జల్లులకు తడుస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో జీవాలు పలురకాల రోగాలకు గురౌతాయి. చిటుక రోగం, గాలికుంటు, నీలినాలుక, పిపిఆర్ వంటి రోగాలు వచ్చి జీవాలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటి నుంచి జీవాలను రక్షించడానికి యజమానులు పలురకాల జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
బ్యాక్టీరియా వల్ల కలిగే రోగాలు
చిటుకువ్యాధి: సంప్రదాయ పద్ధతిలో మేసే గొర్రెలకి మేత పుష్కలంగా దొరికినా వ్యాధులు సోకే అవకాశం కూడా ఎక్కువే ఉంటుంది. వర్షాకాలంలో తొలకరి జల్లులకి మొలచిన గడ్డి తిని చిటుకు వ్యాధి సూక్ష్మజీవి (బ్యాక్టీరియా) క్లోస్ట్రిడియం పెర్ఫ్రింజెన్స్ టైప్-డి ద్వారా వస్తుంది. అన్ని వయసు గొర్రెలు ఈ వ్యాధికి గురౌతాయి. అందువలన తొలకరి జల్లులు కురిసే ఒక నెల ముందు చిటుకు వ్యాధి టీకాను గొర్రెలకు వేయించడం ద్వారా ఈ వ్యాధి నుంచి గొర్రెలను కాపాడవచ్చు.
కాలిపుండు వ్యాధి: వర్షాకాలంలో చిత్తడినేలలలో ఎక్కువసేపు తిరగడం వలన బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి సోకుతుంది. వ్యాధి సోకిన గొర్రెల గిట్టల మధ్యభాగం ఎర్రగా కందుతుంది. కుంటుతూ నడుస్తాయి. వ్యాధిసోకిన గొర్రెలను మంద నుంచి వేరుచేసి యాంటిబయోటిక్స్ పశువైద్యుని పర్యవేక్షణలో వేయించాలి. వ్యాధిసోకిన గిట్టలను 10% ఫార్మలిన్ మరియు కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ముంచాలి. ఈ వ్యాధికి టీకాలు ఉండవు. గొర్రెలను బురద నేలలో ఎక్కువగా తిరగకుండా చూడాలి.
సూక్ష్మాతి సూక్ష్మజీవుల వల్ల కలిగే రోగాలు
పిపిఆర్: గొర్రెల్లో అధిక నష్టాన్ని కలిగించే మరొక రోగం పిపిఆర్. దీనిని పారుడు రోగం అంటారు. ఇది సూక్ష్మాతిసూక్ష్మమైన జీవుల వల్ల గొర్రెలకి సోకుతుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. నివారణమే ముఖ్యం. సంవత్సరంలోపు పిల్లల్లో ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ. ఈ వ్యాధి తీవ్రమైన థలో శ్వాసకోశ మరియు జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అధిక జ్వరం, ముక్కు నుంచి పలుచటి స్రవాలు కారుతాయి. ఇది తీవ్ర థలో చీములాగా మారి జీవాల నుంచి దుర్వాసన వస్తుంది. రక్తము మరియు జిగురుతో కూడిన విరేచనాలు అవుతాయి. నోటి పూత పూస్తుంది. పిపిఆర్ సోకిన గొర్రెల్లో అధిక నష్టం కలగకుండా యాంటీబయోటిక్ మందుల్ని వాడాలి. నోటి పూత వల్ల ఆహారం తీసుకోలేవు. అందువలన జావ మరియు ఓఆర్యస్ కలిపి త్రాగించాలి. క్రమం తప్పకుండా పిపిఆర్ టీకాలు వేయించాలి. మూడు మాసాలు దాటిన గొర్రె పిల్లల్లో టీకాలు వేయించాలి. ఇలా చేయడం వలన గొర్రెల మందలో ఈ వ్యాధిని వ్యాప్తిచెందకుండా చూడవచ్చు.
నీలినాలుక: వర్షాకాలంలో ఈగలు, దోమలు, బాహ్యపరాన్న జీవుల బెడద ఎక్కువగా ఉంటుంది. క్యులికోయిడ్స్ అనే దోమ కాటు వలన ఆరోగ్యంగా ఉన్న గొర్రెలలో ఆర్బోవైరస్ సంక్రమించి నీలినాలుక వ్యాధికి గురౌతాయి. ఈ వైరస్ రక్తనాళంను నాశనం చేస్తాయి. రక్తం గడ్డకట్టకపోవడం వలన వివిధ శరీర భాగాల్లో రక్తస్రావంతో పాటు నీరు చేరి గొర్రెలు చనిపోతాయి. నాలుకలోని రక్తనాళాలు వాచిపోవడం వలన నాలుక నీలిరంగులోకి మారిపోతుంది. అధిక జ్వరం, ముక్కు నుంచి జిగురు వంటి ద్రవం కారుతుంది. కాళ్ళ గిట్టలు ఎర్రగా వాచిపోతాయి. దాని వలన గొర్రెలు కుంటుతూ నడుస్తాయి. ఆకలి మందగిస్తుంది. మరియు నోటిలో పుండ్లు అవుతాయి. జావ మరియు ఓఆర్యస్ త్రాగించాలి. వ్యాధి నివారణ కోసం నీలినాలుక టీకాలు అందుబాటులో ఉన్నాయి. మూడు మాసాలు దాటిన పిల్లల్లో ఈ టీకా వేయాలి. నెల తర్వాత బూస్టర్ డోస్ వేయాలి. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా టీకాలు వేయడం వల్ల వ్యాధిని నివారించి అధిక దిగుబడిని పొందవచ్చు.
గాలికుంటు వ్యాధి: ఈ వ్యాధి సోకిన గొర్రెల్లో నోరు మరియు గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. గొర్రెలు కుంటుతూ మేత మేయవు. ఈ వ్యాధి వ్యాపించి పెంపకందార్లకు తీరని నష్టాన్ని కలిగిస్తాయి. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. గొర్రెలలో తీవ్రమైన జ్వరం వస్తుంది. నోరు, నాలిక, గిట్టల మధ్యలో పుండ్లు అవుతాయి. చూడి గొర్రెలు ఈడ్చుకుపోతాయి. వ్యాధిసోకిన జీవాలను మందనుంచి వేరు చేసి చికిత్స చేయాలి. యాంటీబయోటిక్ మరియు నొప్పి నివారణ మందులు ఇవ్వాలి. నోటిపుండ్లను 1% పొటాషియం పర్మాంగనేటు ద్రవంతో కడిగి బోరిక్ గ్లిసరిన్ ఆయింట్మెంట్ పూయాలి. గాలికుంట వ్యాధి నివారణ టీకాలు వేయించాలి.
ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన జీవుల వల్ల కలిగే రోగాలు ఒక్కసారి మందలో ప్రవేశిస్తే టీకాలు వేయించరాదు. వైరస్ సోకిన జీవాలను గుర్తించి వెంటనే మంద నుంచి వేరు చేయాలి మరియు తగిన చికిత్స అందించి వ్యాధి తగ్గిన తరువాత మందలో ప్రవేశపెట్టాలి.
కొత్తగా సంతలో కొన్న జీవాలను మందలో కలిపేముందు వాటిని వేరుగా ఉంచి వ్యాధి నిరోధక టీకాలు విప్పించి వ్యాధులు ఏమీ లేవు అని నిర్ధారించిన తర్వాత మందలో ప్రవేశపెట్టాలి.
బూజు పట్టిన ఆహారాన్ని గొర్రెలకు మేపితే అఫ్లాటాక్సికోసిస్ అనే ఫంగల్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. అందువలన రైతులు గొర్రెలకు ఆహారం వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ తొలకరి జల్లులకు గొర్రె పిల్లల్లో ఎక్కువగా ఊపిరితిత్తుల వ్యాధులు సోకి 30% మరణాలు సంభవిస్తాయి. గొర్రెల శాలలో తేమశాతం పెరగకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మలమూత్రాలను తీసివేస్తూ శుభ్రపరిచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వర్షాకాలంలో జీవాలు వ్యాధిబారిన పడితే వెంటనే పశువైద్యాధికారిని కలిసి తగిన చికిత్స జీవాలకు అందించడం ద్వారా రైతులు నష్టాలబారిన పడకుండా ఉంటారు.
డా. కె. వాణి, పి.జి స్కాలర్, పశువైద్య & పశుసంవర్థక శాఖ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్, సెల్: 9640697636
ఇటీవల కాలంలో అధిక పాల దిగుబడులు, అధిక వెన్న శాతం పొందడానికి దాణాలు, బైపాస్ ప్రోటీన్లు, బైపాస్ ఫ్యాట్లు వాడకం పట్ల రైతుల ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
అధిక పాల దిగుబడి నిచ్చే ఆవులు, గేదెలలో ఎక్కువగా పాల దిగుబడికి ఎక్కువ పరిమాణంలో నాణ్యత గల ఎక్కువ మాంసకృతులను కొవ్వు పదార్థాలను అందించవలసి ఉంటుంది. వీటిలో బైపాస్ ఫ్యాట్ల గురించి చూస్తే ఇది పామ్ ఆయిల్, రేప్ సీడ్ ఆయిల్, వరి తవుడు, ప్రొద్దుతిరుగుడు గింజల ద్వారా సుమారు 8500 కిలో క్యాలరీల శక్తి లభ్యమవుతుంది. వీటిలో జీర్ణం అయ్యే పదార్థాలు 90% వరకు ఉంటాయి. పశువుకి బైపాస్ ప్రోటీన్లు అందించినప్పుడు రూమెన్లో జీర్ణం అవ్వకుండా వృధా కాకుండా నేరుగా చిన్న ప్రేగులోకి చేరి శక్తిగా మారి పాల దిగుబడికి పూర్తిగా సద్వినియోగపడుతుంది.
ఇది రుచికరంగా ఉండటం వలన పశువులు ఎంతో ఇష్టంగా తింటాయి. బైపాస్ ఫ్యాట్స్ని దాణాలో కలిపి పశువులకు అందించినట్లయితే పాల దిగుబడి పెరగడంతో పాటు పాలలోని వెన్న శాతం 0.2 నుండి 1% వరకు పెరిగే అవకాశాలుంటాయి, పాలలో మాంసకృత్తులు 0.07% పెరుగుతాయి, చూడి కట్టే శాతం కూడా పెరుగుతుంది శరీర బరువు వృద్ధి చెందటం గమనించవచ్చు. బైపాస్ ఫ్యాట్స్తో కూడిన ఫీడ్ సప్లిమెంట్స్ని దాణాతో కలిపి పెట్టాలి. ప్రతిరోజు 100 నుండి 150 గ్రాముల దాకా ఇవ్వవచ్చు. బైపాస్ ప్రోటీన్ల విషయానికి వస్తే మాంసకృత్తుల లభ్యత శరీరానికి పెరిగి పాల దిగుబడులు పెరుగుతాయి. ప్రత్తి గింజల చెక్క, వేరుశనగ చెక్క, పొద్దుతిరుగుడు విత్తనాల చెక్క, మొదలగు పదార్థాలలో మాంసకృత్తులు, బైపాస్ ప్రోటీన్ల లక్షణం కలిగి ఉంటాయి అందువలన పై పదార్థాలను నేరుగా లేదా సమీకృత దాణాలో కలిపి పశువులకు అందించినట్లయితే పాల దిగుబడి పెరుగుతుంది. కొన్ని కంపెనీలు బైపాస్ ప్రోటీన్ దాణాలు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు ఇటువంటి దాణాలు వాడటం వలన పాల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. పడ్డలు, పెయ్యలు త్వరగా పెరుగుతాయి సమీకృత దాణా అవసరం 40% వరకు తగ్గి, ఎండు పదార్థాలు వినియోగం 30% వరకు పెరుగుతుంది. పశువుకి ఎండు పదార్థాల అవసరం 20% వరకు తగ్గుతుంది. బైపాస్ ప్రోటీన్లు, బైపాస్ ఫాట్స్తో కూడిన ఫీడ్ సప్లిమెంట్ వాడటం వలన పాడి పశువుల నుండి సుఖంగా, వేగంగా, అత్యధికంగా, ఉత్పాదక శక్తి సామర్థ్యం పొందే అవకాశాలు నిండుగా ఉంటాయి.
నానాటికీ కనుమరుగై పోతున్న పచ్చికబీళ్ళు, ఇతర మేపు సమస్యల వల్ల సాంప్రదాయమైన పాత పద్ధతులలో భారీ సంఖ్యలో గొర్రెలు, మేకల్ని పెంచే అవకాశాలు క్షీణిస్తున్నాయి. పంటల మీద ఎక్కువగా వాడుతున్న రసాయనాల వల్ల, పంటల వ్యర్థాలు, దంట్ల మీద ఆధారపడే జీవాల ఆరోగ్యాలు, ఎదుగుదల క్షీణించే అవకాశాలే ఎక్కువ. క్రూరమృగాల భయంతో ఇటీవల మందల్ని సమీప అరణ్యాలకు జీవాలను మేపుకు తోలుకు వెళ్లటం కూడా ప్రమాదకరంగా మారింది. సంచార మందలు రోడ్డు ప్రమాదాలతో పాటు అంటురోగాల బారిన కూడా ఎక్కువగా పడుతున్నాయి. ఇవికాక అనేక ఇతర కారణాల వల్ల కూడా ఇండ్బ్రో పౌల్ట్రీ సంస్థ యజమాని తాను రెండేళ్ల క్రింత ఎం.ఆర్.ఎఫ్. షీప్ బ్రీడింగ్ ఫారంను సాంద్ర పద్ధతిలో పూర్తి చేతి మేత పద్ధతిలో ప్రారంభించారు. ఈ షీప్ బ్రీడింగ్ ఫారం మహబూబ్నగర్ జిల్లా దోనూరు గ్రామ శివారులో హైదరాబాదు నగరానికి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిరకాలంగా తన హాచరీ మరియు పౌల్ట్రీ యూనిట్లలో అత్యంత విశ్వాసపాత్రంగా, నమ్మకంతో పనిచేస్తూ ఉన్న సిబ్బందితోపాటు తన చిరకాల మిత్రులు జీవాల బ్రీడింగు మరియు న్యూట్రిషన్ విభాగాలలోని శాస్త్రజ్ఞులు ఇస్తున్న సహాయ సహకారాల మీద నమ్మకంతోనే తాను ఈ షీప్ బ్రీడింగ్ రంగంలోకి ప్రవేశించినట్లు స్వయంగా జంతు జన్యుశాస్త్రజ్ఞుడైన డా. కోటయ్య అంటున్నారు. వీరి సలహాలు, సేవలు, సహకారాల కారణంగానే సాధారణంగా ప్రారంభ సంవత్సరాలలో 4-5 శాతం ఉండే మరణాలను గత రెండేళ్లలో కేవలం 0.7 శాతానికి సమర్ధవంతంగా అదుపు చేయగలిగానని, అంతేకాక శాస్త్రీయ మేపు విధానాల వల్ల తన ఫారంలో జీవాల ఎదుగుదలతో పాటు ప్రత్యుత్పాదక సామర్థ్యం కూడా రాష్ట్ర మరియు జాతీయ సగటు కంటే ఎక్కువగా వున్నట్లు ఆయన వివరించారు. జీవాల చర్మాలకు, ఉన్నికి క్షీణించిన మార్కెట్ గిరాకీని దృష్టిలో ఉంచుకుని కేవలం ఉన్నతమైన సంతతి ద్వారా ఎక్కువగా నాణ్యతా పరిమాణాలు కలిగిన మాంస ఉత్పత్తినే తన లక్ష్యంగా కృషి చేస్తున్నానని వివరిస్తున్నారు.
వ్యాపార దృక్పథంతో పాటు ఒక సైంటిస్టుగా శాస్త్రీయ దృక్పథంతో ప్రారంభించిన ఎమ్.ఆర్.ఎఫ్. ఫారం ద్వారా ఔత్సాహిక గొర్రెల పెంపకందారులకు, యువ శాస్త్రజ్ఞులకు అవసరమైన శాస్త్రీయ సమాచారాన్ని అందించాలనే తన లక్ష్యంతో ఈ ఫారం పనిచేస్తూ వుంది. భారీ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జీవాల పంపిణీ ద్వారా లబ్దిదారులు ఇంకా ఎక్కువ ప్రయోజనాలను పొందుటకు అవసరమైన సహాయ సహకారాలను అందించుటకు తాను ఎల్లప్పుడు సిద్ధంగా ఉండగలనని డా. కోటయ్య ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా జీవాల రంగంలో కనిపించని విస్తరణ సేవలలో కీలకమైన విధాన ప్రదర్శన – ఫలితాల ప్రదర్శనల ద్వారా జీవాల పెంపకందారులలో సాంకేతిక చైతన్యాన్ని పెంచే లక్ష్యంతో నడుస్తున్న ఈ రిసెర్చి ఫారం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అదనపు ప్రోత్సాహకాలను అందించవలసిన అవసరం ఉంది.
ఖర్చుకు వెనుకాడకుండా ఇతర రాష్ట్రాల నుండి 70-80 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేసిన జన్యుపరంగానే కాక పుష్టిగా కూడా ఉన్నతంగా ఉండే నెల్లూరు జొడిపి, రాంబుల్లెట్ గొర్రెపోతులు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా వివిధ వయస్సుల ఆడపిల్లలు, యువతల్లుల్ని కూడా రెండు-మూడు తరాల జన్యుచరిత్రను గమనించి వందల సంఖ్యలో ఎక్కువగా పెంపకందారుల మందల నుండి నేరుగా సేకరించారు.
జీవాలకు అవసరమైన సూపర్ నేపియర్, హెడ్జ్లూసర్న్ గ్రాసాలతో పాటు ఉభయత్రా ఉపయోగపడే చిలకడదుంప, వేరుశనగ, మొక్కజొన్న వంటి పంటల్ని కూడా ఇక్కడే సాగు చేసి, వీటిని ముక్కలుగా చేసి దాణాలతో కలిపి మేపుతున్నారు. ఈ దాణాలు కూడా తన పౌల్ట్రీ ఫారంకు చెందిన దాణా మిశ్రమ కార్మాగారంలోనే శాస్త్రీయంగా తయారు చేస్తున్నారు. జీవాల ఎదుగుదలను వేగవంతం చేసే ఉలవల సాగును కూడా చేపట్టే ఆలోచనలో ఉన్నారు.
ఈ ప్రాజెక్టును ప్రారంభించుటకు ముందు డా. కోటయ్య దేశంలోని ప్రముఖ గొర్రెల పరిశోధనా కేంద్రాలను స్వయంగా సందర్శించి అక్కడి నిర్వాహకుల నుండి విలువైన సమాచారాన్ని సేకరించారు. తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ గొర్రెల జాతుల గొర్రెలు లభ్యమయ్యే ప్రాంతాలు నెల్లూరు, మాచెర్ల, నంద్యాల, మహానంది, నిజామాబాద్లతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుండి మూడు తరాల జన్యు చరిత్రను తెలుసుకుని కొనుగోలు చేసిన సుమారు 500 గొర్రెలు, పిల్లలు ఈ క్షేత్రంలో మాతృజీవాలుగా పెంచబడుతున్నాయి. రెండు సంవత్సరాలలో కనీసం మూడు ఈతల్ని పొందే లక్ష్యంతో బ్రీడింగ్ ప్రణాళిక రూపొందించుట జరిగింది. ఈ లక్ష్యం మేరకు తొలిథలోనే సుమారు నాలుగు వందల పిల్లలు ఇక్కడ జన్మించాయి. ఎదుగుదల, మార్కెట్ డిమాండు తదితర అంశాలలో నెల్లూరు జొడిపి జాతి గొర్రెలు నెల్లూరు పల్లా, నెల్లూరు బ్రైన్ తదితర స్థానిక జాతి గొర్రెల కంటే మేలైనవని గత రెండేళ్ల అనుభవంతో చెబుతున్నారు. ఇవికాక నారిజాతి, రాంబుల్లెట్ గొర్రెల్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా పెంచుతున్నారు. నారి జాతి గొర్రెలు ఐదు నెలల వయస్సులో సుమారు 40-50 కిలోల శరీరబరువు పెరుగుతాయని గమనించారు.
తొలి బ్యాచి గొర్రెలు రాకముందే ఐదు ఎకరాలలో సూపర్ నేపియర్, హెడ్స్లూసర్న్ సాగును ప్రారంభించారు.
షెడ్ నిర్మాణం: శాస్త్రీయ అధ్యయనాలకు అవసరమని ప్రత్యేకంగా కొంత ఎక్కువ ఖర్చైనప్పటికీ వివిధ అవసరాలకు మందలలోని జీవాల సంఖ్య బ్రీడింగ్ గదులు ఈనే గొర్రెలకు ప్రత్యేక అవసరాలు, కొత్తజీవాలకు క్వారంటైన్ షెడ్లు, గ్రాసాల కోత మిషన్లు తదితర ప్రత్యేక అవసరాలకు సుమారు 60 లక్షలు వెచ్చించి 10þ12 నుండి 16þ12 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గదులకు అనుబంధంగా సుమారు మూడు రెట్లు అదనపు విస్తీర్ణం కలిగిన ఆవరణతో (పాడక్) నిర్మించుట జరిగింది. ఈ షెడ్లు ఎత్తైన నేల మీద పటిష్టమైన డ్రైయినేజ్ ఏర్పాటుతో నిర్మించుట ద్వారా గొర్రెలన్నింటికీ ఆరోగ్యరక్షణ కల్పించుట జరిగింది. స్వచ్ఛమైన త్రాగునీటిని బేసిన్ల పైన అమర్చిన నిపుల్స్ ద్వారా ఏర్పాటు చేశారు. పటిష్టమైన ఈ షెడ్లపై పరిశోధనా పరమైన అవసరాల కోసం కొంత ఎక్కువ ఖర్చైనప్పటికీ ఈ నిర్మాణ సామగ్రిని అవసరమైతే తక్కువ నష్టంతో వేరొక చోటుకు తరలించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ షెడ్లలో 700 నుండి 800 వరకు జీవాలను పెంచవచ్చును. పరిశోధనలకు కాక కేవలం ఉత్పత్తే లక్ష్యంగా నడిచే షీప్ ఫారాలకు షెడ్లు మీద వ్యయాన్ని 10-15 లక్షలకు పరిమితం చేయవలెను.
జీవాల ఆరోగ్యభద్రత: సంచారమందలు, సంతలలో సమూహమైన జీవాలలో అనేక ప్రమాదకర అంటువ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువ. కాబట్టి సంతల నుండి కాక ఆదర్శమైన గొర్రెల ఫారాలు గొర్రెల పెంపకందారుల నుండి మాత్రమే తనకు అవసరమైన ఫౌండేషన్ స్టాక్ను కొంత హెచ్చు ధర చెల్లించి అయినా కొనుగోలు చేయుటకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఫారంలో జన్మించిన ప్రతి గొర్రె పిల్లకు, బయట నుంచి కొనుగోలు చేసిన ప్రతి జీవానికి ప్రత్యేక నెంబరు కలిగిన చెవిపోగు బిగించబడుతుంది. ఇది శాస్త్రీయ అధ్యయనాలకు చాలా అవసరం. వయస్సుకు తగ్గ శరీర తూకంతో పాటు, నిర్దేశించిన జాతి లక్షణాలు కలిగి, పుష్టిగా కనిపించే జీవాలను మాత్రమే కొనుగోలు చేయాలి. సొంత ఫారానికి వచ్చిన తర్వాత కనీసం 10 రోజులు వాటిని వేరుగా ఉంచి ఆల్బెండజోల్ వంటి పరాన్న జీవుల నిర్మూలన మందుల్ని అవసరమైతే లివర్ టానిక్స్ను పట్టించాలి. ప్రతిజీవం ఫారం ప్రవేశం వద్ద క్రిమినాశకం కలిపిన నీళ్లతొట్టిగుండా నడిచి మాత్రమే ఫారంలోకి ప్రవేశించాలి.
చిటుకరోగం, బొబ్బరోగం, గాలికుంటు, గురక మరియు బ్రూసెల్లోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణకు టీకాల వేయించుట, షెడ్లు ఆవరణలను ఎప్పుడూ పొడిగా శుభ్రంగా వుంచటం, మల మూత్రాలలో చిన్నతేడా కనిపించిన వెంటనే లేబొరేటరీ పరీక్షలు జరిపి ఆరోగ్య సమస్యల్ని గుర్తించటం వంటి విషయాలలో ఇక్కడి యాజమాన్యం అప్రమత్తంగా ఉంటుంది. ఇంతేకాక మరణించిన ప్రతి జీవానికి శవ పరీక్ష జరిపి, మృతకళేబరాలను శాస్త్రీయంగా తొలగించి, లోతుగా పూడ్చివేయటం వంటి జాగ్రత్తల్ని ఖచ్చితంగా పాటిస్తున్నారు.
మేపు: జన్మించిన ప్రతి పిల్లకు 4 నుండి 5 వారాల వరకు తల్లి నుండి సమృద్ధిగా పాలను త్రాగనిచ్చి ఆ తర్వాత వేరు చేయాలి. ఇందువల్ల పిల్లలు వేగంగా పుష్టిగా పెరగటమే కాక, తల్లి కూడా మరో నెలలోపల చూడి కట్టే అవకాశాలు ఉంటాయి. 4-5 వారాల నుండి పచ్చిమేతతో పాటు విటమిన్లు, మినరల్స్ కలిగిన ప్రత్యేక సమీకృత దాణాలను 50 నుండి 100 గ్రాములు ప్రతిరోజూ అందించాలి. సూపర్ నేపియర్, లూసర్న్, మొక్కజొన్న, ఇతర గ్రాసాల మిశ్రమాల్ని చాఫ్కట్టర్తో చిన్న ముక్కలుగా తరిగి మేపుటతో పాటు రావి, మర్రి, సుబాబుల్, మల్బరి, తుమ్మ, మారేడు వంటి ఆకుల్ని కూడా అవకాశాన్ని బట్టి ఈ మేతలతో కలిపి మేపవచ్చును. పచ్చిమేతలు సమృద్ధిగా లభిస్తే సైలేజ్ మరియు టోటల్ మిక్స్డ్ రేషన్ టి.ఎం.ఆర్) అనే దాణాగ్రాసాల మిశ్రమాన్ని కాని మేప వలసిన అవసరం ఉండదు. ఎదుగుదలలో నిర్దేశిత ప్రమాణాలు లోపిస్తే వెంటనే పోషణ విషయంలోనూ, జీవాల ఆరోగ్య స్థితిపైనా, అవసరమైన సమీక్ష చేయాలి. వారం వారం తూకం వేస్తూ ఎదుగుదలను గమనిస్తూ దాణాలో మాంసకృత్తులు, ఇతర పోషకాల శాతాన్ని, దాణా పరిమాణాలను నిపుణుల సలహామేరకు సవరిస్తూ ఉండాలి. మాంసం కోసం జీవాలను విక్రయించే ముందు నెలరోజుల పాటు గొర్రెల దాణాలో ఉడికించిన ఉలవలు రోజుకు 100-150 గ్రాములు అదనంగా కలపితే అంతకు అనేక రెట్లు అదనపు ఆర్థిక ప్రయోజనం వుంటుంది.
ఎం.ఆర్.ఎఫ్ ఫారంలో జన్మించిన గొర్రె పిల్లల పుట్టుక శరీర తూకం ఇతర ఫారాల కంటే చాలా ఎక్కువగా అంటే 3.0 నుండి 3.8 కిలో గ్రాముల వరకు వుండుట గమనార్హం!
ఎక్కువ బరువుతో జన్మించిన పిల్లలు వేగంగా ఎదిగి త్వరగా యుక్త వయస్సుకు వచ్చి జీవితాంతం ఎక్కువ లాభదాయకంగా ఉంటాయి. సమృద్దిగా జున్నుపాలను తొలివారంలోనూ, ఆ తర్వాత 5 వారాల వరకు తల్లిపాలను అందిస్తే పిల్లలు పుష్టిగా వేగంగా ఎదుగుతాయని డాక్టర్ కోటయ్య తన అనుభవాన్ని వివరిస్తున్నారు.
కనీసం గత మూడు తరాలలో ఎటువంటి రక్త సంబంధం (జన్యుసంబంధం) లేని ఆడ-మగ గొర్రెల మధ్య మాత్రమే సంపర్కాన్ని ఏర్పాటు చేయాలి. అంతర్గత సంపర్కం వల్ల నిర్వీర్యమైన సంతతి జన్మిస్తుంది. పోతుల వద్దకు, చీకటి సమయాలలో ఎదలో వున్న ఆడ గొర్రెను సంపర్కానికి వదలాలి. ఇందుకు అవసరమైతే రాత్రిళ్లు పాకలలో లైట్లు తీసి వేయుటతో పాటు వెలుతురు తగ్గించుటకు నల్ల పరదాలను ఏర్పాటు చేయగల్గితే మంచిది. లింగ విభజన అంటే ఒ మరియు ఖ క్రోమోజోములను వేరువేరుగా కలిగిన వీర్యాన్ని ఉపయోగించి మనం కోరిన ఆడ లేదా మగ సంతతిని పొందే కృత్రిమ గర్భోత్పత్తి విధానం అమలు కూడా పరిశీలనలో ఉంది.
చూడి పరీక్షలు: గొర్రెలలో చూడి నిర్ధారణ ఆవులు-గేదెలంత సులువుకాదు. మేత-నీరును ఒకపూట నిలిపి వేసి పొట్టను కొంత ఖాళీ చేసిన తర్వాత పొట్ట క్రింద తడిమి మూడు నెలలు దాటిన చూడిని 80 నుండి 90 శాతం ఖచ్చితంగా అంచనా వేయగల నైపుణ్యాన్ని పొందవచ్చు. ఇవికాక అల్ట్రాసోనిక్ సాధనం ద్వారా కూడా గర్భంలోని పిండాన్ని – పిండాల సంఖ్యను తెలుసుకోవచ్చును. రక్తం నుండి సేకరించిన సీరమ్ పరీక్ష ద్వారా ప్రొజెస్టెరోన్ హార్మోను పరిమాణాన్ని తెలుసుకొని తొలిమాసం చూడి దాటిన గొర్రెలలో చూడి నిర్ధారణ చేయవచ్చును. ఇదే పద్ధతిని గత నెల నుండి 100 శాతం ఖచ్చితత్వంలో విజయవంతంగా అమలు చేస్తున్నారు. దీనివల్ల గొడ్డుమోతు గొర్రెల్ని గుర్తించి సకాలంలో సరియైన చర్యలు తీసుకొనుట సాధ్యమౌతుంది.
గొర్రెలలో ఎదసమన్వయం: ఒకేసారి ఎక్కువ సంఖ్యలో హార్మోన్లతో ఎదకు తెప్పించి వీటన్నింటికీ నిపుణుని చేత కృత్రిమ గర్భోత్పత్తి చేయుట వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నందున ఈ అంశం కూడా పరిశీలనలో ఉంది.
సహజ సంపర్కం జరిపిన తర్వాత 15-17 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఎద లక్షణాలకు పరిశీలించి, ఎద లక్షణాలు కనిపించకపోతే ఆ తర్వాత చూడి పరిశీలన చేయాలి. అందువల్ల మందలో ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని పెంచి ప్రతి 8-9 నెలలకు ఒక ఈతను పొందవచ్చు.
కవలలు అవసరమా?
ఒకే ఈతలో ఒకటి కంటే ఎక్కువ పిల్లల్ని ఆశించుట మంచిది కాదు. డాక్టర్ కోటయ్య అభిప్రాయం. గర్భంలో ఒకటి కంటే ఎక్కువ పిల్లలు వుంటే వాటికి తల్లిగర్భంలో తగినంత పోషణ అందక అవి తక్కువ శరీర తూకంతో జన్మిస్తాయి. పుట్టిన తర్వాత కూడా వాటి శరీర అవసరాలకు తగిన స్థాయిలో జున్నుపాలు, ఐదారు వారాల వరకు అందవలసిన తల్లిపాలు కానీ లభ్యం కానందున వాటి ఎదుగుదల కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అంతేకాక తన గర్భంలో రెండు కంటే ఎక్కువ పిండాల భరించుట వల్ల 60-70 శాతం అదనపు భారాన్ని భరించడమేకాక, ఈనే సమయంలో ప్రాణాంతక సమస్యలు కూడా తలెత్తవచ్చును. ఇటువంటి ఇబ్బందిని మూగజీవానికి కలిగించుట కూడా మానవత్వం కాదని డాక్టర్ కోటయ్య అభిప్రాయం.
సుమారు 1000 జీవాలకు అవసరమైన షెడ్ల నిర్మాణం మీద సుమారు 60 లక్షలు ఖర్చు అయినట్లు, జీవాల (పిల్లలతో కలిపి ఆడవి-మగవి విత్తనపు పోతులు) షుమారు 70 లక్షల రూపాయలు వెచ్చించినట్లు, ఇప్పటివరకు 450 వరకు పిల్లలు జన్మించి సంతృప్తికరంగా ఎదుగుతున్నట్లు, తన ఫారంలో జనన తూకాలు 3.0 నుండి 3.8 కిలోల వరకు ఉన్నట్లు పాలు విడిచిన పిల్లల దినవారీ ఎదుగుదల 100 120 గ్రాములు ఐదు నెలలకు వాటి తూకం 22 నుండి 25 కిలోల వరకు ఉన్నట్లు నెల్లూరు జొడిపి జాతి గొర్రెల ఎదుగుదల నెల్లూరు బ్రౌన్ మరియు నెల్లూరు పల్లా జాతుల కంటే మెరుగుగా ఉన్నట్లు డా. కోటయ్య వివరిస్తున్నారు.
సకాలంలో టీకాలు, పరాన్నజీవుల నిర్మూలన, చూడి తల్లుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో పాటు తాను తీసుకుంటున్న బయోసెక్యూరిటీ జాగ్రత్తల వల్ల తన ఫారంలో మరణాల శాతాలను 0.7 శాతానికంటే తక్కువ స్థాయిలో అదుపు చేసి సుదీర్ఘ అనుభవం కలిగిన సాంప్రదాయక జీవాల పెంపకందారుల్నే కాక, ఈ రంగంలోని శాస్త్రజ్ఞుల్ని కూడా డా. కోటయ్య అబ్బురపరచుట అభినందనీయం.
జీవాల అమ్మకం ద్వారానే కాక ప్రతి జీవం నుండి ఏటా లభిస్తున్న 0.5 నుండి 0.7 టన్నుల సారవంతమైన ఎరువు ద్వారా తనకు అదనపు ఆదాయాలు అందుతున్నాయి.
నిర్ధిష్టమైన నెంబరుతో పెరుగుచున్న ప్రతి గొర్రె యొక్క సమాచారం కంప్యూటర్లలో నిక్షిప్తమై తనకు సకాలంలో సరియైన నిర్ణయాలు తీసుకొనుటకు ఉపయోగపడుతున్నాయని, ఇదే సమాచారాన్ని ఇతర శాస్త్రజ్ఞులకు కూడా అందుబాటులో ఉంచగలనని డాక్టర్ కోటయ్య ప్రకటించుట అభినందనీయం!
వివిధ రకాల కారణాల వలన ప్రస్తుతం అవసరానికి తగ్గట్టుగా జీడిపిక్కల సరఫరా లేదు కాబట్టి ఇతర దేశాల నుంచి జీడిపిక్కలను దిగుమతి చేసుకోవలసి వస్తుంది. గత రెండుమూడు థాబ్దాల నుంచి అధిక దిగుబడులను ఇచ్చు అంటుమొక్కలు అందుబాటులో వస్తున్నా కాని ఇంకా మన అవసరాలకు తగినట్లు దిగుబడులను పొందలేకపోతున్నాము కాబట్టే దిగుమతులపై ఆధారపడవలసి వస్తుంది. ఈ పరిస్థితులు మారాలంటే మేలైన అంటుమొక్కలను వేసుకోవడంతోపాటు, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉందని బాపట్లలోని డా|| వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, జీడిమామిడి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా|| కె. ఉమామహేశ్వరరావు వివరించారు.
ఆంధ్రరాష్ట్రంలో సుమారు 1,35,000 హెక్టార్లలో జీడిమామిడి సాగులో ఉంది. కానీ దిగుబడి మాత్రం సుమారు 1,20,000 టన్నులుగా ఉంది. సాధారణంగా హెక్టారుకి 2000 కిలోల వరకు దిగుబడి రావలసి ఉంది కాని ప్రస్తుతం సాధిస్తున్న దిగుబడిని పరిశీలించినట్లయితే దిగుబడి చాలా తక్కువగా ఉంది. మంచి దిగుబడి పొందాలంటే అధిక దిగుబడిని ఇచ్చు అంటుమొక్కలను నాటుకోవడంతోపాటు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఇక్కడ అధిక దిగుబడులను ఇచ్చు అంటుమొక్కలను ఉత్పత్తి చేస్తున్నాము. ఇప్పటి వరకు అనేక రకాల అభివృద్ధి పరచిన అంటుమొక్కలను మన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతులతో పాటు ఒరిస్సా, పశ్చిమబెంగాల్, చత్తీస్ఘడ్ రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా కొనుగోలు చేసి నాటుకుంటున్నారు అని కె. ఉమామహేశ్వరరావు వివరించారు.
రైతులు అంటుమొక్కలను ఎంపిక చేసుకునేటప్పుడు అశ్రద్ధకు తావు ఇవ్వకుండా 9 నుంచి 12 నెలల వయస్సు గల 10 నుంచి 12 ఆకులు గల అంటుమొక్కలను ఎంపిక చేసుకోవాలి. అంటు జాయింట్ కూడా గట్టిగా ఉండాలి. 6þ9 సైజు గల కవరులో గల అంటుమొక్కలను కొనుగోలు చేసుకుని రవాణాలో తగిన జాగ్రత్తలు తీసుకుని, వెంటనే నాటుకోకుండా 2 లేదా 3 రోజుల తరువాత ప్రధాన పొలంలో వేసుకుంటే మోర్టాలిటిని తగ్గించవచ్చు. మొక్కలు రవాణాలో కొంత వత్తిడికి గురి అవుతాయి కాబట్టి నీడలో దించుకుని నీటిని అందించి రెండు, మూడు రోజులు ఆగి నాటుకోవాలని రైతులను ఉమామహేశ్వరరావు కోరుతున్నారు.
అన్ని జాగ్రత్తలు తీసుకొని మంచి యాజమాన్య పద్ధతులు పాటించగలిగితే రెండవ సంవత్సరం నుంచి కాపు మొదలు అవుతుంది కానీ మూడవ సంవత్సరం నుంచి దిగుబడి పొందవచ్చు. బాగా ఎండి రాలిపోయిన గింజలను సేకరించి రెండు, మూడు రోజులు మంచి ఎండలో ఎండబెట్టిన తరువాత గ్రేడింగ్ చేసి నిల్వ చేసుకోగలిగితే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. కాబట్టి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. సాధారణంగా దిగుబడి వచ్చిన కొత్తలో జీడి పిక్కల రేటు తక్కువనే ఉండి పండుగల సమయంలో పెరుగుతుంది కాబట్టి నాణ్యమైన జీడి పిక్కలను నిల్వ చేసుకుని గిరాకీ ఉన్న సమయంలో అమ్ముకోగలిగితే మంచి ఆదాయం వస్తుంది అని ఉమామహేశ్వరరావు వివరించారు.
జీడిమామిడి అనగానే ఎక్కువ మందికి జీడిపప్పు మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ జీడిపప్పుతో పాటు జీడి పండ్ల నుంచి కూడా ఉపఉత్పత్తులను తయారు చేయవచ్చు. జీడిపండులో అనేక పోషకాలు ఉంటాయి. బత్తాయిలో కంటే రెండు రెట్లు అధిక సి విటమిన్ జీడి పండ్లలో ఉంటుంది. జీడిపండ్ల నిల్వ సామర్థ్యం చాలా తక్కువ కాబట్టి వీటి నుంచి రసం తీసి వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చు. ఒక ఎకరం జీడితోట నుంచి రెండు నుంచి మూడు టన్నుల జీడి పండ్ల దిగుబడి వస్తుంది. కిలోకు 5/-లు వచ్చినా కూడా ఎకరం జీడి తోట నుంచి 10 నుంచి 15 వేల రూపాయల అదనపు ఆదాయం పొందవచ్చు. కాబట్టి జీడి పండ్లతో తయారు చేయగల ఉపఉత్పత్తులకు మరియు జీడి పిక్కల నుంచి జీడి పప్పు తయారీకి సంబంధించిన విషయాల గురించి శిక్షణను అందిస్తున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోగలరు. జీడి పంటకు సంబంధించిన సాగు పద్ధతులు, నాణ్యమైన అంటుమొక్కలు, చీడపీడల యాజమాన్యం గురించి 7382633656 ఫోనులో తనను సంప్రదించవచ్చని ఉమామహేశ్వరరావు కోరుతున్నారు.
ఈ వ్యాధి వేడి రక్తం గల ప్రతి జంతువులోను మరియు మనుషులలోను కలుగు అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి. ఈ వ్యాధిలో ముఖ్యంగా మెదడు మరియు వెన్నుపాము కణాలు దెబ్బతినుట వలన నాడీమండల వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి.
రేబీస్ వ్యాధిని ”హైడ్రోఫోబియా”, ”లిస్సా మరియు రేజ్” అని కూడా పిలుస్తారు.
వ్యాధి కారకం: ఈ వ్యాధి ”రాబ్డ విరిడె” జాతికి చెందిన లోస్సా వైరస్ వలన కలుగుతుంది. ఈ వైరస్ బుల్లెట్ ఆకారంలో ఉండి సుమారు 70 నుండి 80 మి.మీ. పరిమాణంలో ఉంటుంది. సాధారణంగా జంతువులలో వ్యాధులను కలిగించే వ్యాధి కారక వైరస్ను ”స్రీట్ వైరస్” అని, ప్రయోగశాలలో సీరియల్ పసాజ్ చేసిన వైరస్ను ఫిక్స్డ్ వైరస్ అని అంటారు.
ఈ వ్యాధిబారిన పడే పశువులు: గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, గుర్రాలు, పందులు, కుక్కలు, పిల్లులు, నక్క, కోతులు, ఉడతలు ఇలా వేడి రక్తం గల ప్రతి పశువులోను మరియు మనుషులలో వచ్చే ఒక ‘జునోసిస్’ వ్యాధి.
వ్యాధి సోకే మార్గం: ఈ వ్యాధి ముఖ్యంగా వ్యాధిగ్రస్త జీవి కరవడం వలన (కుక్కలు, నక్కలు, పిల్లులు, ముంగిసలు, గబ్బిలాలు), వ్యాధిబారిన పడిన పశువుల లాలాజలం, కంటి స్రావాలు చర్మగాయాలపై పడినప్పుడు, కొన్ని సందర్భాలలో వ్యాధిబారిన పడిన పశువుల పాలు మరియు వ్యాధితో చనిపోయిన పశువుల మాంసం సరిగా ఉడకబెట్టనట్లయితే కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ.
ఇంకుబేషన్ పీరియడ్: సాధారణంగా రేబీస్లో ఇంక్యుబేషన్ పీరియడ్ 1 రోజు నుండి 60 రోజుల వరకు ఉంటుంది. ఇంక్యుబేషన్ పీరియడ్ వ్యాధిగ్రస్త జీవి కాటు వేసే లేదా గాయం చేసే ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది. మెడ లేదా తల దగ్గర కరిచినట్లయితే 1 లేదా 2 నెలల లోపు వ్యాధి లక్షణాలు బయట పడును. ఇతర శరీర భాగాలలో కరిచినట్లయితే 1-2 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం కూడా పడుతుంది. ఒక్కసారి రేబిస్ వ్యాధి లక్షణాలు బయట పడినట్లయితే 10 రోజుల లోపు ఆ పశువు చనిపోతుంది.
వ్యాధి లక్షణములు: ఈ వ్యాధిలో ప్రధానంగా రెండు రకములైన లక్షణములు కనిపించును. అవి 1) ప్యూరియస్ థ లక్షణములు, 2) డంభ్ థ లక్షణములు.
ప్యూరియస్ దశ లక్షణములు: వ్యాధిగ్రస్త పశువుల ప్రవర్తనలో మార్పు ఉంటుంది. యజమాని మాట పశువు వినదు. పశువు ఎదురుగా ఉన్న ప్రతి ఒక్కదానిని కరవాలి అనే లక్షణం ఉంటుంది. అందువలన కుక్కలు కనిపించిన ప్రతి పశువును, మనుషులను కరవడమే కాక ఎదురుగా ఉన్నచెక్కలు, ఇనుము, రాళ్ళు వంటివి కూడా కొరుకుతూ ఉంటుంది. ప్రతి చిన్న చర్యకు కూడా తీవ్రమైన ప్రతిచర్యను చూపిస్తాయి. కుక్కలు విపరీతంగా అరుస్తాయి. క్రమేపి ఆకలి నశించి కళ్ళు ఎర్రబడి ఉంటాయి. కుక్కలు నీటిని త్రాగలేక నీరును చూసి చాలా భయపడతాయి. ఈ ప్యూరియస్ థ సుమారు 1-7 రోజుల వరకు ఉంటుంది.
డంభ్దశ లక్షణములు: ఈ మూగథ లక్షణములో క్రింది దవడ నాలుక స్వరపేటిక, వెనుక కాళ్ళు, పక్షవాతానికి గురి అవుతాయి. ఈ దశలో కుక్కలు కరవలేవు. కాని వాటి లాలాజలంలో మాత్రం వైరస్ అధికంగా ఉంటుంది. అరుపులో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. క్రింది దవడ వ్రేలాడుతు ఉంటుంది. నోరు పూర్తిగా మూత పడదు. చివరకు కుక్కలు 1-10 రోజులలోపు చనిపోతాయి.
నిర్ధారణ: వ్యాధి చరిత్ర వ్యాధి లక్షణాలు, వ్యాధికారక చిహ్నములు ఆధారంగా ఈ వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. కుక్క కరిచిన తరువాత 10 రోజుల వరకు కుక్కను గమనిస్తూ ఉండాలి. 10 రోజుల లోపు ఆ కుక్క చనిపోతే దానికి రేబిస్ వ్యాధి ఉంది అని నిర్ధారణ చేయవచ్చు. ”నిగ్రిబాడిస్ టెస్ట్” ప్లోరోసెంట్ ఆంటీబాడీ టెస్ట్ల ద్వారా కూడా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.
చికిత్స: వ్యాధిగ్రస్త జీవి కరిచిన వెంటనే ఆ ప్రదేశాన్ని మొదట నీటితో బాగా శుభ్రపరచాలి. ఆ తరువాత వెంటనే ఆంటీసెప్టిక్ ద్రావణంతో గాయాలను శుభ్రం చేయాలి. గాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కట్టుకట్టుట కుట్లు వేయుట చేయరాదు. ఈ వ్యాధికి ఎటువంటి ప్రత్యేకమైన చికిత్స లేదు.
వ్యాధి లక్షణములకు చేయు చికిత్స: ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఆంటీఇన్ఫ్లమేటరీ నొప్పులను తగ్గించడానికి పెయిన్ కిల్లర్స్, జ్వరం తగ్గించడానికి ఆంటీపైరటిక్స్ ఔషధములను ఇవ్వవలెను.
నివారణ: వైరస్తో కలుషితమైన ఆహారాన్ని ఇవ్వకూడదు. వ్యాధితో బాధపడుతున్న కుక్కలను లేదా పశువులను వేరు చేయాలి. కుక్కలు లేదా పశువులు ఈ వ్యాధితో చనిపోయిన యెడల వాటిని శవపరీక్ష చేయుట, వాటి పాలు త్రాగుట నిషేధం. వీధికుక్కల నివారణ మరియు మనుషులతో ఈ వ్యాధి గురించి అవగాహన చాలా అవసరం.
కుక్క కరిచిన ఎడల రేబిస్ టీకాను ఈ క్రింది షెడ్యూల్ ప్రకారం ఇవ్వాలి. కుక్క కరిచిన రోజును లేదా మొదటి టీకా వేసిన రోజును ‘0’ రోజుగా లెక్కించి, తరువాత 3, 7, 14, 28, 90 రోజులలో మొత్తం 6 మోతాదులను ఇవ్వవలెను.
కుక్కలలో ఈ వ్యాధి రాకుండా ఉండుటకు: మూడవ నెలలో మొదటి మోతాదును మరియు నాలుగవ నెలలో బూస్టర్ మోతాదును తిరిగి ప్రతి సంవత్సరం ఈ టీకాను వాటి జీవిత కాలం ఇచ్చినట్లయితే ఈ వ్యాధిని కుక్కలలో రాకుండా నివారించవచ్చు.
డా. ఎం. వెంకట ప్రసన్న, వెటర్నరీ డాక్టర్, మైదుకూరు – 516172
జనాభాలో మన దేశం చైనాను దాటి ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశం అయ్యింది. మన దేశ జనాభా ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. జనాభాతో పాటు నిరుద్యోగుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు దొరుకుతున్నవా? అంటే సమాధానం కాదు అని వస్తుంది. ప్రస్తుతం మన దేశంలో పరిశ్రమలు మరియు ఇతర సేవా రంగాల ద్వారా లభించే ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులందరికి ఉద్యోగాలు కల్పించలేకపోతున్నాయి. పెరుగుతున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే సత్తా మన దేశంలో వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకే ఉంది. కాని వివిధ రకాల కారణాల వలన ఈ రంగాలలోకి అడుగు పెట్టడానికి విముఖత చూపడము వల్ల వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాల నుంచి వేరే రంగాలకు వలసలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ రంగాలలో శారీరక శ్రమ ఎక్కువగా ఉండడము, కొన్ని విలాసవంతమైన సౌకర్యాలకు దూరంగా ఉండవలసి రావడం, ఈరంగాలలో ఉండే అబ్బాయిలకు పెళ్ళిళ్లు జరగడము ఇబ్బందిగా ఉండడము లాంటి వివిధ రకాల కారణాల వలన వ్యవసాయం మరియుఅనుబంధ రంగాల నుంచి ఉద్యోగ, వ్యాపార రంగాల వైపు అడుగులు వేగంగా పడ్డాయని చెప్పవచ్చు. కానీ ఇటీవల కాలంలో ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెరగడము, ఆరోగ్యాన్ని కాపాడుటలో శారీరకశ్రమ ప్రధాన పాత్ర పోషించటం, వ్యవసాయరంగంలో శారీరక శ్రమ తప్పకుండా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం కాపాడుకోవాలంటే తప్పనిసరి శారీరక శ్రమ ఉండే వ్యవసాయ రంగమే సరైన దారి అని గ్రహించటం, గ్రామాలలో కూడా నగరాలలో, పట్టణాలలో అనుభవించే సౌకర్యాలు, ప్రత్యేకించి ఇంటర్నెట్, యూట్యూబ్, వాట్సప్ లాంటి సౌకర్యాలు అందుబాటులోకి రావడము లాంటి మారిన పరిస్థితులలో ఉద్యోగ, వ్యాపార రంగాల నుంచి తిరిగి వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకు మెల్లమెల్లగా వలసలు మొదలయ్యాయి అని చెప్పవచ్చు. కానీ ఉద్యోగ, వ్యాపార రంగాల నుంచి వ్యవసాయరంగంలో అడుగు పెట్టిన వారిలో చాలామంది వివిధ రకాల కారణాల వలన పంటల సాగులో అనుకున్న లాభాలు ఆర్జించలేకపోతున్నారు. పంటల సాగు లాభసాటిగా లేకపోవడముతో కొత్తగా ఈ రంగంలో అడుగు పెట్టినవారు నిరుత్సాహపడి వ్యవసాయరంగాన్ని వదలివేయాలని ఆలోచిస్తున్నారు. ఇలాంటి వారికి పొట్టేళ్ల పెంపకం సరైనదారి అని నిరూపిస్తున్నాడు నకిరేకల్ మండలం కడపత్రి గ్రామానికి చెందిన సైదిరెడ్డి.
వ్యవసాయ నేపధ్యానికి చెందిన సైదిరెడ్డి 10వ తరగతి వరకు చదువుకుని అందరి లాగానే వ్యవసాయ రంగాన్ని వీడి బొంబాయిలో టాక్సీడ్రైవరుగా పని చేయడం మొదలు పెట్టాడు. ఎంతయినాకాని వ్యవసాయ రంగం నుండి వచ్చిన వారు తమ మూలాలను మరువలేరు కాబట్టి సైదిరెడ్డి కూడా తన మూలాలను మరచిపోలేక 10 సంవత్సరాలు టాక్సీడ్రైవరుగా బాధ్యతలు నిర్వర్తించిన తరువాత వ్యవసాయాన్ని మరిచిపోలేకపోవడం, పిల్లల చదువులు, సొంత గ్రామంలో ఉండాలనే ఆలోచన లాంటి వివిధ రకాల కారణాల వలన చేస్తున్న ఉద్యోగాన్ని వదలి తమ స్వగ్రామం తిరిగి వచ్చి పంటల సాగు మొదలు పెట్టి పత్తి, వరి, నిమ్మ లాంటి పంటలు పండిస్తూ వస్తున్న సమయంలో పంటల సాగులో నష్టాలను చవిచూడవలసి రావటం మొదలయ్యి వేరే రంగాల గురించి ఆలోచించగా గొర్రె పొట్టేల పెంపకం సరైనదారి అని తెలుసుకుని 2020 వ సంవత్సరం గొర్రె పొట్టేళ్ళ పెంపకం మొదలు పెట్టాడు.
పొట్టేళ్ళ పెంపకం లాభసాటిగా ఉండాలంటే సొంతంగా పశుగ్రాసాలను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించి 15 గుంటలలో సూపర్ నేపియర్, 15 గుంటలలో హెడ్జ్లూసర్న్ సాగు మొదలు పెట్టాడు. మొదటి బ్యాచ్ కింద 20 పిల్లలను కొనుగోలు చేసుకుని రెండు నెలలు మేపిన తరువాత 40 వేల లాభంతో వాటిని అమ్మకం చేశాడు. మొదటి బ్యాచ్లో లాభాలు రావడముతో రెండవ బ్యాచ్లో 40 పిల్లలను కొనుగోలు చేయగా అది వర్షాకాలం కాబట్టి వివిధ రకాల జబ్బులతో 10 పిల్లలు చనిపోగా రెండవ బ్యాచ్లో నష్టాలు చవిచూశాడు. కానీ వెనుకంజ వేయకుండా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే పొందాలనే నానుడి గుర్తు చేసుకుని తాను చేసిన పొరబాట్ల నుంచి గుణపాఠం నేర్చుకుని గొర్రె పిల్లలకు అవసరమయిన దాణా, మందులు, రోగాలబారి నుండి కాపాడటానికి అవసరమయిన టీకాల గురించి కక్షుణ్ణంగా తెలుసుకుని, తెలుసుకున్న వాటిని తు.చ. తప్పకుండా పాటిస్తూ ప్రతి రెండు, మూడు నెలలకొక బ్యాచిని అమ్ముతూ, కొనుగోలు చేస్తూ తాను ఉద్యోగంలో సంపాదించిన సొమ్మును సొంత గ్రామంలో కుటుంబంతో ఆనందంగా గడుపుతూ సంపాదిస్తున్నాడు.
పొట్టేలు పిల్లల పెంపకంతో పాటు వరి, పత్తి, నిమ్మ లాంటి పంటలు పండిస్తూ వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలను నమ్ముకుని అన్ని మెళకువలతో కొనసాగిస్తూ, శారీరక శ్రమ చేయగలిగితే ఈ రంగాలు ఎంతమందికయినా ఉపాధి అవకాశాలు కల్పించగలవు అని సైదిరెడ్డి నిరూపిస్తున్నాడు.
పశుగ్రాసాలు
పొట్టేళ్ళ పెంపకంలో ఖర్చులు తగ్గించుకోవాలంటే నాణ్యమైన పశుగ్రాసాలను సొంతంగా పెంచుకోవాలని గ్రహించి 15 గుంటల ధాన్యపు జాతి బహువార్షిక పశుగ్రాసం సూపర్నేపియర్, 15 గుంటల్లో పప్పుజాతి బహువార్షిక పశుగ్రాసం థరథ గడ్డి (హెడ్జ్లూసర్న్)ని పెంచుతూ పొట్టేలు పిల్లలకు అందిస్తున్నాడు. వర్షాకాలంలో పచ్చిగ్రాసాలు అందించలేని పరిస్థితులలో మేతగా అందించటానికి వీలుగా వేరుశనగ కట్టెను నిల్వ చేసుకుని తప్పనిసరి పరిస్థితిలో అందిస్తున్నాడు.
ఆరోగ్య పరిరక్షణ
పొట్టేలు పిల్లల పెంపకంలో ఆరోగ్యపరిరక్షణ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మొదటలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సైదిరెడ్డి అనుభవం పెరిగిన కొద్దీ తెలిసిన వారి ద్వారా, పశువైద్య నిపుణుల ద్వారా రోగాలు, మందుల గురించి కక్షుణ్ణంగా తెలుసుకుని పిల్లలు చనిపోకుండా కొనుగోలు చేసిన పిల్లలన్నింటిని అమ్ముకోగులుగుతున్నాడు. ఎండాకాలంలో పెంచే పిల్లల కంటే వర్షాకాలంలో పెంచే పిల్లలకు రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వ్యాక్సిన్లు తప్పనిసరిగా అందిస్తున్నాడు. ఎండాకాలం అంటే అక్టోబరు నుంచి జూన్ వరకు పెంచే పిల్లలకు పిపిఆర్, హెచ్ఎస్, షీప్ ఫాక్స్ వ్యాక్సిన్లను, వర్షాకాలం అంటే జూన్ నుంచి అక్టోబరు వరకు పెంచే పిల్లలకు హెచ్ఎస్, బ్లూటంగ్, ఎఫ్ఎండి, పిపిఆర్ వ్యాక్సిన్లను అందిస్తున్నాడు. వీటన్నిటితోపాటు తొలకరి వర్షాలకు కొత్త మొలకలు తిన్న గొర్రెపిల్లలకు చిటుక రోగం రాకుండా మే నెలలో జూఊ వ్యాక్సిన్ను అవసరాన్నిబట్టి వేయిస్తుంటాడు. పిల్లలకు తప్పనిసరిగా ప్రతిరోజు క్యాల్షియంను దాణాతో అందించడంతో పాటు నెలకు 5 రోజులు లివర్ టానిక్ను అందిస్తున్నాడు. ఇలాంటి మెలకువలు తెలుసుకుని పాటిస్తున్నాడు కాబట్టి అప్పటి నుంచి కొనుగోలు చేసిన పిల్లలో మరణాలు లేకుండా కాపాడగలుగుతున్నాడు. మొదటలో 10 పిల్లలు చనిపోయిన తరువాత అవగాహన పెంచుకుని అప్పటి నుండి ఒక పిల్ల కూడా చనిపోకుండా కాపాడుకోగలుగుతున్నాడు. సాధారణంగా వచ్చే జ్వరం, దగ్గు, పురుగు ముట్టడము లాంటి సమస్యలకు కూడా మందులు అందిస్తూ పిల్లలను కాపాడుకోగలుగుతున్నాడు. పొట్టేళ్ళ పెంపకం మొదలు పెట్టిన కేవలం 3 సంవత్సరాల్లోనే తోటి పెంపకం దార్లు తనను సలహాలు అడిగే స్థాయికి సైదిరెడ్డి ఎదిగాడు కాబట్టి గొర్రె పొట్టేళ్ల ఆరోగ్య విషయంలో తోటి పెంపకందార్లు తన సలహాలు పాటిస్తున్నారని సైదిరెడ్డి వివరించారు.
చాఫ్కట్టర్
పశుగ్రాసాల వృథాను అరికట్టడంతో పాటు పశుగ్రాసాలు సక్రమంగా ఉపయోగపడాలంటే పశుగ్రాసాలను చాఫ్కట్టర్ ద్వారా ముక్కలు చేసి అందించటమే సరైన దారి అని గ్రహించి అప్పట్లో 18000/- పెట్టి 3 హెచ్.పి., 3 ఫేజ్ పవర్తో నడిచే చాఫ్కట్టరును కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నాడు. సూపర్ నేపియర్ని చాఫ్కట్టర్తో ముక్కలు చేసి గొర్రె పిల్లలకు మేతగా అందిస్తున్నాడు.
దాణా: పచ్చిమేతను అందించడంతో పాటు గొర్రెపిల్లలు త్వరగా పెరగాలంటే దాణా కూడా తప్పనిసరిగా ఇవ్వాలి కాబట్టి మొక్కజొన్న, తవుడు, బియ్యం నూకలను సమపాళ్ళు అంటే గొర్రె పిల్లల వయస్సు 25 కిలోలు దాటిన తరువాత 3 కిలోల మొక్కజొన్న రవ్వ, 3 కిలోల తవుడు, 3 కిలోల నూకలకు 100 గ్రాముల మినరల్ మిక్చర్ కలిపి ప్రతి రోజు 30 పొట్టేలు పిల్లలకు దాణాగా అందిస్తున్నాడు.
మరిన్ని వివరాలు సైదిరెడ్డి 9515470375 కు ఫోను చేసి తెలుసుకోగలరు.
పుదీనాలో జపనీస్ పుదీనా, స్పియర్ పుదీనా, పిప్పర్మెంట్ పుదీనా, బర్గామెట్ అనే వాటిలో భారతదేశంలో జపనీస్ పుదీనాకు గిరాకీ ఉంది. దీని తైలాన్ని సుగంధ పరిమళాలు, పాన్మసాలాల్లో, దగ్గు, జలుబు, నొప్పులను తగ్గించే ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. అంతేగాక టూత్పేస్టులు, మౌత్వాష్లు, చూయింగ్గమ్ మొదలగు వాటిలో పుదీనాను వాడుతున్నారు.
రకాలు: శివాలిక్, కోసి, హిమాలయ, సక్షమ్, కుషాల్ అను రకాలు జపాన్ పుదీనాలో ముఖ్యమైనవి. శివాలిక్, కోసి, హిమాలయ రకాలు ఆకుపచ్చ, తుప్పు, తెగుళ్ళను తట్టుకోలేవు. అందువల్ల ఇప్పుడు అవి ఎక్కువగా సాగు చేయడం లేదు.
సక్షమ్: పిలకలు నాటడం ద్వారా ఈ రకం నుంచి హెక్టారుకు 80 శాతానికి పైగా మెంథాల్ కలిగిన 225-250 కిలోల తైలాన్ని పొందవచ్చు.
కుషాల్: ఈ రకం రబీ చివరలో కూడా నాటడానికి అనుకూలం. అంటే వరికోత ఆలస్యమైనప్పుడు కూడా వరి తర్వాత ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు.
నేలలు: అధిక సేంద్రియ పదార్థం కలిగిన ఎర్రనేలలు, నీరు నిల్వని, నల్లనేలలు, ఉదజని సూచిక 6.5-8.5 ఉన్న నేలలు అనుకూలం. ఆమ్ల, క్షార భూములు సాగుకు అనుకూలం కాదు.
వాతావరణం: సమశీతోష్ణస్థితి నుంచి ఉష్ణ వాతావరణ పరిస్థితులు పుదీనా పెరుగుదలకు అనుకూలం. 100-110 సెం.మీ. వర్షపాతం, 20-40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు సాగుకు అత్యంత అనుకూలం.
ప్రవర్ధనం: దీనిని వేర్లు, కాండపు ముక్కలు, పిలకల ద్వారా వ్యాప్తి చేస్తారు.
నాటే పద్ధతులు: పుదీనాను రెండు రకాలుగా నాటుకోవచ్చు.
1) జనవరి నుంచి ఫిబ్రవరి 15 వరకు నాటుకోవాలంటే పిలకలను పొలంలో నాటుకోవచ్చు. వరుసకు మధ్య 60 సెం.మీ. మొక్కల మధ్య 10 సెం.మీ. ఉండేలా నాటుకోవాలి. పిలకలను 5-6 సెం.మీ. లోతులో నాటుకోవాలి. తర్వాత వాటిని పూడ్చాలి. వెంటనే తడి ఇవ్వాలి. జనవరిలో నాటుకొంటే 3-4 వారాల్లో, ఫిబ్రవరిలో అయితే 2-3 వారాల్లో మొలకలు వస్తాయి.
2) ఫిబ్రవరి 15 తర్వాత నాటుకోవాలంటే పిలకలను ముందుగా 100 చ.మీ. నారుమడిలో పెంచుకొని ఆరు ఆకులు వచ్చిన తర్వాత 30þ10 సెం.మీ. దూరంతో ప్రధాన పొలంలో నాటుకోవచ్చు.
ఎరువులు: సమగ్ర పోషక యాజమాన్యం అనగా ఎరువులను సమ్మిళతంగా ఉపయోగించడం వల్ల ఆకులు, మెంథాల్ పదార్థాల దిగుబడి ఎక్కువ వస్తుంది. ఆఖరి దుక్కిలో 20-30 టన్నుల పశువుల ఎరువు వేసుకొని కలియదున్నాలి.
నీటి యాజమాన్యం: జనవరి, మార్చి నెలల మధ్య రెండు వారాలకోసారి తడి ఇవ్వాలి. ఏప్రిల్, జూన్ మాసాల్లో అయితే ప్రతి 7-10 రోజుల వ్యవధిలో 8-10 నీటి తడులు తప్పనిసరిగా ఇవ్వాలి. సాళ్ళలో 5 టన్నుల పచ్చి, ఎండు ఆకులతో కప్పి ఉంచడం ద్వారా 25 శాతం నీటిని ఆదా చేయడమే గాక కలుపు పెరగకుండా చేసి వేసవిలో నేల ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటు ఆకుల సత్తువ, సేంద్రియ పదార్థం నేలకు అందుతుంది.
కలుపు తీయడం: సరైన సమయంలో కలుపు నివారణ చేపట్టకపోతే 70-75 శాతం దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి పిలకలు నాటే పద్ధతిలో అయితే నాటిన 45, 65, 80 రోజుల తర్వాత మనుషులతో కలుపు తీయించాలి. మళ్ళీ పంట మొదటి కోత తర్వాత 30-45 రోజులకు రెండోసారి కలుపు తీయాలి.
అంతర పంటలు: ప్రతి రెండు వరుసల పుదీనాకు ఒక వరుస మినుము, కంది లేదా అలసందలు వేసుకోవడం ద్వారా అధిక ఆదాయం పొందడమేగాక ఈ పంటల వేర్లు నేలకు నత్రజనిని అందిస్తాయి. అదేవిధంగా మలబారు వేప, శ్రీగంధం వంటి తోటల్లో పుదీనాను అంతరపంటగా సాగు చేయటం ద్వారా రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు అదనపు ఆదాయం పొందవచ్చు.
కోత: పిలకలను నాటుకుంటే (జనవరి-ఫిబ్రవరి 15 వరకు) 100 రోజుల్లో (మేలో) పంట మొదటి కోతకు సిద్ధంగా ఉంటుంది. తదుపరి ప్రతి 60-70 రోజులకు కోతలు కోసుకోవచ్చు. రెండు లేదా మూడు కోతల తర్వాత తీసివేసి మళ్ళీ నాటుకోవాలి. అదే నారు ద్వారా నాటుకునే పంట మార్చి-ఏప్రిల్లో నాటుకుంటే జూన్-జూలైలో ఒకే ఒక కోత కోసుకోవచ్చు. అడుగున ఉన్న ఆకుల రంగును బట్టి కోత మొదలు పెట్టవచ్చు. అడుగు ఆకులు పసుపురంగుకు మారుతుంటే వెంటనే కోయాలి.
దిగుబడి: హెక్టారుకు 20-40 టన్నుల ఆకుల దిగుబడి, వాటి నుంచి 125-200 కిలోల తైలం దిగుబడి వస్తుంది.
సస్యరక్షణ – పురుగులు: ఆకుచుట్టు పురుగులు, పెంకు పురుగులు, బొంత పురుగులు ఆశించి ఆకులను నాశనం చేస్తాయి. వీటి నివారణకు తగిన చర్యలు చేపట్టాలి.
తెగుళ్ళు: పిలక, వేరుకుళ్ళు, ఆకుమచ్చ, వడలు తెగులు కనిపిస్తే తగిన చర్యలు చేపట్టాలి.
తైలం తీసే పద్ధతి: పంటకోసిన తర్వాత 4-5 గంటలు నీడలో ఆరబెట్టి నూనె బట్టీలో వేసి స్వేదన ప్రక్రియ ద్వారా నూనె తీయాలి. దీనికోసం బట్టీ తొట్టి (బాయిలర్), ద్రవీకారి (కండెన్సర్) సంగ్రహపాత్ర (సెపరేటర్) కలిగిన యంత్రం అవసరం. కోసిన ఆకులను బట్టీ తొట్టిలో నిండా నింపి, మూత మూసి నీటి ఆవిరి పంపాలి. ఇలా చేయడం వల్ల ఆకుల్లోని నూనెగ్రంధులు పగిలి నూనె ఆవిరి, నీటి ఆవిరి కలిసి ద్రవీకారిలోకి ప్రవేశించి చుట్టూ ఉన్న నీటివల్ల ద్రవీభవించి చుక్కల రూపంలో సంగ్రహ పాత్రలోకి ప్రవేశించింది. తైలాన్ని వేరుచేసి, శుభ్రపరిచి అల్యూమినియం లేదా గాజు పాత్రలో భద్రపరుచుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తవడానికి 4 గంటల వ్యవధి పడుతుంది.
ఆర్. అర్చన, (7075394529), కె. అనూష, కె. సాధన, డా. ఆర్. సుశీల, డా. బి. పుష్పవతి, వ్యవసాయ కళాశాల, పాలెం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం.
1. భూమిలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంచుతుంది నేల స్వరూపం కొంత వరకు మారుతుంది.
2. నేలలో చౌడు శాతాన్ని తగ్గింస్తుంది నేలకు తేమ నిలుపుకునే సామర్ధ్యాన్ని పెంచుతుంది.
3. భూమిలో వానపాముల వ్యాప్తికి తోడ్పడుతుంది అలాగే హానికర సూక్ష్మజీవులను అరికడుతుంది
4. మొక్కలలో వచ్చే కుళ్ళు తెగుళ్లను అరికడుతుంది.
5. ప్రధానంగా వేరుపురుగు వేరు కాయలను కలుగచేసే నెమటోడ్స్ అంటే నులి పురుగులను అదుపులో ఉంచుతుంది.
6. ఇది మొక్కలకు నిదానంగా అందటం వలన పోషకాలు సమానంగా స్థిరంగా మొక్కలకు అందుతాయి
7. పోషకాలు నిదానంగా అందటం వలన మొక్కలో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది
8. వేపపిండి స్థూలపోషకాలతోపాటు సూక్ష్మపోషకాలు కలిగి ఉంటుంది.
9. అన్ని రకాల ఎరువులతో కలిపి చల్లుకోవచ్చు
10. ఒకసారి భూమిలో వేశాక పంట చివరి వరకు మొక్కలకు అందుతుంది
11. ఇందులో ఎలాంటి హానికరమైన క్లోరైడ్స్ ఉండవు
12. పోషకాలు స్థిరంగా అందటం వలన పంట దిగుబడి పెరుగుతుంది
కల్తీ వేపపిండి, వేపనూనెలబారిన పడకండి…
వేపపిండి వాడాలి అనుకున్న రైతులు, ఇది వేపపండ్లు రాలే సమయం కాబట్టి, వారుకాని, ఎవరినైనా నియమించికాని, వేపకాయలు సేకరించి, మధ్యవర్తులకు, మిల్లువాళ్లకు అమ్మేవారిదగ్గర సేకరించి, ఎండబెట్టి, రోడ్డుమీద పోసి ట్రాక్టర్తో త్రొక్కించి వాడుకుంటే, అంతకన్నా మించిన, ఉత్తమం, వేరొకటిలేదు.
మనకు, మార్కెట్లో దొరికే వేపపిండి, ఆకర్షణీయమైన బస్తాలలో నింపి, వివిధరకాల ఆకర్షణీయ పథకాలతో అమ్ముతున్న వేపపిండి, ఎంత కల్తీదో ఆదేముడికి కూడా తెలియదు.
నాణ్యతా ప్రమాణాలు కూడా నియమించలేదు, నియంత్రించటమూ లేదు. కల్తీలేని, వేపపిండి దొరికితే మీ అదృష్టం.
వేప నూనె వాడేవారుకూడా, ఈ ఎండబెట్టిన గింజలను నానబెట్టి, వెట్ గ్రైండర్లో మెత్తగా రుబ్బి, నీరుకలిపి, పిండి క్రింద తేరుకున్న తరువాత, వడకట్టిన ద్రావణాన్ని పైరుపై స్ప్రే చేసుకుంటే, మిల్లునుంచి తెచ్చిన వేపనూనె లేక మార్కెట్లో దొరికే నమ్మకమైన కంపెనీలు అమ్మే రకరకాల వేపనూనె ప్రొడక్ట్స్ కన్నా ఎంతో ఉపయోగమని పరిశోధనా ఫలితాలుకూడా చెబుతున్నాయి.
మొత్తం భూగోళ విస్తీర్ణం 51 కోట్ల చదరపు కిలో మీటర్లుగా అంచనా వేయబడింది. అందులో 36.1 కోట్ల చదరపు కిలోమీటర్లు (71 శాతం) సముద్రాలు విస్తరించి ఉన్నాయి. మిగిలిన 14.9 కోట్ల చదరపు కిలో మీటర్లు (29 శాతం) భూభాగంగా ఉంది. అందులో 1.5 కోట్ల చదరపు కిలో మీటర్లలో హిమనదులు ఉన్నాయి. మరో 2.8 కోట్ల చదరపు కిలోమీటర్లలో ఎడారులు, ఉప్పు భూములు, కొండలు, రాళ్ళు, సముద్ర తీరాలు, ఇసుక తిన్నెలు వ్యాపించి ఉన్నాయి. ఇక మిగిలిన 10.6 కోట్ల చదరపు కిలోమీటర్లే నివాస యోగ్య ప్రాంతాలుగా ఉన్నాయి. అందులో 4 కోట్ల చదరపు కిలో మీటర్లలో అడవులు, 1.7 కోట్ల చదరపు కిలో మీటర్లలో చిట్టడువులు వృక్షజాలంతో నిండి ఉన్నాయి. అవి పోనూ 15 లక్షల చదరపు కిలోమీటర్లలో నగరాలు, గ్రామాలు నిర్మాణాలతో నిండి ఉన్నాయి. మరో 15 లక్షల చరదపు కిలో మీటర్లలో నదులు, చెరువులు, జలాశయాలు ఉన్నాయి. ఇక సాగుకి యోగ్యమైన భూమి 4.8 కోట్ల చదరపు కిలోమీటర్లే. అందులో కూడా 3.7 కోట్ల చదరపు కిలోమీటర్లలో పశువులు మేయడానికి పనికివచ్చే గడ్డి నేలలు, పశువుల మేత కోసం గడ్డి, ఇతర మొక్కలను పెంచే భూములుగా ఉన్నాయి. వ్యవసాయ పంటలను కేవలం 1.1 కోట్ల చదరపు కిలో మీటర్లలోనే పండిస్తున్నారు. 77 శాతం పశుగ్రాసపు భూముల నుండి మానవులకు 18 శాతం కేలరీలు, 37 శాతం మాంసకృత్తులు లభ్యమౌతున్నాయి. 23 శాతం వ్యవసాయ భూముల నుండి 82 శాతం కేలరీలు, 63 శాతం మాంసకృత్తులు, వృక్ష సంబంధిత వంట నూనెలు లభిస్తున్నాయి. మొత్తం భూగోళ విస్తీర్ణంలో రెండు శాతం పటల సాగుకి, ఆరేడు శాతం పశుగ్రాసానికీ ఉపయోగపడుతున్నది.
తగ్గుతున్న సాగు భూమి లభ్యత
పంటల సాగుకి గానీ, పశుగ్రాసపు ఉత్పత్తికి గానీ మొత్తం 190 కోట్ల 69 లక్షల 21 వేల 938 హెక్టార్ల భూమి ఉన్నట్లు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ, ఇతర పరిశోధనా సంస్థలు అంచనా కట్టాయి. 2022 నవంబరులో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరింది. అంటే సగటున ఒక మనిషికి దాదాపు ఒక పావు హెక్టారు భూమి ఉన్నట్లు లెక్క కట్టవచ్చు. కేవలం 73 సంవత్సరాల క్రితం ప్రపంచ జనాభా 1950లో 220 కోట్లు మాత్రమే. అప్పుడు ఒక్కో మనిషికి దాదాపు ఒక హెక్టారు భూమి ఉంటే ఇప్పుడది నాల్గవ వంతుకి తగ్గిపోయింది. అయినా 1950లో సగటున మనిషికి 2200 కిలోకేలరీల శక్తి లభించగా, 2022లో సగటు లభ్యత 2890 కిలోకేలరీకు పెరిగింది. జనాభా కన్నా వేగంగా ఆహారోత్పత్తి పెరిగింది. అంతకన్నా వేగంగా నీటినీ, ఇంధనాన్ని, ఇతర సహజ వనరులను మానవులు వాడారు. జనాభా ఈ శతాబ్దాంతానికి 1000 కోట్ల వద్ద స్థిరీకరించబడుతుందని ఆశిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞాన వృద్ధితో సగటు మనిషికి కేలరీల శక్తి, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాల లభ్యత మరింత పెరగవచ్చు. 2030 నాటి కల్లా ప్రపంచంలో పేదరికం, ఆకలిని నిర్మూలించాలని ఐక్యరాజ్య సమితిని నిర్ణయించింది. అప్పటికి కాకున్నా 2050 నాటికైనా ఆ లక్ష్యాలు నెరవేరవచ్చు. ఆహారపదార్థాల వాస్తవ ధరలు గత 60 సంవత్సరాల్లో నాల్గవ వంతుకి పడిపోయాయి. భవిష్యత్తులో ఇవి మరింత తగ్గవచ్చు. మరోవైపు సగటు ఆదాయాలు పెరుగుతున్నందువల్ల ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నా కటిక పేదరికం, అర్ధాకలి మాసిపోవచ్చు.
తగ్గుతున్న చిన్న కమతాలు
ప్రపంచమంతా ‘కుటుంబ భూకమతాలు’ అనే అంశం ప్రాచుర్యంలో ఉంది. ఏ కుటువంబంలోనైనా శామ్రికులు 50 శాతం కన్నా ఎక్కువ సమయాన్ని వ్యవసాయ వ్యాపకాలకు వినియోగిస్తుంటే వారి కమతాలను ‘కుటుంబ భూకమతాలు’గా పరిగణిస్తారు. ప్రపంచంలో 57 కోట్ల భూకమతాలున్నట్లు అంచనా. అందులో 50 కోట్లు ‘కుటుంబ భూకమతాలు’ గా ఉన్నాయి. అంటే దాదాపు 90 శాతం కుటుంబ యాజమాన్యంలో నిర్వహించబడుతున్నాయి. కాని వీటి క్రింద ఉన్న భూమి 54.7 శాతం మాత్రమే. వీటి సగటు విస్తీర్ణం 2.2 హెక్టార్లు మాత్రమే. అయితే కుటుంబ భూకమత సగటు విస్తీర్ణం వివిధ దేశాల్లో వేర్వేరుగా ఉన్నది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 180 హెక్టార్లు కుటుంబ భూకమతాల సగటు విస్తీర్ణంగా ఉన్నది. ఆస్ట్రేలియాలో సగటు విస్తీర్నం వేల హెక్టార్లలో ఉన్నది. గసటు కమత విస్తీర్ణం బంగ్లాదేశ్్లో 0.8 హెక్టార్లు, భారత్ 1.02 హెక్టార్లు, చైనాలో 2.4 హెక్టార్లు, జపాన్లో 3.9 హెక్టార్లుగా ఉన్నది. దక్షిణాసియాలో 1.4 హెక్టార్లు, తూర్పు ఆసియాలో 4.5 హెక్టార్లు, ఆఫ్రికాలో 9.2 హెక్టార్లు, యూరోప్లో 12.8 హెక్టార్లు, దక్షిణ అమెరికాలో 34 హెక్టార్లు, ఉత్తర అమెరికాలో 221.6 హెక్టార్లు, ఆస్ట్రేలియాలో 3340 హెక్టార్లు సగటు కమత విస్తీర్ణాలుగా ఉన్నాయి. ప్రపంచంలో కుటుంబ భూకమతాల విస్తీర్ణం సగటున 2.2 హెక్టార్లుగా కాగా, సగటు కమత విస్తీర్ణం 7.3 హెక్టార్లుగా ఉంది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియాలో ఎక్కువగానూ, యూరోప్, ఆఫ్రికాలలో కొంతమేరకు వాణిజ్య స్థాయిలో పనిచేస్తున్న భూమకమతాలు పెరుగుతున్నాయి. ఆసియాలోనూ, చాలా ఆఫ్రికా దేశాల్లోనూ, కొన్ని యూరోపియన్ దేశాల్లోనూ కుటుంబ భూకమతాలు సింహభాగంగా ఉన్నాయి. అమెరికాలో 1900 సంవత్సరంలో 60 శాతం ప్రజలు గ్రామా ప్రాంతాల్లో నివసించేవారు. సుమారుగా 40 శాతం ప్రజలు వ్యవసాయమే జీవనాధారంగా ఉండేవారు. ఇప్పుడు కేవలం 20 శాతం ప్రజలే గ్రామ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 1940లో 60 లక్షల మంది రైతులుండగా ఇప్పుడు వారి సంఖ్య 20 లక్షల దిగువకు వర్చింది. గత యాభై సంవత్సరాల్లో ఉన్న కమతాల సంఖ్య 30 శాతం తగ్గింది. అతి చిన్నకమతాలు మూడు రెట్లు పెరగ్గా, అతిపెద్దకమతాలు ఐదు రెట్లు పెరిగాయి. జపాన్లో గత నలభై సంవత్సరాల్లో రెండు హెక్టార్లులోపున్న కమతాలు 70 శాతం అంతరించాయి. ఆస్ట్రేలియాలో గత నలభై సంవత్సరాల్లో చిన్నకమతాలు 37 శాతం తగ్గాయి. న్యూజిలాండ్లో 40 హెక్టార్ల కన్నా చిన్న కమతాలు, 800 హెక్టార్ల కన్నా పెద్ద కమతాలు 35 శాతం పెరిగాయి. పశ్చిమ యూరోప్లో 70 శాతం, తూర్పు యూరోప్లో 40 శాతం భూమకమతాలు తగ్గాయి. ఆర్జెంటీనాలో 40 శాతం, చీలిలో 15 శాతం, కొలంబియాలో 50 శాతం, ఉరుగ్వేలో 20 శాతం భూకమతాలు అంతరించాయి. అక్షరాస్యత పెరిగి, ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరగవడంతో రైతులు వ్యవసాయాన్ని వదిలి అమెరికా ఖండాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, యూరోప్లలో ఇతర రంగాల (పారిశ్రామిక, సేవా రంగాలు)కు మళ్ళుతున్నారు. వ్యవసాయంలో మిగిలిన చిన్న కమతాల వాళ్ళు కూడా తమ కుటుంబాదాయంలో ఎక్కువ భాగాన్ని ఇతర రంగాల నుండి, స్వల్పంగా మాత్రమే వ్యవసాయం నుండి పొందుతున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేని దక్షిణాసియా, సహారా దిగువన ఉన్న ఆఫ్రికా దేశాల్లోనే చిన్న భూకమతాల సంఖ్య పెరుగుతున్నది. ఈ దేశాల్లోనే కమతాల సగటు విస్తీర్ణం తగ్గుతున్నది. ఆ కమతాలను నిర్వహిస్తున్న వారిలో చాలామంది సరిపడే ఆదాయాన్ని పొందలేక ఇతర రంగాలపై జీవనోపాధికి ఆధారపడాల్సి వస్తుంది.
పెరుగుతున్న వాణిజ్య వ్యవసాయ కమతాలు
వ్యవసాయ ఉత్పత్తుల వాస్తవ ధరలు తగ్గుతుండటం వల్ల ఒక హెక్టారు భూమి నుండి లభించే నికరాదాయం గణనీయంగా పడిపోతున్నది. ఉద్యాన వన, డెయిరీ, పౌల్ట్రీ, ఫిషరీస్ వ్యాపకాల్లో ఉన్న వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా క్రమేపీ వాటి లాభదాయకత కూడా తగ్గుతున్నది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా చాలామంది రైతులు వ్యవసాయాన్ని వీడి, ఇతర రంగాల్లో అవకాశాలకు ప్రయత్నిస్తున్నారు. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా ఖండదేశాల్లో వ్యవసాయాన్ని అంటిపెట్టుకున్న వాళ్ళు జనాభాలో ఒకటి నుండి ఐదు శాతంలోపే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా లెక్కించినా 1960లో 25 శాతం శ్రామికులు వ్యవసాయంపై ఆధారపడేవారు. ప్రపంచాదాయంలో 11 శాతం వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా లభించేది. ఇప్పుడు కేవలం 15 శాతం ప్రజలే వ్యవసాయాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. 2021లో ప్రపంచాదాయంలో 4.3 శాతం మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా లభించింది. భారత దేశంలో ఇప్పటికీ 45 శాతం శ్రామికులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. కాని జాతీయాదాయంలో 15 శాతానికి లోబడే వ్యవసాయాదాయం ఉంటున్నది. పారిశ్రామికీరణ వేగవంతం కావడంతో చైనాలో 30 శాతం శ్రామికులు వ్యవసాయం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఆదేశపు ఆదాయంలో 10 శాతమే వ్యవసాయం ద్వారా లభిస్తున్నది. లాభదాయకత క్షీణించడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా రైతులు, వ్యవసాయ కూలీలు ఇతర రంగాలకు మరలిపోతున్నారు. అభివృద్ధిలేని లైబీరియాలో 77 శాతం, సోమాలియాలో 60 శాతం, గినీజిస్సూలో 56 శాతం ఇప్పటికీ వ్యవసాయ రంగం ద్వారానే ఆదాయాలు లభిస్తున్నాయి. ఒక హెక్టారు భూమి నుండి లభిస్తున్న ఆదాయం మొజాంబిక్లో 78 డాలర్లు, జింబాబ్వేలో 83 డాలర్లు, బుర్కినాఫానోలో 86 డాలర్లు, మలావీలో 424 డాలర్లు, ఇథియోపియోలో 1184 డాలర్లుగా అంచనా వేయబడ్డాయి. మొత్తం సహారా దిగువున ఉన్న ఆఫ్రికాదేశాల్లో ఒక హెక్టారు నుండి లభిస్తున్న నికరాదాయం సగటున 535 డాలర్లు. ఈ దేశాల ప్రజలు దారిద్య్రరేఖను అధిగమించాలంటే కనీసం హెక్టారు నుండి 1250 డాలర్ల నికరాదాయం కావాలి. భారతదేశంలో కూడా ఒక హెక్టారు నికరాదాయం 600 డాలర్లను దాటటం లేదు. దారిద్య్రరేఖను దాటాలంటే హెక్టారుకి 1500 డాలర్ల ఆదాయమన్నాలభించాలి. అందుకే దక్షిణాసియాదేశాల్లోనూ, సహారాదిగువన ఉన్న ఆఫ్రికా దేశాల్లోనూ ఇంకా పేదరికం, అర్ధాకలి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. అమెరికాలో ఒక హెక్టారు నుండి సంవత్సరానికి 1200 డాలర్ల నికరాదాయం లభిస్తున్నది. 40 హెక్టార్ల భూమి ఉన్న రైతులు, సగానికి పైగా ఆదాయాన్ని ఇతర రంగాల నుండి పొందగలిగితేనే కుటుంబాలను పోషించుకోగలుగుతున్నారు. రోజు కూలీ 150 డాలర్లుగా ఉండటం వల్ల వేగంగా వ్యవసాయ యంత్రీకరణ జరుగుతున్నది. 11 శాతం కమతాల్లో స్థూల ఆదాయం సంవత్సరానికి 350,000 డాలర్లను మించి ఉండటం వల్ల వాటిని వాణిజ్యస్థాయి వ్యవసాయం నిర్వహిస్తున్న కమతాలుగా పరిగణిస్తున్నారు. ఇందులో 8 శాతం కమతాలు కుటుంబాల అధీనంలో ఉండగా, 3 శాతం కమతాలు కార్పొరేషన్ల చేతిలో ఉన్నాయి. ఇవి మూడు శాతం కమతాలైనా అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల విలువలో 43 శాతం ఆర్జిస్తున్నాయి. బిల్మలోన్ అనే బిలియనీర్ 9 లక్షల హెక్టార్ల భూమిని, అమెజాన్ అధినేత జెఫ్బెజోస్ 1.8 లక్షల హెక్టార్ల భూమిని, బిల్గేట్స్ 1.1 లక్షల హెక్టార్ల భూమిని కలిగి ఉన్నారు. ఆస్ట్రేలియాలో 10 శాతంగా ఉన్న పెద్ద రైతులు, కంపెనీలు దేశంలోని 50 శాతానికి పైగా భూమిని నిర్వహిస్తున్నారు. అత్యంత పెద్ద రైతుకి 92 లక్షల హెక్టార్ల పచ్చిక బీళ్ళున్నాయి. యూరోపియన్ యూనియన్లో 50 హెక్టార్ల కన్నా ఎక్కువున్న కమతాలు 7.5 శాతం మాత్రమే. కాని వాటి కింద మొత్తం భూమిలో 68.2 శాతం విస్తీర్ణం ఉంది. ఇలా భూమికి కొరత లేని దేశల్లో వాణిజ్యస్థాయిలో వ్యవసాయం భారీ యంత్రాలతో జరుగుతున్నది. అమెరికాలో మొత్తం ఉత్పత్తి ఖర్చులో 12 శాతం మాత్రమే కూలీలకు లభిస్తున్నది. భారత్ వంటి చిన్న కమతాలున్న దేశంలో కూలీల ఖర్చు మొత్తం ఖర్చులో 35 నుండి 40 శాతంగా ఉంటున్నది. ఒక హెక్టారు నుండి లభించే నికరాదాయం తగ్గుతున్నకొద్దీ వాణిజ్య స్థాయిలో వ్యవసాయం చేస్తున్న కమతాలు తమ విస్తీర్ణాన్ని పెంచుకుంటున్నాయి. భారతదేశంలో కూడా పారిశ్రామిక, వ్యాపార, సేవారంగాల్లో ఆర్జించిన డబ్బుతో పట్టణాలకు 50 కిలో మీటర్ల పరిధిలో భూముల్ని భారీగా కొంటున్నారు. ఇప్పుడు భారతదేశంలోని రైతులు తమ దేశంలోని ధనిక రైతులతో పాటు ప్రపంచ కుబేర్లతో కూడా వ్యవసాయోత్పత్తిలో పోటీపడాల్సి వస్తున్నది. వ్యవసాయాదాయం పెద్దగా లేకున్నా భూములధరలు పెరగటం వల్ల భారత్ వంటి వర్ధమాన దేశాల్లో కూడా వ్యవసాయం వాణిజ్యీకరణ దిశగా పయనిస్తున్నది.
డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త,
మనది వ్యవసాయక దేశం. అయినాకానీ వివిధ రకాల కారణాల వలన వ్యవసాయ రంగం నుంచి వేరే రంగాలకు వలసలు బాగా పెరిగినవి కాబట్టే ఒకప్పుడు వ్యవసాయరంగంలో 90% పైగా ఉన్న ప్రజలు ప్రస్తుతానికి సుమారు 70% మాత్రమే వ్యవసాయరంగంలో కొనసాగుతున్నారు. ఈ 70% మంది వ్యవసాయరంగంలో కొనసాగుతున్నా కూడా వారందరూ తృప్తిగా వ్యవసాయం చేస్తున్నారా? అంటే సమాధానం కాదు అని వస్తుంది. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో కొసాగుతున్న చాలామంది రైతులు చాలావరకు వేరే అవకాశాలు లేకనే తప్పనిసరి పరిస్థితులలో వ్యవసాయం చేస్తున్నారని చెప్పవచ్చు. పంటల సాగు లాభసాటిగా లేకపోవడం, వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తూ ప్రతికూల వాతావరణ పరిస్థితులలో ఆరుగాలం కష్టించి పండించిన పంటను నష్టపోవలసి రావడం, అన్నీ అనుకూలంగా ఉండి పంట దిగుబడులు బాగా వస్తే సరైన ధరలు లభించకపోవడం లాంటి వివిధ రకాల కారణాల వలన వ్యవసాయ రంగాన్ని వీడి వేరే రంగాలకు వలసలు జరిగినవి. కాని ఇటీవల ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెరగడం, ఆరోగ్యాలను కాపాడుటలో సేంద్రియ ఆహారం మరియు వ్యవసాయం ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయనే విషయాల మీద అవగాహన పెరగడముతో ఇటీవల కాలంలో ఇతర రంగాలలో ఉన్న వారి ఆలోచనలు వ్యవసాయ రంగంవైపు మళ్లి ఆ దిశగా ఆలోచించడం మొదలయ్యింది. ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఆర్ధికంగా ఎదిగిన వారు, కాలుష్యం లేని ప్రశాంత జీవనానికి, ఆరోగ్యకర ఆహారానికి వ్యవసాయరంగమే, అదీను సేంద్రియ సాగే సరైనదారి అని గ్రహించి ఆ దిశగా అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. కొత్తగా ఉద్యోగ వ్యాపార రంగాల నుంచి వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టే వారు ఆదాయం కోసం కాకుండా ఆరోగ్యం కోసం వ్యవసాయరంగంలోకి అడుగుపెడుతున్నారు కాబట్టి ఇలాంటి వారికి సంవత్సరం పొడవునా స్వచ్ఛమైన ఆహారం లభించటంతో పాటు, ఎక్కువ మంది పనివారి అవసరం లేని పద్ధతుల గురించి అన్వేషిస్తున్నారు. ఇలాంటి వారి కోసం ప్రత్యక్షంగా ఒక పొలాన్ని సిద్ధం చేసి చూపించినట్లయితే బాగా ఉపయోగకరంగా ఉంటుందని భావించి తాడేపల్లిలో సుమారు మూడు ఎకరాల స్థలంలో చాలా రకాల పంటలతో ఫుడ్ ఫారెస్ట్కి అక్బర్ రూపకల్పన చేస్తున్నాడు.
అక్బర్కి వ్యవసాయం అన్నా, మన పురాతన విత్తనాలన్నా మక్కువ ఎక్కువ. తన మక్కువ తీర్చుకోవడంతో పాటు చాలామందికి ఉపయోగపడాలనే లక్ష్యంతో మూడు సంవత్సరాల క్రితం తాడేపల్లిలోని సియం. క్యాంపు ఆఫీసుకు వెళ్ళే దారిలో సుమారు మూడు ఎకరాల పొలంలో వివిధ రకాల పంటలు పూర్తి సేంద్రియ పద్ధతిలో పండిస్తూ ఫుడ్ ఫారెస్ట్ని సృష్టిస్తున్నాడు. అక్బర్ ప్రధాన లక్ష్యం ఒక కుటుంబం తమకు అవసరమయిన ఆహారాన్ని తామే సొంతంగా పండించుకుంటూ, 365 రోజులు ఏదో ఒక ఆహారాన్ని తమ పొలం నుంచే పొందడంతో పాటు అవకాశం ఉంటే తాము వినియోగించగా మిగిలిన ఆహార పదార్థాలను ఇతరులకు అమ్మకం చేసి ఆదాయాన్ని పొందడము, ఈ లక్ష్యంతోనే అక్బర్ ముందుకు సాగుతున్నాడు.
ఈ వ్యవసాయ క్షేత్రంలో మూడు సంవత్సరాల క్రితం పంటల సాగు మొదలు పెట్టాడు. ఈ పద్ధతి పాటించే రైతులు తమ ఆహారం సొంతంగా పండించుకోవడంతో పాటు అవకాశం ఉన్నంతలో ఆదాయం కూడా పొందాలనే లక్ష్యం ఉంది కాబట్టి సుమారు 500 వరకు అరటి మొక్కలు నాటించాడు. అరటిలో చక్రకేళి, కర్పూర, కూర అరటి. ఈ మూడు రకాల నాటు పిలకలను తెలిసిన రైతు వద్ద నుంచి సేకరించి నాటించాడు. అరటితో పాటు బొప్పాయి, మునగ, మూడు రకాల జామ, బత్తాయి, నారింజ, రామాఫలం, సీతాఫలం, రెండు రకాల సపోటా, వివిధ రకాల మామిడి, యాపిల్బేర్ మొక్కలతో పాటు కొన్ని వేప చెట్లను కూడా పెంచుతున్నాడు. వేప ఆకులు మరియు వేప విత్తనాలతో సేంద్రియ సాగులో వినియోగించే వివిధ రకాల కషాయలు, ద్రావణాలు తయారు చేసుకోవడానికిగాను వేప చెట్లను పెంచుతున్నాడు. పండ్ల చెట్ల మధ్యలో ఖాళీ ఉన్న చోట బెడ్లు చేసి ఆ బెడ్లపై గోంగూర, మెంతికూర, తోటకూర లాంటి ఆకుకూరలతో పాటు బెండ, మిరప, వంగ లాంటి కూరగాయలు కూడా సాగు చేస్తున్నాడు.
పూర్తి సేంద్రియ పద్ధతులు పాటిస్తున్నాడు కాబట్టి ఎలాంటి రసాయనాలకు తావు లేకుండా మొక్కలకు పోషకాలను అందించడానికి వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేసుకున్న సొంత ఎరువు, జీవామృతం లాంటి వాటిని అందిస్తున్నాడు. చీడపీడల నివారణకు వేప కషాయం, సీతాఫలం ఆకుల కషాయం లాంటి వాటిని ఉపయోగించడంతో పాటు లింగాకర్షక బుట్టలు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కలుపు నివారణ కొరకు నాటు కోళ్ళను పెంచుతున్నాడు. మొదటలో 4 కోళ్ళను కొనుగోలు చేసి వాటిని అభివృద్ధి పరచగా ప్రస్తుతానికి సుమారు 30 నాటుకోళ్ళు అయినాయి. నాటుకోళ్ళు పండ్ల మొక్కల మధ్య తిరుగుతూ కలుపు విత్తనాలను, కలుపు ఇగుళ్లను తింటుంటాయి. కాబట్టి కలుపు సమస్య ఎదురు కావడంలేదు. అవసరమయితే బ్రష్కట్టరును అప్పుడప్పుడు ఉపయోగించి కలుపు నివారించుకుంటున్నాడు. నాటుకోళ్ళ వలన కలుపు నివారణతో పాటు నాటుకోళ్ళ ఎరువు మొక్కలకు మంచి పోషకాలను అందిస్తుంది. నాటుకోళ్ళు నివాసం కొరకు తక్కువ ఖర్చుతో అంటే కేవలం 2000/-ల ఖర్చుతో 30 కోళ్ళు ఉండటానికి వీలుగా చిన్న షెడ్ని ఏర్పాటు చేసుకున్నాడు.
కొత్తగా వ్యవసాయరంగంలోకి అడుగుపెట్టే వారికి ప్రయోజనకరంగా ఉండటంతో పాటు మన పురాతన విత్తనాలను సంరక్షించాలనే తలంపుతో అక్బర్ ఈ ఫుడ్ ఫారెస్ట్ని సృష్టిస్తున్నాడు.
మరిన్ని వివరాలు 99666 43666 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
వ్యవసాయ వ్యర్థాలతో ఎరువు
పొలంలో సేకరించిన వ్యవసాయ వ్యర్థాలలో కర్రలను పందిర్ల కోసం, స్టేకింగ్ కోసం ఉపయోగించుకుంటూ మిగతా వ్యర్థాలను ఒక కుప్పలాగా పోసుకుంటాడు. ఆకుప్పపై కర్ర సహాయంతో రంధ్రాలు ఏర్పాటు చేసి ఆ రంధ్రాలలో క్రమం తప్పకుండా జీవామృతం, బయోసాయిల్ నీటిని పోస్తుంటారు. ఈ రెండు కూడా వ్యవసాయోత్పత్తులను మంచి పోషకాలుగల సేంద్రియ ఎరువుగా మారుస్తాయి కాబట్టి ఆ ఎరువుని తాను సాగు చేసే పంటకు అందిస్తుంటాడు.
నైరుతి 2023 ఆలస్యంగా ప్రారంభమై రైతులలో ఆందోళనకు, అలజడికి కారణం అయింది. రైతులపై ప్రభావం చూపుతోంది. రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించటానికి సకాలంలో రుతుపవనాల ప్రారంభ అంచనాలు అవసరం. చాలా కీలకం కూడా. ఎందుకంటే నైరుతి రుతుపవనాల రాక అనేది వ్యవసాయం మీద ఆధారపడి జీవనోపాధి పొందే కోట్లాది ప్రజానీకం ఎంతో ఎదురుచూసే విషయం. ఇది వారి జీవితాలతోపాటు దేశ ఆర్థిక ప్రగతిని ప్రభావితం చేస్తుంది కనుక. రుతుపవన కాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు కొనసాగటమే కాకుండా ఇది దేశ వ్యవసాయ రంగానికి కీలకం. దేశ వార్షిక వర్షపాతంలో నైరుతి వాటా 70% పైగా ఉంటుంది. వర్షాకాలం సకాలంలో వచ్చి కొనసాగితే రైతు జీవితం సాఫీగా సాగిపోతుంది. లేదంటే సాగు సజావుగా సాగటం కోసం వర్షాల కోసం ఎదురు చూపులు అయితే మాత్రం రైతులకు ఆశ బదులు నైరాశ్యం ఆవహిస్తుంది. భయాందోళనలు పెరుగుతాయి. తెలియని అయోమయం ఏర్పడుతుంది. వర్షాభావంతో పాటు, ఒక్కోసారి ఒక్కో వర్షానికి మధ్య పెరిగే కాలం, అతివృష్టి తదితర కారణాల వల్ల పంటకి నష్టము జరిగి, రైతు ఆర్థికంగా నష్టపోవలసి వస్తుంది.
దేశంలో, ప్రపంచంలో ఎందరో శాస్త్రవేత్తలు, సంస్థలు వాతావరణ మార్పులు చేర్పుల గురించి సకాలంలో అందించేందుకు పరిశోధనల ద్వారా కృషి చేస్తూ రైతులకు సాయం చేస్తున్నారు.
రుతుపవనాల ప్రారంభానికి సంబంధించిన ఖచ్చితమైన దీర్ఘకాలిక సూచనలను అందించడం ద్వారా రైతులకు చేదోడు వాదోడుగా భారత వాతావరణ శాఖతోపాటు పలు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కూడా నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అన్నారు. అలానే రుతుపవనాల గమనం ఉంది. విస్తరణ కూడా అలానే ఉండటంవల్ల వారి అంచనాలు బలపడ్డాయి. అడపాదడపా వర్షము కురిసినపుడు కుంభవృష్టి, ఒక వర్షంకు మరో వర్షానికి ఎక్కువ కాలం ఉండటం, నిరంతరము వర్షాల తీరు తెన్నుల గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తున్నాయి. రుతుపవనాల ఖచ్చితమైన సమయం, ప్రదేశాన్ని తెలుసుకోవడం ద్వారా, అలాగే ప్రారంభ వర్షపాతం తరువాత పొడి వాతావరణం ఏర్పడితే వచ్చే ప్రభావం తెలుసుకోవడం ద్వారా, రైతులు సకాలంలో పొలం పనుల గురించి మంచి సమాచారంతో సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు.
ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్లో, దక్షిణ హిందూ మహాసముద్రంలో సాధారణం కంటే ఎక్కువ గాలి ఉష్ణోగ్రతలు ఏర్పడ్డాయి. తర్వాత భూమధ్యరేఖ తూర్పు పసిఫిక్ మహాసముద్రం క్రమంగా వేడెక్కటం, ఈ వేడెక్కడం ఎల్నినో పరిస్థితులలో మార్పుకు సంకేతం కావటం చూశాం. దీనితో జూన్లో నైరుతి రుతుపవనాలు వచ్చినపుడు భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రంలో ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటుంది, దీనివల్ల రుతుపవనాలు స్థిరపడక ముందే ప్రత్యామ్నాయ అడపాదడపా వర్షాలు, పొడి గాలులు ఏర్పడతాయి. ఇది కూడా చూశాం. ఇటువంటి మార్పులు గత కొద్ది కాలంగా జరగటం, దీనికి కారణం వాతావరణ మార్పులు అని నిపుణులు నిగ్గు తేల్చారు. వీటిని తట్టుకునేందుకు పరిష్కార మార్గాలు ఉన్నాయి. వాటిని అందరూ ప్రపంచ వ్యాప్తంగా ఆచరించాలి. ఇది ఒక్కరి సమస్య కాదు. అంతర్జాతీయ సమస్య కూడా. అయితే ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలలో నైరుతి బాగా ఆలస్యం అయ్యింది. దానికి తోడు విస్తరణ కూడా ఆశాజనకంగా లేదు. అందువల్ల ప్రస్తుతానికి సాగు పనులు ఆశాజనకంగా లేవు. జూలై నెలలో రాబోయే వర్షాలు పడి విస్తరిస్తేనే పంటకాలం సజావుగా సాగుతుంది. ఇటీవల కాలంలో ప్రతి పంట కాలంలో ఈ సమస్య చూస్తున్నాం. రోజురోజుకు అధికమౌతున్న వాతావరణ మార్పులతో ఎదురౌతున్న సమస్యలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి. వారిని సాగుకు సమాయత్తం చేయాలి. మరీ ముఖ్యంగా రుతుపవనాలు ఆలస్యం అయితే వారికి ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసి అందించాలి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలకు ముఖ్యంగా పాలక పక్షాలకు నైరుతి నైరాశ్యం, దిగులు, గుబులు పుట్టిస్తోంది. అందువల్ల రైతులకు అందాల్సిన సహకారం తప్పనిసరిగా అందే అవకాశం ఉంది, ఉంటుంది కూడా. ఏ మాత్రం తేడా వచ్చినా ఫలితాలు మరో రకంగా ఉంటాయి కదా! అందువల్ల నైరుతి నైరాశ్యం నుంచి రైతు గట్టెక్కగలరనే నమ్మకముంది.
పక్షులు వ్యవసాయంలో రెండు రకాల పాత్రలను పోషిస్తాయి. చాలా జాతుల పక్షులు పంటలకు లాభము కలుగజేస్తుండగా కొన్ని జాతుల పకక్షులు మాత్రం నష్టము కలుగజేస్తాయి. నష్టం చేసే పకక్షులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ఇవి స్థిరంగా ఉండే వ్యవసాయ క్షేత్రాలను అలవాటు చేసుకుని అక్కడ వాటి సంఖ్య పెరిగి పంటలకు విపరీతమైన నష్టాన్ని కలిగిస్తుంటాయి. కొన్ని సమయాలలో ఒకే జాతికి చెందిన పక్షులు ఒక ప్రదేశంలో ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, పరిస్థితులు మరియు ప్రదేశం మీద ఆధారపడి మరొక ప్రదేశంలో నష్టాన్ని కలిగించేవిగా ఉంటాయి.
ఇటీవల కాలంలో పక్షుల సమస్య పెరగడం వలన వ్యవసాయంలో పక్షుల నియంత్రణ చేయవలసిన అవసరం ఏర్పడింది. కానీ ఈ పకక్షులు ఆహారపు గొలుసులో ప్రత్యేక పాత్రను పోషిస్తూ వ్యవసాయ మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ఉంటాయి. కొన్ని అంతరించిపోతున్న పక్షి జాతులు కూడా పంటలకు అక్కడక్కడా నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని పక్షులకు ఏవిధమైన హాని కలుగకుండా వాటి నియంత్రణ చేయాలి.
మన దేశంలో సుమారు 1364 పక్షి జాతులు గుర్తించబడ్డాయి. వీటిలో 81 జాతులు స్థానికమైనవి. వీటిలో కొన్ని పకక్షులు మాంసాహారులుగా జీవిస్తూ చిన్న చిన్న పురుగులను మరియు ఎలుకలను తింటూ రైతుకు మేలు చేస్తాయి. మరికొన్ని పకక్షులు మొక్కలలో పరాగ సంపర్కానికి మరియు విత్తన వ్యాప్తికి దోహదపడతాయి. అయినప్పటికీ కొన్ని జాతుల పక్షులు వివిధ థలలో పంటలను పాడుచేస్తూ రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నాయి.
మన రాష్ట్రంలో మొక్కజొన్న, జొన్న, వరి మరియు ప్రొద్దుతిరుగుడు మొదలైన పంటలను పక్షులు ఎక్కువగా పాడుచేస్తాయి. ముఖ్యంగా పక్షులలో రామచిలుకలు, పిచ్చుకలు, పావురాలు, కాకులు, గోరింకలు మరియు నెమళ్ళ వలన పంటలకు అధిక నష్టము కలుగుతుంది. ముఖ్యంగా ఈ నష్టము తక్కువ విస్తీర్ణం కలిగిన పంట పొలాల్లో మరియు ఎక్కువ పకక్షుల స్థావరాలు ఉన్న ప్రాంతాలలో జరుగుతుంది.
ఉదాహరణకు మొక్కజొన్న పంటలో పక్షుల దాడిని పరిశీలించినట్లయితే విత్తనము విత్తినప్పటినుండి పావురాలు, కాకులు, విత్తిన గింజలను ఏరుకుని తింటాయి. విత్తనము మొలకెత్తే థలో కాకులు లేత మొగ్గ భాగాలను పెకిలించి తింటాయి. విత్తనము పాలుపోసుకునే సమయంలో రామచిలుకలు కంకిని తొలిచి గింజలను తింటాయి. గింజ పట్టిన తరువాత రామ చిలుకలు, కాకులు గింజలను వలచుకుని తింటాయి. వివిధ థలలో పక్షులు చేయు నష్ట శాతాన్ని గమనించినట్లయితే విత్తే థ మరియు విత్తనం మొలకెత్తే థలో పావురాలు, కాకులు, గోరింకలు, రామచిలుకలు, నెమళ్ళు, గువ్వలు దాడి చేసి 10-20% నష్టాన్ని కలుగజేస్తాయి. గింజ పాలుపోసుకునే థలో రామచిలుకలు, కాకులు, దాడిచేసి 6-39% నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ విధంగా మొక్కజొన్నలో పక్షుల వలన 10-40 % వరకు నష్టము జరుగుతుంది.
అదేవిధంగా పొద్దుతిరుగుడు చూసినట్లయితే ముఖ్యంగా రామచిలుకలు, కాకులు, గోరింకల వలన నష్టము అధికంగా జరుగుతుంది. విత్తనాలు వేయునప్పుడు కాకుల బెడద ఎక్కువగా ఉంటుంది. గింజ పాలుపోసుకునే థ నుండి గట్టిపడే వరకు రామచిలుకల ద్వారా 40% వరకు నష్టము కలుగుతుంది.
వేరుశనగ పంటలో విత్తనం విత్తే థ నుండి మొలకెత్తే వరకు కాకులు, పావురాలు, నెమళ్ళు, పిచ్చుకలు వలన 15-75 % వరకు నష్టము జరుగుతుంది. అదేవిధంగా గింజ ఏర్పడే థ నుండి గట్టిపడే థ వరకు చిలుకలు, కాకులు, పావురాలు, నెమళ్ళు వలన 10-50% వరకు నష్టము జరుగుతుంది. వరిలో గమనించినట్లయితే గింజ గట్టిపడే థలో పకక్షుల వలన నష్టము అధికంగా ఉంటుంది.
పక్షులు దాడి చేయు విధానం:
పక్షులు దాడి చేయు విధానం వివిధ పంటలలో భిన్నంగా ఉంటుంది. పక్షులు వాతావరణ పరిస్థితులు, సమయం, పంటథ మొదలైన వాటిమీద ఆధారపడి పంటపై దాడి చేస్తాయి. ఉదాహరణకు మొక్కజొన్న పంటలో మొదటిగా విత్తనాలు విత్తునప్పుడు ఉదయం వేళల్లో సుమారు 5 గంటల నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు కాకులు మరియు పావురాలు దాడి చేసి గింజలను ఏరుకుని తింటాయి. అదేవిధంగా నీటి తడులు ఇచ్చిన వెంటనే విత్తనాలు నీటిలో నాని ఉబ్బుతాయి అప్పుడు పక్షులు వాటిని మూడు రోజులు వరకు దాడి చేసి ఏరుకుని తింటాయి. కానీ కాకులు మాత్రం విత్తనాలు మొలకెత్తే వరకు దాడి చేస్తాయి. కంకులు కట్టే థలో రామచిలుకలు 2 నుండి 10 వరకు గుంపులుగా దాడి చేస్తాయి. అవి కంకి పై భాగాన్ని చీల్చి తియ్యని అక్షాన్ని తింటాయి. కంకి నుండి వ్రేలాడే సన్నని పట్టు వంటి నూగును కొరికివేస్తాయి. దీనివలన పరాగ సంపర్కం జరగకపోవడం వలన కంకులలో గింజలు ఏర్పడవు. గింజలు ఏర్పడిన తర్వాత పాలుపోసుకునే థలో లేత కంకికి ఒక చీలికనేర్పరచి వాడియైన వంపు కలిగిన ముక్కుతో లోపలి గింజలను తింటాయి. ఈ థలో జరిగే దాడి వలన విత్తనాలు లేని కంకులు బోసిగా కనిపిస్తాయి.
వివిధ పంటలలో పక్షులు కలుగజేసే నష్టాన్ని అరికట్టడానికి వన్యప్రాణి సంరక్షణా చట్టానికి అనుగుణంగా పర్యావరణానికి హాని చేయని మరియు తక్కువ ఖర్చుతో కూడిన సులభమైన పద్ధతులు క్రింద వివరించడం జరిగినది. ఈ పద్దతులను ఉపయోగించి పంటలలో పక్షుల వలన సంభవించే నష్టాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చును.
1. విత్తన శుద్ధి:
వేపనూనె 5 మి.లీ. ఒక కెజీ విత్తనాలకు పట్టించి 24 గంటల తర్వాత విత్తుకోవాలి లేదా తగినంత కోడిగ్రుడ్డు ద్రావణంలో విత్తనాలను నానబెట్టి విత్తినట్లయితే అవి పక్షులకు రుచించవు.
ఈ విధంగా విత్తన శుద్ధి చేసి నాటడం వలన విత్తనాలు పక్షులు తినవు కావున అన్ని విత్తనాలు మొలకెత్తుటకు అవకాశం ఉంటుంది.
2. వేపగింజల కషాయం పిచికారీ పద్ధతి:
బాగా ఎండబెట్టిన ఒక కిలో వేప గింజలను బాగా పొడిగా చేసి పల్చని గుడ్డలో కట్టి, 10 లీటర్ల నీరున్న బకెట్లో ఒక రోజంతా నానబెట్టాలి. మరుసటి రోజు గుడ్డనుబాగా అదిమి పిండినట్లయితే తెల్లని పాలవంటి కషాయం నీటిలోకి దిగుతుంది. పలుసార్లు దీనిని గట్టిగా పిండి అదనంగా 10 లీటర్ల నీటిని చేర్చినప్పుడు 5% వేపగింజల కషాయం తయారు అవుతుంది.. ఈ రకంగా తయారు చేసిన కషాయాన్ని చేతి పంపు సహాయంతో పంటపై పిచికారీ చేసినచో పక్షులు గింజలను తినడానికి విముఖత చూపుతాయి. ఈ పద్ధతి ద్వారా 7-10 రోజుల వరకు పక్షులు పంటను నష్ఠపరచకుండా కాపాడవచ్చు. వేపగింజల ద్రావణాన్ని ఆముదం నూనె మిశ్రమంతో కలిపి పంటపై పిచికారీ చేస్తే దీని ఫలితం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో నిరూపించబడినది.
3. కోడిగ్రుడ్డు ద్రావణం పిచికారీ:
కుళ్ళిన కోడిగ్రుడ్డులను సేకరించి వాటిని పగులగొట్టి ద్రావణాన్ని వేరుపరచాలి. ఈ ద్రావణాన్ని 25 మీ.లీ. ఒక లీటరు నీటికి కలిపి గింజ పాలుపోసుకునే థలో పంట పై పిచికారీ చేసినచో ఆ వాసనలు పక్షులకు తీవ్రమైన చిరాకును కలుగచేస్తాయి మరియు గింజలు పక్షులకు రుచించవు, అందువలన అవి పంట పొలాల వైపునకు రాకుండా దూరంగా వెళ్లిపోతాయి. దీని ద్వారా వచ్చు వాసన సుమారు 10-15 రోజుల వరకు పనిచేసి పక్షులను రాకుండా చేస్తుంది. అవసరమైనచో రెండవ విడత కూడా పిచికారీ చేసుకోవచ్చు.
4. రిబ్బన్ పద్ధతి:
ఈ పద్దతిలో ఒక వైపు తెలుపు రంగు, మరొక వైపు ఎరుపు రంగు కలిగి, పాలీప్రొపిలీన్తో తయారు చేయబడి అర అంగుళం వెడల్పు కలిగిన తళ తళ మెరిసే రిబ్బన్లను వెదురు బొంగుల సాయంతో పంటపై ఒక అడుగు ఎత్తులో ఉత్తర దక్షిణ దిశలో కట్టుకోవాలి. ఈ కర్రలకు రిబ్బన్లను 3 లేదా 4 మెలికలు త్రిప్పి కర్రల మధ్య దూరం 10 మీటర్లు ఉండేలా చూసి కట్టవలెను. పక్షుల బెడద ఎక్కువగా ఉన్నట్లయితే కర్రల మధ్య దూరం 5 మీటర్లు తగ్గించి కట్టవలెను.
ఈ విధంగా కట్టడం వలన సూర్యరశ్మి రిబ్బన్ పైన పడి ఆ రిబ్బన్లు తళ తళ మెరిసి పకక్షుల కంటికి తీవ్రమైన అసౌకర్యమును కలిగించును కావున పక్షులు పంట పొలం వైపు దృష్ఠి సారించలేవు. రిబ్బన్లు గాలికి రెపరెపమని శబ్దం చేయడం వలన పక్షులు బెదిరి పంట పొలాల నుండి దూరంగా వెళ్లిపోతాయి. ఈ పద్ధతి ద్వారా సుమారు 10 -15 రోజుల వరకు పక్షుల బెడదను అరికట్టవచ్చు. రిబ్బన్ పద్దతిని విత్తనం విత్తే థలో మరియు గింజ పాలుపోసుకునే థ లో కూడా ఉపయోగించవచ్చు. ఒక ఎకరా పొలంలో 100 మీ. నిడివిగల రిబ్బన్లు సుమారు 10 వరకు అవసరపడతాయి. ఎకరాకు రూ. 1000/- వరకు ఖర్చవుతుంది.
5. నెమళ్ళ యాజమాన్యం:
నెమళ్ళ నష్టతీవ్రతను తగ్గించడానికి కొబ్బరిత్రాడు / పురికొస తాడును విత్తనం విత్తే థలో పొలానికి 4 వైపులా కర్రలను పాతి భూమికి ఒక అడుగు ఎత్తులో పంట పైన అడ్డు నిలువు వరుసలలో ఒక మీటరు మధ్య ఎడంగా ఖాళీ ఉంచుకుని కట్టినట్లయితే, పంటల మీదికి ఎగురుతూ వచ్చే నెమళ్ళు పంట పొలాలపై దిగినప్పుడు వాటి కాళ్ళకి ఈ త్రాడు చుట్టుకొని రెక్కలు చిక్కుకుపోతాయి దీనికి నెమళ్ళు భయాందోళనకు గురై ఆర్తనాదాలు చేయుచు దూరంగా పారిపోతాయి. కాయలు ఏర్పడే థలో పంట గట్టు వెంబడి భూమి నుండి ఒక అడుగు ఎత్తులో 3 వరుసలు పంటచుట్టూ కట్టినట్లయితే నెమళ్ళ బెడదను సమర్థవంతంగా అరికట్టవచ్చు.
6. కాగితపు ప్లేట్ల పద్ధతి:
ఈ పద్దతిలో ఒక వైపు వెండి పూతను పోలిన మెరుపు గల చిరుతిండ్లు తినే కాగితపు ప్లేట్లను తీసుకుని వెండి పూత పైకి వచ్చేటట్లు ప్రొద్దుతిరుగుడు పువ్వు కాడకు అమర్చవలెను. అప్పుడు సూర్యరశ్మి సోకినప్పుడు వెండిపూత తళ తళ మెరిసి పక్షుల కళ్ళకి అసౌకర్యం కలిగించును. ఒకవేళ సూర్యరశ్మి లేకపోయినా పేపర్ ప్లేట్లు పకక్షులు వాలడానికి ఆధారం లేకుండా చేస్తాయి. ఫలితంగా పువ్వులో గింజ నష్టం అరికట్టబడుతుంది. ఈ పద్ధతి సమర్థవంతంగా పని చేస్తుంది. ఈ పద్ధతి ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ ప్రొద్దుతిరుగుడు పంట గింజ పాలుపోసుకునే థలో సమర్థవంతంగా పకక్షుల బెడదను అరికట్టుతుంది.
7. ఆర్తనాద పద్ధతి:
ఈ పద్ధతిలో పంటను నష్టపరచు వివిధ పక్షుల ఆర్తనాదములను మరియు పరభక్షక పక్షుల కఠిన శబ్దాలను రికార్డు చేసి శబ్దోత్పతి యంత్రాల ద్వారా పంట పొలాలకు సమీప ప్రాంతం నుండి ఆర్తనాదాలు ఉత్పత్తి చేస్తారు. అప్పుడు పంటను నష్టం చేయు పకక్షులు బెదిరి ఆపద ఉన్నదని బ్రాంతికి గురై పంటపొలాల నుండి దూరంగా పారిపోతాయి. ఈ పద్దతిలో ఉపయోగించే యంత్రం ఖరీదు సుమారు రూ. 20000/- (సోలార్ ప్లేట్లతో), విద్యుత్ సరఫరాతో పనిచేయు యంత్రం ఖరీదు రూ. 15000/- ఈ యంత్రం సుమారుగా 4-5 ఎకరాల విస్తీర్ణం గల పంట పొలాలకు సమర్థవంతంగా పనిచేయుచున్నదని ప్రయోగపూర్వకంగా రుజువు చేయబడినది.
8. శబ్ద ప్రయోగ పద్ధతి:
ఈ పద్ధతిలో అధిక మొత్తంలో ప్రేలుడు శబ్ధాలనుత్పత్తిచేయు యంత్రాలను ఉపయోగించి పక్షులను భయబ్రాంతులకు గురి చేస్తారు. ఈ శబ్దాలను ఉత్పత్తి చేయు యంత్రం కాల్షియమ్ కార్బైడ్ అనే ముడి పదార్థం ద్వారా పని చేస్తుంది. కానీ మార్కెట్లో కాల్షియమ్ కార్బైడ్ ఉత్పత్తి తగ్గిన కారణంగా ఎల్.పి.జి.గ్యాస్తో నడిచే కొత్త యంత్రాలను రూపొందించారు. ఈ యంత్రాలు రూ. 40,000/- వరకు ధర పలుకుతాయి. కానీ శాశ్వతంగా వీటిని ఉపయోగించి అధిక మొత్తంలో శబ్దాన్ని ఉత్పత్తి చేసి 3-4 ఎకరాల విస్తీర్ణం లో శాశ్వతంగా పంటను కాపాడవచ్చు. ఈ యంత్రాన్ని ఒకే ప్రదేశంలో కాకుండా పంట చుట్టుప్రక్కల ప్రదేశాలలో ఉపయోగించుట ద్వారా వెలువడే తీవ్రమైన శబ్దానికి పక్షులు దూరప్రాంతాలకు పారిపోతాయి. వీటిని చేపలు/రొయ్యల చెరువుల దగ్గర కూడా పకక్షులను బెదిరించడానికి ఉపయోగిస్తారు.
ప్రస్తుతం మార్కెట్టులో సోలార్ శక్తితో పనిచేసే అగ్రి ఇ-కెనాన్ అనే పరికరం కూడా అందుబాటులో ఉన్నది. ఇది నిరంతరం వివిధ శబ్ధాలను ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తూ పంటలను పకక్షుల బారినుండి సమర్థవంతంగా రక్షిస్తుంది. దీని ఖరీదు సుమారు రూ.25000/-
9. గూళ్ళ నిర్ములనా పద్ధతి:
పొలము గట్లపైనున్న పొదలలో గూళ్ళను నిర్మూలించడం, చెట్ల తొర్రలను మూయడం మరియు ఆవాస ప్రాంతాలలో పక్షి గూళ్ళను తొలగించడం ద్వారా పకక్షులు రాకుండా చేయవచ్చు.
10. ప్రత్యామ్నాయా ఆహార సరఫరా:
పంట పొలాల సమీపంలో, ఆవాస ప్రాంతాలలో వృధాగా ఉన్న భూములలో మరియు పొలం గట్ల వెంబడి వివిధ అడవి జాతి పండ్ల చెట్లు పెంచడం వలన వీటి యొక్క ఫలాలు వివిధ పక్షులను ఆకర్షిస్తాయి. తద్వారా పక్షులకు ప్రత్యమ్నాయ ఆహారం లభించి పంట పొలాల మీద పకక్షులు దాడి చేయడం తగ్గుతుంది. మరియు అడవి జాతి ఫలసాయం వలన రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ముఖ్యంగా ఆడవి జాతి పండ్ల చెట్లయిన చీమ చింత, మోదుగ, రావి, మర్రి, పర్కి, కల్మికాయలు, మొర్రి, తూనిక జీడిపండ్లు, రేగు, చింత, వెలగ మొదలైనవి పక్షులకు ప్రత్యామ్నాయ ఆహరం అందించడంలో ప్రముఖమైనవి.
11. ఆకు చుట్టుపద్ధతి:
మొక్కజొన్న పంటలో ఇది అతిముఖ్యమైన పద్ధతి. ఇందులో గింజలు పాలు పోసుకునే థలో కంకి చుట్టూ ఉన్న ఆకులను చుట్టి పక్షులకు కనపడకుండా చేయాలి. ఈ విధంగా గట్లనుండి 3-4 వరుసల వరకు ఆకులను చుట్టి పక్షుల దృష్టిని మరల్చి పంటలను రక్షించవచ్చు. తక్కువ విస్తీర్ణంలో పంటలకు ఇది అనుకూలమైన పద్ధతి. ఇది చాలా ప్రభావవంతమైన ఎటువంటి సామాగ్రి పరికరాలు అవసరం లేనటువంటి తక్కువ ఖర్చుతో కూడుకున్న ఆమోదయోగ్యమైన పద్ధతి.
12. తెర పంట పద్ధతి:
సాధారణంగా మొక్కజొన్న పంటలో రామచిలుకలు పంట గట్ల వెంబడి 2-3 వరుసలలో ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. పశుగ్రాస వంగడాలైన జొన్న గాని, మొక్కజొన్నను దగ్గర దగ్గరగా స్క్రీన్ క్రాప్/తెర పంటగా వేయడం ద్వారా లోపల ఉన్న మొక్కజొన్న పంటను పకక్షుల కంటికి కన్పించకుండా సమర్థవంతంగా పక్షుల బారి నుండి కాపాడవచ్చు. తెర పంట పశుగ్రాసంగా ఉపయోగపడి రైతుకు అదనపు ఆదాయాన్ని కూడా చేకూరుస్తుంది.
పైన సూచించిన పద్ధతులని ఒక్కొక్కటి ఒక్కొక్క సమయంలో అమలు పరిస్తే వచ్చే ఫలితాల కన్నా అవసరంమేరకు రెండు మూడు పద్ధతులు కలిపి మిశ్రమంగా సమగ్ర సస్యరక్షణ అమలుపరచినట్లయితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.
డా|| నామాల శ్రీనివాసరావు, శ్రీమతి బి.అనూష, డా|| టి. శ్రీనివాస్, జి. ఝాన్సీరాణి, వి. రమ్య శ్రీ, ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య అనుబంధ విభాగం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మారుటేరు-534122, ఆంధ్రప్రదేశ్.
వివిధ రకాల కారణాల వలన పట్టణాలలో, నగరాలలో ఇంటిపంట లేదా మిద్దెతోట సంస్కృతి రోజురోజుకు పెరుగుతూ ఉంది. మొదటలో తమ ఇంటి అవసరాలకు సరిపోను కూరగాయలు మరియు ఆకుకూరలతో మొదలైన ఇంటిపంటను కొందరు పట్టుదలతో నందనవనంగా మార్చుకుంటున్నారు. మనసు ఉంటే మార్గాలు అనేకం అన్నట్లు, సంకల్పం ఉంటే ఏదైనా అసాధ్యం కాదు అని కొంతమంది ఇంటిపంట ఔత్సాహికులు నిరూపిస్తున్నారు. అలాంటి ఔత్సాహికులలో హైదరాబాద్ కొంపల్లిలో మిద్దెతోటను నిర్వహిస్తున్న శోభ ముందువరుసలో ఉంటుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.
శోభకు మొక్కలన్నా, పల్లెటూరు అన్నా, పచ్చదనం అన్నా మక్కువ ఎక్కువ. పరిస్థితుల ప్రభావంతో పల్లెటూరుని వదలి నగరంలో జీవనం కొనసాగించవలసి రావడంతో వాటన్నింటిని మిస్ అవుతున్నామన్న లోటు నుంచి బయటకు రావటానికి తన మిద్దెతోటను ఒక నందనవనంగా తీర్చిదిద్ది మిద్దెతోటలోనే ఒక పల్లెటూరును, ఒక రిసార్టును సృష్టించి మనసు ఉంటే మార్గం తప్పక ఉంటుందని నిరూపిస్తున్నారు.
కొంపల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలో, తమ విల్లా పైన అందుబాటులో ఉన్న 200 గజాల మిద్దెను రెండు భాగాలుగా చేసుకుని ఒకవైపు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మరియు రెండోవైపు పూలు మరియు క్రోటాన్స్ను పెంచుతూ మిద్దెమీదకు వచ్చిన అందరూ రిసార్టులో మరియు పల్లెటూరులో ఉన్న అనుభూతి పొందేలా తమ మిద్దెతోటను తీర్చిదిద్దారు. మిద్దెమీద ఒక ప్రాంతంలో పల్లెటూరులో ఉండే అన్ని అంశాలను సొంతంగా తయారు చేసి ఏర్పాటు చేసుకున్నారు. వృధాగా పడవేసే ఏ వస్తువులను కూడా వదలకుండా తనకు అనుకూలంగా డిజైన్ చేసుకుని అందులో మొక్కలు పెంచుతుంటారు. చివరకు తాగిపడవేసే కొబ్బరి బోండాలను కూడా వృథాగా పడేయకుండా కొబ్బరి బోండాలకు రంగులు వేసి డిజైన్లు వేసి ఏదో ఒక మొక్కను పెంచుతుంటారు. ఈ విధంగా ఖాళీ పెరుగు డబ్బాలు, నూనె సీసాలు లాంటి వాటన్నింటిలో మొక్కలు పెంచుతుంటారు. మిద్దెతోపాటు పెరటిలో కూడా విల్లా నాలుగు ప్రక్కల పెరటి గోడపక్కన కూడా పసుపు, మిరప, వగ, టమాటాలాంటి మొక్కలు పెంచుతున్నారు.
మిద్దెతోటలో పాలకూర, చుక్కకూర, మెంతికూర, పొదీనా, కొత్తిమీర, బీర, కాకర, చిక్కుడు, సొర, వంగ, టమాట, మునగ, సపోట, జామ, అంజూర, మామిడి, స్టార్ఫ్రూట్, జీడిమామిడి, వాటర్ యాపిల్, మల్లె, మందార, గన్నేరు మొదలగు మొక్కల పెంపకం చేస్తున్నారు. అవకాశం ఉన్న చోట వ్రేలాడే కుడీలను కూడా నిర్వహిస్తున్నారు.
పసుపు సాగులో శోభగారిని ప్రత్యేకించి చెప్పుకోవలి. తమ ఇంటి పంటలో పసుపును ఎక్కువగా సాగు చేస్తున్నారు. తనకు పసుపు సాగుపై మక్కువ పెరగడంతో తమ గేటెడ్ కమ్యూనిటీలో ఖాళీ ప్రాంతంలో పసుపును సాగు చేసి తోటి వారికి పసుపును ఉచితంగా పంపిణీ చేశారు. ఎవరికి వారు తమకు సంవత్సరానికి సరిపోయేటంత పసుపును తామే సొంతంగా పండించుకోవటానికి ముందుకు రావాలన్నదే శోభ ధ్యేయం. పసుపు సులభమైన పంట కాబట్టి ఎవరైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా పసుపును పండించుకోవవచ్చు అని తోటి ఇంటిపంటదారులకు చెప్పడంతో పాటు ఇంటిపంట అవగాహనా సదస్సుల ద్వారా కూడా వేరేవారికి చెబుతూ ఉంటారు.
మట్టి మిశ్రమంలో ఎర్రమట్టి, కోకోపిట్, వర్మికంపోస్ట్, ఇసుక, వేపపిండిలతో మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుని మొక్కలు పెంచుతుంటారు. తరువాత అవసరాన్నిబట్టి ఆముదాల పిండి, బోన్ మీల్, కిచెన్ వేస్ట్లను మొక్కలకు బలంగా అందించడంతో పాటు చీడపీడల నివారణకు బూడిద, వేపనూనె, పులిసిన మజ్జిగలను వినియోగిస్తుంటారు. కొత్తగా ఇంటిపంటను చేపట్టేవారు మొదటిలో చిన్న చిన్న టబ్బులలో మెంతికూర, పాలకూర, పొదీనా లాంటివాటి పెంపకాన్ని చేపట్టి అనుభవం గడిచే కొలది మొక్కల సంఖ్యను పెంచుకుంటూ పోతే ఫలితం బాగా ఉంటుందని కొత్తగా ఇంటి పంటలోకి అడుగు పెట్టేవారికి శోభ సలహా ఇస్తున్నారు.
భూమిపై జీవనం కొనసాగించే అనంతకోటి జీవరాశులకు, చివరకు మొక్కలతో సహా అన్నింటికి ప్రకృతితో అనుబంధం ఉంటుంది. ప్రకృతిలో అందుబాటులో ఉండే ఎండ, గాలి, నీరు లాంటివాటిని గ్రహిస్తూ అన్ని తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రకృతికి విరుద్ధంగా ఏ జీవి తన మనుగడను కొనసాగించలేదు. ఏదో తప్పనిసరి పరిస్థితులలో కొంత సమయం ప్రకృతికి విరుద్ధంగా ఉండవలసిన పరిస్థితులు నెలకొన్నా అవి మరలా కొంత సమయానికి ప్రకృతికి అనుకూలంగా మారవలసిందే. అడవులలో లేదా రోడ్లప్రక్కన పెరిగే జంతువులు మరియు మొక్కలను గమనించినట్లయితే అవి చాలా వరకు ప్రకృతితో మమేకమై జీవనాన్ని కొనసాగిస్తుంటాయి. అందువలననే అవి ఆరోగ్యంగా తమ జీవనాన్ని కొనసాగించగలుగుతున్నాయి. జంతువుల విషయానికొస్తే మనిషి ప్రమేయం లేకుండా ఉండే అన్ని జంతువులు వాటి అవసరము మేరకు ప్రకృతిలో అందుబాటులో ఉండే ఆహారాన్ని తింటూ ఆరోగ్యంగా తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. ఆయా జంతువుల నుండి వచ్చే ఉత్పత్తులు సక్రమమైన, అవసరమైన నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉంటాయి. అలా కాకుండా మనిషి ప్రమేయం మొదలయిందంటే జంతువులు అనారోగాల భారిన పడడము, వాటి ఉత్పత్తులు నాణ్యత కోల్పోవడం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితులలో పశుపోషణలాంటి వాటిలో మనిషి ప్రమేయం మితిమీరింది అని చెప్పవచ్చు. పాలకొరకు పోషించే పశువులను ఒకసారి గమనించినట్లయితే కొంతమంది పశుపోషకలు తమ పశువులను షెడ్లలో కట్టివేసి వాటిని ఏమాత్రం బయటకు వదలకుండా కట్టి వేసిన ప్రాంతానికి మేత, నీటిని అందిస్తూ వాటి ద్వారా పాలు పొందుతున్నారు. ఇలాంటి పెంపకం విధానాల వలన పాలలో ఉండవలసిన పోషకాలు సక్రమంగా ఉండకపోవడంతో పాటు పశువులు తరచుగా అనారోగాల బారిన పడతుంటాయి. ఇటీవల కాలంలో అంటే దేశీ జాతి ఆవు పాలు మరియు నెయ్యిల యొక్క విలువ మరియు మన ఆరోగ్యాన్ని కాపాడుటలో దేశీ జాతి ఆవు పాలు, పెరుగు, నెయ్యిలలో లభించే పోషకాల పాత్ర తెలుసుకున్న తరువాత చాలామంది దేశీ జాతి ఆవుల పోషణవైపు అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. ఇప్పటికే దేశీజాతి గోశాలను ప్రారంభించిన వారిలో చాలామంది ఆవులను ఒకే ప్రదేశంలో కట్టివేసి ఏమాత్రం ఎండకు తిప్పకుండా మేత మరియు నీటిని వాటికి అందిస్తూ గోఉత్పత్తులను పొందుతూ వాటిని అమ్మకం చేస్తున్నారు. ఆవులను ఏమాత్రం ఎండకు తిప్పకపోవడం వలన అలాంటి ఆవుల ద్వారా వచ్చే ఉత్పత్తులలో నాణ్యత సక్రమంగా ఉండదు అని తెలుసుకున్న కొంతమంది ఔత్సాహికులు ఆవులను ప్రకృతిసిద్దంగా ఎండలో తిరగనిస్తూ ప్రకృతి సిద్ధంగా దొరికే మేతలను తినటానికి అవకాశం ఇస్తూ గో-శాలను నిర్వహిస్తూ అలాంటి ఆవులు ద్వారా వచ్చిన పాల నుండి సాంప్రదాయ పద్ధతిలో నెయ్యిని ఉత్పత్తి చేస్తూ నాణ్యమైన నెయ్యి ఉత్పత్తికి ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ఈ కోవకే చెందుతారు అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలంలో గోశాలను నిర్వహిస్తున్న వర్మ.
ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఆహారాల వలన మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి అనే విషయం తెలుసుకున్న వర్మ తనకు ఉన్న పరిధిలో దేశీ జాతి ఆవు పాల వలన ఆరోగ్యాలు మెరుగుపడతాయని తెలుసుకుని దేశీ జాతి ఆవులతో గోశాలను నిర్వహించాలని తలచి 2010వ సంవత్సరంలో కొన్ని ఆవులతో గోశాలను ప్రారంభించి నెమ్మదిగా ఆవుల సంఖ్యను పెంచుకుంటూ వస్తున్నారు. తన వద్ద అభివృద్ధి చెందిన ఆవులు మరియు కొనుగోలు చేసుకున్న ఆవులతో కలిపి ప్రస్తుతం వర్మగారు సుమారు 50 ఆవులను పోషిస్తున్నారు. వాటిలో ఎక్కువగా రాజస్థాన్ ప్రాంతానికి చెందిన రాఠీ జాతివే ఎక్కువగా ఉన్నాయి. రాజస్థాన్ ప్రాంతానివి అయితే మన వాతావరణానికి బాగా అనుకూలంగా ఉంటాయని గ్రహించి రాఠీ జాతిని కొనసాగిస్తున్నారు. పరిశీలన నిమిత్తం ఒక ఒంగోలు, ఒక తార్పార్కర్, ఒక కాంక్రెజ్, ఒక సాహివాల్ ఆవును పోషిస్తున్నారు. వాటి గర్భధారణ కొరకు పుంగనూర్, సాహివాల్, రాఠీ ఎద్దులను ఒక్కొక్క జాతికి ఒక్కొక్క ఎద్దు చొప్పున పెంపకం చేస్తూ తన గోశాలలోని ఆవులన్నింటిని ప్రకృతిసిద్ధంగానే గర్భధారణ చేయిస్తుంటారు. కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లను చేయించరు.
గోశాల మొదలు పెట్టిన కొత్తలో పాలను అమ్మకం చేస్తూ వచ్చారు. కాని పాలకు అందే ధర ఆశాజనకంగా ఉండకపోవడంతో పాల అమ్మకం ఆపివేసి నెయ్యిని అమ్మకం చేస్తున్నారు. ఆవు నెయ్యి ఎక్కువ భాగం ఔషధ రూపంలో ఉపయోగిస్తున్నారు కాబట్టి నెయ్యిలో ఉండవలసిన పోషకాలు సక్రమంగా ఉండాలంటే ఆవులను ఎండలో తిరగనియ్యాలని అని గ్రహించి అన్ని ఆవులను ప్రతిరోజూ ఎండలోనే వదిలేస్తున్నారు. రాత్రి సమయంలో మరియు వర్షం వచ్చిన సందర్భంలోనో ఆవులను షెడ్లలో ఉంచుతుంటారు. రోజు మొత్తం ఆవులన్ని ఎండలోనే తిరుగుతూ అవసరమైన గడ్డిని, మొక్కలను తింటూ ఉంటాయి. మేతకొరకు 4 ఎకరాలలో సూపర్ నేపియర్ సాగు చేయడంతో పాటు ప్రతినెల రెండు ఎకరాల చొప్పున మొక్కజొన్నను సాగు చేస్తూ మొక్కజొన్న కండె తయారయిన స్టేజ్లో మొక్కజొన్నను కట్ చేసి, సూపర్ నేపియర్ కలిపి చాఫ్కట్టర్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి పచ్చిమేతగా అందిస్తుంటారు. మొక్కజొన్న కండే తయారయిన స్టేజ్లో దాణాలో ఉండవలసిన పోషకాలు మొక్కజొన్నలో ఉంటాయి కాబట్టి ఎలాంటి దాణాను అందించనవసరం పడడం లేదు. ఎండుమేతగా వేరుశనగ చెత్తను ఒక్కొక్క ఆవుకు రోజుకు 4 నుంచి 5 కిలోలు అందిస్తుంటారు. ఇంతకు మించి ఆవులకు ఎలాంటి దానాను అందించడం లేదు.
వీరి గోశాలలో మంచి పాల దిగుబడి అంటే రోజుకు 10 నుంచి 20 లీటర్లు ఇచ్చే రాఠీ జాతికి చెందిన ఆవులు ఉన్నాయి. ఇందుకుగాను ఆవులు కొనుగోలు సమయంలో ఎలాంటి అశ్రద్ధకు తావు ఇవ్వకుండా రాజస్థాన్ వెళ్ళి అక్కడ నెలరోజుల వరకు బస చేసి ఆ ప్రాంతం మొత్తం తిరిగి మంచి పాల దిగుబడిని ఇవ్వగలిగిన ఆవులను కొనుగోలు చేయడంతో పాటు తన దగ్గరకు వచ్చిన తరువాత కూడా ఎలాంటి అశ్రద్ధకు తావు ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోగలుగుతున్నాడు కాబట్టి మంచి పాల దిగుబడి పొందుతున్నాడు.
నెయ్యి తయారీ…. ప్రతిరోజు వచ్చిన పాలను సన్నని సెగపై ఇత్తడి గిన్నెలలో సుమారు మూడు గంటలు వేడి చేసి ఆ పాలను పెరుగు చేసి పెరుగును చిలికి వెన్నను సేకరించి ఆ వెన్నను మరలా సన్నని సెగపై మూడు గంటలు పైగా వేడి చేసి నాణ్యమైన నెయ్యిని పొందుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని తయారు చేసి నెయ్యిని 200 గ్రాముల గాజు సీసాలలో ప్యాక్ చేసి మార్కెట్ చేస్తున్నారు.
మరిన్ని వివరాలు 9701703656 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
పట్టణ ప్రాంత ఆవాసాలలో పోషక పదార్థాలనిచ్చే కూరగాయల పెంపకం ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ కలుషిత ప్రపంచంలో విషాహారం తింటూ ఆరోగ్యం గురించి ఆలోచించడం అత్యవసరమే. విటమిన్లు, ఖనిజలవణాలు, పీచు, పిండిపదార్ధాలున్న కూరగాయలు సగటున మనిషికి రోజుకు 300 గ్రాములు మరియు పండ్లు 92గా, ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ 300 గ్రాములు కూరగాయలలో 125గ్రా, ఆకుకూరలు – 100గ్రా., వేరుతో కూడిన కూరగాయలు- 75 గ్రా, ఇతర కూరగాయలను తీసుకోవాలి. కాని తీసుకుంటున్నది …… పండ్లు 92గ్రా, ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. కాని తీసుకుంటున్నది చాలా తక్కువగా ఉంది. ఇది ఆహార, ఆరోగ్య భద్రతకు సవాలుగా మారింది. ఈ నేపధ్యంలో పెరుగుతున్న జనాభాను, పోషకాహార లోపాన్ని, పట్టణాల్లో స్థలాభావాన్ని మరియు కూరగాయల ధరలను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన తాజా కూరగాయల్ని, ఆకుకూరల్ని, పండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఇంటి పంట దివ్యవరం. ఇంటి పరిసరాలలో, డాబాపైన సేంద్రీయ పద్ధతిలో ఎలాంటి రసాయన ఎరువులు, సస్యరక్షణ మందులు, కలుపునాశినులు వాడకుండా కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల, పూలపంటలను పెంచుకుంటే విషతుల్యం కాని తాజా ఆహారాన్ని కొంతవరకు పొందవచ్చు.
పెరటితోటల పెంపకం
మొక్కల పెంపకం ఆరోగ్యకరమైన అలవాటు. ఈ పనిలో నిమగ్నమయినప్పుడు మనస్సుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మొదట్లో కొంచెం శ్రమపడితే, పిన్న వయస్కులకు, పెద్దలకు కూడా అర్ధవంతమైన అలవాటుగా.. మారుతుంది. గట్టిగా ప్రయత్నిస్తే అన్నీ ఇంట్లోనే సమకూరుతాయి. పెరటితోటల పెంపకం, డాబాపై మొక్కల పెంపకం వలన పల్లెల నుండి పట్టణాలకు వలస వచ్చిన జనాభాకు సరిపడే పండ్లు, కూరగాయలు పెంచవచ్చు.
పట్టణప్రాంత అవసరాలకు కుండీలలో కూరగాయల సాగు
పట్టణ ప్రాంతాలలో, జనాభా పెరుగుదలతో ఎక్కువ భూమి ఇంటి నిర్మాణానికి వినియోగించబడుతుంది. అందువలన కూరగాయలను పెంచడానికి భూమి దొరకదు. ప్రత్యేకంగా కుండీలను, కంటైనర్లను ఉపయోగించి పండ్ల మొక్కలను, కూరగాయలను మన ఇంటి ఖాళీస్థలంలో లేదా డాబాపై పెంచుకోవడం ఒక్కటే మార్గం. నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపడే కూరగాయలను పండించడానికి 40-50 చ.మీ స్థలం కావాలి. కంటైనర్లలో మట్టిని సంవత్సరానికొకసారి మార్చాలి. పాంటింగ్ మిశ్రమంలో మట్టి, ఇసుక, వేపపిండి, జీవన ఎరువులు సమపాళ్ళలో ఉండాలి. మట్టిలో ఉదజని సూచిక 6-7.5 మధ్య ఉండాలి.
ఇంటి తోటల మొక్కల పెంపకము వల్ల లాభాలు
ఇంటి తోటల మొక్కల పెంపకం ద్వారా ఏడాది పొడవునా విష అవశేషాలులేని తాజా ఉత్పత్తులు లభిస్తాయి. -ఆహార, ఆరోగ్య భద్రత, శుభ్రత పొందవచ్చు. పచ్చదనాన్ని పెంపొందించడంతో ప్రాణవాయువు పెరిగి, గాలిలో హానికర బొగ్గుపులుసు వాయువు తగ్గుతుంది. ఉత్పత్తులు నాణ్యంగా పోషకాలతో నిండి ఉంటాయి. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఇంటి వంట వలన మంచి వ్యాయామం లభిస్తుంది. మన విత్తనాన్ని మనమే ఉత్పత్తి చేసుకొని బయటకు పోయే పని ఉండదు. మనసుకు ఉల్లాసంగా ఉండే ఈ పనిని రోజు చేయవచ్చు. పండ్లు, కూరగాయల ఖర్చు తగ్గుతుంది.
వార్షిక కూరగాయల, పండ్ల మొక్కల పెంపకంపై ప్రణాళిక
మొక్కలు పెంపకం చేపట్టే ముందు ప్రణాళిక తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ డాబాపై పెంచుతున్నదైతే ముందుగా ఇంజనీరు చేత డాబా పైకప్పు గట్టిదనాన్ని పరీక్షింపజేయాలి. అంటే మన ప్రణాళిక ప్రకారం కూరగాయలు, పండ్లు మొదలైనవి పెంచడానికి తట్టుకోగలదో లేదో పరీక్షించాలి. పైకప్పు కారకుండా ఉండాలి. మురుగు నీటి పారుదల సౌకర్యం తప్పని సరిగా ఉండాలి. ప్రణాళికబద్ధంగా మొక్కలను నాటాలి. కుండీల్లో నింపే మిశ్రమం తేలికపాటి బరువు కలిగి ఉండాలి. మొక్కలను పెంచడానికి ఎత్తైన మడులను ఏర్పాటు చేయాలి. ట్రెల్లీస్ ఏర్పాటుచేసి తీగలు పాకించాలి. దాబాలపైన, బాల్కానీలలోను పెరిగే మొక్కలు ఎక్కువ గాలికి, ఎక్కువ వేడికి గురవుతాయి. ఎత్తైన మడులు, ఎత్తులో అమర్చిన కుండీలు ఒకే వరుసలో ఉండాలి. వీటిని తేలికపాటి మట్టి మిశ్రమంతో నింపాలి. మట్టి మిశ్రమంతో నింపక ముందు సరైన మురుగునీటి పారుదల సౌకర్యం ఏర్పాటుచేయాలి. షేడ్నెట్గాని, పందిరికాని ఏర్పాటుచేసుకొని ఏడాది పొడవునా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు మరియు పూలను కూడా పెంచుకోవచ్చు. ముందుగా తక్కువ ఖర్చుతో మొదలుపెట్టి అనుభవం గడించిన తర్వాత ఎక్కువ మొక్కలను ఎక్కువ ఖర్చుతో పెంచుకోవచ్చు.
మనది వ్యవసాయక దేశం అయినప్పటికి రైతులందరూ తమ పంటల సాగులో లాభాలు ఆర్జించ లేకపోతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. రైతులందరూ ఆర్థికంగా లాభాలు సంపాదించలేకపోతున్నారా? అంటే సమాధానం కాదు అని వస్తుంది. కొంతమంది అంటే చాలా తక్కువ మంది తమ పంటల సాగులో లాభాలు ఆర్జించగలుగుతున్నారు. వ్యవసాయంలో లాభాలు ఆర్జించే వారిని గమనించినట్లయితే వారు లాభాలు ఆర్జించటానికి అనేక కారణాలు మనకు అర్థం అవుతాయి. సరైన సమయంలో సరైన మెళకువలు పాటించడం, కుటుంబ సభ్యులందరూ కలసికట్టుగా పనిచేస్తూ కూలీల మీద ఎక్కువగా ఆధారపడకపోవటం, పంట ఉత్పత్తులను అదేవిధంగా అమ్మకుండా విలువజోడించి అమ్మడము, పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మడము, వినియోగదారుల అభిరుచుల మేరకు పంట ఉత్పత్తులను పండించి ఇవ్వడము, వాతావరణం అనుకూలించని పరిస్థితులలో పంట దిగుబడులు పొందడమో… లాంటి వివిధ రకాల పరిస్థితులలో కొంతమంది రైతులు తమ పంటల సాగుని లాభాల బాటలో నడిపిస్తున్నారు. పంటల సాగులో లాభాలు ఆర్జించే వారిని గమనిస్తే మనకు బోధపడే విషయం ఏమిటంటే… వీరు వ్యవసాయంలో ఏ ఒక్క అంశాన్ని అశ్రద్ధ చేయకుండా అందుబాటులో ఉన్న అవకాశాలను అనుకూలంగా మలచుకుంటూ తమ సాగుని లాభాల బాటలో నడిపిస్తుంటారు. ఇదే కోవకు చెందుతారు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పాలీహౌస్లో ఆకుకూరలు పండిస్తూ తమ ఆకుకూరల సాగును లాభాల బాటలో నడిపిస్తున్న రైతు దంపతులు కృష్ణమూర్తి, నీలిమ.
వీరిది వ్యవసాయకుంటుంబం. వీరికి 10 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉంది. వీరికి ప్రత్తి, మిరప లాంటి పంటల సాగులో మంచి అనుభవం ఉంది. 2018వ సంవత్సరం తెలంగాణా ప్రభుత్వం పాలీహౌస్లకు 90% సబ్సిడీ అందించగా వీరు తమ సాగును నూతన పంథాలో నడిపించాలని ఒక ఎకరంలో పాలీహౌస్ని నిర్మించారు. పాలీహౌస్ను నిర్మించి అందులో క్యాప్సికమ్, కీరా లాంటి పంటలు సాగు చేయగా వివిధ రకాల కారణాల వలన ఆ పంటల సాగు లాభదాయకంగా లేదు. ప్రత్యేకించి క్యాప్సికమ్, కీరా లాంటి వాటికి హైదరాబాదు లాంటి మహానగరాలలో మాత్రమే మార్కెట్ ఉంటుంది. అంతదూరం రవాణా చేయాలంటే రవాణా ఖర్చులు పెరిగి గిట్టుబాటు కాకుండా పోయింది. ఆ సమయంలో తమ సాగుని లాభాలబాటలో నడిపించటానికి అందుబాటులో ఉన్న అవకాశాలని పరిశీలించి సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలు పండిస్తూ వాటిని దగ్గరలో మార్కెట్ చేసుకోగలిగితే ఫలితం ఉంటుందని గ్రహించి 2019వ సంవత్సరములో సేంద్రియ ఆకుకూరల సాగు మొదలు పెట్టారు.
సాధారణంగా వర్షాకాలం మరియు వేసవి కాలంలో ఆకుకూరల ధరలు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో బయట నుంచి వచ్చే ఆకుకూరలు వర్షాలు మరియు ఎండల వలన నాణ్యత దెబ్బతింటాయి కాబట్టి పాలీహౌస్లో అలాంటి సమస్యలు ఉండవు కాబట్టి వర్షాకాలం మరియు వేసవికాలంలో ఆకుకూరలకి మంచి ధర లభిస్తుందని గ్రహించి ప్రతి సంవత్సర వర్షాకాలం మరియు వేసవి కాలంలో నిరంతరం ఆకుకూరలు దిగుబడి తీసేలా ప్రణాళిక వేసుకుంటూ ఆకుకూరల సాగును కొనసాగిస్తున్నారు.
ఆకుకూరల సాగుకి సేంద్రియ పద్ధతులు పాటించాలని తలంచారు కాబట్టి ప్రతి సంవత్సరం ఎకరానికి 20 ట్రక్కులకు తగ్గకుండా ఎరువుని అందిస్తుంటారు. ఎకరం పొలాన్ని 16 బెడ్లలాగా చేసుకుని, ఈ బెడ్లపై విత్తనాలను దఫాలుదఫాలుగా చల్లి నెలలో 20 రోజులు ఆకుకూరలు దిగుబడులు వచ్చేలా తమ సాగుని కొనసాగిస్తున్నారు. పాలకూరకు డిమాండు ఎక్కువగా ఉంటుంది కాబట్టి 70% పొలాన్ని పాలకూరకు కేటాయించి మిగతా 30% పొలంలో తోటకూర, బచ్చలికూర, మెంతికూర లాంటి వాటిని సాగు చేస్తుంటారు. పంట మార్పిడి తప్పనిసరిగా పాటిస్తుంటారు. విత్తనాలు విత్తిన 30 రోజులలో పాలకూర మొదటి కోత వస్తుంది. తరువాత ప్రతి 20-22 రోజులకు ఒక కోత చొప్పున మొత్తం 3 లేదా 4 కోతలు కోసిన తరువాత మొత్తం దున్ని మరలా తాజాగా విత్తనాలను వేస్తుంటారు.
ఎలాంటి రసాయనిక ఎరువులను భూమికి అందించకుండా కేవలం పశువుల ఎరువును మాత్రమే అందిస్తుంటారు. చీడపీడల నివారణకు నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, పుల్లటి మజ్జిగ, మట్టిద్రావణం లాంటి వాటిని ఉపయోగిస్తుంటారు. ప్రతిరోజు ఒక్కొక్క బెడ్ నుంచి 150 నుంచి 200 కిలోల వరకు అంటే నెలలో సుమారు 20 రోజులకు 3000 కిలోల వరకు తగ్గకుండా ఆకుకూరల దిగుబడి పొంది కిలో 40/- నుంచి 60/- వరకు అమ్మకం చేస్తుంటారు. మామూలుగా పండించే ఆకుకూరలతో పోల్చుకుంటే సేంద్రియ పద్ధతులతో పాలీహౌస్లో పండించే ఆకుకూరలు రెండు, మూడు రోజులు తాజాగా ఉండడము రుచి కూడా బాగా ఉండడం వలన తాము పండించిన ఆకుకూరలను మార్కెట్ చేసుకోవటానికి ఎలాంటి ఇబ్బందులు పడటము లేదు అని, ఏరోజు వచ్చిన దిగుబడిని ఆరోజు అమ్ముకోగలుగుతున్నాము అని, ఒకసారి కొనుగోలు చేసిన కొనుగోలుదారు మరలా మరలా అడిగి కొనుగోలు చేస్తున్నారని కృష్ణమూర్తి వివరించారు. సేంద్రియ పద్ధతిలో రసాయనాలకు పెట్టుబడులు పెట్టనవసరం లేదు, తమ శ్రమనే పెట్టుబడిగా పెట్టి ఆకుకూరలను సాగు చేస్తున్నాము కాబట్టి పెట్టుబడి ఖర్చు బాగా తగ్గుతున్నాయని వీరు వివరిస్తున్నారు. బయట మార్కెట్కు అవసరమయిన ఆకుకూరలు పండించడంతో పాటు తమ ఇంటి అవసరాలకు అవసరమైన మిగతా కూరగాయలు, అల్లం, పసుపు, ఉల్లి, వెల్లుల్లి లాంటి వన్నీ పూర్తి సేంద్రియ పద్ధతులతో పండిస్తూ తాము ఉపయోగిస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా తమ సాగుని కొనసాగిస్తున్నాము అని కృష్ణమూర్తి దపంతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు 9676444600కి ఫోను చేసి తెలుసుకోగలరు.
అముల్ డెయిరీ గురించి గానీ అముల్ బటర్కు అంతర్జాతీయంగా ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి గానీ తెలియని వారు ఉండరు. అముల్ ఉత్పత్తులకు ముఖ్యంగా అముల్ బటర్కు అంతటి కీర్తి రావడానికి దివంగత శ్వేత విప్లవ నేత డాక్టర్ వర్గీస్ కురియన్ యొక్క శక్తి సామర్థ్యాలు, అముల్ డెయిరీ సాంకేతిక సిబ్బంది యొక్క వృత్తి నైపుణ్యాలతో పాటు అముల్ డెయిరీకి పాలను అందించిన సుర్తీ జాతి గేదెల పాలలోని విశిష్టతకు ఒక ముఖ్య కారణమేనని చెప్పక తప్పదు. గుజరాత్ రాష్ట్రంలోని కైరా జిల్లా (ఆనంద్ డెయిరీ పాల సేకరణకు ప్రధాన సరఫరా జిల్లా) సూరత్, వడోదరా, భరూచీ, నడియాద్, తలాఖా ప్రాంతాలలో అభివృద్ధి చెందిన సుర్తీ జాతి గేదెలు సాధారణ చిన్న-మధ్యస్థాయి రైతుల నిర్వహణకు, అక్కడి మేత, వాతావరణ యాజమాన్య పరిస్థితులకు అనుకూలంగా ఉండుటయే కాక, ఎక్కువ పరిమాణంలో అంటే సగటున 7.5 గట్టి వెన్నతో భారతీయ సగటు కంటే చాలా ఎక్కువగానే పాలను అందించగలవు. ఇందుకు ఈ జాతికి వున్న సహజమైన జన్యు శక్తితో పాటు స్థానికంగా సులువుగా, చౌకగా లభ్యమయ్యే ఎక్కువ క్రొవ్వు కలిగిన ప్రత్తి చెక్క నుండి, వేరుశనగ పిండి, ఇతర వ్యవసాయ వ్యర్థాలు కూడా దోహదపడుతున్నాయి. గోధుమ వర్ణ చర్మం కలిగిన సుర్తీ గేదెలు, ముర్రాజాతి పశువులకంటే ఎక్కువగా ఎండ ధాటిని తట్టుకోగలవు. వీటి మధ్యస్థ శరీర తూకం ముర్రా జాతి సగటు పశువు కంటే 75-80 శాతం తక్కువగా ఉండుట వల్ల వీటి నిర్వహణ ముఖ్యంగా తినే మేత పరిమాణం తక్కువగా ఉండి ఆ మేరకు పోషించే ఖర్చులు తగ్గుతాయి. మరోవిధంగా చెప్పాలంటే ఒక్క కొమ్ముల ఆకృతి, కొన్ని శరీర కణాల విషయంలో తప్ప, నాలుగైదు థాబ్దాల క్రితం మన తెలుగు రాష్ట్రాలలో విరివిగా కనిపించే గేదెల మందలలో ఉన్నతమైన నాటు జాతి గేదెలతో వీటిని పోల్చవచ్చును.
అముల్ డెయిరీ వారు గత ఆరుథాబ్దాలుగా అమలు చేస్తున్న పాల పరిమానాన్ని కాక అందులోని వెన్న పరిమాణం (కిలో వెన్న ఆధారిత పాల ధర నిర్ణయ విధానం) ఆధారంగా పాల సేకరణ ధరలు నిర్ణయించుట వల్ల ఎక్కువ వెన్న శాతం కలిగిన సుర్తీ గేదెపాలకు ఎక్కువ ధర రైతులకు గిట్టుబాటు కావటం వల్ల, మధ్య-చిన్న స్థాయి పాల ఉత్పత్తిదారులు సుర్తీ జాతి పాడి గేదెల పట్ల తమ ఆసక్తిని కొనసాగిస్తూ ఉండటం, ఈ జాతిని మరింత లాభదాయకం చేయడానికి, అముల్ డెయిరీ, జాతీయ పాడి అభివృద్ధి సంస్థ మరియు డెయిరీ పరిశోధనా సంస్థలు విశేషమైన కృషిని కొనసాగిస్తున్నాయి.
గోధుమ వర్ణం కలిగిన చర్మం, కొడవలి ఆకృతిలో బల్లపరుపుగా ఉండి ప్రక్కకు క్రిందకు ఆ తర్వాత పైకి వంగి, కొన వద్ద కొక్కెం మాదిరి వంపు తిరిగిన కొమ్ములు, పొడవు-వెడల్పు కలిగిన నుదురు, మెడ క్రింద తెల్లని ఆకర్షణీయమైన రెండు చారలు, ఎగుడుదిగుడు లేకుండా సమాంతరంగా ఉండే వెన్ను సుర్తీ జాతి ముఖ్య లక్షణాలు.
సాధు స్వభావంతో పాటు, మధ్యస్థ శరీర పరిమాణం (400-450 కిలోల శరీర తూకం) ఈ జాతి గేదె పడ్డలు 40-45 నెలల వయసుసలో తొలిసారి ఈని, ఆ తర్వాత యాజమాన్య పరిస్థితులను బట్టి ప్రతి 400-450 రోజులకొకసారి ఈనగలవు. వేసవిలో సైతం ఎదలోకి వచ్చి చూడి కట్టే అవకాశాలు ముర్రా జాతిలో కంటే ఈ సుర్తీ జాతిలోనే ఎక్కువ అని నా వ్యక్తిగత అభిప్రాయం.
ఈ జాతి గేదెలు తొలిఈతలో సగటున 1500 నుండి 1600 లీటర్లు. రెండవ ఈతలో 1900 నుండి 2000 లీటర్లు, మూడవ ఈత నుండి 5-6 ఈతల వరకు 2200 నుండి 2500 లీటర్ల వరకు పాలను ఎక్కువ వెన్న శాతంతో అందించగలవు. పది లీటర్ల ముర్రా గేదె పాలలో ఉండే వెన్న ఎనిమిది-తొమ్మిది లీటర్ల సుర్తీ గేదెల పాలలో ఉంటుందని అముల్ పాల ఉత్పత్తిదారులు చెబుతారు. గరిష్టంగా రోజులో 19 లీటర్లు ఈతలో 3300 లీటర్ల పాలను ఇవ్వగల సత్తా సుర్తీ గేదెలలో ఉంది. ముర్రా గేదెలలో కంటే సుర్తీ జాతిలో పాల ఉత్పత్తి ఎక్కువ స్థిరంగా, నిలకడగా తక్కువ ఒడిదుడుకులతో ఎక్కువ రోజులు ఉండే అవకాశాలు ఎక్కువ. సుర్తీ జాతి గేదెలలో పొదుగువాపు సమస్య కూడా ముర్రా, గ్రేడెడ్ ముర్రా జాతులలో కంటే తక్కువ.
వివిధ సంక్షేమ పథకాల క్రింద మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న ముర్రా గేదెలు చాలామంది లబ్దిదారులకు ఆశించిన ఫలితాలను అందించని విషయం తెలిసిందే! పేద మధ్య తరగతి లబ్దిదారులకు అందుబాటులో ఉన్న పరిమిత వనరులతో సులువుగా పోషించగలిగే సుర్తీగేదెలను మన తెలుగు రాష్ట్రాలలో ప్రోత్సహించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే సుర్తీ జాతి గేదెల గర్భాశయం పొడవు ఎక్కువగా ఉండి, ఈ సమయంలో గర్భసంచి మెలికపడి (టార్షన్) గర్భద్వారం మూసుకు పోయి దూడ బైటకు రావడం జటిలం కావచ్చు. ఈ మెలికను నిపుణుడైన, అనుభవజ్ఞుడైన పశువైద్యుడు మాత్రమే సులువుగా సరిదిద్ది ప్రసవాన్ని సులభతరం చేయగలడు. అనుభవం లేని వారు మొరటుగా బలప్రయోగంతో దూడకు బైటకు లాగాలనే ప్రయత్నం వల్ల దూడతో పాటు తల్లి ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చును. అయినా అలవాటుగా క్రమంగా పశువుగా పశువుల ప్రాణాలకు బీమా చేయిస్తే దీనివల్ల ఆర్థిక నష్టాలను నివారించుకోవచ్చు.
తాజాగా ‘ఆక్స్ఫామ్’ సంస్థ విడుదల చేసిన నివేదిక భారతదేశంలోని ప్రజల మధ్య నెలకొన్న తీవ్ర ఆర్థిక అసమానతలను ఎత్తిచూపింది. దేశంలోని అత్యంత ధనికులైన పది శాతం మంది దేశ సంపదలో 77 శాతాన్ని తమ చేతుల్లో బంధించారు. 2017లో దేశంలో సృష్టించబడ్డ అదనపు సంపదలో 73 శాతం అత్యంత ధనికులైన ఒక శాతం మందికి దక్కింది. దేశంలో 67 కోట్ల పేదలకందరికీ కలిపి దక్కింది ఒక్క శాతం మాత్రమే. దేశ ప్రధాని తరచుగా నినదించే ‘సబ్కీ సాథ్, సబ్ కో వికాస్’ (అందరితో కలిసి అందరి అభివృద్ధి) మంత్రంలోని డొల్లతనాన్ని పై గణాంకాలు బట్టబయలు చేసాయి. దేశంలో వ్యవసాయరంగంపై ఆధారపడుతున్న రైతులు, కౌలుదార్లు, వ్యవసాయ కూలీల్లో 99 శాతం మంది అత్యంత పేదల్లోనే ఉన్నారని చెప్పటానికి ఆధారాలు కోకొల్లలు.
గత రెండు శతాబ్దాల ప్రపంచ చరిత్రను గమనిస్తే వ్యవసాయరంగంపై ఆధారపడ్డవారు పేదలుగా మారిన ఉదంతాలు పుష్కలంగా ఉన్నాయి. పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించినా, సోషలిజం ఎండమావివైపు పరిగెత్తినా, మిశ్రమ ఆర్ధిక విధానాలను అనుసరించినా, దేశాలన్నింటిలోనూ వ్యవసాయరంగం నీరసించటం, పారిశ్రామిక రంగం, సేవారంగం బలపడటం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారవేత్తలు ఈ కొత్తరంగాలను స్వాధీనం చేసుకోవటం, ఆర్థికంగా లాభించిన వారు ప్రభుత్వాలను శాసించటం, సాంకేతిక ప్రగతి వారి నిచ్చెలకు మెట్లు కావటం చర్విత చరణమే. ఆదాయం తగ్గుతున్న కొద్దీ వ్యవసాయరంగం నుండి శ్రామికులు నిష్క్రమించి, ఇతర రంగాల్లో ఉపాధి పొందగలిగిన దేశాల్లో వ్యవసాయంలో మిగిలినవారు కనీస జీవన ప్రమాణాలను అనుభవిస్తున్నారు. కాని దక్షిణాసియా దేశాల్లో, ముఖ్యంగా భారతదేశంలో వేరే ఉపాధి మార్గాలను అనుసరించే పెట్టుబడి, అవకాశాలు, నైపుణ్యం, వ్యవహార దక్షత లేక పంజరాల్లో చిలకల్లా చిక్కి, ఆర్థికంగా దోపిడీకి గురై శల్యమౌతున్నారు. జాతీయోత్పత్తిలో 14 శాతం వాటా ఉన్న వ్యవసాయరంగంపై దాదాపు 50 శాతం ఆధారపడటం వల్ల వారి సగటు ఆదాయం జాతీయ సగటు ఆదాయంలో సగం కన్నా తక్కువగా ఉంటున్నది. కమతాలు చిన్నవిగా ఉండటం వల్ల రైతులు, ఖర్చులతో పాటు కౌలు భారం వల్ల కౌలుదారులు, ఎక్కువ రోజులు పనిదొరకనందువల్ల వ్యవసాయ కూలీలు అతితక్కువ ఆదాయాలు పొందగలుగుతున్నారు. కుటుంబ ఖర్చులు పెరుగుతుండటం, ఆదాయాల్లో వృద్ధిలేకపోవటంతో అప్పుల పాలవుతున్నారు.
ఆదాయ సంక్షోభం
ప్రభుత్వ దృష్టిలో వ్యవసాయ రంగంలో సంక్షోభమే లేదు. గిరాకీ మించిన లభ్యత ఉండటం వల్ల ఆహార ధాన్యాల కొరత లేదు. వంట నూనెలు, అపరాలు మాత్రమే దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. దిగుమతుల విలువను మించి వ్యవసాయ ఎగుమతులుండటం వల్ల ప్రభుత్వాలు ఆందోళన చెందడం లేదు. అయితే రైతులు, కూలీల ఆదాయాల విషయంలో మాత్రం సంక్షోభం తీవ్రతరమౌతున్నది. 1991లో నూతన ఆర్థిక విధానాలను అవలంబించడం మొదలైన తర్వాత ఈ సంక్షోభం ఎక్కువైంది. 1998 నుండి 2004 మధ్య ఎన్.డి.ఏ. ప్రభుత్వ కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు బాగా తగ్గాయి. రైతుల ఆదాయాలు తగ్గటంతో వ్యవసాయ కూలీలకు లభించే కూలి రేట్లు స్తబ్ధంగా ఉండిపోయాయి. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ తగ్గింది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, పారిశ్రామిక ఉత్పత్తుల ధరల మధ్య నిష్పత్తి తగ్గి, వ్యాపార తులనాత్మకత దెబ్బతిని, వ్యవసాయ రంగం దెబ్బతిన్నది. రైతుల ఆత్మహత్యలు దేశంలోని అనేక ప్రాంతాలలో పెరిగిపోయాయి. 1998-2004 మధ్య వ్యవసాయరంగం కేవలం 1.76 శాతం చొప్పున మాత్రమే ప్రతి ఏటా పెరిగింది. అయితే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గటం వల్ల మధ్యతరగతి వారు, పట్టణ ప్రజలు సంతోషించారు. విదేశీ పెట్టుబడిదారులు, దేశీయ తయారీదార్లు లాభాలు సంపాదించారు. అధికారంలో ఉన్న పార్టీ ‘దేశం వెలిగిపోతుంది’ అని ప్రచారం చేసింది. ద్రవ్యోల్బణం తగ్గటం, ఆర్థిక లోటు అదుపులో ఉండటం, విదేశీ పెట్టుబడులు పెరగటం ఆ ప్రచారానికి దోహదపడింది. కాని గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయేతర గ్రామీణ ప్రజలు ఆర్థికంగా దిగజారిపోయారు. గ్రామీణ ప్రజల అసంతృప్తిని పరిగణనలోకి తీసుకోకుండా ప్రసార మాధ్యమాలు ఎన్.డి.ఏ. తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని జోశ్యం చెప్పాయి. కాని 2004లో జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాలు వెలిగిపోవటం లేదని నిరూపించాయి. యూ.పి.ఏ. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది.
కొంతపుంజుకున్న వ్యవసాయరంగం
కాంగ్రెసు పార్టీ నాయకత్వంలో పనిచేసిన యూ.పి.ఏ. పదేళ్ళపాటు అధికారంలో ఉంది. 2004-05 నుండి 2012-13 వరకు వ్యవసాయాభివృద్ధి రేటు సాలీనా 3.84 శాతంగా నమోదైంది. అయితే 2013-14 వ సంవత్సరంలో ఈ రంగం కొంత వెనుకంజ వేయటం వల్ల 2004-05 నుండి 2013-14 మధ్య వ్యవసాయాభివృద్ధి రేటు 3.5 శాతంగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగటం ఇందుకు దోహదపడింది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలను భారీగా పెంచింది. 2004-05లో వరి ధాన్యానికి మద్దతు ధర క్వింటాలుకి 560 రూపాయలు. 2013-14లో ఆ మద్దతు ధర రూ. 1310/- పెరిగింది. యూ.పి.ఏ. పాలించిన పదేళ్ళ కాలంలో వరికి కనీస మద్దతు ధర 134 శాతం పెరిగింది. గోధుమ మద్ధతు ధర 2004-05లో క్వింటాలుకి రూ. 640/-గా ఉండగా, 2013-14లో ఆ మద్దతు ధర క్వింటాలుకి రూ. 1400/-కి పెరిగింది. పదేళ్ళకాలంలో గోధుమ మద్దతు ధర 119 శాతం పెరిగింది. ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు కూడా ఆకర్షణీయమైన ధరలు లభించాయి. ఫలితంగా 2004-05 నుండి 2011-12 మధ్య రైతుల ఆదాయాలు సాలీనా 5.52 శాతం పెరిగాయి. ఈ కాలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, జాతీయ ఆహార భద్రతా చట్టం, సమాచార హక్కు చట్టం వంటి ప్రగతిశీల పథకాలు అమలయ్యాయి. వాటివల్ల వ్యవసాయ కార్మికులకు, గ్రామీణ పేదలకు మేలు జరిగింది. 2008-13 మధ్య కూలీరేట్లు ఏటా 6 శాతం చొప్పున పెరిగాయి. ద్రవ్యోల్బణపు ప్రభావాన్ని తీసివేయగా వాస్తవంగా కూలిరేట్లలో ఏర్పడ్డ వృద్ధి ఆ స్థాయిలో ఉంది. రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల స్థితిగతులు మెరుగవటంతో ఈ పదేళ్ళ కాలంలో దేశంలో పేదరికం గణనీయంగా తగ్గింది. 2004-05లో వ్యవసాయ ధరలు పారిశ్రామిక ధరల నిష్పత్తి సూచీ 85గా ఉండగా, 2010-11లో అది 103కి పెరిగింది. కొంతమేరకు వ్యవసాయరంగానికి న్యాయం జరిగినట్లు ఈ సూచీ తెలియజేస్తున్నది. ఇదేకాక వ్యవసాయరంగానికి బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన వంటి బృహత్తర పథకాన్ని ప్రవేశపెట్టటం వల్ల దీర్ఘకాల పెట్టుబడుల్లో వృద్ధి సంభవించింది. రసాయన ఎరువుల వినియోగం కూడా బాగా పెరిగింది. 2000-01లో 16.7 మిలియన్ టన్నుల రసాయనక ఎరువుల్ని వాడగా 2010-11లో అది 28.1 మిలియన్ టన్నులకు పెరిగింది. 2004-05లో ట్రాక్టర్ కొనుగోళ్ళు 2 లక్షల 47 వేలుండగా, 2013-14లో అవి 6 లక్షల 97 వేలకు పెరిగాయి. పవర్ టిల్లర్ల కొనుగోళ్ళు 2004-05లో 17,481 యూనిట్లుగా ఉండగా 2013-14కి అవి 56,000కి పెరిగాయి. అలాగే రైతులకిచ్చే సంస్థాగత రుణాలు కూడా ఈ పదేళ్ళ కాలంలో బాగా పెరిగాయి. యూ.పి.ఏ. ప్రభుత్వ కాలంలో వ్యవసాయరంగంలో పెట్టుబడులు, దిగుబడి ఆదాయాలు, కూలిరేట్లు, గ్రామీణ ఉపాధి అవకాశాలు పెరగటం వల్ల వ్యవసాయ రంగం కొంత వరకు తేరుకుంది. గ్రామీణ పేదరికం తగ్గింది. అయితే చివరి రెండు సంవత్సరాల్లో వ్యవసాయ ప్రగతి కొంత మందగించింది.
మళ్ళీ గ్రహణం
2014లో ఎన్.డి.ఏ. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. యూ.పి.ఏ. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు గుప్పించి, విదేశాల్లో దాచ్చుకున్న నల్లధనాన్ని తెచ్చి, ప్రజలకు పంచుతామనే వాగ్ధానంతో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చారు. పాత ప్రభుత్వంలో అవినీతి జరిగినట్లు నిరూపించిందీలేదు, ఎవరినీ శిక్షించిందీ లేదు. విదేశాల నుండి నల్లధనాన్ని తెచ్చిందీ లేదు. వ్యవసాయరంగం నుండి శ్రద్ధ మరల్చి, తమకు మద్దతు పలికిన పెట్టుబడిదారులు, మధ్యతరగతి ప్రయోజనాలకు పెద్దపీట వేశారు. 2014, 2015 సంవత్సరాల్లో ఏర్పడిన కరవు పరిస్థితులు కూడా వ్యవసాయాదాయాలను దెబ్బతీశాయి. 2013-14లో వ్యవసాయ రంగానికి కేటియంచిన బడ్జెట్తో పోలిస్తే 2015-16 బడ్జెట్లో కేటాయింపులు 25 శాతం తగ్గాయి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తీసివేస్తే వాస్తవ కేటాయింపులు ఇంకా తక్కువ. 2016-17లో కేటాయింపులు పెరిగినా 2013-14లో కేటాయింపుల స్థాయికి చేరుకోలేదు. 2017-18, 2018-19లో కేటాయింపులు పెరిగినట్లు కనిపిస్తున్నది. కాని అది వాస్తవంగా పెరగలేదు. 2016-17 వరకు వడ్డీపై ఇచ్చే రాయితీని, బీమాపై సబ్సిడీలను ఆర్థిక శాఖ పద్దుల్లో చూపించే వారు. కాని 2017-18 నుండి దానిని వ్యవసాయ శాఖ కేటాయింపుల్లో చూపిస్తున్నారు. ఇలా తెలివితేటల్ని ప్రదర్శించి, వ్యవసాయానికి సాయం పెంచుతున్నట్లు చెప్పుకున్నారు. 2013-14 నుండి 2017-18 వరకు వ్యవసాయరంగంలో పెరుగుదల రేటు 2.9 శాతానికి తగ్గింది. ఇది భౌతికంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో కనిపించిన పెరుగుదల రేటు. వ్యవసాయరంగంలో జోడించిన విలువను పరిశీలిస్తే సాలీనా 0.5 శాతం వృద్ధి మాత్రమే ఉంది. అది కూడా ఉద్యాన పంటలు, అనుబంధ రంగాల్లో మాత్రమే ధనాత్మక మార్పు ఉంది. మూడింట రెండు వంతుల వాటా ఉన్న సాంప్రదాయ పంటల్లో జోడించిన విలువలో తగ్గుదలే ఉంది. 2011-12 నుండి 2017-18 వరకు రైతుల ఆదాయాలు సాలీనా 1.36 శాతం తగ్గుదల నమోదైంది. 2010-11లో 28.1 మిలియన్ టన్నుల ఎరువుల్ని వాడగా 2016-17లో 26 మిలియన్ టన్నులకు తగ్గింది. ట్రాక్టర్ల కొనుగోళ్ళు 2013-14లో 6.97 లక్షలుండగా 2016-17లో అవి 5.82 లక్షలకు తగ్గింది. పవర్ టిల్లర్ల కొనుగోళ్ళు 2013-14లో 56వేలుండగా, 2016-17లో 45,200 కు తగ్గాయి. రుణ వితరణ కూడా మందగించింది. రైతుల రుణ భారం పెరిగినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. వ్యవసాయరంగంలో ప్రభుత్వ పెట్టుబడుల్లో సాలీనా ఒక శాతం తగ్గుదల నమోదైంది. వ్యవసాయ ధరలు-పారిశ్రామిక ధరలు నిష్పత్తి సూచీ 2015-16లో 97కి తగ్గింది. కేంద్ర ప్రభుత్వం చమురు ధరలు అంతర్జాతీయంగా పెరిగినప్పుడు దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరల్ని పెంచుతున్నది. కాని ముడిచమురు ధరలు తగ్గినప్పుడు పెట్రోలు, డీజిలు ధరలను తగ్గించటం లేదు. 2016లో వెలువడ్డ నోట్ల రద్దు నిర్ణయం అసంఘటిత రంగంపై చావు దెబ్బకొట్టింది. వ్యవసాయ కార్మికుల నిజవేతనాలు 2014 నుండి 2018 మధ్య సాలీనా 0.87 శాతం మాత్రమే పెరిగాయి. వ్యవసాయేతర గ్రామీణ కార్మికుల నిజవేతనాల్లో వృద్ధి సాలీనా 0.23 శాతం మాత్రమే ఉంది. వ్యవసాయ ఎగుమతులు మందగించాయి. అవకాశాలున్నప్పుడు ఎగుమతులపై ఆంక్షలు పెట్టడం వల్ల రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆదాయం రెట్టింపు నినాదం ప్రహసనంగా మిగలటంతో దానిపైన సమీక్షలే లేకుండా పోయాయి. కరోనా కాలంలో గిరాకీ లేక, మార్కెట్లు పనిచేయక కోళ్ళ పరిశ్రమ, కూరగాయల ఉత్పత్తిదార్లు దెబ్బతిన్నారు. కరోనా తగ్గిన తర్వాత కూడా వ్యవసాయాదాయాల్లో చెప్పుకోదగ్గ మార్పు లేదు. 2017 నుండి 2021 వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రైతు ఆందోళనలు వారి అసంతృప్తికి అద్దం పట్టాయి.
భవిష్యత్తు నిరాశాజనకం
ఇప్పటివరకు పొందుపరిచిన ప్రభుత్వ గణాంకాలు వ్యవసాయోత్పత్తులు పెరుగుతున్నా, రైతులు, కౌలుదార్లు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయేతర గ్రామీణ కార్మికులు ఆదాయ సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నారని స్పష్టం చేస్తున్నాయి. 1998-2004 మధ్య వ్యవసాయ సంక్షోభం తీవ్రమైంది. 2004 నుండి 2014 వరకు వ్యవసాయరంగం, రైతు, కూలీలు కొంత తేరుకున్నట్లు తెలుస్తుంది. 2014 తర్వాత రైతులు, కూలీలు, వ్యవసాయేతర గ్రామీణ పరిశ్రమ కార్మికులు ఆదాయ నష్టాన్ని అనుభవిస్తున్నారు. ఆక్స్ ఫామ్ సంస్థ వెలువరించిన ఆదాయ వ్యత్యాసాల నివేదిక దేశంలో తీవ్రతరమౌతున్న ఆర్థిక అసమానతలను వెల్లడించింది. గ్రామీణ రంగంలో ఉన్న రైతు, కార్మికులు, పట్టణ పేదలు దేశ ప్రగతిలో వాటాను పొందలేకపోతున్నారు. ఆదాయ వంచితులు దేశంలో అత్యధికులుగా ఉన్నా వారి మధ్య ఐక్యత లోపించటం వల్ల రాజకీయ ప్రత్యామ్నాయం బలపడటం లేదు. ఈ సంవత్సరం బడ్జెట్లో రానున్న ఎన్నికల దృష్ట్యా వ్యవసాయ, గ్రామీణ రంగాలకు కొన్ని తాయిలాలు లభించవచ్చు. అభివృద్ధి ఫలాలు విస్తృతంగా పంపిణీ కాకుంటే దేశం ముందుకు వెళ్ళదు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో మూడవ పెద్ద వ్యవస్థగా అవతరించడం అనే ఎండమావులుగానే మిగలవచ్చు.
డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త,
APCOB మేనేజింగ్ డైరెక్టర్ డా|| ఆర్. శ్రీనాథ్ రెడ్డి
రైతులు పండిరచిన పంటలను నేరుగా అమ్ముకోకుండా వాటిని ప్రొసెసింగ్ చేసుకుని వినియోగదారులకు అమ్ముకొన్నట్లయితే అధిక ఆదాయం పొందవచ్చని మే 15న రైతునేస్తం ఫౌండేషన్ను సందర్శించిన APCOB మేనేజింగ్ డైరెక్టర్ డా|| ఆర్. శ్రీనాథ్ రెడ్డి అన్నారు. రైతులు ఏక పంటలు కాకుండా మిశ్రమ పంటలను సాగు చేసుకోవాలి. వ్యవసాయంతో పాటు పశువులు, కోళ్ళు, గొర్రెలు, మేకల పెంపకం కూడా చేపట్టినట్లయితే రైతుకు అధిక ఆదాయంతో పాటు భూమికి కావలసిన సేంద్రియ పదార్థాన్ని పొందవచ్చు. రసాయనిక ఎరువులు వాడకుండా సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువులను ఉపయోగించినట్లయితే భూమి ఆరోగ్యంతో పాటు ప్రజలకు మంచి ఉత్పత్తులను అందించవచ్చు. పర్యావరణాన్ని కాపాడడమే కాకుండా సమస్త జీవరాశులను కాపాడుకోగలుగుతాము. రైతులు కూడా తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని పొందే మార్గాలను తెలుసుకొని ఆచరణలో పెట్టాలి. రైతులకు చిన్న చిన్న ఫుడ్ ప్రొసెసింగ్ యంత్ర పరికరాలకు ఋణాలను కూడా APCOB ద్వారా ఇవ్వడం జరుగుతుంది. రైతునేస్తంలో జరుగుతున్న వివిధ రకాల ఫుడ్ ప్రొసెసింగ్ యంత్ర పరికరాలను తమ అధికారులకు కూడా చూపించడం జరిగింది. రైతులకు కావలసిన ఈ యంత్ర పరికరాలకు ఋణాలను వ్యక్తిగతంగా మరియు గ్రూపులకు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో APCOB అధికారులు మరియు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.
సేంద్రియ సాగు విధానానికి సంబంధించిన వివిధ రకాల కషాయాలు మరియు ద్రావణాలు మరియు పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్న వివిధ రకాల పంటలను ప్రత్యక్షంగా తిలకించారు. వీటితో పాటు దేశీయ జాతి గోవులతో ఏర్పాటు చేసిన గోశాలను సందర్శించి గోవ్యర్ధాలను ఏ విధంగా వ్యవసాయంలో వినియోగిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించగలిగే వివిధ ఉత్పత్తులను ఉదాహరణకు గోవ్యర్ధాలతో పిడకలు, ప్రమిదలు లాంటి ఉప ఉత్పత్తులు, కట్టెగానుగతో నూనె చేసే ప్రక్రియను, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడిరపుకు సంబంధించిన యంత్రపరికరాలైన బిస్కెట్ల తయారీ యంత్రాన్ని, టమోటా సాస్ తయారు చేసే ప్రక్రియను, చిరుధాన్యాల ప్రొసెసింగ్ యంత్రాలను, చిరుధాన్యాలతో వివిధ రకాల వంటకాలు తయారుచేసే విధానాలను ప్రత్యక్షంగా తిలకించడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశంగా మరియు రైతులకు అదనపు ఆదాయ వనరుగా ఉపయోపడే తేనెపెట్టెలను, పుట్టగొడుగుల తయారీ యూనిట్ను ప్రత్యక్షంగా సందర్శించి రైతులకు మరియు నిరుద్యోగులకు ‘రైతునేస్తం ఫౌండేషన్’ అందించే సేవలను అభినందించారు.
మన దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు నిరుద్యోగం మరియు రైతులకు వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం. మన దేశ జనాభా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నిరుద్యోగుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. రెండో వైపు మన దేశ ప్రధాన రంగమైన వ్యవసాయంలో రైతులు సరైన లాభాలు ఆర్జించలేకపోతున్నారు. ఈ రెండు సమస్యలకు తన వంతు పరిష్కారం చూపించడంలో రైతునేస్తం ఫౌండేషన్ మార్గదర్శిగా ఉందని మే 5న రైతునేస్తం ఫౌండేషన్ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.ఆర్. గోపాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రస్తుతం మన రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పంటల సాగులో పెట్టుబడులు పెరిగి రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. దానికి సంబంధించి రైతులు రసాయన వ్యవసాయాన్ని వదిలి సేంద్రియబాట పట్టగలిగితే పెట్టుబడులు తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన దిగుబడులు లభిస్తాయి. సేంద్రియ సాగు విధానానికి సంబంధించిన వివిధ రకాల కషాయాలు మరియు ద్రావణాలు మరియు పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్న వివిధ రకాల పంటలను ప్రత్యక్షంగా తిలకించారు. వీటితో పాటు దేశీయ జాతి గోవులతో ఏర్పాటు చేసిన గోశాలను సందర్శించి గోవ్యర్ధాలను ఏ విధంగా వ్యవసాయంలో వినియోగిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా నిరోద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించగలిగే వివిధ ఉత్పత్తులను ఉదాహరణకు గోవ్యర్ధాలతో పిడకలు, ప్రమిదలు లాంటి ఉప ఉత్పత్తులు, కట్టెగానుగతో నూనె చేసే ప్రక్రియను, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడిరపుకు సంబంధించిన యంత్రపరికరాలైన బిస్కెట్ల తయారీ యంత్రాన్ని, టమోటా సాస్ తయారు చేసే ప్రక్రియను, చిరుధాన్యాల ప్రొసెసింగ్ యంత్రాలను, చిరుధాన్యాలతో వివిధ రకాల వంటకాలు తయారుచేసే విధానాలను ప్రత్యక్షంగా తిలకించడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశంగా మరియు రైతులకు అదనపు ఆదాయ వనరుగా ఉపయోపడే తేనెపెట్టెలను, పుట్టగొడుగుల తయారీ యూనిట్ను ప్రత్యక్షంగా సందర్శించి రైతులకు మరియు నిరుద్యోగులకు రైతునేస్తం ఫౌండేషన్ అందించే సేవలను అభినందించారు.
వ్యవసాయ దేశమైన మన దేశంలో రైతులు పంటల సాగుతో పాటు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల లాంటి వాటిని పోషిస్తూ జీవితాలను కొనసాగిస్తున్నారనే విషయం అందరికి తెలిసిందే. ఒకప్పడు పంటఉన్న ప్రతి ఒక్కరికీ పాడి తప్పనిసరిగా ఉండేది. కాని రాను రాను వివిధ రకాల కారణాల వలన పాడిపంటల మధ్య దూరం ఏర్పడిరది. అయినా కాని మన దేశంలో పాడి పశువుల పోషణ ఏ మాత్రం తగ్గకుండా కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. పాడి పశువులు రోగాల బారిన పడినప్పుడు పాడి రైతులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిగతా ఇబ్బందులతో పోల్చుకుంటే పాడి పశువులకు చికిత్స విషయంలో ఎక్కువ ఖర్చులు భరించవలసి వస్తుంది. పాడి పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ ఖర్చులు అవ్వడం వలన పాడి రైతులకు పశుపోషణ గిట్టుబాటు కావడం లేదు. ఇందుకు సరైన పరిష్కారం హోమియో చికిత్సా విధానం. హోమియో చికిత్స విధానంలో తక్కవ ఖర్చులతో పాడి పశువులను రోగాల బారిన పడకుండా మరియు రోగాల బారి నుండి కాపాడవచ్చని గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలోని రైతునేస్తం ఫౌండేషన్లో పశుగణాలకు హోమియో చికిత్సా విధానంపై మే 25న జరిగిన (264వ వారం) ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో పశువైద్య నిపుణులు వి.వి.ఆర్.కె. శాస్త్రి అన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్య నిపుణులు శర్మ, ములగలేటి శివరాం, శివసాగర్ రెడ్డి, రైతునేస్తం ఫౌండేషన్ మేనేజరు ప్రసాదరావు పొల్గొన్నారు.
మూగజీవాలకు సేవ చేయగలగడం మన అదృష్టంగా భావించవచ్చు. ఎన్నో జన్మల పుణ్యకర్మల వలననే మనము ఈ వృత్తిలో ఉండగలిగాము. కాబట్టి వచ్చిన అదృష్టాన్ని సక్రమంగా నిలుపుకోవాలంటే స్వార్ధం లేకుండా మూగజీవాలకు సేవ చేయగలగాలి. మనిషి లాగా మూగ జీవాలు తమ ఇబ్బందులను నోటితో చెప్పలేవు గనుక వాటి పరిస్ధితులను గమనిస్తూ మనమే వాటికి ఎదురయ్యే సమస్యలను గుర్తించి అందుకు సరైన వైద్యం అందించగలగాలి. పశువులకు కూడా అలోపతి, ఆయుర్వేద, హోమియోపతి, నాటు వైద్యం లాంటి అనేక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిలో ఖర్చు తక్కువతో ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపని వైద్య విధానం హోమియోపతి అని చెప్పవచ్చు. ఈ విధానంలో పశువుకి వచ్చిన రోగ లక్షణాలను బట్టి హోమియోపతి మందులు అందించవలసి ఉంటుంది. కాబట్టి పశువైద్యలందరూ హోమియోపతి వైద్య విధానం గురించి కక్షుణ్ణంగా తెలుసుకోగలిగితే తమ ప్రాంతంలోని రైతులకు మంచి సలహాలు అందించగలరు. రైతులు పశుపోషణ వైపు మక్కువ పెంచుకోవాలంటే హోమియోపతి వైద్య విధానం బాగా ఉపయోగపడుతుందని వివరించారు. అనంతరం సర్టిఫికెట్లు అందజేశారు.
గుంటూరు సమీపంలోని చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్శిటి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ విభాగంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ మరియు ‘నాబార్డు’ సంయుక్త ఆధ్వర్యంలో ‘పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అండ్ వాల్యూ అడిషన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్’ అనే అంశంపై రైతులకు నిర్వహించిన ఐదు రోజుల శిక్షణలో భాగంగా ఏప్రిల్ 28న కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ను సందర్శించింది రైతుల బృందం. రైతునేస్తం ఫౌండేషన్లో వాల్యూ ఎడిషన్కి సంబంధించి ఏర్పాటు చేసిన యంత్రపరికరాల గురించి వివరిస్తూ విలువ జోడిరపుతోనే రైతుకు అధిక ఆదాయం అని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. యడ్లపల్లి వేంకటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్త టి.వి. రమణారావు పాల్గొన్నారు.
రైతునేస్తం ఫౌండేషన్లో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలతో పాటు సేంద్రియ సాగుకు అవసరమైన కషాయాలు, మిశ్రమాల తయారీ విధానాన్ని విపులంగా అడిగి తెలుసుకున్నారు. వీటితో పాటు కట్టెగానుగతో నూనె తీసే పద్ధతుల్ని, వానపాముల ఎరువు తయారీ విధానాన్ని, తేనేటీగల పెంపకాన్ని, పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రత్యక్షంగా సందర్శించి తెలుసుకోవడంతోపాటు కూరగాయలకు విలువ జోడిరపు పద్ధతులు (ఉదాహరణకు ఎండు మిరపకాయలను కారంపొడి తయారు చేయడం, టమోటాలను పల్ప్ తయారు చేయు విధానాలను) ప్రత్యక్షంగా సందర్శించి వాటి వివరాలను, కూరగాయలకు విలువ జోడిరచడం వలన వచ్చే ఉపయోగాలను విపులంగా రైతునేస్తం సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. తమ శిక్షణలో భాగంగా రైతునేస్తం ఫౌండేషన్ సందర్శించి తమకు ఉపయోగపడే ఎన్నో విషయాలను తెలుసుకోవడంతోపాటు కొన్నింటిని ప్రత్యక్షంగా చూడడం మాకు చాలా ఆనందంగా ఉందనీ, వీటిని ప్రత్యక్షంగా చూడడం వలన వీటికి అవసరమైన నైపుణ్యాల గురించి మాకు అవగాహన వచ్చింది కాబట్టి ఈ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత మేము తమకు అవకాశం ఉన్నంతవరకు తాము ఇలాంటి ఉపాధి అవకాశాలలో అడుగుపెట్టి వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడిరపును ఉపాధిగా మార్చుకొని ఆర్ధికంగా బలపడగలమని మాకు నమ్మకం కలిగిందని వివరిస్తూ ఈ అవకాశం కల్పించిన రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వేంకటేశ్వరరావుకు రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.
పంట కోతానంతరం పండ్లు, కూరగాయలను ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే కోత పద్ధతుల ప్రాముఖ్యత చాలా ఉంటుంది. పంట పక్వతను అర్థం చేసుకోవాలి. పంటను కోసే విధానం మీద కూడా పంట నిల్వ సామర్థ్యం, నాణ్యత ఆధారపడి ఉంటుంది. పంటను సరైన సమయంలో వాటి పక్వథను సరిగా అర్థం చేసుకోవడం మీద దృష్టిసారిస్తే అధిక మొత్తంలో పంట ఉత్పత్తులను అమ్ముకునే అవకాశాన్ని కల్పించుకున్న వారవుతారు. సాధారణంగా పక్వత అనేది పండ్లు, కూరగాయలు, ఇతర ధాన్యాలను వినియోగదారుడు ప్రత్యక్షంగా ఉపయోగించగలిగే స్థితికి లేదా ఏదైనా ప్రాసెసింగ్ ఉత్పత్తుల తయారీకి కావాల్సిన పక్వథకు పంట చేరుకోవడం. పంటను బట్టి ఇవి రెండు ఒకే థలో లేదా వేరువేరు థల్లో చేయవచ్చు.
పక్వత సూచిక ఆధారంగా కోతలు
పక్వత సూచిక అంటే ఏదైనా పంట దాని పక్వ థకు చేరుకుందా లేదా అని తెలిపేది. సాధారణంగా రైతులు కొన్నిఅంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని పంట పక్వతను నిర్ధారించుకొని కోతలు కోస్తారు. తద్వారా పంటను మార్కెట్లో గ్రేడింగ్ చేయడం ద్వారా సరైన పక్వథలో లేని పండ్లు, కూరగాయలు అతి తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, పక్వానికి ముందుగానే లేదా చాలా ఆలస్యంగా కోస్తే పంటకోత తర్వాత వ్యాధుల బారిన పడతాయి. సరైన సమయంలో పండ్లను కోసుకుంటే హానికరమైన రసాయన మందులతో పండ్లను పండించే పరిస్థితులు కూడా ఏర్పడవు. తద్వారా ప్రజల ఆరోగ్యాలకు ఎలాంటి ముప్పు సంభవించకుండా నివారించవచ్చు. పక్వత సూచికలు నిర్ధారించే అంశాలను ప్రధానంగా క్యాలెండరు తేదిని బట్టి లేదా పూత లేదా పిందె కాసినప్పటి నుంచి రోజుల లెక్కింపును బట్టి భౌతిక, రసాయన పరీక్షలపై ఆధారపడి నిర్ణయిస్తారు.
పక్వతను నిర్ధారించే అంశాలు:
పంట పూత థ నుంచి రోజుల లెక్కింపు ఉదా: ఆపిల్, మామిడి, బత్తాయి, నారింజ, నిమ్మ.
పిందె కాసినప్పటి నుంచి రోజుల లెక్కింపు ఉదా: అరటి, మామిడి
పండు గట్టిదనం ఆధారంగా ఉదా: ఆపిల్, కర్బూజ మొదలైనవి.
పిండి పదార్థాల శాతం ఆధారంగా ఉదా: అరటి, ఆపిల్
పండ్లలోని రసం శాతం ఆధారంగా ఉదా: బత్తాయి, నారింజ, నిమ్మ
పండ్లలోని ఆమ్లశాతం లేదా చక్కెర, ఆమ్ల నిష్పత్తి ఉదా: బత్తాయి, నారింజ, నిమ్మ, పైనాపిల్
చక్కెర శాతం ఆధారంగా ఉదా: పుచ్చకాయ, కర్బూజ, ద్రాక్ష
పండు లోపలి రంగు, నిర్మాణ క్రమం ఉదా: పుచ్చకాయ, కర్బూజ
పండు దృఢత్వం
కాడ లేదా తీగ నుంచి కాయ వదులుకొనేలా తయారవ్వడం ఆధారంగా ఉదా: కర్బూజ
రైతులు మరిన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని వారికి కావాల్సిన పక్వత సూచిక ప్రకారం పండ్లు, కూరగాయలను కోస్తే మరింత ఆదాయం చేకూరుతుంది. పండ్లు, కూరగాయలను ఉపయోగించే వివిధ రకాల అవసరాల దృష్ట్యా వాటి పక్వత సూచికలను శారీరక, వాణిజ్య, కోతకు అనువైన పక్వతలుగా నిర్ణయిస్తారు.
పండ్ల శారీరక పక్వత: చెట్టుకు ఉన్న కాయ సహజసిద్ధంగా చెందాల్సిన అభివృద్ధి లేదా ఎదుగుదలను చెట్టుమీదనే పూర్తిగా ముగించుకుని ఒక నిర్ధిష్ట పక్వథకు చేరుకుంటుంది. తదుపరి కాయ చెట్టు నుంచి వేరు చేసిన తర్వాత కూడా ఈ కాయ చెట్టు మీదనే ఉన్న తీరులో పక్వతకు చేరుకుని దాని పక్వ ప్రక్రియను కొనసాగిస్తుంది. ఈ థలో పండును చెట్టు నుంచి వేరు చేసిన కావాల్సిన కనీస నాణ్యతలో పండు ఉపయోగపడుతుంది.
వాణిజ్య పక్వత: ఇది కాయ ఏదైనా అభివృద్ధి థ కావచ్చు. ఈ థలో పండును కోయడం జరుగుతుంది. ఈ థను వినియోగదారుని వాణిజ్య, ఇతర ప్రాసెసింగ్ అవసరాలకు అనుగుణంగా నిర్ణయిస్తారు. అనగా పండ్లను కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే కోయవచ్చు లేదా బాగా మగ్గిన తర్వాత కూడా కోయవచ్చు. అది దానిని ఉపయోగించే విధానం మీద ఆధారపడుతుంది.
కోతకు అనువైన పక్వత: కాయ లేదా పండు సరైన అభివృద్ధి థలో వినియోగదారుని దగ్గరకు తీసుకొచ్చే విధంగా నిర్ణయిస్తారు. ఈ థలో పండ్లు సరైన పక్వథలో తినడానికి, ఇతర అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ సూచికలను రైతు ఏ అవసరం కోసం ఉపయోగిస్తున్నారనేది దృష్టిలో పెట్టుకొని కోసుకోవాల్సి ఉంటుంది.
పండ్ల తోటల్లో పక్వత: కొన్ని రకాల పండ్లు చెట్టు నుంచి వేరుచేశాక మరికొన్ని వేరుచేయకముందు వాటి పక్వతను కొనసాగిస్తాయి. మొక్క లేదా చెట్టు నుంచి కాయలు వేరు చేసిన తర్వాత కూడా దాని పక్వత కొనసాగే ఆపిల్, మామిడి, అరటి, బొప్పాయి, జామ, సపోటా మొదలైన వాటిని కొంచెం దృఢంగా ఉన్నప్పుడే రైతులు కోసుకొని రవాణా చేసుకోవాలి. తర్వాత సహజ పద్ధతుల్లో పండ్లను పక్వానికి పెట్టుకోవచ్చు. చెట్టు నుంచి కాయను వేరుచేసిన తర్వాత కాయలు పండటం ఆగిపోయే దానిమ్మ, పుచ్చ, ద్రాక్ష, నిమ్మ, బత్తాయి, నారింజ, పైనాపిల్ మొదలైన పండ్లను తప్పనిసరిగా చెట్టుకు ఉన్నప్పుడే మగ్గనిచ్చి లేదా పూర్తిగా వృద్ధి చెందనిచ్చిన తర్వాత కోయాలి. అరటి, మామిడి, బొప్పాయి, సపోట, జామ, దానిమ్మ, నిమ్మ, పుచ్చకాయ మొదలైనవి అధికంగా తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. వాటి పక్వథలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
మామిడి: సహజ సిద్ధంగా మామిడి చెట్టు నుంచి కాయలు రాలిపడుతుంటే పక్వథగా గుర్తించి రైతులు కాయలు కోస్తారు. దీనికి ఇంకా కొన్ని శాస్త్రీయ పద్ధతులు కూడా ఉన్నాయి.
మామిడి కాయ ఉపరితలం రంగు ముదురు ఆకుపచ్చ నుంచి లేత ఆకుపచ్చకు మారడం, లోపలి కండ భాగం గోధుమ తెలుపు వర్ణంలోకి మారడం, దాని రూపంలో లేదా ఆకృతిలో వృద్ధి, సాపేక్ష సాంద్రత 1 నుంచి 1.02 గా ఉండాలి. దీనిని పరీక్షించాలంటే ఒక బకెట్టులో నీళ్ళు తీసుకొని అందులో మామిడి పండ్లు వేయాలి. మునిగిన వాటిని పక్వథకు వచ్చినవిగా గుర్తించాలి. తేలినవి ఇంకా వృద్ధి చెందాల్సి ఉన్నట్లు గుర్తించాలి. కాయ గట్టిదనం 12 కి./చ.సెం.మీ. కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మొత్తం కరిగి ఉన్న ఘనపదార్థాల శాతం (టి.ఎస్.ఎస్) 8 నుంచి 11 శాతంగా ఉన్నప్పుడు, మామిడి పిందెలు కాసినప్పటి నుంచి 12 లేదా 16 వారాల సమయంలో పక్వథకు చేరుకుంటుందని గుర్తించాలి.
నిమ్మలో: సహజంగా నిమ్మ పిందె కాసినప్పటి నుంచి 165-195 రోజులకు పక్వథకు చేరుకుంటుంది. నిమ్మకాయల కోతకు ప్రధానంగా రంగు, పరిమాణం గమనిస్తారు. కాయరంగు ఆకుపచ్చ నుంచి పసుపు పచ్చకు మారే సమయంలో కోసుకోవచ్చు. కాయ పరిమాణం 5 సెం.మీ. వ్యాసం తగ్గకుండా చూసుకోవాలి. దీని కోసం ఏదైనా ఇనుప లేదా అల్యూమినియం తీగను 5 సెం.మీ. వ్యాసంతో గుండ్రంగా తయారు చేసుకొని నిమ్మ పండును ఆ పరిమాణంకు సరిగా వృద్ధి చెందిందా లేదా అని పరీక్షించుకోవచ్చు. కాయలో 28%, ఆపైన రసం ఉన్నప్పుడు, ఆమ్ల శాతం 9గా ఉన్నప్పుడు సరైన పక్వథగా గుర్తించాలి.
జామ: జామకాయ రంగు ముదురు ఆకుపచ్చ నుంచి లేత ఆకుపచ్చ రంగుకు మారుతుంది. సాపేక్ష సాంద్రత 1గా ఉండాలి. పూత పూసినప్పటి నుంచి 120, 150 రోజుల మధ్యలో జామ పక్వథకు చేరుకుంటుంది. మొత్తం కరిగిన ఘనపదార్థాల శాతం 12 నుంచి 14 శాతం కలిగి ఉంటే పక్వథకు చేరినట్లు గుర్తించాలి.
సపోటాలో: సపోటాను పక్వథ దాటాక కోస్తే డాగుపడి త్వరగా చితికి, పాడైపోతాయి. కాబట్టి కొద్దిపాటి గట్టిదనం ఉన్నప్పుడే కాయలను కోయాలి. పూత పూసినపుడు మొదలుకొని 240 నుంచి 270 రోజుల్లో సపోటా పక్వథకు చేరుకుంటుంది. సపోటాలు తేలికపాటి గోధుమ రంగు నుంచి ముదురు గోధుమ రంగుకు మారతాయి. కాయను పట్టుకున్నప్పుడు పొడుంపొడుంగా చేతిలో రాలిపోతుంది. అంటే పండు పైన ఉంటే పొడుం తగ్గిపోతుంది. కాయ బరువు 65 నుంచి 70 గ్రా. మధ్య, సాపేక్ష సాంద్రత 1.025 నుంచి 1.057 మధ్య ఉన్నప్పుడు కోయాలి. కాయ భాగాల నుంచి తెల్లని రబ్బరులా ఉండే పాలు స్రవించడం తగ్గిపోతుంది. చేతివేలితో లేదా గోరుతో సపోటా తోలు తొలగించినపుడు లోపలి పండు భాగం పసుపు రంగులో కన్పిస్తుంది.
బొప్పాయిలో: పక్వథకు చేరిన బొప్పాయి రంగు ఆకుపచ్చ నుంచి పసుపుపచ్చకు మారడం అందరికీ తెలిసిందే. కాయ అడుగు భాగంలో మొదటగా పసుపుపచ్చగా మారడం గమనిస్తూ, కాయ మూడోవంతు వరకు రంగు వ్యాపిస్తే అప్పుడు కాయలను కోసుకోవచ్చు. అలాగే మొత్తం కరిగి ఉన్న ఘనపదార్థాల శాతం (టి.ఎస్.ఎస్.) 7 నుంచి 11 శాతంగా కోతకు తయారైనట్లు గుర్తించాలి.
పుచ్చకాయలో: పుచ్చకాయలను మొక్క కాడ లేదా తీగలకు ఉన్నప్పుడే పూర్తిగా వృద్ధి చెందనిచ్చి తర్వాత మొక్క నుంచి వేరు చేస్తారు. ఎందుకంటే వేరుపరచిన తర్వాత కాయలోపల రంగు, గుజ్జు, చక్కెర శాతం మొదలైన పదార్థాల అభివృద్ధి ఆగిపోతుంది. సహజంగా పుచ్చకాయ నేలను తాకి ఉన్న అడుగు ప్రాంతంలో కాయ తెల్లని ఊదారంగు నుంచి గోధుమ పసుపు రంగులోకి మారినట్లు గమనిస్తే అది పక్వానికి లేదా పూర్తి వృద్ధికి సంకేతం. అలాగే కాయకు ఉన్న కాడ లేదా తీగ వాడిపోవడం మొదలైతే అది కూడా పక్వథను తెలియజేస్తుంది. ముఖ్యంగా కాయను బాహ్యరంగును బట్టి నిర్ణయించలేము. కానీ, కాయ లోపలి భాగంలో గమనిస్తే గింజ చుట్టు గుజ్జు అతుక్కోవడం ఆగిపోయి, గింజ గట్టిగా తయారై, గుజ్జురంగు ఎరుపుగా, గుజ్జు పటుత్వంతో పెళుసుగా ఉండటం పక్వానికి సూచికలు, మొత్తం కరిగి ఉన్న ఘన పదార్థాలు (టి.ఎస్.ఎస్.) 10 శాతంగా ఉన్నప్పుడు పుచ్చకాయలను కోసుకోవాలి.
అరటిలో: అరటి కాయ తొక్క, గుజ్జు నిష్పత్తి 0.5 గా ఉండాలి. అరటికాయ పొట్టను గమనిస్తే బాగా సూటి కోణాలుగా కాకుండా గుండ్రంగా మారుతుంది. అడ్డుకోతలో అరటికాయ గుండ్రంగా ఉండాలి. ముప్పావు వంతు కాయ ఎదుగుదల లేదా మొదల్లో సులువుగా తెగిపోయే లేదా విరిగిపోయే స్థితికి అరటి చేరుకోవడం అనేవి పక్వతకు సంకేతాలుగా సూచిస్తారు.
దానిమ్మలో: పూత పూసినపుడు మొదలుకొని 130 నుంచి 140 రోజుల మధ్యలో పక్వథకు చేరుకుంటుంది. కాయలు పసుపురంగు నుంచి ముదురు ఎరుపు రంగుకు మారతాయి. కాయ కింద భాగంలో ఉండే పుష్పకోశం ముడుచుకుంటుంది. పక్వథకు చేరుకున్న దానిమ్మను చేతివేళ్ళతో నొక్కితే లోపల విత్తనాలు పగులుతున్న శబ్దం వినిపిస్తుంది. సరిగ్గా పక్వమైన పండ్లను వేలిగోళ్ళతో సులభంగా తీయవచ్చు. దానిమ్మ రసం పూర్తిగా ఎరుపురంగులో కనిపించడం, ఆమ్ల శాతం 1.85 గా ఉండటం పక్వథకు సంకేతాలు.
కె. సాధన (9940236076), డా|| జె.డి. సరిత, డా. బి. పుష్పావతి, వ్యవసాయ కళాశాల, పాలెం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ.
ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, గుఱ్ఱాలు ఆహారంగా పచ్చిమేత, ఆకులు తింటూ ఉంటాయి. పొలంలో దొరికే పచ్చగడ్డి, గరిక, కణుపు గడ్డి, ఇంగ్లీష్ గడ్డి రకరకాల పచ్చిమేతను తెచ్చి పెడుతూ ఉంటారు. అలాగే రైతులు చిక్కుడు జాతి మొక్కలు అలసంద, లూసర్న్, జనుము, పిల్లిపెసర మొదలగు వాటినీ పాడి పశువుల మేతకోరకు పెంచుతుంటారు. పచ్చగడ్డితో బాటు ఎండుగడ్డి, యితర ఎండు మేతలు, యింకా తవుడు, కొబ్బరి, వేరుశనగ, పత్తి, నువ్వు చెక్కలు మేపుతుంటారు. పశువులు పచ్చిమేత ఇష్టంగా తింటాయి. మనకళ్ళముందు కనిపించే కోడి, కుక్క, గుఱ్ఱం, మనిషి నెమరు వేసే అవకాశం లేదు. వాటి ఆహారనాళం వేరే విధంగా ఉంటుంది. వీటికి ఒకటే జీర్ణాశయం ఉంటుంది. తిన్న ఆహారం అందులో జీర్ణం అయిన తరువాత ప్రేవులను చేరుకుంటుంది. వాటితో పోల్చుకుంటే నెమరువేయు జంతువుల ఆహార వ్యవస్థ భిన్నంగానూ, క్లిష్టంగానూ ఉంటుంది. ఆహారనాళం పొడవుగా, పరిమాణం ఎక్కువగా, ఆహారం ఎక్కువ సమయం ఉండడానికి వీలుగా తయారు చేయబడింది. పాడిపశువు ఆహారంలో పీచు పదార్ధం ఎక్కువ అది జీర్ణమవడానికి సమయం పడుతుంది.
అసలు పాడి పశువులకు పచ్చిమేత ఎందుకు కావాలి
పాడి పశువుకు పచ్చిమేత ఎందుకు పెట్టాలి, మనలా వండిన అన్నం, కూర, సాంబారు, పెరుగు ఎందుకు పెట్టకూడదని అనుమానం వస్తూ వుంటుంది. అంతేకాదు ఎక్కువ దాణా ఎండుమేత పెట్టడం వలన అధిక పాల ఉత్పత్తి చేయవచ్చును కదా అని అడుగుతుంటారు. పందెపు ఎద్దులకు, బండలు లాగేవాటికి విచిత్రంగా నెయ్యి, మాంసాహారం, పాలు, జీడిపప్పు వగైరాలు పెట్టి పోషణ చేస్తుంటారు. పండుగ రోజుల్లో ఆవులకు, దూడలకు ప్రేమగా బూరెలు, గారెలు, పరమాన్నం పెట్టి రైతమ్మలు అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. రోడ్ల మీద తిరిగే అనాధ ఆవులు బజారులో దొరికే ఆకుకూరలు, వదిలేసిన కూరగాయలు తింటూ ఉంటాయి. దేవాలయాల దగ్గర కొబ్బరిముక్కలు, అరటిపండ్లూ ఆరగిస్తూ ఉంటాయి. గ్రామాలలో ఊరుమ్మడి ఆంబోతులకు నూకలు, పెసలు, మినుములు, తెలగపిండి మొదలగువాటిని ప్రేమతో గృహస్తులు నోటికి అందిస్తుంటారు. ఈనిన ఆవుకు దంచిన ఒడ్లు, జొన్నలు, ఉడికించిన నూకలు ఆనవాయితీగా వడ్డిస్తుంటారు. ఇక కాయ కష్టం చేసే ఎడ్లకు ఉలవలు ఉడకబెట్టి దాయ వేసి తినిపించడం చూస్తుంటాము.
ఆవులు గేదెలు ఏమి తినాలి అనేది ఎవరు నిర్ణయించాలి
ప్రధానంగా అవి తినే మేత వాటి శరీరవసరాలకు అనుగుణంగా ఉండాలి. తేలికగా జీర్ణమవడం పూర్తిగా శోషణం చెందడం ముఖ్యం. మనకు పాలు, ఉత్పత్తులు అపారంగా ఇస్తుండాలి. రైతుకు తక్కువ ఖర్చు ఎక్కువ రాబడి ఉండాలి. సంతతి వృద్ధి చెందడానికి తోడ్పడాలి. సులభంగా దొరకాలి. అటువంటి మేత ఏదైనా ఉందా అంటే అది పచ్చిమేత మాత్రమె. ప్రస్తుతం మన దగ్గర ఉన్న జంతువులు ఒకప్పుడు అరణ్యాలలో మసులుతూ ఉండేవి. మానవులు వాటిని పెంపకం చేసి తమ అవసరాలకు అనుగుణంగా పెంపుడు జంతువులుగా మార్చివేసారు. కాలక్రమీణ వాటి జీవన విధానం, అలవాట్లు, నడవడిక కొంత మారడం జరిగింది. కాని వాటి శరీర నిర్మాణం, అవయవాల పని, సహజలక్షణాలు మారలేదు. కొన్ని వేల సంవత్సరాల నుండి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మనుషుల దగ్గర జీవిస్తూ ఉన్నా వాటి సహజ గుణాలు, అవసరాలు అలానే ఉన్నాయి. అందువలన అవి తినే ఆహారం వాటికి అనుగుణంగా ఉండాలి. మన యిష్టాయిష్టాలతో పనిలేదు. కాని మన ఇష్టానుసారం పాల ఉత్పత్తి పెంచాం. మాంసం కొరకు కొత్త జాతులను సృష్టించాం. ఈ పరిణామంలో అధిక ఉత్పత్తులతో పాటు కొన్ని అవలక్షణాలు వచ్చాయ్. అధిక పాల ఉత్పత్తి చేసే ఆవుల పొదుగు భారీగా ఉంటుంది. కాళ్ళ మధ్య అడ్డం పడుతూ ఉంటుంది. నడవ లేవు. సరీగా పండుకోలేవు. వీటి బరువు భరించలేని కాళ్ళు, గిట్టలు, నొప్పులకు గాయాలకు లోనవుతాయి. ఆహారంలో గింజలు, పిండిపదార్ధం అధికంగా ఉంటే మనుషుల మాదిరి వాటికీ అసిడిటి వస్తుంది. మాంసానికి పెంచే పశు జాతులలో కడుపుబ్బరం, గిట్టలలో పుండ్లు, ఈనలేక పోవడం వస్తుంటాయి. మన ప్రయోజనాల కొరకు పాడి పశువును ఎంత మార్చినా అస్సలు మారని విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఆహారనాళం. రెండవది ఆవు శరీరంలో పాలు తయారీ ప్రక్రియ. మూడవది ప్రత్యుత్పత్తి. ఇక్కడ ఆహార నాళం గురించి తెలుసుకుందాం. పాలు తయారీ విధానం, ప్రత్యుత్పత్తుల గురించి తరువాత తెలుసుకుందాము.
శరీర నిర్మాణం
ఆసలు విషయం తెలియాలంటే ఆవు, గేదే శరీరనిర్మాణం తెలుసుకోవాలి. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు నెమరు వేయు జంతువులు. ఆహారం తిన్న తరువాత విశ్రాంతి సమయంలో ముందుగ తిన్న ఆహారాన్ని నోటిలోకి తెచ్చుకుని నములుతూ ఉంటాయి. బాగా నమిలిన ఆహారం గుజ్జు, నీరుగా మారిన పిదప ఆ ద్రవాన్ని మింగుతాయి. అలా బాగా నమిలి మింగిన ఆహారం అబోమజం (జులీళిళీబిరీతిళీ), ప్రేవుల (|దీశిలిరీశిరిదీలి) లోకి చేరుకొని శోషణం (జులీరీళిజీచీశిరిళిదీ) చెందుతుంది. నెమరువేయ జంతువుల (ష్ట్రతిళీరిదీబిదీశిరీ) జీర్ణాశయం నాలుగు భాగాలుగా విభజించబడి ఉంటుంది. అతి పెద్దభాగం రూమేన్ (ష్ట్రతిళీలిదీ). ఇది 50-100 లీటర్లు ఆ పైన పదార్ధాలు పట్టేంత విశాలంగా ఉంటుంది. ఆవు తిన్న ఆహారం రూమేన్ లో చేరి 12 నుండి 24 గంటలు అక్కడనే ఉంటుంది. ఆ సమయంలో తిన్న ఆహారం పులుస్తుంది (ఓలిళీలిదీశిబిశిరిళిదీ). రూమేన్లో ఉండే సూక్ష్మజీవులు తిన్న ఆహారాన్ని పులియ చేస్తాయి. రూమేన్లో అనేకరకాలు సూక్ష్మజీవులు ఉంటాయి. ఒక మిల్లిలీటరు రూమేన్ ద్రవంలో 25 బిలియన్ల సూక్ష్మక్రిములు (ఔబిబీశిలిజీరిబి), 10 మిలియన్ల ఏకకణజీవులు (ఆజీళిశిళిచిళిబి), పదివేల శైలేంద్రాలు (ఓతిదీవీరి) ఉంటాయి. ఇవి జీవించడానికి 39 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నిలకడగా ఉంటుంది. రూమేన్ పీహెచ్ 6-7 మధ్యన ఉండాలి. ఈ రూమేన్ లో కొన్ని ‘బి’ విటమినులు తయారవుతాయి. రూమేన్ లోపలి గోడలు మూకస్ మెంబ్రేన్ ద్వారా కొన్ని పదార్ధాలను, పోషకాలను, నీటిని పీల్చుకుంటాయి. రూమేన్ వాతావరణం కొద్దిగ మారిందంటే సూక్ష్మజీవుల ప్రపంచం తలకిందులవుతుంది. నాణ్యత లేని మేత, తొందరపాటు ఆహారం మార్పులు, నిస్సారమైన మేత, ఆవులను తరలించడం, ఎండ వేడిమి, ఒత్తిడి మొదలగు అంశాలు సూక్ష్మజీవుల ఉనికిని నాశనం చేస్తాయి. వాటి మనుగడ మీద ఆవు, గేదె జీవితం ఆధారపడి ఉంటుంది. అందువల్లనే ‘సూక్ష్మజీవులను బాగా చూసుకుంటే ఆ సూక్ష్మజీవులే ఆవును, గేదెను చూసుకుంటాయి’ (ఉళిళిది బితీశిలిజీ శినీలి ళీరిబీజీళిలీలిరీ బిదీఖి శినీలిగి గీరిజిజి జిళిళిది బితీశిలిజీ శినీలి బీళిగీ) అని పశు ఆహార శాస్త్రం (జుదీరిళీబిజి శ్రీతిశిజీరిశిరిళిదీ) చెబుతుంది. రూమేన్ తరువాత రెటిక్యులం (ష్ట్రలిశిరిబీతిజితిళీ) ఒమేజం (ంళీబిరీతిళీ) అబోమేజం (జులీళిళీలిరీతిళీ) అను భాగాలుంటాయి. మనుషుల కడుపు (ఐశిళిళీబిబీనీ) ఎలా పనిచేస్తుందో ఆవులు, గేదెలలో అబోమేజం అలా పనిచేస్తుంది. మనుషులకు కడుపు (ఐశిళిళీబిబీనీ) ఒక్కటే అయితే నెమరువేయు ఆవు, గేదెల కడుపు నాలుగు భాగాలుగా, పెద్దగా, విశాలంగా ఉండి వేరువేరు పనులు చేస్తూ మనిషి తినడానికి పనికిరాని పచ్చగడ్డి, ఎండుమేత, దాణాల నుండి పోషక పదార్ధాలను సేకరించి అబోమేజం కు పంపిస్తే అబోమేజం మనుషులలోని కడుపు మాదిరి వ్యవహరిస్తూంది.
లాలాజలం
సుమారు 100 లీటర్ల నుంచి 150 లీటర్ల లాలాజలం ఒక రోజులో తయారవుతుంది. ఈ లాలాజలం రూమేన్లో ఆమ్లం పెరగకుండ అక్కడి వాతావరణాన్ని మధ్యస్తంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. లాలాజలంలో సోడియం (శ్రీబి), పొటాషియం (చ) ధాతువులు రూమేన్ పీహెచ్ లో మార్పులు రాకుండా నిలకడగా ఉంచేందుకు ప్రయత్నిస్తాయి. ఆహారం తింటున్నపుడు నమలడానికి ఆహారనాళంలో మెత్తగా దిగడానికి లాలాజలం సహాయ పడుతుంది. తినే మేతనుబట్టి లాలాజలం ఊరుతూ ఉంటుంది. దాణాలు, గింజలు, చెక్కలు, తవుడు వంటివి పొడి రూపంలో ఉంటాయి. వాటిలో పీచు తక్కువ ఉంటుంది. గనుక ఎక్కువ సేపు నెమరువేయవలసిన అవసరం ఉండదు. అపుడు లాలాజలం కొద్దిగా ఉత్పత్తి అవుతుంది. తక్కువ ఉత్పత్తి అయిన లాలాజలం రూమేన్లోని పీహెచ్ని అదుపులో ఉంచలేదు. ఆమ్లం పెరగడం మూలంగా సూక్ష్మజీవులు నశించి పోతాయి. తిన్న ఆహారం జీర్ణం కాదు. తగినంత లాలాజలం ఆవు నోటిలో తాయారు అవ్వడానికి ఆహారంలో పీచు పదార్ధం ఉండాలి. ఆ పీచు పదార్ధం పచ్చిమేతలో ఉంటుంది గనుక సరిపోయినంత పచ్చిమేతను పెట్టాలి. ఎండుమేత లో పుష్కలంగా పీచు ఉంటుంది. అది తింటే ఎక్కువ లాలాజలం ఉత్పత్తి అయ్యేమాట నిజమే కాని ఆవులు గేదెలు ఎక్కువ ఎండుగడ్డి తినలేవు. 100 కిలోగ్రాముల శరీర బరువుకు 1.25-1.5కిలోగ్రాముల ఎండుగడ్డి తినగలవు. అంతకు మించి తినలేవు. పైగా అందులో పోషక పదార్ధములు బహు స్వల్పంగా ఉంటాయి. అటువంటిదే జొన్న చొప్ప, చెరకు పిప్పి, శనగ పొట్టు, పత్తి గింజల పొట్టు. ఎండుగడ్డి కన్నా ఇవి కొంచెం మేలు.
పోషక పదార్ధములు
పెంపుడు జంతువులు అనేక రకాలుగా మానవులకు సేవ చేస్తున్నాయి. ఒకప్పుడు రవాణా సాధనాలుగా, వ్యవసాయానికి, పాలకు, మాంసానికి, చర్మానికి, ఇతరత్రా ఉపయోగపడే పశువులు ఇపుడు అధికంగా పాలకు, మాంసానికి ఉపయోగపడుతున్నాయి. ఈ మార్పుల కారణంగా మగ పశువుల ప్రాముఖ్యత తగ్గి వాటి సంఖ్య నానాటికి తరిగి పోతుంది. పశువులకు కావలసిన పోషక పదార్ధములు పచ్చిమేత ద్వారానే సులభంగాను, చవుకగాను లభిస్తాయి. గొర్రెలకు 91%, మాంసం కొరకు పెంచే గొడ్డులకు 83%, గుఱ్ఱాలకు 72%, పాడి పశువులకు 61%, పందులకు 15% పోషక పదార్ధములు పచ్చిమేతలోనే లభిస్తున్నాయి. పాడి పశువుల విషయానికి వస్తే ఆవులు, గేదెలు అధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్నాయి. పాలలో మాంసకృత్తులు, లాక్టోజ్, విటమినులు, ఖనిజాలు మొదలగు పోషక పదార్ధములు ఉండడం మూలాన పాలు పెద్దలకు, పిన్నలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, తల్లులకు, ఎదుగుతున్న పిల్లలకు శ్రేష్టం అని ఇస్తుంటారు. అవ్వన్నీ పాలలోకి రావడానికి ఆవు మేతలో పోషకాలు కావాలి. మేతలో పోషక పదార్దముల నిష్పత్తిలో కొంచెం తేడా వచ్చినా పాల ఉత్పత్తిలో మార్పులొస్తాయి. పాలఉత్పత్తిదారులకు పాల దిగుబడి పై అంచనాలుంటాయి. అవి అందుకోడానికి యజమానులు తీవ్రంగా కృషి చేస్తుంటారు. పరాయి రాష్ట్రాల నుండి ముర్రా గేదెలను, సంకరజాతి ఆవులను తెచ్చి పెంచాలని ప్రయత్నం చేస్తాము. అక్కడి వాతావరణం, మేత, నీరు వేరుగా ఉండడం, పోషణ, పాలన తేడాలుండడం వలన పాల ఉత్పత్తిలో తేడాలొస్తాయి.
పచ్చిమేత
పచ్చిమేతలో పోషక పదార్ధములు ఉంటాయి. సులభంగా జీర్ణం అవుతుంది. రూమేన్లోని సూక్ష్మజీవులను పోషిస్తుంది. పీచు పదార్ధం కలిగిన పచ్చిమేత రూమేన్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తక్కువ ఖర్చుతో వస్తుంది. ఆవు, గేదె తినే పచ్చగడ్డి, మొక్కలలో 75% పిండి పదార్ధములు ఉంటాయి. రూమేన్లో ఉండే సూక్ష్మజీవులు ఈ పిండిపదార్ధములను పులియపెట్టడం ద్వారా చక్కెరగా మారుస్తాయి. సూక్ష్మక్రిములు తమ ఎదుగుదలకు అవసరమగు శక్తిని ఈ చక్కెర నుండి గ్రహించి మిగిలిన దానిని ఆవు కొరకు ఒలటైల్ ఫాటి ఆసిడ్స్ (ఙఓజు) అందిస్తాయి. ఈ ప్రక్రియలో బొగ్గుపులుసు వాయువు (్పుబిజీలీళిదీ ఖిరిళినిరిఖిలి), మిధేన్ (ఖలిశినీబిదీలి) వాయువులు వెలువడతాయి. తక్కువ నాణ్యత గల పచ్చిమేత పాడి పశువును ఆకర్షించదు. వాటిని తక్కువ తింటాయి. ఆలస్యంగా తింటాయి. వాటిలో తక్కువ పోషకాలు ఉంటాయి. పచ్చిమేత రెండు రకాలు. ఒకటి చిక్కుడు జాతి మొక్కలనుండి (ఉలివీతిళీరిదీళితిరీ) లభించేది. అవి పిల్లిపెసర, జనుము, అలసంద, ఉలవలు, లూసర్న్, బర్సీమ్ మొదలగునవి. చిక్కుడు జాతి గ్రాసంలో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. రెండవది సాధారణంగా లభించే పచ్చిమేత హైబ్రిడ్ నేపియర్, పారగ్రాస్, గిని గ్రాస్, రోడ్స్ గ్రాస్ (ఖళిదీళిబీళిశి స్త్రజీబిరీరీలిరీ), రాగులు, సజ్జలు, గోధుమలు (ఈరిబీళిశి స్త్రజీబిరీరీలిరీ) మొదలగునవి. ఇంకా సుబాబుల్, మల్బరీ, పనస, తుమ్మ వృక్షాల ఆకులు పశువుల మేతకు ఉపయోగపడతాయి. మన ఆవులు ,గేదెలు రోజుకు 30కిలోగ్రాముల మేత తింటే అందులో 65-70% పచ్చిమేత 20-25% ఎండుమేత 15-18% దాణా ఉండాలి. ఈ నిష్పత్తి పాల ఉత్పత్తి, శరీర స్థితి, నెలల చూడి మొదలగు అంశాలపై ఆధారపడి ఉంటుంది. పచ్చిమేత ఆవును, గేదెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పాల ఉత్పత్తి పెంచుతుంది. పాల నాణ్యత పెరుగుతుంది. పచ్చిమేత పుష్కలంగా ఉన్నపటకి ఎండుమేత కొంత ఉండడం అవసరం. పశుగ్రాసంలో మాంసకృత్తులు పీచు పదార్ధం వుంటాయి. లేత పశుగ్రాసంలో మాంసకృత్తులు అధికంగాను పీచు పదార్ధం తక్కువగా ఉంటుంది. తగినంత పీచు లేకుంటే మాంసకృత్తులు అమోనియాగా మారి యూరియా రూపంలో (ఔఏశ్రీ) రక్తంలో తిరుగుతూ ఉంటుంది. పాలలో యూరియా (ఖఏశ్రీ) కనిపిస్తుంది. ఇది ప్రత్యుత్పత్తికి సహకరించదు. అందువలన ఎండుమేతను తప్పనిసరిగా కొంత వేయవలసి వస్తుంది. ఎండబెట్టిన జనుము, పిల్లిపెసర, జొన్నచొప్ప, గోధుమ చొప్ప, లూసర్న్ మొదలగు వాటిని ఎండుమేతగా మేపవచ్చును. సమతుల్యంగా పచ్చిమేత, ఎండుమేత, దాణాలు, విటమినులు, ఖనిజ లవణాలు, విషపదార్ధాలను నిర్భందించేవి (ఊళినిరిదీ లీరిదీఖిలిజీరీ), ప్రయోజనకరమైన కొన్ని అధరవులు (ఓలిలిఖి జుఖిఖిరిశిరిఖీలిరీ) అధిక పాలు ఉత్పత్తి చేసే ఆవులకు, గేదెలకు మేపాలి. ఏప్రిల్ నెలలో ఉత్తరప్రదేశ్ లోని ముజఫీర్నగర్ లో పశుప్రదర్శన అందాల పోటీలు నిర్వహించారు. అందులో ఒక ఆవు 65 లీటర్ల పాలు ఇస్తుందని రోజుకు 3 సార్లు పాలు పిండాలని వివరించారు. ఆ ఆవుకు ఎటువంటి మేతవేయాలి. ఏమి పెట్టాలి. ఎంత తినిపించాలి. ఆలోచించండి.
ఎక్కువ ఎండుగడ్డి దాణాలతో మేపడం సాధ్యంకాదు
ఎక్కువ ఎండుగడ్డి వేస్తే అందులో ఎక్కువ పీచు ఉంటుంది. పీచుపదార్ధం అధికంగా ఉంటె ఎక్కువ సేపు నెమరు వేయాలి. లాలాజలం ఎక్కువ ఉత్పత్తి చేయాలి. ఎండుగడ్డి 45% మాత్రమే జీర్ణం అవుతుంది. జీర్ణం కావడానికి 50 గంటలు పడుతుంది. జీర్ణం అవడానికి అంతసేపు జీర్ణాశయంలో ఉంటే శరీరానికి కావలసిన పోషకపదార్ధములు ఆవుకు ఎప్పుడు లభిస్తాయి. అందులో పోషక పదార్ధములు తక్కువగా ఉంటాయి. మేత తక్కువ తినడం మూలాన పోషక పదార్ధములు పాల ఉత్పత్తికి సరిపడా అందవు. పాల ఉత్పత్తి తగ్గుతుంది. అందువలన పోషకపదార్ధములు సమకూర్చడానికి దాణాలు, చెక్కలు, గింజలు మేతలో అధికం చేయాలి. అలా చేయడం వలన ఆమ్లములు రూమేన్లో పుట్టి అసిడిటి వస్తుంది. ఆసిడ్స్ సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి. దానితో రూమేన్ వాతావరణం మారిపోతుంది. ఎండుగడ్డి ఆహారంగా ఉంటే నమలగా వచ్చిన గుజ్జు నెమ్మదిగా ఆలస్యంగా ఆహారనాళంలో కదులుతుంది. ఆహారనాళం నిండి పోతుంది. చాలినంత ఆహారం తినలేవు. ఎండుగడ్డి ఒక మిల్లిమీటర్ ముక్కలుగా మారిన తరువాతనే రూమేన్ నుండి కదులుతుంది. అందువలన ఎండుగడ్డిని చిన్న ముక్కలుగా కత్తిరించి మేపాల్సి ఉంటుంది. యంత్రం సహాయంతో ఎండుగడ్డిని ముక్కలు చేయాల్సి ఉంటుంది. ఎండుగడ్డిని ఎండుమేతగా పరిగణించరాదు. ఎండుగడ్డిలో ఉన్న ఆక్జాలిక్ ఆసిడ్ శరీరంలోని కాల్షియంను బయటకు పంపిస్తుంది.
ఆర్గానిక్ మిల్క్… సేంద్రీయ పద్దతులలో పాలఉత్పత్తి రాబోయే కాలంలో ప్రజాదరణ పొందుతుంది. దాణాలు తక్కువ వేసి అధిక శాతం పశుగ్రాసాలతో మేపడం ద్వారా ఆర్గానిక్ మిల్క్ పొందుతారు. సేంద్రీయ పాల ఉత్పత్తికి రసాయనిక ఎరువులు, కీటక నిర్మూలకాలు (ఆలిరీశిరిబీరిఖిలిరీ), సూక్ష్మక్రిమి సంహారక నిరోధక ఔషధములు (జుదీశిరిలీరిళిశిరిబీరీ) వాడడం నిషేధం. ఆవు పేడ, మూత్రం వగైరా సేంద్రీయ ఎరువులు ఉపయోగించి పశుగ్రాసం పెంచవలసి వస్తుంది. సహజవనరులతో వనమూలికల సహాయంతో మొక్కల చీడను తొలగించ వలసి వస్తుంది. గనుక శ్రేష్ఠమైన పశు గ్రాసం పెంచాలి.
ఒమేగా ఫేటి ఆసిడ్స్
ఆవు పాలలో 3.5%, గేదె పాలలో 7% కొవ్వు ఉంటుంది. అందులో అనేకరకాల కొవ్వు ఆమ్లములుంటాయి. మనం తాగే పాలలో ఒమేగా 6, ఒమేగా 3, ఒమేగా 9 కొవ్వు ఆమ్లములు ఉంటాయి. ఒమేగా 6 తినడం వలన గుండె జబ్బులు, చక్కర వ్యాధి, బరువు పెరగడం వస్తాయని వైద్య శాస్త్రం చెబుతుంది. బదులుగా ఒమేగా 3, ఒమేగా 9 మంచిదని ఆహారంలో అదే ఎక్కువ ఉండాలని అంటారు. మన పాడి పశువులు అధికంగా పచ్చగడ్డి తిని ఇచ్చిన పాలలో ఒమేగా 6 తక్కువ, ఒమేగా 3, ఒమేగా 9 ఎక్కువ ఉండడం వలన పాలు తాగేవారందరూ ఆరోగ్యంగా ఉంటారు. వినియోగదారుల ఆరోగ్యం పాల ఉత్పత్తిదారులకు రక్ష.
కాన్జుగేటెడ్ లినోలిక్ ఆమ్లము
ఈకొవ్వు ఆమ్లము ఒక్కటే రొమ్ము, ప్రోస్ట్రేట్, కొలోన్, ఒవేరియన్, ల్యుకీమియా, మెలనోమ కాన్సర్ వ్యాధులనుండి కాపాడుతుందని ప్రయోగాలలో రుజువు అయ్యింది. బరువు తగ్గడానికి, మూసుకుపోయిన రక్తనాళాలు తెరిపించడానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి, చక్కర వ్యాధికి, ఎముకలు గట్టిగా మారడానికి ఉపయోగపడుతుంది. ఈ కొవ్వు ఆమ్లము ఉపయోగించి మానవులకు స్వస్థత చేకూర్చాలని ప్రపంచం ఎదురు చూస్తుంది. పచ్చిమేత వేసి పెంచే ఆవు పాలు తాగుతున్న స్త్రీలలో రొమ్ము కాన్సర్ తక్కువని ఫిన్లాండ్ దేశంలో జరిపిన ఆధ్యాయనాలు చెబుతున్నాయి. ఫ్రాన్స్ దేశంలో కూడా పచ్చిమేత తిన్న ఆవు పాలు తాగిన తల్లులలో రొమ్ము కాన్సర్ తక్కువ అని నిర్ధారించారు. కాన్జుగేటెడ్ లినోలిక్ ఆమ్లము ఆవు పాలల్లోని కొవ్వు నుండి లభిస్తుంది. పచ్చిక బయళ్ళులో మేసిన ఆవుల పాలలో అధికం. లేతగా నున్న పచ్చిమేతలోనూ ఎక్కువ. ఎక్కువ ఆకులుండే పచ్చగడ్డి మరింత మంచిది. దంచిన సోయబీన్, పత్తి, పొద్దుతిరుగుడు, అవిశ గింజలు కూడ పాలలో ఈ కొవ్వు ఆమ్లమును పెంచుతాయి. రూమేన్లో సూక్ష్మ జీవులు ప్రధాన కారణమైతే, పాల గ్రంధులు (ఖబిళీళీబిజీగి స్త్రజిబిదీఖి) ఈ కొవ్వు ఆమ్లమును సృష్టించడం మరొక కారణం. కనుక పాడి పశువులకు పెట్టిన పచ్చిమేత, మంచి పాలు ఇస్తుంది. మంచి పాలు తగిన ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉన్న ప్రజలు పాలు, పెరుగు ఎక్కువ తాగితే పాడి పరిశ్రమకు, దేశానికి మరింత లాభం.
బాలింత పశువులు
ఈనిన 70-80 రోజులవరకు పాల ఉత్పత్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. శరీర స్థితి తరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆహారం తగినంత కావాలి. అవసరం మేరకు తినలేవు. శరీరంలోని కొవ్వులు కరిగి పాల ఉత్పత్తికి అవసరమగు శక్తిని ఇస్తాయి. రోగ నిరోధకశక్తి తగ్గకుండా తగిన ఆహారం తినిపించాలి. బాలింత జబ్బులు దరిచేరకుండా పుష్టికరమైన ఆహారం అందచేయాలి. మంచి పచ్చిమేత, కొంచెం ఎండుమేత, దాణాలు కలిసిన నాణ్యమైన ఆహారం పెట్టాలి. అధికంగా 20-25 లీటర్లు పాలు ఇచ్చే ఆవులకు, గేదెలకు సమతుల్యమైన ఆహారం ఉండాలి. మొక్కజొన్న, ఆల్ఫాఆల్ఫా, హైబ్రిడ్ నేపియర్ లాంటి నాణ్యమైన పచ్చిమేత, జనుము, పిల్లిపెసర, గోధుమ, జొన్నచొప్ప వంటి ఎండుమేతలు, పత్తి గింజల చెక్క, కొబ్బరిచెక్క, సోయబీన్ మీల్, చేప పొడి లాంటి మాంసకృత్తులు, రూమేన్ అధిగమించి అబోమేజం చేరుకునే కొవ్వులు, ప్రోటీన్లు (ఔగిచీబిరీరీ ఓబిశి, ఆజీళిశిలిరిదీ), విటమినులు, ఖనిజలవణాలు, ఎంజైములు, విషపదార్ధాలను అడ్డుకునే (ఊళినిరిదీ లీరిదీఖిలిజీరీ) దినుసులు కావాలి. ఏ విధంగా చూసినా పాడి పశువులకు పచ్చిమేత తప్పనిసరిగా కావాలి.
పునరుత్పత్తి: ఈనిన మూడు-నాలుగు నెలలకు ఆవు గర్భం ధరించాలి. వెంటనే చూడిదవడం వలన ఈతల మధ్య దూరం తగ్గుతుంది. తక్కువ సమయంలో దూడని ఇస్తుంది. దూడతో పాటు పాలూ ఇస్తుంది. జీవిత కాలంలో ఎక్కువ సార్లు గర్భం దాల్చడం, ఎక్కువ దూడల్ని పెట్టడం మూలాన ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తుంది. అందుకు ఏ, ఈ విటమినులు చాలా అవసరం. ఇంకా ఖనిజాలు కావలి. రుతుక్రమం సాఫీగా సాగడానికి పచ్చిమేత కావాలి. పచ్చిమేత తక్కువ ధరకు ఎక్కువ పోషకాలను అందిస్తుంది. పిండిపదార్ధములు, అందులోని చక్కెరలు (ఐతివీబిజీరీ) ప్రత్యుత్పత్తికి మేలు చేస్తాయి. ఏ, ఈ విటమినులు సెలీనియం తో కలిసి పొదుగు వాపునుండి (ఖబిరీశిరిశిరిరీ) రక్షణ ఇస్తాయి. ఈనిన తరువాత మాయ పడటానికి సహాయపడతాయి. గర్భాశయం ఆరోగ్యాన్ని కాపాడతాయి.
భూసారం: పచ్చిమేత పెంచే విధానం భూమిని సారవంతంగా ఉంచుతుంది. భూమిలోకి చొచ్చుకుపోయిన వేళ్ళు, భూమిపైన అల్లుకు పోయిన మొక్కలు భూమికి రక్షణ ఇస్తాయి. సేంద్ర్రియ పదార్ధాలను వృద్ది చేస్తాయి. చిక్కుడు జాతి మొక్కలు భూమిలో నత్రజనిని పెంచుతాయి. వర్షాలు, వరదలు వచ్చినా, పచ్చిమేత మొక్కలు భూమి కోతకు గురి కాకుండా పట్టి ఉంచుతాయి. భూమి సత్తువగా ఉండడానికి అఉపయోగపడతాయి. అందువల్ల ఎరువులు తక్కువ వాడవచ్చును. పచ్చిమేత, మొక్కలు సహజంగాభూమిలో పెరుగుతాయి.
కనుక పచ్చిమేతకు, పాడి పరిశ్రమకు విడదీయలేని అనుబంధం ఉంది. పాల ఉత్పత్తిదారులు నూతన విధానాలను ఆచరించి, సులభమైన పద్ధతులలో పాడి పశువుల ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని ప్రోత్యహించి, పాల ఉత్పత్తిని పెంచి, పునరుత్పత్తిని పెంపు చేసి లాభాలను పొందడానికి కృషి చేయడం ద్వారా పాడి పరిశ్రమను వృద్ధి చేయగలరు.
తుది పలుకు: పాల ధరలు 12-16% ఫిబ్రవరి, 2023 నెలలోనే పెరిగినట్లు జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ (శ్రీఈఈఔ), వినియోగదారుల సంస్థ (ఈలిచీబిజీశిళీలిదీశి ళితీ ్పుళిదీరీతిళీలిజీరీ జుతీతీబిరిజీరీ), లోక్ సభ, వాణిజ్య మంత్రిత్వశాఖలు (ఖరిదీరిరీశిజీగి ళితీ ్పుళిళీళీలిజీబీలి) చెబుతున్నాయి (ఊనీలి కరిదీఖితి 20-04-2023). ముద్ద చర్మ వ్యాధి (ఉతిళీచీగి ఐదిరిదీ ఈరిరీలిబిరీలి), పచ్చిమేత ఎక్కువ ఖరీదు అవడం కారణం అని చెబుతున్నారు. పచ్చిమేత ఎక్కువ ఖరీదు ఎందుకంటే తక్కువ మంది పండిస్తున్నారు. తక్కువ మంది పండించడం వలన గిరాకీ. గిరాకీ ఉన్నపుడు ధర పెరుగుతుంది. పాల ఉత్పత్తి 2018 సంవత్సరంలో 6.6% అత్యధికంగా పెరిగింది. ఆ తరువాత పాల ఉత్పత్తి ఆ స్థాయిలో పెరగడం లేదు. ఈ సంవత్సరం (2023) చివరకు 1-2% పెరుగుతుందని అనుకుంటున్నారు. ప్రతీ సంవత్సరం లక్షల కొలది సంకరజాతి ఆవు దూడలు, ముర్రా గేదె దూడలు పుడుతున్నపుడు, ముద్దచర్మ వ్యాధి కారణంగా 1.86 లక్షల పశువులు చనిపోవడం వలన పాల ఉత్పత్తి స్థభించి పోయిందా! పూర్తిగా కాదు. ఇతర కారణాలున్నాయి. అందులో పచ్చిమేత కొరత ముఖ్య కారణం. పచ్చి మేత అవసరానికి తగ్గట్టు పెంచడం లేదు. పండటం లేదు. మేపడం లేదు. ఎండుమేత దాణా వేసి పాలు ఉత్పత్తి చేయడం అంటే తక్కువ పాలకు ఎక్కువ ఖర్చు చేయడం. పచ్చిమేత పండించకపోతే, పాడి పశువులకు పచ్చిమేత మేపకపొతే మనదేశం, ప్రపంచంలో పాలఉత్పత్తిలో ఇప్పుడున్న మొదటి స్థానం నిలబెట్టుకోవడం కష్టం.
ఖర్చు: పాడి పరిశ్రమలో ఖర్చులు అధికం. 60-75 శాతం ఖర్చు పశువులను మేపడానికే అవుతుంది. నివాస గృహాలు (ఐనీలిఖిరీ), పనివారు, విద్యత్తు, మందులు, యితర ఖర్చులు నిలకడగా ఉంటాయి. మేత, దాణాల ఖర్చులు మారుతూ ఉంటాయి. మొక్కజొన్నలు, జొన్నలు, కొబ్బెర పిండి, పత్తి చెక్కల ధరలు కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అందువల్ల రైతు పచ్చిమేతపై ఆధారపడక తప్పదు. పచ్చిమేత అన్ని కాలాలలో అందుబాటులో ఉంటే అధిక ధరలు వెచ్చించి దాణాలను, మొక్కజొన్న వగైరా గింజలను కొనవలసిన పరిస్థితి రాదు. పచ్చిమేత పుష్కలంగా వేసి మేపితే పాల ఉత్పత్తి ఖర్చు 45-60 శాతం వరకు వస్తుంది. దాణాలు (్పుళిదీబీలిదీశిజీబిశిలి), గింజలు, పిండి, చెక్కలు (్పుబిదిలిరీ), కొంచెం పచ్చిమేత, కొంచం ఎండుమేత కలిపి మేపితే పాల ఉత్పత్తి ఖర్చు 50-70 శాతం అవుతుంది. ఎండుగడ్డి, బూస, శనగ పొట్టు, ఇతరత్రా ఎండుమేతలు (ఈజీగి ఓళిఖిఖిలిజీ) మేపితే ఎక్కువ దాణాలు (్పుళిదీబీలిదీశిజీబిశిలి) వేయవలసి వస్తుంది. అపుడు పాల ఉత్పత్తి ఖర్చు 70-80 శాతం చేరుకుంటుంది. ఆరు నుండి ఎనిమిది లీటర్లు పాలు ఇచ్చే ఆవును, గేదెను పచ్చిమేత మీదనే పోషించ వచ్చును. దాణాల మీద ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పని లేదు. ఇపుడు చిన్నా, పెద్ద రైతులు సైతం పశువుల దాణాలకు అలవాటు పడ్డారు. వాటి నాణ్యత ననుసరించి పాల ఉత్పత్తి పెరుగుతుంది. పచ్చిమేత లేనపుడు దాణా తోబాటు ఎండుమేత వేయడం తప్పనిసరి అవుతుంది. ఖర్చులు పెరుగుతాయి. పచ్చిమేత కొనడం, స్వంతంగా పెంచలేకపోవడం ఖర్చులను పెంచుతున్నాయి. అధికంగా ఎండుగడ్డి, దాణాల మీద పెంచడం ఆవు ఆరోగ్యానికి చేటు చేయడమే గాక పాల ఉత్పత్తి ఖర్చు తక్కువ అవుతుంది. అటువంటి మేతలో విటమినులు, ఖనిజలవణాలు చాలకపోవడం పునరుత్పత్తి అవకాశాలను దెబ్బతీస్తుంది. రోజుకు 30 లీటర్ల పాలు ఇచ్చే ఆవులకు కూడా నాణ్యమైన పచ్చిమేత వేసి అమెరికాలో పాల ఉత్పత్తి చేస్తున్నారు. మనం వేసే మేతలో పోషక పదార్ధములను దిగ్భందం చేసే పలుకులు (జుదీశిరి శ్రీతిశిజీరిశిరిళిదీబిజి ఓబిబీశిళిజీరీ) ఉంటాయి. అవి పోషక పదార్ధములను జీర్ణం కానివ్వవు. మరికొన్నిటిని శోషణం కాకుండా చేస్తాయి. అటువంటి ఆక్జలేట్ (ంనిబిజిబిశిలి) పలుకులు ఎండుగడ్డిలో అధికం. దానితో కాల్షియం శోషణం కాదు.
మన ఆరోగ్యాన్ని కాపాడుటలో మనం తినే ఆహారం, మనం పీల్చే గాలి, శారీరక శ్రమ, మన మానసిక పరిస్థితి, ప్రకృతితో మమేకమవడం లాంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. కాని ప్రస్తుత కాంక్రీట్ జంగిల్స్ మరియు ఉరుకుల పరుగుల జీవితాలలో ఇవన్నీ అందుబాటులో దొరకడము చాలా కష్టంగా ఉంటుంది. ఇవన్నీ అందుబాటులో లేకపోవడముతో చాలామంది ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి తమతమ ఆరోగ్యాలను సంరక్షించుకోవాలనుకునే వారందరూ తమకు అవకాశం ఉన్నంతలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలకు అందుబాటులోకి వచ్చిన మార్గమే ఇంటిపంట. ఇంటి పంట వలన రసాయనాలు లేని కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని రకాల పండ్లను పొందడముతో పాటు పచ్చదనం వలన వాతావరణ కాలుష్యం తగ్గటంతో పాటు ఇంటి పంట వలన శారీరక శ్రమకు అవకాశం కుదురుతుంది కాబట్టి ఆహ్లాదకర వాతావరణానికి ఇంటి పంట సరైనదారి అని నమ్మి ఇంటిపంటను ఇప్పటి వరకు చేపట్టిన వారు, ఇంకా చేపట్టే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆరోగ్యకర ఆహారాన్ని పొందడముతో పాటు యోగా చేసుకోవటానికి, తనకిష్టమైన సంగీతాన్ని పచ్చని మొక్కల మధ్య ఆస్వాదించటానికి సరైన దారి ఇంటిపంట అని గ్రహించి విజయవాడ, పటమట ప్రాంతానికి చెందిన భారతిదేవి మిద్దెతోటను మొదలు పెట్టారు.
భారతీదేవి కాస్మొటాలజిస్ట్. వీరికి చిన్నతనం నుంచి పచ్చదనం, సంగీతం, యోగాల మీద మక్కువ చాలా ఎక్కువ. తన వృత్తిలో తీరిక లేకుండా ఉండే భారతీదేవి తనకు అందుబాటులో ఉన్న సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా సక్రమంగా వినియోగించుకుంటూ కాస్మొటాలజిస్ట్గా తన వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తూ సంగీతానికి, యోగాకి ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయిస్తుంటారు. వాటితోపాటు ఇంటి పంటపై కూడా మక్కువ ఉంది కాబట్టి కొంత సమయాన్ని కేటాయించి తమ మిద్దె మీద కొన్ని రకాల మొక్కల పెంపకం చేపట్టి కొనసాగిస్తున్న పరిస్థితులలో కరోనా రావడం జరిగింది. కరోనా సమయంలో ఎక్కువ సమయం ఇంటి వద్దనే గడపవలసి రావడముతో ఆ సమయాన్ని తమ మిద్దె తోటలోని మొక్కల సంఖ్యను పెంచటానికి కేటాయించి మిద్దెతోటను అభివృద్ధి చేశారు.
మిద్దెమీద మొక్కల పెంపకం చేస్తున్నారు కాబట్టి స్లాబుమీద నీరుపడి స్లాబు పాడవకుండా ఉండటానికి వీలుగా స్లాబుకు వాటర్ ఫ్రూప్ కోటింగ్ను వేయించడంతో పాటు స్టాండులు ఏర్పాటు చేసుకుని స్లాండులపై కుండీలు, టబ్బులు, డ్రమ్ములు లాంటివి ఏర్పాటు చేసుకుని వాటిలో మొక్కల పెంపకం చేస్తున్నారు. అన్ని రకాల మొక్కలకు ఒకే రకమైన కంటెయినర్లు ఉపయోగించకుండా మొక్కల రకాలను బట్టి కంటెయినర్లను ఎంపిక చేసుకున్నారు. ఆకుకూరలకు వెడల్పు మూతి ఉండే టబ్బులను, పండ్ల మొక్కల పెంపకానికి డ్రమ్ములను, కూరగాయలకు బక్కెట్లను…. ఈ విధంగా మొక్కల రకాన్ని బట్టి అందుకు అనుకూలంగా ఉండే కంటెయినర్లను ఎంపిక చేసుకున్నారు. మట్టి మిశ్రమంలో మట్టి, ఎరువు, వేపపిండి, ఇసుక లాంటి వాటిని కలుపుకున్నారు. మట్టి మిశ్రమములో కోకోపిట్ను ఉపయోగించలేదు. ఈ మట్టి మిశ్రమము మూడు నెలల వరకు మొక్కలకు పోషకాలను అందిస్తుంది. కాబట్టి మూడునెలల తరువాత మరలా అవసరమైన మట్టి మిశ్రమాన్ని అందిస్తుంటారు. కంటెయినర్లలోని మట్టి గట్టిపడినట్లయితే మొక్క పెరగదు కాబట్టి మట్టి గట్టిపడకుండా ఉండేందుకు గాను క్రమం తప్పకుండా మట్టిని కలుపుతూ మట్టి గుల్లగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇంట్లో వృథాగా పడి ఉండే ప్లాస్టిక్ బక్కెట్లు మరియు ఇతర సామాగ్రిని కూడా కంటెయినర్లగా ఉపయోగిస్తూ&వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు.
వీరి మిద్దెతోటలో చింతచిగురు కోసం చింత, సపోట, జామ, అంజీర, డ్రాగన్ఫ్రూట్, దానిమ్మ, అరటి, ఉసిరి, ద్రాక్ష, నిమ్మ, బత్తాయి మొదలగు మొక్కలతో పాటు అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఆల్స్సైసెస్ మొక్క, క్యాబేజీ, కాలీఫ్లవర్, బీర సొర, కాకర లాంటి తీగజాతి కూరగాయల మొక్కలను కూడా ఆయా మొక్కలకు అనుకూలమైన కంటెయినర్లలో పెంచుతున్నారు. వీటితో పాటు కొన్ని రకాలను పాలినేషను కొరకు, మిద్దెతోట అందంగా కనిపించేందుకుగాను పెంచుతున్నారు. వేసవి కాలంలో మొక్కల పాదులలో కొబ్బరి పీచు లేదా ఎండు ఆకులను ఏర్పాటు చేయడం వలన ప్రయోజనం బాగా ఉంటుందని ఆవిధంగా చేస్తున్నారు. వేసవి కాబట్టి పిచ్చుకలకు, పకక్షులకు తాగేందుకు నీటిని కూడా మొక్కల నీడలో ఏర్పాటు చేయడం వలన వివిధ రకాల పకక్షులు వీరి మిద్దెతోటలో కనిపిస్తుంటాయి.
వీరికి సంగీతంపై మక్కువ ఎక్కువ కాబట్టి ప్రతిరోజు కొంత సమయాన్ని మిద్దెతోటలో వీణవాయించటానికి కేటాయిస్తారు. మిద్దెతోటలో వీణ వాయించటముంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో వీణవాయించటం వలన పొందే తృప్తితో పాటు మిద్దెతోటలోని మొక్కలకు కూడా ప్రతిరోజు సంగీతాన్ని వినిపిస్తున్నారు. అంతేకాకుండా తాను చిన్నతనం నుంచి యోగా చేస్తుంటారు. ఇప్పుడు మిద్దెతోటలో యోగా చేయడం వలన ఫలితాలు ఇంకా ఆశాజనకంగా ఉంటున్నాయని భారతీదేవి అంటున్నారు. ప్రతిరోజు కొంత సమయాన్ని మిద్దెతోటలో గడపడం వలన శారీరక శ్రమకు అవకాశం దొరుకుతుందని వీరు భావిస్తున్నారు.
తమ ఇంట్లో తమ చేతులతో ఎలాంటి రసాయనాలు లేకుండా పండించుకున్న ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా మంచి రుచిగా ఉంటాయని, కూరగాయలు, ఆకుకూరలు త్వరగా ఉడుకుతాయని, తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. మిద్దెతోటలో ఉసిరి, చింత లాంటి విటమిన్లు అందుబాటులో ఉండే మొక్కలను పెంచి వాటిని ఆహారంగా తీసుకున్నట్లయితే మన శరీరానికి కావలసిన విటమిన్లు సహజ సిద్ధంగా అందుబాటులోకి వస్తాయి కాబట్టి మిద్దెతోట వలన అందరికీ ప్రత్యేకించి స్త్రీలకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి అందరు ఇంటి పంటను తప్పని సరిగా చేపట్టాలని భారతీదేవి కోరుతున్నారు. కొత్తగా ఇంటి పంటను చేపట్టే వారు మొదటలో ఆకుకూరలతో మొదలుపెడితే ఫలితాలు బాగుంటాయనే సూచనను ఇంటిపంటను మొదలు పెట్టేవారికి ఇస్తున్నారు.
కదిరి కుళ్లాయప్ప కరువుతో కుస్తీ పట్టలేక రెండెకరాల పొలం అమ్మినాడు. అమ్మితే వచ్చిన రెండు లక్షలతో భార్యని, ఇద్దరు కూతుర్లనీ తీసుకొని తిరుపతి చేరినాడు. సేంద్రీయ వ్యవసాయంతో పండించిన కూరగాయల వ్యాపారం చేద్దామని పట్టణానికి కొంత దూరంలో అవిలాల జంక్షన్లో అంగడి పెట్టినాడు. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు, వేపపిండి లాంటి పదార్థాలతో పండించిన సేంద్రీయ కూరగాయలను అమ్మసాగాడు. కూరగాయలను పక్కనున్న నాగలాపురం, పిచ్చాటూరు, కమ్మపల్లి మండలాల రైతుల వద్దకెళ్లి తెచ్చుకొనేవాడు.
కుళ్లాయప్ప కూరగాయలు తెస్తే, భార్య భ్రమర భద్రంగా వాటిని సర్దేది. పెద్ద కూతురు కృష్ణవేణి తూకం వేసేది. రెండవ కూతురు రేవతి గల్లాపెట్టె కాడ కూర్చొనేది. ముగ్గురూ కూలోళ్ల లెక్కన కష్టపడేవాళ్లు. ‘ఎగిరి దంచినా, ఎగిరెగిరి దంచినా ఒకే పిండి’ అన్నట్లుగా వాళ్లు ఎంత కష్టపడినా రోజుకి మూడు వందల రూపాయలకి అటూ ఇటూ మాత్రమే వ్యాపారం జరిగేది.
తమ కష్టాలను తమ కస్టమర్ అయిన ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ లక్కిశెట్టి బీరప్పకి చెప్పినారు. తమ అనంతపురం జిల్లా మనుషుల పట్ల అభిమానంతో ఆయన చిన్న సినాప్సిస్ తయారుచేసినాడు. ”కుళ్లాయప్పా! చాలామందికి ప్రకృతిసిద్ధమైన, పర్యావరణ అనుకూలమైన, జీవాధారిత వ్యవసాయం ద్వారా ప్రాంతీయ వనరులతో లభించే ఆర్గానిక్ ఆహారం తినాలని వుంటుంది. కానీ ఈ బిజీ పట్టణంలో కూరగాయలు కొని, వండి తినే సమయం, ఓపిక, తీరిక ఆర్గానిక్ ప్రియులు అందరికీ వుండకపోవచ్చు. వాటిపై మక్కువ వున్నా ఇంతింత దూరాలు వచ్చి పట్టుకెళ్లి వండుకోవడానికి వారికి కుదరకపోవచ్చు. రాలేక పోలేక, చెయ్యలేక, చేసుకోలేక చాలామంది గమ్మున వుండిపోతారు. నా మాటవిని నీవు ఈ కూరగాయల అంగడిని సేంద్రీయ కూరగాయలతో పండిన కర్రీస్ కార్నర్గా మార్చిచూడు. వారికి ఆరోగ్యం – మీకు ఆదాయం, వారికి తృప్తి – మీకు మంచి వ్యాపారం చేస్తున్నామన్న సంతృప్తి మిగులుతాయి” అని చెప్పివెళ్లాడు.
* * *
మూడు నెలలు గడిచింది. ప్రొఫెసర్ ప్లాన్ ఫలించింది. కుళ్లాయప్ప కూరగాయల అంగడి ‘కుళ్లాయప్ప కర్రీస్ కార్నర్’ అయ్యింది. రుచిగా, శుచిగా సేంద్రీయ వంటలు వండసాగారు. టూవీలర్లలో, ఫోర్ వీలర్లలో జనాలు సర్రుసర్రున వచ్చి ఆర్గానిక్ ఆహారాన్ని ప్యాక్ చేసుకుపోసాగారు. మూడు మునక్కాయలు, ఆరు సొరకాయలుగా వ్యాపారం వెలిగిపోయింది. పట్టణంలో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ బ్రాంచీలు ప్రారంభమయ్యాయి.
* * *
ఓ శుక్రవారం సాయంత్రం ప్రొఫెసర్ బీరప్ప తన ఇంటి తోటకి నీళ్లు పడుతున్నాడు. అప్పుడే మహిళా యూనివర్శిటీలో ఎం.సి.ఎ. చదువుతున్న కూతురు సైకిల్ స్టాండు వేస్తూ ”అమ్మా! కొత్తగా మన జంక్షన్లో ఆర్గానిక్ కర్రీస్ కార్నర్ పెట్టారే! ఎంచక్కా మంచి కర్రీస్ ఎంజాయ్ చేయవచ్చు” అంటోంది. చిన్నచిన్నగా నవ్వుకున్నాడు ప్రొఫెసర్ బీరప్ప.
* * *
మూడు ఏండ్లకే మూడు ఎకరాల పొలం కొన్నాడు కుళ్లాయప్ప. నెలకి ఆరు లారీల కూరగాయలు పండించి ఉత్తర రాష్ట్రాలకు ఎగుమతి చేయసాగాడు. సేంద్రీయాన్ని నమ్ముకున్న కుళ్లాయప్ప కుటుంబమంతా ఎర్ర టమోటాల లెక్కన కళకళలాడసాగింది.
కల్పవృక్షంగా అభివర్ణించే కొబ్బరి సాగు ప్రపంచవ్యాప్తంగా 93 దేశాలలో జరుగుచున్నది. దేశ వ్యాప్తంగా కేరళ, తమిళనాడు, కర్నాటక మరియు ఆంధ్రప్రదేశ్ కొబ్బరిని పండించే ముఖ్యమైన రాష్ట్రాలు. కొబ్బరిని ఎక్కువగా పండించే రాష్ట్రాలలో మన ఆంధ్రప్రదేశ్ ఒకటి. మన రాష్ట్రంలో దీనిని సుమారు లక్ష హెక్టార్లలో సాగు చేస్తున్నారు. కొబ్బరి సాగుకు సంబంధించి మన రాష్ట్రం విస్తీర్ణంలో నాల్గవ స్థానంలో ఉంది. విస్తీర్ణంలో సగానికి పైగా ఉభయ గోదావరి జిల్లాలలో ఉండి, మిగతా విస్తీర్ణం, ఉత్తరకోస్తా, కృష్ణా, గుంటూరు మరియు చిత్తూరు జిల్లాలలో ఉన్నది. కొబ్బరిలో దిగుబడి గణనీయంగా తగ్గిపోవడానికి ప్రధానమైన కారణం శిలీంధ్రాలు కలుగజేసే తెగుళ్ళు. ఈ తెగుళ్ళలో ఎర్రలక్క తెగులు (గానోడెర్మా తెగులు), నల్లమచ్చ తెగులు మరియు మొవ్వుకుళ్ళు లేదా కాయకుళ్ళు తెగుళ్ళు ముఖ్యమైనవి.
కొబ్బరి పంట దిగుబడిని గణనీయంగా తగ్గించే వివిధ కారణాలలో తెగుళ్ళు ముఖ్యమైనవి. గానోడెర్మా శిలీంధ్రము వలన కలిగే ఎర్రలక్క తెగులు అతి ముఖ్యమైనది మరియు ప్రమాదకరమైనది. ఈ తెగులు ఎక్కువగా తేలిక పాటి నేలలైన ఇసుక నేలలు, ఎర్ర నేలలు, లంక భూములలో ఉన్న కొబ్బరిని ఆశిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి, మల్కిపురం, ఆత్రేయపురం, రాజమండ్రిలోని లంక భూముల్లో, అప్పనపల్లి, ఉప్పలగుప్తం, అల్లవరం, కలవచర్ల మండలాలలో ఈ తెగులు ఉధృతి గమనించడమైనది. అదే విధంగా పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం, శ్రీకాకుళంలోని కవిటి మండలం, విజయనగరం జిల్లాలోని పూసపాటి రేగ మండలాలలో కూడా గమనించడమైనది.
గానోడెర్మా తెగులు
కొబ్బరి తోటలను ఆశించు తెగుళ్ళలో గానోడెర్మా తెగులు ముఖ్యమైనది మరియు చాలా ప్రమాదకరమైనది. దీనిని సిగ తెగులు, ఎర్రలక్క తెగులు, బంకకారు తెగులు, పొట్టులక్క తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు నల్ల నేలలలో కంటే తేలిక నేలల్లోని కొబ్బరి తోటలలో ఎక్కువగా కనబడుతుంది. వ్యాప్తి కూడా తేలిక నేలల్లో విస్తారంగా ఉంటుంది. వర్షపాతం ఎక్కువగా ఉన్న సంవత్సరాలలో వ్యాధి వ్యాప్తి తక్కువగా ఉండటం గమనించవచ్చు. సాధారణంగా నవంబరు నుండి జూన్ వరకు ఉండే వాతావరణ పరిస్థితులు ఈ తెగులు వ్యాప్తికి దోహదపడుతుంటాయి. ఈ తెగులు తీవ్రత మరియు తెగులు వ్యాప్తి నీటి ఎద్దడి అధికముగా ఉండు తోటలలో ఎక్కువగా ఉంటుంది. సాధారణముగా రైతులు, కొబ్బరి చెట్ల వేర్లను నరికివేయడం చేస్తూ ఉంటారు. అలా చేయరాదు. కొబ్బరి వేర్లు నరికివేయడం వలన వేర్లు గాయము ఏర్పడి నేలలో ఉండే గానోడెర్మా తెగులు కలుగచేయు శిలీంధ్రబీజాలు గాయమైన వేర్ల ద్వారా చెట్లను ఆశించడం జరుగుతుంది.
గానోడెర్మా తెగులు లక్షణాలు
గానోడెర్మా తెగులు నేలలో ఉండే బూజు జాతి శిలీంద్ర బీజముల వలన కొబ్బరికి సోకుతుంది. గానోడెర్మా తెగులు తొలుత భూమిలో నుండు వేర్లను ఆశించును. ఈ థలో మనము తెగులును గమనించలేము. అధిక శాతం వేర్లుకుళ్ళిన తరువాత కాండములోకి వ్యాపించి కణాలు పూర్తిగా కుళ్ళేలా చేస్తుంది. అయితే ఈ కుళ్ళు భూమిలోను, కాండములోను అంతర్గతమవడం వలన బయటకు కనిపించదు. క్రమక్రమముగా ఈ తెగులు వేర్ల నుండి కాండములోనికి ప్రవేశించును. ఈ థలో కాండము మొదలు చుట్టూ ఉన్న చిన్న చిన్న పగుళ్ళ నుండి ముదురు గోధుమ రంగు నుండి తెలుపు వర్ణం కలిగిన చిక్కటి జిగురు వంటి ద్రవం కారడం గమనించవచ్చు. కాండములోని కణ సముదాయం పూర్తిగా కుళ్ళిపోవడం వలన చెట్టు అవసరమైన నీరు, పోషక లవణాలను భూమి నుండి తీసుకోలేకపోతుంది. ఈ థలో కాండము మొదలు చుట్టూ ముందు చిన్న చిన్న పగుళ్ళ ద్వారా జిగురు కారును. ఈ బంక కారుట క్రమేణా పైకి వ్యాపించును. తెగులు సోకిన చెట్టు ఆకులు పసుపు వర్ణమునకు మారి వడలిపోయి గోధుమ వర్ణానికి మారుతాయి. కొత్త ఆకులు ఆలస్యముగా రావడము వలన తెగులు సోకిన చెట్టుపై ఆకుల సంఖ్య తక్కువగా ఉండటం గమనించవచ్చు. అదే విధముగా ఆకు పరిమాణము కూడా తగ్గిపోతుంది.
తెగులు సోకిన కొబ్బరి మొక్కలలో పుష్పాల సంఖ్య బాగా తగ్గిపోవడమే కాకుండా మగ పుష్పాల సంఖ్య పెరిగి ఆడ పుష్పాల సంఖ్య బాగా తగ్గి పోతుంది. పిందెలు, కాయలు రాలడము కూడా ఈ తెగులు యొక్క లక్షణము. ఈ తెగులు ఆశించిన కొబ్బరి చెట్టు వేర్లను గమనించినట్లయితే పూర్తిగా కుళ్ళిపోయి నలుపు రంగులో మారడం చూడవచ్చు. తెగులు తీవ్రంగా ఉన్న చెట్లలో సుమారు 70 శాతం వేర్లు కుళ్ళిపోయి ఉంటాయి. కొత్త వేర్లు పుట్టవు. ఏ మాత్రము అశ్రద్ధ చేసినను తెగులు తీవ్రమయి చెట్టు ఆకులు పసుపు వర్ణంలోకి మారి వడలి వ్రేలాడిపోవు థకు చేరును.తరువాత మొవ్వు భాగం మొత్తం వడలి చెట్టు ఎండిపోతుంది. ఈ లక్షణము గానోడెర్మా తెగులుగా గుర్తించాలి. పిమ్మట ఈ ఎండిపోయిన కొబ్బరి ఆకులు రాలిపోవడం జరుగుతుంది. కొబ్బరి ఆకులు పూర్తిగా రాలిపోవడం వలన కాండము మొండిగా తయారై చెక్కిన పెన్సిల్ మొన మాదిరిగా అగుపిస్తుంది. తదుపరి 5, 6 మాసములలో చెట్టు చనిపోవును. కొన్ని సమయాలలో తెగులు సోకి చివరి థలో ఉన్న చెట్ల మొదళ్ళపై పుట్టగొడుగులు మొలుచును. ఈ పుట్టగొడుగుల పై భాగము లక్క రంగులో ఉండును. క్రింది భాగము తెలుపు లేక బూడిద రంగులో ఉండును. ఈ భాగమును శ్రద్ధగా చూసినచో లక్షలాది సూక్ష్మరంధ్రములు కనిపించును. వీటి నుండి కోట్ల కొలది తెగులు కలిగించు శిలీంద్రము యొక్క బీజములు బయల్పడి గాలి ద్వారా వ్యాప్తి చెందును. తడికి ఇవి మొలకెత్తి శిలీంద్రమును పెంచిదగ్గరలో ఉన్న కొబ్బరి వేర్లను తెగులుకు గురిచేయును. అదుచేతనే ఈ గానోడెర్మా తెగులును పుట్టగొడుగులు ఏర్పడువరకు రానిచ్చుట అత్యంత ప్రమాదకరము. బలమైన గాలులు వీచినపుడు ఈ గానోడెర్మా తెగులు సోకి చనిపోయిన చెట్లు, అడుగు భాగములో విరిగి పడిపోవడం కొబ్బరి తోటలలో గమనిస్తూ ఉంటాము. ఈ పడిపోయిన కొబ్బరి దుంగలను గమనించినపుడు దుంగల లోపలి భాగము కుళ్ళిపోయి గుల్లమాదిరి ఉండుటం కూడా గమనించవచ్చు.
గానోడెర్మా తెగులు నివారణకు జీవనియంత్రణ పద్ధతులతో కూడిన సమగ్ర యాజమాన్య పద్ధతులు
1. తోటలో గానోడెర్మా తెగులు లక్షణాలు గమనించిన వెంటనే తెగులు ఉన్న ప్రాంతమును ఒక మీటరు లోతు, 50 సెం.మీ. వెడల్పు గల గోతిని త్రవ్వి తెగులు సోకిన చెట్ల నుండి వేరు చేయాలి. ఈ విధముగా చేయడం వలన తెగులు సోకిన చెట్టు వేర్లు వద్ద ఉన్న తెగులు కలుగచేయు శిలీంద్ర బీజాలు ఆరోగ్యవంతమైన చెట్టు వద్దకు చేరజాలవు.
2. తోటలోని చనిపోయిన మరియు తెగులు ఎక్కువగా సోకిన చెట్లను వేర్లతో సహా పెకలించి తగుల బెట్టవలయును. లేనిచో చనిపోయిన చెట్ల కాండముపై పుట్టగొడుగులు మొలచి తెగులు వ్యాప్తిని నిరోధించుట కష్టసాధ్యమగును. ఆ గోతులలో చెత్త, గడ్డి వేసి తగులబెట్ట వలయును. ఏ పరిస్థితులలోను చనిపోయిన చెట్ల మొదళ్ళను తోటలో నిలువ ఉచంరాదు. లేనిచో కొత్తగా నాటిన మొక్కలు చనిపోవును.
3. చనిపోయిన చెట్ల స్థానంలో తిరిగి మొక్కలను నాటేముందు, గుంతలను వారం, పదిరోజులు సూర్యరశ్మికి బాగా ఎండేలా చేయాలి. తరువాత చెత్త, చెదారం వేసి కాల్చడం ద్వారా వేరు కుళ్ళు శిలీంద్రాలను నియంత్రించవచ్చు. కొత్త మొక్కలను తిరిగి నాటునపుడు చెత్త వేసి కాల్చిన గోతులలో బాగా చివికిన పశువుల ఎరువు, కంపోస్ట్ ఎరువులతో పాటు 50 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంద్రపు పొడిని 1 కిలో వేపపిండి మిశ్రమముతో నింపి మొక్కను నాటవలయును.
4. కొత్తగా తోటలు పెంచడానికి తెగులు ఉనికి లేని ప్రాంతాలలో పెంచిన మొక్కలు ఎన్నుకోవాలి.
5. గానోడెర్మా తెగులు కలిగించే శిలీంద్రబీజాలు నేలలో ఉండి తెగిన లేక దెబ్బ తిన్న వేర్ల ద్వారా చెట్లకు వ్యాపిస్తుంది. కనుక కొబ్బరి చెట్ల వేరు నరుకుట, వేర్లు తెగునంతవరకు లోతుగా దుక్కి చేయుట పనికిరాదు. ఎట్టి పరిస్థితులలోను చెట్ల వేర్లు నరకరాదు.
6. ఈ తెగులు ఎక్కువగా తేలిక నేలల్లో వస్తుంది. అందువల్ల ఈ తేలిక నేలల్లో జీలుగ, జనుము వంటి పచ్చిరొట్ట పంటలు చిక్కగా పెంచి పూతకు వచ్చే థలో భూమిలో కలియదున్నాలి. ఇందువల్ల భూమిలో సేంద్రియ పదార్థములు పెరిగి నీటిని నిలువ ఉంచు శక్తి అధికమవుతుంది. దీనితో పాటుగా గానోడెర్మా శిలీంద్రాన్ని అదుపులో ఉంచే శిలీంద్రాలు కూడా అభివృద్ధి అవుతాయి.
7. చెట్ల మొదలు చుట్టూ రెండు మీటర్ల వ్యాసార్థం గల పళ్ళాలు చేసి, బోదెల ద్వారా ప్రతి చెట్టుకు విడివిడిగా నీరు పెట్టాలి. అలా కాకుండా తోటలకు మడులుగా చేసి నీరు పెడితే గానోడెర్మా శిలీంద్రము నీటి ద్వారా అన్ని చెట్లకు వ్యాప్తిస్తుంది.
8. గానోడెర్మా తెగులు ఉన్న నేలల్లో కొబ్బరి చెట్టుకు ప్రతి సంవత్సరం 50 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంద్రపు పొడిని 5 కిలోల వేపపిండిలో కలిపి వేయాలి. ఈ ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రపు పొడిని ఖచ్చితముగా వేపపిండితో కలిపి వేయవలెను. ఎందువలన అనగా ఈ ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రము వేపపిండిలో బాగా వృద్ధి చెంది గానోడెర్మా తెలుగు కలుగచేయు శిలీంద్రబీజాలు అభివృద్ధి చెందకుండా అరికట్టగలుగుతుంది.
9. గానోడెర్మా తెగులు అధికంగా ఉన్న నేలల్లో కొబ్బరి చెట్టుకు ప్రతి సంవత్సరం 125 గ్రా. ట్రైకోడెర్మా విరిడి + 125 గ్రా. సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ శిలీంద్రపు పొడిని 5 కిలోల వేపపిండిలో కలిపి సంవత్సరమునకు ఒకసారి వేయాలి.
10. కొబ్బరి తోటలో ఏ ఒక్క చెట్టుపై గానోడెర్మా తెగులు లక్షణాలు కనిపించినా, ఆ తోటలోని అన్ని చెట్లకు పైన వివరించిన విధముగా చర్యలు చేపట్టవలయును.
11. ట్రైకోడెర్మా శిలీంద్రపు పొడిని బోర్డో మిశ్రమముతో కాని లేక ఇతర తెగులు మందులతో కలిపి వాడరాదు.
నల్లమచ్చ తెగులు
నల్లమచ్చ తెగులును నల్లలక్క తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు ధీలావియాప్సస్ పేరడాక్సా అనే బూజు జాతి శిలీంద్రము వలన కలుగుతుంది. ఈ తెగులు అన్ని వయస్సుల కొబ్బరి చెట్లను ఆశిస్తుంది. కాని తక్కువ వయస్సుగల చెట్లపై తెగులు వ్యాప్తి అధికంగా ఉంటుంది. భూమిలో ఎత్తయిన నీటిమట్టం మరియు నేల యొక్క అధిక ఆమ్ల్ల లేదా క్షార లక్షణములు ఈ తెగులు కలగడానికి దోహదం చేస్తాయి.
నల్లమచ్చ తెగులు లక్షణాలు
కాండము పై పగుళ్ళ నుండి ముదురు రంగు ద్రవం కారుట ప్రధాన లక్షణము, అలా కారిన ద్రవం నలుపురంగులోకి మారి నల్లమచ్చగా ఆమరుతుంది. ఈ నల్లమచ్చ క్రిందనున్న భాగమంతా కుళ్ళిపోతుంది. ఈ నల్లమచ్చ ప్రాంతములో చెక్కినట్లయితే పసుపునుండి గోధుమ వర్ణం కలిగిన ద్రవం బయటకి వస్తుంది. తెగులు బాగా అభివృద్ధి చెందితే కాండముపైన బెరడు ఊడిపోతుంది. ఈ తెగులుకు అనుకూల పరిస్థితులు తోడు అయినపుడు, కాండము అంతయూ నల్లని చారలుగా అగుపించును. ఈ తెగులు ఆశించిన చెట్లలో కొబ్బరికాయల దిగుబడి తగ్గిపోతుంది. ఈ తెగులు లేత వయసు మొక్కలను ఆశించినపుడు, ఆ మొక్కలు చనిపోయే ప్రమాదము ఉన్నది. ఈ తెగులు కలుగచేయు బూజు శిలీంధ్రము కాండము పై ఏర్పడిన గాయముల ద్వారా, పగుళ్ళ ద్వారా చెట్టులోనికి ప్రవేశించి తెగులును కలుగచేయును.
యాజమాన్య పద్ధతులు
1. కొబ్బరి చెట్టు కాండముపై ఎటువంటి గాయము కలిగించరాదు.
2. ఈ తెగులు లక్షణాలు కాండముపై కనిపించిన వెంటనే, ఆభాగము పై ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్రపు పొడిని పేస్ట్గా తయారుచేసి పూయవలెను (50 గ్రాముల పొడికి 25 మి.లీ. నీటిని కలిపిన పేస్ట్ తయారగును).
3. ఈ తెగులును కలిగించే శిలీంధ్రబీజాలు కూడా గానోడెర్మా తెగులు కలిగించే శిలీంధ్ర బీజాలవలనే నేలలో ఉండి, తగిన వాతావరణ పరిస్థితులలో కాండముపై ఉన్నటువంటి సహజమైన పగుళ్ళద్వారా కొబ్బరిని ఆశించి తెగులును కలిగిస్తాయి. కావున నేలలో ఉన్నటువంటి శిలీంధ్రబీజములను అరికట్టుటకు ప్రతి సంవత్సరము చెట్టుకు 50 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్రపు పొడిని 5 కిలోల వేపపిండితో కలిపి పాదులలో వేయడం వలన లాభదాయకంగా ఉంటుంది.
నల్లమచ్చ తెగులు లక్షణాలు కాండముపై కనిపించిన వెంటనే, ఆ భాగమును చెక్కి, అక్కడ ట్రైకోడెర్మా విరిడి కేకును పెట్టి కట్టవలయును. ఈ విధముగా చేయడం ద్వారా ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రబీజములు అభివృద్ధి చెంది, తద్వారా నల్లమచ్చ తెగులును నివారించవచ్చును.
మొవ్వుకుళ్ళు తెగులు
మొవ్వుకుళ్ళు, కాయకుళ్ళు తెగులు వర్షాకాలంలో కొబ్బరిని ఆశించి నష్టపరుస్తాయి. వర్షాల ఆరంభముతోనే ఈ తెగులు లక్షణాలు కనిపించడానికి అవకాశము కలదు. మొవ్వుకుళ్ళు, కాయకుళ్ళు తెగులు సోకిన చెట్లు, నివారణ చర్యలు తీసికొననిచో చనిపోతాయి. ఈ తెగులును ఫైటోఫ్తోరా పామివోరా అనే బూజుజాతి శిలీంద్రము కలుగుచేస్తుంది. కొబ్బరిలో మొవ్వు, కాయకుళ్ళు తెగులు నారుమడిలోని చిన్న మొక్కల నుంచి 25 ఏళ్ళలోపు చెట్లకు ఆశించి నష్టపరుస్తుంది. నీటి ముంపునకు గురైన తోటల్లో ఇది ఎక్కువగా ఆశిస్తుంది. లంక భూముల్లోని తోటల్లో వరద ముంపునకు గురయిన సంవత్సరాలలో ఎక్కువ నష్టం కలిగిస్తుంది.
లక్షణాలు
ఓ తెగులు సోకిన మొక్కల్లో మొదట మొవ్వు ఆకు, దాని పక్కనున్న రెండు లేదా మూడు ఆకులు వడలిపోతాయి.
ఓ తర్వాత ఇతర పరాన్నజీవులు చేరి మొవ్వు పూర్తిగా కూల్చి, చెడు వాసన వస్తుంది.
ఓ ఈ కుళ్ళు మొవ్వు ఆకు క్రిందకు వ్యాపించి కొబ్బరి చెట్టులోని ఏకైక అంకురాన్ని ఆశించి, తద్వారా అంకురం చనిపోయి చెట్టు చనిపోతుంది.
ఓ కొన్నిసార్లు మొవ్వు కుళ్ళినప్పటికీ అంకురం బ్రతికి ఉండుటచేత కొన్ని మాసాల తరువాత కొత్త ఆకులు జనిస్తాయి.
ఓ కాని అవి అంచులు మాడి కురచగా గిడసబారినట్లుగా ఉంటాయి. ఇటువంటి ఆకులు మొవ్వులోని పీచుతో నొక్కివేయబడి గుబురుగా ఉంటాయి.
ఓ తగిన సమయంలో నివారణ చర్యలు తీసుకొననిచో ఈ తెగులు కొబ్బరి తోటలకు విపరీతంగా నష్టాన్ని కల్గించును.
తెగులు సోకిన తర్వాత నివారణ చర్యలు తీసుకునేకంటే రాకుండా రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.
1. సిఫారసు చేసిన విధంగా 8 మీటర్ల ఎడంతో కొబ్బరి మొక్కలు నాటాలి. దగ్గర దగ్గరగా నాటితే గాలిలో తేమ పెరిగి త్వరగా, సులభంగా తెగులు వ్యాప్తి చెందుతుంది.
2. తెగులు సోకి చనిపోయిన చెట్లను తీసి కాల్చివేయాలి. మొవ్వుకుళ్ళు సోకిన చెట్టు మొవ్వు, దాని ప్రక్కన కుళ్ళిన భాగము తీసివేసి తగులబెట్టాలి. గిడసబారి కురచ ఆకులున్న చెట్ల మొవ్వులోని పీచు కోసివేసి ఆకులు సులభంగా బయటకొచ్చేలా వదులుచేయాలి.
3. సిఫారసు చేసిన మోతాదులో పొటాష్ ఎరువులు క్రమం తప్పకుండా వేస్తే మొక్కలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
4. కొబ్బరి మొక్క మొవ్వు భాగంలో సుడోమోనాస్ ప్లోరిసెన్స్ టాల్క్ పొడిని వేయాలి. మొక్క వయసును బట్టి సంవత్సరం లోపు మొక్కకు 5 గ్రాములు, ఒక సంవత్సరం మొక్కకు 10 గ్రాములు ఇదే విధముగా 2, 3, 4, 5 మరియు 5 సంవత్సరముల కంటే ఎక్కువ వయసు గల మొక్కలకు 75, 100, 150, 200 గ్రాముల టాల్క్ పొడిని వేయాలి.
5. కాయకుళ్ళు సోకిన గెలను తొలగించి, ఇతర గెలలు, మొవ్వు భాగం తడిచేలా సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కల్చర్ ద్రావణాన్ని పిచికారి చేయాలి.
6. వరద ముంపుకు గురయిన తోటలలో వరద నీరు తగ్గగానే మొవ్వులలో చేరిన ఒండ్రుమట్టి పోయేలా శుభ్రంగా కడిగివేయాలి. తదుపరి మొక్క వయసును బట్టి పై విధముగా సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ టాల్క్ పొడిని వేయాలి లేక సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కల్చర్ ద్రావణాన్ని మొవ్వు ఆకులు తడిచేలా పిచికారీ చేయాలి.
7. ఈ తెగులును కలిగించే శిలీంద్రబీజాలు కూడా నేలలో ఉండి, వాతావరణ పరిస్థితులు అనుకూలించినపుడు కొబ్బరి మొక్కను ఆశించి తెగులును కలిగిస్తాయి. అందువల్ల నేలలో ఉన్నటువంటి శిలీంద్ర బీజాల ఉత్పత్తిని అరికట్టేందుకు ప్రతి యేటా చెట్టుకు 50 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రపు పొడిని 5 కిలోల వేపపిండితో కలిపి పాదులలో వేయాలి. దీని వల్ల నేలలో ఉండే శిలీంద్రబీజాల ఉత్పత్తి తగ్గిపోవడమే కాక తెగుళ్ళను తట్టుకునే శక్తి కూడా పెంపొందుతుంది.
ఆకు ఎండు తెగులు లక్షణాలు
1. ఈ తెగులు పాత ఆకులపై మచ్చలుగా ఏర్పడి క్రమేపి ఆకు మొత్తము విస్తరిస్తుంది. బాహ్యవలయంలో ఉన్న ఆకులను ఎక్కువగా ఆశిస్తుంది.
2. తెగులు సోకిన ఆకుల చివరి నుండి ఎండిపోవడం ప్రారంభమై, క్రమేపి ఆకు మొత్తం ఎండిపోయినట్లు ఉంటుంది.
3. ఈ తెగులు సోకిన కాయలపై అలల మాదిరిగా మచ్చలు ఏర్పడి ముచ్చిక చివరి భాగంలో వ్యాప్తి ప్రారంభమవుతుంది.
4. తరువాత కాయ లోపల కొబ్బరి మొత్తం కుళ్ళిపోతుంది. దీనివలన కాయలు ఎదుగుదల లేక, చిన్నవిగా ఉండి, ఊడిపోతాయి. దిగుబడి 10 నుండి 25 శాతం వరకు తగ్గుతుంది.
5. ఈ తెగులు సంవత్సరం మొత్తం వ్యాపిస్తుంది. ఎక్కువగా వేసవి కాలము తెగులుకి అనుకూల వాతావరణము.
6. వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు శిలీంద్ర బీజాలు గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి.
యాజమాన్య పద్ధతులు
1. తెగులు సోకిన ఆకులను తోట నుండి వేరు చేసి కాల్చివేయాలి.
2. ఈ తెగులు ఉన్న కొబ్బరి చెట్టుకు ప్రతి సంవత్సరం 200 గ్రా. సూడోమోనాస్ ఫ్లోరిసన్స్ టాల్క్ పొడిని, 50 కిలోల పశువుల ఎరువు మరియు 5 కిలోల వేపపిండిలో కలిపి వేయాలి.
వ్యవసాయంలో దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక పంటల సాగు విధానాలను రైతులు పాటిస్తుంటారు. దీర్ఘకాలిక పంటల జాబితాలో పండ్ల తోటలు ప్రధానంగా ఉంటాయి. పండ్లతోటలు సాగు చేసే రైతులు ఆయా పంటల నుండి దిగుబడి పొందాలంటే కనీసం ఒక సంవత్సరంపైనే ఎదురు చూడవలసి ఉంటుంది. మామిడి, బత్తాయి లాంటి పంటలు సాగు చేసే రైతులయితే ఇలాంటి పండ్ల తోటలలో దిగుబడి పొందాలంటే కనీసం 3 సంవత్సరాలు ఎదురు చూడవలసి వస్తుంది. కాబట్టి ఇలాంటి పంటలు సాగు చేసే రైతులకు ప్రతినిత్యం ఆదాయం అందుబాటులో లేకపోవడం వలన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా వ్యవసాయ అనుబంధ రంగాలను ఆశ్రయించటం, అంతర పంటలు సాగు చేయడం లాంటి ఎన్నో విధానాలను వివిధ ప్రాంతాలలోని రైతులు తమకు అనుకూలంగా సాగు చేసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. ఈ అంతర పంటల విధానాన్ని కొద్దిగా మార్పులు చేసి కొంత శాస్త్రీయత జోడించి భూమిని సక్రమంగా సద్వినియోగంతో పాటు రైతులకు పలు రకాలుగా ఉపయోగకరంగా ఉండే పద్ధతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి జీరోబడ్జెట్ నాచురల్ ఫామింగ్ శాఖకు చెందిన అధికారులు ఏటిఎం మోడల్ నమూనాను రైతులకు పరిచయం చేస్తున్నారు. ఈ మోడల్లో రైతు ప్రతినిత్యం పంటల సాగు నుంచి ఆదాయం గడించవచ్చు. తనకున్న మూడు ఎకరాల మామిడి తోటలో 45 సెంట్ల పొలంలో ఈ ఏటిఎం మోడల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నాడు అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం మండలం మల్లాపురంకి చెందిన రైతు నారాయణ.
నారాయణది వ్యవసాయ నేపథ్యం. తన అర్థాంగి పార్వతి సహకారంతో తమకున్న మూడు ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగు చేస్తూ వస్తూ వివిధ రకాల కారణాల వలన ఇతర పంటల సాగును ఆపి 2014వ సంవత్సరములో ఎకరానికి 70 మొక్కలు వచ్చే విధంగా వివిధ రకాల మామిడి మొక్కలు నాటారు. 2 అడుగుల లోతులో గుంతలు తీసి గుంతలలో మట్టి, పశువుల ఎరువు మిశ్రమాన్ని నింపి మామిడి మొక్కలు నాటారు. ఒకే రకమైన మామిడిని నాటకుండా మార్కెట్కి ఇబ్బంది లేని రకాలైన మల్లిక, నీలం, బంగినపల్లి మరియు బెంగుళూరు రకాలను ఎంపిక చేసుకుని నాటించాడు. 2016లో మొక్కలు నాటించి 2018 వరకు రసాయన వ్యవసాయం కొనసాగిస్తూ వస్తున్న సమయంలో 2018లో ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని అప్పటి నుంచి రసాయనాలు ఆపి పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ మామిడి సాగును కొనసాగిస్తున్నాడు. అవసరాన్ని బట్టి జీవామృతం మరియు ఘనజీవామృతం లాంటి వాటిని భూమికి అందించడంతో పాటు నీమాస్త్రం, కొబ్బరినీరు లాంటి వాటిని మామిడి మొక్కలపై అవసరాన్ని బట్టి పిచికారి చేస్తూ వస్తున్నాడు. రసాయనిక సేద్యాన్ని ప్రకృతి సేద్యంలోకి మార్చిన తరువాత తన పొలంలో వానపాముల సంచారము పెరగడము నారాయణ గమనించాడు. దానికి తోడు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పెట్టుబడులు బాగా తగ్గాయి. ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగపడే వివిధ రకాల కషాయాలు మరియు ద్రావణాలను తన భార్య పార్వతి సహకారంతో సొంతంగా తయారు చేసుకుంటూ పంటలకు ఉపయోగించుకుంటూ రావడము వలన బయట నుంచి కొనుగోలు చేయవలసిన రసాయనాలు తగ్గి తమకు పెట్టుబడి తగ్గింది అని నారాయణ వివరించారు. తమ శ్రమనే పెట్టుబడిగా పెట్టి మామిడి సాగును కొనసాగిస్తున్నాడు.
ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మారిన తరువాత దిగుబడి, నాణ్యత పెరగడముతో పాటు పెట్టుబడులు తగ్గాయి కాబట్టి మామిడి సాగు లాభదాయకంగా ఉంది కాని మామిడి దిగుబడి సంవత్సరంకు ఒక్కసారి మాత్రమే రావడం వలన సంవత్సరములో కొన్ని నెలలు మాత్రమే డబ్బు అందుబాటులో ఉండి మిగతా సమయాలలో ఆర్థిక అవసరాల కొరకు వేరే వారిని ఆశ్రయించ వలసి ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా జీరోబడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ అధికారులు ఏటిఎం పద్ధతి గురించి నారాయణకు వివరించగా నారాయణ ఆ దారిలో నడచి తన 3 ఎకరాల మామిడి తోటలో మమిడి మొక్కల మధ్యలో 45 సెంట్ల స్థలాన్ని ఏటిఎం మోడల్ అభివృద్ధికి కేటాయించారు.
ఈ ఏటిఎం మోడల్లో రైతులు నేలను సక్రమంగా సద్వినియోగం చేసుకోవడంతో పాటు మామిడి తోటలలాంటి పండ్ల తోటల మధ్యలో ఏటిఎం మోడల్లో పంటలు సాగు చేసినపుడు కలుపు సమస్య తగ్గడముతో పాటు ప్రధాన పంటకు పోషకాలు సక్రమంగా అంది దిగుబడి బాగా ఉంటుంది. తన మామిడి తోటలోని మామిడి చెట్ల మధ్యలో 45 సెంట్లు భూమిలో ఏటిఎం మోడల్ సాగు పద్ధతిలో భాగంగా నేలను సిద్ధం చేసుకుని, ఘనజీవామృతం అందించి వివిధ కాలాలలో దిగుబడిని అందించే పంటలు సాగు చేస్తున్నారు. ఈ మోడల్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం రైతుకు ప్రతి రోజు ఆదాయం కావాలి. అందుకు అనుగుణంగా వివిధ రకాల ఆకుకూరలు, వంగ, మిరప, టమాట, బెండ లాంటి కూరగాయలు, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ లాంటి దుంప జాతి కూరగాయలు, అలసందల లాంటి పప్పుజాతి పంటలు నీడ కొరకు మొక్కజొన్న లాంటి ధాన్యపు జాతి పంటలను ఎంపిక చేసుకుని సాగు చేస్తున్నారు. ఆకు కూరలు నాటిన 15-20 రోజుల నుంచి దిగుబడి మొదలవుతుంది. ఆ తరువాత వంగ, మిరప, టమాట లాంటి కూరగాయలు ఆ తరువాత ముల్లంగి, క్యారెట్ బీట్రూట్ లాంటి దుంప జాతి కూరగాయలు ఆ తరువాత అలసందలు, మొక్కజొన్నల దిగుబడి వస్తుంది. కాబట్టి రైతుకు ప్రతినిత్యం ఆదాయం రావాలనే లక్ష్యంతో మొదలు పెట్టిన ఏటిఎం మోడల్ని నారాయణ తన పొలంలో 45 సెంట్లలో సాగు చేసి విజయం సాధించాడు.
జీరోబడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ సిబ్బంది ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకుని తమ రసాయనిక సేద్యాన్ని ప్రకృతి సేద్యంలోకి మార్చడము వలన తమకు పెట్టుబడులు తగ్గడముతో పాటు దిగుబడి, నాణ్యత పెరిగింది. దానికి తోడు భూమిలో వానపాముల సంచారం పెరిగి భూమి దెబ్బతినకుండా ఉంటుందనే విషయం గ్రహించగలిగారు. ఇంకా ముఖ్యంగా మామిడి తోట వలన సంవత్సరంలో కేవలం ఒకే ఒకసారి ఆదాయం వస్తుంది కాబట్టి మామిడి దిగుబడి లేని సమయంలో ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి పరిష్కారంగా ఏటిఎం మోడల్ గురించి జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సిబ్బంది తెలియచేసి మా పొలంలో ఏటిఎం మోడల్ పంటల సాగు మొదలు పెట్టించి దిగుబడి వచ్చే వరకు క్రమం తప్పకుండా మా క్షేత్రాన్ని సందర్శిస్తూ అవసరానికి అనుగుణంగా సలహాలు అందిస్తున్న జీరోబడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ అనంతపురం డిపిఎం లక్ష్మీనారాయణ గారికి నారాయణ కృతజ్ఞతలు తెలియచేశారు. మరిన్ని వివరాలు 95504 84675లో తెలుసుకోగలరు.
పౌల్ట్రీ, జీవాల పరిశోధన అభివృద్ధిపథంలో ఇండ్బ్రో సంస్థ
ఈయనొక జంతు జన్యుశాస్త్రవేత్త. తిరుపతి వెటర్నరీ కాలేజీ నుండి 1970లో బి.వి.యస్సీ. డిగ్రీని, 1972లో ప్రతిష్ఠాకరమైన ఇండియన్ వెటర్నరీ రీసెర్చి ఇన్స్టిట్యూట్ నుండి ఎం.వి.యస్సీ. డిగ్రీని పొందిన డాక్టర్ తలపనేని కోటయ్య ఒక సాధారణ దిగువ మధ్య తరగతి రైతు బిడ్డ! వీరు 1948లో నెల్లూరు జిల్లా ఇందుపూరు గ్రామంలో జన్మించారు. తొలి నుండి పౌల్ట్రీ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెంచుకున్న డాక్టర్ కోటయ్య, తన రీసెర్చ్ గైడ్ మరియు ఇతర గురువులు, శ్రేయోభిలాషుల సలహా మేరకు పౌల్ట్రీ పరిశ్రమలో ప్రవేశించి పూనాపెర్ల్స్ మరియు కసిలా ఫార్మ్స్ మరియు హాచరీస్లలో పనిచేసి ఈ రంగంలో విలువైన అనుభవాన్ని గడించారు. ఆ తర్వాత 1993లో హైదరాబాద్ శివారు, రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ వద్ద తన కుమార్తె (పిల్లల శస్త్ర వైద్య నిపుణురాలు) మందాకిని పేర మందాకిని రిసెర్చి ఫారమ్ను స్వయంగా నెలకొల్పారు. ఆ తర్వాత థల వారీగా ఎదిగిన ఈ సంస్థ ఇండ్ బ్రో (ఇండియన్ బ్రాయిలర్) రిసెర్చ్ అండ్ బ్రీడింగ్ ఫారంగా 2000 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఈ సంస్థ రంగారెడ్డి జిల్లాలోని కేసంపేట పరిసరాలలో సుమారు 20 కిలో మీటర్ల పరిధిలో, 2 నుండి 10 కిలోల మీటర్ల దూరాలలో దూరం దూరంగా బయోసెక్యూరిటీ లక్ష్యంతో 6 ప్రాంగణాలలో నిర్మించిన పౌల్ట్రీ షెడ్లు, హాచరీస్ ఏర్పాట్లు ఈ రంగంలోకి ప్రవేశించదలచిన ఔత్సాహికులందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
2006లో పౌల్ట్రీ రంగాన్ని అతలాకుతలం చేసిన బర్డ్-ఫ్లూ వ్యాధి వల్ల భారీగా నష్టపోయిన పౌల్ట్రీ సంస్థలలో ఇండ్ బ్రో సంస్థ కూడా ఉంది. బహుశ ఇదే తర్వాత కాలంలో బయోసెక్యూరిటీ పట్ల వీరిని అప్రమత్తం చేసి, అంటురోగాల నివారణకు ఖచ్చితమైన, కఠినమైన నియమ నిబద్ధతలను పాటించుటకు ప్రేరణ అయిందని చెప్పవచ్చు. ఒకే సంస్థలోని 6-7 ఫారాల మధ్య కార్మికులు, సిబ్బంది, వారి సామగ్రి ద్వారా వ్యాధి క్రిములు వ్యాప్తి చెందకుండా ఏ ఫారం సిబ్బందికి, అక్కడే వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తూ ఫారాల మధ్య మనుషులు – ఇతర జంతువుల కదలికలను నియంత్రించుటతో పాటు ప్రతిఫారమ్ ప్రవేశం వద్ద క్రిమినాశక ఫుట్ మరియు వాహన చక్రాల ప్రక్షాళన ఏర్పాట్లతో పాటు, శానిటైజర్ జల్లులను కూడా ఏర్పాటు చేయుట జరిగింది. ఇవన్నీ కూడా ఇతర ఫారాలకు మార్గదర్శకాలు.
తన సంస్థ ఆర్థికంగా నష్టాలతో ఉన్నప్పుడు తన భార్య శ్రీమతి సుధా కోటయ్య అందించిన ప్రోత్సాహం, ధైర్యం, అండదండలతోనే తాను మరల ఉత్తేజంతో గాడిలో పెట్టగలిగారు. ఈమె అన్ని రకాల టీకాలు వేయుటలోనే కాక, ఒక రోజు కోడి పిల్లల లింగనిర్ధారణ చేయుటలో కూడా మంచి ప్రవీణురాలుగా పేరుగడించి, సంస్థ అభివృద్ధికి ప్రతి థలోనూ ఈమె కీలక పాత్ర వహించారు.
ఇండోబ్రో సంస్థ తొలి థలో దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా ఆంధ్ర-తెలంగాణా ప్రాంతాలలో పౌల్ట్రీ పరిశ్రమ కొద్ది దిగ్గజ కార్పొరేట్ సంస్థలు చేతులలో ఉంది. వీటికి ధీటుగా పౌల్ట్రీ రంగంలో నిలబడాలనే ఉద్దేశంతో వారితో పోటీ పడకుండా 80 వారాలలో ప్రత్యేక రుచితో పాటు అధిక పోషక విలువలు కలిగిన, 345 గ్రుడ్లను పెట్టగల, నాణ్యమైన గ్రుడ్లను ఉత్పత్తి చేయగల ఇండ్బ్రౌన్ లేయర్ను తానే జన్యుపరంగా వృద్ధి చేసి, వాటి గుడ్లను ఇతర సాధారణ గుడ్ల కంటే రెట్టింపు ధరకు మార్కెట్లో విక్రయిస్తూ తన వ్యాపార ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. అంతేకాక దేశీయమైన అసీల్ జాతి కోడి పుంజులతో రోడ్ ఐలాండ్ రెడ్ జాతి కోడి పెట్టలను కృత్రిమంగా సంకరపరచి వీరు రూపొందించిన ఇండ్బ్రో కలర్ బ్రాయిలర్స్ ఇతర బ్రాయిలర్స్ కంటే నెమ్మదిగా ఎదిగి అంటే 55 రోజుల వయస్సుకు సుమారు 2.0 కిలోల శరీర తూకానికి మాత్రమే చేరి నాణ్యమైన నాటు కోడిపెట్టల మాంసానికి ధీటైన, రుచికరమైన ఎక్కువ పోషక విలువలు కలిగిన మాంసాన్ని అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కలర్ బ్రాయిలర్ మాంసం ధర కూడా దాదాపుగా ఇతర బ్రాయిలర్ కోడి మాంసాల కంటే అధిక ధరను, అంటే కిలో ధర 350 రూపాయల వరకు పలుకుతోంది. ఈ ఫారాలలో ఎక్కడా అవసరానికి మించి యాంటి బయోటిక్స్ గానీ, ఇతర రసాయనాలు కానీ దాణాల రూపంలో గానీ, ఇతరత్రా గానీ వినియోగించబడవు. ఇండ్బ్రో కలర్ బ్రాయిలర్ కోడి మాంసం జాతీయ మాంస పరిశోధనా సంస్థ నుండి ప్రత్యేక ప్రశంసలు అందుకుంటోంది.
మనలో చాలామంది వినని, చూడని కృత్రిమ గర్భోత్పత్తి విధానం ద్వారా జన్మించిన అత్యున్నత స్థాయి పేరెంట్ స్టాక్ నుండి ఉత్పత్తి అయిన పొదిగే గ్రుడ్ల, రోజు వయస్సు పిల్లలు, ముఖ్యమైన వాక్సిన్స్ చేయబడిన 5 వారాల పిల్లలు మన తెలుగు రాష్ట్రాలలోనే కాక, బీహార, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు మరియు నేపాల్, కెన్యా, ఉగాండా, సెనిగల్ తదితర దేశాలకు ఎగుమతి అగుచూ, అక్కడి పౌల్ట్రీ ఫారాలలోనూ, పెరళ్ళలోనూ పెరుగుతూ పెంపకందారులకు లాభాలను అందిస్తున్నాయి.
మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇండ్బ్రో సంస్థ కోళ్ల లాభదాయకతను గుర్తించి, తాము అమలు చేస్తున్న గ్రామీణ కుటీర పరిశ్రమ మరియు మహిళా సంక్షేమ పథకాలకు ఈ కోడి పిల్లలను భారీ స్థాయిలో కొనుగోలు చేసి, వేలాది గ్రామీణ లబ్దిదారులకు పంపిణీ చేస్తూ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నాయి.
తమ వద్ద వుండే సుమారు మూడు లక్షల వివిధ రకాలు, వయస్సులోని కోళ్లకు ప్రతిరోజూ అవసరమైన సుమారు 40 టన్నుల దాణాను నాణ్యతలో ఎటువంటి రాజీపడకుండా స్వయంగా ఉత్పత్తి చేసుకొనుటకు రోజుకు 60 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కోళ్ల దాణా కర్మాగారాన్ని ఇక్కడే నిర్వహిస్తున్నారు.
ఆల్ ఇన్-ఆల్ ఔట్ పద్ధతిలో పెంచబడే లేయర్ బ్యాచ్ల వల్ల నిర్వహణా సౌలభ్యంతో పాటు మార్కెటింగ్ సౌలభ్యతను కూడా గుర్తించి ఇండ్బ్రో సంస్థ ప్రయోజనం పొందుతూ ఉంది.
ఇక్కడే పెరిగిన బ్రాయిలర్ కోళ్లు అంతర్జాతీయ జంతు వధ ప్రమాణాలకు లోబడి స్టన్నింగ్ తర్వాత మాత్రమే బాధ కలిగించకుండా మానవత్వంలో వధిచబడుటేకాక, వాటి మాంస శుద్ధి మరియు ప్యాకింగ్ కూడా అత్యున్నత శుభ్రతా ప్రమాణాలను పాటిస్తూ నిర్వహించబడుతుంది.
ఇండ్బ్రో సంస్థలో పెరిగిన ప్రతి పేరెంట్ కోడి వివరాలు, వాటి ఉత్పాదకత కంప్యూటర్లలో నిక్షిప్తమై విశ్లేకులకు అందుబాటులో ఉంటాయి. కంప్యూటర్లలో నిక్షిప్తమైన ఈ సమాచారం పౌల్ట్రీ శాస్త్ర విద్యార్థులు మరియు శాస్త్రజ్ఞుల పరిశీలనకు కూడా వారి విశ్లేషణలకు అందుబాటులో ఉంచుతున్నారు. తన సిబ్బందే తన బలం అని భావించే డాక్టర్ కోటయ్య తన వద్ద పని చేస్తున్న సుమారు రెండు వందల కార్మిక కుటుంబ సభ్యుల సంక్షేమానికి, విద్య, వైద్య సౌకర్యాలను స్వయంగా కల్పిస్తున్నారు. అందుకే ఈ సంస్థలో పనిచేసే కార్మికులు సుదీర్ఘ కాలంగా ఇక్కడే పనిలో కొనసాగుతున్నారు.
నిత్యకృషీవలుడు, నిరంతర పరిశోధకుడు, నైతికత కలిగిన వ్యాపారవేత్త అయిన డాక్టర్ కోటయ్య తన తపనను కేవలం పౌల్ట్రీ రంగానికే పరిమితం చేయకుండా 2021లో మందాకినీ గొర్రెల పరిశోధనా ఫారంను ప్రారంభించారు. ప్రస్తుతం 800 గొర్రెలు ఉన్న ఈ గొర్రెల ఫారమ్ ప్రారంభించిన తొలి సంవత్సరంలోనే అనూహ్య విజయాలను సాధిస్తూ ఈ రంగంలో తరతరాల అనుభవం గడించిన సాంప్రదాయ గొర్రెల పెంపకందారులనే కాక గొర్రెల రంగంలోని సీనియర్ శాస్త్రజ్ఞులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఈ గొర్రెల ఫారం గురించి రాబోయే సంచికలో వివరిస్తాను.
మామిడిలో చాలా రకాలు ఏడాదికి ఒకసారి మాత్రమే కాపు (పంట) నిస్తాయి. కాయలకోత తర్వాత జూన్ నుంచి సెప్టెంబరు వరకు తోటల యజమానులు పాటించిన సాగు పద్ధతులపైన అక్టోబరు-నవంబరు నెలలో ముదిరిన రెమ్మల్లో పూమొగ్గలు ఏర్పడతాయి. ఆయా రకం, వాతావరణ పరిస్థితులను బట్టి సాధారణంగా డిసెంబరు రెండో వారం నుంచి జనవరి మధ్య వరకు పూమొగ్గలు రావడం మొదలవుతుంది. అయితే ప్రస్తుతం వాతావరణంలో కలిగే మార్పుల వల్ల పూత రావడం క్రమ పద్ధతిలో జరగడం లేదు. కాబట్టి రైతులు ఈ మార్పులకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులు మార్చుకోవాల్సి ఉంటుంది.
కాయలు కోశాక చేపట్టే యాజమాన్యంపై కాయల దిగుబడి, నాణ్యత ఆధారపడి ఉంటుంది. కాయలు కోసిన తర్వాత పూత థ వరకు.. 1. కొమ్మల కత్తిరింపులు, 2. అంతర సేద్యం, 3. ఎరువుల యాజమాన్యం, 4. నీటి యాజమాన్యం, 5. సస్యరక్షణలో జాగ్రత్తలు తీసుకోవాలి.
కొమ్మల కత్తిరింపులు: ఏ పంటలోనైనా ఆకులు మాత్రమే సూర్యరశ్మి సహాయంతో కిరణజన్యసంయోగ క్రియ జరుపగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ చర్య ద్వారా చెట్టుకు కావాల్సిన ఆహార పదార్థాలు తయారై శ్వాసక్రియ ద్వారా శక్తిగా మారి పెరుగుదలకు, పుష్పించేందుకు, కాయలు వృద్ధి చెసేందుకు తోడ్పడతాయి. మనం అందించే ఎరువుల మూలంగా మామిడి చెట్టు బాగా పెరిగి ఆకుపచ్చదనం కలిగి గుబురుగా ఉన్న కొమ్మలు, ఆకులతో ఉంటుంది. ఇలాంటి చెట్లను అధ్యయనం చేయగా చివరనున్న ఆకుల విస్తీర్ణానికి అనగా 15 శాతం విస్తీర్ణానికి మాత్రమే పూర్తిగా తగినంత సూర్యరశ్మి (ఎండ) సోకుతున్నట్లు మిగిలిన 85 శాతం ఆకుల విస్తీర్ణం వివిధ స్థాయిల్లో నీడలో ఉన్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో చెట్లు తమకున్న ఆహార పదార్థాల తయారీ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేవు. దీనివల్ల ఆహార పదార్థాల ఉత్పత్తి బాగా తగ్గి దిగుబడులపై ప్రభావం చూపించినందువల్ల దిగుబడులు తగ్గుతాయి. దీనికి తోడు దురదృష్టవశాత్తు జన్యుపరంగా మామిడి ఆకులు కిరణజ్యసంయోగక్రియకు అవసరమైన శక్తిని సూర్యరశ్మి నుంచి గ్రహించడంలో జామ, సీతాఫలం లాంటి చెట్లతో పోల్చితే చాలా తక్కువ సామర్ధ్యం కలిగి ఉంటాయి.
నీడ తగిలినపుడు ఈ సామర్థ్యం మరింత తగ్గి ఉత్పత్తయ్యే ఆహార పదార్థాలు చాలా తగ్గుతాయి. ఆకులు గుబురుగా ఉన్నప్పుడు చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంగా ప్రతీ సంవత్సరం దాదాపు ఒకే స్థాయిలో దిగుబడినిచ్చే బెంగళూరు (కలెక్టర్/తోతాపురి) రకం మామిడి చెట్లను గూర్చి తెలుసుకోవాలి. బెంగళూరు చెట్టుకు కొమ్మలు, ఆకులు చాలా తక్కువగా ఉంటాయి. దానికి తోడు కొమ్మలు ఏటవాలుగా ఉంటాయి. ఈ కారణాల వల్ల ఆకులన్నింటికి సూర్యరశ్మి బాగా సోకినందున ఆహార పదార్థాల ఉత్పత్తి బాగా జరిగి కాపు బాగా ఇస్తాయి.
కొమ్మల కత్తిరింపులు:
కాయలు కోశాక 15-20 రోజులు చెట్లకు విశ్రాంతినివ్వాలి. వేసవిలో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని కాయల వృద్ధికి ఆహారాన్ని తయారు చేసి అందించినందున కొంతవరకు చెట్లు నిర్వీర్యమై ఉంటాయి. విశ్రాంతినిస్తే కొంత బలాన్ని పుంజుకుంటాయి.
విశ్రాంతినిచ్చిన తర్వాత కొమ్మల కత్తిరింపు ప్రారంభించి ఆగస్టు మధ్యలోపల కత్తిరింపులు పూర్తి చేయాలి. అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు, తెగులుసోకి ఎండిన కొమ్మలు పూర్తిగా కత్తిరించి తొలగించాలి.
వ్యవసాయ పనులకు అడ్డంగా లేకుండా నేలపై జీరాడే కొమ్మలను మొదటికి కత్తిరించి తొలగించాలి.
ఎండిన పూతకాడల (కొరడాల) ద్వారా తెగుళ్ళు, వ్యాపించే అవకాశముంటుంది. వీటిని వర్షాకాలం రాకముందే తొలగించాలి.
తలపైన 3-4 అంగుళాల మందమున్న కొమ్మను కోసి (కత్తిరించి) ఖాళీ ఏర్పరచాలి. ఇలా చేసినపుడు మధ్యాహ్నంవేళ ఎండ మొదలుపై పడి, లోపలికి ప్రసరించి ఆకులకు సోకాలి.
అవసరమైతే తూర్పు, పడమర దిశల్లో కూడా 2-3 అంగుళాల మందమున్న కొమ్మలను కత్తిరించి కొమ్మల మధ్యలో ఖాళీలు ఏర్పడేలా చేసి సూర్యుడు తూర్పున ఉదయించి పడమటి దిశకు ప్రయాణించేటప్పుడు సూర్యరశ్మి ఈ ఖాళీల ద్వారా ఆ చెట్టులోనికి ప్రసరిస్తుంది. ఈ రకం కత్తిరింపులు కొమ్మలు, ఆకులు ఎక్కువగా పుట్టే రకాలైన ఆల్ఫాన్సో (ఖాదర్), బంగినపల్లి (బేనిషాన్), నీలం లాంటి రకాలకు తప్పనిసరిగా చేయాలి.
కత్తిరింపులు చేసిన వెంటనే కోసిన/కత్తిరించిన పెద్దకొమ్మల భాగానికి చీడపీడలు ఆశించకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలి.
వేరుమూలం నుంచి వృద్ధి చెందిన చెట్లు, అధిక దిగుబడినివ్వని చెట్లు అతి తక్కువ దిగగుబడినిచ్చే రకాల చెట్లు, మార్కెట్లో మంచి ధరలు లభించని రకాల చెట్లను మంచి దిగుబడి నాణ్యమైన దిగుబడినిచ్చే మనం కోరుకున్న రకం చెట్టుగా మార్చే తలమార్పిడి (టాప్ వర్కింగ్) విధాన ప్రక్రియను జూన్ ఆఖరి వారంలో లేదా జూలై మొదటి వారంలోగా ప్రారంభించాలి.
అంతర సేద్యం:
కాయలకోత తర్వాత తోటల్లో పడి ఉన్న టెంకలను, ఎండు పుల్లలను ఏరి కాల్చివేయాలి.
జూలై నెలలో వర్షాలు కురవగానే దున్నకాలు ప్రారంభించాలి. 2-3 సార్లు దున్ని చెట్ల మధ్యలో, చెట్ల కింద కలుపు మొక్కలు లేకుండా చేయాలి. చెట్ల కింద దున్నకాలు చేయించి వీలు లేకుంటే పారలతో కుళ్ళగించాలి. దున్నకాలు చేయడం వల్ల కలుపు మొక్కలు తొలగించబడతాయి. నేల గుళ్ళబారి తోటలో పడిన వర్షం నీరు తోటలోనే ఇంకుతుంది. నేలలో ఉండే పురుగుల కోశస్థ థలు పిల్ల పురుగులు బయటపడి పకక్షులు తిన్నందున, ఎండకు, గాలికి చనిపోతాయి.
దున్నకాలు సెప్టెంబరు లోపు పూర్తి చేయాలి.
అక్టోబరు, నవంబరు నెలల్లో కొమ్మల కత్తిరింపులు, దున్నకాలు, ఎరువులు వేయడం, నీరు పారించడం చేయకూడదు. ఎందుకంటే మన ప్రాంతాల్లో ఈ నెలలో కొమ్మల లోపల మొగ్గలు ఏర్పడి పూమొగ్గలుగా, శాఖీయ మొగ్గలుగా మారుతాయి. ఈ నెలలో చేస్తే శాఖీయ మొగ్గలుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కలుపు మొక్కలు ఎక్కువగా వృద్ధి చెంది తప్పక దున్నకాలు చేయాల్సిన అవసరం ఏర్పడితే లోతుగా దున్నకుండా రోటావేటరు లాంటి వాటితో వరుసల మధ్యలో మాత్రమే దున్నాలి.
ఎరువుల యాజమాన్యం
జూలైలో చెట్ల పాదుల్లో పడిన ఎండుమామిడి ఆకుల్ని పాదుల్లో నేలలో కలిసేలా మొదలు దగ్గరకు కల్టివేటరు లేదా రోటావేటరు పోయేలా దున్నాలి. ఈ ఆకులు కొన్ని రోజులకు కుళ్ళి సేంద్రియ పదార్థంగా మారి చెట్లకు సత్తువనిస్తాయి. ఒక అంచనా ప్రకారం 20 సంవత్సరాలున్న (వయసున్న) బంగినపల్లి మామిడి చెట్టు ఒక సంవత్సరంలో 42 వేల ఆకుల్ని రాలుస్తుంది.
జూలై, ఆగస్టు నెలల్లో చెట్టుకు 50 కిలోల పశువుల ఎరువు వేయాలి. ఈ నెలల్లోనే జనుము, జీలుగ, పెసర, పిల్లిపెసర, అలసంద లాంటి పచ్చిరొట్ట పైర్లు సాగు చేసి పూత థలో నేలలో కలియదున్నాలి.
ఎరువులను చెట్టు మొదలుకు 3-4 అడుగుల దూరంలో చేసిన గాడిలో వేసి కప్పాలి.
జింకు, ఇనుము, బోరాన్ లోపాలు సాధారణంగా కనిపిస్తాయి. వీటి లోప నివారణకు సేంద్రియ రూపంలో దొరికే ఫార్ములా-4 పొడిని లీటరు నీటికి 5 గ్రా. చొప్పున కలిపి 20 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
నీటి యాజమాన్యం: మామిడి కాయల కోత తర్వాత నీటి పారుదల సౌకర్యమున్న తోటలకు నీరు పారించడాన్ని కొనసాగించాలి. కురిసే వర్షాల్ని బట్టి సెప్టెంబరు ఆఖరు వరకు నీరు పారించాలి. అక్టోబరు, నవంబరు నెలల్లో నీరు పారించకుండా చెట్లను బెట్టకు గురి చేస్తే పూత బాగా వచ్చే అవకాశం ఉంటుంది. డిసెంబరు మధ్యలో ఒక తేలికపాటి తడిస్తే పూత తొందరగా ఒకేసారి వచ్చేందుకు దోహదపడుతుంది. పిందెలు ఏర్పడినప్పటి నుంచి నీటి పారుదల ప్రారంభించాలి.
సస్యరక్షణ:
కాండం బెరడు తొలుచు పురుగుల్ని గమనిస్తే ఇవి నష్టపరచిన బెరడును తొలగించి రంధ్రంలోని రంపపు పొట్టు లాంటి దానిని తొలగించి రంధ్రంలోకి ఇనుపకడ్డీని చొప్పించి లోపలుండే పిల్ల పురుగులను బయటకు లాగి చంపాలి. రంధ్రంలో ఉండే పిల్ల పురుగులు లోపలే చనిపోవటానికి వీలైన చర్యలు చేపట్టాలి.
చెదలు నివారణకు చెట్ల మొదలు, కొమ్మలపైన, పాదుల్లో సూచించిన మందు ద్రావణం పిచికారి చేయాలి. చెట్టు మొదలు చుట్టూ గునపంతో అడుగులోతు గుంతలు నాలుగు వైపుల చేసి మందు ద్రావణాన్ని పోయాలి. చెదల పుట్టను తవ్వి అందులో ఉండే రాణి చెదపురుగుని చంపి తగినచర్యలు చేపట్టాలి.
ఆకుగూడు పురుగులు చేసిన గూళ్ళను కట్టెతో చెదరగొట్టి మందు ద్రావణం పిచికారి చేయాలి.
మామిడి కోతల తర్వాత పైన తెలిపిన యాజమాన్యం చేస్తే ముదురు తోటల పునరుద్ధరణ కూడా చేసినట్లవుతుంది.
కె. సాధన (9940236076), డా|| జె.డి. సరిత, డా. బి. పుష్పావతి, వ్యవసాయ కళాశాల, పాలెం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ.
దేశవాళి పశువుల్లో కన్నా సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువుగా ఉంటుంది. దేశవాళి పశువుల్లో ప్రాణ నష్టం అంతగా ఉండదు. మార్చి, ఏప్రిల్ మరియు ఆగష్టు మాసాలలో ఈ వ్యాధి ఎక్కువుగా వచ్చును.
వ్యాధి ఎలా వస్తుంది?
ఇది పికోర్నా విరిడే కుటుంబానికి చెందిన అప్తోస్ వైరస్ వల్ల వస్తుంది. వ్యాధి సోకిన ఆవులు, గేదెలు పాల ద్వార దూడలకి వ్యాపిస్తుంది.
వ్యాధి లక్షణాలు
1) జ్వరం 103-106 డిగ్రీల ఫారెన్హీట్కి పెరుగుతుంది.
2) పశువుల నోటిలో, చిగుళ్ళు పై పొక్కులు ఏర్పడటం వల్ల అవి మేత మరియు నీళ్ళు తీసుకోలేక నీరసించిపోతాయి.
3) నోరు మరియు గిట్టలు మధ్యలో బొబ్బలు ఏర్పడటం, 2-3 వారాల్లో అవి చితికి పుండ్లుగా మారటం.
4) నోటి నుంచి చొంగ కారుతుంది. 5) పాల ఉత్పతి తగ్గుతుంది.
వ్యాధిని ఎలా నివారించాలి
1) వ్యాధి సోకిన వాటిని వేరు చెయ్యాలి
2) పశువుల పాకని క్రిమిసంహారక మందులతో, వాషింగ్ సోడాతో కడగాలి.
3) చనిపోయిన పశువులని సున్నపు గోతిలో పూడ్చాలి.
4) వ్యాధి సోకిన పశువుల పాలను దూడలకి త్రాగించాకూడదు.
5) మార్చి-ఏప్రిల్ మరియు ఆగష్టు -సెప్టెంబర్ మాసాలకు ముందుగా వ్యాధినిరోధక టికా (ఓఖఈ వాక్సిన్) వేయించాలి.
2. నోటిలోని పుండ్లకీ గ్లిసరిన్, బోరిక్ పౌడర్ని కలిపి పుయ్యాలి.
3. డాక్టరును సంప్రదించి అవసరమైన యాంటిబయోటిక్ మరియు నొప్పి నివారణ మందులు వాడాలి.
డా.టి.జశ్వంత్ రెడ్డి, శాస్త్రవేత్త (పశు వైద్య విభాగం), డా.పి.వెంకట సుబ్బయ్య, సమన్వయకర్త, డా.ఎన్.రాజ శేఖర్, శాస్త్రవేత్త (సస్య రక్షణ), డా. కే. లక్ష్మికళ, శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం), డా. ఎన్.శివ ప్రసాద్, శాస్త్రవేత్త (సస్య పోషణ), డా.ఐ.వెంకట రెడ్డి, శాస్త్రవేత్త (వ్యవసాయ విస్తరణ విభాగం), డా.ఆర్.ప్రభావతి, శాస్త్రవేత్త (గృహవిజ్ఞాన విభాగం) డా.కె.ఎల్.రావు కృషి విజ్ఞాన కేంద్రం, ఆచార్య. ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం.
పశువులలో జననేంద్రియ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెంది పునరుత్పత్తి జరపగలిగే విధముగా అండములను విడుదల చేసే థను ప్యూబర్టీ లేదా యుక్త వయస్సు అని అంటారు. సకాలములో యుక్త వయస్సుకు రాని పశువులను మేపుట రైతన్నలకు వ్యయముతో కూడిన పని. పశువులలో యుక్తవయస్సు వాటి జీవిత కాల సంతానోత్పత్తిపై చాలా ప్రభావం చూపిస్తుంది. పశువులు సరైన సమయానికి యుక్త వయస్సుకి చేరుకోవటం వలన సంభోగాన్ని త్వరగా ప్రారంభించవచ్చు. తద్వారా సంవత్సరానికి ఒక దూడను పొందటం సులువు అవుతుంది మరియు దీని వలన పశువుల యొక్క జీవిత కాలంలో వాటి నుండి ఉత్పత్తి అయ్యే దూడల సంఖ్య పెరుగుతుంది. తద్వారా రైతుల ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది.
యుక్త వయస్సును ప్రభావితం చేసే ప్రాధమిక అంశాలు
పశువు యొక్క ఎన్నిక
ప్యూబర్టీ అనేది జన్యు మరియు జన్యు రహిత కారణాల మీద ఆధారిపడి ఉంటుంది. అలాగే యుక్త వయస్సుకు చేరుకోవడం అనే అంశము వాటి యొక్క జాతుల మీద ఆధారిపడి ఉంటుంది. దేశవాళి పశువుల కంటే సంకర జాతి పశువులు యుక్త వయస్సుకి త్వరగా రావటం గమనించవచ్చును. అలాగే వ్యవసాయానికి వాడే పశువుల కంటే పాలకొరకు వాడే పశువులు యుక్త వయస్సును త్వరగా చేరుకుంటాయి. కోడె దూడల కంటే పెయ్య దూడలు యుక్తవయస్సుకి త్వరగా వస్తాయి.
పశువు యొక్క వయస్సు మరియు శరీర బరువు
యుక్త వయస్సును ప్రభావితము చేయు అంశాలలో మరియొక ప్రధాన అంశము పశువు యొక్క శరీర బరువు. పెయ్యల పరిపక్వత వాటి వయస్సు కంటే కూడా శరీర బరువు మీద ఎక్కువశాతం ఆధార పాడి ఉంటుంది. సహజంగా సరి అయిన బరువు ఉన్న పశువులు తక్కువ బరువు కలిగిన పశువులతో పోల్చిన త్వరగా యుక్త వయస్సుకు రావడము గమనించవచ్చును. సాధారణంగా పెయ్యలు వాటి వయోజన బరువులో 2/3 వంతు లేదా 60- 65 శాతము వృద్ధి చెందినప్పుడు ప్యూబర్టీ థకు చేరుకొనును మరియు ఆ థలో జననేంద్రియాల ఎదుగుదల సక్రమముగా జరిగి సంపర్కానికి సిద్ధమవును. దీనితో పాటుగా శరీరములోని అన్నీ భాగాలు మరియు క్షీర గ్రంధులు కూడా బాగా వృద్ధి చెందటంతో పెయ్య యొక్క జీవిత కాల పాల ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకొనుటలో దోహదపడును.
సమతుల్య పోషకాహారం మరియు పెరుగుదల
పశువు యుక్త వయస్సుకి చేరుకోవడానికి ప్రధాన అంశము అయిన శరీర బరువును చేరుకొనుటకు ప్రత్యక్ష మార్గము సమతుల్య పోషకాహారం అందచేయడము. ఈ విధానము దూడలకు ముర్రు పాలు పట్టడముతో మొదలయిన వాటి జీవిత కాల సహజ రోగ నిరోధక శక్తి నిర్వహణకు ఎంతగానో తోడ్పడును, సమతుల్య పోషకాహార నిర్వహణలో భాగంగా కౌమార థకు చేరుకొనిన పశువులకు సమపాళ్ళలో పచ్చి మరియు ఎండు గడ్డిని, మరియు దాణాను అందిస్తూ అదనంగా ఖనిజ లవణముల మిశ్రమమును ఇచ్చినట్లయితే యుక్త వయస్సుకు అవసరమగు మంచి శరీర బరువును సకాలములో పొందగలవు. అసంపూర్ణ పోషణ వలన పెయ్యలలో ఎదుగుదల తగ్గిపోయి ప్యూబర్టీనీ చేరుకోవాటానికి చాలా ఆలస్యమవును. ఇటువంటి పశువులకు సమతుల్య పోషణను అందించిన యెడల అవి కూడా మంచి శరీర బరువుని పొంది, ప్యూబర్టీ థకు చేరి పునరుత్పత్తి సామర్థ్యమును పెంచుకొను ఆస్కారం కలదు.
వాతావరణ ప్రభావం
పశువులలో యుక్త వయస్సును ప్రభావితం చేసే కాలానుగుణ అంశాలలో ఋతువు అనేది ప్రధానమైనది. పాడి పశువులలో శీతాకాలం లేదా శరధృతువు అనేది యుక్త వయస్సు ప్రారంభానికి అనుకూలంగా ఉంటుంది. కావున వసంత ఋతువు లేదా వేసవి కాలం లో పుట్టిన పెయ్యల కంటే శీతాకాలంలో జన్మించిన పెయ్యలు 7 నెలల వయస్సుకి వచ్చేటప్పటికి వేసవి కాల ఉష్ణోగ్రత మరియు సూర్య కాంతి ప్రసరణ వలన యుక్త వయస్సుకు త్వరగా రావడము గమనించవచ్చును. వాతావరణం సానుకూలంగా లేనప్పటికీ నాణ్యమైన మేత, దాణ మరియు ఇతర జాగ్రత్తలు తీసుకున్న యెడల దీనిని అధిగమించవచ్చును.
పోతులకు సమీపముగ ఉంచడం
కోడెలకు సమీపములో లేని పెయ్యలతో పోల్చిన సమీపములో ఉన్న పెయ్యలు త్వరితగతిన యుక్తవయస్సుకు చేరుకొనును. కావున పెయ్యలను కోడెలతో ఉంచుట ద్వారా లేక కలిపి మేతకి పంపుట ద్వారా కలిగే బాహ్య సంకేతాల వలన మరియు పశువుల మూత్రం మరియు లాలజలం నుండి విడుదలయ్యే ప్రత్యేకమైన రసాయనాల వలన పెయ్య యొక్క జననేంద్రియాలు త్వరగా పరిపక్వత చెంది త్వరితగతిన ప్యూబర్టీ థను చేరుకొనును.
హార్మోన్లు: యుక్త వయస్సు ప్రారంభములో హార్మోనుల పాత్ర చాలా కీలకమైనది. ప్రాధమిక హార్మోనుల ఉత్పత్తి పశువు పోషణ, శరీర బరువు, కేంద్ర నాడీ వ్యవస్థ మరియు ప్రత్యుత్పత్తి హార్మోనులను స్రవించు గ్రంధుల పని తీరును బట్టి ఆధారపడి ఉండును. పశువులో ఉత్పత్తి అయిన ఈ హార్మోనులు, ఇతర ప్రత్యుత్పత్తి హార్మోనులను ప్రేరేపించి అండోత్పత్తికి అలాగే అండము విడుదలకు సహకరించును.తద్వారా పశువు త్వరితగతిన యుక్త థకు చేరి ఎద లక్షణాలను చూపును.
వ్యాధులు: పశువుల యుక్తవయస్సు పైన దుష్ప్రభావాన్ని చూపు ప్రధాన కారణాలలో ఒకటి పశువులు వ్యాధి బారిన పడడము. ఈ వ్యాధులు ప్రత్యక్షంగా పునరుత్పత్తి అవయవాల పైన చేదు ప్రభావాన్ని చూపుతూ లేదా పరోక్షంగా పశువుల జీవ క్రియ మరియు పోషక వినియోగములో ఆటంకం కలిగిస్తూ పశువు యుక్త వయస్సు చేరుకొనుటను ఆలస్యము చేయును.
యాజమాన్య పద్ధతులు
పశువుల ఎన్నికలో మెళకువలు పాటించాలి.
దూడ వయస్సు నుంచే పోషణ నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి. దూడలకు ముర్రు పాలను పట్టుట వాటి వ్యాధి నిరోధక శక్తిని పెంచుటలోనూ మరియు త్వరితగతిన యుక్త థకు చేరుకొనుటలో ఉపయోగపడును.
కౌమార థలో ఉన్న పశువులకు తప్పనిసరిగా సమతుల్య ఆహారమును, ఖనిజ లవణ మిశ్రమాన్ని తగు మోతాదులో అందించాలి.
సకాలంలో సరైన మోతాదులో నట్టల నివారణ మందులను త్రాపాలి.
కాలానుగుణంగా వ్యాధి నోరోధక టీకాలను సకాలంలో అందించాలి.
ప్రతీసారీ మందలో ఉండే పశువులతో కలపడం కంటే బయట పశువులతో దాటించడం వలన పుట్టే దూడలు యుక్తవయస్సుకు వచ్చే కాలం మరింత తగ్గుతుంది.
పశువులను అధిక వేడిమి, వేడి గాలుల నుంచి రక్షణ కల్పించాలి.
పశువులకు తగు వ్యాయామమును కల్పించుట వలన మంచి దేహ ధారుడ్యము కలిగి త్వరగా యుక్త థకు చేరుకొనును.
యుక్త వయస్సుకు త్వరగా రాని పశువులను కొంత కాలము మగ పశువులతో కలిపి ఉంచుట సత్ఫలితాలను ఇచ్చును.
పైన తెలిపిన యాజమాన్య పద్ధతులు ఫలించని యెడల రైతులు ఆలస్యము చేయక తమ పశువుకు పశు వైద్యునిచే పరీక్ష చేయించి తగిన వైద్యము అందించాలి.
డా. కె. హిమ బిందు (7780726071), పి.జి. విద్యార్ధిని,
డా. యస్.రాధిక (6281354568) పి.జి, సహాయ ఆచార్యులు,
పశు గర్భకోశ శాస్త్ర మరియు ప్రసూతి విభాగము, ఎన్.టి.ఆర్ పశు వైద్య కళాశాల, గన్నవరం,
శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి.
మనతోపాటు ఈ విశ్వంలో జీవనాన్ని కొనసాగిస్తున్న అనంత జీవకోటి, ఈ విశ్వంలో ఉన్న అన్నీ కూడా ప్రకృతిలో భాగమే. మిగతా వాటి గురించి ప్రక్కన పెడితే భూమండలంలో జీవించే ప్రాణికోటి మొత్తం ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తుంది. మనం పీల్చే గాలి, మనం త్రాగే నీరు, మనం తినే ఆహారం. ఇలాంటివన్నీ కూడా ప్రకృతిలో నుంచి మనం పొందుతున్నాము. ఈ విషయం అందరికీ తెలిసిందే కాని చాలామంది ఈ విషయాన్ని గ్రహించకుండా ప్రకృతిని అశ్రద్ధ చేస్తున్నారు. ప్రకృతి అంటే ఏదో తమకు సంబంధించినది కాదు అనే భావంతో చాలామంది తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతిని అశ్రద్ధ చేస్తున్నారు. ప్రకృతిని అశ్రద్ధ చేయటం వలన, ప్రకృతికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను ఇవ్వలేకపోవడం వలన అనేక అనర్థాలు జరిగాయి. జరుగుతున్నాయి. ఇంకా కూడా జరుగుతూనే ఉంటాయి అనే మాట అక్షర సత్యం. ప్రకృతి వలన జరిగే అనార్థల గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవాలంటే ఇటీవల ఉద్భవించిన కరోనాను ఉదాహరణగా తీసుకుంటే అందరికీ బాగా అర్థం అవుతాది కరోనా ఇటీవల జరిగిన వినాశనం కాబట్టి అందరికీ గుర్తు ఉంటుంది. ప్రపంచం మొత్తం కరోనాతో అతాలకుతలం అయ్యిందనే విషయం అందరికీ తెలిసిందే.
కరోనా వలన కొంతమంది చాలా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది తక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయం అర్ధం అవుతుంది. ప్రకృతికి దగ్గరగా జీవిస్తూ, ప్రకృతితో ఎక్కువగా మమేకమయ్యేవారు కరోనా వలన పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. ప్రకృతికి దూరం జరిగి, ప్రకతికి విరుద్ధమైన జీవనశైలికి అలవాటు పడ్డవారు కరోనా వలన ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయం అక్షర సత్యం. ఈ ఉదాహరణతో ప్రకృతి యొక్క ప్రాముఖ్యత సులభంగా తెలుసుకోవచ్చు. మనము మరియు మనతోపాటు జీవనాన్ని కొనసాగించే అనంత జీవకోటి క్షేమంగా జీవనాన్ని కొనసాగించాలంటే ప్రకృతిని ఇబ్బంది పెట్టకూడదు. ప్రకృతిని నాశనం చేయకూడదు అనే విషయం తెలుస్తుంది. మిగతా రంగాలను ప్రక్కన పెడితే వ్యవసాయ రంగం కూడా ప్రకృతిని ఇబ్బంది పెట్టడములో తనవంతు పాత్రను పోషిస్తుందనడంలో సందేహం లేదు. దాని ఫలితంగానే వ్యవసాయరంగంలో అనేక ఆటుపోట్లు సంభవిస్తున్నాయి. రైతులు అనేక రకాలుగా నష్టాలను భరించవలసి వస్తుంది. విష రసాయనాలతో పండించిన ఆహారాలను రైతులు ప్రజలకు అందిస్తున్నారు. విష రసాయనాలతో నేల, నీరు, ఆహారం, వాతావరణం కలుషితమవుతుంది. అందువలననే అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. ఈ విషయాలను గమనించిన చాలామంది ఔత్సాహికులు ప్రకృతిని ఇబ్బంది పెట్టని సాగు పద్ధతుల వైపు అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. ఈ కోవకి చెందుతారు హైదరాబాదు శివారు ఘట్కేసర్లో వివిధ రకాల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో పండిస్తున్న విజయ్.
వ్యవసాయరంగంతో ఏలాంటి ప్రత్యక్ష సంబంధం లేని విజయ్ ఉన్నత చదువులు చదివి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో మనం తినే ఆహారంలో ఉండే విష రసాయనాల గురించి తెలుసుకుని తన గమ్యం ఆరోగ్యకర ఆహారాన్ని సమాజానికి అందిస్తూ రసాయన అవశేషాలు లేని భూమిని తరువాత తరాలకి అందించడమే అని తలచి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి వ్యవసాయరంగంలో అడుగు పెట్టాడు. తనకు సొంత భూమి లేదు కాబట్టి ఘట్కేసర్ సమీపంలోని అవిషాపూర్లో కొంత పొలాన్ని కౌలుకి తీసుకుని 2015 వ సంత్సరం నుండి పూర్తి సేంద్రియ పద్ధతులో వరి, మామిడి, వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల సాగుతో పాటు నాటుకోళ్ళను కూడా పోషిస్తూ గుడ్లను వినియోగదారులకు అందిస్తూ వస్తున్నారు.
తాము వ్యవసాయంలోకి ప్రవేశించిన ప్రారంభంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినాకాని వెనుకంజ వేయకుండా అన్ని ఆటుపోట్లను తట్టుకుంటూ ముందుకు నడుస్తూ తమ సమస్యలకు కొంతలో కొంత పరిష్కారంగా సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాల దుకాణాన్ని హైదరాబాద్ నగరంలోని అల్వాలు ప్రాంతంలో ప్రాచీన పేరుతో ఏర్పాటు చేశారు. సేంద్రియ సాగులో ఎదరుయ్యే ఆర్థిక సమస్యలకు పరిష్కారం కావాలంటే తమ సేంద్రియ ఉత్పత్తులను ఆశాజనకమయిన ధరలకు వినియోగదారులకు నేరుగా అమ్మగలగాలి. దానికి సరైన దారి సేంద్రియ ఉత్పత్తుల అమ్మకం దుకాణం కాబట్టి అటువైపు అడుగులు వేశారు. వినియోగదారులకు అవసరమయిన అన్ని వస్తువులను అందుబాటులో ఉంచాలి కాబట్టి తాము పండించలేని ఆహార ఉత్పత్తులను తోటి రైతుల చేత పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేయించి రైతుల వద్ద నుంచి మంచి ధరలకు ఉత్పత్తులను కోనుగోలు చేసి వినియోగదారులకు అందిస్తున్నారు. తాము ఒప్పందం కుదుర్చుకున్న రైతులకు అన్ని సాంకేతిక సలహాలను సమయానుకూలంగా అందిస్తూ రైతులు ఆరోగ్యకర దిగుబడి సాధించటములో తమవంతు పాత్రను పోషిస్తున్నారు.
మామిడి: మిగతా ఆహార పదార్థాల కంటే మామిడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తాము సొంతంగా మామిడి సాగు చేయడముతో పాటు తోటి మామిడి రైతుల వద్ద నుంచి కూడా మామిడి కాయలు కొనుగోలు చేస్తూ సంవత్సరానికి 10000 కిలోలకు తగ్గకుండా ఆరోగ్యకరమయిన, రుచికరమైన మామిడి కాయలను వినియోగదారులకు సరసమైన ధరలకు అందిస్తున్నారు. ఒక్కసారి ఈ మామిడి కాయల రుచి చూసిన వినియోగదారులు తిరిగి తిరిగి కొనుగోలు చేస్తున్నారు. మొదటలో 100 మందితో మొదలైన వినియోగదారుల సంఖ్య ప్రస్తుతానికి 3000 పైగా పెరిగింది. మామిడి కాయల నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీపడకపోవటం వలననే వినియోగదారుల సంఖ్య పెరిగింది.
మామిడితో పాటు వరి, వివిధ రకాల ఆకుకూరలు, గోరుచిక్కుడు, చిక్కుడు, టమాట, చెర్రి టమాట లాంటి వాటిని పూర్తి సేంద్రియ పద్ధతులతో పండిస్తున్నారు. వీరు సాగు చేసే పంటలకు దుక్కిలో పశువుల ఎరువు, గొర్రెల, మేకల ఎరువు అందించడంతో పాటు పంచగవ్య, జీవామృతం, థపర్ణి కషాయం, నీమాస్త్రం లాంటి వాటిని ఉపయోగిస్తూ ఎలాంటి రసాయనాలు లేకుండా పూర్తి సేంద్రియ పద్ధతులతో ఆరోగ్యకర దిగుబడులు సాధిస్తూ సొంతంగా వినియోగదారులకు అమ్మకం చేస్తున్నారు. మరిన్ని వివరాలు 9848312988 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
మామిడి కాయలను ఇబ్బంది పెట్టకుండా సహజంగా పండనివ్వాలి
మనం పొందే ఆహారం ప్రకృతి నుంచే లభిస్తుంది కాబట్టి ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని పొందగలిగితే ఆ ఆహారం రుచిగా, ఆరోగ్యంగా ఉంటుందనడంలో సందేహం లేదు. మామిడిని ఉదాహరణగా తీసుకుంటే కొంతమంది రైతులు వివిధ రకాల కారణాలు, సమస్యల వలన పూర్తిగా తయారు కాని మామిడి కాయలను వివిధ రకాల పద్ధతులతో మాగించి మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తున్నారు. కాబట్టి అవి సరిగ్గా రుచిగా లేకపోవడంతో పాటు అరోగ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా పూర్తిగా తయారయిన కాయలను మాత్రమే చెట్టునుంచి కోసి, ఆ కాయలను 40 డిగ్రీల సెంటీగ్రేడు ఉన్న వెచ్చని నీటిలో కడిగి అవి ఆరిన తరువాత వరిగడ్డిలో మాగపెట్టి వినియోగదారులకు అందిస్తున్నారు. ఇక్కడ వీరు మామిడి కాయలను ఇబ్బంది పెట్టకుండా సహజ సిద్ధంగా పండే అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి రుచి బాగా ఉంటుంది. కాబట్టి వినియోగదారులు మరలా మరలా కొనుగోలు చేస్తున్నారని విజయ్ అంటున్నారు. బంగినపల్లి, చిన్నరసాలు, పెద్ద రసాలు, థేరి, కేసరి లాంటి రకాలను ఎక్కువగా అమ్మకం చేస్తున్నారు.
వినియోగదారుల ఆరోగ్యం, ఆనందం మాకు తృప్తినిస్తుంది
వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నాము కాబట్టి వినియోగదారుల సంఖ్య ఏఏటికాయేడు పెరుగుతూ ఉంది. మేము అందించిన మామిడికాయలు తిన్న వినియోగదారులు మామిడి కాయల రుచిని ఆస్వాదించిన తరువాత తమ ఆనందాన్ని మాకు తెలియచేస్తున్నారు. కొంతమంది వినియోగదారులు మామిడి రుచి ఇలా ఉంటుందనే విషయం మేము అందించిన మామిడి పండ్లను తిన్న తరువాత తెలిసిందని, నిజమైన మామిడి రుచిని తెలియ చేసినందుకు మాకు కృతజ్ఞతలు చెబుతూ మెసేజ్లు పంపుతుంటారు. ఇలాంటి మెసేజ్లు మాకు ఎంతో తృప్తిని కలుగ చేస్తున్నవని, సమాజానికి ఆరోగ్యకర ఆహారాన్ని అందించే సామాజిక బాధ్యత గల వ్యాపకంలో ఉండటము మాకు చాలా ఆనందంగా ఉందని విజయ్ అభిప్రాయపడుతున్నాడు.
ప్రపంచ వ్యవసాయంలో భారతదేశం ఆహార ధాన్యాలు, నూనెగింజలు మరియు చెరుకు ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుంది. వివిధ విభిన్న వ్యవసాయ వాతావరణ పంటలు దేశం మండలాల్లో అనేక రకాలు నలుమూలల్లో పండిస్తున్నారు. ఈ పంటల నుండి ప్రధాన ఆర్థిక ఉత్పత్తుల వినియోగం కోసం కోతానంతరం దాదాపు 500 మిలియన్ టన్నులు ఒక సంవత్సరానికి పంట అవశేషాలు భారతదేశంలో లభ్యమవుతున్నాయి. స్థానిక అవసరాలైన పశువుల మేత, వంట చెరకు మరియు సేంద్రియ ఎరువులుగా వాడిన తర్వాత కూడా దాదాపు 30% పంట అవశేషాలు మిగులు ఉంటుంది. అంటే సంవత్సరానికి 234 మిలియన్ టన్నులు మిగులు ఉంటుందని చాలామంది రైతులు ఎంతో విలువైన పంట అవశేషాలను తగులబెట్టి తర్వాత పంటకు నేలని తయారు చేస్తున్నారు. ముఖ్యంగా వరి, ప్రత్తి, మొక్కజొన్న, చెరకు మరియు వేరుశనగ లాంటి పంట వ్యర్థాలు ప్రపంచ వ్యాప్తంగా పంట వ్యర్థాలను తగలబెట్టటంలో చైనా, భారత్, అమెరికా మరియు ఆఫ్రికా దేశాలు అగ్ర స్థానంలో నిలుస్తున్నాయి. కేవలం వరి, గోధుమ మరియు చెరకు పంటల వ్యర్థాలు తగలబెట్టటంలో 82% వాటా కలిగి ఉన్నాయి.
పంట అవశేషాలను తగలబెట్టుటకు ముఖ్య కారణాలు:
వరిని కంబైన్డ్ హార్వెస్టర్తో కోత కోసినప్పుడు వెలువడిన అవశేషాలు ఏరుట కష్టంగా ఉండడం
పశు సంపద తగ్గిపోవడం
పంట వ్యర్థాలు కుళ్ళడానికి 15-20 రోజుల సమయం వృధా కావడం
వేగంగా కలుపు మరియు చీడపీడల నివారణ జరగడం
వ్యర్థాల యాజమాన్యానికి అధిక ఖర్చు కావడం
పంట అవశేషాలను తగలబెట్టడం వలన కలిగే నష్టాలు
వాతావరణ కాలుష్య కారకాలు అయిన విషవాయువులు ముఖ్యంగా మీథేన్ మరియు కార్బన్డయాక్సైడ్ వెలువడటం.
వాతావరణ మార్పులు జరగడం
నేలలో పోషకాల క్షీణత అనగా ఒక టన్ను పంట వ్యర్థాలు తగలబెట్టడం వలన 5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల భాస్వరము, 25 కిలోల పొటాష్, 1.2 కిలోల గంధకము మరియు 400 కిలోల సేంద్రీయ కర్బనం నష్టపోవడం జరుగుతుంది.
మానవుల ఊపిరితిత్తులకు సమస్యలు కలిగించే క్యాన్సర్ కారకాలు విడుదలవుతున్నాయి.
పంట అవశేషాలు సుస్థిర యాజమాన్యం
స్వల్పకాలిక వరి రకాలను ఎన్నుకోవడం ద్వారా త్వరగా కోతలు చేపట్టి పంట వ్యర్థాలను నేలలో కలియదున్నుకోవాలి.
పంట మార్పిడి చేయడంతో పంట అవశేషాలు యాజమాన్యం సలువుగా ఉంటుంది.
పంట అవశేషాలను సైలేజ్గా పశుగ్రాసాలుగా వాడుకోవడం
పంట అవశేషాలను వివిధ రకాల జీవుల సమ్మేళనంతో (వేస్ట్ డికంపోజర్) కంపోస్టింగ్ పద్ధతిలో వాడుకోవడం ద్వారా నేల భౌతిక మరియు రసాయన లక్షణాలు మెరుగపడడమే కాకుండా భూసారం మరియు నీరు నిలుపుకునే శక్తి పెరుగుతుంది.
వరి, గోధుమ, పొద్దు తిరుగుడు మరియు మొక్కజొన్న వంటి పంటల వ్యర్థాలను, విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమకు ముడి సరుకుగా వాడుతున్నారు.
వరి, మొక్కజొన్న, జొన్న మరియు సజ్జ వంటి పంటల నుండి వెలువడిన అవశేషాలను మల్చింగ్గా వాడవచ్చు.
వరి అవశేషాలను పుట్టగొడుగుల పరిశ్రమకు వాడడం జరుగుతుంది.
మొక్కజొన్న, జొన్న వ్యర్థాలను జీవ ఇంధనం తయారీకి వాడుతున్నారు.
ప్రత్తి, చెరుకు పంటల అవశేషాలతో పేపర్ తయారు చేస్తున్నారు.
ప్యాకింగ్ పదార్థాలుగా పంట అవశేషాలు వాడడం
వరి కోత యంత్రాలకు, వరిగడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసే పరికరాన్ని అమర్చుకోవడం ద్వారా పంట అవశేషాలు నేలలో త్వరగా విచ్ఛిన్నం కావడానికి వీలుగా ఉంటుంది.
వరిగడ్డిని చుట్టలుగా చుట్టే యంత్రంను వాడడం.
పత్తి పంటను తీసుకున్న తర్వాత షెడ్డర్ యంత్రంతో చిన్న ముక్కలుగా చేసి నేలలో కలియదున్నడం.
వరి పంట తర్వాత దున్నకుండా మొక్కజొన్న పంటను జీరో టిల్లేజ్ పద్ధతిలో సాగు చేయడం.
పత్తి, కంది కట్టెలను బయోచార్ రూపంలో కాలబెట్టి పంటలకు వాడటం.
పంట వ్యర్థాలను బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా బయోగ్యాస్ తయారీకి వినియోగించడం.
పంట అవశేషాలను వర్మీకంపోస్ట్గా తయారు చేసి కేవలం 45 రోజుల్లో పంటలకు ఎరువుగా అందించడం.
హ్యాపీ సీడర్ పరికరంతో తరువాత పంటను సాళ్లల్లో పెట్టుకోవడం ద్వారా పంట అవశేషాలు నేలలో ఉన్నప్పటికీ మొకల శాతం దెబ్బతినకుండా ఉంటుంది.
మల్చర్ అనే పరికరంతో వరి, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు మరియు పొగాకు పంట అవశేషాలను మల్చింగ్ కొరకు వాడుకోవడం
రోటోవేటర్ను ఉపయోగించి వేసవిలో మిగిలిన పంట వ్యర్థాలను భూమిలో కలియ దున్నడం.
ఈ విధంగా ఎంతో విలువైన పంట అవశేషాలు తగలబెట్టకుండా వ్యవసాయంతో పటు వివిధ పరిశ్రమలకు ముడి సరుకుగా వాడుతూ సద్వినియోగం చేయడం ద్వారా వృధాగా పోయే వాటిని సంపదగా మార్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని రైతు సోదరులు గమనించాలి.
డా. టి. వినోద్ కుమార్, వ్యవసాయ విస్తరణ విభాగ శాస్త్రవేత్త,
బి. నవ్య, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త, డా|| ఎ. శ్రీనివాస్, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ అండ్ హెడ్, కెవికె, శ్రీ కొండా లక్ష్మణ్ తెంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రామ్గిర్ ఖిల్లా, పెద్దపల్లి.
వ్యవసాయనికి అనుబంధ రంగమైన పుట్టగొడుగుల పెంపకం, యువతకు మరియు ఇంట్లోనే ఉంటూ ఉపాధి చేసుకోగలిగిన మహిళలకు ఎంతో లాభకారమైనది. వివిధ రకాల పుట్టగొడుగులు మన దేశములో సాగు చేయబడుచున్నవి. అందులో ముఖ్యముగా శ్రీకాకులము జిల్లా యొక్క వాతావరణ పరిస్థితుల్లో ముత్యపుచిప్ప పుట్టగొడుగు, వరి గడ్డి పుట్టగొడుగు మరియు పాల పుట్టగొడుగుల పెంపకము చేపట్టవచ్చును. ఎన్నో పోషక విలువలు కలిగి ఉండి, క్రొవ్వు మరియు పిండి పద్ధారం తక్కువగా ఉండటం మరియు ముఖ్యంగా మాంసకృత్తులు అధికంగా ఉండటం వీటి ప్రత్యేకత. పెరుగుదలకు కావాల్సిన లైసిన్ అనే అమైనో ఆమ్లం వీటిలో ఉండటం వల్ల ఇవి అధిక జీర్ణ శక్తిని (60-70%) కలిగి ఉంటాయి. పుట్టగొడుగుల్లో కొవ్వు పదార్ధాలు చాలా తక్కువగా ఉండటమేకాక ఇవి శరీరానికి అవసరమైన మంచి కొలస్ట్రాల్ ను పెంచుతూ, గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
ఇటీవల కాలంలో పుట్టగొడుగులలో ఉండే పోషక విలువలు, ఉపయోగాల గురించి అందరిలో అవగాహన పెరుగుతున్నందు వల్ల, మరియు వాతావరణ పరిస్ధితులకు అనుకూలమైన వివిధ రకాల పుట్టగొడుగులు అందుబాటులో ఉండటం వలన చాలా మంది నిరుద్యోగ యువత, రైతులతో పాటు మహిళలు కూడా పుట్టగొడుగుల పెంపకం పై ఆసక్తి చూపిస్తున్నారు.
1. ముత్యపు చిప్ప పుట్టగొడుగులు
ఈ పుట్టగొడుగులు విచ్చుకొని ముత్యపు చిప్ప ఆకారంలో ఉండటం వల్ల వీటికి ఆపేరు వచ్చింది. వీటిలో తెల్ల ముత్యపు చిప్ప, ఎల్లో ముత్యపు చిప్ప, గ్రే మరియు పింక్ రకం ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిని రైతులు తమ వద్ద లభించే వరిగడ్డితోనే కాక వ్యవసాయ సంబంధమైన ఏ వ్యర్ధపదార్డం ఉపయోగించి అయినా సులభంగా పండించవచ్చును. మిగతా రకాలతో పోలిస్తే ఇవి అధిక దిగుబడులను ఇస్తాయి. కాబట్టి తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడికి అధిక లాభాలను సంపాదించే రకంగా ఇవి ప్రాచుర్యాన్ని పొందాయి. వీటిని అధికంగా దక్షిణ భారతదేశంలో సాగు చేస్తారు.
సాగు చేయు విధానం :
వరిగడ్డి చౌకగా మరియు సులభంగా దొరకటం వల్ల దీన్ని వాడతారు. ముందుగా వరిగడ్డిని 3-5 సెం.మీ. ముక్కలుగా చేసుకోవాలి. తరువాత మంచి నీటిలో 4-6 గంటలు నానబెట్టిన తర్వాత నీటిని తీసివేయాలి. ఇలా నానబెట్టిన గడ్డిని గొనె సంచిలో నింపి వేడి నీటిలో ఒక గంట పాటు ఉంచి తరువాత తీసివేసి గడ్డిలో 60-65% తేమ ఉండేలా ఆరబెట్టాలి. తేమ శాతం తనిఖీ చేయడానికి చేతినిండా గడ్డిని తీసుకోని వెళ్ళ మధ్య ఉంచి పిండినట్లయితే నీరు కారకుండా ఉన్నట్లయితే తగినంత తేమ శాతం ఉన్నట్లుగా నిర్ధారించుకోవచ్చు. పాలిధీన్ సంచుల్లో ఆరబెట్టిన వరిగడ్డి ముక్కల్ని 5 సెం. మీ. మందాన వేసి విత్తనాన్ని అంచుల వెంట కాకుండా మధ్యలో వేయాలి. 1 కేజీ వరిగడ్డికి 50 గ్రా. స్పాన్ కలిపి మరి గట్టిగా వత్తకుండా సంచులలో నింపి రబ్బరు బ్యాండ్ బిగించాలి. తర్వాత సంచులను స్పాన్ రన్నింగ్ గదిలోకి మార్చాలి.
ప్రతి రోజు గదిలో తగినంత తేమ, ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 3-4 వారాల్లో బెడ్లపైన తెల్లని శిలింధ్రం దట్టంగా వ్యాపిస్తుంది. ఇలా తయారైన బెడ్లపైన పాలిధీన్ సంచులను శుద్ధి చేసిన బ్లేడుతో కత్తిరించాలి. గదిలో గాలి మరియు వెలుతురు సరఫరా అయ్యేలా చూసుకోవాలి.
ఇలా చేసిన తర్వాత 6-7 రోజులకు మొదటి పంట వస్తుంది. బెడ్లను రోజుకు 2 సార్లు తడిపి తేమ 65% ఉండేలా చూసుకోవాలి. తర్వాత 15 రోజుల వ్యవధిలో రెండవ మరియు మూడవ పంట వస్తుంది. బెడ్లను ప్రతిరోజు పరిశీలిస్తూ నలుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగు ఉన్న బెడ్లను తీసి దూరంగా గుంటలో వేయాలి. లేకుంటే ఇతర బెడ్లకు వ్యాపించే అవకాశం ఉన్నది. ప్రతి కిలో ఎండు గడ్డి నుండి దాదాపు కిలో పచ్చి పుట్టగొడుగులు వస్తాయి. వీటిని తాజాగా ఉన్నప్పుడే 24 గంటల్లో మార్కెటింగ్ చేయాలి. ఫ్రిజిలో అయితే 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అదే ఎల్లో పుట్టగొడుగులు గది ఉష్ణోగ్రత వద్ద 3 రోజులు మరియు ఫ్రిజ్ లో అయితే 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి.
2. పాల పుట్టగొడుగులు
ఈ పుట్టగొడుగుల పెంపకం కొద్దిపాటి చిన్న మార్పులతో ముత్యపుచిప్ప పుట్టగొడుగుల పెంపకమును పోలి ఉంటుంది. ఈ పుట్ట గొడుగుల పెంపకానికి 30-35 డిగ్రీల సెం. ఉష్ణోగ్రత మరియు 80-95% గాలిలో తేమ తగిన వెలుతురు అవసరం. మార్చి నుండి అక్టోబరు వరకు గల వాతావరణం చక్కగా అనుకూలిస్తుంది. పరిస్దితులకు అనుకూలంగా తగుపాటి జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరమంతా ఈ పుట్టగొడుగుల పెంపకం చేపట్టవచ్చును.
సాగుచేయు విధానం
వీటి సాగులో రెండు థలు ఉంటాయి. మొదటి 21- 24 రోజులు ఇంక్యుబేషన్ కోసం డార్క్ రూమ్ సృష్టించుకోవాలి. 24వ రోజున కేసింగ్ చేసి కాంతి అందే చోట సాగు చేయాలి.
పాల పుట్టగొడుగు సాగు కోసం వరిగడ్డిని సేకరించి క్రీమిరహితం చేసుకోవాలి. ఇలా క్రిమీరహితం చేసిన గడ్డిని 50% తేమశాతం ఉండేలా ఆరబెట్టుకోవాలి. నాణ్యమైన పాల పుట్టగొడుగు స్పాన్ను తీసుకొని, సమాన నాలుగు భాగాలుగా చేసుకోవాలి. స్పానింగ్ చేసే ముందు చేతులను క్రిమిరహితం చేసుకోవాలి. ఒక ప్లాస్టిక్ సంచిలో స్పాన్ మరియు వరిగడ్డి పొరలుగా వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బ్యాగులకు రంధ్రాలు పెట్టి వాటిని డార్క్ రూమ్ లో 21-24 రోజుల వరకు ఉంచవలెను. డార్క్ రూమ్ లో 28-35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండాలి.
కేసింగ్ ప్రక్రియ 24 వ రోజున పాటించవలెను. ఇందుకోసం నల్లమట్టి, కొకోపీట్, వెర్మికాంపోస్ట్,వంటివి వాడవలెను. పి. హెచ్ నిర్వహణ కోసం చాక్ పౌడెర్ వంటివి కలపవచ్చు. ఒక సంచిని రెండు భాగాలుగా చేసి దానిమీద కేసింగ్ మట్టిని వేసుకోవాలి. ఇలా కేసింగ్ చేసిన వాటిని కాంతి అందే గదిలో పెట్టుకోవాలి. ఇక్కడ 28-35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు 80-85% తేమశాతం ఉండవలెను. ప్రతిరోజు పైన ఉన్న మట్టిలో తేమశాతం ఉండేలా చూసుకోవాలి. ఒక 10-12 రోజుల తరువాత మొలకలు కనిపిస్తాయి అనంతరం 18-20 రోజుల్లో పంట అందుతుంది.
3. వరిగడ్డి పుట్టగొడుగులు
ఈ పుట్టగొడుగులు ఉత్తరకోస్తాంధ్రలో మరియు ఒడిస్సా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేయబడుచున్నవి. వీటిని పెంచటానికి వరిగడ్డిని ఉపయోగిస్తారు. వీటి కాడలు మృదువుగా ఉండి పొడవుంటాయి. వీటి పెరుగుదలకు 30-350 సెల్సియస్ ఉష్ణోగ్రత మరియు 85-90% గాలిలో తేమ ఉండే ప్రదేశాలు అనుకూల మైనవి. వరిగడ్డి పుట్టగొడుగులను గడ్డి పుట్టగొడుగులు అని, ప్యాడి స్ట్రా పుట్టగొడుగులు అని అంటారు. ఈ పుట్టగోడుగులు విత్తనం వేసిన 15 రోజులలో కోతకు వస్తాయి. ఈ రకం పుట్టగొడుగుల నిల్వ కాలం 24 గంటలు మాత్రమే ఉంటుంది. తర్వాత పుట్టగొడుగులు నీరులాగ వాసన ప్రసరింపచేస్తాయి.
సాగు చేయు విధానం
ఒక కిలో వరిగడ్డిని సుమారు 5 సెం. మీ. మందం, 85-90 సెం.మీ. పొడవు గల కట్టలుగా కట్టాలి. ఇటుకలు పేర్చి నేల మట్టానికి కొంచెం ఎత్తుగా మడి చేయడానికి ప్లాటఫారామ్ తయారు చేయాలి. గడ్డి కట్టలను నీటిలో ముంచి సుమారు 12-16 గంటలు నానబెట్టి తీయాలి. ఎక్కవగా ఉన్న నీరు జారిపోయేటట్లుగా కట్టలను 15-20 నిమిషాలు నిలబెట్టాలి. కొయ్య చట్టాన్ని తుడుచి శుభ్ర పరచాలి. దానిని ప్లాట్ ఫాం పై ఉంచి మొదటి వరుస 6-8 గడ్డి కట్టలను ఒకదాని ప్రక్కన ఒకటిగా పేర్చాలి. మొదటి వరుస కట్టలపై పుట్టగొడుగుల విత్తనాన్ని అంచుల నుండి 10 సెం. మీ ఎడంగా కుప్పలుగా నాలుగు ప్రక్కలా ఉంచాలి. మొదటి వరుస గడ్డి కట్టల పై సుమారుగా 5 గ్రా. పప్పుపోడిని మరియు నీటిని చల్లాలి. అదే విధంగా మొదటి వరుసకు అడ్డంగా నీటిని చల్లాలి. అదే విధంగా మొదటి వరుసకు అడ్డంగా రెండో వరుస వేసి మూడవ వరుసకు అడ్డంగా నాల్గవ వరుస గడ్డి కట్టలను పేర్చుతూ వరుసల మధ్య విత్తనాన్ని, పప్పుపొడి, యూరియా నీళ్ళను చల్లాని. ఐదవ వరుస పై అంచుల వెంటనే కాకుండా ఉపరితలం అంతటా విత్తనం పప్పుపొడి, యూరియా నీళ్ళను చల్లాలి. చేతులతో కట్టలను కొంచెం నొక్కి మైనపు కాగితంతో కప్పాలి. ప్రతి రోజు మైనపు కాగితాన్ని తీసి మడిలో తేమ ఆరిపోకుండా కొంచెం మంచి నీటిని చల్లాలి. గది/పాకలో తగినంత తేమ, చల్లదనం కొరకు గోడల వెంట తడిపిన గొనె పట్టాలను వ్రేలాడదీసి అవసరము మేర వాటిని నీటితో తడుపుతూ ఉండాలి. వారము నుండి పది రోజులలో పుట్టగొడుగుల మొలకలను గమనించవచ్చును.
ఇవి 4-5 రోజులలో బాగా పెద్దవి అవుతాయి. గొడుగులు విచ్చుకోకముందే అంటే గుండు థలోనే వాటిని కోసుకోవాలి. ఒక వారం రోజులలో రెండవ కాపు మరొక వారంలో మూడవ కాపు వస్తాయి. పుట్టగొడుగులు ప్రతి మడికి 2-3 కిలోలు రాగలవు. మడికి చీమలు పట్టకుండా 10 శాతం బి.హెచ్.సి పొడిన చల్లాలి. మడిని నీలి / ఆకుపచ్చ / నలుపు రంగు గల శిలీంధ్రము ఆశించే అవకాశముంది. అటువంటి వాటిని తీసి నాశనం చేయాలి. లేనిచో మిగిలిన వాటికీ కూడా ఈ శిలింధ్రం వ్యాపించి ఎక్కువ నష్టం కలుగచేస్తుంది. గొడుగులు విచ్చుకోక ముందు కోయవలెను. కోసిన తరువాత వేడి నీళ్ళలో గాని, ఉప్పు నీళ్ళలో గాని ఉంచవలెను.
పుట్టగొడుగులపై వచ్చే వ్యాధులు-నివారణ
ఏ రకానికి చెందిన పుట్టగొడుగులు అయినా, పరిశుభ్రమైన వాతావరణంలో తగు జాగ్రత్తలతో పెంచి ఎటువంటి వ్యాధులు రాకుండా చూసుకోవాలి. లేకుంటే తరచుగా బెడ్స్ మీద నలుపు, ఆకుపచ్చ బూజులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి బెడ్లపై కనిపిస్తే దానిని జాగ్రత్తగా చాకుతో తీసివేసి, ఆ ప్రదేశాలలో బావిస్టిన్ (0.1 శాతం) పిచికారి చేయాలి. స్పాన్ రన్నింగ్ గదుల్లో దోమలు, నల్లులు, స్ప్రింగ్ టైల్స్, నులి పురుగులు, బాక్టీరియా మరియు వైరస్ ఆశిస్తాయి. పుట్టగొడుగులను ప్రధానంగా స్టాప్ మిల్ డ్యూ, బ్రౌన్ ప్లాస్టర్ మోల్డ్, వైట్ ప్లాస్టర్ మౌల్డ్, అవివ్ గ్రీన్ మాల్డ్, నలుపు, ఆకుపచ్చ, బాక్టీరియా మచ్చ తెగుళ్ళు ఆశిస్తాయి.
వీటి నివారణకు గదిలో బావిస్టిన్ (0.1 శాతం) లేదా ఫార్మాల్డీహైడ్ (10%) గదులు, గోడల వెంట గోనె సంచుల పైన మరియు నేల మీద ఉన్న ఇసుక పైన ప్రతి 10 రోజులకు ఒకసారి చల్లాలి. అలానే బెడ్స్లో దోమ కన్పించినట్లయితే వేప ద్రావణాన్ని (5 మి. లీ./లీ. నీటికి) కలిపి చల్లాలి. పుట్టగొడుగుల బెడ్పై బాక్టీరియా మచ్చలు కనిపేస్తే 2 గ్రా. బ్లీచింగ్ పౌడర్ 10 లీ. నీటిలో కలిపి చల్లాలి. క్రాపింగ్ రూమ్లో ఎప్పటికప్పడు ఫార్మలిన్ 5% ద్రావణాన్ని పిచికారి చేయాలి.
పుట్టగొడుగుల పెంపకములో పాటించవలసిన మెళకువలు
* మంచి రకం విత్తనం (స్పాన్)నే వాడాలి. సాగు చేయు స్థలంలో పూర్తి పరిశుభ్రతను పాటించాలి.
* గదిలో తగినంత ఉష్ణోగ్రత, తేమ వుండేలా జాగ్రత్త వహించాలి.
* వారానికి కనీసం 2 సార్లు గోడలు, నేలపై ఫార్మాలిన్ ద్రావణాన్ని పిచికారి చేయాలి.
* పిచికారి చేసే సమయంలో బెడ్స్ పై నీరు పడకుండా తప్పనిసరిగా ఏదైనా కప్పాలి. క్రాపింగ్ రూములలో తగినంత వెలుతురు, గాలి ప్రసరణ వుండేలా చూడాలి.
* క్రాపింగ్ సమయంలో పుట్టగొడుగులు తీసిన తరువాత మాత్రమే బెడ్స్పై నీరు చల్లాలి.
* గదిలోకి ఎలుకలు, కీటకాలు ప్రవేశించకుండా చూడాలి. గది కిటికీలకు జాలి బిగించాలి.
* ఆకుపచ్చని నల్లని మచ్చలు కనిపించిన బెడ్స్ తక్షణం అక్కడి నుండి తొలగించి పారవేయాలి. తద్వారా వ్యాధి వ్యాపిచకుండా నిరోధించవచ్చు.
డా.వై.సృజన, డా.ఎస్.రమేష్ బాబు, డా.డి.శ్రీనివాస్, పి. అంజని శ్రీ, ఎస్.జోష్ణ, డి. అఖిల సిరి, అన్షుమన్ రౌల్, కే.చాందినీ, దేవి శివాని కోట, ఎస్.దినేష్, బి.హర్షవర్ధన్, డి.ఝాన్సీ, మొనీష్ రెడ్డీ, బి.మౌనిక, సిహెచ్. మౌనిక, వ్యవసాయ కళాశాల నైరా, శ్రీకాకుళం జిల్లా, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము.
రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డా|| కె. రామచంద్రం
గతంలో వ్యవసాయంలో రసాయనాలు ప్రవేశపెట్టకముందు సేంద్రియ పదార్థం తగిన మోతాదులో అందిస్తూ పంటల సాగు చేపట్టేవారు కాబట్టి సూక్ష్మజీవుల పెరుగుదలకు అనుకూలమైన వాతావరణం ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో నేలలో సేంద్రియ పదార్థం తక్కువగా ఉంది కాబట్టి సేంద్రియ పదార్థాన్ని పెంచుకోడానికి అవసరమైన చర్యలు అయినటువంటి పచ్చిరొట్ట పైర్లు వేయడం, వ్యవసాయ వ్యర్థాలను భూమిలో కలియదున్నడం మరియు సేంద్రియ ఎరువులు ఉపయోగించడానికి చర్యలు చేపట్టి క్రమంగా సేంద్రియ పదార్థాన్ని పెంచుకుంటూ పోతే సేంద్రియ సాగు విజయవంత మవుతుందని ఏప్రిల్ 29, 30, మే 1 తేదీలలో రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేంద్రియ సాగు విధానం, కషాయాలు, మిశ్రమాల తయారీతోపాటు రైతులు పండిరచిన వ్యవసాయ దిగుబడులకు విలువ జోడిరపు వంటి అంశాలపై గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలోని రైతునేస్తం ఫౌండేషన్లో నిర్వహించిన రైతు శిక్షణా కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ముఖ్య అతిధిగా పాల్గొన్న రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డా. కె. రామచంద్రం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డా. సుధ, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు పొల్గొన్నారు.
పంటల దిగుబడులు, నాణ్యతను పెంచటం, స్వయం ఉపాధిగా తేనేటీగల పెంపకం బాగా ఉపయోగపడుతుంది. తక్కువ పెట్టుబడితో తేనేటీగల పెంపకం చేపట్టవచ్చు. ప్రస్తుత సమాజంలో తేనే వాడకం రోజు రోజు పెరుగుతూ వస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తేనేటీగల పెంపకం చేపట్టగలిగితే స్వయం ఉపాధిగా ఉపయోగపడడంతోపాటు రైతులకు పంట దిగుబడి, నాణ్యత పెరుగుతుందనే లక్ష్యంతో తేనేటీగల పెంపక విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ డా. సుధ విపులంగా వివరించారు. అదే విధంగా తక్కువ పెట్టుబడితో స్ధాపించుకోదగ్గ కుటీర పరిశ్రమలలో పాల పుట్టగొడుగుల పెంపకం ముందు వరుసలో ఉంటుంది. అంతే కాకుండా అదనపు ఆదాయ వనరుగా కూడా వీటి పెంపకాన్ని సులభంగా చేపట్టవచ్చు అని వివరిస్తూ పాల పుట్టగొడుగుల పెంపకం విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ డా. సుధ వివరించారు.
ఫౌండేషన్లో ఏర్పాటు చేసిన గోశాల, కట్టెగానుగతో నూనె తీసే ప్రక్రియ, వానపాముల ఎరువు, ఘనజీవామృతం తయారీ విధానం ప్రత్యక్షంగా చూపించడం జరిగింది.
ఆహారమే ఔషధం కావాలి : డా. జి.వి. పూర్ణచంద్
మనం తినే ఆహారం మనకి శక్తిని ఇవ్వడంతోపాటు మన ఆరోగ్యాన్ని కాపాడగలిగేదిగా ఉండాలి. కాని ప్రస్తుతం మన ఆహారపు అలవాట్లు పరిశీలించినట్లయితే ఈరోజుల్లో మనలో చాలా మంది తినే ఆహారం శక్తిని సక్రమంగా ఇవ్వకపోగా రసాయనాలతో పండిరచిన ఆహారాన్ని తింటున్నాము కాబట్టి మనం తినే ఆహారంలో ఉండే రసాయనిక అవశేషాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కాబట్టి ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం వైపు అడుగులు వేయాలి. అందుకు అనుగుణంగా రైతులు కూడా రసాయానాలు లేకుండా పోషకాలు సక్రమంగా గల ఆహార పదార్థాలను అందించే వ్యవసాయ పద్ధతుల వైపు అడుగులు వేయాలి. ఏది ఏమైనా గాని మనం తినే ఆహారం మనకు ఔషధంలా పనిచేయాలని శిక్షణా కార్యక్రమం మూడవ రోజు ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. జి.వి. పూర్ణచంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానశాఖ సహాయ సంచాలకులు కె. శ్రీకాంత్ రెడ్డి, సేంద్రియ రైతులు మీసాల రామకృష్ణ, శబరీనాధ్, ఏడుకొండలు మరియు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు పొల్గొన్నారు.
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉండే ఆకు కూరలు మరియు కూరగాయలు చాలా వరకు రసాయనాలతో పండిరచినవే అందుబాటులో ఉంచుతున్నారు. కొన్ని సార్లు రైతులు రసాయనాలు పిచికారి చేసిన వెంటనే కూరగాయలు, ఆకుకూరలను మార్కెట్లో అందుబాటులో ఉంచడం వలన వాటిలో ఉండే విష రసాయనిక అవశేషాలు ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి. దీనికి ప్రత్యామ్నాయం సేంద్రియ పద్ధతులలో కూరగాయలు మరియు ఆకుకూరలు పండిరచడమే. బొప్పాయి మరియు అరటి పంటలు సేంద్రియ సాగుకు అనుకూలం అని మీసాల రామకృష్ణ అన్నారు. రసాయనిక వ్యవసాయంలో జామ రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జామ పంటను ఆశించే నెమటోడ్స్ సమస్యకు రసాయనాల్లో సరైన పరిష్కారం లేదు. సేంద్రియంలోనే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందనే విషయం శబరీ అనుభవ పూర్వకంగా తెలుసుకుని గత కొన్ని సంవత్సరాల నుంచి జామ సాగును పూర్తి సేంద్రియ పద్ధలతో సాగు చేస్తూ ఎలాంటి సమస్య లేకుండా మంచి దిగుబడులు సాధించవచ్చని తన అనుభవాన్ని రైతులకు జామ రైతు శబరీనాధ్ వివరించారు.
వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడిరపునకు సంబంధించిన వివిధ యంత్రపరికాల వివరాలు అనగా వాటి ధర, అవి పనిచేసే విధానాలను, అవి దొరికే ప్రదేశాలను రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు పవర్ పాయింట్ ద్వారా వివరించారు. శిక్షణకు హాజరైన రైతులకు సర్టిఫికెట్లు అందజేశారు.
వేసవి పంట కోసిన తర్వాత (మార్చ్-ఏప్రిల్) తొలకరి వానలు కురిసే వరకు (జూన్) భూమి ఖాళీగా ఉంటుంది. సుమారు రెండు, మూడు నెలలు ఎటువంటి వ్యవసాయ పనులు చేయక పోవడం వలన భూమి గట్టి పడుతుంది. మే-జూన్ మాసాల్లో తొలకరి జల్లులు కురిసిన వెంటనే కొందరు అనుభవం ఉన్న రైతులు తగినంత తేమ ఉన్నపుడు నేలను దున్నడం ప్రారంభిస్తారు. కానీ, కొందరు రైతులు ఖరీఫ్, రబీ పంటల కోతల తర్వాత మళ్ళీ వర్షాకాలం వరకు భూమిని దున్నకుండా వదిలేస్తుంటారు. ”దున్నకుండా వేస్తే కొయ్యకుండా పోతుంది” అనేది తెలుగు నానుడి. విత్తనాలు విత్తాలన్నా, నారు నాటేయాలన్నా దుక్కిని దున్ని విత్తేందుకు, నాటేందుకు అనుకూలంగా తయారు చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ సామెత తెలియచేస్తుంది. ”దుక్కికొద్దీ పంట” అనే తెలుగు సామెత తొలకరిలో చేసే దుక్కి యొక్క ప్రాముఖ్యతను తెలియ చేస్తుంది.
దుక్కి చేయకుండా భూమిని ఖాళీగా వదిలేయడం వలన కలుపు మొక్కలు మరియు ఇతర గడ్డి జాతి మొక్కలు పెరిగి భూమిలోని తేమను, పోషకాలను గ్రహించి, భూమిని సత్తువ లేకుండా నిర్వీర్యం చేస్తాయి. దీని వలన భూసారం తగ్గి పోవడమే కాకుండా, నీరు భూమి లోపలి పొరల నుండి గ్రహించబడి ఆవిరి అయిపోతుంది. అంతే కాకుండా ముడి పోషకాల కొరత ఏర్పడి తర్వాత పంటలకు అత్యధిక మోతాదుల్లో రసాయన ఎరువులు వేయవలసిన అవసరం ఏర్పడుతుంది. కావున, ప్రస్తుత పరిస్థితుల్లో రైతు సోదరులు వేసవి లోతు దుక్కుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున రైతులు వేసవిలో ముఖ్యంగా ఏప్రిల్, మే మాసాల్లో కురిసే తొలకరి జల్లులను సద్వినియోగపరుచుకొని దాదాపు 9-10 అంగుళాలకు (25-30 సెం.మీ.) తగ్గకుండా దుక్కులు చేసుకోవడం శ్రేయస్కరం. వీటినే వేసవి దుక్కులు (లేదా) తొలకరి సేద్యం అంటారు. వర్షాలకు ముందు భూమిని దున్నడం వలన తొలకరి వర్షాలు పడగానే మట్టి పెళ్లలు మెత్తపడతాయి. వర్షాలు పడిన తర్వాత నీరు బాగా ఇంకడం వలన అవసరం అయితే ఈ నేలను మరోసారి దున్ని వెంటనే విత్తుకోవచ్చు. నేల రకాన్ని బట్టి, వేయబోయే పంటను బట్టి నేలను ఎన్నిసార్లు దున్నాలి అనేది నిర్ణయం తీసుకోవాలి. దుక్కి అనేది దున్నడం వలన నేల ఏ విధంగా తయారు అయింది అనేది తెలుపుతుంది. మంచి దుక్కి వచ్చింది అంటే నేల విత్తనం వేసుకోవడం కోసం అనుకూలంగా తయారు అయింది అన్నమాట. ప్రాధమికంగా దుక్కి దున్నే విధాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.
1. లోతుగా దున్నడం: వేసవిలో తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిని లోతుగా దున్నడం వలన క్రింది పొర మట్టి పైకి తిరగబడుతుంది. తద్వారా నేలలో హానికర కీటకాల గుడ్లు, ప్యూపాలు మరియు శిలీంద్ర బీజాలు సూర్యరశ్మికి గురై నశిస్తాయి. నేలను ఎంత లోతుకు దున్నాలి అనే విషయం – నేల లోతు, ముందు వేయబోయే పంట, కలుపు ఉదృతి పైన ఆధార పడి ఉంటుంది. సాధారణంగా కనీసం 25-30 సెం.మీ. లోతు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి భూమిని దున్నుకోవడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.
2. నేల క్రింది గట్టి పొరలను చేదించే విధంగా దున్నుట (సబ్ సాయిలింగ్): సాధారణంగా చాలా మంది రైతులు ప్రతి సంవత్సరం పొలాన్ని కల్టివేటరు తో తక్కువ లోతులో (సుమారు 10-15 సెం. మీ.) దున్నుతుంటారు. తద్వారా భూమి లోపలి పొరల్లో గట్టి పొర ఏర్పడుతుంది. ఈ గట్టి పొరల వలన వర్షపు నీరు భూమిలోనికి ఇంక కుండా చేయడమే కాక, పంట వేళ్ళు భూమి లోపలి పొరలకు విస్తరించకుండా అడ్డుపడతాయి. కావున ప్రతి 2 మీ. దూరంలో సుమారు 60-75 సెం.మీ. లోతుగా దున్ని ఈ నేల క్రింది పొరలను చేదించడం వలన మెట్ట పంటల్లో సుమారు 20-30 శాతం దిగుబడి పెరిగింది అని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ విధంగా ప్రతి 2-3 సంవత్సరాలకొకసారి లోతుగా దున్నితే సరి పోతుంది. ఈ విధంగా దున్నడానికి సబ్ సాయిలర్ /చిజిల్ నాగలిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా దీర్ఘ కాలిక మరియు లోతైన వేరు వ్యవస్థ గల కంది, ఆముదం వంటి మెట్ట పంటల్లో ఈ పద్ధతి మంచి ఫలితాన్ని ఇస్తుంది.
3. సంవత్సరం పొడవునా దున్నడం: పంట వేసే ముందు దున్నడమే కాకుండా పంట వేసిన తర్వాత వరుసల మధ్య వివిధ రకాల పనిముట్లను ఉపయోగించి పంటలను కలుపు మొక్కల భారి నుండి కాపాడటమే గాక, పలుమార్లు దున్నడం వలన, నేల గుల్ల బారి పడిన వర్షపు నీరు అంతా నేల లోనికి ఇంకి పంటలు బెట్టకు గురి కాకుండా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ రకమైన సేద్యం మెట్ట ప్రాంతాలకు చాలా అనుకూలంగా ఉంటుంది.
* లోతైన దుక్కులు (30 సెం. మీ.) వాలుకు అడ్డంగా దున్నడం వలన వర్షపు నీరు వృధాగా పోకుండా భూమి లోపలి పొరల్లోకి చేరుతుంది. వాలుకు అడ్డంగా దున్నుకోవడం వలన ఈ సమస్య అధిగమించబడి, భూమి ఎక్కువ తేమను గ్రహించి నిల్వ చేసుకొనే సామర్ద్యాన్ని పెంపొం దించుకుంటుంది. తద్వారా నీటిని పరిరక్షించడమే కాకుండా నేల కోతను కూడా నివారిస్తుంది. వర్షాధార పంటలు వివిధ కీలక థల్లో బెట్టకు గురైనప్పుడు (లేదా) తక్కువ వర్షపాతం నమోదు అయినప్పుడు పంట వేర్లు లోతుగా పోవడం వలన నేల లోపలి పొరల్లోని తేమను మరియు పోషకాలను గ్రహించి బెట్టను తట్టుకునే శక్తిని చేకూరుస్తుంది.
* లోతు దుక్కుల వలన ఖరీఫ్ మరియు రబీ పంట అవశేషాలు, కలుపు మొక్కలు, పంట మొక్కల నుండి రాలిన ఆకులు వంటి వివిధ సేంద్రీయ పదార్థాలు ఎరువుగా మారతాయి. తద్వారా నేలలో తేమ శాతం పెరగడంతో పాటు సేంద్రీయ కర్బన శాతం, పోషక పదార్థాలు పెరుగుతాయి. దీని వలన మేలు చేసే సూక్ష్మ జీవులు గణనీయంగా వృద్ధి చెందడమే కాకుండా, వానపాములు కూడా వృద్ధి చెందుతాయి. తద్వారా భూసారం వృద్ధి చెందుతుంది.
* లోతు దుక్కుల వలన భూమి లోపలి పొరల్లోని మట్టి భూమి పైకి మరియు భూమి పైమట్టి లోపలి పొరల్లోకి కలసిపోవడం ద్వారా భూసారం సమానంగా మొక్కలకు అందుతుంది.
* లోతు దుక్కులు చేసినట్లైతే బహు వార్షిక మొండి జాతి కలుపు మొక్కలైన తుంగ, గరిక, దర్భ మరియు జమ్ము లాంటి సమస్యాత్మక కలుపు మొక్కల వేర్లు, దుంపలు భూమి పైకి వచ్చి వేసవిలో ఉండే అధిక సూర్యరశ్మికి గురై నశిస్తాయి. అంతే గాక, నేల పైకి వచ్చిన వేర్లు, దుంపలు ఏరివేయడం ద్వారా వీటిని అరికట్టవచ్చు. తద్వారా ఆ తర్వాత పంట కాలంలో కలుపు మందులకు మరియు ఇతర క్రిమిసంహారక మందులకు వెచ్చించాల్సిన పెట్టుబడి ఖర్చు కూడా తగ్గిపోతుంది.
* వేసవిలో లోతు దుక్కులు చేయడం వలన భూమిలో దాగి ఉన్న చీడ పీడల కోశాలు, గుడ్లు మరియు ఇతర శిలీంద్ర జాలాలు కూడా బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు గురవడం ద్వారా నశిస్తాయి. అంతే గాకుండా, భూమి పైన బయట పడిన ప్యుపాలను, గుడ్లను కొంగలు, కాకులు మొదలైన పకక్షులు తిని నాశనం చేస్తాయి. దుక్కి దున్నేటపుడు, మనుషులు, పశువుల తొక్కిసలాటలో కొన్ని పురుగులు, ప్యూపాలు చనిపోతాయి. కావున సమగ్ర సస్యరక్షణలో వేసవి లోతు దుక్కులకు మొట్టమొదటి ప్రాధాన్యమివ్వాలి. తద్వారా పురుగు మరియు తెగుళ్ల మందు ఖర్చు కొంతవరకు తగ్గుతుంది మరియు వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది.
* గత పంటకు (ఖరీఫ్/రబీ) సంబందించిన మొక్కల దుబ్బులు, కొయ్యలు, వేర్లు కుళ్ళి పోయి సేంద్రీయ ఎరువుగా మారుతాయి.
* లోతు దుక్కుల వలన భూమిపై మట్టి లోనికి తిరగబడుతుంది. అంతేగాక, కొన్ని లవణాలు, క్షారాలు భూమి లోపలి పొరలకు చేరుకొని పై భాగంలో ఉదజని సూచిక సమంగా ఉంటుంది.
* వేసవి లోతు దుక్కుల వలన మట్టి రేణువుల లోనికి గాలి వెళుతుంది.నేల ఆరోగ్యంగా ఉండాలంటే మట్టి రేణువుల్లో 50 శాతం నీరు, 25 శాతం గాలి ఉండాలి.
కావున రైతుసోదరులు వేసవిలో కురిసే తొలకరిజల్లులను ఉపయోగించుకొని భూమిని బాగా లోతుగా దుక్కి చేసుకోవాలి. తద్వారా భూమిలో తేమను నిల్వచేసుకొనే శక్తీ పెరగడమే కాకుండా, భూసారం కూడా పెంపొందించుకోవచ్చు మరియు నేలకోతను నివారించు కోవచ్చు. అంతే గాకుండా మొండి జాతి కలుపు మొక్కల నివారణ తో పాటు చీడ పీడలను కూడా కొంతవరకు నివారించుకోవచ్చు. కావున రైతు సోదరులు ప్రతీ 2-3 సంవత్సరాలకు ఒకసారి వేసవిలో లోతుడుక్కులను (20-30 సెం.మీ.) చేసుకోవడం వల్ల పైన చెప్పిన లాభాలు పొంది, మెట్ట పంటల్లో అధిక దిగుబడులు పొందవచ్చు.
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని జూన్ 4వ తేదీన తాకి, ఆంధ్రప్రదేశ్ను తర్వాత 3 రోజుల్లో, హైదరాబాదును 6 రోజుల్లో తాకవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలను 10 రోజుల్లో పూర్తిగా విస్తరించవచ్చు. తన పొలంలో, ఎప్పుడు ఎంత వర్షం పడిందనేది రైతు గమనించుకోదగిన ముఖ్యాంశం. ఈ నేపథ్యంలో జూన్ (రోహిణి, మృగశిర, ఆరుద్ర కార్తెలు) లో చేయవలసిన వ్యవసాయ పనులను గూర్చి తెలుసుకుందాం.
ఏ పంట పండించాలి. ఆ పంటలో, అందుబాటులో ఉన్న రకాలలో ఎక్కువ ఆదాయాన్నిచ్చే రకాన్ని సరైన పదనులో విత్తాలి. త్వరగా విత్తితే ముందుగా కోతకొస్తుంది. తదుపరి పంట పెట్టడానికి భూమి త్వరగా ఖాళీ అవుతుంది.
టమాట: క్రితం సంవత్సరం ఎండాకాలంలో ధరలధికంగా కిలో 100 రూపాయల దాకా పలికినాయి. విస్తీర్ణం పెరిగి ఈసారి ఎండాకాలం టమాట పంట విపరీతంగా మార్కెట్కు వచ్చి ధరలు బాగా తగ్గినాయి. రుతుపవన ప్రభావంతో మేఘావృత వాతావరణం, ఎక్కువ వర్షాలు, ముసురు ఏర్పడితే పంట దిగుబడి తగ్గుతుంది. ధరలు పెరిగే అవకాశముంది.
కొత్తిమీర: ఎండాకాలంలో క్రమం తప్పకుండా అధికాదాయాన్నిస్తున్న పంట కొత్తిమీర. ఈ పంట పెరగడానికి ఎండల్లో పాక్షిక నీడ అవసరముంటుంది. కొత్తిమీర ధరలు జూన్ మాసం అంతా అధికంగా ఉండే అవకాశముంది. జూలైలో తగ్గే అవకాశముంది. చల్లని ఎత్తైన ప్రాంతాలైన మదనపల్లి ప్రాంతాల్లో ఈ నెలలో ఈ పంటను విత్తి, మంచి దిగుబడులతో పాటు అధిక ఆదాయాన్ని పొందవచ్చు. వర్షాలు కూడా ఈ ప్రాంతంలో తక్కువే. మంచి పంట వస్తుంది. అధిక వర్షాలకు ఈ పంట దెబ్బతింటుంది. జూన్లో అధిక వర్షాలు కురిసే ప్రాంతాల్లో ఈ పంట విత్తకపోవడం మంచిది. పందిరి కూరగాయపొలాల్లో మామిడి, మునగ, కొబ్బరి మొదలగు తోట పంటల్లోని ఖాళీ భూమిలో పాలీహౌస్లు, షేడ్నెట్లు, నెట్హౌస్లు, చెట్ల కొమ్మలతో ఏర్పాటు చేసిన పందిర్ల క్రింద పాక్షిక నీడలో కొత్తిమీర సాగు చేసి, జూన్లో అధిక లాభం పొందవచ్చు.
ఫ్రెంచిచిక్కుడు: ఎండాకాలంలో పాక్షిక నీడలో పండే పంట. అత్యధిక ధరలుండే దాని వలన పాక్షిక నీడలో పండించవచ్చు. మొక్కజొన్న, ఆముదం పంటలలో అంతరపంటగా కూడా పండుతుంది.
ఆకుకూరలు: వర్షాధారంగా పండే ఆకుకూరలు జూలై మూడవ వారంలో మార్కెట్కు వస్తాయి. అంతవరకు నీటితడులతో పండించిన ఆకుకూరలకు బాగా గిరాకీ ఉంటుంది. ఇవి ఎండలకు వేడికి కూడా బాగా పెరుగుతాయి. అన్ని రకాల భూములను ఆకుకూరల పంటకు వినియోగించవచ్చు. పాల కూర కొద్దిగా తక్కువ దిగుబడితో చౌడు భూముల్లో కూడా పెరుగుతుంది. వేసవిలో మంచి ఆదాయాన్నిచ్చే ఆకుకూరలు: పాలకూర, తోటకూర, మెంతికూర, చుక్కకూర, గోంగూర, పొన్నగంటి కూర, సోయకూర, కొయ్యగూర మొదలయినవి.
సిరిధాన్యాలు: సేంద్రియ వ్యవసాయంలో, రసాయనాలు వాడకుండా, వర్షానికి, జూన్ నెలలో కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికలు విత్తడానికి అనుకూలం. మొలకెత్తడానికి సరిపడ వర్షం పడితే విత్తవచ్చు. రసాయనాలు లేకుండా పండిస్తున్నామని వాట్సాప్లో ప్రచారం చేసుకుంటే ఖర్చులేకుండా, మంచి ప్రచారం జరుగుతుంది. రైతు వద్దకే వచ్చి కొనుక్కెళతారు. పంట పెట్టిన తర్వాత సిరిధాన్యాలను బియ్యం చేసి అమ్మడం వలన రైతుకు మంచి లాభం వస్తుంది. బుచ్చి మెథడ్ ద్వారా రోజుకు 20 కిలోల వరకు చిన్న మిక్సీ ద్వారా పొట్టు తీసే అవకాశముంటుంది. ఇంటివద్దనే క్లీన్ చేసి బియ్యం చేసే అవకాశముంది. ఇంకా సులభంగా బియ్యం చేయ గల్గిన చిన్ని చిన్న యంత్రాల ఆవిష్కరణలు జరగాలి.
వర్షాధార కూరగాయలు: వర్షాధారంగా పండే భూముల్లో పలు కూరగాయలను పండించవచ్చు.
జూన్లో విత్తగలిగిన కూరగాయ పంటలు:
బెండ: జూన్లో విత్తవచ్చు. విత్తిన 40-45 రోజుల్లో తొలి కోత మొదలవుతుంది. సొంత వితనాలుపయోగిస్తే ఖర్చు తగ్గుతుంది. ఎగుమతి కనువైన పలు రకాలు/హైబ్రిడ్లు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. ఉదా: విశాల్, నాథ్శోభ, వర్ష మొ|| నీటి ఆధారముంటే, బెట్ట సమయాల్లో తడులిస్తే దిగుబడి బాగా పెరుగుతుంది.
వంగ: జూన్-జూలైలో నారు పోసి 30-35 రోజుల తర్వాత నాటుకోవచ్చు. ఆయా ప్రాంతంలో ప్రాచుర్యంలో గల రకాలను ఎంపిక చేసుకుంటే మార్కెటింగ్ సులభమవుతుంది. పచ్చని రకాలకు ధర ఎక్కువ లభిస్తుంది. టమాట కంటే రేటు ఎక్కువగా లభిస్తుంది.
గోరుచిక్కుడు: తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి నివ్వగల్గిన మొండి పంట. జూన్-జూలై నెలల్లో విత్తుకోవచ్చు. పశువుల దాణాగా, పచ్చిమేతగా, పచ్చి రొట్ట ఎరువుగా కూడా పనిచేస్తాయి. గింజల నుండి గమ్ తయారు చేస్తారు. లేత కాయలను కూరగాయగా వాడుతారు. అనుకూలమైన రకాలు: పూసా సదాబహార్, పూసా మౌసమి మొ|| కూరగాయల దిగుబడి 3 నుండి 6 టన్నులు/ఎ. గింజ దిగుబడి 600-800 కిలోలు/ఎకరాకు.
కాకర: ప్రస్తుతం అధిక ధర పలుకుతున్న రకాలలో స్టార్ కాకర చాలా ముఖ్యమైనది. దీనిని జూన్లో విత్తి అధిక దిగుబడి, అధిక ఆదాయం పొందవచ్చు.
గుమ్మడి: గుమ్మడి గింజల్లో జింకు లభ్యత ఎక్కువ. పూజల్లో ఎక్కువగా వాడుతారు. ఎప్పుడైన అమ్ముకోవచ్చు. నిల్వ ఉంటుంది. అధిక దిగుబడి రకాలు: పూసా విశ్వాస్, కో-2 మొదలయినవి. అధిక దిగుబడి హైబ్రిడ్: పూసా హైబ్రిడ్-1
బూడిద గుమ్మడి: గుండె జబ్బుల నివారణలో ప్రాముఖ్యం వహిస్తున్నది. పేట (గుమ్మడి స్వీట్) తయారీలో ఉపయోగపడుతున్నది. మంచి రకాలు: బి.హెచ్-25, బి.హెచ్-24
పొట్ల: నేలపై పాకే పొట్ల రకం: కొ-2, ఇది పందిరిపై కూడా కాస్తుంది. ఇతర రకాలు: పి.కె.ఎం-1, శ్వేత. అనుకూలమైన హైబ్రిడ్ (పందిరిపైన పండించడానికి): ఎం.డి.యు-1.
దొండ: జూన్-జూలైలలో నాటవచ్చు. చలి తక్కువగా ఉండే కోస్తాఆంధ్ర ప్రాంతంలో సంవత్సరమంతా నాటుకోవచ్చు.
కీరదోస: మంచి పార్థినోకార్పిక్ రకాలు: కియోన్, సటిన్, అలామిర్
పూలు:
బంతి: ఏదైనా పండుగకు ఈ పూలందివ్వాలంటే ఆ పండుగకు 60 రోజుల ముందుగా బంతి నారు నాటాలి. జూన్ రెండవ వారంలో నారు పోసుకుని జూలై 2వ వారంలో నాటితే మార్కెట్ చేయడానికి అక్టోబరులో పూలొస్తాయి.
గులాబి: వీటి అంట్లను జూన్ నెల నుండి జనవరి నెల వరకు నాటవచ్చు. సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో నాటితే చాలా ఎక్కువ దిగుబడి వస్తుంది. మంచి రకాలు: హైబ్రిడ్ టీస్: ఆదిత్య, గ్రాండ్గల, అమాలియ మొ|| ఫ్లోరిబండాస్: ఆకాష్ దీప్, రెడ్ ట్రెంప్ మొ|| మినియేచర్: బేబిచాక్లెట్, నర్తకి, పింక్ స్ప్రే మొ||
మల్లె: జూన్-జూలై నెలల్లో వేర్లు వచ్చిన పిలక మొక్కలు నాటాలి. సుమారు 5 కణుపులు గల కొమ్మ కత్తిరింపులను జూన్ నుండి సెప్టెంబరు వరకు ఇసుకలో నాటాలి. త్వరగా వేర్లు రావడానికి కాండపు ముక్కలను 4 గ్రా. ఇండోల్బ్యూట్రిక్ ఆమ్లం (ఐ.బి.ఎ)ను లీటరు నీటిలో కలిపి ద్రావణంలో ముంచి నాటాలి. గుండుమల్లెను 5þ5, జాజిమల్లెను 7þ7, కాగడ మల్లెను 6þ5 అడుగుల ఎడంలో నాటాలి. గుండుమల్లె: రెండు వరస రేకులుంటే దొంతర మల్లె అని, పెద్దపూలుంటే బొద్దుమల్లె అని అంటారు. గుండు మల్లెలు మార్చి నుండి అక్టోబరు వరకు పూస్తాయి.
జాజిమల్లె: మంచి సువాసన ఉంటుంది. సంవత్సరమంతా పూస్తుంది. కాని ఏప్రిల్ నుండి నవంబర్ వరకు ఎక్కువ పూలనిస్తాయి.
కాగడమల్లె: నవంబరు నుండి జనవరి వరకు పూలనిస్తాయి.
కనకాంబరం: మే-జూన్ నెలల్లో నారు పెంచి ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో ప్రధాన పొలంలో 60þ30 సెం.మీ. దూరంలో నాటాలి. చలికాలం, ఎండాకాంలో బాగా పూస్తుంది. వర్షాకాలంలో తక్కువగా పూస్తుంది. అంటే సంవత్సరమంతా పూస్తుంది.
వేరుశనగ: జూన్ 2వ పక్షం నుండి జూలై మొదటి వారంలోపు విత్తి అత్యధిక దిగుబడులు పొందవచ్చు. జూలై మొదటి వారం తర్వాత విత్తడంలో నిదానమయ్యే కొద్దీ దిగుబడి తగ్గుతూ వస్తుంది. విత్తనాల కొరత వేరుశనగలో చాలా ఎక్కువ. మంచి రకాల విత్తనాలకు విపరీతమైన గిరాకీ ఉంది. మంచి రకాలు: విశిష్ట (టి.సి.జి.ఎస్-1694), కదిరి-9, కదిరి-7, నిత్యహరిత. విశిష్ట రకాన్ని విత్తనోత్పత్తి చేపట్టి అత్యధిక దిగుబడి, అత్యధిక ఆదాయం పొందండి. విత్తనాలు పండించే వారు వాట్సాప్లో ఖర్చు లేకుండా ప్రచారం చేసుకోవచ్చు. సులభంగా మార్కెట్ చేసుకోవచ్చు.
ప్రత్తి: కల్తీల బెడద విపరీతంగా ఉన్న పంటలలో ప్రత్తి ముఖ్యమైనది. అందుకే అనుభవమున్న రకాలను, బాగా నమ్మకస్తుడైన డీలరు దగ్గరనే కొనండి. కొత్తవాళ్ల దగ్గర విత్తనాలు కొనద్దు. కొత్త రకాలను వేయాలనుకుంటే కొద్ది విస్తీర్ణంలో (ఒక సెంటు లేక ఒక కుంట)లో పరీక్షించి, బాగా పండితే తదుపరి సంవత్సరంలో వాటి విస్తీర్ణాన్ని పెంచవచ్చు. అధిక సాంద్రత విధానంలో ప్రత్తి పండించి, అధిక దిగుబడులు పొందవచ్చు. నీటి ఆధారంతోను వర్షాధారంగా కూడా, అధిక సాంద్రతలో సాగు చేయవచ్చు. ఈ విధానంలో పంట త్వరగా పూర్తయి, తర్వాత పంటగా పెసర, మినుము, శనగ, నువ్వులు, వేరుశనగ వంటి పంటలు పండించుకోవచ్చు.
వరి: గవర్నమెంటు కొంటామంటుంది. మిల్లుల యాజమాన్యాలు సతాయిస్తుంటాయి. కాబట్టి మిల్లుల యాజమాన్యాల మీద, గవర్నమెంటు మీద ఆధారపడకుండా బయట అమ్ముకున్నా ఎక్కువ రేటుకు అమ్ముడుబోయే రకాలనే విత్తుకోండి. పంట పండినాక దాన్ని దాచుకొని, పాతగయినాక ఎక్కువ రేటుకు బియ్యం చేయించి అమ్ముకోవడానికి మొదటి నుండి ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఈ విధమైన పద్ధతులు అమలు చేయడానికి రైతు ప్రజా సంఘాలను ప్రతి పల్లెలోను, ఏర్పాటు చేసుకోండి. వాటి ద్వారా ఆర్థికంగా బలమైన వారుగా రైతులు ఎదగాలి. వివరాలు కావలిస్తే 9494408619 కు ఫోను చేయండి.
ప్రొద్దు తిరుగుడు: తేలిక నేలల్లో జూన్ 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. అత్యధిక దిగుబడినిచ్చే ప్రైవేటు హైబ్రిడ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అనువైన పబ్లిక్ హైబ్రిడ్లు: ఎన్.డి.ఎస్.హెచ్-1012, దిగుబడి: 600-720 కిలోలు/ఎకరానికి. డి.ఆర్.ఎస్.హెచ్-1, దిగుబడి: 520-640 కిలోలు/ఎకరానికి.
ఆముదం: మే చివరి వారం నుండి జూలై కడవరకు విత్తడానికనుకూలం. అనువైన రకాలు: ప్రగతి: దిగుబడి 6-7 క్వి/ఎ. 85-150 రోజులు. ఎండు తెగులును తట్టుకుంటుంది. త్వరగా కోతకొస్తుంది.అనువైన హైబ్రిడ్లు: పి.సి.హెచ్111, పి.సి.హెచ్-222, దిగుబడి: 7-8 క్వి/ఎ. ఎండు తెగులును తట్టుకుంటాయి. ఐ.సి.హెచ్-66: దిగుబడి 7-9 క్వి/ఎ. ఎండుతెగులును మరియు బెట్టను తట్టుకుంటుంది.
మొక్కజొన్న: దిగుబడి పెరిగినా, పౌల్ట్రీ పరిశ్రమలో వినియోగము ఎక్కువగా ఉన్నందున ధరలు నిలకడగా ఉన్నాయి. మార్కెట్ ధరలు అనుకూలంగా ఉన్నాయి. 30-35 క్వి/ఎ దిగుబడినిచ్చే పబ్లిక్ హైబ్రిడ్లు: డి.హెచ్.ఎం-117 (బి.హెచ్.-40625), డి.హెచ్.ఎం-119 (బి.హెచ్-4062), డి.హెచ్.ఎం-121 (బి.హెచ్-41009). 40-45 క్వి/ఎ దిగుబడినిచ్చే ప్రైవేటు హైబ్రిడ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్పెషల్ రకాలు: ఈ నెలలో విత్తదగినవి. తీపి రకాలు: కాంపోజిట్ రకాలు: విన్ఆరంజ్, అల్మోరా, ప్రియ, మాధురి, హైబ్రిడ్ రకాలు: షుగర్-75, బ్రైట్ జీన్. పేలాల రకాలు: పెర్ల్ పాప్ కార్న్ కాంపోజిట్, వి.ఎల్. అల్మోరా పాప్కార్న్, అంబర్ పాప్కార్న్. మన దేశంలో బేబికార్న్ రకాలుగా గుర్తించిన కాంపోజిట్లు: వి.ఎల్-42, హిమ్-123, హిమ్-129, మాధురి తీపిజొన్న, హైబ్రిడ్లు: హిమ్-128, ప్రకాశ్, హెచ్.ఎం.-4, పూసా ఎర్లీ హైబ్రిడ్ మొక్కజొన్న-1, పూసా ఎర్లీ హైబ్రిడ్ మొక్కజొన్న-2.
పంటలలో అధిక వివరాలకు, రైతు ప్రజా సంఘాలు అన్ని పల్లెలకు విస్తరించడానికి సంప్రదించవలసిన ఫోను నెంబర్లు: 9494408169 / 8639526595, సల్లా నారాయణస్వామి, ఛైర్మన్ – నారాయణ ఫౌండేషన్.
మార్కెట్లో దొరికే ఆకుకూరలు మరియు కూరగాయల లాంటివి చాలా వరకు రసాయనాలు ఉపయోగించి పండిస్తున్నవే కాబట్టి, రసాయన అవశేషాలు లేని కూరగాయలు మరియు ఆకుకూరల కొరకు ఎక్కువమంది ఇంటి పంటను చేపడుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు శారీరక శ్రమ, మానసిక ఉల్లాసం లాంటి ప్రయోజనాలు కూడా ఇంటిపంట వలన లభ్యం అవుతాయి. వీటన్నింటితో పాటు వాతావరణ కాలుష్యంతో పాటు మన దైనందిన జీవితంలో మనం ఉపయోగించే వస్తువుల వలన ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల రసాయన వాయువులను కూడా స్వీకరించగలిగే కొన్ని మొక్కలు కూడా ఇంటిపంటలో ఉన్నట్లయితే ఇంకా ప్రయోజనం ఉంటుందని గ్రహించి తమ ఇంటి పంటలో అన్ని రకాలుగా ఉపయోగపడే వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు సూర్యాపేటకి చెందిన పవిత్ర.
పవిత్ర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బయాలజీ టీచర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాను బయాలజీ చదివింది కాబట్టి మొక్కల గురించి తనకు తెలిసిన విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ తన ఇంటి పంటలను నిర్వహిస్తున్నారు. ఇంటి పెరటిలో సుమారు రెండున్నర సెంట్ల స్థలంలో పెరటితోటతో పాటు మిద్దె మీద కూడా వివిధ రకాల మొక్కలను వివిధ రకాల కంటెయినర్లలో పెంచుతూ మిద్దెతోటను కూడా నిర్వహిస్తున్నారు. కంటెయినర్లను ఎంపిక చేసుకునే సమయంలో అన్నీ ఒకే పరిమాణానివి కాకుండా మొక్క రకాన్ని బట్టి ఆకు కూరలకు తక్కువ లోతు, వెడల్పు ఎక్కువ ఉండే టబ్బులు, కూరగాయలకు పెరుగు డబ్బాల లాంటివి, పండ్ల మొక్కలకు లోతు ఎక్కువగా ఉండే డ్రమ్ముల లాంటి వాటిని ఉపయోగిస్తున్నారు. మొక్కల పెంపకానికి ఉపయోగించే కంటెయినర్లకు ఖర్చు చేసే డబ్బు విషయంలో కూడా జాగ్రత్తలు వహిస్తూ తక్కువ ఖర్చుతో సేకరించగలిగే కంటెయినర్లను సేకరిస్తున్నారు. అందులో భాగంగా పెరుగు బక్కెట్లు తక్కువ ధరలో దొరుకుతాయి కాబట్టి ఎక్కువ మొక్కలు పెరుగు డబ్బాలలో పెంచుతున్నారు. పెరుగు డబ్బాలతో పాటు, కుండీలు, ప్లాస్టిక్ టబ్బులు, ప్లాస్టిక్ డ్రమ్ముల లాంటివాటిని తక్కువ ధరలో కొనుగోలు చేసుకొని వినియోగిస్తున్నారు. మిద్దెతోట వలన స్లాబు పాడవకుండా స్లాబుపై స్టాండులు ఏర్పాటు చేసి స్టాండుపై కంటెయినర్లను ఏర్పాటు చేస్తున్నారు.
మొక్కల విషయంలో అన్ని రకాలుగా ఆలోచించి బహుళ ప్రయోజనాలు ఉన్న మొక్కలను తప్పనిసరిగా ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా వివిధ రకాల విటమిన్లు గల మల్టి విటమిన్ మొక్క, ఎక్కువ పోషకాలు గల మిరాకిల్ మొక్క (మునగ), భారీ రసాయన వాయువులను స్వీకరించగల స్నేక్ప్లాంట్, సుగర్ వ్యాధికి ఉపయోగపడే ఇన్సులిన్… ఈవిధంగా ఔషధ గుణాలు గల మొక్కలతో పాటు అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలలో వంగ, టమాట, బెండ, కాకర, బీర, చిక్కుడు, వెల్వెట్ బీన్స్, లాంగ్ బీన్స్, దోస, గోరు చిక్కుడు, ముల్లంగి, వింగ్డ్ బీన్స్, మిరప లాంటి మొక్కలతో పాటు లిల్లి, బంతి, మందార, గులాబి లాంటి పూల మొక్కలు, అరటి, బొప్పాయి, డ్రాగన్ఫ్రూట్, నేరేడు, స్టార్ఫ్రూట్, అంజీర లాంటి పండ్ల మొక్కలు కూడా పెరటిలో లేదా మిద్దె మీద పెంపకం చేస్తున్నారు.
మట్టి మిశ్రమంగా బాగా నీటితో కడిగిన కోకోపిట్, ఎర్రమట్టి, వేపపిండి, వర్మికంపోస్టు, బాగా మాగిన పశువుల ఎరువు లాంటి వాటిని అన్ని సమపాళ్ళలో తీసుకుని మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుంటున్నారు. చీడపీడల నివారణకు కూడా ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా ఫంగస్ సమస్య నివారణకు పుల్లటి మజ్జిగను, పేనుబంకను నివారించుటకు కుంకుడు రసం మరియు హాండ్ వాష్ మిశ్రమాన్ని ఉపయోగిస్తూ ఇంకా అవసరమయితే చేతితో చీడపీడలను నివారించు కుంటున్నారు. అన్ని రకాల మెళకువలతో ఇంటి పంటలో వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూలతో పాటు విషవాయువులను గ్రహించగలిగే మొక్కలను పెంచుతున్న పవిత్రని తోటి ఇంటి పంటదారులు ఆదర్శంగా తీసుకుంటే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని చెప్పవచ్చు.
పల్లెలు సస్యశ్యామలంగా ఉన్నాయంటే వ్యవసాయం కారణం. కొంతమంది రైతులు ప్రకృతి ఒడిలో ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం లేదా ప్రకృతి సేద్యం గత కొంత కాలంగా ప్రాచుర్యం సంపాదించింది. రసాయన సేద్యంతో నష్టపోయిన రైతులు ఎక్కువ మంది శ్రీ సుభాష్ పాలేకర్ గారి పద్ధతులను పాటిస్తూ ప్రకృతి సేద్యంలోకి ప్రయాణం చేస్తున్నారు. ప్రధానంగా పద్మశ్రీ గ్రహీత శ్రీ సుభాష్ పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయంలో అనుసంధానకర్తగా వ్యవహరించి చాలా మంది రైతులకు ఆదర్శంగా నిలిచి తనదైన శైలిలో మన దేశంలో ప్రకృతి సేద్యానికి పితామహుడిగా నిలిచారు. అతి తక్కువ ఖర్చుతో గో- ఆధారిత సహజ ఎరువులు, వాటి మిశ్రమాలతో, ప్రకృతిలో సహజంగా దొరికే వనరులతో కషాయాలు, నూనెలు తయారు చేసుకుని, భూసారాన్ని పెంచుకుంటూ, చీడపీడల్ని నివారించుకుంటూ అధిక దిగుబడులతో పాటు పర్యావరణాన్ని కాపాడుకుంటూ అందరికీ నాణ్యమైన రసాయన రహిత ఆహారాన్ని అందించడానికి కొంతమంది ప్రకృతి నేస్తాలు పూనుకున్నారు. వీరికి సహాయంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి వివిధ పథకాలు ప్రకటించడమే కాక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ శాఖల సమన్వయంతో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన మరియు సమగ్ర ప్రకృతి వ్యవసాయ విధానాన్ని రైతులందరికీ చేరువ చేయటానికి, ”నేషనల్ మిషన్- ప్రకృతి వ్యవసాయం” పేరిట ఒక విభాగాన్ని స్థాపించింది. ప్రకృతి వ్యవసాయంలో పాటించాల్సిన ముఖ్య సూత్రాలు, రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఆచరించాల్సిన ముఖ్య విధానాలను సమగ్రంగా తెలుసుకుందాం.
ప్రకృతి వ్యవసాయం- ఆవశ్యకత
హరిత విప్లవం మన దేశంలో ఆహారధాన్యాల వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంతో పాటు ఆహారధాన్యాల నిల్వలు పెరిగి సమృద్ధత చేకూర్చింది. దీనితో పాటు విచక్షణ రహితంగా రసాయన ఎరువులు, పురుగు మందులు మరియు ఇతర హానికారక రసాయనాల వాడకం పెరిగి ప్రకృతి వనరుల దుర్వినియోగమై భూసారం తగ్గటంతో పాటు భూమి నిర్వీర్యంగా తయారవుతున్నది మరియు ప్రకృతిలో వాతావరణం, నీరు, ఆహార కాలుష్యానికి దోహదపడుతున్నది. దీనికి ప్రత్యామ్నాయంగా రసాయన రహిత ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించడానికి మరియు మన సహజ వనరులను కాపాడుకుంటూ, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకుంటూ, రైతులకు సుస్థిర వ్యవసాయ దిగుబడులను అందిచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయడానికి పూనుకుంటున్నాయి. ఇప్పటికే కొందరు ఆదర్శ రైతులు దేశంలో సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను సమర్ధవంతంగా పాటిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు, ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కేరళ, జార్ఖండ్, ఒరిస్సా, పంజాబ్, హర్యానా, ఉత్తప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ, మేఘాలయ ప్రకృతి వ్యవసాయం మరియు సేంద్రీయ వ్యవసాయంలో ముందంజలో ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయం మరియు ప్రకృతి వ్యవసాయం, రెండు పద్దతులలో రసాయన రహిత సేద్యం గురించి చెబుతున్నప్పటికీ కొంతవరకు రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. సేంద్రీయ పద్దతులలో కొన్ని సేంద్రియ మరియు జీవ ఉత్పత్తులను బయట నుంచి కొనుగోలు చేసి వాడతారు మరియు అవసరాన్ని అనుసరించి కొన్ని ప్రకృతి ఖనిజాల నుంచి పోషకాలు వాడి భూసారాన్ని సరిచేస్తారు. ప్రకృతి వ్యవసాయంలో పూర్తిగా ప్రకృతి సహజ ఎరువులు (మల్చింగ్), సహజ కషాయాలు, గోఆధారిత సహజ తయారీలు (ఆవు పేడ, గోమూత్రం) మాత్రమే వాడి, బయట నుంచి జీవసంబంధమైన మందులు కానీ, సేంద్రీయ ఉత్పత్తులు కానీ కొనుగోలు చేయకుండా సేద్యం చేయాలి.
ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన సూత్రాలు
ప్రకృతిలో జీవుల మనుగడ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. రసాయన వ్యవసాయం జీవుల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రకృతి వ్యవసాయంలో మాత్రమే జీవ వైవిధ్యం మనుగడ సాగించే అవకాశం ఉంది. మన భవిష్యత్ తరాలకు సారవంతమైన నేల, నాణ్యమైన ఆహారం, కాలుష్యం లేని వాతావరణం అందించాలంటే ప్రకృతి వ్యవసాయం వైపు మన రైతులంతా మొగ్గు చూపాలి. సుభాష్ పాలేకర్ అనుసరించిన వ్యవసాయ విధానాలు మన రైతులకు ఆదర్శంగా నిలిచాయి. ప్రభుత్వాలు కూడా ఈ వ్యవసాయ విధానాలతో ఆమోదించబడిన ప్రకృతి లేదా సహజ వ్యవసాయ పద్ధతులను రైతులకు చేరువ చేసే పథకాలను రూపొందించాయి. ప్రకృతికి మేలు చేసే జీవుల వినాశనం కలుగకుండా ఒక ఆవుతోనే వ్యవసాయం సాగించవచ్చు. రసాయన ఎరువులు కాని పురుగు మందులు కాని వాడకుండా మన ఇంట్లో మరియు పరిసరాల్లో సహజ వనరుల రూపంలో దొరికే పదార్ధములను వాడి, సేద్య పద్ధతుల్లో కొన్ని మార్పులు, చేర్పులు చేసి రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని నిరూపించబడినది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని నేషనల్ మిషన్- ప్రకృతి వ్యవసాయం నిర్దేశించిన ప్రధాన విషయాలు లేదా సూత్రాలు ఈ విధంగా ఉన్నాయి.
ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా వైవిధ్యమైన వివిధ పంటల వ్యవస్థలను, పంటల సరళిని, అంతరపంటలని తీసుకోవలసిన అవసరం ఉంటుంది.
దేశవాళి అవులనుంచి వచ్చే వివిధ వ్యవసాయ ఉత్పత్తులు లేదా ఉత్పాదకాలతో మొక్కలకు కావలసిన పోషకాలు అందచేయటం, భూసారాన్ని పెంచటం
పంటల సస్యరక్షణకు వివిధ మొక్కలు మరియు చెట్ల నుంచి తయారు చేసే కషాయాలు వాడటం
వీటితో పాటు పచ్చిరొట్ట ఎరువులు వాడకం, వ్యవసాయ వ్యర్ధాలు లేదా పచ్చని ఆకులతో మల్చింగ్(ఆచ్ఛాదన) విధానం వంటి పద్ధతులు జోడించడం, నేలలో తేమ మరియు గాలి సమతుల్యం అనుసరించడం, నేలను వీలున్నంత వరకు దుక్కి చేయకపోవడం
దేశవాళి ఆవులు, దేశీయ విత్తనాలు, దేశీయ వానపాములు, దేశీయ సూక్ష్మజీవులు, సంప్రదాయ పద్ధతులతో శ్రీ సుభాష్ పాలేకర్ గారు ప్రతిపాదించిన గోఆధారిత ప్రకృతి వ్యవసాయం లేదా సహజ/ సంప్రదాయ వ్యవసాయాన్ని మన దేశంలోని రైతులు ఆదర్శంగా పాటించవలసిన తరుణం ఆసన్నమైంది. దీనికి మద్దతుగా తోటి రైతులు, స్వచ్ఛంద సంస్థలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలలో ‘రైతునేస్తం ఫౌండేషన్’ సేంద్రీయ మరియు ప్రకృతి ఆధారిత ఉత్పత్తులలో ముందంజలో ఉంది. ఒక దేశీయ ఆవుతో ముప్పై ఏకరాల వ్యవసాయం చేయవచ్చని ప్రకృతి వ్యవసాయంలో నిర్దేశించబడినది. సహజవనరులతో లబ్ధి చేకూర్చే వివిధ ప్రకృతి వ్యవసాయ పదార్థాల తయారీ గురించి తెలుసుకుందాం.
గో – ఆధారిత కషాయాలు
గో- ఆధారిత కషాయాల తయారీ విధానం రైతునేస్తం వారి ‘ప్రకృతి నేస్తాలు’ ప్రచురణ నుంచి, రైతుల అనుభవాల నుంచి సేకరించబడినవి.
బీజామృతం: 20 లీటర్ల నీటిని ఐదు లీటర్ల గోమూత్రం,5కిలోల పశువుల పేడ, 50గ్రాముల సున్నము మరియు 50 గ్రాముల పుట్టమట్టి కలిపిన మిశ్రమంతో విత్తనశుద్ధి చేయటం వలన మొలక శాతం పెరిగి విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను నియంత్రించవచ్చు. బీజామృతంను తయారు చేసిన వెంటనే వాడుకోవాలి. నిల్వ ఉంచరాదు.
జీవామృతం: దీనిని రెండు విధాలుగా వాడుకోవచ్చు.
ఘన జీవామృతం: వంద కిలోల తాజా పశువుల ఎరువుకు 5 లీటర్ల గోమూత్రం, 2 కిలోల నల్ల బెల్లం, 2 కిలోల పప్పులపొడి (పెసర, మినుము, శనగ, ఉలవ పిండి) మరియు 50 గ్రాముల పుట్టమట్టి కలిపి తయారు చేస్తారు. ఈ విధంగా తయారు చేసిన 50 కిలోల జీవామృతం ఎకరానికి 400 కిలోల చొప్పున రెండు దఫాలుగా దుక్కిలో ఒకసారి, తరువాత 30-45 రోజులకు ఒకసారి పొలానికి అందించాలి. ఈ జీవామృతం రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా వాడి భూసారం, భూమిలో సూక్ష్మజీవులు, వానపాముల సంఖ్య అపారంగా పెంచుకోవచ్చు.
ద్రవ జీవామృతం: డ్రమ్ములో 200లీటర్ల నీటికి 10 లీటర్ల గోమూత్రం, 10 కిలోల తాజా ఆవు పేడ,2 కిలోల నల్ల బెల్లం, 2కిలోల పప్పుల పొడి, 50 గ్రాముల పుట్టమట్టి కలిపి కర్రతో కుడివైపుగా (సవ్య దిశలో) బాగా కలియబెట్టి, గోనె సంచి కప్పి 48 గంటలు నానబెట్టాలి. మధ్యలో అప్పుడప్పుడూ కలియబెడుతూ ఉండాలి. ఈ ద్రవజీవామృతంను సాగునీటి కాలువల ద్వారా కానీ, నేరుగా భూమికి గానీ, పిచికారీ ద్వారా కానీ ఎకరానికి 200 లీటర్ల మోతాదులో అందజేయాలి. ద్రవజీవామృతంను తయారు చేసిన 9 రోజుల లోపుగా వాడుకుంటే మంచిది. ఎప్పటికప్పుడు తాజాగా జీవామృతం తయారు చేసుకుని వాడాలి.
పంచగవ్య: 5కిలోల తాజా ఆవుపేడలో 1/2 కిలో ఆవునెయ్యి కలిపి వెడల్పు మూతి గల ప్లాస్టిక్ డ్రమ్ము లేదా మట్టి కుండలో వేసి, మధ్యమధ్యలో కలుపుతూ నాలుగు రోజులు ఉంచాలి. 5వ రోజు ఈ మిశ్రమానికి 3 లీటర్ల ఆవు మూత్రము, 2 లీటర్ల ఆవు పాలు, 3 లీటర్ల కల్లు, 2 లీటర్ల ఆవు పెరుగు, 3 లీటర్ల లేత కొబ్బరి నీరు, ఒక కిలో నల్ల బెల్లం, 12 మగ్గిన అరటిపండ్లు మెత్తగా చేసి బాగా కలియతిప్పాలి. ఈ పాత్రకు గుడ్డతో మూతి బిగించి మధ్యలో కలియబెడుతూ 15 రోజులు ఉంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని పలుచటి గుడ్డలో వడబోసి ఎకరానికి మూడు లీటర్ల పంచగవ్యను 100 లీటర్ల నీటికి కలిపి పంటల యొక్క వివిధ థలలో పిచికారీ చేయవచ్చు. పంచగవ్యని మొక్కల ఎదుగుదలకు, చీడపీడల నివారణకు, విత్తనశుద్ధికి, నారుమళ్ళలో వాడవచ్చు. పంచగవ్య పంటలకు వ్యాధినిరోధక శక్తిని అందిస్తుంది. పంట ఉత్పత్తుల నాణ్యతను, నిల్వను,రుచిని పెంచుతుంది. సాగునీటి ద్వారా, బిందు సేద్యంద్వారా కూడా పంచగవ్యను వాడవచ్చు. పంచగవ్యను ఆరునెలల వరకు వాడుకోవచ్చు.
నీమాస్త్రం: 5 కిలోల వేప ఆకు బాగా దంచి 200 లీటర్ల నీటిని కలపాలి. ఈ మిశ్రమంలో 5 లీటర్ల తాజా గోమూత్రం, 1 కిలో తాజా ఆవుపేడ వేసి కర్రతో బాగా కలియబెట్టాలి. దీనిని 24-48 గంటలు మూతతో కప్పి నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టి పంటలపై ఎకరానికి పిచికారీ చేయవచ్చు. పంటలను ఆశించే పురుగుల నివారణకు నీమాస్త్రం ఉపయోగపడుతుంది.
బ్రహ్మాస్త్రం: 2-3 కిలోల వేప ఆకు, రెండు కిలోల పల్లేరాకు,రెండు కిలోల ఉమ్మెత్త ఆకు, 2 కిలోల సీతాఫలం ఆకు, విడివిడిగా, బాగా మెత్తగా నూరి ఒక పాత్రలోకి తీసుకుని 10 లీటర్ల తాజా గోమూత్రం కలిపి బాగా కలియబెట్టిన తరువాత మూతపెట్టి అరగంట పాటు మరగబెట్టాలి. ఈ మిశ్రమాన్ని 48 గంటల పాటు చల్లారనిచ్చి గుడ్డలో వడపోయాలి.ఎకరానికి మూడు లీటర్ల బ్రహ్మాస్త్రాన్ని 100 లీటర్ల నీటికి కలిపి పంటలపై పురుగులు మరియు తెగుళ్ల నియంత్రణకై పిచకారీ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఆరునెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. పైన చెప్పిన ఆకుల లభ్యత లేనపుడు పొంగామియా ఆకు, మామిడి ఆకు, మారేడు ఆకు లేదా జామ ఆకులతో కూడా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు.
అగ్ని అస్త్రం: 1 కిలో పొగాకు, 1/2 కిలో వెల్లుల్లి, 1 కిలో పచ్చిమిర్చి 5 కిలోల వేపాకులను విడివిడిగా దంచుకుని ఒక పాత్రలోకి తీసుకుని 10 లీటర్ల గోమూత్రాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టి నాలుగు సార్లు పొంగు వచ్చేటట్లు మరిగించాలి. 48 గంటల పాటు చల్లారనిచ్చిన తరవాత మూడు లీటర్ల అగ్ని అస్త్రంను 100 లీటర్ల నీటికి కలిపి పంటలపై పిచికారీ చేయాలి.పంటలపై ఆశించే లద్దెపురుగులు, పచ్చ పురుగులు, కాండం మరియు కాయ తొలుచు పురుగుల నివారణకు అగ్ని అస్త్రం వాడవచ్చు.
పైన వివరించిన గోఆధారిత కషాయాలతో పాటు ప్రకృతి వ్యవసాయంలో వివిధ మొక్కలు, చెట్లు, గింజల నుండి తయారు చేసిన కషాయాలు పురుగులు మరియు తెగుళ్ల నివారణకు వాడతారు. వీటిలో ముఖ్యంగా వేపగింజల కషాయం, వావిలాకు కషాయం, లొట్ట పీసు (తూటాకు) కషాయం, పచ్చిమిర్చి మరియు వెల్లుల్లి కషాయం, థపత్ర కషాయం, మారేడు పత్ర కషాయం, పిచ్చి తులసి కషాయం, కానుగ పప్పు కషాయం, నిమ్మగడ్డి కషాయం వంటివి వాడుకలో ఉన్నాయి. రైతులు మరెన్నో కషాయాలను వివిధ పంట ఉత్పత్తుల కలయికతో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వాడుతున్నారు. ప్రకృతి వ్యవసాయంలో చేప కషాయం (మీనామృతం) వంటి ఔషధ శక్తి కలిగిన ద్రావణాన్ని ఉద్యాన పంటలలో చీడపీడల నివారణకు వాడుతున్నారు. ఇవి కాకుండా రైతులు గానుగ చేత తీసిన ఆముదం, నువ్వులు, కానుగ, వేప, కొబ్బరి నూనెలు కూడా ప్రకృతి వ్యవసాయంలో వాడి పోషకాలు అందచేయటం, చీడపీడలను నివారిస్తున్నారు.
ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన సమస్యగా ఉండే గో- ఆధారిత ఉత్పత్తులు, వాటి లభ్యత, వాటి తయారీ, పాడి కొరత రైతులకు కొంత అవరోధం కలుగజేసే అవకాశం ఉంది. దీనిని అధిగమించడానికి ప్రభుత్వం రైతులకు పాడి చేకూర్చే ప్రయత్నాలు చేపట్టాలి. నీతి ఆయోగ్ సభ్యులు రమేష్ చంద్ మన దేశంలో గోశాలలను ఆర్థిక సహాయంతో వృద్ధి చేసి గోఆధారిత ఉత్పత్తులను రైతులకు అందించడానికి కృషి చేయాలని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయంలో వాడే వివిధ పద్ధతులను వ్యవసాయ పరిశోధన సంస్థలలో కూడా పరిశీలించే నిమిత్తం మరియు రైతులకు అవగాహన కల్పించటం కొరకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఏ.పి. రైతు సాధికార సమస్త 2021లో అన్ని పంటలకు ప్రకృతి వ్యవసాయంలో పాటించవలసిన సాగు పద్దతుల ప్యాకేజీ మరిన్ని వివరాలతో రూపొందించి రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఈ నివేదిక ప్రకృతి వ్యవసాయానికి ఒక నిఘంటువు లాగా ఉపయోగ పడుతోంది.
అధిక ఖర్చులు, పెట్టుబడులతో చేసే రసాయన వ్యవసాయం కన్నా అతి తక్కువ ఖర్చు, తక్కువ పెట్టుబడితో చేసే ప్రకృతి వ్యవసాయం సుస్థిర పంట దిగుబడులతో ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు సాగాలని మన ప్రధాన మంత్రి మన దేశ నలుమూలల రైతులను చైతన్య పరచడానికి సమగ్ర ప్రణాళికతో కార్యాచరణ మిషన్ను ప్రతిపాదించారు. ఈ మిషన్ను సమిష్టి బాధ్యతగా అందరం ముందుకు తీసుకువెళ్లాలి.
ఎస్.ఎం. విద్యాశేఖర్, జీ. శ్రీకృష్ణ, డి.ఎల్.ఏ.గాయత్రి, వి.మారుతి, ఎం. శ్రీనివాసరావు, వీ.కె.సింగ్, కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ, సంతోష్ నగర్, హైదరాబాద్-500059, తెలంగాణ.
ఈ సంవత్సరంతో పాటు రాబోయే 4-5 సంవత్సరాల వరకు వేసవి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని, ఇందుకు విశ్వంలోని ఎల్నినో ప్రభావమే కారణమని వాతావరణ నిపుణులు అంటున్నారు. దీని ప్రభావంతో రాబోయే వానాకాలం, శీతాకాలంలలో సైతం గతంలో మనకు కనిపించని వాతావరణ వైపరీత్యాలను ఎదుర్కొనే ముప్పులేకపోలేదు. ఉదాహరణకు గత ఏప్రిల్-మే నెలల్లో అనూహ్యంగా ఎదురైన అకాల వర్షాలు, వడగళ్ల వానలు, గాలి దుమారాలు, పిడుగుపాట్ల వల్ల మన తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో జరిగిన పంట నష్టాలు, వాననీటిలో మునిగిన కల్లాలు, తడిసిన ధాన్యాలు, నీట తడిచిన మొక్కజొన్న, మిరప, పత్తి పంటలకేకాక తడిచిన గడ్డివాములకు కూడా జరిగిన నష్టాలు అపారం. పిడుగు పాట్లు, వడగళ్ల వానల వల్ల వందల సంఖ్యలో జీవాలు, పశువులు ప్రాణాలు కోల్పోవటమో లేదా తీవ్రంగా గాయపడటమో జరిగి పశుపోషకులు కూడా తీవ్ర నష్టానికి గురైనారు. కొందరు రైతులు ఈ నష్ట భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఇటువంటి విపత్తులను రాబోయే రోజుల్లోనైనా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ముందు ప్రణాళికలతో రైతాంగము మరియు ప్రభుత్వాలు సిద్ధంగా ఉండుట చాలా అవసరం. పటిష్టమైన సమాచార వ్యవస్థ ద్వారా వాతావరణ హెచ్చరికలను రైతాంగానికి సకాలంలో అందించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది.
ఇక నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత సహజమైన వర్షాలు పడినప్పటికీ, గత వేసవి తీవ్రతలకు ఆకస్మికంగా మారిన వాతావరణ మార్పులకు, మేత సమస్యలకు గురైన పశువులలో వ్యాధినిరోధక శక్తి క్షీణించి, అవి సులువుగా అనేక రకాల వ్యాధులకు లోనై, ప్రాణాలను సైతం కోల్పోయే ముప్పు ఉండవచ్చు. ఇంతేకాక వేసవి తీవ్ర తాపానికి గురైన ఆరేడు నెలల చూడి పశువులలో గర్భస్రావాల సమస్య కూడా తీవ్రంగానే ఉండవచ్చు. మేపు లోపాలు, వాతావరణ తీవ్రతల కారణాల వల్ల చూడి థలోని పశువులలో పాల ఉత్పత్తి వ్యవస్థ కూడా కుంటుపడి రాబోయే ఈతలో ఆశించిన పాల ఉత్పత్తి ఉండక పోవచ్చును. కాబట్టి వేసవిలోనే కాక వర్షాకాలంలో కూడా చూడి పశువులకు అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలనూ తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేని ఎడల పాడి రైతు భారీగా నష్టపోయే ముప్పు ఉంటుంది.
వానలు, ముసురు, తుపాన్లు, వరదల రోజుల్లో గాలికుంటు, జబ్బవాపు, గురక, కుందేటి వెర్రి, ఎర్రమూత్ర వ్యాధి, లంపీస్కిన్ డిసీజ్, జీవాలలో చిటుక రోగం వంటి అనేక రకాల వ్యాధి క్రిముల్ని వ్యాపింప చేసే దోమలు, ఈగలు, పిడుదులు, గోమార్ల నిర్మూలన పట్ల ప్రత్యేక వ్రద్ధ వహించాలి. ఇందుకు పశువులను, పాకలను, పాకల పరిసరాలను పరిశుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. మురుగు నిల్వ లేకుండా పటిష్టమైన మురుగు పారుదల ఏర్పాట్లు చేసుకొనుట చాలా అవసరం. కేవలం పాకలలోని అశుభ్రత వల్లనే ఎదురయ్యే పొదుగువాపు వ్యాధిని నివారించుటలో పాకల పరిశుభ్రత కీలక పాత్ర వహిస్తుంది. పాకలలో నాపరాళ్లను పరచి నేలను ఏర్పాటు చేసే పద్ధతి మంచిది కాదు. ఏదైనా ఒక నాపరాయి గిట్టల తాకిడికి పగిలినప్పుడు లేదా వాటి అతుకులు ఊడినప్పుడు వాటి క్రింద చేరిన మురుగు, బురదల వల్ల ఇతర నాపరాళ్లు కూడా కృంగిపోయి పగిలి పోవటం, పాక అంతా మురుగుమయమై పోయి పొదుగు వాపు వ్యాధి ప్రబలటమే కాక, పాల నాణ్యత కూడా క్షీణిస్తుంది. ఈ అశుభ్రత వల్ల దూడల మరణాలు కూడా పెరుగుతాయి. పటిష్టమైన కాంక్రీటు నేలను, తగిన వాలు, గరుకుతో ఏర్పాటు చేసుకొనుట ఉత్తమం.
వాతావరణంలో ఆకస్మిక మార్పులు నిర్వహణ లోపాలు అశుభ్రత, పోషణ లోపాల వల్ల వానాకాలంలో చూడి పశువులలో గర్భస్రావాలు, మెయ్యదిగటం వంటి సమస్యలు ఎక్కువగా ఎదురుకావచ్చు. దీనిని నివారించుటకు పశువైద్య నిపుణుడితో సంప్రదించి అవసరమైతే అవసరమైన హార్మోన్ల ఇంజక్షన్లు వాడవలసి ఉంటుంది.
గత మూడేళ్లుగా మన పశు సంపదను, తీవ్రంగా దెబ్బ తీస్తున్న లంపీస్కిన్ డిసీజ్ నివారణకు కూడా టీకాలు వేయించుట చాలా అవసరం. రోగగ్రస్త పశువులను గుర్తించిన వెంటనే వాటిని ఇతర పశువుల నుండి దూరంగా వేరు చేయుట చాలా అవసరం.
గర్భస్రావాలకు లోనైన పశువుల్ని, జీవాలను కక్షుణ్ణంగా గమనించి, వాటి మాయతో పాటు, స్రావాలను కూడా దగ్ధం చేయుట లేదా లోతుగా నేలలో పూడ్చి వేయాలి తప్ప, ఆరుబయళ్ల లోనూ నీటి వనరులలోనూ వదలివేయకూడదు. ఈ స్రావాలు, రక్తపు నమూనాలు మాయలను సమీపంలోని ప్రభుత్వ పశు వ్యాధి నిర్ధారణ కేంద్రాలకు తీసుకు వెళ్లి పరీక్షలు చేయించి అంటురోగాలను గుర్తించి తగిన నివారణ చర్యల్ని చేపట్టాలి.
ముర్రా గేదెల పోషకుల పాలిట కొరకరాని కొయ్యగా ఉన్న ఎలర్జిక్ మామైటిస్ (ఖైలైటిస్) రొమ్ము వాపులను ఎంతో కొంత మేరకు నివారించేందుకు, ఆఖరి నెల చూడి థలో ఐవర్మెక్టిన్ ఇంజక్షను 7-8 మిల్లీలీటర్లు చర్మం క్రిందకు ఇంజక్షను 20 రోజులకొకసారి చేయిస్తే ఎలర్జిక్ మామైటిస్ వచ్చే అవకాశాలు తగ్గటంతో పాటు, పశువులకు అనేక రకాల ఇతర అంటు రోగాలను ప్రత్యక్షంగానే కాక, పరోక్షంగా కూడా కలిగించే వివిధ రకాల బాహ్య (దోమలు, కీటకాలు, పేలు, పిడుదులు వగైరా) మరియు అంతర్గత (నులిపురుగులు, జలగ వ్యాధి క్రిములు, ప్రేగులు, రక్తం మరియు వివిధ శరీర అవయవాలలో వృద్ధి చెందే) పరాన్న జీవుల బెడద చాలా వరకు తగ్గుతుంది.
భారీవర్షాలు వరదల వల్ల నీటి వనరులు బురద మయమై పోవుట, మురుగునీరు త్రాగునీటి వనరులతో కలిసి పోవుట వల్ల అనేక రకాల వ్యాధి క్రిములు, కీటకాలు వృద్ధి చెంది పశువుల ఆరోగ్యాలకు, ప్రాణాలకు హాని చేయవచ్చును. వాతావరణ తేమ వల్ల వరిగడ్డితో పాటు దాణాలు కూడా బూజు పట్టి ఎఫ్లాటాక్సిన్లతో విషతుల్యమై దూడలతో పాటు పెద్ద పశువుల ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్ల వచ్చును. బురద నీటి తేటపరచుటకు పటిక పొడి లేదా మునగ గింజల పొడి లేదా చిల్ల (ఇండుప) గింజ పొడులను వాడి తేట నీటిని పశువులు త్రాగుటకు అందించాలి. లేదా స్వచ్ఛంగా ఉండే బావి నీరు కూడా శ్రేష్టమే! అవసరమైతే మరిగించి చల్లార్చిన నీటిని సైతం అందించవలసి ఉంటుంది. పశువుల్ని బైటకు వదిలే ముందే శుభ్రమైన నీటిని సమృద్ధిగా త్రాగనిస్తే బైట కలుషితమైన, అశుభ్రమైన నీటిని త్రాగవలసిన అవసరం వాటికి ఉండదు.
వరదల సమయంలో పశునష్టం జరుగకుండా వాతావరణ శాఖ సూచనలను గుర్తించి పశువుల్ని ముందుగా ఎత్తైన ప్రాంతాలకు తరలించటం, విపత్తు సమయాలలో పశువుల్ని సులువుగా కట్టుకొయ్యల నుండి విడుదల చేసే ఏర్పాట్లు చేయటం మంచిది. ముసురు రోజుల్లో మేత కొరత ఏర్పడితే నేరేడు, మారేడు, గుర్రపు డెక్క, మునగ, అవిసె, అరటి, మల్బరీ, సుబాబుల్ వంటి ఆకులతోను, కూరగాయలు, పండ్లు, ఆకుకూరల వ్యర్థాలతోనూ కొంతవరకైనా పశువుల ఆకలి తర్చీవచ్చును.
ముసురు, వరద, తుపాను సమయాలలో చలులు, అశుభ్రతల కారణంగా దూడలు ఎక్కువ సంఖ్యలో మరణించవచ్చును. కనీసం ఈ రోజుల్లోనైనా దూడలకు వెచ్చని శుభ్రమైన వసతి ఏర్పాట్లు చేసి సంరక్షించుట చాలా అవసరం! నేటి దూడలే కదా రేపటి కామధేనువులు!
మానవ అంచనాలకు అందని ప్రకృతి విపత్తుల వల్ల పశువుల ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు సంభవించే నష్టాలకు పరిహారం పొందుటకు పశువులన్నింటికీ వెంటనే బీమా చేయించుకోవాలని, ఇందుకు ప్రభుత్వాలు, పాల సహకార సంఘాలు, ప్రైవేటు డెయిరీ యాజమాన్యాలు అందిస్తున్న సబ్సిడీలు, సహాయ సహకారాలను సద్వినియోగ పరచుకోవాలనీ నా సూచన.
భూమిలోని పోషకాలు, లోపాలను తెలుసుకుని సాగుచేసినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి. చాలా మంది సాగు సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో దిగుబడులు కోల్పోతున్నారు. తోచినట్లు సాగు చేయడం, ఏటా ఒకే రకమైన పంటలు వేయడం, ఇష్టానుసారంగా మందులు, ఎరువులు వినియోగించడం, తదితర కారణాలతో వ్యవసాయంలో అనుకున్నంతగా రాణించలేక పోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖాధికారులు, సిబ్బంది రైతులకు చైతన్యం కలిగిస్తున్నారు. భూసార పరీక్షల ఆవశ్యకత, మట్టి నమూనా సేకరణ, పరీక్షల విధానం లాంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. మట్టి నమూనాలకు ఇదే సరైన సమయమని చెబుతున్నారు.
నమూనాల సేకరణ విధానం
* భూమి రకాలను బట్టి 1 నుంచి 5 ఎకరాల వరకూ ఒక నమూనాను సేకరించవచ్చు. నమూనా సేకరించాల్సిన భూమి రంగు, ఎత్తు వాలును బట్టి చౌడు వంటి సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకొని భాగాలుగా విభజించాలి.
* వేరు చేసిన భాగాలను వేరువేరు భూములుగా గుర్తించాలి. ప్రతి భాగం నుంచి వేరువేరు నమూనాలు సేకరించాలి.
* నమూనా తీయాల్సిన చోట చెత్తాచెదారం లేకుండా చేతితో పక్కకు తోయాలి. నాగలి సాలు పోయేంత లోతు ఆరు అంగుళాల లోతు వరకూ&ఙ ఆకారంలో తవ్వాలి. తవ్విన గుంతలో నుంచి అరకేజీ వరకూ మట్టి సేకరించాలి. మొత్తం మట్టిని కలిపి వాటిలో ఉండే రాళ్లు, వేర్లు, కొయ్యలు, చెత్తను శుభ్రం చేసుకోవాలి.
* మట్టి తడిగా ఉంటే నీడలో ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత మొత్తం మట్టిని నాలుగు భాగాలుగా ఉంచి రెండు భాగాలుగా తీసివేయాలి.
* మిగిలిన రెండు భాగాల్లో అరకేజీ వరకూ ఉంచుకోవాలి. ఈ మట్టిని శుభ్రమైన సంచిలో గానీ, గుడ్డ సంచిలో గానీ నింపు కోవాలి. రైతు పేరు, సర్వే నెంబర్, ఊరు, వంటి వివరాలు రాసి అందులో ఉంచాలి.
* నమూనాలు సేకరించాల్సిన పొలంలో గట్టు, నీడ, చవుడు వంటి ప్రదేశాలను గమనించాలి. చెట్ట నీడ, బురద ఉండే ప్రదేశాలు, తేమగా ఉన్న చోట నమూనాలు సేకరించకూడదు.
* పొలం గట్లు, ఎరువు కుప్పులు, పైరుకు దగ్గరగా నమూనాలు తీయకూడదు. సున్నం, బూడిద, రసాయన ఎరువులు వేసిన మూడు నెలల వరకూ తీయకూడదు.
ఆర్బీకే పరిధిలో నమూనాలు
ఉదాహరణకు కాకినాడ జిల్లాలో ప్రతీ రైతు భరోసా కేంద్రంలో రెండు మట్టి నమూనాలు సేకరించేలా వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ఏడాది 836 మట్టి నమూనాలు సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ 402 నమూనాలు సేకరించారు. మరో వారంలోపు మిగిలినవి సేకరించనున్నారు. ఆర్బీకేల వారిగా మట్టి నమూనాలను ఆయా సిబ్బంది సమీపంలోని భూసార పరీక్షా కేంద్రానికి పంపుతారు. వీటిని ప్రయోగశాలల్లో పరీక్షించాక ఫలితాలను రైతులకు కార్డులు రూపంలో అందిస్తారు. ఫలితాలను బట్టి పొలాల్లో నెలకొన్న సమస్యలు, అనుసరించాల్సిన పద్ధతులు, ఎరువుల మోతాదులు, ఇతర వివరాలను సంబంధిత వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు తెలియజేస్తారు.
నేలను కాపాడుకోవాలి
ప్రస్తుత పరిస్థితుల్లో భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. నేల ఆరోగ్యంగా ఉంటే అందరం ఆరోగ్యంగా ఉంటాం. మట్టి పరీక్షల ఆధారంగానే రైతులు పంటలు వేసుకుంటే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు కూడా బాగా తగ్గుతాయి. నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మట్టి నమూనాలు సేకరించే విధంగా చర్యలు తీసుకొంటున్నాం అని అంటున్నారు. \
– ఎన్ విజయ్కుమార్, కాకినాడ జిల్లా వ్యవసాయశాఖాధికారి
ఎండాకాలంలో తీవ్రమైన ఎండల వల్ల పశువులు అధిక వేడి లేదా తాపానికి గురై ఉత్పాదక శక్తి కోల్పోవడమే కాకుండా కొన్ని సందర్భాలలో మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. కనుక వేసవి కాలంలో వేడి నుండి పశువులను మరియు గొర్రెలు, మేకలను సంరక్షించుకోవడానికి తగిన సూచనలను పాటించవలసి ఉంటుంది. మొదటగా పశువులను గాని గొర్రె, మేక పిల్లలను గాని వీలైనంత వరకు ఉదయం 10 గంటల లోపు మరియు సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే బయటకు మేపుకు తీసుకెళ్లాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పశువుల కొట్టాలలోనే ఉంచాలి. పశువుల కొట్టాలు లేదా షెడ్ సౌకర్యం లేని వారు చెట్ల నీడలో పశువులను ఉంచవచ్చును. పశుగ్రాస వసతి సమృద్ధిగా ఉన్నప్పుడు షెడ్లలో మేపడమే శ్రేయస్కరము. కొట్టాలు లేదా షెడ్ చుట్టుపక్కల నీడనిచ్చే చెట్లను పెంచుకుంటే పశువులకు వేసవికాలంలో చల్లదనాన్ని అందిస్తాయి. పగటి సమయాలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కొట్టాలు లేదా షెడ్లకు గోనె సంచులు కట్టి తడపడం వలన లోపల వాతావరణం చల్లగా మారి పశువులకు అనుకూలంగా ఉంటుంది.
ఎండాకాలంలో ప్రతి పశువుకు రోజుకు సుమారు 60 నుంచి 70 లీటర్ల త్రాగునీరు అవసరం అవుతుంది. కావున వేసవిలో తగినంత త్రాగునీరు పశువులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. వీలైనంత ఎక్కువగా పచ్చి మేత అందించాలి. మరియు దాణాను తడిపి ఇవ్వడం మంచిది. వాణిజ్యపరంగా పాడి పశువులు మరియు గొర్రెల, మేకల పెంపకం చేపట్టేవారు షెడ్లలో ఫ్యాన్లు, ఫాగర్సు, స్ప్రింక్లర్స్ ఏర్పరచుకొని ఉష్ణోగ్రతను తగ్గించే ప్రయత్నం చేయవచ్చును. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే దాణాతో పాటు ఖనిజ లవణాల మిశ్రమము మరియు పుష్కలంగా త్రాగునీరు ఇవ్వడం వలన పశువులు బలహీన పడకుండా తొందరగా డీహైడ్రేషన్కు గురికాకుండా సంరక్షించుకోవచ్చు. వేసవి తాపానికి గురైన పశువులు అధిక శరీర ఉష్ణోగ్రతను కలిగి, అధిక శ్వాస తీసుకుంటూ ఇబ్బంది పడుతుంటాయి. అలాంటి పశువులను గమనించి వెంటనే తల మరియు శరీర భాగాలను నీటితో తడుపుతూ సమీప పశు వైద్య అధికారిచే చికిత్స చేయించుకోవాలి. అదేవిధంగా కోళ్లకు వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా షెడ్పై స్ప్రింక్లర్లను మరియు షెడ్లు లోపల ఫాగర్స్ను ఏర్పాటు చేసుకున్నట్లయితే చల్లటి వాతావరణాన్ని అందించగలం. పైన తెలిపిన విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని వేసవికాలంలో పశువుల యాజమాన్య పద్ధతులను సరిగ్గా పాటించినట్లయితే ఎండ వేడి నుంచి పశువులను సంరక్షించుకోవచ్చు. దీ
ఒక నమ్మకం… రోగి గొంతులో అమృతమవుతుంది. ఒక విశ్వాసం… ఆటగాడికి ఊపిరి అవుతుంది. ఒక భరోసా… చంటి పిల్ల ఆకలి తీరుస్తుంది. దైనందిన జీవితంలో అంతర్బాగమైన పాలు, పాల ఉత్పత్తులు కేవలం నాణ్యత, నమ్మకం, విశ్వసనీయత పునాదులపై నిలుస్తుంది.
చిన్న, సన్నకారు రైతుల నుండి ప్రామాణిక పద్ధతుల్లో సేకరించి, నాణ్యతా పరీక్షలు చేసి, 24 గంటల్లో శుద్ధీకరించి ప్యాకింగ్ చేసి ఇవ్వగల సత్తా ఒక్క సహకార డెయిరీలకే సాధ్యం.
పాడి రైతుల నుండి మంచి పాలకు మంచి ధర అందించాలనే సమాఖ్య ఛైర్మన్ సోమ భరత్ కుమార్, ఎం.డి. అధర్ సిన్హాల స్వప్నం ఫలించి ‘పాలమిత్ర యాప్’ అందుబాటులోకి తేబడింది. రైతు చెంతనే పాల పరీక్ష జరిపి, వెనువెంటనే అతడి చరవాణికి పాల కొలత, ధర, పాలకు వచ్చే మొత్తం డబ్బులు సంక్షిప్త సమాచారం రూపంలో అందించే దిశగా ‘విజయ తెలంగాణ’ పారదర్శకతకు పెద్దపీట వేసింది. పైలట్ ప్రాజెక్టుగా మొదట జనగామ, రంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లో ప్రారంభించి, క్రమేపి అన్ని జిల్లాల్లో ఈ విధానాన్ని విస్తరించడం జరుగుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 పాల పరిధుల్లో 5250 పై చిలుకు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ద్వారా, 1,50,000 పైగా పాడి రైతులు పాలను విజయ డెయిరీకి అందిస్తున్నారు.
ఈ యాప్ ద్వారా 15 రోజులకోసారి పాల పైకం, రైతు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. పాల సేకరణ స్థాయిలోనే పాల కొలత, నాణ్యత నమోదు చేయబడతాయి. అంతేకాక, పాడి రైతులకు వెనువెంటనే సంక్షిప్త సందేశం రూపంలో పాల వివరాలు చేరవేయబడతాయి. రిజిస్టర్లలో, పుస్తకాల్లో కాకుండా పాల కొనుగోలు వివరాలు మొబైల్ యాప్ ద్వారా సరళంగా నమోదు చేసే వాలున్న ఈ ‘యాప్’ సహకార రంగంలోనే ఒక మైలు రాయి. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ద్వారా ఈ యాప్ వెలువరించబడగా, రోజు వారీ పాల ధర తెలవడం రైతు కష్టానికి తగు ప్రతిఫలం అందించినట్లవుతుంది.
అంతేకాక, స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా పాడి పశువుల కొనుగోలుకు ఒప్పందం చేసుకుని పాడి రైతులకు భరోసా కల్పిస్తోంది విజయ తెలంగాణ.
పాడి పరిశ్రమ పసిడి బాటలో నడవడానికి కావలసిన పశుదాణా, లవణ మిశ్రమం, దాణా పోషఖాలు అందిస్తోంది.
మౌలిక స్థాయిలో పాడి రైతుల సంఘాల ఏర్పాటు, మూతబడిన సుమారు 70 బల్క్కూలింగ్ యూనిట్లను పాడిరైతులు/ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహణ ఖర్చులు అందించి నడిచేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుని, రాబోవు కొన్ని నెలల్లో అందుబాటులోకి వచ్చే మెగా డెయిరీ పాల నిర్వహణ సామర్థ్యం పూర్తిగా వినియోగించుకునేలా అడుగులు వేస్తోంది.
శిక్షణలు, సామర్థ్యాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి, గ్రామ స్థాయిలో నాణ్యమైన పాలసేకరణ, గ్రామాల్లో వినియోగించే పాల పరీక్షా పరికరాల పనితీరు మెరుగుపర్చడం లాంటి చర్యలు చేపట్టింది. అవకాశమున్న చోట తెలంగాణ ఆగ్రో కేంద్రాల ద్వారా పాలసేకరణ కూడా చేపడుతూ పాడి పశువుల కొనుగోలుకై ముద్ర, పిఎంఈజిపి, కెసిసి ఋణాలు, పశుసంవర్థక శాఖతో వైద్యశిబిరాలు, గోపాలమిత్రల సేవలను పాల ఉత్పత్తి పెంపుదలకు ఉపయోగించుకోవడం లాంటి పలు చర్యలతో స్వయం సమృద్ధి దిశగా విజయ తెలంగాణ అడుగులు వేస్తోంది.
మధుసూదనరావు, ఉప సంచాలకులు, విజయ డెయిరీ, ఆదిలాబాద్
దేశంలో అన్ని వర్గాల ప్రజలు వారి భవిత కోసం, ప్రగతి కోసం ఆరాటపడుతున్నారు. అప్పుడప్పుడు విధిలేని పరిస్థితుల్లో రోడ్లు ఎక్కి ఆందోళనలకు దిగుతున్నారు. వారి హక్కులు అనండి లేదా వారి సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తూ కొన్నిసార్లు విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే మరోవైపు ఆరుగాలం కష్టించి తన చెమట చుక్కలను ఆహార రంగంలో దేశ స్వయం సమృద్ధికోసం అహర్నిశలు రైతులు తమ జీవితాలను ధారపోస్తున్నారు. అకాల వర్షాలకు నోటికాడ పంట నాశనం అయినా చీడపీడలతో దిగుబడులు, వాటి నాణ్యత దెబ్బతిన్నా, తనను తాను ఓదార్చుకుంటూ ముందుకు సాగుతూనే ఉన్నారు.
ప్రతి థలో వారికి ఎదురీతే. ఇటీవల కురిసిన అకాల వర్షాలు దెబ్బతీశాయి. పంట దిగుబడి వచ్చినా, మార్కెట్ కనికరించక ఇబ్బందులే. ఎన్ని పథకాలు అండగా ఉన్నా, భరోసా అనుకున్నా అనుకున్న ఫలితం రాక వ్యవసాయం గిట్టబాటు కావటం లేదు. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ ఉన్నది, ఉండేది రైతులోకం ఒక్కటే. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా ఆచరణలో మాత్రం ఒరిగేది ఏమీ లేదు సుమా. ఇతరరంగాల సమస్యలను అధిగమించటానికి జరుగుతున్నంత కృషి, ప్రయత్నం, మేధో మథనం రైతు దిశగా సాగకపోవటం శోచనీయం. అయినా ఏనాడూ రైతు తన పని మానుకోలేదు. తన శక్తియుక్తులను కూడదీసుకుని నిరంతరం ఒక పంటకాలం తరువాత మరో పంటకాలం గురించి ఆలోచిస్తూ, దేశ భవిష్యత్కు భరోసాగా ఉంటున్నారు. తను కృంగి, కృశించిపోతున్నా దేశ ప్రజల ఆహార అవసరాలు తీర్చే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నారు. ఇంతెందుకు… కాలం కలిసి రాలేదు. ప్రకృతి అండగా లేదు. అంతా సమస్యల వలయమే. ఎవ్వరూ రాకపోయినా ఉన్న వనరులతో మంచి దిగుబడులు సాధించి దేశ లక్ష్యాలను సాధించారు. అందుకు నిదర్శనమే నిన్నగాక మొన్న కేంద్రం తాజాగా ప్రకటించిన అంచనాలు. దాదాపు అన్ని పంటలలో అంచనాలకు మించి ఉత్పత్తి వస్తుందని నిగ్గు తేల్చారు. అంటే రైతులు ప్రభుత్వ అంచనాలను మించి అదరగొట్టినట్లే కదా! ఇది వారికి ఎప్పుడూ అలవాటే. థాబ్దాలుగా వారి రికార్డ్స్ను వారే తిరిగి రాస్తున్నారు. అయితే వారి కృషికి త్యాగానికి తగిన న్యాయం జరగకపోవటమే పెద్ద విషాదం.
ఇన్ని అపశ్రుతులు, అవరోధాలు ఎదురైనా రైతులు వారి శక్తియుక్తులుతో ఎదుర్కొని ఉత్పత్తి సాధిస్తున్నారు లక్ష్యాలకు అనుగుణంగా. కరోనా సమయంలో కూడా ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే ఆదుకుంది. అన్ని విపత్కర పరిస్థితుల్లో కూడా దేశానికి అండగా నిలిచారు. నిలుస్తున్నారు కూడా. కేంద్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2022-23 తిండిగింజల ఉత్పత్తి లక్ష్యం 288.31 మిలియన్ టన్నులు కాగా, సవరించిన అంచనాల ప్రకారం 303.3 లక్షల టన్నులు.. అలానే ఇతర వాటిలో కూడా…
దీనిని బట్టి అర్థమయ్యే విషయం ఒక్కటే మనం అంతా జైకిసాన్ అంటూ వారికి మద్దతుగా, వారి సంక్షేమం కోసం పని చేయాలి. వారి బాగుకోసం పాటుపడాలి. వారు విశ్రమిస్తే దేశం మొత్తం దివాళానే అన్న సంగతి మరచిపోకూడదు. ‘జైకిసాన్ జైకిసాన్ జైకిసాన్’ నినాదం మరోసారి దేశమంతా మార్మ్రోగాలి. వారిని రక్షించుకోవటం మన అందరి బాధ్యత.
మనది వ్యవసాయక దేశం. ఆది నుంచి మన ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఒకప్పుడు 90 శాతానికి పైగా ప్రస్తుతం 70 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. వ్యవసాయాన్ని మన ప్రజలు మన సంస్కృతి, సంప్రదాయాలలో భాగంగానే చూస్తారు. అందుకనే చాలామంది పొలాన్ని అమ్మటానికి ఇష్టపడరు. కొంతమంది పొలం ఉండికూడా వ్యవసాయ రంగానికి దూరంగా జరిగిన వారు కూడా తమ పొలాన్ని అమ్మకుండా కొనసాగిస్తుండటము మన దేశంలో సహజం. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం మరియు వివిధ రకాల కారణాల వలన చాలామంది వ్యవసాయ రంగం నుండి వేరే రంగాలవైపు వెళ్ళినా కాని తమ మూలాలను మరవకుండా తమ ఆలోచనలను వ్యవసాయరంగం చుట్టూ తిప్పుతూనే ఉంటారు. ఒకప్పుడు వ్యవసాయంలో ఆర్థికంగా అభివృద్ధి చెందడము కుదరదు కాబట్టి వ్యవసాయరంగాన్ని వదలి వేరే ఉద్యోగ, వ్యాపార రంగాలలో అడుగు పెట్టి ఆర్థికంగా ఒకస్థాయికి చేరుకున్న తరువాత తిరిగి వ్యవసాయం గురించి ఆలోచించే వారి సంఖ్య ప్రస్తుత తరుణంలో రోజు రోజుకి పెరుగుతూ ఉంది.
గతంతో పోల్చుకుంటే సేంద్రియ సాగు గురించి అవగాహన పెరిగిన తరువాత, ప్రధానంగా కరోనా తరువాత వ్యవసాయ రంగం గురించి ఆలోచించడంలో వేగం పెరిగిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అందులో భాగంగానే గతంలో వ్యవసాయ రంగం నుంచి వేరే రంగంవైపు వెళ్ళిన వారు తిరిగి వ్యవసాయరంగం వైపు ఆలోచిస్తూ తమ మూలాలను మరవకూడదు అనే తపనతోపాటు ఆరోగ్యం కాపాడుకోవాలంటే వ్యవసాయ రంగమే సరైన రంగం అని తలచి వ్యవసాయ రంగం వైపు వేగంగా అడుగులు వేసే వారి సంఖ్య క్రమేపి పెరుగుతూ ఉంది. ఇదే విధంగా ఆలోచించి తమ మూలాలను మరవకూడదనే తలంపుతో పారిశ్రామిక రంగంలో రాణిస్తూ కూడా తమ వ్యవసాయ నేపధ్యాన్ని మరవకుండా తిరిగి వ్యవసాయ రంగంలో అడుగుపెట్టి వినూత్న ఆలోచనలలో వివిధ రకాల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులలో పండిస్తూ మన దేశీయ గోజాతులతో గో-శాలను నిర్వహిస్తున్నారు కృష్ణా జిల్లా, గన్నవరం మండలం, చిక్కవరం గ్రామానికి చెందిన సురేంద్రబాబు.
సురేంద్రబాబు గారిది వ్యవసాయ నేపథ్యం. వీరి పూర్వీకుల నుంచి వ్యవసాయం చేస్తున్న చరిత్ర వీరిది. అయినా కాని అందరిలాగానే వ్యవసాయరంగాన్ని వీడి పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టడం జరిగింది. పారిశ్రామిక రంగంలో అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటు రాణించగలిగి ఒక గుర్తింపు సంపాయించారు. గుర్తింపుతో పాటు ఆర్థికంగా ఎదిగిన తరువాత తమ మూలాలను మరవకూడదు అని గ్రహించి 2020వ సంవత్సరంలో తిరిగి వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టారు. వీరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు కాబట్టి తాము చేసే వ్యవసాయం నలుగురికి ఉపయోగపడేదిగా, మన సంస్కృతి, సాంప్రదాయ, సనాతన ధర్మాలను కొనసాగించేదిగా, తమ ఆరోగ్యాలను కాపాడేదిగా ఉండాలనే తలంపుతో అడుగులు వేయడం జరిగింది. సురేంద్రబాబు తన ఆలోచనలతో పాటు తన అర్థాంగి విశాలాక్షి అభీష్టం మేరకు అందరికి ఉపయోగపడేలా ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకోగా అందుకు రంగారావు మరియు ఇతరుల సలహాలు, సంప్రదింపులతో తన వ్యవసాయ క్షేత్రాన్ని ఒక నందనవనంగా తీర్చిదిద్ది వివిధ రకాల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నారు.
సురేంద్ర బాబు గారికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి తన వ్యవసాయంలో వ్యాపార ధోరణిని ప్రక్కనబెట్టి ఆరోగ్యానికి, ఆధ్యాత్మకతకు ప్రాధాన్యాన్ని ఇచ్చారు. అందులో భాగంగానే నక్షత్రవనాన్ని నిర్మించి ఆ నక్షత్రవనంలో వివిధ రకాల ఔషధ గుణాలున్న ఆయుర్వేద మొక్కలను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నారు. ఈ నక్షత్ర వనంలో మల్టి విటమిన్, కొవెల్ బంక, కుందేటి చెవులు, రుద్రాక్ష, మిరియాలు, తిప్పతీగ, రణపాల, లక్ష్మితరు, ఇన్సులిన్, బిర్యాని ఆకు, యాలకులు మొదలగు ఔషధ మొక్కలను నక్షత్రపు ఆకారపు తోటలో పెంచుతూ మధ్యలో వన దుర్గ మరియు ధన్వంతరి స్వామి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రతి పౌర్ణమి రోజున వివిధ రకాల పోటీలను నిర్వహిస్తున్నారు. పౌర్ణమి రోజున అనేకమంది హోమంతో పాటు ఇక్కడ జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొని ఒక వేడుకలాగా జరుపుతుంటారు. ఈ హోమం ద్వారా వచ్చిన బూడిదను పంటల సాగులో వినియోగిస్తూన్నారు. ఈ నక్షత్ర వనంలో వివిధ రకాల ఔషధ గుణాలున్న మొక్కల మధ్య ధ్యానం చేయడం వలన ఆరోగ్యం బాగుంటుందనే తలంపుతో ఈ నక్షత్రవనాన్ని ఏర్పాటు చేశారు.
నక్షత్రవనంలో వివిధ రకాల ఔషధ గుణాలున్న మొక్కల పెంపకంతో పాటు అవకాశం ఉన్న చోట వివిధ రకాల ఆకుకూరలు మరియు కూరగాయలను సాగు చేస్తున్నారు. సుమారు 15 కుటుంబాల అవసరాలను తీర్చటానికి అవసరమయిన అన్ని రకాల ఆకుకూరలు, టమాట, వంగ, మిరప, సొర, బీర, కాకర వంటి కూరగాయలను సాగు చేస్తూ తమ సొంత వినియోగానికి ఉపయోగిస్తున్నారు. వీటి సాగుకు ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా కేవలం పంచగవ్య, హోమంలో లభించే బూడిద, గోవ్యర్థాలను మాత్రమే ఉపయోగిస్తున్నారు.
సేంద్రియ సాగులో మన దేశీయ జాతి గోవు ప్రధాన పాత్ర పోషిస్తుందనే విషయం తెలిసిన వీరు వివిధ రకాల దేశీ గోజాతుల గోశాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి వీరి గోశాలలో 80 దూడలు 100 పెద్ద పశువులు ఉన్నాయి. ప్రధానంగా గిర్, పుంగనూరు, తార్పార్కర్, రాఠి, సాహివాల్ జాతికి చెందిన గోవులను పోషిస్తున్నారు. రోజుకి 80 లీటర్ల చొప్పున పాల దిగుబడి పొందుతున్నారు. గోవులను ఒకే ప్రాంతంలో కట్టివేయకుండా ఫ్రీగ్రేజింగ్ పద్ధతిలో పెంచుతున్నారు. ఈవిధంగా ఫ్రిగ్రేజింగ్ పద్ధతిలో పెంచటం వలన ఆవులకు నడవటానికి అవకాశం ఉండటంతో పాటు తమకు ఇష్టం వచ్చినగ్రాసాలను తినటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆవుల ద్వారా వచ్చిన పాలు, పేడ, మూత్రం లాంటివి నాణ్యంగా ఉంటాయనే లక్ష్యంతో ఈ పెంపక విధానాన్ని ఎన్నుకున్నారు. గోవులకు మేతగా సూపర్ నేపియర్, పిల్లిపెసర, అలసంద మొదలగు పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నారు. దాణాగా ఎండుగడ్డి, పెసరపొట్టు, మినుపపొట్టు, వేరుశనగ పొట్టు లాంటివి వినియోగిస్తున్నారు.
వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలతో పాటు వరి, మామిడి పంటలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులతో పండిస్తున్నారు. 1262 రకం వరిలో కేవలం ఎకరానికి 20,000/-ల ఖర్చుతో ఎకరం నుంచి సుమారు 39 బస్తాల వడ్లను దిగుబడి పొందడము జరిగింది. సుమారు 25 సంవత్సరాల వయస్సు గల మామిడి తోటను గత మూడు సంవత్సరాల నుంచి సేంద్రియ సాగు పద్ధతులు పాటిస్తూ ఆరోగ్యకరమైన దిగుబడి పొందుతున్నారు. ముందు ముందు మామిడి కాయలను వేరే దేశాలకు ఎగుమతి చేయాలనే ధ్యేయంతో ఉన్నారు. వీరు సాగు చేసే పంటలకు పశువుల ఎరువు, పంచగవ్య, థపర్ణి కషాయం, జీవామృతాలను ఉపయో గిస్తుంటారు. పశువుల పాక శుభ్రం చేసే సమయంలో వచ్చే వ్యర్థాలను నేరుగా పొలానికి పంపించే ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఈ క్షేత్రంలో ఆరోగ్యకర వాతావరణం ఏర్పడి ఉదయం, సాయంకాలం సమయంలో వివిధ రకాల పకక్షులు దర్శనమిస్తుంటాయి. మరిన్ని వివరాలు 99856 92555కి ఫోను చేసి తెలుసుకోగలరు.
భారత దేశంలో రుతుపవనాల ద్వారానే ఎక్కువ భాగం వర్షపాతం నమోదవుతున్నది. మొత్తం సంవత్సరంలో దేశంలో సగటున 1160 మిల్లీమీటర్ల వర్షం కురుస్తున్నది. అందులో 75 నుండి 80 శాతం జూన్ నుండి సెప్టెంబరు మాసాల్లో నైరుతీ రుతుపవనాల ద్వారా లభిస్తున్నది. అక్టోబరు 15 తర్వాత వచ్చే ఈశాన్య రుతుపవనాల ద్వారా మరో 15 శాతం వర్షపాతం నమోదవుతున్నది. మార్చి నుండి మే వరకు ఉష్ణ వాతావరణం ఉంటుంది. అయితే వేసవి కాలంలో కూడా అప్పుడప్పుడు కొన్ని వర్షాలు పడతాయి. దేశంలో సగటున 76 మిల్లీమీటర్లు ఏప్రిల్లో, 40 మిల్లీమీటర్లు మేలో వర్షం పడుతుంది. అందులో ఎక్కువ భాగం తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోనే కురుస్తుంది. కాని మార్చి 1వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాపితంగా సగటున 28 శాతం అధిక వర్షపాతం కురిసింది. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణంగా ఈ నెలల్లో 200 మిల్లీమీటర్ల వర్షం పడుతుంది. కాని ఈ సంవత్సరం 29 శాతం తక్కువగా 141.5 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. వాయువ్య భారతంలో 18 శాతం ఎక్కువ వానపడగా, మధ్య భారతంలో 268 శాతం అధికంగా వర్షాలు ముంచెత్తాయి. దక్షిణ భారతదేశంలో సాధారణ వర్షపాతం 54.2 మిల్లీమీటర్లే కాగా, ఈ సంవత్సరం 88 శాతం అధికంగా 102 మిల్లీమీటర్ల వానలు కురిశాయి. ఏప్రిల్, మే మాసాల్లో సాధారణంగా విజయవాడ ప్రాంతంలో 26 మిల్లీ మీటర్లు, హైదరాబాద్ ప్రాంతంలో 57 మిల్లీమీటర్లు, విశాఖపట్నం ప్రాంతంలో 87 మిల్లీమీటర్లు 60 సంవత్సరాల సగటుగా నమోదయ్యాయి. కాని ఈ సంవత్సరం మార్చి 14 నుండి మే ఏడవ తేదీ వరకు సాధారణ వర్షపాతానికి మూడు నాలుగు రెట్లు వర్షాలు కురిసాయి. వర్షాలతో పాటు గాలి తీవ్రత, వడగండ్ల ప్రభావం కూడా ఎక్కువగా ఉండటం వల్ల వరి, మొక్కజొన్న, మిర్చి, పసుపు వంటి పంటలతో పాటు మామిడి వంటి ఉద్యానవన పంటలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. అకాల వర్షాలవల్ల రైతులు పంటల్ని సరిగా నూర్చుకోలేక, ఎండబెట్టలేక కొంత దిగుబడిని నష్టపోవటం జరిగింది. వరి, మొక్కజొన్న, జొన్న గింజలు మొలకలు వచ్చి, నాణ్యతను కోల్పోయి, అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. కల్లాల్లో ఎండుమిర్చి, పసుపు తడిసి, కుళ్ళిపోయాయి.
అపారనష్టం…
చేతికొస్తుందనుకొన్న పంట ఆఖరి నిమిషంలో చేజారడం రైతులను నిరాశకు గురి చేస్తున్నది. తెలంగాణలో దాదాపు రెండు లక్షల ఎకరాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లో మూడు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనాలు వస్తున్నాయి. మొత్తం అధిక వర్షాల వల్ల రైతులకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు ఈ రెండు రాష్ట్రాల్లో నష్టం జరిగి ఉంటుంది. రైతుల్ని ఆదుకోవటానికి ప్రధానమంత్రి 2016లో ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ ను తెచ్చారు. అప్పటి వరకు దేశంలో 30 శాతం మంది రైతులు ‘పంట బీమా’ పథకంలో పాల్గొంటున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. దేశంలో కనీసం 50 శాతం మంది రైతులు ఈ పథకంలో చేరి, లబ్ధి పొందటం లక్ష్యంగా ఈ పథకం రూపొందింది. గత ఆరేడేళ్ళగా అమలవుతున్న ఈ పథకం పట్ల రైతులు ఏ మాత్రం సంతృప్తిగా లేరు. అనేక రాష్ట్రాలు ఈ పథకం నుండి వైదొలగాయి. ప్రధాని స్వరాష్ట్రమైన గుజరాత్ కూడా వైదొలగటం విశేషం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు కూడా అసంతృప్తితో పథకం నుండి బయటకు వచ్చాయి. ఇప్పుడు దేశంలో కేవలం 10 నుండి 15 శాతం రైతులు మాత్రమే ఇందులో చేరుతున్నారు. ఈ పథకం వల్ల రైతుల కంటే ఇన్సూరెన్సు కంపెనీలే ఎక్కువగా లాభిస్తున్నాయనే అసంతృప్తితో అనేక రాష్ట్రాలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుండి వైదొలగాయి. ఆంధ్రప్రదేశ్ అందుకు ప్రత్యామ్నాయంగా ‘వై.ఎస్.ఆర్. ఫ్రీ పంట బీమా యోజన’ను తీసుకు వచ్చింది. రైతులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా ఇందులో చేరవచ్చు. 22 రకాల పంటలు ఈ పథకంలో అర్హత కలిగి ఉంటాయి. అంటే ఈ పంటలు పండించే రైతులు అ పథకంలో ప్రీమియం చెల్లించకుండానే చేరవచ్చు. కౌలుదార్లు కూడా ఇందులో చేరే అవకాశం ఉంది. రైతులకు ప్రీమియం భారం లేకుండా ఉండటంతో జనాదరణ పొందింది. కొన్ని సీజన్లలో కొందరు రైతులకు నష్టపరిహారం కూడా లభించింది. అయితే రైతు భరోసా కేంద్రాలు అవసరమైన మేరకు పనిచేయటం లేదని రైతులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా పంటల్ని సేకరించటానికి అవి చొరవ చూపడటం లేదని, సేకరించిన ధాన్యాలకు చాలా ఆలస్యంగా డబ్బులు చెల్లిస్తున్నారని ఆందోళన చేస్తున్నారు. రైతులు కోతకోసిన పంటల్ని నిలవ చేయటానికి గోడౌన్లు లేక, మిల్లర్లకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్న మిల్లర్లు బస్తాకు ఐదు నుండి పన్నెండు కిలోలు అదనంగా తీసుకుంటున్నారనీ, ఒక లారీకి పదివేలకు పైగా కోత పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. పంటరాశులపై కప్పి, రక్షించడానికి టార్పాలిన్లు కూడా అందించటం లేదని రైతులు ఆందోళన చేస్తున్నారు. పొగాకు, మొక్కజొన్న, పసుపు, మిర్చి వంటి పంటల్లో నష్టం అపారంగా ఉంటున్నదని రైతులు చెబుతున్నారు. పంట అంచనాలు బాగానే ఉన్నాయి కాబట్టి రైతులకు నష్ట పరిహారం లభించకపోవచ్చు. నష్టం పంటకల్లాల్లో ఉన్నప్పుడు జరిగింది కాబట్టి పంట బీమా పథకం ద్వారా రైతులకు లబ్ది చేకూరకపోవచ్చు. ప్రభుత్వం ప్రత్యేక సాయాన్ని ప్రకటిస్తే తప్ప రైతులకు ఉపశమనం కలగదు.
తెలంగాణ రాష్ట్రం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుండి బయటకు వచ్చింది కాని ప్రత్యేకంగా తమ స్వంత బీమా పథకాన్ని తేలేదు. అయితే ముఖ్యమంత్రి గారు నష్టపోయిన రైతుల పొలాలను సందర్శించి, ఎకరాకు నష్టహారంగా పదివేల రూపాయల సాయం చేస్తామని ప్రకటించారు. అయితే ఈ పరిహారాన్ని కొన్ని ప్రాంతాలకు, ఒక దఫా వర్షాలకే పరిమితం చేస్తారా, అన్ని ప్రాంతాల్లోనూ గత మూడు మాసాల్లో కురిసిన అధిక వర్షాలకు నష్టపోయిన రైతులందరికీ ఇస్తారా అనేది వేచి చూడాలి. నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారాన్ని అందించటానికి కొన్ని వందల కోట్ల రూపాయలు అవసరమౌతాయి.
తుఫాన్ల బెడద
మే మాసంలో ఒకటి రెండు తుఫాన్లు వచ్చే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో పుట్టిన ‘మోచా’ తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో తక్కువగానే ఉండటంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. కొద్దిపాటి గాలులు, చిరుజల్లులను మినహాయిస్తే ప్రమాదం తప్పినట్లే. రానున్న ఇరవై రోజుల్లో మరో తుఫాను పుట్టవచ్చు. అది ‘మోచా’ లాగానే తేలిగ్గానే ఉండవచ్చు. ఒక్కోసారి మే నెలలో వచ్చే తుఫాన్లు భారీ నష్టాన్ని కూడా కలిగించవచ్చు. మే 15 లోగా పంటలన్నీ ఇళ్ళకు చేరుకోవచ్చు. మేలో కురిసే ఎండాకాలపు వానలు రైతులు భూమిని దున్ని, విత్తటానికి తయారుగా ఉండటానికి సాయపడతాయి. జూన్లో రుతుపవనాలు రాగానే విత్తనాలు చల్లుకునే అకాశం కల్పిస్తాయి. రుతుపవనాల కన్నా ముందుగా వచ్చే వానలు రైతులకు బాగానే ఉపయోగపడతాయి. అయితే విపరీతమైన గాలులు, భారీ వర్షాలు వస్తే మాత్రం నష్టాలు, కష్టాలు తప్పవు.
తప్పుకుంటున్న కేంద్రం
గత కొన్నేళ్ళగా కేంద్రప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు అర్థమౌతుంది. కనీస మద్దతు ధరల్ని ప్రకటించే కేంద్ర ప్రభుత్వానికి వాటిని నిలపాల్సిన బాధ్యత కూడా ఉంది. ధరలు మార్కెట్లో తగ్గి, కనీస మద్ధతు ధర కన్నా తక్కువ స్థాయికి వచ్చినపుడు రాష్ట్రాలతో సేకరణ వ్యూహాన్ని రూపొందించి, వ్యవసాయ ఉత్పత్తుల్ని సేకరించాలి. కాని క్రమేపీ ఆ బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంటున్నది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమానంగా ఉండాలి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన విఫలమైన పరిస్థితుల్లో, కేంద్రం తన అధికార బృందాలను పంపి నష్టాలను అంచనా వేసి, కొంతమేరకైనా సాయాన్నందించాలి. వచ్చే సంవత్సరం ఎన్నికలున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొంత మేరకు రాష్ట్రాల విజ్ఞప్తులకు స్పందించే అవకాశముంది. కాని ఇప్పటికి కేంద్ర బృందాలను అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న రాష్ట్రాలకు పంపలేదు. కాని రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం రూపంలోగానీ, ఇన్పుట్ సబ్సిడీ రూపంలో గానీ సాయం అందించే అవకాశాలున్నాయి. నష్టం వేల కోట్ల రూపాయల్లో ఉంటే, సాయం వందల కోట్లలోనే ఉండవచ్చు.
వాతావరణం మారుతున్నదా?
ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పుల గురించి చర్చ జరుగుతున్నది. ఉష్ణోగ్రతలు పారిశ్రామీకకరణకు ముందుతో పోలిస్తే ఎంతమేరకు పెరుగుతున్నాయి? 21వ శతాబ్దం చివరకు ఉష్ణోగ్రతల పెరుగుదల 1.5 నుండి 2.0 డిగ్రీలకే పరిమితమవుతుందా లేక 2.0 డిగ్రీల సెంటీగ్రేడుని మించుతుందా అనే విషయంపై పర్యావరణవేత్తలు చర్చించుకుంటున్నారు. కార్బన్డైఆక్సైడ్ సాంద్రత పెరుగుతుందనేది నిర్వివాదాంశం. కార్బన్మోనాక్సైడ్, మిథేన్ వంటి ప్రమాదకరమైన వాయువులు పర్యావరణానికి సవాలుగా తయారయ్యాయి. ఓజోన్ పొరలో రంధ్రాలు ఏర్పడటం, పెద్దవి కావటం నీలలోహిత కిరణాలు ప్రకృతిపైన, మనుషులపైన విపరీత ప్రభావం కలిగించవచ్చని దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. బొగ్గు, క్రూడాయిల్, గ్యాస్ వంటి ఇంధన వనరుల వాడకాన్ని తగ్గించి, సూర్యరశ్మి, పవనశక్తి, హైడ్రో ఎలక్ట్రిక్ వంటి పునరుత్పాదక శక్తి కలిగిన వనరుల్ని ఎక్కువగా వాడాలని అన్ని దేశాలు నిర్ణయించాయి. కాని కార్యాచరణలో అభివృద్ధి చెందిన దేశాలు వెనుకంజ వేస్తున్నాయి. పారిస్, క్యోటో ఒప్పందాల అమలులో అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. అన్ని దేశాలూ బాధ్యతల్ని పంచుకోకుంటే భూగోళం వేడెక్కక తప్పదు. అది వర్షపాతంపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియాల్లోని వర్ధమాన దేశాల్లో వర్షపాతం తగ్గుతుందని అంచనాలు ఈ దేశాల్లో పేదరికం, ఆకలి బాధలు పెరుగుతాయనే భయాలు కలిగిస్తున్నాయి. ఇప్పటికే ‘ఎల్నినో’ ప్రభావంతో భారత్ వంటి దేశాల్లో వర్షాలు తగ్గుతాయనే ఆందోళనలున్నాయి. 2023-24లో వర్షపాతం సాధారణం కన్నా తక్కువగా ఉంటుందనే అంచనాలే కొంత ఆందోళన కలిగిస్తున్నది.
తగ్గని వర్షపాతం:
గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఒక సంవత్సరంలో కురిసే వర్షపాతంలో మార్పు లేదని భారత వాతావరణ సంస్థ చెబుతున్నది. అయితే రుతుపవనాల ప్రారంభం, గమనం, ముగింపులో సంవత్సరాల మధ్య తేడా ఉంటున్నది. ఈ సంవత్సరం నడి వేసవిలో వర్షాలు ఎక్కువగా ఉండటాన్ని కూడా తాత్కాలికమార్పే కాని దీర్ఘకాలమార్పు కాదనే అర్థం చేసుకోవాలి. కాని రైతులు ఒక వాతావరణ క్రమాన్ని బట్టి తమ పంటల సరళిని, పొలం పనుల్ని నిర్ణయించుకుంటారు. ఊహించని సమయంలో వర్షాలు పడటం వల్ల రైతులు ఒక విధంగా ‘షాక్’కి గురయ్యారు. ఆకస్మిక మార్పుల వల్ల కలుగుతున్న నష్టాలను వారే ఎక్కువగా భరించాల్సి వస్తున్నది. దిగుబడులు బాగుండి, ఆదాయాలు తగ్గడం ఆరుదుగా జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో రైతుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తమ పంటల బీమా పథకం ఎందుకు విఫలమైందో ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎన్నో రాష్ట్రాలు వైదొలగటం, రైతుల సంఖ్య తగ్గిపోవటం, కొన్ని కంపెనీలు కూడా ఈ పథకం నుండి తప్పుకోవటం, రైతుల్ని కష్టాల్లో ఆదుకోలేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని, కొత్త పథకాన్ని రూపొందించాల్సిన సమయం ఆసన్నమైంది. ఏదో ఒక్కో చిన్న రైతుకి ఏటా ఆరువేలిస్తున్నాము కాబట్టి మద్దతు ధరల్ని కాపాడము, సేకరణ మద్దతు నందించం, ప్రకృతి వైపరీత్యాల నుండి రైతుల్ని రక్షించం అనే వైఖరి సమంజసం కాదు. రైతుబంధు సాయాన్నిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం, నవరత్నాలిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పించుకోవటం సమర్ధనీయం కాదు. అనేక వైపరీత్యాల నెదుర్కుంటూ, రైతు కూలీలు కష్టించి, దేశంలో ఆహార కొరత రాకుండా చేస్తున్న రైతు కూలీల జీవన స్థితిగతుల గురించి ఆలోచించాలి. కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలి.
డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త,
మన దేశ జనాభా ఏఏటికాయేడు పెరుగుతూనే ఉంది. ఇటీవలే మన జనాభా చైనాను దాటి జనాభాలో ప్రపంచంలో మొదటి స్థానాన్ని సంపాదించింది. జనాభాతో పాటు నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతూనే ఉంది. పెరుగుతున్న నిరుద్యోగులకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు పెరగడము లేదు. కొంతమంది నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. మిగతా నిరుద్యోగులు ఉపాధి అవకాశాల కోసం అన్వేషించాలి. ఉపాధి అవకాశాల గురించి ఆలోచిస్తే ప్రస్తుతం ఉన్న ప్రజల జీవనశైలి ప్రకారం అందరికి నచ్చే ఉపాధి అవకాశాలు సరైన మొత్తంలో అందుబాటులో ఉండడము లేదు. మనది వ్యవసాయక దేశం కాబట్టి వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్యకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించే సత్తా మన దేశంలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకే ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు. కాబట్టి నిరుద్యోగులు తమ జీవన శైలిని మార్చుకొని వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను స్వయం ఉపాధిగా మలచుకున్నట్లయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. కాని ఈ రంగాలలో శారీరక శ్రమతో పాటు ఇతర సమస్యలు ఉంటున్నాయి కాబట్టి ఈ రంగాలను ఉపాధి అవకాశాలుగా ఎంచుకోవటానికి ఎక్కువమంది యువత ముందుకు రావడము లేదనే విషయం ప్రస్తుత సమాజాన్ని పరిశీలిస్తే అర్థం అవుతుంది. కాని కొంతమంది యువత అన్ని సమస్యలను ఎదుర్కోగలమనే నమ్మకంతో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలవైపు అడుగులు వేస్తూ స్వయం ఉపాధి మార్గాలుగా ఎంచుకుని విజయం సాధిస్తున్నారు. కొంతమంది ఇంకొంత ఆదర్శంగా ఆలోచించి చేస్తున్న ఉద్యోగాలను వదలి కూడా వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలను స్వయం ఉపాధి మార్గాలుగా ఎంచుకుని విజయం సాధిస్తున్నారు. ఈ రంగాలలో విజయం సాధించిన వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమకు వెనుకంజ వేయకుండా, సొంత మార్కెటింగ్ వ్యవస్థను సృష్టించుకున్న వారు తప్పనిసరిగా వ్యవసాయం రంగంలో విజయం సాధిస్తూ ఉద్యోగంలో వచ్చిన జీతం కంటే ఎక్కువ ఆదాయాన్ని తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఆనందకరమైన జీవితాలను గడుపుతూ ఆడుతూ, పాడుతూ, శ్రమిస్తూ… సంపాయిస్తున్నారు. ఈ కోవకే చెందుతాడు హైదరాబాదు శివారు తురకపల్లి మండలం మాధపురం గ్రామంకి చెందిన జైపాల్రెడ్డి.
వ్యవసాయ నేపధ్యానికి చెందిన జైపాల్రెడ్డి ఐఐటి చదివి ఇసిఐఎల్లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి కొనసాగిస్తున్నాడు. 2009లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి తన చదువుకు సంబంధించిన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్న సమయంలో ప్రకృతి వ్యవసాయం గురించి, ఆరోగ్యం గురించి, మన ఆరోగ్యం కాపాడుటలో ప్రకృతి వ్యవసాయం ప్రధాన పాత్ర పోషిస్తుందనే విషయాలను రాజీవ్ దీక్షిత్ మరియు సుభాష్ పాలేకర్ వంటి వారి ద్వారా తెలుసుకుని తాను కూడా సమాజానికి మంచి ఆహారాన్ని అందించాలని ఆలోచించ సాగాడు. తన లక్ష్యం నెరవేరాలంటే చేస్తున్న ఉద్యోగాన్ని వదలడముతో పాటు అప్పటి వరకు తన తల్లిదండ్రులు చేస్తున్న రసాయనిక సేద్యాన్ని సేంద్రియంలోకి మార్చగలగాలి. ఈ రెండు పనుల వలన కొన్ని ఇబ్బందులు ఉంటాయని తెలిసి కూడా చేస్తున్న ఉద్యోగాన్ని 2019 సం||లో వదలి వేసి తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నా కూడా ఏ మాత్రం లెక్కచేయకుండా ప్రకృతి వ్యవసాయంలోకి అడుగు పెట్టాడు.
మంచి జీతాన్ని వదులుకొని వ్యవసాయంలోకి అదీను శారీరక శ్రమ ఎక్కువగా ఉండే సేంద్రియ సాగులోకి జయపాల్రెడ్డి అడుగు పెట్టడము వారి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. వారికి ఇష్టం లేకపోవడానికి మన సమాజ పరిస్థితులే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. మన సమాజంలో ఎక్కువ మంది ప్రజలు డబ్బు సంపాదనే ధ్యేయంగా పెరుగుతున్నారనే విషయం అక్షర సత్యం. ప్రస్తుతంతో పోల్చుకుంటే గత రెండు మూడు థాబ్దాల క్రితం ఈ పరిస్థితులు మన సమాజంలో ఇంకా ఎక్కువగా ఉండేవి. గతాన్ని అంటే 30, 40 సంవత్సరాల క్రితం పరిస్థితులు ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే మనిషి పుట్టింది డబ్బు సంపాదన కొరకు, సుఖాలను అనుభవించుట కొరకే అని భావించే వారే అప్పటి సమాజంలో 90 శాతానికి పైగా ఉన్నారనే విషయం అక్షర సత్యం. కాబట్టే అప్పట్లో ప్రజలు అన్నీ ఫణంగా పెట్టి డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవితాలను కొనసాగించే వారు. కొంతమంది అయితే తమ ఆరోగ్యాలను, ప్రాణాలను ఫణంగా పెడుతూ డబ్బు సంపాదన కోసం వెంపర్లాడేవారు అనే విషయం అందరికీ తెలిసిందే. అందువలన అప్పట్లో ఆరోగ్యం కోసం పెద్దగా ఆలోచించే వారు కాదు. కాని రాను రాను ఎక్కువమంది ప్రజలకు డబ్బు అందుబాటులోకి రావడము, కొంతమందికి అవసరానికి మించి డబ్బు అందుబాటులోకి రావడము మొదలవటం, ఉపాధి అవకాశాలు పెరగడము లాంటి వివిధ రకాల పరిస్థితుల వలన గతంతో పోల్చుకుంటే ప్రస్తుత పరిస్థితులలో ఎక్కువమందికి కనీస అవసరాలు తీర్చుకోవటానికి అవసరమయినంత డబ్బు అందుబాటులోకి వచ్చిందని చెప్పవచ్చు. గతంలో కనీస అవసరాలు తీర్చుకోవడానికి అందుబాటులో లేని డబ్బు ప్రస్తుత పరిస్థితులలో కనీస అవసరాలతో పాటు విలాస వంతమైన, సౌకర్యవంతమైన జీవితాలను కొనసాగించటానికి కూడా అవసరమైన డబ్బు ఎక్కువమందికి అందుబాటులోకి రావటం వలన కొంతమందికి కోల్పోతున్న ఆరోగ్యం గురించి చర్చ మొదలయ్యింది. కరోనా సమస్య, సామాజిక మాధ్యమాలు వేగంగా అభివృద్ధి చెందడంతో సమాచారం చాలా వేగంగా ప్రపంచం మొత్తం తెలవటానికి అవకాశాలు అందుబాటులో ఉండడము లాంటి కారణాల వలన ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెరిగి ఆరోగ్యానికి సరైన దారి సేంద్రియ ఆహారం అని అందరికీ తెలిసి వచ్చింది కాబట్టి ఎక్కువ మంది యువత సేంద్రియం వైపు అడుగులు వేస్తున్నారు. జయపాల్ రెడ్డి కూడా ఈ బాటలోనే నడుస్తానంటే అప్పటి పరిస్థితులు ప్రత్యక్షంగా అనుభవించిన వీరి తల్లిదండ్రులు జయపాల్ రెడ్డిని వ్యతిరేకించారు. ఇంకా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయినాకాని జయపాల్ రెడ్డి వెనుకంజ వేయకుండా చేస్తున్న ఉద్యోగాన్ని వదలి సేంద్రియ సాగులో అడుగు పెట్టి ఇందులోనే తన ఆదాయం పెంచుకొనే మార్గాలను అన్వేషిస్తూ 2019 నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాడు.
2019లో ప్రకృతి సాగులోకి అడుగు పెట్టిన జయపాల్ రెడ్డి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి వచ్చాడు కాబట్టి ఉద్యోగంలో వచ్చిన డబ్బు తప్పనిసరిగా పొందాలనే లక్ష్యంతో మార్గాలు అన్వేషిస్తూ సొంత మార్కెటింగ్ మరియు అనుబంధ రంగాలను ఆదరించడమే అని గ్రహించి తాము పండించిన సేంద్రియ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు మంచి ధరలకు అమ్మడంతో పాటు మన దేశీయ జాతి ఆవులను కొనుగోలు చేసి వాటి ద్వారా వచ్చిన పాలను, నెయ్యిని మంచి ధరలకు నేరుగా వినియోగదారులకు అమ్ముతూ వస్తూ ఉద్యోగంలో సంపాదించిన దానికంటే ఎక్కువగానే సంపాదిస్తున్నాడు.
పూర్తి సేంద్రియ పద్ధతులతో వివిధ రకాల కూరగాయలు, మామిడి, మన పురాతన వరి రకాలను పండిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం మామిడి, వరి పంటలు సాగులో ఉన్నాయి. గత సంవత్సరం వరకు వివిధ రకాల కూరగాయలు సాగు చేశాడు. ప్రస్తుతం కూరగాయలు సాగులో లేవు. వాటితో పాటు మన దేశీ జాతి ఆవులను పోషిస్తూ వాటికి అవసరమయిన పశుగ్రాసాలను సొంతంగా సాగు చేస్తున్నాడు.
వరి: ప్రతి సంవత్సరం వరి సాగు చేస్తుంటాడు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు మొదలు పెట్టిన తరువాత నూతన వరి వంగడాలను ప్రక్కన పెట్టి మన పురాతన వరి రకాలను మాత్రమే సాగు చేస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు నవారా, బహురూపి, కర్పూరకేలి, రత్నచోడి, మైసూర్ మల్లిక, ఇంద్రాణి, కుజుపటాలియా లాంటి రకాలను మాత్రమే సాగు చేశాడు. మన పురాతన వరి రకాలలో మన ఆరోగ్యాన్ని కాపాడే లక్షణాలు ఉంటాయని భావించి ఆ రకాలనే సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం మూడు ఎకరాలలో మైసూర్ మల్లికు మరియు కుజుపటాలియా రకాలు సాగులో ఉన్నాయి. సొంత విత్తనాలను ఎకరానికి 10 కిలోల చొప్పున నారు పోసుకుని 20 రోజులు పెరిగిన నారుని ప్రధాన పొలంలో నాటించాడు. సొంత ఆవుల ద్వారా వచ్చిన ఎరువు కుప్పపై జీవామృతాన్ని చల్లి ఆ ఎరువుకుప్పను ఘనజీవామృతంగా మార్చుకుని దుక్కిలో ఎకరానికి ఒక ట్రక్కు చొప్పున ఘనజీవామృతాన్ని అందించారు. నవంబరు 20న నారు పోసుకుని డిసెంబరు 10న నారు నాటించారు. నారు నాటిన తరువాత ప్రతి 10 లేదా 15 రోజులకు ఒకసారి ఎకరానికి 200 లీటర్ల చొప్పున జీవామృతం మరియు గో-కృపామృతాలను మార్చి మార్చి భూమికి అందిస్తూ వస్తున్నాడు. అవసరాన్ని బట్టి పుల్లటి మజ్జిగ, జీవామృతం, వేపకషాయాలను పంటపై పిచికారి చేయించారు. అంతకు మించి ఏమీ చేయలేదు. పంట మే మూడవ వారంలో కోత కోయించాడు. ఎకరానికి 70 కిలోల బస్తాలు 25 వరకు దిగుబడి వచ్చింది. గత పంటకాలంలో 3 ఎకరాలకు గాను 4200 కిలోల బియ్యాన్ని పొంది కిలో 70/- నుంచి 80/- ల వరకు అమ్మకం చేశాడు.
మామిడి: తెలిసిన వారికి చెందిన 7 ఎకరాల మామిడి తోటలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ తాను మార్కెటింగ్ చేసుకోగలిగిన మొత్తంలో మామిడి కాయలను తోట యజమాని నుంచి కొనుగోలు చేస్తూ నేరుగా వినియోగదారులకు మంచి ధరలకు అమ్మకం చేస్తుంటాడు. ప్రతి 30 రోజులకు ఎకరానికి 200 లీటర్ల చొప్పున జీవామృతం లేదా గోకృపామృతాలను మార్చి మార్చి డ్రిప్పు ద్వారా మామిడి మొక్కల పాదులలో అందిస్తుంటారు. అవసరాన్ని బట్టి థపర్ణి కషాయం, పుల్లటి మజ్జిగలను పంటపై పిచికారి చేయిస్తుంటారు. తనకున్న ఆవులను 7 ఎకరాల మామిడి తోటలో తిరగనిస్తుంటారు. బంగినపల్లి, రసాలు, థేరి రకాలను సాగు చేస్తూ కిలో 100 నుంచి 120/-లకు నేరుగా వినియోగదారులకు అమ్మకం చేస్తూ ఉంటాడు.
ఆవులు: ప్రస్తుత పరిస్థితులలో మనదేశీ జాతి ఆవులయిన ఒంగోలు, గిర్, సాహివాల్, తార్పార్కర్ మొదలగు గోవుల పాలు మరియు నెయ్యిలకు గిరాకీ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దానిని గమనించి జయపాల్ రెడ్డి దేశీ జాతి ఆవులతో పశుపోషణ మొదలు పెట్టాడు. పశుపోషణలో ఆర్థికంగా ఫలితాలు సాధించాలంటే గిర్, కాంగ్రెజ్, సాహివాల్ జాతులు మొదటి వరుసలో ఉంటాయని గ్రహించి ఈ జాతులనే కొనుగోలు చేస్తూ తన పశు సంపదను అభివృద్ధి పరుస్తున్నాడు. మొదటలో 2020వ సంవత్సరములో రెండు గిర్ ఆవులను కొనుగోలు చేశాడు. ప్రతి సంవత్సరం కొన్ని ఆవులను కొనుగోలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇటీవల అంటే రెండు నెలల క్రితం 1,20,000/-లు వెచ్చించి గిర్ ఆవును కొనుగోలు చేశాడు. ఆ ఆవు మే 2వ తారీఖున ఈనింది. ప్రస్తుతం అది రెండు పూటలా కలిపి 8 లీటర్ల పాలు ఇస్తుంది. పూటకి లీటరు చొప్పున దూడకు వదలగా పూటకు 4 లీటర్ల పాలు ఇస్తుంది. ఈ ఆవు పాల దిగుబడి పెరుగుతూ కొన్ని రోజులు గడిచే సరికి రోజుకి 16 నుంచి 20 లీటర్లు పాలు పొందగలననే నమ్మకంతోనే జయపాల్ రెడ్డి ఆ ఆవును 1,20,000/-లకు కొనుగోలు చేశాడు. మొత్తం 15 ఆవులను, ఒక ఎద్దును, 10 దూడలను పోషిస్తున్నాడు. 15 ఆవులలో 9 ఆవులు ప్రస్తుతానికి పాలు ఇస్తున్నాయి. ఆవులలో గిర్, కాంగ్రెజ్, సాహివాల్, రాఠి, రెడ్సింధి రకాలు ఉన్నాయి. దూడలలో 5 మగవి, 5 ఆడవి ఉన్నాయి. 9 ఆవుల నుండి రోజుకు రెండు పూటలు కలిపి సగటున 60 లీటర్ల పాల దిగుబడి పొందుతున్నాడు. ఒక రోజు పాలను నెయ్యి చేస్తుంటాడు. ఒక రోజు పాలను వినియోగదారులకు అమ్ముతుంటాడు. అంటే రోజు మార్చి రోజు అంటే నెలలో 15 రోజుల పాలను నెయ్యి (పాలను పెరుగు చేసి, ఆ పెరుగు చిలికి వెన్న చేసి వెన్న నుంచి నెయ్యి) చేస్తుంటాడు. నెలకు 50 నుంచి 60 లీటర్ల నెయ్యి పొంది లీటరు 2500/-లు (మిషను సహాయంతో వెన్న పొంది, ఆ వెన్నతో చేసిన నెయ్యి) మరియు లీటరు 3500/- (మనిషి చిలికి వెన్న పొంది ఆ వెన్న నుంచి పొందిన నెయ్యి) ల చొప్పున అమ్మకం చేస్తున్నాడు. నెలకు 15 రోజులు రోజుకు 60 లీటర్ల చొప్పున పాలను లీటరు 100/- నుంచి 120/-లకు నేరుగా వినియోగదారులకు అమ్మకం చేస్తున్నాడు. ఆవులను సాధ్యమయినంత వరకు స్వేచ్ఛగా తిరగనిస్తుంటాడు. వీటికి పశుగ్రాసంగా సూపర్ నేపియర్, మొక్కజొన్నలను సాగు చేస్తున్నాడు. ఈ పశుగ్రాసాలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులతోనే సాగు చేస్తున్నాడు. ఈ పశుగ్రాసాలతో పాటు వేరుశనగ చెక్క, దాణాలను కూడా అందిస్తున్నాడు. తాను పోషించే ఆవుల గర్భధారణ కొరకు ఎలాంటి కృత్రిమ పద్ధతులవైపు ఆలోచించకుండా తాను పోషిస్తున్న గిర్, కాంగ్రెజ్ కలయికలతో ఉన్న ఎద్దునే ఉపయోగిస్తున్నాడు.
ఏది ఏది ఏమైనా కాని చేస్తున్న ఉద్యోగాన్ని వదలి తల్లిదండ్రులను ఎదిరించి సేంద్రియ సాగు చేస్తూ తన భూమిని, ప్రకృతిని తనవంతుగా కాపాడుతూ తాము ఆరోగ్యకరమైన ఆహారం తింటూ సమాజానికి ఆరోగ్యకర ఆహారాన్ని అందిస్తూ ఉద్యోగంలో కంటే ఎక్కువగా సంపాదిస్తూ శారీరక శ్రమ, సొంత మార్కెటింగ్ చేయగలిగితే ఉద్యోగం చేయనవసరం లేదు అని జయపాల్ రెడ్డి నిరూపిస్తున్నాడు. మరిన్ని వివరాలు 9666167923కి ఫోను చేసి తెలుసుకోగలరు.
శారీరక శ్రమ తప్పనిసరి
తాను చేసే సేంద్రియ సాగు మరియు పశుపోషణలో శారీరక శ్రమ తప్పనిసరిగా ఉంటుంది. సేంద్రియ సాగులో వినియోగించే వివిధ రకాల కషాయాలు మరియు ద్రావణాలు సొంతంగా తయారు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా వచ్చిన దిగుబడికి మంచి ధర లభించాలంటే సొంతంగా మార్కెటింగ్ చేసుకోవలసి ఉంటుంది. కాబట్టి శారీరక శ్రమ చేయగల వారికి సేంద్రియ పద్ధతులు ఆరోగ్యకరమైన వ్యాపకం అని నిస్సందేహంగా చెప్పవచ్చని జయపాల్ రెడ్డి అంటున్నాడు.
రోజుకి 20 లీటర్ల పాలు ఇచ్చే గిర్ ఆవు
మన దేశీ జాతి ఆవులు అనగానే పాలు సక్రమంగా పొందలేము అనే అభిప్రాయం రైతులలో ఉంది. అందువలననే విదేశీ జాతులవైపు పశుపోషకులు మొగ్గు చూపుతున్నారు. తాను పోషించే ఆవులలో రోజుకు 10 నుంచి 12 లీటర్ల పాలు ఇచ్చే గిర్, కాంగ్రెజ్, సాహివాల్ ఆవులు ఉన్నాయి. రోజుకు రెండు పూటలు కలిపి 16 నుంచి 20 లీటర్ల పాలు ఇచ్చే గిర్ ఆవును రెండు నెలల క్రితం 1,20,000/-లు వెచ్చించి కొనుగోలు చేయడం జరిగింది. ఈ ఆవు ఇటీవల ఈనడము జరిగింది. ప్రస్తుతానికి పూటకు 5 లీటర్ల చొప్పున (దూడ తాగే పాలతో కలిపి) రోజుకు 10 లీటర్ల చొప్పున ఇస్తుంది. క్రమేపి పాల దిగుబడి పెరిగి రోజుకు రెండు పూటలు కలిపి 16 నుంచి 20 లీటర్ల పాలను ఈ ఆవు నుంచి పొందుతానని జయపాల్రెడ్డి అంటున్నాడు.
ఎక్కడికి అక్కడే మార్కెట్లు సృష్టించుకోవాలి
మార్కెట్ గురించి దూరం ఆలోచించకుండా ఈ పద్ధతులు పాటించే వారు తమ ప్రాంతాలకు సమీపములోనే మార్కెట్ను సృష్టించుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ జీవితాలను కొనసాగించవచ్చు. ఇష్టం లేకుండా ఒకరి దగ్గర ఉద్యోగం చేయకుండా తమ కాళ్ళపై తామే నిలబడుతూ ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాలకు ఇదే సరైన దారి కాబట్టి ఈ దారిలో నడవటానికి లక్షల మందికి అవకాశం ఉంది కాబట్టి నిరుద్యోగులు ఈ దిశగా ఆలోచన చేయాలని జయపాల్ రెడ్డి కోరుతున్నాడు.
నాణ్యమైన ఉత్పత్తులు వినియోగదారులకు అందించడము ముఖ్యం
ప్రస్తుత సమాజంలో ఎక్కువ మంది ప్రజలకు ఆరోగ్యం గురించి, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలనే విషయాల గురించి అవగాహన పెరిగింది. ఇంకా పెరుగుతూనే ఉంది కాబట్టి ఈ పరిస్థితులను మనము అనుకూలంగా మలచుకోవాలంటే నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించగలిగితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయనే దానికి తానే ఉదాహరణ అని జయపాల్ రెడ్డి అంటున్నాడు. తాను మొదటలో బియ్యం, కూరగాయలను వినియోగదారులకు ఇవ్వడంతో మొదలు పెట్టి ప్రస్తుతం మామిడి కాయలు, ఆవు పాలు, ఆవు నెయ్యి లాంటి ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మగలుగుతున్నాడు. ఒక పంట కాలానికి తాను పొందే 4000 కిలోలపైగా దేశీ రకం బియ్యం, నెలకు 50 నుండి 60 లీటర్ల నెయ్యి, నెలకు 800 నుంచి 900 లీటర్ల ఆవు పాలు, సంవత్సరానికి సుమారుగా 5000 కిలోల మామిడి కాయలు నేరుగా వినియోగదారులకు అమ్మగలుగు తున్నాను. నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ వినియోగదారులకు నమ్మకం కలిగించగలిగితే ఉజ్వల భవిష్యత్తుకు అవకాశాలు మెండుగా ఉంటాయని జయపాల్ రెడ్డి నిరూపిస్తున్నాడు.
ఆదిలక్ష్మి, రైతు శిక్షణా కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్
మట్టి అన్నింటికీ మూలం. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న బంగారం, రాగి, వెండి, ఇనుము లాంటి ఖనిజాలు అన్నీ కూడా మట్టిలోనుండే వస్తున్నాయి. వివిధ రకాల పంటలను మట్టిలోనే పండిస్తున్నాము. చేదుగా ఉండే కాకరకాయ, తీపిగా ఉండే మామిడికాయ, సువాసనలు అందించే మల్లెపూలు, రంగురంగుల మందార పూలు ఈ విధంగా చూసుకుంటే వివిధ రకాల రుచులు, వివిధ రకాల సువాసనలు, వివిధ రకాల రంగుల పంటలన్నీ కూడా మట్టి ద్వారానే మనం పొందుతున్నాము. మనిషితో పాటు ఏ జీవి చనిపోయినా కుడా మట్టి తనలో కలుపుకుంటుంది. ఇలాంటి ఎన్నో గొప్ప గుణాలున్న మట్టిని రసాయనాలు వేసి పాడు చేస్తున్నాము. కాబట్టి అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా మేల్కొని రసాయనాలను వీడి సేంద్రియ సాగు బాటపట్టి మట్టిని కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉందని ఏప్రిల్ 9న ‘నాబార్డు’ వారి సహకారంతో రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా, నర్సపూర్లోని శ్యామసుందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ సాగు విధానం, కషాయాలు, మిశ్రమాల తయారీతోపాటు రైతులు పండిరచిన వ్యవసాయ దిగుబడులకు విలువ జోడిరపు వంటి అంశాలపై జరిగిన అవగాహన సదస్సులో రాజేంద్రనగర్ రైతు శిక్షణా కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిలక్ష్మి అన్నారు. కార్యక్రమంలో ఏ.ఈ.ఓ. విజృంభణ, సేంద్రియ రైతులు శ్యామసుందర్ రెడ్డి, బాలేష్, క్రాంతి కిరణ్, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.
రైతులు ఏక పంట విధానానికి స్వస్తి పలికి బహుళ పంటల విధానాన్ని చేపట్టడంతోపాటు గొర్రెలు, మేకలు, కొళ్ళను కూడా పెంచుకుంటూ సమగ్ర వవ్యవసాయ విధానాలను అవలంబించగలిగితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని తన సొంత అనుభవాన్ని శ్యామసుందర్ రెడ్డి వివరించారు. వేసవి కాలంలో ఆకు కూరలకు గిరాకీ బాగా ఉంటుంది కాబట్టి నీడ అందుబాటులో ఉండే ప్రదేశాలలో వివిధ రకాల ఆకు కూరలను, కూరగాయలను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తూ వచ్చిన దిగుబడులను నేరుగా వినియోగదారులకు అమ్మకం చేసినట్లయితే సేంద్రియ సాగులో లాభాలు తప్పనిసరిగా వస్తాయని తన సొంత అనుభవాన్ని సేంద్రియ రైతు బాలేష్ వివరించారు. సేంద్రియ సాగు ఆవశ్యకత, వివిధ పంట ఉత్పత్తులకు విలువ జోడిరపుకు సంబంధించిన సమాచారాన్ని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వేంకటేశ్వరరావు విపులంగా వివరించారు. శిక్షణకు హాజరైన రైతులు శ్యామసుందర్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రాన్ని ప్రత్యక్షంగా తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాజరైన రైతులకు సర్టిఫికెట్లు అందజేశారు.
పురుగులు: తమలపాకు తోటల్లో తీగలను ఆశించే ప్రధానమైన పురుగులు పొగాకు లద్దె పురుగు, అగ్గిపురుగు, తెల్లనల్లి, ఎర్రనల్లి. అవిశ మొక్కలను చిత్తపురుగులు, బర్మా పురుగు, పొగాకు లద్దె పురుగు, ఆకుముడత పురుగు, ఎర్రనల్లి ప్రధానంగా ఆశిస్తాయి.
పొగాకు లద్దెపురుగు: ఈ పురుగు ముందుగా అవిశ మొక్కలను ఆశించి అవిశ ఆకులను తిని వేయుట వలన అవిశ మొక్కలు తమలపాకు తీగలకు సరిపోయే నీడను అందించలేవు. తమలపాకుల తీగలను ఆశించినప్పుడు తమలపాకులపై రంధ్రాలు ఏర్పడతాయి. లింగాకర్షణ బుట్టలు హెక్టారుకు పది చొప్పున జూలై నుండి తోటల్లో అమర్చుకోవాలి. జల్లెడ చేసిన అవిశ ఆకులను, తమలపాకులను తొలగించాలి. అక్టోబరు, నవంబరు నెలల్లో 5శాతం వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి (ఎకరాకు ఒక లీటరు వేపనూనె చొ||న) కోతకు వచ్చిన ఆకులు కోసిన తరువాత పిచికారి చేయాలి.
అగ్గిపురుగు : లేత తమలపాకుల నుండి తల్లిపురుగులు, పిల్లపురుగులు రసం పీల్చడం వలన ఆకులపై కాలిన మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు 5 శాతం వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి (ఎకరాకు 400 మిల్లీ లీటర్లు) కోతకు వచ్చిన ఆకులు కోసిన తరువాత పిచికారి చేయాలి.
తెల్లనల్లి/ఎర్రనల్లి : తెల్లనల్లి లేత ఆకుల నుండి రసం పీల్చడం వలన ఆకులు ముడతబడతాయి. ఎర్రనల్లి ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వలన ఎరుపు లేదా గోధుమరంగు మచ్చలు కనబడతాయి. నివారణకు డిసెంబరు జనవరి నెలల్లో లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకపు పాడిని కలిపి (ఎకరాకు 800 గ్రా.) పిచికారి చేయాలి. అదే విధంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో 15 రోజుల వ్యవధిలో రెండు పర్యాయములు పిచికారి చేయాలి.
చిత్తపురుగు : అవిశ విత్తనము నాటిన 15 నుండి 20 రోజులకు ఈ పురుగు ఆశించిన ఆకులపై రంధ్రాలు చేసి మొక్కల మొదళ్ళను కొరికి వేయును. నివారణకు 5శాతం వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
అవిశ గొంగళి పురుగులు: ఆవిశ ఆకులను ఆకుపచ్చ రంగులో ఉండే సెమీలూపర్, ఆకుముడత పురుగులు ఆశించుట వలన, అవిశ మొక్కలు ఆకులు లేని మోడులై, కొత్తగా నాటిన తమలపాకు తీగలకు కావలసిన నీడను ఇవ్వలేవు. దీని ఫలితంగా, తీగలు అధిక సూర్యరశ్మికి గురై ఎండిపోతాయి. వీటి నివారణకు తగిన చర్యలు చేపట్టాలి. తీగ నాటిన తర్వాత 5 శాతం వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కాండము తొలుచు పురుగు (బర్మా పురుగు): ఈ పురుగు తాకిడి ఆగష్టు నెలలో ప్రారంభమై మార్చి నెల వరకు ఉంటుంది. అవిశ మొక్కల కాండపు లోపలి భాగాన్ని గొంగళి పురుగు తొలిచి వేయడం వలన మొక్క బలహీనపడి విరిగిపోతుంది. దీని నివారణకు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో 2-3 సార్లు అవిశ మొక్కల తలలను గిల్లి వేయాలి. పురుగు తొలి థలోనే ఉన్నప్పుడు 5 శాతం వేపగింజలు కలిపి కషాయం లేదా వేపనూనె 5 మిల్లీ లీటర్లు లీటరు నీటికి పిచికారి చేయాలి. అవిశ కాండం తొలిచే పురుగు తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో అవిశ తోట సాగు క్లిష్టతరంగా ఉన్నపుడు అవిశ మొక్కలకు ప్రత్యామ్నయంగా తమలపాకు తీగలకు నీడను కల్పించడానికి హరిత గృహాలు/షేడ్నెట్లను ఏర్పరచి కూడా తమలపాకు తోటలను సాగు చేయవచ్చును. ఈ షేడ్ నెట్ విధానంలో షేడ్నెట్ లోపల మొక్కలకు వెదురుగెడలను పాతి తమలపాకు తీగలను నాటేటప్పుడు వెదురుగెడలకు పాకించి నాటుకోవాలి. ఈ షేడ్నెట్ విధానం ద్వారా అవిశ మొక్కల నుండి తమలపాకు తీగలకు ఆశించే పురుగులను అరికట్టవచ్చు.
సర్పిలాకారపు తెల్లదోమ: ఇటీవల కాలంలో తమలపాకు తోటలలో ముఖ్యంగా కొబ్బరి తోటలు మరియు జామ తోటల సమీపంలో సాగు చేస్తున్న తమలపాకు రైతులకు మరో సమస్యగా మారిన పురుగు సర్పిలాకారపు తెల్లదోమ. ఇప్పటి వరకు తమలపాకు తోటలలో ఈ పురుగు తీవ్రత తక్కువగానే ఉంది. అయినప్పటికీ తమలపాకు రైతులు ముందు జాగ్రత్త చర్యలు అవలంబించినట్లయితే సర్పిలాకారపు తెల్లదోమ నుండి తమలపాకు తోటలను కాపాడవచ్చు. గత 3 సం||ల నుండి సర్పిలాకారపు తెల్లదోమ ప్రధానంగా కొబ్బరితోటలు, ఇతర ఉద్యాన పంటలైన జామ, ఆయిల్పామ్, అరటి, సీతాఫలం మరియు సపోట తోటలలో పొడి వాతావరణంలో ముఖ్యంగా అక్టోబరు నుండి మార్చి వరకు ఆశించడం వలన దిగుబడులు గణనీయంగా తగ్గినట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. తల్లి రెక్కల పురుగు ఆకు అడుగుబాగాన తెల్లటి వలయాల మాదిరిగా గుడ్లను పెడుతుంది. ఈ సర్పిలాకారపు తెల్లదోమ పిల్లపురుగులు మరియు తల్లి పురుగులు ఆకులు అడుగుభాగాన గుంపులుగా చేరి రసం పీల్చడం వలన ఆకులు నాణ్యత, పరిమాణం కోల్పోతాయి. పురుగు ఉధృతి అధికమైనప్పుడు నల్లని మసిలాంటి బూజుతెగులు ఆకుల పైన వృద్ధి చెందుతుంది. తద్వారా ఆకు మార్కెట్కు పనికి రాకుండా పోవడం వలన దిగుబడి తగ్గే అవకాశం ఉంది. తమలపాకులను నేరుగా తింటాము కాబట్టి రసాయనిక పురుగు మందులను పిచికారి చేయరాదు. ఈ పురుగు నివారణకు కింద ఉదహరించిన యాజమాన్య పద్ధతులను రైతులు పాటించినట్లయితే పురుగును చాలావరకు అదుపులో ఉంచవచ్చు. పురుగు ఉనికిని గమనించడానికి పసుపు రంగు జిగురు అట్టలను ఎకరానికి 5 చొప్పున ఏర్పరచుకోవాలి. తెల్లదోమ ఆశించిన తీగలను విత్తనపు తీగగా ఎంచుకోరాదు. మిత్రపురుగులైన ఎన్కార్సియా గుడెలోపే అనే పరాన్నజీవి సర్పిలాకార తెల్లదోమ యొక్క పిల్ల పురుగులను సహజంగా అదుపులో ఉంచుతాయి. పరాన్న జీవి ఆశించి నల్లగా మారిన పిల్లపురుగులను ఆకుల మీద గమనించగానే ఇటువంటి ఆకులను మిగతా తమలపాకు తోటల్లో తెల్ల దోమ ఆశించిన తీగల దగ్గరలో ఉంచడం వలన పరాన్నజీవి కొత్త తోటలలో వృద్ధి చెంది తెల్లదోమను అదుపులో ఉంచుతుంది. డైకోక్రెసా అస్టుర్ గుడ్లను లేదా పిల్లపురుగులను 500 నుండి 1000 ఎకరానికి చొప్పున 15 రోజుల వ్యవధిలో తోటల్లో విడుదుల చేయాలి. మిత్రపురుగుల ఉనికి ఉన్నప్పుడు ముందుగా 1 శాతం అజాడిరక్టిన్ 1500 పిపిఎం లీటరు నీటికి 5 మి.లీ. చొప్పున పిచికారి చేయాలి. పురుగును నియంత్రించే శిలీంధ్రం ఇసారియ ఫ్యుమసోరోసే (1þ108 కణాలు / మి.లీ.) 6 మిల్లీ లీటర్ల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మిత్రపురుగులు: తమలపాకు తోటల్లో ఆశించే హాని కలుగచేసే పురుగులను వివిధ రకాల మిత్ర పురుగులైన అక్షింతల పురుగులు సాలీళ్లు మరియు పరాన్న జీవులు సహజంగానే కొంతవరకు అదుపులో ఉంచుతాయి.
తెగుళ్ళు: తమలపాకు తోటలలో కనిపించే తెగుళ్ళలో ఎండుతెగులు మరియు ఆకుమచ్చ తెగుళ్ళ ప్రధానమైనవి.
ఎండు తెగులు లేదా ఆకు /మొదలుకుళ్ళు తెగులు : ఆకులపై గుండ్రటి గోధుమ రంగు మచ్చలు గాని గాఢ మరియు లేత గోధుమ రంగు వలయాలతో మచ్చలు వచ్చి నల్లగా మారతాయి. మచ్చలు ఉన్న ఆకుల నుండి శిలీంధ్రము భూమిలో చేరి వృద్ధి చెందుతుంది. తీగ మీద తెగులు లక్షణాలు కనిపించే నాటికి చాలా ముందుగానే శిలీంద్రం ఆశిస్తుంది. తెగులు తీగ మొదట్లో ఆశించినప్పుడు వేర్లు గోధుమ రంగు నుండి నల్లగా మారి కుళ్ళుతాయి. దీని నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా తెగులు ఆశించకుండా నివారించుకోవాలి. నివారణకు తెగులు సోకిన ఆకులను మరియు తీగలను ఏరి కాల్చివేయాలి. మొదటి సం||రం తోటల్లో తెగులు లక్షణాలు కనిపించినప్పటి నుంచి నవంబరు నుండి ఫిబ్రవరి వరకు తప్పనిసరిగా నెలకొకసారి 1% బోర్డోమిశ్రమాన్ని 1 మీటరు నిలువు దూరానికి ఒక లీటరు వంతున (ఎకరాకు 40 కిలోల మైలుతుత్తం, 40 కిలోల సున్నం చొప్పున 4000 లీటర్ల నీటిలో కలిపి) పాదుల్లో పోసుకుని మరియు 0.5% బోర్డోమిశ్రమాన్ని 15 రోజులకొకసారి (ఎకరాకు 200 లీటర్లు) ఆకులపై పిచికారి చేయాలి. 2వ సం||పు తోటల్లో బోర్డోమిశ్రమాన్ని పైన తెలిపినట్లు ఆగస్టు నుండి సెప్టెంబరు వరకు వాడాలి. మూడు సంవత్సరములకు ఒకసారి మొక్కజొన్న లేదా జొన్నలతో పంట మార్పిడి చేసుకోవాలి. విత్తనపు తీగలను ఆరోగ్యవంతమైన తోటల నుండి తీసుకొని, విత్తన తీగశుద్ధి చేసుకొని తీగలను క్రొత్త తోటల్లో నాటుకోవాలి.
బాక్టీరియా ఆకుమచ్చ: ఆకుల అడుగుభాగాన నీటిలో తడిచినట్లు గోధుమరంగు చదరపు మచ్చలు ఏర్పడి, క్రమేణా పెద్దవై, నలుపు రంగుకి మారి ఆకులు కుళ్ళిపోతాయి. కాండముపై నల్లని మచ్చలు ఏర్పడి, పగుళ్ళు ఏర్పడతాయి. నివారణకు విత్తనపు తీగలను ఆరోగ్యవంతమైన తోటల నుండి తీసుకొని, విత్తన తీగశుద్ధి చేసుకొని తెగులు ఆశించకుండా కాపాడుకోవాలి. తెగులు కనిపించిన వెంటనే 0.5% బోర్డో మిశ్రమము నెలకు ఒకసారి చొ||న ఆకులపై పిచికారి చేయుట వలన ఈ తెగులును సమర్ధవంతంగా నివారించుకోవచ్చు.
కొలిటోట్రైకం ఆకుమచ్చ తెగులు: తెగులు సోకిన ఆకులపై భాగాన గుండ్రని గోధుమ రంగుతో కూడిన పసుపు రంగు అంచుగల మచ్చలేర్పడి క్రమేపి నల్లబడి ఆకు అంతా వ్యాపిస్తాయి. దీని నివారణకు 0.5% బోర్డోమిశ్రమాన్ని (ఎకరాకు 600 గ్రా. చొ||న) ఆకులపై పిచికారి చేయాలి.
ఎకరానికి తీగశుద్ధి చేయడానికి కావలిసిన బోర్డో మిశ్రమము తయారికి కావలసిన పదార్ధములు :
మైలుతుత్తం – 1 కిలో
సున్నం – 1 కిలో
నీరు – 200 లీటర్లు
బోర్డో మిశ్రమమును (0.5%) తయారుచేయు విధానము:
ముందుగా రెండు మట్టి లేక ప్లాస్టిక్ లేక సిమెంటు పాత్రలలో ఒక్కొక్క దానిలో 100 లీటర్ల చొప్పున నీటిని తీసుకోవాలి. ఒకదానిలో మెత్తగా పొడిచేసిన ఒక కిలో మైలతుత్తంను వేసి పూర్తిగా నీటిలో కరిగేలా కర్రతో కలపాలి. రెండవ దానిలో 100 లీటర్ల నీటిలో ఒక కిలో పొడిసున్నం వేసి అదే విధముగా కలపాలి. రెండు పూర్తిగా కరిగిన తరువాత మైలుతుత్తం ద్రావణమును నెమ్మదిగా సున్నం ద్రావణములో కర్రతో కలుపుతూ పోయాలి. సున్నం ద్రావణమును మైలుతుత్తం ద్రావణములో పోయరాదు. పై విధముగా తయారుచేసిన మిశ్రమాన్ని ఇనుప బ్లేడును గాని కొడవలిని గాని 2 నిముషాలు ముంచి పరీక్ష చేయాలి. ఇనుప బ్లేడు మీద రాగి రంగు మచ్చలు ఏర్పడినట్లయితే మిశ్రమములో మైలతుత్తం ఎక్కువ ఉన్నదని తెలుస్తుంది. కాబట్టి మరి కొంచెము పొడి సున్నం కలిపి కలియబెట్టి మరల పరీక్ష చేయాలి. మిశ్రమంలో మైలుతుత్తం ఎక్కువగా లేదని నిర్ధారణ చేసుకొన్న తరువాత ఆ మిశ్రమాన్ని తీగచుట్టలపై పిచికారి చేయాలి.
డా. పి. సునీత (80085 96235), సీనియర్ శాస్త్రవేత్త (ఎంటమాలజి), డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం.
మనుషులలో కరోనా వైరస్ లాగానే పశుగణాలను కూడా వేధిస్తున్న అంటువ్యాధుల్లో మహా ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధిని ఆంగ్లంలో ‘ఫుట్ అండ్ మౌత్ డిసీజ్’ అని అంటారు.
కలుషితమైన గాలి ద్వారా సోకే ఈ గాలికుంటు వైరస్ వ్యాధి ఒకప్పుడు మార్చి నుండి సెప్టెంబర్ మాసాల మధ్య వ్యాపించేది, కానీ ఈ మధ్యకాలంలో ఏడాది పొడవునా పశువులు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యాధి పశువులలోనే కాక సన్నజీవాలకు వ్యాప్తి చెందుతుంది.
పరిచయం: ఎఫ్.యం.డి. (ఫుట్ అంట్ మౌత్ డిసీజ్) అనగా గాలికుంటు వ్యాధి అని అంటారు. ఈ వ్యాధి ముఖ్యంగా వైరస్ (జుచీశినీళిఖీరిజీతిరీ) వలన వ్యాప్తి చెందుతుంది. ఎఫ్.యం.డి. (గాలికుంటు వ్యాధి) అనేది వేగంగా ఒక పశువు నుండి మరొక పశువుకు వ్యాప్తి చెందును. (ఇది ఇన్ఫెక్షియస్ మరియు కంటేజియస్ వ్యాధి). ఈ వ్యాధి ప్రత్యేకంగా రెండు గిట్టలు కలిగినటువంటి జంతువులు ఉదా: ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందులకు వ్యాపిస్తుంది.
కారకము
ఈ వ్యాధి 7 రకములు కలిగి ఉన్న జుచీశినీళిఖీరిజీతిరీ వలన కలుగుతంది.
మన దేశంలో ం, జు, ్పు, జురీరిబి-| రకాలు వలన వ్యాప్తి చెందుతుంది.
ఈ వ్యాధి పశువులకు అన్నింటికీ సోకుతుంది కానీ. ఈ వ్యాధి బారిన పడినటువంటి పశవుల మరణాలు చాలా తక్కువగా ఉంటాయి.
వ్యాధి వ్యాప్తి
పశువులు తినే గడ్డి, మేత, కలుషితమైన గాలి ద్వారా సోకే అవకాశం కలదు. అలాగే పశువుల శాఖలో పనిచేయువారి వలన, గడ్డి కోయు యంత్రాల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది.
తల్లి పాల ద్వారా దూడలకు వ్యాప్తి చెంది మొత్తం పశుగణం అంతా వ్యాధిబారిన పడే ప్రమాదం కలదు. కావున రైతులు జాగ్రత్త వహించి, తగిన నివారణ చర్యలు ముందుగా తీసుకోవలెను.
వ్యాధి లక్షణాలు:
వ్యాధి సోకిన పవువులు ఈ క్రింది తీవ్రమైన లక్షణాలను చూపుతాయి.
ఈ వ్యాధిబారిన పడిన పశువులు అధిక జ్వరం (105-106 డిగ్రీ ఫారెన్హీట్) (40-41 డిగ్రీ సెంటీగ్రేడ్)తో బాధపడుతుంటాయి. మరియు మేత తినడం ఆపివేయును.
పాలిచ్చే పశువుల యందు పాలదిగుబడి గణనీయంగా తగ్గిపోవును.
ఒకటి లేదా రెండు రోజులలో జ్వరం తగ్గుముఖం పట్టినప్పటికీ నోరు మరియు గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి ఉండును, నోటి నుండి తీగల వంటి జొల్లు కారడం మరియు అధికంగా లాలాజలం ఊరడం అనేది జరుగుతుంది.
వ్యాధి సోకిన పశువు నోరు తెరచి గమనించినట్లయితే నోటి లోపల మరియు నాలుకపై పుండ్లు (1-2 సెం.మీ. డయామీటర్) కనిపించును. అంతేకాక గిట్టల మధ్యన పుండ్లు ఉండటంవలన పశువు సరిగా నడవలేక పోతుంది. వీటిని గమనించిన వెంటనే పశువైద్యులని సంప్రదించాలి.
చికిత్స: పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో గిట్టల మధ్య పుండ్లను బాగా శుభ్రంగా కడగవలెను.
నోటిలోని పుండ్లను ఉప్పు నీటితో కడగవలెను. అలాగే బోరిక్ పౌడర్+గ్లిసరిన్ పేస్ట్ను పూత ముందుగా రాసినట్లయితే పుండ్లు తగ్గుముఖం పడతాయి.
నోటిలో పుండ్లు ఉండటం చేత మేత తీసుకొనలేవు కాబట్టి మెత్తటి పదార్థాలను అనగా రాగి జావ త్రాగించడం వంటివి, గంజి లాంటి ద్రవ పదార్థాలను మేతగా ఇవ్వవలెను.
పుండ్ల పైన ఈగలు వాలకుండా మరియు యాంటిసెప్టిక్ ఆయింట్మెంట్లని ఉపయోగించవలెను.
బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆంటిబయోటిక్ మందులు మరియు శ్రీఐజు|ఈని మూడు నుండి ఐదు రోజుల వరకు వాడవలెను.
ఈ వ్యాధి సోకడం వలన శక్తి కోల్పోతాయి. కాబట్టి మల్టీ విటమిన్ సిరప్లు మరియు లివర్ టానిక్ మందులను వాడుకోవలెను.
నివారణ చర్యలు
వ్యాధి సోకిన తరువాత మందులు వాడినప్పటికీ తక్కువ ఫలితాలను ఇచ్చును. కాబట్టి ముందస్తు టీకాలు వేయించుకోవాలి.
ఈ వ్యాధి సోకకుండా ఉండుటకు వేయు టీకాలు ముఖ్యంగా రెండు దఫాలుగా వేస్తారు. అనగా 6 నెలలకి ఒకసారి టీకాలు వేయించుకోవాలి.
ఈ వ్యాధి సోకకుండా వేయు టీకా మందులను ఫిబ్రవరి/మార్చి మరియు ఆగస్టు/సెప్టెంబర్ మాసాల యందు వేస్తూ ఉంటారు.
చిన్నపాటి జ్వరం మరియు పాలు తగ్గినప్పటికీ అధైర్యపడకుండా ఈ టీకాలు వేయించుకున్నట్లయితే పశువులలో ఈ వ్యాధి వ్యాపించకుండా నివారించవచ్చును.
4 నెలలు మరియు ఆపై వయస్సు కలిగిన దూడలకి, పశువులకి టీకాలు వేయించాలి.
నియంత్రణ: వ్యాధి సోకిన పశువుల నుండి ఆరోగ్యకరమైన పశువులను దూరంగా ఉంచాలి. పశువులు ఉండు ప్రదేశం నందు వాషింగ్ సోడా లేదా సున్నం పిచికారి చేయడం వలన వైరస్ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన పశువులకు కూడా టీకాలు వేయించాలి.
డా. యం. వెంకట ప్రసన్న, ఎం.వి.ఎస్.సి., పశువైద్యురాలు, మైదుకూరు. సెల్: 83097 24436
భారత దేశం ఒక వ్యవసాయ ఆధారిత దేశం, సుమారు 77 శాతం ప్రజానీకం వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల ద్వారా ఉపాధి పొందుతున్నారు ,భారత దేశ ఆర్థిక వ్యవస్థ స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు 17.5 శాతం వ్యవసాయ రంగం ద్వారా సమకూరుతుంది. అయితే మారుతున్న కాలం తో పాటు, పెరుగుతున్న జనాభాకి సరిపడా ఆహారం పండించాలన్నా, వ్యవసాయంలో పెరుగుతున్న వ్యవసాయ కూలీల కొరతను అధిగమించాలన్నా వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికలతో కూడిన మార్పు రావాలి. వ్యవసాయం హైటెక్ పరుగులు పెడుతోంది. వాతావరణ పరిస్థితులు మొదలుకుని నాట్లు వేయడం, విత్తనాలు జల్లడం, కలుపు తీయడం, కోతలు కోయడం వరకూ అన్ని పనుల్లోనూ రోబోలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. దుక్కిదున్నే ట్రాక్టర్ నుంచి పంట కోసే మిషన్ల వరకూ ఇప్పుడు అందుబాటులో ఉండగా పంటలు ఎప్పుడు వేయాలి, ఎప్పుడు కోయాలి, పురుగు పడితే ఏం చేయాలనేది చెప్పేందుకు మొబైల్ యాప్లు రెడీ అయ్యాయి. నూతన ప్రయోగాలతో పాటు సరికొత్త ఆవిష్కరణలు, యంత్రాలు తయారు అవుతున్నాయి.
అయితే మారుతున్న కాలం తో పాటు, వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికలతో కూడిన డ్రోన్ల యొక్క వినియోగాన్ని పెంచడం ఎంతయినా అవసరం. డ్రోన్ అనేది వినేందుకు కొత్త గా ఉన్నా వ్యవసాయ రంగ పనుల్లో దీని పాత్ర అమోఘంగా ఉంటుంది. డ్రోన్ అనేది ఒక వైమానిక వాహనం. ఇది పంటలను పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది. పంట పరిస్థితి, చీడపీడల గురించి తెలుసుకోవడం వల్ల పంటలపై తక్కువ ఖర్చుతో క్రిమి సంహారక మందులను పిచికారీ చేయవచ్చు. డ్రోన్ లకు ఉండే అధునాతన సెన్సార్లు, డిజిటల్ ఇమేజ్ ద్వారా తమ పొలం యొక్క చిత్రాన్ని స్పష్టంగా చూడవచ్చు. పంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు, చీడపీడలు వస్తే వెంటనే గుర్తించి, తగిన నివారణ చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. ఒక డ్రోన్ పది నిమిషాల్లో ఎకరా పొలంపై మందులు చల్లగలదు.
భారతదేశంలో వ్యవసాయ డ్రోన్ ధర
ఒక వ్యవసాయ డ్రోన్ తరచుగా ఇంటర్నెట్ ఆధారిత స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించి పిచికారీ మరియు పంట ఆరోగ్య పర్యవేక్షణ వంటి ఖచ్చితమైన వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహిస్తుంది, దీని ధర 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఉండవచ్చు. ఇది మొదట్లో కొంత ఖరీదైనదిగా అనిపించినా రానున్న రోజులలో చాల చవుకగా లభించే అవకాశాలు వున్నాయి.
వ్యవసాయంలో డ్రోన్ పాత్ర అమోఘం. ముఖ్యంగా వ్యవసాయ రంగ వెలుగు కనిపిస్తోంది. కూలీలు, మందుల పిచికారీ సమస్యలకు తరుణోపాయంగా ఆశలు కల్పిస్తోంది. రెండు థాబ్దాల క్రితం వరకు నిఘా కార్యకలాపాలకే పరిమితమైన ఈ బుల్లిమానవ రహిత విమానం ప్రతి చోట తన ఉనికిని చాటుతోంది. రక్షణ, భద్రత మొదలు వైద్యం, ఆర్ధికం, మైనింగ్, వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, సరకు రవాణా వరకు ప్రతి రంగంలో విశిష్ట సేవలందిస్తోంది. ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. నెమ్మదినెమ్మదిగా సరికొత్త రూపు సంతరించుకుని, బహుళ సౌకర్యాలతో నిఘా విభాగం, రక్షణ గోడలు దాటుకుని ఇప్పుడు పొలంలోకి అడుగు పెట్టింది.
పెద్ద కమతాల్లో పంట పరిస్థితి, చీడపీడల గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా రైతులు, వ్యవసాయ, పారిశ్రామికవేత్తలు డ్రోన్ల మీదే ఆధారపడుతున్నారు. పెద్ద పెద్ద తోటలు, డెయిరీ ఫారాల్లో అడుగడుగునా నడవలేనిచోట డ్రోన్ని వినియోగించి క్షణాల్లో వీడియో తీసి ఆ దృశ్యాలని కంప్యూటర్లో చూసి పంటల స్థితిగతులు, చీడపీడల ప్రభావం అంచనావేసి తదనుగుణంగా చేపట్టాల్సిన చర్యలు నిర్థారించుకుంటున్నారు. మట్టి నాణ్యత విశ్లేషణ, వాతావరణం, పంట దిగుబడి అంచనాలకి సైతం డ్రోన్లనే వాడుతున్నారు.
కంపెనీలు సైతం వ్యవసాయ రంగానికి అనువైన డ్రోన్లని ప్రత్యేకంగా తయారు చేస్తున్నాయి. పొలాల్లో పురుగుమందులు పిచికారీ చేసేటప్పుడు రైతులకు కలిగే అరోగ్య సమస్యలు అన్నీ ఇన్నీ కావు. పిచికారీ కోసం గంటల తరబడి రైతులు పొలాల్లో శ్రమిస్తుంటారు. సరైన రక్షణ లేకుండా ఈ క్రమంలో ఆ గాలిని పీలుస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గంలా నిలుస్తున్నాయి డ్రోన్లు. డ్రోన్ల సహాయంతో పురుగుమందుల పిచికారీ చేపట్టవచ్చు. రైతు ఆరోగ్యం కాపాడవచ్చు. ముఖ్యంగా పంటల్లో చీడపీడలు, తెగుళ్ల తాకిడి అధికమై వెంటనే పురుగు మందులు పిచికారీ చేయాల్సిన సమయంలో కూలీల కొరత, ఒకేసారి పెద్దకమతాల్లో మందులు చల్లే అవకాశం లేక రైతులు పంటని రక్షించుకోలేకపోతున్నారు. పొలాలకు పురుగు మందులు చల్లే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది. డ్రోన్ వినియోగం వల్ల రైతులకు ఎలాంటి హాని ఉండదు. తక్కువ సమయంలో పని పూర్తి అవడమే కాక విస్తీర్ణాన్ని బట్టి పురుగు మందును అందుకు అవసరమైన నీటిని కలుపుకునే టెక్నాలజీని డ్రోన్లో పొందుపరిచారు.
మామూలు స్ప్రే వల్ల పురుగు మందులు వృథా అయ్యే అవకాశం ఉంటుంది. డ్రోన్లో అందుకు ఆస్కారం ఉండదు. పది మంది కూలీలు చేసే పనిని డ్రోన్ ఒక్కటే చేస్తుంది. పది నిమిషాల్లో ఎకరం పొలంలోని పంటనంతటిపై మందు చల్లేస్తుంది. అది కూడా నిర్దిష్ట పరిమాణంలో పొలంలోని మొక్కలన్నింటికీ సమానంగా మందు పిచికారీ చేస్తుంది. సాధారణంగా పిచికారీ చేసే కంటే డ్రోన్ 40 నుంచి 60 శాతం సమర్థంగా మొక్కలకి మందు చేరవేస్తుంది. ప్రస్తుతం 3 లీటర్ల నుంచి 20 లీటర్ల వరకు పిచికారీ చేసే డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి.
డ్రోన్ల వాడకంతో మరో సౌలభ్యం కూడా ఉంది. మొబైల్ యాప్, జీపీఎస్ మ్యాపింగ్, వెబ్ల్యాండ్ అనుసంధానం ద్వారా పొలం సర్వే నంబర్లు, విస్తీర్ణం తెలియడంతో పాటు నిర్ణీత ప్రదేశంలోనే ఎగురుతూ మందుని చల్లుతుంది. మరోసారి అదే చోట మందు పిచికారీ చేయడం తేలికవుతుంది. రసాయన మందుల పిచికారీతో పాటు ఎరువులు వేసే డ్రోన్లని కూడా తయారీ సంస్థలు రూపొందించాయి. పంటకు ఏ పురుగు ఆశించింది? ఏ తెగులు వచ్చిందో తెలుసుకునేందుకు , పంటని విహంగ వీక్షణం చేసి సమస్యని గుర్తించే డ్రోన్లు వచ్చేశాయి. అత్యాధునిక పరికరాలతో నిమిషాలలో పొలాన్ని చుట్టేసి తెగుళ్ల గుట్టు చెప్పే నవీన డ్రోన్లు సిద్ధమయ్యాయి.
అత్యాధునిక డ్రోన్లు అన్ని కోణాల్లోనూ ఫోటోలు, వీడియోలు తీయగలవు. హెచ్డీ నాణ్యతతో, త్రీడైమెన్షన్లో దృశ్యాలని బంధించగలవు. అంతే కాకుండా డ్రోన్కి అనుసంధానం చేసిన కంప్యూటర్ లేదా స్మార్ట్ఫోను ద్వారా పైలట్ కంట్రోలర్ పొలంలో కావాల్సిన ప్రదేశంవైపు డ్రోన్, కెమెరాని తిప్పుతూ ఫోటోలు, దృశ్యాలు చిత్రీకరించే వెసులుబాటు ఉంది. అడ్వాన్స్డ్ సెన్సార్లు. డిజిటల్ ఇమేజింగ్ ద్వారా పంటకి సంబంధించిన నాణ్యమైన చిత్రాలు తీసుకుని విశ్లేషించే సౌలభ్యమూ ఉంది. మనిషి చూపుకి అందని ఎన్నో విషయాలు డ్రోన్ సెన్సార్లు పసిగడతాయి. సాధారణంగా బర్డ్స్ ఐ వ్యూ, ఇన్ఫ్రారెడ్ వ్యూ అనే రెండు విధాలుగా చిత్రాలు తీయవచ్చు. నీటి సమస్య, నేలతీరు, చీడపీడల ప్రభావం వంటి వాటిని మొదటిదాని ద్వారా తెలుసుకోవచ్చు.
ఇన్ఫ్రారెడ్ వ్యూ ద్వారా ఆరోగ్యంగా ఉన్న మొక్కలు, చీడపీడలబారిన పడ్డ మొక్కల మధ్య తేడాని గుర్తించవచ్చు. మొక్క ఆకుల ఆరోగ్యం, నాణ్యత ఆధారంగా డ్రోన్లకి అమర్చిన ఇన్ఫ్రారెడ్ లైట్లు వెలుగుతాయి. ఈ లైట్లు వెలిగే తీరు, రంగులు బట్టి మొక్కల ఆరోగ్యం తెలుసుకోవచ్చు. ఇలా పొలంలో అణువణువునా తీసిన ఫోటోలు, దృశ్యాలని కంప్యూటర్ ద్వారా చూసి తదనుగుణంగా చీడపీడల నివారణ చర్యలు చేపట్టవచ్చు. పొలంలో దిగడం సాధ్యం కాని చోట గాల్లో అంచనాలు కట్టి వివరాలు నమోదు చేస్తున్నారు. రైతుల సహనాన్ని పరీక్షించి చివరికి ఉసూరుమనిపించే ఈ విధానం ఇకముందు మారబోతోంది. విలువైన సమయాన్ని ఆదాచేసి మనుషులు అడుగుపెట్టలేని ప్రాంతాల్లో సైతం అత్యంత నాణ్యమైన ఫోటోలు తీసే విహంగాలు అందుబాటులోకి వచ్చాయి. పంట నష్టం అంచనాలో సమగ్ర వివరాలకోసం అత్యాధునిక డ్రోన్ పరికరాల వాడకం ఈమధ్యకాలంలో మొదలైంది. మూడు కిలోమీటర్ల పరిధిలో సుమారు వెయ్యి ఎకరాల్లో పంటల స్థితిగతులను సర్వే చేసి ఫోటోలను తీసే డ్రోన్లను గతేడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాపట్లలో తొలిసారి ప్రయోగాత్మకంగా వాడింది.
డ్రోన్ల వాడకం ద్వారా ఒకేసారి ఎక్కువ విస్తీర్ణంలో వివరాల సేకరణ సులభమవుతుంది. జీపీఎస్ పరిజ్ఞానం వల్ల ఏయే ప్రాంతాల్లో ఫోటోలు తీసిందనేది తెలియడమే కాకుండా. వాటి వివరాలను మ్యాపింగ్ చేస్తుంది. డ్రోన్ల ద్వారా అధికారులకి సర్వే నిర్వహణ తేలికవడంతో పాటు అటు రైతులకి సకాలంలో పరిహారం మంజూరయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఒక్క మందుల పిచికారీ, పంట నష్టం సర్వే మాత్రమే కాకుండా నీటి వనరులు, నేలలోని పోషకాలు గుర్తించే డ్రోన్లు తయారయ్యాయి. అపరాలు, వాణిజ్య పంటల ఎదుగుదల, చీడపీడల ఉదృతని సమీక్షించడానికి డ్రోన్ తీసిన ఛాయాచిత్రాలు, దృశ్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అసలు ఈ డ్రోన్లు ఎలా పనిచేస్తాయి? డ్రోన్లను వినియోగించాలంటే ఎలాంటి అనుమతులు తీసుకోవాలి? కేంద్రం మార్గదర్శకాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
పైలట్ కంట్రోలర్, రెక్కలు, ఛార్జర్, బ్యాటరీలు, కెమెరాలు, నాజిల్స్ మెమొరీ కార్డులు, టాబ్లెట్, క్లౌడ్ ప్రాసెసింగ్కి సమాచారం పంపే సాఫ్ట్వేర్ ఇవీ ప్రాథమికంగా డ్రోన్ పరికరాలు. మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్, చిన్నపాటి జీపీఎస్ మాడ్యూల్స్, అధిక శక్తి కలిగిన కంప్యూటర్ ప్రాసెసర్లు, చిన్నపాటి డిజిటల్ రేడియోస్ అన్నవి డ్రోన్లలోని నూతనత్వాలు. మన దేశంలో ఐదు రకాల పరిమాణంలో డ్రోన్లు వాడడానికి కేంద్రం మార్గదర్శకాలిచ్చింది. అవి నానో, మైక్రో, మిని, స్మాల్, లార్జ్. కనిష్టంగా 250 గ్రాములు, గరిష్టంగా 150 కిలోల వరకు బరువుంటాయి. డ్రోన్లు వినియోగించడానికి దేశంలో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. 250 గ్రాములకంటే తక్కువ బరువున్న నానోడ్రోన్ల వాడకానికి ఎటువంటి లైసెన్సు అవసరం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం డ్రోన్ల వాడకానికి సంబంధించి కొత్త విధానం తీసుకొస్తోంది. పరిమాణాన్ని బట్టి వాటిని వర్గీకరించి, డ్రోన్లకు విశిష్ట గుర్తింపు సంఖ్యలను, రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్లనూ తప్పనిసరి చేయబోతోంది. ఇక డ్రోన్ పనిచేసే విషయానికి వస్తే… పైలట్ కంట్రోలర్, మొబైల్ యాప్, స్మార్టుఫోన్ లేదా కంప్యూటర్ ఆదేశాల ద్వారా పనిచేస్తుంది. వైమానిక ఇమేజింగ్ మ్యాపింగ్ ద్వారా నిర్దిష్ట ప్రాంతంలో నడిపించవచ్చు. డ్రోన్ ప్రత్యేకతలు, పనితనంరీత్యా రోజు రోజుకి వీటి అవసరం, వినియోగం పెరుగుతోంది.
రైతులు ఎరువులు, పురుగుమందులు చల్లడానికి కూలీలను వెతుక్కోవాల్సిన తిప్పలు తప్పుతాయి. ఎంత పెద్ద కమతాల్లోనైనా పొలం గట్టుపైనే నిలబడి ఒక్క డ్రోన్తో నిమిషాల్లో మందులు పిచికారీ చేసేయవచ్చు. ఒక్కసారి డ్రోన్ని చేనంతా తిప్పేసి పంట ఎదుగుదల, చీడల జాడని పసిగట్టేయవచ్చు. సూక్ష్మంలో మోక్షంలా బుల్లి విహంగాలతో అద్భుత ప్రయోజనాలున్నా ప్రస్తుతానికైతే ఖరీదు మాత్రం కాస్త ఎక్కువే. డ్రోన్ సైజు, సామర్థ్యాన్ని బట్టి లక్షన్నర నుంచి 10 లక్షల వరకు పలుకుతున్నాయి. మిగతా యంత్రాల మాదిరిగా ప్రభుత్వమే ప్రతి గ్రామానికి సరఫరా చేస్తే సామాన్య రైతులు వినియోగించుకోగలుగుతారు. ఒకే రకం పంట పొలాల్లో ఒకేసారి పిచికారీ చేయడం వల్ల చీడపీడల తీవ్రత తగ్గుతుంది. ఈ పయనంలో కొన్ని సాంకేతిక అవరోధాలని అధిగమించాల్సిన అవసరముంది. నీడ, వెలుతురు సమస్యలతో ఫోటో నాణ్యత తగ్గే పరిస్థితులకి పరిష్కారం కనుగొనాలి. అలాగే డ్రోన్లు తీసిన ఫోటోలని పరిశీలించి నివారణ మార్గాలు సూచించే వ్యవస్థ, వ్యక్తులను తయారు చేయాలి. చట్టపరంగా, భద్రతపరంగా డ్రోన్లను ఉపయోగించడానికి పైలెట్లకి శిక్షణ ఇవ్వాలి.
అన్నింటికంటే ముఖ్యంగా పంటలపై మూడు నాలుగు అడుగుల ఎత్తు నుంచి గాలిలో రసాయన పురుగుమందులు పిచికారీ చేయడం ద్వారా తలెత్తే సమస్యలు, పర్యావరణ కాలుష్య, ఆరోగ్య ముప్పు అంశాలపై దృష్టి పెట్టాలి. అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేసేవారు డ్రోన్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎరువులు చల్లడానికి, శ్రమ, శక్తిని తగ్గించుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మందులు చల్లడానికి ఉపయోగపడుతుండటంతో ఇవి ఎక్కువ మందినే ఆకర్షిస్తున్నాయి.
డ్రోన్ల వినియోగంలో సవాళ్లు:
డ్రోన్ల వినియోగం అనేది పూర్తిగా సాంకేతికతతో కూడుకునట్టువంటి అంశం, రైతులు సులువుగా వినియోగించలేరు మరియు డ్రోన్ల కొనుగోళ్లు అనేది సామాన్య చిన్న, సన్నకారు రైతులకు ఖర్చుతో కూడుకునట్టువంటిది మరియు డ్రోన్లను వినియోగించేటపుడు విద్యుత్ స్తంభాలు, పొలం మధ్యలోగల చెట్లు వీటికి అడ్డంకిగా మారవచ్చు.
డ్రోన్ల ఉపయోగం కొరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ఎస్ వోపి (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) జారీ చేసింది, ఇది డ్రోన్లు, డ్రోన్ పైలట్లు మరియు డ్రోన్ ఆపరేటర్లు ఏరియల్ క్రిమిసంహారక పిచికారీ ఆపరేషన్ సమయంలో అనుసరించాల్సిన సూచనలు, నిబంధనలు మరియు ఆవశ్యకతలను జాబితా సూచిస్తుంది అవి :
క్రిమిసంహారిణి పిచికారీ చేసే ప్రాంతాన్ని డ్రోన్ ఆపరేటర్ ద్వారా డ్రోన్ పైలట్ ఆ పరిసరాలను ముందు మార్క్ చేయాలి.
ఆమోదించబడ్డ క్రిమిసంహారకాలను మాత్రమే ఉపయోగించాలి.
ప్రథమ చికిత్స సదుపాయాలను ఆపరేటర్లకు అందించాలి.
ఆపరేషన్కు సంబంధం లేని జంతువులు లేదా వ్యక్తులు నిర్ధిష్ట కాలం పాటు ఆపరేషన్ ఆవరణలోకి ప్రవేశించడానికి అనుమతించరాదు.
డ్రోన్ పైలట్లు క్రిమిసంహారకాల యొక్క క్లినికల్ ప్రభావాలతో సహా క్రిమిసంహారకాల స్పెషలైజేషన్లో ట్రైనింగ్ను పొంది ఉండాలి.
డా.ఎస్. లోకేష్ బాబు, శాస్త్రవేత్త (విస్తరణ విభాగం), ఫోన్: 99485 42942; డా. కిరణ్ కుమార్ రెడ్డి (పంట ఉత్పత్తి విభాగము), డా. విజయ్ కుమార్ నాయక్ (సస్య రక్షణ విభాగము), హరి సాదు, శాస్త్రవేత్త (మత్స్య విభాగం), డా. ఆర్. సుజాత, శాస్త్రవేత్త (గృహవిజ్ఞానం), డా. లలిత శివ జ్యోతి, ప్రోగ్రాం-కో ఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, నెల్లూరు.
ఆరోగ్యకరమైన మానవుల జీవన శైలికి పంచ భూతములలో ఒకటైన భూమి ప్రముఖ పాత్ర వహిస్తుంది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహారము మరియు ఇతరత్ర ఉత్పత్తి చేయుట కొరకు రైతులు రసాయన వ్యవసాయం ఆచరించుట వలన భూమి తన అస్థిత్వము కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా మానవుల ఆరోగ్యం భూమి ఆరోగ్యంపై ఆధారపడింది కనుక భూమి ఆరోగ్యం కాపాడుకోవటం తప్పనిసరి. ఇందుకొరకు భారత ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికగా ప్రతి రైతు భూమిలో పరీక్ష జరిపి నేల ఆరోగ్య పత్రాలను అందజేయడానికి నడుం కట్టింది. నేల ఆరోగ్య పత్రంలో సూచించిన విధంగా మెరుగైన యాజమాన్య పద్ధతులను చేపట్టి సమస్య ఉన్న భూములలో కూడా తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందిన రైతులు ఉన్నారు. కావున రైతులందరూ ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకొని వ్యవసాయంలో వ్యయం తగ్గించుకొని, సుస్థిర దిగుబడులతో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సన్నద్ధులు కావాలి.
ముఖ్యంగా నేలలు వాటిలోని సహజంగా ఉన్న పోషక పదార్ధాలతో పాటు, అదనంగా వేసిన సేంద్రీయ మరియ రసాయనిక ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడికి దోహదపడతారు. కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ఎంతో అవసరం. దీనికి సంబంధించిన రైతులు తమ పొలంలోని మట్టిని వర్షాధార భూములలో 3 సంవత్సరాలకు ఒకసారి మరియు నీటి వసతి క్రింద 3 పంటలకొకసారి పరీక్ష చేరుంచుకుంటే మంచిది. పోషక పదార్ధాల గురించేకాక, భూమిలోని చౌడు గుణాలను, సున్నం శాతాన్ని, నేల కాలుష్యాన్ని గుర్తించేందుకు కూడా మట్టి పరీక్ష చేరుంచుకోవాలి.
భూసార పరీక్షలో అన్నిటికన్నా ముందు తెలుసుకోవాల్సిన విషయం మట్టి నమూనాలను సేకరించడం. భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరియైనది కానిచో, దాని భౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండదు. దీని వలన చేరుంచిన భూసార పరీక్ష, దానికి అనుగుణంగా చేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్ధమవుతారు. కాబట్టి, మట్టి నమూనా సేకరణలో ఈక్రింది జాగ్రత్తలను తప్పక పాటించాలి.
మట్టి నమూనాలను సేకరించాల్సిన భూమిని ముందుగా నేల రంగు, ఎత్తు, వాలు, చౌడు మరియు పంట దిగుబడులు మొదలగు అంశాలపై పరిశీలన చేసి కంటికి కనిపించే లక్షణాలను బట్టి వివిధ భాగాలుగా విభజించాలి. ప్రతి భాగం నుండి పొలం విస్తీర్ణమును బట్టి నమూనాలను తీయాలి. కంటికి కనిపించే లక్షణాలలో ఎటువంటి తేడా లేనప్పుడు జిగ్జాగ్ పద్ధతిలో పొలమంతా తిరుగుతూ ఒక ఎకరా భూమిలో కనీసం 8 నుండి 10 మట్టి నమూనాలను తీయాలి.
పొలంలో అక్కడక్కడ చౌడు ప్రాంతంగా ఉన్నట్లు అనుమానం కలిగితే అక్కడి నుండి ప్రత్యేకంగా నమూనాను తీసి వేరుగా చౌడు లక్షణాల పరీక్ష కొరకు పంపాలి. అటువంటి మట్టిని బాగుగా ఉన్న ఇతర ప్రాంతపు మట్టితో కలుపరాదు.
నమూనాలను తీయు స్థలంలో నేలపై ఉన్న ఆకులు, చెత్త, చెదారం తీసివేయాలి. తరువాత పొలంలో ”ఙ” ఆకారంలో గడ్డి జాతి పంటలైన వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, చెఱకు మొదలగు పంటలకు 15 సెం.మీ. వరకు మరియు లోతైన వేరు వ్యవస్థ గల వేరుశనగ, ప్రత్తి, అపరాలు, కూరగాయలు మొదలగు పంటలలో 30 సెం.మీ. వరకు పారతో గుంట తీసి, అందులో పైపొర నుంచి క్రింది వరకు ఒక ప్రక్కగా మట్టిని సేకరించాలి.
ఈవిధంగా ఒక ఎకరా విస్తీర్ణంలో 8-10 చోట్ల సేకరించిన మట్టిని ఒక దగ్గర చేర్చి, బాగా కలిపి 4 భాగాలుగా చేయాలి. అందులో ఎదుటి భాగాలు తీసుకొని, మిగతా భాగాలు తీసివేయాలి. ఈ విధంగా మట్టి 1/2 కిలో వచ్చే వరకు చేయాలి.
ఇలా సేకరించిన మట్టిలో రాళ్ళు, పంట వేర్లు, మొదళ్ళు లేనట్లుగా చూసుకొని, నీడలో ఆరనివ్వాలి.
మట్టి నమూనా కొరకు పొలంలో మట్టిని త్రవ్వి, సేకరించినప్పుడు
గట్ల దగ్గరలోను, పంట కాల్వాలలోను మట్టిని తీసుకోరాదు.
చెట్ల క్రిందనున్న పొలం భాగం నుంచి మట్టిని సేకరించరాదు.
ఎరువు (పశువుల పేడ, కంపోస్టు, వర్మి కంపోస్టు, పచ్చిరొట్ట మొదలగునవి) కుప్పలు వేసి ఉంచిన చోట మట్టిని సేకరించరాదు.
ఎప్పుడు నీరు నిలబడే పల్లపు స్థలంలో మట్టిని సేకరించరాదు.
పండ్ల తోటలకు అనువైన నేలలను గుర్తించునప్పుడు గాని, పండ్ల చెట్లకు ఏవైన పోషక పదార్ధాలు మరియు ఇతర సమస్యల గుర్తింపు కొరకు మట్టి నమూనాను ఈక్రింది విధంగా తీసుకోవాలి.
సాధారణంగా పంటను బట్టి 3 నుండి 5 అడుగుల (1-2 మీ.) లోతు గుంట త్రవ్వి, విడిగా ప్రతి అడుగుకు కొంత మట్టిని (నమూనా) సేకరించి, భూసార పరీక్షకు పంపాలి.
మట్టి నమూనా కొరకు గుంట త్రవ్వుతున్నప్పుడు ఏవైనా గట్టి పొరలు ఉన్నట్లరుతే వాటి లోతు మరియు వాటి లక్షణాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
పండ్ల తోటల విషయంలో ఇలాంటి నమూనా సేకరణ ఎకరాకు 2-4 చోట్ల నుంచి చేస్తే చాలా మంచిది.
ఇటువంటి నమూనాలను పరీక్ష కొరకు పంపునప్పుడు ”పండ్ల తోటలకు అనువైన పరీక్షల కొరకు” అని తెలియజేయాలి.
పొలంలో పలు ప్రాంతాల (8-10 చోట్ల) నుండి సేకరించిన మట్టిని లేదా పండ్ల తోట కొరకు తీసిన మట్టిని గాని, కలిపేందుకు యూరియా లేక ఇతర ఎరువుల సంచులను వాడరాదు. ఇందుకొరకు శుభ్రమైన ప్లాస్టిక్ షీటును ఉపయోగించుట మంచిది.
ఈ విధంగా సేకరించిన మట్టిని బాగా నీడలో గాలికి ఆరిన తరువాత మంచి ప్లాస్టిక్ బ్యాగులో గాని, గుడ్డ సంచిలో గాని, తమకు సమీపంలోని వ్యవసాయ శాఖకు సంబంధించిన భూసార పరీక్షా కేంద్రానికి ఈ క్రింది సమాచారంతో పంపాలి.
రైతు పేరు, సర్వే నెంబరు, గ్రామం, మండలం.
కావలసిన భూసార / చౌడు / పండ్ల తోట ఎంపికకు పరీక్ష.
ఇంతకు మునుపు పంట, దానికి వాడిన ఎరువులు
వేయబోవు పంట
నేలలో గమనించిన ఏవేని సమస్యలు
నీటి సదుపాయం – సాగు చేయవలసిన పంట వివరాలు.
రైతులు కాగితంలో పైన తెలిపిన విషయాలను వ్రాసి మట్టి నమూనాతో పాటు సంచిలో వేసి భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి.
మరింత సమాచారం కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 89856 20346.
డా|| యం. వెంకటరాములు, సీనియర్ శాస్త్రవేత్త (విస్తరణ శాస్త్రం);
డా|| ఎ. మనోజ్, శాస్త్రవేత్త (విస్తరణ శాస్త్రం); వ్యవసాయ సమాచార మరియు ప్రసార కేంద్రం, లాం, డా|| కె.ఎస్. పూర్ణిమ, సీనియర్ శాస్త్రవేత్త (విస్తరణ శాస్త్రం); సార్వత్రిక మరియు దూర విద్యా కేంద్రం, లాం, గుంటూరు. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం.
కారణాలు ఏమైనా కాని ఇంటిపంట చేపట్టే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉంది. ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో కొన్ని మొక్కలు పెంచుతున్నారు. మొక్కలు పెంచుకోవటానికి అనేక రకాల కుండీలు, టబ్బులు, డ్రమ్ములలాంటివి వివిధ రకాల కొలతలలో అందుబాటులో ఉంటున్నాయి. కానీ ఇలాంటివి అన్నీ కూడా కొంత డబ్బు వెచ్చించి కొనుగోలు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఖర్చు ఎక్కువుగా అవుతుంది. తక్కువ ఖర్చుతో ఇంటి పంటను మొదలు పెట్టాలనుకునేవారు తమ ఇంట్లో అందుబాటులో ఉండే వృథా అయిన ఫ్రిజ్ డబ్బాలు, బక్కెట్లు, కూలర్ డబ్బాల లాంటి వాటితో మొదలు పెడుతున్నారు. వాటన్నింటితో పాటు ఇంట్లో అనేక రకాల బిందెలు, కుండీలు, నీళ్ళ డబ్బాల లాంటి వాటిని కూడా తమ మిద్దెతోటలో వినియోగిస్తున్నారు నెల్లూరు పట్టణంలోని మైపాడు గేటు సమీపములో మిద్దెతోటను పెంచుతున్నారు విజయ.
విజయ గారిది వ్యవసాయ నేపథ్యం. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన విజయకి మొక్కలన్నా, పచ్చదనం అన్నా బాగా ఇష్టం కాబట్టి ఇంటిపంటలను మొదలు పెట్టాలని ఆలోచించి తమ మిద్దెమీద మిద్దె తోట పెంపకానికి అవకాశం ఉంది కాబట్టి మిద్దెతోటను సాగు చేస్తున్నారు. జీరో బడ్జెట్తో మిద్దెతోటను మొదలు పెట్టాలనే తలంపుతో మొక్కల పెంపకానికి అవసరమయిన కుండీలు లేదా డ్రమ్ముల లాంటివాటిని బయట నుంచి కొనుగోలు చేయకుండా తమ ఇంట్లో వృథాగా పడి ఉండే బక్కెట్లు, డబ్బాలు, కుండీలు, బియ్యం డబ్బాలు, స్టీలు బిందెలు, ఫ్రిజ్ డబ్బాల లాంటి వాటిని తమ మిద్దె తోటలో ఉపయోగిస్తున్నారు. కొన్నిసార్లు పాతసామానుకు ఉల్లిపాయలు అమ్మేవారి వద్ద నుంచి తక్కువ ధరకు ప్లాస్టిక్ బక్కెట్లు, ప్లాస్టిక్ డబ్బాలు లేదా ఏ ఇతర సామాన్లు మొక్కల పెంపకానికి అనుకూలంగా ఉంటాయో అలాంటి వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసుకుని ఉపయోగిస్తున్నారు. ఏది ఏమైనా కాని మొక్కల పెంపకానికి ఉపయోగించే కంటెయినర్ల కోసం సాధ్యమయినంతవరకు ఖర్చు పెట్టకుండా జీరో బడ్జెట్లో చేయాలన్నదే విజయ గారి లక్ష్యం. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తూ ఇంట్లో ఏ వస్తువును వృథాగా పడవేయకుండా చివరికి పగిలిపోయిన కుండలలో కూడా మొక్కలు పెంచుతున్నారు.
మొక్కల పెంపకానికి ఉపయోగించే మట్టి మిశ్రమం కోసం కూడా ఎక్కువ ఖర్చు పెట్టకుండా తమ మిద్దెతోటలో ఉండే మొక్కల నుండి లభించే ఎండు ఆకులతో పాటు బయట అందుబాటులో ఉండే ఎండు ఆకులను కూడా సేకరించి ఎండు ఆకులు మరియు మట్టిని పొరలు పొరలుగా వేసుకుంటూ పైన 25 శాతం భాగం మాత్రమే ఎరువు, మట్టితో నింపి అందులో మొక్కల పెంపకం చేపడుతున్నారు. ఈ పద్ధతి వలన లోపల వేసిన ఎండు ఆకులు నిదానంగా కుళ్లుతుంటాయి కాబట్టి మొక్క నాటిన లేదా విత్తనం పెట్టిన 60 నుండి 90 రోజుల వరకు మొక్కకు పోషకాలు ప్రధానంగా అందుతుండడము విజయ అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. మొక్కకు అవసరమైన పోషకాలు సక్రమంగా అందడము వలన మొక్కల రోగనిరోధక శక్తి పెరిగి చీడపీడల ప్రభావం తక్కువగా ఉంటుంది. తాను పెంపకం చేసే మిద్దెతోటలో చీడపీడల ప్రభావం తక్కువగా ఉంటుంది కాట్టి చీడపీడల నివారణ కొరకు పెద్దగా ఇబ్బందులు ఉండడం లేదు.
వీరి మిద్దెతోటలో ఆకుకూరలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడుటలో ఆకుకూరలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. కాబట్టి రోజు మార్చి రోజు తమ ఆహారంలో ఆకుకూర ఉండేలా తమ మిద్దెతోటలో ఆకుకూరలను పెంచుతున్నారు. తోటకూర, కొత్తిమీర, పొదీనా, రెండు రకాల బచ్చలి కూర, పొన్నగంటి కూర, రెండు రకాల గోంగూర, మెంతికూర పెంచడముతోపాటు ఆవాలు, వాము లాంటి వాటిని కూడా మిద్దెతోటలో పెంచుతూ ఆకుకూరగా ఉపయోగిస్తున్నారు. వీటితోపాటు మునగ ఆకు, తమలపాకు లాంటి వాటిని కూడా తమ వంటలలో క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నారు. వంగ, బెండ, టమాట లాంటి కూరగాయలతో పాటు తీగజాతి కూరగాయల పెంపకానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. తీగజాతి కూరగాయల పెంపకానికి ఎక్కవ స్థలం అవసరం లేకపోగా దిగుబడి కూడా బాగా వస్తుంది కాబట్టి బీర, కాకర, పొట్ల, దోస లాంటి కూరగాయలు 365 రోజులు వచ్చేలా విత్తనాలను వేస్తుంటారు. ఏది ఏమైనా కాని తమ ఇంటి అవసరాలకు సరిపోయే కూరగాయలు, ఆకుకూరలను అతి తక్కువ ఖర్చుతో ఒక విధంగా చెప్పాలంటే ఖర్చు లేకుండా ఆరోగ్యంగా పెంచుతూ ఉపయోగిస్తున్నారు. వీరు పెంపకం చేసే చింత చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చింత చిగురు కోసమని చింత చెట్టును పెంచుతున్నారు. ఆ చెట్టు నుండి ప్రతినిత్యం చింతచిగురు పొందుతున్నారు. చింత చెట్టు పెద్ద చెట్టు అయిన తరువాత తమ ఇంటి చుట్టుప్రక్కల వారు తమ తమ అవసరాలకు ఆ చెట్టు నుండి చింత చిగురును పొందుతుంటారు. వీటితో పాటు కరివేపాకు, బొప్పాయి, నిమ్మ, జామ, సపోట, సీతాఫలం, కొబ్బరి, కుంకుడు, బత్తాయి, నారింజ, గన్నేరు, మల్లె లాంటి మొక్కలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నారు.
తాను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కాబట్టి మొక్కల పెంపకం గురించి, పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు అనునిత్యం తెలియ చేయడంతో పాటు స్కూలు ఆవరణలో కూడా కొన్ని మొక్కలను పిల్లల చేత నాటిస్తుంటారు. అంతేకాకుండా ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో అవకాశం ఉన్న చోట మొక్కల పెంపకం చేపడుతుంటారు. కొత్తగా ఇంటి పంటను చేపట్టే వారు ఇంట్లో వృథాగా ఉండే వస్తువులను తమ ఇంటి పంటలో ఉపయోగిస్తే జీరోబడ్జెట్తో ఇంటి పంటను మొదలు పెట్టవచ్చు అని సలహా ఇస్తున్నారు. – వై. శ్రవణ్ కుమార్, స్పెషల్ కరస్పాండెంట్
ముందుగా నేలలో పోషకాల యొక్క స్థితిని తెలుసుకోవడానికి భూసార పరీక్షలు చేయించాలి. మట్టి ఆరోగ్య కార్డును బట్టి సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపట్టాలి.
నాణ్యమైన నారును ఎంచుకోవాలి. ఉత్తమ యాజమాన్య పద్ధతులను పాటిస్తున్న నర్సరీలను (40 మెష్ నెట్, రెండు గదుల ద్వారము, హార్టీకల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ నాణ్యమైన కోకోపీట్) ఎన్నుకోవాలి.
ఎకరాకు 8 నుంచి 12 టన్నుల పశువుల ఎరువును భూమికి అందించాలి. భూమిలో కర్బన శాతం పెరుగుతుంది. మొక్కకు అవసరమైన జీవన ఎరువులను పెంచుతుంది. నీరు, పోషకాలను నిలుపుకోవడానికి సహాయపడుతుంది.
జీవన శిలీంద్రనాశిని ట్రైకోడెర్మా, సూడోమోనాస్లు పంటలపై దాడి చేయగల శిలీంధ్రాలను అరికడతాయి. వేరుకుళ్ళు, మొదలకుళ్ళు పంట రోగాలను తగ్గిస్తుంది. మొక్కల వృద్ధికి సహాయపడుతుంది.
ఎత్తు మడులలో పంట సాగు చేయడం వలన నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మొక్క వేర్లకు తగినంత స్థలం లభించి ఏపుగా పెరుగుతుంది.
వేప/కానుగ పిండిని ఎకరానికి 100-250 కిలోలు వేసుకోవాలి. భూమిలో ఉండే పురుగు ప్యూపా థను, నులి పురుగులను నియంత్రిస్తుంది.
ఆచ్ఛాదన/మల్చింగ్ 25-30 మైక్రాన్ మందం కలిగిన ప్లాస్టిక్ లేదా సేంద్రియ మల్చ్తో (వరిగడ్డి) కలుపును సమర్ధవంతంగా నివారించవచ్చు.
మొక్కల మధ్యదూరం 40-60 సెం.మీ. మరియు సాళ్ళ మధ్య దూరం 1-1.5 మీ. పాటించాలి. ఎకరానికి 6,666 (చలికాలం), 8000 (వేపవికాలం) మొక్కలుండాలి.
డ్రిప్పు ద్వారా బిందు సేద్యం. డ్రిప్పు నీటిని, ఎరువులను మొక్క వేరు భాగంలో అందించి ఉష్ణోగ్రత, తేమను నిర్వహిస్తుంది. పంట నాణ్యతను మెరుగుపరచి ఉత్పత్తిని పెంచుతుంది.
ఎరువులను నీటి ద్వారా అందించడం (ఫెర్టిగేషన్) మొక్కకు పోషకాల లభ్యతను పెంచుతుంది. పంట పెరుగుదల మరియు దిగుబడిని ప్రభావితం చేయకుండా 20-40% ఎరువులను ఆదా చేస్తుంది.
సూక్ష్మ పోషకాల కోసం కాల్షియం, మెగ్నీషియం, బోరాన్, ఇనుము, మాంగనీసు, మాలిబ్డినం, జింకు కలిగిన సూక్ష్మపోషకాల మిశ్రమంను పిచికారి చేసుకోవాలి. ఇది అధిక దిగుబడిని, స్థిరమైన వృద్ధిని ప్రోత్సహిస్తాయి మరియు పంట నాణ్యతను పెంచుతాయి.
పొలం చుట్టూ కంచె పంటలను వేసుకోవాలి. 3-4 వరుసల మొక్కజొన్న, జొన్న లేదా సజ్జ పంటలను టమాట నాట్లకు ముందే విత్తుకోవాలి.
ఎర పంటగా బంతి మొక్కను నాటుకోవాలి. 16 వరుసల టమాట నారుకు ఒక వరుస బంతి నారును వేసుకోవాలి. టమాట కాయతొలుచు పురుగులు మొదట టమాట పంటకు రాకుండా బంతి పువ్వులకు ఆకర్షించబడుతాయి.
రసం పీల్చే పురుగుల నివారణకై ఎకరాకు 40 నుండి 50 పసుపు-నీలం రంగు జిగురు అట్టలను అమర్చాలి. ఇవి పురుగులను ఆకర్షించి పంట నష్టం నుండి కాపాడతాయి.
ఎకరాకు 4-5 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. ఇవి మగ పురుగులను ఆకర్షించి సంతానోత్పత్తి కాకుండా నియంత్రించి, మొక్కలకు, కాయలకు నష్టం కాకుండా చేస్తాయి.
దీపపు ఎరలను పొలంలో అమర్చాలి, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు వాడాలి. హాని చేసే పురుగులను నియంత్రించవచ్చు.
మొక్క క్రింద ఉన్న 3-4 వరుసల ఆకులను మట్టికి తగలకుండా కత్తిరింపులు చేయాలి. దీనివలన ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు తెగులు సోకకుండా పంటను కాపాడుకోవచ్చు.
మొక్కలు నేలకు తగలకుండా కర్రల సహాయంతో ఊతము ఇవ్వాలి. దీనివలన మొక్క ఏపుగా పెరిగి తెగుళ్ళ ఉధృతి తగ్గి మంచి దిగుబడులు వస్తాయి. బలమైన గాలుల నుంచి మొక్కలకు రక్షణ లభిస్తుంది.
రసం పీల్చే పురుగులు, చిన్న థ పురుగులు నివారించడానికి 5% వేపగింజల కషాయం/వేప నూనెను పిచికారి చేయాలి. ఇది పంట పెరిగే థలో మాత్రమే వాడాలి.
పంటపై పురుగులు రాకుండా వారానికి ఒకసారి నివారణచర్యలు చేపట్టాలి. పురుగు/తెగుళ్ళు రాకముందే వేపనూనె/వేపగింజల కషాయం వంటి మందులను పిచికారి చేసుకోవాలి.
కాయలను గ్రేడింగ్, సార్టింగ్ చేయాలి. టమాట పంటను కోసిన తరువాత సూపర్ ఎ, సూపర్, ఫ్యాన్సీ, కమర్షియల్ గ్రేడ్లుగా గ్రేడింగ్ చేసి మార్కెట్కు పంపాలి. దీని వలన పంట దిగుబడులు పెరిగి రైతుకు మంచి ఆదాయం వస్తుంది.
డా. నాయుడు మాధవి, అసిస్టెంట్ ప్రొఫెసర్, హార్టీకల్చర్ విభాగం, ఎస్బివిఆర్ అగ్రికల్చరల్ కాలేజ్, బద్వేల్, ఫోన్: 9494881824
వాతావరణ ఆటుపోట్లు, పెట్టుబడి పాట్లు పీడిస్తున్న నేటి సాగు రంగంలో రైతులు నిలదొక్కుకోలేని పరిస్థితి. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి, అన్నీ బాగుంటే పండిన పంటకు ధర దక్కని దుస్థితి. ఇలాంటి పరిస్థితులలో పూర్తిగా పంటల సాగుపైనే ఆధారపడకుండా అనుబంధ రంగాలైన పశుపోషణ, జీవాలు, చేపలు, కోళ్ళ పెంపకాలను జోడిస్తే రైతులకు వివిధ రూపాలలో ఆదాయం సమకూరే అవకాశం ఉంది. దీనినే సమగ్ర వ్యవసాయం/సమీకృత వ్యవసాయం అంటారు. సమగ్ర వ్యవసాయంలో ఒక రంగం నుంచి వచ్చే వ్యర్థ పదార్థం మరొక రంగానికి వనరులుగా ఉపయోగపడుతుంది. సమగ్ర వ్యవసాయంలో వచ్చిన పంట అవశేషాలు లేదా పశువుల పేడను కంపోస్టుగా వాడవచ్చు. అలాగే పాడి ఎక్కడైతే ఉందో అక్కడ బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవచ్చు. సమగ్ర వ్యవసాయంలో ఎక్కువ పచ్చిగడ్డి లభిస్తున్నట్లయితే సైలేజ్ లేదా మాగుడు గడ్డి కూడా తయారు చేసుకోవచ్చు.
సాధారణంగా రైతులు గ్రామాల్లో పశువుల పేడను, వ్యవసాయ వ్యర్థపదార్థాలను కుప్పలుగా వేస్తారు. ఇలా చేయడం వల్ల అవి ఎండకు ఎండి వానకు తడిసి సహజ పోషకాలను కోల్పోతాయి.
రైతులు కొంత శ్రమపడి సేంద్రియ పదార్థాలను సేకరించి గుంటలో వేసి తగిన పరిస్థితులు కల్పిస్తే ఎరువుగా తయారవుతుంది. సాధారణ పరిస్థితుల్లో సేంద్రియ పదార్థాలు కుళ్ళటానికి చాలా నెలలు పడుతుంది. కుళ్ళే ప్రక్రియ చాలా త్వరగా జరగడానికి అనువైన పరిస్థితులను కల్పించడాన్ని కంపోస్టింగ్ అని అంటారు. ఇలా తయారైన ఎరువును కంపోస్టు అంటారు.
కంపోస్టింగ్కు అనువైన వ్యర్థ పదార్థాలు:
ఎండుగడ్డి / ఎండు ఆకులు / కలుపు మొక్కలు / గ్లైరిసీడియా కొమ్మలు / వివిధ (తర్వాత వచ్చిన) వ్యర్థ పదార్థాలు / కొమ్మల భాగాలు / పశువుల పేడ, గొర్రెల / కోళ్ళ పెంట, మూత్రములు / గోబర్ గ్యాస్ ప్లాంట్ స్లర్రీ మొదలైన వాటిని కంపోస్టు ఎరువు తయారు చేయడానికి వాడవచ్చు.
కంపోస్టు గుంట పరిమాణము: 5.25 మీ. þ 2 మీ. þ 1 మీ.
కంపోస్టింగ్ పద్ధతి:
5.25 మీ. పొడవు, 2 మీ. వెడల్పు, 1 మీ. లోతు గుంటలను పొలంలో ఒక మూల వీలయితే చెట్ల నీడలో త్రవ్వాలి.
ఇలా త్రవ్విన గుంటలో నీరు నిలువకుండా సులభంగా ఇంకిపోవడానికి దిబ్బ అడుగున రాళ్లు, పెంకులు వంటివి 6 అంగుళాల మందము పరచాలి.
సేకరించిన వ్యర్థ పదార్థాలను, చెత్తను 6 అంగుళాల మందం వరకు నింపి దానిపై పేడను, ఆపైన రాక్ ఫాస్ఫేట్ సుమారు 1 కిలో చిలకరించాలి. ఈ పద్ధతిన పొరలు, పొరలుగా వ్యవసాయ, పశువుల వ్యర్థ పదార్థాలపై రాక్ ఫాస్ఫేట్ చిలకరించి ఈ విధంగా భూమి మట్టానికి 1-2 అడుగుల ఎత్తు వరకు అమర్చిన తర్వాత అందులో తేమను పెంచటానికి నీటిని చిలకరించవలెను.
ఆ తర్వాత గాలి సోకకుండా, మట్టి, పేడ మిశ్రమంతో పూత పూయవలెను.
ఈ విధంగా చేసిన తర్వాత గుంతలో వేసిన సేంద్రియ పదార్థాలు కుళ్ళి సుమారు 75-90 రోజులలో మంచి సారవంతమైన కంపోస్టు తయారవుతుంది.
ఈ ప్రక్రియలో గుంతలో ఉత్పన్నమైన వేడికి (40-50 సెంటీగ్రేడ్) ఇందులోని హానికారక శీలీంద్రాలు, రోగకారక క్రిములు, కీటకాలు నశించును.
కంపోస్టింగ్ త్వరగా జరగడానికి అనువైన పరిస్థితులు పంట వ్యర్థ పదార్థాల ఎంపిక:
కంపోస్టు త్వరగా 3 నెలలోపు తయారు అవ్వాలి అంటే కర్బన, నత్రజని మోతాదు తక్కువ ఉన్న వ్యర్థ పదార్థాలు ఎన్నుకోవాలి. కర్బన, నత్రజని నిష్పత్తి ఏ పంట వ్యర్థాలలో తక్కువగా ఉంటే అవి త్వరగా కుళ్ళుతాయి.
పంట వ్యర్థ పదార్థాలు బాగా చిన్నవిగా ఉంటే త్వరగా కుళ్ళుతాయి.
గుంతలో ఎప్పుడూ తేమ తగినంత ఉండాలి. తేమ వలన కుళ్ళడానికి దోహదపడే సూక్ష్మజీవులు అధికంగా వృద్ధి చెంది ఎరువును తయారు చేయడానికి దోహదపడతాయి. అందుకు దిబ్బపై నీటిని చిలకరిస్తుండాలి.
ఎట్టి పరిస్థితులలోను కంపోస్టు గుంతలో నీరు నిల్వ ఉండకూడదు.
సాధ్యమైనంత వరకు తేమ త్వరగా ఆరిపోకుండా కంపోస్టు గుంతను చెట్ల నీడలో వేసుకోవాలి.
కంపోస్టు వాడడం వల్ల లాభాలు
నత్రజని, పొటాష్, భాస్వరం వంటి ప్రధాన పోషకాలే కాకుండా కాల్షియం, మెగ్నీషియం, బోరాన్, జింక్, మాంగనీస్ వంటి సూక్ష్మపోషకాలు కూడా పంటకు అందుతాయి.
పంటకు తెగుళ్ళను తట్టుకునే శక్తి పెరుగుతుంది. అందువల్ల క్రిమినాశక మందులకు అయ్యే ఖర్చు తగ్గుతుంది.
యూరియా, డిఎపి, పొటాష్ వంటి ఎరువులు వాడనక్కర లేదు.
కంపోస్టు వాడితే పంటకు నీరు తక్కువ పట్టి నీరు ఆదా అవుతుంది.
పండిన పంట త్వరగా చెడిపోదు.
నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులు (సూక్ష్మ&క్రిములు) సంఖ్యను బాగా పెంచుతుంది. భూమికి సేంద్రియ కర్బనం లభిస్తుంది.
కంపోస్టు ఎరువులోని జిగురు పదార్థాలు మట్టిని పట్టుకొని ఉండటం వల్ల మట్టికోత తక్కువగా ఉంటుంది.
నేలలోకి గాలి బాగా వీచేలా, నీరు బాగా ఇంకేలా చేస్తుంది. నీటిని నిల్వ ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది.
ప్రతి ఏటా పంట దిగుబడి నిలకడగా ఉంటుంది.
అలాగే పంట అవశేషాలు, ఆవుపేడ, డెయిరీ నుంచి వచ్చిన పెంటను ఉపయోగించి వర్మికంపోస్టును తయారు చేసుకోవచ్చును. వర్మికంపోస్టు 2 నెలలలో ఒక సైకిల్ పూర్తవుతుంది.
పాడి ఉన్న ప్రదేశాల్లో బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవచ్చు. సాంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ సబ్సిడి మీద బయోగ్యాస్ ప్లాంట్ను నిర్మించి ఇవ్వటం జరుగుతుంది. బయోగ్యాస్ ప్లాంట్ సైజ్ ఉండే పశువులను బట్టి అలాగే ఇంట్లో ఉండే మనుషులను బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా 1 క్యూ.మీ. సైజు బయోగ్యాస్ ప్లాంట్కు 2 పాడి పశువులు అలాగే రోజుకి 25 కిలోల పేడ అనేది అవసరమవుతుంది. ఈ 25 కిలోల పేడను 25 లీ. నీటిలో కలిపి స్లర్రీ లాగా చేసుకోవాలి. బయోగ్యాస్ ప్లాంట్ ఇన్లెట్లో పొయ్యాలి. ఇలా చేసాక మనకి గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాస్ని వంట చేసుకోవడానికి వాడవచ్చు. అలాగే అవుట్లెట్ల నుంచి వచ్చే స్లర్రీని పొలాలకి వేయడం వలన నేల యొక్క సారవంతత గణనీయంగా పెరుగుతుంది. దాదాపు పశువుల పేడ కన్నా 3 రెట్లు నత్రజని ఈ బయోగ్యాస్లో ఉంటుంది.
ఈ సమగ్ర వ్యవసాయంలో ఎక్కువగా పచ్చిగడ్డి లభిస్తున్నప్పుడు సైలేజ్/మాగుడు గడ్డి తయారు చేసుకోవచ్చు. వేసవి కాలంలో పశుగ్రాసాల కొరత ఉన్నప్పుడు వీటిని వాడవచ్చు. దీని తయారి కోసం మామూలుగా గుంత పద్ధతి అయినా అవలంభించవచ్చు. లేదంటే సైలో బ్యాగ్స్ కూడా దొరుకుతున్నాయి. సైలేజ్ అంటే పచ్చిగడ్డిని నిల్వ చేసుకోవడం. దీ
కంపోస్టింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కుప్పలో వేడిమి 60-90 సెంటీగ్రేడ్ డిగ్రీల వరకు ఉండేలా చూసుకోవాలి.
కంపోస్టు కుప్పలోని అన్ని భాగాలకు గాలి బాగా ఆడాలి.
బెడ్లో వేసే వ్యర్థ పదార్థాలను 1-2 అంగుళాల సైజు ముక్కలుగా చేసి వేస్తే గాలి బాగా ఆడుతుంది.
కంపోస్టింగ్ ప్రక్రియ త్వరగా జరగడానికి బెడ్లో ఉదజని సూచిక 6.5-7.5 మధ్యలో ఉండేట్లు చూసుకోవాలి.
డా. జె.డి. సరిత, డా. కె. కళ్యాణి, కె. సాధన (9940236076)
డా. బి. పుష్పావతి, వ్యవసాయ కళాశాల, పాలెం, ప్రొఫెసర్ జయంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ.
పేరిశాస్త్రి తల్లి వైదేహి ఉదయమే లేచి పేరిశాస్త్రిని పెరట్లోకి తీసుకెళ్ళింది. అతడిని కొబ్బరిచెట్టు నీడన రాతిబండపై కూర్చోబెట్టింది. బాదం తైలంతో అతని తలని మర్ధన చేసింది. ఉష్ణం తగ్గాలని నిమ్మకాయ పిండి తలకి రాసింది. పేరిశాస్త్రి ముఖం మిలమిలా మెరవాలని దోసిడంత గోవు వెన్న తీసి ముఖానికి పూసింది. అరవై నిమిషాలు తైలంతో నానాక అతడి శరీరంపై చేదబావిలోని చన్నీళ్ళను బొక్కనతో తోడి పోసింది. కుంకుడు కాయలతో తలని అంటి అభ్యంగన స్నానం పూర్తి చేయించింది. తన చీర కొంగుతో అతడి తలను ఆరబెట్టింది. విసన కర్ర తెచ్చి విసురుతూ కురులను వదులు చేసింది. తలకి సాంబ్రాణి పొగ వేసింది. పేరిశాస్త్రిని రచ్చబండ వద్దకి తీసుకెళ్ళి వేపచెట్టు కింద పసుపు కుంకుమలు పూసివున్న గంగమ్మ తల్లికి దండాలు పెట్టించింది.
ఇంటికి తీసుకెళ్ళి దోసిట్లో చద్ది అన్నం పోసి ఉల్లిపాయ ముక్క, పచ్చి మిరప అందించింది. కడుపు నిండా ఆరగించిన పేరిశాస్త్రి రేగుపండ్ల కోసం అడవికి బయలుదేరినాడు.
* * *
పేరిశాస్త్రి తల్లి వైదేహికి పాతికేళ్ల వయస్సుకే వైధవ్యం ప్రాప్తించింది. ఏటిగట్టుకి ఈతకు పోయిన భర్త సదానంది శాస్త్రి ఏరు పెరిగి ఏటిలో ఎటో కొట్టుకు పోయినాడు. వైధవ్యం ప్రాప్తించే నాటికి పేరిశాస్త్రి చిన్న బిడ్డ. ఇంటవున్న గేదెల పాల విక్రయం ద్వారా జీవనం సాగిస్తోంది ఆమె.
తండ్రిని చూడకనే పేరిశాస్త్రి బాల్యం గడిచింది. ఆయా రుతువులలో ఫలించే అడవి ఫలాలను తెచ్చి పల్లెల్లోకి తీసుకెళ్లి అమ్ముతాడు పేరిశాస్త్రి. దాని ద్వారా లభించే నగదు, ధాన్యాలను గృహానికి చేరుస్తాడు.
* * *
పేరిశాస్త్రి చిన్నగా నడుస్తున్నాడు. వడివడిగా నడిస్తే పుడమితల్లి గాయపడుతుందేమోనన్నంత చిన్నగా నడుస్తున్నాడు. అతడు గోదావరి నదికి అభిముఖంగా నడక సాగిస్తున్నాడు. అతడి మెత్తటి నడకను వెక్కిరిస్తున్నట్టుగా గోదావరి ఎగిరెగిరి ప్రవహిస్తోంది.
అడవిలో కావలసినన్ని రేగుపండ్లు సేకరించి బుట్టలలో, సంచులలో బిగించి ఇంటికి తీసుకెళ్తున్నాడు. గోదావరి నదిలో స్నానం చేస్తున్న ఓ పదహారేళ్ల పడుచుపిల్ల పేరిశాస్త్రిని చూసి సిగ్గుపడలేదు. నవ్వుతూ ఈదుకుంటూ వచ్చి ఒడ్డుపై వాలింది. ఆ పిల్ల ఒళ్ళు బంగారంలా మెరుస్తోంది. తడిసిన సొగసు రతీదేవిని అసూయపరిచేట్లుగా వుంది. సిగకొప్పు నల్ల చీకటి ముద్దలా వుంది. కొప్పులోని వాడిన మల్లెలు అలసిన మన్మథుడు రతీదేవిపై వాలి ఉన్నట్లుగా ఉంది. ఆ పిల్ల కిసుక్కున నవ్వితే మెరుపు మెరిసినట్లుగా వుంది. ఆ పిల్ల ముక్కు పుడక కాంతి సన్నని చీకటి దీపంలాగా ఉంది.
అలాంటి పిల్ల నది గట్టున కూర్చొని పేరిశాస్త్రిని మైలు దూరం నుంచి చూసి చూసి… విసిగింది. అతడి క్షణ వీక్షణానికై తహతహలాడింది. అయితే పేరిశాస్త్రిలో చలనం లేదు. తన మార్గంలో తను ఉన్నాడు. శుక్ర మహర్షిలా ఠీవిగా నడుస్తున్నాడు.
విసిగిన ఆ పిల్ల ‘తన బతుకెందుకింక’ అన్న ధోరణిలో గబుక్కున నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళింది.
* * *
పేరిశాస్త్రి అడవిదాటి, నది దాటి, సేద్యపు గెనాలు దాటి పల్లెలోకి ప్రవేశించాడు. పల్లెకి దూరంగా ఒంటిగా వున్న తన ఇంటిలోకి పెరటిగుండా వెళ్ళినాడు. పెరట్లోని చేదబావి దగ్గర కొబ్బరి చెట్ల నీడన కూర్చొని తను తెచ్చిన రేగుపండ్లను ఆరపోశాడు. చెడిన పండ్లను ఏరి పారేస్తూ కిటికీగుండా ఇంటిలోకి చూసినాడు.
ఇంటిలోపల పట్టెమంచంపై రామశర్మ కూర్చొని ఉన్నాడు. అమ్మ పక్కనే నిలబడి ఉంది. రామశర్మ తన పల్లెలోని పడమటి వీధిలో కాపురముంటున్నాడు. పౌరోహిత్యం ద్వారా జీవనం సాగిస్తున్నాడు. పేరిశాస్త్రికి వరుసకు పెదనాన్న అవుతాడు.
పేరిశాస్త్రి పెరటినుండి ఇంటిలోపలికి వచ్చి రామశర్మ పాదాలకి నమస్కరించాడు. భయంగా, గౌరవంగా, దూరంగా నిలబడినాడు. ఇంటిముందు ముద్ద మందారం చెట్టులోని మందారాలు గాలికి అటూ ఇటూ ఊగుతున్నాయి.
* * *
రామశర్మ కొడుకు సుధాకరం అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చదివినాడు. బిడ్డకి మంచి భవిష్యత్తు ఉంటుందని కలలు కనినాడు. ఏ శాపం తగిలిందో ఏమో, సుధాకరానికి మూత్రపిండాల జబ్బు వచ్చింది. మూత్రనాళాలలో ఇన్ఫెక్షన్లు ప్రారంభమై క్రియాటిన్ స్థాయిలు పెరిగి మూత్రపిండాలు దెబ్బతిని డయాలసిస్ స్థాయి దాటి మూత్రపిండ మార్పిడి వరకు వచ్చింది.
”బిడ్డలాంటి బిడ్డ నీవు నాకు. కష్టపడి చదివిన నా సుధాకరం, నీవూ ఒకటే బాబు నాకు. ఒక్క మూత్రపిండమైనా మారిస్తే తన బతుకు తాను బతకగలడని యూరాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు చెబుతున్నారు.
విదేశాలలో ఉద్యోగాలు సైతం వాడికోసం సిద్ధంగా ఉన్నాయి. అయినా వాడు మన తెలుగు రాష్ట్రాల ఎల్లలు దాటనంటాడు. తెలుగు రైతన్నలకు మంచి చెడ్డలు నేర్పతానంటాడు. దానికోసం ‘కర్షక మిత్ర’అనే సంస్థను చిన్న పల్లెటూరు, మన పొరుగూరు అయిన అనంతంపల్లిలో ఆఫీసు ఏర్పాటు చేసినాడు. భావసారూప్యం కలిగిన పదిమందితో జట్టు కట్టినాడు. ఆ పదిమందిలో అగ్రికల్చరల్ బి.యస్సీ. చేసిన వారు, హార్టికల్చర్, సెరికల్చర్ సబ్జక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారు, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్లు ఉన్నారు.
వారికి సహాయకరంగా ఇరవైమందితో అంకితభావం కలిగిన క్షేత్రస్థాయి బృందం ఒకటి ఏర్పడింది. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫార్మ్ ఇంజనీరింగ్, అగ్రి టెక్నాలజీలలో డిప్లొమోలు చేసినవారు ఈ బృందంలో ఉన్నారు.
వీరంతా ఉత్తరాల ద్వారా, కరపత్రాల ద్వారా, ఫోన్ల ద్వారా, మొబైల్ మెసేజ్ల ద్వారా రైతులకు సలహాలు, సూచనలు ఉచితంగా ఇస్తారు. రైతుల పొలాల నుంచి ఇంటికి వచ్చినాక రాత్రిళ్లలో రచ్చబండ సమావేశాలు నిర్వహిస్తారు. దిగుబడి పెంచి, రాబడి గడించే సూచనలు చేస్తారు. అవసరమైతే పొలాలకు వెళ్ళడం, రైతులు ఇండ్లకి వెళ్ళడం చేస్తారు. వారి అవగాహనా సామర్థ్యాన్ని పెంచడానికి ప్రజెంటేషన్స్ చేస్తారు. అందుకై ఎల్.సి.డి. ప్రొజెక్టర్, ల్యాప్ టాప్, స్క్రీన్, రిమోట్ మరియు సి.డి. లు కొనుగోలు చేసారు.
అలాంటి సంస్థ నాయకుడి ఆరోగ్యం దెబ్బతినడంతో సంస్థ ఎటుపోతుందో తెలియడం లేదు. సంస్థ నిర్మాణం కోసం, వస్తు సామాగ్రి కోసం వాహనాలకోసం, జీతభత్యాలకోసం ఉన్న ఇల్లూ, వాకిలీ, నేలా, నగా అన్నీఅమ్మేశా. దిక్సూచి లేని సముద్ర ప్రయాణంలా ఉంది పరిస్థితి.
మంచి చదువు చదివినవాడు, పదిమందికీ పనికివస్తాడని ఆశించినాము. అయితే రోజు రోజుకీ వాడి ఆరోగ్యం క్షీణిస్తోంది. వయసు మీరిన నేను ఎక్కువకాలం బతకను. పదేళ్లక్రితమే భార్యను పోగొట్టుకున్నవాణ్ణి. ఇప్పుడు కొడుకునీ పోగొట్టుకోలేను. వాడి ఆదర్శాలనూ చంపలేను. నా శరీర నిర్మాణం సరిగా లేనందున నా అవయవదానం పనికిరాదు.
పెద్దమనసు చేసుకొని నీ మూత్రపిండం ఒక్కటి నా బిడ్డకి ఇస్తే మా ఇంటిదీపం వెలిగించిన వాడవవుతావు. నీకు తమ్ముడిలాంటి వాడు. వాడికి ఆయుష్షు ప్రసాదించు బాబూ! వాడు ఈ సమాజానికి చేయాల్సింది చాలా ఉంది బాబూ!” అని ఏడుస్తూ పేరిశాస్త్రి కాళ్లమీద పడినాడు.
తల్లి వైదేహి ససేమిరా ఒప్పుకోవద్దని పేరిశాస్త్రికి సైగలు చేస్తోంది. పమిటతో నోటికి కప్పి ఏడుస్తూ వుంది. ఆమె సైగలను పట్టించుకోలేదు అతడు.
పేరిశాస్త్రి తీక్షణంగా రామశర్మ కళ్లలోకి చూస్తూ, మౌనంగా, నిలబడినాడు. అలాగే పదిహేను నిమిషాలపాటు కళ్ళు మూసి దీర్ఘంగా ఉచ్చ్వాసనిశ్వాసాలు తీసినాడు.మనసుకి ఏదో బోధపడింది.
కళ్లు తెరిచి ”పెద్దనాన్నగారు, నా శరీరభాగం మన సుధాకరానికి ఉపయోగపడుతుందంటే రెండవ ఆలోచన చేయాల్సిన పనిలేదు. రైతు బాంధవుడు అతడు. అజ్ఞానం నీడలో, సాగుబడిలేక, దిగుబడిరాక దినదిన గండంతో సతమతమవుతున్న రైతుల చీకటి జీవితాల్లో చిన్న చిరుదివ్వె వెలిగించాలన్నది సుధాకరం తపన. అది ఎంతమందికి వెలుగు ప్రసాదిస్తుందనేది అప్రస్తుతం. ప్రయత్నం చాలు. మనందరం ఆ ప్రయత్నాన్ని స్వాగతిద్దాం. మనవంతు సాయం మనం చేద్దాం. మీరు మూత్రపిండ మార్పిడికి డాక్టర్లతో మాట్లాడి ఏర్పాటు చేసుకోండి” అని ధైర్యంగా సూటిగా రామశర్మకి చెప్పినాడు.
రెండు చేతులూ జోడించి కళ్లనీళ్లతో ”కృతజ్ఞతలు బాబూ!” అంటూ రామశర్మ బయలుదేరినాడు.
* * *
వెక్కి వెక్కి ఏడుస్తూ వచ్చిన వైదేహి పేరిశాస్త్రికి నాలుగు అడుగులు దూరంలో నిలబడింది. ఆమె శరీరం చిన్నగా కంపిస్తోంది. కళ్లలోంచి కన్నీరు… వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తోంది.
తల్లి ఏడ్వడం సహించలేని పేరిశాస్త్రి వడివడిగా వస్తూ ”ఏడ్వకే అమ్మా!” అంటూ ఆమెను తన ఒడిలోకి తీసుకొని మౌనంగా భుజం తడుతూ ఓదార్చినాడు.
సొమ్మసిల్లినట్టుగా పడివున్న తన తల్లి ముఖాన్ని చల్లటి నీటితో శుభ్ర పరచాలని నీటితొట్టి వద్దకి పరుగు తీసినాడు. పరుగుతీసే సమయంలో అతడి కాలికి ముల్లు గుచ్చుకొంది. గట్టిగా ”అమ్మా!” అని అరిచినాడు.
వైదేహి ఉలిక్కిపడింది. పరుగెత్తుకెళ్ళి అతడిని తన ఒడిలోకి తీసుకొని కాలిలోని ముల్లు పెరికింది. పేరిశాస్త్రిని బాధ లాగుతోంది. అరిపాదంలో ఇరుక్కొని వున్న ముల్లుకొన నెప్పి పెడుతోంది.
ఆమె తనవద్ద వున్న పిన్నుతో ముల్లుకొనని తీసి పారేసింది. రక్తం వస్తోంది. ఆమె తన నోటిలోకి రక్తాన్నంతా లాక్కొంది.
రక్తం రావడం ఆగాక, చిన్నగా అరిపాదంపై ముద్దెట్టుకుంది. అతడి కళ్లలో కన్నీరు ”ఒక్కగానొక్క కొడుకువి, నన్ను అన్యాయం చేయకయ్యా!” అని చేతులు పట్టుకు అడిగింది. అతడు ఏడ్చాడు. చిన్న పిల్లాడిలా ఆమెను హత్తుకుపోయాడు.
”అమ్మా! అమ్మా! నీవు ధైర్యంగా ఉండవే! నీ కళ్లలో కన్నీళ్లు చూడలేను. నవమాసాలు నన్ను మోసి, పెంచి, పెద్ద చేసినదానవు. నేను నీ సృష్టినే అమ్మ! నీకు అన్యాయం ఎందుకు చేస్తానే!
పెద్ద చదువులు చదవకపోయినా, నాలో చిన్నప్పటి నుంచీ అన్నం పెట్టే రైతన్నలకి ఏమైనా, ఏదైనా సహాయం చేయాలనిపించేది. అది జరిగే వీలు నాకు కలగలేదు. సుధాకరం నా కలలని వాస్తవం చేసే యజ్ఞంలో ఉన్నాడు. ఆ యజ్ఞానికి నా వంతు ఆజ్యం పోస్తానమ్మా!”అన్నాడు.
వైదేహి తల్లడిల్లిపోయింది.
‘ఒక్కగానొక్క కొడుకు. ‘నా’ అనే దిక్కు లేదు. ఏమి చేసేదబ్బా’ అనుకుంటూ మంచంపైని తుండుగుడ్డని లాక్కొని ముఖాన్ని దాచుకొని ఏడుస్తూ కూర్చుంది.
అమ్మ కాళ్లదగ్గర కూర్చున్నాడు పేరిశాస్త్రి.
”అమ్మా! గొప్ప చదువులు చదివినవాడిని కాను. మీరంతా చదవమనినా, చదవక తప్పించుకొని తిరిగినవాడిని. పట్టుమని పదివరకైనా చదవలేకపోయాను. ప్రపంచాన్ని చూసేకొద్దీ చదువు విలువ తెలుస్తోందమ్మా.
తమ్ముడు పెద్ద పెద్ద చదువులు చదివినాడు. ఎందరో జనాలకి సహాయం చేయాలని ఉన్నవాడు. నేను ఎంత ఎదిగినా నా పరిమితి చిన్నది. సుధాకరం బృందం పరిమితి పెద్దది.
నా శరీరంలోని ఒక భాగం ఒక సంఘసేవకుడి నిర్మాణాత్మక కార్యక్రమాలలో భాగస్వామ్యం అవుతున్నందులకు గర్వపడాలి. చిన్నప్పటి నుంచీ రైతులకు సహాయం చేయాలని ఉండేది. ఇప్పుడు అవకాశం వ్చచింది నాకు. కాదనవద్దమ్మా! ఒక్క మూత్రపిండం దానం చేసినంత మాత్రాన నా ప్రాణాలేమీ పోవమ్మా! నాకు పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. నీ బిడ్డ చేసే సాయంవల్ల నలుగురికీ మంచి జరుగుతుందే అమ్మా! ఓ బిడ్డ తల్లిలాగా ఆలోచించవద్దు. లబ్ధిపొందబోయే రైతుబిడ్డల తల్లిగా ఆలోచించు. అందరూ ‘నా’ వారు అనుకుంటే సమస్య ఉండదమ్మా!” అని ప్రాధేయపడినాడు.
అలాగే ఆమె అతడిని నెలల పసికందులా దగ్గరకు తీసుకున్నట్లు తీసుకొని ఆలింగనం చేసుకొంది. ఆకాశం నుంచి సన్నసన్న చినుకులు రాలడం ప్రారంభమయ్యింది. ఆకాశంలో తూర్పు దిక్కున ఇంద్రధనస్సు మొలిచింది.
ఇంటి పెరటి చింతచెట్టు గాలికి చిన్నగా సవ్వడి చేసింది. చింత చిగురు వారినిద్దరినీ పలకరిస్తున్నట్టుగా మెరుస్తూ ఉంది. లేత చింతకాయలు పేరిశాస్త్రిని ఆశీర్వదిస్తున్నట్లుగా అటూ ఇటూ ఊగుతున్నాయి. *
ఈ భూమండలంలో జీవనాన్ని కొనసాగించే అనంతకోటి జీవరాశులలో మనము కూడా ఉన్నాము అనే విషయం అక్షర సత్యం. మిగతా జీవరాశులతో పోల్చుకుంటే మనిషికి తెలివితేటలు ఉన్నాయి అంతే. అంతకు మించి ఏమీ తేడా లేదు. మిగతా జీవరాశుల లాగానే మనక్కూడా ఆకలి, నిద్ర లాంటివి సహజం. ఏ జీవికి సంబంధించిన నిత్యకృత్యాలు అవి పాటిస్తూ ఉంటాయి. కానీ మనిషికి మాత్రం తెలివితేటలు ఉండటము వలన మిగతా జీవులకంటే భిన్నంగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. తన తెలివి తేటలను మంచి కొరకు కంటే చెడు కొరకు మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు. తన తెలివితేటలతో కొత్త కొత్త వస్తువులను, ఉత్పత్తులను తయారు చేసుకుని తమ కోరికలను పెంచుకుంటూ, అవసరాలను ప్రక్కకు నెట్టి అనుకరణలకు ప్రాముఖ్యతను పెంచుకుంటూ పోతూ తమ జీవితాలలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోతూ ఆర్థికంగా బలపడుతున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆరోగ్యం, ఆనందం లేని జీవితాలలో ఆర్థికబలం ఎంత ఉన్నా అది వృథా అనే విషయం తమ తెలివి తేటలతో తెలుసుకోగలిగినా కూడా తమకు ఉన్న వివిధ రకాల బలహీనతల వలన తెలిసిన మంచి విషయాలను అమలు పరచటములో చాలా చాలా వెనుకంజ వేస్తున్నారు అనే విషయం ప్రస్తుత సమాజాన్ని పరిశీలిస్తే అర్థం అవుతుంది. ఈ విషయం కరోనా సమయంలో ఇంకా బాగా అర్థం అయ్యింది. ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన వాళ్ళు కూడా కంటికి కనిపించని చిన్న వైరస్కు భయపడి ఇంటి నుంచి బయటకు రాకుండా ముక్కుకు, మూతికి గుడ్డ కట్టుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన నైజీరియా, టాంజానియా, యుగాండా లాంటి దేశాలకంటే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందినది అనుకుంటున్న అమెరికా లాంటి దేశాలలోనే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందనే విషయం వాస్తవం. కరోనాతో అందరికీ ఇమ్యూనిటీ యొక్క విలువ తెలిసి వచ్చింది. ఇన్కం కంటే ఇమ్యూనిటి ముఖ్యం అనే విషయం తెలుసుకోగలిగారు. ఇమ్యూనిటి ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం ఉంటేనే జీవితాలలో ఆనందం ఉంటుంది. ఇమ్యూనిటి పెరగాలంటే సరైన వ్యాపకం వ్యవసాయం. అందుకే ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు మసనోబు ఫకుఓకా ఏమన్నారంటే ”మనిషి ఆనందంగా బతకాలంటే అర ఎకరం పొలం చాలు, అర ఎకరం పొలంతో మనిషి ఆనందంగా, ఆరోగ్యంగా జీవించవచ్చు” అని అన్నారు. ఈ విషయాన్ని నిజమే అని నిరూపిస్తున్నారు గుంటూరు సమీపములోని పెదపలకలూరు గ్రామంలో కేవలం 70 సెంట్ల స్థలంలో వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలతో పాటు కొన్ని గేదెలను పోషిస్తూ ఆనందంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు పోలయ్య.
పోలయ్యది వ్యవసాయ నేపథ్యం. గుంటూరు సమీపములోని పెదపలకలూరులో తమకు ఉన్న 70 సెంట్ల భూమిలో వివిధ రకాల పంటలు పండిస్తూ అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని కొన్ని పశువులను కూడా పోషిస్తూ పాలు మరియు వానపాముల ఎరువుతో పాటు కూరగాయలు అమ్ముకుంటూ 70 సెంట్ల భూమిని జీవనోపాధిగా చేసుకుని ఆనందకర జీవనాన్ని కొనసాగిస్తూ అర ఎకరం పొలం ఉన్నా కూడా ఆనందంగా జీవించవచ్చు అని నిరూపిస్తున్నాడు.
తమ భూమి బాగుపడడముతో పాటు పశువులు ఆరోగ్యంగా ఉండాలన్నా సేంద్రియ సాగే సరైన దారి అని నమ్మి సేంద్రియ సాగు పద్ధతులను అమలు పరుస్తున్నారు. ఒక ఆవు మరియు దూడలతో కలిపి 12 గేదెలను పోషిస్తున్నాడు. వాటి ద్వారా వచ్చిన పాలను అమ్మకం చేస్తున్నాడు. పశువుల పేడను వానపాముల ఎరువుగా తయారు చేస్తూ తమ పంట పొలానికి ఉపయోగించడంతోపాటు ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇంటి పంటను నిర్వహించే వారికి కిలో 8 నుంచి 10/-ల వరకు అమ్మకం చేస్తూ ఆదాయం గడిస్తున్నాడు. పశువులకు మేత కొరకు ఎండుగడ్డిని అందించడంతో పాటు సూపర్ నేపియర్ గడ్డిని పెంపకం చేస్తూ అందిస్తున్నాడు. సేంద్రియ పద్ధతిలో పెంచిన సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని మేపడము వలన పాలు రుచిగా ఉంటున్నాయని వినియోగదారులు అంటున్నారు.
పండ్ల విషయానికొస్తే పోలయ్య తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నాడు కాబట్టి ఎక్కువ రకాల పంటలు సాగు చేయకుండా కేవలం ఆకుకూరలు, కొన్ని రకాల కూరగాయలతో పాటు కొన్ని రకాల పండ్ల మొక్కలను సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం పాలకూర, పొదీన, చుక్కకూర, గోంగూర, కరివేపాకు, వంగ, సొర, టమాట, చిక్కుడు, పొట్ల మొదలగు కూరగాయలు అర ఎకరంలో సాగు చేస్తూ నేరుగా వినియోగదారులకు అమ్మకం చేస్తున్నారు. వాటితో పాటు సపోటా, తినే ఉసిరి, బత్తాయి, సీతాపలం, దబ్బకాయ, మునగ, నిమ్మ, జామ, పారిజాతం, శంఖుపువ్వులు, మందార, మల్లె, తులసి లాంటి మొక్కలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నాడు.
పశువుల ఎరువు మరియు సొంతంగా తయారు చేసుకున్న వానపాముల ఎరువు భూమికి అందిస్తూ పంటలు సాగు చేయడం వలన ఆ భూమిలో పెరిగే మొక్కలు వ్యాధినిరోధక శక్తిని పెంచుకుంటూ పెరుగుతున్నాయి కాబట్టి వీరు సాగు చేసే పంటలను చీడపీడలు పెద్దగా ఆశించటం లేదు. వంగ పంటను ఉదాహరణగా తీసుకుంటే రసాయన పద్ధతిలో సాగు చేసే వంగలో చీడపీడల ప్రభావం విపరీతంగా ఉండడము వలన విచక్షణా రహితంగా రసాయనాలను ఉపయోగిస్తూ వంగ పంటను పండిస్తుంటారు. కాని భూమిలో సేంద్రియ పదార్థం సక్రమంగా ఉండడముతో పాటు తగినంత సేంద్రియ ఎరువులను అందిస్తూ పంటలను సాగు చేసినట్లయితే విపరీతంగా రసాయనాలు అవసరమయ్యే వంగ లాంటి పంటలను కూడా రసాయనాలు ఏమాత్రం ఉపయోగించకుండా కేవలం సేంద్రియ పద్దతులు పాటిస్తూ చీడపీడలు ఆశించని వంగ దిగుబడిని తగినంత పొందవచ్చు అని పోలయ్య నిరూపిస్తున్నాడు. మరిన్ని వివరాలు 9666460129 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
మామిడి: కాయల కోతకు 30-40 రోజుల ముందు నీరు పెట్టడం ఆపితే కాయనాణ్యత పెరుగుతుంది. కాయలను చల్లటి వేళల్లో, కోత పరికరాలను ఉపయోగించి కోయాలి. కాయకు 5-7 సెం.మీ. తొడిమ ఉండేలా కోసి సొన అంటకుండా తలకిందులుగా ఉంచి, సొన మొత్తం కారిపోయిన తర్వాత తర్వాత గ్రేడింగ్ చేసుకొని అట్టపెట్టల్లో కాగితపు ముక్కలను ఒత్తుగా వేసి ప్యాకింగ్ చేయాలి. దూరప్రాంత రవాణా కోసం కాయలను కోసిన తర్వాత 10 గంటల్లోపు శీతల గిడ్డంగుల్లో 12.5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 80-90 శాతం తేమ వద్ద నిల్వ ఉంచాలి.
జామ: చెట్లను బెట్టకు గురి చేయడం ద్వారా ఆకులు రాలేలా చేసి, ఎండిన, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను, కాపు కాసిన కొమ్మలను చివరి నుంచి 5-6 సెం.మీ. లోపలికి కత్తిరించాలి.
ద్రాక్ష: వేసవి కత్తిరింపుల తర్వాత 9వ ఆకు ఏర్పడిన థలో కొమ్మల కొనలను గిల్లడం ద్వారా పిల్లకొమ్మల అభివృద్ధి జరుగుతుంది. కొత్త చిగుర్లలో పక్షికన్ను తెగులు సోకకుండా సరైన చర్యలు చేపట్టాలి.
సపోట: ముదురు తోటల్లో నీటి తడులు ఇవ్వాలి. తయారైన కాయలను ఉదయం వేళల్లో తొడిమతో సహా కోసుకోవాలి.
పనస: కళ్లు పూర్తిగా విచ్చుకొని, పసుపుపచ్చ రంగులోకి మారి సువాసనలు వెదజల్లే కాయలను కోయాలి. కోత తర్వాత ఎండిన రెమ్మలను తీసివేసి ఎలాంటి తెగుళ్ళు రాకుండా చర్యలు చేపట్టాలి.
దానిమ్మ: చెట్లకు పూర్తిగా విశ్రాంతి నివ్వాలి. బాక్టీరియా తెగులును అదుపులో ఉంచడానికి ఒక శాతం బోర్డోమిశ్రమాన్ని 20 రోజుల వ్యవధిలో 2-4 సార్లు పిచికారి చేయాలి.
రేగు: పాదుల దగ్గర మట్టిని తిరగబెట్టి నిద్రావస్థ థలో ఉన్న కాయతొలుచు పురుగులను నాశనం చేయాలి.
నిమ్మ: ఉష్ణోగ్రతలు 42 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు లీటరు నీటికి 5-10 గ్రా. సున్నం చొప్పున కలిపి పిచికారి చేస్తే అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే వీలుంటుంది. సున్నం పిచికారి చేశాక 15 రోజుల తర్వాత యూరియా లేదా పొటాషియం నైట్రేట్ (10. గ్రా./లీ. నీటికి) పిచికారి చేయాలి.
బొప్పాయి: 5 నెలలు దాటిన తోటల్లో ప్రతి మొక్కకు 25-30 లీటర్ల నీటిని డ్రిప్ ద్వారా ఇవ్వాలి. ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం పెరిగేకొద్ది ఆకుముడత, తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగుల నివారణకు సరైన చర్యలు చేపట్టాలి. తెల్లదోమ ఉధృతి నియంత్రణకు పసుపు రంగు జిగురు అట్టలను, పేనుబంక ఉధృతి నియంత్రణకు నీలంరంగు జిగురు అట్టలను ఎకరాకు 12-15 చొప్పున పంట ఎత్తులో అమర్చాలి.
కూరగాయలు
తీగజాతి కూరగాయలు: వేసవి దుక్కులు లోతుగా చేసుకొని నేలలో దాగి ఉన్న పురుగుల కోశస్థ థలు చనిపోయేలా చూడాలి. కంద, చేమ, పెండలం నాటడానికి అనువుగా భూమిని 30-40 సెం.మీ. లోతుగా దున్ని, తొలకరి వర్షాలకు 3-4 సార్లు గొర్రుతో మెత్తగా దుక్కిచేయాలి.
ఉల్లి: ఖరీఫ్ ఉల్లిసాగుకు అనువైన అగ్రిఫౌండ్ డార్క్రెడ్, నాసిక్ రెడ్, అర్కాకళ్యాణ్ రకాల నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకొని నారు పోసుకోవాలి.
పూల తోటలు: కొత్తగా పూల తోటలు సాగు చేయడానికి వేసవిలో లోతుగా దుక్కులు చేయాలి.
గులాబి: గులాబీ తోటల్లో నీరు పెట్టాలి.
కనకాంబరం: తోటలు వేయడానికి అవసరమైన నారును పెంచుకోవాలి.
తోటపంటలు: కొత్తగా కొబ్బరి నాటడానికి 1þ1þ1 మీ. సైజు గుంతలను 8þ8 మీ. దూరంలో చేయాలి. కాపుకాసే తోటల్లో వారానికి ఒకసారి నీరు పెట్టాలి. పళ్ళాలలో పచ్చిరొట్టను కోసి వేసి తేమ ఆరకుండా చూడాలి. తోటలను ఆశించిన సర్పిలాకార తెల్లదోమ యాజమాన్యం చేపట్టాలి.
తమలపాకు: మొదటి సంవత్సరం తోటలు వేయడానికి నేలను బాగా దున్ని ఎకరాకు 40 బండ్ల పశువుల ఎరువు, 20 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులు వేసి, 16-20 కిలోల అవిశ గింజలను సాలుకు సాలుకు మధ్య మీటరు దూరం ఉండేలా ఉత్తర-దక్షిణ దిశల్లో ఒత్తుగా విత్తుకోవాలి. రెండో సంవత్సరపు తోటల్లో వేడి గాలులు తోటలోనికి రాకుండా తోటచుట్టూ దడులు కట్టాలి.
జీడిమామిడి: చెట్ల పాదుల్లో ఎండు ఆకులు గడ్డి మల్చ్గా వేసి నేల తేమ ఆరకుండా కాపాడుకోవాలి.
సుగంధద్రవ్య పంటలు
మిరప: పొలాలను లోతుగా దుక్కి చేసి, చెత్తాచెదారాన్ని ఏరి కాల్చివేయాలి. సిఫార్సు చేసిన రకాల విత్తనాలను సేకరించుకోవాలి.
అల్లం: ఏప్రిల్లో నాటిన చోట చేతితో కలుపు తీయాలి. మురుగు నీటి కాలువలను సరిచేసుకోవాలి. మే నెలలో నీటి వసతి ఉంటే విత్తుకోవచ్చు.
పసుపు: పంటకు భూమిని లోతుగా దున్ని తొలకరి వర్షాలకు 2-3 సార్లు దుక్కి చేసి ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల ఆముదం పిండి లేదా వేపపిండి, 10 కిలోల జింక్ సల్ఫేట్ వేసుకొని స్వల్పకాలిక రకాలైన కస్తూరి, సుగుణ, సుదర్శన రకాలను మే నెల చివరిలో నాటుకోవాలి.
ఔషధ, సుగంధ పంటలు
పామా రోజా: విత్తనాన్ని ఎకరానికి 2 కిలోల చొప్పున ముందురోజు రాత్రి తడి ఇసుకతో మూటకట్టి మరుసటి నారుమళ్ళలో విత్తుకోవాలి.
కలబంద: పంటకు నేలను బాగా కలియదున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులు వేసుకోవాలి.
నిమ్మగడ్డి: పిలకలు నాటడానికి పొలం బాగా దున్ని ఆఖరిదుక్కిలో 4 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి.
కె. సాధన (9940236076), డా|| యమ్.ఆర్. భానుశ్రీ, డా. జె.డి. సరిత, డా. బి. పుష్పావతి, వ్యవసాయ కళాశాల, పాలెం, ప్రొఫెసర్ జయంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ.
వాతావరణ మార్పులు, తగ్గిపోతున్న వ్యవసాయ భూమి, జనాభా వృద్ధిరేటుకు అనువుగా లేని వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల మరియు ఆర్థిక మందగమనం మొదలైనవి మానవ ఆహార భద్రత మరియు పోషకాహార భద్రత పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో చౌకగా, వాతావరణ మార్పులను తట్టుకోనే అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహార పంటల వృద్ధి అవసరం ఎంతైనా ఉంది. చాలా దేశాలలో పోషకాహార లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల అధిక పోషణ వల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ (జీవనశైలి వ్యాధులు) మరియు స్థూలకాయత్వం మరి కొన్ని చోట్ల రెండు పూటలా ఆహారం తినే పరిస్థితి లేక పోషకాహార లోపాలు స్పష్టంగా చూస్తున్నాము. ఇటువంటి పరిస్థితులలో భూమి మీద నివసిస్తున్న సమస్త మానవ కోటికి సమతుల్య ఆహారం, పోషణ వైవిధ్యం, పోషకార భద్రత మరియు ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఆహార ఉత్పత్తి పంటల సరళిని మార్చి పోషకాహార భద్రత వైపు అడుగులేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం గా చేసుకుంటూ ముందుకు వెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి పరిస్థితులలో మన పెద్దలు సాగు చేసి తిన్నటువంటి జొన్నలు మరియు మిల్లెట్స్ పంటల సాగు విస్తీర్ణం పెంచడంతోపాటు, విలువ జోడించుట, కాలంతో పరిగెత్తుతున్న రోజుల్లో వండుకోవడానికి మరియు తినడానికి అనువుగా ఉండే వివిధ రకాల ఆహార పదార్థాల తయారీ, మార్కెటింగ్ సదుపాయాలు మొదలైనటువంటి కార్యక్రమాలను ఉధృతం చేసి ప్రజలందరికీ ఆరోగ్యమైన ఆహారాన్ని వంట గదికి చేర్చడానికి ఎంతో కృషి చేయవలసిన అవసరం ఉంది. ఇక్రిశాటు మిల్లెట్స్ను స్మార్ట్ఫుడ్గా పిలుస్తుంది ఎందుకంటే బలవర్ధకమైన పోషక విలువలను కలిగి ఉండడం వలన మానవులు ఆహారంగా తిన్నట్లయితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మిల్లెట్స్ పండించడానికి ఎక్కువ ఎరువులు మరియు పురుగు మందుల అవసరం ఉండదు. పంట పండించే సమయంలో వాతావరణం లోనికి తక్కువ కర్బన ఉద్గారాలను మిల్లెట్స్ వాతావరణంలోకి వదులుతాయి. కావున ఇది మన వాతావరణానికి ముఖ్యంగా విశ్వానికి ప్రయోజనం చేకూరుస్తుంది. అంతేకాకుండా మిల్లెట్స్ పంట కాల వ్యవధి తక్కువగా ఉండడం వలన తక్కువ సమయంలో రైతుకు పంట చేతికి అందుతుంది. ఈ విధంగా రైతులకు కూడా ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి అందుకే మిల్లెట్స్ను స్మార్ట్ ఫుడ్స్గా పిలుస్తారు.
మన భారత ప్రభుత్వం 2023 వ సంవత్సరాన్ని ప్రపంచ మిల్లెట్ సంవత్సరముగా జరపాలని ఐక్యరాజ్యసమితిని కోరడం జరిగినది. తద్వారా ప్రపంచానికి భారతదేశం కేంద్రముగా మిల్లెట్స్ ఉత్పత్తి, విలువ జోడించుట మరియు వాణిజ్యం జరగాలని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, భారత వ్యవసాయ పరిశోధన మండలి వారి మిల్లర్స్ రిసర్చ్ ఇన్స్స్టిట్యూట్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయ శాఖ, హైదరాబాద్ చుట్టూ ఉన్న చిన్న మరియు మధ్య తరహా మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కృషి చేస్తున్నాయి
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ జొన్నలు, మిల్లెట్స్ మరియు ఇతర చిరుధాన్యాలను పోషకధాన్యాలుగా పిలవాలని మరియు వాటి సాగు విస్తీర్ణంతో పాటు వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలందరికీ విస్తృతంగా తెలియజేస్తూ ప్రపంచంలో భారతదేశం మిల్లెట్స్ హబ్గా మారి మన రైతులకు, ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆరోగ్య భద్రత కూడా ఉండాలని 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలను చేపడుతూ ప్రజలను మరియు రైతులను చైతన్య పరుస్తూ భవిష్యత్తు ఆహార భద్రతకు మరియు రైతు ఆర్థిక భద్రత పునాదులు వేయడానికి కృషి చేస్తున్నాయి.
ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ రైతులు ఎక్కువ మొత్తంలో సాగు చేయడం లేదు, మిల్లెట్స్ ను పూర్వకాలంలో పేదలు తినే వారు అనే అపోహ, వండడం సులభతరంగా లేకపోవడం, ప్రాసెసింగ్ యంత్రాలు అందుబాటులో లేకపోవడం, కనీస మద్దతు ధర, మార్కెట్ సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వలన పోషక ధాన్యాల సాగు మనదేశంలో తగినంతగా లేదు.
మిల్లెట్స్ గురించి మీకు తెలుసా!
ద నిన్నటి ముతక ధాన్యాలు నేటి పోషక ధాన్యాలైన మిల్లెట్స్ – అలనాడు పేదవాడి ఆహారం ఈరోజు అది అందరి ఆహారం
మిల్లెట్ సాగులో చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది ఎందుకంటే అవి చాలా తెగుళ్లు మరియు వ్యాధులకు నిరోధకతను కలిగి ఉంటాయి. వివిధ రకాల వాతావరణ మార్పులను ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలుగుతాయి.
ప్రపంచ మిల్లెట్స్ ఉత్పత్తిలో మన దేశం వాటా సుమారు 40.62%. 2020 – 21వ సంవత్సరంలో సుమారు 17.58 మిలియన్ మెట్రిక్ టన్నుల పోషక ధాన్యాలను మన దేశంలో ఉత్పత్తి చేయడం జరిగినది.
2015-16 సంవత్సరం నుండి 2020-2021 సంవత్సరం వరకు స్మాల్ మిల్లెట్స్ ఉత్పత్తి రెండింతలు అయినది.
పోషక ధాన్యాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ మరోవైపు దురదృష్టవశాత్తు చిన్నపిల్లల్లో పోషకాహార లోపాలలో మన దేశం రెండో స్థానంలో ఉన్నది. సుమారు 32 శాతం చిన్నపిల్లలు వయసుకు తగ్గ బరువు లేరు, 36 శాతం మంది పిల్లలలో సరైన ఎదుగుదల లేదు. అంతేకాకుండా 15-49 సంవత్సరాల వయసు గల ఆడవారిలో 50 శాతానికి పైగా రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతున్నారు.
చాలా రకాల మిల్లెట్స్ వరి, బియ్యం మరియు గోధుమల కన్నా మూడు నుండి నాలుగు రెట్ల కన్నా ఎక్కువ పోషక విలువలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా పోషక ధాన్యాలలో ప్రోటీన్లు, విటమిన్లు, పీచు పదార్థం మరియు ఖనిజ లవణాలు అధిక మోతాదులో లభ్యమవుతాయి. అందుకే చిరుధాన్యాలు లేదా పోషక ధాన్యాలను సూపర్ ఫుడ్స్గా పిలుస్తారు.
దేశంలో పెరుగుతున్న పోషకాహార లోపాలను అధిగమించాలన్నా, జీవనశైలికి సంబంధించిన వ్యాధులను అరికట్టి ప్రజా జీవితాన్ని మెరుగు పరచాలంటే మిల్లెట్ సాగు మరియు మిల్లెట్స్ను రెగ్యులర్గా తినడం ఆచరణీయమైన పరిష్కార మార్గం.
మిల్లెట్స్ తినడం ద్వారా శరీరానికి కావలసిన మంచి శక్తితో పాటు, పుష్కలంగా దొరికే పీచు పదార్థం మరియు నెమ్మదిగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు తద్వారా రక్తంలోనికి గ్లూకోస్ నెమ్మదిగా విడుదలవుతుంది. ప్రీ డయాబెటిక్ పేషెంట్స్కు మరియు టైప్ (శిగిచీలి-2) 2 డయాబెటిస్ పేషెంట్స్కు మిల్లెట్స్ తినడం ద్వారా మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
చిరుధాన్యాలను తీసుకోవడం ద్వారా కలిగే అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ముఖ్యంగా వీటిలో అధిక మొత్తంలో పీచు పదార్థం, గ్లూటెన్ ఫ్రీ ప్రోటీన్లు, తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ మరియు ఇతర బయో యాక్టివ్ సమ్మేళనాలు కూడా అధికంగా ఉంటాయి.
జొన్నలు మరియు చిరుధాన్యాలలో సగటు కార్బోహైడ్రేట్ల 56.88-72.97%, ప్రోటీన్లు 7.5-12.5% మరియు కొవ్వు పదార్థాలు 1.3-6.0% ఉంటాయి. అంతేకాకుండా అతి ముఖ్యమైన పీచుపదార్థం, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు కూడా విరివిగా దొరుకుతాయి.
వివిధ పరిశోధనలో మిల్లెట్స్ విరివిరిగా తినడం ద్వారా క్యాన్సర్, స్థూలకాయత్వం, మధుమేహం, గుండె సంబంధ సమస్యలు, ఉబ్బసం, జీర్ణక్రియ సమస్యలు, కిడ్నీలో రాళ్ల సమస్యలు, తలనొప్పి మరియు మైగ్రేన్ వంటి సమస్యలను తగ్గించుకోవడంతో పాటు వ్యాధుల బారిన పడకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు.
చిన్నపిల్లలకు, కిషోర్ బాల బాలికలకు మరియు గర్భిణీ స్త్రీలకు మిల్లెట్స్తో చేసిన బలమైన పోషకాహార పదార్థాలను తినిపించడం ద్వారా వారిలో ఎదుగుదల మరియు ఆరోగ్యం మెరుగుపడిందని ప్రయోగపూర్వకంగా వివిధ రకాల పరిశోధనా సంస్థలు నిరూపించాయి.
పంట కోత అనంతరం మిల్లెట్స్ ను ప్రైమరీ ప్రాసెసింగ్ ద్వారా తినడానికి అనువుగాని బాగాలైన పొట్టు లేదా ఊక వంటి భాగాలను తొలగించి బియ్యంగా మార్చి వండుకొని తినడము లేదా పిండిగా మార్చి వివిధ రకాల ఆహార పదార్థాల తయారీలో ముడి సరుకుగా వాడుతారు.
ప్రైమరీ ప్రాసెసింగ్లో భాగంగా మిల్లెట్స్ను నానబెట్టడం, మొలకెత్తించి మాల్ట్ తయారు చేయడం, పెనం పైన వేయించడం, ఎండబెట్టడం, పాలిషింగ్ చేయడం మరియు మిల్లింగ్ చేసి పిండి, ఆటా మరియు రవ్వ వంటివి తయారు చేయడం.
మిల్లెట్స్ను సెకండరీ ప్రాసెసింగ్ విధానంలో పులియబెట్టి ఇడ్లీ, దోస, పునుగులు, పొంగనాలు, వడ మరియు డోక్లా వంటి ఆహార పదార్థాలు, పార్బోయిలింగ్ పద్ధతి ద్వారా బియ్యము మరియు రవ్వ వంటి ఆహార పదార్థాలను తయారు చేయడం, ఇన్స్టెంట్ కుకింగ్ మీల్స్ ముఖ్యంగా ఉప్మా, కిచిడి, పొంగల్, పులిహోర, పెరుగన్నం, పాయసం, బిర్యానీ మరియు పలావ్ వంటివి తయారు చేయవచ్చు, పఫ్ఫింగ్ ద్వారా మురుముర్లు, అటుకులు మరియు వివిధ ఇండస్ట్రీలకు అవసరమైన మిల్లెట్స్ ఇంగ్రెడైంట్స్ (ముడి సరుకు) ద్వారా వివిధ రకాల తినుబండారాలు, సౌకర్యవంతమైన వంట గదిలో వండుకునే ఆహార పదార్థాలు ముఖ్యంగా నూడిల్స్, వర్మిసెల్లి, పాస్తా, సూప్ మిక్స్, బేకరీ మిక్సెస్, కుకీస్, బిస్కెట్స్, పాన్ కేక్స్, కేక్ మిక్సెస్ మరెన్నో సంప్రదాయ ఆహార పదార్థాలను తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు.
100 గ్రాముల మిల్లెట్స్ తినడం ద్వారా సుమారు 320 -370 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇది మన దేశ జాతీయ పోషకాహార సంస్థ నిర్దేశించిన రోజుకు ఒక మానవుడు తీసుకునే శక్తి 2000 కిలో క్యాలరీలలో సుమారు 16-18.5%.
ప్రధానమైన తృణధాన్యాలతో పోలిస్తే మిల్లెట్లలో పిండిపదార్థం లేని పాలీశాకరైడ్లు మరియు డైటరీ ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉంటాయి.
మిల్లెట్స్లో అధిక మోతాదులో పీచు పదార్థం ఉండడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను మన శరీరానికి అందిస్తాయి. ముఖ్యంగా జీర్ణకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రక్తంలో చక్కెర మరియు కొవ్వుల నియంత్రణ.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయం మరియు అనుబంధ రంగాల సంస్థలు,స్వచ్ఛంద సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మరియు రైతు సంఘాలు మొదలైనవి మిల్లెట్స్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అందరికీ పోషక విలువలతో కూడిన ఆహారం లభించే విధంగా కృషి చేస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తూ మిల్లెట్స్ ఉత్పత్తి, ప్రాసెసింగ్ మరియు వాణిజ్యం విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుందని భావిద్దాం అది గుర్తు చేస్తూ మరొకసారి అందరికీ అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం 2023 శుభాకాంక్షలు.
‘విత్తనపు పొట్టేలు మందకు సగం బలం’ అనే నానుడి ఉంది. అంటే గొర్రెల మంద త్వరగా అభివృద్ధి చెంది, తద్వారా గొర్రెల కాపరికి ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది. మందలో సంతానోత్పత్తికి పనికిరాని పొట్టేళ్లు ఉండడము వలన, సరైన సంఖ్యలో పొట్టేళ్ళు లేకపోవడం వలన మంద అభివృద్ధి కుంటుపడుతుంది.
విత్తనపు పొట్టేలు సామర్థ్యమును ఆ పొట్టేలు ఉత్పత్తి చేసే వీర్య పరిమాణము వీర్యం యొక్క నాణ్యత మరియు వీర్యాన్ని ఆడ గొర్రెలలో ప్రవేశపెట్టడముపై ఆధారపడి ఉంటుంది. విత్తనపు పొట్టేలు యొక్క సామర్థ్యానికి రుజువు వాటి ద్వారా జన్మించే గొర్రె పిల్లలు.
విత్తనపు పొట్టేలు వలన కలిగే ప్రయోజనాలు:
మంచి లక్షణాలు కలిగిన విత్తనపు పొట్టేలు వలన పుట్టే గొర్రె పిల్లలు అధిక బరువును కలిగి, తక్కువ శాతము మరణాల బారిన పడతాయి. వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయి.
కవల పిల్లలు పుట్టే అనువంశిక లక్షణాలు ఉన్న జాతి విత్తనపు పొట్టేలును ఉపయోగించిన పుట్టే పిల్లలలో కవలలు పుట్టే లక్షణాలు కలిగి మంద అభివృద్ధికి తోడ్పడుతుంది.
ఒక గొర్రె లేదా మేక 2 సంవత్సరాలలో 3 ఈతలు ఈనడం వలన జీవాల పెంపకము లాభసాటిగా ఉండాలంటే మందలో తగినన్ని సంఖ్యలో పొట్టేళ్లు ఉండాలి.
విత్తనపు పొట్టేలు ఎంపికలో తీసుకోవలసిన సూచనలు:
గొర్రెల మందలో ప్రతి 20 లేదా 25 గొర్రెలకు ఒక విత్తనపు పొట్టేలు లేదా పోతు ఉండాలి. సాధారణంగా ఒక పొట్టేలు 2 లేదా 3 గొర్రెలను ఒక రోజులో దాటుతుంది. (జత కలుస్తుంది) ముఖ్యంగా ఎక్కువ శాతం (70%) గొర్రెలు వర్షాకాలంలో (జూన్-జూలై నెలల్లో) ఎదకు వస్తాయి. ఆ సమయంలో విత్తనపు పొట్టేళ్ల సంఖ్య తక్కువగా ఉంటే జత కలిసే అవకాశం మరియు చూలు నిలిచే అవకాశం తక్కువగా ఉంటుంది.
మందలో పుట్టిన పొట్టేలుపిల్లనే విత్తనపు పొట్టేలుగా కాపరులు ఎంపిక చేసుకుంటారు. దీని వలన పుట్టే పిల్లలు బలహీనంగా, తక్కువ బరువుతో పుట్టడం, పెరుగుదల లోపించడం అనువంశిక జబ్బులతో పుట్టడం జరుగుతుంది.
మందలో ఒక విత్తనపు పొట్టేలును 3 సంవత్సరాల కన్నా ఎక్కువ రోజులు ఉంచిన, తన రక్త సంబంధికులైన గొర్రెలను దాటడం వలన పుట్టే పిల్లలు బలహీనంగా తక్కువ బరువుతో పుడతాయి.
విత్తనపు పొట్టేలుగా 2-21/2 సంవత్సరాల వయసు ఉన్న పొట్టేళ్లను ఎన్నుకోవాలి. ఆ విధంగా ఎంపిక చేసుకున్నచో 21/2-5 సంవత్సరాల వరకు బాగా జత కలిసి చూలు కడతాయి. 2 సంవత్సరాల లోపు వయసున్న పొట్టేలు జత కలిసినా వీర్య నాణ్యత సరిగా ఉండకపోవడం వలన చూలు కట్టే శాతం తక్కువగా ఉంటుంది. 6 సంవత్సరాల పైబడిన పొట్టేళ్లలో జత కలిసే ఆసక్తి తగ్గి, చూలు కట్టే శాతం తక్కువగా ఉంటుంది. కావున 2-21/2 సంవత్సరాల పొట్టేళ్లను ఎన్నుకోవాలి. 5-6 సంవత్సరాల తరువాత వాటిని మంద నుండి తీసివేయాలి.
కవల పిల్లలలో ఒకటైన పొట్టేలు పిల్లను విత్తనపు పొట్టేలుగా ఎన్నుకుంటే, కవలలు పుట్టే అవకాశాలు అధికంగా ఉంటాయి.
మంచి జాతులైన పెరుగుదల ఎక్కువగా ఉండి, తొందరగా కోత వయసు వచ్చే జాతులైన నెల్లూరు, మాండ్యా, మేకలయితే బోయర్/బీటిల్/ఉస్మానిబాదీల పొట్టేలు/పోతులను ఎన్నుకోవాలి.
విత్తనపు పొట్టేలు యొక్క పుట్టిన బరువును, పెరుగుదలను పరిగణనలోకి తీసుకోవాలి.
విత్తనపు పొట్టేలు ద్వారా పుట్టిన పిల్లల పెరుగుదలను పరిగణనలోకి తీసుకోవాలి.
విత్తనపు పొట్టేలు భౌతిక/శారీరక లక్షణాలు:
ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలి. ఎటువంటి అంటువ్యాధులు ఉండకూడదు.
కాలిగిట్టలు బలంగా ఉండాలి. కాలిగిట్టల వాపు, గాయాలు ఉండకూడదు.
మోకాళ్ళు, భుజాలు, కాలి పిక్కలు, తొడలు బలంగా ఉండి కండపుష్టి కలిగి ఉండాలి.
పొట్టేలు యొక్క శరీర స్థితి (బాడీ స్కోరింగ్ 3-3.5) మంచిగా ఉండాలి. బలహీనంగా ఎక్కువ కొవ్వు పట్టి ఉండకూడదు.
మెడ భాగం బలిష్టంగా ఉండాలి.
నడుము, వీపు భాగము బాగా విస్తరించి బలంగా ఉండాలి.
ప్రక్కటెముకలు బాగా అభివృద్ధి చెంది ఉండాలి.
దంతాలు, కళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో పరీక్షించుకోవాలి.
వృషణాలు పెద్దవిగా, ఎక్కువ చుట్టుకొలత (32 సెం.మీ. కన్నా ఎక్కువ) ఉండాలి. అంటే దాదాపు / గ్రాము కణజాలము నుండి 20 మిలియన్ల వీర్యకణాల ఉత్పత్తి అవుతాయి. కాబట్టి 32 సెం.మీ. కన్నా ఎక్కువ చుట్టుకొలత ఉన్నట్లయితే ఎక్కువ స్కలించే వీర్య పరిమాణము, వీర్య నాణ్యత కలిగి ఉంటాయి.
వృషణాల చుట్టూ ఉండే చర్మము (స్క్రోటమ్) వృషణాలు అతుక్కొని, దగ్గరగా ఉండాలి. వదులుగా ఉండరాదు.
వృషణాలు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వేసవి నందు శరీరానికి దూరంగా, చలికాలం నందు శరీరానికి దగ్గరగా ఉండాలి.
విత్తనపు పొట్టేలు ఎద లక్షణాలు గుర్తించగలిగి, ఆడ గొర్రెలను దాటుటకు (జత కలుపుటకు) ఆసక్తి చూపాలి.
విత్తనపు పొట్టేలు / పోతును జత కలిపే సమయానికి ముందు సంసిద్ధము చేయుట
బ్రీడింగ్ సమయం ముందు విత్తన పొట్టేలు ఆరోగ్యంగా, సంతానోత్పత్తికి సిద్ధంగా ఉండడము వలన ఎక్కువ శాతం గొర్రెలు చూలు నిలిచి, రైతుకు లాభదాయకంగా ఉంటుంది. కావున పొట్టేలును 30-60 రోజుల ముందు భౌతికంగా పరీక్షించి, ఎటువంటి పద్ధతులు పాటించాలో కాపరులు తెలుసుకోవాలి.
సాధారణ ఆరోగ్యం: చురుకుగా ఉండాలి. మేత బాగా తీసుకోవాలి. నెమర బాగా వేయాలి. ఎటువంటి గాయాలు చీము గడ్డలు ఉండకూడదు.
అనారోగ్య లక్షణాలు: అసాధారణంగా ప్రవర్తన, నడక, పడుకోవడం లాంటివి ఉన్నప్పుడు తగిన చికిత్స చేయించడం, దగ్గు, జ్వరం, విరేచనాలు లాంటి అనారోగ్య లక్షణాలు ఉంటే గమనించి వైద్యం చేయించాలి.
వ్యాధి నిరోధక చర్యలు చేపట్టడం:
అంటువ్యాధులు సంభవించకుండా, టీకాలు ఇవ్వడం
గర్భస్రావాలు కలిగించే వ్యాధులైన బ్రూసెల్లోసిస్, విబ్రియోసిస్, ట్రైకొమోనియాసిస్ లాంటి వ్యాధులు లేకుండా చూసుకోవాలి.
బ్రీడింగ్ సీజన్ ముందే అంతర, బాహ్య పరాన్నజీవులను నిర్మూలించి పొట్టేలు ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకోవాలి.
బ్రూసెల్లోసిస్ లాంటి వ్యాధులు ఉన్నచో ఆ పొట్టేలును మంద నుండి తీసివేయాలి.
శరీర స్థితి (బాడీ స్కోరింగ్): మంచి శరీరస్థితి (బాడీ స్కోరింగ్ 3-4) ఉండాలి, బలహీనంగా లేదా ఎక్కువ కొవ్వు పట్టి ఉండకూడదు.
కళ్ళు మరియు కంటి శ్లేష్మ పొరలు:
కంటిచూపు ఉందో లేదో పరీక్షించాలి. కళ్ళ నుండి నీరు కారడము, అనువంశిక కంటి సంబంధ (ఎంటిరోపియాన్ లాంటి) సమస్యలు ఏమైనా ఉన్నచో చికిత్స చేయించాలి.
కంటిలోని శ్లేష్మ పొరలు గులాబి రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు, పాలిపోయి, ఎర్రగా కంది ఉన్నట్లయితే అనారోగ్యంగా ఉన్నట్టు. శ్లేష్మ పొరలు వాపు ఉండకూడదు.
మెడ మరియు తలను పరీక్షించాలి: గజ్జి క్రిములు, నీలినాలుక వలన నాలుక వాపు, కంటేజియస్ ఎక్తిమా (మూతి పుండ్లు, నాసల్ బాట్) లాంటి వ్యాధులు ఉన్నాయేమో పరీక్షించుకోవాలి.
కాళ్ళు మరియు కాలి గిట్టలు:
గిట్టలు ఆరోగ్యంగా ఉండి, ఎక్కువ పెరిగిన వాటిని కత్తిరించాలి.
గిట్టలు మధ్య భాగంలో ఏవైనా పుండ్లు గాయాలు ఉన్నాయో పరీక్షించాలి.
గిట్టలు ఆరోగ్యంగా ఉండి కుంటుబడకుండా ఉండే పొట్టేలు బాగా జత కలుస్తుంది.
కాళ్ళ నొప్పులు, కుంటుతూ ఉండడం గమనించి వైద్యం చేయించాలి.
ఉన్నిని కత్తిరించడం: ఉన్నినిచ్చే జాతులలో కళ్ళు చుట్టూ, పురుషాంగం చుట్టూ ఉన్నిని, శరీరంపైన ఉన్న ఉన్నిని బ్రీడింగ్ సీజన్ ముందు కత్తితరించాలి.
పురుషాంగం, పురుషాంగం చుట్టూ ఉన్న చర్మం:
పురుషాంగం యొక్క శ్లేష్మమును పరీక్షించాలి.
పురుషాంగము చుట్టూ ఉన్న చర్మము వాపుకు గురై వ్యాధి కలిగి ఉన్నట్లయితే దీనిని ”ఫిజిల్ రాట్” అంటారు. చికిత్స చేయించాలి. సంభోగ సమయంలో నొప్పి కలిగి ఉంటుంది.
యురేత్రాను పరీక్షించాలి.
వృషణాలు:
వృషణాలు రెండు సమాన పరిమాణము కలిగి ఉండాలి.
వృషణాలు మెత్తగా లేదా గట్టిగా లోపల గడ్డలు ఉండకూడదు.
నొక్కి చూసినప్పుడు దృఢంగా ఉండాలి.
వృషణాలు గాయాలు బారిపడి ఉండకూడదు, గాయాల నుండి కోలుకున్నను వీర్యోత్పత్తి తక్కువగా ఉంటుంది.
వృషణాలు శరీరం లోపల (క్రిప్టార్కిడ్) ఉన్న పొట్టేలును తీసివేయాలి.
వాపుకు గురి కాకూడదు, వాపుకు గురైనచో మంద నుండి తీసివేయాలి.
వ్యాధి కలిగి ఉన్నచో 2-3 వారాల పాటు వీర్య ఉత్పత్తిపై ప్రభావము చూపి, తక్కువగా ఉంటుంది.
ఎపిడిడమస్: వృషణాలు క్రింది భాగాన పరీక్షించిన బుడిపెలాంటి నిర్మాణం ఉంటుంది. దీనినే ‘ఎపిడిడమస్’ అంటారు. ఇది వాపునకు గురైనట్లయితే బ్రూసెల్లా వ్యాధి వలన వాపు కలిగినట్లు నిర్ధారణ అయితే పొట్టేలును మంద నుండి తీసివేయాలి.
వీర్యం: వీర్యం నీరు లాగా ఉంటే వంద్యత్వం ఉండే అవకాశం ఉంటుంది. వీర్యం ”క్రీమ్” రంగు ఉంటే వీర్య నాణ్యత బాగుంటుంది.
విత్తనపు పొట్టేలు మందలో ఉంచడం వలన పొట్టేలు యొక్క వాసన, శబ్దం మరియు పొట్టేలును చూడడం వలన ఎక్కువ శాతం గొర్రెలు ఎదకు వచ్చి చూలు కడతాయి. దీనినే పొట్టేలు ప్రభావం అంటారు.
విత్తనపు పొట్టేలును బ్రీడింగ్ సీజన్నకు 2-3 నెలలు ముందు మంద నుండి వేరు చేసి అకస్మాత్తుగా మందలోనికి తీసుకు రావడం వలన 70-80% గొర్రెలు ఎదకు వస్తాయి. దీనినే ”టెలిస్కోపింగ్” అంటారు.
యుక్త వయసుకు వచ్చిన కొత్త విత్తనపు పొట్టేళ్లను ఈతలు ఈనిన పాత గొర్రెలతో జత కలపవలెను.
అనుభవం ఉన్న పాత విత్తనపు పొట్టేళ్లుతో యుక్త వయసుకు వచ్చిన గొర్రెలను దాటించాలి.
ఎక్కువ వయసు (6 సం|| పైబడి) ఉన& పొట్టేళ్ల యందు బ్రూసెల్లోసిస్ వ్యాధి ఉండే అవకాశం ఉంది కావున వాటి రక్త నమూనాలు పరీక్షించి వ్యాధి ఉన్నవాటిని తీసి (ఏరి) వేయాలి. ఒక మంద నుండి ఇంకొక మంద వారు పొట్టేలు మార్పిడి చేసుకునే సమయంలో బ్రూసెల్లా లాంటి వ్యాధులు లేవని నిర్ధారణ చేసుకోవాలి.
అనువైన వాతావరణ పరిస్థితులు కల్పించాలి. శరీర ఉష్ణోగ్రత కన్నా వాతావరణ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వీర్య ఉత్పత్తిపై ప్రభావం ఉంటుంది. కావున వేడి నుండి కలిగే ఒత్తిడిని తట్టుకొనే విధంగా చర్యలు చేపట్టాలి.
పోషణ:
పోషణ అనునది పొట్టేలు లేదా పోతు యొక్క శరీర స్థితిని ప్రభావితం చేస్తుంది. పోషణ లోపం వలన బలహీనంగా ఉన్న పొట్టేలు జత కలుపుటకు ఆసక్తి చూపదు. శక్తి తక్కువగా ఉండడం వలన వీర్య నాణ్యత తక్కువుండి చూలు కట్టే శాతం తక్కువగా ఉంటుంది. ఎక్కువగా బలసిన పొట్టేళ్ళు చురుకుగా ఉండక జత కలిసేందుకు ఆసక్తి చూపవు.
బ్రీడింగ్ సీజన్ 2 నెలల ముందు పొట్టేలు 12% మాంసకృత్తులు కలిగిన 250 గ్రాముల దాణా లేదా 500 గ్రాములు కాయజాతి ఎండు గడ్డిని ఇవ్వాలి. ఈ విధంగా పోషించిన జత కలిసే సమయంలో వృషణాలు చుట్టుకొలత పెరిగి వీర్యోత్పత్తి అధికంగా ఉంటుంది.
పచ్చిక బయళ్ళు మేసే మందలలో బ్రీడింగ్ సీజన్ తరువాత పొట్టేళ్ళు దాదాపు 15% శరీర బరువును కోల్పోతుంది.
బ్రీడింగ్ సీజన్ ముందు విత్తనపు పొట్టేలుకు విటమిన్ ఏ, డి, ఇ లు ఇవ్వాలి. దీ
డా. వి. రామచంద్రారెడ్డి, సహాయ సంచాలకులు, ప్రాంతీయ పశుసంవర్థక శిక్షణా కేంద్రం, రెడ్డిపల్లి, అనంతపురం జిల్లా.
చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు (ఖరిజిజిలిశిరీ) ఆహార ధాన్యాలలో చిన్న గింజ కలిగిన గడ్డిజాతి పంటలు. ఇందులో ప్రాముఖ్యత సంతరించుకున్నవి 5 సిరిధాన్యాలు. అవి…
1. కొర్రలు
2. అరికలు
3. సామలు
4. ఊదలు
5. అండుకొర్రలు
సిరిధాన్యాల విశిష్టత:
సహజ పీచు పదార్థం కల్గి ఉండటమే సిరిధాన్యాల ప్రత్యేకత. మూడు పూటలా తిన్నప్పుడు, ఆ రోజుకు మనిషికి అవసరమైన 25-30 గ్రాముల పీచుపదార్థం (ప్రతీ మానవుడికి రోజుకు 38 గ్రాముల పీచుపదార్థం కావాలి) ధాన్యాల నుండే లభిస్తుంది. తక్కిన 10 గ్రాములూ కూరగాయల నుండి, ఆకు కూరల నుండి పొందవచ్చు. ఒక్కొక్క సిరిధాన్యమూ కొన్ని రకాల దేహపు అవసరాలనూ, ప్రత్యేకమైన రోగనిర్మూలన శక్తిని కలిగి ఉన్నాయి.
వరి, గోధుమలలో పీచు పదార్థం / ఫైబర్ ఉన్నప్పటికీ, అది ధాన్యపు పై పొరలలోనే ఉండబట్టి పాలిష్ చేస్తే పోతోంది. కానీ సిరిధాన్యాలలో పీచు పదార్థం గింజ మొత్తం పిండి పదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తిగా ఉపయోగపడుతుంది. అందువల్లనే ఇవి సిరిధాన్యాలయ్యాయని గుర్తించాలి.
1. కొర్ర బియ్యం – సమతుల్యమైన ఆహారం. 8 శాతం పీచుపదార్థంతో పాటు, 12 శాతం ప్రోటీను కూడా కలిగి ఉంది. గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారమని చెప్పవచ్చు. కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్ధకాన్ని కూడా పోగొట్టే సరైన ధాన్యమిది. పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినపుడు మూర్ఛలు వస్తాయి, అవి శాశ్వతంగా నిలుస్తూ ఉంటాయి
వాటిని పోగొట్టగలిగే లక్షణం వీటికి ఉంది, నరాల సంబంధమైన బలహీనతలకు సరైన ఆహారం కొర్ర బియ్యం. కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఉదర క్యాన్సర్, పార్కిన్సన్ రోగం, ఆస్మా (అరికెలతో పాటుగా) నివారించడంలో కూడా కొర్రబియ్యం ఉపయోగపడుతుంది.
2. అరికల బియ్యం – రక్త శుద్ధికీ, ఎముకల గుజ్జు సమర్ధవంతంగా పనిచేసేలా చూసేందుకూ, అస్తమా వ్యాధి, మూత్ర పిండాలు, ప్రోస్టేటు, రక్త క్యాన్సర్, ప్రేగులు, థైరాయిడ్, క్లోమ గ్రంధులు, కాలేయపు క్యాన్సర్లూ తగ్గించుకోవడానికి, అధికంగా చక్కెర వ్యాధి వారికి కూడా అరికలు మేలు చేస్తాయి. డెంగ్యు, టైఫాయిడ్, వైరస్ జ్వరాలతో నీరసించిన వారి రక్తం శుద్ధి చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి అరికలు.
3. సామ బియ్యం – మగ, ఆడ వారి పునరుత్పత్తి మండలంలోని వ్యాధులు బాగు చేస్తాయి. ఆడవారిలో పిసిఓడి తగ్గించుకోవచ్చు. మగ వారిలో వీర్యకరణాల సంఖ్య పెరుగుతుంది. ఇవికాక మానవుడి లింపు నాడీ వ్యవస్థ శుద్ధికి, మెదడు, గొంతు, రక్త క్యాన్సర్, థైరాయిడ్, క్లోమ గ్రంథుల క్యాన్సర్ల నియంత్రణకు సామలు వాడకం వల్ల ప్రయోజనం ఉంటుంది.
4. ఊద బియ్యం – థైరాయిడ్, క్లోమ గ్రంథులకు మంచివి. చక్కెర వ్యాధిని పారదోలుతాయి. కాలేయం,మూత్రాశయం, గాల్ బ్లాడరు శుద్ధికి పనిచేస్తాయి. కామెర్లను తగ్గించడానికి, వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఊదబియ్యం పనికి వస్తాయి.
మెట్ట భూముల్లో రసాయన ఎరువుల వాడకుండానే చిరుధాన్య పంటలు బాగా పెరుగుతాయి. అందువలన చిరుధాన్యాలను పండించే రైతులు పర్యావరణ పరిస్థితులలో పశువుల ఎరువునుపయోగించి వీటిని పండిస్తారు. ఇటీవలి కాలంలో రైతులు తమ పెరటిలో స్వయంగా తయారు చేసుకున్న వర్మికంపోస్టు తదితర జీవన ఎరువులను, పంటల పెరుగుదలను పెంచే పంచగవ్య, అమృతపాని మొదలగు వాటినుపయోగించి చిరుధాన్య పంటలను పండిస్తున్నారు.
చిరుధాన్యాల పంటల సరళి : సంప్రదాయ పద్ధతుల్లో పండించే చిరుధాన్య పంటలు కేవలం పంటలేకాక, ఈ చిరుధాన్య క్షేత్రాలలో జీవవైవిధ్యముంటుంది. ఒకే పొలంలో ఒకేసారి 6 నుండి 12 పంటలను సాగు చేస్తారు. దక్షిణ భారతదేశంలో పన్నెండు పంటల పద్ధతిలో చిరుధాన్య పంటలను ఆపరాలు, నూనెగింజల పంటలతో కలిపి సాగు చేస్తారు.
ఆహార భద్రత : వరి, గోధుమ వంటి పంటలు భారతదేశానికి ఆహారభద్రత అందిస్తే, చిరుధాన్యాలు ఆహారం, పోషకాలు, పశుగ్రాసాలు, పీచు, ఆరోగ్యం, జీవనాధారం, పర్యావరణం వంటి అనేక భద్రతలనందిస్తాయి. అనేక చిరుధాన్య పంటల కాండాలను పశువులు ఇష్టంగా తింటాయి. అనేకసార్లు జొన్న, సజ్జ వంటి పంటలను పశుగ్రాసాలుగానే సాగు చేస్తారు. పశుగ్రాసాలగానే కాక, చిరుధాన్య పంటలు పోషక నిలయాలుగా పోషక భద్రతనందిస్తాయి. సహచర పంటలుగా పండించే లెగ్యూమ్ జాతి పంటలు ఆకులను రాల్చి సహజ ఎరువుగా భూసారాన్ని వృద్ధి చేస్తాయి. ఆ విధంగా చిరుధాన్య పంటలు భూసారాన్ని ఉపయోగించుకోడమే కాకుండా భూమికి తిరిగి అందిస్తాయి.
ఏ సిరిధాన్యం ఏ యే వ్యాధులను తగ్గిస్తుంది?
1. కొర్రలు: నరాల శక్తి, మానసిక దృఢత్వం, ఆర్ద్రయిటిస్, పార్కిన్సన్, మూర్ఛరోగాల నుంచి విముక్తి.
* అందుబాటులో ఉన్న ధాన్యాలలో చిరుధాన్యాలు అతి తక్కువ అలర్జి కలిగించి, జీర్ణశక్తిని పెంచే ధాన్యాలు.
* చిరుధాన్యాలలోని నీటిలో కరుగని పీచు పదార్థం ట్రైగ్లిసరైడ్లను తగ్గిస్తుంది.
* చిరుధాన్యాలలో నరాల వ్యవస్థకు మంచి కలిగించే లెసితిన్ అధిక పరిమాణాలలో ఉంటుంది.
* చిరుధాన్యాలలో ఉండే మెగ్నీషియం మైగ్రెన్, అధిక రక్తపోటును, గుండెపోటులను తగ్గిస్తుంది.
* చిరుధాన్యాలు టైప్2 డయాబెటీస్ను తగ్గిస్తాయి.
* చిరుధాన్యాలలో జన్యుకోడ్ నిర్మాణానికి ముఖ్యమైన న్యూక్లిక్ యాసిడ్లలో ఉండే భాస్వరం ఎక్కువగా ఉంటుంది.
* చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే స్త్రీలలో మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటం, పిల్లల్లో ఆస్తమా సమస్యలు తగ్గుతాయి.
* మెనోపాజ్ తర్వాత స్త్రీలలో గుండె సమస్యలు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ మోతాదులను తగ్గించి చిరుధాన్యాలు లాభం కల్గిస్తాయి.
* చిరుధాన్యాలలో ఉండే బహుళ పోషకాలు కలిగిన లిగ్నాన్లు రొమ్ము క్యాన్సర్తో పోరాడి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.
చిరుధాన్యాలను ఏ భూముల్లో పండించవచ్చు
అనేక చిరుధాన్యాలను అతితక్కువ సారవంతమైన భూముల్లో పండించవచ్చు. కొన్నింటిని ఆమ్లభూముల్లో, కొన్నింటిని చౌడుభూముల్లో సాగు చేయవచ్చు. సజ్జను ఇసుక నేలల్లో కూడా సాగు చేయవచ్చు. నిజానికి రాగిని చౌడు భూముల్లో కూడా సాగు చేయవచ్చు. వరి పంట పండని భూముల్లో కూడా ఊదలు పండుతాయి. సమస్యాత్మక భూములను సరిచేయడానికి కూడా చిరుధాన్య పంటలు సాగు చేయవచ్చు
మెట్ట ప్రాంతాలలోని భూములు ఎక్కువగా సారం లేని భూములే. మెట్ట ప్రాంతాలలో వ్యవసాయాన్ని సుస్థిరపరచే పంటలు చిరుధాన్యాలే. చిరుధాన్య పంటలు సగటు వర్షపాతం 500 మి.మీ. కన్నా తక్కువ వున్న ప్రాంతాలలో, ఇసుక, ఆమ్ల నేలల్లో వర్షాభావ పరిస్థితులను తట్టుకుని దిగుబడులనివ్వగల సమర్థవంతమైన పంటలు
బి. నవ్య (గృహ విజ్ఞాన శాస్త్రవేత), డా. కిరణ్ పిల్లి, (మృత్తిక శాస్త్రవేత్త), డా. వినోద్ కుమార్ (విస్తరణ విభాగం శాస్త్రవేత్త), డా. ఎ. శ్రీనివాస్ (ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అండ్ హెడ్), కృషి విజ్ఞాన కేంద్రం, రామగిరిఖిల్లా, పెద్దపల్లి జిల్లా
పంటల సాగులో ఎరువుల వినియోగం చాలా కీలకమైనది. సాధారణంగా రైతులు ఎరువులు నేలకు నేరుగా వేస్తారు. భాస్వరం, పొటాష్ ఎరువుల్ని పైరు విత్తే ముందే వేస్తారు. నత్రజని ఎరువును 2-3 దఫాలుగా వేస్తారు. దీనివల్ల పైరుకు రెండు మూడు నెలల పాటు అవసరమయ్యే పోషకాలు ముందే వెయ్యటం వల్ల, అధిక శాతం ఎరువు వృథా అవుతున్నాయి. దీనివల్ల సాగు ఖర్చు పెరగటంతో పాటు నేల కాలుష్యం, వాతావరణ కాలుష్యం జరుగుతుంది. మరియు పైర్లు ఆశించిన స్థాయిలో పెరగక దిగుబడులు తగ్గుతున్నాయి.
ఇటీవలి కాలంలో ఎరువుల్ని పైరు ఎదుగుదల థలకు అనుగుణంగా ఎరువుల అవసరాన్ని బేరీజు వేస్తూ డ్రిప్ పద్ధతి నీటితో పాటుగా అందిస్తే ఎరువుల ఆదాతో పాటు పైరు దిగుబడులు గణనీయంగా పెరిగినట్లు పరిశోధనలలో తేలింది. దీని కోసం పంట మొక్కల వయసును బట్టి పోషకాల అవసరాన్ని లెక్కకట్టి, ఆయా పోషకాలకు కావలసిన ఎరువుల్ని నీటిలో కరిగించి, డ్రిప్ లైన్ల ద్వారా మొక్కల మొదళ్ల దగ్గర ఎరువు ద్రావణాన్ని అందిస్తారు. ప్రత్తి, చెరకు, మొక్కజొన్న వంటి ఆరు తడి పంటలకు మరియు టమాట వంగ వంటి కూరగాయ పంటలకు, బొప్పాయి, జామ వంటి పండ్ల తోటలకు నేరుగా ఎరువు ద్రావణాన్ని డ్రిప్ లైన్ల ద్వారా ఇవ్వటానికి అవసరమైన ఎరువుల మోతాదును, వినియోగించవలసిన ఎరువులను సిఫార్సు చేస్తున్నారు. పైరుకు అవసరమయ్యే పోషకాలు పైరు వివిధ థల్లో ఎరువు ద్రావణం రూపంలో డ్రిప్ ద్వారా అందించడాన్ని ఫెర్టిగేషన్ అంటారు.
ఫెర్టిగేషన్ పద్ధతిలో ఎరువు ద్రావణాన్ని ఫెర్టిగేషన్ ట్యాంకు ద్వారా గాని, వెంచురీ లేదా ఫెర్టిగేషన్ పంపు ద్వారా అందించవచ్చు. ఈ ఫెర్టిగేషన్ పరికరం డ్రిప్ యంత్రం కంట్రోలు హెడ్ దగ్గర అమర్చబడి ఉంటుంది. ఫెర్టిగేషన్ పరికరం ద్వారా వచ్చే ఎరువు ద్రావణం మెయిన్ లైన్లోని నీటితో కలిసి ఫిల్టరు ద్వారా మరల మెయిన్ లైన్లోకి వెళ్లునట్లు చేస్తారు. ఈ విధంగా చేయడం వలన ఎరువు ద్రావణంలో ఉన్న మలినాలు ఫిల్టరు అవుతాయి.
ఫెర్టిగేషన్ వల్ల కలిగే లాభాలు
* పైరు ఎదుగుదలకు అనుగుణంగా పోషకాలు అందించటం వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. పంట మొక్కలకు వయసును బట్టి కావల్సిన మోతాదులో పోషకాలు అందుతాయి.
* ఎరువులను నేరుగా మొక్క మొదళ్ల వద్ద అందించటం వల్ల వృథాను అరికట్టవచ్చు. ఎరువుల వినియోగం 25 శాతం తగ్గుతుంది.
* పంట దిగుబడి దాదాపు 30 నుండి 40 శాతం పెరిగే అవకాశం ఉంది.
* పంట ఉత్పత్తుల నాణ్యత మెరుగవుతుంది.
* వాలు ఎక్కువ ఉన్న పొలాల్లో డ్రిప్ ద్వారా ఎరువు అందించే పద్ధతి అత్యంత అనుకూలమైనది.
డ్రిప్ పద్ధతిలో సాగు చేసే పంటలకు ఎరువులు వాడకంలో మెలకువలు
* ప్రతిరోజు ఫెర్టిగేషన్ ద్వారా పోషకాలను అందించటం అత్యంత శ్రేయస్కరం. కనీసం వారానికి రెండుసార్లయినా పైర్లకు ఫెర్టిగేషన్ చెయ్యాలి.
* పంట మొక్క వయసు బట్టి పోషకాల అవసరం దృష్ట్యా సరైన ఎరువులను ఎంపిక చేసుకోవాలి.
* సాగు నీటి నాణ్యతను పరీక్షించుకోవాలి. సాగు నీటిలో అధిక కాల్షియం, మెగ్నీషియం, సల్ఫేట్, ఇనుము, మాంగనీసు గనక ఉంటే అవి ఎరువు సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.
* ఒకే ట్యాంకులో కలిపిన వివిధ ఎరువుల కంపేటబిలిటీ ఉండాలి.
* పంటకు సిఫార్సు చేసిన మొత్తం పోషకాల మోతాదు, పూర్తి పంటకాలానికి సరిపోయేలా రోజు వారి మోతాదును లెక్కగట్టాలి.
* ద్రవ లేదా పొడి రూపంలో ఉండే ఎరువులను టాంకులో కలిపేటపుడు, టాంకు పరిమాణంలో 70 శాతం మించకుండా ఉండేటట్లు జాగ్రత్త పడాలి. డ్రిప్ ద్వారా ఎరువులు అందించడం, డ్రిప్ సాగు నీరు పద్ధతిలో అంతర్భాగమై ఉండాలి.
* ఫెర్టిగేషన్ ప్రక్రియ ప్రారంభించే ముందు కొద్దిసేపు డ్రిప్ ద్వారా నీటిని వదలాలి. దీని వల్ల పొలం అంతటా సమానమైన ఒత్తిడితో నీరు విడుదలవుతుంది. ఫెర్టిగేషన్ తరువాత, కొనసాగింపుగా నీటిని డ్రిప్పర్ల ద్వారా కొద్దిసేపు పంపించాలి. దీనివల్ల పైపులలో మరియు డ్రిప్పర్లలో ఉండే ఎరువు అవశేషాలు కడిగి వేయబడతాయి.
పి. గురుమూర్తి, ప్రొఫెసర్ అండ్ హెడ్, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ విభాగం, వ్యవసాయ కళాశాల, నైరా-532185 ఫోన్: 9491567949
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, రబీ పంటలు మార్కెట్లకు బాగా వస్తున్నాయి. ప్రత్తి రేట్లు కొద్ది కొద్దిగా పెరుగుతున్నాయి. మిరప రేట్లు బాగాన్నాయి. టమాట ధరలు బాగా పడిపోయాయి. మిగతా కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయి. వరి ప్రొక్యూర్మెంట్ మే నెలలో కూడా కొనసాగే పరిస్థితి. ఎండలు సాధారణంగా ఉండవచ్చనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో మే నెల (భరణి, కృత్తిక, రోహిణి కార్తెలు)లో పలు పంటలలో చేయవలసిన వ్యవసాయ పనులను గురించి తెలుసుకుందాం. రాబోయే ఖరీఫ్ పంటకు ముందుగా చేయవలసిన పనులను కూడా తెలుసుకుందాం. చేతికొచ్చిన పంటను అమ్మేటపుడు గుర్తుంచుకోవలసిన మెళకువలు, సంఘాల సహకారం గురించి కూడా తెలుసుకుందాం.
వరి: మద్ధతు ధరకు మిల్లు యజమానులు తరుగు తీయకుండా వరిని కొంటామని ప్రకటించి దానికవసరమైన చర్యలు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నది. మిగతా ప్రభుత్వాలు కూడా ఈ విధమైన పద్ధతులు పాటించి రైతులకు మేలు చేయవచ్చు. తద్వారా పలుకుబడి పెంచుకోవచ్చు. చలికాలపు వరి పంట మే నెలలో కూడా మార్కెట్కు ఎక్కువగా వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా బియ్యం ఉత్పత్తి తక్కువగా ఉన్నదని ధరలు 2024 వరకు అధికంగా ఉంటాయని మార్కెట్ ఇంటలిజెన్స్ వారు తెలుపుతున్నారు. అందువలన నాణ్యమైన బియ్యానికి ధరలు బాగుంటాయని ఆశిద్దాం. వడ్లకు బదులు బియ్యాన్ని తయారు చేసి అమ్మడానికి రైతులు, రైతు సంఘాలు ప్రయత్నించండి. చిన్న చిన్న మొబైల్ రైస్ మిల్లులను రైతు ప్రజా సంఘాలు కొని, అద్దె ప్రాతిపదికన రైతులకిస్తే, రైతులు బియ్యాన్నమ్మే వారుగా ఎదుగుతారు. ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు లాభదాయకంగా ఉంటుంది. వడ్లను, అనుకూలమైన చోట, పాతవయ్యేంత వరకు నిల్వ చేసి బియ్యం చేసి అమ్మితే ఇంకా ఎక్కువ లాభం వచ్చే వీలున్నది. పల్లెల నుండి పట్టణాలకు వలసపోయిన వారి ఇండ్లు ఖాళీగా ఉన్నవాటిని వడ్ల నిల్వకు ఉపయోగించవచ్చు. నాణ్యమైన సన్నబియ్యానికి ధరలెక్కువగా వస్తున్నాయి. వచ్చే వర్షాకాలంలో కూడా ధరలెక్కువగా దొరికే సన్న బియ్యాలను సాగు చేయడానికి కావలసిన విత్తనాలను మే నెలలోనే తయారుగా పెట్టుకోండి. వర్షాకాలంలో నారుపోయుట రోహిణి కార్తెలో (25-5-23 నుండి 7-6-23 వరకు) మొదలు పెట్టుట ఆనవాయితి. నాటుకు నీరు పుష్కలంగా ఉన్న చోట రోహిణి కార్తెలో నారుపోసి తర్వాత నాటిన పంటలో చీడపీడల ఉధృతి చాలా తక్కువగా ఉండి దిగుబడి బాగా పెరుగుతుంది. కొత్త రకాలను కొద్ది భూమిలో పరీక్షించడానికి కొనవచ్చు. బాగా పండి, వాటికి ధరలు బాగుంటే తర్వాతి సీజన్లలో ఆ రకాల విస్తీర్ణాన్ని పెంచవచ్చు. విత్తనాలను ముందే తెచ్చి తయారుగా పెట్టుకోండి.
ప్రత్తి: రైతుల దగ్గర ప్రత్తి చాలామటుకు వ్యాపారస్తులకు అమ్ముడు పోగానే, ప్రత్తి ధరలు పెరుగుట క్రితం సంవత్సరం జరిగింది. ఇప్పుడు కొన్ని మార్కెట్లలో ప్రత్తి ధర క్వింటాలుకు 8000 దాటి పలుకుతున్నది. ఇది ఇంకా పెరగవచ్చని ఊహ. వర్షాలు తగినంత పడినా, లేక నీటి తడులివ్వడానికి అవకాశమున్నచోట మేనెల కడ వారంలో (రోహిణి కార్తెలో) ముంగారి ప్రత్తి విత్తడం అలవాటు. రోహిణిలో విత్తే పత్తిలో చీడపీడల బెడద ముఖ్యంగా గులాబి రంగు పురుగు ఉధృతి చాలా తక్కువ. ప్రత్తిని అధిక సాంద్రతలో (80þ20 సెం.మీ.) ఎకరాకు 25000 మొక్కలుండేటట్లు పెంచుకోవాలి. అధిక సాంద్రత విధానం, వర్షాధారంగానూ, నీటితడులిచ్చి కూడా పంటబెట్టవచ్చు. ఈ విధానంలో పంట త్వరగా పూర్తవుతుంది. తదుపరి పంటగా పెసర, మినుము, నువ్వులు, శనగ, వేరుశనగ సాగు చేయవచ్చు. నీటి ఆధారమున్న ప్రాంతాలలో ఎక్కువ దిగుబడులు సాధ్యపడతాయి. వర్షాలు పడకుండా బెట్టవచ్చినపుడు వీలున్నచోట నీటి తడి ఇచ్చి ప్రత్తి దిగుబడి బాగా పెంచవచ్చు. మీరు గమనించిన మంచి దిగుబడినిచ్చే రకాలనే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి నమ్మకంగా అధిక దిగుబడులు సాధించండి. కొత్త రకాలను కొద్ది విస్తీర్ణంలో సాగు చేసి, వాటి దిగుబడి, వాటికి వచ్చే ధర బాగుంటే ఎక్కువ విస్తీర్ణంలో వచ్చే సంవత్సరం ప్రయత్నించవచ్చు. ఇంటి దగ్గరే రైతులు సంఘాలుగా / గ్రూపులుగా ఏర్పడి బాగా బేరమాడి, మోసపోకుండా వ్యాపారులకమ్మితే మార్కెట్కు తీసుకెళ్లి అక్కడ పడే బాధల నుండి తప్పించుకోవచ్చు.
మొక్కజొన్న: చీడపీడల బాధ తక్కువగా ఉండి, అత్యధిక దిగగుబడులు సాధించడానికి మే చివరి వారం నుండి జూన్ మొదటి వారం వరకు విత్తాలి. ఈ సమయంలో భూమిలో తేమ విత్తనం మొలకెత్తడానికి సరిపడినంత ఉండాలి. బాగా వర్షం కురిసి గాని, నీటి తడి ఇచ్చిగాని విత్తాల్సుంటుంది. బెట్టలేకుండా నీటి తడులివ్వగలిగిన ప్రదేశాల్లోనే అత్యధిక దిగుబడులు సాధ్యమవుతాయి. ఎకరాకు 45-50 క్వింటాళ్ళ గింజ దిగుబడినివ్వగలిగిన ప్రైవేటు హైబ్రిడ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
అల్లం: ఈనెలలోపల విత్తవలసిన పంట. జూన్లో విత్తితే దుంపకుళ్ళు ఎక్కువై దిగుబడులు తగ్గుతాయి. అధిక దిగుబడి రకాలు: తెలంగాణకు: రియోడిజనీరో, మారన్; ఆంధ్రప్రదేశ్కు: రియోడిజనీరో, వైనాడ్లోకల్. అత్యధిక దిగుబడులకు ఎక్కువ ఎండ, ఎక్కువ వేడి, ఎక్కువ తేమ ఉన్న ప్రాంతాలు అనుకూలం. పాక్షిక నీడ గల్గిన ప్రాంతాలయిన పందిరి కూరగాయతోటలు, మామిడి, కొబ్బరి, బొప్పాయి, జామ, నిమ్మ తోటలలో కూడా ఈ పంట పండుతుంది. ఎకరాకు 600-800 కిలోల దుంపలు విత్తనానికి సరిపోతాయి.
పసుపు: 6-7 నెలల్లో త్రవ్వడానికి వచ్చే స్వల్పకాలిక పసుపు రకాలను ఆంధ్రప్రదేశ్లో నాటడానికి మే చివరి వారం అనుకూలం. అదే తెలంగాణలో అయితే జూన్ మొదటి వారంలో నాటాలి. అధిక దిగుబడినిచ్చే స్వల్పకాలిక రకాలు: ఐ.ఐ.ఎస్.ఆర్. ప్రతిభ: 185-190 రోజుల పంట; దిగుబడి: 15-16 ట/ఎ. రికవరి: 18.5 శాతం. ఐ.ఐ.ఎస్.ఆర్.ప్రభ: 195 రోజుల పంట, దిగుబడి: 15ట/ఎ. రికవరి: 19.5 శాతం.
నువ్వులు: తెలంగాణలో మే రెండవ వారంలోపు విత్తి అధిక దిగుబడి పొందవచ్చు. తర్వాత ఆగస్టు రెండవ పక్షం అనుకూలం. రాయలసీమలో మే-జూన్ నెలల్లో విత్తడం అనుకూలం. కోస్తా ఆంధ్రప్రదేశ్లో మే రెండవ పక్షంలో విత్తడం మేలు. అనుకూలమైన రకం- రెండు తెలుగు రాష్ట్రాలకు: జగిత్యాలతిల్-1 (జె.సి.ఎస్-1020): 90-125 రోజుల పంట. నువ్వుల దిగుబడి: 5-8 క్వి/ఎ. చలికాలం, వేసవి కాలాల్లో కూడా పంట పెట్టవచ్చు. ఈ నెలలో విత్తనోత్పత్తి చేపట్టి మంచి ఆదాయం పొందే అవకాశం.
కొత్తిమీర: ఎండాకాలంలో ఎదుగుదల తక్కువ. మసాలాలలో బాగా వాడతారు. రోగనిరోధక శక్తిని పెంచే గుణముంది. ఎండాకాలంలో బాగా గిరాకీ ఉన్న పంట. ఎకరాకు ఆదాయం లక్షకు పైమాటే. పాక్షిక నీడ గలిగిన తోట పంటలు, పందిర్ల క్రింద, షేడ్ నెట్లు, నెట్హౌస్లు, పాలీహౌస్లలో ఈ పంట బాగా వస్తుంది. ఎత్తైన కొండ ప్రాంతాల్లో వాతావరణం చల్లగా ఉన్న ప్రాంతాల్లో ఈ పంటను నీడలేకున్నా పండించవచ్చు. చవుడులేని పొలాల్లో పండించడానికి అనుకూలమైన కొత్తిమీర రకాలు: ద్వా, పంత్హరితిమా, కో-1, 2, 3. చౌడు భూముల్లో కూడా పెరిగే కొత్తిమీర రకం: కో-2. జూలై మొదటి పక్షం వరకు కొత్తిమీర ధరలు అధికంగా ఉండే అవకాశముంది.
పొదీన: ఎండాకాలంలో మంచి ఆదాయాన్నిచ్చే మరొక పంట పొదీనా. మసాలా వంటల్లో ఆకును వాడుతారు. తైలం తీసి కూడా మార్కెట్ చేయవచ్చు. అనుకూలమైన రకాలు హిమాలయ, శిలిక్, కోసి. దిగుబడి పొదీనా 15-20 ట/ఎ. నూనె తీస్తే 70-75 కిలోల నూనె/ఎ.
ఆకుకూరలు: పాలకూర: వేసవిలో మంచి గిరాకీ ఉంటుంది. చౌడు భూముల్లో కూడా కొద్ది తక్కువ దిగుబడితో పండుతుంది. మంచి రకాలు: ఊటీ: 24ట/ఎ. జాబ్నగర్ గ్రీన్: 16-19 ట/ఎ.
తోటకూర, ఎర్ర తోటకూర, మెంతికూర, చుక్కకూర, గోంగూర, పొన్నగంటికూర, సోయకూర, కొయ్యగూర మొదలైన ఆకుకూరలు కొద్దిపాటి నీటితో, కొద్దిపాటి భూమిలోనయినా పండించవచ్చు. మంచి ఆరోగ్యానికి, ఆకుకూరల వినియోగం పెరుగుతున్నది.
పూలు – కనకాంబరం: నాటిన 3 సంవత్సరాల వరకు పూస్తుంది. తొలి రెండు సంవత్సరాలలో పూత ఎక్కువ. తర్వాత తగ్గుతుంది. మే-జూన్ నెలల్లో నారు పోసుకుని, ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో నాటాలి. పూల కాడల్లో, పూలు తెంపడం పూర్తయినాక, ఖాళీ కాడలను, ఎండిన కొమ్మలను తీసివేస్తూ, అవసరాన్ని బట్టి, నీరు పెట్టి, సేద్యం చేస్తే, సంవత్సరం పొడవునా కనకాంబరం పూలను పొందవచ్చు.
టమాట: నీరు పుష్కలంగా ఉండడం వలన, టమాట ఎక్కువ విస్తీర్ణంలో పండించడం వలన దిగుబడి ఎక్కువ. ధరలు తక్కువగా ఉన్నాయి. విస్తీర్ణాన్ని నియంత్రిస్తేనే ధరలు పెరుగుతాయి. అధిక వర్షాలు/తుఫాన్లు/వడగండ్ల వానలు వంటి విపరీత పరిస్థితులొస్తే దిగుబడి తగ్గుతుంది. రేట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. తొలకరిలో మేఘావృత వాతావరణముంటే దిగుబడి తగ్గి ధరలు పెరగవచ్చు.
వంగ: ప్రస్తుతం టమాట రేట్లు తక్కువగా ఉన్నందున ఇతర కూరగాయలను పండించడానికి మొగ్గు చూపుతున్నారు. వంగ ధరలు టమాటల కంటే ఎక్కువగా ఉన్నందున ఈ పంట ప్రాచుర్యం పెరిగింది.
కీరదోస: వీటి వినియోగం సాలాడ్ కొరకు విపరీతంగా పెరుగుతున్నది. ఎండాకాలం ఇంకా గిరాకీ ఎక్కువ ఉన్నందున ధరలు బాగుంటాయి. రైతులు పండించి మంచి ఆదాయం పొందవచ్చు.
ఫ్రెంచిబీన్స్: ఎండాకాలంలో పాక్షిక నీడ ఉన్న ప్రాంతాలలో లేక చల్లటి కొండ ప్రాంతాలలో పంట తీయవలసి వస్తుంది. వెజ్ బిరియానీలో వాడకం ఎక్కువ. అందువలన ఎండాకాలం మంచి రేటొస్తుంది.
సిరిధాన్యాలు: బెట్టను తట్టుకునే శక్తి గలిగిన కొర్రలు, అండుకొర్రలు, అరికలు, సామలు, ఊదలు, తొలకరికి ముందు వచ్చే మంచి వర్షాలకు విత్తుకోవచ్చు. వర్షాధార భూముల్లో ప్రయత్నించవచ్చు. రోహిణిలో వచ్చే వర్షాలను లాభదాయకంగా ఉపయోగపెట్టవచ్చు. బెట్ట సమయములో తడి ఇవ్వగల ప్రదేశాల్లో దిగుబడి మరియు ఆదాయం ఎక్కువగా ఉంటాయి.
రోహిణిలో నీరున్న చోట పంటలు: నీరు బాగా ఉన్న చోట బెండ, గోరుచిక్కుడు, కాకర, పొట్ల, బీర, గుమ్మడి, సొర, విత్తుకోవచ్చు. కూరగాయల నార్లు పోసుకోవచ్చు. కంది, పెసర, మినుము పంటలను విత్తుకోవచ్చు. దానిమ్మ, రేగు మొక్కలను నాటవచ్చు. పామారోజా, కామంచి వంటి సువాసన మొక్కల విత్తనాలు విత్తుకోవచ్చు.
మామిడి: తయారైన కాయలను తెంపి, చెట్ల క్రింద వరిగడ్డి/బోదగడ్డిలో కార్బైడు వేయకుండా మాగబెట్టి ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చు. ప్రకృతి సిద్ధంగా మందులు వేయకుండా మాగబెట్టిన పండ్లు అని బోర్డు పెట్టుకోవాలి. రోడ్ల ప్రక్కన ఉన్న తోటల దగ్గర వ్యాపారం అనుకూలం.
పలు పంటల మీద, రైతు ప్రజా సంఘాల మీద, అధికారుల సేవలు ప్రజలకు ఇంకా ఎక్కువ ఉపయోగకరంగా మార్చే విధానాల మీద సంప్రదించడానికి 9494408619కు ఫోను చేయవచ్చు.
ప్రకృతి విపత్తులు, రైతుల కష్టాలు మార్కెట్లలో సరుకు నష్టాలు- పరిష్కార మార్గాలు
ఏప్రిల్, మే నెలల్లో పడే అకాల వర్షాలు, వడగండ్ల వానలు పంటను మార్కెట్కు తెచ్చినాక కూడా రైతులను విపరీతంగా నష్టాల పాలు చేస్తున్నాయి. ఈ బాధల నుండి రైతులను కాపాడాలి. ప్రభుత్వ విధానాలలో మార్పులు తేవాల్సిన అవసరముంది. రైతులు పండించిన పంటలను ఇండ్ల దగ్గరికే వచ్చి కొనే వ్యవస్థలను బలోపేతం చేయాలి. వ్యాపారులు ఒక్కొక్క రైతును మోసగించకుండా కాపాడడానికి ప్రతి జనావాసం/కుగ్రామం/గ్రామం/ పెద్ద ఊర్లలో రైతు ప్రజా సంఘాలను ప్రోత్సహించడం ఆచరణ సాధ్యం. ప్రజలు పట్టణాలకు వలస వెల్లడం వలన ఊర్లలో చాలా ఇండ్లు ఖాళీగా ఉంటున్నాయి. వీటిని రైతులు, రైతు సంఘాలు తమ పంటల ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి ఉపయోగిస్తే మంచి ధర వచ్చినపుడు అమ్ముకోడానికి వీలవుతుంది. ఈ పద్ధతులను ప్రోత్సహించడానికి విస్తరణ విభాగాలను సమాయత్తం చేయవచ్చు. మార్కెట్లో దొరికే రేటు, ఊర్లోనే, బాధలు లేకుండా రైతుకు దక్కించవచ్చు. దీనికి రైతు ప్రజా సంఘాలను మారుమూల పల్లెలతో సహా అన్ని జనావాసాలతో ఏర్పాటయ్యేటట్లు ప్రోత్సహించాలి. ఇప్పటికే ఉన్న వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను ఉపయోగించి వీటిని ఏర్పాటు చేయవచ్చు. బాధలు పడి, ఖర్చు భరించి పండిన పంటను మార్కెట్కు తీసుకొని పోయి, అక్కడే అమ్మాలనే పాలసీని మార్చాలి. రైతుల బాధలను తగ్గించాలి. ఇండ్ల దగ్గరే మంచి రేటుకు బాధలు లేకుండా అమ్ముకునేందుకు, ప్రభుత్వ యంత్రాంగం సహకరించే విధంగా విధాన మార్పులు తేవాలి.
ప్రజల/రైతుల కొరకు యంత్రాంగం: రైతుల/ప్రజల వద్దకు యంత్రాంగం అనే పద్ధతికి మారాలి. ఉత్పత్తిదారులకు/వ్యాపారులకు అనుసంధాన కర్తలుగా ఉత్పత్తిదారులకు సహాయపడేందుకు అధికారులను సమాయత్తం చేయాలి.
పలు రకాల కారణాల వలన ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాలలో కూడా ఇంటి పంటను చేపట్టే వారు పెరుగుతున్నారు. ఇంటిపంటదారుల సంఖ్య పెరిగేకొలది ఇప్పటి వరకే ఇంటి పంట మొదలు పెట్టిన వారికి మరియు కొత్తగా మొదలు పెట్టే వారికి అనేక రకాలుగా ఉపయోగం ఉంటుంది. మొదటలో కొద్ది మంది మాత్రమే ఇంటి పంటను చేస్తున్న సమయంలో విత్తనాల కొరకు, చిన్న చిన్న సలహాల కొరకు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఇంటి పంట దారుల సంఖ్య పెరిగే కొలది అనేక రకాల సమస్యలకు పరిష్కారాలు సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి ఇంటిపంట వైపు అడుగులు వేసే వారి సంఖ్య ఏఏటికాయేడు పెరుగుతూ ఉంది. ఇంటి పంట వైపు అడుగులు వేసేవారిలో అన్ని వర్గాల వారు, అన్ని వయసుల వారు ఉంటున్నారు. మిగతా వారితో పోల్చుకుంటే ఉద్యోగ బాధ్యతల నుంచి పదవీవిరమణ చేసిన వారికి ఇంటిపంట బాగా ప్రయోజనకారిగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తమకు అవసరమయిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల లాంటి వాటిని ఎలాంటి రసాయనాలు వేయకుండా ఆరోగ్యకరంగా పండించుకొని తింటూ తమ తమ ఆరోగ్యాలను కాపాడుకోవడంతో పాటు పదవీ విరమణ అయిన తరువాత ఎలాంటి వ్యాపకం లేకుండా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఇంటి పంట ఒక ఆరోగ్యకర వ్యాపకంగా ఉపయోగపడుతుండడంతో పదవీవిరమణ చేసిన వారికి అన్ని రకాలుగా ప్రయోజనకారి ఇంటిపంట అని గ్రహించి తాము చేస్తున్న ఉద్యోగాల నుంచి పదవీ విరమణ పొందిన తరువాత టెర్రస్ గార్డెన్ మొదలు పెట్టారు హైదరాబాదు మధురానగర్కి చెందిన వినయకుమార్, సృజన దంపతులు.
వినయ్కుమార్ పవర్గ్రిడ్లో మేనేజరు బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. సృజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని చేస్తూ పదవీ విరమణ పొందారు. వీరు తమ పదవీ విరమణ అయిన తరువాత ఒక మంచి వ్యాపకం కోసం 2020వ సంవత్సరములో తమ మిద్దె మీద మిద్దెతోటను ప్రారంభించారు. మిద్దెతోట వలన ఆరోగ్యకర ఆహారాన్ని పొందడముతో పాటు శారీరక శ్రమతో పాటు మానసిక ఉల్లాసం దొరుకుతుందని ఇటువైపు అడుగులు వేశారు. వారు మిద్దెతోటను ప్రారంభించే సమయానికి అనేక మంది ఇంటి పంటదారులు ఉన్నారు కాబట్టి కొన్ని రకాల మెళకువలు చేపట్టడానికి అవకాశం కుదిరింది. తెలుసుకున్న వెళకువలలో భాగంగా మొక్కల పెంపకానికి ఉపయోగించే కంటెయినర్ల విషయంలో ఎక్కువ ఖర్చు చేయకుండా తక్కువ ఖర్చుతో ఇంట్లో అందుబాటులో ఉండే వృథాగా పడవేసే టైర్లు, డబ్బాలు, నీటి డబ్బాలు, బక్కెట్లు, నూనె టిన్నుల లాంటి వాటితో పాటు స్క్రాప్ దుకాణాలలో తక్కువ ధరలో అందుబాటులో ఉండే కూరగాయల ట్రేలు, సూట్కేసుల లాంటి వాటిని అతి తక్కువ ధరలో సేకరించి వివిధ రకాల మొక్కల పెంపకం మొదలు పెట్టారు.
టెర్రస్ మీద నీళ్ళు పడితే స్లాబ్ పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి కంటెయినర్లను స్లాబ్ మీద పెట్టకుండా కొంచెం ఎత్తులో ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా ఎత్తులో ఏర్పాటు చేసుకోవడం వలన స్లాబ్ మీద పడిన నీరు వెంటనే ఆరిపోయి స్లాబ్ పాడవకుండా కాపాడుకోగలిగారు. మట్టి మిశ్రమానికి గాను మిద్దెతోట ప్రారంభించిన మొదటిలో ఒక ట్రాక్టరు ట్రక్కు మట్టిని కొనుగోలు చేసుకుని ఇప్పటివరకు ఆ మట్టిని వినియోగిస్తున్నారు. మట్టి మిశ్రమములో మట్టి, కోకోపిట్, ఎరువులను సమానంగా తీసుకుని దానికి కొద్దిమొత్తంలో వేపపిండిని కలిపి ఆ మిశ్రమాన్ని కంటెయినర్లలో నింపి మొక్కల పెంపకం మొదలు పెట్టారు.
విత్తనాల కొరకు కూడా పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. మిద్దెతోట ప్రారంభించిన కొత్తలో ఒక్కసారి మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయడం జరిగింది. తరువాత తమ మిద్దెతోటలోని మొక్కల నండి విత్తనాలను సేకరించి తాము ఉపయోగిస్తూ తోటివారికి అందిస్తూ ఉన్నారు. ఇందుకు గాను ఇంటి పంటను పెంచేవారితో కొన్ని గ్రూపులను ఏర్పాటు చేసుకుని ఆ గ్రూపులలో విత్తనాల గురించి, ఇంటి పంటకు సంబంధించిన విషయాల గురించి చర్చించుకుంటూ, ఒకరికొరకు చేదోడుగా ఉంటూ, విత్తనాలు, నారు లాంటి వాటిని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మిద్దె తోటను కొనసాగిస్తున్నారు. మొక్కలకు పోషకాలకు మరియు చీడపీడల నివారణకు గో-కృపామృతం, వేస్ట్డికంపోజర్, కిచెన్ వేస్ట్ ద్రావణాన్ని ఉపయోగిస్తున్నారు. అన్ని రకాల మెలకువలు తీసుకుంటూ తక్కువ ఖర్చుతో మిద్దెతోటలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. తమ మిద్దెతోటలో వివిధ రకాల ఆకుకూరలతో పాటు, వంగ, టమాట, చిక్కుడు, పచ్చిమిర్చి, చింత, ఉసిరి, స్ట్రాబెర్రి, జామ, సపోట, యాపిల్ బేర్, నిమ్మ, డ్రాగన్ఫ్రూట్, బత్తాయి లాంటి వాటితో పాటు తులసి, అరటి లాంటి మొక్కలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులలో పెంపకం చేస్తున్నారు.కొత్తగా ఇంటిపంటను చేపట్టేవారు కంటెయినర్ల విషయంలో ఎక్కువ
ఖర్చు పెట్టకుండా తమ ఇంట్లో వృథాగా పడి ఉన్న టైర్లు, వాటర్ క్యానులు, నూనె క్యానులు, బక్కెట్ల లాంటి వాటితో పాటు స్క్రాప్ దుకాణాలలో దొరికే కూరగాయల ట్రేలు, ప్లాస్టిక్ డబ్బాలు, బక్కెట్లు లాంటి వాటిని తక్కువ ధరలో కొనుగోలు చేసుకుని మొక్కల పెంపకం చేపట్టగలిగగితే ఖర్చులు తక్కువగా అవుతాయి. విత్తనాల విషయంలో తమ లాంటి ఇంటి పంట దారులను సంప్రదిస్తే విత్తనాలు అందుబాటులోవస్తాయి కాబట్టి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే కొత్తగా ఇంటిపంటను చేపట్టే వారిని వారు కోరుతున్నారు.
రసాయనిక వ్యవసాయం వలన జరుగుతున్న అనర్థాల నుండి బయటపడటానికి అనేకమంది రైతులు సేంద్రియ బాట పట్టారు. ఇంకా పడుతూనే ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. వినియోగదారులు కూడా ఆరోగ్యంపై అవగాహన పెరిగిన తరువాత సేంద్రియ ఉత్పత్తులవైపు మక్కువ చూపుతున్నారు. ఏదిఏమైనా కాని అటు రైతులు ఇటు వినియోగదారులు సేంద్రియంవైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. సేంద్రియ సాగు వలన తాము ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించుకొని సొంతంగా వినియోగించడముతో పాటు సమాజానికి కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. వీటన్నింటికంటే అతిముఖ్యంగా రాబోవు తరాల వారికి కలుషితం కాని భూమిని అందించవచ్చు. ఈ ఆలోచనతో అనేకమంది రైతులు సేంద్రియ బాట పడుతున్నారు. ఈ విధంగా ఆలోచించి తన తరువాత తర్వాత తరానికి కాలుష్యం కాని నేలనీ, ఆహారాన్ని అందించాలనే తలంపుతో తన రసాయనిక సేద్యాన్ని సేంద్రియంలోకి మార్చి వివిధ రకాల పంటలు పండిస్తున్నాడు వికారాబాద్ జిల్లా, బొంతారం మండలం, రొంపల్లె గ్రామానికి చెందిన రాజు.
రాజుది వ్యవసాయ నేపథ్యం. రాజు ప్రధాన వృత్తి వ్యవసాయం. 10వ తరగతి వరకు చదువుకొని వ్యవసాయంలోనే కొనసాగుతూ వస్తూ అందరి రైతుల లాగానే తన పంటల సాగులో రసాయనాలు వినియోగిస్తూ కొనసాగుతున్నారు. రసాయనిక సేద్యం వలన పెట్టుబడులు పెరగడముతో పంటల సాగు గిట్టుబాటు కాకపోయినా కూడా తన ప్రధాన వృత్తి వ్యవసాయమే కనుక ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తూ పంటల కొనసాగిస్తూ మిరప, కంది, పత్తి లాంటి పంటల సాగు కొనసాగిస్తున్నాడు. తాను చేస్తున్న వ్యవసాయంలో నష్టాలు రావటంతో పాటు విచక్షణా రహిత రసాయనాల వినియోగం వలన భూమి కలుషతం కావడం గమనించి ప్రత్యామ్నాయ పద్ధతుల అన్వేషణలో వేగం పెంచి సేంద్రియ సాగు గురించి తెలుసుకుని అందుకు సంబంధించిన వివరాలు సేకరించి సేంద్రియ సాగులో ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా కేవలం ప్రకృతి సిద్ధంగా లభిస్తున్న వస్తువులను ఉపయోగించవలసి ఉంటుందని తెలుసుకుని అటువైపు అడుగులు వేసి తన రసాయనిక సేద్యాన్ని 2018వ సంవత్సరములో సేంద్రియంలోకి మార్చటం జరిగింది.
సేంద్రియ సాగులో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకు సిద్ధమయ్యి వివిధ రకాల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేయడం మొదలు పెట్టాడు. సేంద్రియ సాగుకు అవసరమైన మన దేశీయ ఆవులను రెండింటిని పోషిస్తూ వాటి వ్యర్థాలను తన పంటల సాగులో వినియోగిస్తూ పంటల సాగు కొనసాగిస్తున్నాడు. తన ఈ 5 సంవత్సరాల సేంద్రియ సాగు అనుభవంలో అరటి, జామ, క్యారెట్, పెసర, మినుము, ఉల్లి, బొప్పాయి, కంది లాంటి పంటలు పండించాడు. ఈ సంవత్సరం కంది, ఉల్లి, బొప్పాయి పంటలు పండించాడు. కంది, ఉల్లి పంటలు దిగుబడి సాధించాడు. బొప్పాయి ఇంకా దిగుబడి వస్తూనే ఉంది.
కంది: అర ఎకరంలో కంది పంట పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేశాడు. ఇందుకు గాను నాటు రకం సొంత విత్తనాలను ఉపయోగించాడు. అర ఎకరానికిగాను బాగా మాగిన ఆవుల ఎరువు ఒక ట్రక్కు వేయడంతో పాటు పంటకాలంలో ప్రతి సారి 100 లీటర్ల చొప్పున 5 సార్లు అంటే 500 లీటర్ల జీవామృతాన్ని కంది పంటకు అందించాడు. చీడపీడల నివారణకు థపర్ణి కషాయం మరియు పంచగవ్యలను కలిపి పిచికారి చేయించాడు. అర ఎకరానికి గాను 450 కిలోల కందుల దిగుబడి పొంది కిలో 100/-ల చొప్పున నేరుగా వినియోగదారులకు అమ్మకం చేశాడు.
ఉల్లి: రెండున్నర ఎకరాలలో ఉల్లి సాగు చేస్తున్నాడు. రెండున్నర ఎకరాలలో ఒకేసారి కాకుండా రెండు దఫాలుగా నారు నాటించాడు. ఇందుకుగాను దుక్కిలో రెండున్నర ఎకరాలకు సుమారు మూడు ట్రక్కుల పశువుల ఎరువు తోలించాడు. నాటు రకం తెల్ల ఉల్లి రకం విత్తనాలను నారు పోసుకున్నాడు. రెండున్నర ఎకరాలకు సుమారు 5 కిలోల విత్తనం ఉపయోగించాడు. కిలో విత్తనం 650/-ల చొప్పున 5 కిలోలకు గాను 3250/-లు విత్తనం కొరకు ఖర్చు చేశాడు. జనవరి 15న నారు పోసుకుని 30 రోజులు పెరిగిన నారుని ప్రధాన పొలంలో నాటించాడు. ప్రధాన పొలంలో మడులు ఏర్పాటు చేసుకుని మడులలో నారు నాటించాడు. రెండున్నర ఎకరాలకు గాను ప్రతిసారి 500 లీటర్ల చొప్పున 3 సార్లు అంటే 1500 లీటర్ల జీవామృతాన్ని నీటి ద్వారా ఉల్లి పంటకు అందించాడు. చీడపీడల నివారణకు ఒకసారి థపర్ణి కషాయం మరియు పంచగవ్య మిశ్రమాన్ని పిచికారి చేయించాడు. మొదటి దఫా అంటే ఫిబ్రవరి రెండవ వారంలో నాటిన ఉల్లి ఏప్రియల్ 25 కి దిగుబడి పొందడం జరిగింది. ఎకరానికి 9000 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. కిలో 20/-ల చొప్పున నేరుగా వినియోగదారులకు అమ్మకం చేస్తున్నాడు.
బొప్పాయి: 4 ఎకరాలలో బొప్పాయి సాగులో ఉంది. ఎకరానికి 800 మొక్కల చొప్పున కో-15 రకం మొక్కలను ఒక్కొక్కటి 20/-ల చొప్పున 4 ఎకరాలకు గాను 3200 మొక్కలు కొనుగోలు చేసుకుని 2022 జనవరిలో నాటించాడు. 4 ఎకరాలకు గాను దుక్కిలో మూడు ట్రక్కుల కోడి ఎరువు అందించాడు. ప్రతి 20 రోజులకు ఎకరానికి 200 లీటర్ల చొప్పున జీవామృతాన్ని భూమికి అందించడంతో పాటు చీడపీడల నివారణకు పంచగవ్య, థపర్ణి కషాయం, పుల్లటి మజ్జిగలను ఇప్పటి వరకు 5 సార్లు పంటపై పిచికారి చేయించారు. 2022 జులై ఆఖరి వారంలో దిగుబడి మొదలయ్యింది. ఇప్పటి వరకు సుమారుగా ఎకరానికి 18 టన్నుల చొప్పున దిగుబడి పొంది టన్ను 11 వేల నుంచి 15 వేల రూపాయల వరకు అమ్మకం చేస్తూ వస్తున్నాడు. పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన కొనుగోలు దారులకు కిలో 11/- నుంచి 15/-లకు అమ్మకం చేస్తున్నాడు. కొద్ది మొత్తంలో కొనుగోలు చేసే వినియోగదారులకు మరియు సేంద్రియ దుకాణాలకు కిలో 24/-ల చొప్పున అమ్మకం చేస్తున్నాడు. వచ్చిన దిగుబడిలో సుమారుగా 20 శాతం వరకు 24/-ల చొప్పున అమ్మకం చేస్తూ వస్తున్నాడు. ఈ రకం బొప్పాయి వైరస్ రెసిస్టెంట్ అవడం వలన ఈ రకాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఇప్పటి వరకు వైరస్ మొక్కలు అసలు కనిపించలేదు. ఇంకా దిగుబడి వస్తూనే ఉంది. పంటను గమనించినట్లయితే ఎకరానికి ఇంకా 12 టన్నులకు తగ్గకుండా వచ్చేలా ఉంది. అంటే సుమారుగా ఎకరానికి 30 టన్నుల దిగగుబడి సాధించవచ్చు.
రసాయనిక వ్యవసాయం వలన జరిగే నష్టాల నుంచి బయట పడటానికి శారీరక శ్రమ ఎక్కువగా ఉన్న సేంద్రియ పద్ధతుల బాట పట్టి తాను ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ సమాజానికి విష రసాయనాలు లేని ఆహారాన్ని రాజు అందిస్తున్నాడు. మరిన్ని వివరాలు 8309861250 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
ఆహార ధాన్యాలన్నింటిలోనూ ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తవుతున్న పంట మొక్కజొన్న. మధ్య అమెరికా, మెక్సికో ప్రాంతాల్లో మొక్కజొన్నను తొలిగా పండించినట్లు చారిత్రక ఆధారాలు దొరికాయి. మొట్టమొదట్లో ఈ పంటను రైతులు సాగు చేసినప్పుడు ఒక మొక్కజొన్న కండెకు ఎనిమిది గింజలే ఉన్నట్లు నమోదైంది. ఇప్పుడు కొన్ని సంకర రకాల్లో కండెకు 800కి పైగా గింజలుంటున్నాయి. అంతేకాక మొక్కల సాంద్రత పెరగటం వల్ల దిగుబడులు వంద రెట్లకు పైగా పెరిగాయి. పంటలన్నింటిలోనూ సంకర రకాలు తొలిగా అభివృద్ధి చేసింది మొక్కజొన్నలోనే. 2021 -22లో ప్రపంచంలో 1216.87 మిలియన్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తయినట్లు అమెరికా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 2022-23లో మొక్కజొన్న ఉత్పత్తి 4.52 శాతం తగ్గి, 1161.86 మిలియన్ టన్నులుగా ఉండవచ్చని అభిప్రాయపడ్డది. మొక్కజొన్న ఉత్పత్తిలో అమెరికాదే అగ్రస్థానం. చైనా, బ్రెజిల్, ఆర్జెంటీనా, యూరోపియన్ యూనియన్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వాటి తర్వాత భారతదేశం ఆరవ స్థానంలో ఉన్నది. గత సంవత్సరం (2021-22)లో భారతదేశంలో 33.73 మిలియన్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తయినట్లు అంచనాలున్నాయి. గత సంవత్సరం రబీలో దేశంలో 20.22 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగవ్వగా 2022-23లో 22.98 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగవుతున్నట్లు ప్రాధమిక అంచనాలు తెలుపుతున్నాయి. భారత ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ సంవత్సరం దేశంలో 34.61 మిలియన్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి కావచ్చు. గత సంవత్సరం కన్నా 0.88 మిలియన్ టన్నుల మొక్కజొన్న అదనంగా పండవచ్చని భావిస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం గోధుమ ఉత్పత్తి 4.4 మిలియన్ టన్నులు పెరగ వచ్చని ప్రభుత్వం అంచనాలు తెలుపుతున్నాయి. చలికాలంలో ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా ఉండటం వల్ల ఆలస్యంగా పక్వానికి వచ్చి, దిగుబడులు పెరుగుతాయని భావిస్తున్నారు. వరి ఉత్పత్తిలో 0.3 మిలియన్ టన్నులు, మొక్కజొన్నలో 0.9 మిలియన్ టన్నులు, ఇతర ముతక ధాన్యాల్లో 0.7 మిలియన్ టన్నులు, అపరాల్లో 0.5 మిలియన్ టన్నులు అదనంగా ఉత్పత్తవుతాయని ప్రభుత్వం అంచనాలు తేటతెల్లం చేస్తున్నాయి. మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 323.55 మిలియన్ టన్నులుండవచ్చనే ఆశాభావంతో ప్రభుత్వం ఉన్నది. గత సంవత్సరం కన్నా 7.94 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు అధికంగా ఉత్పత్తవవచ్చనే అంచనా ఆశాజనకంగా ఉంది. ప్రపంచ జనాభాలో ప్రథమ స్థానం సంపాదించిన భారత్లో ఆహార కొరత ఉండకపోవచ్చని భావించవచ్చు. కానీ ఇప్పటికీ తలసరి ధాన్య లభ్యత భారత్లో తక్కువగానే ఉంది. ఆహార భద్రత విషయంలో దేశం ఇప్పటికీ కడగొట్టు దేశాల జాబితాలోనే ఉన్నది.
బహుళ వినియోగాలు
గత 60 సంవత్సరాల్లో ప్రపంచంలో మొక్కజొన్న సాగు రెట్టింపయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా మొక్కజొన్న సాగు 105 మిలియన్ హెక్టార్ల నుండి 198 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. ఇదే కాలంలో ఉత్పత్తి సుమారు ఆరు రెట్లు పెరిగింది. 1960లో 200 మిలియన్ టన్నులుగా ఉన్న ఉత్పత్తి ఇప్పుడు 1200 మిలియన్ టన్నులకు చేరింది. ఉత్పాదకత 1960లో హెక్టారుకు 2 టన్నుల దిగుబడి ఉండగా 2020 నాటికి దాదాపు 6 టన్నులకు పెరిగింది. విస్తీర్ణం రెట్టింపవ్వగా, దిగుబడి మూడు రెట్లు పెరగటం వల్ల, ఉత్పత్తి ఆరు రెట్లు పెరగటం సాధ్యపడింది. భారత దేశంలో 1950-51 సంవత్సరంలో 1.73 మిలియన్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తయింది. అప్పుడు మొక్కజొన్న సాగు కింద 3.16 మిలియన్ హెక్టార్లు మాత్రమే. 2020-21లో మొక్కజొన్న సాగు 9.9 మిలియన్ హెక్టార్లుగా నమోదైంది. ఖరీఫ్లో 7.7 మిలియన్ల హెక్టార్లలోనూ, రబీలో 2.2 మిలియన్ హెక్టార్లలోనూ ఈ పంట సాగవుతున్నది. గత 70 సంవత్సరాల్లో మొక్కజొన్న ఉత్పత్తి దేశంలో 20 రెట్లు పెరిగింది. విస్తీర్ణం 3.13 రెట్లు పెరగ్గా, దిగుబడి 6.4 రెట్లు పెరగటం వల్ల మొక్కజొన్న ఉత్పత్తిలో విప్లవాత్మక పెరుగుదల సాధ్యమైంది. సగటు దిగుబడి హెక్టారుకి 3.5 టన్నులకు చేరింది. ఖరీఫ్లో 22 మిలియన్ టన్నులు, రబీలో 12.6 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతున్నది. సగటు దిగుబడి ఖరీఫ్లో 2.87 టన్నులు మాత్రమే ఉండగా, రబీలో రెట్టింపు దిగుబడి (5.7 టన్నులు) లభిస్తున్నది. దేశంలో రబీ దిగుబడి ప్రపంచ సగటు దిగుబడికి సమీపంగా ఉన్నది. ఖరీఫ్ పంటలో దాదాపు 15 శాతానికి మాత్రమే సాగు నీటి వసతి ఉంది. రబీలో దాదాపు మొత్తం విస్తీర్ణానికి నీటి సదుపాయం లభిస్తున్నది. దిగుబడిలో తేడాకి ఇదే ముఖ్య కారణం కావచ్చు. మొక్కజొన్న నుండి 200కి పైగా ఉప ఉత్పత్తులు తయారు చేయవచ్చు. 40 ఉత్పత్తులైతే బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అమెరికాలో ఉత్పత్తవుతున్న మొక్కజొన్నలో 45 శాతం ఇథనాల్ తయారీకి వాడుతున్నారు. యూరోప్లో పారిశ్రామిక వినియోగం ఎక్కువ. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఎక్కువగా ఆహారానికే దీనిని వినియోగిస్తున్నారు. చైనాలో మొక్కజొన్న ఉత్పత్తిలో 60 శాతం పశువుల దాణాకు వాడుతుండగా, భారత్లో ఉత్పత్తవుతున్న మొక్కజొన్నల్లో సగభాగం కోళ్ళమేతకు వాడుతున్నారు. మొక్కజొన్నను ఎగుమతి చేసే దేశాల్లో అమెరికా, యుక్రెయిన్, ఆర్జెంటీనా, బ్రెజిల్, రష్యాలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. యుక్రెయిన్, రష్యాలు ఒక సంవత్సరానికి పైగా యుద్ధంలో నిమగ్నమై ఉండటంతో, వాటి ఎగుమతులు దెబ్బతిన్నాయి. ప్రపచ మార్కెట్లో సరఫరా తగ్గటంతో ధరలు పెరిగాయి. ఈ సంవత్సరం ప్రపంచ మొక్కజొన్న ఉత్పత్తి కొంత తగ్గవచ్చనే అనుమానంతో ధరలు ఎక్కువగానే ఉంటున్నాయి. గత సంవత్సరం భారతదేశం కూడా 1.7 మిలియన్ టన్నుల మొక్కజొన్నను ఎగుమతి చేసింది. అది ఈ సంవత్సరం మరికొంత పెరిగే అవకాశం కనిపిస్తున్నది.
తెలుగు రాష్ట్రాల్లో సాగు, దిగుబడులు:
దేశంలో అత్యధికంగా మొక్కజొన్న సాగు అయ్యే రాష్ట్రాలు మధ్యప్రదేశ్, కర్నాటకలు. ఈ రెండు రాష్ట్రాలు దేశంలో మొక్కజొన్న సాగయ్యే విస్తీర్ణంలో చెరి 15 శాతం వాటా కలిగి ఉన్నాయి. మహారాష్ట్రకు 10 శాతం, రాజస్థాన్కు 9 శాతం, ఉత్తరప్రదేశ్కు 8 శాతం వాటాలతో ముఖ్య రాష్ట్రాలుగా ఉన్నాయి. అయితే ఉత్పత్తిలో కర్నాటక, మధ్యప్రదేశ్ల తర్వాత బీహార్ మూడవ స్థానంలో ఉన్నది. ఉత్పాదకతలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. బీహార్లోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ రబీ మొక్కజొన్న వాటా ఎక్కువగా ఉంది. తెలంగాణాలో మొక్కజొన్న సాగు 6.63 లక్షల హెక్టార్లలో జరుగుతున్నది. 2540 కిలోల హెక్టారు సగటు దిగుబడితో 16 లక్షల టన్నుల మొక్కజొన్న ఉత్పత్తవుతున్నది. ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్న సాగు 3.01 లక్షల హెక్టార్లకే పరిమితం. తెలంగాణాలో సాగవుతున్న మొక్కజొన్న విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్లో సాగు విస్తీర్ణం సగం కన్నా తక్కువగా ఉంది. అయితే సగటు దిగుబడి 7055 కిలోలుగా ఉండటంతో దిగుబడి 21.21 లక్షల టన్నులుగా ఉంది. రబీలో ఎక్కువ విస్తీర్ణం ఉన్న గుంటూరు జిల్లాలో హెక్టారుకి 10,455 కిలోలు, పశ్చిమ గోదావరిలో హెక్టారుకి 9,108 కిలోల దిగుబడి నమోదవుతున్నది. కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఖరీఫ్ విస్తీర్ణం ఎక్కువగా ఉండటం వల్ల సగటు దిగుబడులు తక్కువగా ఉన్నాయి. తెలంగాణాలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సాంప్రదాయకంగా మొక్కజొన్నని పండిస్తారు. దక్షిణ తెలంగాణా జిల్లాలైన అవిభక్త రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో గతంలో జొన్న, సజ్జ, రాగి వంటి పంటలు సాగయ్యేవి. కానీ క్రమేపీ మొక్కజొన్న వాటి స్థానంలో ఈ జిల్లాలకు కూడా పాకింది. ఇక రబీలో అయితే నీటి వసతి ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో రబీ మొక్కజొన్న సాగువుతున్నది. ఈ జిల్లాల్లో ఎక్కువగా సాగయినా, దాదాపు అన్ని జిల్లాల్లోనూ రబీ మొక్కజొన్న వ్యాపించింది.
ఉత్పత్తి వ్యయం – ఆదాయం:
ఖరీఫ్ మొక్కజొన్న సాగుకి హెక్టారుకి రూ. 40 నుండి 50 వేల వరకు ఖర్చవుతున్నది. రబీ మొక్కజొన్న సాగుకి రూ. 60 నుండి 80 వేల వరకు ఖర్చవుతున్నది. ఖరీఫ్లో సగటున 25 క్వింటాళ్ళు, రబీలో సగటున 35 నుండి 50 క్వింటాళ్ళ వరకు దిగుబడులు లభిస్తున్నాయి. ఒక క్వింటాలు ఉత్పత్తి వ్యయం ఖరీఫ్లో రూ. 1500 నుండి 1800, రబీలో రూ. 1600 నుండి 2000 వరకు వస్తున్నది. ఈ సంవత్సరం మొక్కజొన్నకు కనీస మద్దతు ధర క్వింటాలుకి రూ. 1962గా ప్రకటించారు. మార్కెట్ ధరలు కనిష్టంగా రూ. 1500, గరిష్టంగా రూ. 2700 నాణ్యతను బట్టి లభిస్తున్నాయి. సగటు ధర రూ. 2000గా చాలా మార్కెట్లలో నమోదవుతున్నది. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్లో వాతావరణ ప్రతికూలతలనెదుర్కొంటున్న రైతులు 20 శాతం వరకు నష్టపోతున్నారు. రబీలో దిగుబడి నిలకడగా ఉంటున్నది కాబట్టి 90 శాతం రైతులు లాభిస్తున్నారు. అయితే లాభశాతం మాత్రం 10 నుండి 20 శాతం కన్నా మించటం లేదు. జొన్న, సజ్జ, రాగి, కొర్ర, సామ వంటి చిరుధాన్యాలకు సాపేక్షికంగా ఎక్కువ ధర లభిస్తున్నది. వాటికి ప్రకటించిన కనీస మద్దతు ధరలు కూడా మొక్కజొన్నతో పోలిస్తే ఎక్కువే. అయినా రైతులు వాటి సాగువైపు మళ్ళకపోవటానికి కారణం మార్కెటింగ్లో ఎదుర్కుంటున్న సమస్యలే. వాటికి కనీస మద్దతు ధర ఎక్కువగా ఉన్నా ప్రభుత్వాలు సేకరణ మద్దతు నందిస్తాయనే నమ్మకం రైతుల్లో లేదు. ప్రపంచ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా బడ్జెట్లో ‘సిరిధాన్యాల’కు ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రకటించారు. మార్కెట్ ధరలు కూడా ఆకర్షణీయంగానే ఉన్నా వాటిని పెద్ద ఎత్తున సాగు చేయటానికి రైతులు ధైర్యం చేయటం లేదు. జొన్న, సజ్జ, రాగి పంటలకు కనీస మద్దతు ధరలు మొక్కజొన్న కన్నా ఎక్కువగానే ఉన్నాయి. వాటితో పాటు కొర్ర, సామ, ఊద, అండుకొర్ర, వరిగ, ఆరిక వంటి సిరిధాన్యాలకు కూడా కనీస మద్దతు ధరల్ని ప్రకటించి, అవసరమైతే వాటిని కొనుగోలు చేస్తామనే హామీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. వాటి ఉత్పత్తి పెరిగితే ధరలు నిలుస్తాయనే నమ్మకం లేక రైతులు వాటి సాగుని చేపట్టటం లేదు. ఎందుకంటే మద్దత ధర ప్రకటించిన పంటల విషయంలో కూడా ధరలు తగ్గినప్పుడు కేంద్రం సేకరణ మద్దతు నందించటం లేదు. అలాంటప్పుడు కొత్త పంటలకు, జొన్న, సజ్జ, రాగి వంటి పంటలకు సేకరణ మద్దతు నందిస్తారనే నమ్మకం లేదు. అందుకే వర్షపాతం తగ్గినప్పుడు మొక్కజొన్న కన్నా వర్షాభావాన్ని తట్టుకోగలిగిన జొన్న, సజ్జ, రాగి, వరిగ, కొర్ర, అండుకొర్ర, సామ, ఊద, అరిక వంటి పంటలు రైతుల అభిమానానికి నోచుకోవటం లేదు. మార్కెట్లో గిరాకీ ఉన్న మొక్కజొన్న సాగునే ఇష్టపడుతున్నారు.
కోళ్ళ పరిశ్రమతో లింకు:
మొక్కజొన్నలను ఎక్కువగా కోళ్ళ పరిశ్రమలో దాణాగా వాడుతున్నారు. కోళ్ళ దాణాకు మొక్కజొన్నలు, సోయా చెక్క ముఖ్యమైన ముడి పదార్థాలు. మొక్కజొన్న ధరలు కనీస మద్ధతు ధర కన్నా తక్కువకు పడిపోయినప్పుడు కోళ్ళ పరిశ్రమ రైతులు లాభిస్తారు. కాని సోయాచెక్క ధరలు పెరిగినప్పుడు వారు దాణాకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకనుగుణంగా గ్రుడ్లు, మాంసం ధరలు పెరగకుంటే వారు నష్టాల పాలవుతారు. ప్రస్తుతం వేసవి ప్రభావం వల్ల గ్రుడ్లకు గిరాకీ తగ్గి ధరలు తగ్గాయి. ఒక్కో కోడి గ్రుడ్డు ఉత్పత్తిలో ఒక రూపాయి నష్టపోతున్నామని కోళ్ళ రైతులు వాపోతున్నారు. ఇలా మొక్కజొన్న ధర-కోడిగ్రుడ్ల ధర మధ్య వైరుధ్యం నెలకొని ఉన్నది. కోళ్ళ మేతతో పాటు మొక్కజొన్నను పశువుల దాణాకు కూడా వాడుతున్నారు. అంతేకాక ‘స్టార్చ్’ తయారీకి కూడా మొక్కజొన్నను వాడుతున్నారు. స్టార్చ్ని మందుల పరిశ్రమలోనూ, కాగితం తయారీలోనూ, జౌళి పరిశ్రమలోనూ విరివిగా వాడతారు. ప్రపంచంలో తలసరి స్టార్చ్ వినియోగం 6 కిలోలుంటే భారత్లో అది 1.5 కిలోలు మాత్రంగా ఉంది. అయితే మొక్కజొన్న ఆధారిత స్టార్చ్ యూనిట్లు కూడా బియ్యం నూకలు, దారి మళ్ళుతున్న రేషన్ బియ్యం చౌకగా దొరుకుతుండటంతో వాటిని వాడుతున్నారు. ఇవికాక మొక్కజొన్న పిండిని అనేక వంటకాల్లో, స్నాక్స్ తయారీకి కూడా వాడుతున్నారు. కార్న్ఫ్లేక్స్ను పాలతో కలిపి ఫలహారంగా వాడుతున్నారు. ఇంకా ఎన్నో ఉపఉత్పాదనలను తయారు చేసే అవకాశాలను ఆహార శుద్ధి పరిశ్రమ పరిశీలిస్తున్నది. సాపేక్షికంగా తక్కువ చీడపీడలతో, అధిక దిగగుబడినిచ్చే సత్తా కలిగిన మొక్కజొన్న సాగుపై రైతుల ఆసక్తి పెరుగుతూనే ఉంది. వివిధ అవసరాలకు 40 మిలియన్ టన్నుల మొక్కజొన్న అవసరమని, పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 36 మిలియన్ టన్నులుగా ఉన్న ప్రస్తుత ఉత్పత్తి మరింత పెరిగి రైతులకు, దేశానికి మేలు కలిగే అవకాశం ఉంది.
డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త,
మనది వ్యవసాయాధారిత దేశం అయినప్పటికినీ, మన నేలలు, మన భౌగోళిక పరిస్థితులు, మన మానవ వనరులు.. అన్నీ కూడా వివిధ రకాల పంటల సాగుకు అనుకూలంగా ఉన్నప్పటికినీ, ఎక్కువ మంది రైతులు ఎక్కువ సార్లు తమ పంటల సాగులో లాభాలు ఆర్జించలేకపోతున్నారు. ఎక్కువ శాతం మంది రైతులు పంటలసాగులో నష్టాలను భరించవలసి వస్తుంది. వ్యవసాయం లాభసాటిగా లేకపోవటానికి ఉన్న కారణాలను రెండు రకాలుగా విభజించవచ్చు. వాతావరణం, ప్రకృతి వైపరీత్యాల లాంటి కారణాలు ఒక రకం కారణంగా చెప్పవచ్చు. ఈ రకం కారణాలు మన చేతులలో ఉండవు కాబట్టి ఇలాంటి సమస్యలకు పరిష్కారాలు లభించకపోవచ్చు. రెండో రకం కారణాలుగా మన చేతులలో ఉండే విత్తన ఎంపిక, ఏక పంట విధానం, సరైన అవగాహన, పెట్టుడులు లేకపోవడము, అవసరమయిన సమయానికి చర్యలు చేపట్టలేకపోవడము, సరైన ప్రణాళిక వేసుకోలేకపోవడం… లాంటి కారణాల వలన కూడా రైతులు నష్టాలు భరించవలసి వస్తుంది. ఈ రెండో రకం సమస్యలు రైతుల చేతులలో ఉంటాయి కాబట్టి వాటికి రైతులు సరైన పరిష్కార మార్గాలు అన్వేషించి అమలు పరచగలిగితే పంటల సాగు లాభసాటిగా మలుచుకోవచ్చు అనే విషయం అనేకమంది రైతుల అనుభవాలు చెబుతున్నాయి. ఈ తరహాలో ఆలోచించి పక్కా ప్రణాళికతో తమ వ్యవసాయాన్ని లాభాల బాటలో నడిపిస్తున్నారు విశాఖపట్టణం జిల్లా, బక్కనిపాలెంలో రెండు ఎకరాల కంటే తక్కువ పొలంలో పక్కా ప్రణాళికతో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్న రైతు దపంతులు పార్వతి, మాధవ్.
మాధవ్ సివిల్ ఇంజనీరుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తరువాత వీరు వేరే రంగాల వైపు ఆలోచించకుండా వ్యవసాయరంగంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం మనం తినే ఆహారంలో ఉండే విష రసాయన అవశేషాల వలన మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి కాబట్టి మన ఆరోగ్యం కాపాడుకుంటూ తోటి వారికి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలంటే వ్యవసాయం చేయాలని, అదీను సేంద్రియ సాగు చేయాలనే తలంపుతో విశాఖపట్టణం జిల్లా మధురవాడ సమీపములోని బక్కనిపాలెం గ్రామంలో సుమారు రెండు ఎకరాల పొలం తీసుకుని ఆ పొలంలో పూర్తి సేంద్రియ పద్ధతులతో వివిధ రకాల కూరగాయలు, కొన్ని రకాల పండ్ల సాగు మొదలు పెట్టారు.
ప్రస్తుతం వ్యవసాయం చేసే రైతులు చాలావరకు లాభాలు ఆర్జించలేకపోతున్నారు కాబట్టి అందుకు కారణాలు తెలుసుకుని అవే సమస్యలు తలెత్తకుండా వీరు జాగ్రత్తపడుతూ పక్కా ప్రణాళికతో పంటల సాగు కొనసాగిస్తున్నారు. సాధారణంగా పంటల సాగులో వచ్చే ప్రధాన సమస్యలు అయిన ఎక్కువ పెట్టుబడులకు పరిష్కారంగా సేంద్రియ బాటపట్టి తామే సొంతంగా సేంద్రియ సాగులో అవసరమయ్యే వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు, సేంద్రియ ఎరువులు తయారు చేసుకుంటూ పెట్టుబడి తగ్గించుకుంటున్నారు. కలుపు సమస్య పరిష్కారానికి పొలం మొత్తం బెడ్లు వేసి బెడ్లపై మల్చింగ్ షీటు పరచి విత్తనాలు లేదా మొక్కలు నాటుతున్నారు. తీగజాతి కూరగాయలకు కూడా తక్కువ ఖర్చుటో ఇంటూ (þ) పందిరి వేసుకున్నారు. సంవత్సరం పొడవునా పలు రకాల పంటల సాగుకు వీలుగా పంటలు సాగు చేస్తున్నారు. ఆశాజనకమైన ధరలు పొందాలంటే సొంత మార్కెటింగ్ సరైన పరిష్కారం అని గ్రహించి తాము పండించే పంటలను సాధ్యమయినంత వరకు నేరుగా వినియోగదారులకు అమ్ముతున్నారు. ఈ విధంగా అన్ని విషయాలను పరిశీలిస్తూ పక్కా ప్రణాళికతో పంటలు సాగు చేస్తూ తమ వ్యవసాయాన్ని లాభాల బాటలో నడిపిస్తున్నారు.
గడచిన రబీ సీజనులో సుమారు ఎకరం పొలంలో బీర పంట సాగు చేశారు. ఇందుకుగాను ఐఐహెచ్&ఆర్ బెంగుళూరు నుంచి అర్క ప్రసన్న విత్తనాలను ఎంపిక చేసుకున్నారు. ఈ విత్తనాలు సూటి రకం విత్తనాలు కాబట్టి ప్రతిసారి విత్తనాలను కొనుగోలు చేయకుండా రైతులు తమ పంట నుండి విత్తనాలను సేకరించుకొని మరలా నాటుకోవచ్చు కాబట్టి ఈ విత్తనాలను ఎంపిక చేసుకున్నారు. ఎకరానికి గాను సుమారు 750 గ్రాముల విత్తనం అవసరం పడింది. బీర పంట అయిన తరువాత ఈ పొలంలో వంగ, పుచ్చ లాంటి పంటలు వేయాలనే లక్ష్యంతో ఉన్నారు కాబట్టి రెండు బెడ్ల మధ్య దూరం అందుకు అనుకూలంగా పెట్టుకుని బెడ్లపై మల్చింగ్ షీటు పరచి, మల్చింగ్ షీట్కి రెండు వసరులలో రంధ్రాలు చేసుకుని రంధ్రాలలో బీర విత్తనాలను నాటించారు. బీర నాటిన 15 రోజులకు బీర తీగ మొదలయ్యింది. తీగ పాకటానికి అనుకూలంగా తక్కువ ఖర్చులో ఇంటూ (þ) పందిరి ఏర్పాటు చేసుకున్నారు. బీరలో వచ్చే చీడపీడల నివారణకు పసుపుపచ్చ జిగురు అట్టలు, సోలార్ దీపపు ఎర, పండుఈగ ఎరల లాంటివి ఏర్పాటు చేసుకోవడంతో పాటు అవసరాన్ని బట్టి వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు పిచికారి చేశారు. దుక్కిలో పశువుల ఎరువు, ఘనజీవామృతం, మేకల ఎరువు అందించడంతో బాటు క్రమం తప్పకుండా జీవామృతం, బియ్యం కడిగిన నీటిని నేలకు అందిస్తూ రావడం వలన ఎలాంటి చీడపీడలు ఆశించని నాణ్యమైన దిగుబడి పొందారు. ఎకరం పొలం నుంచి సుమారు 6000 కిలోల బీర దిగుబడి పొంది సగటున కిలో 25/-ల చొప్పున అమ్మకం చేశారు. బీర పంట కాపు మొదలయ్యే సమయానికి బెడ్ల మధ్యలో వంగ మరియు పుచ్చ విత్తనాలు నాటారు. వంగ పంట ఇప్పుడే దిగుబడి మొదలయ్యింది. రోజుకు 50 కిలోల వరకు వంగ దిగుబడి పొందుతున్నారు. పుచ్చ పంట దిగుబడి ఇంకా రావాల్సి ఉంది.
వీటితో పాటు కొన్ని రకాల ఆకుకూరలు, అరటి, మునగ, సపోట, నిమ్మ, బత్తాయి, బొప్పాయి, పసుపు, అల్లం, తినే ఉసిరి, నారింజ, చిక్కుడు, బెండ లాంటి మొక్కలను / పంటలను సాగు చేస్తూ పొలం చుట్టూ వెదురు నాటించారు. తాము సాగు చేసే పంటలన్నింటికి దుక్కిలో ఘనజీవామృతం, పశువుల ఎరువు, మేకల ఎరువు అందించడంతోపాటు క్రమం తప్పకుండా జీవామృతం, బియ్యం కడిగిన నీరు, కిచెన్ వేస్ట్ ద్రావణం, వేరుశనగ చెక్క, వేపచెక్కల ద్రావణం లాంటివి భూమికి అందించడంతో పాటు పంచగవ్య మరియు వివిధ రకాల కషాయాలను పంటపై పిచికారి చేస్తూ ఆరోగ్యకరమైన దిగుబడి పొందుతున్నారు. మరిన్ని వివరాలు 8978198938 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
వేరుశనగ, వేపచెక్కల ద్రావణం: 100 లీటర్ల నీటిలో 5 కిలోల వేరుశనగ చెక్క మరియు ఒక కిలో వేప చెక్క లేదా వేపపిండిని వేసి ప్రతిరోజు రెండు సార్ల చొప్పున కలుపుతూ ఉంటే 5 నుంచి 7 రోజులలో ద్రావణం తయారవుతుంది. ఈ విధంగా తయారైన ద్రావణాన్ని 15 రోజులకు ఒకసారి బీర పంటకు డ్రిప్పు ద్వారా భూమికి అందించారు.
బియ్యం కడిగిన నీరు: 10 కిలోల బియ్యాన్ని 200 లీటర్ల డ్రమ్ములో వేసి రెండు రోజులు కలిపిన తరువాత మూడవ రోజున ఈ ద్రావణాన్ని డ్రిప్పు ద్వారా పంపించి మరలా ఆ డ్రమ్ములో నీటిని నింపుతారు. ఈ విధంగా ప్రతి రెండు లేదా మూడు రోజులకు ఒకసారి బియ్యం కడిగిన నీటిని పంపుతుంటారు. నెలకు ఒకసారి ఆ డ్రమ్ములో 10 కిలోల బియ్యం వేస్తుంటారు. ఈ నీటిలో కొన్నిసార్లు కిచెన్ వేస్ట్ ద్రావణాన్ని కూడా కలుపుతుంటారు.
మనది వ్యవసాయక దేశం. మన తాతలు చేసింది నిజమయిన వ్యవసాయం. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచానికి వ్యవసాయంలో సరైన దారి చూపింది మన పూర్వీకులే అని చెప్పవచ్చు. ప్రపంచంలోని ఏదేశములో పాడి-పంటకు అనుబంధం ఉండదు. ఒక భారతదేశంలోనే పాడికి పంటకు అనుబంధం ఉంటుంది. అందుకే మన పూర్వీకులు పాడి-పంట అంటుండేవారు. అంటే పాడి లేకుండా పంట, పంట లేకుండా పాడి ఉండవు… ఉండకూడదు. ఈ రెండూకూడా విడదీయరాని… విడదీయకూడని అంశాలు. దానిని గమనించి తప్పనిసరిగా ఒక ఎకరానికి ఒక గేదె చొప్పున పోషించగలగాలి.
దానినే వ్యవసాయం అంటారు.
లేకుంటే … అంటే పాడి లేకుండా పంటలు పండించే దానిని వ్యవసాయం అనరు. అనకూడదు అంటున్నారు ఏలూరు జిల్లా కొత్తగూడెంకు చెందిన గద్దె సతీష్బాబు.
సతీష్బాబుది వ్యవసాయ నేపథ్యం. వారి పూర్వీకుల నుంచి వ్యవసాయమే వృత్తిగా కొనసాగుతూ వచ్చారు. వ్యవసాయం అంటే ఒక్క పంటల సాగే కాదు. పాడి పశువులను కూడా పోషిస్తూ పంటల సాగు చేస్తూ వస్తున్నారు. వారి నిర్వచనం ప్రకారం వ్యవసాయం అంటే పంటల సాగు మరియు పశుపోషణ. రెండింటిని కలిపితేనే వ్యవసాయం అని బల్లగుద్దినట్లు చెబుతారు. కానీ కొందరు ఈ నిర్వచనాన్ని మార్చి పశవులను వ్యవసాయం నుంచి వేరు చేసి విడిగా చూస్తున్నారు. అందుకే నిర్వచనం మార్చుకున్న ప్రస్తుత రైతులు తగిన ఫలితాలను పొందలేకపోతున్నారు అంటున్నారు సతీష్బాబు. ఉన్నత చదువులు చదివిన సతీష్బాబు వ్యవసాయమే సరయిన దారి అని నమ్మి తమ పూర్వీకుల నుంచి వచ్చిన వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.
వీరికి మొత్తం 50 ఎకరాల సాగు భూమి ఉంది. భూమితో పాటు 50 వరకు గేదెలను పోషిస్తున్నారు. ఈ 50 ఎకరాలలో కొబ్బరి, వరి, మొక్కజొన్న పైర్లను మాత్రమే ప్రతి సంవత్సరం సాగు చేస్తుంటారు. కొబ్బరిని బోండాల గురించి సాగు చేస్తూ దూర ప్రాంతాల కొనుగోలుదారులకు కొబ్బరి బోండాలను అమ్మకం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం బిపిటి 5204 రకాన్ని సాగు చేస్తూ ఎకరానికి 20 నుంచి 23 బస్తాల దిగుబడి పొందుతూ వచ్చిన దిగుబడి మర పట్టించి బియ్యం చేసి బియ్యాన్ని మంచి ధరకు అమ్ముతుంటారు. కొంత పొలంలో మొక్కజొన్నను ప్రతి సంవత్సరం అక్టోబరు మాసంలో సాగు చేస్తుంటారు. ఎకరానికి సుమారు 40 క్వింటాళ్ళ మొక్కజొన్న దిగుబడి పొందుతూ తమ సొంతానికి అవసరమైన మ్కొజొన్నను ఉంచుకొని మిగతావి మార్కెట్లో అమ్ముతుంటారు. ప్రతి సంవత్సరం మొక్కజొన్న, వరి పంటలను ఒకే ఒక పంట అదే ప్రాంతంలో సాగు చేస్తుంటారు. రెండవ పంటగా ఏ విధమైన పంటలు సాగు చేయకుండా పిల్లిపెసర్లు చల్లి అవి పెరిగిన తరువాత పొలంలో గేదెలను వదులుతుంటారు. ఎలాంటి పంట మార్పిడి, అంతర పంటలు, మిశ్రమ పంట విధానాలను పాటించరు.
తన 50 ఎకరాల పొలాన్ని 365 భాగాలుగా చేసుకుని రోజుకి ఒక భాగంలో 50 గేదెలు ఒక రోజు ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ 50 గేదెల ద్వారా వచ్చిన పేడ మరియు మూత్రాలు ఆ రోజు అదే ప్రాంతంలో పడతవి. ఆ విధంగా 365 రోజులలో 50 ఎకరాలలో గేదెల పేడ మరియు మూత్రాలు అందేలా జాగ్రత్తపడతారు. అంతకుమించి ఏ విధమైన సాగు పద్ధతులు పాటించరు. ఈ విధంగానే ప్రతీ సంవత్సరం చేస్తూ ఉంటారు. అంటే ప్రతి సంవత్సరం ఎకరానికి 365 గేదెల ద్వారా ఒక రోజులో వచ్చే పేడ మరియు మూత్రాలు అందిస్తూ వస్తున్నట్లు. భూమికి అవసరమయిన మరియు పంటకు అవసరమయిన అన్ని రకాల పోషకాలు ఈ పేడ మరియు మూత్రాలు ద్వారా అందుబాటులోకి వస్తుంటావి కాబట్టి ఆ పొలంలో పండే పంటలు ఆరోగ్యాంగా, చీడపీడలను తట్టుకునే విధంగా పెరుగుతాయి. కాబట్టి ఈ పొలంలో చీడపీడల సమస్య పెద్దగా ఉండదు. ఈ పద్ధతిలో చీడపీడలు పంటలను ఆశించవు. అంటే చీడపీడలు ఆశించకుండా భూమిని, పంటలను తయారు చేయడమే ఇక్కడ మనము చేసేది. ఇదే ఉత్తమమైన పద్ధతి. కానీ నేటి రైతులు ఇందుకు వ్యతిరేకంగా చీడపీడలు ఆశించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా చీడపీడలు ఆశించిన తరువాత వివిధ రకాలుగా ఖర్చులు పెడుతూ సాగు ఖర్చు పెంచుకుంటున్నారు కాబట్టి పంటల సాగు రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఈ పద్ధతిలో కలుపు సమస్య కూడా పెద్దగా ఉండదు. గేదెలు పొలం మొత్తం తిరుగుతూ ఉండడం వలన వాటి మూత్రానికి కలుపు గింజల మొలక శక్తిని కోల్పోవడంతో పాటు మొలచిన చిన్న చిన్న మొక్కలు గేదెల మూత్రం ఘాటుకి మాడి పోతాయి. నేటి రైతులు తమ వ్యవసాయంలో ఎదుర్కొనే ప్రధాన సమస్యలు కలుపు మరియు పెట్టుబడులు తగ్గించుకోవడానికి మరియు దిగుబడుల నాణ్యత పెరగటానికి ఇదే ఉత్తమమైన మార్గం అంటున్నారు సతీష్ బాబు.
ప్రపంచంలో మన దేశంలోనే ఈ విధానం మన పూర్వీకులు వ్యవసాయంలో పాటించారు. కానీ పాశ్చాత్య పోకడలకు అలవాటయిన మనము వ్యవసాయంలో కూడా పాశ్చాత్య పోకడలను అనుకరించి రసాయనాలను ఉపయోగించడం, పశుపోషణకు దూరం జరగడము జరిగింది. కాబట్టి దాని ప్రభావాన్ని మన రైతులు రుచి చూశారు…. చూస్తున్నారు…. ప్రపంచంలోని మిగతా దేశాలు కూడా తమ తమ వ్యవసాయ పద్ధతులలో ఉన్న తప్పులను ఇప్పుడిప్పుడే గుర్తిస్తూ అందుకు పరిష్కారం మన తాతలు చేసిన పాత వ్యవసాయ పద్ధతులు అంటే వ్యవసాయం చేయాలంటే పశువులను తప్పనిసరిగా పోషించాలి. పశువులను పోషిస్తూ పంటల సాగు చేసిన వారిని రైతు అంటారు. అదే మన తాతముత్తాతల నిర్వచనాన్ని ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాయి.
వ్యవసాయంలో డ్రోన్ లాంటి ఆధునిక టెక్నాలజీ వచ్చిందని సంబర పడుతున్నాము. అసలు డ్రోన్ అవసరము లేని టెక్నాలజీని అశ్రద్ధ చేసి డ్రోన్ టెక్నాలజీ వచ్చింది సంబరపడటాన్ని ఏమంటారంటే? గాయం చేసి ఆయిట్మెంట్ రాయడం అంటారు. అసలు గాయం చేయకుండా ఉంటే సరిపోతుంది కదా! గాయం చేయటం ఎందుకు? ఆయిట్మెంట్ రాయడం ఎందుకు? మన పూర్వీకులు చేసిన వ్యవసాయం అదే. అసలు డ్రోన్ అవసరము లేని సాగు పద్ధతులు మన సొంతం అయినప్పుడు దానిని ప్రక్కదోవ పట్టించి మరలా డ్రోన్ టెక్నాలజీ వచ్చిందని సంబరపడిపోవటాన్ని ఏమనాలో ఆలోచించండి అని సతీష్బాబు అంటున్నారు.
ప్రపంచంలో పశువులను వ్యవసాయంలో ఎక్కువగా ఉపయోగించేది మన దేశంలోనే కావచ్చు. చాలా దేశాలలో పశువులను మాంసం కొరకు పెంచుతుంటారు. ఒకప్పుడు అంటే బుద్ధునికి పూర్వం మన దేశంలో కూడా పశువులను వ్యవసాయంలో ఉపయోగించుకోవడంతో పాటు మాంసం కోసం తినటానిక్కూడా పశువులను పోషించేవారు. జంతు బలుల పేరుతో ప్రతి కార్యక్రమంలో బలులు అంటే ఆవులను, గేదెలను బలి ఇస్తూ ఆ బలి ఇచ్చిన జంతువులను ఆహారంగా తీసుకునేవారు. కానీ వ్యవసాయంలో ఉపయోగించే, ఉపయోగపడే పశువులను జంతు బలుల పేరిట బలి ఇవ్వడం సరయినది కాదని, ఈ పద్ధతి ఇదే విధంగా కొనసాగితే మన వ్యవసాయానికి ఏ పశువు అందుబాటులో లేక వ్యవసాయం కుంటుపడుతుందని గ్రహించిన బుద్ధుడు జంతుబలులను నిర్మూలించటానికి ముమ్మర ప్రయత్నాలు చేశారు. తరువాత అశోకుని కాలంలో జంతుబలులను నిషేధించడం కూడా జరిగింది. అప్పటి నుండి (జంతువులను) పశువులను ఆహారంగా ఉపయోగించడం తగ్గించి వ్యవసాయంలో ఉపయోగించడం పెరుగుతూ వచ్చింది. కాబట్టే మన పూర్వీకులు ఆరోగ్యకరమైన వివిధ రకాల పంటలు పండించారు. మన దేశ వాతావరణం వివిధ రకాల పంటల సాగుకి అనుకూలం మరియు మన రైతులు మంచి నైపుణ్యం చూపించగలిగారు కాబట్టి అప్పట్లో ప్రపంచంలో ఎక్కడా పండని సుగంధ ద్రవ్యాలను మన రైతులు పండించారు. ఈ సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసం వచ్చిన ఈస్ట్ఇండియా కంపెనీ వ్యాపారం పేరుతో మన దేశంలో అడుగుపెట్టి చివరకు దేశాన్ని పాలించే స్థాయికి ఎదిగారు. అంటే ఇక్కడ మనకు అవసరమైన విషయం మనల్ని బ్రిటీష్ వారు పరిపాలించటం కాదు. మన రైతుల గొప్పతనం. మన దేశ గొప్పతనం. ఏ దేశం మీద, ఏ ప్రాంతం మీద ఆధారపడకుండా ఏ ప్రాంతానికాప్రాంతంలో అందుబాటులో ఉండే వనరులతో అద్భుతమైన పంటలు మన రైతులు పండించారు. పంటలు పండించటానికి ఊరు కూడా దాట వలసిన పనిలేదు అనేవిధంగా పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితి నుంచి పంటల సాగులో అవసరమైన ప్రతిదానికి షాపులకు వెళ్లాలి. ఊర్లు దాటాలి… జిల్లాలు… రాష్ట్రాలు దాటాలి. చివరకు దేశాలు కూడా దాటాలి అనేలా పరిస్థితులకు దిగజారాయి. వరి పండించే రైతు తన ఇంటికి అవసరమైన బియ్యాన్ని షాపులో కొనుగోలు చేస్తున్నాడు. మారుమూల పల్లెటూర్లలో కూడా పాలు కావాలంటే ప్యాకెట్లలో పాలు కొనుక్కోవలసిందే. విత్తనం కావాలంటే విత్తనాల షాపులకి, చీడపీడల నివారణకు ఏవైనా కావాలంటే పురుగు మందుల దుకాణానికి పరిగెత్తవలసిన దౌర్భాగ్యంలో ప్రస్తుత రైతులు ఉన్నారు. పరిస్థితులు ఇదేవిధంగా కొనసాగితే చివరకు మిగిలేది శూన్యం. ప్రపంచ దేశాలు మన పురాతన సాగు పద్ధతులను గుర్తించినవి కాని మన రైతులే గుర్తించలేకపోతున్నారు. ఇప్పటికైనా మేల్కొని మన పురాతన సాగు పద్ధతులను తిరిగి ప్రారంభిస్తేనే వ్యవసాయం, రైతు నిలబడగలడు అని చెబుతున్నారు సతీష్. మనం కూడా ఒకసారి సతీష్ మాటల గురించి ఆలోచిద్దాం.
అసలైన వ్యవసాయానికి సూత్రాలు
వ్యాపారాలకి, రాజకీయాలకి, ఉద్యోగాలకి, సంసారానికి… కొన్ని సూత్రాలు ఉన్నట్లే వ్యవసాయానికి కూడా కొనిన సూత్రాలు ఉన్నాయి. రైతు తప్పనిసరిగా పంటల సాగుతో పాటు పశుపోషణ చేపట్టాలి. పశువ్యర్థాలను పంటలకు, పంట వ్యర్థాలను పశువులకు అందించాలి. పంటలకు చీడపీడలు ఆశించకుండా జాగ్రత్త వహిచాలే కానీ చీడపీడలు వచ్చిన తరువాత నివారించడానికి ప్రయత్నాలు చెయ్యకూడదు. రైతు తప్పనిసరిగా పంటల సాగుకి దగ్గరలో నివాసం ఏర్పాటు చేసుకుని ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి రోజు పంటలను గమనిస్తూ ఉండాలి. సాధ్యమయినంత వరకు వ్యవసాయంలో అవసరమైన అన్ని పనులు కుటుంబ సభ్యుల సహకారంతో చేయగలగాలి. కూలీల మీద ఎక్కువగా ఆధారపడకుండా ప్రణాళిక వేసుకోవాలి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు, చుట్టప్రక్కల వ్యాపారం, ఉద్యోగం చేసే వారితో పోల్చుకుంటూ తప్పటడుగులు వేయకుండా తనకు ఏది అవసరమో అదే చెయ్యాలి. అంటే అవసరాలకి ప్రాముఖ్యత ఇవ్వాలి కాని అనుకరణలకు ప్రాముఖ్యతను ఇవ్వకూడదు. వ్యవసాయాన్ని సిగ్గుపడుతూ కాకుండా గర్వంగా అంటే మేము సమాజానికి ఆహారం అందిస్తున్నాము అనే తృప్తితో, రైతు లేకపోతే ప్రజలు లేరు, అందరికీ రైతు అవసరం తప్పనిసరి అని తెలియచేసేలా వ్యవసాయం చేయాలి లాంటి కొన్ని సూత్రాలను గద్దె సతీష్ తోటి రైతులకు తెలియచేశారు.
భారతదేశంలో ప్రతి ఒక్కరూ వ్యవసాయ మూలల నుండి వచ్చిన వారే. ప్రతి ఒక్కరికీ వ్యవసాయంతో సంబంధాలు ఉండే ఉంటవి. వారో, వారి తండ్రో, వారి తాతా లేక వారి ముత్తాతో ఏవరో ఒకరు వ్యవసాయం చేసే ఉంటారు. అందుకే ఎవరో అన్నారు భారతదేశంలో ప్రతి ఒక్కరూ వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉంటారు. వ్యవసాయం గురించి మాట్లాడని భారతీయులు చాలా తక్కువగా ఉంటారు. అందువలననో ఏమోగాని ఎంతటి వారైనా ఏ రంగంలోని వారైనా, వారి వారి రంగంలో ఎంతో ఎత్తుకి ఎదిగిన వారైనా వారి మొక్క చివరి మజిలీగా వ్యవసాయం ఉంటుంది. ఉదాహరణకు రాజకీయ ప్రముఖులు కె. చంథ్రేఖరరావు గారికి, నారా చంద్రబాబు నాయుడి గారికి వ్యవసాయ క్షేత్రాలు ఉన్నవి. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.యస్. రాజశేఖరరెడ్డి గారికి వ్యవసాయ క్షేత్రం ఉంది. వీరితోపాటు మనదేశంలో అనేకమంది రాజకీయ నాయకులకు వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలితకి వ్యవసాయ క్షేత్రం ఉంది.
ప్రముఖ సినీనటులు పవన్కళ్యాణ్, ప్రకాష్రాజ్ మరియు తదితరులకు కూడా సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న జైన్ ఇరిగేషన్, రిలయన్స్, చందనబ్రదర్స్, అగ్రిగోల్డ్, శివశక్తి బయోటెక్… ఇలా చెప్పుకుంటూ పోతే ఇతర రంగాలలో ఉన్న చాలామందికి వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. ఈ విధంగా అన్ని రంగాలలో ఉన్నవారు చాలా మంది వ్యవసాయంతో సంబంధాలు కలిగి ఉన్నారు. అదే విధంగా ఉద్యోగాలలో ఉన్నవారు కూడా పదవీ విరమణ తరువాత మరి కొంత మంది ఉద్యోగాలు కొనసాగిస్తూ కూడా వ్యవసాయం చేసేవారు మనకు తారసపడడము మామూలే. మనదేశంలో ఎక్కువమంది యువతరం తమ లక్ష్యంగా ఎంపిక చేసుకునే రంగం సాఫ్ట్వేర్. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం సాధించడమే ధ్యేయంగా పెట్టుకున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి సాఫ్ట్వేర్ రంగంలో కూడా విసిగివేసారిపోయిన యువత ఆ రంగం నుంచి వ్యవసాయరంగం వైపు అడుగులు వేయడం, అదీనూ సేంద్రీయ వ్యవసాయం చేయటానికి ముందుకు రావటం సర్వసాధారణమైన విషయం అని అందరికీ తెలిసిందే. కారణము ఏదైనా కావచ్చు ప్రతి ఒక్కరియొక్క చివరి మజిలీ వ్యవసాయం. అదీనూ ఈ మధ్య కాలంలో అయితే సేంద్రియ వ్యవసాయం అనేది అర్థమవుతుంది. అదేకోవకు చెందినవారు సుకవాశి హరిబాబు.
గుంటూరు జిల్లా, తెనాలి ప్రాంతానికి చెందిన హరిబాబు తెనాలి వి.యస్.ఆర్. కాలేజీలో బి.కామ్. పూర్తి చేసి ఎం.కాం.లో చేరి కొన్ని అనివార్య కారణాల వలన ఎం.కాం. మధ్యలోనే ఆపివేయటం జరిగింది. తెనాలి వి.యస్.ఆర్. కాలేజీలో చదువుకునే రోజులలో విద్యార్థి రాజకీయాలలో చురుకుగా పాల్గొనేవారు.
చదువు అవగానే హైదరాబాద్ వెళ్ళి కొంతకాలం, కొన్ని ప్రభుత్వశాఖలలో కాంట్రాక్టరుగా వ్యాపారం చేయటము జరిగింది. పరిస్థితులు అనుకూలించక వ్యాపారాన్ని మానివేసి కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన వ్యాపారం చేయటము జరిగింది. ఇందులో కూడా హరిబాబు ఇమడలేకపోయారు. ఈ రెండు వ్యాపారాలలో ఇమడలేకపోవటానికి ప్రధాన కారణం ప్రభుత్వ శాఖలలో ఉన్న అవినీతే అని హరిబాబు తన ఆవేదనను వ్యక్తం చేశారు. తరువాత కొన్ని సంవత్సరాలు సినీ పరిశ్రమలో ఫైనాన్సియర్గా వ్యాపారం చేశారు. ఇందులోను ఇమిడలేక సొంతంగా బుల్లితెర సీరియల్స్ నిర్మించడం జరిగింది. 600 ఎపిసోడ్ల సీరియల్స్ ‘జీవన తీరాలు’ మరియు ‘జీవన సంధ్య’లను నిర్మించినందుకుగాను ఈ రెండు సీరియల్స్కు వరుసగా మూడు సంవత్సరాలలో రెండింటికి కలిపి 6 నంది అవార్డులు అందుకుని హ్యాట్రిక్ సాధించిన ఘనుడు హరిబాబు. అదే సమయములో ‘కలహాల కాపురం’ అనే సీరియల్ కూడా నిర్మించి జెమిని టి.వి. ద్వారా ప్రసారం చేయటము జరిగింది.
ఎన్నిరకాల వ్యాపారాలు చేసినా, సేవారంగంలో, సినీ, బుల్లితెర రంగంలో ఉన్నా కూడా తన వ్యాపకం అయిన వ్యవసాయాన్ని మాత్రం వదలకుండా హైదరాబాదు గచ్చిబౌలిలో 2 ఎకరాలలో సుమారు 30 రకాల పండ్ల మొక్కలను 1987 నుంచి 2005 వరకు పెంచటము జరిగింది. ఆ సమయంలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ రకాల మొక్కలను సాగుచేసిన అనుభవంతో 2013 మరియు 2014 సంవత్సరాలలో హైదరాబాదు శివారు మహేశ్వరం మండలం అమీర్పేట గ్రామంలో 10 ఎకరాల భూమిని కొనుగోలుచేసి వెంటనే వివిధ రకాల మొక్కల పెంపకం చేపట్టారు. ఇక్కడ వ్యవసాయం మొదలు పెట్టినప్పటి నుండి 2015 డిసెంబరు వరకు రసాయనాలను ఉపయోగిస్తూ వచ్చారు. 2015 డిసెంబరులో ప్రకృతి వ్యవసాయ విధానాన్ని గురించి తెలుసుకోవటము జరిగింది. వెంటనే రసాయన వ్యవసాయాన్ని మానివేసి ప్రకృతి వ్యవసాయాన్నే చేయాలని నిర్ణయం తీసుకొని ఆవులను పోషిస్తూ 2016 జనవరి నుండి రసాయనాలను ఉపయోగించటము మానివేసి ప్రకృతి వ్యవసాయం చేయటము మొదలు పెట్టడము జరిగింది. జీవామృతం చేసుకోవటానికి తోట మధ్యలో పెద్ద సిమెంట్ తొట్టెలను ఏర్పాటు చేసుకొని అందులో తయారు చేసుకొన్న జీవామృతాన్ని మొక్కలకు అందిస్తున్నారు. జీవామృతంతో పాటు వివిధ రకాల నూనెలను కూడా కలుపుకుని మొక్కలకు అందిస్తున్నారు. మొత్తం 10 ఎకరాలలో ఉన్న వివిధ రకాల మొక్కలను పొలంలో ఉన్న ఒకే ఒక్క 2 అంగుళాల నీటి సామర్థ్యం గల బోర్వెల్తో పండించటం జరుగుతుంది.
రైతులు అధిక ఆదాయం పొందాలంటే దేశంలో ఉన్న అవినీతి మరియు దళారీ వ్యవస్థ అంతం అవటంతోపాటు రైతులు కూడా వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంలో ఇంటెన్సివ్గా చేయాలి. అప్పుడే రైతు ఆర్థికంగా నిలదొక్కుకోగలడు అని హరిబాబు అభిప్రాయపడ్డారు. ఎవరు ఎన్ని గొప్పగొప్ప వృత్తులలో ఉన్నాకూడా చివరిగా సేదతీరేది మాత్రం వ్యవసాయంలో అనేది ఎంతోమంది అనుభవాలు చెప్పకనే చెబుతున్నవి. నేను కూడా వ్యాపారరంగం, సినీ రంగం, రాజకీయ రంగం, బుల్లితెర రంగం, వ్యవసాయ రంగం మరియు సామాజిక సేవారంగం అన్నింటిలో అనుభవం గడించాను. కానీ చివరిగా వ్యవసాయ రంగంలోనే ప్రస్తుతము తృప్తిగా సేదతీరటం జరుగుతుంది. నా అనుభవం నేర్పిన పాఠం ఏమిటంటే మనషులను నమ్ముకోవటం కంటే మొక్కలను నమ్ముకోవటమే ఉత్తమం. అందుకనే తాను వివిధ రకాల మొక్కలను పెంచుతున్నాను అనే అభిప్రాయంలో హరిబాబు ఉన్నారు.
వివిధ రకాల మొక్కల పెంపకం…
ఎక్కువ రకాల మొక్కలను పెంచడంలో బహుశా హరిబాబుకు ఎవరూ సాటి ఉండకపోవచ్చు. తన 10 ఎకరాల పొలములో అటవీ మొక్కలైన టేకు, ఎర్రచందనం, శ్రీగంధం, సిల్వర్ఓక్, పహజన్, రోజ్ఉడ్, ఔషధ మొక్కలైన శతావరి, అశ్వగంధ, బిళ్ళగన్నేరు, రుద్రాక్ష, మారేడు, వేప, తులసి, అడ్డసర, కలబంద, నేలవేము, మాసపత్రి, సుగంధద్రవ్య మొక్కలైన లవంగం, బిర్వాని ఆకు, దాల్చిన చెక్క, యాలకలు, జాజికాయ, మిరియాలు, తమలపాకు మరియు పండ్ల మొక్కలైన లిచి, మామిడి, పనస, సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలం, నారింజ, సపోట, దానిమ్మ, జామ, డ్రాగన్ఫ్రూట్, వివిధరకాల చెర్రిమొక్కలు, రంబూటన్, జబోడిక, కొబ్బరి, అరటి మరియు చెరకు, వాక్కాయ, కూరగాయలతోపాటు ఇంకా అనేక రకాల మొక్కలను పెంచుతున్నారు. వివిధ రకాల మొక్కలను అందుబాటును బట్టి కర్నాటకలోని మడికెరి, అగుంబే, శృంగేరి, బెంగుళూరు, కేరళలోని కేసర్గౌడ్, త్రిచూర్లతోపాటు ఆంధ్రప్రదేశ్లోని కడియంలనుంచి సేకరించాడు.
హరిబాబు సాగుపట్ల ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఆసక్తి పెరిగింది. ఎందరో వారి క్షేత్రాన్ని సందర్శిస్తూ, వారి విధానాల గురించి తెలుసుకుంటున్నారు. ఆ దిశగా మేము కూడా ప్రయాణిస్తామని ప్రతిజ్ఞ చేయటం ఓ శుభ పరిణామం.
జీవామృతం, నూనెల మిశ్రమం
తయారీ మరియు వాడకం
200 లీటర్ల సామర్థ్యంగల ప్లాస్టిక్ డ్రమ్ములో 10 లీటర్ల ఆవు మూత్రం, 10 కిలోల ఆవుపేడ, 2 కిలలో బెల్లం, 2 కిలోల ఉలవ పిండి, 1 కిలో గట్టు మట్టి మరియు వివిధ రకాల నూనెల మిశ్రమము 1 1/2 కిలోలు, మిగిలినది నీరు పోసుకొని మొత్తం కలిపి 2,3 రోజులు నిల్వ ఉంచిన తరువాత చెట్టు వయస్సును బట్టి ఒక్కొక్క చెట్టుకు 2 నుంచి 5 లీటర్ల చొప్పున 15 నుంచి 20 రోజులకు ఒకసారి అందిస్తుంటారు. అదే దాషామాలో ఎక్కువ మొత్తంలో జీవామృతాన్ని పెద్ద సిమెంటు తొట్టెల్లో కూడా తయారుచేసుకుంటూ ఉంటారు.
నూనెల మిశ్రమం : వేపనూనె 15 కిలోలు, చేప నూనె 5 కిలోలు, పత్తి నూనె 15 కిలోలు, కొబ్బరి నూనె 15 కిలోలు, వేరుశనగ నూనె 15 కిలోలు, అవనూనె 15 కిలోలు, ప్రొద్దుతిరుగుడు నూనె 15 కిలోలు, సీతాఫలం విత్తనాల నూనె 5 కిలోలు, తవుడు నూనె 15 కిలోలు, కుసుమ నూనె 15 కిలోలు మరియు నువ్వుల నూనె 15 కిలోలు. ఈ నూనెలన్నింటిని కలిపి నూనెల మిశ్రమం తయారు చేసుకొని 9 కిలోల ఈ నూనెల మిశ్రమానికి 1 లీటరు ఎమల్సిఫైర్ కలుపుకుని ఉపయోగిస్తుంటారు.
ప్రతి వ్యక్తికి కొన్ని సరదాలు / అలవాట్లు / వ్యాపకాలు ఉంటాయి. ప్రస్తుతం సమాజంలో వ్యక్తుల అలవాట్లను గమనించినట్లయితే చాలావరకు తమకు, సమాజానికి నష్టం కలిగించేవిగానే ఉన్నాయి. ఉదాహరణకు కొంతమందికి డ్రైవింగ్ సరదాగా ఉండవచ్చు. అనవసరమైన డ్రైవింగ్ వలన ఇంధనము రూపంలో డబ్బు ఖర్చు అవటంతోపాటు ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండవచ్చు. ఇంకొంతమంది ప్రొగత్రాగడానికి, డ్రగ్స్కు, అల్కహాలుకు, బెట్టింగుల లాంటి అలవాట్లను సరదాగా మొదలు పెట్టి చివరకు వాటికి బానిసలు అయ్యి ఎంతో నష్టపోతుంటారు. ఇంకా కొంతమంది ఫోన్ల వాడకం సరదాగా మొదలు పెట్టి అది అలవాటుగా మారి చివరకు ఫోన్లకు కూడా బానిసలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈవిధంగా చెప్పుకుంటూపోతే సమాజంలో అనేక రకాల సరదాలు, అలవాట్ల వలన తాము నష్టపోవడంతోపాటు సమాజానికి కూడా నష్టం వాటిల్లుతుంది. ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే మన సరదాలు, మన అలవాట్లు మనతో పాటు తోటి వారికి ఉపయోగపడేవిగా, మన ఆరోగ్యాన్ని కాపాడేవిగా, శారీరక శ్రమకు అవకాశం ఉండేవిగా ఉండాలి. అప్పుడు అన్ని రకాలుగా ఫలితాలు ఉంటాయి. అలాంటి సరదాలలో/అలవాట్లలో ఇంటిపంట మొదటి వరుసలో ఉంటుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ విషయాన్ని గ్రహించిన చాలామంది ఇంటిపంటవైపు అడుగులు వేశారు, వేస్తున్నారు. ఈ కోవకు చెందుతారు హైదరాబాద్ రాంపల్లి, నేతాజీనగర్లో టెర్రస్గార్డెన్ పెంచుతున్న ఎలిజబెత్.
ఎలిజిబెత్ రెండున్నర సంవత్సరాల క్రితం సరదా కోసం ఇంటి పంటను మొదలు పెట్టారు. ప్రస్తుతం ఆ ఇంటి పంట తమ ఆరోగ్యాలను కాపాడటంతో పాటు తన పరిచయాలను కూడా పెంచి ఒక మంచి సర్కిల్ను ఏర్పాటు చేసింది. ఈ సరదాకోసం మొదలు పెట్టిన ఇంటి పంట ద్వారా రెండున్నర సంవత్సరాలలో నైపుణ్యాన్ని పెంచుకొని తక్కువ కాలంలో తోటి వారికి అవగాహన కల్పించే స్థాయికి ఎలిజబెత్ ఎదిగింది. ఎలిజబెత్ ప్రస్తుతం తన అనుభవాలను తోటి వారికి పంచడంతో పాటు ఉద్యాన శాఖ వారు ఇంటి పంటపై ఏర్పాటు చేసే అవగాహన సదస్సుల ద్వారా కూడా తన అనుభవాలను తోటి ఇంటి పంటదారులకు తెలియచేస్తున్నారు.
తన ఇంటి పంటలో పునాస మామిడి, చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి, పందిరిమామిడి, అల్టైమ్ మామిడి లాంటి మామిడి మొక్కలు, యాపిల్ బేర్ 5 మొక్కలు, నేరేడు రెండు రకాలు, దానిమ్మ, డ్రాగన్ఫ్రూట్, అంజూర, అరటి, స్టార్ఫ్రూట్, జీడిమామిడి, టేబుల్ నిమ్మ, తీపినిమ్మ, బత్తాయి, చింత మొదలగు పండ్ల మొక్కలతో పాటు అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలతో పాటు మందార, గులాబి లాంటి మొక్కలు కూడా పెంచుతున్నారు.
తమ ఇంటిపంటలో ఉన్న మొక్కలను ప్రతిరోజూ గమనిస్తూ పిండినల్లి లాంటి చీడపీడలను బ్రష్తో, పేనుబంకను (ఎఫిడ్స్) గంజి+ఇంగువ+పసుపు ద్రావణంతో నివారించుకుంటున్నారు. ప్రతి 10 రోజులకు మ్యాజిక్ కంపోస్టు (వివరాలను బాక్సు చూడగలరు)ను అందిస్తున్నారు. తీగజాతి కూరగాయలకు 3 జి కటింగ్ (వివరాలకు బాక్సు చూడగలరు) చేస్తూ ఎక్కువ దిగుబడి పొందుతున్నారు. కాకర, సొర, బీర లాంటి తీగ జాతి కూరగాయలు మగ, ఆడపూలు విడివిడిగా ఉంటాయి కాబట్టి రెండుకంటే ఎక్కువ మొక్కలు వేస్తున్నారు. తన ఇంటి పంటలో ఉన్న మొక్కలలో కొన్నింటిని తోటి ఇంటిపంట దారుల వద్ద నుంచి సేకరించి అభివృద్ధి చేసినవి ఉన్నాయి అని తనకు మొక్కలు అందచేసిన వారికి కృతజ్ఞతలు తెలియచేశారు. అదేవిధంగా తాను కూడా ఇతరులకు విత్తనాలు, మొక్కలు అందచేస్తూ తోటివారిని ఇంటిపంటవైపు అడుగులు వేయించడంలో తన వంతు కృషి చేస్తున్నారు. తన అనుభవాన్ని వేరే వారికి తెలియపరచడానికి ఏవిధమైన ఇబ్బంది పడకుండా తోటి వారిని ఇంటి పంట వైపు ప్రోత్సహిస్తున్నారు. తమ కుటుంబానికి, తోటి సమాజానికి, పర్యావరణానికి ఉపయోగపడే అలవాటును సరదాగా తీసుకొని కొనసాగిస్తున్న ఎలిజబెత్ని నిజంగా అభినందించవలసిందే. మరిన్ని వివరాలు మరియు ఇంటి పంటకు అవసరమైన సలహాలను ఎలిజబెత్ 8142055527కి ఫోను చేసి తెలుసుకోగలరు.
మ్యాజిక్ ఫార్ములా
200 గ్రాముల ఆవపిండి, 200 గ్రాముల వర్మికంపోస్టు, 200 గ్రాముల వేపపిండి, 50 గ్రాముల తాజా టీ పొడి, తొక్కతో ఉన్న 4 అరటి పండ్ల పేస్టు. వాటన్నింటిని 20 లీటర్ల నీటిలో కలిపి ప్రతి రోజు రెండుసార్ల చొప్పున కట్టెతో 3 రోజులు కలిపితే మ్యాజిక్ కంపోస్టు తయారవుతుంది. 4వ రోజు నుండి ఈ ద్రవ ఎరువును ఉపయోగించుకోవచ్చు. లీటరు ద్రవ ఎరువుకు 10 లీటర్ల నీటిని కలిపి సాయంకాలం పూట మొక్కల పాదులలో అందించాలి. సున్నితమైన మొక్కలకు అయితే ఒక లీటరు ద్రవ ఎరువుకు 15 లీటర్ల నీటిని కలిపి మొక్కల పాదులలో అందించాలి. ఈ ద్రవ ఎరువును ప్రతి 10 రోజులకు ఒకసారి మొక్కలకు అందిస్తే ఫలితం బాగా ఉంటుంది.
మట్టి మిశ్రమం
30 శాతం ఎర్రమట్టి, 30 శాతం వర్మికంపోస్టు లేదా మాగిన ఆవుపేడ, 30 శాతం ఇసుక (కోకోపిట్ తప్పనిసరి కాదు) 10% వేప పిండిని కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకున్నట్లయితే 30 నుంచి 40 రోజుల వరకు ఎలాంటి పోషకాలు అందించ కుండానే మొక్కలు ఎదుగుతాయి. 40 రోజుల తరువాత పోషకాలు అందించవలసి ఉంటుంది.
అలోవేరాతో అనేక ఉపయోగాలు
ఆలోవేరాని అంగుళం ముక్కలుగా కోసుకుని, ఒక లీటరు నీటిలో ఒక ముక్క వేసి 5 గంటలు నానిన తరువాత ఆ నీటిని మొక్కకు ఒక్కొక్క కప్పు చొప్పున పాదులలో అందిస్తే వర్షాకాలంలో నీరు ఎక్కువ అయినందువలన వచ్చే సమస్య నుండి మొక్క తేరుకుంటుంది. అంతేకాకుండా మల్బరి, గులాబి, మందార లాంటి కొమ్మలను కలబంద జ్యూస్లో ముంచి నాటుకున్నట్లయితే త్వరగా వేర్లు అభివృద్ధి చెందుతాయి అని ఎలిజబెత్ తాను పాటించిన పద్ధతులు వివరించారు.
3జి కటింగ్
బీర, సొర, కాకర లాంటి తీగజాతి మొక్కలను 3 జి కటింగ్ చేసినట్లయితే ఎక్కువ ఆడపూలు పుష్పించి దిగుబడి పెరుగుతుందని ఎలిజబెత్ వివరిస్తున్నారు. ఇందుకు గాను తీగజాతి కూరగాయ మొక్క రెండు అడుగులు పెరిగిన తరువాత తల త్రుంచినట్లయితే రెండు ఇగుర్లు వస్తాయి. అవి కూడా ఒక అడుగు వచ్చిన తరువాత మరలా వాటి తలను త్రుంచితే ఈసారి ఒక్కొక్క దానికి రెండు చొప్పున రెండు తీగలకు 4 తీగలు వస్తాయి. మరలా అవి కూడా ఒక అడుగు పెరిగిన తరువాత తల గిల్లినట్లయితే ఈసారి 8 తీగలు వస్తాయి. ఈ 8 తీగలను వదలి వేసినట్లయితే ఎక్కువ బ్రాంచీలు వచ్చి ఆడ పూల శాతం పెరిగి ఎక్కువ దిగుబడి వస్తుందని ఎలిజబెత్ తన అనుభవాన్ని వివరించారు.
చింత చిగురు పొందడం
ఇంట్లో డ్రమ్ములో చింత చెట్టు పెంచుకొంటూ ముదురు ఆకులని క్రమం తప్పకుండా గిల్లుతూ ఉన్నట్లయితే చింత చిగురు వస్తూ ఉంటుంది. తాను ఆ విధంగానే తన మిద్దె తోటలో పెంచుతున్న చింత చెట్టు నుండి చింత చిగురు పొందుతున్నానని ఎలిజబెత్ వివరించారు.
మామిడిలో కోతలు పూర్తి అయిన తరువాత రైతులు ఈ క్రింది తెలియజేసిన పద్ధతులు చేపట్టినట్లయితే రాబోయే పంటకాలంలో మామిడిలో నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు.
* చెట్టు ప్రధాన కాండం మీద 2 లేదా 3 బలమైన కొమ్మలను పెరగనిచ్చి మిగతావి తీసివేసి చెట్టు లోపలికి గాలి మరియు వెలుతురు బాగా ప్రసరించేటట్లు చూడాలి.
* ప్రక్క కొమ్మల పొడవు 80 సెం.మీ.లు ఉంచి చివర్లను కత్తిరించాలి.
* పెద్ద చెట్లలో ప్రతి సంవత్సరము కాయ కోత తరువాత అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు, చీడపీడలు వచ్చిన కొమ్మలు, వేలాడుతున్న కొమ్మలు, ఎండు కొమ్మలు తీసివేయుట వలన సూర్యరశ్మి చెట్టంతా బాగా సోకి మంచి కాపునిస్తుంది.
* చెట్ల నుంచి కాయలు కోసిన తరువాత మిగిలిపోయిన తొడిమలను కత్తిరించాలి. కత్తిరింపుచేసిన తరువాత ప్రతి రెమ్మ చివరి నుంచి 3-5 చిగుర్లు వస్తే రెండింటిని నిలుపుకొని మిగిలిన వాటిని అందినమేర తీసివేయాలి.
* కత్తిరించిన ఎండు కొమ్మలను, చెట్ల క్రింద రాలిన ఎండు పుల్లలను ప్రోగు చేసి దూరంగా కాల్చివేయాలి.
* కొమ్మలు కత్తిరింపు చేసిన తరువాత 0.3% కాపర్ ఆక్సీక్లోరైడ్ (బ్లైటాక్స్) పేస్టును పూయవలెను. వీలుకాని ఎడల అదే మందును పిచికారి చేసుకోవాలి.
* చెట్టు కాండంపైన ఒకవేళ రంధ్రాలను గమనించినట్లయితే గట్టి ఇనుప తీగను లోపలికి చొప్పంచి కాండం తొలిచే పురుగులను బయటకు లాగి చంపివేయాలి.
* తొలకరి జీలుగ (10 కిలోలు/ఎకరానికి) లేదా జనుము (25 కిలోలు/ఎకరానికి) లాంటి పచ్చిరొట్ట విత్తనాలను చెట్ల మధ్య వేసి 45-50 రోజులలో (పూతకు వచ్చే సమయంలో) భూమిలో కలియదున్నాలి. 10 సంవత్సరాలు పైబడ్డ చెట్టుకి చివికిన పశువుల ఎరువు (సుమారు 10 తట్టలు) లేదా వర్మికంపోస్టు (10 కిలోలు) ప్రతి చెట్టు పాదులో వేయాలి.
ఈ యాజమాన్య చర్యలు చేపట్టగలిగితే డిసెంబరు నెలలో ఏర్పడే పూత మంచి దిగుబడినిస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల మామిడిలో రాబోయే పంట కాలంలో అధిక దిగుబడులతో పాటు మంచి నాణ్యత గల దిగుబడి పొందవచ్చు.
డా. ఎం. రాజ్కుమార్,డా. బి. మాధవి, శాస్త్రవేత్త (సాయిల్ సైన్స్), డా. పి. హరికాంత్, కె. మౌనిక, ఎ. నితిష్, ఎ. వైష్ణవి, జి. నవ్య, ఫల పరిశోధన స్థానం, సంగారెడ్డి. ఫోన్: 99515 10516.
గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే ప్రతిరైతు పంటలసాగుతో పాటు పశుపోషణ, గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపకం చేస్తూ తమ ఇంటి అవసరాలకు సరిపోను కూరగాయలు, ఆకుకూరలు పండించుకుంటూ తమ అవసరాలు తీరగా మిగిలిన దిగుబడులు బయట అమ్మకం చేస్తూ ఉండేవారు. అసలు వ్యవసాయం మొదలయ్యిందే తమ ఆహార అవసరాలు తీర్చుకోవడానికి అనే విషయం అందరికీ తెలిసిందే. ఆది మానవులు తమ ఆకలిని తీర్చుకోవడానికి వేటాడి మాంసాన్ని తినడంతోపాటు తమ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఆహార పంటలు సాగు చేస్తూ తమ ఆకలిని తీర్చుకునేవారు. ఆవిధంగా మొదలైన వ్యవసాయం అనేక మార్పులకు గురయ్యి వ్యాపారంగా మారి ఏక పంట విధానానికి మారిన తరువాతనే రైతులు నష్టాల పాలవడం, తమ ఆహార అవసరాలకు కూడా వేరే రైతులు పండించిన ఆహారాల మీద ఆధారపడటం, రసాయనాలు ఉపయోగించిన ఆహార పదార్థాలను తినడం లాంటివి జరిగి ఆరోగ్యాలు దెబ్బతీసుకుంటున్నారు. వీటికి పరిష్కారం సేంద్రియ సాగు మరియు సమీకృత సేద్యం అని తెలుసుకున్న కొంతమంది రైతులు తిరిగి మన తాతముత్తాతలు చేసిన వ్యవసాయ పద్ధతులను తిరిగి అమలు పరుస్తున్నారు. ఈకోవకే చెందుతారు సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన శేషుకుమార్.
శేషుకుమార్ ఒకటిన్నర ఎకరాలలో సమీకృత సేద్యం మొదలుపెట్టాడు. శేషుకుమార్ ప్రధాన లక్ష్యం ప్రధానంగా తమకు కావలసిన ఆహారం విష రసాయనాలు లేకుండా పండించుకుని తాము తింటూ మిగిలినవి అమ్మి ఆదాయం పొందడం. భూమిని నమ్ముకుంటే భూమి మనలను మోసం చేయదు అనే సిద్ధాంతాన్ని నమ్మి 2021 నవంబరులో సమీకృతం సేద్యాన్ని ప్రారంభించాడు. ముందుగా పొలంలో ఎలివేటెడ్ షెడ్ నిర్మాణం చేసి ఈ షెడ్లో పైభాగంలో గొర్రెలను పెంచుతూ క్రింద భాగంలో కోళ్ళను పెంచుతున్నాడు. వాన పాముల ఎరువు తయారీకి కూడా ఒక షెడ్ ఏర్పాటు చేసుకుని గొర్రెల ఎరువును వానపాములకు ఆహారంగా వేసి వానపాములు ఎరువును తయారు చేసి తాను సాగు చేసే వివిధ రకాల మొక్కలకు అందిస్తున్నాడు. పుట్టగొడుగుల పెంపకాన్ని కూడా మొదలుపెట్టారు.
ప్రస్తుతం తన పొలంలో వివిధ రకాల పండ్ల మొక్కలు అంటే సంవత్సరం పొడవునా ఏదో ఒకటి అందుబాటులో ఉంటే మన భవిష్యత్తుతరాల వారు విష రసాయనాలు లేని పండ్లు, కూరగాయలు తింటూ ఆరోగ్యాలను కాపాడుకోవాలనే లక్ష్యంతో అన్ని కాలాలలో వచ్చే పండ్ల రకాలు అయిన జామ, పనస, యాపిల్బేర్, సపోట, యాపిల్, బత్తాయి, నిమ్మ, చింత, డ్రాగన్ఫ్రూట్, అంజూర, కొబ్బరి, సీతాఫలం, అరటి, బొప్పాయి, 14 రకాల మామిడి మొక్కలు సాగు చేస్తున్నాడు. ఇంటి అవసరాలకు సరిపోను వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నాడు. సుభాష్ పాలేకర్ చెప్పిన విధంగా నత్రజనిని స్థిరీకరించే మునగ మొక్కలను సాగు చేస్తూ వాటి నీడలో కొబ్బరి, జామ మొక్కలను సాగు చేస్తున్నాడు.
తాను చేసే సమీకృత సేద్యంలో మొదట తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాలి కాబట్టి 5 లక్షలకు పైగానే పెట్టుబడి పెట్టాడు. మొదటి సంవత్సరంలో గొర్రెలు, కోళ్ళ వలన కొంత ఆదాయం లభించింది. భవిష్యత్తులో తమకు అవసరమైన ఆరోగ్యకర ఆహారం తమ సొంత పొలం నుంచి పొందటంతో పాటు ఆర్థికంగా కూడా తన సమీకృత సేద్యం లాభాలని అందించగలదనే నమ్మకంతో ముందుకు సాగుతున్నాడు. మరిన్ని వివరాలు 99121 16331 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
2021-22 సంవత్సరంలో బియ్యం ఉత్పత్తి 128 మిలియన్ టన్నులుండవచ్చని భారత ప్రభుత్వ సంస్థలు అంచనా వేశాయి. గత పది సంవత్సరాల్లో వరి ఉత్పత్తి క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2015-16లో 104.32 మిలియన్ టన్నులుగా ఉన్న బియ్యం ఉత్పత్తి ఆరేళ్ళకాలంలో దాదాపు 23 శాతం పెరిగి 127.9 మిలియన్ టన్నులకు చేరటం వరి పండించే రైతులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాధికార్లు సమిష్టి కృషికి దర్పణం పట్టింది. 46 మిలియన్ హెక్టార్లలో ఈ ఉత్పత్తిని సాధించటం వల్ల ఉత్పాదకత కూడా హెక్టారుకి 2.78 టన్నులకు చేరింది. అయితే ఉత్పత్తికి తగినంత గిరాకీ పెరగనందున వరి పండించిన రైతులకు మద్దతు ధర కూడా లభించలేదు. 2020-21లో 21 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసి, 9.6 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించినట్లు గణాంకాలు ధృవపరుస్తున్నాయి. అందులో 4 మిలియన్ టన్నుల బాస్మతీ రకం బియ్యం ఉండగా, 17 మిలియన్ టన్నుల సాధారణ రకం బియ్యం కూడా ఎగుమతైంది. మొత్తం దేశంలోని బియ్యం ఉత్పత్తిలో ఆరవ వంతు ఎగుమతి కావటం దేశానికి గర్వకారణం. కరోనా వల్ల అనేక దేశాల్లో ఉత్పత్తి కుంటుపడటం వల్ల ప్రపంచ మార్కెట్లో ధరలు పెరగటంతో బియ్యం ఎగుమతిదార్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కాని 2021-22లో ప్రపంచ మార్కెట్లో బియ్యం ధరలు తగ్గుముఖం పట్టటం, వరి సాగు పెరగటం వల్ల ప్రభుత్వాలు మద్దతు ధరకు వడ్లను సేకరించటం భారంగా భావించాయి. అందుకే రబీలో వరి సాగుని నిరుత్సాహపరుస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు విడుదల చేశాయి. ముఖ్యంగా ఉప్పుడు బియ్యం ధరలు తగ్గటం వల్ల, ఉప్పుడు బియ్యాన్ని సేకరించమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణా ప్రభుత్వం వరి పంటను వేయకుండా ప్రత్యామ్నాయ పంటలకు మారవలసిందిగా రైతులను కోరింది. ఆంధ్రప్రదేశ్లో కూడా దాళ్వా వరి సాగుని నిరుత్సాహపరుస్తూ, కొన్ని ప్రాజెక్టుల పరీవాహ ప్రాంతాలకే పరిమితం చేసింది. అయినా పల్లపు భూముల రైతులు, చదును చేసి, మళ్ళు కట్టిన రైతులు తమకున్న నీటి సదుపాయంతో వరిని సాగు చేసారు. పండిన పంటకు ధరలు సరిగా రాక రైతుల ఇబ్బందులు పడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేక సేకరణ ఆలస్యంగా ప్రారంభమైంది. తమ పంటను నిల్వ పెట్టుకునే శక్తి లేని రైతులు చాలామంది మిల్లర్లకు, వ్యాపారులకు మద్దతు ధర కన్నా క్వింటాలుకి నాలుగైదు వందల రూపాయలు తక్కువకే అమ్ముకున్నారు. ఆ తర్వాత ప్రారంభమైన సేకరణ కూడా కొద్ది రోజులకే ముగిసింది. ఆలస్యంగా పంట వచ్చిన రైతులు మళ్ళీ వ్యాపారులకే అమ్ముకున్నారు. మద్దతు ధరకు సేకరించిన ధాన్యానికి కూడా డబ్బులు చాలా ఆలస్యంగా వచ్చాయి. వరిని పండించిన రైతులందరికీ చేదు అనుభవాలే మిగిలాయి. కోనసీమలో రైతులు పంట విరామాన్నే ప్రకటించారు.
తగ్గిన విస్తీర్ణం
మొత్తం దేశవ్యాపితంగా వరి రైతులు ప్రత్యామ్నాయ పంటలను ఆశ్రయించారు. గత సంవత్సరంలాగానే ఈ సంవత్సరంకూడా దేశమంతా భారీ వర్షపాతం నమోదైంది. వర్షాలెక్కువగా పడిన సంవత్సరాల్లో వరి విస్తీర్ణం పెరగటం సాధారణంగా జరుగుతుంటుంది. కాని కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం వరి విస్తీర్ణం గత సంవత్సరం కన్నా 13 శాతం తగ్గినట్లు తెలుస్తున్నది. అందులో కొంత భాగం వరదల వల్లనూ, అధిక వర్షాల వల్లనూ దెబ్బతిన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక భవిష్యత్తులో వాతావరణాన్ని బట్టి దిగుబడులుంటాయి. దిగుబడులు బాగున్నా విస్తీర్ణం తగ్గటం వల్ల 2022-23లో బియ్యం ఉత్పత్తి 120 మిలియన్ టన్నుల కన్నా తక్కువగానే ఉండవచ్చు. ప్రతికూల వాతావరణం ఉంటే ఉత్పత్తి 115 మిలియన్ టన్నల కన్నా తగ్గే అవకాశం కనిపిస్తున్నది.
2021-22లో అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం ధరలు మొదట్లో తక్కువగా ఉన్నాయి. కాని బియ్యం ఉత్పత్తి అంచనాలు వెలువడ్డ తర్వాత కొంత పుంజుకున్నాయి. మొత్తం ప్రపంచంలో బియ్యం ఉత్పత్తి గత సంవత్సరంతో పోలిస్తే రెండు మిలియన్ టన్నులు తగ్గి 520.5 మిలియన్ టన్నులుండవచ్చని అంచనా వేయబడింది. 2022-23 లో ఉత్పత్తి, నిల్వలు తగ్గుతాయని అంచనాలు రాగానే బియ్యం ధరల్లో కదలిక వచ్చింది. 2021-22 సీజనులో బియ్యం ఎగుమతులు కొంత పెరిగి 22 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. పది బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువగానే విదేశీ మారక ద్రవ్యం బియ్యం ఎగుమతుల ద్వారా సమకూరిందని గణాంకాలు తెలుపుతున్నాయి. పంటల ఎగుమతి ధరలు డాలర్లలో కొంత తగ్గినా, రూపాయి మారకం రేటు తగ్గటం వల్ల రూపాయల్లో ఎగుమతిదారులకు ఎక్కువగానే గిట్టింది. ప్రపంచంలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి 2021-22తో పోలిస్తే 2022-23 లో ఎనిమిది మిలియన్ టన్నులు తగ్గవచ్చని తాజా అంచనాలు తెలుపుతున్నాయి. రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు గోధుమ, బార్లీ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు నూనెల ధరలు గణనీయంగా పెరిగాయి. అప్పుడు బియ్యం ధరలు పెరగలేదు గాని, గత మూడు మాసాల్లో 30 శాతం పెరిగాయి. ఎగుమతి అవకాశాలు పెరిగినా; ఉత్పత్తి తగ్గనుండటంతో బియ్యం ఎగుమతులు గత రెండు సంవత్సరాలతో పోలిస్తే తగ్గే సూచనలే కనిపిస్తున్నాయి. ఖరీఫ్ పంట వచ్చే సరికి వడ్ల ధరలు కనీస మద్దతు ధర కన్నా ఎక్కువగానే ఉండవచ్చు. ప్రభుత్వాలకు సేకరణ భారం తగ్గవచ్చు. బియ్యం ధరలు పెరిగితే కేంద్ర ప్రభుత్వం గోధుమ ఎగుమతుల్ని నిలిపి వేసినట్లుగానే బియ్యం ఎగుమతులపై కూడా పరిమితులు విధించవచ్చు.
తగ్గిన గోధుమ ఉత్పత్తి
2021-22 రబీలో ఉత్తర భారతంలో చలి ప్రభావం తక్కువగా ఉండటంతో గోధుమ ఉత్పత్తి అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఏడెనిమిది మిలియన్ టన్నులు తగ్గింది. ముందుగా అంచనా వేసిన దానికన్నా ఉత్పత్తి ఇంకా తగ్గినట్లు తాజా అంచనాలు తెలుపుతున్నాయి. ఫలితంగా గోధుమ ధరలు బాగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా యుక్రెయిన్-రష్యాల యుద్ధకారణంగా గోధుమ ధరలు ఎక్కువయ్యాయి. గోధుమ ఎగుమతులకు మంచి అవకాశం వచ్చిందని ఎగుమతిదారులు విదేశీ వ్యాపారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కానీ దేశీయంగా గోధుమ ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఎగుమతుల్ని నిషేధించింది. చాలా నిల్వలున్నాయని చెప్పుకోవటమేగాని అందులో ఏ మేరకు వాడకానికి పనికి వస్తాయో, ఎంత మేరకు చెడిపోయాయో వివరాలు తెలవవు. 2022 ఆగస్టులో 27,95 మిలియన్ టన్నుల గోధుమలు, 26.65 మిలియన్ టన్నుల బియ్యం, 19.46 మిలియన్ టన్నుల వడ్లు, 3.58 లక్షల టున్నులు ముతక ధాన్యాలు భారత ఆహార కార్పొరేషన్ వద్ద ఉన్నాయని అధికారికంగా ఆ సంస్థ ప్రకటించింది. అన్ని మిలియన్ టన్నుల గోధుమ, బియ్యం, వడ్ల నిల్వలుండగా కొంత వరకు వాటిని తగ్గించుకొని, ఎగుమతుల్ని ఎందుకు అనుమతించడంలేదో అర్థం కావట్లేదు. భారత ఆహార కార్పొరేషన్ ధాన్యాలను అమ్మి, రుణ భారాన్ని తగ్గించుకునే సువర్ణావకాశాన్ని ఎందుకు జారవిడుచుకుంటుందో తెలియటం లేదు. నీతి ఆయోగ్ సభ్యులు, ప్రభుత్వ మంత్రులు అవసరాన్నిమించి ఆహార ధాన్యాల నిల్వలున్నాయనీ, అందుకనే వాటిని సేకరించడం లేదని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ ఉన్నప్పుడు అధిక నిల్వలను వదిలించుకునే ప్రయత్నం చేయకపోవడంతో నిల్వల నాణ్యతపై అనుమానం కలుగుతున్నది. బియ్యం, వడ్ల నిల్వలను సెప్టెంబరులోగా తగ్గించుకుంటే కొత్త పంట వచ్చినప్పుడు సేకరించుకోవచ్చు. ప్రజాపంపిణీ వ్యవస్థకు కావల్సిన ఆహారధాన్యాల కోసమే గోధుమ ఎగుమతుల్ని నిషేధించినట్లు ప్రభుత్వం సాకుగా చెప్పింది. అనేక రాష్ట్రాలలో విజయం సాధించడానికి కోవిడ్ కాలంలోనూ, ఆ తర్వాత కూడా దారిద్య్రరేఖ క్రింద ఉన్న వినిమయదారులకు ఉచితంగా ఆహార ధాన్యాలివ్వటం సాయపడిందని ప్రభుత్వం భావిస్తుంది. గోధుమ ఉత్పత్తి తగ్గిన నేపధ్యంలో బియ్యాన్నైనా సమృద్ధిగా నిల్వ ఉంచుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుంది.
ఉప్పుడు బియ్యంపై శ్రద్ధ
2022 రబీలో ఉప్పుడు బియ్యాన్ని సేకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం ఖరాఖండీగా చెప్పింది. తెలంగాణలో అధికంగా దొడ్డు బియ్యాన్ని పండిస్తున్నారనే విషయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణా ప్రజలు దొడ్డు బియ్యాన్ని తినాలని కేంద్రమంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారనటం వివాదాస్పదమైంది. కేంద్ర ప్రభుత్వం రబీ పంట కాలంలో సేకరణ విషయంలో తెలంగాణా ప్రభుత్వానికి సహకరించలేదు. సేకరణ బాధ్యత తెలంగాణా ప్రభుత్వానిదే అన్న వైఖరిని ప్రదర్శించింది. వాస్తవానికి వరికి మద్దతు ధరను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వమే. దొడ్డు రకాలకు గిరాకీ లేదనుకుంటే వాటిని నిరుత్సాహపరచటానికి సన్న రకాలకు ఎక్కువ మద్దతు ధరను ప్రకటించాలి. అలాగే ఉప్పుడు బియ్యానికి మార్కెట్ లేక పచ్చి రకం బియ్యానికి ఎక్కువ సేకరణ ధరను నిర్ణయించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో రైతులు, మిల్లర్ల నిర్ణయాలను మార్చటానికి ధరల వ్యవస్థను వాడుకోవాలి. బాస్మతీ బియ్యానికి ఎక్కువ ధరలు లభిస్తున్నాయి కాబట్టి ఆ రకాల ఉత్పాదకత తక్కువగా ఉన్నా పచ్చి రకం బియ్యానికి ఎక్కువ సేకరణ ధరను నిర్ణయించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో రైతులు, మిల్లర్ల నిర్ణయాలను మార్చటానికి ధరల వ్యవస్థను వాడుకోవాలి. బాస్మతీ బియ్యానికి ఎక్కువ ధరలు లభిస్తున్నాయి కాబట్టి ఆ రకాల ఉత్పాదకత తక్కువగా ఉన్నా రైతులు సాగు చేస్తున్నారు. సన్న రకాల పచ్చి బియ్యాన్ని ప్రోత్సహించదలచుకుంటే వాటికి మద్దతు, సేకరణ ధరలను పెంచాలి. అంతేగాని మద్దతు ధర ప్రకటించి, దొడ్డు రకాలను, ఉప్పుడు బియ్యాన్ని సేకరించమని చెప్పటం మద్దతు ధరల విధానాన్ని ప్రహసనంగా మార్చటమే అవుతుంది. రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు చోద్యం చూసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దానిని తమ మధ్య రాజకీయ క్రీడగా భావించడం అన్యాయం. వరికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించిన ప్రభుత్వాలు ఇప్పుడు కొరత ఏర్పడుతుందనే భయంతో దిద్దుబాటు చర్యలకు పూనుకున్నాయి. రైతుల దగ్గర చౌకగా వడ్లను కొని, నూకలు కాకుండా వాటిని బియ్యంగా మార్చిన మిల్లర్లు తమ వద్ద ఉన్న నిల్వలను కొనాలని లాబీయింగ్ చేశారు. రైతుల గోడు పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం మిల్లర్లను రక్షించడం కోసం తెలంగాణా నుండి ఎనిమిది లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం కొంటామని ప్రకటించింది. మునుగోడు ఎన్నికల సభకు వచ్చిన కేంద్ర హోంమంత్రి దొడ్డు రకం వడ్లను కొంటామని హామీ గుప్పించారు. కొద్ది నెలల ముందు పనికిరాని ఉప్పుడు బియ్యం, దొడ్డు రకం వడ్లు ఇప్పుడెలా అవసరమయ్యాయి? ప్రపంచ మార్కెట్లో బియ్యానికి గిరాకీ పెరగటం, గోధుమ ఉత్పత్తి తగ్గిపోవటంతో అన్ని రకాల వడ్లు, ఉప్పుడు బియ్యం కొంటానికి కేంద్ర ప్రభుత్వం వైఖరిని మార్చుకున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు నష్టపోతున్నప్పుడు వినోదంగా భావించిన కేంద్రం ఇప్పుడు వ్యాపారులు, మిల్లర్ల కోసం మెట్టు దిగిరావడానికి రాజకీయాలు కారణమా, ముంచుకొస్తున్న ఆహార ధాన్యాల కొరత భయం కారణమా అనేది స్పష్టం చేయాలి. దేశానికి 30 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల నిల్వలు సరిపోతాయి అని వాదించిన మేధావులు 65 మిలియన్ టన్నులు నిల్వలున్నా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల వడ్లను, బియ్యాన్ని కొనటానికి ఎందుకు ఆసక్తి చూపుతున్నది? ప్రభుత్వం అటు మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించి, అవసరమైనప్పుడు రైతుల నుండి సేకరించదు. పూర్తి స్వేచ్ఛా మార్కెట్ను అనుసరించదు. రైతులను అడకత్తెరలో పెట్టి, ఎలాగైనా నష్టపోయేలా చూడటం సమంజసమా?
డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త,
మనిషి నిత్యం విద్యార్థే. ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని తెలుసుకున్నా… ఇంకా నేర్చుకోవలసింది…. తెలుసుకోవలసింది… మిగిలే ఉంటుంది. మిగతా విషయాలతో పోల్చుకుంటే ప్రకృతి విషయంలో తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి అంతం ఉండదు. తెలుసుకొనేకొలది ఇంకా తెలుసుకోవలసింది ఎంతో మిగిలి ఉంటుందనే విషయం ప్రకృతిని పరిశీలిస్తే అర్థం అవుతుంది. మిగతా రంగాలకంటే వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై ప్రకృతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రంగాలలో ఉండేవారు ప్రతినిత్యం ప్రకృతిని పరిశీలిస్తూ ఉండవలసిందే. ఈ విషయం ఇంకా బాగా అర్థం అయ్యేలా తెలుసుకోవాలంటే మిరప పంటను ఉదాహరణగా తీసుకుంటే మన రైతులు కొన్ని థాబ్దాల నుంచి మిరప పంటను సాగు చేస్తూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏదో రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే రైతులు మిరప సాగుని కొనసాగిస్తూ వస్తున్నారు. గత సంవత్సరం కొత్తరకం తామర పురుగులు మిరప పంటను సర్వనాశనం చేసినవి. వీటికి పరిష్కారం లేక చాలామంది రైతులు మధ్యలోనే మిరప పంటను పీకివేసి వేరే పంటలు వేసుకోవడము, కొంతమంది రైతులు ఏమీ చేయలేక పంటను వదిలివేయడం జరిగింది. అతికొద్దిమంది రైతులు మాత్రమే మిరప సాగును కొనసాగించి కొద్ది మొత్తంలో అంటే సాధారణ దిగుబడిలో 20 నుండి 30% దిగుబడిని మాత్రమే పొందగలిగారు. ఈ విధంగా ప్రకృతి ప్రభావం వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రకృతిని పరిశీలిస్తూ, అవకాశం ఉన్న వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ కొనసాగించడమే మనము చేయగలము. ప్రకృతిలో అనంతకోటి జీవజాలం జీవనం కొనసాగిస్తూంది. ఈ అనంతకోటి జీవజాలంలో మనిషి కూడా ఒక జీవ జాలం, కాకపోతే మిగతా జీవరాశులతో పోల్చుకుంటే మనిషికి తెలివితేటలు, ఆలోచించే శక్తి ఉంది కాబట్టి మిగతా జీవరాశులను సక్రమంగా వినియోగించుకుంటూ ముందుకు సాగుతుంటారు. అందువలననే కాలం గడిచేకొలది కొత్త కొత్త పద్ధతులు తెలుసుకోవటం ఉపయోగపడే వాటిని పాటించటము, ఉపయోగపడని వాటిని ప్రక్కకు నెట్టడం జరుగుతుంది. ఈ ప్రయాణంలో భాగంగానే వానపాముల ఎరువు తయారీ, పుట్టగొడుగుల పెంపకం, తేనెటీగల పెంపకం, మిత్ర పురుగుల పెంపకం లాంటి వాటిని రైతులు చేపడుతున్నారు. ఇవన్నీ కూడా రైతులకు, వ్యవసాయ రంగానికి, ప్రజలకు ఉపయోగపడేవే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇప్పుడు వీటి సరసన బ్లాక్ సోల్జర్ ఫ్లై పెంపకం చేరింది. ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై రైతులకు, పర్యావరణానికి ప్రత్యేకించి కోళ్ళ రైతులకు వరం అని చెప్పవచ్చు. ఈ విషయాన్ని గ్రహించి బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాలను తమ కోళ్ళకు మేతగా, కోడి ఎరువును కుళ్ళగొట్టడానికి వినియోగిస్తున్నారు గుంటూరు సమీపములోని చౌడవవరంకి చెందిన దాసయ్య.
దాసయ్య బావ మధుకోణార్క్ గారికి కోళ్ళ పెంపకంలో మంచి అనుభవం ఉంది. వీరికి ప్రత్యేకంగా లేయర్సు (గుడ్లు పెట్టే కోళ్ళు) పెంపకంలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. దేశం మొత్తం మీద వీరికి అనేక బ్రాంచీలు ఉన్నాయి. రోజుకి 4,00,000 పైగా కోడిగుడ్లను దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. వీరి అనుభవంలో కోళ్ళ ఫారాల దగ్గర పెద్దగా ఇబ్బంది పెట్టే సమస్య వాసన మరియు ఈగలు. ఈ సమస్యల వలన కోళ్ళ ఫారాలు గ్రామాలకు, మనుషుల సంచారానికి దూరంగా ఏర్పాటు చేస్తుంటారు. ఈ సమస్యలకు పరిష్కారం కోసం అన్వేషించి బ్లాక్ సోల్జర్ ఫ్లై వలన వాసన మరియు ఈగల సమస్య నుండి బయటపడటముతో పాటు కోడి ఎరువును పోషకాల గనిగా మార్చటంలో ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై బాగా ఉపయోగపడడంతో పాటు దాణా ఖర్చులు తగ్గించవచ్చు అని తెలుసుకుని బ్లాక్ సోల్జర్ ఫ్లైను ఉత్పత్తి చేస్తూ తమ కోళ్ళ ఫారంలో వినియోగిస్తున్నారు.
బ్లాక్ సోల్జర్ ఫ్లై పర్యావరణానికి ఉపయోగపడే ఈగ (ఇవి మామూలుగా మన చుట్టు ప్రక్కల కనిపించే ఈగలు కావు). ఈ ఈగలు పశువులు, కోళ్ళ వ్యర్థాలను కుళ్ళగొట్టి మంచి పోషకాలు గల ఎరువుగా మారుస్తాయి. సాధారణంగా కోళ్ళ ఎరువు వాసన వస్తుంది. కాని కోళ్ళ వ్యర్థాలలో ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాను వదలినట్లయితే 45 రోజులలో మంచి ఎరువుగా మార్చి కోళ్ళ ఎరువును ఏ విధమైన వాసన రాకుండా చేయగలవు. లేయర్స్ కోళ్ళ ఫారమ్లలో పైన ఉన్న కోళ్ళు కిందకు రెట్టను వదులుతుంటాయి. ఈ రెట్టలో బ్లాక్ సోల్జర్ ఫ్లై యొక్క లార్వాలను వదులుతారు. ఈ లార్వాలు కోళ్ళ వ్యర్థాన్ని కుళ్ళగొడుతుంటాయి. 45 రోజులలో మంచి ఎరువుగా తయారవుతుంది. పూర్తిగా తయారయిన ఎరువు వాసన లేకుండా, తగు మొత్తంలో తేమ శాతంలో పొడి పొడిగా ఉంటుంది. పొడిగా ఉన్న ఎరువును జల్లెడపోసి లార్వాలను వేరు చేసి ఆ లార్వాను కోళ్ళకు దాణాగా వేస్తుంటారు. ఈ ప్రక్రియ వలన ఒకవైపు కోళ్ళ ఎరువులో పోషకాలు అభివృద్ధి చెందడముతోపాటు ఇంకో వైపు కోళ్ళ దాణా ఖర్చు తగ్గడంతో పాటు కోళ్ళ ఆరోగ్యం మెరుగుపడడం, కోడిగుడ్లలో పోషకాల శాతం పెరగడం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి బ్లాక్ సోల్జర్ ఫ్లై (ఈగ)లు రైతుల పాలిటి ప్రత్యేకించి కోళ్ళ రైతుల పాలిటి వరం అని దాసయ్య అంటున్నారు. మరిన్ని వివరాలు 90008 90909 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
మంచి సేంద్రియ ఎరువు
ప్రస్తుతం అనేక సేంద్రియ ఎరువులు అందబాటులో ఉన్నాయి. వీటిలో వానపాముల ఎరువు, పశువుల ఎరువు, ఘనజీవామృతం, గొర్రెలు, మేకల ఎరువు, కోళ్ళ ఎరువులను ప్రధానంగా చెప్పవచ్చు. పశువు, గొర్రెలు, మేకల ఎరువులతో పోల్చుకుంటే కోళ్ళ ఎరువులో పోషకాల శాతం ఎక్కువగా ఉంటుంది. కానీ కోళ్ళ ఎరువు వలన వేడి ఉత్పన్నమవుతుందనే ఉద్దేశ్యముతో కోళ్ళ ఎరువును ఉపయోగించటానికి రైతులు వెనుకంజ వేస్తుంటారు. కొంతమంది బాగా కుళ్ళిన తరువాత అంటే 6 నుండి 10 నెలల తరువాత ఉపయోగిస్తుంటారు. కానీ ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాలతో కుళ్ళగొట్టిన కోళ్ళ ఎరువు వేడిని ఉత్పత్తి చేయదు కాబట్టి వెంటనే అన్ని రకాల పంటలకు వినియోగించవచ్చు. ఈ ఎరువును ఉపయోగించి పంటల సాగు చేసినట్లయితే మొక్కలు దృఢంగా రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ పెరుగుతాయి కనుక పంటలపై చీడపీడల ప్రభావం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఎరువు సేంద్రియ రైతులకు బాగా ఉపయోగపడుతుందని దాసయ్య అంటున్నారు.
రసాయనాలకు దూరం జరగవచ్చు
కొంతమంది రైతులు తమ పంటల సాగులో రసాయనాలను వినియోగించకపోతే పంట దిగుబడులు తగ్గుతాయనే ఆలోచనతో రసాయనాలకు దూరం జరగలేకపోతున్నారు. అలాంటి రైతులు మెల్లమెల్లగా రసాయనాలను తగ్గిస్తూ ఈ ఎరువును ఉపయోగిస్తూ పంటల సాగు కొనసాగిస్తున్నట్లయితే 4, 5 సంవత్సరాలలో పూర్తిగా తమంతటతామే రసాయనాలను వదిలిపెడతారు అని దాసయ్య అంటున్నాడు.
విదేశీమారక ద్రవ్యం ఆదా అవుతుంది
ప్రస్తుతం రైతులు ఉపయోగించే రసాయన ఎరువులలో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవే. ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చుచేస్తూ విష రసాయనాలను దిగుమతి చేసుకుని పంటల సాగులో వినియోగిస్తూ నేల, నీరు, గాలి, ఆహారం లాంటివి కలుషితము చేయడంలో రైతులు తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ప్రాణాలు కాపాడవలసిన ఆహారాన్ని అందించవలసిన అన్నదాతలు తప్పని పరిస్థితులలో రసాయన అవశేషాలు కల ఆహారాలను అందిస్తున్నారు. రైతులు సేంద్రియ పద్ధతులు పాటిస్తూ అన్ని రకాల సేంద్రియ ఎరువులతో పాటు బ్లాక్ సోల్జర్ ఫ్లైతో తయారయిన ఎరువు కూడా వినియోగించినట్లయితే రసాయనాల అవసరం ఉండదు కాబట్టి రసాయనిక ఎరువుల కొనుగోలు నిమిత్తం ఖర్చుచేసే విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని దాసయ్య అంటున్నారు.
ప్రకృతి అందించే పరిపూర్ణ ఆహారమైన పాలలో నీరు, చక్కెర (లాక్టోజ్), ఇతర విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండగా వెన్నశాతం మాత్రమే ఎక్కువ మార్పులకు లోనవుతుంటుంది. పాలలోని ‘వెన్న’ను అసహజ పద్ధతుల్లో ఇతర పదార్థాలతో పూరించలేము.
డెయిరీల్లో సాధారణంగా గేదె పాలకైతే కిలో వెన్నకు ధర చెల్లిస్తుంటే, ఆవు పాలకైతే పాలలోని వెన్న, వెన్నేతర ఘనపదార్థాలను కలిపి కిలో ఘన పదార్థాల కింద ధర కడుతుంటారు. వాణిజ్యసరశిలో నడిచే డెయిరీలు, పాలే జీవనాధారంగా చేసుకున్న పాడిరైతులు పాలల్లో వెన్నశాతం పెంచుకోవడానికే ఆసక్తి చూపుతారు.
పాడి పశువుల జాతులు, జాతిభేదము, కాల ప్రభావము, ఈనిన తర్వాత రోజులు, ఈతల సంఖ్య, పాలుపితికే వేళల్లో మార్పులు, పశువు ఆరోగ్య పరిస్థితి, తినే మేత, పాలు పితికే విధానము మరియు పాలుపితికే చోటు తరచు మార్చడం లాంటి అంశాలు వెన్నశాతంలో వ్యత్యాసాలకు కారణమవుతుంటాయి.
వెన్నశాతం తగ్గడానికి కారణాలు
1) పశువుల ఆహారంలో పీచు పదార్థాల తగ్గుదల, పశువుల ఆహారంలో కనీసం 1.2% పీచు పదార్థం లేకపోతే వెన్న శాతం తగ్గుతుంది.
2) పచ్చిమేతలు లేకపోవుట: మేలు జాతి పచ్చిమేతలు పశువుల బరువుకు1.4% తప్పక మేపాలి.
3) దాణా ఇవ్వకపోవడం: పశువుల ఆరోగ్యసంరక్షణకై తగు మోతాదులో దాణా తప్పక ఇవ్వాలి.
4) పీచురహిత పిండిపదార్థాలు, అసిటిక్ ఆమ్ల ఉత్పత్తిని తగ్గించి, పాలలో వెన్నశాతాన్ని ప్రభావితం చేస్తాయి.
5) ఎక్కువ మోతాదులో నూనెచెక్కలను మేపితే క్రమేపి వెన్నశాతం తగ్గుతుంది.
8) అధిక పాలనిచ్చే థలో, శక్తినిచ్చే పదార్థాలతో కూడిన దాణా తగ్గినా, క్రమేపి పాలలో వెన్న శాతం తగ్గుతుంది.
9) వేసవి/ఎక్కువ తేమ ఉండేకాలంలో వెన్న శాతం తగ్గుతుంది.
10) అధిక మోతాదులో సొమెటిక్ కణాల సంఖ్య, వెన్న శాతం తగ్గిస్తుంది.
పాలు తీసేటపుడు చివరి థ పాలల్లో, పశువు ఎండిపోయే ముందు ఉత్పత్తి అయే పాలలో, శీతాకాలం ఉత్పత్తి అయే పాలలో, పోషకాల పచ్చిమేత మేపినా, తక్కువ పాలిచ్చే దేశీవాళీ పశువుల్లో అధిక వెన్న శాతం కనిపిస్తుంటుంది.
స్థానికంగా దొరికే ప్రత్యామ్నాయ దాణా తయారీ వస్తువుల వాడకం దానా తయారీ ఖర్చును తగ్గిస్తుంది.
పశువుకు ఎల్లవేళలా మేత, నీరు అందుబాటులో ఉంచడంతోబాటు మేత అందించే తొట్టెలు శుభ్రంగా ఉంచాలి.
రూమెన్ బైపాస్ ఫ్యాట్స్ దాణాతో జతచేసి మేపడం వలన పాలలో వెన్నశాతం పెరుగుతుంది. అయితే ఇవి 2శాతం మించకుండా జాగ్రత్తవహించాలి. అధికపాలనిచ్చే పశువులకై మార్కెట్లో డెయిరీలాక్, మెగాలాక్ పేరుతో ఇవి అందుబాటులో ఉన్నాయి.
పశువు పెద్దపొట్టలో పి.హెచ్. అదుపుచేసే సోడా ఉప్పు, 50-70 గ్రా. 2-3 దఫాలు దాణాలో చేర్చి అందిస్తే వెన్న పెరుగుతుంది.
వేసవిలో తగు జాగ్రత్తలతో వెన్నశాతం పెంచుకుని పాడి రైతులు లాభాలు గడించడమే పాడి రైతు ముందున్న తక్షణ కర్తవ్యం.
కోవిడ్-19 కరోనా వైరస్ డిసీజ్ అనేది కొత్తరకం సార్స్ కరోనావైరస్-2 అను వైరస్ వల్ల కలుగు వ్యాధి. ఈ వ్యాధి ప్రపంచం అంతటా వ్యాపించటమే కాకుండా, కొన్ని చోట్ల జంతువులలో కూడా ఈ వైరస్ గుర్తించటం వలన యాజమాన్యంలో చాలా సందేహాలు కలుగుతున్నాయి. మరీ ముఖ్యంగా పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులు కరోనా వ్యాధి బారిన పడే అవకాశం ఉన్నందున వాటి యజమానులలో చాలా సందేహాలు కలుగుతున్నాయి. కరోనావైరస్ యొక్క కుటుంబంలో అనేక రకాలైన కరోనా వైరస్లు ఉన్నాయి. వివిధ జంతుజాతులు ఈ వైరస్ల బారిన పడే అవకాశం ఉంది. కానీ ఒక్కో వైరస్ ఒక్కో రకమైన వ్యాధిని కలుగజేస్తుంది. ఈ కరోనా వైరస్ కుటుంబంలో నాలుగు జాతులు ఉన్నాయి. ఆల్ఫా, బీటా, గామా మరియు డెల్టా కరోనా వైరస్. సార్స్ కరోనావైరస్-2 బీటా కరోనా వైరస్ జాతికి చెందుతుంది. కుక్కలకు మరియు పిల్లులకు సోకు కరోనా వైరస్ ఆల్ఫా కరోనా వైరస్ జాతికి చెందుతుంది. సార్స్ కరోనా వైరస్-1 2002-2004 సంవత్సరంలో చైనాలో అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అను వ్యాధి అకస్మాత్తుగా వ్యాపించి చాలామంది చనిపోవడం జరిగింది. అంతేకాకుండా 2012వ సంవత్సరంలో మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వల్ల కూడా పలు దేశాలలో మరీ ముఖ్యంగా సౌదీ అరేబియాలో చాలామంది చనిపోవడం జరిగింది. ఈ రెండు వ్యాధిగ్రస్తులలో గుర్తించబడిన సార్స్ మరియు మెర్స్ కరోనా వైరస్లు బీటా జాతికి చెందినది. ఇవి కేవలం మనుష్యులలో మాత్రమే గుర్తించబడ్డాయి. చాలామంది ఈ వ్యాధుల బారిన పడినప్పటికీ జంతువులలో మాత్రం ఈ వ్యాధికారక వైరస్లు గుర్తించబడలేదు.
కుక్కల కరోనా వ్యాధి: కుక్కలలో కరోనా వైరస్ వల్ల జీర్ణవ్యవస్థకు సోకటం వల్ల విరేచనాలు అవుతాయి. ముఖ్యంగా కుక్కపిల్లలు ఎక్కువగా/బాగా బాధపడతాయి. కానీ కుక్కలకు ఈ వ్యాధి నివారణ కోసం టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కేవలం కుక్కలలో మాత్రమే పనిచేస్తాయి. కుక్కలలో కరోనావ్యాధి ముఖ్యంగా కుక్క పిల్లలలో ప్రేగులకు సంక్రమించు అంటువ్యాధి. వ్యాధి సోకిన కుక్క పిల్లలు స్వల్పకాలం పాటు ఉదర సంబంధమైన అసౌకర్యాలతో బాధపడతాయి. ఈ వైరస్ కేవలం జీర్ణాశయాంతర సమస్యలను మాత్రమే కలుగజేసి, మలం ద్వారా విసర్జించబడుతుంది. దీనివల్ల ఆహార పదార్థాలు, నీరు, పాత్రలు కలుషితమవుతాయి. కలుషితమైన ఆహార గిన్నెల నుండి తినడం లేదా సోకిన కుక్కలతో దగ్గరగా ఉండటం వలన ఆరోగ్యవంతమైన కుక్కలు వ్యాధిబారిన పడవచ్చు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాలు మరియు అపరిశుభ్రమైన పరిసరాలు కరోనావైరస్ వ్యాప్తికి దోహదపడతాయి. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన దగ్గరి నుండి వ్యాధి లక్షణాలు కనపడడానికి 1 నుండి 4 రోజులు పడుతుంది. చాలా కుక్కలలో వ్యాధి లక్షణాలు 2-10 రోజుల వరకు ఉంటాయ. ఇతర వైరస్లు, బ్యాక్టీరియా మరియు పరాన్నజీవుల వల్ల అనారోగ్య తీవ్రత ఎక్కువ అవడమే కాకుండా అవి తొందరగా కోలుకోలేవు. ఒకసారి వ్యాధి సోకిన తర్వాత దాదాపు ఆరు నెలల పాటు వ్యాధికారక వైరస్లు శరీరం నుండి విడుదల అవుతూ ఉంటాయి.
వ్యాధి లక్షణాలు: చాలా కుక్కలలో వ్యాధి లక్షణాలు బయటకు కనిపించవు. కొన్నింటిలో మాత్రమే వ్యాధి లక్షణాలు బహిర్గతం అవుతాయి. అప్పుడప్పుడు వ్యాధి లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వ్యాధిసోకిన కుక్కలు ముఖ్యంగా చిన్న కుక్కపిల్లలలో అకస్మాత్తుగా విరేచనాలు అవడం ప్రారంభమవడమే కాకుండా అతిసారంలాగా మారే అవకాశం ఉంది. బద్ధకంగా ఉంటూ ఆకలి మందగిస్తుంది. మలం వదులుగా ఉండి, నారింజ రంగులో దుర్వాసన కూడి ఉంటుంది. అప్పుడప్పుడు రక్తం లేదా శ్లేష్మం కలిగి ఉండవచ్చు. ఒకవేళ అది మిశ్రమ సంక్రమణ అయి ఉంటే ఉదాహరణకు కరోనా వ్యాధి, పార్యోవైరస్ రెండు ఉన్నట్లయితే అనారోగ్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
చికిత్స: కరోనా వైరస్ సంక్రమణకు నిర్ధిష్టమైన చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీబయాటిక్ మందులు వైరస్ సంక్రమణలకు పనిచేయవు. కానీ ఇవి ఇతర బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులను నియంత్రించడానికి ఉపయోగపడవచ్చు. తీవ్రమైన అతిసారం వల్ల శరీరంలోని నీటిశాతం బాగా తగ్గిపోతుంది. కాబట్టి కుక్కపిల్లలకు వెంటనే గ్లూకోజ్ సీసాలను ఎక్కించాలి. అతిసారం ఆగిపోయిన తర్వాత 24 గంటల పాటు ఆహారం ఇవ్వకుండా క్రమక్రమంగా కొద్దిమొత్తంలో ఆహారం ఇస్తూ మొదలుపెట్టాలి.
వ్యాధి నియంత్రణ: కుక్కల కరోనావ్యాధికి టీకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ అన్ని కుక్కలకు ఈ టీకా మందును ఇవ్వకూడదు. అది దాని యొక్క జీవనశైలి మరియు టీకాలతో వచ్చు దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని సలహా ఇవ్వాలి. ఈ టీకా కేవలం కుక్కలకు మాత్రమే పనిచేస్తుంది. మనుష్యులలో సంక్రమించే కోవిడ్-19 నివారణకు ఈ టీకా పనిచేయదు.
కళ్యాణి పుట్టి, 9550862090, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ హెడ్, వెటర్నరీ బయోటెక్నాలజీ విభాగం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని మంచి నీటి వనరుల్లో రైతులు ఎక్కువగా మిశ్రమం పెంపక విధానంలోకార్పు రకాల చేపలు పెంపకం చేపడుతున్నారు. దేశీయ కార్పు రకాలైన బొచ్చె, రాగండి, ఎర్రమైల రకాలు, విదేశీ కార్పు రకాలైన గడ్డి చేప, బంగారు తీగ,రకాలతో కలిపి పెంచడం జరుగుతుంది. ఈ విధమైన మిశ్రమ పెంపక విధానంలో పాక్షిక సాంద్ర పద్ధతిలో (ఐలిళీరి రిదీశిలిదీరీరిఖీలి) ఎకరాకు 3 నుండి 4 టన్నులు, పంచాయతీ మరియు కమ్యూనిటీ చెరువులో ఎకరాకు 600 నుండి 800 కేజీల వరకు ఉత్పత్తి జరుగుతున్నది. అయినప్పటికీ పట్టుబడి సమయంలో మార్కెట్కు తరలించే సమయంలో చేపలు నాణ్యత తగ్గడం వలన మార్కెట్లో మంచి ధరలు రాక రైతులు నష్టపోవడం జరుగుతుంది. అందువల్ల చేపలు పట్టుబడి సమయంలో, వాటిని ప్యాక్ చేసి రవాణా సమయంలో కొన్ని జాగ్రత్తలు వహించి సరైన పద్ధతిలో సకాలంలో మార్కెట్లకు తరలించినప్పుడే ఉత్పత్తి చేసిన చేపలకు మంచి ధర పలికి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది.
రైతులు చెరువులో ఉన్న చేపల రకాలు, వాటి సైజులను బట్టి గత కొన్ని రోజులుగా మార్కెట్లో ఏ విధమైన ధరలు ఉన్నాయో తెలుసుకుంటూ ఉండాలి. ధరలు పెరిగే అవకాశం ఉంటే పెంపక కాలాన్ని కొంతకాలం వరకు పొడిగించుకోవచ్చు. అంతేకాకుండా మే, జూన్ నెలలలో పంచాయతీ చెరువుల్లో, కమ్యూనిటీ చెరువుల్లో సాధారణంగా నీటి మట్టం బాగా తగ్గి పట్టుబడులు పెరుగుతాయి. కనుక పెంపక చెరువులోని చేపలకు డిమాండ్ తగ్గి మార్కెట్ ధర పడిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో పట్టుబడిని కొంతకాలం పాటు వాయిదా వేసుకోవాలి.
పట్టుబడికి వారం రోజుల ముందు చెరువు అడుగు భాగం లోని నీటిని తీసి కొత్త నీటితో నింపుకోవడం వల్ల సమయానికి నాణ్యంగా ఉంటాయి. పట్టుబడికి ఒకరోజు ముందు మేత వేయడం నిలిపివేయాలి. ఈ విధంగా చేయడం వల్ల పట్టుబడి సమయంలో చేపలు ఆరోగ్యంగా ఉండి రవాణా సమయంలో నాణ్యత కోల్పోకుండా ఉంటుంది.చెరువు సైజు, చేపల మొత్తం బరువు (బయోమాస్)నుబట్టి చేపలు పట్టే వారికి చెప్పి, వలలు, ఐస్ వంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి. పట్టుబడి చేసే సమయంలో చేపల బరువును ముందుగా అంచనా వేసి రెట్టింపు మోతాదులో ఐస్ పట్టుబడి సమయానికి వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి.
చేపలు పట్టుబడి చల్లని వాతావరణంలో చేసుకుంటే చేపలు తొందరగా పాడవకుండా ఉంటాయి. సాధారణంగా ఉదయం పూట 9 గంటల లోపు పూర్తి అయ్యేలా ఏర్పాటు చేసుకోవాలి. చెరువులోని నీటి పరిమాణాన్ని బట్టి తెల్లవారుజాము కల్లా మూడింట రెండు వంతుల నీరు తగ్గే విధంగా కాలువల ద్వారా నీటిని తీసివేయాలి. నీటిమట్టం తగ్గిన తరువాత లాగుడు వలలతో చెరువు లోతు భాగం నుండి వలను చేపల పై ఎక్కువ ఒత్తిడి లేకుండా పట్టుబడి చేసుకోవాలి.
పట్టుబడి చేసిన చేపలు శ్వాసక్రియ ఆగిపోయి చనిపోయిన వెంటనే వాతావరణంలోని ఉష్ణోగ్రత ఆధారంగా సూక్ష్మజీవుల, జీవ రసాయన చర్యలు ప్రారంభమవుతాయి. అందువల్ల పట్టుబడి చేసిన చేపలను చల్లని నీటితో కడిగి ప్లాస్టిక్ సంచుల్లో గాని వెదురు బుట్టలలోగాని ప్యాకింగ్ చేసే ప్రదేశానికి తీసుకెళ్లాలి. వలను రెండు మూడు సార్లు లాగడం వలన చెరువు అంతా బురదగా మారి చేపలపై బురద, రక్తపు మరకలు, జిగురు ఏర్పడడం జరుగుతుంది. అందువల్ల చల్లని మంచి నీటితో కడగకపోతే చేపలు త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది.
ఈ విధంగా పట్టుబడి చేసిన చేపలను చెరువునకు వీలైనంత దగ్గరగా నీడ ఉండే ప్రాంతంలో గ్రేడింగ్ చేసి తూకం వేసి ప్యాకింగ్ కు ఏర్పాటు చేసుకోవాలి. అన్ని సైజుల చేపలను ఒకే దగ్గర ఉంచితే సరైన ధర లభించదు. చేపల రకాలు, సైజులను బట్టి గ్రేడింగ్ చేసుకుని మార్కెట్ చేసుకుంటే సరైన ధర లభిస్తుంది. గ్రేడింగ్ చేసేప్పుడు గాయపడిన, చెడిపోయిన, వ్యాధిగ్రస్తమైన చేపలను వేరుగా ప్యాకింగ్ చేసుకోవాలి. గ్రేడింగ్ మరియు తూకం కోసం చేపలు బయట వేయాల్సి వస్తే చదునుగా ఉండే నేలపై ప్లాస్టిక్ పరదాలను గాని టార్పాలిన్ షీట్లను గాని పరచి మట్టి, బురద అంటకుండా తొందరగా ప్యాకింగ్ చేసుకోవాలి.
తూకం వేసిన చేపలను ప్లాస్టిక్ పెట్టెల్లో గాని ధర్మకోల్ పెట్టెలలో గాని ఐస్తో కలిపి ప్యాకింగ్ చేసుకోవాలి. దూర ప్రాంతాలకు రవాణా చేసేటప్పుడు చేపలు తాజా స్థితిలో ఉంచడానికి ఐస్ ప్రధాన పాత్ర వహిస్తుంది. ప్యాకింగ్ చేసే సమయంలో పెట్టెలో ముందుగా ఒక లేయర్ ఐస్ వేసి తర్వాత ఒక పొర చేపలు వేసి తరువాత పొరను ఐస్తో కప్పాలి. ఈ విధంగా చేయడం వలన ప్యాక్ చేసిన అన్ని చేపలకు చల్లదనం సమానంగా ఉండి, రవాణా సమయంలో చేపలు పాడవకుండా ఉంటాయి.
లైవ్ ఫిష్ మార్కెట్ విధానం
ఈ మధ్యకాలంలో వినియోగదారుల్లో లైఫ్ ఫిష్ మార్కెట్ పై మంచి అవగాహన పెరిగింది కాబట్టి పట్టుబడి చేసిన చేపలలో కొంత భాగాన్ని లైవ్ ఫిష్ మార్కెట్కు అందిస్తే మంచి ధరలు పొందే అవకాశం ఉంది. లైవ్ ఫిష్ రవాణా చేసే వాహనంలో లేదా టాంకులలో ముందుగా శుభ్రమైన నీటిని నింపుకుని అవసరమైన ఆక్సిజన్ అందించడానికి ఆక్సిజన్ సిలిండర్ లేదా చేపల రవాణాకు వాడే నీటిని తిరగతోడే విధంగా పంపుసెట్లను ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి.పట్టుబడి చేసిన చేపల జీవక్రియ రేటు ఎక్కువగా ఉండి ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుంది అందువల్ల రవాణా చేసే దూరాన్ని బట్టి టాంకులలోగాని వ్యాన్లోగాని వేసే చేపల మొత్తం బరువును నిర్ణయించుకోవాలి. లైవ్ ఫిష్ మార్కెట్కు అందించే చేపల విషయంలో పట్టుబడి చేసిన చేపలను కొంత సమయం పాటు చెరువులో హపాలలో గాని వలలోగాని ఉంచేటు చేయాలి ఈ విధంగా చేయడం వల్ల చేప ప్రేగుల్లో ఉన్న ఆహార పదార్థం మొత్తం బయటికి వెళ్లడం ద్వారా చేపల రవాణా సమయంలో నీరు తొందరగా పాడవకుండా ఉంటుంది. చేపలను వీలైనంత తొందరగా రవాణా చేసే వాహనం వద్దకు తీసుకువచ్చి వాహనం లో నీటిలో వేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.ఈ విధంగా రైతులు మార్కెట్ లో చేపల ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పట్టుబడి చేసేప్పుడు, గ్రేడింగ్, ప్యాకింగ్, రవాణా సమయంలో జాగ్రత్తలు పాటించినట్లయితే చేపలలో నాణ్యత తగ్గకుండా మార్కెట్లో మంచి గిట్టుబాటు ధరలకు అమ్ముకొని లాభాలను ఆర్జించవచ్చు.
సిహెచ్. బాలక్రిష్ణ (9440792616), మత్స్య శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, ఆమదాలవలస, శ్రీకాకుళం; ఎ. దేవీ వరప్రసాద్ రెడ్డి, మత్స్య శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, వెంకట రామన్న గూడెం, పశ్చిమ గోదావరి, పి. ధర్మాకర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, సముద్ర మత్స్య ఎగుమతుల అభివృద్ధి సంస్థ, విశాఖపట్నం;
బి. మధుసూధనరావు, మత్స్య అభివృద్ధి అధికారి,మత్స్య కమీషనర్ కార్యాలయం, విజయవాడ, డి. చిన్నం నాయుడు, ప్రోగ్రాం కో ఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, ఆమదాలవలస, శ్రీకాకుళం.
ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుండే తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు, వరదలు ప్రారంభమై పంటలకు, పండ్ల తోటలకు కళ్లాలోని ధాన్యాలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. మే నెలలోనే కొన్ని జలాశయాలలో నీటిమట్టాలు గణనీయంగా పెరిగాయి. రాబోయే సెప్టెంబరు-అక్టోబరు నెలల వరదల భయాలు కొనసాగనున్నాయి. సాగు నీరు, మురుగునీటి యాజమాన్యం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంతృప్తికరంగా లేనందువల్ల డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి అశుభ్ర అనారోగ్య వాతావరణం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల తీవ్రత ఎక్కువగానే ఉండవచ్చుననే ఆందోళన ప్రజలలో నెలకుంది. వరదలు, సుదీర్ఘ వానలు లోపించిన డ్రైనేజి వ్యవస్థ వల్ల వ్యాధిక్రిములు, వాటిని విస్తరింపచేసే దోమలు, జోరీగలు, పిడుదులు, గోమార్ల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ప్రతికూల వాతావరణ యాజమాన్య పరిస్థితులలో పశువులలో ముఖ్యంగా మన రాష్ట్రాలలో పాడికి ముఖ్య ఆధారమైన గేదెలకు సోకే ప్రాణాంతకమైన గురకవ్యాధి లేదా గొంతువాపు వ్యాధి చాలా ముఖ్యమైనది. గేదెలతోపాటు, తెల్ల పశువులు, మేకలు, గొర్రెలు, గాడిదలు, చివరకు ఏనుగులలో సైతం పాశ్చురెల్లా మల్టోసిడా మరియు పాశ్చురెల్లా హిమోలైటికా అనే బ్యాక్టీరియా వల్ల ఈ ప్రాణాంతక వ్యాధితో ఏటా కొన్ని వేల పాడి గేదెలు, దూడలు, పడ్డలు, పెయ్యలు, దున్న కుర్రలు, దున్నలు మరణిస్తున్నాయి. తెల్ల పశువులలో కంటే గేదెలలో ఈ వ్యాధివల్ల జరిగే ప్రాణ నష్టం సుమారు మూడురెట్లు అధికం కాబట్టి గేదెల పెంపకందారులందరూ ఈ వ్యాధిపట్ల ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి.
త్రాగునీరు, కలుషిత వాతావరణం, అనారోగ్య పశువుల స్పర్శ, కలుషితమైన గాలి, మేత, పరికరాలు మరియూ ఈగలు, జోరీగల వంటి కీటకాల ద్వారా ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా వరదల తర్వాత నిలిచిపోయిన మురుగునీటిలో, అశుభ్రమైన పశువుల పాకలు, వాటి పరిసరాలు ఈ వ్యాధి వ్యాప్తికి కారకమౌతాయి.
ముఖ్యంగా శ్వాసవ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుట వల్ల ఈ వ్యాధికి గురక వ్యాధి అని, గొంతు, మెడ, క్రిందిభాగాలు నీటితో వాయుట వల్ల గొంతువాపు అని తెలుగువారు పిలుస్తారు. రక్తంలో విస్తరించి, శరీర అంతర్గత భాగాలలో రక్తచారికల్పి కల్పించుట వల్ల ఈ వ్యాధిని ఇంగ్లీషులో హీమోరేజిక్ సెప్టిసీమియా (హెచ్.ఎస్.) వ్యాధి అని అంటారు.
గురక వ్యాధి లక్షణాలు: వ్యాధిక్రిములు వివిధ మార్గాల ద్వారా శరీరంలోకి ప్రవేశించిన 8 నుండి 32 గంటలలో వ్యాధి లక్షణాలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాలలో ఏ లక్షణమూ కనిపించకుండానే ఆకస్మికంగా పడ్డలు, దూడలు మరణించవచ్చును. సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు 6 నుండి 36 గంటల వరకు కనిపించి, సకాలంలో సరైన వైద్యం అందకపోతే పశువు శ్వాస ఆడక చనిపోవచ్చు.
మేత, నెమరు మందగించుట, పాలు నిలిచిపోవుట, గొంతు క్రింద ప్రారంభమైన జలవాపు (ఇడిమా) క్రమక్రమంగా మెడ క్రిందికి, ఆ తర్వాత ముందుకాళ్ల మధ్య ఎదురు రొమ్ము క్రింది భాగాలకు చేరుతుంది. పశువు తీవ్రమైన ఆయాసంతో రొప్పుతూ, గురకపెడ్తూ, ముక్కు నుండి నోటి నుండి నురగ వంటి స్రావాలను కారుస్తూ ఉంటుంది. శరీరం చెవి దగ్గర తాకి చూస్తే వేడిగా ఉంటుంది. జ్వరం 104 నుండి 107 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉండవచ్చు. కనుపాపలు ఎర్రగా మార్పు చెందవచ్చు. పశువు అడ్డం పడిపోయి కొన్ని గంటలలోనే మరణిస్తుంది. కొన్ని సందర్భాలలో మూత్రం ఎర్రగా లేదా చాక్లెట్ రంగుకు మారవచ్చును.
వ్యాధి నిర్ధారణ: ప్రాణాంతకమైన గురకవ్యాధి విస్తృతంగా వ్యాపించే లక్షణం కలిగి ఉన్నందున, రక్తపు నమూనాలు సేకరించి, పరీక్షలు జరిపించి, వ్యాధి నిర్ధారణ చేయుట వల్ల ఇతర పశువులకైనా సకాలంలో సరియైన చికిత్స చేయించుట, లేదా సరియైన టీకాలు వేయించుటతో పాటు ఇతర నివారణ చర్యలు చేపట్టవచ్చును. అవసరమైతే శవపరీక్షలు జరిపించి, లోపలి అవయవాలలో కనిపించే మార్పులవల్ల కూడా వ్యాధినిర్ధారణ చేయగల్గితే మరీ మంచిది.
గురకవ్యాధి చికిత్స: పశువును ప్రశాంతంగా విశ్రాంతిలో ఉంచాలి. రోజుకు నాలుగైదు సార్లు సాంబ్రాణి దూపం వేసి శ్వాస పీల్చుకునే ఏర్పాటు చేస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. పశువును పరీక్షించుటకు గానీ, ఇంజక్షన్లు చేయుటకు కానీ పశువును పడవేయకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ బంధించవలసి వచ్చినప్పటికీ ఆందోళన కలిగించకుండా చాలా సున్నితంగా, శ్వాసకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తవహించాలి.
ఎన్రోఫ్లాక్ససిన్ సిప్రాఫ్లాక్ససిన్ జెంటామైసిన్, సల్ఫా, పెన్సిలిన్ వంటి ఏదైనా యాంటిబయోటిక్ ఇంజక్షనును వరుసగా కనీసం 3-4 రోజులు వాడవలసిన రీతిలో వాడాలి.
మెలాక్సికామ్-ప్రోడ్నిసలోన్ వంటి బాధను, ఇతర లక్షణాల తీవ్రతల్ని తగ్గించే ఇంజక్షన్లు అవసరాన్ని బట్టి వాడాలి. వ్యాధిని తట్టుకోగల శక్తిని పెంచే లెవామెజోల్ ఇంజక్షనుతో చికిత్సను ప్రారంభించవచ్చు.
గురకవ్యాధి నివారణ: వ్యాధి సోకిన పశువును గుర్తించిన లేదా అనుమానించిన వెంటనే ఇతర పశువుల నుండి దూరంగా, పరిశుభ్రమైన ప్రశాంతమైన స్థలానికి తరలించాలి.
ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పశువుల్ని, జీవాలను, సర్కసు జంతువుల్ని కనీసం వారం రోజుల పాటు వేరుగా పరిశీలనలో ఉంచి, ఆ తర్వాత మాత్రమే (పాత) సొంత పశువులతో కలవనివ్వాలి. పశువుల పాకలు, పాకల పరిసరాలలో క్రిమికీటకాలు చేరకుండా శుభ్రంగా, పొడిగా ఉంచి సున్నం, డి.డి.టి., గమాక్సిన్, సైపర్మెథ్రిన్, డెల్టామెథ్రిన్ వంటి కీటకనాశకాలను స్ప్రే చేయాలి.
వ్యాధిసోకిన పశువుల కళేబరాలను, వ్యర్థాలను, దూరంగా తరలించి లోతైన గుంతలలో పాతివేయాలి తప్ప పచ్చికబీళ్లు, పంట భూములు, చెరువులు, వాగులు, కాల్వలు, నదులలోకి వదిలి వేయరాదు. ఇందుకు అవసరమైతే గ్రామ పంచాయతీలు, పాలసహకార ససంస్థలు, ప్రభుత్వము వారి సహాయ సహకారాలు పొందే కృషి చేయాలి.
గురకవ్యాధి నివారణ టీకాలు: ఆరు నెలల నుండి సంవత్సరకాలం వరకు గురకవ్యాధి సోకకుండా రక్షణనిచ్చే అల్యూమినియం మోనోస్టిరేట్ మరియు ఆయిల్ ఎడ్జువెంటు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఈ వ్యాధి ఉనికివున్న ప్రాంతాలు, గ్రామాలు, నదీతీరాలలో తొలకరి ప్రారంభంలోనే ఒక్కొక్క మందలో (గ్రామంలో) కనీసం 90 శాతం పశువులు, జీవాలకు ఈ టీకాలు వేయించాలి. అప్పటికే వ్యాధి కనిపించిన గ్రామాలను, మూడు వృత్తాలుగా విభజించి, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న బైట వృత్తంలో మొదట, అనుమానస్పందగా ఉన్న మధ్యవృత్తంలో ఆ తర్వాత వ్యాధి కనిపించిన కమతంలో ఆఖరున టీకాలు వేస్తే, వాక్సినేటర్ల ద్వారా, వారి పరికరాల ద్వారా అనారోగ్య పశువులు, అనుమానాస్పద పశువుల నుండి ఆరోగ్యవంతమైన పశువులకు గురకవ్యాధి బాక్టీరియా వ్యాపించకుండా ఉంటుంది. టీకాలకు వినియోగించే సూదులు, సిరంజిలను ఎప్పటికప్పుడు మరిగే నీటితో శుభ్రపరుస్తూ ఉండాలి.
గురకవ్యాధితో పాటు, కనిపించే జబ్బవాపు (బ్లాక్క్వార్టర్) గాలికుంటు (ఫుట్ అండ్ మౌత్ అనే వైరస్ వ్యాధి) వ్యాధుల నివారణకు సమర్ధవంతంగా పనిచేసే సంయుక్త వాక్సిన్లను ఇండియన్ ఇమ్యునొలాజికల్స్ లిమిటెడ్ వంటి వ్యాక్సిన్ సంస్థల నుండి లభిస్తున్నాయి. ఈ సంయుక్త వాక్సిన్ల వల్ల, దీర్ఘకాలం పనిచేసే ఆయిల్ ఎడ్జువెంట్ వ్యాక్సిన్ల వల్ల, పదే పదే పశువుల్ని అనవసరంగా టీకాల వత్తిడికి, ఆందోళనకు గురిచేసే అవసరం తగ్గటమే కాక, రైతులకు ఖర్చులు, శ్రమలు కూడా బాగా తగ్గుతాయి. టీకాల ద్వారా నివారించబడే గురక వ్యాధి మరణాలకు బీమా పరిహారాలు లభించవని యజమానులు గుర్తించాలి.
వానాకాలంలో ముఖ్యంగా వరదలు, తుపాన్లు వచ్చిన వెంటనే ఎక్కువగా కనిపించే గురకవ్యాధి పట్ల పాడి రైతులు అప్రమత్తంగా ఉండి, వ్యాధి సోకిన పశువుల్ని గుర్తించిన వెంటనే చికిత్స చేసి ప్రాణాలు కాపాడుటకు, పశువైద్యుల సేవల్ని సకాలంలో పొందుట, ఇతర పశువుల్ని టీకాలతో పాటు, ఇతర మార్గాల ద్వారా వ్యాధిని నివారించే చర్యలు తీసుకొనుట చాలా అవసరం.
మనది వ్యవసాయక దేశం. వ్యవసాయంలో కష్టం (శారీరక శ్రమ) ఉంటుంది. వ్యవసాయేతర రంగాలు అంటే ఉదాహరణకు వ్యాపార, ఉద్యోగ రంగాలలో వ్యవసాయరంగంతో పోల్చుకుంటే శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. మరియు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉండవు కాబట్టి సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని సుఖాన్ని అనుభవించటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. సుఖం…. సంతోషం… ఆనందం… ఆరోగ్యం…. వీటన్నింటికి అవినాభావ సంబంధం ఉంటుంది. సకల సౌకర్యాలతో సుఖపడితే ఆరోగ్యంగా ఉండటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆరోగ్యం లేని జీవితాలలో సంతోషం, ఆనందం ఉండదు. శరీరాన్ని కష్టపెడితేనే ఆరోగ్యంగా ఉండటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆరోగ్యం పదిలంగా ఉంటేనే ఆనందంగా ఉండగలము అనే విషయం తెలిసిందే. ఈ విషయాలను గ్రహించి తమకు సుఖం కంటే ఆనందం ముఖ్యం అని చేస్తున్న, అనుభవిస్తున్న సుఖమైన ఉద్యోగాలను, సౌకర్యాలను కాదనుకొని ఆనందం కోసం పంటల సాగులో అడుగుపెట్టారు కడప జిల్లా రామాపురం మండలం, గోపగుడిపల్లికి చెందిన దంపతులు అశోక్రాజు, అపర్ణ.
వీరిది వ్యవసాయ నేపథ్యం. ఇద్దరూ కూడా బి.టెక్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ తాము పుట్టిన గ్రామాలకు దూరంగా పట్టణాలలో జీవితాలను కొనసాగిస్తూ వస్తున్నారు. భార్యభర్తలు ఇద్దరూ కూడా మంచి జీతాలు లభించే సాఫ్ట్వేర్ రంగంలోనే ఉన్నారు కాబట్టి మంచి ఆదాయం పొందుతూ కార్లు, ఎ.సి.లు, బంగ్లాలు లాంటి సౌకర్యాలతో విలాసవంతమైన, సుఖమైన జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. కానీ వీరి జీవితంలో ఆనందం కొరవడింది. ఇద్దరికి ఉద్యోగాలలో వుండే పని ఒత్తిడిలు, నగరాలలో ఉండే ఉరుకుల పరుగుల జీవితం లాంటి పరిస్థితుల వలన ఏదో తెలియని ఇబ్బంది ఎదుర్కొంటూ ఆ ఇబ్బంది ఏమిటని వారికి వారు ప్రశ్నించుకోగా తాము సుఖంగా ఉంటున్నాం గాని ఆనందంగా ఉండాలేకపోతున్నాం అని అర్థం చేసుకోగలిగారు. ఇలాంటి పరిస్థితులకు కారణాలు ఆలోచించగా… మన పెద్దలు, పూర్వీకులు తమ జీవితాలను ఆనందంగా గడిపారు కాబట్టి వారి పెద్దల జీవనశైలిని గుర్తు చేసుకున్నారు. వారి పెద్దలు వ్యవసాయ రంగంలో వున్నారు కాబట్టి సుఖంగా లేకపోయిన ఆనందంగా ఉండగలిగారు. కానీ మనం సుఖం కోసం ఆనందాన్ని వదులుకోని వచ్చాం కాబట్టి మనం జీవితంలో ఆనందాన్ని కోల్పోతున్నాం అని గ్రహించి వారంతపు శెలవు దినాలలో చుట్టు ప్రక్కల అందుబాటులో వుండే పంట పొలాలకు వెళ్ళి వారాంతపు సెలవు దినాలను ఆ పంట పొలాలలో గడుపుతూ వస్తున్నారు. పంట పొలాలలో గడిపిన రోజులు వీరికి ఆనందంగా గడిచాయి. కానీ సుఖాన్ని వదులుకొని కష్టపడవలసి వచ్చేది. ఈ విషయాలు వీరు ప్రత్యక్షంగా అనుభవించారు. మనిషి జీవితానికి సుఖం కంటే ఆనందం ముఖ్యం అని గ్రహించి చేస్తున్న ఉద్యోగాలను వదిలి పొలంబాట పట్టారు. వీరి నిర్ణయాన్ని వీరి పెద్దలు మొదటలో అంగీకరించలేదు. కానీ వ్యవసాయంలో అడుగుపెట్టి కొంత కాలం గడిచిన తరువాత వీరి పెద్దలు కూడా వీరి నిర్ణయానికి ఆనందిస్తూ వీరి వ్యవసాయంలో తమవంతు పాత్రను పోషిస్తున్నారు.
వ్యవసాయంలో అడుగుపెట్టి మొత్తం 27 ఎకరాలలో వివిధ రకాల పంటలు పూర్తి ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తూ వస్తున్నారు. వీరి ప్రాంతం నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇలాంటి ప్రాంతం ఏ పంటలకు అనుకూలంగా ఉంటుందని తెలుసుకోవడం గురించి విచారించి నీరు తక్కువగా ఉన్న ప్రాంతాలలో డ్రాగన్ ఫ్రూట్ సాగు అనుకూలంగా తెలుసుకుని ఆ సాగు వైపు అడుగులు వేశారు. డ్రాగన్ ఫ్రూట్ సాగుకి పెట్టుబడి ఎక్కువవుతుంది. అయినా కానీ వెనుకంజ వేయకుండా ఎకరానికి సుమారు 7 లక్షల రూపాయల ఖర్చు పెట్టి డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అవసరమైన స్థంభాలు, టైర్లు, మొక్కలు లాంటివి ఏర్పాటు చేసుకున్నారు.
మొదట్లో అర ఎకరానికి అవసరమైన మొక్కలను తైవాన్ దేశం నుంచి ఎక్కువ ధరపెట్టి తెప్పించి నాటుకున్నారు. తరువాత తమ మిగతా పంటకు అవసరమైన మొక్కలను తామే అభివృద్ధి పరచుకుని మొత్తం ఒక ఎకరం పొలాంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు కొనసాగిస్తున్నారు. మొదటి సంవత్సరం ఎకారానికి 800 కిలోల దిగుబడి పొంది, ప్రతి సంవత్సరానికి దిగుబడి పెరుగుతూ వస్తుంటే మూడవ సంవత్సరం ఎకరానికి 2 టన్నుల దిగుబడి సాధించారు. వచ్చిన దిగుబడిని సొంతంగా మార్కెట్ చేసుకుంటూ మంచి ఆదాయం గడిస్తున్నారు. పంట దిగుబడితోపాటు తోటి రైతులకు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను కూడా అమ్మి అధిక ఆదాయాన్ని గడిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ పంటకి చీడపీడల సమస్య పెద్దగా ఉండదు కాబట్టి ఈ పంట ప్రకృతి సేద్య విధానానికి బాగా అనుకూలంగా వుంటుంది. క్రమం తప్పకుండా భూమికి పశువుల ఎరువును అందిస్తూ వస్తున్నారు. మొదట్లో డ్రాగన్ ఫ్రూట్లో అంతరపంటగా వేరుశనగ వేసి మంచి దిగబడి సాధించారు.
చెఱకు: చెరకు పంటను కూడా సాగు చేస్తూ వస్తున్నారు. మామూలు పద్ధతిలో చెరకు నాటితే అధిక వర్షాలకు పంట దెబ్బతింటుంది కాబట్టి రింగ్పిట్ పద్ధతిలో చెరకును సాగు చేస్తున్నారు. ఈ పద్ధతిలో చెరకు సాగు ఖర్చు కొద్దిగా పెరుగుతుంది. అయిన కానీ దిగుబడి కూడా పెరుగుతుంది కాబట్టి ఈ పద్ధతిలో చెరకును సాగు చేస్తూ పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్నారు. వచ్చిన దిగుబడిని బెల్లం చేసి, బెల్లాన్ని నేరుగా వినియోగదారులకు మంచి ధరకు అమ్మి తమ చెరకు సాగుని లాభాలబాటలో సాగిస్తున్నారు.
డ్రాగన్ ఫ్రూట్, వేరుశనగ, వరి, చెరకు లాంటి పంటలకు పూర్తి సేంద్రీయ పద్ధతులతో పండిస్తూ తమ పంటల సాగును లాభాలబాటలో నడిపిస్తూ ఉద్యోగాలలో పొందిన ఆదాయాన్ని పంటల సాగులో కూడా పొందుతూ ఆనందంగా ముందుకు సాగుతూ ఆనందం కావాలంటే తప్పనిసరిగా కష్టపడాలి… సుఖపడితే ఆనందం దొరకదని అంటున్నారు. మరిన్ని వివరాలకు అశోక్రాజును 95028 26931 ఫోన్ ద్వారా సంప్రదించగలరు.
ప్రస్తుత వ్యవసాయంలో చదువు తప్పనిసరి
గతంలో అంటే వ్యవసాయంలో రసాయనాలు రాకముందు రైతులందరూ పశువులను పోషిస్తూ పశువ్యర్థాలు పంటలకు అందిస్తూ పంట వ్యర్థాలను పశువులకు అందిస్తూ వ్యవసాయాన్ని కొనసాగించేవారు. అప్పట్లో భూములలో పోషకాలు సమృద్ధిగా ఉండేవి కాబట్టి చీడపీడల సమస్య పెద్దగా ఉండేది కాదు. దిగుబడులు కొంచం అటో… ఇటో… అయినా కానీ పంటల సాగుకి పెద్దగా ఆలోచించవలసిన అవసరం ఉండేది కాదు. అప్పట్లో ఉపయోగించిన విత్తనాలు కూడా నాణ్యతగలవి. కాబట్టి చీడపీడలను తట్టుకోగలిగి పంటలు పెరిగేవి. కానీ రానురాను వ్యవసాయంలో రసాయనాలు, హైబ్రిడ్ విత్తనాలు ప్రవేశించిన తరువాత తెలిసో… తెలియకో… రైతులు పశుపోషణకు దూరం జరిగి భూమికి సేంద్రీయ పదార్థాలను అందించకుండా పూర్తిగా రసానాయనాల మీద ఆధారపడి పంటలసాగు చేయడానికి అలవాటు పడ్డారు. దీనివలన పంటలపై చీడపీడల ప్రభావం పెరిగి వీటి నివారణకు ఖర్చులు పెరిగి రైతులకు పెట్టుబడులు పెరిగి పంటల సాగు నష్టాలను మిగులుస్తూంది. ఇటువంటి విపత్కర పరిస్థితులలో గుడ్డిగా వెళ్ళకుండా అన్నింటినీ అంటే నేలను, నేలలో వుండే పోషకాలను, విత్తనాలను, విత్తనాలలోని రోగనిరోధక వ్యవస్థను, వాతావారణాన్ని… ఈ విధంగా అన్ని విషయాలను అవగాహన చేసుకుంటూ ప్రతినిత్యం వచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని, కొత్త పంటలను, కొత్త విధానాలను, కొత్త యంత్ర పరికరాలను కక్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ పంటల సాగు కొనసాగించాలి. ఇవన్నీ చేయాలంటే రైతులకు తప్పనిసరిగా చదువు ఉండాలంటున్నారు వీరు. చదువుకొన్నవారు వ్యవసాయంలో అడుగుపెట్టాలి. ప్రతి ఇంట్లో ఒక చదువుకున్న రైతు ఉండాలి. అప్పుడే మనం, మన దేశం, మన రైతు, మన ఆరోగ్యం సక్రమంగా ఉండి ఆనందమైన జీవితాలను గడపగలము అని అంటున్నారు.
కండ్ల కలక అనేది కంటికి సోకే ఇన్ఫెక్షన్ను సూచిస్తుంది. దీనినే వ్యావహారిక భాషలో ‘కళ్ళ కలక’ అనీ వైధ్యాభాషలో ‘కంజక్తివైటిస్’ అంటారు. ఇది చూడటానికి మనుషులలో వచ్చే మద్రాస్ ఐ మాదిరి ఉంటుంది. ఈ పరిస్థితిలో కంటిలోని తెల్లటి భాగం ఎర్రగా లేదా గులాబీ రంగులోకి మారుతుంది. సాధారణంగా గులాబీ కళ్ళు అని కూడా అంటారు. కండ్ల కలక సాధారణంగా కంటిలో తెల్లగుడ్డు లేదా కళ్లల్లోని తెలుపు రంగు పొరను ఆవరించి ఉండే కణజాలం అయిన కనురెప్ప వాపు వల్ల ఏర్పడుతుంది. ముఖ్యంగా సరైన పరిశుభ్రత లేకపోవడం దానికి కారణం. అతి తేలికిగా ఒకదాని నుంచి మరొక దానికి సంక్రమిస్తుంది. ‘కళ్ళకలక’ వివిధ రకాలవ్యాధి క్రిములవల్ల వస్తుంది. సాధారణంగా వచ్చే కళ్ళ కలకకు స్టఫాలోకోకస బాక్టీరియా క్రిమే కారణం ఈ కళ్ళ కలక ముందు ఒక కంటికి ప్రారంభమైనా, రెండవ పూటకి రెండవ కంటికి కూడా సంక్రమిస్తుంది. వ్యాధి వచ్చినప్పుడు కంటినుంచి కారే నీరుద్వారా, పుసులు ద్వారా రెండవవారికీ తేలికగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
కారణాలు
కండ్ల కలకకి, సాధారణంగా వైరస్, బాక్టీరియాలు, ఎలర్జీలు కూడా కారణం కావచ్చు.
ముఖ్యమైన వాటిలో ఎడినోవైరస్, ఫంగై, బాక్టీరియా (స్టెఫిలోకోకస్, ఎపిడెర్మిడిస్, స్టెఫిలోకోకస్ అరియోస్, స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా, హిమోఫిలస్ ఇన్ఫ్లుయాంజా).
వైరస్ క్రిముల వల్లకూడా సాధారణంగా కళ్ళకలక వస్తుంది. వైరస్ వల్లవచ్చే కళ్ళకలకలో మామూలుగా వచ్చే కళ్ళకలకలోలాగా పుసులు కట్టడం, రెండుకళ్ళు అంటుకుని పోవడం జరగదు. వైరస్ వల్ల వచ్చే కళ్ళకలక ముందు ఒక్క కంటితోనే ప్రారంభం అవుతుంది. కళ్ళు ఎర్రబడతాయి, బాగా మండుతాయి, కళ్ళవెంట నీళ్ళు బాగా కారతాయి. వెలుతురూ చూస్తే మరింత నీళ్ళు కారతాయి. ఈ కళ్ళకలక కూడా మూడు – నాలుగు రోజుల్లో తగ్గుతుంది.
రోగ నిరోధక వ్యవస్థలో ఏర్పడే లోపాలు, కంటి లోపల పెరిగిన ఒత్తిడి, రక్త ప్రసరణ వ్యవస్థకి సంబంధించిన ఇతర సమస్యలు.
రోగ నిర్ధారణ
కంటిని పరిశీలించడం ద్వారా, కండ్ల కలకను నిర్ధారిస్తారు. ఒక వేళ ఏదైనా ఇన్ఫెక్షన్ సోకితే, దానికి కారణమైన సూక్ష్మ క్రిమిని గుర్తించేందుకు కల్చర్ పరీక్షని నిర్వహించవచ్చు.
చికిత్స
వైరస్ వల్ల కలికిన కండ్ల కలక సాధారణంగా ఎలాంటి మందులు లేకుండా రెండు వారాలలో తగ్గిపోతుంది. హెర్పిస్ వైరస్ కార్నీయాని సోకితే తగ్గేవరకు మందులను వాడమని సూచించవచ్చు.
కళ్ళకలక వచ్చినప్పుడు శుభ్రమైన నీళ్ళతో కళ్ళు శుభ్రంచేస్తూ ఉండాలి. కళ్ళలో టెర్రామైసిన్, సోఫ్రామైసిన్ లాంటి కంటి అయింటుమెంట్లు వాడాలి. అవసరాన్ని బట్టి యాంటి బయాటిక్స్ వాడవలసి ఉంటుంది. కళ్ళకలక వచ్చినప్పుడు మందువాడితే రెండు మూడు రోజుల్లో కొంతవరకూ తగ్గిపోతుంది. పూర్తిగా వ్యాధి తగ్గేవరకు మందువాడాలి. సాధారణంగా కంటికి వచ్చే ఈ వ్యాధివల్ల ఎటువంటి దుష్పలితాలు ఉండవు, సరైన చికిత్స పొందకుండా వ్యాధిని నిర్లక్ష్యం చేయడంవల్ల, నాటువైద్యం చేయడంవల్ల కంట్లో పుండు ఏర్పడే ప్రమాదం మాత్రం వుంది.
కంటి కనురెప్పలకు ఒక్కొక్కసారి ప్రేడ్నిసలోన్, డేక్సామితసాన్ వంటి కార్టికోస్తీరాయిడ్స్ను కనురెప్పలకు ఇవ్వడము వలన కూడా పలితాలు ఉంటాయి.
ఇన్ఫెక్షన్లతో కూడిన బ్యాక్టీరియా సోకిన సందర్భంలో, యాంటీబయాటిక్స్ను కంటిలో వేసుకునే చుక్కలు, ఆయింట్మెంట్లు లేదా మాత్రల రూపంలో అందించవచ్చు.
మంట పుట్టించే పదార్ధాల వల్ల కండ్ల కలక కలిగితే, కళ్ళని స్వచ్ఛమైన నీటితో ఐదు నిమిషాల పాటు శుభ్రపరుచుకోవాలి. ఆమ్లాలు, క్షారాల వంటి తీవ్రమైన మంట పుట్టించే పదార్ధాలు కంటికి తగిలినప్పడు మీ వైద్యులను సంప్రదించండి.
ఎలర్జీ వల్ల కలిగే కండ్ల కలక, ఆ ఎలర్జీకి చికిత్స చేసి, దాని కారకాన్ని తొలగించినప్పడే మెరుగవుతుంది. ఎలర్జీకి సంబంధించిన కండ్ల కలక చికిత్సలో, మంటల్ని తగ్గించే మందులు, దురదల్ని తగ్గించే యాంటీ హిస్టమైన్స్ వంటివి ఉన్న మందులను ఉపయోగించాలి. కళ్ళ మంటని తగ్గించడానికి అప్పుడప్పుడు స్టిరాయిడ్లను కూడా ఉపయోగించవచ్చు.
సమస్యలు
కండ్ల కలక సమస్యలు అది ఎలర్జీ వల్ల కలిగినదా లేదా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినదా అన్న దాని మీద ఆధారపడి ఉంటాయి. క్లమేడియా ఇన్ఫెక్షన్ వ్యాధి సందర్భంలో ఆ కండ్ల కలక కొన్ని నెలల పాటు కొనసాగవచ్చు.
కొన్నిసార్లు కార్నియా వాచి, శుక్ల పటలపు కోత అనే ఒక పరిస్థితికి దారి తీయవచ్చు. శుక్ల పటలపు కోత ఫలితంగా ఏర్పడిన కంతులు చివరికి చూపుని శాశ్వతంగా పోగొట్టే అవకాశముంది.
ఎక్కువసార్లు కనురెప్పలు చీము పట్టిన దూడలలో చిన్న కోత పెట్టి లోపల ఉండే చీమును బయటికి తీసి శుభ్రము చేసి చికిత్స చేయవలెను.
నివారణ
అంటు రోగమైన కండ్ల కలకని నివారించేందుకు తరుచూ శుభ్రపరుచుకోడమన్నది ఒక గొప్ప పద్ధతి.
కళ్ళని రుద్దడాన్ని నివారించాలి.
కళ్ళను తుడిచిన తరవాత మీ చేతుల్ని తప్పనిసరిగా శుభ్రపరుచు కోవాలి.
వాడే వస్తువులు రోజు సబ్బు నీటితో శుభ్రంగా కడగాలి.
కంటిని తుడుచుకున్న లేదా తాకిన తరువాత చేతుల్ని శుభ్రపరుచుకోవాలి.
వేరే దూడలను తాకడాన్ని నివారించండి.
చికిత్స కోసం మీ వైద్యుడిని సంప్రదించండి.
కళ్ళ కలక ఒక అంటురోగం. కాబట్టి వైద్యులు అనుమతించే దాకా వాటిని వేరే దుడలతో కలపకూడదు.
ప్రమాద సంకేతాలు
ఈ కింది లక్షణాలు కనిపించినప్పడు వైద్యులను సంప్రదించండి.
కళ్ళు ఎర్రగా మారి దురద పుట్టినప్పడు.
రెండు, మూడు రోజుల తరువాత కూడా గుణం కనిపించకపోతే.
కళ్ళు అంటుకు పోవడానికి దారితీసే చిక్కటి స్రవాలు కారుతున్నప్పడు.
తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు.
కళ్ళు రెప్పలు వాచినప్పుడు
కండ్ల కలక సామాన్య లక్షణాలు
కళ్ళల్లో మంట పుట్టడం, ఎర్రబడడం, దురదలు.
కళ్ళ నీళ్ళు ఎక్కువగా కారడం.
ఉదయం లేచేసరికి రెండు కనురెప్పల్ని అంటుకునేలా చేసే పసుపు లేదా రంగు లేని స్రవాలు
కనురెప్పలు వాచడం.
విపరీతమైన కంటి నొప్పి, కంటి దురద, కళ్ళల్లో మంట పుట్టిన అనుభూతి.
చూపు మసకబారడం.
రెండు కళ్ళు పూర్తిగా అంతుకుని పోయి కళ్ళనిండా పుసులు ఉంటాయి
మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు అందించడంలో కూరగాయల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రపంచ ఆహార సంస్థ నిర్ధేశించిన విధంగా ప్రతి మనిషికి సగటున రోజుకు 300 గ్రా. కూరగాయలు ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ మనదేశంలో కేవలం 230 గ్రా. మాత్రమే లభ్యమవుతున్నాయి. కావున కూరగాయల ఉత్పత్తిని పెంచవలసిన అవసరం ఉంది. ప్రపంచంలో చైనా తర్వాత భారతదేశం కూరగాయల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్నప్పటికీ, ఉత్పాదకతలో వెనుకబడి ఉన్నాం. భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో సంవత్సరం పొడవునా కూరగాయలు పండించుటకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ దిగుబడి తక్కువగా ఉంది. సాధారణంగా కూరగాయలు ఖరీఫ్, రబీ, వేసవి కాలంలో సాగు చేస్తారు. రబీ మరియు వేసవితో పోలిస్తే ఖరీఫ్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి రుతుపవనాల రాక నుంచి రుతుపవనాల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పవచ్చు. ఈ పంటలు సాధారణంగా జూలై నెలలో ప్రారంభమయ్యే తొలకరి వర్షాలలో నాటుతారు. ఈ కాలాన్ని నైరుతి రుతుపవనకాలం అంటారు. ఖరీఫ్లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండి దిగుబడి పెరగడం వల్ల రైతుకు ఆదాయం పెరుగుతుంది. కావున ఖరీఫ్ కూరగాయల సాగులో రైతు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే పంట నష్టం నుంచి బయటపడటంతో పాటు వినియోగదారులకు సరసమైన ధరకు కూరగాయలను అందించే అవకాశం ఉంది.
నేల: సారవంతమైన తేలికపాటి నేలలు లేదా బాగా నీరు ఇంకే బరువైన గరప నేలలు కూరగాయల సాగు చేపట్టడానికి అనుకూలంగా ఉంటాయి. బీడు భూములు, మురుగు నీరు పోయే సదుపాయం లేని భూములు కూరగాయల సాగుకు అనుకూలం కాదు.
పొలం తయారీ: పొలాన్ని మూడు, నాలుగు సార్లు బాగా దున్ని దుక్కిలో ఒక హెక్టారుకు 15-20 టన్నుల మాగిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. పొలంలో వరుసగా ఒకే పంట వేయకుండా పంట మార్పిడి చేయాలి.
నారుమళ్ళ తయారీ: కొన్ని రకాల కూరగాయ పంటలకు ముందుగా నారుపోసి తర్వాత పొలంలో నాటాలి. టమాట, వంగ, పచ్చిమిర్చి పంటలకు నారు పోసేటప్పుడు ఎత్తు నారుమడులు తయారు చేసుకోవాలి.
నారుమళ్ళలో వచ్చే నారుకుళ్ళు తెగులు నివారణకు విత్తనశుద్ధి చేసుకుని విత్తనాలను పది సెం.మీ. ఎడంలో వరుసల్లో రెండు సెం.మీ. లోతులో విత్తిన తరువాత పశువుల ఎరువుగానీ, మట్టి లేదా ఇసుకతో గానీ కప్పాలి. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసేయాలి. 4-6 వారాల వయస్సు కలిగిన, 8-10 సెం.మీ. ఎత్తు పెరిగిన మొక్కలను నాటాలి.
నారు నాటే విధానం: నారును సాయంత్రం సమయాల్లో నిర్ణీత దూరాల్లో నాటాలి. విత్తనాలైతే నిర్ణీత దూరంలో ఎకరానికి నిర్ణీత పరిమాణంలో నాటాలి. చిక్కుడు, బెండ, సొరకాయ వంటి పెద్దగింజలను కొంచెం లోతుగాను, ముల్లంగి వంటి చిన్న గింజలను కొంచెం పైపైన నాటాలి.
అధిక దిగుబడికి సూచనలు:
నేలలో గల పోషక పదార్థాలను భూసార పరీక్ష ద్వారా నిర్ధారించుకొని పంటలకు కావాల్సిన పోషకాలను నిర్ణీత మోతాదులో అందించాలి.
చీడపీడల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
పంట కాలంలో నేలలో తగినంత తేమ లేని పక్షంలో దిగుబడి తగ్గుతుంది.
బిందు, తుంపర్ల సేద్యంలో నీరు పెడితే తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు.
సరైన పక్వథలో కాయలు కోయాలి.
ఆకారం, పరిమాణం, రంగును అనుసరించి గ్రేడింగ్ చేయాలి. రవాణా చేసేటప్పుడు దెబ్బతినకుండా ప్లాస్టిక్ బుట్టలను వాడాలి.
విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు:
వాతావరణ పరిస్థితులకు అనువుగా ఉండే రకాలను మాత్రమే ఎన్నుకోవాలి.
విత్తనాల్లో ఆమోదిత సంస్థల నుంచి పూర్తి వివరాలతో కూడిన బిల్లులను తీసుకొని మాత్రమే కొనాలి.
విత్తనాల్లో మొలక శాతం 70 శాతం కంటే ఎక్కువగా ఉండాలి.
విత్తనశుద్ధి చేసిన విత్తనాలను మాత్రమే కొనాలి. లేదంటే రైతులే సొంతంగా ఇంటి దగ్గర విత్తనశుద్ధి చేసుకోవాలి.
రోగనిరోధక శక్తి కలిగి, అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ విత్తనాలను వాడాలి.
ఒక కిలో విత్తనానికి ట్రైకోడెర్మావిరిడి 4 గ్రా. చొప్పున విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి.
టి. తేజస్విని (పిహెచ్.డి), 7032883207, డా. టి. థాంసన్ (శాస్త్రవేత్త), 9494963291, డా. ఎమ్. రవీంద్రబాబు (సీనియర్ శాస్త్రవేత్త), 9849733741, డా. వైఎస్ఆర్ హార్టీకల్చరల్ యూనివర్సిటీ.
ఆకుపచ్చ బెండకాయ గురించి మనమందరం విన్నాము, కానీ మీరు ఎర్ర బెండకాయ గురించి విన్నారా? ‘కుంకుమ్ బెండిట, తరచుగా ‘రెడ్ బెండి’ అని పిలుస్తారు, ఈ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ కొత్త బెండకాయ ఆకుపచ్చ రకం కంటే ఎక్కువ పోషకమైనది మరియు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది రైతు ఆదాయాన్ని మూడు రెట్లు పెంచుతుందని అంచనా. అయితే, ఈ భారతీయ ఆవిష్కరణ విజయవంతం కావడానికి 8-10 సంవత్సరాల నిరంతర ప్రయత్నం అవసరమని తెలుసుకుంటే ఆశ్చర్యపోతాము.
భారతదేశంలో, ఉత్తరప్రదేశ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ (IIVR) శాస్త్రవేత్తలు ‘రెడ్ ఓక్రా’ అనే కొత్త రకం బెండకాయను అభివృద్ధి చేశారు. ఈ ఎర్రటి బెండకాయ యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఇది ఆకుపచ్చగా కాకుండా ఎరుపు రంగులో ఉంటుంది, అందుకే దీనికి కాశీ లలిమ అని పేరు పెట్టారు. ఈ ఎర్ర బెండకాయలో ఆంథోసైనిన్లు మరియు ఫినాలిక్లు పుష్కలంగా ఉంటాయి. రెడ్ ఓక్రాను మెజెంటా, పర్పుల్ లేదా బుర్గుండి ఓక్రా అని కూడా అంటారు. ఇది రెండు నుండి ఐదు అంగుళాల పొడవు మరియు టార్పెడో ఆకారంలో ఉంటుంది. ప్రత్యేకమైన రుచి ఉంటుంది. మన దేశంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు మహారాష్ట్రలో దీనిని సాగు చేస్తున్నారు. తెలంగాణలో వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో ఎర్ర బెండను రైతులు పండిస్తున్నారు.
రెడ్ ఓక్రా రకాలు
ఓ రెడ్ వెల్వెట్ ఓ కాశీ లలిమ ఓ రాధిక
ఓ రాయల్ బుర్గుండి ఓ లిటిల్ లూసీ
ఓ అత్త హెట్టీ యొక్క ఎరుపు ఓ హిల్ కంట్రీ రెడ్
నేల రకం: ఎరుపు బెండకాయను తడి ఇసుక నేలల్లో పెంచవచ్చు. ఇది వేసవి మరియు తడి సీజన్లలో సాగు చేయవచ్చు.
విత్తనం ధర: 100 గ్రాముల విత్తనం ధర 1250/-, 1 కిలో విత్తనం ధర 12500/-, ఎర్ర బెండను విత్తడానికి అనువైన సమయం ఫిబ్రవరి నుండి ఏప్రిల్ రెండవ వారం వరకు, నవంబర్లో కూడా విత్తుకోవచ్చు. ఎక్కడ కొనాలి? ఈ రకమైన రెడ్ ఓక్రా విత్తనాలు ఆన్లైన్లో సులభంగా అందుబాటులో ఉంటాయి. కొన్ని వెబ్సైట్లు seed2plant.in, Flipkart. com, Amazon.com, Indianmart.com. ఈ రోజుల్లో రైతులు నేరుగా మార్కెట్లోని రిటైల్ దుకాణాల నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.
మొక్కల మధ్య దూరం: వేసవి పంటకు 45 సెం.మీ ని 20 సెం.మీ, ఖరీఫ్ పంటకు మొక్కల మధ్య 60 ని 30 సెం.మీ దూరం పాటించాలి. ఎరుపు భేండి నిర్వహణ పద్ధతులు ఆకుపచ్చ బెండకాయని పోలి ఉంటాయి.
నీటిపారుదల: ఎర్ర నేలల్లో వారానికి 4 నుండి 5 సార్లు మరియు నల్ల నేలలలో 1 నుండి 2 సార్లు నీరు అవసరం.
టెర్రస్ గార్డెన్/పట్టణ వ్యవసాయం కోసం…
కుండ పరిమాణం 10-12 అంగుళాల లోతు ఉండాలి, ప్రతి ప్లాట్లో 2 నుండి 3 సెంటీమీటర్ల లోతుతో 2 నుండి 3 ఓక్రా విత్తనాలను విత్తాలి. ఓక్రాకు కొద్దిగా తేమతో కూడిన నేల అవసరం
ప్రధాన తెగుళ్లు మరియు వ్యాధులు: చలికాలంలో బూజు తెగులు ప్రధాన వ్యాధి మరియు ఎరుపు ఓక్రాలో త్రిప్స్ ప్రధాన తెగులు.
ఈ ఎర్ర బెండి రకం ఎల్లో వెయిన్ మొజాయిక్ వైరస్(YVMV) మరియు ఆకు ముడత వంటి వైరస్లకు నిరోధకతను కలిగి ఉంటుంది. ఎర్ర బెండిలో తెగుళ్లు మరియు వ్యాధులు తక్కువగా ఉంటాయి.
ఎర్ర బెండకాయల ప్రత్యేకత ఏమిటి?
ఎర్ర బెండకాయలలో పోషక విలువలు
కుంకుమ బెండకాయలో 94% పాలీఅన్శాచురేటెడ్ కొవ్వు ఉంది, ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, అలాగే బలమైన 66% ఉప్పు కంటెంట్ను కలిగి ఉంటుంది, ఇది రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది.
21% ఇనుము ఉండటం వల్ల రక్తహీనతతో బాధపడేవారికి సహాయం చేస్తుంది, కేవలం 5% ప్రోటీన్ శరీర జీవక్రియ వ్యవస్థను అదుపులో ఉంచుతుంది.
ఎర్ర బెండకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, విటమిన్ ఎ, చర్మాన్ని మరియు కళ్ళను సంరక్షిస్తుంది మరియు విటమిన్ బి, అలాగే కాల్షియం మరియు పొటాషియం.
యాంటీ ఆక్సిడెంట్-రిచ్ లక్షణాలు మరియు దీర్ఘకాలిక డైటరీ ఫైబర్ మూలం
జగదీష్ సింగ్ (2020) ఎర్ర బెండకాయలో విటమిన్ బి మరియు ఫోలేట్ అధికంగా ఉంటాయి, ఇది గర్భిణీ స్త్రీల ఆహారంలో కీలకమైన ఆహారంగా మారుతుంది. అలాగే న్యూరల్ ట్యూబ్ అసాధారణతల అవకాశాలను తగ్గిస్తుంది.
రైతుకు పచ్చి బెండి లేదా ఎర్ర బెండి పండించడం లాభదాయకమా?
ఎర్ర బెండి యొక్క హార్వెస్టింగ్, ధర మరియు ఆదాయం?
ఎర్ర బెండ 45 రోజుల తర్వాత కోయవచ్చు, 45 నుండి 60 సార్లు మనం కోత కోయవచ్చు, పచ్చి బెండకాయల ధర కిలోకు 30 నుండి 40 /- అయితే ఎర్ర బెండకాయల కిలొగ్రామ్ కి ధర 60 నుండి 80/- ఉంది. కొన్ని ప్రాంతాలలో, ఎర్ర బెండకాయ అత్యధికంగా 800/ కిలోగా ఉంది.
ఎర్ర బెండకాయ పండిస్తున్నా రైతు విజయగాథ
ఒక రైతు (మహేందర్) గుండాల గ్రామం, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లాలో , తెలంగాణ రాష్ట్రం, 1 ఎకరంలో రెడ్ ఓక్రా రకం కాశీ లలిమా రకంను సాగు చేస్తున్నాడు, భూమి దున్నడానికి ట్రాక్టర్ ధర 3000/-, విత్తన ధర 18750, విత్తడానికి కూలీ ఖర్చు. 1000/-, అతను ఎరువు (ఆవు పేడ) ఉపయోగిస్తున్నాడు, ఎరువుల ఖర్చు 4000/-, త్రిప్స్ రైతు నియంత్రణ కోసం 1000 ppm వేప నూనెను వాడుతున్నాడు, దాని ధర 500/-, నీటిపారుదల రైతు మైక్రో-స్ప్రింక్లర్ని స్వీకరించాడు. దీని ద్వారా అతను బూజు తెగులును కూడా నియంత్రిస్తున్నాడు.
ఆదాయం: విత్తిన 45 రోజుల తర్వాత ఎర్ర బెండ పంట కోయడం జరుగుతుంది. ఎర్ర బెండ ధర కిలో 50 రూపాయలు. ఒక సారి ఎర్ర బెండ కోస్తా 2 క్వింటాళ్లు రైతుకు 10000 రూపాయలు వచ్చేది. పంట కాలం ముగిసే వరకు 20 సార్లు కోత చేస్తారు, కిలో 50 రూపాయలుంటే 2 లక్షల రూపాయలు ఆదాయం వస్తాయని రైతు చెప్పాడు.
కొత్త రైతులు ఎర్ర బెండను పెంచడానికి ఆసక్తి కలిగి ఉంటే, వారు మార్కెటింగ్ సౌకర్యాలను తనిఖీ చేయాలి.
సిరిపురం హరిప్రియ, పి.హెచ్డి స్కాలర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఫోన్: 9573835451్ష్; సామల మనోజ్ కుమార్, పి.హెచ్డి స్కాలర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ, తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఫోన్: 9676151259
జనాభా పెరుగుతున్న కొద్ది ఆహార పదార్థాలు మరియు పీచుపదార్థాల ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది. దీనివల్ల ప్రతీ యూనిట్ విస్తీర్ణంలో ఆహార పదార్థాల మరియు పంటల దిగుబడి పెంచటానికి రసాయన మందుల వాడకం కూడా పెరుగుతూ వస్తుంది. కానీ ఎక్కువ రసాయనిక ఎరువుల వల్ల విపరీతమైన వ్యాధులు వస్తున్నాయి. దాంతోపాటు పర్యావరణ కాలుష్యం అధికం అవుతుంది. కాబట్టి దీనిని తగ్గించటానికి ప్రస్తుత రోజల్లో మొక్కల నుంచి తీయబడ్డ పదార్థాలను వ్యవసాయరంగంలో, ఉద్యానరంగంలో ఉపయోగిస్తున్నారు. కాబట్టి రసాయనిక ఎరువుల స్థానంలో క్రమంగా ప్రత్యామ్నాయ స్థానంలో సహజసిద్ధమైన ఎరువులు ఉపయోగించటం ఎంతో ఉపయోగకరం. సహజసిద్ధమైన ఎరువులు సులభంగా సూక్ష్మజీవులతో విచ్ఛిన్నం చేయబడతాయి. విషపూరితం కావు. పర్యావరణాన్ని కాలుష్యం కలిగించవు. మనుష్యులకు, జంతువులకు, పకక్షులకు హానికరం కాదు.
సీవీడ్ అనేది కంటికి కనిపించే సముద్రపు ఆల్గే. వీటిని ఆహారంగా, పశువులకు మేతగా, రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. పరిశ్రమ పదార్థాలయిన అగార్, ఆల్జినేట్లను తయారు చేయడానికి కూడా సీవీడ్ని ఉపయోగిస్తారు. ప్రస్తుత రోజుల్లో రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సీవీడ్ని ఉపయోగిస్తున్నారు. సీవీడ్ ద్రవరూపంలో, బయోస్టిమ్యులెంట్ రూపంలో మార్కెట్లో లభిస్తాయి.
బారదేశంలో 800 రకాల సముద్రపు ఆల్గేలు భారతదేశ తీరప్రాంతాలైన అలల మధ్య ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలో కనుగొనబడ్డాయి. దీనిలో దాదాపుగా 60 రకాల జాతులను మాత్రమే వాణిజ్యపరంగా ఉపయోగకరమైనవిగా గుర్తించారు. ఇవి తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, లక్షద్వీపాలు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అండమాన్నికోబార్, పశ్చిమబెంగాల్, ఒరిస్సా తీరప్రాంతాలలో లభిస్తాయి. దీనిలో కొన్ని జాతులను మాత్రమే వ్యవసాయరంగంలో ఉద్యానరంగంలో విరివిగా ఉపయోగిస్తున్నారు.
వీటిలో ముఖ్యమైన సీవీడ్ రకాలు:
కప్పాఫికస్ ఆల్వరెజి: ఇది తినడానికి వీలయ్యే ఎర్రటి సముద్రపు ఆల్గే. ఇది ఉష్ణమండల ప్రాంతాలలో అధికంగా పెరిగే, లభించే ఆల్గలలో ఒకటి. ఈ ఆల్గే 23.4 మి.గ్రా./లీ. ఐబిఏ, 27.8 మి.గ్రా./లీ. జిబ్బర్లిన్, 31.9 మి.గ్రా. సైటోకైనిన్ కలిగి ఉంటుంది.
గ్రాసిలేరియా ఎడ్యులిస్: ఇది ఎర్రటి ఆల్గే కుటుంబానికి చెందినది. ఇది భారతదేశ ఉప అలల ప్రాంతాలలో అధికంగా లభించే ఆల్గే. ఈ ఆల్గే నుండి తీయబడిన ద్రవం/సారంలో ఫాస్ఫరస్ 278.5 మి.గ్రా./లీ., సోడియం 195.2 మి.గ్రా./లీ., ఐరన్ 12.7 మి.గ్రా./లీ., మాంగనీస్ 32.9 మి.గ్రా./లీ. కలిగి ఉంటాయి.
వీటితో పాటు గెలిడైఎల్లా ఎకరోజా ఆస్కోఫిల్లమ్ నోడోసమ్ కూడా ముఖ్యమైనది.
సీవీడ్ తయారు చేసుకొను పద్ధతులు:
తీరప్రాంతాల నుంచి సేకరించిన సముద్రపు ఆల్గేని మొదట సముద్రపు నీటితో బాగా శుభ్రపరచుకోవాలి. దీనివల్ల ఆల్గేకు అంటుకొని ఉన్న మలినాలు, ఇసుక రేణువులు, ఇతర ఆల్గేపై పెరిగే అవసరం లేని మొక్కలు తొలగించబడతాయి. తర్వాత వీటిని పాలిథీన్ సంచులలో ఉంచి, వీటిని మంచుపెట్టెలో ఉంచుకోవాలి. తర్వాత వీటిని తయారు చేయు ప్రదేశానికి తీసుకువచ్చి వీటితో ఆల్గేకు అంటుకొని ఉన& లవణాలు తొలగించబడేలా శుభ్రపరచుకోవాలి. తర్వాత తాజా శుభ్రమైన ఆల్గేను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. 1 కిలో ఆల్గే నుంచి సారాన్ని/ద్రవాన్ని సేకరించుకోవాలి. ఈ ద్రవాన్ని/సారాన్ని రెండుపొరల మస్లిన్వస్త్రం గుండా పోస్తే వడబోసుకోవాలి. దీనివల్ల ఇతర చిన్న చిన్న మొక్క బాగాలు కూడా తొలగించబడతాయి. ఇలా లభించిన ద్రవం 100% సాంద్రత కలిగిన ద్రవరూప సీవీడ్. దీనిని 0-4 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నిల్వ చేసుకోవాలి. మొక్కలకు అనుగుణంగా అవసరమైన మోతాదులో దీని నుండి (100% లిక్విడ్ సీవీడ్) వివిధ మోతాదులను (ఉదాహరణకు 25%) తయారు చేసుకోవచ్చు.
అదేవిధంగా 50 గ్రా.ల ఎండిన పౌడర్ని 50 మి.లీ. ల నీటిలో రెండురోజులపాటు నానబెట్టి తర్వాత మస్లిన్ వస్త్రంతో వడపోసుకుని కూడా వినియోగించుకోవచ్చు.
సముద్రపు ఆల్గేని బాగా 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో ఎండబెట్టుకోవాలి. తర్వాత మెత్తని పౌడర్ను తయారు చేసుకోవాలి. దీని నుంచి ఎరువు తయారీ కోసం 50 గ్రా. పౌడర్ని 50 మి.లీ. నీటిలో ఒక గంటపాటు మరగబెట్టుకోవాలి. తర్వాత మస్లిన్ వస్త్రం ద్వారా వడపోసుకోవాలి. ఈ వడపోసిన మిశ్రమాన్ని 50 మి.లీ. వరకు చేసుకోవాలి. దీనివల్ల 100% మోతాదుగల మిశ్రమాన్ని పొందవచ్చు.
పైన తెలిపిన మూడు పద్ధతులలో తీయబడ్డ ద్రవరూప సీవీడ్ని తదుపరి ఉపయోగించేవరకు 0-4 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో నిల్వ చేసుకోవాలి. తర్వాత 100% మోతాదుగల ద్రావణాన్ని మొక్కల రకాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వివిధ మోతాదులో నీటితో కలిపి తయారు చేసుకోవచ్చు.
ఈ పద్ధతిలో తాజా సముద్రపు ఆల్గేని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. వీటికి బలమైన ఆమ్లాలయిన హైడ్రోక్లోరిక్ ఆమ్లం లేదా సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలిపి 30 నిమిషాలపాటు 40-50 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఇంకుబేట్ చేసుకోవాలి. ఈ ఆమ్లం సంక్లిష్ట పదార్థాలని ద్రవరూప మిశ్రమం నుంచి తీసివేస్తాయి.
ఇందులో పైన తెలిపిన పద్ధతిలో ఉపయోగించిన ఆమ్లం స్థానంలో సోడియం హైడ్రాక్సైడ్ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ క్షారాలను వినియోగిస్తారు. ఈ పద్ధతిలో కూడా తాజా సముద్రపు ఆల్గేని చిన్నముక్కలుగా కత్తిరించుకొని, బలమైన క్షారాలను కలుపుకొని అధిక ఉష్ణోగ్రతలో (70-100 డిగ్రీ సెంటీగ్రేడ్) 30 నిమిషాల పాటు ఇంకుబేట్ చేసుకోవాలి.
ఇది కొంచెం క్లిష్టమైన, ఆధునిక పద్ధతి. దీనిలో ఎండిపోయిన సముద్రపు ఆల్గేని నీటిలో బాగా నానబెట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమానికి సూక్ష్మతరంగాలను పంపి వేడి చేయడం వల్ల ద్రవరూప సముద్రపు ఆల్గే ఎరువును పొందవచ్చు.
వ్యవసాయరంగంలో ప్రాధాన్యత
సముద్రపు ఆల్గే ఎరువులు ద్రవరూపంలో, గుళికలుగా, పౌడరు రూపంలో మార్కెట్లో లభ్యమవుతాయి.
వీటిని ఎరువులుగా ఆకులమీద పిచికారి చేసేవిధంగా, కండిషనర్లుగా, నేలలో కలిపేవిధంగా వినియోగించుకోవచ్చు.
ఇది అన్ని రకాలైన ధాన్యాలు, పప్పులు, పూల మొక్కలలో లాభదాయకమైన ప్రభావాన్ని చూపించినవిగా కనుగొనబడ్డాయి.
ఈ సీవీడ్ ఎరువులు కలుపు మరియు వ్యాధికారక శిలీంద్ర రహితం
నేలలో కంటే ఆకులమీద పిచికారి చేయటం వల్ల మొక్కలు పోషకాలను త్వరగా గ్రహించుకొంటాయి.
ఆకులమీద పిచికారి చేయటం వల్ల ధాన్యం, కూరగాయలు, పండ్లతోటల్లో మొక్కల ఎదుగుదల మరియు దిగుబడిని పెంచూయి.
ఈ ద్రవరూప సముద్రపు ఆల్గే ఎరువులు తక్కువ మోతాదులో (1:1000) క్రియాశీలకంగా పనిచేస్తాయి.
విత్తన అంకురోత్పత్తిలో ప్రాధాన్యత
విత్తనాలను తక్కువ మోతాదు సముద్రపు ఆల్గే ఎరువులో నానబెట్టి విత్తుకోవడం వల్ల ఎక్కువ అంకురోత్పత్తి, వేరు మరియు మొక్క పెరుగుదల అధికంగా ఉంటుంది. తక్కువ మోతాదులో మొక్క ఎదుగుదలకు అవసరమైన ఆక్సిన్లు, జిబ్బర్లిన్లు, సైటోకైనిన్లు, సూక్ష్మ, స్థూల పోషకాలు లభ్యమవుతాయి.
ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తే అంకురోత్పత్తి తగ్గిపోతుంది. ఎందుకంటే ఎక్కువ మోతాదుల్లో అధిక లవణాలు ఉండి అంకురోత్పత్తి నారు పెరగకుండా చేస్తాయి.
ఇవి మొక్కలకు అవసరమైన హార్మోన్లు కలిగి ఉండటం వల్ల, వేరు మరియు మొక్క పెరుగుదలను మెరుగుపరుస్తాయి.
అధిక కార్బన్ సమీకరణవల్ల కిరణజన్య సంయోగక్రియ పెరిగి పండ్లతోటలు మరియు పూల దిగుబడి పెరుగుతుంది.
ఇవి మొక్క ఎదుగుదలకు, అభివృద్ధికి కారణమైన మొక్క పెరుగుదల నియంత్రణకారులను కలిగి ఉండటం వల్ల మొక్కల్లో వార్ధక్య థ తగ్గిస్తుంది.
సీవీడ్ని వాడటం వల్ల మొక్కల్లో పర్యావరణ ఒత్తిడులను తట్టుకొని సామర్ధ్యం పెరుగుతుంది.
యాంటీఆక్సిడెంట్స్ పెరుగుదలకు దోహదపడతాయి.
ఈ సేంద్రియ ఎరువులను వినియోగించటం వల్ల కీటకనిరోధక, వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
అదేవిధంగా ఈ సీవీడ్ ఎరువులలో సైటోకైనిన్లు ఉండటం వల్ల మొక్కల్లో క్రియాశీలమైన, ఉపయోగకరమైన వేరుబుడిపెల పెరుగుదలకు దోహదపడతాయి.
ఈ సముద్రపు ఆల్గే ఎరువులలో సేంద్రియ పదార్థాలు అధికంగా ఉండటం వల్ల మొక్కలకు అవసరమైన తేమని, పోషకాలను వేరుకు అందుబాటులో ఉంచుతాయి. దీనివల్ల పంట దిగుబడి పెరుగుతుంది.
సీవీడ్ వేరు విస్తరణను పెంచటం వల్ల ప్రోటీన్ తయారీకి అవసరమైన నైట్రోజన్, ఫాస్ఫరస్ను మరియు సల్ఫర్ను అధికంగా గ్రహించుకొని ప్రోటీన్ శాతాన్ని పెంచుతాయి.
ఈ సీవీడ్ హార్మోన్లు, ఎంజైములు, పెరుగుదల నియంత్రణకారులు కలిగి ఉండటం వల్ల పంటల మరియు పూల నిల్వ కాలాన్ని కూడా పెంచుతాయి.
ఇటువంటి ఉపయోగాల వల్ల ప్రస్తుత రోజుల్లో సహజసిద్ధమైన సముద్రపు ఆల్గే వినియోగం చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
దరిపల్లి శ్రీలక్ష్మి, పిహెచ్.డి, ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్, బిధన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయం, మోహన్పూర్, పశ్చిమబెంగాల్. ఫోన్: 70324 60731
ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరకోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో చెరకు ఒక ప్రధాన వాణిజ్యపంట. ఈ జిల్లాల్లో వరి పంట తరువాత చెరకు పంటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనికి తోడు ఉత్తరకోస్తా జిల్లాల్లో బెల్లం తయారీ ఒక కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెంది ఉంది. ముఖ్యంగా అనకాపల్లి బెల్లం మార్కెట్ నందు జరుగు వాణిజ్య లావాదేవీలు దేశంలోని బెల్లం వాణిజ్య లావాదేవీలకు ఒక గుర్తింపుగా నిలుచుచుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రాంతాలలో సుమారు 1.0 లక్షల హెక్టార్లలో చెరకు సాగు చేస్తుండగా దీనిలో సుమారుగా 40,000 హెక్టార్లకు పైగా ఒక్క శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాలో సాగు చేస్తున్నారు. దీనిని బట్టి ఈ మూడు జిల్లాలలో చెరకు పంట ప్రాధాన్యత తెలుస్తుంది. దీనికి తోడు ఈ మూడు జిల్లాల్లో 4 సహకార చక్కెర కర్మాగారాలు, 1 ప్రైవేటు చక్కెర కర్మాగారం స్థాపించబడి మొత్తంగా 5 చక్కెర పరిశ్రమలు ప్రస్తుతంఈ మూడు జిల్లాల్లో స్థాపించబడి మనుగడలో ఒక్క చోడవరం చక్కెర ఫ్యాక్టరీ ఆడుతుంది. రాష్ట్ర సరాసరి చెరకు దిగుబడి 76 నుండి 78 ట/హె.తో పొరుగు రాష్ట్రంతో 10వ స్థానంలో నిలిచింది.
సాధారణంగా ఉత్తర కోస్తా జిల్లాలయినటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో సాధారణ వర్షపాతం 1000 మి.లీ. నుండి 1100 మి.లీ. వరకు ఉంటుంది. కాని, అసమాన వర్షపాత విస్తరణ కారణంగా ఈ మూడు జిల్లాల్లో అతివృష్టి, అనావృష్టి సాధారణంగా ప్రతీ సంవత్సరం నమోదు కాబడుతుంది. దీనికి తోడు అక్టోబరు, నవంబరు నెలల్లో రబీ పంట కాలంలో సంభవించే తుఫాన్లు, అల్పపీడన ద్రోణుల కారణంగా రెండు నెలల కొకసారైన సాధారణ వర్షపాతం ఒక సారిగా ఒకటి రెండు రోజులలో నమోదు కాబడుతుంది. ఉదాహరణకు రాష్ట్రంలో గత 2010 సంవత్సరం నుండి అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఏర్పడిన లైలా, జల్, నేలం, ఫైలీన్, హెలెన్, లెహర్, హుద్హుద్, ఫోని, తితిలి, యాంఫన్ గులాబ్ తుఫాన్ల కారణంగా ఒకటి రెండు రోజులలోనే సుమారు 200 మి.మీ.కు మించి వర్షపాతం నమోదైంది. దీని కారణంగా పలు పంటలు నీటిముంపుకు గురవుతాయి. ముఖ్యంగా చెరకు ప్రధానమైనది.
ఉదాహరణకు తేది 12-10-2014 నాడు హుద్హుద్ తుఫాన్ కారణంగా అనకాపల్లిలో ఒక్కరోజులో 231.7 మి.మీ.
వర్షపాతం నమోదవగా, ఒక్క అచ్యుతాపురం గ్రామంలోనే సుమారు 500 మి.మీ. వర్షపాతం నమోదు కాబడినదంటే, తుఫాన్ల కారణంగా వర్షపాత తీవ్రత తేటతెల్లమవుతుంది. ఈ అధిక వర్షపాతం కారణంగా ప్రథమంగా పంట నష్టం తీవ్రత అధింకగా ఉంటూ వస్తుంది. ఈ హుద్హుద్ తుఫాన్ కారణంగా అధిక వర్షపాతానికి తోడు ఈదురు గాలులు సుమారు గంటకు 250 కి.మీ.కు పైబడి వీచడం వలన పంటలకు తోటలకు అధిక నష్టం వాటిల్లడం జరిగింది. ప్రధానంగా మామిడి, జీడిమామిడి, అరటి, ఆయిల్పామ్, కొబ్బరి తోటలతో పాటుగా వివిధ థలలో ఉన్న చెరకు తోటలకు నష్టం వాటిల్లుతుంది. ఈ నష్ట తీవ్రత వివిధ రూపాల్లో అనగా చెరకు తోటలు విరిగి పడిపోవడం, ఆకులు చీలిపోవడం, చెరకు తోటలు మొదళ్ళు వేళ్ళతో పెకిలించబడడం, వంగి పోవడం వంటివి జరుగుతుంటాయి. దీనికి తోడు చెరకు తోటల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలబడటం, ముంపుకు గురవడం సంభవిస్తుంది. దీనికితోడు చుట్టూ వరిమాగాణి పొలాలు, మధ్య చెరకు సాగు కారణంగా, చెరకు పంట నీటి ముంపుకు గురవుతుంది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సాధారణంగా అక్టోబరు/నవంబరు నెలల్లో రబీ పంట కాలంలో తుఫాన్లు మరియు నీటిముంపు కారణంగా చెరకు పంట వివిధ థలలో నష్టానికి గురవుతుంది.
చెరకు తోటలు విరిగిపోవడం వలన చచ్చు కర్రలు ఎక్కువగా వచ్చి దిగుబడి తగ్గుతుంది. చచ్చు కర్రలు ఎక్కువ దిగుబడి నష్టం చేస్తాయి. దీనికి తోడు కణుపులపై వేర్లు పుట్టి దిగుబడిని నిరోధిస్తాయి.
చెరకు తోటలు పడిపోవడం వలన చక్కెర శాతం తద్వారా రికవరీలో తరుగుదల ఉంటుంది. నిలబడిన తోటలకన్నా పడిపోయిన తోటలలో 0.4 శాతం రికవరీ క్షీణత ఉన్నట్లుగా పరిశోధనా ఫలితాలు చెబుతున్నాయి.
మురుగు నీరు/నీరు నిలబడిన చెరకు తోటల్లో పూతకు వచ్చిన లేదా కణుపుల వద్ద వేర్లు పుట్టినచో గడబరువు, రసక్షీణత ఎక్కువగా ఉంటుంది. పూత వచ్చిన తోటల్లో ఊల ఏర్పడి గడ బరువు గణనీయంగా పడిపోతుంది.
ముంపు, నీరు నిలబడిన చెరకు తోటల్లో చీడపీడలు ముఖ్యంగా ఎర్రకుళ్ళు, వడలు తెగులు, దూదేకుల పురుగు, పిండినల్లి తాకిడి ఎక్కువ.
పడిపోయిన తోటల్లో ఎలుకలు, ఉడుతల కారణంగా నష్టం ఎక్కువ.
వివిధ థలలో ఉన్న చెరకు తోటలు తుఫాను కారణంగా అధిక వర్షపాతం, నీటిముంపు మరియు ఈదురు గాలులకు గురయినపుడు తీసుకోవలసిన యాజమాన్య చర్యలు
ముందుగా చెరకు పంట పొలంలో / లోతట్టు ప్రాంతంలో నిలచియున్న మురుగు నీటిని యాంత్రిక కప్పీలు/మోటారు పంపులు, ఏతాలు లేదా గూడలు ద్వారా మురుగు నీటిని పంట పొలం నుండి తీసివేసి, పంట పొలంలో నీరు నిలువకుండా జాగ్రత్తపడాలి.
పడిపోయిన చెరకు తోటలను కర్రపచ్చిపై అవకాశాన్ని బట్టి నిలగట్టాలి. అవసరమైతే వెదురు బొంగులు, సర్వీబాదు కర్రల సహాయంతో చెరకు దుబ్బులు/తోటలను నిలగట్టాలి.
నేలను ఆరగట్టి వెంట్రుకవాసి పగుళ్ళు వచ్చిన తర్వాత ఒకటి రెండు తడులు మంచి నీటితో ఇచ్చినట్లయితే సరికొత్త వేరు వ్యవస్థ పుట్టి చెరకు తోటలు మెరుగుపడతాయి.
చక్కెర కర్మాగారాలు నవంబరు, డిసెంబర్ నెలల్లో తెరచిన వెంటనే చెరకు కాల పరిమితి, పక్వతను బట్టి చెరకు కార్మాగారాలలో ముంపు తోటలను ముందుగా గానుగాడుకోవాలి.
ముంపుకు గురైన తోటలలో చచ్చుకర్రలు ఎక్కువగా వచ్చే అవకాశముంటుంది. కావున ఇటువంటి తోటల నుండి విత్తన ఎంపిక అంత శ్రేయస్కరం కాదు.
జూన్/జులై నెలల వర్షాధార చెరకు తోటలు, విత్తనపు దవ్వ తోటల యాజమాన్యంలో అదనపు మోతాదు పోషకాలను అందిస్తూ, నిఘా ఉంచి సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
చక్కెర కర్మాగారాల పరిధిలోని చెరకు తోటలకు నిఘా ఉంచి పక్వత నిర్ధారణ చేయించుకోవాలి.
బెల్లం తయారీ చేయు రైతాంగం పక్వతను బట్టి అనివార్య కారణాల వలన ముందుగా బెల్లం తయారు చేయవలసి వస్తే బెల్లం పొడి లేదా పంచదారను వినియోగించి పాకం వచ్చేటట్లు చేసుకోవాలి. (తప్పని పరిస్థితుల్లో మాత్రమే)
నీటి ముంపు ప్రాంతం మరియు లోతట్టు ప్రాంతాలలో చెరకు సాగు చేయు రైతాంగం తీసుకోవలసిన చర్యలు
చెరకు తోటలు నాటేముందు ప్రతీ 15 మీటర్లకు ఇవకతీత కాలువలు చెరకు సాగు చేయు రైతాంగం సామూహికంగా ఏర్పాటు చేసుకొని మురుగు నీటిని పంట పొలం నుండి తొలగించాలి.
పూతకు రాని లేదా పూత తక్కువగా పూచే రకాలు నాటుకోవాలి. ఉదాహరణకు కో6907, 84ఎ 125, 85ఎ261, 86వి96, 88ఎ189, కో7706, 87ఎ397, కో7219, 86ఎ146, 87ఎ298, 2001ఎ63, 98ఎ163
నీటి ముంపుకు గురయ్యే ప్రాంతంలో చెరకు తోటల నాట్లు జనవరి ఆఖరి లోగా నాటుకోవాలి. దీని కారణంగా ఎదిగిన తోటలు నీటి ముంపును కొంత వరకు తట్టుకుంటాయి.
నీటి ముంపుకు గురయిన తోటలకు, మురుగు నీటిని తీసి, పొలాన్ని ఆరగట్టి పంట థను బట్టి అదనంగా ఎకరానికి 50 కిలోల యూరియాతోపాటు 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వాడుకోవాలి.
తోటల నుండి నీటిని తీయడానికి వీలుకాని పరిస్థితులలో పంటపై పంటథను బట్టి లీటరు నీటికి 25 గ్రాముల యూరియా, 25 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి.
వర్షాకాలానికి ముందుగా ఎదిగిన తోటలకు జడచుట్లు వేసి మట్టిని ఎగద్రోసి చెరకు తోటలను నిలగట్టాలి.
చెరకు పొలం చుట్టూ ఉన్న గట్లకు వర్షాకాలానికి ముందుగా గట్టిగా వేసుకోవడం వలన ముంపు నీరు లేదా వరి పంట ప్రక్క పొలంలోని ఊట నీరు చెరకు తోటలోకి రాకుండా జాగ్రత్తపడాలి.
మురుగు నీరు తీసిన తరువాత పంట పొలాన్ని ఆరగట్టి, వెంట్రుకవాసి నెర్రెలు, పగుళ్ళు వచ్చిన వెంటనే పంట థనుబట్టి మంచినీటితో ఒకటి రెండు దగ్గరదగ్గర తడులు ఇచ్చుకోవాలి. దీని కారణంగా క్రొత్త వేరు వ్యవస్థ వృద్ధి చెంది చెరకు తోటలు వేగంగా నిలదొక్కుకుంటాయి.
చక్కెర కర్మాగారాలు తెరచిన వెంటనే ముంపుకు గురైన తోటలను ముందు కర్మాగారాలకు పక్వతను బట్టి గానుగాడుకోవాలి.
వర్షాకాలం నీటి ముంపుకు గురైన తోటలను మొక్క తోట తరువాత కార్శి లేదా మోడెం చేయడం ఎంత ముందుగా వీలయితే అంతముందుగా (ఫిబ్రవరి 15 లోపుగా) చేసుకోవాలి.
ముంపుకు గురైన చెరకు తోటల్లో సకాలంలో చెరకు పంట యాజమాన్య చర్యలు చేపట్టి కొంతమేరకు ముంపు వలన చెరకు పంటకు వాటిల్లే నష్టాన్ని పూరించుకోవచ్చు.
డా|| సిహెచ్. ముకుందరావు (9908150600), డా|| పి. సాంబశివరావు, డా|| యం. చారుమతి, డా|| బి. చిత్కళాదేవి, డా|| యం. భరతలక్ష్మి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అనకాపల్లి – 531 001, ఆం.ప్ర.
వ్యవసాయ రంగంలో పంటల సాగు విధానంలో పంట ఉత్పత్తులను అధికంగా సాధించాలంటే శ్రేష్టమైన విత్తనాన్ని ఎంచుకోవడం చాలా కీలకంగా పరిగణించవచ్చు. విత్తనాన్ని ఎన్నుకొనే క్రమంలో ఆయా భౌగోళిక వాతావరణ శీతోష్ణస్థితి పరిస్థితులను అనుసరించి సమీప ప్రాంతాల్లోని వ్యవసాయ పరిశోధన స్థానాన్ని గాని, కృషి విజ్ఞాన కేంద్రమును గాని, వ్యవసాయ అధికారులను, వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి కాలానుగుణంగా వివిధ పంటలలో విత్తుకొనే విత్తనాలను తగు జాగ్రత్తలతో కొనుగోలు చేయడం అనేది రైతు సోదరులకు ప్రముఖ విధిగా గుర్తుంచుకోవాలి.
విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోని యెడల పంటల సాగులో విత్తనం మొలకెత్తకపోవడం, ఎక్కువగా తెగుళ్ళు, చీడపీడలు ఆశించడం వల్ల పంటనష్టం జరుగుతుంది. తద్వారా రైతు సోదరులు విత్తన ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
మంచి నాణ్యత, మొలకెత్తే శక్తి కలిగిన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. విత్తనాలను ఎంచుకొనే క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించి అధీకృత విత్తన డీలర్ల వద్దనే కొనుగోలు చేసుకోవాలి.
ఇలా కొనడం ద్వారా పంటనష్టం జరిగినపుడు రైతులు వ్యవసాయ ఉన్నత అధికారులను సంప్రదించి నష్టపరిహారం పొందవచ్చు.
విత్తనాలు ఉన్న సంచులు సరైన సీలుతో ధృవీకరణ పత్రంతో ఉన్న వాటినే కొనుగోలు చేయాలి.
విత్తన సంచులపై విత్తనరకం, ల్యాబ్ నంబర్, గడువు తేది తదితర వివరాలు సరిగా ఉన్నాయో లేవో చూసుకొన్న తరువాత మాత్రమే కొనుగోలు చేసుకోవాలి.
విత్తనాన్ని కొనుగోలు చేసిన తర్వాత అధీకృత డీలర్ నుండి బిల్లుపై (రశీదు) సంతకం తీసుకోవాలి.
హైబ్రిడ్ విత్తనం కొనుగోలు చేసేటప్పుడు విత్తనరకం, భౌతిక స్వచ్ఛత, మొలకెత్తే స్వభావం, జన్యుపర నాణ్యతను లేబుల్ మీద ఉన్నాయో లేదో గమనించి కొనుగోలు చేయాలి.
విత్తనాన్ని దుకాణదారుని నుండి కొనుగోలు చేసిన తర్వాత ఇంటివద్దనే విత్తన మొలకశాతాన్ని పరీక్షించుకున్న తర్వాత సంతృప్తికరంగా ఉంటేనే పొలంలో విత్తుకోవాలి.
విత్తనంలో మొలకశాతం తక్కువగా ఉంటే కొనుగోలు చేసిన దుకాణదారుని దగ్గరకు తీసుకవెళ్లి పరిస్థితిని వివరించి వేరే విత్తనాన్ని తీసుకోవాలి.
విత్తనంలో గల లోపాన్ని వివరించిన తరువాత కూడా దుకాణదారుడు సరైన విధంగా విత్తనాన్ని మార్చి ఇవ్వకపోతే సదరు డీలర్పై వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ విధంగా చేసిన యెడల విత్తన పరిహారం పొందే హక్కు రైతులకు ఉంటుంది.
పంటకు నష్టం జరిగితే రైతుకు రశీదే కీలక ఆధారం. కాబట్టి పంట కాలం పూర్తయ్యే వరకు కొనుగోలు చేసిన బిల్లును (రశీదును) జాగ్రత్తగా భద్రపరచుకోవాలి.
సీల్ తీసి ఉన్న విత్తన సంచులు, పగిలిన విత్తన ప్యాకెట్లు, మూతలు తీసిన డబ్బాల్లోని విత్తనాన్ని కొనుగోలు చేయరాదు.
విత్తనాన్ని కొనుగోలు చేసే క్రమంలో విత్తన సంచి బరువు తక్కువగా అనిపిస్తే డీలర్ ముందు తూకం వేయించి తక్కువగా ఉన్న విత్తనాన్ని డీలర్కు ఇచ్చి కొత్త విత్తనాన్ని తీసుకోవాలి.
విత్తన మొలకథలో, పూత థలో పంటల ఎదుగుదల సరిగా లేకపోతే వెంటనే వ్యవసాయశాఖ అధికారులకు తెలియచేసి క్షేత్రానికి తీసుకవెళ్ళి చూపించాలి.
విత్తనం ఎక్కడ తయారీ అయ్యిందో ఏ కంపెనీ వారు పంపిణీ చేసారో, విత్తనం అమ్మిన దుకాణదారుడి ద్వారా తెలుసుకోవాలి.
వీటిలో ఏ విధమైన సంతృప్తి సమాధానం పొందలేని యెడల వ్యవసాయ శాఖ అధికారులకు వెంటనే ఫిర్యాదు చేసుకోవాలి.
రైతు సోదరులు విత్తనాన్ని ఎన్నుకొనేటప్పుడు విత్తనాన్ని ఎన్ని రకాలుగా విభజించారో తెలుసుకోవాల్సిన అవసరం ఒక రైతుగా బాధ్యత వహించాలి.
బ్రీడర్సీడ్: ఈ రకం విత్తనం అన్ని రకాల విత్తనాలకు మూల విత్తనం. దీన్ని రూపొందించిన పరిశోధనా స్థానాలలోనే ఆయా శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఉత్పత్తి చేస్తారు. జన్యు స్వచ్ఛత 100 శాతం ఉంటుంది. విత్తనం సంచులకు ”పసుపు రంగు ట్యాగ్” ఉంటుంది.
ఫౌండేషన్ రకం విత్తనం: ఈ రకం విత్తనాన్ని బ్రీడర్ విత్తనం నుండి ఉత్పత్తి చేస్తారు. వివిధ పరిశోధనా స్థానాలు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆశ్వర్యంలో నడుస్తున్న విత్తనాభివృద్ధి క్షేత్రాలలో సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఉత్పత్తి చేస్తారు. ఇవి కూడా దాదాపు 100 శాతం జన్యుస్వచ్ఛత కలిగి ఉంటాయి. సంచులకు ‘తెలుపు రంగు’ ట్యాగ్ ఉంటుంది.
సర్టిఫైడ్ సీడ్ (ధృవీకరణ విత్తనం): ఈ రకం విత్తనాన్ని ఫౌండేషన్ విత్తనం నుండి సీడ్ సర్టిఫికేషన్ వారి ఆధ్వర్యంలో రైతుల పొలాల్లో పండిస్తారు. ప్రయోగశాలల్లో పరీక్షించి నిర్దేశించిన ప్రమాణాలు కలిగిన వాటికి ధృవీకరణ విత్తనం లేబుల్ ఇస్తారు. దీనికి ‘నీలిరంగు’ ట్యాగ్ ఉంటుంది.
ట్రూత్ఫుల్ లేబుల్: మార్కెట్లో ఉత్పత్తిదారులు సొంత పూచికత్తుతో ట్రూత్పుల్ లేబుల్ అనే ట్యాగ్ వేసి విత్తనాలను అమ్ముతూ ఉంటారు. వీటికి లేత ఆకుపచ్చరంగు ట్యాగ్ను వాడతారు. వీటిని ఉత్పత్తిని చేసే సంస్థ / వ్యక్తులను బట్టి విత్తన కొనుగోలు చేస్తారు.
ఈ విధంగా రైతన్నలు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు విత్తన రకాలు మరియు కాలానుగుణంగా వివిధ పంటలలో వేసుకొనే విత్తనాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ అధికారులను సంప్రదించి వారి సలహాలు, సూచనలను పాటించి కొనుగోలులో నాణ్యత ప్రమాణాలు, జాగ్రత్త పాటించి తీసుకోవాలి.
డా. టి. శ్రీకాంత్, (9550237897), సహాయ ఆచార్యులు,
డా. పి. మధుకర్, శాస్త్రవేత్త, వృక్ష ప్రజనన విభాగం, జగిత్యాల;
ఎ. ఉమారాజశేఖర్ (9505989896), సహాయ ఆచార్యులు,
డా. ఎ. వెంకటరమణ, సహాయ ఆచార్యులు, డా. కె. రాజేష్, సహాయ ఆచార్యులు, డా. టి. అరుణ్బాబు, సహాయ ఆచార్యులు, వ్యవసాయ కళాశాల, సిరిసిల్ల.
మాగుడు గడ్డిగా నిల్వచేసుకోవటానికి కొన్నిరకాల పైర్లు మాత్రమే ఉపయోగపడతాయి. ఈ మేపుకు అనువైన పశుగ్రాసాలలో మొక్కజొన్న, జొన్న మొదలైన ఏకవార్షిక పశుగ్రాసాలు హైబ్రిడ్ నేపియర్ లాంటి బహువార్షిక పశుగ్రాసాలు బాగా పనికొస్తాయి. మన దేశంలోని రైతుల ఆర్థిక స్థితిగతులు, వాతావరణ పరిస్థితుల దృష్టితో ఆలోచించినట్లైతే భూమిలో గుంట తీసి పచ్చిమేతను నిలువచేయటం తేలికయిన పద్ధతి. గుంటను గుండ్రటి ఆకారంలో గాని చతురస్ర ఆకారంలో గాని త్రవ్వుకోవచ్చును. మాగుడు గడ్డిని పాడిపశువులకు రోజుకు 20 కిలోల చొప్పున ఇవ్వవచ్చును. ఐదు పాడిపశువులు కనుక ఉన్నట్లైతే 3 నెలల కాలానికి 12,000 కిలోల సైలేజి అవసరం అవుతుంది. 1 ఘనపు అడుగు సైలేజి గడ్డి బరువు 15 కిలోలు ఉంటుంది. 15 టన్నుల సైలేజి తయారు చేయుటకు 1000 ఘనపు అడుగుల పాతర కావాలి. ఇందు కొరకు 8 అడుగుల వెడల్పు, 5 అడుగుల లోతు, 25 అడుగుల పొడవు గల గుంతను ఏర్పాటు చేసుకోవాలి. కత్తిరించిన మేతను పాతరలో నింపేటప్పుడు పొరల మధ్య గాలి చొరకుండా చూసుకోవాలి.సైలేజి గుంటను వర్షపునీరు నిల్వని ఎత్తైన ప్రదేశములలో నిర్మించాలి. ఇటుకలతో పలుచటి గోడను నిర్మించి సిమెంట్ తో పూత పూయిస్తే పటిష్టంగా ఉండి వర్షపు నీరు లోనికి రాకుండా రక్షణ కల్పిస్తుంది. మాగుడు మేతకు ఉపయోగించదలచిన గడ్డిని పూతకొచ్చే థవరకు పెరగనిచ్చి కొయ్యాలి. కోసిన మేతలో తేమ 65-70 శాతం మించి ఉంటేఅటువంటిమేతను పొలంలోనే ఆరబెట్టవలెను. ఆరిన మేతను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించవలెను. వర్ష సూచనలు లేని రోజులలో మాత్రమే ఈ పనిని మొదలుపెట్టాలి. పాతరలో అడుగు భాగాన చుట్టూ సిమెంటు పూత లేనిచో మందపాటి పాలిథిన్ షీటుతో కానీ, పనికిరాని ఎండుగడ్డితో కానీ కప్పి మట్టిపెల్లలు మేతపై పడకుండా నివారించాలి. పాతరలో కత్తిరించిన మేతను నింపేపనిని ఉదయాన్నే ప్రారంభించాలి. మేతను పొరలు పొరలుగా పేర్చుతూ పొరల మధ్య నిల్వవుండే గాలిని కాళ్ళతో తొలగించాలి.పొరల మధ్య నిలబడిన గాలిని తొలగించని యెడల మాగుడుగడ్డి బూజు పట్టిపోయే అవకాశం ఉంది. గుంట పై భాగంలో అర్ధచంద్రాకారం వచ్చేటట్లు పేర్చి దానిపై మందపాటి పాలిథిన్ షీట్ కప్పాలి. దీనిపైన 10-15 సెం. మీ మందాన మట్టితో కప్పితే ఆబరువుకు నిలువ చేసిన గడ్డి త్వరగా రసాయనిక మార్పుకు గురవతుంది. మట్టి పొరపైన పశువుల పేడతో కానీ మట్టితో కానీ అలికితే రంధ్రాలు పూరుకుపోయి మాగుడుగడ్డి తయారీకి బాగా అనుకూలంగా ఉంటుంది. చొప్పతో పోలిస్తే ఎండబెట్టి నిలవచేసిన గ్రాసాలలో పోషక విలువలు ఎక్కువ.నాణ్యమైన ఎండుమేతలో ఆకులు ఎక్కువగావుండి ఆకు పచ్చని రంగుతో మృదువుగా పశువులకు నోరూరించే వాసన, రుచి కలిగి ఉంటాయి. సైలేజి నిల్వవుంచిన గడ్డిని 2-3 సంవత్సరాల వరకు చెడిపోకుండా నిల్వచేసుకోవచ్చు.మొత్తం కప్పునంత ఒక్కసారిగా తీయకూడదు. అలవాటు పడేవరకు పశువులు సైలేజిని తినకపోవచ్చు. పాలు పీతికిన తరువాత లేదా పాలు పితకడానికి నాలుగు గంటల ముందు దీనిని పశువులకు మేపాలి. లేనిచో సైలేజి వాసన వస్తుంది.
సైలేజి వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కుళ్లిన లేదా పాడైపోయినసైలేజి పశువుల మేపుకు పనికిరాదు.
పాతరలో మేతను పొరలు పొరలుగా పేర్చుతూ పొరల మధ్య నిల్వవుండే గాలిని కాళ్ళతో తొలగించాలి. అలా తొలగించని యెడల మాగుడుగడ్డి బూజు పట్టిపోయే అవకాశం ఉంది.
సైలేజి గడ్డి యొక్క తేమ శాతాన్ని గమనిస్తూ వుండాలి.
సైలేజి గుంత తెరిచిన తరువాత నెలరోజులలో వాడుకోవాలి లేకపోతే ఆరిపోయి చెడిపోతుంది.
ప్రతిరోజూ పశువు తినే మెతలో 55-60 శాతం సైలేజితో మేపి మిగిలిన 40-45 శాతం దాణాతో మేపవచ్చు.
సైలేజి వాడకం
మంచి నాణ్యమైన సైలేజిని పశువులు మరియు జీవాలు (మేకలు, గొర్రెలు) చాలా ఇష్టంగా తింటాయి. పశువులకు సైలేజిని అలవాటు చెయ్యడం కోసంమెపేటప్పుడు మొదటగా ఆహారంలో 20 శాతం మాత్రమే సైలేజిని ఇవ్వాలి. తరువాత రోజూ 15 శాతం పెంచవలెను. పశువులు వాటి శరీర బరువును బట్టి 25-30 కిలోల వరకు సైలేజిని తీసుకుంటాయి. అదే జీవాలకు (మేకలు, గొర్రెలు)వాటి శరీర బరువుని బట్టి 900 గ్రాముల నుండి 2 కిలోల వరకు సైలేజిని తీసుకుంటాయి. మార్కెటింగ్ వయస్సుకి వచ్చిన జీవాలు 2.5-3 కిలోల వరకు సైలేజిని ఒకరోజుకి తినగలవు.
డా. జి. మితున్, 7799880400, ఎస్.ఎం.ఎస్, పశుసంరక్షణ శాఖ, డి.డి.ఎస్ – కృషి విజ్ఞాన కేంద్ర, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ.
మన అందరికి తెలుసు కోడి అంటే ముందు గుర్తుకు వచ్చేది కోడి మాంసం’ మరియు కోడిగ్రుడ్లు వాటి పోషక విలువలు, మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ కొన్ని జాతి కోళ్లు పోషక విలువలతో (ప్రోటీన్స్, ఆమ్లాలు…) పాటు ఆరోగ్యపు విలువలు బహుళ ప్రయోజన విలువలు కూడా కలిగి ఉన్నాయి అని ముందుకు వచ్చే కోళ్ళ జాతిలో మొదటిది, మధ్యప్రదేశ్లో పుట్టింది, రంగులలో నాకు ఎవరు సాటిరారు అని నిరూపించుకొని వచ్చే అరుదైన జాతి ‘కడక్నాథ్’.
‘కడక్నాధ్’ అనేది మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు గుజరాత్లోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే దొరికే అరుదైన జాతి, నాటుకోడి. ఈ కడక్నాథ్ని ‘కాలమసి’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ కోళ్లు చూడటానికి నల్లగా ఉంటుంది. అంతేకాకుండా అరుదైన విషయం ఏమిటంటే వీటి మాంసం కూడా నల్లగానే ఉంటుంది కాబట్టి. కడక్నాధ్ జన్మస్థలం కతివార్ అలిరాజాపూర్ అడవులు ఉన్నటువంటి జబువా జిల్లా మధ్యప్రదేశ్. ఇటువంటి జాతి కోళ్లే ఇండోనేషియాలో కూడా గలవు. వీటిని అక్కడ అయామ్సెమాని అంటారు. ఈ జాతి కోళ్లను ఆయా ప్రదేశాలలో గ్రామాలలో నివసించే వాళ్లు ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీయులు ఎక్కువగా పెంచుతారు. ఆయా ప్రాంతాలలో ముఖ్యంగా ఆదివాసీయులు వీటిని పవిత్రముగా పూజించి దీపావళి రోజున దేవునికి నైవేద్యంగా పెడతారు. ఈ జాతి కోళ్లను రెండు రకాలుగా పెంచుతారు, గ్రుడ్ల కోసం మరియు మాంసం కోసం. మరీ ముఖ్యంగా మాంసం కోసం పెంచుతారు ఎందుకంటే ఈ నల్లజాతి కోడి ఎన్నో ఆయుర్వేదిక మరియు మెడిసినల్ గుణాలను కలిగి ఉంది.
ఈ జాతి కోళ్లు ముదురు నలుపు మరియు బంగారపు ఈకలును కలిగి ఉంటుంది. బూడిద నలుపు రంగు మాత్రం కాళ్లు, ముక్కు, నాలుక, వాటిల్స్ మరియు కూంబ్ మీద ఉంటుంది. అంతేకాకుండా ముదురు నలుపు మరియు నీలం రంగుల్లో ఉండే కోళ్లలో చర్మం, వెంట్రుకలు, మాంసంతో పాటు రక్తం కూడా నలుపు రంగులో ఉంటుంది.
ఈ కడక్నాథ్ జాతి కోళ్లు ముఖ్యంగా మూడు రకాలు:
ఎ) నల్లని జెట్ బ్లాక్, బి) పెన్సిల్ రంగు, సి) గోల్డెన్ రంగు
ఈ మూడు రకాలు కోళ్లలో మాంసం మాత్రం నల్లని రంగులోనే ఉంటుంది. మాములుగా కోడిపుంజు: 1.8-2 కిలోలు మరియు ఆడకోళ్లు 1.2-1.4 కిలోలు బరువు ఉంటాయి. కడక్నాధ్ కోడిగ్రుడ్లు బూడిద రంగుతో పాటు అక్కడక్కడ గులాబిరంగులో ఉంటాయి. ఈ జాతి కోళ్లలో పొదుగు లక్షణం చాలా తక్కువ. అదేవిధంగా గ్రుడ్డు బరువు 33-35 గ్రాములు ఉంటుంది. మిగిలిన కోళ్ల జాతితో పోల్చితే (55 గ్రా.) గుడ్డు బరువు వీటిలో తక్కువగా ఉంటుంది.
ప్రయోజనాలు: ఈ కడక్నాధ్ కోళ్లు ఎక్కువ రోగనిరోధక శక్తి మరియు ఎటువంటి వాతావరణ పరిస్థితులను అయినా తట్టుకొనే సామర్థ్యం చాలా ఎక్కువ. ఈ జాతికోళ్ళలో మాంసం రంగు నల్లగా ఉండటానికి ముఖ్యకారణం ‘మెలనిన్’ అనే పిగ్మెంట్. అందుకే ఈ కోళ్లు ఎక్కువ రోగనిరోధక శక్తిని, సామర్థ్యంను కలిగి ఉన్నాయి. అందువలన ఈ జాతి కోళ్లు ఆయా ప్రదేశాల్లో గిరిజనులు మూలికా వైద్యంలో వాడుతారు. మిగిలిన కోడి జాతుల మాంసంతో పోల్చితే ఈ కడక్నాధ్ జాతి కోళ్ల మాంసంలో క్రొవ్వు శాతం తక్కువ మరియు మాంసకృత్తులు, లినోలిక్ ఆమ్లాలు ఎక్కువ మోతాదులో ఉన్నాయి. వీటి మాంసం ఉండే మెలనిన్ పిగ్మెంట్ అధికంగా ఉండటం వలన పురుషులలో నరాలబలహీనత, వంధ్యత్వ నిరోధానికి ఉపయోగపడుతుంది. వీటి మాంసం అనేక రకాలైన అమైనోయాసిడ్స్ మరియు విటమిన్స్ కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ జాతి కోళ్ల మాంసం తినడం వలన రక్తకనాలు పెరగడమే కాకుండా హిమోగ్లోబిన్ని కూడా రక్తంలో పెంచుతాయి. ఈ కడక్నాధ్ కోళ్లు వ్యర్ధపదార్థలను మరియు కీటకాలను తొందరగా మాంసంగా మార్చుకొనే గుణం కలిగి ఉంది.
మధ్యప్రదేశ్లోని గిరిజనులు దీర్ఘకాలిక జబ్బులు నివారించేందుకు ఈ జాతి కోళ్ళ రక్తాన్ని వైద్యం కొరకు మరియు ఆయుర్వేదం కొరకు వాడుతారు. ముఖ్యంగా స్త్రీలలో గైనకాలజీ సమస్యలు తీరుతాయని, వాటి గ్రుడ్లు తినడం వలన తలనొప్పి, మూత్రపిండ వ్యాధులు, నీరసం, ఆస్థమా, శ్వాసకోశవ్యాధులు, ముసలివాళ్లలో కీళ్లనొప్పులకి ఆరోగ్యదాయకం అని ఆయా ప్రదేశాలలో గిరిజనుల నమ్మకం.
ఈ కడక్నాధ్ జాతి మాంసంలో అధిక మోతాదులో ఖనిజ లవణాలు మరియు ఆవశ్యక అమైనో ఆమ్లాలు బి1, బి1, బి6, బి12, సి ఞ ఇ విటమిన్లు ఉండటం మరీ ముఖ్యంగా బి12 మరియు ఇనుపధాతువులు ఉండటం వల్ల ఎనిమియా, నిమోనియా, ఆస్థమా, కీళ్ల నొప్పులు, ఎముకలు విరిగిన వారికి ఆరోగ్యకరమైన ఆహారంగా భావించవచ్చు. ఈ జాతి కోళ్లలో మరొక మంచి లక్షణం ఏమిటంటే బయట పడేసిన వంట వ్యర్థాలు, కీటకాలు తిని బ్రతికేయగలవు. కాకపోతే ఈ జాతికోళ్ళలో పొదుగులక్షణం చాలా తక్కువ. 6 నెలల వయస్సు నుండే గ్రుడ్లను పెడతాయి. వేసవిలో 100 గ్రుడ్లు పెడుతుంది. 7 నెలల వ్యవధిలో ఈ జాతి కేవలం 1.5 కిలో బరువు మాత్రమే పెరుగుతుంది.
విదేశీ కోళ్లపై ఉన్న మమకారం దేశీ కోళ్లపై ఉండదు. మనిషి ఎప్పుడూ తను ఆర్థికంగా స్థిరపడాలంటే తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందాలనుకుంటాడు. విదేశీ కోళ్లు తొందరగా పెరిగి మాంసాన్ని మరియు గ్రుడ్లను ఇస్తాయి. అందుకు భిన్నంగా దేశీ కోళ్లులో ఎదుగుదలకు చాలా సమయం తీసుకొంటాయి. అంతేకాకుండా సహజ మేతతో నిదానంగా పెరగడం, పిల్ల థలలోనే చాలా వరకు మరణిస్తున్నాయి అనే కారణంతో ఈ దేశీ జాతి కోళ్లు అంతగా వృద్ధి చెందట్లేదు. ఎంతో అరుదైన జాతి గల ఈ కడక్నాధ్ కోళ్లు ప్రస్తుతం అంతరించిపోతున్న స్థితికి చేరుకొన్నాయి. అందువలన ఈ కడక్నాధ్ కోళ్లలో గల ప్రయోజనాలను అందరికీ తెలియజేసి ఈ కడక్నాధ్ ఆరోగ్యంగా ఉంటే మనుషులు కూడా ఆరోగ్యవంతులు అవుతారు అని అందరికీ తెలియజేసి, ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని వీటిని అంతరించిపోకుండా, వీటి సంఖ్యను పెంచే కార్యాచరణలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే గ్రామాల్లో మరియు నగరాల్లో ఈ జాతి కోళ్లను కోడిగ్రుడ్లు మరియు మాంసం కోసమే కాదు వీటిలో చాలావరకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ప్రజలలో అవగాహన కల్గించి అంతరించి పోతున్న ఈ అరుదైన అందమైన నల్లజాతి కోళ్లను కాపాడుకుందాం!
మనిషికి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం లేని జీవితాలలో ఆనందం ఉండదు. కాబట్టి అందరికీ ఆరోగ్యం తప్పనిసరి. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు మన పెద్దలు. మన ఆరోగ్యం ప్రధానంగా మనం పీల్చుకునే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం, వ్యాయామం లాంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఈ నాలుగు అంశాలలో ఆహారం తప్పితే మిగతావి అన్నీ కూడా వేరేవారిపై ఆధారపడవలసిన అవసరంలేదు. ఆహారం మాత్రం చాలావరకు వేరేవారిపై ఆధారపడాలి. గ్రామాలలో జీవించేవారు, పంటల సాగు చేసే వారు మాత్రం కొంతవరకు తామే సొంతంగా పండించుకుంటూ కొంతవరకు మాత్రమే మిగతా వారిపై అంటే అవి పండించే రైతుల ద్వారా పంట ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే వ్యాపారులపై ఆధారపడాలి. వేరే వారిపై ఆధార పడటం అంటే నమ్మకం కుదరక పోవచ్చు. ఈ సమస్యకు పరిష్కారం పెరటి తోట లేదా మిద్దెతోట లేదా ఇంటి పంట. ఇంటి పంట అవసరం ప్రస్తుతం అందరికీ ఉంటుంది. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి 12 సంవత్సరాల క్రితమే ఇంటి పంటను మొదలు పెట్టారు తుమ్మేటి రఘోత్తమరెడ్డి. సక్రమంగా ఇంటిపంటను చేపట్టినట్లయితే ఇంటి పంట ఒక బహుళార్థక సాధక ప్రాజక్ట్ అని రఘోత్తమ రెడ్డి తన అనుభవంలో గ్రహించారు.
రఘోత్తమరెడ్డిది స్వతహాగా వ్యవసాయ నేపథ్యం. చదువుకునే రోజుల్లో కూడా పొలం పనులలో తనవంతు పాత్ర పోషిస్తుండేవారు. సింగరేణిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా తన నివాస స్థలంలో పెరటి తోటను పెంచేవారు. మొత్తం మీద మొక్కల సాగులో 40 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. సింగరేణి సంస్థలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్న రఘోత్తమరెడ్డి ఒకానొక సందర్భంలో తాను నిర్వర్తించే ఉద్యోగ బాధ్యతలు సరైనవి కావు అని భావించి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి మిద్దెతోట వైపు అడుగులు వేశారు. ఉప్పల్ సమీపములోని నారపల్లిలో 160 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. స్థలం తక్కువగా ఉండటం వలన పెరటి తోట కుదరదు. పెరటి తోటకు ప్రత్యామ్నాయం మిద్దెతోట అని గ్రహించి ఇంటి పైన మిద్దెతోట పెంచాలని నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా ఇంటి నిర్మాణం చేయించారు. మిద్దెపైన కుండీలలో మొక్కలు పెట్టి మొక్కల పెరుగుదలకు నీటిని అందిస్తుంటాము కాబట్టి ఆ నీరు క్రిందకు కారకుండా ఉండేందుకు వీలుగా స్లాబును వేయించారు. మిద్దెపై కొన్ని మడులు నిర్మించుకున్నారు. మొక్కలు పెంచుకోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలతో ఇల్లు నిర్మించుకున్నారు కాబట్టి గత 12 సంవత్సరాలకు పైగా మిద్దె తోటలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో పాటు బొప్పాయి, జామ, అరటి లాంటి పండ్ల మొక్కలను కూడా పెంచుతూ ఆరోగ్యరమైన దిగుబడులు తీస్తున్నారు.
మిద్దెపై నిర్మించిన మడులలో మరియు కుండీలు, ఇంట్లో వృథాగా పడిఉన్న కూలర్ బాక్సులు, బక్కెట్ల లాంటి వాటిలో కూడా వాటికి అనువైన మొక్కలు సాగు చేస్తున్నారు. వంటింటి వ్యర్థాలను మొక్కలకు అందిస్తూ చీడపీడల నివారణకు వేపనూనె లాంటివి ఉపయోగిస్తుంటారు. ప్రతిరోజు కొంత సమయాన్ని మిద్దెతోటలో గడుపుతూ ప్రతి మొక్కను పరిశీలిస్తూ ప్రాథమిక థలో ఉన్న చీడపీడలను చేతులతో కూడా నివారిస్తుంటారు. ఎక్కవగా నాటు రకం విత్తనాలను ఉపయోగిస్తూ తాను పెంచిన మొక్క నుంచే విత్తనాలను అభివృద్ధిపరుస్తూ అవసరమైన తోటి ఇంటి పంట ఔత్సాహికులకు విత్తనాలను అందిస్తూంటారు.
మిద్దెతోటను పెంచినందువలన ఇంటిలోపల ఉష్ణోగ్రత ఎండాకాలంలో కొద్దిగా తగ్గడం రఘోత్తమరెడ్డి తెలుసుకున్నారు. వేడి తగ్గి చల్లదనం లభిస్తే ఎండాకాలం ఏసిలు, కూలర్ల అవసరం లేకుండా పోయింది కాబట్టి విద్యుత్ను ఆదా చేయవచ్చు. సాయంకాలం సమయంలో కొంత సమయం కుటుంబ సభ్యులందరూ మిద్దె తోటలో గడిపినట్లయితే ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపినట్లవుతుంది. అందరూ ఎంతో కొంత శారీరక శ్రమ చేయటానికి అవకాశం కుదురుతుంది. కాబట్టి మిద్దె తోటను ఒక బహుళార్ధక సాధక ప్రాజక్ట్ అని రఘోత్తమరెడ్డి అంటారు. రఘోత్తమ రెడ్డి స్వతహాగా కవి కాబట్టి మిద్దె తోటలో గడుపుతూ కవితలు రాస్తూ ఉంటారు.
ప్రస్తుతం గ్రామాలలో ఉన్న రైతులు ఏకపంట విధానానికి అలవాటు పడ్డారు కాబట్టి గ్రామాలలో కూడా ఇంటి పంట అవసరం ఉందని గ్రహించారు. పట్టణాలలో మరియు గ్రామాలలో కూడా ఇంటి పంట సాగుదారులను పెంచాలనే ధ్యేయంతో ఇంటిపంట ఆవశ్యకతను, ఇంటి పంటలో మెళకువలను సామాజిక మాధ్యమాల ద్వారా అందరికి తెలియచేస్తూ ఉంటారు. రైతునేస్తం తరఫున ఇంటి పంటపై జరుగుతున్న అవగాహన సదస్సులకు హాజరయ్యి తన అనుభవ పాఠాలను తోటి ఔత్సాహికులకు తెలియచేస్తుంటారు. అవగాహనా సదస్సులకు ఎలాంటి పరిమితులు విధించకుండా ఏ ప్రాంతానికైనా వెళ్ళి అక్కడ అవగాహనా సదస్సులలో భాగస్వాములవుతుంటారు. మిద్దెతోటకు సంబంధించిన పుస్తకాలను కూడా రైతునేస్తం పబ్లికేషన్స్ ద్వారా ముద్రించారు. ఇంటి పంట అభివృద్ధికి శక్తికి మించి కృషి చేస్తున్నారు.
ప్రస్తుత సమాజంలో సమాచారాన్ని విశ్వవ్యాపితం చేయటానికి సామాజిక మాధ్యమాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రఘోత్తమ రెడ్డి ప్రతిరోజూ ఇంటి పంటకు సంబంధించిన సమాచారాన్ని, చిత్రాలను వాట్సప్, ఫేస్బుక్ల ద్వారా తోటి ఔత్సాహికులకు తెలియ చేస్తుంటారు. తాను తెలియపరిచే సమాచారం అంతా కూడా సరళమైన తెలుగు భాషలో అందరికీ అర్థం అయ్యేలా తెలుగులో టైపు చేసి పంపిస్తుంటారు. జిల్లాల వారీగా వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసి తన సూచనలను సలహాలను ప్రతి జిల్లాలోని మారుమూల ప్రాంతాలలోని మిద్దెతోట/ఇంటిపంట ఔత్సాహికులకు చేరేలా చర్యలు చేపడుతుంటారు. ఇంటి పంటకు సంబంధించి సదస్సులు ఏర్పాటు చేసే నిర్వాహకుల ఆహ్వానం మేరకు సదస్సులకు హాజరై తన అనుభవ పాఠాలను వివరిస్తూ ఉంటారు. సదస్సుకు హాజరయ్యే ఔత్సాహికుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని సదస్సులకు హాజరవుతూ ఎక్కువ మందిని ఇంటిపంట వైపు అడుగులు వేయించడమే తన లక్ష్యం అంటూ ముందుకు నడుస్తున్నారు. ఇంటి పంట/పెరటి తోట / మిద్దె తోటల పెంపకంలో మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ అనుభవం ఉన్న వారి గురించి ప్రస్తావిస్తే రఘోత్తమరెడ్డి ముందు వరుసలో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహంలేదు. మరిన్ని వివరాలు 90001 84107 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
తొలకరి వర్షాలతోనే రైతులు ఖరీఫ్ (వానాకాలం) సీజన్ పనులకు సన్నాహాలు జరుగుతువుంటాయి. ఈ సంవత్సరంకు గాను మనకు నైరుతి రుతుపవనాలు చాలా తొందరగా (ముందస్తుగా) వచ్చేస్తున్నాయని మన వాతావరణ విభాగం వారు తెలియజేస్తున్నారు.
ఖరీఫ్ 2022-2023 త్వరలో మొదలవుతుంది. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గతంలో వ్యవసాయ పనులలో, వ్యయంలో (ఆర్థికంగా) గాని మరియు వనరులను ఉపయోగించడంలో గతంలో చేసిన పొరపాట్లను తిరిగి చేయకుండా ఈ తొలకరిలో సరైన సన్నాహాలను చేసుకొన్నట్లయితే రైతన్నకు లాభసాటి వ్యవసాయం సాధ్యమే. అలా కాని పక్షంలో రైతు వ్యవసాయంలో భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.
మనకున్న (రైతు) నేల రకం, నీటి వసతి, పెట్టుబడి లభ్యత, కుటుంబ పరిస్థితి మరియు ఆర్థిక స్థితిగతులు వంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని పంటలను మరియు విత్తన రకాలను ఎన్నుకోవాలి. మన పరిస్థితులకు అనుగుణంగా మన వ్యవసాయ ప్రణాళిక ఉండాలి. నీటి వసతి, మరియు వర్షాధారిత నేలలో కొన్ని దీర్ఘకాలిక, మరికొన్ని స్వల్పకాలిక ఆదాయ వనరులను ఇచ్చేవిధంగా ఉండాలి. ఎప్పటికి వేరే వాళ్ళను అనుకరించే విధంగా ఉండకూడదు.
సాధ్యమైన వరకు నేల సారవంతతను పెరిగే విధంగా…
చెరువు మట్టిని పంటపొలాలకు వేసవిలో తోలుకోవాలి.
పొలంలో గొర్రెల మందలకు తోలాలి (పెట్టాలి)
పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు మరియు గొర్రెల ఎరువులను పంట పొలాల భూములలో తప్పకుండా వాడాలి.
నీటి తడులు ఇచ్చే అవకాశం ఉన్న చోట వేసవిలో పచ్చిరొట్ట ఎరువులను (జీలుగ/పెసర/జనుము) వేసి అవి పూత థకు చేరుకొనే సమయంలో రోటావేటర్ సహాయంతో నేలలో కలియదున్నాలి.
పంటల ఎన్నిక / పంటల ప్రణాళిక
ఎండాకాలంలో మట్టి నమూనా పరీక్షలు తప్పని సరిగా చేయించాలి. మట్టి నమూనాలలో వచ్చిన ఫలితాలకు సమతుల్యమైన ఎరువులను సమయానుసారంగా శాస్త్రీయ పద్ధతిలో వాడాలి.
వాతావరణం సూచనలు, భూగర్భ జలాల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ వాటికి అనుగుణంగా పంటలను సాగు చేసుకోవాలి.
పంటలలో మన వాతావరణ పరిస్థితులకు మరియు మన పరిస్థితులకు అనువైన రకాలను అలాగే మన ప్రాంతంలో చీడపీడలను తట్టుకొనే రకాలను ఎన్నిక చేసుకోవాలి.
ఏక పంటకు బదులు బహుళ పంటల సాగు పద్దతిని ఎన్నుకోవాలి. దీర్ఘకాలిక పంటలకు బదులుగా 2-3 స్వల్పకాలిక పంటలు, తక్కువ పెట్టుబడి అవసరమున్న పంటలను ఎన్నుకోవాలి. మరీ ముఖ్యంగా అంతరపంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి. పంటల మార్పిడి లేక రకాల మార్పిడి తప్పకుండా పాటించాలి.
అవసరానుసారంగా మండల వ్యవసాయ అధికారులకు, ఏరువాక కేంద్రాలను, శాస్త్రవేత్తలను మరియు కిసాన్ కాల్ సెంటర్లను సంప్రదించి సందేహాలను (వ్యవసాయ పనులలో) నివృత్తి చేసుకోవాలి.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమతుల సహాయాన్ని, మార్కెటింగ్, గిడ్డంగులు మరియు తక్కువ వడ్డీతో పంట రుణాలను వాటి మాఫీ సదుపాయాలను రైతులు వినియోగించుకోవాలి.
విత్తనాలను సర్టిఫైడ్ డీలర్ల వద్ద మాత్రమే కొనాలి. అలాగే రశీదు తప్పక తీసుకొని భద్రపరచుకోవాలి.
సమగ్ర సుస్థిర వ్యవసాయం చేపట్టాలి. అనగా వ్యవసాయంతో పాటు పెరటి కోళ్ళ పెంపకం, పాడి గేదెల పెంపకం మరియు పందిరి కూరగాయలు మొదలైనవి చేపట్టాలి.
ఈ విధంగా రైతులు సరైన ప్రణాళికలను ఖరీఫ్కు ముందుగా రూపొందించుకొని, పంటలపై పెట్టుబడిని తగ్గుంచుకుని, పంట ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచుకొని, వ్యవసాయంతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించి వ్యవసాయాన్ని ఈ ఖరీఫ్ సీజన్లో పండగ లాగా చేసుకోవాలి. జి
పశుపోషణలో… జూన్ మాసంలో నైరుతీ రుతుపవనాలతో వర్షాలు మొదలౌతాయి. షెడ్డులో తేమ లేకుండా చూడాలి. లేదా పశువులకు వ్యాధులు సోకుతాయి. గొంతువాపుకు టీకాలివ్వకపోతే ఈ నెలలో ఇవ్వాలి. అలాగే గాలికుంటు వ్యాధి నివారణ టీకాలిచ్చి ఆరు నెలలయితే మళ్ళీ ఇవ్వాలి. పచ్చిమేత లభించడం ఈకాలంలో మొదలవుతుంది. పశువులకు పచ్చిమేత ఎక్కువగా మేపి దాణా తగ్గిస్తే లాభదాయకం. వాతావరణం చల్లబడడంతో పశువులు ఎక్కువగా ఎదకొస్తాయి. ఉదయాన ఎదకొచ్చిన పశువులను సాయంత్రం, అలాగే సాయంత్రం ఎదకొచ్చిన పశువులకు మరుసటి ఉదయం మేలు జాతి ఆబోతుల వీర్యాన్ని కృత్రిమ గర్భోత్పత్తి ప్రక్రియ ద్వారా ఉపయోగించాలి. సైలేజిని గుంటనించి కాని, పై నుంచి కాని తీస్తే, తీసిన వెంటనే కప్పి వేయాలి లేదా చెడిపోయి మేపుకు పనికిరాదు.
పశుగ్రాసాల సాగులో… ఈ నెలలో నైరుతీ రుతుపవనాలు మొదలై వర్షాలు కురుస్తాయి. వర్షాధార పంటలైన జొన్న, మొక్కజొన్న రకాల్ని విత్తుకునేందుకిది అనువైన సమయం. మొక్కజొన్నలో ఆఫ్రికన్ టాల్ రకం పచ్చిమేత ఎక్కువగా ఇస్తుంది. అలాగే దీర్ఘకాలికమైన ఏపిబిఎన్-1, కో-1, కో-2, కో-3 మొదలగు పంటలు వర్షాలకు బాగా పెరిగి మేతెక్కువిస్తాయి. పాడి పశువులకు పచ్చిమేత ఎక్కువగా మేపి దాణా తగ్గించుకోవడం లాభదాయకం. దీర్ఘకాలికమైన హైబ్రిడ్ నేపియర్ వంటి రకాల కణుపుల్ని భూమిలో పాతి నాటుకోవడానికిది మంచి సమయం. వర్షాల వలన కణుపులు ఎక్కువగా బతికి భూమిలో బాగా నిలదొక్కుకుంటాయి. కణుపులెండిపోయిన చోట్ల మళ్ళీ పాతాలి.
జీవాల పోషణలో… వేసవి తరువాత నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు మొదలవుతాయి. పచ్చిగడ్డి మొలకొస్తుంది. అయినా పొలాల్లో పచ్చిమేత పూర్తిగా దొరకదు. షెడ్డులో కొంతవరకు సైలేజి, ఎండుమేత, దాణా మేపడం అవసరం. ఎండుమేతను ముక్కలుగా కత్తిరించి మేపితే, మేత వృథాగాదు. గొర్రెల్ని వర్షంలో తడవనీయకూడదు. లేదా న్యుమోనియాతో బాధపడతాయి. రోగాలెక్కువగా వ్యాపించడానికి వర్షాకాలం అనుకూలం. నట్టల నివారణ కషాయాలు, పిడుదులు, గోమార్ల నివారణ పద్ధతులు వినియోగించాలి. చిటుక రోగానికిప్పటి వరకు టీకాలియ్యని గొర్రెలు, మేకలకు, పిల్లలకు, టీకాలిప్పించాలి. గాలికుంటు వ్యాధికి ఆరు నెలలుగా టీకాలివ్వని గొర్రెలు, మేకలు, పిల్లలకు టీకాలిప్పించాలి. మూడు నెలలు నిండిన పిల్లల్ని తల్లుల నుండి వేరు చేయాలి. ఉన్నిచ్చే గొర్రెలైతే ఉన్ని కత్తిరించాలి. గొర్రెలు, మేకల్లో జత కలపాలి.
కోళ్ళ పెంపకంలో… ఈ నెలలో వర్షాకాలం మొదలవుతుంది. కోళ్ళ షెడ్డులో తేమ లేకుండా చూడాలి. వ్యాధి నిరోధక టీకాలు పశువైద్యులు, కోడి పిల్లల నందించే హ్యచరీల సూచనల మేరకు వేయించాలి. తక్కువ ఖర్చుతో అన్ని పోషకాలు ఉన్న కోళ్ళ మేత తయారీ, వాడకంలో సంబంధిత నిపుణుల సూచనల్ని పాటించాలి. తద్వారా అధిక లాభాల్ని పొందవచ్చు. ఎందుకంటే కోళ్ళ పరిశ్రమలో 70 శాతం ఖర్చు మేతపైనే ఉంటుంది. గ్రామాల్లో రైతులు పెరటి కోళ్ళను పెంచవచ్చు. దీనికి వనరాజ, గ్రామప్రియ, రాజశ్రీ అనే రకాలున్నాయి. మామూలు దేశీయ కోళ్ళు సంవత్సరానికి 80 వరకూ గుడ్లు పెడితే, ఇవి 180 వరకూ గుడ్లు పెట్తాయి. పైగా త్వరగా పెరిగి మాంసానికి కూడా పనికొస్తాయి. రాజేంద్రనగర్లోని కోళ్ళ పరిశోధన సంస్థలు ఈ కోడి పిల్లల్ని అందిస్తున్నాయి.
ఈరోజుల్లో గొర్రెలను వృత్తిగా మాత్రమే కాకుండా వాణిజ్య సరళిలో పెంచుతున్నారు మరియు అధునాతన యాజమాన్య పద్ధతుల్లో పెంచుతున్నారు. అయితే సాధారణంగా గొర్రెల్లో చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవి వైరస్ మరియు బాక్టీరియా వల్ల కావచ్చు. వీటిల్లో చాలా వరకు వ్యాధులను యజమాని గుర్తు పట్టి వైద్యం అందించి బ్రతికించుతాడు. కానీ కొన్ని వ్యాధులు గుర్తు పట్టడం మరియు చికిత్స అందించే లోపలే గొర్రెలు చనిపోయే అవకాశం ఉంది. వాటిల్లో చిటుకువ్యాధి ముఖ్యమైనది. తొలకరి జల్లులు పడగానే క్లాస్ట్రిడియం అనే బాక్టీరియా విడుదల జేసే విషపదార్థం వల్ల ఈ వ్యాధి వస్తుంది. చిటుక వేసినంత కాలంలోనే విష పదార్థం విడుదల అవడం వలన జీవాలు చనిపోతాయి. అందుకే ఈ వ్యాధిని చిటుకు వ్యాధి అంటారు. ఈ వ్యాధిని ఎంటిరోటాక్సిమియా అని వాడుక భాషలో అయితే గడ్డి రోగం, మెడసారం, ముచు& వ్యాధి అని రకరకాల పేర్లతో పిలుస్తారు. అలాగే ఈ వ్యాధితో ఒకేసారి పిడుగుపాటుకు చనిపోయినట్లుగా చనిపోతాయి. అందుకే ఈ వ్యాధిని నెత్తి పిడుగు వ్యాధి అని కూడా అంటారు. ఈ చిటుకు వ్యాధి జూన్-జూలై మాసాలలో దొరొకే పచ్చిక తిన్న జీవాలలో వస్తుంది. సాధారణంగా చిటుక వ్యాధి లేత వయస్సు ఉన్న దృఢంగా, ఆరోగ్యంగా ఉన్న జీవాలలో, గొర్రెలలో ఎక్కువగా కనిపిస్తుంది.
వ్యాధి కారణాలు
గొర్రెల్లో అకస్మాత్తుగా గడ్డి ఎక్కువగా తినడం వల్ల పేగుల్లో అనరోబిక్ అనగా ఆక్సిజన్ తక్కువగా అవడం వల్ల క్లాస్రీటడియం ఫర్ఫ్రింజెన్స్-డి వల్ల వస్తుంది. ఈ బాక్టీరియా బద్దె పురుగులు కడుపులో ఉండటం వల్ల ఎక్కువగా అటు ఎప్సిలాన్ అనే విష పదార్థాన్ని విడుదల చేయడం వలన ఈ వ్యాధి వస్తుంది. పచ్చిగడ్డికి బదులు ఎండుగడ్డిని వేయడం లేదా ఒకేసారి మేతను మార్చడం వల్ల ఈ వ్యాధి వస్తుంది.
వ్యాధి లక్షణాలు
సామాన్యంగా ఈ జీవాల్లో రోజంతా బాగుండి, తెల్లారేసరికి ఎక్కువ సంఖ్యలో జీవాలు ఎటువంటి లక్షణాలు లేకుండా హఠాత్తుగా గాల్లోకి ఎగిరి కిందపడి గిలగిలా కొట్టుకొని, పళ్లు బిగపట్టుకొని, కళ్ళను పైకి అని మరణిస్తాయి. వీటిలో శరీర ఉష్ణోగ్రత (104-106 డిగ్రీ ఫారెన్హీట్) ఉంటుంది. వ్యాధి అధికంగా ఉన్నపుడు నీరసంగా ఉండటం, పొట్టను తన్నుకొవడంతో పాటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అయి గొర్రెలు చనిపోతాయి.
వ్యాధి చికిత్స
ఈ వ్యాధిలో గొర్రెలకు చికిత్స అంటూ లేదు. ఎందుకంటే ఈ వ్యాధి సోకిన జీవాలు అకస్మాత్తుగా మరణిస్తాయి. వ్యాధి దీర్ఘకాలికంగా సోకిన జీవాలకు పశువైద్యుని సలహా ప్రకారం పెన్సిలిన్ ఆంటిబయోటిక్ను క్రమం తప్పకుండా 5 రోజులు వాడాలి. రక్తనాళంలోకి డెక్ట్రెస్ సెలైన్ను ఎక్కించాలి.
వ్యాధి నివారణ
వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయటం కష్టమని తెలిసింది కాబట్టి కొన్ని నివారణ చర్యలు పాటిస్తే మనం జీవాలను ఎంటరోటాక్సిమియా బారిన పడకుండా కాపాడవచ్చు. మే మాసంలో అనగా తొలకరి జల్లులు పడే కంటే ముందు ఈ టీకాను వేయించాలి. మరల 15 రోజుల తరువాత బూస్టర్డోస్ తప్పకుండా వేయించాలి. తొలకరి వర్షాలకు మొలిచిన, వాడిపోయిన లేతగడ్డిని జీవాలు మేయకుండా జాగ్రత్తపడాలి.
పిల్లలు పాలు తాగే స్థితి మంచి మేత, దాణాను ఒకేసారి మార్చకుండా క్రమక్రమంగా మార్చుకోవాలి. తొలకరి జల్లులు పడినప్పుడు కడుపునిండా పచ్చిమేత పెట్టకుండా, 3-4 గంటలు మాత్రమే మేసేలా చూడాలి. టీకాలు వేసే కంటే ముందు బద్దె పురుగులకు సంబంధించిన నట్టల మందును తాగించాలి.
ఈ వ్యాధి వస్తే అధిక సంఖ్యలో జీవాలు అకస్మాత్తుగా చనిపోయిన, జీవాల పెంపకందారులు తీవ్రమైన నష్టాలకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం మే-జూన్ మాసాల్లో తప్పనిసరిగా చిటుక రోగ నివారణ టీకాలు వేయించాలి.
వ్యాధి నిర్ధారణ
గొర్రెలు తొలకరి జల్లులు పడినపుడు మేత ఎక్కువగా తిని ఒకేసారి ఎక్కువ సంఖ్యలో చనిపోయినపుడు మనం చిటుక వ్యాధిగా నిర్ధారించుకోవచ్చు. గొర్రెను కోసి చూసినట్లయితే పొట్టలో ఆకుపచ్చదనం కన్పిస్తుంది. చిన్న ప్రేగు ప్రారంభంలో గుండె మీద రక్తస్రావాలు గమనించవచ్చు. ముఖ్యంగా గొర్రె మూత్ర పిండాలు గుజ్జు గుజ్జు అవుతాయి. ఈ లక్షణాలను బట్టి మనం చిటుకు వ్యాధిగా నిర్ధారణ చేసుకోవచ్చు. ఇంకా నిర్ధారణ చేసుకోవాలంటే గొర్రె పొట్టలో పదార్థాన్ని ల్యాబ్కు పంపినట్లయితే దాన్ని ఎలుక తోకలోకి ఎక్కించి 24 గంటల్లో చనిపోయినట్లయితే ఎంటిరోటాక్సిమియా చిటుకు వ్యాధిగా నిర్ధారించవచ్చు.
నది వ్యవసాయక దేశం. అనాదిగా మన ప్రదాన వృత్తి వ్యవసాయం. అయినా కాని రైతులు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు అంటున్నారు. గిట్టుబాటు కాకపోయినా పంటల సాగు ఆగుతుందా? అంటే ఆగడము లేదు. పంటల సాగు నిరంతరం కొనసాగుతుంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. రైతులు పంటల సాగు కొనసాగించడం వలననే కరోనా సమయంలో అన్ని ఆగినవి కానీ రైతు కాడి ఆగలేదు. కాబట్టి మన అవసరాలకు మించి ఆహారాన్ని అన్నదాతలు పండించగలిగారు. వరి ఉత్పత్తి పెరగబట్టే ప్రభుత్వాలు వరి సాగును నియంత్రించడం జరిగింది. అంటే రైతులకు పంటల సాగు గిట్టుబాటు అయినా, కాకపోయినా కూడా వ్యవసాయం ఆగడం లేదు. రైతులందరికీ పంటల సాగు గిట్టుబాటు కావడం లేదా? అంటే సమాధానం కాదు అని వస్తుంది. అంటే కొంతమంది రైతులు లాభాల సాగు చేస్తున్నారు. కొంతమంది రైతులు సాగులో నష్టాలను భరించవలసి వస్తుందనేది మన వ్యవసాయ రంగం సారాంశం. ఏది ఏమైనా కానీ వ్యవసాయంలో అవసరమైన అన్ని మెళకువలు అంటే పెట్టుబడులు తగ్గించుకొని, నాణ్యమైన దిగుబడి పొంది ఆ దిగుబడికి విలువ జోడించి నేరుగా వినియోగదారులకు అమ్మగలిగితే రైతులు తమ సాగులో లాభాలు గడించగలరు అని అనేకమంది రైతుల అనుభవాలు చెబుతున్నాయి. ఈ కోవకే చెందుతారు పశ్చిమగోదావరి జిల్లా రావులపాలెంకి చెందిన వీరారెడ్డి.
వీరారెడ్డి జీవితం అనేక మలుపులు తిరిగింది. ఒకానొక సమయంలో ఆర్థిక సమస్యల నుంచి బయట పడటానికి చెరకు సాగు మొదలు పెట్టారు. మొదటగా ఒక ఎకరంలో చెరకును పూర్తి సేంద్రియ పద్ధతిలో పండించి ఆ చెరకును అదేవిధంగా చెరకుగా అమ్మకం చేసినట్లయితే సరైన ఆదాయం రాదు అని గ్రహించి చెరకుకు విలువ జోడించి రసం చేసి, చెరకు రసాన్ని నేరుగా వినియోగదారులకు అమ్మగలిగితే మంచి ఆదాయం వస్తుందని గ్రహించి ఆ దిశగా అడుగులు వేశారు. వీరారెడ్డి గారు కౌలుకు తీసుకున్న పొలం ప్రధాన రహదారి ప్రక్కనే ఉండడం వలన చెరకు రసంను మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం కుదిరింది. తాను పండించే చెరకుకు ఎలాంటి రసాయనాలు వేయకుండా పశువుల ఎరువు తోలించడంతో పాటు అవసరాన్ని బట్టి ద్రవజీవామృతం, ఘనజీవామృతం లాంటివి అందిస్తూ వస్తున్నారు. ఇంకా అవసరమనుకుంటే ఫిష్ ఎమినో యాసిడ్ కూడా పంటకు అందిస్తూ వస్తుంటారు. చెరకు రసం తీసిన పిప్పిని కూడా బాగా కుళ్ళించి దానిని కూడా చెరకు సాగుకు ఉపయోగిస్తూ ఎలాంటి రసాయనాల అవసరం లేకుండా ఎకరానికి 40 టన్నులకు తగ్గకుండా చెరకు దిగుబడిని పొందుతూ ఆ దిగుబడిని రసం తీసి లీటరు 60/-ల చొప్పున అమ్ముతూ వస్తున్నారు.
ఒక దుకాణంతో, ఒక ఎకరంతో మొదలైన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి 22 బ్రాంచిలకు, 22 ఎకరాలకు ఎదిగింది. ప్రస్తుతం వీరారెడ్డి గారు మొత్తం 22 ఎకరాలలో చెరకు పంటను సాగు చేస్తున్నారు. 22 ఎకరాల చెరకుగాను ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో 22 దుకాణాలను ఏర్పాటు చేసి సంవత్సరం పొడవునా చెరకు రసం మార్కెటింగ్ చేస్తూ వస్తున్నారు. చెరకు రసంలో ఉండే పోషకాలను వినియోగదారులకు తెలియపరుస్తూ శీతల పానీయాలకు బదులుగా చెరకు రసాన్ని వినియోగిస్తే లభించే ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు తెలియపరుస్తూ రోజు రోజుకు తన వ్యాపారాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.
చెరకు రసం తీయడానికి పలు రకాల మిషన్లు ఉపయోగించి చివరకు లక్షన్నర విలువ చేసే మిషన్ అయితే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుసుకుని అన్నీ ఆ మిషన్లనే ఏర్పాటు చేశారు. మిషను మరియు దుకాణంకి కావలసిన అన్ని ఏర్పాట్లకు కలసి ఒక్కొక్క దుకాణానికి 8 లక్షల రూపాయలు ఖర్చు చేసి 22 బ్రాంచిలను ప్రారంభించి అన్ని బ్రాంచీలను విజయవంతంగా నడిపిస్తున్నారు. సొంత దుకాణాల ద్వారా చెరకు రసాన్ని అమ్మకం చేయడంతో పాటు శుభకార్యాలకు, పెళ్ళిళ్లకు, పంక్షన్లకు కూడా చెరకు రసాన్ని సరఫరా చేస్తున్నారు. ఇందుకుగాను ముందుగా వచ్చిన ఆర్డరు ప్రకారం అవసరమైన చెరకు ముక్కలను రిఫ్రిజిరేటర్లో పెట్టి అవసరమైన చల్లదనం వచ్చిన తరువాత ఆ చెరకు ముక్కలను కూల్ బాక్స్లో పెట్టి ఫంక్షన్ జరిగే ప్రాంతానికి చల్లబరచిన చెరకు ముక్కలు మరియు రసం తీసే మిషను తీసికెళ్ళి అక్కడకూడా తాజా చెరకు రసాన్ని తీసి అందిస్తున్నారు.
చెరకు సాగుకు కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. చెరకు విత్తనం నాటడానికి, సేంద్రియ పదార్థం అందించటం, చెరకు నరకడము ఇలాంటి పనులన్నింటికి కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే చెరకును చెరకు రసంగా మార్చాలంటే కూలీల అవసరం ఇంకా ఎక్కువగా ఉంటుంది. చెరకు గడను పై చెత్త తొలగించడం, ఉప్పు నీటిలో ఒకసారి, మంచి నీటిలో ఒకసారి కడగడం, శుభ్రంగా కడిగిన గడలను ముక్కలుగా కట్ చేసి ట్రేలలో అమర్చడం, కట్ చేసే సమయంలో ఏదైనా తెగులు ఆశించిన భాగాన్ని తొలగించడం, సిద్ధమైన చెరకు ముక్కలను అవసరమైన ప్రాంతానికి రవాణా చేయడం లాంటి వాటన్నింటికి కూలీల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందుకుగాను వీరారెడ్డి గారు మొత్తం సుమారుగా 150 మంది కూలీలను నియమించుకుని ప్రతినిత్యం వారికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు.
మామూలుగా చెరకును అదేవిధంగా చెరకు ఫ్యాక్టరీకి అమ్మకం చేసినట్లయితే టన్నుకు 3000/-ల వరకు రావచ్చు. అదే చెరకు రసం చేసే వారికి అమ్మకం చేసినట్లయితే టన్నుకు 5000/-ల వరకు రావచ్చు. అదే తానే సొంతంగా చెరకు రసాన్ని తీసి అమ్మినట్లయితే టన్ను చెరకు నుంచి 30000/-ల స్థూల ఆదాయం పొందవచ్చు. టన్ను చెరకు నుంచి 500 లీటర్ల చెరకు రసం పొందవచ్చు. లీటరు 60/-లకు అమ్మకం చేసినా కూడా 30,000/-ల స్థూల ఆదాయం వస్తుంది. ఈ రకంగా వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించగలిగితే రైతు లాభా బాటలో నడవడం తధ్యం అని వీరారెడ్డి నిరూపిస్తున్నారు. చెరకుతోపాటు కొద్ది ప్రాంతంలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు కూడా పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్నారు. మరిన్ని వివరాలు 95333 61515 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
ఎకరానికి 9 లక్షల ఆదాయం
చెరకు అందరికీ తెలిసిన పంట. రసాయనాలతో చెరకును పండించేవారు ఎకరానికి 60 టన్నులకు పైబడే దిగుబడి తీస్తున్నారు. ఏది ఏమైనా కానీ సగటున కనీసం 40 టన్నుల వరకు తీస్తున్నారు. సేంద్రియ సాగు పద్ధతులు వచ్చిన తరువాత చెరకు రైతులు సేంద్రియబాట పడుతున్నారు. మిగతా పంటలతో పోల్చుకుంటే చెరకు సేంద్రియ సాగుకు బాగా అనుకూలం. అన్ని మెళకువలు సక్రమంగా తీసుకోగలిగితే చెరకులో సేంద్రియ పద్ధతులు పాటించిన మొదటి సంవత్సరం నుంచే రసాయనాలతో సమానంగా దిగుబడి తీయవచ్చని అనేకమంది రైతులు నిరూపిస్తున్నారు. వీరారెడ్డిగారు 22 ఎకరాలలో చెరకును సాగు చేస్తూ ఎకరానికి సంవత్సరానికి సగటున 30 టన్నుల దిగుబడి తీస్తున్నారు. చెరకును రసం తీసి లీటరు 60/-లకు తగ్గకుండా అమ్మకం చేస్తున్నారు. టన్ను చెరకు నుంచి 500 లీటర్లకు తగ్గకుండా చెరకు రసం వస్తుంది. లీటరు 60 రూపాయలు చొప్పున 500 లీటర్లకు 30,000/- అంటే టన్ను చెరకు 30,000/-లు. ఎకరానికి 30 టన్నుల దిగుబడి సాధిస్తూ, 30 టన్నుల చెరకును రసం తీసి అమ్ముతూ టన్ను చెరకు నుంచి 500 లీటర్లు అంటే 30 టన్నుల చెరకు నుంచి 15000 లీటర్ల రసం పొంది లీటరు 60/-ల చొప్పున మొత్తం ఎకరం చెరకును చెరకు రసం చేసి 9 లక్షల రూపాయల స్థూల ఆదాయం గడిస్తున్నారు. రసం తీయగా వచ్చిన పిప్పిని కుళ్ళించి మరలా చెరకు సాగుకు వినియోగిస్తున్నారు కాబట్టి సాగు ఖర్చులు కూడా తగ్గించుకుంటున్నారు.
ప్రతి మనిషికి గాలి, నీరు తరువాత ప్రాథమిక అవసరాలు ఆహారం మరియు రక్షణ. ప్రస్తుత పరిస్థితులు గమనించినట్లయితే వివిధ రకాల కారణాల వలన ప్రతి దేశం వారు విదేశీయుల నుండి, పొరుగు లేదా శత్రు దేశాల నుండి తమ దేశాన్ని, తమ దేశ ప్రజలను రక్షించుకోవడం కొరకు లక్షల కోట్లు ఖర్చు చేయవలసి వస్తుంది. విదేశీ శత్రువులనుండి మన దేశాన్ని సైనికులు ప్రతిక్షణం కాపాడుతూ ఉంటారు. సైనికులు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రతికూల పరిస్థితులలో కూడా దేశ రక్షణ కోసం అనునిత్యం పాటుపడుతుంటారు. అనివార్య పరిస్థితులలో యుద్ధంలాంటిది సంభవిస్తే తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మన దేశాన్ని కాపాడటానికి ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు. మనం క్షేమంగా ఉంటూ గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోతున్నామంటే అది మొత్తం మన సైనికుల త్యాగం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ, ప్రతిక్షణం జై జవాన్ అంటూ సైనికుల త్యాగాలను గుర్తిస్తూ వారికి జేజేలు పలకవలసిందే. అదేవిధంగా పెరుగుతున్న జనాభా అందరికీ ఆహారం అందుతుందంటే మరియు కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో కూడా అన్ని ఆగినవి కాని ఒకటి మాత్రం ఆగలేదు. అదే వ్యవసాయం. రైతులు స్వేదం చిందిస్తూ సేద్యం చేస్తూ కరోనాలాంటి విపత్కర పరిస్థితులలో కూడా తమ కాడిని ఆపకుండా పంటల సాగు చేశారు, చేస్తున్నారు కాబట్టే మన ఆకలి తీరుతుంది. పంటల సాగులో చాలావరకు రైతులు నష్టాల పాలవుతున్నారు. నష్టాలను భరించలేని కొంతమంది రైతులు తమ కుటుంబాలను అనాధలను చేసి లోకాన్ని విడిచి పెడుతున్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా రైతు పంటల సాగును ఆపడం లేదు. రైతు తమని తాము త్యాగం చేసుకుంటూ సేద్యం చేస్తున్నారు కాబట్టే మన కడుపులు నిండుతున్నవి కాబట్టి మనందరం రైతులకు రుణపడి ఉన్నాము. రైతు వేళ్లు మట్టిలోకి వెళితేనే మన వేళ్లు నోట్లోకి వెళుతున్నాయనే విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు, ప్రతి రోజు జై కిసాన్ అంటూ రైతులకు జేజేలు పలకవలసిందే. జై జవాన్… జైకిసాన్ అని జేజేలు పలికించుకున్న వ్యక్తి ఒకరే అయితే అంతకు మించిన అదృష్టం ఉండదు. అలాంటి అదృష్టవంతులు అతి తక్కువమంది ఉంటారు అనడంలో సందేహం లేదు. అలాంటి తక్కువమందిలో ముందువరుసలో ఉంటారు కడప జిల్లా, కోడూరు గ్రామానికి చెందిన వెంకటరామరాజు.
వెంకటరామరాజుది వ్యవసాయ నేపథ్యం. పియుసి వరకు చదివిన వెంకటరామరాజు చదువు పూర్తి అయిన తరువాత వాయుసేనలో సైనికునిగా బాధ్యతలు చేపట్టి అందులో కొనసాగుతూ వస్తున్నారు. 15 సంవత్సరాలు వాయుసేనలో సేవలు అందించిన తరువాత అందులోనే కొనసాగే అవకాశం ఉన్నా కూడా స్వతంత్ర జీవనానికి, మన దేశ అభివృద్ధికి వ్యవసాయమే సరైన దారి అని నమ్మి వాయుసేనలో పదవీ విరమణ పొంది ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా వ్యవసాయరంగంలో అడుగుపెట్టారు. తోటి రైతుల లాగానే వ్యవసాయంలో అవసరమైన మార్పులను చేపడుతూ పంటల సాగు కొనసాగిస్తూ వస్తున్న సమయంలో రసాయనిక వ్యవసాయం వలన సంభవిస్తున్న అనర్థాల నుండి బయట పడటానికి సేంద్రియ సాగే సరైనదని అని తెలుసుకోవడం జరిగింది. ఈ మార్పుకు సుభాష్ పాలేకర్ అవగాహనా సదస్సులు బాగా ఉపయోగపడినవి. హైదరాబాదు మరియు తిరుపతిలో జరిగిన సుభాష్ పాలేకర్ అవగాహనా సదస్సులకు హాజరయ్యి ప్రకృతి సాగులో మన నాటు ఆవు ప్రాముఖ్యత మరియు ప్రస్తుత పరిస్థితులలో ప్రకృతి సాగు ఆవశ్యకతను గుర్తించి తన రసాయనిక సేద్యాన్ని ప్రకృతిసాగులోకి మార్చారు.
ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వివిధ పంటలు సాగు చేయడంతో పాటు పంటల సాగులో తన అనుభవాలను, తాను నేర్చుకున్న సాంకేతికతను తోటి రైతులకు తెలియజేస్తూ విజ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదు.. విజ్ఞానం అందరికి సంబంధించినది కాబట్టి తాను తెలుసుకున్న విజ్ఞానం తనతో అంతం కాకుండా అందరూ నేర్చుకున్నప్పుడే ఆ విజ్ఞానానికి సరైన అర్థం ఉంటుందనే లక్ష్యంతో వివిధ ప్రాంతాలలోని రైతులకు తన క్షేత్రస్థాయి అనుభవాలను నిస్వార్థంగా తెలియపరుస్తూ జై విజ్ఞాన్ అనే మూడవ నినాదాన్ని వెంకటరామరాజు జత చేశారు. ఈ జైవిజ్ఞాన్ అనే నినాదం వెనక వ్యవసాయ శాస్త్రవేత్త డా|| స్వామినాధన్ ఆలోచన ప్రధానమైనది. ఒకానొక సమయంలో వెంకటరామరాజుకి డా|| స్వామినాథన్ని కలిసే అవకాశం లభించింది. ఆ సందర్భంలో జరగిన సంభాషణల ఫలితమే జై విజ్ఞాన్ అనే నినాదం. జై జవాన్, జై కిసాన్.. జై విజ్ఞాన్ అనే మూడు నినాదాలకు వెంకటరామరాజు న్యాయం చేకూరుస్తున్నారు.
వెంకటరామరాజుకు వివిధ పంటల సాగులో మంచి అనుభవం ఉంది. వీరి ప్రతిభను గుర్తించి అనేక అవార్డులు, రివార్డులు వీరిని వరించినవి. మన దేశంలోనే కాకుండా ఇథోపియా లాంటి దేశాలలో కూడా వ్యవసాయరంగంలో వెంకటరామరాజు తన సేవలను అందించారు. వీరికి వివిధ పంటల సాగులో మంచి అనుభవం ఉన్నా కూడా, ప్రత్యేకించి అరటి మరియు బొప్పాయి పంటల సాగులో వీరికి సుదీర్ఘ అనుభవం ఉంది. ప్రస్తుతం కడప జిల్లా కోడూరు ప్రాంతంలో తోటి రైతుల భాగస్వామ్యంతో అరటి మరియు బొప్పాయి పంటలను సుమారు 15 ఎకరాలలో పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నారు. జీవన ఎరువులు మరియు ట్రైకోడెర్మావిరిడి, సూడోమోనాస్ లాంటి జీవ శిలీంద్ర నాశినులతో అభివృద్ధి పరచుకున్న పశువుల ఎరువును దుక్కిలో అందించడంతోపాటు అవసరాన్ని బట్టి పైపాటుగా అందిస్తుంటారు. క్రమంతప్పకుండా జీవామృతాన్ని భూమికి అందించడంతోపాటు వివిధ రకాల కషాయాలు మరియు ద్రావణాలను పంటపై పిచికారి చేస్తూ పంటలను చీడపీడల నుంచి కాపాడుకుంటున్నారు. చీడపీడల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలలో భాగంగా జిగురు అట్టలు, సోలార్ లైట్ట్రాప్ని ఉపయోగిస్తున్నారు. 15 ఎకరాలలో ఉన్న అరటి మరియు బొప్పాయి మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయి. చుట్టుప్రక్కల రసాయన వ్యవసాయం చేసే తోటలతో పోల్చుకుంటే రాజు గారు సాగు చేసే బొప్పాయి, అరటి పంటలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. పూర్తి సేంద్రియ పద్ధతులతో పంటలు సాగు చేస్తూ తోటి రైతులు సేంద్రియంవైపు అడుగులు వేయటానికి రాజుగారు కృషి చేస్తున్నారు. మరిన్ని వివరాలు 9652902972 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
ఉద్యమాలలో వెంకటరామరాజు
రైతు సమస్యల కోసం, ప్రజల సమస్యల కోసం ఉద్యమాలు అవసరమయితే ఆ ఉద్యమంలో వెంకట రామరాజు ముందువరుసలో ఉంటుంటారు. వివిధ శాఖలకు చెందిన అధికారులతో సత్సంబంధాలను కొనసాగిస్తూ అధికారులకు సూచనలు, సలహాలను అందిస్తూ ప్రత్యేకించి వ్యవసాయ శాఖ ఉద్యానశాఖ వారితో క్రమం తప్పకుండా కలుస్తూ రైతులకు అవసరమైన చర్యలు ఆయా అధికారులు తీసకునేలా వారితో చర్చలు జరుపుతూ అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా వెంకటరామరాజు గుర్తింపు పొందారు.
జార్జిబుష్కి నాగలిని బహూకరించిన వెంకటరామరాజు
జార్జ్బుష్ (జూనియర్) అమెరికా ప్రెసిడెంటుగా ఉన్న సందర్భంలో 2006 వ సంవత్సరంలో మన రాష్ట్రాన్ని సందర్శించారు. జార్జిబుష్ తన సందర్శనలో భాగంగా రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొంతమంది రైతులను కలశారు. జార్జిబుష్ని కలిసిన రైతులలో వెంకటరామరాజు, చింతల వెంకట రెడ్డి, నాగరత్నం నాయుడు, మేకల లక్ష్మీనారాయణ లాంటి వారు ఉన్నారు. వెంకటరామరాజు ఒక నాగలిని జార్జిబుష్కి బహుమానంగా అందించారు. ఆ నాగలిని భుజంపై పెట్టుకుని జార్సిబుష్ ఫొటోలు దిగారు. నాగలితో పాటు పెద్ద పనసకాయ, ప్రకృతి సిద్ధంగా పండించిన మస్క్మెలన్, ఎర్ర అరటి పండ్లను కూడా వెంకటరామరాజు జార్జిబుష్కు అందించారు. జార్జిబుష్ అమెరికా తిరిగి వెళ్ళిన తరువాత వెంటరామరాజుని అభినందిస్తూ ఒక అభినందన పత్రాన్ని పంపడం, వెంకటరామరాజు నైపుణ్యానికి నిదర్శనం.
ఈ సంవత్సరం భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదవ్వచ్చని శాస్త్రవేత్తల అంచనా. మన పొలంలో ఎప్పుడు ఎంత పడింది అనేది ఎక్కడికక్కడ గమనించాల్సిందే. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ను జూన్4న, తెలంగాణాను జూన్ 7న మూడు నాలుగు రోజుల తేడాతో తాకవచ్చు. ఈ నేపథ్యంలో జూన్ నెల (రోహిణి, మృగశిర, ఆరుద్ర కార్తెలు)లో చేయవలసిన వ్యవసాయ కార్యక్రమాలను గురించి తెలుసుకుందాం.
పంటచేతికొచ్చే సమయానికి పండిన సరుకు, లాభానికి అమ్ముడు పోతుందనే నమ్మకమున్న పంటలను, రకాలను ఎంపిక చేసుకుని సాగు చేద్దాం.
టమాట: ఇప్పుడు టమాట చిల్లరగా వంద రూపాయల దాకా అమ్ముతున్నారు. నీళ్లున్న ఎక్కువ మంది రైతులు, టమాట సాగు వైపు మొగ్గు చూపే అకాశముంది. విస్తీర్ణం బాగా పెరిగితే పంట చేతికొచ్చేటయానికి (విత్తిన 90 రోజులకు లేక నాటిన 60 రోజులకు పంటచేతికి రావడం మొదలవుతుంది) ధరలు తగ్గే అవకాశముంది. వర్షానికి కూడా టమాట సాగు చేయడం పలు ప్రాంతాలలో అలవాటుంది. వర్షాధార పంట చేతికొచ్చే టయానికి టమాట ధర బాగా తగ్గే అవకాశముంది. విపరీత వర్షాలు, ముసురు, మేఘావృత వాతావరణం వలన ఏ ప్రాంతంలోనైనా పంట దెబ్బతింటే అప్పుడు టమాట రేట్లు పెరుగుతాయి. టమాట ధర జూన్ నెలలో కూడా ఎక్కువగానే ఉండే పరిస్థితి కనబడుతున్నది. జూలై 3వ వారం, ఆ తర్వాత వర్షాధార ఆకుకూరలు, కూరగాయలు మార్కెట్కు వచ్చినపుడు ఈ పంట ధర తగ్గే అవకాశముంది.
కొత్తిమీర: జూన్ మొదట్లో రుతుపవనాలు మొదలయ్యే వరకు వేడి వాతావరణమే ఉంటున్నందున, ధనియాలు మొలకెత్తి, పెరగడానికి పాక్షికంగా నీడ/ఎండ ఉండి, నీటి లభ్యత ఉన్న ప్రాంతాలు కొత్తిమీర సాగుకు అనుకూలం. మొక్కజొన్నలో అంతర పంటగా పందిరి కూరగాయల పొలాల్లో, మామిడి, మునగ, కొబ్బరి మొదలగు తోట పంటల్లోని ఖాళీ జాగాల్లో, పాలీహౌస్లు, నెట్హౌస్లు, షేడ్నెట్ల క్రింద, చెట్ల కొమ్మలతో ఏర్పాటు చేసిన పందిర్ల క్రింద, కొత్తిమీర సాగు చేసి జూన్లో ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. జూన్లో కూడా చల్లగా ఉన్న ఎత్తైన ప్రాంతాల్లో, తక్కువ వర్షపాతం పడే ప్రాంతాల్లో (అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతంలో) కొత్తిమీరను అనుకూలంగా పండించి, ఇతర ప్రాంతాలకు పంపవచ్చు. ఈ నెలలో అత్యధిక వర్షపాతమున్న ప్రాంతాల్లో జూన్లో విత్తినపుడు కొత్తిమీర దెబ్బతినే అవకాశముంది.
ఫ్రెంచిచిక్కుడు: ఈ పంటకూడా కొత్తిమీర లాగానే, అధిక ఎండను, వేడిని తట్టుకోలేదు. కనుక పాక్షిక ఎండ/నీడ ఉన్న ప్రదేశాలలో ఈ పంటను పండించి, అధిక ధరను పొందే వీలుంది.
ఆకుకూరలు: వర్షాధారంగా వచ్చే ఆకుకూరలు జూలై 3వ వారం నుండి ఎక్కువగా ఉంటాయి. ఆలోపు చేతికొచ్చే ఆకుకూరలకు ఎక్కువ ధర పొందవచ్చు. వీటిని ఎండలకు కూడా పండించవచ్చు. తక్కువ పొలంలో, తక్కువ నీటితో మంచి లాభాలు పొందవచ్చు. పాలకూర, తోటకూర, చుక్కకూర, మెంతికూర, గోంగూర, పొన్నగంటి కూర, కొయ్యగూర, సోయకూర, గంగవాయిలాకు మొదలైనవి.
సిరిధాన్యాలతో పాలకూర, తోటకూర, పొన్నగంటికూర, కొయ్యగూర, గంగవాయిలాకు మొదలగు ఆకుకూరలను కలిపి వండుకోవచ్చు. తక్కువ క్యాలరీలు కలిగి, ఎక్కువ బల్క్ ఉన్న ఆహారం తయారవుతుంది. దీనిని తినే దాని వలన మధుమేహాన్ని సులభంగా కంట్రోల్లో ఉంచవచ్చు. ఆచరించిన అనుభవంతో తెలుపుతున్నాను. మధుమేహగ్రస్తులు అలవాటుపడితే ఆకుకూరలకు విపరీతమైన గిరాకీ ఏర్పడవచ్చు. ఖచ్చితంగా సుగర్ వ్యాధి అదుపులోకొస్తుంది. రైతులు పండించిన ఆకుకూరలకు మంచిధర రావడం జరుగుతుంది. అన్నికాలాల్లో దొరికే ఆకుకూరలు (ముఖ్యంగా చప్పగా ఉన్న ఆకుకూరలు) సిరిధాన్యాల బియ్యంతో కలిపి వండుకోవడం కూడా చాలా సులభం. మధుమేహాన్ని చాలావరకు ప్రపంచం నుండి తరిమికొట్టవచ్చు. మధుమేహపు మందులను మానేయవచ్చు. ఆచరించి చూడండి. వివరాలకు 94944 08619 కు ఫోన్ చేయవచ్చు.
సిరిధాన్యాలు: కొర్రలు, ఆరికలు, సామలు, ఊదలు, అండుకొర్రలు విత్తడానికి జూన్ నెల కూడా అనుకూలమే. వర్షాధారంగా, రసాయనిక ఎరువులు వాడకుండా పండించిన ఈ పంటలకు అత్యధిక ధర ఇచ్చి రైతుల వద్దకే వచ్చి కొనుక్కెళ్లే వాళ్లున్నారు. ఈ విధంగా పండిస్తున్నామని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకునే అవకాశం బాగుంది. వాట్సాప్ ఖర్చు లేకుండా అందుబాటులో ఉంది.
కూరగాయలు: పలు కూరగాయ పంటలను జూన్ మొదటి నుండి విత్తుకోవచ్చు. భూమిలో తడిలేకపోతే నీరు పెట్టాల్సుంటుంది. వర్షం పుష్కలంగా పడితే, తేమ అనుకూలంగా ఉన్నపుడు విత్తుకోవచ్చు. కూరగాయల ఎగుమతులను విపరీతంగా పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బెండ: జూన్లో విత్తవచ్చు. విత్తిన 45 రోజుల్లో తొలి కోత మొదలుపెట్టవచ్చు. సులభంగా పంట తీసుకోవచ్చు. సొంత విత్తులను నాటితే ఖర్చు తక్కువ. అత్యధిక దిగుబడులనిచ్చే రకాలు, హైబ్రిడ్లు మార్కెట్లో దండిగా దొరుకుతున్నాయి. ఎక్స్పోర్ట్కు అనుకూలాలు మెండు. ఎగుమతికనువైన రకాలు: వర్ష, విశాల్, నాథ్శోభ, పంజాబ్ పద్మిని.
వంగ: వర్షాకాలంలో నారు పోయడానికి జూన్-జూలై నెలలు అనుకూలం. 30-35 రోజుల నారు నాటవచ్చు. ఏ ప్రాంతానికి అనువైన రకాలను ఆ ప్రాంతంలో సాగు చేసి, మంచి ధర పొందవచ్చు. దేశవాళీ రకాలను, సొంత విత్తనాలను, ఆర్గానిక్ పద్ధతి ద్వారా పెంచి, సోషల్ మాధ్యమం ద్వారా ప్రచారం చేసుకుంటే ఎక్కువ ధరలకు అమ్ముకోవచ్చు. ఖర్చు తక్కువ. తప్పుడు ప్రచారం చేసుకుంటే అది బెడిసికొట్టి ఆ మనిషికి విలువ లేకుండా చేస్తుంది.అనుకూలమైన రకాలు: కోస్తాఆంధ్ర: పూసాపర్పుల్ క్లస్టర్, పూసాక్రాంతి, గులాబి; రాయలసీమ: రాయదుర్గం, పోలూరు వంగ, అర్కకుసుమాకర్; తెలంగాణ: శ్యామల, దేశవాళీ పచ్చ వంగ రకాలు, పూసా పర్పుల్ క్లస్టర్, పూసాక్రాంతి.
గోరుచిక్కుడు: వర్షాధారంగా పండించే మొండిజాతి పంట. నీటిఎద్దడిని, చీడపీడలను చాలావరకు తట్టుకుంటుంది. నీటి ఆధారంగా కూడా పండించి అధిక దిగుబడులు పొందవచ్చు. జూన్-జూలై నెలల్లో విత్తి అధిక దిగుబడి పొందవచ్చు. పశువుల దాణాగా, పచ్చిమేతగా, పచ్చిరొట్ట ఎరువుగా, దీని గింజలు గమ్ తయారీకి పనికొస్తాయి. లేత కాయలు, కూరగాయగా వాడుతారు. జూన్-జూలైలో విత్తవచ్చు. అనుకూలమైన రకాలు: పూసామౌసమి, పూసాసదాబహార్, పూసానవబహార్, గౌరి.
పూలు: బంతి: ఏడాది పొడవునా సాగు చేయవచ్చు. జూన్ రెండవ వారంలో నారు పోసుకుని, జూలై రెండవ వారంలో నాటడం అనుకూలం. మార్కెట్కు అక్టోబరులో తయారవుతుంది. పండుగకు అందివ్వాలంటే సుమారు 60 రోజులు ముందుగా నాటుకోవాలి.
గులాబి: జూన్ నుండి జనవరి వరకు నాటుకోవచ్చు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో నాటడం అత్యంత అనుకూలం. హైబ్రిడ్ టీస్: పింక్ పాంథర్, ఆదిత్య, రక్తిమ; ఫ్లోరిబండాస్: ఆకాష్దీప్, రెడ్ ట్రెంప్, ల్యూటిన్; మినియేచర్: బేబి చాక్లెట్, ప్రీతి.
మల్లె: వర్షాకాలం ప్రారంభంలో జూన్-జూలైలో వేర్లు వచ్చిన పిలక మొక్కలు నాటాలి. గుండుమల్లెను 5þ5, జాజిమల్లెను 7þ7, కాగడమల్లెను 6þ5 అడుగుల ఎడంలో నాటాలి.
కనకాంబరం: మే-జూన్ నెలల్లో నారుపెంచి, ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో ప్రధాన పొలంలో 60þ30 సెం.మీ. దూరంలో నాటాలి. సంవత్సరమంతా పూస్తుంది. చలికాలం, వేసవిలలో పూలదిగుబడి ఎక్కువ. వర్షాకాలంలో దిగుబడి తగ్గుతుంది.
వరి: భారతావనిలో వరి పంట దిగుబడి అవసరాల కంటే ఎక్కువైనందున ఈ పంటకు ప్రభుత్వాల ప్రోత్సాహం తగ్గుతున్నది. వరి తప్ప ఇతర పంటలు వేయలేని ఊటభూములు, కాలువల క్రింద, లోతట్టు ప్రాంతాల్లో మాత్రమే పండించడం మంచిది. ఇంటి వాడకానికి, ఆర్గానిక్ పద్ధతిలో పంట పెట్టుకోవచ్చు. అధిక దిగుబడులకు జూన్లో ఎంత ముందుగా వీలయితే అంతముందుగా విత్తడం పూర్తి చేయండి. నాటు పెట్టడం కూడా నీటి లభ్యత ఉంటే, ఎంత లేత నారు నాటితే అంత దిగుబడులు పెరుగుతాయి. నీటి లభ్యత సరిగా లేనిచోట, నీటి లబ్యత మెరుగైన తర్వాతనే నారు పోయుట, నాటుట చేపట్టాల్సుంటుంది. ప్రభుత్వ ప్రొక్యూర్మెంటుపై ఆధారపడకుండా, స్వంతంగా మార్కెట్ చేసుకున్నా, గిరాకీ ఉన్న రకాలనే ఎంపిక చేసుకొని సాగు చేయడం బాధలను తగ్గిస్తుంది.
ప్రత్తి: చైనా నుండి దిగుమతులను కట్టడి చేయడం వలన, గులాబి రంగు పురుగు ఉధృతి ఎక్కువైనందున, దిగుబడి తగ్గినందున మార్కెట్లో ప్రత్తికి మంచి డిమాండ్ ఉంది. క్వింటాలు ప్రత్తి రూ. 10-12 వేలు పలుకుతున్నది. మంచి ప్రోత్సాహమున్నందున ఈ పంటను రైతులు పెట్టడానికి ఉత్సాహం చూపుతున్నారు. పూర్తిగా నమ్మకమైన డీలర్ల దగ్గర నమ్మకంగా క్రితం సంవత్సరంలో బాగా పండిన, గిరాకీ ఉన్న రకాలనే పండించండి. కొత్త రకాలు వేయాలనుకునేవాళ్లు, కొద్ది విస్తీర్ణంలో పరీక్షించి బాగా పండితే తదుపరి సంవత్సరం, అదే రకాన్ని ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టవచ్చు. అధిక సాంద్రత విధానంలో ప్రత్తిని పండించి, అధిక దిగుబడి పొందవచ్చు. ఈ విధానంలో ప్రత్తి పంట త్వరగా పూర్తవుతుంది. ప్రత్తి తర్వాత శనగ, పెసర, మినుము, నువ్వులు, వేరుశనగ పంటలను పెట్టుకోవచ్చు. అధిక సాంద్రత విధానాన్ని వర్షాధారంగాను, నీటితడులిచ్చి కూడా చేపట్టవచ్చు.
వేరుశనగ: జూన్ రెండవ పక్షం నుండి జూలై మొదటి వారంలోపు విత్తి అత్యధిక దిగుబడులు పొందవచ్చు. వేరుశనగ గింజలు పెద్దగా ఉండడం వలన, మొలకెత్తడానికి భూమిలో తగినంత తేమ అవసరం. జూలై మొదటి వారం తర్వాత ఎంత నిదానించి విత్తితే అంత దిగుబడి తగ్గుతుంది. కదిరి లేపాక్షి (కె-1812) బాగా దిగుబడినిస్తున్నప్పటికి కన్ఫెక్షనరీ (గింజలతో తయారైన పదార్థాలు) తయారీదారులు, దీని వాడకానికి ఇష్టపడుట లేదు. ఇందులో వగరు ఉండుట కారణమంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వారు రూపొందించిన టి.సి.జి.ఎస్-1694 గట్టి, కమ్మటి, లావుగింజలు, సమానమైన సైజుగల గింజలు కలిగి, అత్యధిక దిగుబడులను సైతం ఇస్తున్నది. దీనిని ప్రాచుర్యంలోకి తేవ డానికి, విరివిగా విత్తనోత్పత్తి చేపట్టవచ్చు.
ప్రతి పల్లె / జనావాసంలో రైతు ప్రజాసంఘాలు-రైతుల సత్వర ప్రగతికి సోపానాలు. పల్లెలోని ప్రజలంతా పెట్టుబడి పెడితే, ఆ పెట్టుబడి ముఖ్యంగా డబ్బులతో ఎక్కువ ఇబ్బందిపడే రైతులకు తక్కువ వడ్డీకే అప్పుగా దొరికితే, రైతుల అభివృద్ధి త్వరగా జరుగుతుంది. అందుకే ప్రతి పల్లె / జనావాసంలో రైతు ప్రజా సంఘాలు ఏర్పాటు చేయడానికి తెలంగాణా ప్రభుత్వానికి ప్రపోజల్ పంపండం జరిగింది. వీటి వలన రైతులు, ప్రజలు అందరు అన్ని విధాలా అభివృద్ధి (ఆల్ రౌండ్ డెవలప్మెంట్) సాధించడానికి వీలవుతుంది. ఏం చేస్తే పల్లె ప్రజలు బాగా అభివృద్ధి సాధిస్తారో ఈ సంఘాల నాయకులు తీర్మానాల రూపంలో తెలుపుతారు. వారికి నచ్చిన విధంగా, వారి అభివృద్ధి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి, ప్రభుత్వం నుండి, వివిధ పార్టీల నుండి ప్రోత్సాహం లభిస్తే ప్రజలందరి సమగ్ర అభివృద్ధి సత్వరంగా జరగడానికి వీలవుతుంది. ఎఫ్.పి.ఓ.ల ఫెయిల్యూర్లను నివారించడానికి కూడా ఈ సంఘాలు బాగా పని చేస్తున్నాయి.
పలు పంటలపైన, ప్రజలందరి సత్వర, సమగ్ర అభివృద్ధిపైన వివరంగా తెలుసుకోగోరువారు 9494408619 కు ఫోను చేయవచ్చు. ఫేస్బుక్లో SALLA NARAYANASWAMY/Profsnswamy అకౌంట్లలో ఫొటోలతో కూడిన వివరణలను చూడవచ్చు. రైతులకు సలహాలు, సూచనలు ఉచితం.
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన కుందేళ్ళ పెంపకం, ఇప్పుడిప్పుడే మన రాష్ట్రంలో అడుగిడుతుంది. ప్రారంభ థలో కుందేళ్ళ పెంపకం అలంకార ప్రాయంగా కొందరు పెంచుకోగా, ఇప్పుడు పెరుగుతున్న ఆర్థిక స్థాయి అనుసరించి ప్రజలు విలువ కలిగిన ఆహార ఉత్పత్తులవైపు ఖర్చు చేయుటకు మొగ్గు చూపుతున్నారు. అధిక పోషక విలువలు కలిగిన మాంసాన్ని అందించే కుందేళ్ల పెంపకంకు రాబోయే రోజుల్లో మరింత డిమాండ్ పెరిగే అవకాశముంది. మాంసం కొరకే కాకుండా ఉన్ని కొరకు చాలామంది పెంచుటచే ఈ పరిశ్రమ లాభసాటి పరిశ్రమ అయి వాటి నుండి తయారైన వస్తువులను ఎగుమతి చేసి తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా రూపొందుతుంది. మన రాష్ట్రంలో కుందేళ్ళ మాంసానికి మంచి గిరాకి ఉన్నది. కాబట్టి తక్కువ ఖర్చులో కుందేళ్ళ పెంపకాన్ని చేపట్టి మంచి యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే అధిక లాభాలను పొందవచ్చు. కుందేళ్ల పెంపకాన్ని చేపట్టేవారు ముందుగా ఏ ప్రాంతములో మాంసానికి గిరాకి ఎక్కువ ఉందో తెలుసుకుని ఆ ఆప్రాంతంలో కుందేళ్ళ పెంపకాన్ని చేపట్టడం మంచిది.
కుందేళ్ళ పెంపకంతో లాభాలు
దీ కుందేళ్ల పెంపకాన్ని తక్కువ పెట్టుబడితో చేపట్టవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని సన్న, చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులు, ఆసక్తిగలవారెవరైనా కూడా కుందేళ్లు పెంపకాన్ని చేపట్టవచ్చు.
దీ కుందేళ్ళ పెంపకానికి అవసరమైన స్థలం చాలా తక్కువ.
దీ ఇవి ప్రకృతికి ఎటువంటి నష్టాన్ని కలిగించవు.
దీ ఈ కుందేళ్లు సాధు స్వభావం కలిగినవి. ఇంటిలోని మనుషులు సులభంగా కుందేళ్ల పెంపకంలో పాల్గొనవచ్చు. కాబట్టి అదనపు కూలీ ఖర్చులు అవసరం ఉండదు.
దీ కుందేళ్లు వంట ఇంట్లో మిగిలిన కూరగాయలు మొదలైన వాటిపై ఆధారపడి జీవిస్తాయి. కావున వాటి ఆహారానికి అయ్యే ఖర్చు కూడా తక్కువే.
దీ ఇతర జంతువులు వినియోగించుకోలేని ఆకులను ఇవి సమర్ధవంతంగా వినియోగించుకోగలవు. కావున ఇది రైతులకు వరం లాంటిది.
దీ కుందేళ్లలో వ్యాధులకు గురికావడం తక్కువగా ఉండడం చేత మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది.
దీ కుందేళ్లకు వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చే అవసరం కూడా ఉండదు.
దీ కుందేళ్లు తీసుకునే ఆహారంలో ఎక్కువ భాగాన్ని మాంసంగా మార్చుకోగలవు. కోళ్ల తర్వాత కుందేళ్లకు ఈ సామర్ధ్యం ఎక్కువగా ఉంటుంది.
దీ కుందేళ్ల మాంసంలో 22 శాతం వరకు మాంసకృత్తులు ఉండడం మరియు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం వలన గుండెకు సంబంధించిన వ్యాధులు కలిగిన వారు ఈ మాంసాన్ని స్వీకరించవచ్చు.
దీ ఒక కిలో ఉన్ని ఉత్పత్తికి అంగోరా జాతి కుందేళ్లు తీసుకునే ఆహారం గొర్రెల కంటే చాలా తక్కువగా ఉంటుంది.
దీ కుందేళ్లు తెల్లని మాంసాన్ని ఉత్పత్తి చేస్తాయి. అంతేకాకుండా కుందేలు మాంసంలో సోడియం, పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది.
దీ కుందేళ్ల పేడలో అధిక పాళ్లలో నత్రజని, భాస్వరం ఉండటం వల్ల పెరటి తోటల్లో పూలు, పండ్లు, కూరగాయలను పెంచడానికి సేంద్రియ ఎరువుగా వాడవచ్చును.
దీ కోళ్ళ పరిశ్రమలో దాణా ఖర్చు ఎక్కువగా అవుట చేత, అది అంత లాభసాటిగా లేదు. కాని కుందేళ్లు ఎక్కువగా గడ్డిపైన ఆధారపడి యుండుట చేత దీనిపై ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఈ విషయమును రైతు సోదరులు గమనించగలరు.
దీ మన రాష్ట్రంలోని రాజేంద్రనగర్ మరియు కోరుట్ల వెటర్నరి కళాశాల యందు కుందేళ్లను చాలా రోజుల నుండి పెంచుతున్నారు. కావున ఈ కేంద్రముల నుండి ఆసక్తి గల రైతులు కుందేళ్లను పొందవచ్చును.
మన దేశంలో కుందేళ్ల జాతులు
దీ మన దేశంలో కుందేళ్లను రెండు రకాలుగా పెంచుతారు.
1) ఉన్ని కోసం పెంచే వాటిని అంగోరా కుందేళ్లు అంటారు.
2) మాంసం కోసం పెంచే వాటిని బ్రాయిలర్ కుందేళ్లు అంటారు.
దీ మన దేశంలో హిల్ మరియు చలి ప్రాంతాలు అయిన జమ్ము కాశ్మీర్ మరియు సిక్కిం తదితర ప్రాంతంలో అంగొరా కుందేళ్లను పెంచుతున్నారు.
దీ అంగోరా జాతి కుందేళ్లకు ఉదాహరణ బ్రిటీష్ అంగోరా, జెర్మన్ అంగోరా, రష్యన్ అంగోరా మొదలగునవి.
దీ ఈ కుందేళ్ల పెంపకం వల్ల మాంసంతో పాటు చర్మంతో గార్మెంట్స్, బొమ్మలు తదితర వస్తువులు తయారు కాగా ఉన్నితో బట్టలు, కార్పెట్లు మొదలగునవి తయారు చేస్తున్నారు.
దీ బ్రాయిలర్ కుందేళ్ల జాతులకు ఉదాహరణ న్యూజిలాండ్ వైట్, సోవియట్ చించిల్లా, ఫ్లెమిష్ జైంట్, గ్రేజైంట్ మరియు కాలిఫోర్నియన్ వైట్ జాతికి చెందిన కుందేళ్లు మన వాతావరణంలో పెంచుకోవడానికి అనువైనవి.
గృహ వసతి
దీ కుందేళ్ల షెడ్ ప్రశాంతమైన, పరిశుభ్రమైన ప్రదేశంలో కట్టవలెను.
దీ షెడ్ను ఎత్తైన ప్రదేశంలో గాలి ధారాళముగా వచ్చు చోట, నీరు ఇంకని చోట కట్టవలెను.
దీ షెడ్ను తూర్పు, పడమర దిశలో కట్టవలెను.
దీ షెడ్ పరిసరాలలో శబ్దకాలుష్యం లేకుండా చూడాలి. శబ్దం ఎక్కువగా ఉన్నట్లయితే కుందేళ్లు భయపడటమే కాకుండా ఒత్తిడికి గురి అవుతూ ఉత్పాదక సామర్ధ్యం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి షెడ్ను నిర్మించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
దీ షెడ్ను ప్రతిరోజు శుభ్రంగా కడగాలి. మలమూత్రాలను తీసివేయాలి. మరియు తేమ బూజులు లేకుండా జాగ్రత్త వహించాలి.
కుందేళ్లను రెండు పద్ధతులలో పెంచుతారు.
1) డీప్ లిట్టర్ పద్ధతి; 2) కేజ్ పద్ధతి
డీప్ లిట్టర్ పద్ధతి:
దీ ఈ పద్ధతిలో కుందేళ్లను లిట్టరుపై పెంచుతారు.
దీ ఈ పద్ధతిలో కుందేళ్లు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి.
దీ ఈ పద్ధతిలో యుక్త వయసు వచ్చిన తరువాత ఒకదానితో మరొకటి పొట్లాడుకుంటాయి. మరియు పరాన్నజీవుల బారినపడే అవకాశం ఉన్నందున ఈ పద్ధతి అంత మంచిది కాదు.
కేజ్ పద్ధతి:
దీ ప్రతి ఆడ కుందేలుకు 2.5 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు మరియు 1.5 అడుగుల ఎత్తు గల కేజ్లు అవసరం.
దీ ప్రతి మగ కుందేలుకు 1.5 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు మరియు 1.5 అడుగుల ఎత్తు గల కేజ్లు అవసరం.
దీ ఈ కేజ్లను కాలిఫోర్నియన్ టైప్గా అమర్చినట్లయితే తక్కువ స్థలంలో ఎక్కువ కుందేళ్లను పెంచవచ్చు. ఈ పద్ధతి కుందేళ్ళ పెంపకానికి ఎంతో అనువైనది.
దీ కేజ్లను భూమి నుండి 2 అడుగుల ఎత్తులో ఉండునట్లు చూడవలెను.
దీ కుందేళ్ల కేజ్లలో అమర్చిన నీటి మరియు దాణా తొట్లను ప్రతి రోజు శుభ్రం చేయాలి.
దీ కుందేళ్ల కేజ్లను స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయవలెను. దీనికి బదులు కొందరు కర్రలతో కేజ్లను తయారు చేసెదరు. కానీ అట్టి వాటిని పరిశుభ్రం చేయుట కష్టం. ఎప్పుడైనా జబ్బు వచ్చినప్పుడు కేజ్లను బ్లో లాంపుతో కాల్చవలెను. కర్రలతో చేసిన ఎడల వాటిని కాల్చడం వీలుకాదు.
దీ అడుగు భాగమున 1/2” þ 1/2” సైజు వెల్డుమెష్ను తప్పనిసరిగా వాడవలెను. లేనిచో పుట్టిన పిల్లల సందుల నుండి జారి క్రింద పడిపోవుటకు ఆస్కారము ఉన్నది.
దీ ఒక్కొక్క కేజిలో ఒక ఎదిగిన ఆడ కుందేలు లేదా ఒక ఎదిగిన మగ కుందేలు పెంచవచ్చు. ఒకే కేజ్లో 3-4 పెరిగే పిల్లలు 4 మాసములు వయస్సు వరకు పెంచవచ్చు. 4 మాసముల తరువాత వీటిని విడిగా ఒక్కొక్క కేజ్లో వేయాలి.
దీ ఒక్కొక్కప్పుడు మగ కుందేళ్లు 3 మాసములు తరువాత పొట్లాడుకొనును. అట్టి పరిస్థితిలో వాటిని వేరు చేయాలి.
కుందేళ్ల పిల్లల యాజమాన్యం
దీ బన్నీల బరువు పుట్టినపుడు 40-50 గ్రా. మరియు పాలు మరచే సమయానికి సుమారు 300 నుండి 350 గ్రా. ఉంటాయి.
దీ ఆడ కుందేలు రోజుకు ఒకసారి నెస్ట్ బాక్స్లోకి వెళ్లి పిల్లలకు పాలనిస్తుంది.
దీ పిల్లలు త్రాగిన ప్రతి 2 గ్రా. పాలకు 1 గ్రా. బరువు పెరుగుతాయి.
దీ కుందేళ్ల పిల్లలు కళ్లు తెరవడానికి 14 రోజుల సమయం పడుతుంది.
దీ ప్రతి రోజు తల్లి కుందేలు పిల్లలకు పాలు ఇస్తుందో లేదో గమనించాలి.
కుందేళ్ల పోషణ
దీ సాధారణంగా పుట్టినప్పటి నుండి 12 రోజుల తరువాత పిల్లలు ఆహారం తినడం మొదలు పెడతాయి.
దీ కుందేళ్లకు ఇచ్చే ఆహారంలో ఎక్కువ మోతాదులో పీచు పదార్థం ఉండేటట్లు చూడాలి. ఆహారంలో పీచు పదార్థం శాతం తగ్గినట్లయితే జీర్ణవ్యవస్థ పాడవుతుంది. కొన్నిసార్లు కుందేళ్ళు పారుకోవడం జరుగుతుంది. కాబట్టి కుందేళ్ళకు ఇచ్చే ఆహారంలో 14% పీచు పదార్థాలు ఉండేలా చూడాలి.
దీ కుందేళ్లను ‘హెర్బిదొరస్’ (శాకాహారిగా) పరిగణించాలి. పశువుల్లో లాగా నెమరు వేసే జంతువులా కాకుండా కుందేలు ఒకే పొట్టతో ఉంటుంది.
దీ కుందేళ్లకు ఇచ్చే దాణాలో పలు పోషక పదార్థాలుండాలి. మాంసకృత్తులు 15-17 శాతం ఉండునట్లు చూసుకోవాలి. పిండిపదార్థాలు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు సమపాళ్లలో ఉండాలి.
దీ కుందేళ్లకు ఇచ్చే దాణాలో ఏ విధమైన విష పదార్థాలు లేకుండా జాగ్రత్త పడాలి.
దీ సాధారణంగా తమ తమ ప్రాంతాల్లో లభ్యమయ్యే దాణా దినుసులను ధరలను బట్టి పాళ్లను నిర్ణయించుకొని దాణా తయారు చేసుకోవచ్చు.
దీ ఉదాహరణకు 100 కిలోల దాణా మిశ్రమమును ఈ విధముగా తయారు చేసుకోవచ్చు.
దాణా పదార్థాలు పరిమాణం (పాళ్లు)
మొక్కజొన్న గింజలు/జొన్నలు/నూకలు 50 కిలోలు
వేరుశనగ చెక్క / సోయాబీన్ చెక్క 22 కిలోలు
గోధుమ తవుడు / వరితవుడు 25 కిలోలు
ఖనిజ లవణ మిశ్రమం 2 కిలోలు
ఉప్పు 1 కిలో
మొత్తం 100 కిలోలు
దీ ప్రతి కుందేలుకు సుమారు 1 లీటరు త్రాగు నీటిని 200-300 గ్రా. దాణా, 200 గ్రా. పచ్చిమేత అవసరము.
దీ కుందేళ్ల పరిశ్రమ లాభదాయకంగా ఉండాలుంటే, అవి ఆరోగ్యంగా ఎదగాలి అంటే పుష్టికరమైన పచ్చి మేత పెట్టవలెను.
దీ రైతులు తమ భూములలో పచ్చి గడ్డిని పెంచి మేత పెట్టవలెను.
దీ రైతులు తమ భూములలో పచ్చి గడ్డిని పెంచి ఇచ్చినచో మేతపై అగు ఖర్చు తగ్గుతుంది.
దీ కుందేళ్లకు పప్పుజాతి పశుగ్రాసాలైన లూసర్న్, బర్సీమ్ తప్పకుండా ఇవ్వవలెను.
కుందేళ్లలో పునరుత్పత్తి
దీ సుమారు 6 నెలల వయస్సులో కుందేళ్ళు సంతానోత్పత్తికి అనువుగా ఉంటాయి.
దీ ఐదు నుండి ఆరు ఆడ కుందేళ్లను దాటించడానికి ఒక మగ కుందేలు సరిపోతుంది.
దీ జత కట్టించడానికి ముందు కుందేళ్లకు తగినంత ఆహారం అందేటట్లు చూడాలి.
దీ మగ కుందేలు కేజ్లో ఆడ కుందేలును ఉంచి జత కట్టించాలి.
దీ వారానికి 3-4 సార్లు మగ కుందేలుతో క్రాసింగ్ చేయించాలి.
దీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి విత్తనపు మగ కుందేలు మరియు ఆడ కుందేళ్లను వేరే ఫారాల నుండి తెచ్చినట్లయితే పుట్టే పిల్లలో మరణాల శాతాన్ని తగ్గించడమే కాకుండా ఎదుగుదల బాగా ఉంటుంది.
దీ వేసవిలో ఉష్ణోగ్రత 30 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దాటిస్తే మగ కుందేలు వీర్యోత్పత్తి తాత్కాలికంగా తగ్గిపోతుంది. కావున ఏప్రిల్ మరియు మే నెలలో జతకట్టించకూడదు.
దీ ఆడ కుందేలు నిర్దిష్టమైన ఎదలక్షణములు చూపదు, కానీ అది ఎదలో ఉన్నది లేనిది తెలుసుకొనుట కష్టము, జాగ్రత్తగా పరిశీలించినటచో ఆడ కుందేలు మానము ఎర్రగా తేమగా ఉండును.
దీ ఆడ కుందేలు ఎదలో ఉన్నచో వెంటనే మగ కుందేలును దాటుటకు అనువుగా కూర్చొనును. ఒకవేళ ఎదలో లేనిచో కేజ్లో పరుగెత్తుచుండును. లేదా తోక ముడుచుకొని ఒక మూలన కూర్చొనును.
దీ ఆడ కుందేలు జత కలిసిన రోజు నుండి 30-31 రోజుల్లో ఈనుతుంది.
దీ ఆడ కుందేలు ఈనిన రోజు కూడా దాటించుటకు సిద్ధమైయుండును. కానీ వెంటనే దాటించరాదు, ఎందుకనగా దాని గర్భం తిరిగి మామూలు స్థితికి వచ్చుటకు 15 రోజులు పట్టును. మరియు దాటించిన వెంటనే పాలు రాకుండటచేత పుట్టిన పిల్లలు పాలు దొరకక చనిపోవును. కావున ఆడ కుందేళ్లు ఈనిన నెల తర్వాత బన్నిలను వేరుచేసి మగకుందేళ్లతో జత కట్టించాలి.
దీ ఆడ కుందేళ్లు ఈనే 3 రోజుల ముందు చెక్కతో తయారు చేసిన నెస్ట్ బాక్సులను కేజ్లలో అమర్చాలి.
దీ చూడి నిర్ధారణ, ఆడ కుందేలును జత కట్టించిన 14 రోజుల తర్వాత చేయవచ్చు.
దీ ఆడ కుందేళ్లు ఈనడానికి ముందు తన చర్మంపై ఉన్న ఉన్నిని లాక్కొని నెస్ట్ బాక్స్ యందు ఉంచును.
దీ ఆడ కుందేలు ఎక్కువగా రాత్రులు లేక తెల్లవారుఝామున ఈనుతాయి.
దీ ఆడ కుందేలు ఈనుటకు ముందు దాణా, మేత తక్కువగా తినును.
దీ ఆడ కుందేలుకు సరిపోను నీరు అందుబాటులో ఉండునట్లు చేసుకోవాలి.
దీ ఆడ కుందేలును కదిలించుట మరియు బెదరకొట్టుట మంచిది కాదు.
దీ ఒక్కొక్క ఈతలో 4 నుండి 10 బన్నిలను కంటాయి.
దీ మాయ ఒక రక్తపు ముద్దలా పడును, దానిని వెంటనే తీసివేయాలి. మరియు దానిని తినకుండా ఉండునట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
దీ ఈనిన తరువాత చనిపోయిన పిల్లలను తీసివేయవలెను.
దీ ఒక్కొక్కప్పుడు తల్లి పిల్లలను కేజ్లోనే ఈనుతాయి. అటువంటి పరిస్థితిలో వాటిని వెంటనే తీసి నెస్టు బాక్సులో పెట్టవలెను. ఈనునప్పుడు ఎక్కువమంది ఉన్న, కుక్కలు, పిల్లులు, ఎలుకలు ఉన్నచో అది భయపడి పిల్లలను త్రొక్కుట వలన పిల్లలు చనిపోవును. కావున అది ఈనునపుడు చాలా జాగ్రత్తగా ఉండవలెను.
మాంసోత్పత్తి
దీ ప్రతి కుందేలు 12 నుండి 16 వారాల వయసులో సుమారు 2 కిలోల బరువు తూగి, 1 కిలో మాంసాన్ని ఉత్పత్తి చేస్తుంది.
దీ కుందేలు మాంసం తెల్లగా, రుచిగా మరియు మృదువుగా ఉంటుంది.
దీ ఒక్కొక్క బన్ని 2 కిలోల బరువు పెరిగేవరకు, ప్రతి కిలో బరువు పెరుగుదలకు సుమారు 3కిలోల దాణా అవసరం ఉంటుంది.
దీ తమ దేహ బరువులో సుమారు 55 శాతం వండుకోవడానికి వీలైన మాంసాన్ని ఉత్పత్తి చేస్తాయి.
డా. సి.హెచ్. శివప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ హెడ్, పశుగణ క్షేత్ర సముదాయము, పశువైద్య కళాశాల, కోరుట్ల
ప్రణాళికతో ముందుకు సాగితే ఏ రంగంలో అయినా మంచి ఫలితాలు రాబట్టవచ్చు. మట్టి, నీరు, శ్రమతో సాగే వ్యవసాయంలోను ఎక్కువ రాబడి సాధించాలంటే సమగ్ర ప్రణాళిక, ఆచరణ కీలకం. ఈ సూత్రాల ఆధారంగానే.. పంటల సాగులో వైవిధ్యాన్ని, క్రమ పద్ధతిని పాటిస్తూ ఆదాయ సిరులు అందుకుంటున్నారు… రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం, లాలపేట్ గ్రామానికి చెందిన నేమూరి విష్ణువర్దన్ రెడ్డి. పాత్రికేయుడిగా సమాజాన్ని చైతన్యం పరుస్తూనే సహజ సేద్యం చేస్తూ తోటి కర్షకులకి ఆదర్శంగా నిలుస్తున్నారు. 18 ఎకరాల వ్యవసాయంలో ఇప్పటి వరకు అనేక రకాల పంటలు పండించారు. దేశీయ వరి సాగులో అధిగ దిగుబడులు సాధించారు. కొర్రలు, అండు కొర్రలు, పచ్చ జొన్నలు వంటి చిరుధాన్యాలను వైవిధ్యంగా సాగుచేశారు. కూరగాయలు పండించారు. ఇలా ప్రకృతి సేద్య విధానాలు, భిన్న పంటలు, స్వీయ మార్కెటింగ్ తో సేద్యంలోనే ఏటా రూ. 10 లక్షల ఆదాయం ఆర్జించవచ్చని నిరూపించారు. బహుళ పంటలపై ఆసక్తితో ఇదే వ్యవసాయ క్షేత్రంలో 5 లేయర్ సాగు విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారీ.. కలం పట్టిన హలం శ్రామికుడు.
విష్ణువర్దన్రెడ్డిది వ్యవసాయ కుటుంబం. పదో తరగతి పూర్తయ్యాక వ్యవసాయంలో తండ్రికి తోడయ్యారు. సేద్యపు పనులు చేస్తూనే షాద్ నగర్ లో ఇంటర్మీడియెట్ చదివారు. దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. వ్యవసాయాన్ని కొనసాగిస్తూనే.. పాత్రికేయంపై ఇష్టంతో కలం పట్టారు. ప్రింట్ మీడియా జర్నలిస్టుగా అక్షర సేద్యం మొదలుపెట్టారు. ఇలా ఏకకాలంలో అటు రైతుగా, ఇటు పాత్రికేయుడిగా రాణించారు. వ్యవసాయం, లాభసాటి విధానాలు, పంటల యాజమాన్యంలో మేలైన పద్ధతులపై అనేక ఆర్టికల్స్ రాశారు. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటున్న సమయంలో విష్ణు వర్దన్ తండ్రి క్యాన్సర్ బారిన పడి కన్నుమూశారు. పాత్రికేయుడిగా ఆహారం – ఆరోగ్యంపై ఉన్న అవగాహనతో తన తండ్రి అనారోగ్యానికి రసాయన వ్యవసాయమే కారణమని తెలుసుకున్నారు. తన తండ్రిని తమ నుంచి దూరం చేసిన క్యాన్సర్ భూతం.. మరొక కుటుంబంలో విషాదం నింపకుండా అడ్డుకోవాలని సంకల్పించారు. ఇందుకు ప్రకృతి వ్యవసాయమే ఉత్తమ విధానమని తెలుసుకుని.. శ్రీ సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ శిక్షణ కార్యక్రమాలకు హాజరయ్యారు. అలా తెలుసుకున్న విషయాలతో సహజ సేద్యం ప్రారంభించారు. 2017లో ముచ్చింతల్ లో జరిగిన పాలేకర్ 9 రోజుల శిక్షణా తరగతులకు హాజరై.. ప్రకృతి వ్యవసాయంలో సమగ్ర విషయాలను అవగతం చేసుకున్నారు. రెండు దేశీయ జాతి ఆవులను పోషిస్తూ 18 ఎకరాల్లో అన్ని పంటలను రసాయన రహితంగా, పూర్తి సహజంగా పండించడం మొదలు పెట్టారు. ఇందులో 9 ఎకరాల్లో ఏడాదికి 3 పంటలు తీసే సాగు విధానాలను పాటిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. కేవలం ఒక పంటకు కట్టుబడి ఉంటే , మార్కెట్ ఒడిదుడుకులు.. ప్రకృతి ప్రతికూలతలను తట్టుకోవడం రైతుకి కష్టంగా మారుతుంది అంటారు.. రైతు విష్ణు వర్దన్ రెడ్డి. ప్రధాన పంటకు తోడుగా అంతర పంటలు సాగు చేస్తే .. ఒకదాంట్లో నష్టపోయినా, ఇంకొక్కటి గట్టెక్కిస్తుందని చెబుతారు. రైతు అంటే నష్టాలు, ఆత్మహత్యలు అనే మాటలు వినిపిస్తోన్న తరుణంలో వ్యవసాయ విధానంలో మార్పుతోనే ఆ పరిస్థితులను అధిగమించవచ్చని అంటున్నారు… ఈ ప్రకృతి రైతు.
పంటల సాగులో వైవిధ్యం ..
ముత్తాతలు, తాతలు వ్యవసాయం చేసే రోజుల్లో నేలలు సారవంతంగా ఉండేవి. వారు పాటించిన వ్యవసాయ పద్ధతులు అలాంటివి మరి. హరిత విప్లవం తర్వాత వచ్చిన మార్పులతో రసాయన ఎరువులు వినియోగం పెరిగింది. దిగుబడులపైనే దృష్టితో భూసారం తగ్గింది. అలాంటి నేలల్లో తిరిగి మళ్లీ పూర్వ వ్యవసాయ విధానాలు పాటించాలంటే.. ముందుగా నేలలో కర్బణ శాతం పెంచాలని నిర్ణయించుకున్నారు విష్ణు వర్దన్ రెడ్డి. పశువులు, గొర్రెలు – మేకల ఎరువు పోశారు. పచ్చిరొట్ట పైర్లు పెంచి కలియదున్నారు. సొంతంగా ఆవులు పెంచి వాటి ద్వారా వచ్చే మూత్రం, పేడతో జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసి నేలకు అందించారు. ఇలా నెమ్మదిగా భూసారం పెంచి.. తర్వాత పంటలపై దృష్టి సారించారు. ఉన్నది ఒకే బోరు. నిత్యం తోడేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయి మొదటికే మోసం వస్తుంది. అందుకే… కేవలం ఒక్క వరి పంటకే పరిమితం కాకుండా పంటల వైవిధ్యాన్ని పాటిస్తున్నారు. దేశవాలి వరి రకాలైన కృష్ణవ్రీహి, బ్లాక్ రైస్ సాగు చేస్తున్నారు. తెలంగాణ సోనా కూడా పండిస్తున్నారు. వీటితో పాటే అతి తక్కువ నీరు అవసరమైన చిరుధాన్య పంటలు కొర్రలు, అండు కొర్రలు, పచ్చ జొన్నలు… అంతర పంటలుగా కందులు, పప్పు శనగలు సాగు చేస్తున్నారు.
”చిరుధాన్యాలు 6 ఎకరాల్లో సాగు చేస్తాను. కొర్రలు రెండు రకాలు పండిస్తాను. ఎకరాకు మూడున్నర కిలోల విత్తనాలు అవసరమవుతాయి. వెదజల్లే పద్ధతిలో కలుపు తీయడం సమస్యగా ఉంటుందని, సాళ్ల పద్ధతిలో హై డెన్సిటీ విధానంలో విత్తుతాము. సాలుకి సాలుకి మధ్య ఫీటు దూరం పాటిస్తాము. తద్వారా అంతర కృషి చేసుకోవడానికి వీలవుతుంది. కొర్రలు, అండు కొర్రల్లో.. ఆరు సాళ్ల మధ్య ఒక సాలు కంది సాగు చేస్తాను. ఇది ఆరు నెలల పంట. చిరుధాన్య పంటలు 3 నెలల్లో కోతకు వస్తాయి. ఆ తర్వాత వాటి స్థానంలో పప్పు శనగ సాగు చేస్తాను. ఇది స్వల్పికాలిక పంటే కాబట్టి, కంది.. శనగ రెండు ఒకేసారి చేతికొస్తాయి. ఆ తర్వాత వేసవిలో కూరగాయలు పండిస్తుంటాను. ఇలా ఏడాదికి 3 పంటల సాగులో సాగుతుంటాను. కొర్రలు, అండు కొర్రల పంటలకు పిచ్చుకలు ఎక్కువగా వస్తాయి. డాక్టర్ ఖాదర్ వలి చెప్పినట్లుగానే మేము ఆ పిచ్చకులను తరమలేదు. అవి వచ్చి పంటపై ఏమైనా పురుగులు ఉంటే ముందు వాటిని తింటాయి. అలాగే పొలాల్లోనే రెట్ట వేస్తాయి. కంకుల మీద కొన్ని గింజలు తిన్నా.. పకక్షులు రావడం ద్వారా వచ్చే నష్టం కంటే కలిగే మేలే ఎక్కువ అని నేను ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నాను. ఎకరానికి గరిష్ఠంగా కొర్రలు 8 క్వింటాళ్లు, అండుకొర్రలు 12 క్వింటాళ్లు వచ్చాయి. పచ్చ జొన్న ఎకరానికి 10 క్వింటాళ్లు వచ్చాయి. జొన్నలను ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి… ఈ పంట కోయక ముందే ఊరి వాళ్లే కొనుగోలు చేస్తారు. కొర్రలు, అండు కొర్రలు మార్కెట్లో మంచి ధరకే అమ్మాను. ఇక 3 ఎకరాల్లో దేశవాలి వరి పండించి, మార్కెట్లో మంచి ధరకే విక్రయిస్తుంటాను. ఉన్న కొద్ది పాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటు.. ఏడాదికి 3 పంటలు పండిస్తు వ్యవసాయంలో మంచి లాభాలు పొందుతున్నానని” సగర్వంగా చెబుతున్నారు ప్రాకృతిక వ్యవసాయ రైతు విష్ణువర్ధన్రెడ్డి.
కాలానికి అనుగుణంగా మార్పు అవసరం. వ్యవసాయానికి ఇదే సూత్రం వర్తిస్తుంది. ఒకప్పుడు ఒక మోడల్ మంచి ఆదాయం ఇచ్చింది కదా అని ఎప్పుడూ విధానాన్ని పాటించలేం. పద్ధతుల్లో కొద్దిగా మార్పులు చేసుకుని, అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకుంటే లాభాలు ఢోకా ఉండదంటారీ ప్రకృతి రైతు. ఇన్నాళ్లూ చిరుధాన్యాలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, వరి, ఉల్లిగడ్డ ఎక్కువగా సాగు చేసిన ఈ రైతు.. ఇప్పుడు సుభాష్ పాలేకర్ 5 లేయర్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 10 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో ఎన్నో విజయాలను అందుకుని తోటి రైతులకి స్ఫూర్తిగా నిలిచిన విష్ణవర్ధన్ 5 లేయర్ సాగులోను అద్భుత ఫలితాలు సాధిస్తారని రైతునేస్తం ఆశిస్తోంది. మరిన్ని వివరాలకు విష్ణువర్థన్రెడ్డిని ఫోన్ 95025 53483 ద్వారా సంప్రదించగలరు.
ఏడాదికి రూ. 10 లక్షల నికర ఆదాయం : విష్ణు వర్దన్ రెడ్డి
రసాయన ఎరువులు, పురుగు మందులతో వ్యవసాయం చేసిన రోజుల్లో ఎంత పంట పండినా లాభం మిగిలేది కాదు. పెట్టుబడి అలా ఉండేది. ప్రకృతి వ్యవసాయంలోకి దిగాక, నావరకు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెట్టుబడి ఎకరానికి రూ. 20 వేలు మించడం లేదు. నేను పండించిన వరి, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలకు మార్కెట్లో మంచి రేటు వస్తోంది. పంటల సాగులో వైవిధ్యం పాటించడం ద్వారా ఏడాదికి ఖర్చులన్నీ పోను రూ. 10 లక్షల వరకు నికర ఆదాయం అందుకోగలిగాను. వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతోనే నా ఇద్దరు కొడుకులని అమెరికాలో చదివించగలిగాను. ఇప్పుడు వారిద్దరూ ఉన్నత చదువులు పూర్తి చేసి అమెరికాలోనే స్థిరపడ్డారు. ఒక రైతుగా ఇంతకంటే ఆనందం ఏముంటుంది. ఈ పదేళ్ల ప్రకృతి వ్యవసాయంలో అనేక పంటలు పండించాను. వరి, ఉల్లిగడ్డ, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు సాగు చేశాను. పంటల ఎంపికలో నిత్యం మార్పులు చేస్తూనే ఉంటాను. రైతులు ఎప్పుడు ఒకే పంట వేయకూడదు. ప్రధాన పంటకు తోడుగా అంతర పంటలు సాగు చేయాలి. ఉన్న వ్యవసాయ భూమి ద్వారా ప్రతి నెలా ఆదాయం వచ్చేలా ప్రణాళికబద్దంగా ముందుకు సాగాలి. ఆవులు పెంచాలి. గో మూత్రం, పేడ వ్యవసాయంలో ఉపయోగించాలి. ముఖ్యంగా రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగానికి స్వస్తిపలకాలి. సొంతంగా కషాయాలు, మిశ్రమాలు తయారు చేసుకోవాలి. చీడ పీడల నివారణకు ప్రకృతిలోనే అనే పరిష్కారాలు ఉన్నాయి. వాటిపై అవగాహన పెంచుకొని, క్రమంగా పాటస్తే వ్యవసాయంలో పెట్టుబడి గణనీయంగా తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. మన పంటలు తిన్న ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. వెరసి, రైతుగా మనకు ఆదాయం, ప్రజలకు ఆరోగ్యాన్ని పంచామన్న ఆత్మ సంతృప్తి దక్కుతాయి.
ప్రస్తుతం లేయర్, బ్రాయిలర్, దేశవాళి కోళ్ళ ఫారాలలో తరచూ కనబడుతున్న రాణికేట్ వ్యాధిని వ్యవహారిక భాషలో కొక్కెర వ్యాధిగా పిలుస్తారు. కొక్కెర వ్యాధి పారమిక్సో తరగతి వైరస్ వలన సంక్రమిస్తుంది. అన్ని వయస్సుల కోళ్లకు, అన్ని రకాల కోళ్లలో (అనగా లేయర్స్, బ్రాయిలర్స్, దేశీ కోళ్లలో) ఈ వ్యాధి వలన అధికంగా మరణాలు సంభవించడమే కాకుండా గుడ్ల ఉత్పత్తి, మాంస ఉత్పత్తులు తగ్గి కోళ్ళ రైతులకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి. అందువల్ల ఈ కొక్కెర వ్యాధిని తీవ్రస్థాయి వ్యాధిగా గుర్తించడం జరిగింది.
వ్యాధి వ్యాప్తి
1. ఈ వ్యాధి గాలి ద్వారా ఒక కోడి నుండి మరొక కోడికి సంక్రమిస్తుంది. వ్యాధిగ్రస్తమైన కోళ్ల ఫారాల నుండి మరొక కోళ్ల ఫారంకు గాలి ద్వారా వ్యాప్తి చెంది, కోళ్ల ముక్కు రంధ్రాల ద్వారా కాని, నోటి ద్వారా కాని కంటి ద్వారా కానీ శరీరంలోకి ప్రవేశిస్తాయి.
2. క్రితం బ్యాచ్లలో వ్యాధి సోకినట్లయితే వ్యాధి సంక్రమించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
3. వ్యాధిగ్రస్తమైన ఫారాల నుండి వచ్చే మనుషులు, వాహనాలు, గుడ్ల పెట్టెలు, గోనె సంచుల వల్ల కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
4. వ్యాధిగ్రస్తమైన కోళ్ళ ఫారాల నుండి తొలగించిన కోడి ఎరువు నుండి కూడా వేరొక ఫారం కోళ్లకు సోకుతుంది.
5. దాణా మరియు త్రాగు నీరు కోడి ఎరువుతో కలుషితం అవడం వల్ల కూడా సంక్రమిస్తుంది.
6. ఫారం పరిసరాలలో దేశీ కోళ్ళు పెంచడం వల్ల, కొంగలు, కాకుల వంటి పకక్షులు ఫారం పరిసరాలలో తిరగడం వల్ల సంక్రమిస్తుంది.
7. ఈ వ్యాధితో మరణించిన కోళ్లను సరిగ్గా నిర్మూలించకపోవడం వల్ల మరొక ఫారంకు సంక్రమిస్తుంది.
వ్యాధి లక్షణాలు
1. వ్యాధిగ్రస్తమైన కోళ్లు నీరసిస్తాయి, దాణా వినియోగం తగ్గుతుంది. నరాల బలహీనతను, ఆకుపచ్చని రెట్టను ప్రధాన లక్షణాలుగా చెప్పవచ్చు.
2. కాళ్ల మరియు రెప్పల పక్షవాతం లేదా మెడ ఒకవైపుకు తిరిగినట్టు ఉండే లక్షణాలను ఈ వ్యాధిలో చూడవచ్చు.
3. బ్రాయిలర్ కోళ్లు నీరసించి బరువు తగ్గుతాయి.
4. లేయర్ కోళ్లలో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గి, తోలు గుడ్లు మరియు పలుచని పెంకు గల గుడ్లను ఎక్కువగా పెడతాయి.
5. తీవ్ర స్థాయి గురక లాంటి శబ్దాలు కూడా ప్రారంభమవుతాయి.
6. వ్యాధి సోకిన కోళ్లలో వాటి మొఖము ఉబ్బి ముక్కు రంధ్రాల గుండా నీరు వలే కారడం మనము గమనించవచ్చు.
7. వ్యాధి తీవ్రతరం అయితే కోళ్లలో మరణాల రేటు అధికంగా ఉంటుంది.
8. చనిపోయిన కోళ్లను కోసి పరిశీలించినట్లయితే ప్రోవెంట్రిక్యులస్ నుంచి రక్తపు మరకలను చూడవచ్చు. పేగులో పుళ్ళు ఏర్పడతాయి. గుడ్ల తిత్తులలో కూడా రక్తపు మరకలు/చారికలు చూడవచ్చు.
చికిత్స
1. ఈ వ్యాధి వైరల్ వ్యాధి కావడం వల్ల చికిత్స లేనప్పటికీ వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే లసోటా వ్యాక్సిన్ను డ్రాప్గా కానీ నీటి ద్వారా కానీ, ఇంజక్షన్ రూపంలో కానీ ఇవ్వవలసి ఉంటుంది. దానితో పాటు ఎ, డి3, ఇ, కె విటమిన్లను ఇవ్వాలి.
2. వ్యాధి వ్యాప్తిని వ్యాధి తీవ్రతను తగ్గించడానికి పైరుసిడల్ ఏజెంట్లు అయిన బయోబస్టర్, బి-904 వంటి మందులను కోళ్ల మీద మరియు ఫారం చుట్టూ పరిసరాలలో పిచికారీ చేసి వైరస్ను నిర్మూలించవచ్చు.
నివారణ చర్యలు
1. ఫారంలో క్రితం బ్యాచ్లకు వ్యాధి సోకిన సందర్భాలలో ఖచ్చితమైన వ్యాక్సినేషన్ విధానాలను అవలంభించాలి.
2. వ్యాధి సోకిన కోళ్లను తీసివేసిన తరువాత తప్పనిసరిగా 6 లేదా 8 వారాల వ్యవధినిచ్చి, పూర్తి స్థాయిలో శుభ్రపరచి, తిరిగి కోళ్ళను కాని, కోడి పిల్లలను గానీ వేయాలి. ఖాళీ షెడ్లను ఫ్యూమిగేషన్ విధానంలో శుభ్రపరచడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
3. ఫారం పరిసరాలలో వ్యాధి సోకిన సందర్భాలలో నివారణగా ముందస్తు వ్యాక్సిన్లు ఇవ్వాలి (లసోటా వ్యాక్సిన్)
4. అవసరాన్ని బట్టి రక్త పరీక్ష చేయడం వల్ల వ్యాధి సంక్రమించక ముందే వ్యాక్సిన్లు ఇవ్వవచ్చు. దాని మూలాన వ్యాధి నివారణ సాధ్యమవుతుంది.
5. కొంగలు, కాకులు వంటి ఇతర పకక్షులు షెడ్లలోనికి ప్రవేశించకుండా షెడ్ల సైడు జాలీల ఖాళీలను సరిచేసుకోవాలి.
6. లేయర్ కోళ్లకు ప్రతీ 5 లేదా 6 వారాలకొకసారి లసోటా వ్యాక్సిన్ ఇవ్వాలి. బ్రాయిలర్ కోళ్లకు 20 రోజుల వయస్సులో రెండవసారి లసోటా వ్యాక్సిన్ తప్పనిసరిగా ఇవ్వాలి.
7. కోళ్లలో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఒత్తిడి వల్ల వ్యాక్సిన్ టైటర్స్ తగ్గి వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది.
8. క్రమం తప్పకుండా విటమిన్లు ఇవ్వడంవల్ల టైటర్స్ తగ్గకుండా ఉంచవచ్చు.
9. దాణాలో ఉన్న టాక్సిన్ల వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గి వ్యాధి సంక్రమించవచ్చు కావున క్రమం తప్పకుండా దాణాలో టాక్సిన్ బైండర్లను వాడాలి.
10. వ్యాధి సోకి మరణించిన కోళ్ళ నిర్మూలన అత్యంత ముఖ్యమైనది. ఈ వ్యాధి వలన మరణించిన కోళ్ళను కాల్చివేయాలి లేదా కనీసం పూడ్చి వేయాలి.
11. ఫారంలోకి బయటి నుండి వచ్చే మనుషులు, వాహనాల రాకపోకలను నియంత్రించాలి.
13. షెడ్లు లోపల కోళ్లపై క్రమం తప్పకుండా వైరు సిడిల్ ఏజెంట్లు అయిన బయోబస్టర్ వంటి వాటిని స్ప్రే చేయాలి. షెడ్లు బయటి పరిసరాలలో 10% ఫార్మాలిన్ను స్ప్రే చేయడం వల్ల వ్యాధి సోకకుండా నిర్మూలించవచ్చు.
మన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం ఎక్కువగా వర్షంపై ఆధారపడి ఉంటుంది. అందువలన రైతులు ఖరీఫ్లో ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేస్తారు. ఖరీఫ్లో సాగు చేసినప్పుడు, వివిధ చీడ పురుగులు పంటలని ఆశించి నష్టం కలుగచేస్తాయి. వీటి నివారణకి కేవలం పంటకాలంలో రసాయనిక మందులపైనే ఆధారపడకుండా, ముందు జాగ్రత్తగా కొన్ని సస్యరక్షణ చర్యలు వేసవిలో చేపట్టినట్లయితే ఖరీఫ్లో వచ్చే చీడపురుగులు కొంతవరకు అదుపులో ఉంచవచ్చు.
పంటల అవశేషాలను తొలగించాలి: ఇంతకు ముందు సాగు చేసిన పంట అవశేషాలను పూర్తిగా తొలగించడం వలన కొన్ని పురుగులు కోశస్థథలను నాశనం చేసి, తర్వాత సాగు చేసే పంటకి ఈ పురుగులు ఆశించకుండా చేయవచ్చు. ప్రత్తిలో చివరిసారి ప్రత్తిని ఏరిన తర్వాత మిగిలిపోయిన, గులాబిరంగు కాయతొలుచు పురుగు ఆశించిన పచ్చికాయలను తినడానికి మేకలను / గొర్రెలను చేలల్లో మేపాలి.
ఉదా: వరిలో ప్రధానమైన కాండము తొలిచే పురుగును, ప్రత్తిలో గులాబిరంగు కాయతొలచు పురుగును పంటల అవశేషాలను తొలగించడం వలన నియంత్రించవచ్చు.
వేసవి దుక్కులు: పంటలను కోసిన తర్వాత మే నెలలో వర్షాలు పడగానే లేదా జూన్లో తొలకరి వర్షాలు పడగానే లోతుగా పొలాన్ని దున్నాలి. లోతుగా దుక్కులు చేసుకున్నట్లయితే ముఖ్యంగా భూమిలోపల ఉండే పురుగుల కోశస్థథలు, కొన్నింటి పిల్లపురుగు థలు బయటపడి ఎండతాకిడికి/పకక్షులతాకిడికి గురై చనిపోతాయి. దీనివలన తర్వాత పంట కాలంలో వీటి ఉధృతి తక్కువగా ఉండేటట్లు చేయవచ్చు.
ఉదా:
వరిలో కాండంతొలుచు, రెల్ల రాల్చు, లద్దె పురుగులు
ప్రత్తిలో పొగాకు లద్దె, శనగపచ్చ, మచ్చల కాయ తొలుచు పురుగులు
మిరప, టమాట, బెండలో కాయతొలుచు పురుగులు
వేరుశనగ పంటలో ఎర్రగొంగళి, శనగపచ్చ, పొగాకు లద్దె పురుగులు
గుమ్మడి, బీర, దొండ, కాకర, పొట్లకాయ పంటలలో పండు ఈగ
కలుపు మొక్కలను తొలగించుట: చాలా రకాల పురుగులు ఒకే పంటపైనే కాకుండా ఇతర మొక్కలపైన (కలుపు మొక్కలు) కూడా ఉంటూ వాటి మనుగడ సాగిస్తాయి. ముఖ్యంగా కలుపు మొక్కలను ఆశించి, పురుగులు పంటలు విత్తుకోగానే వాటిని ఆశించి తీవ్రమైన నష్టం కలిగిస్తాయి. అందువలన వేసవిలో ముఖ్యంగా పంటలు విత్తుకునే ముందే కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
ఉదా:
వరి పంటను సాగు చేసే ముందు గరిక, తుంగ మొదలగు కలుపు మొక్కలను లేకుండా చేయడం ద్వారా వరిలో ప్రధానమైన ఉల్లికోడు, ఆకు ముడత, కంకినల్లి మొదలగు పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు.
ప్రత్తిలో వయ్యారిభామ, తుత్తురు బెండ లాంటి కలుపు మొక్కలు లేకుండా చేయడం ద్వారా పిండినల్లి సమస్యను తగ్గించవచ్చు.
పొలం గట్ల మీద, గట్ల ప్రక్కన కలుపు మొక్కలు లేకుండా చేయడం ద్వారా ఎలుకల సమస్యను తగ్గించవచ్చు. ఎలుకల నివారణకి రైతులందరూ సామూహికంగా నివారణ చర్యలు చేపట్టినట్లయితే ఫలితం ఉంటుంది.
పంటకాలాన్ని పొడిగించుట: నీటివసతి సౌకర్యం ఉన్నప్పటికీ, కొన్ని రకాల పంటలను కాలపరిమితికి మించి సాగు చేయకూడదు. ఉదాహరణకి ప్రత్తిలో పంటకాలాన్ని పొడిగించినట్లయితే లేదా కార్శి పంటగా సాగు చేసినట్లయితే, ప్రత్తిలో ప్రధానమైన గులాబిరంగు, కాయతొలిచే పురుగు సమస్య తర్వాత పంటలో చాలా తీవ్రంగా ఉండి నష్టం ఎక్కువగా ఉంటుంది.
పంట విత్తే సమయము – ప్రణాళిక తయారీ: చాలా పంటలలో, పంటను ఆలస్యంగా విత్తినట్లయితే పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. కావున పంటలను నిర్ధేశించిన సమయంలోనే విత్తుకొనే విధంగా ప్రణాళికను ముందుగానే తయారు చేసుకోవాలి.
పైన చెప్పిన పద్ధతులను రైతులు ముందస్తు చర్యగా వేసవిలో పాటించినట్లయితే, రాబోవు ఖరీఫ్ సాగు కాలంలో వివిధ చీడపురుగుల ఉధృతి నష్టపరిమితి స్థాయిలోపు ఉండి, ఉధృతి మరింత పెరగకుండా చేయవచ్చును. తద్వారా రసాయన పురుగు మందుల పిచికారి ఖర్చు తగ్గించి అధిక నికరాదాయం పొందటానికి ఆస్కారం ఉంటుంది.
వేపగింజల కషాయం తయారీ
వర్షాకాలంలో సాగు చేసే పంటలపై ఆశించే చీడ పురుగుల నివారణకి వాడుకొనుటకు గాను, వేపగింజలను ముందుగానే సమీకరించుకొని ఎండబెట్టుకోవాలి. వీటి నుంచి వేపగింజల కషాయం తయారు చేసుకొని పురుగులు ఆశించిన తొలిథలో పిచికారి చేసుకోవచ్చు. ఆఖరి దుక్కిలో వేప చెక్కను వేసినట్లయితే పసుపులో దుంపఈగ, మిరపలో నులిపురుగులను నియంత్రించవచ్చు.
గుమ్ముడాల యశస్విని,
డి. సాయిచరణ్,
కూసరి సుప్రియ,
ఈర్ల స్రవంతి,
బి. మాధురి,
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం,
పాడి పశువుల ఉత్పాదక శక్తి పశువుల పునరుత్పత్తి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. పాడి పశువులలో ఎదను సరైన సమయంలో గుర్తించి కృత్రిమ గర్భధారణ చేయడం అతి ముఖ్యమైనది. ఇలా చేయడం ద్వారా వలన ఈతల మధ్య వ్యవధి తగ్గి పాడి పరిశ్రమ లాభదాయకంగా కొనసాగుతుంది. యుక్త వయస్సు వచ్చిన ఆడ పశువుల్లో అండాశయంలో ఉత్పత్తి అయిన హార్మోన్ల వలన అసహజమైన లక్షణాలను ప్రదర్శిస్తాయి. ఈ స్థితిని ఎద అని అంటారు.
దేశవాళి పశువులు 3-4 సంవత్సరాల వయస్సులో ఎదకు వచ్చి 4-5 సంవత్సరాలలో మొదటి ఈత ఈనుతాయి. అదే సంకరజాతి పశువులు ఒకటిన్నర సంవత్సరం వయస్సులోపు ఎదకు వచ్చి 2-3 సంవత్సరాల వయస్సులో తొలి ఈత ఈనుతాయి. సాధారణంగా పశువులు 3 వారాలకొకసారి ఎదకు వస్తాయి. ఎద కాలం ఆవులలో 18-24 గంటలు, గేదల్లో 24-36 గంటలు ఉంటుంది. ఎద కాలంలోనే పశువులు సంపర్కానికి సిద్దంగా ఉండి మగ పశువుల్ని దాటనిస్తాయి.
పశువుల్లో ఎద లక్షణాలు:
ఎద కాలం సాధారణంగా మూడు థలుగా విభజించవచ్చును. మొదటి థలో మానం నుండి పలుచని తీగలు వేస్తుంది. రెండవ థలో మానం నుండి కోడిగ్రుడ్డు తెల్ల సొన లాగ చిక్కగా తీగలు వేస్తుంది. మూడవ థలో అండము విడుదలయి, వీర్య కణముతో కలిసి ఫలదీకరణం చెందుతుంది. గేదేలలో కంటే ఆవులలో ఎద లక్షణాలు తేలికగా గుర్తించవచ్చు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రత్యేకించి గేదేలలో ఎద కాలం 8-12 గంటలు మాత్రమే ఉంటుంది.
గేదేలలో మూగ ఎద:
ఆవులలో లాగా గేదెలు ఎద లక్షణాలను స్పష్టంగా బహిర్గతం చేయలేక పోవడాన్ని మూగ ఎద అంటారు. గేదె మానం తెరచి చూస్తే లోపలి పొర ఎర్రగా ఉంటుంది. తీగలు తోకను, మానం పై అతుక్కొని ఆరిపోయి ఉంటాయి. గేదె అరుపు తక్కువ స్థాయిలో ఉంటుంది. మూగ ఎదను టీజర్ ఆంబోతు ద్వారా గుర్తించవచ్చు. ఎదకు రాకపోవటం:
ఇది రెండు రకాలుగా ఉంటుంది. 1. ఆలస్యంగా పొర్లుకు రావటం 2.ఈనిన తరువాత సకాలంలో ఎదకు రాకపోవటం* బాహ్య పరాన్నజీవులు, అంతర పరాన్నజీవుల బెడద, వ్యాధుల బారిన పడటం మరియు ఎక్కువ కొవ్వుపట్టిన పశువు ఎదకు సరిగా రాదు.* వేసవిలో అధిక వాతావరణ ఉష్ణోగ్రత, వడగాల్పు, గాలిలో అధిక తేమ శాతం ఉన్నప్పుడు పశువు ఎదకు రావటం కష్టం.* పశువు శరీరంలో కాపర్, కోబాల్ట్, మాంగనీస్ మొదలైన ముఖ్యమైన ఖనిజాలు లోపించడం* పుష్టికరమైన ఆహరం లోపించడం, విటమిన్ ‘ఎ’ లోపించడం, అండాశయంలో కాయతో పాటు ఇతర లోపాలు ఏర్పడటం, వ్యాధుల బారిన పడటం, పశువు ముసలిది కావటం, పుట్టుకతోనే కొన్ని లోపాలు సంక్రమించడం, అండాశయం సక్రమంగా వృద్ది చెందకపోవటం. పశువు సకాలంలో ఎదకు రావాలంటే….
* పశువులలో పునరుత్పత్తి సామర్థ్యం పెంచుటకు మేపు చాలా ముఖ్యం. పచ్చిగడ్డి కొరత నివారించటానికి సైలేజ్ గడ్డిని తయారుచేయడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలి.
* బాహ్య పరాన్నజీవులు,అంతర పరాన్నజీవులను నిర్మూలించాలి.
* అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల నుండి పశువుల్ని సంరక్షించాలి. పశువు పై నీళ్ళు చల్లుతూ శీతల పరిస్థితిని కల్పించాలి.
* పశుపోషకుడు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం రోజుకు రెండుసార్లు (ఈనిన 45 రోజుల తరువాత) పరిశీలిస్తే ఎదలోని పశువుల్ని సులభంగా గుర్తించవచ్చును.
* మూగ ఎద, బలహీనమైన ఎదల సమస్యలు ఉన్న పశువులకు ప్రతిరోజు 500-1000 గ్రాముల మొలకెత్తిన ఉలవలు, శనగలు, గోధుమలను వంటి ధాన్యాలను 20-30 రోజులు మేపాలి.
* గర్భకోశ వ్యాధులకు తగిన వైద్యం చేయించి ఫలితాలు పొందాలి వైద్యం చేసిన తరువాత కూడా చూడి కట్టించడం లేకపోయినచో పశువును మంద నుండి తొలగించాలి.
* విటమిన్ ఏ, డి, ఇ లను ఇంజక్షన్ రూపంలోనూ, కాపర్, భాస్వరం, జింక్, సెలీనియం మొదలగు ఖనిజ లవణాలను మినరల్ మిక్సర్ రూపంలో రోజుకు 50 గ్రాములు అందించాలి.
* ఎక్కువ కొవ్వు పట్టిన గేదెకు/ఆవుకు సరిపోను వ్యాయామం కల్పిస్తే చాలు చురుకుగా తయారయ్యి పశువులు ఎదకు వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి.
* పశువు ఈనడానికి రెండు మాసాలు ముందు నుండి పాలు పితకడం మాని వేసినచో ఈనిన తర్వాత ఎదకు తొందరగా రావచ్చును. సైక్లోమిన్ బిల్లలను వారానికి ఒకటి చొప్పున పశువులు ఎదకు వచ్చేంతవరకు ఇవ్వాలి. జెనోవా లేక ప్రజానా మందులను రోజుకు మూడు చొప్పున రెండు రోజులు వాడాలి.
* పశువు ఈనిన తర్వాత మొదటి సారి 11 నుండి 17 రోజుల్లో ఎదకు వస్తాయి కానీ ఆ రెండవ సారి 35 నుంచి 45 రోజుల్లో ఎదకు వచ్చినప్పుడు చూడి కట్టిస్తే 90% పశువుల్లో చూడి నిలిచే అవకాశాలు ఉంటాయి.
* పశు గర్భకోశ ద్వారంలోకి లుగాల్స్ అయోడిన్ పంపించి అండాశయాన్ని సున్నితంగా మర్దించి చురుకుగా తయారు చేయించినచో పశువు ఎదకు రావచ్చును.
ఎదలో ఉన్నప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
* రైతులు తమ పశువు ఎద లక్షణాలను గుర్తించి సరైన సమయంలో గర్భధారణ చేయించినచో సకాలంలో గర్భం ధరించి, తిరిగి సకాలంలో పాల ఉత్పత్తి మొదలవుతుంది.
* పశువు ఈనిన 45 రోజుల తర్వాత వచ్చే మొదటి ఎదలో గర్భధారణ చేయించినచో చూడి నిలిచే శాతం అధికంగా ఉంటుంది. గర్భధారణ చేయించిన తరువాత 17 నుండి 26 రోజుల మధ్య క్రమం తప్పకుండా పశువును జాగ్రత్తగా పరిశీలించి తిరిగి ఎదకు వచ్చినదీ లేనిది నిర్ణయం తీసుకొని, అవసరమైనచో తిరిగి గర్భధారణ చేయించాలి.
* రైతులు పశువు మొదటి ఎదకాలం జాగ్రత్తగా గమనించి వెంటనే గర్భధారణ చేయించడం మంచిది.* మూగ ఎదకు వచ్చిన పశువులలో ఎద మామూలు కాలం కన్నా ఎక్కువ కాలం ఉండవచ్చును అందుచేత రెండవసారి ఇన్సెమినేషన్ చేయించవలసి వస్తే చేయించాలి.
* కొన్ని పశువులలో ఎద36 గంటలు దాటి మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఉండవచ్చును. కనుక గర్భధారణ చేసిన తర్వాత పశువును మూడు నుంచి నాలుగు రోజులు జాగ్రత్తగా గమనించి అవసరమైనచోతిరిగి గర్భధారణ చేయించాలి.
* 10 నుండి 15 శాతం పశువులు ఎక్కువగా గేదేలలోను, సంకరజాతి పశువులలోను ఎదకు వచ్చిన 7 నుండి 10 రోజుల లోపు మళ్ళీ వస్తాయి (ఐచీజిరిశి నీలిబిశి). కనుక గర్భధారణ చేసిన ఏడవ రోజు నుండి పదవ రోజు వరకూ పశువును జాగ్రత్తగా పరిశీలించి అవసరమైనచో గర్భధారణ చేయించాలి.
* అరుదైన సందర్భాలలో 4 నుంచి 5 రోజులలో లేక ప్రతి వారం అస్తవ్యస్తంగా పశువులు ఎదకు వస్తాయి.
* కొన్ని సందర్భాలలో 3 నుంచి 5 నెలల చూడి కాలంలో పశువులు ఎదకు వస్తాయి. దీనిని చూడి ఎద అని అంటారు. గర్భధారణ చేయించకూడదు. రైతులు పశువుల ఎద లక్షణాలను పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం సకాలంలో చూడి కట్టించుటకు ఇది చాలా అవసరం.
* గర్భధారణ ఎద మధ్య థ నుండి చివరి థ వరకు చేయించవచ్చు. ఈ థలో చూడి కట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
* పశువు అరవగానే వీర్య దానం చేయించరాదు. ఎద మొదలైన 12 గంటల తర్వాత గర్భధారణ చేయించాలి అనగా ఉదయం ఎదకు వస్తే సాయంత్రం, సాయంత్రం ఎదకు వస్తే మరుసటి రోజు ఉదయం గర్భధారణ చేయించాలి. ఆరు గంటల తేడాతో రెండుసార్లు గర్భధారణ చేయిస్తే ఫలితాలు బాగుంటాయి.గేదేలలో ఎద కాలం 24 నుంచి 36 గంటలు ఉంటుంది. అది ఎదకు వచ్చిన 24 గంటల తర్వాత వీర్యదానం చేయించాలి అనగా ఉదయం ఎదకు వచ్చిన మేరకు మరుసటి రోజు ఉదయం సాయంత్రం వరకు వచ్చిన గేదెకు మరుసటి రోజు సాయంత్రం చూడి కట్టించాలి.చూడి కట్టించడం ఆలస్యం చేస్తే కట్టు నిలిచే అవకాశాలు తగ్గిపోతాయి.
* సరైన సమయంలో గర్భధారణ చేస్తే 70 శాతం పశువులు మొదటి సారే చూడి కడతాయి.
* పశువులు ఎదకు రావడానికి వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ తక్కువగా ఉన్న సమయాలు మిక్కిలి అనుకూలంగా ఉంటాయి.
* సహజ సంపర్కం: ఒక ఆవునుగానీ, గేదెనుగానీ ఎదకు వచ్చినప్పుడు ఆబోతు చేతగాని/ దున్నపోతు చేతగాని దాటించి గర్భధారణ చేయడాన్ని సహజ సంపర్కం అంటారు. ఈ పద్ధతి పూర్వకాలం నుండి ఆచరణలో ఉన్న పద్ధతి.
* కృత్రిమ గర్భోత్పత్తి : మేలు జాతి ఆబోతు వీర్యాన్ని పరికరాల సహాయంతో శాస్త్రీయ పద్ధతిలో సేకరించి ఆడ పశువు గర్భకోశంలో సకాలంలో ప్రవేశపెట్టి గర్భం ధరించేటట్లు చేసే ప్రక్రియనే శాస్త్రీయ గర్భోత్పత్తి లేదా కృత్రిమ గర్భధారణ అంటారు.
కృత్రిమ గర్భధారణ లాభాలు :
* పాల దిగుబడులు పెంచుటకు అధిక పాల దిగుబడి ఇచ్చే మేలుజాతి పశువులను ఉత్పత్తి చేయడానికి కృత్రిమ గర్భధారణ పద్ధతి అనుసరించాలి.
* తక్కువ ఖర్చుతో జాతిని మెరుగుపరచి అధిక పాల దిగుబడి పొందవచ్చు.
* అధిక పాల సార కలిగిన ఆంబోతుల వీర్యాన్ని ప్రపంచంలోని ఏ మూల నుంచైనా తెచ్చుకొనవచ్చు.
* మినీ డెయిరీలలో ఆబోతు మేపటం ఖర్చుతో కూడుకున్న పని. గర్భధారణ వల్ల తక్కువ ఖర్చుతో చూడి కట్టించుకొనవచ్చు.
* కృత్రిమ గర్భధారణ పద్ధతిలో ఆబోతులకు ఉండే సుఖవ్యాధులు లేదా ఆవులలోని గర్భకోశ వ్యాధులు, ఆంబోతుల ద్వారా ఇతర పశువులకు సంక్రమించకుండా నిరోధించవచ్చు.
గర్భధారణ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
* ఎద లక్షణాలు కనిపించగానే పశువును వేరు చేసి కట్టి ఉంచాలి.
* తొలిసారి గర్భధారణ చేసే పడ్డలు/పెయ్యలు బాగా బలంగా ఉండి, తగిన ఎత్తు పెరిగి ఉండాలి. సుమారుగా ఆవు దూడలు 200 నుండి 250 కిలోల బరువు, గేదె దూడలు 250 నుంచి 300 కిలోల బరువు ఉంటే మంచిది.* ఆరోగ్యంగా ఉన్న పశువులకు మాత్రమే గర్భధారణ చేయించాలి.
* అనారోగ్యంగా ఉన్న పశువులకు, తగినంత బలంగా లేని పశువులకు, గర్భవాతం ఉన్న పశువులకు కృత్రిమ గర్భధారణ చేయించరాదు.
* పాడి పశువులు వేసే తీగలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఎద మధ్య థ నుండి చివరి థ వరకు పశువు మానం నుండి తీగలు బాగా వేస్తుంది. తీగలు తొడ పైన, తోకకు అంటుకొని మెరుస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో గర్భధారణ చేయించి మంచి ఫలితాలను పొందవచ్చు.
* ఇన్సెమినేషన్ చేసేముందు, చేసిన తర్వాత పశువుకు విశ్రాంతినిచ్చి బెదరకుండా చూడాలి. పశువును కొట్టడం, పరిగెత్తించడం చేయ కూడదు. ఉద్రేకానికి గురికాకుండా మూడు రోజులు జాగ్రత్తలు తీసుకోవాలి.
* కృత్రిమ గర్భధారణ చేసే పశువును ఏకాంతంగా చల్లని ప్రదేశంలో ఉంచటం మంచిది.
* వీర్యదానం చేయించగానే చల్లని నీరు శరీరంపై చల్లడం మంచిది.
* వీర్య దానం చేసిన తర్వాత 3 నుంచి 4 రోజుల వరకూ,15 నుంచి 26 రోజుల మధ్య, 38 నుంచి 48 రోజుల మధ్య పశువు ఎదకు వచ్చుచున్నది లేనిది గమనించాలి. ఎదకు రాకుంటే 60 రోజుల తర్వాత చూడి పరీక్ష చేయించాలి.
* కృత్రిమ గర్భధారణ చేసిన తేదీ, పశువును తిరిగి ఎద గురించి పరిశీలించవలసిన తేదీలు, చూడి పరీక్షకు తీసుకువెళ్ళవలసిన తేదీలు రాసి పెట్టుకోవాలి.
టి. విజయ నిర్మల, శాస్త్రవేత్త, ఫోన్: 8121136184;
ఎ. దేవివరప్రసాద్రెడ్డి, శాస్త్రవేత్త,
కె. వెంకట సుబ్బయ్య, శాస్త్రవేత్త,
ఇ.కరుణశ్రీ, ప్రధాన శాస్త్రవేత్త
బి. శ్రీనివాసులు, విస్తరణ సంచాలకులు,
కృషి విజ్ఞాన కేంద్రం, డా. వై.ఎస్.ఆర్, ఉద్యాన విశ్వవిద్యాలయం,
ఆఫ్ సీజన్లో పంటల సాగును ఎలా చేస్తారు. ఇది ప్రధానంగా వేసవిలో తెలంగాణ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి మరియు పంట ఉత్పాదకత చాలా కష్టంగా ఉంటుంది. ఫలితంగా, పాలీహౌస్ లేదా రక్షిత సాగు ద్వారా పంటలు పండించవచ్చు. పాలీహౌస్ వ్యవసాయం అనేది అధిక-విలువైన, ప్రత్యేకమైన పంటల యొక్క ప్రత్యేక, నియంత్రిత పర్యావరణ సాగు, అధిక మార్కెట్ ధరలను పొందవచ్చు (కత్తిరించిన పూలు, ఆఫ్-సీజన్లో పండించిన కూరగాయలు, తక్కువ-సీజన్ ఆకుకూరలు, మైక్రోగ్రీన్లు మొదలైనవి). గ్రీన్హౌస్లో పండించిన పండ్లకు ప్రజలు అధిక ధరలను చెల్లించగలరు కాబట్టి, మీరు అధిక-స్థాయి వినియోగదారులకు ఆరోగ్యకరమైన, పురుగుమందులు లేని తాజా ఉత్పత్తులను పండించి అందించవచ్చు.
భారతదేశంలో, పాలీహౌస్ వ్యవసాయం నెమ్మదిగా ప్రజాదరణ పొందుతోంది. పాలీహౌస్ వ్యవసాయం రైతుకు చాలా లాభదాయకంగా ఉంటుంది. అయితే, చాలా మందికి పాలీహౌస్ లేదా గ్రీన్హౌస్ అంటే ఏమిటో తెలియదు, కాబట్టి ఈ ఆర్టికల్లో, పాలీహౌస్లు మరియు దాని ప్రయోజనాల గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదాన్ని మేము వివరిస్తాము. పాలీహౌస్ అంటే ఏమిటి?
పాలీహౌస్, తరచుగా గ్రీన్హౌస్ అని పిలుస్తారు, ఇది గాజు లేదా పాలిథిలిన్ వంటి పదార్థాలతో నిర్మించిన భవనం లేదా నిర్మాణం, దీనిలో మొక్కలు నియంత్రిత పర్యావరణ పరిస్థితులలో పెరుగుతాయి మరియు అభివృద్ధి చెందుతాయి. నిర్మాణం యొక్క పరిమాణం డిమాండ్ను బట్టి చిన్న గుడిసెల నుండి పెద్ద నిర్మాణాల వరకు ఉంటుంది. అన్నింటికంటే మించి, గ్రీన్హౌస్ అనేది ఒక గాజు నిర్మాణం, దీని ఇంటీరియర్లు సూర్యరశ్మికి గురైనప్పుడు వేడెక్కుతాయి, ఎందుకంటే నిర్మాణం గ్రీన్హౌస్ వాయువు బయటకు రాకుండా చేస్తుంది. బయట గడ్డకట్టే సమయంలో, మొక్కలు జీవించడానికి లోపల ఉష్ణోగ్రత తగినంత వెచ్చగా ఉంటుంది. గ్రీన్హౌస్, పాలీహౌస్ ఫార్మింగ్ మధ్య వ్యత్యాసం:
పాలీహౌస్ అనేది ఒక రకమైన గ్రీన్హౌస్ లేదా మరొక విధంగా చెప్పాలంటే, పాలిథిలిన్ కవర్తో కూడిన గ్రీన్హౌస్ యొక్క చిన్న వెర్షన్. చవకైన నిర్మాణ ఖర్చులు మరియు నిర్వహణ సౌలభ్యం కారణంగా పాలీహౌస్ వ్యవసాయం భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒక ప్రముఖ గ్రీన్హౌస్ పద్ధతి. పాలీహౌస్లో పండే పంటలు:
* కార్నేషన్, జెర్బెరా మరియు ఆర్చిడ్ వంటి పువ్వులను కూడా సులభంగా పెంచవచ్చు పాలీహౌస్ వ్యవసాయం యొక్క ప్రయోజనాలు:
ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయాన్ని ఇష్టపడే రైతులకు పాలీహౌస్ ఎంతో మేలు చేస్తుంది. పాలీహౌస్ యొక్క కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి:
* మొక్కలను నియంత్రిత ఉష్ణోగ్రతలో పెంచడం వల్ల పంట నష్టం లేదా నష్టం జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
* మీరు ఏడాది పొడవునా పంటలను పండించవచ్చు మరియు ఏదైనా నిర్దిష్ట సీజన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.
* పాలీహౌస్లో తెగుళ్లు మరియు కీటకాలు తక్కువగా ఉంటాయి.
* బాహ్య వాతావరణం పంటల పెరుగుదలపై ఎలాంటి ప్రభావం చూపదు.
* పాలీహౌస్లో ఉత్పత్తి యొక్క నాణ్యత స్పష్టంగా ఎక్కువగా ఉంటుంది.
* పాలీహౌస్లో అలంకారమైన పంటల ప్రచారం కూడా అప్రయత్నంగా చేయవచ్చు.
* పాలీ హౌస్ ఏ సీజన్లోనైనా మీ మొక్కలకు సరైన పర్యావరణ సౌకర్యాలను అందిస్తుంది.
* ఇది దాదాపు 5 నుండి 10 రెట్లు దిగుబడిని కూడా పెంచుతుంది.
* తక్కువ పంట కాలం
* ఎరువులు వేయడం సులభం మరియు బిందు సేద్యం సహాయంతో స్వయంచాలకంగా నియంత్రించబడుతుంది.
పాలీహౌస్ రకాలు:
పర్యావరణ నియంత్రణ వ్యవస్థల ఆధారంగా పాలీహౌస్లు రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి:
* సహజంగా వెంటిలేషన్ చేయబడిన పాలీహౌస్ – ఈ రకమైన పాలీహౌస్ లేదా గ్రీన్హౌస్లో ప్రతికూల వాతావరణం మరియు సహజ తెగుళ్లు మరియు అనారోగ్యాల నుండి పంటలను రక్షించడానికి తగిన వెంటిలేషన్ మరియు ఫాగర్ సిస్టమ్ మినహా పర్యావరణ నియంత్రణలు లేవు.
* పర్యావరణపరంగా నిర్వహించబడే పాలీహౌస్లు – ఈ నిర్మాణాలు కాంతి, ఉష్ణోగ్రత, తేమ మరియు ఇతర కారకాలను నియంత్రించడం ద్వారా పంటల పెరుగుతున్న సీజన్ను విస్తరించడానికి లేదా ఆఫ్-సీజన్ దిగుబడిని పెంచడానికి రూపొందించబడ్డాయి.
ముగింపు:
ఓపెన్ ఫీల్డ్ ఫార్మింగ్తో పోలిస్తే పాలీహౌస్ లేదా గ్రీన్హౌస్ ఫార్మింగ్లో దిగుబడి 4-8 రెట్లు పెరుగుతుందని అంచనా వేయబడింది. ఫలితంగా, రైతులు బహిరంగ పొలాల్లో పని చేయకుండా, పాలీహౌస్ నిర్మించడాన్ని పరిగణించవచ్చు. ఉదాహరణకు సంగారెడ్డి ప్రాంతంలోని రైతులు, వర్షపాతం మరియు ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా ఉత్పాదకత తక్కువగా ఉన్నప్పుడు మే నుండి ఆగస్టు వరకు పాలీ హౌస్లలో టమోటాలు పండించడం ద్వారా అధిక రాబడిని సాధించారు.
ఎం. భార్గవ్ రెడ్డి, యంగ్ ప్రొఫెషనల్-2,
నేషనల్ అకాడమి ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్,
మన తెలుగు రాష్ట్రాల్లో పండించే అపరాల్లో పెసర, మినుము ముఖ్యమైనవి. సుమారుగా 65-80 రోజుల్లో కోతకు వచ్చే ఈ పంటలు 1.5 లక్షల ఎకరాల్లో సాగుచేయబడుతున్నది. సాగు నీటి లభ్యత ఎక్కువగా ఉండటం వలన రైతులు వేసవి పప్పుధాన్యాల సాగు చేసుకోవచ్చు. పెసర, మినుము పంటలు తక్కువ కాల పరిమితి కల్గి ఉంటం వల్ల మరియు తక్కువ నీటి వసతి ఉన్నచోట కూడా పండించేందుకు అనుకూలంగా ఉంటుంది. అన్ని కాలాల్లో పండించే ఈ పప్పు దినుసులు మన ఆహారంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
మానవ శరీరానికి అవసరమైన మాంసకృత్తులు, ఖనిజ లవణాలను అందించడమేకాకుండా నత్రజని స్థిరీకరణ ద్వారా నేలను సారవంతం చేస్తుంది. పప్పుదినుసులు తలసరిగా రోజుకు 80 గ్రా. తీసుకోవలసి ఉండగా ప్రస్తుతం కేవలం 31 గ్రా. మాత్రమే అందుబాటులో వున్నాయి. ఈ వ్యత్యాసాన్ని పూడ్చడానికి ప్రస్తుతం మన భారతదేశం 3 మిలియన్ టన్నుల అపరాలను దిగుమతి చేసుకుంటుంది. పెసర, మినుము మనకు కావాల్సిన మాంసకృత్తులు అందించడమే కాకుండా పంట మార్పిడి జరిగి భూసారం పెరిగి ప్రధాన పంటల్లో స్థిరమైన దిగుబడి సాధించుటకు దోహదపడుతుంది.
మినుము, పెసర సాగులో సమస్యలు:
* అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకోకపోవడం నిస్సారమైన భూముల్లో వర్షాధారంగా సాగుచేయడం, సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, చౌడు విస్తీర్ణం పెరగటం
* సరైన సమయంలో కలుపు నివారణ చేయకపోవటం వరి మాగాణుల్లో ఊద మరియు బంగారు తీగ ప్రధాన సమస్య
* తెగుళ్ళకు, పురుగులకు లొంగిపోవటం- తెగుళ్ళల్లో పల్లాకు, మొవ్వుకుళ్ళు, ఆకుముడత, ఎండు తెగులు, బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు మరియు పురుగుల్లో మారుకా మచ్చల పురుగు, రసం పీల్చే పురుగులు, పొగాకు లద్దె పురుగు ప్రధాన నష్టాన్ని కలుగజేస్తున్నాయి.
* పండించిన పంటకు సరైన ధర రాకపోవడం. కాబట్టి రైతులు సరైన యాజమాన్య పద్ధతులతో సాగు చేస్తే, వాణిజ్య పంటలతో పోటీగా ఆదాయాన్ని పొందవచ్చు. వేసవి పెసర/మినుము సాగు అవకాశాలు:
ఈ అపరాల సాగుకు సుమారు 300 మి.మీ. నీరు అవసరం ఉంటుంది. కొద్దిపాటి నీటిసదుపాయం ఉన్న రైతులు కీలక థల్లో 3-4 నీటితడులు ఇచ్చినట్లయితే ఈ పంటలను సమర్థవంతంగా సాగు చేసుకోవచ్చు. వాణిజ్య పంటలైనటువంటి ప్రత్తి, మిరప, పసుపు అలాగే యాసంగి మొక్కజొన్న, వేరుశనగ, వరి తీసిన తరువాత ఖాళీగా ఉన్న భూముల్లో పెసర, మినుము సాగుచేయవచ్చు. వేసవిలో సాగుచేసే పెసర, మినుము పంటల్లో చీడపీడల బెడద తక్కువగా ఉండటం వలన తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందవచ్చు. నేలలు:
నీటి వసతి కలిగిన ఎర్ర నేలలు, సారవంతమైన మురుగు నీరుపోయే సౌకర్యం గల నల్ల నేలలు కూడా అనుకూలం. నీరు బాగా ఇంకి తేమను పట్టి ఉంచే మధ్యస్థ బరువైన నేలలు అనుకూలమైనవి. సమస్యాత్మక భూములు ముఖ్యంగా చౌడు భూములు ఈ పంటల సాగుకి పనికిరావు.
యంజిజి-295: కాపు పైభాగాన గుత్తులుగా వస్తుంది. గింజ మధ్యస్థ లావుగా ఉండి, సాదాగా ఉంటుంది. మొవ్వుకుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. పంట కాలం 65-70 రోజులు, దిగుబడి: 5-6 క్వి/ ఎకరానికి.
యంజిజి-347: కాపు పైభాగాన ఉండి ఒకేసారి కోతకు వస్తుంది. ముదురు ఆకుపచ్చ మరియు సాదా గింజలు. పల్లాకు తెగులు మరియు బెట్టను కొంత వరకు తట్టుకుంటుంది. పంట కాలం 60-65 రోజులు. దిగుబడి : 5-6 క్వి/ఎకరం.
యంజీజీ-348: గింజ మధ్యస్థ లావుగా ఉండి, లేత ఆకుపచ్చలో సాదాగా ఉంటుంది. బెట్టను కొంత వరకు తట్టుకుంటుంది. పంట కాలం : 65-70 రోజులు. దిగుబడి: 5-6 క్వి/ఎకరం.
యంజిజి-351: లేత ఆకుపచ్చ, సాదా, మధ్యస్థ లావు గింజ ఉండి, పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. పంట కాలం 70 రోజులు. దిగుబడి 6-6.5 క్వి/ఎకరం.
యంజిజి-385: మొక్కలు నిటారుగా, గుబురుగా పెరిగి కాయలు గుత్తులుగా వ్యాపించి ఉండి ఒకేసారి కోతకు వస్తుంది. గింజలు మధ్యస్థ లావుగా, ముదురు ఆకుపచ్చగా మెరుస్తూ ఉంటాయి. మొవ్వుకుళ్ళును, ఆకుముడతను సమర్ధవంతంగా తట్టుకుంటుంది. పంట కాలం : 70-76 రోజులు. దిగుబడి 6-6.4 క్వి/ఎకరం.
డబ్ల్యుజిజి-37: గింజ మెరుస్తూ మధ్యస్థ లావుగా ఉండి, ఒకేసారి కాపుకు వచ్చి పల్లాకు తెగులును తట్టుకుంటుంది. పంట కాలం 60-65 రోజులు. దిగుబడి 5-6 క్వి/ఎకరం.
డబ్ల్యుజిజి -42: పొడవైన కాయలు, లావు పాటి మెరుపు గింజలు కలిగి, పల్లాకు తెగులును సమర్ధవంతంగా తట్టుకునే రకం. పంట కాలం 55-60 రోజులు. దిగుబడి 4-5 క్వి/ఎకరం.
టీయం-96-2: గింజలు లావుగా ఉండి, బూడిద తెగులును తట్టుకునే పాలిష్ రకం. వరి మాగాణుల్లోకి అనువైనది. పంట కాలం 60-65 రోజులు. దిగుబడి 5-6 క్వి/ఎకరం.
ఐపియం-2-14: మొక్క నిటారుగా పెరిగి ఒకేసారి కోతకు వచ్చి, మధ్యస్థ లావు గింజలు కలిగి, పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. పంట కాలం 60-65 రోజులు. దిగుబడి : 5-6క్వి/ఎకరం. వేసవికి అనుకూలమైన మినుము రకాలు – లక్షణాలు
యంబిజి-207: పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. పంట కాలం 75-80 రోజులు. దిగుబడి 7.2-8 క్వి/ఎకరం. వరి మాగాణులకు అనువైన రకం.
డబ్ల్యుబిజి-26: అన్ని కాలాలకు అనువైన సాదా రకం. కణుపుల మధ్య దూరం తక్కువ. గుత్తుల కాడ చిన్నగా ఉండి, కాయలు ఎక్కువ. పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. దిగుబడి 4-4.8 క్వి/ఎకరం.
పియు-31: అన్ని కాలాలకు అనువైన పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకునే సాదా రకం. కాయల మీద నూగు ఉంటుంది. తక్కువ కాల పరిమితి గల రకం. పంటకాలం 65-70 రోజులు. దిగుబడి 6-6.8 క్వి/ఎకరం.
యల్బిజి-752: అన్ని కాలాలకు అనువైన పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకొనే పాలిష్ రకం. వరి మాగాణుల్లో ఆలస్యంగా విత్తుకొనుటకు అనువైన రకం. పంట కాలం 75-80 రోజులు. దిగుబడి 8-8.5 క్వి/ఎకరం.
ఎల్బిజి-787: అన్ని కాలాలకు అనువైన, మధ్యస్థ కాల పరిమితి కలిగి పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. కాయలు ప్రధాన కాండం మీద కణుపుల వద్ద కూడా కాస్తాయి. పంట కాలం 75-80 రోజులు. దిగుబడి 8.0-8.8 క్వి/ఎకరం.
టిబిజి-104: అన్ని కాలాలకు అనువైన పల్లాకు తెగులును తట్టుకొనే పాలిష్ రకం. కాయలపై నూగు ఉంటుంది. పంట కాలం 70-75 రోజులు. దిగుబడి 5-6 క్వి/ఎకరం.
జిబిజి-1: అన్ని కాలాలకు అనువైన పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. కాయలపై నూగు ఉంటుంది. పంట కాలం 70-75 రోజులు. దిగుబడి 5-6 క్వి/ఎకరం. నేల తయారీ: యాసంగి పంట తీసేసిన తరువాత కలుపు మొక్కలు, పంట అవశేషాలు లేకుండా నేల విత్తుటకు సిద్ధం చేయాలి. భూమిని 2-3 సార్లు బాగా దున్ని, 2 సార్లు గుంటక తోలి, చదును చేయాలి. వీలైతే ఒక నీటి తడి ఇచ్చి కూడా విత్తనాన్ని విత్తుకోవచ్చు.
విత్తనం/విత్తే పద్ధతి: ఎకరాకు 6-8 కిలోల విత్తనం అవసర ముంటుంది. గొర్రుతో సాళ్ళ మధ్య 22.5-25 సెం.మీ. (9-10 అంగుళాలు), మొక్కల మధ్య 10 సెం.మీ. (4 అంగుళాలు) ఉండేలా వరుసల్లో విత్తుకోవాలి. విత్తే సమయం: వేసవిలో సాగుచేయడానికి ఫిబ్రవరి నుండి మార్చి మొదటి పక్షం వరకు పెసర, మినుము పంటలు విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తినప్పుడు పూత, కాయ థల్లో ఉష్ణోగ్రత పూత రాలటం, గింజ కట్టడం వంటి సమస్యల దిగుబడి తగ్గే ప్రమాదముంది. 19
కలుపు యాజమాన్యం: విత్తిన 25 రోజుల వరకు పైరులో కలుపు లేకుండా చూసుకోవాలి.
అంతరకృషి: విత్తనం ఎద బెట్టిన పంటల్లో సాళ్ళ మధ్య గొర్రుతో కాని, గుంటకతోగాని 20-25 రోజుల సమయంలో అంతరకృషి చేసుకున్నట్లయితే కలుపు నివారించబడి పంట ఏపుగా పెరుగుతుంది. అదే విధంగా బెట్ట పరిస్థితుల నుంచి పంటను కొంతవరకు కాపాడుకోవచ్చు.
కసనబోయిన క్రిష్ణ, పిహెచ్.డి. స్కాలర్,
ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము, రాజేంద్రనగర్, హైదరాబాద్.
జి. పరిమళ, బాదవత్ కిషోర్, పిహెచ్.డి. స్కాలర్,
బిధాన్ చంద్ర కృషి విద్యాలయం, మోహన్పూర్, వెస్ట్ బెంగాల్;
నందిగాం స్వాతిరేఖ, పిహెచ్.డి. స్కాలర్,
ఆచార్య ఎన్.జి. రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్
పంటల సాగులో విత్తనాలది ప్రముఖ పాత్ర అనే విషయం అందరికీ తెలిసిందే. పంటల సాగుకు సంబంధించి మిగతా అన్ని అంశాలు సక్రమంగా ఉండి విత్తనాలు నాణ్యమయినవి ఉపయోగించకుంటే ఫలితాలు సక్రమంగా రావు. భూమిలో ఉండే పోషకాలను గ్రహించే శక్తి ఆ విత్తనాలకు ఉండాలి. సహజంగా ప్రకృతి సిద్ధంగా పెరిగిన విత్తనాలకు ఆ శక్తి ఉంటుంది కాబట్టి రోడ్ల వెంబడి, పొలం గట్ల మీద, పొలంలో మొలిచే కలుపు మొక్కలు, కొండలమీద, అడవులలో పెరిగే మొక్కలు… ఇలాంటివి అన్నీ పరిశీలిస్తే…. ఇవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి పోషక లోపం లేకుండా, ఎలాంటి చీడపీడలు ఆశించకుండా వాటి పరిధిలో అవి పెరుగుతూ తగినంత దిగుబడిని లేదా ఫలసాయాన్ని అందిస్తుంటాయి. కాని మనం రైతు స్థాయిలో వేసే విత్తనాలకి మాత్రం బయట నుంచి అన్నీ అందించవలసిన పరిస్థితులు ఎందుకు నెలకొంటున్నాయి అని రాజు ఆలోచించసాగాడు.
ఇందుకు ప్రధాన కారణం ఏమిటి? రైతులు మొదటి నుండి ఈ సమస్యలు ఎదుర్కొన్నారా? లేక ఇటీవలే ఈ పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందా? అనే విషయాలు అధ్యయనం చేస్తే.. వ్యవసాయంలో రసాయనాలు, అధిక దిగుబడిని ఇచ్చు వంగడాలు ప్రవేశపెట్టకమునుపు చాలావరకు విత్తనాలు రైతుస్థాయిలో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలోనే రైతుల ద్వారా చేతులు మారుతుండేవి. అప్పుడు అందుబాటులో ఉన్న విత్తనాలు అన్నీ నాటురకాలే. అవి చీడపీడలను తట్టుకుంటూ, వాటి పరిధిలో అవి దిగుబడులను ఇస్తూ ఉండేవి. కానీ పెరుగుతున్న ప్రజల ఆహార అవసరాలను తీర్చే లక్ష్యంతో అధిక దిగుబడిని ఇచ్చు వంగడాలను అభివృద్ధి చేసి వాటిని ఉపయోగించటం మొదలయ్యింది. అధిక దిగుబడిని ఇచ్చు వంగడాలను సాగు చేసినట్లయితే అందుకు అవసరమైన పోషకాలను కూడా అందించగలిగినపుడే సరైన దిగుబడి వచ్చేది. లేనట్లయితే సరైన దిగుబడి వచ్చేది కాదు. ఆవిధంగా విత్తనాల స్వచ్ఛతను కోల్పోయాము కాబట్టే రైతులు తమ సాగుని లాభాల బాటలో నడిపించలేకపోతున్నారు.
పంటలసాగు లాభాల బాటలో నడిపించాలంటే రసాయనాలను దూరం పెట్టడముతో పాటు విత్తనాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించి సూటి రకాలు లేదా నాటు రకాలు ఉపయోగించగలిగితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని నిపుణులు, అధికారులు, అనుభవజ్ఞులు ప్రచారం చేస్తుండగా రైతులు నెమ్మదినెమ్మదిగా నాటు విత్తనాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇదే కోవకు చెందుతారు నాగర్కర్నూలు జిల్లా, గుమ్మకొండకు చెందిన బైరిపాగ రాజు.రాజుది వ్యవసాయ నేపథ్యం. తోటి రైతుల లాగానే రాజు కూడా తన పంటల సాగులో వివిధ రకాల హైబ్రిడ్ విత్తనాలను, రసాయనాలను వినియోగిస్తూ తన వ్యవసాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండడం లేదు, పంటల సాగులో పెట్టుబడులు పెరిగి కొన్నిసార్లు నష్టాలను చవిచూడవలసి వస్తుంది. నష్టాల సాగుని కొనసాగించలేక పరిష్కార మార్గాలవైపు ఆలోచిస్తుండగా ప్రకృతి వ్యవసాయం గురించి తెలిసింది. అదే సమయంలో అంటే 2014 వ సంవత్సరం సుభాష్ పాలేకర్ ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ సదస్సుకు హాజరయ్యి అక్కడ తెలుసుకున్న విషయాలతో తన రసాయనిక సేద్యాన్ని ప్రకృతి సేద్య విధానంలోకి మార్చాలని నిర్ణయం తీసుకుని అటువైపు అడుగులు వేసి 2014వ సంవత్సరం నుండి తన సాగులో రసాయనాలు ఆపివేసి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించడం మొదలు పెట్టారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో ప్రధానమయినవి నాటు విత్తనాలు మరియు ఆవు వ్యర్థాలు కాబట్టి వీటిని తప్పకుండా ఉపయోగిస్తూ వస్తున్నారు.మొత్తం 8 ఎకరాలలో వివిధ రకాల పంటలు ప్రకృతిసేద్య విధానంలో సాగు చేస్తూ వస్తున్నారు.
ఇందుకుగాను ఒక దేశీయ ఆవును పోషిస్తూ వాటి వ్యర్థాలతో వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు తయారు చేసుకుంటూ తన సాగులో వినియోగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో నాటు విత్తనాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి కనుక తప్పనిసరిగా నాటు విత్తనాలు వినియోగిస్తున్నారు. నాటు విత్తనాలు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ నుంచి సేకరించి వివిధ రకాల కూరగాయలు, పురాతన వరి రకాలు, వేరుశనగ, కంది, పెసర, పుచ్చ మొదలగు పంటలు సాగు చేస్తూ తన పంట నుంచి విత్తనాలను సేకరించి తోటి రైతులకు అందిస్తూ వస్తున్నారు. 2021వ సంవత్సరం రబీలో వేరుశనగ, పుచ్చ, టమాట మొదలగు పంటలు సాగు చేశారు. టమాట:
448 రకం విత్తనాలకు సంబంధించిన 25 రోజులు పెరిగిన నారుని నాటించారు. దుక్కిలో ఘనజీవామృతంతో పాటు పశువుల ఎరువు అందించారు. మొక్క నాటిన రోజు నుంచి క్రమం తప్పకుండా జీవామృతాన్ని భూమికి అందిస్తూ రావడంతో పాటు అవసరాన్ని బట్టి అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, థపర్ణి కషాయం, పుల్లటి మజ్జిగ, ఫిష్ ఎమినో యాసిడ్, ఉపయోగిస్తూ వస్తూ ఆరోగ్యకరమైన దిగుబడి పొందుతూ వచ్చిన దిగుబడిని సొంతంగా మార్కెట్ చేసుకుంటూ మంచి ఆదాయం గడిస్తున్నారు. పుచ్చ:
ఒక ఎకరంలో పుచ్చ పంటను సాగు చేశారు. ఇందుకుగాను నల్ల రకం నాటు విత్తనాలను ఎంపిక చేసుకుని విత్తనాలను బీజామృతంతో విత్తనశుద్ధి చేసుకుని ఉపయోగించారు. ఎకరానికి 500 గ్రాముల విత్తనం అవసరం పడింది. దుక్కిలో ఘనజీవామృతంతో పాటు, పశువుల ఎరువు కూడా అందించారు. క్రమం తప్పకుండా జీవామృతాన్ని భూమికి అందించడంతో పాటు అవసరాన్ని బట్టి అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, పేడ+ఇంగువ ద్రావణం, సివిఆర్ గారి మట్టి ద్రావణం పంటపై పిచికారీ చేస్తూ వచ్చారు. ఎకరానికి సుమారు 20,000/- వరకు ఖర్చు చేశారు. 15 టన్నుల వరకు దిగుబడి తీసి టన్ను 10000/-లకు అమ్మకం చేశారు. కొన్ని కాయల నుంచి విత్తనాలను సేకరించి తరువాత తన సాగుకి ఉపయోగించడానికి, తోటి రైతులకు అందించాలనుకుంటున్నారు. వేరుశనగ:
మూడు ఎకరాలలో వేరుశనగను సాగు చేశారు. ఇందుకుగాను కదిరి లేపాక్షి 1812 రకం సొంత విత్తనాన్ని వినియోగించారు. ఎకరానికి 60 కిలోల విత్తనం అవసరం పడింది. విత్తనం నాటిన తరువాత ప్రతి 15 రోజులకు స్ప్రింక్లర్స్ సహాయంతో నీటిని అందిస్తూ జీవామృతాన్ని పొలంపై చల్లించారు. ఈ విధంగా 5 సార్లు అంటే పంట కాలంలో ఎకరానికి 1000 లీటర్ల జీవామృతాన్ని భూమికి అందించారు. విత్తనం నాటిన 25-30 రోజుల మధ్యలో కూలీల సహాయంతో కలుపును నివారించారు. అవసరమయితే ఎద్దులతో కూడా అంతరకృషి చేస్తూ ఉంటారు. అవసరాన్ని బట్టి ఫిష్ ఎమినోయాసిడ్, పుల్లటి మజ్జిగ, నూనెలను పంటపై పిచికారి చేస్తూ చీడపీడలను నివారించారు. తన వేరుశనగ సాగు అనుభవంలో ఎకరానికి 12 క్వింటాళ్ళు కాయలు అధిక దిగుబడి పొందారు. చుట్టు ప్రక్క రసాయన పద్ధతులు పాటించే రైతులకంటే 2 లేదా 3 క్వింటాళ్ళు కాయలు అధికంగా పొందుతున్నారు. వేరుశనగ కాయలను అదేవిధంగా అమ్మకుండా విత్తనాలను తీసి తోటి రైతులకు విత్తనాల కొరకు మంచి ధరకు అమ్ముతుంటారు. అడవి పందుల నుంచి పంటను రక్షించడం:
వేరుశనగ పంటకు అడవి పందుల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పొలం చుట్టూ చీరలు కట్టి లేదా వివిధ రకాల శబ్దాలు చేసే మైకు ఏర్పాటు చేసి తన వేరుశనగ పంటని అడవి పందుల బారి నుంచి రక్షించుకుంటున్నారు.కంది, బీర, సొర, 5 రకాల వంగ, పురాతన వరి రకాలు, పుచ్చ, వేరుశనగ మొదలగు విత్తనాలను సొంతంగా ఉపయోగించుకుంటూ తోటి రైతులకు మంచి ధరకు అమ్ముతూ తన సాగుని లాభాల బాటలో నడిపిస్తున్నారు.
మరిన్ని వివరాలకు బైరిపాగ రాజును 81868 86807 ఫోన్ నెంబర్లో సంప్రదించగలరు.
అనాదిగా మన ప్రధాన వృత్తి వ్యవసాయం. ఎప్పటి నుంచో మన రైతులు వివిధ రకాల పంటలు పండిస్తూ ప్రజల ఆకలిని తీరుస్తూ తమ సాగుని కొనసాగిస్తూ వస్తున్నారు. వివిధ రకాల పద్ధతులు పాటిస్తూ రెక్కలు ముక్కలు చేసుకుంటూ స్వేదం చిందించి సేద్యం చేస్తూ అందరి ఆకలిని తీర్చుతున్నారు గాని తమ ఆకలిని సక్రమంగా తీర్చుకోలేకపోతున్నారు. ఎక్కువమంది రైతులు పంటల సాగులో నష్టాలను చవిచూస్తున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతూ పెళ్ళాం పుస్తెలను తెగనమ్ముతూ సాగుని కొనసాగిస్తున్నారు. అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మన ఆకలిని తీర్చే అన్నదాతలు లోకాన్ని విడిచి, కుటుంబ సభ్యులను అనాధలను చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితులకు కారణాలు ఏమిటి? రైతుల సమస్యలకు పరిష్కారాలు దొరకవా? అని ఆలోచించి ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాలు కావాలంటే వ్యవసాయంలో మెరుగయిన పద్ధతుల గురించి కక్షుణ్ణంగా అధ్యయనం చేసి పరీక్షించి క్షేత్రస్థాయిలో విజయం సాధించే అంశాలను రైతు లోగిళ్ళకు చేర్చగలగాలి. ఆవిధంగా చేసినపుడే మన రైతు మనుగడ సాగించగలడు. లేనట్లయితే మన భవిష్యత్తు అంధకారమే అనే విషయం అక్షర సత్యం. ఈ విషయాన్ని గ్రహించి రైతుబిడ్డగా తనవంతు బాధ్యత నిర్వర్తించాలనే తలంపుతో మెరుగయిన వ్యవసాయ పద్ధతుల పరిశోధనలో ముందుకు సాగుతున్నారు మన రైతునేస్తం జిట్టా బాల్రెడ్డి.
బాల్రెడ్డిది వ్యవసాయ నేపథ్యం. పరిస్థితుల ప్రభావం మరియు వివిధ రకాల కారణాల వలన బాల్రెడ్డి జీవితం అనేక మలుపులు తిరిగి ప్రస్తుతానికి వ్యవసాయ పరిశోధనలో స్థిరపడింది. యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరిలోని ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి తన పరిశోధనలకు వేదిక అయ్యింది. ఈ క్షేత్రానికి అమేయ కృషి వికాస కేంద్రం అని నామకరణం చేసి, అనేక ప్రయోగాలకు వేదిక చేసుకుని వివిధ రకాల పంటలు పండిస్తూ వస్తున్నారు. ఈ యజ్ఞంలో తన అర్ధాంగి జ్యోతిరెడ్డిని కూడా భాగస్వామిని చేసి మహిళలు తలుచుకుంటే ఏమైనా సాధించవచ్చు, మనం ఏరంగంలో ఉన్నా కూడా కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి అని తెలియచెబుతున్నారు. మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయంలో అదీను సేంద్రియ వ్యవసాయంలో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి. కుటుంబ సభ్యుల సహకారం లేనిదే సేంద్రియ వ్యవసాయం ముందుకు సాగదని బాల్రెడ్డి వివరించారు.
ప్రస్తుతం మన రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పెట్టుబడులు పెరగడం. పెట్టుబడులు పెరగటానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు వ్యవసాయం చేసే ప్రతి రైతూ పాడి పశువులను పోషిస్తూ పాడి ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతూ పశువ్యర్థాలను పంటలకు అందిస్తూ నాణ్యమైన దిగుబడి పొందుతూ ఉండేవారు. కాని రాను రాను వివిధ రకాల కారణాలు, వ్యవసాయంలో రసాయనాలు ప్రవేశపెట్టడం వలన రైతులు పాడిపశువులకు దూరం జరిగి పూర్తిగా రసాయనాలమీదనే ఆధారపడి పంటలు సాగు చేయటానికి అలవాటు పడ్డారు. విచక్షణా రహితంగా రసాయనాలు ఉపయోగించడం వలన పంటలపై చీడపీడల ప్రభావం పెరిగింది. వీటి నివారణకు తిరిగి రసాయన పురుగు మందులు లాంటి వాటి కోసం మరలా ఖర్చు చేయవలసి వస్తుంది. ఈ విధంగా పంటల సాగు ఖర్చు ఏఏటికాయేడు పెరుగుతూ వస్తుంది. దీనికి పరిష్కారం రైతులు రసాయనాలకు దూరం జరిగి తిరిగి పశుపోషణ చేపట్టి పశువ్యర్థాలను మరియు వివిధ రకాల సేంద్రియ పద్ధతులను ఉపయోగిస్తూ పంటల సాగు కొనసాగించడమే కాబట్టి బాల్రెడ్డి ఆ దారిలో నడుస్తూ గత 10 సంవత్సరాలకు పైగా ఈ క్షేత్రంలో ఏ విధమైన రసాయనాలు వినియోగించకుండా పూర్తి ప్రాకృతిక వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ పంటల సాగు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇందుకుగాను పాడి పశువులను కూడా పోషిస్తూ వాటి వ్యర్థాలను తన పంటల సాగులో వినియోగిస్తూ వస్తున్నారు. ఈ పద్ధతిలో రసాయనాలకు దూరం జరగడం జరిగింది కానీ పశువుల ఎరువు మరియు జీవామృతం లాంటి వాటిని మొక్కలకు అందించాలంటే కూలీలపై ఆధారపడవలసి వస్తుంది. కూలీ రేట్లు పెరగటంతో పాటు కొంతమంది కూలీలు గోవు వ్యర్థాలతో తయారు చేసిన జీవామృతం లాంటి వాటి వాసన భరించలేక పనికి దూరంగా ఉంటున్నారు. దానికి పరిష్కారంగా మానవ వనరుల వినియోగం లేకుండా జీవామృతం లేక ద్రవ సేంద్రియ ఎరువులను భూమికి అందించటానికి సులువైన పద్ధతిని పరిశోధించి అమలు పరుస్తున్నారు. ఈ పద్ధతి వలన ఒక దెబ్బకు మూడు పిట్టలు అన్నట్లు కూలీల ఖర్చు తగ్గడముతో పాటు, కూలీల అవసరం లేకుండా చేయడం మరియు ఎరువుల యొక్క వృథాని తగ్గించడం జరిగి మొక్కలు ఆరోగ్యంగా పెరగడం బాల్రెడ్డి అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఈ పద్ధతికిగాను వారు 12000 లీటర్ల సామర్ధ్యం గల కుంటను తవ్వించి ఆ కుంటలో నీరు ఇంకకుండా నల్లరంగు ప్లాస్టిక్ పట్టాను పరచారు. ఆవు మూత్రం, ఆవుల పాక కడిగిన నీటిని ఒక పంపు సహాయంతో ఈ కుంటలోకి వచ్చేలా ఏర్పాటు చేసుకుని అందులో నీటిని, పేడను మరియు ఇతర పదార్థాలను కలిపి పంటలకు అందిస్తుంటారు. పంటలకు అందించటానికి కూడా మానవ వనరుల వినియోగం లేకుండా మాములుగా పంటలకు నీటిని అందించే పైపుకి అనుసంధానం అయ్యి జీవామృతం మరియు నీరు కలిసి వెళ్ళేలా ఏర్పాట్లు చేసుకున్నారు. (ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు బాక్స్ చూడగలరు), మానవ వనరులతో పాటు ప్రస్తుతం రైతులు ఉపయోగించే రసాయనిక పురుగు మందులు కూడా సాగు పెట్టుబడులను పెంచుతున్నాయి. విచక్షణా రహితంగా రసాయనాలు ఉపయోగించడంతో పాటు సారం లేని నేలలో పెరిగిన మొక్కలో రోగనిరోధక శక్తి లోపించడం వలన పంటలపై చీడపీడల ప్రభావం పెరిగి రసాయనాలు ఉపయోగించే కొలది చీడపీడలు నిరోధక శక్తిని పెంచుకుని ఎంత ఖర్చు పెట్టి రసాయనాలు ఉపయోగించినా కూడా చీడపీడలు నివారించలేకపోవడం లాంటి పరిస్థితులు రైతులకు ఎదురవుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా ఇటీవల మిరప రైతులు ఎదుర్కొన్న నల్ల తామర పురుగు. మిరప రైతులను నల్ల తామర పురుగు విపరీతంగా ఇబ్బందులకు గురి చేసింది. కొంతమంది రైతులు వీటిని నివారించలేక పంటను వదలి వేసుకున్నారు. ఇలాంటి సమస్యలకు హోమియో మందులు పనిచేస్తాయి అని గ్రహించి తాను సాగు చేసే పంటలపై హోమియో మందులు పరీక్షించి విజయం సాధించిన తరువాత తోటి రైతులకు తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం అనేకమంది మిరపతో పాటు ఇతర పంటల సాగు చేసే రైతులు బాల్రెడ్డి సలహాల మేరకు హోమియోమందులు ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతో తమ పంటలను చీడపీడల నుండి రక్షించుకున్నారు అని బాల్రెడ్డి వివరించారు. ఈ హోమియో మందులు రైతులు ఎవరికి వారు వారికి అందుబాటులో ఉన్న హోమియో దుకాణాల నుంచి నాణ్యమైనవి కొనుగోలు చేసుకుని ఉపయోగించవచ్చు. కాని మోతాదు మాత్రం తప్పనిసరిగా పరిమితులకు లోబడే వినియోగించాలి. మోతాదు పెంచినట్లయితే పంట నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి హోమియో మందుల వివరాలు మరియు మోతాదు వివరాలు ఆయనను సంప్రదించి నిర్ధారించుకోవాలని బాల్రెడ్డి రైతులను కోరుతున్నారు
రైతులు పెట్టుబడులు తగ్గించడంతో పాటు సంవత్సరం పొడవునా పంట దిగుబడులు అందుబాటులో ఉన్నట్లయితే రైతులకు ఆదాయం పెరుగుతందని గ్రహించారు బాల్రెడ్డి. అటువైపు ఆలోచించి పండ్ల మొక్కలను ఉదాహరణగా తీసుకుంటే మామిడి, బత్తాయి లాంటి పండ్లు సంవత్సరములో కొన్ని నెలలు మాత్రమే పంట దిగుబడి వచ్చే రకాలు ప్రస్తుత మన రైతులు సాగు చేస్తున్నారు. దానికి పరిష్కారంగా వియత్నాం, మలేషియా, ఫిలిప్పెయిన్స్ మొదలగు దేశాలలో అందుబాటులో ఉండే పండ్ల మొక్కలు సంవత్సరం పొడవునా పంట దిగుబడిని ఇచ్చే వాటిని ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తెప్పించి తమ పరిశోధనా క్షేత్రంలో పరిశీలిస్తున్నారు. పరిశోధించి అన్ని అంశాలు అనగా దిగుబడి, రుచి, నేల అనుకూలత, చీడపీడలను తట్టుకునే గుణం లాంటి వాటిని ప్రత్యక్షంగా తమ క్షేత్రంలో పరిశీలించి అన్నీ అనుకూలంగా ఉంటేనే రైతులకు అందచేస్తూ ఏ అంశంలోనైనా తనకు నమ్మకం కుదరకపోతే ఆ రకాన్ని తన క్షేత్రానికే పరిమితం చేస్తూ రైతులకు చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని బాల్రెడ్డి వివరించారు. కుటుంబ సభ్యుల సహకారంతో పంటలసాగు, పశుపోషణని కొనసాగిస్తూ మెరుగయిన వ్యవసాయ పద్ధతుల పరిశోధనలో చిత్తశుద్ధితో బాల్రెడ్డి కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరిన్ని వివరాలు 8978221966 కి ఫోను చేసి తెలుసుకోగలరు. ఖర్చు లేకుండా జీవామృతాన్ని పంటలకు అందించే పద్ధతి
ప్రకృతి వ్యవసాయంలో మన దేశీయ గోవులు, ఆగోవుల వ్యర్థాలతో తయారు చేసుకొనే జీవామృతం లాంటివి ప్రముఖపాత్రను పోషిస్తున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ జీవామృతంలో పిండి, ఆవుపేడ మొదలగునవి కలుపుతారు, కాబట్టి వడకట్టడం ఇబ్బందులతో కూడుకుని ఉంది. కాబట్టి జీవామృతాన్ని పంటలకు అందించాలంటే రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది రైతులు కూలీల సహాయంతో మొక్కల పాదులలో పోయిస్తున్నారు. కాలువల ద్వారా నీటిని అందించే రైతులుకు పెద్దగా ఇబ్బంది ఉండదు కాని రెయిన్గన్, స్ప్రింక్లర్స్, డ్రిప్పు ద్వారా పంటలకు నీటిని అందించే రైతులు జీవామృతం మొక్కలకు అందించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి రైతులు మరియు తన సౌకర్యార్థం బాల్రెడ్డి ఒక పద్ధతిని అమలు పరుస్తున్నారు. తాను కూడా పంటలకు నీరు అందించటానికి డ్రిప్పు వ్యవస్థని ఉపయోగిస్తున్నారు కాబట్టి కొత్త పద్ధతి గురించి శోధించి ఏలాంటి ఇబ్బంది లేకుండా జీవామృతం పంటలకు అందేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకుగాను సుమారు 6 అడుగుల లోతులో 12000 లీటర్ల సామర్థ్యం గల చిన్న కుంటను తవ్వించి ఆ కుంటలో అడుగు భాగాన నీరు ఇంకకుండా ప్లాస్టిక్ షీట్ పరిచారు. మాములుగానే బాల్రెడ్డి పంటలకు నీటిని అందించడానికి ఫారమ్ పాండు తవ్వుకున్నారు. ఈ ప్రాతంలో నీటి లభ్యత సక్రమంగా ఉండదు కాబట్టి బోరు నుంచి నేరుగా డ్రిప్పుద్వారా పంటకు అందించడంలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఫారమ్పాండు తవ్వించి అందులో ప్లాసిక్ షీటు పరచి బోర్ల నుండి ఫారమ్ పాండ్లోకి నీటిని నింపి ఫారమ్ పాండులోని నీటిని మోటారు సహాయంతో పంటలకు డ్రిప్పు ద్వారా పంపిస్తుంటారు. జీవామృతం టాంకులో అందుకు అవసరమయిన పదార్థాలను కలిపి జీవామృతం తయారు చేసుకుంటారు. ఈ జీవామృతం ఫిల్టరు అవటానికి వీలుగా 4 లేదా 5 వరుసల నైలాన్ మెష్ను ఫుట్వాల్కి చుట్టి ఆ ఫుట్వాల్ని జీవామృతం టాంకులో వదులుతారు. ఈ ఫుట్వాల్ జీవామృతం ట్యాంకులో అడుగువరకు వెళ్ళకుండా ఎంతలోతులో ఫుట్వాల్ ఉండాలో అంత పొడవు తాడు కట్టి ఆ తాడు చివర రెండు ప్లాసిటక్ డబ్బాలను కట్టి ఫుట్వాల్ని జీవామృతం ట్యాంకులో వదులుతారు. ఆ ఫుట్వాల్కి కట్టిన ప్లాస్టిక్ డబ్బాలు జీవామృతం ట్యాంకులో పైన తేలుతూ ఫుట్ వాల్ను అడుగు వరకు చేరకుండా ఆపుతాయి కాబట్టి అడుగున పేరుకున్న మడ్డి (దీనిని తరువాత మొక్కల పాదులలో లేదా నేలకు అందిస్తుంటారు) అలానే ఉంటూ పైన ఉన్న జీవామృతం మాత్రమే ఫుట్వాల్కి అమర్చిన పైపు ద్వారా పంటలకు నీరు అందించే ట్యాంకులో అమర్చబడిన పైపుకు అనుసంధానం చేయబడుతుంది. ఈ మధ్యలో ఒక వాల్ని కూడా అమర్చి అవసరము లేకుంటే వాల్ని మూసివేస్తే జీవామృతం వెళ్ళకుండా కేవలం నీరు మాత్రమే వెళ్ళేలా ఏర్పాట్లు చేసుకున్నారు. పంటకు నీటిని అందించే సమయంలో నీటితో కలిసి పీడనశక్తి ద్వారా జీవామృతం కూడా వెళుతుంది కాబట్టి జీవామృతం యొక్క వినియోగ శక్తి మెరుగవడంతో పంటలకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి పంటలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. జీవామృతంతో పాటు కోడి ఎరువు మరియు ఏవిధమైన సేంద్రియ లేదా ప్రకృతిసిద్ధమైన ఎరువులను మనుషుల సహాయం అవసరం లేకుండా ఈ పద్ధతి ద్వారా పంటలకు పంపించడం వలన ఖర్చు తగ్గిస్తున్నాయని, ఈ పద్ధతిని చాలామంది రైతులు అనుసరిస్తూ తమ సాగు ఖర్చు తగ్గించుకుంటున్నారని బాల్రెడ్డి వివరించారు.
చిటుకు వ్యాధి బాగా మేసి బలిష్టంగా ఉన్న గొర్రెల్లో, మేకల్లో వస్తుంది. క్లాస్ట్రీడియం పెర్ఫ్రింజెన్స్(టైప్-డి) అనబడే సూక్ష్మజీవులు ఆరోగ్యంగా ఉన్న జంతువుల పేగులలో చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. ఆహారంలో పిండి పదార్థాల శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సూక్ష్మజీవులు వృద్ధి చెంది విష పదార్థాలను విడుదల చేస్తాయి. అతిగా తినడం వల్ల వస్తుంది కాబట్టి దీనిని తినే వ్యాధి అంటారు. ఈ వ్యాధి సోకిన కొద్ది సమయంలోనే తీవ్రరూపం దాల్చడం వల్ల గొర్రెలు చిటికెలో మరణిస్తా యి. అందువల్ల దీనిని చిటుకు రోగంగా పిలుస్తారు. ఈ రోగం వస్తే జీవాలను రక్షించడం చాలా కష్టం. అందువలన గొర్రెల కాపలదారులు జాగ్రత్త వహించాలి.
వ్యాధి ఎలా వస్తుందంటే?:
గొర్రె లేదా మేక పిల్లలు చాలా ఎక్కువగా పాల ను తాగినప్పుడు, ఎక్కువగా దాణా మేసినప్పుడు, ఇతర వ్యాధులు సోకినప్పుడు, జీవాల్లో సహజ వ్యాధి నిరోధకశక్తి క్షీణించడం వల్ల, పరాన్నజీవులు జీవాల కడుపులో ఎక్కువగా ఉన్నప్పుడు, ఇతర ఏవైనా కారణాల వల్ల పేవుల కదలిక తగ్గినప్పుడు ఈ వ్యాధి ప్రబలుతుంది.
లక్షణాలు:
ఈ వ్యాధి సోకిన జీవాలు అకస్మాతుగా మేత మేయడం మానేస్తాయి. పొట్ట భాగాన్ని కాళ్లతో కొట్టుకోవడం, తరచు కిందికి పైకి లేవడం, పక్కలకి తిరిగి పడుకోవడం వంటివి చేస్తాయి.సూక్ష్మజీవులు విడుదల చేసిన విష ప్రభావం మెదడుపై ప్రభావం చూపడం వల్ల కాళ్లు చాపి తల మెడ భాగం వెనక్కి విరుచుకోవడం చేస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన కొద్ది నిమిషాల్లోనే జీవాలు చనిపోతాయి. సూక్ష్మజీవులు విడుదల చేసిన విషపదార్ధల వలన కొన్నిసార్లు, జీవాలు విడుదల చేసిన విషపదార్థాల వల్ల కొన్నిసార్లు జీవాల్లో పారుడు, విరేచనాల లక్షణాలు కనబడతాయి. వ్యాధితో మరణించిన గొర్రెలలో మూత్రపిండాలు లావుగా, మెత్తగా మారిపోతాయి. సూక్ష్మజీవుల విషపదార్ధాల వల్ల పేగులు నల్లగా మారిపోతాయి.
చికిత్స:
తీవ్రమైన థలో ఈ వ్యాధి చికిత్సకు నయం కాదు. గొర్రె లేదా మేక పిల్లలకు 5మి.లీ యాంటి టాక్సిన్ను చర్మం కింది పొరల్లో ఇవ్వాలి. తద్వారా మనం వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. వ్యాధి తీవ్రతను తక్కువగా ఉన్నప్పుడు పెన్సిలిన్ గొర్రె బరువును బట్టి ఇవ్వాలి. యాంటిసిడ్ యాంటి బ్లోట్ మందులను తాగించాలి. థయామిన్(బి1) విటమిన్ను కండకు ఇంజక్షన్ చేయాలి. విష పదార్థాల ప్రభావం తగ్గించడానికి కార్టికోస్టిరాయిడ్స్ రక్తము ద్వారా ఇవ్వాలి.
నివారణ చర్యలు:
జీవాలకు పిండి పదార్థాలు దాణా ఎక్కువ మోతాదులో పెట్టకూడదు.గొర్రె, మేక పిల్లలకు దాణాలో ఇచ్చే పెల్లెట్ల మోతాదును 3-4 బాగాలుగా విభచించి ఇవ్వాలి. ప్రతి సంవత్సరం పశు సంవర్ధక శాఖ వారు ఏప్రిల్, మే నెలలలో చిటుకు వ్యాది నివారణ టీకాలు పంపిణీ చేస్తుంది. ఈ టీకా మందుని మొదటిసారి ఆరు వారాల పైబడిన పిల్లలన్నింటికి ఇచ్చి ఆ తర్వాత మూడు వారాల లోపు రెండవ డోస్ ఇప్పించాలి.అంతే కాకుండా ప్రతి సంవత్సరం ఈ టీకాలును క్రమం తప్పకుండా చేయించాలి.గర్భంతో ఉన్న జీవాలకు ఈనటానికి 2-3వారాల ముందు ఈ టీకా మందు ఇస్తే పుట్టే పిల్లలకు 8 వారాల వరకు ఈ వ్యాధినుంచి రక్షణ కలుగుతుంది. డా. జి. రాంబాబు, పశు వైధ్యాధికారి, కడప. ఫోన్: 9618499184
రామచంద్రయ్య హర్యానా నుండి లారీలలో దిగుమతి చేసుకున్న ఎనిమిది గేదెలలో రెండు మార్గమధ్యంలోనే గర్భస్రావాలకు గురికాగా, మిగిలిన వాటి నుంచి క్షీణించిన పాల ఉత్పత్తి పునరుద్ధరించడానికి ఎంతో సమయం, శ్రమ, ఖర్చు చేయవలసి వచ్చింది. వెంకట్రామయ్య పాడి గేదె దూడ చనిపోయిందనే దిగులుతో పాలివ్వడం మాని వేసింది. యజమాని చనిపోయిన వారం రోజులకే దిగులుతో సుబ్బారావుగారి పెంపుడు కుక్క కూడా చనిపోయింది. అదేవిధంగా మావటి చనిపోయినందున ఒక దేవాలయ ఏనుగు కూడా మరణించింది. మరోచోట మావటి యొక్క క్రూరత్వాన్ని, నిర్దయ, నిర్లక్ష్యాలను భరించలేక ఒక ఏనుగు నగరమంతా బీభత్సం సృష్టించింది. ఇటువంటి ఎన్నో దురదృష్టకర సంఘటనలకు మూగజీవాలు భరించలేని మానసిక, శారీరక వత్తిళ్లే కారణమని మనమంతా తెలుసుకోవాలి. ఈ వత్తిళ్లకు కారణాలను సకాలంలో గుర్తించి వాటిని తొలగించటం లేదా ప్రత్యామ్నాయ ఉపశమన మార్గాలను పాటించకపోతే తీవ్రమైన కష్టనష్టాలను యజమానులు ఎదుర్కోవలసి ఉంటుంది.
శరీరం తాను సహజంగా భరించగలిగిన అసౌకర్యానికి, ఇబ్బందులకు, ఆకలి, దాహాలకు ప్రయాణాలకు, నడక, వాతావరణ – యాజమాన్య – వసతి నిర్వహణాలోపాల బాధలకు గురైనప్పుడు అవి మానసికంగా, భౌతికంగా, హార్మోన్ల పరంగా ఎదుర్కొనే మార్పుల వల్ల కలిగే ఎదురయ్యే సమస్యల సముదాయమే వత్తిడి! లైంగిక సుఖానికి దూరమైన జంతువులలో కూడా వత్తిడి లక్షణాలను ప్రదర్శించడం ఏనుగులు, ఆంబోతులలో ఎక్కువగా గమనించవచ్చు. సహజ లేదా కృత్రిమ సంపర్కాలకు ముందు ఆ తర్వాత ఎక్కువ నడక వల్ల జరిగే వత్తిడి వల్ల కూడా గర్భాలు నిలిచే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. దాదాపు అన్ని రకాల ఆరోగ్య సమస్యల వల్ల కూడా జంతువులపై వత్తిడి పెరుగుతుంది. వత్తిడి లక్షణాలు:
ఉత్పత్తి క్షీణించడం, ఆయాసం, వగర్పు, మూలుగుట, గురక, భయం, వణుకుట, ఇతర పశువులు – మనుషుల నుండి దూరంగా వెళ్ళిపోవుట, సహజమైన విధేయత అణకువలు క్షీణించటం, దాడి చేయటం వంటి అనేక లక్షణాలను వత్తిళ్ళకు గురైన జంతువులు ప్రదర్శిస్తాయి. ప్రతికూలతలను తట్టుకోలేని పరిస్థితులలో మెదడులోని హైపోథలామస్, మరియు పిట్యుటరీ గ్రంథుల వల్ల ప్రేరణ పొందిన థైరాయిడ్ మరియు అడ్రినల్ గ్రంథులు విడుదల చేసే థైరాక్సిన్ మరియూ కార్టికోస్టెరాయిడ్స్ ప్రభావంతోనే వివిధ వత్తిడి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో పాలు కుడవటం మానని దూడల వల్ల కలిగే మాతృత్వ స్పందనలకు కారణమయ్యే ప్రొలాక్టిన్ అనే హార్మోనువల్ల కూడా ఎదకు రావటం ఆలస్యం కావచ్చు. గేదెలలో చెమట గ్రంథులు చాలా తక్కువగా ఉండటం, వాటి నల్లని చర్మం వాతావరణ వేడిని ఎక్కువగా గ్రహించటం వల్ల అవి త్వరగా వడగాడ్పులకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. వాతావరణ తాపం పెరిగినప్పుడు శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచే హైపోథలామస్ గ్రంథి కూడా తన నియంత్రణ శక్తిని కోల్పోవుట వల్ల పశువు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉండవచ్చు. వత్తిడి సమయంలో శరీరంలో విడుదలయ్యే కొన్ని స్రావాలను గుర్తించుట ద్వారా వత్తిడి స్థాయిల్ని గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. జంతువులలో వత్తిడిని తగ్గించే మార్గాలు
* జంతువుల పట్ల ప్రేమ ఆదర-అభిమానాలను పెంచుకుని వాటి మానసిక, శారీరక ఆహార, లైంగిక అవసరాలను సకాలంలో తీర్చే ఏర్పాట్లు చేయాలి.
* పోషకాహార అవసరాలను తీర్చే విధంగా నాణ్యమైన పుష్టివంతమైన శాస్త్రీయ మేతల్ని అందించాలి. ఎల్లప్పుడూ చల్లని త్రాగునీటిని సమృద్ధిగా అందుబాటులో ఉంచాలి.
* సంతతి నుండి సహ జంతువుల నుండి లభించవలసిన సామాజిక జీవనానికి అంతరాయాలు కలిగించరాదు.
* చల్లని, సుఖవంతమైన, శుభ్రమైన వసతిని వీలైతే చెట్ల నీడన, పచ్చని వాతావరణంలో ఏర్పాటు చేయాలి.
* శబ్దాలు, రణగొణ ధ్వనుల చికాకుకు వీలైనంత మేరకు నివారించాలి.* పొగలు, దుమ్ము, ధూళీలు, రసాయన కాలుష్యాలకు పశువుల్ని దూరంగా ఉంచాలి.
* విశ్రాంతికి, నిద్రకు రోజుకు కనీసం 5-6 గంటల విరామంతోపాటు, అవసరమైన నడక ఈత వంటి వ్యాయామ సదుపాయం కూడా ఉండాలి. సహజ సంపర్కం లేదా కృత్రిమ గర్భధారణలకు ముందు – ఆ తర్వాత పశువును ప్రశాంతంగా ఉంచి, కనీసం 15-20 నిముషాలు విశ్రాంతినివ్వాలి.
* పశువుల ప్రవర్తనను, ఉత్పత్తి స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తూ, వత్తిడి లక్షణాలను, వ్యాధుల్ని గుర్తించి సకాలంలో చికిత్సను అందించాలి. ఇందుకు వీలైతే నిరంతర పరిశీలన-పర్యవేక్షణలకు సి.సి. కెమేరాల వంటి సాంకేతిక ఏర్పాట్లు చేసుకోగల్గితే మంచిది.
* నిర్వాహకులను పదేపదే మార్చరాదు. వీలైతే ప్రత్యామ్నాయ నిర్వాహకుల్ని ముందు నుంచీ పశువులకు అలవాటు చేయగల్గితే మంచిది.
* విభిన్న వాతావరణ పరిస్థితులు కలిగిన ప్రాంతాల మధ్య పశువుల్ని రవాణా చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆకస్మిక తీవ్ర వాతావరణ వత్తిళ్లకు పశువులు గురికాకుండా జాగ్రత్తవహించాలి. ఉదాహరణకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఉత్తరాది ప్రాంతాల నుండి పశువుల్ని వేసవి రోజులలో కంటే చలికాలంలో మన తెలుగు రాష్ట్రాలలోకి దిగుమతి చేసుకుంటే మంచిది.
* ప్రకృతిసిద్ధమైన లైంగిక అవసరాలను గుర్తించి, సకాలంలో లైంగిక సంపర్క అవసరాలను తీర్చే ఏర్పాట్లు చేయాలి.
* తీవ్రమైన ఎండలు, గాడ్పులు, చలులు, ముసురు రోజులలో ఎంతో అవసరమైతే తప్ప టీకాలు వేయించటం, డివర్మింగ్ చేయించటం వంటి అదనపు వత్తిళ్ళు కలిగించే చర్యలు చేపట్టుట మంచిది కాదు.
* వైద్య అవసరాలకు వాడే మందుల వినియోగం విషయంలో కూడా శాస్త్రీయతను తప్పక పాటించాలి. అవసరానికి మించి వినియోగించే మందులు కూడా రోగుల మీద వత్తిడిని పెంచుతాయని తెలుసుకోవాలి. ప్రతి వ్యాధి చికిత్సలో విశ్రాంతి కూడా ఒక కీలక అంశమేఅని కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా పశువుల పట్ల ప్రేమ, ఆదరణ, కరుణతో వ్యవహరించటం ద్వారా వాటిలో వత్తిళ్ల ప్రభావాన్ని చాలా వరకు నివారించవచ్చు. డా. ఎం.వి.జి. అహోబలరావు, 9393055611
మామిడి సాగులో మన దేశంది అగ్రస్థానం, బంగారు వర్ణంలో నోరూరించే మామిడి రుచిలో మధురంగా, అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది, అందుకే మామిడిని ”ఫల రాజు” అని పిలుస్తారు. మన దేశం ఉత్పత్తిలో మొదటి స్థానములో ఉన్నప్పటికీ ఎగుమతిలో మాత్రం వెనకబడే ఉంది. దీనికి గల ప్రధాన కారణం పండు ఈగ ప్రభావం. మన తెలుగు రాష్ట్రాలలో కూడా విస్తారంగా సాగు అవుతున్న ముఖ్యమైన వాణిజ్య పంటలలో మామిడి ఒకటి. సుమారుగా 7.7 లక్షల ఎకరాలలో సాగు చేయబడి, ఏటా 25 నుండి 30 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. మన మామిడికి ఇతర దేశాలలో మంచి గిరాకీ ఉంది, కానీ పండు ఈగ ఆశించడం వల్ల మామిడి ఎగుమతి నిరాకరించబడుతుంది, అలాగే వివిధ దేశాల ప్రమాణాలను అందుకోలేకపోవడం మూలంగా ఆయా దేశాలు దిగుమతి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పండు ఈగ ద్వారా నష్టం మామిడి, జామ, సపోటా, అరటి, బొప్పాయి మరియు సీతాఫలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఈ పండు ఈగ ఆశించుట వలన కనీసముగా 25 శాతం, ఒకవేళ ఉదృతి ఎక్కువగా ఉన్నట్లైతే 100 శాతం వరకు నష్టం వాటిల్లుతుంది. ‘మేడి పండు చూడు మేలిమైయుండును పొట్ట విప్పి చూడు పురుగులుండు’ అనే నానుడి ఇప్పుడు మామిడికి కూడా వర్తిస్తుంది. ఈ పండు ఈగలు కాయ అభివృద్ధి చెందేటప్పుడు ఆశించి పక్వానికి వచ్చే వరకు ఈ నష్టం మనకి బయటికి ఏ మాత్రం కనబడదు, కాని తీరా పండ్లు కోసి చూస్తే అందులో తెల్లని పిల్ల పురుగులు గుజ్జును తింటూ ఉంటాయి. ఇలాంటి కాయల కొనుగోలుకు వ్యాపారులు, ఎగుమతిదార్లు ముందుకు రాక రైతులు నష్టపోతున్నారు.రైతు సంవత్సరం పొడువునా కష్టపడి మామిడి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎన్నో ఆశలతో ఎదురుచూసే సమయంలో పండు ఈగ ఆశించడం వలన రైతులు తీవ్ర నష్టానికి గురవుతున్నారు. రైతులు పండు ఈగ నుండి పంటను కాపాడుకోవడానికి విపరీతమైన రసాయనిక మందులు వాడుతున్నారు, దీని వలన పండ్ల పై పురుగు మందు అవశేషాలు ఎక్కువవుతున్నాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే రసాయనిక మందులు వాడినా ప్రయోజం ఏ మాత్రం ఉండదు, ఎందుకంటే తల్లి ఈగలు కాయ చర్మాన్ని గుచ్చి లోపల గుడ్లు పెట్టి అందులోనే పొదగబడి గుజ్జుని తింటాయి. ఇక కోశస్థ థ భూమి లోపల జరుగుతుంది. ఎక్కడా మనం ఈ పండు ఈగ నష్టాన్ని గుర్తించలేము, ఇలాంటప్పుడు రసాయనిక మందులు పిచికారీ చేసినా పండు లోపల ఉన్న లార్వాను చేరలేవు. ఈ పండు ఈగను ఏ రసాయన మందులు గాని సమర్ధవంతంగా నివారించలేవు. కావున ఈ పండు ఈగ రాకుండా ముందస్తుగానే ఎలాంటి చర్యలు సకాలంలో చేపట్టాలి మరియు రసాయనిక మందులకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి సమగ్ర యాజమాన్య పద్దతులు అనుసరించాలి లేదా ఇంకా ఇతర నూతన సాంకేతిక పరిజ్ఞానాలు ఏమైనా ఉన్నాయా అని రైతులు ఈ కోణంలో ఒక్కసారి ఆలోచిస్తే మంచి నాణ్యమైన దిగుబడులు సాధించగలరు. ఇప్పుడు పండు ఈగ నష్టపరుచు విధానము మరియు సమగ్ర సస్య రక్షణ చర్యలు మరియు అధునాతన పద్ధతులు ఏం ఉన్నాయో తెలుసుకుందాం.
పండు ఈగ రకాలు:
ఈ పండు ఈగలు ముఖ్యంగా మామిడి, జామ, అరటి, బొప్పాయి, సపోటా మరియు సీతాఫలంను ఆశించి నష్టపరుస్తాయి.
పండు ఈగ వృద్ధికి అనుకూల సమయం, వాతావరణం:
* పండు ఈగ ఉదృతి మార్చి, ఏప్రిల్ మాసంలో ప్రారంభమై సంతతిని వృద్ధి చేసుకుని జూన్ మరియు జులై మాసంలో విజృంభిస్తుంది.
* కాయ అభివృద్ధి చెందే థలో లోపల ఉన్న గుడ్లు వేడికి పొదగబడి పిల్ల పురుగులుగా మారి లోపల కణజాలాన్ని తింటూ ఉంటాయి
* వాతావరణంలో అధిక వేడి, చలి ఉన్నప్పుడు ఈ పండు ఈగలు తట్టుకోలేవు
పండు ఈగ జీవిత చక్రం, నష్టపరుచు విధానం:
* ఆడ పండు ఈగలు లేత గోధుమ రంగులో ఉండి పారదర్శకమైన రెక్కలు కలిగి ఉంటాయి. వీటి వెనుక భాగం లో గుడ్లు పెట్టడానికి వీలుగా సూది లాంటి అండోత్సర్గంను కలిగి ఉంటాయి
* పండు ఈగ జీవిత చక్రం నాలుగు థలను కలిగి ఉంటుంది. గుడ్డు థ, లార్వా (మాగ్గోట్) థ, కోశస్థ థ మరియు తల్లి పురుగు థ. ఈ నాలుగు థల్లో లార్వా థ ప్రత్యక్షంగా అధికంగా ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది.
* ఈ పండు ఈగలు 50 కిలో మీటర్ల వరకు కూడా వ్యాప్తి చెంది వేరే పంటలను ఆశ్రయించి దాని జీవిత చక్రం పూర్తి చేసుకుంటాయి. కింద రాలి కుళ్లిపోయిన పండ్లలో కూడా తన జీవిత చక్రాన్ని కొనసాగిస్తాయి. ఈ రెండు పద్ధతుల ద్వారా పండు ఈగలు తోటల్లో ఆశించే అవకాశం కలదు.
* ఆడ తల్లి ఈగ కాయలు అభివృద్ధి చెందే థలో అనువుగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని కాయ యొక్క చర్మం లోపలికి అండోత్సర్గంతో గుచ్చి రంద్రం చేసి సుమారుగా 100-500 గుడ్లను పెడుతుంది. తల్లి ఈగ తన జీవిత కాలంలో 1000 గుడ్లు పెడ్తుంది.
* ఈ గుడ్లు 2 నుండి 3 రోజులలో పిల్ల పురుగులుగా మారి లోపల ఉన్న కణజాలాన్ని తింటాయి. కాయలపై గుడ్లు పెట్టడానికి చేసిన రంద్రాల ద్వారా ఇతర శిలింద్రాలు మరియు బాక్టీరియా ఆశించి కాయలు మెత్తబడి కుళ్లిపోతాయి.
* ఈ లార్వా థ అంతా పండులోనే జరుగుతుంది, కావున నష్టాన్ని మనం పండు కోసే వరకు గుర్తించలేము. * తదుపరి పిల్ల పురుగులు బాగా ఎదిగి కోశస్థ థకు చేరే ముందు పండ్ల నుండి ఎగిరిపడి భూమిలో కోశస్థ థను గడుపుతాయి. పిల్ల పురుగుల వలన తీవ్రమైన ఆర్థిక నష్టం కలుగుతుంది.
* కోశస్థ థ 10 – 40 రోజులలో వాతావరణ పరిస్థితులను బట్టి తల్లి ఈగలుగా మారుతాయి.
* ఈ ఆడ మరియు మగ ఈగలు సంపర్కం జరిపి గుడ్లను పెట్టి వాటి జీవిత చక్రాన్ని ప్రారంభిస్తాయి. ఇలా పండు ఈగలు సుమారుగా 40 నుండి 50 రోజులలో తమ జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటాయి. ఒక్కో పండు ఈగ వేల ఈగలను సృష్టించి తన సంతతిని పెంచుకుంటూ మన పంటకు నష్టాన్ని కలుగజేస్తాయి. కావున వీలైనంత త్వరగా సరైన యాజమాన్య పద్దతులను తీసుకోవడం ఎంతో ముఖ్యం.
* పండు ఈగ ఆశించిన పండ్లు నాణ్యతను కోల్పోయి తినడానికి కాని, స్థానిక మార్కెట్లలో అమ్మడానికి కాని ఎగుమతికి గాని పనికిరావు.
సమగ్ర సస్యరక్షణ చర్యలు
* పండు ఈగ కోశస్థ థ భూమిలో గడుపుతుంది, కావున వేసవి లో చెట్ల పాదులలో 10 సెం. మీ. లోతు వరకు దున్నుకుని మిథైల్ పారథియాన్ పొడిని 50 – 100 గ్రాముల చొప్పున చల్లుకోవాలి.
* పండు ఈగలు ఆశించి రాలిన పండ్లను ఏరి నాశనం చేయాలి. ఎండు కొమ్మలను తీసి వేయాలి మరియు కోత అనంతరం కొమ్మ కత్తిరింపులు చేసుకుంటే గాలి వెలుతురు బాగా ప్రసరిస్తాయి.
* పండ్ల తోటల్లో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి మరియు పండ్ల తోటలకు దగ్గరగా జామ, బొప్పాయి, సీతాఫలం మరియు తీగ జాతి కూరగాయలు ఉన్నట్లైతే వాటిపై సరైన సస్య రక్షణ చర్యలు చేపట్టాలి, లేదంటే అవి వీటికి ప్రత్యామ్న్యాయ పంటలుగా తోడ్పడి వాటి జీవిత చక్రాన్ని సాగించడానికి మరియు సంతతిని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి.
* పిందె కట్టిన 40 రోజుల తర్వాత కాయలకు బ్యాగులను తొడగాలి కొంత వరకు పండు ఈగ ఆశించే అవకాశం తగ్గుతుంది, కాని అన్ని కాయలకు కట్టడం సాధ్యం కాని పని మరియు ఖర్చుతో కూడుకున్న పని.
* లింగాకర్షక బుట్టలు (మిథైల్ యూజినల్ ఎరలు), ఎకరానికి 6 నుండి 10 ఎర బుట్టలను పెట్టుకోవాలి. ఈ ఎర బుట్టలు పండు ఈగ ఉదృతిని తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. 20 నుండి 30 బుట్టలను పెట్టుకున్నట్లైతే కొంత వరకు పురుగు ఉదృతిని తగ్గించవచ్చు, కాని ఈ మాస్ ట్రాప్పింగ్ ద్వారా కూడా పురుగు ఉదృతిని ఆర్థికంగా నష్టపరిచే స్థాయి లోపల ఉంచడం సాధ్యం కాదు. వివిధ రకాల చెక్కతో చేసిన లింగాకర్షక ఎరలు మార్కెట్లలో లభిస్తున్నాయి. వీటిని 30 నుండి 40 రోజులకొకసారి ఎరలని మార్చాల్సి ఉంటుంది మరియు పురుగు ఉదృతి బట్టి 3 నుండి 7 రోజులలో బుట్టలలో నీటిని మార్చాల్సి ఉంటుంది. ఈ ఎరల వలన పురుగు ఉదృతి మాత్రమే తెలుస్తుంది, కానీ అప్పటికే పండ్ల తోటల్లో జరగాల్సిన నష్టం జరిగి ఉంటుంది. పైగా ఈ చెక్క ఎరలు వాతావరణంలో జరిగే మార్పులను బట్టి సరిగ్గా పనిచేయవు. వర్షం పడిన రోజులలో పండు ఈగలను ఆకర్షించలేవు.
* ఈ చెక్క ఎరల యొక్క లోపాలను మరియు పరిమితులను అధిగమించడానికి వినూత్నంగా పండు ఈగ ఉదృతి తెలుసుకోవడం కోసం ATGC బయోటెక్ సంస్థ ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా నానో టెక్నాలజీతో స్వీయ నియంత్రణ పద్దతిలో విడుదల చేసే టాబ్లెట్ ఎరను MANTRA ME అనే పేరుతో మార్కెట్ లోకి తీసుకురావడం జరిగింది. ఈ టాబ్లెట్ను లింగాకర్షక బుట్టల్లో ఉంచి పండ్ల తోటల్లో పెట్టినట్లయితే సమర్ధవంతంగా 120 రోజుల వరకు మగ ఈగలను ఆకర్షించి బుట్టలలో పడేటట్లు చేస్తుంది. ఈ టాబ్లెట్ పనితనం చెక్క ఎరల కన్నా సమర్ధవంతంగా పనిచేస్తుందని నిరూపించబడింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఎరలు పురుగు ఉదృతిని తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి.
* పండు ఈగలను ఆకర్షింపజేసి సమర్ధవంతంగా నివారించడానికి ఆకర్ష్ ME పేస్టును ఉపయోగించినట్లైతే మంచి ఫలితాలు సాధించవచ్చు. దీన్ని ఉపయోగించే విధానం మరియు ప్రయోజనాలు వివరముగా వినూత్న పద్దతులలో తెలుసుకుందాం.
* ఒక లీటరు నీటికి 5 శాతం వేప గింజల కాషాయం కలిపి మొదటి థగా కాయలు గోలి సైజులో ఉన్నప్పుడు మరియు రెండో విడత 15 రోజుల తర్వాత మరోసారి పిచికారీ చేసుకుంటే పురుగు ఉదృతిని తగ్గించవచ్చు
* ఇక ఇవన్నీ చేసాక మాత్రమే రసాయనిక మందులను వాడాలి, కానీ ఈ మందులు పండు ఈగ ఉదృతిని తగ్గించడంలో అంతగా ప్రభావం చూపవు. వీటిలో ప్రోఫినోఫోస్ (50 ఇ. సి.) 1.5 మి. లీ. లేదా డైమిథోయేట్ 2 మి. లీ. లేదా డెకామేత్రిన్ (2.8 ఇ. సి.) 0.5 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పండు ఈగను సమర్ధవంతంగా అరికట్టుటలో వినూత్న పద్దతి: ఆకర్ష్ ME
* ATGC బయోటెక్ సంస్థ ప్రపంచంలోనే మొట్ట మొదటి సరిగా CREMIT అనే వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సహజసిద్ధంగా రూపొందించిన ఉత్పత్తి Akarsh ME
* దీనికి మగ, ఆడ ఈగలను సైతం ఆకర్షింపగల సామర్థ్యం కలదు.
* దీనిలో ఏ రకమైన హానికరమైన పురుగు మందులు లేవు. ఇది అత్యంత సమర్థవంతంగా పండు ఈగను ఆకర్షించి చంపే జెల్ ఎర.
* ఆకర్ష్ ME పేస్టు మామిడి. జామ, బొప్పాయి, సపోటా సీతాఫలం మరియు దానిమ్మ వంటి పండ్ల తోటల్లో వచ్చు వివిధ రకాల పండు ఈగ జాతులను ఆకర్షించి వాటిని నివారించడంలో సమర్ధవంతమైనది.
* ఈ ఆకర్ష్ ME పేస్టు (250 గ్రా.) ను ఏదేని ఆమోదించబడిన పురుగు మందులను (స్పైనోసాడ్ లేదా ఫిప్రూనిల్) 7.5 – 10 మి. లీ./250 గ్రా పేస్టు తో కలిపి మిశ్రమాన్ని చేయాలి.
* ఈ ఆకర్ష్ ME పేస్టుని పిందె నుంచి మొదలు పెట్టి ప్రతి 30-45 రోజులకొకసారి 2 పర్యాయాలు వాడినట్లైతే పండు ఈగను సంతతిని ముందునుంచే అరికట్టి వాటి సంతతి వృద్ధి పెరుగుదలను సమర్ధవంతంగా అరికట్టవచ్చని వివిధ పరిశోధనలు నిర్ధారించాయి.
* ఈ పేస్టును చెట్టు వయసుని బట్టి 1 నుండి 4 ప్రదేశాలలో కాండం లేదా కొమ్మ పైభాగంలో 1 – 2 గ్రా. మిశ్రమాన్ని చిన్న ముద్దలాగా చేసి పెట్టాలి.
* ఈ పేస్టుకు మగ మరియు ఆడ ఈగలు కూడా ఆకర్షింపబడతాయి, తద్వారా వాటి సంతతిని మొదటి నుండే మన పండ్ల తోటల్లో ఉదృతిని సమర్ధవంతంగా నివారించవచ్చు.
* సామూహికంగా తోటి రైతులందరితో కలిసి వాడినట్లైతే పండు ఈగ ఉదృతిని పూర్తిగా నివారించవచ్చు.* పక్క పొలాల్లో పండు ఈగ ఉదృతి ఎక్కువగా ఉన్నట్లైతే ఈ ఆకర్ష్ ఖజూ పేస్టును మన పండ్ల తోటల చుట్టూ ఉన్న చెట్లపై ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది.
* ఈ ఆకర్ష్ ME పేస్టును పలు భారతీయ ఉద్యానవన పరిశోధన కేంద్రాలు మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల ద్వారా పరీక్షించబడి ఆమోదించబడినది.
* దీన్ని పండు పరిపక్వము థలోనే కాకుండా పిందె థ నుండి వాడినట్లైతే మంచి ఫలితాలు వస్తాయని వివిధ మామిడి రకాలలో పరీక్షింపజేసి నిరూపించబడినది.
* శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట ఉద్యాన విశ్వవిద్యాలయం మరియు సెంటర్ అఫ్ ఎక్స్లెన్స్, ములుగు లో ఆకర్ష్ ME ని ఉపయోగించి పండు ఈగ ఉధృతిని సమర్ధవంతంగా అరికట్టే పద్దతిని క్షేత్ర స్థాయిలో రైతులకు ప్రదర్శన చేయడం జరిగింది.
* వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు జరిగిన దీని పనితనంలో ఎలాంటి మార్పు ఉండదు. వర్షానికి రాలిపోదు మరియు ఎండకి కరిగిపోదు.
* ఇతర రసాయనిక పురుగు మందులు వాడినా దీని ప్రభావం తగ్గదు.
* ఆకర్ష్ ME వలన క్షేత్రంలోని మిత్ర పురుగులకు ఎటువంటి హాని జరగదు మరియు, ఇది సహజసిద్ధ ఉత్పాదన కావున పండ్లపై ఎటువంటి పురుగు మందుల అవశేషాలు ఉండవు. పండు ఈగ ఉదృతి తెలుసుకునేందుకు: Mantra ME
* ATGC బయోటెక్ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా నానో టెక్నాలజీతో స్వీయ నియంత్రణ పద్దతిలో విడుదల చేసే టాబ్లెట్ ఎర MANTRA ME. పండు ఈగ ఉదృతి తెలుసుకోవడం కోసం, చెక్క ఎరల యొక్క లోపాలను మరియు పరిమితులను అధిగమించడానికి వినూత్నంగా ఆవిష్కరించబడిన సరికొత్త ఉత్పాదన.
* పండు ఈగ ఉదృతిని గమనించడానికి ఎకరాకు 5 ఎర (MANTRA ME) బుట్టలను పెట్టుకోవాలి. 25 -30 ఎర బుట్టలు (MANTRA ME) పెట్టుకున్నట్లైతే పురుగు ఉదృతిని మాస్ ట్రాప్పింగ్ పద్దతి ద్వారా తగ్గించవచ్చు. ఈ MANTRA ME ఒక్కో టాబ్లెట్ను ఒక్కో McPhail ట్రాప్లలో ఉంచి పంట పొలాల్లో చెట్టు కొమ్మలకు వేలాడదీయాలి.
* పంటల్లో ఉన్న పండు ఈగలు ఈ టాబ్లెట్ ఎరకు ఆకర్షింపబడి బుట్టలల్లో పడిపోతాయి.
* ఈ MANTRA ME టాబ్లెట్ ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా సమర్ధవంతంగా 60-90 రోజులు పనిచేయగలదు మరియు నీటిలో కూడా కరగదు. అదే చెక్కతో చేసిన లింగాకర్షక ఎరలు 30 నుండి 40 రోజులకొకసారి వాటిలోని ఎరలని మార్చాల్సి ఉంటుంది మరియు పురుగు ఉధృతి బట్టి 3 నుండి 7 రోజులలో బుట్టలలో నీటిని మార్చాల్సి ఉంటుంది.
ఇలా సమగ్ర సస్యరక్షణ చర్యలు సరైన సమయంలో పాటిస్తే మాత్రం పురుగు ఉదృతిని తగ్గించుకుని మంచి దిగుబడులు సాధించవచ్చు. రసాయనిక పురుగు మందులు వాడటం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది, ప్రజల ఆరోగ్యానికి హాని, మిత్ర పురుగులు నశిస్తాయి, పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా పండ్లపై చేరతాయి.
ఇవన్నీ మామిడి మార్కెటింగ్ మరియు ఎగుమతిని దెబ్బతీస్తాయి. ఇక వివిధ రకాల ఎర బుట్టలను వాడటం వల్ల పురుగు ఉనికిని మాత్రమే పసికట్టగలం కానీ ఉదృతి తగ్గించలేము. బ్యాగింగ్ చేయడం ఖర్చుతో కూడిన పని. ఎన్ని రసాయనిక మందులు వాడినా లేని ప్రయోజనం ఆకర్ష్ ME పేస్టు వల్లే సాధ్యం మరియు పండు ఈగ బారి నుండి పంటకు రక్షణ కల్పిస్తుంది. ఈ ఉత్పాదనను మామిడిలోనే కాక వివిధ పండ్ల తోటల్లో వాడినప్పుడు ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని పండు ఈగను 45 రోజుల వరకు సమర్ధవంతంగా నివారించడంలో సత్తా చూపించిందని వివిధ పరిశోధనలలో తేలింది. నూతన టెక్నాలజీ ద్వారా రూపొందించబడిన ఆకర్ష్ ME పేస్టు వలన పర్యావరణ కాలుష్యం జరగదు, కూలీల ఖర్చు తక్కువ, మందులు పిచికారీ చేయాల్సిన పని లేదు, పేస్టు పెట్టడానికి ఏ పంపులు కూడా అవసరం లేదు. శ్రమ మరియు ఖర్చు కూడా తక్కువే అయినప్పటికీ పండు ఈగను సమర్ధవంతంగా ఎదుర్కోగలదు. కావున రైతులు అన్ని సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటిస్తూ, రసాయనిక మందుల వాడకం తగ్గించి ఇటువంటి నూతన పద్ధతుల పట్ల అవగాహన పెంచుకుని సేంద్రియ ఉత్పాదనలు వాడినట్లైతే మంచి నాణ్యమైన దిగుబడులు మీ సొంతం చేసుకోవచ్చు. ఇతర యాజమాన్య పద్దతులతో పాటు ఆకర్ష్ ME వాడినట్లైతే పురుగు మందుల అవశేషాలు ఉండవు కావున ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుంది.
డా. సౌజన్య బత్తుల, డా. శశిధర్ బూర్ల, డా. విజయ్ రెడ్డి, ATGC బయోటెక్, ఇన్నోవేషన్ స్క్వేర్, బయోటెక్ పార్క్, శామీర్ పేట్, హైదరాబాద్, తెలంగాణ 500 078. ఫోన్: 8977632842
రోషానికి, రౌద్రానికి, రణానికి ప్రపంచంలోనే పేరు గాంచిన మన అసీల్ జాతి పందెం కోడి మన దేశానికి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. ఆంధ్ర-తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోనే కాక థాయిలాండ్ తదితర కొన్ని విదేశాలలో కూడా ఈ పందెంకోడి పుంజుల కూత లేనిదే గ్రామాలు నిద్రలేవవని ప్రతీతి. పెట్టలు సంవత్సరంలో కేవలం 50-60 గుడ్లు మాత్రమే ఉత్పత్తి చేయగల్గినప్పటికీ, వీటి మాంసం పరిమాణంలోనే కాక రుచి, నాణ్యతలలో కూడా అత్యంత గిరాకీ కలిగి ఉండుట, ముఖ్యంగా వీటి మాంసం మరియు గుడ్లలోని మాంసకృత్తులు, విటమిన్లు, ఇతర పోషకాల వల్ల కరోనా వంటి ప్రమాదకరమైన వైరస్ వ్యాధులబారి నుండి తట్టుకోగల శక్తి పెరుగుతుందనీ, ప్రకృతిసిద్ధమైన పెరటి వాతావరణాలలో పెరిగే ఈ కోళ్ల మాంసాన్ని, గ్రుడ్లను వినియోగదారులు ఆర్గానిక్ ఉత్పత్తులుగా భావించి ఆదరించడం వంటి కారణాల వల్ల దేశీ కోళ్లలో అసీల్ (అసలైన కోడి అని అర్థం) కోడి మాంసానికి, గ్రుడ్ల ధరలు పెంపకందారులకు లాభాల పంటను పండిస్తున్నాయి. ఇందుకు ఈ జాతికి సహజంగా ఎక్కువగా వుండే వ్యాధి నిరోధక శక్తి వాతావరణ తీవ్రతలను తట్టుకోగల శక్తులే మరో ముఖ్య కారణం. వేల సంవత్సరాల చరిత్రలో పల్నాటి యుద్ధం – బొబ్బిలి యుద్ధం వంటి చరిత్రాత్మక గాధలలో కూడా మన అసీల్ జాతి పుంజులు కీలక పాత్ర పోషించాయి. అయితే జీవహింసా నివారణ చట్టం వల్ల ప్రస్తుతం అనేక రాష్ట్రాలలో కోడి పందాలు నిషేధించబడ్డాయి.
మంచి సహజ సిద్ధమైన పరిస్థితులు – పోషణలో పుంజులు 3-4 కిలోలు, పెట్టలు 1.5-2.0 కిలోలు శరీర తూకం కలిగి తెలుగు రాష్ట్రాలలో లైవ్ కోళ్లకు కిలోలకు 250 నుండి 300 రూపాయల ధర పలుకుతున్నాయి. ఇందులో ఉత్పత్తి ఖర్చు గ్రామీణ ఫారాలలో కిలోకు 150 నుండి 180 వరకు ఉంటుంది. పెరళ్లలో పెరిగే కోళ్ళ మీద ఖర్చు ఇంకా చాలా తక్కువగానే ఉంటుంది.
పందెం పుంజుల ధర సగటున 6000 నుండి 7000 మధ్య ఉండగా ప్రత్యేక గుర్తింపు పొందిన పుంజుల ధరలు లక్షకు పైగా కూడా ఉంటున్నాయి. ప్రస్తుతం కేవలం హైదరాబాదు నగరంలోనే ప్రతివారం 20,000 కు పైగా అసీల్ కోళ్లు మాంసం కోసం విక్రయించబడ్తున్నాయని ఒక అంచనా. అసీల్ కోడిపుంజు లక్షణాలు:
పొడవైన సన్నని తల, చురుకైన కళ్లు, కండపట్టిన ఎర్రని శిఖ, పొడవైన మెడ, గంభీరమైన కూత, దృఢమైన ముక్కు, చిన్న తోక, ముఖ్యంగా బలిష్టమైన పొడవైన నిటారైన కాళ్లు, కాళ్ల వెనుక దృఢమైన ఆరి, కలిగిన ఈ పుంజులు ఎరుపు, పసుపు, నలుపు, బంగారు మిశ్రమ వర్ణాలలో కనిపిస్తాయి. బలమైన కాళ్లు రెక్కలు పటిష్టమైన వేళ్లు, ఆరి, చురుకైన కళ్లు, వాటిని మంచి పోరాట పకక్షులుగా గుర్తింపు నిచ్చాయి. శతృజీవాల నుండి తప్పించుకొనడానికి ఇవి సులువుగా చెట్లమీదకు, ఎత్తైన ప్రాంతానికి ఎగిరి తమను తాము ఆత్మరక్షణ చేసుకోగలవు. పందాల రంగంలో ఈ పుంజుల్ని వివిధ స్థానిక పేర్లతో వర్గీకరించారు.
పుట్టినప్పుడు 35-40 గ్రాములు, 14వ వారంలో ఒక కిలో, 20 వ వారానికి 1.5 కిలో సంవత్సరానికి 2.5 నుండి 3.0 కిలోలకు పుంజులు పెరిగితే పెట్టల పెరుగుదల ఇందులో 75-80 శాతానికే పరిమితం అవుతుంది. పెట్టలు 22-25 వారాల వయస్సులో గ్రుడ్ల ఉత్పత్తిని ప్రారంభిస్తే పుంజులు కూడా అదే వయస్సుకు బ్రీడింగుకు సిద్ధమౌతాయి. అసీల్ కోళ్లలో వ్యాధినిరోధక శక్తి, వైరి జంతువులను ధీటుగా ఎదుర్కోగల శక్తి, ఎగిరే శక్తి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోగల శక్తి ఎక్కువే అయినప్పటికీ, వాణిజ్యపరంగా అసీల్ జాతి కోళ్ల పెంపకాన్ని చేపట్టదలచిన వారు వివిధ అంటురోగాల నివారణకు టీకాలు వేయించే అవసరాన్ని ఇతర జాగ్రత్తలను విస్మరించకూడదు.
టీకాల ప్రణాళిక:
పుట్టిన వెంటనే మారెక్ టీకా, 7వ రోజు – రాణికెట్ టీకా (లసోటా) (కొక్కెర తెగులు) 14-16 రోజుల మధ్య – ఇన్ఫెక్షియస్ బర్సల్ డిసీజ్ వాక్సిన్ (ఇబిడి) 5వ వారం – పౌల్ట్రీపాక్స్ (అమ్మవారు) 8వ వారం – రాణికెట్ వాక్సిన్ హాచరీస్ నుండి పిల్లల్ని 5-6 వారాల వయస్సులో కొనుగోలు చేస్తే అప్పటికే వాటన్నింటికీ హాచరీస్ స్థాయిలోనే దాదాపు అన్ని వాక్సినేషన్లు పూర్తి శాస్త్రీయంగా, సంతృప్తికరంగా, సులువుగా పూర్తి అవుతాయి.
గ్రామీణ సంక్షేమ పథకాలన్నింటిలో పేదలకు చాలా అనువైన అనుబంధ పరిశ్రమ అసీల్ జాతి కోళ్ల పెంపకం. దీనిని ప్రభుత్వం వారు శాస్త్రీయంగా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అమలు చేస్తే సుస్థిరమైన ఆదాయాలు, సంక్షేమం, అభివృద్ది అతి తక్కువ ఖర్చుతో అత్యధిక నిరుపేద – మధ్య తరగతి రైతాంగానికి అందించవచ్చును.
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఇండ్బ్రో పౌల్ట్రీ పరిశోధన బ్రీడింగ్, హాచరీ సంస్థ వంటి సంస్థలు అసీల్ జాతి కోడి పుంజుల్ని అధిక మాంసంతో పాటు అధికంగా గ్రుడ్లను కూడా ఉత్పత్తి చేసే రోజ్ఐలాండ్ రెడ్ పెట్టలతో క్రాస్ చేసి ఉత్పత్తి చేసే సంతతి నాణ్యమైన ఎక్కువ మాంసంతో పాటు ఏటా 150-160 ఆర్గానిక్ కోడిగ్రుడ్లను ఇస్తున్నాయి. తక్కువ పెట్టుబడితో అత్యంత లాభదాయకమైన ఈ అసీల్-క్రాస్ కోళ్లను పెరళ్లలోనే కాక చిన్న చిన్న గ్రామీణ పౌల్ట్రీ ఫారాలలో పెంచడాన్ని తెలుగు రాష్ట్రాలు ఆర్ధిక-సాంకేతికంగా ప్రోత్సహిస్తున్నాయి.
గ్రామీణ స్థాయిలో ప్రత్యేక కాలనీలలో కేంద్రీయ కోడిపిల్లలు-కోళ్ల ఫారాలను (నర్సరీ తరహాలో) ఏర్పాటు చేసి, వీటి ద్వారా వివిధ లబ్దిదారులకు వివిధ కాలవ్యవధుల మధ్య ఎదిగే కోళ్లను పెంపకానికి పంపిణీ చేయవచ్చును. అముల్ పాల సహకార సంఘాల పంధాలలో అసీల్ (ఆర్గానిక్) కోళ్ల పెంపకాన్ని, మేతల సరఫరాను, వైద్య సేవల్ని, సాంకేతిక సహకారాలతో పాటు శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి ఆకర్షణీయమైన ప్యాకింగ్లో మాంసాన్ని విక్రయించి, తద్వారా లభించే ఆదాయాలను అందరికీ ఆమోదయోగ్యమైన, సహకార చట్టాలు, నిబంధనావళులకు లోబడి పెంచుకుంటూ లబ్ది పొందవచ్చు. అయితే అశాస్త్రీయంగా, రాజకీయ ప్రయోజనాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని ప్రారంభించే ఏ సహకార సంస్థ బ్రతికి బట్ట కట్టిన దాఖలాలు లేవనే వాస్తవాన్ని పాలకులు, అధికారులతో లబ్దిదారులందరూ గుర్తించినప్పుడు మాత్రమే ఇటువంటి పథకాలు విజయవంతం కాగలవు.
వేసవిలో పశువుల సంరక్షణ చాలా అవసరం. ప్రస్తుతం రోజురోజుకీ వేసవి తాపం పెరిగిపోతున్నది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనివలన పశువులు వడదెబ్బకు గురవుతున్నాయి. దీనివలన పాల దిగుబడి తగ్గిపోతుంది. రొప్పుతూ మేత మేయక, శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగి, రోగ నిరోధక శక్తిని కోల్పోతాయి. దీనివలన రైతులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, దేశ ఆర్థిక ప్రగతికి నష్టం వాటిల్లుతోంది. అందుకు వేసవిలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే పశువులను సంరక్షించుకోవటంతో పాటు, పాడికి రక్షణ ఇచ్చిన వాళ్ళం అవుతాం.
వేడి ఒత్తిడి – ప్రభావం: పశువులు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. ముఖ్యంగా ఆవుల కంటే గేదెలు ఉష్ణ తాపానికి ఎక్కువగా గురవుతాయి. ఎందుకంటే గేదెల్లో నల్లని శరీరం వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది మరియు చెమట గ్రంధులు తక్కువగా ఉంటాయి. దేశీయ ఆవులు, సంకర జాతి ఆవులు మరియు విదేశీ జాతి ఆవులు కంటే ఎక్కువ వేడిని తట్టుకోగలవు. ఎందుకంటే దేశీ ఆవులు తక్కువ వేడి ఉత్పత్తి చేస్తాయి మరియు వేడి కోల్పోయే అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దక్షిణ భారతదేశంలో ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత ఒక్కోసారి 110 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు పెరగటం, వాతావరణ ఉష్ణోగ్రత (అనుకూల ఉష్ణోగ్రతలు 24-260బీ సంకరజాతి ఆవులకు, 330బీ దేశి ఆవులకు మరియు 360బీ గేదెలు) పెరగడం వలన అంతర్గత ఉష్ణోగ్రత సరిగ్గా సమతుల్యంలో ఉండక పెరుగుతుంది. దీనివలన చెమటలు, నోటి నుండి చొంగ ధారాళంగా కారుతుంది. నోటిద్వారా శాసించటం (పాంటింగ్). విశ్రాంతి లేకపోవడం. ముట్టె ఎండిపోతుంది. ఎక్కువ దాహానికి గురవుతాయి. మరీ ముఖ్యంగా మేతను సరిగా తినకపోవడం జరుగుతుంది. దీని వలన శరీరంలో గ్లూకోజు నిల్వలు తరిగిపోయి పశువులు క్రమంగా నీరసించి, బలహీనపడతాయి. ఒక్కొక్కసారి అపస్మారక స్థితికి చేరుకొని మరణిస్తాయి. గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో (కోస్తా జిల్లాలు) ఉష్ణోగ్రత ప్రభావానికి పశువులకు వడదెబ్బ తగులుతుంది. దీనివలన ఆవులు మరియు గేదెలు ఎండ తీవ్రతకు గురై పాల దిగుబడి తగ్గిపోతుంది. పాలలో వెన్న శాతం, మాంసకృత్తులు శాతం తగ్గుతుంది. పశువులు త్వరగా పొదుగు వాపు లాంటి వ్యాధుల బారిన పడతాయి. పునరుత్పత్తి సామర్ధ్యాన్ని కోల్పోతాయి. పెరుగుతున్న పశువులలో బరువు పెరుగుదల తగ్గుతుంది. ఎద లక్షణాలు తక్కువగా కనిపిస్తాయి. రోగ నిరోధక శక్తి క్షీణించి పోయి, ట్రీపనోసో మీయాసిస్, ఫైలేరియాసిస్ మరియు మైక్రోఫైలేరియా వంటి వ్యాధులకు గురవుతాయి. కొన్ని సందర్భాల్లో పశువుని కోల్పోవలసి వస్తుంది. దీని ప్రభావం రైతు ఆర్థిక పరిస్థితిపై పడుతుంది.హార్మోన్ల సమతుల్యత కోల్పోయి సరైన సమయంలో ఎదకు రాక పోవడం జరుగుతుంది మరియు ఈతల మధ్య వ్యవధి పెరిగి రైతులకు నష్టం వాటిల్లుతుంది. యాజమాన్య పద్ధతులు:
దేశవాళి ఆవులు వేసవిని, ఎండలను తట్టుకుంటాయి. కాబట్టి గేదెలకు మరియు సంకరజాతి ఆవులకు వేసవి నుండి రక్షణ కల్పించాలి. ముఖ్యంగా గాలిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పశువులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం.
గృహవసతి – సంరక్షణ:
ఎండ నుండి పశువులను రక్షించాలంటే వాటిని ఎల్లప్పుడూ చల్లగా చెట్ల నీడలో కట్టి పెట్టాలి. పశువుల షెడ్ల చుట్టూ నీడనిచ్చే చెట్లను పెంచడం చాలా మంచిది ఎందుకంటే పశుగ్రాసాల్లా ఉపయోగపడతాయి. కొన్ని సందర్భాల్లో చెట్ల నీడ అందుబాటులో లేని పరిస్థితుల్లో పశువులను పై కప్పు గల పాకలో పెట్టటం మంచిది. గృహ వసతి అనేది ఎండ తీవ్రత నుండి రక్షణ కల్పించే విధంగా అనువుగా ఉండాలి. పశువుల పాకలు ఎత్తయిన ప్రదేశంలో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఉండాలి. పాకల ఎత్తు 9-15 అడుగుల ఎత్తు ఉండేలా చూసుకోవాలి. పశువుల షెడ్లలో పైకప్పు రేకులతో ఉంటే దానిని వరిగడ్డి తో గాని తాటాకులతో గాని కప్పడం మంచిది. దాన్ని తరచుగా నీటితో తడుపుతూ ఉంటే మంచిది. పశువుల షెడ్ల చుట్టూ చాపలు మరియు గోతాములతో కప్పి మధ్యాహ్న సమయంలో నీటితో తడపడం వలన పాకలు, షెడ్లు చల్లగా ఉంటాయి మరియు సూర్యరశ్మి నేరుగా పడకుండా చేస్తూ చల్లని వాతావరణ పరిస్థితులను సమకూరుస్తాయి. షెడ్లలో ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఫ్యాన్లు షెడ్లలోని తేమ మరియు వేడిని సమతుల్యం చేస్తాయి. షెడ్లలో ఎల్లప్పుడూ నీటిని అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
ఎందుకంటే నీరు ఎక్కువగా తాగిన కొద్ది శరీరంలో వేడి తగ్గిపోతుంది. పగటిపూట గేదెలను రెండు మూడుసార్లు నీటితో కడగటం మంచిది. అదేవిధంగా గేదెలను మధ్యాహ్నం 2-3 గంటలు చెరువులో ఉండటం మంచిది. ఈ విధంగా చేయడం వల్ల పశువులను వేడి తాపం నుండి కాపాడుకుని, ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు పాల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి సామర్థ్యాన్ని సక్రమంగా ఉంచుకోవచ్చు.
అధిక వేడి తాపం వలన పశువులు వేసవికాలంలో ఎక్కువగా ఆహారం మరియు మేతను తీసుకోలేవు మరియు జీర్ణ వ్యవస్థ సన్నగిల్లుతుంది. దీనివల్ల పాల దిగుబడి మరియు పునరుత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది. అందువలన వేసవిలో పశువుల పోషణ ఎంతైనా అవసరం.
పశువులను ఉదయం 10 గంటల లోపు మరియు సాయంత్రం నాలుగు గంటల తర్వాత మేతకు పంపడం అనువైన సమయం. మిట్టమధ్యాహ్నం 11 నుంచి 3 గంటల లోపు మేపుకు పంపినట్లయితే, వేసవి తాపానికి గురై వడదెబ్బ తగిలే ఆస్కారం ఉంది. ముఖ్యంగా పాల దిగుబడి తగ్గిపోతుంది. పశువులు వేసవిలో కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువగా జీర్ణించుకోలేవు. కాబట్టి వాటిని తగ్గించి, శక్తినిచ్చే పిండి పదార్థాలు అయినటువంటి గంజి, జావ లాంటి పదార్థాలు ఎక్కువగా ఇవ్వడం మంచిది. ఇది గేదెలలో మరీ ముఖ్యం. అధిక వేడి వలన శరీరంలో జీర్ణక్రియ సరిగ్గా జరగదు. దీని వల్ల జీర్ణరసాలు తగిన మోతాదులో ఉత్పత్తి కావు. అందువల్ల పశువులను రోజుకు రెండు మూడు సార్లు నీటితో కడిగి నట్లయితే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అదేవిధంగా జావ, మినరల్ మిక్చర్, ఉప్పుకలిపిన ద్రావణం తగిన మోతాదులో మిశ్రమ దాణతో కలిపి ఇవ్వటం మంచిది.
విటమిన్ ఏ సరైన మోతాదులో శరీరంలో ఉన్నట్లయితే, పశువులు వేసవిలో ఉష్ణోగ్రతను సమర్థవంతంగా తట్టుకుంటాయి. విటమిన్ ఎ, ఒక పశువుకి ఒక రోజుకి 1 గ్రాము చొప్పున అందించాలి. ఈ విధంగా ఎనిమిది నుంచి పది రోజులు నెలకి అందించాలి. వేసవిలో పొటాషియం లవణాలు ఎక్కువగా అవసరమవుతాయి. అందువలన పొటాషియం క్లోరైట్ లవణాన్ని అందించాలి.
వేసవిలో పశువులు పచ్చిమేతను మాత్రమే తింటాయి. ముఖ్యంగా సంకరజాతి ఆవులు, విదేశీ ఆవులు పచ్చిమేత లేనిదే వేడిని తట్టుకోలేవు. పాల దిగుబడిని బట్టి దాణాను పశువులకు ఇవ్వాలి. పశుగ్రాసాలను చాప్ కట్టర్తో అంగుళం సైజులో కత్తిరించి మేపాలి. దీని వలన మేత వృధా కాకుండా ఉంటుంది. పచ్చిమేతను పగటిపూట, ఎండు గడ్డిని రాత్రిపూట ఇవ్వడం మంచిది. కొన్ని సందర్భాల్లో పచ్చిమేత లేనప్పుడు, ఖనిజ లవణాలు, మిశ్రమ దాణాలను ఇచ్చి అధికంగా మేపాలి. ఈవిధంగా సమృద్ధిగా వేసవిలో పోషణ ఇవ్వడం వలన పశువులు ఆరోగ్యంగా ఉండి, పాల దిగుబడి సాఫీగా సాగుతుంది. ఆరోగ్య సంరక్షణ:
ఎండ తాపానికి గురైన వెంటనే పశువులను నీడలో చెట్టు కింద ఉంచటం మంచిది. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేటట్టు చూసుకోవాలి. శరీరంపై చల్లని నీటిని చల్లాలి. గ్లూకోజ్ సెలైన్, సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని ఎక్కించాలి. వేసవిలో ఎండ వేడికి రోగనిరోధక శక్తిని కోల్పోతాయి. దీని వలన జబ్బ వాపు వ్యాధి, గొంతువాపు వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. అందువలన వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వటం మంచిది. రెండు 4 నుంచి 8 నెలల వయసున్న దూడలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. అలాగే అంతర పరాన్నజీవుల కోసం నట్టల నివారణ మందులు వేయించాలి. పరిశుభ్రమైన నీటిని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలి. దాహానికి బురద నీరు, అపరిశుభ్రమైన నీరు త్రాగి పారుడు వంటి జీర్ణకోశ వ్యాధులకు ఆస్కారం ఉంది. అందువలన మనమే మంచినీటి కుంటలను పశువులకు అందుబాటులో ఉంచాలి. ఎప్పటికప్పుడు పాకలను శుభ్రం చేస్తూ ఉండాలి.
వేసవి కాలంలో ఎండ తీవ్రత, అధిక ఉష్ణోగ్రత, వేడి గాలులు వీచడం వలన పాడి పశువులు తీవ్ర అనారోగ్యానికి, అసౌకర్యానికి లోనుకావడం జరుగుతుంది. దీనివలన వాటి ఉత్పత్తి మరియు పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. కావున మన రైతాంగం పైన ఉదహరించిన యాజమాన్య పద్ధతులను వేసవిలో చేపట్టినట్లయితే పశువులను సంరంక్షించడమే కాకుండా, పాడికి రక్షణ కల్పించి, దేశం ఆర్థికంగా మెరుగుపడుతుంది. డా. యు. వినోద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డా. జి. సుష్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్; డిపార్ట్మెంట్ ఆఫ్ అనిమల్ జెనిటిక్స్ అండ్ బ్రీడింగ్, పశు వైద్య కళాశాల, తిరుపతి. ఫోన్: 9492298321
కౌంజు పిట్టలనే ‘క్వయిల్’, ‘పరిఘ’ పకక్షులు అని అంటారు. ఇవి చూడడానికి చిన్నగా, మన పిచుకుల మాదిరిగా/కొంచెం పెద్దవిగా ఉండి, కరెంటు తీగల మీద అలా తారసపడుతూ ఉంటాయి. అయితే అవి అడవి జాతికి చెందినవి. అయితే షెడ్డులో పెంచుకోవడానికి అనువైన రకం ఒకటి జపనీస్ క్వయిలు.
ఈ జపనీస్ క్వయిలును మాంసం మరియు గ్రుడ్ల ఉత్పాదన / రెండింటి కొరకు పెంచుకొనవచ్చును. మిగతా కోళ్ళ రకాలతో పోల్చినట్లయితే క్వయిల్/కౌంజు పిట్టలకు వ్యాధి నిరోధక చాలా ఎక్కువ, ఎటువంటి టీకాలు అవసరం లేదు. ఈ పిట్టలు 5 వారాల వయస్సుకే మాంసం కొరకు అమ్మవచ్చును. ఆరవ వారం నుండి ఇవి గ్రుడ్లు పెట్టడం మొదలు పెడతాయి.
ఐదు వారాల వయస్సులో ఇవి 180-220 గ్రా. వరకు బరువు తూగుతాయి. మరియు వీటి మాంసంలో మాంసకృత్తులు మిగతా కోళ్ల మాంసం కంటే అధిక మోతాదులో లభిస్తాయి. దేశంలో మొత్తం పౌల్ట్రీ పాపులేషన్లో 1.8% కౌంజు పిట్టలు ఉన్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, పెరిగిన తలసరి ఆదాయం కలిగిన అవగాహనల మూలాన నేడు రైతులు ప్రత్యామ్నాయ కోళ్ల పెంపకం పట్ల మక్కువ చూపిస్తున్నారు. అటువంటి వాటిలో కౌంజు పిట్టల పెంపకం ఒకటి.
కౌంజు పిల్లల పెంపకం :
కౌంజు పిట్టలు ఉదర భాగం బూడిద రంగు కలిగి శరీరం మొత్తం ముదురు నుండి లేత గోధుమ రంగులో ఉంటుంది. బయట మార్కెట్ నందు ఒక రోజు వారి పిల్లలు లభ్యం అవుతాయి. పిల్లలు 7-9 గ్రా. బరువు ఉండి సున్నితంగా ఉంటాయి. వీటికి మొదటి వారంలో 95-99 ఫారెన్హీట్ వరకు వేడిని అందించాలి. మొదటి వారంలో తీసుకునే జాగ్రత్తలు దాదాపు ఫారం కోడి పిల్లల బ్రూడింగ్ మాదిరిగానే చేసుకోవాలి. కాకపోతే కౌంజు పిట్టల యొక్క చిన్నపాటి శరీరం వలన వాటికీ మాములు ఇతర కోడి పిల్లల కంటే అధిక ఉష్ణోగ్రతను అందించాలి.
ఒక్కొక్క బ్రూడర్ 100-150 అంగుళాలు వెడల్పుగా ఉన్నట్లయితే దానితో 250-300 వరకు పిల్లలను ఉంచవచ్చును. మొదటి వారం తరువాత నుండి ఉష్ణోగ్రతను 5 ఫారెన్హీట్ చొప్పున తగ్గిస్తూ అది 70, 75 ఫారెన్హీట్ వచ్చే వరకు బ్రూడింగ్ చేయాలి. దాదాపు 3 వారాల వయస్సు వచ్చేసరికి ఈకలు బాగా పెరిగి మగ, ఆడ కౌంజులను వేరుచేయుటకు అవుతుంది (లింగబేధం తెలుస్తుంది).
సాధారణంగా ఆడ పకక్షులు ఉదర భాగంలో ఉండే ఈకలపైన నల్లటి మచ్చలు ఉండి మగ వాటి కంటే అధిక బరువు తూగుతాయి. మగ పకక్షులు ఉదర భాగం గోధుమ వర్ణంలో ఉంటుంది. 5 వారాల వయస్సు వచ్చేసరికి ఆడ కౌంజులు 220 గ్రా.ల వరకు, మగవి దాదాపు 180-190 గ్రా. వరకు బరువు తూగుతాయి. వీటిని 4/5 వారాల వయస్సులో మాంసం కొరకు వినియోగించవచ్చు. 5 వారాల వరకు ఇవ్వవలసిన దాణాలో దాదాపు 26-28% వరకు మాంసకృత్తులు ఉండేలా చూసుకోవాలి. ఒక బ్రాయిలర్ కోడిని పెంచేటటువంటి స్థలం (1 చ. అడుగు) దాదాపు 5 కౌంజు పిట్టలను పెంచడానికి సరిపోతుంది.
గ్రుడ్లు పెట్టే కోళ్ల పెంపకం:
కౌంజు పిట్టలు ఆరవ వారం నుండే గ్రుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. అవి 13 నుండి 14 వారాలు వచ్చే సరికి గ్రుడ్లు ఉత్పత్తి 90-95% నికి చేరుతుంది. సంవత్సరానికి దాదాపు 250-270 గ్రుడ్లను ఉత్పత్తి చేస్తాయి. గుడ్లు 10 నుండి 12 గ్రా. బరువు ఉండి, పెంకు కొంచెం దళసరిగా, నల్లని మచ్చతో కూడి ఉంటుంది.
పోషకాల పరంగా చూసుకొన్నట్లయితే కోడి గ్రుడ్లు కంటే 2% మాంసకృత్తులు కౌంజు పిట్టల గుడ్ల నుండి లభ్యమవుతాయి. ఈ గ్రుడ్లను బోండాలు వంటివి వేసుకోవడానికి వినియోగిస్తారు. వీటి యొక& చిన్నసైజు వలన పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. కౌంజు పిట్టలు 3 వారాల వయస్సు నిండిన తరువాత నుండి ఎగరడం మొదలు పెడతాయి. కనుక కౌంజులను తప్పనిసరిగా గృహవసతి కల్పించాలి. బ్రాయిలర్ కోళ్లకు ఉపయోగించునటువంటి షెడ్డును కౌంజు పిట్టల పెంపకానికి వాడుకొనవచ్చు. గ్రుడ్లను తినడానికి మాత్రమే వినియోగించేటట్లు అయితే మగ కౌంజులను 5వ వారంలో మాంసం కొరకు అమ్మివేయవచ్చును.
లేదా గ్రుడ్లను పొదగవేయాలి అనుకునేవారు ఒక మగ కౌంజుకు, 1 లేదా 2 ఆడ కౌంజులు ఉండునట్లుగా చూసుకోవాలి. ఈ థలో కౌంజులను డీప్లిట్టర్ పద్ధతిలో గని లేదా కేజెస్ నందు గని పెంచుకోవచ్చు.
కౌంజు గుడ్డు నుండి పిల్ల రావడానికి 18 రోజుల సమయం పడుతుంది. ప్రత్యుత్పత్తికి వినియోగించే కౌంజులకు ఇతర కౌంజుల కంటే ఎక్కువ ఖనిజ లవణాలు, విటమిన్లను అందించాలి.
ఇంక్యూబేటర్ నందు గ్రుడ్లను పొదగా వేసేటప్పుడు మొదటి 15 రోజుల వరకు 99-99.5 డిగ్రీ ఫారెన్మీట్ ఉష్ణోగ్రత, 70-75% తేమ, 2/3 తెరిచిన వెంటిలేటర్స్ మరియు గ్రుడ్లను నిలువుగా ఉంచి, రోజుకు 7-8 సార్లు విడిగా త్రిప్పాలి. చివరి 3 రోజులలో 99.8-99 డిగ్రీ ఫారెన్హీట్ ఉష్ణోగ్రత, 88-90′ తేమ, 1/3 తెరిచినా వెంటిలేటర్స్, మరియు గ్రుడ్లను అడ్డంగా హాచరీట్రేల నందు ఉంచాలి. 18వ రోజు తదుపరి పిల్లలు గ్రుడ్ల పెంకును పగుల గొట్టుకుని బయటకు వస్తాయి. వాటిలో చిన్నగా, బలహీనంగా, కాళ్ళు పడిపోయిన పిల్లలను వేరుచేయాలి. మిగిలిన పిల్లలను రైతులకు అమ్మడం కానీ లేదా వేరే ఇంకొక బ్యాచ్ను కానీ మొదలు పెట్టవచ్చు. సాధారణంగా కౌంజు పిట్టలలో వ్యాధులు తక్కువ. కౌంజుల పెంపకం చేపట్టినపుడు అక్కడ లభించు నీటి వసతి, నాణ్యత పరిశీలించుకోవాలి. అవసరాన్ని బట్టి నీటిలో తగు మోతాదులో శానిటైజర్స్ వాడాలి. నెలలో విడిగా 3 రోజులు బి-కాంప్లెక్స్ను నీటి ద్వారా అందించుట మేలు. ప్రతి 3 నెలలకు ఒకసారి డి-వార్మింగ్ చేస్తే మేలు.
కౌంజు పిట్టల పోషణ :
కౌంజు పిట్టలకు మిగతా కోళ్ల కంటే కొంచెం అధిక మోతాదులో మాంసకృత్తులు అవసరం అవుతాయి. బయట మార్కెట్ నందు ప్రత్యేకంగా కౌంజు పిట్టల దాణా లభించునట్లయితే దొరికిన దాణాకి కొద్ది మోతాదులో అవసరం మేరకు సోయా చెక్కను కలిపి వాడుకోవాలి.
సాధారణంగా కౌంజులు మొదటి 5 వారాల వయస్సు వరకు 550-600 గ్రా. వరకు దాణా తింటాయి. కోడి ఒకటికి ఆ తదుపరి అనగా గ్రుడ్లు పెట్టు థలో దాదాపు రోజుకు కోడికి సగటున 25 గ్రా. దాణా అవసరం అవుతుంది. దాదాపు సగటున కౌంజు పెట్టకు గుడ్ల థలో 10 నుండి 11 కిలోల దాణా అవసరం అవుతుంది.
కౌంజు పిట్టల దాణా :
తరాలు అనగా: లైసిన్, మిథియోనిన్, బికాంప్లెక్స్, విటమిన్లు, ఫాట్ సాల్యుబుల్ విటమిన్లు, కోలిన్ క్లోరైడ్, ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ ఉంటాయి. దాణా ఖర్చు మొత్తం పెట్టుబడిలో 70-75% వరకు ఉంటుంది. కనుక దాణా తయారీ విధానంలోను, దాణా అందించే విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మేత తొట్లలో 2/3 వంతు వరకు మాత్రమే దాణా నింపాలి. రోజుకు 3 సార్లుగా దాణా అందించాలి. షెడ్డు నందు తగినంత గాలి, వెలుతురు ఉండునట్లు చేసుకోవాలి. గ్రుడ్లు పెట్టు కౌంజులకు రోజు మొత్తం మీద 16 గంటలు వెలుతురు ఉండునట్లు చూడాలి. కౌంజు పిట్టల పెంపకం ఆదాయ వ్యయాలు: 10000 కౌంజులకు
షెడ్డు నిర్మాణానికి: 10000 కౌంజులకు: 40,000.00 నీటి వసతి కరెంటు వసతి.
నికర ఖర్చులు :
ఒక రోజు వయస్సు గల కౌంజు ధర: 8.00 þ 10000 = 80,000.00 దాణా ఖర్చు 5 వారాల వరకు 550 గ్రా. þ 10000þ30/1000 = 1,65,000.00 ఇతర ఖర్చులు (లిట్టర్, కరెంటు చార్జీలు, బికాంప్లెక్స్) రూ.2 / కోడికి = 20,000.00
మొత్తం ఖర్చు = 2,65,000
ఆదాయం: 10,000 కౌంజులకు 5% మరణాలు అయినా మార్కెట్కు తరలించే సంఖ్య 9,500 ఒక్కొక్క కౌంజు రూ. 35/- చొప్పున = 3,32,500 అనగా 10,000 కౌంజులను పెంచుకున్నట్లు అయితే వాటిని 5 వారాలకు అమ్మడం ద్వారా దాదాపు రూ. 67,500/- (3,32,500 – 2,65,000) ఆదాయాన్ని 5 వారాలలో పొందవచ్చు. పైన తెలిపిన విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ సరైన సమయంలో మార్కెట్ చేసుకున్నట్లయితే కౌంజులు పెంపకాన్ని ఒక ఉపాధిగా చేపట్టి లాభాలు గడించవచ్చు. డా. నాగరాజ కుమారి కళ్ళం,
భారతదేశంలో ప్రత్తి పైరు 1300 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర్ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్తి సాగు 6.50 లక్షల హెక్టార్లలో, కర్నూలు, గుంటూరు, కృష్ణా, అనంతపురం, ప్రకాశం జిల్లాలలో ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ప్రత్తిని ఆశించే అనేక రకాలైన పురుగులలో గులాబి రంగు పురుగు ముఖ్యమైనది. ఇటీవల కాలంలో ఈ పురుగు ఉద్ధృతి గణనీయంగా పెరగడమే కాకుండా పంట విత్తిన 75-80 రోజులకే ఆశించి నష్టం చేకూరుస్తుంది. ఈ పురుగు యాజమాన్యంకు కేవలం ఒక రసాయిన పురుగుమందులపై ఆధారపడకుండా సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టుట వలన గులాబి రంగు పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు.
ప్రత్తి తీసిన తర్వాత అవశేషాలను పంట చేలోనే ఎక్కువ కాలం ఉంచడం వల్ల గులాబి రంగు పురుగు పంట పొలంలో ఆశ్రయం పొంది దాని ఉధృతి పెరుగుతోంది. కొంత మంది రైతులు ప్రత్తి తీత మరియు తర్వాత విత్తే పంటల మధ్య ఉన్న సమయం తక్కువగా ఉండటం వల్ల పొలాలను వేగంగా సిద్ధం చేయడం కొరకు ప్రత్తి కట్టెలను కాల్చేస్తారు. కానీ అలా కాల్చడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ప్రత్తి అవశేషాలను కాల్చడం వల్ల నష్టాలు
1. పంట తీసుకున్న అనంతరం ఎండిన మొక్కలను పంట చేలోనే కాల్చేయడం వల్ల భూమిలోని సారం దెబ్బతింటుంది.
2. నేలలో ఉండే మిత్రపురుగులు, సూక్ష్మజీవులకు హాని కలుగుతుంది.
3. కాల్చడం వల్ల భవిష్యత్తులో ఉద్గార వాయువుల పరిమాణం పెరిగి వాతావరణంలో తీవ్రమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది.
4. భారత దేశంలో ప్రత్తి సాగు చేయడం ద్వారా సుమారు 25-30 మిలియన్ టన్నుల పంట అవశేషాలు ఉత్పత్తి కాగా, వాటిలో 48.9 శాతం అవశేషాలను కాల్చివేయడం జరుగుతోంది. ప్రత్తి పంట తీసిన తర్వాత ఏర్పడే అవశేషాలను మెలకువగా ఉపయోగిస్తే లాభదాయకంగా ఉంటుంది మరియు గులాబీ రంగు పురుగు నివారణకు కూడా లాభం చేకూరుస్తుంది. ప్రత్తి వ్యవసాయ వ్యర్థాల వినియోగం
1. ప్రత్తి తీతల తర్వాత వచ్చే కాండాలు, ఆకులు మరియు పండిన కాయలను చేలో మేకలను, గొర్రెలను మరియు పశువులను తోలి మేపవచ్చు. లేదా ఇంటికి తీసుకెళ్లి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టి శీతాకాలపు మేతగా కూడా వాడవచ్చు.అయితే మొక్కల్లో పురుగుమందుల అవశేషాల స్థాయి కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వాటిని పశువులకు తినిపించరాదు.
2. ప్రత్తి మోళ్ళను ట్రాక్టరు ష్రెడ్డర్ తో భూమిలో కలియ దున్నుకోవచ్చు. ఇలా చేయడం వల్ల…
* భూసారం పెంచడంతో పాటు తేమను సంరక్షించుకోవచ్చు. పత్తి పంట వల్ల ఒక హెక్టారుకు సుమారుగా 2 టన్నుల కాండాలను ష్రెడ్డింగ్ చేసి భూమిలో కలియ దున్నటం వలన భూమికి 12.4-20.0 కిలోల నత్రజని, 1.6 కిలోల భాస్వరం మరియు 12.2-13.6 కిలోల పొటాష్ లభ్యమవుతుంది.
* అధికవర్షాలప్పుడు భూమి కోతకు గురికాకుండా ఉంచుతూ అలాగే వేసవి కాలంలో భూమి యొక్క ఉష్ణోగ్రతను మితంగా ఉంటుంది.
* మెరుగైన వేరు వ్యాప్తి, అధిక సూక్ష్మజీవుల కార్యకలాపాలు ఉంటాయి.
3. ఎండిన ప్రత్తి కట్టెను పొడి చేసి వర్మీ కంపోస్ట్ తయారీలో వినియోగించవచ్చు.
4. పోడి చేసి చేలో చల్లితే కలుపు మొక్కలు పెరగకుండా కొంత వరకు అరికడుతుంది.
5. ప్రత్తి వ్యవసాయ వ్యర్థాలతో కంపోస్టుని కూడా తయారు చేసుకోవచ్చు. సాధారణంగా ప్రత్తి కాండాలలో ఎక్కువ ్పు/శ్రీ నిష్పత్తి మరియు అధిక లిగ్నోసెల్యులోజ్ శాతం ఉండటం వలన అవి సూక్ష్మజీవుల దాడికి నిరోధకంగా ఉండి కంపోస్ట్ తయారీకి 4-6 నెలల సమయం పడుతుంది.
అలా కాకుండా యాక్సిలరేటెడ్ కంపోస్టింగ్ ప్రక్రియలో డీకంపోజర్ను ఉపయోగించి తడి ప్రత్తి కట్టెలని అయితే 45 రోజుల్లో, ఎండిన ప్రత్తి కట్టెలని అయితే 60 రోజుల్లో పూర్తి చేయవచ్చు. ఈ విధంగా తయారైన కంపోస్టులో ఉన్న పోషక విలువలు (1.43:0.78:0.82 శాతం ఎన్పికె), పశువుల పేడ యొక్క పోషక విలువలు (0.5:0.2-0.4:3-5 శాతం ఎన్పికె) కంటే అధికంగా ఉంటుంది.
6. ప్రత్తి వ్యవసాయ వ్యర్థాలు ఆచ్ఛాదనగా ఉపయోగించుకోవచ్చు.
7. పుట్టగొడుగుల పెంపకంలో మైక్రో క్రిస్టలిన్ సెల్యులోజ్ కోసం ప్రత్తి కర్రను వినియోగించుకోవచ్చు.
8. ఎండిన ప్రత్తి కట్టెలను ప్యాకింగ్ మెటీరియల్, పార్టీకల్ బోర్డులు, హార్డ్ బోర్డులు, కరుగేటెడ్ బోర్డులు, బాక్స్లు, పేపర్ పల్ప్ మరియు ప్లైవుడ్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. వీటి తయారీ కోసం రైతులు ప్రత్తి కట్టెలను ఫ్యాక్టరీలకు అమ్మటం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చు.
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో ఫ్యాక్టరీ యజమానులు తొలగించిన ప్రత్తి కట్టెలను టన్నుకు 300-400/- రూపాయల వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన మన రైతులు కూడా ప్రత్తి కట్టెలను ఈ విధంగా సద్వినియోగం చేస్తే కేవలం ప్రతి కట్టె అమ్మకం ద్వారా ప్రతి రైతుకు హెక్టారుకు 1200-1600/- రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు.
9. ప్రత్తి కట్టెతో పిడకలు తయారుచేసి ఫ్యాక్టరీల్లో, బ్రాయిలర్లలో బొగ్గుకు బదులుగా కూడా వాడవచ్చు.
10. ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థ అయిన కేంద్ర ప్రత్తి సాంకేతిక పరిశోధనా సంస్థ వారి గణాంకాల ప్రకారం ప్రత్తి అవశేషాలలో 58.5 శాతం సెల్లులోజ్, 14.4 శాతం హెమి సెల్యులోజ్ మరియు 21.4 శాతం లిగ్నిన్ ఉంటాయి. వీటి వలన ఈ అవశేషాలను జీవ శక్తిగా మార్చి బయోచార్, బయోగ్యాస్, ఇతనాల్ లాంటి జీవ ఇంధన తయారీకి ఉపయోగించడానికి ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రస్తుతం రైతులు దూది సేకరణ తర్వాత మొక్కలను తొలగించడానికి ఎకరానికి 600/- దాకా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు కారణంగా ప్రత్తి సాగు రైతులకు భారంగా మారుతోంది. సాగుదారులు పెట్టుబడి ఖర్చు పెరిగి అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకతను తొలగించడం రైతుకు అదనపు భారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యేకతలను సద్వినియోగం చేసుకుని పరిశ్రమల ఏర్పాటుకు యువతకు చేయూతనిస్తూ గులాబిరంగు పురుగు నివారణకు తోడ్పాటు అందించాలి.
మనుషులందరూ ఎవరికి వారుగా ఉంటే వ్యక్తులౌతారు, సంఘటితమైతే శక్తి అవుతారుఅందుకే పెద్దలు ”సంఘటన్ మే శక్తి హై” అని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎవరికి వారుగా ఉన్న రైతు సోదరులు అందరిని ఒక తాటిపైకి తీసుకువచ్చి సహకార రైతు సంఘాలు, ఖజ్పుఐ, రైతు సేవ సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పిఓ) ఏర్పాటు చేయడం ద్వారా అసంఘటిత రంగంలో ఉన్న రైతులు అందరినీ సంఘటిత రంగంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వము దేశ వ్యాప్తంగా 2023-24 నాటికి సుమారు 10,000 ఎఫ్పిఓల ఏర్పాటు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించింది. ఈ రైతు సంఘలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా వాటికి నాబార్డు, యన్.సి.డి.సి., నాబ్ కిసాన్ వంటి సంస్థల తరఫున ఆర్థిక సహాయ సహకారాలను అందజేస్తున్నారు.
రైతు సంఘాల ఏర్పాటుతో ప్రయోజనాలు:
1. రైతు ఉత్పత్తిదారుల సంస్థ: రైతులు ఎఫ్పిఓలుగా సంఘటితం అవ్వడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సంవత్సరానికి సుమారు 18 లక్షల రూపాయలు చొప్పున మూడు సంవత్సరాల వరకు ఆర్థిక సహకారాన్ని పొందే అవకాశం ఉంది. ఇట్టి డబ్బును సంఘాలు తమ సంఘంలో వ్యాపారానికి పెట్టుబడిగా వినియోగించుకోవచ్చు మరియు ఈ ఆర్థిక సహకారాన్ని సంఘాలు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం ఉండదు.
2. ఈ సంఘాలకు వ్యాపారాభివృద్ధికి కావలసిన నైపుణ్యం పెంపుదల శిక్షణలను మరియు అవగాహన కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చేపడతాయి.
3. రైతులు సంఘాలుగా ఏర్పడడం వల్ల తమకు కావల్సిన ఎరువులు పురుగు మందులు, విత్తనాలు వంటి వ్యవసాయ ఇన్పుట్లను టోకుగా అతి తక్కువ ధరలకే కొనుగోలు చేసే అవకాశం ఏర్పడుతుంది.
4. కస్టం హైరింగ్ సెంటర్: వ్యవసాయ అవసరాలకు కావలసిన పనిముట్లను ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండేవిధంగా ఈ సంఘాలు కస్టం హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ యంత్రాల ద్వారా సంఘంలోని సభ్యులు అన్ని రకాల వ్యవసాయ పనిముట్లను అనుకున్న సమయానికి, అతి తక్కువ ధరలో వినియోగించుకునే అవకాశం ఉంది. అలాగే సంఘానికి కూడా ఆదాయం సమకూరుతుంది.
5. NABARD : నాబార్డ్ వంటి జాతీయ వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు ప్రత్యేకంగా ఈ రైతు సంఘాల నిర్వహణ కొరకు ”నాబ్ కిసాన్” అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చేసి అతి తక్కువ వడ్డీ రేటుతో అత్యధిక రుణాన్ని మంజూరు చేస్తున్నాయి. అలాగే ‘గ్రామీణ బండారన్ యోజన’లో భాగంగా ఈ సంఘాలు కమ్యూనిటీ గోదాములు నిర్మించుకోవడానికి 25 శాతం సబ్సిడీ లేదా గరిష్ఠంగా రూ. 2.25 కోట్లు సబ్సిడీ మంజూరు చేస్తుంది. అంతేకాకుండా ‘క్రెడిట్ గ్యారంటీ ఫండ్’లో భాగంగా ఈ సంఘాలు బయటి బ్యాంకులలో తీసుకునే రుణాలకు నాబార్డ్ పూచీకత్తు అందిస్తుంది.
6. NCDEX: నేషనల్ కమోడిటీ డెరివేటివ్ ఎక్స్ఛేంజ్ అనే జాతీయ సంస్థ ఈ రైతు సంఘాలకు ఆన్-లైన్ వేదికగా జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో తమ పంట ఉత్పత్తులను అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాకుండా పంట కోత, పంట శుద్ధి మరియు రవాణా కొరకు అయ్యే ఖర్చులో 50-75 శాతం ఖర్చును ఈ సంస్థ రైతుకు అదనంగా చెల్లిస్తుంది.
7. Spice Board : జాతీయ సుగంధద్రవ్యాల బోర్డు వారు పసుపు ఉత్పత్తిదారుల సంస్థలకు బాయిలర్లు, పాలిష్ మిషిన్, పసుపు తీసే యంత్రాలు, టార్పాలిన్లు మొదలగు పరికరాలను 50 శాతం సబ్సిడీతో అందించడమే కాకుండా నాణ్యమైన పసుపు ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో నేరుగా అమ్ముకునే అవకాశాలను రైతులకు కల్పిస్తున్నాయి.
8. e-NAM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ”ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ-నామ్)” అనే జాతీయ ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థలో రిజిస్టర్ అయిన సంఘాలకు తమ పంట ఉత్పత్తులను జాతీయ మార్కెట్లో అనుకున్న రేటుకి అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి.9. ఈ రైతు సంఘాలకు సుమారు 100 కోట్ల టర్నోవర్ వరకు కూడా ఆదాయపు న్ను నుండి మినహాయింపు ఇవ్వడం జరిగినది.10. పంటల ఉత్పత్తి, కోతలు, సేకరణ, గ్రేడింగ్, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలలో ఈ రైతు సంఘాలకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. రైతు సోదరులందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఈ చేయూతను వినియోగించుకొని రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మరియు సహకార సంఘాలుగా ఏర్పడి సమిష్టి కృషితో ఉమ్మడి విజయం సాధించి సహకార వ్యవస్థ యొక్క సత్ఫలితాలను ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా.
బి. రాజ్కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి, నిర్మల్ జిల్లా. ఫోన్: 9014205493
రాష్ట్రంలో ప్రతి రైతు తొలకరి వర్షాలు పండటంతోటే వ్యవసాయం సాగు పనులు ప్రారంభిస్తారు. ఇలా ఖరీఫ్, రబీ (యాసంగి) మరియు నీటి వసతి కల్గిన చోట వేసవి పంటలను కూడా వేస్తారు. ఇలా పండించినటువంటి పంటల కోతల అనంతరం మళ్ళీ ఖరీఫ్ పంటలు వేసుకోవడం ప్రారంభమై వర్షాలు మొదలయ్యే నాటికి భూమిని దున్నకుండా వదిలేస్తుంటారు. దీని ద్వారా కలుపు మొక్కలు, ఇతర గడ్డి జాతి మొక్కలు భూమిలో పెరిగి పురుగు మందుల అవశేషాలు కూడా భూమి లోపల ఉండిపోతాయి. ఈ కారణాల ద్వారా మనం (రైతన్న) వేసుకొనే వివిధ పంటలకు కావల్సిన లోతైన బీజపీఠం ఏర్పడదు, తద్వారా దిగుబడి తగ్గుతుంది.
వేసవి దుక్కుల ప్రాముఖ్యత:
యాసంగి, వేసవి పంటలకు చేసేటటువంటి లోతు దుక్కులను వేసవి దుక్కులు అంటారు. ఎంత లోతుగా దుక్కి దున్నుకోవాలనేది మనం వేయబోయే పంటనుబట్టి కూడా ఉంటుంది. లోతు వేర్లు పంటలకైతే (కంది, ఆముదం, పత్తి మొ||) లోతుగా దున్నుకోవాలి. మొక్కజొన్న, జొన్న, వేరుశనగ మొదలగు పంటల వేర్లు మధ్యరకంగా లోతు ఉంటే 15-20 సెం.మీ. లోతు సరిపోతుంది. ముఖ్యంగా దున్నే విధానాన్ని, నేల స్వభావాన్ని బట్టి ఎంచుకోవాలి. లోతుగా నేలను తిరగబడేటట్టుగా దున్నాలనుకుంటే మోల్డుబోర్డు నాగలితో దున్నుకోవాలి. దుక్కిలో పశువుల ఎరువును భూమిలో కలిసేటట్లుగా మోల్డ్బోర్డ్ నాగలి ద్వారా చేసుకోవచ్చు. అలాగే డిస్క్లను వాడి కూడా గడ్డి, గరికను భూమిలో కలియదున్నవచ్చును. నేల లోపలి పొరలు గట్టిపడి మురుగు నీటి సౌకర్యం లేనపుడు, గాలి, నీటి శాతం తగ్గుతుంది. దీని ద్వారా మొక్కల వేర్లు పెరుగుదల పోషకాల లభ్యత, శ్వాసక్రియ (మొక్కలకు) లాంటి చర్యలు తగ్గి మొక్క చనిపోతుంది. లోతుగా దున్నినప్పుడు గట్టిపొర విచ్ఛిన్నమై నేల గుల్లగా తయారవడమే కాకుండా నేలలో గాలి శాతం మరియు నీటిని పీల్చుకునే లక్షణాలు పెరుగుతాయి. తద్వారా సూక్ష్మజీవుల సంతతి, చర్యలు పెరుగుతాయి. దీని వల్ల నేలలోని సేంద్రియ పదార్థాలు త్వరగా విచ్ఛిన్నమై పోషకాలుగా విడుదల అవుతాయి. మరియు కలుపు మొక్కల వేర్లు, పురుగు మందుల అవశేషాలు నేలలో ఉంటాయి. వీటిని లోతు దుక్కుల ద్వారా విష పదార్థాలు విచ్ఛిన్నమై పంటల దిగుబడి పెరుగుతుంది. మరియు వర్షపు నీరు లోపలి పొరలలోకి ఇంకి భూమి సారాన్ని పెంచుతుంది. వేసవి దుక్కి దున్నటం ద్వారా కలుపు మొక్కలన్నీ వేర్లతో పెకిలించి నేల లోపలి పొరల్లోకి చేరతాయి. దీని వలన సూర్యరశ్మి సోకి కలుపు మొక్కల విత్తనములు నిర్వీర్యం అవుతాయి. వేసవి దుక్కి దున్ని నేలను తిరగవేయడం వలన నేలలోని చీడపురుగు థలన్ని నేలపైకి రావడం వలన పకక్షులు వాటిని తిని చంపి వేస్తాయి. మరియు వేసవిలోని అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక చనిపోతాయి.
వేసవి దుక్కుల ద్వారా లాభాలు:
నేల భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. తద్వారా వివిధ పంటలకు కావలసిన లోతైన బీజ పీఠం ఏర్పడుతుంది. వేసవిలో దున్నే ముందు నేలలో పశువుల ఎరువుగాని, కంపోస్టుగాని మరియు చెరువులోని నల్లమట్టిని గాని వెదజల్లడం వలన నేల సారవంతమౌతుంది. దుక్కి (ఒండ్రుమట్టి) చేయడం కంటే ముందు పశువుల మందను గాని, గొఱ్ఱెలు లేదా మేకల మందను గాని ఉంచడం వల్ల వాటి ఎరువు నేలకు చేరి సేంద్రియ పదార్థం పెరిగి భూసారం పెరుగుతుంది. చెరువు మట్టిలో మనకు నత్రజని-0.3 శాతం, భాస్వరం – 0.2 శాతం మరియు పొటాష్-0.4 శాతం లభిస్తాయి. ఈ సారవంతమైన చెరువులోని ఒండ్రుమట్టిని పొలంలో వేసుకొని భూసారం పెంచుకోవచ్చు. వేసవిలో లోతు దుక్కులు చేయడం ద్వారా కలుపు మొక్కలు వాటి విత్తనాలు నశింపబడతాయి. మొండి జాతికి చెందిన తుంగ వంటి కలుపు మొక్కలు అన్ని రకాల నేలల్లో సమస్యాత్మకంగా మారుతున్నవి. ఇలాంటి కలుపు మొక్కల దుంపలు లోతు దుక్కులు చేయడం వలన సూర్యరశ్మికి బహిర్గతమై చనిపోతాయి. మంచి నేలల్లో మట్టి రేణువులు 50 శాతం, నీరు 25 శాతం, గాలి 25 శాతం ఉంటుంది. ఇవి ఏ కారణం చేతనైనా నేల లోపలి పొరలు గట్టిపడి, మురుగునీరు పోవు మార్గం లేనపుడు గాలి మరియు నీటి శాతం మొక్కకు తగు మోతాదులో తగ్గుతుంది. దీని ద్వారా పంటల మొక్కల వేర్లు పెరుగుదల, పోషకాల లభ్యత తగ్గి, శ్వాసక్రియ లాంటి చర్యలు తగ్గుతాయి. వీటి ద్వారా పంట మొక్కలు చనిపోవడం జరుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి వేసవి దుక్కులు చేయడం ద్వారా భూమిలోని గట్టి పొరలు విచ్ఛిన్నమై నేల గుల్లబారుతుంది. మరియు నేలలో గాలి శాతం, నీటిని పీల్చుకొనే లక్షణాలు పెరుగుతాయి. వీటి ద్వారా సూక్ష్మజీవుల సంతతి చర్యలు పెరుగుతాయి. కావున వేసవి దుక్కులు దున్నుకొని, నేల సారవంతత కాపాడుతూ అధిక దిగుబడులు పొందవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, ప్రత్తి, కంది, సోయాచిక్కుడు మరియు వేరుశనగ పంటలు ప్రధానంగా సాగు చేస్తున్నారు. వాతావరణంలో వస్తున్న పెనుమార్పులను గమనించి రైతాంగం వ్యవసాయ పద్ధతులను మార్చుకోవాలి. సహజ వనరులైన నేల, నీరు, గాలిని సంరక్షించుకుంటూ, ఉత్పాదకతను, లాభాలను పెంచుకోవాలి. పంటలలో గింజలు, అవశేషాలు ఉత్పత్తవుతున్నాయి. వీటి నుండి ఎంతో విలువైన ఉపఉత్పత్తులను, విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం ద్వారా అధిక నికర లాభం పొందవచ్చు. వ్యవసాయానికి పాడి, కోళ్ళు, గొర్రెల పెంపకం మంచి అనుబంధ వ్యాపకాలు, సమగ్ర వ్యవసాయం చేపట్టి, పంటల అవశేషాలను ఆధునిక పద్ధతులతో విలువలు జోడించిన మేతగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. వ్యవసాయంలో ఏదీ వృథా కాదు. మన ప్రధాన పంటల అవశేషాలను క్రింది విధంగా సద్వినియోగ పరచుకోవాలి.
వరి : ఊక బూడిదను సమస్యాత్మక నేలలు సవరించడానికి సిమెంట్ మరియు ఉక్కు తయారీలో సంకలిత పదార్థంగా వాడతారు. నూకలను పులియబెట్టి బీరు, పిండితో ఇడ్లీ, దోశ, నూడుల్స్ తయారు చేస్తారు.
వరిగడ్డి: హెక్టారుకు 6-7.5 టన్నుల గడ్డి వస్తుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రంలో వరిగడ్డిని తగులబెట్టడం ద్వారా కాలుష్యం పెరిగిపోతుంది. తగులబెట్టకుండా యూరియాతో మాగబెట్టి, పోషక విలువలు పెంచి పశువుల మేతగా వాడుకోవాలి. పొలంలో కలియదున్నినప్పుడు కర్బన/నత్రజని నిష్పత్తి ఎక్కువవడం వల్ల పంటకు నత్రజని లభ్యత తగ్గుతుంది. కావున సిఫారసు చేసిన నత్రజనికి 25% అధిక నత్రజని వాడవలెను. ఈ క్రియవల్ల దీర్ఘకాలంలో నేల సేంద్రియ కర్బనం పెరుగుతుంది. జింక్, కాపర్, ఇనుము మరియు మాంగనీస్ సూక్ష్మ పోషకాల లభ్యత పెరుగుతుంది. పొలంలో గడ్డి తొలగించకుండానే ”హ్యాపీసీడ్ డ్రిల్లర్” యంత్రంతో మొక్కజొన్న, జొన్న మరియు ఇతర పంటలను విత్తుకోవచ్చు. యంత్రాలతో కట్టలు కట్టి విద్యుదుత్పత్తి చేయవచ్చు. పుట్టగొడుగుల పెంపకం మరియు పశువుల పాకలలో పాన్పుగా వాడటం ద్వారా పశువు ఆరోగ్యం, పాల ఉత్పత్తి పెంచడానికి వాడతారు. పనికిరాని గడ్డిని వానపాముల ఎరువుగా తయారు చేసుకోవచ్చు.
మొక్కజొన్న: మొక్కజొన్న కోత తర్వాత కాండం, ఆకులు, గింజలు ఒలిచిన కంకి మిగులుతాయి. పిండిపదార్థాలు కలిగిన ఈ చక్కెరలను పులియబెట్టి పెట్రోల్కు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్ను తయారు చేస్తారు. గుజ్జు చేసి కాగితం తయారు చేయవచ్చు. మండించి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అవశేషాలను పిండి చేసి, సాంద్రీకృత దాణాతో 75:25 నిష్పత్తిలో కలిపి ఎండు టి.యం.ఆర్. (టోటల్ మినరల్ రేషన్) దాణాను తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా చూర్ణాన్ని ప్లాస్టిక్, జిగురు, వెనిగర్ మరియు కృత్రిమ తోళ్ళ తయారీలో పూరకంగా వాడుతారు. పనికి రాని చొప్పను మల్చింగ్గా, దొడ్డిలో పాన్పుగా లేదా వానపాముల ఎరువుగా వాడుకోవచ్చు. పంట పూతథలో బెట్టకొచ్చి లేదా ఇతర కారణాల వల్ల ఎండిపోతుంటే, అటువంటి చొప్పను ”సైలేజ్”గా మార్చుకొని వాడుకోవచ్చు. మొక్కజొన్న, జొన్న, రాగి వంటి చిరుధాన్యాల పంటల కంకులు కోసిన వెంటనే మిగతా మొక్కను సన్నగా కత్తిరించి డ్రమ్ములల్లో సైలేజ్ చేసుకోవడం ద్వారా నాణ్యమైన పశుగ్రాసాలు వృథా కాకుండా సమర్ధవంతంగా పశువులకు మేపుకోవచ్చును.
ప్రత్తి: దూదిపోగా మిగిలిన కట్టె, ఆకులు, బెరడు కలిపి హెక్టారుకు 3 టన్నులు వస్తుంది. దూది తీసి వెంటనే నవంబరు నెలలో ఆకులను, మొగ్గలను మేకలకు, గొర్రెలకు మేపుకోవాలి. తర్వాత మొదళ్ళను తొలగించి ”గులాబి రంగు” పురుగు ఉత్పత్తిని తగ్గించాలి. కట్టెలను కొద్ది మొత్తంలో పంట చెరకుగా వాడి, పెద్ద మొత్తంగా చెక్క పరిశ్రమకు, కార్డ్బోర్డ్ పరిశ్రమకు, కాగితం, పరిశ్రమకు వాడవచ్చును. ప్రత్తి కట్టెలో 68% సెల్యులోస్, 26% లిగ్నిన్ మరియు 7% బూడిద ఉంటుంది. 1000 టన్నుల ప్రత్తి కట్టెతో 100 కె.వి. సామర్థ్యపు 5 విద్యుత్తు కేంద్రాలను ఒక సంవత్సరం నిర్వహించుటకు సరిపోతుంది. పత్తి కట్టెను ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ట్రాక్టరుతో నడిచే మల్టీక్రాప్ బయోష్రడ్డర్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి భూమికి అందించినప్పుడు నేలలో త్వరగా కలిసిపోయి కుళ్ళిపోతాయి. ఒక ఎకరం పత్తి కెట్టె నుంచి 10 కిలోల నత్రజని, 27 కిలోల పొటాష్ నేలకు అందించబడుతుంది. ప్రత్తి పంటను నేలలో కలియదున్నటం వల్ల సేంద్రియ కర్బన పదార్థం పెరుగుతుంది. భూభౌతిక స్థితులు మెరుగుపడతాయి. మేలు చేసే సూక్ష్మజీవులు క్రియాశీలమవుతాయి.
పంటల అవశేషాల వినియోగ లాభాలను గుర్తెరిగి పారిశ్రామికవేత్తలు, రైతులతో అనుసంధానమై ప్రాంతీయ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రైతు సోదరులు సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఆచరించి పశువులను, కోళ్ళను పెంచి పంటల అవశేషాలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలి. వాతావరణ కాలుష్య నివారణ అందరి బాధ్యత. రైతుసోదరులు అధిక లాభాలను పొందుతూ పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సాధారణంగా కొబ్బరి అనగానే గోదావరి జిల్లాలు, సముద్రతీర ప్రాంతాలు, కేరళ లాంటి ప్రాంతాలలోనే పండుతుందంటుంటారు. కానీ ఇది సరైన అభిప్రాయం కాదు. కొబ్బరిని రాయలసీమలో కూడా పండించి విజయం సాధించి కొబ్బరి నుంచి ఆదాయం పొందవచ్చు అని నిరూపిస్తున్నారు కడప జిల్లా రాజంపేటకు చెందిన వెంకట నరసారెడ్డి.
వెంకట నరసారెడ్డిది వ్యవసాయ కుటుంబం. వీరి పూర్వీకుల నుంచి వ్యవసాయమే వీరి ప్రధాన వృత్తి. డిగ్రీ వరకు చదివిన నరసారెడ్డి ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా కుటుంబ వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అందరిలాగానే వ్యవసాయంలో వస్తున్న మార్పులను తన సాగులో కూడా అమలు పరుస్తూ అన్నిరకాల పద్ధతులు పాటిస్తూ వస్తున్న నరసారెడ్డి ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని తన పంటల సాగుని ప్రకృతి వ్యవసాయ విధానంలోకి 2011వ సంవత్సరంలో మార్చి అప్పటినుండి ఎలాంటి రసాయానాలు అందించకుండా కేవలం ప్రకృతి సేద్య విధానాలను అవలంభిస్తూ తన సాగును కొనసాగిస్తున్నారు. ఇందుకుగాను మన దేశీయ జాతి గోవులను పోషిస్తూ వాటి వ్యర్థాలను పంటలసాగుకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఆవులు, ఎద్దులు కలిపి మొత్తం 14 పశువులను పోషిస్తున్నారు. ఇందులో ఒంగోలు, సాహివాల్, కాంగ్రెజ్, గిర్ రకాలైన మన దేశీయ జాతులు ఉన్నాయి. వీటికి అవసరమైన పశుగ్రాసాలను పూర్తి ప్రకృతి సేద్య విధానాలను సాగు చేస్తూ పశువులకు అందిస్తూ వస్తున్నారు.
మొత్తం వీరు 15 ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగుచేస్తున్నారు. అందులో కొబ్బరి 31/2 ఎకరాలలో, 13/4 ఎకరాలలో మామిడి, 33/4 ఎకరాలలో నిమ్మ, 2 ఎకరాలలో అరటి, 11/2 ఎకరాలలో ఆముదం, మునగ పంటలు సాగు చేస్తూ మిగతా పొలంలో పశువులకుగాకు కో-4, సూపర్ నేపియర్, థరథ గడ్డి లాంటి పశుగ్రాసాలను సాగు చేస్తున్నారు. ఈ 15 ఎకరాలలో 2011వ సంవత్సరంనుండి ఎలాంటి రసాయానాలు ఉపయోగించకుండా కేవలం ప్రకృతి సేద్య పద్ధతులనే పాటిస్తు న్నారు. ప్రతి పంటకు క్రమం తప్ప కుండా పశువుల ఎరువు అందించడంతోపాటు జీవామృతం, వానాపాముల ఎరువులను అందిస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో బెల్లం ధర పెరగటం మరియు బెల్లం సక్రమంగా అందుబాటులో ఉండకపోవడంతో జీవామృతాన్ని ఉపయోగించడం ఆపి వేసి ఆవు మూత్రాన్ని భూమికి అందిస్తున్నారు. వీరు సాగు చేసే పంటలకు చీడపీడల ప్రభావంగా తక్కువగా ఉంటుంది కాబట్టి కషాయాలు మరియు ద్రావాణాల అవసరం పెద్దగా ఉండటం లేదు. తప్పనిసరి పరిస్థితులలో అవసరమైతే చీడపీడల నివారణకు వివిధ రకాలు ఆకులు, ఆవుమూత్రం, పేడల లాంటి వాటితో కషాయాలు తయారు చేయించి పంటలకు ఉపయోగించి చీడపీడలను నివారిస్తున్నారు.
కొబ్బరి:1985వ సంవత్సరంలో 31/2 ఎకరాలలో కొబ్బరి మొక్కలు నాటించారు. ఇందుకుగాను రాజంపేట నర్సరీ నుంచి ఈస్ట్కోస్టు రకం కొబ్బరి మొక్కలు తెప్పించి లైనుకి లైనుకి మరియు మొక్కకు మొక్కకు 18 అడుగుల దూరం పాటించి నాటించారు. ప్రస్తుతం 31/2 ఎకరాలకుగాను 375 కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరిలో అంతరపంటగా అవకాశాన్నిబట్టి అరటి సాగు చేస్తుంటారు. కొబ్బరి లైన్ల మధ్యలో ట్రెంచ్ తీసి ఆ ట్రెంచ్లోనే కొబ్బరి మొక్కల వ్యర్థాలను వేసి అక్కడే వీటిని అందింస్తుంటారు. కొబ్బరి మొక్కల పాదుల దగ్గర నీటిని అందించరు. ఈ పద్ధతిని గుజరాత్కి చెందిన ప్రముఖ ప్రాకృతిక రైతు కీ||శే|| భాస్కర్ సావే గారు పాటించారు. అదే పద్ధతిని నరసారెడ్డి గారు తెలుసుకుని తమ పొలంలో అమలు చేస్తూ తక్కువ శ్రమతో మంచి దిగుబడిని తీస్తున్నారు. ప్రస్తుతానికి సగటున ఒక్కొక్క చెట్టునుంచి సంవత్సరానికి సుమారు 200 కాయలవరకు పొందుతూ ఒక్కొక్క కొబ్బరి కాయను రూ. 15/- నుంచి 20/- ల వరకు అమ్మకం చేస్తూ వస్తున్నారు. దిగుబడిని కొయ్యకుండా ఎండి రాలి పడిపోయిన కొబ్బరికాయలను టెంకాయలుగా అమ్ముతున్నారు.
మామిడి: 1990వ సంవత్సరంలో మామిడి మొక్కలు నాటించారు. ప్రస్తుతం 90 చెట్లు ఉన్నాయి. వీటిలో తోతాపూరి, నీలం, బంగినపల్లి మొ||లగు రకాలు ఉన్నాయి. అన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ ఆరోగ్యకరమైన దిగుబడిని పొందుతున్నారు.
నిమ్మ: మొత్తం 33/4 ఎకరాలలో నిమ్మసాగులో ఉంది. ఇందులో 13/4 ఎకరాలలో హైడెన్సిటీలో 650 నిమ్మ మొలకలు 2015లో నాటించారు. నిమ్మలో అంతరపంటగా 100 అరటి మొక్కలు సాగు చేస్తున్నారు. 2 ఎకరాలలో మామూలు పద్ధతిలో నిమ్మ మరియు అంతరపంటగా అరటి సాగుచేస్తున్నారు. 2021లో కురిసిన అధిక వర్షాలకు నిమ్మపంట దెబ్బతింది. పూత సక్రమంగా రాలేదు. కాబట్టి 2022 ఏప్రిల్ నేలలో నిమ్మకు గిరాయికి బాగా పెరిగింది. ఎపుడు లేనంత రేటు నిమ్మ రైతులకు దక్కుతుంది. 50 కిలోల బస్తా రూ. 3,500/- నుంచి 4,000/- వరకు నడుస్తుంది. కర్నూల్ ప్రాంతంలో వ్యాపారస్తులు రైతుల దగ్గరనుంచి ఒక్కొక్క నిమ్మకాయ రూ. 6/-ల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. నిమ్మ పంట రైతులకు మంచి ఆదాయం వస్తుంది. కానీ వీరివద్ద ప్రసుత్తం పంట లేదు. పంట రావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని నరసారెడ్డి అన్నారు.
అరటి: 2 ఎకరాలలో ఎలకి, అమృతపాణి రకాల అరటిని సాగుచేస్తున్నారు. అన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ ఆరోగ్యకరమైన అరటి పంటను పండించి మంచి ధరకు అమ్ముతూ వస్తున్నారు.
ఆముదం, మునగ, పశుగ్రాసాలు: 11/2 ఎకరాలలో ఆముదం మరియు మునగ, మిగతా పొలంలో పశువులకు గాను పశుగ్రాసాలను సాగు చేస్తున్నారు. 2021 సం||లో కురిసిన అధిక వర్షాలకు ఆముదం, మునగ పంటలు దెబ్బతిన్నాయి. పశుగ్రాసాల విషయానికి వస్తే పశువులు ఆరోగ్యంగా ఉండాలంటే వాటికి ధాన్యపు జాతి, పప్పుజాతి పశుగ్రాసాలను తప్పనిసరిగా అందించాలి. కాబట్టి ఈ రెండు రకాలలో బహువార్షిక పంటలు ఎన్నుకున్నారు. ధాన్యాపు జాతి బహువార్షిక పశుగ్రాసం కో.4, సూపర్నేపియర్, పంటలు మరియు పప్పుజాతి బహువార్షిక పశుగ్రాస పంట అయిన థశరథగడ్డి (హెడ్జ్ లూసర్న్)లను పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ ఆవులకు మరియు ఎద్దులకు అందిస్తూ వస్తున్నారు.
ఉన్నత చదువులు చదివిన నరసారెడ్డి వారి ప్రధాన వృత్తి అయిన వ్యవసాయంలో స్థిరపడి 15 ఎకరాల వ్యవసాయ భూమిలో వివిధ రకాల పంటలు సాగు చేస్తూ మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ తన భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన భూమిని మరియు కలుషితంకాని గాలిని అందించడంతోపాటు ప్రస్తుత సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారానికి సేంద్రీయ సాగే శరణ్యం అని ఆ దారిలో నడుస్తూ అందుకు అవసరమైన పశువులను పోషిస్తూ వీటన్నింటి ద్వారా సంవత్సరానికి 8 లక్షలకు తగ్గకుండా ఆదాయం పొందుతూ కుటుంబ సభ్యుల సహకారాంతో పంటల సాగు చేస్తూ ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.
సుస్థిరంగా అధిక పాల ఉత్పత్తి కావాలంటే పాడి పశువుకు పోషకాలు గల ఆహారం అందించాల్సిందే. పశువుకు అందించే ఆహారంలో నాణ్యమైన పచ్చిమేత, ఎండుమేతతో బాటు మాంసకృత్తులు, ఖనిజలవణాలు మరియు విటమిన్లు తగిన మోతాదులో దాణా రూపంలో అందిస్తుంటాం. పశువు శరీర అవసరాలను, పెరుగుదల ప్రత్యుత్పత్తి, పాల ఉత్పత్తుల కోసం ఇదెంతో ఉపకరిస్తుంది. తక్కువ పాలనిచ్చే పశువు తినే ఆహారంలో 66% శరీర పోషణకు ఉపయోగించుకోగా, అధిక పాల దిగుబడి నిచ్చేవి మాత్రం కేవలం 35% మాత్రమే శరీర పోషణకు ుపయోగించుకుంటాయి. పాలఉత్పత్తికయే ఖర్చులో మేతకే 55% మేర ఉంటుంది కాబట్టి, వీలైనంత నియంత్రణలో పోషకాల ఆహారం, స్థానిక వనరులతో తయారు చేసినవి ఉపయోగిస్తేనే, పాల ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. గడ్డి కత్తిరించి మేపడం అలవాటు చేయాలి.
పోషకాల గని లాంటి దాణాలో సాధారణంగా మొక్కజొన్నలు, సజ్జలు, రాగులు, ఉలవలు, శనగలు, చెక్కలు, వరి తవుడు, చెరకు మడ్డి, ఖనిజ లవణాలు, విటమిన్లు, ఉప్పు లాంటి స్థూల పోషకాలుంటాయి.పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణాలు కలిపి ఒకేసారి మిశ్రమ దాణాగా అందించడాన్ని మిశ్రమ ఆహారం అంటారు. ఈ పద్ధతి ద్వారా పశువు జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అంతేకాక, కూలీ ఖర్చు ఆదా అవుతుంది. ఇలా ఆహారం అందించడం ద్వారా పశువు పొట్టలో ఉదజని సూచిక స్థిరంగా ఉండి సూక్ష్మజీవుల పెరుగుదల అధికంగా ఉంటుంది. సరిగ్గా లెక్కకట్టి మేపడం సాధ్యం అవుతుంది కాబట్టి పశుగ్రాసం, దాణా వృథా కూడా అరికట్టవచ్చు.
పశుగ్రాస కత్తిరింపు యంత్రంలో పచ్చిమేతను ముక్కలుగా కత్తిరించి, ఎండుగడ్డి, చొప్ప కూడా కత్తిరించి, దాణా కలిపి, 15 నుండి 20 నిమిషాలు మంచిగా కలిపి రోజుకు 3-4 సార్లు పశువుకు మేపాలి. మేతలు, దాణాల కొలతకై డిజిటల్ మీటర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దాణా తొట్టిలో సమంగా పడేలా చేసే యంత్రాలు కూడా దొరుకుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో పంటల వ్యర్థాలతో సైతం ఇలాంటి మిశ్రమ ఆహారం తయారు చేయవచ్చు. వివిధ వ్యవసాయ వ్యర్థాలైన చెరకు పిప్పి, జొన్నచొప్ప, ఎండుగడ్డి, పొద్దుతిరుగుడు కట్టె, వరిగడ్డి, ప్రత్తి కట్టె, సుబాబుల్ ఆకులు, ఎండిన టేకు ఆకులు, ఎండిన మామిడి ఆకులు, వేరుశనగ కట్టె లాంటి ఎన్నింటినో ఈ మిశ్రమ దాణా తయారులో తగు మోతాదుల్లో వాడవచ్చు. రుచికోసం మొలాసిస్ కలిపితే, దాణా రుచికరంగా ఉంటుంది.
ఈ పద్ధతి ద్వారా పశువులకు ఎక్కువ పీచు ఉండేపదార్థాలు సద్వినియోగంలోకి తేవచ్చు. కడుపు ఉబ్బరం ఏర్పడకుండా కొద్దికొద్దిగా మేపడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మిశ్రమ ఆహారం పాలఉత్పత్తి ఖర్చును తగ్గించడమేకాక, వెన్నశాతం పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆకులలో అధిక మాంసకృత్తులుండే చెట్లయిన మునగ, మలబారు, గ్లైరిసిడియా, సుబాబుల్, అవిశె, తురకవేప లాంటి చెట్ల ఇంటి ఆవరణలో పెంచి, ఇట్టి చెట్ల ఆకులు వినియోగంలోకి తేవడం, పాల ఉత్పత్తి ఖర్చు తగ్గుదలకు మొదటి మెట్టు. ఏ వస్తువైనా అధికంగా ఉత్పత్తి అయినప్పుడు, అట్టి వస్తువుకు వినియోగదారుడు చెల్లించే ధర తగ్గుతుంది. కానీ, ఇది పాడిపరిశ్రమ విషయంలో జరగడం లేదు. అందుకే విరివిగా దాణా కర్మాగారాల స్థాపన జరిగి, పచ్చిమేత, అజొల్లా, మాగుడు గడ్డి లాంటివి మహాత్మాగాంధీ ఉపాధి పథకంలో విస్తృతపరిస్తేనే, పాడి పల్లవిస్తుంది. పాల దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది.
మన సంప్రదాయ వ్యవసాయ విధానమైన సమగ్ర వ్యవసాయ విధానంతో రైతులు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని ‘నాబార్డు’ చైర్మన్ చింతల గోవిందరాజులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్తంగా తిరుపతిలో ఏప్రిల్ 8,9,10 తేదీల్లో ఇస్కాన్ మైదానంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల ‘రాయలసీమ ఆర్గానిక్ మేళా’ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.
మార్కెటింగ్ సమస్య లేని తిరుపతి లాంటి కేంద్రాల్లో ఆర్గానిక్ విక్రయాలకు అవకాశం ఉందని ఆయన విక్రయదారులకు సూచించారు. సేంద్రియ వ్యవసాయానికి సహాయ సహకారాలు అందిస్తామని నాబార్డు చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆర్గానిక్ స్టోర్ ఏర్పాటు చేసేందుకు టిటిడి గానీ, ప్రకృతి వ్యవసాయదారులు గానీ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పురాతన కాలంలో ప్రజలు ఆరోగ్యంగా, బలిష్టంగా ఉండడానికి ప్రధాన కారణం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన పంటలను తినడమేనని వివరించారు. నేడు రసాయన ఎరువుల వాడకం రోజురోజుకూ పెరగడం వల్ల విషపూరిత ఆహార పదార్థాలు ఎక్కువగా లభిస్తున్నాయని, ఈ కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. కల్తీ లేని ఆహార ఉత్పత్తులను అందించడం ద్వారానే ఆరోగ్య భారత్ను చూడగలమని పేర్కొన్నారు. నాబార్డు ద్వారా ప్రకృతి వ్యవసాయం చేసే వ్యవసాయదారులను తాము ప్రోత్సహిస్తామని తెలిపారు. 1982లో 4 వేల కోట్లతో ప్రారంభమైన నాబార్డ్ నేడు 7 లక్షల 50 వేల కోట్ల రూపాయలకు చేరుకుందని తెలిపారు.
రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ వై. వేంకటేశ్వరరావు మాట్లాడుతూ 2012 నుంచి సేంద్రియ వ్యవసాయ విధానాలపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రైతులు వినియోగదారుల్లో మార్పు కనిపిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం వ్యస్థాపకులు కుమారస్వామి మాట్లాడుతూ రసాయన వ్యవసాయానికి ఇచ్చే రాయితీలు సేంద్రియ వ్యవసాయానికి వర్తింపజేస్తే ప్రకృతి వ్యవసాయం ఊపందుకుంటుందన్నారు.
ప్రధాని నుంచి సామాన్యుడి వరకు...
భారతీయ కిసాన్సంఘ్ జాతీయ సంఘటన కార్యదర్శి దినేష్ కులకర్ణి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ఆరోగ్యం కోసం ప్రకృతి, గోఆధారి వ్యస్తాయంపై ఆధారపడడం మంచి పరిమాణం అన్నారు. ఆర్ఎస్ఎస్ సంయుక్త నిర్వహణ కార్యదర్శి విజయ్ ఆదిత్య మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయ విధానాలను పాఠ్యాంశాలుగా చేర్చితే దేశ వ్యవసాయ విధానంలో మార్పు తేవచ్చని వివరించారు. ఆప్కాబ్ ఎండీ శ్రీనాథరెడ్డి ప్రసంగిస్తూ సేంద్రియ రైతులు రైతు ఉత్పత్తిదరాఉలు సంఘంగా ఏర్పడితే అనేక సౌకర్యాలు, అవసరమైన శిక్షణ కార్యక్రమాలకు సహకరిస్తామని ప్రకటించారు. నాబార్డు సీజీఎం ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్ పెంపొందించేందుకు రూరల్ మార్టులను రాయితీలతో ప్రోత్సహిస్తామని తెలిపారు. గో-ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఉపాధ్యకక్షుడు గంగాధరమ్, ప్రధాన కార్యదర్శి భరత్వర్మ, 300 మందికి పైగా ప్రకృతి వ్యవసాయదారులు పాల్గొన్నారు.
వ్యవసాయాధారిత పర్యాటకం పర్యాటక రంగంలో ఒక నూతన ఒరవడిగా చెప్పుకోవచ్చు. రోజువారి యాంత్రిక జీవనంతో విసిగి వేసారిపోయి ప్రకృతి ఒడిలో మట్టి వాసనకు దగ్గరగా సేద తీరాలనుకునే నగరజీవులు ఎంతోమంది. తాము తినే అన్నం ఎలా పండిస్తారో, తాగే పాలు ఎలా పితుకుతారో, టమాటో మరియు వంకాయ మొక్కలకి తేడా తెలియని కార్పొరేటు స్కూలు విద్యార్థులు చాలామందే ఉన్నారు. ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ ఖర్చుతో రైతుల పొలాల్లో ఒక మోస్తరు మౌళిక సదుపాయాలు కల్పించటం ద్వారా వారికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు సృష్టించుకోవచ్చు.
పొలాల్లో విడిది చేస్తూ, వ్యవసాయంలోని రోజువారి కార్యక్రమాలను తెలుసుకుంటూ రైతుల యొక్క సాధక బాధల్ని అర్థం చేసుకోవడానికి, మరుగున పడిపోయిన తమ మూలాలను గుర్తు చేసుకునేందుకు, పిల్లలకు వ్యవసాయం గురించి అవగాహన కల్పించేందుకు, యాంత్రిక జీవనానికి అలవాటు పడిన సగటు నగరజీవికి ఈ తరహా పర్యాటకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి పర్యాటకాన్ని ప్రోత్సహించడం వలన రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు సృష్టించినట్లే అవుతుంది.
ఈ తరహా పర్యాటకాన్ని ప్రోత్సహించడం వలన లాభాలు
* విడిది చేయడానికి, సందర్శించడానికి రుసుము వసూలు చేయడం ద్వారా, పండిన వ్యవసాయ ఉత్పత్తులను అమ్మడం ద్వారా రైతులకు ఆదాయాన్ని కల్పించవచ్చు.* గ్రామాల్లో ఉండే నిరుద్యోగ యువత మరియు మహిళలకు ఉపాధి దొరుకుతుంది.
* ఆయా ప్రాంతాల్లో ఉండే కుటీర పరిశ్రమలకు (బొమ్మలు, చేనేత వస్త్రాలు, ప్రత్యేక తినుబండారాలు) ఊతం కల్పించినట్లు అవుతుంది.
ప్రభుత్వ చొరవ అవసరం:
రాష్ట్రంలో విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు, గోదావరి, కృష్ణా జిల్లాలు ఈ తరహా పర్యాటకానికి చాలా అనువైనవిగా భావించవచ్చు. సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో పాటు, వ్యవసాయ ఉద్యాన పంటల సాగు, డెయిరీ మరియు చేపల పెంపకం విరివిగా ఉండటం ఆ ప్రదేశాలకు కలిసివచ్చే అంశం. గత ప్రభుత్వం 2016-17లో ఈ తరహా పర్యాటకానికి ప్రోత్సాహం అందించే దిశగా ఆలోచనలు చేసినా ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ మరియు వ్యవసాయశాఖలు ఈ విషయమై దృష్టిసారిస్తే రైతులకు ఎంతో ప్రయోజనకరం.
మహారాష్ట్ర ఆదర్శం:
వ్యవసాయాధారిత పర్యాటకంలో మహారాష్ట్ర రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అగ్రిటూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ను 2005లో ఏర్పరచి, రైతులకు శిక్షణ మరియు ప్రోత్సాహకాలను అందిస్తోంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 30 జిల్లాల్లో 320కి పైగా అగ్రిటూరిజం సెంటర్లు ఉన్నాయి. 2014వ సంవత్సరంలో 0.40 మిలియన్లు, 2015లో 0.53 మిలియన్లు, 2016లో 0.70 మిలియన్ల పర్యాటకులు ఈ కేంద్రాలను సందర్శించినట్లు ఏ.టి.డి.సి. సర్వే లెక్కలు చెబుతున్నాయి. గ్రామీణ మహిళలకు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగైనట్లు తెలిపింది. 2016వ సంవత్సరంలో ప్రత్యేక టూరిజం పాలసీని కూడా తీసుకువచ్చి, వ్యవసాయాధారిత పర్యాటకానికి మరింత ఊతమిచ్చేలా అడుగులు వేస్తోంది.
గుడ్ల ఉత్పత్తికి లేదా మాంసానికి బ్రోయలర్ కోళ్ళు పెంచేందుకు కోళ్ళఫారాల్లో అపుడే పుట్టిన పిల్లలను పెంచి పెద్ద చేయడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమము. కోడిపిల్లల ఉత్పత్తి సంస్థలో ఎక్కడో జన్మించిన నవజాత కోడిపిల్లలు రైలులో, మోటారు వాహనాలలో, విమానంలో గంటల/రోజుల తరబడి ప్రయాణించి మన ఫారంలో అడుగుపెడతాయి. అవి చురుకుగా ఆరోగ్యంగా కనువింపుగా ఉంటె వాటిని దింపుకొని బ్రూడింగ్ చేస్తాము. దింపుకునే ముందు ఆ పిల్లలు మంచిగా, బాగుగా ఉన్నాయని నిశ్చయించుకున్న తరువాతనే దించుకుంటాము. చురుకుగా ఉంటె పిల్లలు నాణ్యంగా ఉన్నాయని ఊహించుకుంటాము. కోడి పిల్లలు ఆరోగ్యంగా, చురుకుగా, మంచిగా ఉండాలి. గలగల్లడుతూ బ్రూడింగ్ ప్రదేశంలో తిరగాలి. నీళ్ళు తాగాలి. మేతమేయాలి. పరిమాణంలో వ్యత్యాసం ఉండకూడదు. పెట్టెల్లో నలగకుండా ఉండాలి. ఎక్కువ సంఖ్యలో మరణించి ఉండరాదు. సాధారణంగా ఇవే మనం చూస్తాము.
కాని కోడిపిల్లల ఉత్పత్తి కేంద్రం వారి లెక్కలు వేరుగా ఉంటాయి. గుడ్ల నుండి ఎంత శాతం పిల్లలు పోదిగాయి? పెంకును పగలగోట్టి రాలేనివి (ఆరిచీచీరిదీవీ) ఎన్ని? 3 రోజుల మరణాల శాతం ఎంత? పిల్లల మధ్య వ్యత్యాసం అధికంగా ఉందా? అనే దానిపై లెక్కలు కట్టి కోడి పిల్లల ఉత్పత్తిలో మెరుగులు దిద్దుకుంటారు. కాని వాణిజ్య పద్దతులలో మనం పెంచే కోళ్ళ ఫారంలో పరిస్థితులు వేరు. వేసవిలో వేడి, వర్షాకాలంలో తేమ, తడి, శీతాకాలంలో చల్లదనం, ప్రయాణంలో ఆటంకాలు, ప్రయాణ సమయంలో ఒత్తిడి ప్రతీసారి ఒకే విధంగా ఉండవు. తడవ తడవకు మారుతూ ఉంటాయి. అదే వాహనం రెండు మూడు ఫారాల్లో వేరు వేరు చోట్ల పిల్లలను దించి రావడం వలన మనకు దిగుమతి ఆలస్యం కావచ్చును. లేదా మనకే ముందు దిగవచ్చును. అందువలన పిల్లలు అనుకున్న సమయానికి మన ఫారంలో అడుగు పెట్టడం యల్లకాలం సాధ్యంకాదు.
మంచి కోడిపిల్ల లక్షణాలు ఏమిటి?
ఏడు రోజులకు కోడిపిల్ల బరువా! కొద్ది రోజులలో తక్కువ మేత తిని ఎక్కువ బరువు రావడమా! అతి తక్కువ మరణ శాతమా! గుడ్ల ఉత్పత్తి అధికమా! ఇవన్నీ మన పెంపకం, పాలన, మేత, పారిశుద్ధ్యం, రోగనిరోధక శక్తి పై ఆధారపడి ఉంటాయి. మరి రోజు వయసు కోడిపిల్ల బాగుండడం, బాగాలేకపోవడం అంటే ఏమిటి? మంచిరకం పిల్లలకు నాసి రకం పిల్లలకు తేడా ఏమిటి? మంచివాటినుండి చెడ్డవాటిని గుర్తించడం ఎలా? మంచివని, నాసివని, బాగాలేవని కంటి చూపు తో అంచనా వేస్తున్నాము. చెడు రకాలను నిర్నయిస్తున్నాము. ఒక్కొక్కసారి కంటి చూపు మంచి చెడులను నిర్ణయించడములో విఫలమవ్వచ్చును. నాణ్యతను కంటిచూపుతో నిర్ణయించలేము. ఖచ్చితంగా చెప్పలేము గనుక కొన్ని పరీక్షల ద్వారా అనుబంధ ప్రమాణాలను (ఆబిజీబిళీలిశిలిజీరీ) గుర్తించడం జరుగుతుంది. అవి ఏమంటే…
1. చురుకుదనం (Activity): కోడిపిల్లలు అట్టపెట్టె నుండి తీయగానే పరుగులు పెడతాయి. కలివిడిగా ఉంటాయి. నీరు ఆహారం కొరకు వెతుకుతాయి. బంతుల్లా గలగలా తిరుగుతూ ఉత్తేజంగా ఉంటాయి. వాతావరణం చల్లగా ఉంటే బ్రూడర్లో వేసిన వెంటనే వేడి కొరకు వెతుక్కుంటాయి. ఒకదానికొకటి హత్తుకుంటాయి. వేడిగా ఉంటే దూరంగా జరుగుతాయి. అరచేతిలో లేదా నేలపై వెల్లకిలా పండ బెడితే మూడు సెకన్లలో తిరగబడి కాళ్ళపై నిలబడతాయి.
2. అగుపడడం: శుభ్రంగా, పొడిగా ఉండాలి. ఎక్కడా తడిగా ఉండరాదు. శరీరానికి పెంకులు, పొరలు అంటుకుని ఉండరాదు. మెడ వెనుక భాగం ముదర రంగు ఉండరాదు. 3. ఉదరము: కడుపు సమానంగా ఉండాలి. ఉబ్బరంగా, నిండుగా, పెద్దగా ఉంటే పచ్చసొన అధికంగా ఉన్నట్లు గ్రహించాలి. పచ్చసొన అధికంగా ఉంటే అనారోగ్యానికి దారి తీస్తుంది. కోడిపిల్ల మనదగ్గరకు పొదిగిన వెంటనే రాదు. కొన్ని గంటల సమయం పడుతుంది. అన్ని పిల్లలూ ఒకేసారి గుడ్డునుండి బయటపడవు. బలంగా పెద్దగా ఉన్నవి పెంకు పగలకొట్టి ముందు బయట పడతాయి. చిన్నవి బలహీనంగా ఉన్నవి తరువాత బయటకొస్తాయి. వాటిని హేచరిలో పెద్దపిల్లలను చిన్న పిల్లలను వేరు వేరు గుంపులుగా వర్గీకరిస్తారు. పిల్లలను వేరు చేయడం అంటే పరిమాణాలను గుర్తించి పెద్దవాటినుండి చిన్నపిల్లలను బుల్లి పిల్లలను విడివిడిగా ఉంచడం. గుడ్లపెట్టె కోడిపిల్లలు అయితే పుంజు పిల్లలను వేరు చేసి పెట్టపిల్లలను మాత్రమే పంపుతారు. ఇలాచేయడం చాలా సమయం తీసుకుంటుంది. అదీగాక టీకా మందులు వేయడం ఉంటుంది. ప్రతీ పిల్లను చేతిలోకి తీసుకుని టీకా వేయడం సమయంతో కూడుకొన్న పని. అన్నిటికీ టీకా వేయడానికి 6 నుండి 8 గంటల సమయం పడుతుంది. ఎందుకంటే వేలసంఖ్యలో పిల్లలు పొదిగి బయటకు వస్తాయి. కొన్ని హేచరీలలో టీకాలను కోడి పిల్లలపై పిచకారి చేస్తారు. ఈ పనులన్నీ జరిగిన పిదప అట్ట పెట్టెలలో ఉంచి మోటారు వాహనంలో ఉంచుతారు. అది కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి మనదగ్గరకు రావడానికి కనీసం 10 నుండి 20 గంటలు సమయం పడుతుంది. మధ్యలో రెండు మూడు ఫారాల్లో కోడిపిల్లలను దింపడం కూడా జరగవచ్చు. ఈ సమయంలో పచ్చసొనలో ఉన్న పోషక పదార్ధములే కోడిపిల్లకు ఆహారం. ఈ ప్రక్రియలో పచ్చసొన నెమ్మదిగ కరిగిపోవడంతో ఉదరం సమంగా ఉంటుంది. ఉదరం పొంగి గట్టిగ బిరుసుగా అగుపిస్తే ఆ కోడిపిల్ల పొట్టలో పచ్చసొన ఇంకా మిగిలిఉందని పూర్తిగా వినియోగం కాలేదని తెలియచేస్తుంది. ఎక్కువగా ఉంటే పచ్చసొన కరగలేదని అర్ధం. పచ్చసొన కరగలేదంటే కోడిపిల్ల అనారోగ్యంగా ఉన్నట్లు గుర్తించాలి. 4. కళ్ళు: విప్పారి స్పష్టంగా మెలుకువగా వెలుగులు పంచే కళ్ళు ఆరోగ్యాన్ని సూచిస్తాయి. మూసుకుపోతున్న కళ్ళు అలిసిన డస్సిపోయిన నీరసించిన పరిస్థితిని తెలియచేస్తాయి. మూతపడిన కళ్ళలో జీవం ఉండదు. అటువంటి కోడిపిల్లలు బ్రతకడం కష్టం. ఒకవేళ బ్రతికినా పుంజుకుని ఇతర పిల్లలతో సమానంగా వృద్ధి చెందడం వీలు పడదు. 5. కాళ్ళు : మోకాళ్ళు ఎర్రగా ఉండడం మంచిదికాదు. కోడిపిల్ల రవాణాలోగాని, హేచింగ్ లో గాని ఇబ్బందులకు గురి అయినదని తెలియచేస్తాయి. మోకాళ్ళు వాచి ఉండరాదు. గాయాలుంటే నడవడం యిబ్బంది అవుతుంది. నేల మీద నిలవగలుగుతున్నదా, నడవగలుగుతున్నదా గమనించాలి. కాలి వేళ్ళు బాగున్నవా లేదా చూడాలి. ఒక్కొకసారి మూడు కాళ్ల పిల్లలు, ఒంకర కాళ్ల పిల్లలు, కుంటివి రావచ్చును.
6. బొడ్డు : బొడ్డు రంధ్రము పూర్తిగా మూయబడి ఉండాలి. చర్మము శరీరం రంగుతో కలిసి పోయుండాలి. నల్లటి మచ్చ, వేలాడుతున్నతీగ, మూతపడని బొడ్డు ఉన్న పిల్లలు వస్తాయి. అటువంటి వాటిని వేరు చేయడం మంచిది. అలా ఉంటే మంచిదికాదు. 7. పొరలు: గుడ్డునుండి పిల్ల బయటకు వచ్చిన తరువాత కొద్దిసేపటకి శరీరం గాలికి ఆరి విప్పారుతుంది. బొచ్చు సున్నితంగా మెత్తగా దూదిలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పిల్లను చుట్టి ఉండే పొరలు సైతం విడిపోతాయి. ఫారంలో ప్రవేశించిన పిల్ల శరీరం పై ఏ విధమైన పొరలు, గుడ్డు తాలూకు పెంకులు లేకుండా ఉండాలి. 8. పచ్చసొన: ఎండిపోయిన పచ్చసొన దాని ఆవశేషాలు కాళ్ళపై ఇతర భాగాలపై కనిపించకూడదు. కోడిపిల్ల ఎలా ఉంది అని అడిగితే నలుగురు నాలుగు రకాలుగా చెబుతారు. గనుక కోళ్ళఫారంలో పనిచేసే అందరికి ఎంతోకొంత అవగాహన ఉండడం మంచిది. యజమాని దూరంగా ఉన్నపుడు ఫారంలో పనిచేసేవారు రోజు వయసున్న కోడిపిల్లలను దించుకోవలసి వస్తుంది. వారి విచక్షణా జ్ఞానం యజమానికి మేలు చేస్తుంది. పిల్లలు వచ్చే సమయం తెలియదు. చాలా కోళ్ళఫారాలలో సాధారణంగా పనివారే పిల్లలను స్వీకరించి బ్రూడింగ్ చేస్తుంటారు. కోడిపిల్ల ఆరోగ్యంగా ఉత్తేజంగా ఉంటే వీపుపై పడుకోబెట్టిన 3 సెకన్లలో తన కాళ్ళపై నిలబడి పరుగులు పెడుతుంది. చివరి రెండుమూడు రోజులందు పెంకును పగలగొట్టి పిల్ల బయటపడుతుంది. ఆ సమయంలో హేచర్నందు ఎక్కువ వేడి, గాలిలో తేమ ఉంటే జీవక్రియల సంయమనం కుదరక ఉదరం పెద్దగా మందంగా ఉండడం నీరు నిలిచి ఉండే అవకాశాలుంటాయి. బొడ్డు పూర్తిగా మూసి, మానుపట్టి ఉంటే కోడిపిల్ల ఆరోగ్యంగా ఉన్నట్లే. గుదికాలు ఎరుపు రంగు ఉంటే పొదుగుతున్నపుడు వేడి ఎక్కువగా ఉందని అర్ధం. వేడి ఎక్కువగా ఉంటే ముక్కుపై ఎరుపు, రక్తం కారడం, రక్తపు చుక్కలు ఏర్పడతాయి. ఇంకా చిలకముక్కుపిల్లలు, వంకర ముక్కులు, వంకర కాళ్ళు, మూడు కాళ్ల పిల్లలు, గుడ్డివి అపుడపుడు వస్తూనే ఉంటాయి. వెంటనే గుర్తించకపోయినా రెండుమూడు రోజుల తరువాత అవే బయట పడతాయి.తల్లికోడి ఆరోగ్యం, ఆహారం, నివాసం, గుడ్ల సేకరణ, గుడ్లు శుభ్రం చేసే తీరు, గుడ్లు నిలవ ఉంచేవిధానం, పొదుగించే పధ్ధతి, పిల్లలను పరీక్షించి వేరుచేసే విధానం, టీకాలు, రవాణా, దూరం, సమయం మొదలగు విషయాలపై కోడిపిల్ల నాణ్యత ఆధారపడి ఉంటుంది. కోడిపిల్ల బాగుంటే మంచి ఫలితాలు పొందే అవకాశాలు హెచ్చుగా ఉంటాయి. తల్లికోళ్ళు ఒకే వయసులో ఉంటే వాటి గుడ్లు దాదాపుగా ఒకే బరువులో ఉండి వాటిపిల్లల బరువు సమానంగా ఉంటుంది. కాని వేలకొలది గుడ్లు పొదగవలసి వచ్చినపుడు వివిధ వయసున్న తల్లుల గుడ్లు కలిపి పొదిగించడం తప్పనిసరిగా జరుగుతుంది. అటువంటి పరిస్థితులలో గుడ్ల బరువు వేరుగా ఉంటుంది. గుడ్డు పెంకును పగలగొట్టి కొన్ని పిల్లలు ముందు కొన్ని వెనుక గంటల తేడాలో బయటకు రావడం వలన పిల్లల బరువులో వ్యత్యాసాలు, ఆకారంలో తారతమ్యాలు సాధారణం. ముందు పిల్లకు ఆఖరు పిల్లకు 20 నుండి 30 గంటల వ్యత్యాసం ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకనే పొదిగిన పిల్లలను బరువును బట్టి, పరిమాణాన్ని బట్టి వర్గీకరిస్తారు. ముందుగా పొదగిన పిల్లలు తరువాత పొదిగిన పిల్లలు ఒకేసారి మన ఫారానికి సరఫరా కావచ్చును. రెక్కలపై ఈకలను గమనిస్తే ముందు పొదగిన పిల్లల ఈకలు పెరిగినట్లు గుర్తించవచ్చు. పొదిగే గుడ్ల సంఖ్యను బట్టి, తల్లుల వయసును బట్టి కోడిపిల్లల బరువు పరిమాణంలో తేడాలుంటాయి. కోడిపిల్లల నాణ్యతను నిర్దేశించడానికి పాస్గర్ స్కోరులో అసంకల్పిత చర్యలు, పూడుకుపోయిన బొడ్డు, కాళ్ళు, ముక్కు, పచ్చసొన అవశేషాలు చూస్తారు. టోన (ఊళిదీబి) స్కోరు కూడా కోడిపిల్ల మంచి చెడులను నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. మన ఫారంలో కోడిపిల్ల అడుగుపెట్టిన వెంటనే బరువు తెలుసుకోవాలి. అన్ని బుట్టలనుండి చేతికి అందిన 10 పిల్లల చొప్పున 100 పిల్లలను తూయవచ్చును. తూయడానికి ప్రత్యేకంగా కోడిపిల్లలను ఏరకూడదు. లేదా నాలుగు ఐదు బుట్టల బరువులను కాటా వేసి కోడిపిల్ల సగటు బరువును తెలుసుకోవచ్చును. పిల్ల బరువు గుడ్డు బరువులో 66-67 శాతం ఉంటుంది. పొదగబడిన గుడ్డు బరువు తెలియనప్పటికీ మనకొచ్చిన పిల్లల బరువు తెలుసుకోవలసిన భాధ్యత మనకుంది. ఈ తూకాలవలన పిల్లలు అన్నీ సమానంగా ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. బరువు తక్కువగా ఉన్న వాటిని వేరుగా పెంచడం వలన వేగంగా వృద్ధి వృద్ధి చెందుతాయి. చిన్నాపెద్ద కలిసివుంటే చిన్న పిల్లలు వెనుకబడి ఉత్పత్తి సామర్ధ్యం కుంటుపడుతుంది. చిన్న పిల్లలు మేతకోసం పెద్దవాటితో పోటి పడాల్సి వస్తుంది. ఇంకా కొన్ని హేచరీలలో కోడిపిల్ల పొడవును కొలుస్తారు. తల దగ్గరనుండి గోరుచివర వరకు కొలతలను తీసుకుంటారు. దాని ప్రకారం ఎక్కువ పొడవు ఉన్న కోడిపిల్ల ఎక్కువ ఉత్పత్తులను ఇస్తుందని వారి అంచనా. ఏమైనా నవజాత కోడిపిల్ల బరువు, చురుకుదనం, కళ్ళు, కాళ్ళు, కడుపు మొదలగువన్నీ చక్కగా ఉండాలి. ఎన్ని పిల్లలు వచ్చాయో లెక్కపెట్టి తెలుకోవడం కూడా అవసరమే. పిల్లల సంఖ్యను బట్టి మేత, టీకాలు, మందులు వాడకం ఉంటుంది. ఎన్ని మరణించాయో తెలుస్తుంది. ఎన్నింటిని అమ్మేమో తెలుస్తుంది. ఎన్ని గుడ్లు పెట్టాయో తెలుస్తుంది. ఓ్పుష్ట్ర ఏమిటో కనుగొనవచ్చు. ఆర్ధిక వనరులను తదనుగుణంగా ఏర్పాటు చేసుకోవచ్చు. లాభాలను పెంచుకోడానికి, పాలనా పద్ధతులను మెరుగుపరచుకోవడానికి తోడ్పడుతుంది. తడవ తడవకు వచ్చిన పిల్లల వివరములు, ఉత్పత్తి చేసినవారి వివరములు, పంపిణి పద్ధతులు, సమయం, వాతావరణం ఎప్పటికప్పుడు పుస్తకములో నమోదు చేసుకోవాలి. ఈ విధంగా రాసిఉంచుకోవడం వలన తేడాలుంటే గ్రహించగలుగుతాము. తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. డా. నాగేశ్వరరావు, ఫోన్: 96521 05405
రసాయనిక వ్యవసాయం వలన సంభవించిన, సంభవిస్తున్న అనర్ధాల నుండి బయటపడడానికి అనేకమంది నిపుణులు, శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు, కొన్ని సంస్థలు రసాయనాలు అవసరం లేని వివిధ రకాల సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులకు చేరవేస్తున్నారు. వీటిలో ఫుకుఓక ప్రకృతి వ్యవసాయ పద్ధతి, భాస్కరసావే పద్ధతి, చౌహాన్క్యూ పద్ధతి, నమ్మళ్వార్ పద్ధతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతి, సుభాష్పాలేకర్ జీరోబడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ పద్ధతి లాంటి వాటిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. వీటన్నింటిలో సుభాష్ పాలేకర్ జీరోబడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ పద్ధతి చాలా వేగంగా రైతులోగిళ్ళకు చేరింది. ఇంకా చేరేతూనే ఉంది అని చెప్పవచ్చు. సుభాష్ పాలేకర్ వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ ఈ పద్ధతి గురించి ప్రచారం చేయడంతోపాటు, కొన్ని ప్రభుత్వాలు ఈ పద్ధతిని ప్రోత్సహించడం మరియు రైతులు అమలుపరచటానికి అనుకూలంగా ఉండడం, ఈ పద్ధతిలో మన దేశీయ జాతి గోవు ప్రముఖ పాత్రను పోషించటం లాంటి వివిధ రకాల కారణాల వలన మిగతా పద్ధతులతో పోల్చుకుంటూ సుభాష్ పాలేకర్ జీరోబడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ పద్ధతి చాలా వేగంగా రైతు లోగిళ్ళకి చేరిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే సుభాష్పాలేకర్ వలననే రసాయన వ్యవసాయం వలన జరిగిన, జరిగే నష్టాలు రైతులు తెలుసుకుంటున్నారు. రసాయన రహిత వ్యవసాయం ఇంత వేగంగా రైతులకు తెలియడంలో సుభాష్ పాలేకర్ జీరోబడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ పద్ధతి ప్రధాన పాత్ర పోషించింది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ పద్ధతిని సుభాష్ పాలేకర్ ప్రచారం చేయకుండా ఉండి ఉంటే రసాయన రహిత వ్యవసాయం రైతులోగిళ్ళకు చేరటానికి చాలా సమయం పట్టేది కావచ్చు. పాలేకర్ వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవడం, వారి పుస్తకాలు చదివిన వారు, వారి సభలకు హాజరయ్యి ఈ పద్ధతుల గురించి తెలుసుకున్న చాలామంది రైతులు తమ రసాయనిక సేద్యాన్ని ప్రకృతి వ్యవసాయ బాట పట్టించారు. పట్టిస్తున్నారు. వ్యవసాయేతర ఉద్యోగ, వ్యాపారం లాంటి వేరే రంగాలలో ఉన్న వారు కూడా సుభాష్ పాలేకర్ జీరోబడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ పద్ధతుల గురించి తెలుసుకుని ఈ బాట పట్టారు. ఇంకా పడుతూనే ఉన్నారు. ఈ కోవకే చెందుతారు కృష్ణాజిల్లా, తరకటూరులో 8 ఎకరాలు, వికారాబాద్ సమీపములో 50 ఎకరాలు, రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 58 ఎకరాలలో ప్రకృతి సాగు చేస్తున్న విజయరామ్.
వాస్తవానికి విజయరామ్ ఆర్టిస్ట్ (బొమ్మలు గీస్తుంటారు). ఆర్టిస్ట్గా తన వృత్తిని కొనసాగిస్తూ హైదరాబాదు నగరంలో ఇందిరాపార్కు సమీపంలో ఒక మిఠాయి దుకాణాన్ని నడుపుతూ వస్తున్న సమయంలో నీటి యొక్క విలువను తెలుసుకుని నీటి సంరక్షణకు సంబంధించిన సమాచారాన్ని మిఠాయి దుకాణంకి వచ్చిన వినియోగదారులకు తెలియచేస్తూ ఉండేవారు. అందుకు సంబంధించి చార్టులను తయారు చేయించి అవసరమైన వారికి ఆ చార్టులను ఉచితంగా అందిస్తూ ఉండేవారు. ఆవిధంగా తన ఆలోచనలని సామాజిక రంగాలవైపు కూడా మళ్లించి కొనసాగుతున్న క్రమంలో 2010వ సంవత్సరంలో సుభాష్పాలేకర్ గారి జీరోబడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ పద్ధతి గురించి తెలుసుకొని తాను కూడా గో-ఆధారిత వ్యవసాయం చేయాలనే తలంపుతో అటువైపు అడుగులు వేసి ప్రకృతి వ్యవసాయంలో అడుగు పెట్టారు. ఈ పద్ధతిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనే తలంపుతో సుభాష్పాలేకర్ గారి ద్వారా సదస్సులు ఏర్పాటు చేయడంలో తనవంతు పాత్రను పోషించారు…. పోషిస్తూన్నారు.
గోఆధారిత వ్యవసాయంలో ప్రధానమయినవి మన దేశీయ జాతి గోవులు, మన పురాతన నాటు విత్తనాలు కాబట్టి తన సాగులో ఈ పద్ధతులను అమలుపరచడంతో పాటు అంతరించి పోతున్న మన పురాతన విత్తనాలను అభివృద్ధి చేసి వాటి లభ్యత పెంచాలనే తలంపుతో మన పురాతన విత్తనాల సేకరణకు నడుంబిగించి వాటిని సేకరిస్తూ అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. వీటన్నింటికిగాను కృష్ణాజిల్లా తరకటూరులోని 8 ఎకరాల పొలం, వికారాబాద్ సీమపంలోని 50 ఎకరాల పొలంలో పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వివిధ రకాల పంటలు పండిస్తూ వస్తున్నారు. ఇందుకుగాను మన దేశీయ జాతులు ఒంగోలు, గిర్ లాంటి ఆవులను మరియు ఎద్దులను కలిపి సుమారు 120 మేరకు పశువులను పోషిస్తూ వాటి వ్యర్థాలను తన పంటలసాగులో వినియోగిస్తున్నారు. ఆవు పాల ద్వారా మన తాత, ముత్తాతలు పాటించిన పద్ధతులతో నాణ్యమైన ఆవు నెయ్యిని తయారు చేసి అవసరమైన వారికి అమ్ముతూ వస్తున్నారు.
ప్రస్తుతం వరి, చెరకు, ఉల్లి, పసుపు, అల్లం, వివిధ రకాల కూరగాయలు అరటి మొదలగు పంటలతో పాటు 5 అంచెల పద్ధతిలో (పూర్తి వివరాల కొరకు బాక్స్ చూడగలరు) వివిధ రకాల పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. దుక్కిలో ఘనజీవామృతం అందించడంతో పాటు జీవామృతాన్ని భూమికి అందిస్తుంటారు. అవసరాన్ని బట్టి జీవామృతం, నీమాస్త్రం, పుల్లటి మజ్జిగ లాంటి వాటిని పంటలపై పిచికారి చేస్తూ ఆరోగ్యకరమైన దిగుబడి పొందుతుంటారు. పంట దిగుబడిలో నాణ్యతకు, పోషకాలకు ప్రాముఖ్యతని ఇస్తూ ఎంత దిగుబడి వచ్చిందనే దానిని పట్టించుకోకుండా వచ్చిన దిగుబడి నాణ్యమైనదా కాదా అనే కోణంలో ఆలోచిస్తూ పంటల సాగు కొనసాగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో నాటు విత్తనాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి కాబట్టి తను సాగు చేసే పంటలన్నింటికీ నాటు విత్తనాలనే ఉపయోగిస్తున్నారు. నాటు విత్తనాలను తన పంటల సాగులో వినియోగించడంతోపాటు తోటి రైతులకు అందచేస్తుంటారు. మన పురాతన విత్తనాలు అంతరించి పోతున్నవి కాబట్టి అందుబాటులో ఉన్న పురాతన విత్తనాలను ప్రత్యేకించి వడ్లను ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి సేకరించి వాటిని పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో అభివృద్ధిపరచి తోటి రైతులకు అందచేసి మన పురాతన విత్తన నిధిని కాపాడుటలో విజయరాం ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. పురాతన వడ్లలో పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి వీటిని ఆహారంగా తీసుకుంటే జబ్బులు వచ్చే అవకాశాలు ఉండవు అని తెలుసుకొని పురాతన విత్తనాల అభివృద్ధి మరియు పంపిణీని ఒక ఉద్యమంగా చేస్తున్నారు.
ఐదు అంచెల సాగు విధానం :
ఐదు అంచెల సాగు విధానాన్ని సుభాష్ పాలేకర్ బాగా ప్రచారం చేశారు. ఈ విధానంలో 36 అడుగుల దూరంలో మామిడి, నేరేడు లాంటి పెద్దగా ఎదిగే మొక్కలు పెంచుకొంటూ వాటి మధ్యలో వివిధ రకాల మొక్కలను, కూరగాయలు, ఆకుకూరలను 4 అంచలుగా సాగు చేయడం దాని ప్రధాన ఉద్దేశ్యం. ఈ విధానం 36þ36 అని కూడా ప్రసిద్ధి చెందింది. ఈ 36þ36 విధానం ప్రచారంలోకి వచ్చిందేకాని క్షేత్రస్థాయిలో విజయం సాధించిన వారు పెద్దగా లేరు. కారణం ఈ విధానంలో దిగుబడులు సక్రమంగా రావడం లేదు అని తెలుసుకుని విజయరాం ఈ విధానానికి వేరే రూపం ఇచ్చారు. అంటే 36 కి బదులుగా 50 అడుగుల దూరం పాటిస్తే అన్ని అనుకూలంగా ఉంటాయని అనుభవ పూర్వకంగా తెలుసుకుని 50þ50 అడుగుల దూరంలో 5 అంచెలుగా వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. 50 అడుగుల దూరంలో మొదటి అంచెలో నేరేడు, మామిడి, పనస, బాదం లాంటి పెద్దగా ఎదిగే వృక్షాలు 50 అడుగులలో సగం అంటే 25 అడుగుల దూరంలో రెండో అంచెగా బత్తాయి, నిమ్మ, నారింజ లాంటి మొక్కలు, 25 అడుగులలో సగం అంటే 121/2 అడుగుల దూరంలో 3వ అంచెగా బొప్పాయి, అరటి లాంటి మొక్కలు, 121/2 లో సగం 61/4 లో 4వ అంచగా మునగ, అవిశ లాంటి మొక్కలు 61/4 అడుగులకు మధ్యలో సొర, బీర, కాకర, బెండ లాంటి కూరగాయలతోపాటు తోటకూర, గోంగూర, చుక్కకూర లాంటి ఆకుకూరలు, పసుపు, అల్లం, చేమ దుంపలాంటి పంటలు పండిస్తున్నారు. వీటన్నింటిని పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులోనే పండిస్తున్నారు. 5 అంచెల విధానంలో లైనుకి లైనుకి 61/4 అడుగుల దూరం ఉంటుంది. లైనుకి లైనుకి మధ్య ఒక కాలువ చేసుకుని ఆ వచ్చిన మట్టి లైనులో ఎత్తుగా వేసుకోవడం వలన కలుపు సమస్య తగ్గడంతో పాటు లైనులో ఉన్న మొక్కలకు పోషకాలు బాగా అంది అవి ఆరోగ్యంగా పెరుగుతూ ఎలాంటి కషాయాలు, ద్రావణాలు అవసరం పడటంలేదు. తప్పనిసరి పరిస్థితులలో నీమాస్త్రం, పుల్లటిమజ్జిగ, జీవామృతం లాంటివి పంటపై పిచికారి చేస్తుంటారు. విజయరాం పండించే అన్ని పంటలకు నీటిని అందించటానికి ఎలాంటి డ్రిప్పు, స్ప్రింక్లర్ లాంటి విధానాలను ఉపయోగించకుండా కాలువల ద్వారానే నీటిని అందిస్తుంటారు. 5 అంచెల విధానంలో కాలువ ద్వారా నీటి అందిస్తూ ఆ కాలువలలో అరటి, బొప్పాయి లాంటి ఆకులు మల్చింగ్గా ఉపయోగిస్తుంటారు.
ప్రకృతి వ్యవసాయంలో అడుగుపెట్టి, దేశీయ జాతి గోసంతతిని, మన పురాతన విత్తనాలను అభివృద్ధిపరుస్తూ తోటి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు నడిపిస్తూ పంట దిగుబడులు ముఖ్యం కాదు, నాణ్యమైన దిగుబడులు ముఖ్యం అంటూ విజయరాం ముందుకు నడుస్తున్నారు. మరిన్ని వివరాలు 8374662262 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
మనది వ్యవసాయక దేశం అయినప్పటికీ వివిధ రకాల కారణాల వలన ఉన్నత చదువులు చదివిన రైతుల సంతానం వ్యవసాయరంగానికి దూరంగా ఉద్యోగ, వ్యాపార రంగాలలోకి వలసలు పోయి అందులో కొంతకాలం గడిచిన తరువాత కొంతమంది తిరిగి వ్యవసాయరంగంవైపు అడుగులు వేస్తున్నారు. వ్యాపార రంగంతో పోల్చుకుంటే ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఎక్కువగా తిరిగి వ్యవసాయ రంగంవైపు చూస్తున్నారు. కారణాలు ఏమయినా కాని మన వ్యవసాయ రంగానికి, మనదేశానికి ఇది శుభపరిణామం అని చెప్పవచ్చు. సాధారణంగా మన దేశంలోని ఎక్కువమంది యువతీయువకులు ప్రధాన ధ్యేయం ఉన్నత చుదువులు చదివి ఉన్నత ఉద్యోగాలలో చేరడం పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా వరకు అదేదారిలో నడుస్తున్నారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలలో రాణిస్తూ వివిధ రకాల కారణాల వలన తిరిగి వ్యవసాయ రంగంలో అడుగుపెట్టడం వలన ఎప్పటి నుంచో వ్యవసాయంలో ఉంటూ అసంతృప్తితో కాలం వెల్లతీస్తున్న రైతులకు మనోధైర్యం పెరుగుతుందనడంలో సందేహం లేదు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం, పెద్దకూర్మపల్లికి చెందిన మల్లిఖార్జున రెడ్డి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి వ్యవసాయరంగంలో అడుగుపెట్టి రాణిస్తున్నారు.
మల్లిఖార్జున రెడ్డిది వ్యవసాయ నేపథ్యం. వరి సాగులో మల్లిఖార్జున రెడ్డి నాన్నగారు అధిక దిగుబడులు సాధించారు. అందరిలాగానే ఉన్నత చదువులు చదివిన మల్లిఖార్జున రెడ్డి ఉద్యోగ రంగంలో కొనసాగుతున్నారు. ఆ సమయంలో మార్కెట్లో దొరికే పప్పులు, నూనెలు అన్నీ కూడా కల్తీలు కావడం, తన స్నేహితులు కొందరు క్యాన్సరుతో ఇబ్బందులు ఎదుర్కోవడం దగ్గర నుంచి చూడడం జరిగింది. వీటన్నింటికి పరిష్కారం ఆలోచించసాగారు. వాటికి మరియు తమ ఆరోగ్యాలకు పరిష్కారం సేంద్రియ వ్యవసాయం అని నమ్మి 9 సంవత్సరాలు చేసిన ఉద్యోగాన్ని వదలి స్వగ్రామంలోని తండ్రి చేస్తున్న పంటల సాగులో అడుగుపెట్టారు వ్యవసాయంలో అడుగుపెట్టగానే సరిపోదు, వస్తున్న సంపాదనని వదలుకొని వచ్చాడు కాబట్టి ఒక వైపు సంపాదన గురించి ఆలోచించాలి, రెండోవైపు మన భవిష్యత్ తరాలకు కలుషితం కాని నేలను, వాతావరణాన్ని, ప్రస్తుత తరాలకు అవశేషాలు లేని ఆహారాన్ని అందించాలి. వీటన్నింటికి సరైనదారి అదీను ఇప్పటి వరకు నేలలు రసాయనాలకు అలవాటు పడి ఉన్నాయి కాబట్టి ఒకేసారి మార్పుకు సహకరించకపోవచ్చు కాబట్టి మెల్లమెల్లగా రసాయనాలను తగ్గించుకుంటూ సేంద్రియ పదార్థాలు పెంచుకుంటూ వస్తే 5 సంవత్సరాలకి రసాయనాలను మానివేసి పూర్తి సేంద్రియ సాగుకి మరలడం జరిగింది. అంటే 2017 వ సంవత్సరం నుండి ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా పూర్తి సేంద్రియ పద్ధతులతో వరి, వస, పెసలు, మినుము, నూనెగింజల పంటలు పండించుకుంటూ వస్తున్నారు. పంటల సాగుతో పాటు సేంద్రియ సాగుకు అవసరమైన మనదేశీయ జాతి గోవులను పోషిస్తూ వాటి వ్యర్థాలను పంటల సాగులో వినియోగిస్తున్నారు. వీటన్నింటితో పాటు రైతుకు అదనపు ఆదాయం కావాలంటే పంటల సాగు మరియు పశుపోషణతో ఆగకుండా సమీకృత సేద్యం తప్పనిసరి అని తెలుసుకుని గొర్రెలు, మేకలు, చేపలు, కోళ్ళు మొదలగు వాటిని పెంచుతూ తన సాగును లాభాల బాటలో నడిపిస్తున్నారు. 2021 ఖరీఫ్ మరియు రబీలలో 18 ఎకరాలలో వివిధ రకాల వడ్లను వెద పద్ధతిలో సాగు చేశారు. ఇందుకుగాను దుక్కిలో ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం అందించారు. ఆరుతడి పద్ధతిలో వరి పంటను సాగు చేశారు. ఆరుతడి పద్ధతిలో అయితే వేరువ్యవస్థ బాగా అభివృద్ధి చెంది మొక్క రోగనిరోధక శక్తిని పెంచుకుని పెరుగుతుంది కాబట్టి చీడపీడల ప్రభావం తగ్గడంతోపాటు దిగుబడులు పెరుగుతున్నవి కాబట్టి ఈ పద్ధతిని పాటిస్తున్నారు. కలుపు నివారణకు తాను సొంతంగా పైపు మరియు ఇనుప చైన్లతో తయారు చేసుకున్న పరికరాన్ని ఉపయోగించి కొంత వరకు నివారించుకోవడంతో పాటు మిగిలిన కలుపును మనుషుల సహాయంతో నివారించుకున్నారు. వరి పంటకు అవసరాన్ని బట్టి జీవామృతం, మట్టిద్రావణం, వేస్ట్డికంపోజర్, నీమాస్త్రం, ఇంగువ ద్రావణం, మారేడు కషాయం లాంటివి ఉపయోగిస్తూ వచ్చారు. పంటలో నీటి అవసరం తెలుసుకునేందుకు 6 అంగుళాల పివిసి పైపుకు రంధ్రాలు చేసి ఆ పైపును వరి పంటలో భూమిలో పెట్టి అందులో ఊరిన ఊట నీటిని పరిశీలిస్తూ ఆరుతడి పద్ధతిలో నీటిని అందిస్తూ వచ్చారు. ఖరీఫ్లో ఎకరానికి 2500 కిలోలు, రబీలో ఎకరానికి 3500 కిలోలు వడ్ల దిగుబడి సాధించి సంవత్సరానికి రెండు పంటలకు కలిపి ఎకరానికి 6000 కిలోల వడ్ల దిగుబడి పూర్తి సేంద్రియ పద్ధతిలో సాధించారు. వడ్లను అదేవిధంగా అమ్మకుండా విలువజోడించి అనగా వడ్లను మరపట్టించి బియ్యాన్ని అమ్మకం చేస్తున్నారు. వీటితో పాటు కొంత ప్రాంతంలో మన ప్రాచీన వరి రకాలను కూడా సాగు చేసి మంచి దిగుబడి తీసి ఆ వరిగడ్డిని (ఉప్పుద్రావణం కోటింగు ఇచ్చి) పశువులకు మేతగా అందిస్తూ వస్తున్నారు.
వస: ఒకటిన్నర ఎకరాలలో ఔషధ పంట అయిన వస పంటను సాగు చేశారు. ఇందుకు అవసరమయిన విత్తన మొక్కలను తెలిసినవారి నుండి తెప్పించుకుని నాటారు. ఎకరానికి 40000 మొక్కల చొప్పున ఎకరంన్నరకు 60,000 మొక్కలు అవసరం అయినవి. వస మొక్కలను వరి నారు మాదిరిగానే ‘శ్రీ’ పద్ధతిలో నాటించారు. వస పంటలో 3 నెలల వరకు కలుపు సమస్య ఉంటుంది కాబట్టి కోనోవీడరు తిప్పటానికి వీలుగా మొక్కలను 2021 సంవత్సరం జులై నెలలో నాటించారు. వస సాగుకు గాను ఔషధ మొక్కల బోర్డు నుంచి ఎకరానికి 14000/- ప్రోత్సాహాన్ని కూడా మల్లిఖార్జున రెడ్డి పొందారు. ఇది 9 నెలల పంట. 2022లో దిగుబడి వచ్చింది. ఎకరంన్నరకు గాను 30 క్వింటాళ్ళ దిగుబడి పొంది క్వింటా 8000/-లకు అమ్మకం చేశారు. ఎకరంన్నరకు గాను పెట్టుబడి 1,10,000 వరకు అయ్యింది. పెట్టుబడి పోను ఎకరంన్నరకు సుమారు 1,30,000 వరకు ఆదాయం వచ్చింది. అజొల్లా: అడుగు లోతు 10 అడుగుల వెడల్పు మరియు పొడవులతో ఒక తొట్టెను నిర్మించుకుని అందులో అజొల్లాను పెంచుతున్నారు. తొట్టిలో అడుగున 2 అంగుళాల మందంలో మట్టి, సుమారు 20 కిలోల ఆవుపేడ, అగ్గిపెట్టె పరిమాణంలో మినరల్ మిక్చర్ వేసి నీటిని నింపి అజొల్లా కల్చర్ని తెచ్చివేశారు. ఈ తొట్టెను నీడలో ఏర్పాటు చేసుకున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే 10 నుంచి 15 రోజులలో తొట్టి మొత్తం అజొల్లా అభివృద్ధి చెందింది. ప్రతిరోజు కొంత అజొల్లాను పశువులకు, కోళ్ళకు దాణాగా అందిస్తూ వస్తున్నారు. ప్రతివారం తప్పనిసరిగా అజొల్లా తొట్టిలోని నీటిని మార్చాలి. 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా సుమారు 20 కిలోల పేడను అందించాలి. 6 నెలలకు ఒకసారి మట్టిని మారుస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉంటే 365 రోజులు అజొల్లాని పొందవచ్చు. అజొల్లాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కనుక పశువులు, కోళ్ళు లాంటి వాటికి దాణాగా అందిస్తే ఖర్చు తగ్గడంతో పాటు వాటి ఆరోగ్యం బాగా ఉంటుందని మల్లిఖార్జునరెడ్డి వివరించారు. వివిధ రకాల పంటల సాగుతో పాటు మన దేశీయ గోవులు మూడింటిని పోషిస్తూ వాటి వ్యర్థాలను పంటల సాగులో వినియోగిస్తూ వాటి పాల ద్వారా వచ్చిన వెన్నతో నెయ్యి తయారు చేయించి నెయ్యిని అమ్ముతూ ఆదాయం పొందుతున్నారు. వాటితో పాటు 10 గొర్రెలు, 50 మేకలు (పిల్లలతో కలిపి) 50 కోళ్ళు, సుమారు 300 వరకు చేపలను కూడా పెంచుతూ రైతు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే సమీకృత వ్యవసాయమే సరైన దారి అని నిరూపిస్తున్నారు. మల్లిఖార్జున రెడ్డి చేస్తున్న సమీకృత వ్యవసాయం ద్వారా అన్నీ కలిపి సంవత్సరానికి 10 లక్షలకు తగ్గకుండా ఆదాయాన్ని పొందుతూ కుటుంబ సభ్యుల సహకారంతో ఆనందంగా సేద్యాన్ని కొనసాగిస్తూ ఆరోగ్యంగా జీవితాన్ని గడుపుతున్నారు.
మరిన్ని వివరాలు 9704090613 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
మన తాతముత్తాతలు వ్యవసాయంలో పెద్దగా ఏమీ చేసేవారు కాదు. విత్తనాలు వేసేవారు. దిగుబడి తీసుకునేవారు. కాని రాను రాను పంటల సాగుకి పశువుల ఎరువు అందించటం మొదలయ్యింది. అప్పటి వరకు పరవాలేదు. పశువుల ఎరువు అందించి ఆరోగ్యకరమైన దిగుబడులు సాధించారు. విత్తనాలను కూడా బయట కొనుగోలు చేయకుండా తమ సొంత విత్తనాలను లేదా తమ ప్రాంతాలలో అందుబాటులో ఉండే విత్తనాలను ఉపయోగిస్తూ పంటల సాగు కొనసాగిస్తూ దిగుబడి గురించి ఆలోచించకుండా ఎంత దిగుబడి వస్తే అంత దిగుబడి తీసుకుంటూ జీవితాలను గడుపుతూ వచ్చారు. కానీ రాను, రాను వ్యవసాయంలో సాంకేతికత పెరగడం, జనాభా పెరిగి వారి ఆహార అవసరాలను తీర్చటానికి వ్యవసాయంలో రసాయనాలు, అధిక దిగుబడి వంగడాలను ప్రవేశపెట్టటం జరిగింది. ఈ పరిణామాల వలన అనుకున్న లక్ష్యం నెరవేరింది కాని అనేక ఇబ్బందులు ఎదురవుతున్నవి. ఆ ఇబ్బందుల నుండి బయటకు రావడానికి రైతులు మరలా తిరిగి మన తాత ముత్తాతలు చేసిన పంటల సాగు విధానాలవైపు అడుగులు వేయాలని ప్రభుత్వాలు, అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్నారు. వీరి మాటలు విని వాస్తవం తెలుసుకున్న కొంతమంది రైతులు తమ సాగు పద్ధతులను మార్చుకుని ప్రకృతి సాగు విధానాలవైపు అడుగులు వేశారు. వేస్తున్నారు. ఇదేకోవకు చెందుతారు కోనసీమ జిల్లా గంగవరం గ్రామానికి చెందిన అల్లూరి సూర్యనారాయణమూర్తి.
సూర్యనారాయణమూర్తిది వ్యవసాయ నేపధ్యం. మొదటి నుంచి అంటే గత 40 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తూ వస్తున్నారు. వారి ప్రాంతం పల్లపు ప్రాంతం కాబట్టి వరి ప్రధాన పంటగా సాగు చేస్తూ వస్తుంటారు. అందరి రైతుల మాదిరిగానే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన వరి సాగులో కూడా రసాయనాలు అందిస్తూ సాగును కొనసాగిస్తూ వస్తున్నారు. ఎక్కువగా అధికంగా 50 బస్తాలకు పైగా దిగుబడి వచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. దిగుబడి బాగానే వస్తుంది కాని వివిధ రకాల కారణాల వలన ఆదాయం రాకపోగా రసాయన పద్ధతులతో పండించిన బియ్యాన్ని తినడం వలన ఆరోగ్యాలు కూడా సక్రమంగా ఉండటం లేదు. దానికి పరిష్కారం ప్రకృతి వ్యవసాయం అని తెలుసుకొని తన సాగుని సేంద్రియ పద్ధతులలోకి మార్చాలనే లక్ష్యంతో రసాయనాలను తగ్గిస్తూ సేంద్రియ పదార్థాలను పెంచుతూ కొన్ని సంవత్సరాలు చేసిన తరువాత అంటే 2014 వ సంవత్సరం నుంచి పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వరి పంట సాగును కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రకృతి వ్యవసాయానికి మారిన మొదటలో దిగుబడులు తగ్గినవి కాబట్టి పశువుల ఎరువు, జీవామృతం లాంటివి భూమికి అందిస్తూ వస్తూ గత రెండు సంవత్సరాల నుంచి భూమికి ఏమీ అందివ్వడం లేదు. నారు నాటుకోవటం, కలుపు నివారించటం, దిగుబడి తీయటం అంతే అంతకు మించి ఏమీ చేయకుండా అసలయిన ప్రకృతి వ్యవసాయానికి చిరునామాగా సూర్యనారాయణమూర్తి నిలుస్తున్నారు.
5 ఎకరాలలో వరిని సాగు చేస్తున్నారు. 2021వ సంవత్సరం ఖరీఫ్లో బి.పి.టి. రకం పండించి 75 కిలోల బస్తాలు ఎకరానికి 28 చొప్పున దిగుబడి సాధించారు. రబీలో ఆర్ఎన్ఆర్ 15048 రకం వరిని సాగు చేసి ఎకరానికి 25 బస్తాల దిగుబడిని సాధించారు. సొంత విత్తనాలను లేదా బయట కొనుగోలు చేసుకున్న విత్తనాలను నారు పోసుకుని ఖరీఫ్లో అయితే 35 రోజుల పెరిగిన నారు, రబీలో అయితే 25 రోజులు పెరిగిన నారుని నాటిస్తుంటారు. కలుపు సమస్య నుండి పంటను రక్షించుకోవడానికి నారు నాటే పద్ధతినే అవలంభిస్తున్నారు. ప్రస్తుతం తాను సాగు చేస్తున్న వరి పంటకు ఎలాంటి పదార్థాలు అందించడం లేదు. రబీలో మాత్రం వేడి తగ్గడానికి ఎండుద్రాక్ష, బార్లీగింజలు, మజ్జిగల మిశ్రమాన్ని పిచికారి చేస్తుంటారు. అంతకుమించి ఏమీ చేయవలసిన అవసరం పడటం లేదు. వడ్లను బియ్యం ఆడించి నేరుగా వినియోగదారులకి బియ్యం అమ్మకం చేస్తున్నారు.
సుమారు ఒక ఎకరం తొంభై సెంట్ల భూమిలో చుట్టూ 10 అడుగుల వెడల్పు 4 అడగుల లోతులో కందకం తవ్వి ఆ కందకంలో వచ్చిన మట్టిని మధ్యలో వేసి చదును చేయించారు. కందకంలో చేపలు పెంచుతూ మధ్యలో ఉన్న మట్టిలో వివిధ రకాల పంటలు అంటే తన కుటుంబానికి అవసరమైన అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వస్తుంటారు. ఈ ప్రాంతంలో సాగు చేసే పంటలలో సొర, బీర, కాకర, బెండ, వంగ, టమాట, సీతాఫలం, జామ, సపోట, వాటర్ యాపిల్ లాంటి తమ కుటుంబ ఆహారానికి అవసరమైన పంటలు ఉంటాయి. కందకంలో ప్రతి సంవత్సరం చేపలు పెంచి అవి పెరిగిన తరువాత వాటిని అమ్మి అదనపు ఆదాయాన్ని పొందుతుంటారు. 2021వ సంవత్సరం 200 చేప పిల్లలను పెంచారు. ఇందులో గడ్డి చేప, బొచ్చ, బంగారు తీగ, గచ్చ మొదలగు నాలుగు రకాలు ఒక్కొక్కటి 50 పిల్లల చొప్పున వేశారు. చేప పిల్లలకు ప్రతి రోజు 2 కిలోల చొప్పున తమ వడ్లను మర పట్టించినపుడు మిగిలే వృథాగా పోయే రద్దు నూకను అందిస్తుంటారు. రోజుకు 2 కిలోల చొప్పున నెలకు 60 కిలోల రద్దు నూకలను మాత్రమే అందిస్తుంటారు. తన వరి పంటలో వచ్చిన నూకలు చేపలకు ఆహారంగా సరిపోతుంటవి. బయట నుంచి ఏమీ కొనుగోలు చేయకుండా చేపలను పెంచుతుంటారు. నూకలను మరియు మట్టిని తింటూ చేపలు పెరుగుతుంటాయి. సంవత్సరంలో 1 కిలో వరకు తూగేలా బరువు పెరుగుతాయి. కిలో 250/-ల చొప్పున నేరుగా పొలం దగ్గర అమ్ముతుంటారు. వినియోగదారులు నేరుగా పొలం వద్దకు వచ్చి తమకు నచ్చిన రకాన్ని కొనుగోలు చేస్తుంటారు. వరి మరియు వివిధ రకాల కూరగాయలు, పండ్లు పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సాగు చేస్తూ చేపలకు కూడా బయట నుంచి కొనుగోలు చేసిన పదార్థాలను అందించకుండా కేవలం సేంద్రియ పద్ధతిలో పండించిన సొంత నూకలను అందిస్తూ నాణ్యమైన చేపలను పెంచి మంచి ధరకు అమ్ముతున్నారు. ఒక ఆవు మరియు రెండు గేదెలను పోషిస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ తోటి సమాజానికి రసాయనాలు లేని ఆహారాన్ని అందిస్తూ సంవత్సరానికి ఎకరానికి లక్ష రూపాయలు పైగానే ఆదాయం గడిస్తూ నిజమైన ప్రకృతి వ్యవసాయానికి సూర్యనారాయణమూర్తి దారి చూపిస్తున్నారు.
వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమగా పేరుగాంచిన కోళ్ల పెంపకం యజమానులకు వేసవిలో సవాలుగా మారింది. చలి, వర్షాకాలంలో అధికంగా కోళ్ల దిగుబడి పెరుగుతూ రైతులకు లాభాల బాటలో ఈ పరిశ్రమ కొనసాగుతుంటుంది. కానీ వేసవి కాలం రాగానే రైతులు భయపడి త్వరగా ఇతర రాష్టాలకు ఎగుమతి చేస్తారు. ఎందుకంటే ఎండ తీవ్రత పెరిగే కొద్ది కోళ్లు చనిపోతున్నాయి. వేసవికాలం ఆరంభం మార్చి నుంచి జూన్ వరకు కొనసాగే వేడి వాతావరణం కోళ్ల పరిశ్రమను నష్టాలలోకి తీసుకొని పోతుంది. అంతేగాక బ్రాయిలర్, లేయర్లను ఎగుమతి చేసి ఫారాలను ఖాళీగా ఉంచుతారు. ఏటేటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడదెబ్బకు గురై 25-90 శాతం వరకు చనిపోతున్నాయి. ఇందుకోసం రైతులు తగు జాగ్రత్తలుతో పశుసంవర్థక శాఖ అధికారులతో సంప్రదించి ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే ఆర్థిక నష్టం రాకుండా చేసుకోవచ్చు.
వేడిమి వల్ల కోళ్లలో వచ్చే లక్షణాలు ఏమిటి?
* కోడి శరీరం చలిని తట్టుకునే విధంగా పూర్తిగా ఈకలతో కప్పబడి ఉంటుంది. వాటి శరీరంలో చెమట గ్రంథులు లేకపోవడం వలన ఉష్టోగ్రత 105-107 డిగ్రీల ఫారన్ హీట్ ఉంటుంది. వాతావరణ ఉష్టోగ్రత 107 డిగ్రీ ఫారన్హీట్ వరకు కోళ్లకు సదుపాయంగా ఉంటుంది. ఆపై కోడి యొక్క దేహ రసాయన ప్రక్రియ దెబ్బతింటుంది.
* ముఖ్యంగా వాతావరణ ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కోళ్లు ఆయాసపడుతూ తక్కువ మేత తింటూ ఎక్కువ నీళ్లు తాగుతాయి. అలాంటప్పుడు వడబెబ్బకు గురై చనిపోయే ప్రమాదం ఉంటుంది. గుడ్ల ఉత్పత్తి కూడా బాగా పడిపోతుంది.
* వేడి వాతావరణము వల్ల కోళ్ల ఉత్పత్తి తగ్గుతుంది మరియు పెరుగుదల ఉండదు. అంతేగాక కోళ్లు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే కోళ్లు ఆయాసపడుతూ ఉంటాయి. దీంతో దాణా తక్కువగా తింటాయి.
* లేయర్ కోళ్లులో కోడిగుడ్డు పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. పౌష్టికమైన దాణా పెట్టిన గుడ్ల సైజు పెరగదు మరికొన్ని అసలు గుడ్లు పెట్టవు.
* బ్రాయిలర్ కోళ్లు చనిపోతే రైతు ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోతాడు. వేసవిలో ఈ కోళ్ల ఎదుగుదల ఎక్కువగా ఉండదు. దీని వల్ల మాంసం ఉత్పత్తి తగ్గుతుంది.
* ఎండ వేడికి కోళ్లు, పిల్లలు నీరసంగా కనిపిస్తాయి. నీళ్ల విరేచనాలు అవుతాయి. సరిగా నిలబడలేవు. వణుకుతుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించగానే కోళ్ల ఫారం యజమానులు అప్రమత్తమై తగిన మందులు వేయించాలి.
* కోళ్లలో మెడలు వాల్చడం, సన్నగా మూలగడం, కళ్లనుంచి నీరు కారణం వంటి లక్షణాలున్న కోళ్లను వెంటనే ఇతర కోళ్ల నుంచి వేరు చేసి సరైన చికిత్స అందించాలి.
* వేసవిలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల అనేక వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అంటు వ్యాధులు కూడా వస్తాయి. దీంతో మందుల కొనుగోలుకు అధికంగా ఖర్చులు పెట్టాల్సి వస్తుంది.
* 10 అడుగుల ఎత్తులో నిర్మించబడిన షెడ్ల కన్నా ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్న వాటిలో ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది.
* కొన్ని జాతుల జన్యు సంబంధం మీద కూడా వాటి ప్రాణ నష్టం ఆధారపడి ఉంటుంది.
* 40 వారాల కన్నా తక్కువ వయస్సు గల కోళ్లలో మరియు కొత్తగా ఈకలు రాల్చిన కోళ్లలో ప్రాణనష్టం ఎక్కువ. వేసవిలో కోళ్ళ దాణాలో తీసుకోవలసిన జాగ్రత్తలు
* ముఖ్యమయిన జాగ్రత్త యేమిటంటే పోషకాలున్న దాణా పెట్టాలి. ఒకేసారి ఎక్కువగా దాణా వేయకూడదు.
* వేసవిలో కోళ్లు తక్కువ మేత తింటాయి. ఉష్ణోగ్రతలు పెరిగిన కొద్ది నీరు ఎక్కువగా తాగుతాయి. నీటిని ఎక్కువగా తాగుతుండడంతో దాణా తక్కువగా తీసుకుంటాయి. ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్న సమయంలో దాణా ఇస్తే ప్రయోజనం ఉంటుంది. ఒకేసారి ఎక్కువ పరిమాణంలో దాణా ఇచ్చినా ప్రయోజనం ఉండదు.
* దాణాను కొద్దిగా తడిపి పెట్టడం ఉత్తమం. ఎక్కువ తడిపితే దాణాకు బూజుపట్టే ప్రమాదం ఉంది.* వేసవిలో కోళ్లు పగటిపూట సరిగా తినవు. కాబట్టి ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం నాలుగు గంటల తర్వాత దాణా ఇవ్వాలి. కోళ్లకు నిత్యం ఉదయం నాలుగు గంటలకు 70 శాతం, రాత్రి 9 గంటలకు 30 శాతం దాణాను ఇవ్వాలి. మధ్యాహ్నం వేడిమి సమయంలో ఇవ్వకూడదు.
* దాణాలో అవసరమైన మోతాదులో విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండేలా చూసుకోవాలి. మాంసకృతులు తగ్గించాలి.* ఒత్తిడికి లోనైన కోళ్లకు సి విటమిన్ ఎక్కువ ఇవ్వాలి. ఒక టన్ను దాణాలో వంద గ్రాములు విటమిన్-సి, 50 గ్రాములు విటమిన్-ఇ ఉపయోగించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగును. అంతే కాకుండా విటమిన్-సి వాడడం వల్ల గుడ్డు పొట్టు గట్టిగా ఏర్పడును. విటమిన్-2 ఫలధీకరణ శాతాన్ని, గుడ్ల ఉత్పత్తిని పెంచును. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీటిలో విటమిన్-సి కలిపినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ విటమిన్-ఇ మాత్రం ముందు జాగ్రత్తగా ఇవ్వాలి. టీకాలు వేయుటకు రెండు వారాల ముందుగా ఇవ్వడం ఎంతైనా మంచిది.
* మిథియోనిన్ అనే అమైనో ఆమ్లం కోళ్ల దాణాలో ఉపయోగించడం వల్ల ఎండ వేడి నుంచి కాపాడి గుడ్డు పొట్టు సాధారణంగా ఏర్పడుటకు సహాయపడును. దీ అమ్మోనియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్ 0.25 శాతం ఇవ్వడం వల్ల కోళ్లు ఎక్కువగా నీరు తాగును. దీంతో శరీర ఉష్ణోగ్రత తగ్గించవచ్చు. వేసవిలో కోళ్లకు నీరు విషయములో తీసుకోవలసిన జాగ్రత్తలు
* తక్కువ నీరు ఇవ్వడం ఉత్తమం.
* కోళ్లు వేసవిలో ఎక్కువగానే నీళ్లు తాగుతాయి. దాణా, నీటి నిష్పత్తి 1:2 ఉంటుంది. ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు 1.4 నిష్పత్తి ఇవ్వాలి. కోళ్లకు వీలైనంత వరకు చల్లని నీటిని ఇవ్వాలి. అందువల్ల షెడ్లలో అదనంగా నీటి తొట్టెలు ఏర్పాటు చేసి అవసరం మేరకు నీటిని అందించాలి.
* కోళ్లు తాగే నీటిలో ఎల్లక్ట్రోలైట్లు – విటమిన్ వంటివి కలిపితే అవి వత్తిడికి గురి కాకుండా చూడాలి.
* నీళ్ల ట్యాంకులు చల్లదనంగా ఉండేలా చూసుకోవాలి. నీటి ట్యాంకుల మీద కొనే సంచులు కప్పి వాటిని ఎప్పటికప్పుడు తడుపుతూ ఉండాలి. దీనివల్ల ట్యాంకుల్లోని నీరు వేడెక్కదు. లేదంటే 2000 లీటర్ల నీళ్ల ట్యాంక్లో 20 కేజీల మంచు గడ్డలు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో వేసి ఉంచడం వలన నీటి ఉష్ణోగ్రతను 22 నుంచి 24 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తగ్గించుకోవచ్చు.
* నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు నియంత్రించాలంటే శుభ్రమైన నీటిని ఇవ్వాలి.* ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కోళ్లపైన నేరుగా నీటిని పిచికారి చేయవచ్చు.వేసవిలో కోళ్లకు షెడ్ల నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
* సూర్యరశ్మి తగలకుండా ఉండాలంటే కోళ్ల షెడ్లను తూర్పు, పడమరగా నిర్మించాలి. వెడల్పు 30 అడుగులకు మించకుండా ఉండాలి.
* వేసవికాలంలో కోళ్ల షెడ్డు పైన గడ్డి, స్పింక్లర్స్ అమర్చి అరగంటకు ఒకసారి షెడ్డుపైన నీళ్లు చల్లాలి. దీంతో షెడ్డులోపల చల్లదనం చేకూరుతుంది. కోళ్లు మృత్యువాత నుంచి తప్పించుకోవచ్చు. షెడ్డుకు గాలి వచ్చే దిశలో పలుచని గోనె సంచులు లేదా గ్రీన్ నెట్ లాంటివి కట్టాలి. వాటిపై పది నుంచి పదిహేను సార్లు నీళ్ళు చల్లాలి. ఇలా చేయడం వల్ల వడగాల్పులు నేరుగా షెడ్డులోకి వెళ్ళకుండా ఉంటుంది. తడిచిన గ్రీన్ నెట్ వల్ల షెడ్డులోకి చల్లని గాలి వీస్తుంది. షెడ్డు లోపలి భాగంలో ఫాగర్స్ అమర్చి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అరగంటకోసారి నీళ్లు వదిలినచో కోళ్లపై తుంపరగా పడటం వల్ల కోడికి చల్లదనం ఇస్తుంది.
* కోళ్ల ఫారాలు ఇరుకుగా ఉండకూడదు.షెడ్డులో ఎప్పుడు తేమ లేకుండా పొడిగా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. లిట్టర్ ఎత్తును తగ్గించి షెడ్డులో దుమ్ము, ధూళీ లేకుండా చూసుకోవాలి.
* ఉష్ణోగ్రత తగ్గించేందుకు షెడ్డు పైన గడ్డిని దట్టంగా వేసిదానిపై అప్పుడప్పుడూ నీళ్లు చల్లుతుండాలి. దీంతో షెడ్డులోపల ఉష్ణోగ్రత తగ్గుతుంది. షెడ్డు కప్పుపై తెల్లని రంగు వేసి కూడ కొంత వరకు ఉష్ణోగ్రతను తగ్గించవచ్చును.
* షెడ్డు చుట్టూ పది అడుగుల దూరంలో నీడనిచ్చే చెట్లు పెంచాలి.
* షెడ్లలో కోళ్లను డీప్ లిట్టర్ పద్దతిలో లేదా కేజీస్లో నిర్దేశించిన సంఖ్యలోనే ఉంచాలి. కేజీస్లో పెద్దకోడికి 0.75 వరకు చదరపు అడుగులు, డీప్ లిట్టర్ అయితే రెండు చదరపు అడుగుల స్థలంలో ఉంచాలి.వేసవిలో కోళ్లకు ఆరోగ్య విషయములో తీసుకోవలసిన జాగ్రత్తలు
* వాతావరణం చల్లగా ఉన్నప్పడే కోళ్ల ముక్కలు కత్తిరించిడం, టీకాలు వేయించడం, నట్టల నివారణ మందులు ఇవ్వడం వంటి పనులను పూర్తి చేయాలి. కోళ్ల వయస్సు ఎండ తీవ్రతను బట్టి దాణాలో ఆమైనో అవ్లూలు, విటమిన్లు, ఖనిజాలు, మోతాదును పెంచాలి.
* ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదు గంటల సమయంలో కోళ్లను పట్టుకోవడం, కలత చెందించడం వంటివి చేయకూడదు. వేసవిలో ఉదయం పూట మాత్రమే టీకాలు వేయాలి.
* ఒకవేళ వేడిమికి ప్రాణనష్టం జరుగుతూ ఉంటే పది నుంచి 20 గ్రాముల దాణా తగ్గించాలి. దాణా మీద బూజు పట్టకుండా కొంచెం నీటిని చిలకరించాలి.
* వేసవిలో ఎండ తీవ్రత పెరిగిన కొద్దీ వేడిగాలులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి ఎక్కువగా వ్యాధుల భారీన పడతాయి. కొక్కర, మారెక్స్, ఆర్డి, బర్డ్ప్లూ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఎండకాలంలో వచ్చే వ్యాదుల నివారణకు ముందుగానే టీకాలు వేయించాలి.
* మృత్యువాత గురైన కోళ్లను ఎక్కడ పడితే అక్కడ వేయరాదు. మృత్యువాత పడ్డ కోళ్లను 7 లేదా 8 ఫీట్ల గుంత తవ్వి పూడ్చాలి. ఇలా చేయడం ద్వారా ఒక ఫామ్ నుంచి మరొక ఫామ్కు ఈ వ్యాధులు వ్యాపించవు. ఇలా వేసవిలో కోళ్ల పెంపకందారులు అప్రమత్తంగా ఉంటూ. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కోళ్ల పెంపకాన్ని లాభసాటిగా చేయవచ్చు. డా. జి. రాంబాబు, పశు వైధ్యాధికారి, కడప. ఫోన్: 9618499184
భూసారం ఎంతగా పెరిగితే అందులో మనం పండించే పంటలు అంతగా దిగుబడిని అందిస్తాయి. నేటి కాలంలో వాడే ఎన్నో రకాల రసాయన మందుల వలన భూమి సారవంతత తగ్గుతుంది. దానితో పంట తక్కువ దిగుబడి వస్తుంది. వీటిని వీలైనంత తక్కువ వాడుతూ రసాయన ఎరువులు ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్టనూ ఉపయోగిస్తున్నారు. చాలామంది శాస్త్రవేత్తలు కూడా వీటి వినియోగాన్ని పెంచాలంటూ సూచిస్తున్నారు. ఈ పచ్చిరొట్టలు వేయడం వల్ల పంటలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.
పచ్చరొట్ట ఎరువులను భూమికి రెండు విధాలుగా అందించవచ్చు.
1. పచ్చిరొట్ట ఎరువులు;
2. పచ్చిఆకు ఎరువులు
పచ్చిరొట్ట ఎరువులు: జనుము, జీలుగు, పెసర, అలసంద వంటి పంటలను పూత వరకు పెంచి ఆ తర్వాత నెలలో కలిపి దున్నడాన్ని పచ్చిరొట్ట ఎరువులు అంటారు.పచ్చి ఆకు ఎరువులు: కానుగ, గ్లైరిసిడియా, అవిశ, సీమతంగేడు, వెంపలి వంటి మొక్కల ఆకులను కోసుకొచ్చి పొలంలో తొక్కి వేయడాన్ని పచ్చి ఆకు ఎరువులు అంటారు.
కట్టె జనుము: ఇది అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. పచ్చిరొట్టగా పశువుల మేతగా ఉపయోగించవచ్చు. ఎకరానికి 12 నుండి 15 కిలోల విత్తనాలు చల్లుకోవాలి. దీనివల్ల 5 నుండి 6 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది.
పిల్లిపెసర: దీనిని తేలిక మరియు బరువైన నేలల్లో సాగు చేయవచ్చు. చౌడు భూముల్లో ఇవి సాగుకు పనికిరావు. ఎకరానికి 6 నుండి 8 కిలోల విత్తనం అవసరమవుతుంది. దీనివల్ల మూడు నుండి నాలుగు టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. నీలి వెంపలి: ఇవి చాలా ప్రదేశాల్లో కలుపు మొక్కలుగా కనబడతాయి. ఇవి అన్ని రకాల నేలల్లో వేసుకోవచ్చు. వీటిని పచ్చిరొట్ట ఎరువులుగా వాడుకోవచ్చు. ఇవి ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనాలను అందుకుంటాయి. పచ్చిరొట్టపైరుకు ఉండవలసిన లక్షణాలు:
* తక్కువ రోజుల్లో బాగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టను ఇచ్చేలా ఉండాలి.* అన్ని రకాల నేలల్లో పెరిగే గుణాన్ని కలిగి ఉండాలి.
* పచ్చిరొట్ట పీచు శాతం తక్కువగా ఉండి ఎక్కువ ఆకు కలిగి రసభరితంగా ఉండాలి.
* నేలలో కలియదున్నినప్పుడు త్వరగా కుళ్ళి భూమిలో కలిసేటట్లు ఉండాలి.
* త్వరగా పెరిగి కలుపు మొక్కల పెరుగుదలను అరికట్టాలి.
* పచ్చిరొట్ట వేర్లు చాలా లోతుకు పోయేలా ఉండాలి.
* పప్పు జాతి మొక్కల వేర్లలో బుడిపెలు ఉండి వాతావరణంలో నత్రజని స్థిరీకరణ చేసే విధంగా ఉండాలి.
* ఏ రకమైన నేలలో అయినా పెరిగే గుణాన్ని కలిగి ఉండాలి.
* తక్కువ వనరులు వినియోగించుకుంటూ సాధారణ యాజమాన్యంలో త్వరగా పెరిగి అధికంగా పచ్చిరొట్ట పైర్లు అందించేలా ఉండాలి. పచ్చిరొట్ట ఎరువుల వాడకంలో సూచనలు
* పచ్చిరొట్ట ఎరువులను పూత థలలో ఉన్నప్పుడు కలిపి దున్నాలి.
* నేలలో కలిపి దున్నే నాటికి పైర్లలో 40 నుండి 80 శాతం తేమ ఉండటమే కాకుండా, నేలలో కూడా సరిపడ నీరు ఉన్నట్లయితే అవి త్వరగా మురుగుతాయి. ఇక పైరు మొత్తం మురిగిన తర్వాత పాత నీటిని తీసివేయాలి. వేరే నీటిని అందివ్వాలి.
* పచ్చిరొట్ట పంటలు సాగు చేసే నేలలో నత్రజని తక్కువగా ఉండడం వల్ల నత్రజని వేసినట్లయితే అవి ఏపుగా పెరిగి రొట్ట దిగుబడి ఎక్కువగా ఉంటుంది, వేరు బుడిపెలు కూడా పెరుగుతాయి. పచ్చిరొట్ట ఎరువుల వాడకం
ఒక ఎకరానికి 24 కిలోల జనుము, 12 నుండి 14 కిలోల జీలుగ, 14 నుండి 16 కిలోల పెసర మరియు, 6 నుండి 8 కిలోల అలసంద వంటి పచ్చిరొట్ట పంటలను పెంచుకోవచ్చు. పచ్చిరొట్ట పైర్ల సాగులో ఇబ్బందులు
పచ్చిరొట్ట ఎరువులు వేసిన తర్వాత నేలలో వేసి కలియదున్నడానికి సుమారు 45 రోజుల వ్యవధి పడుతుంది. ఏపుగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టను ఇవ్వాలంటే తేమ అవసరమవుతుంది. పచ్చిరొట్ట ఎరువుల లాభాలు
* నేల భౌతిక స్థితి మెరుగుబడి, భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది.
* నేలలో సేంద్రియ పదార్థం వేయడం వల్ల సూక్ష్మజీవుల వృద్ధి చెందుతాయి. జీవ రసాయనిక చర్యలవల్ల నేల సారం పెరుగుతుంది.
* నేలలో లభ్యం కాని రూపంలో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయి. భూమిలో రసాయన ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగపడతాయి.
* జీలుగు, జనుము, పిల్లిపెసర వంటి పైర్లు వేసినప్పుడు వీటి వేర్లు ఎక్కువ లోతుకు వెళ్లడం వల్ల భూమిలోపలి పొరల్లో నిక్షిప్తమైన అనేక పోషకాలను తెచ్చి పంటకు అందిస్తాయి.
* పప్పుజాతి పంటల వల్ల రైజోబియం అనే బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి. భాస్వరం, గంధకం వంటి పోషకాల లభ్యత గణనీయంగా ఉంటుంది.
* పచ్చి రొట్ట పైర్లు ఎరువులగానే కాకుండా పశువులకు మేతకుగాను ఉపయోగపడుతుంది.
ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెంటేగ్రేడు దాటి 50 డిగ్రీల వరకు వెళుతుంటాయి. పర్యావరణం నానాటికీ వేడెక్కుతున్నది. గాలిలో కార్బన్డైఆక్సైడ్ పెరగటం, గ్రీన్హౌస్ గాస్ల సాంద్రత పెరగటం, ఓజోన్ పొరలో పడ్డ రంధ్రం పెద్దది కావటం ప్రపంచ ప్రజలను గందగోళంలో పడేస్తున్నది. పారిశ్రామికీకరణ, వాతావరణ కాలుష్యం, వాహనాల వాడకం ఎక్కువ కావటం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. వర్ధమాన దేశాల్లో వ్యవసాయ రంగం కూడా అనేక కొత్త సవాళ్ళనెదుర్కోవలిసి వస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల్ని ఎక్కువగా వాడటం, ముడిచమురు, సహజ వాయువు, బొగ్గుల వాడకాన్ని తగ్గించటం ద్వారా భూమి వేడెక్కటాన్ని కొంతవరకు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వేసవి తాపాన్ని ఎదుర్కోవటంలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే నిమ్మకాయలు ఈ వేసవిలో కనిపించటంలేదు. నింబూపానీ, నింబూసోడా వంటి పానీయాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. హోల్సేల్ స్థాయిలో కిలోకి రూ. 200/-లు రిటైల్ స్థాయిలో కిలోకి రూ. 350/- వరకు ధరలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూలేని స్థాయిలో నిమ్మకాయల ధరలుంటున్నాయి. ఒక్కో నిమ్మకాయ రూ. 15 నుండి 20 వరకు అమ్ముడవుతున్నది. గత సంవత్సర కాలంలో ఉత్పత్తి బాగా తగ్గటమే ధరల్లో వృద్ధికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
ఉత్పత్తిలో అగ్రస్థానం:
ప్రపంచవ్యాప్తంగా తోటల పెంపకం ఊపందుకుంటున్నది. భారత దేశంలో కూడా తోటల ఉత్పత్తులు ఆహార ధాన్యాల ఉత్పత్తిని అధిగమించాయి. ఆంధ్రప్రదేశ్లో తోటల ఉత్పత్తులు సాలీనా 12 శాతం చొప్పున పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం తోటల క్రింద 18 లక్షల హెక్టార్లు సాగవుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. అందులో పండ్ల తోటల విస్తీర్ణం ఏడున్నర లక్షల హెక్టార్లకు చేరింది. మామిడి, అరటి, బొప్పాయి, బత్తాయి ముఖ్యమైన పండ్ల ఉత్పత్తులు. తెలంగాణలో తోట పంటలకింద దాదాపు 9 లక్షల హెక్టార్లు సాగవుతున్నాయి. తోట ఉత్పత్తులు దాదాపు 100 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి. దాదాపు 50 లక్షల టన్నుల పండ్లు, 38 లక్షల టన్నుల కూరగాయలు, 8 లక్షల టన్నుల సుగంధ ద్రవ్యాలు పండుతున్నట్లు అంచనాలున్నాయి. సిట్రస్ జాతి పండ్లలో నాగపూర్ సంత్రాలు, ఈశాన్య భారతంలో మాండరిన్ ఆరెంజ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 95,982 హెక్టార్లలో బత్తాయి, 43,000 హెక్టార్లలో నిమ్మ సాగు జరుగుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ప్రపంచంలో 1,73,84,130 టన్నుల నిమ్మకాయలు సంవత్సరానికి పండుతున్నాయని అంచనాలున్నాయి. అందులో అత్యధికంగా 29,78,000 టన్నుల నిమ్మకాయలు భారతదేశంలో ఉత్పత్తయ్యాయి. 24,29,839 టన్నులతో మెక్సికో, 23,29,863 టన్నులతో చైనా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆర్జంటీనా (16,78,337), బ్రెజిల్ (12,62,353)లు, స్పెయిన్ (8,57,754), టర్కి (8,50,600), అమెరికా (8,22,000) ఇతర ముఖ్య ఉత్పత్తిదార్లు. ఇరాన్, ఇటలీ, ఈజిప్ట్లలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో నిమ్మకాయలు ఉత్పత్తవుతున్నాయి. ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉన్నా వాటిని ఎగుమతిచేయడంగానీ, దిగుమతి చేడంగానీ జరగడం లేదు. దేశంలో ఉత్పత్తి స్థానిక అవసరాలకే వినియోగించబడుతున్నది.
ముందువరుసలో ఆంధ్రప్రదేశ్
భారతదేశంలో మూడు లక్షల పదిహేడువేల ఎకరాల్లో నిమ్మ తోటలు సాగు చేయబడుతున్నాయి. అందులో మూడవవంతు విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నది. ఒక లక్షాపదివేల ఎకరాల్లో నిమ్మతోటలు సాగవుతున్నాయి. కానీ దేశంలో ఉత్పత్తవుతున్న 31,14,960 టన్నుల నిమ్మకాయల్లో 20 శాతం (6,93,870 టన్నులు) ఆంధ్రప్రదేశ్ నుండి లభిస్తున్నాయి. 17.8 శాతం వాటా (6,25,830 టన్నులు)తో గుజరాత్ రాష్ట్రం ద్వితీయ స్థానంలో ఉన్నది. మహారాష్ట్ర (3,46,320 టన్నులు), కర్నాటక (3,40,390 టన్నులు), మధ్యప్రదేశ్ (3,02,770 టన్నులు), ఒరిస్సా (2,88,030 టన్నులు), అస్సాం (1,57,320 టన్నులు) లు కూడా ముఖ్య ఉత్పత్తిదార్లు. తెలంగాణాలో 1,50,550 టన్నుల నిమ్మకాయలు ఉత్పత్తవుతున్నాయి. దేశపు ఉత్పత్తిలో ఇది 4.28 శాతం. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ కలిపి దాదాపు నాల్గవ వంతు నిమ్మకాయలు ఉత్పత్తవుతున్నాయి. అయితే ఉత్పాదకతలో భారత్ ఇతర దేశాలకన్నా వెనకబడ్డట్లే, గుజరాత్ రాష్ట్రంతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో హెక్టారు ఉత్పాదకత తక్కువగా ఉంది. దేశపు సగటు ఉత్పాదకత హెక్టారుకి 20 టన్నులుగా ఉంటే, ఆంధ్రప్రదేశ్లో సగటు ఉత్పాదకత 15 టన్నులు మాత్రమే.
నిమ్మ చెట్లకు పుట్టిల్లు ఆగ్నేయాసియా దేశాలైన భారతదేశమంతా ఆ తోటలు సాగులో ఉన్నాయి. అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలు, చౌడుభూములు, ఒండ్రునేలలు కల ప్రాంతాలు నిమ్మ సాగుకి అనువైనవి కావు. నీరు ఇంకిపోయే స్వభావం కల ఎర్రనేలలు, గరువులు, తేలికపాటి నల్లనేలలు నిమ్మ తోటలకు పనికివస్తాయి. వారానికి ఒక తడిని కోరే నిమ్మ చెట్లు కొద్ది నెలల పాటు నీరు లేకున్నా బతికి ఉంటాయి. ఒకప్పుడు నాటు రకం విత్తనాలను వాడేవారు కాని ఇప్పుడు బాలాజీ, పెట్లూరు, సెలక్షన్-1 రకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ రకాలు కేంకర్ (గజ్జి)ని తట్టుకుంటాయి. అంటుకట్టిన మొక్కలు ఒక సంవత్సరం ముందుగా కాపుకి వస్తాయి. సాధారణంగా నాలగవ సంవత్సరం నుండి కాపు మొదలై, చెట్లు ఏడెనిమిది సంవత్సరాలకు పూర్తి కాపుకి వచ్చి 30 సంవత్సరాలపాటు బతికి ఉంటాయి. చీడ, పీడలు ఎక్కువగా ఉండే నిమ్మతోటలకు సంవత్సరంలో నాలుగైదుసార్లు సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. కొందరు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తుంటే, మరికొంతమంది రసాయనక ఎరువుల్ని, పురుగుమందుల్ని వాడుతున్నారు. సంవత్సరంలో మూడుకాపులు వస్తాయి. ముఖ్యపంట సెప్టెంబరు-అక్టోబరు మాసాల్లో పూతకు వచ్చి మార్చి నెలలో కాయలు కోసే స్థితికి వస్తుంది. దీనిని ‘హస్తాబహార్’ అని పిలుస్తారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూతకు వచ్చి, మే నెలలో కోతకు వచ్చే పంటను ‘అంబేబహార్’ అంటారు. జూన్, జులై నెలల్లో పూతకు వచ్చి, నవంబరు చివరకు కాయలు లభించే పంటను ‘మృగబహార్’ అని పిలుస్తారు. రైతులు తమ అనుభవాన్ని బట్టి, సంవత్సరంలో రెండు లేక మూడు పంటల్ని తీసుకుంటారు. సాధారణంగా వర్షాకాలం, శీతాకాలాల్లో వచ్చే పంటకు తక్కువ ధర, వేసవి కాలంలో వచ్చే పంటకు ఎక్కువ ధర లభిస్తుంటుంది. మొత్తానికి సంవత్సరం పొడవునా దేశంలో ఏదో ప్రాంతం నుండి నిమ్మకాయలు మార్కెట్కి వస్తుంటాయి. ముఖ్య పంటను శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచి, గిరాకీని బట్టి మార్కెట్కి వ్యాపారులు తెస్తుంటారు.
పెరుగుతున్న గిరాకీ
నిమ్మకాయకుండే ఔషధ గుణాల గురించి సామాన్యులకు కూడా తెలుసు. 2.26 శాతం సిబ్రిటక్ యాసిడ్ కలిగిన నిమ్మరసంలో ‘సి’ విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. నియమం తప్పకుండా నిమ్మరసం తాగితే బరువు తగ్గుతారు. నిమ్మకాయను క్రమం తప్పకుండా వాడితే చర్మం నిగనిగలాడుతుంది. వేడినీళ్ళతో కలిపి తాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం దూరమవుతుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా కాపాడుతుంది. నోటి దుర్వాసన రాకుండా కాపాడుతుంది. బ్యాక్టీరియాని కూడా నిర్మూలిస్తుంది. మధుమేహుల్లో షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. ఇన్ని మంచి లక్షణాలున్న నిమ్మరసాన్ని ఎక్కువగా వాడితే పండ్లకుండే ఎనామిల్ పూతను తగ్గిస్తుంది. దంతాల క్షయానికి కారణమౌతుంది. నోటిలోని దంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ, నిమ్మరసాన్ని వాడుతుంటే ఆరోగ్యానికి మంచిది. గత రెండేళ్ళుగా కరోనా భయంతో బ్రతికిన ప్రజలకు ‘రోగనిరోధక శక్తి’ని పెంచుకోవాలనే కోరిక బలపడింది. అందుకోసం నిత్యం వాడాల్సిన పదార్థాల్లో నిమ్మరసం ఒకటి. దీనితో నిమ్మకాయలకు గిరాకీ బాగా పెరుగుతున్నది. కానీ గిరాకీకి తగ్గ సరఫరా లేదు. నిమ్మకాయల ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉన్నా, తలసరి లభ్యత మాత్రం చాలా తక్కువ. సంవత్సరానికి దేశంలో ఒక్కొక్కరికి రెండున్నర కిలోలు మాత్రం లభ్యమౌతున్నాయి. అంటే నెలకు రెండు వందల గ్రాములు. పది రోజులకు ఒక్క చిన్నకాయ మాత్రం అందుతున్నది. రెండుమూడు రోజులకు ఒక్కొక్కరు ఒక్క కాయవాడాలన్నా ప్రస్తుతమున్న ఉత్పత్తి నాలుగు రెట్లు పెరగాలి.
కానీ చాలామంది నిమ్మకాయను ఎప్పుడో కాని వాడరు. ఎంతోమంది ధర తక్కువగా ఉన్నప్పుడే వాటిని వాడతారు. ప్రతి సంవత్సరం మార్కెట్లో గిరాకీ పదిశాతం కన్నా ఎక్కువ పెరగదు. ఈ సంవత్సరం అసాధారణంగా పంట దెబ్బతిన్నందువల్లనే ధరలు పెరిగాయి. ఉదాహరణకు గుజరాత్లో 80 శాతం పంట నష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో 20 వేల ఎకరాల్లో తోటలుంటే నీటి ఎద్దడి వల్ల ఏడువేల ఎకరాల్లో తోటలు ఎండిపోయినట్లు పత్రికల్లో వచ్చింది. ఇలా అతివృష్టి, అనావృష్టి, చీడ, పీడల వల్ల దేశంలో కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం జరుగుతుంది. ఈ సంవత్సరం ఒకేసారి చాలా రాష్ట్రాల్లో నిమ్మతోటలు పంట నష్టం వల్ల సరఫరా సగానికి తగ్గింది. గిరాకీ తగ్గకుండా సరఫరా తగ్గడంతో ధరలు భగ్గుమన్నాయి. కొత్త పంట వచ్చే కొద్దీ ధరలు సర్దుకుంటాయి. ఈ సంవత్సరం ధరల్ని చూసి చాలామంది రైతులు కొత్తగా నిమ్మతోటల్ని వేయవచ్చు. సరఫరా సాధారణ స్థాయికి చేరుకుంటే వచ్చే సంవత్సరం ధరలు తగ్గి, మళ్ళీ సరుకు సామాన్యుడికి అందుబాటులోకి రావచ్చు. సరఫరా సాధారణ స్థాయి కన్నా ఇరవైశాతం పెరిగినా ధరలు పడిపోతాయి. నోట్ల రద్దు చేసిన సంవత్సరం కొనే నాధులు లేక రైతులు బాగా నష్టపోయారు. రెండేళ్ళ కరోనా సమయంలో గిరాకీ ఉన్నా సరఫరా వ్యవస్థలో ఏర్పడిన అంతరాయం వల్ల ధరలు తగ్గాయి. ఇలా ఆటుపోట్లు తప్పవు. పదేళ్ళలో ఏడు సంవత్సరాలు ధరలు గిట్టుబాటయితే రైతులు నిలదొక్కుకోగలుగుతారు. వరుసగా రెండుమూడు సంవత్సరాలు ధరలు తగ్గిపోతే రైతులు పాత తోటల్ని తీసివేస్తుంటారు.
లాభనష్టాలు
రైతులు తమ తోటల్ని చక్కగా యాజమాన్యం చేస్తే చెట్టుకో వెయ్యి కాయలు కాయించవచ్చు. ఎకరాకు 80 నుండి 100 చెట్లు పెడితే, అందులో 80 శాతం ఆరోగ్యంగా ఉండి బాగా కాస్తే ఎకరానికి లక్షరూపాయల వరకు లాభాన్ని ఆర్జించవచ్చు. ఉత్పత్తి గండంతో పాటు మార్కెట్ గండం కూడా ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఐదేళ్ళు లాభాలార్జించి, మూడేళ్ళు ఖర్చుల వరకు సంపాదించినా, రెండేళ్ళు వచ్చే నష్టాలను తట్టుకోగలుగుతారు. అన్ని వాణిజ్య పంటల్లోగానే నిమ్మకు కూడా మార్కెట్ ఆటుపోట్లు తప్పవు. పూర్తిగా నిమ్మతోటల్నే నమ్ముకోకుండా సగం భూమిలో వేరే పంటలు వేసుకోగలిగితే ‘రిస్క్’ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. నిమ్మకు పెరుగుతున్న గిరాకీ నేపథ్యంలో ఏటా ఐదుశాతం విస్తీర్ణాన్ని పెంచుకునే ప్రయత్నం చేయవచ్చు. మెరుగైన యాజమాన్య పద్ధతుల్ని రైతులు ఆచరించేలా సహాయపడటం వల్ల ఉత్పాదకత కూడా సంవత్సరానికి ఐదు శాతం పెంచవచ్చు. ఏటా పది శాతం సరఫరాను పెంచటం ద్వారా పెరుగుతున్న గిరాకీని సంతృప్తిపరచవచ్చు. ధరల్ని కూడా అదుపులో ఉంచవచ్చు. ఈ సంవత్సరంలాగా ధరలు పెరిగితే పేదలు నిమ్మకాయల్ని కొనలేరు. మధ్యతరగతి వారు కూడా డజను కాయలు కొనేవాళ్ళు ఒకటి రెండుతో సరిపెట్టుకుంటున్నారు. లెక్కలేకుండా ఖర్చు చేయగలిగిన వాళ్ళు మాత్రమే అవసరానికి తగ్గట్టుగా కొనగలుగుతారు. ఈ తాత్కాలిక ఉపద్రవం మళ్ళీ రాకుండా కొంత విస్తీర్ణాన్ని పెంచుతూ, ఉత్పాదకత పెరిగే చర్యలు చేపడుతూ అటురైతుకి, వినిమయదారుడికీ సంతృప్తి కలిగేలా చర్యలుండాలి.
డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త,
కరోనాతో సంబంధం లేకుండా పంటల ఉత్పత్తి క్రితం 2 సంవత్సరాలలో జరిగింది. పండిన పంటను మార్కెటింగ్ చేయడంలో రైతులు ఇబ్బంది పడినారు. ప్రస్తుతం కరోనా మెల్లమెల్లగా పెరుగుతున్నది. మే నెలలో ఇంకా ఎక్కువయి థర్డ్వేవ్ రావచ్చని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో మే నెల (భరణి, కృతిక, రోహిణి కార్తెలు)లో వ్యవసాయపు పనుల గురించి తెలుసుకుందాం.
వరి: తెలంగాణలో మద్దతు ధరకు వరి కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకొని చర్యలు తీసుకుంటున్నది. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పద్ధతి పాటిస్తే రైతులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వాల పలుకుబడి కూడా పెరుగుతుంది. మే నెలలో చలికాలపు పంట మార్కెట్కు ఎక్కువగా వస్తుంది. ధరలు తక్కువగా ఉన్నప్పుడు వడ్లను నిల్వ చేసి పాతయినాక బియ్యం చేసి ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. ప్రతి రైతు వడ్లను బియ్యం చేసి అమ్ముకునేందుకు అనుకూలమైన చిన్న చిన్న మొబైల్ మిల్లులను సబ్సిడీలిచ్చి ప్రోత్సహిస్తే, పెద్ద మిల్లులపై ఆధారపడడం తగ్గుతుంది. రైతులకు, వినియోగదారులకు అనుకూలంగా ధరలుంటాయి. ప్రతి రైతూ వడ్లను పాతవయ్యేంతవరకు నిల్వ చేయడం, బియ్యం చేసి అమ్మడం వంటి కార్యక్రమాలు గ్రామాల్లో చేపట్టవచ్చు. వర్షాకాలపు వరి నారుపోయుట, మే చివరి వారంలో మొదలవుతుంది. రోహిణి కార్తె 25-5-22 నుండి 7-5-22 వరకు ఉంటుంది. ఈ కార్తెలో నారుపోసి, నాటిన వరి, చీడపీడల బారిన పడకుండా, చాలావరకు తప్పించుకుంటుంది. నీటి లభ్యత అనుకూలంగా ఉండి, ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి అనుకూలంగా లేని చోట మాత్రమే వరి వేస్తే మంచిది. వరి పంట దేశ అవసరాలకు మించి పండుతున్నందున, ఎగుమతి చేయడానికి విలువ పెంచిన సరుకు తయారు చేసి బయటి దేశాలకు పంపడానికి ప్రయత్నాలు ఎక్కువ చేయాలి. ప్రభుత్వాల మీద ఆధారపడకుండా స్వంతంగా మార్కెట్ చేసుకోగలమనే రకాలనే సాగు చేస్తే మంచిది. కొత్త రకాలను కొద్ది భూమిలో పండించి ఈసారి లాభసాటి ధరకమ్ముడుపోతే, వచ్చే సీజన్లలో వీటి విస్తీర్ణాన్ని పెంచవచ్చు.
ప్రత్తి: ఈసారి ప్రత్తి ధరలు క్వింటాలు 10 వేల రూపాయలు దాటాయి. వర్షాలు బాగా పడి, లేక నీటి వసతి ఉన్న చోట మే నెల కడవారంలో (రోహిణిలో) విత్తేపత్తిలో చీడపీడల ముఖ్యంగా గులాబిరంగు పురుగు బాధ చాలా తక్కువగా ఉంటుంది. అధిక సాంద్రతతో చల్కా భూముల్లో కూడా సాగు చేయవచ్చు. సాలుకు సాలుకు 80 సెం.మీ. సాలులో మొక్కల మధ్య 20 సెం.మీ. దూరంలో మొక్కలు నాటి ఎకరాకు 25000 మొక్కలు పెంచవచ్చు. చైనా నుండి ప్రత్తి దిగుమతి ఆపి వేయడం వలన, గులాబి రంగు పురుగు ఉధృతి వలన ప్రత్తి లభ్యత తగ్గి క్రితం సంవత్సరం ప్రత్తి పంటకు మంచి ధర లభించింది. దిగుమతులు మానేస్తే మన రైతులే, ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి, ఎక్కువ లబ్ది పొందే అవకాశముంది. అధిక సాంద్రత ప్రత్తి సాగును, వర్షాధారంగానూ, నీటితడులతోను సాగు చేయవచ్చు. విత్తన మోతాదు 3 కిలోలు/ఎకరాకు. ప్రత్తి పంట అధిక సాంద్రత పద్ధతిలో త్వరగా పూర్తి అవుతుంది. కావున తదుపరి పంటగా, శనగ, పెసర, మినుము, నువ్వులు, వేరుశనగ పంటలను సాగు చేయవచ్చు. నీటి ఆధారమున్నచోట ఇది సాధ్యపడుతుంది. మే నెల చివరన ముంగారి ప్రత్తిని విత్తడం రాయలసీమ, తెలంగాణలలో అలవాటు. రాయలసీమలో శ్రీనంది రకం 8-9 క్వి./ఎ. దిగుబడినిస్తూ ప్రాచుర్యంలో కొస్తున్నది. ఇప్పటికే మంచి ప్రాచుర్యంలో ఉండి, అత్యధిక దిగుబడిలిచ్చుట మీరు గమనించిన రకాలను/హైబ్రిడ్లను ఎంపిక చేసుకొని ప్రత్తిని సాగు చేయండి. కొత్తరాలకు కొద్ది విస్తీర్ణంలో ప్రయత్నించి, దిగుబడి బాగుంటే వచ్చే సంవత్సరం విస్తీర్ణాన్ని పెంచవచ్చు. వ్యవసాయంలో ఒడిదుడుకులను తగ్గించాల్సిన అవసరముంది.
మొక్కజొన్న: అత్యధిక దిగుబడులు సాధించడానికి, మే చివరి వారం నుండి జూన్ మొదటి వారం వరకు విత్తవచ్చు. భూమిలో తేమ తప్పనిసరి కాబట్టి మంచి వర్షం లేదా నీటి తడి అవసరం. ఎకరాకు 40-45 క్వి. దిగుబడినివ్వగలిగిన పలు ప్రైవేట్ హైబ్రిడ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
అల్లం: మే నెలలోపలే విత్తడం పూర్తి చేయవలసిన పంట. తర్వాత విత్తితే దుంపకుళ్ళు ఎక్కువ. దిగుబడులు బాగా తగ్గుతాయి. అధిక పచ్చి అల్లం మరియు ఎండుఅల్లం (శొంఠి) కొరకు అనువైన రకాలు: ఆంధ్రప్రదేశ్కు: రియోడిజనీరో, వైనాడ్లోకల్, తెలంగాణకు: రియోడిజనీరో, మారన్. ఎక్కువ ఎండ, ఎక్కువ వేడి, ఎక్కువ తేమ లభ్యమయ్యే ప్రాంతాల్లో అల్లం దిగుబడి బాగా ఎక్కువ. కొంత ఎండ, కొంత నీడ తగిలే పందిరి కూరగాయతోటలు, ద్రాక్ష, మామిడి, కొబ్బరి, బొప్పాయి, నిమ్మ, జామ తోటల్లో కూడా ఈ పంట పండుతుంది. విత్తనమోతాదు: 600-800 కిలోలు/ఎకరాకు.
పసుపు: ఆంధ్రప్రదేశ్లో 6-7నెలల్లో తవ్వకానికి వచ్చే స్వల్పకాలిక రకాలను విత్తడానికి మే నెల చివరి వారం అనుకూలం. ఈరకాలనే తెలంగాణలో జూన్ మొదటి పక్షంలో నాటడం అనుకూలం. అధిక దిగుబడినిచ్చే స్వల్పకాలిక రకాలు: ఐ.ఐ.ఎస్.ఆర్. ప్రతిభ, దిగుబడి: 15-16 ట/ఎ. పంటకాలం: 185-190 రోజులు, రికవరి శాతం: 18.5; ఐ.ఐ.ఎస్.ఆర్.ప్రభ: దిగుబడి: 15 ట/ఎ, పంటకాలం: 195 రోజులు. రికవరి శాతం: 19.5.
నువ్వులు: వర్షాకాలంలో విత్తే నువ్వు పంటను అధిక దిగుబడుల కొరకు రాయలసీమలో మే-జూన్ నెలల్లోను, కోస్తా ఆంధ్రప్రదేశ్లో మే 15 నుండి మే 31 వరకు విత్తుకోవచ్చు. తెలంగాణలో మే రెండవ వారం లోపు లేక ఆగస్టు రెండవ పక్షంలో విత్తాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక దిగుబడినివ్వగల్గిన తెల్లనువ్వుల రకం జగిత్యాల తిల్-1 (జె.సి.ఎస్-1020): దిగుబడి 5-8 క్వి/ఎ. వర్షాకాలంలో పంటకాలం: 90-125 రోజులు. ఇతర నువ్వుల రకాల కంటే 2 క్వి./ఎ. ఎక్కువ దిగుబడినిస్తున్నట్లు వార్తలు. ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణాలోను విత్తనోత్పత్తి చేపట్టి అధిక దిగుబడితోపాటు అధిక ఆదాయం పొందవచ్చు. విత్తనాల కొరకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పొలాస, జగిత్యాల వారిని 0874-277281 లేదా 9989625213 కు ఫోను చేసి సంప్రదించవచ్చు. చలికాలం, వేసవి కాలాల్లో కూడా ఈ రకం పండుతుంది. కావున విత్తనానికి అమ్ముకునే అవకాశం ఉంది.
కొత్తిమీర: మే నెలలో అధిక ఆదాయంతో పాటు అధిక రోగనిరోధక శక్తిని ఇవ్వగలిగిన పంట. కరోనా సమయంలో ఎక్కువ రోగనిరోధక శక్తినివ్వగలిగే పంటలకు ప్రాధాన్యం ఎక్కువ. కొత్తిమీర, ఎక్కువ ఎండ వేడి ఉన్న మే నెలలో సరిగా ఎదగనందున, పాక్షిక నీడ కలిగిక తోట పంటలు, పందిరి కూరగాయ పంటల నడుమ పెంచవలసి ఉంటుంది. షేడ్నెట్లు, నెట్హౌస్లు, పాలీహౌస్లలో ఈ పంట బాగా వస్తుంది. మే నెలలో కూడా చల్లగా ఉండే ప్రాంతాలైన చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రాంతం, తూర్పు కనుమలు, ఎత్తైన గిరిజన ప్రాంతాలు ఈ పంటను పండించడానికి అనుకూలం. అరకు, పాడేరు ప్రాంతాలు మొదలైన ఎత్తైన ప్రాంతాలు అనుకూలం. ఇక్కడ పండించిన కొత్తిమీరను మిగతా ప్రాంతాలకు రవాణా చేసుకుని ఎండాకాలంలో మంచి ఆదాయం పొందవచ్చు. జూన్ నెలలో కూడా కొత్తిమీరకు మంచి ధర వస్తుంది. కో-2 అనే రకం చౌడు భూముల్లో కూడా పెరుగుతుంది. సాధారణ పొలాల్లో పంట పెట్టడానికి అనుకూలమైన అధిక దిగుబడినిచ్చే కొత్తిమీర రకాలు: హిస్సార్ఆనంద్, పంత్హరితిమా ద్వా, ఆర్.సి.ఆర్-446, కో-1, కో-2, కో-3. తెలివిగా మార్కెట్ చేసుకుంటే మంచి పంటకు ఎకరాకు లక్ష రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
పొదీన: రోగనిరోధక శక్తి ఎక్కువగా గల సూపర్ ఫుడ్లలో పొదీనా ఒకటి. ఎక్కువ ఎండల్లో కూడా పెరుగుతుంది. మే నెల పెండ్లిం డ్లలో, శుభకార్యాల్లో, మసాలా దినుసుగా బిరియానీలోకి దీనిని వాడుతారు. పొదీనాను అలాగే అమ్ముకోవచ్చు. ఎక్కువ విస్తీర్ణం పంటబెట్టితే తైలం తయారీ చేసి అమ్ముకోవచ్చు. మంచి రకాలు: కోసి, సక్షమ్, శిలిక్, హిమాలయ. ఎకరాకు 15-20 ట. పొదీన వస్తుంది. నూనె తీస్తే 70-75 కిలోలు వస్తుంది. ఈ పంట లాభదాయకమే.
పాలకూర: ఈ పంట అత్యధిక దిగుబడులు పొందాలంటే ఉదజని సూచిక 7.0కు దగ్గరుండాలి. ఉదజని సూచిక 10.5 ఉన్న భూముల్లో కూడా ఈ పంట పండుతుంది. ఈ ఆకుకూరలో విటమిన్ ఎ, సి, ఐరన్, కాల్షియం, మాంసకృత్తులు దండిగా ఉంటాయి. అత్యధిక దిగుబడినిచ్చే రకాలు: ఊటీ: 24 ట/ఎ., జాబ్ నగర్ గ్రీన్ : 16-19 ట/ఎ. ఇతర ఆకుకూరలు: తోటకూర, మెంతికూర, చుక్కకూర, గోంగూర, పొన్నగంటి కూర, కొయ్యగూర, సోయకూర మొదలైనవి కొద్ది విస్సీర్ణంలో, కొద్దిపాటి నీటితో పండించి, మంచి ఆదాయం పొందవచ్చు. రోగనిరోధక శక్తి ఆకుకూరలలో అధికంగా ఉంటుంది. క్యాలరీలు తక్కువ. ఊబకాయం గలవారికి, మధుమేహ రోగగ్రస్తులకు బాగా ఉపయోగం.
పూలు- కనకాంబరం: మే, జూన్ నెలల్లో నారు పెంచి ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నాటుకోవాలి. పూలకాడల్లో పూలు తెంపడం అయిపోయాక, పూలగుత్తులను, ఎండిన కొమ్మలను తీసివేస్తే సంవత్సరం పొడవునా కనకాంబరం పూలను పొందవచ్చు. వర్షాకాలంలో దిగుబడి తగ్గుతుంది. నాటిన 3 సం|| వరకు పూత పూస్తుంది. కాని, 2 సం|| పంట తీసుకొని తర్వాత తీసివేస్తే లాభదాయకం. రెండు సంవత్సరాలలో పూల దిగుబడి ఎకరాకు 1500 నుండి 2000 కిలోలు.
టమాట: విస్తీర్ణాన్ని నియంత్రించడం వలన, ఈ పంట ధరలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. ఇదే పరిస్థితి మే నెలలో కూడా ఉండవచ్చు. జూన్, జులై నెలల్లో ధరలు పెరిగే అవకాశముంది. మేఘావృతమైన వాతావరణం, వర్షాల వలన, దిగుబడి తగ్గి ధరలు పెరగవచ్చు. వాతావరణంలో ఎండ బాగా ఉంటే దిగుబడి బాగుంటుంది. మేఘావృతమైతే దిగుబడి బాగా పడిపోతుంది. ప్రస్తుతం ధరలు తక్కువగా ఉన్నాయి. మేఘావృతమైన వాతావరణం ఏర్పడితే తప్ప దిగుబడి తగ్గదు. ధరలు పెరగవు. మంచి ధరలు రావాలంటే విస్తీర్ణాన్ని నియంత్రించాలి. తక్కువ రేట్లున్నపుడు టమాటతో విలువ పెంచే పదార్థాలు (వాల్యూయాడెడ్ ప్రాడక్ట్సు) చేసి విక్రయించుకోవాలి.
రోహిణిలో నీటి లభ్యత-పంటలు: ఈ కార్తె (25-5-22 నుండి 7-6-22 వరకు)లో నీరు పుష్కలంగా ఉంటే, బెండ, గోరుచిక్కుడు, కాకర, పొట్ల, గుమ్మడి, సొర విత్తవచ్చు. వర్షాకాలపు కూరగాయల నార్లు పోసుకోవచ్చు. కంది, పెసర, మినుము పంటలను విత్తవచ్చు. రేగు, దానిమ్మ మొక్కలను నాటవచ్చు. కామంచి, పామరోజా వంటి సువాసన మొక్కల విత్తనాలు విత్తుకోవచ్చు.
మామిడి: పండ్లను తోటల్లోనే వరిగడ్డి, బోదగడ్డిలో కార్బైడ్ వేయకుండా మాగబెట్టి ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. మందులు వేయకుండా ప్రకృతి సిద్ధంగా మాగబెట్టినట్లు బోర్డు పెట్టితే నమ్మకమున్న వాళ్లంతా ఎక్కువ రేటిచ్చి కొంటారు.
కీరదోస: సాలాడ్గా బహుళ ప్రాచుర్యం పొందిన పంట. హరిత గృహాల్లో (పాలీహౌస్లు, నెట్హౌస్లు, షేడ్ నెట్లలో) ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నా ధరలు తగ్గకుండా వినియోగమవుతున్నది. అనుకూలమైన పార్థినోకార్పిక్ రకాలు: కియోన్, సన్-9728, సన్-3019.
బెంగుళూరు మిర్చి: ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా వాడుతున్నారు. అత్యధిక దిగుబడి (40 ట/ఎ.) నివ్వగల్గిన రకాల విత్తనాలు బజార్లో దొరుకుతున్నాయి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
పశువులమేత: ఎండాకలంలో పశువుల మేతకున్న గిరాకీని సొమ్ము చేసుకోవడానికి, ముందుగా పంటబెట్టిన అన్ని రకాల పశువుల మేతను సేకరించి ఎక్కువ ధరలకు ఎండాకలంలో అమ్ముకునే వీలుంది. జొన్నలో పి.సి.-6 అనే రకం సున్నారపు భూముల్లో కూడా పెరుగుతుంది. ఇటువంటి భూములలో సాగు చేసి పశువులమేతగా అమ్ముకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. జూన్-జూలైలో పెట్టే పంటల విత్తనాలు, ఎరువుల సేకరణ: విత్తనాలు, ఎరువులు సేకరించుకోవడానికి మేనెలను ఉపయోగించుకోవచ్చు. డిమాండు ఎక్కువగా ఉన్న రకాలు, దొరకవేమోననే అనుమానాలున్న వాటిని సేకరించి పెట్టుకోవచ్చు. వర్షాధార పంటలలో, తేమ ఆరిపోకముందే విత్తడం త్వరగా పూర్తి చేయవచ్చు.
మట్టిపరీక్షలు: మట్టి పరీక్షలు చేయించి, దాని ప్రకారం ఎరువులను వాడి, ఎరువుల ఖర్చు తగ్గించవచ్చు. దిగుబడులు అధికంగా ఉంచుతూ ఖర్చు తగ్గించి, లాభాన్ని పెంచవచ్చు.
శిక్షణలు: అన్ని ట్రైనింగ్ ప్రోగ్రాములను సద్వినియోగపరచు కొనుటకు మే నెలలో పనులు తక్కువగా ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఎఫ్.పి.ఓ.ల ఫెయిల్యూర్స్ తగ్గించడం: రైతు ప్రజా సంఘాలను పటిష్టపరచు కోవడానికి మే నెల అనుకూలం. ఎఫ్పిఓల ఏర్పాటు చేసుకోవడానికి, సమావేశాలకు సమయం కేటాయించే అవకాశం మే నెలలో ఎక్కువ. చిరస్థాయి గ్రామ సంఘాలు తొలుత ఏర్పాటు చేసి, వాటికనుబంధంగా ఎఫ్.పి.ఓలు ఏర్పాటు చేస్తే ఎఫ్పిఓల ఫెయిల్యూర్స్ చాలా వరకు తగ్గించవచ్చు. చిరస్థాయి రైతు ప్రజా (గ్రామ) సంఘాలు, ఎఫ్పిఓల డైరెక్టర్లను, తప్పిదాలు చేయకుండా కట్టడి చేస్తాయి. తద్వారా ఎఫ్పిఓ (రైతు ఉత్పత్తిదారుల సంస్థ)లు మునిగిపోకుండా, మునిగి పోయినవి కూడా తిరిగి పనిచేసేవిధంగా కాపాడుతాయి. ప్రతి పల్లెలోనూ రైతు ప్రజా (గ్రామ) సంఘం ఏర్పాటుద్వారా ఉత్పత్తిదారులను, వినియోగదారులను ఒకే సంస్థలో ఉంచవచ్చు. వినియోగదారుల్లో ఉన్న ఆర్థిక శక్తి, మేనేజ్మెంట్ క్యాపబిలిటీ, రైతుల ఆర్థిక శక్తిని మెరుగుపరచడానికి బాగా పనికొస్తుంది. మున్ముందు, ప్రతి పల్లె, ప్రతి జనావాసంలోని అందరి ప్రజలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి, ప్రభుత్వాలకు దోహదపడుతుంది. రాజకీయాలకతీతంగా జరిగే ఈ అభివృద్ధిని అన్ని పార్టీల మానిపెస్టోల్లో చేర్చుకుని, గెలిచినవారు ఆచరిస్తే, ఆ పార్టీ వారు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోతారు. పలు పంటలపైన, రైతు సంఘాల ఏర్పాటు, పటిష్టమైన ఎఫ్.పి.ఓ.ల ఏర్పాటు మీద వివరంగా తెలుసుకో గోరేవారు 94944 08619 కు ఫోను చేయవచ్చు. సంఘాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఏర్పాటు చేయించుకోవచ్చు. ఫేస్బుక్లో SALLA NARAYANASWAMY/Profsnswamy అకౌంట్లలో పోస్టింగులలో వివిధ విషయాలపై వివరణలను, ఫొటోలతో సహా చూడవచ్చు. సలహాలు, సూచనలు రైతులకు ఉచితం.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 13 లక్షల ఎకరాల్లో మామిడి తోటలను రైతులు పెంచుతున్నారు. సాలీనా 25-30 లక్షల టన్నుల మామిడి పండ్లను ఉత్పత్తిచేస్తున్నారు. అయితే మంచి సాగుపద్ధతులు పాటించి మరింత దిగుబడితోపాటు నాణ్యమైన పండ్ల ఉత్పత్తులను పొందవచ్చు. మన మామిడి పండ్లకు అనేక దేశాల్లో మంచి గిరాకీ ఉన్నప్పటికీ ఆయా దేశాలు నిర్దేశించిన గరిష్ఠ పరిమితులను మించి వీటి అవశేషాలు ఉండటం వల్ల ఆశించిన రీతిలో మామిడి ఎగుమతులను పెంచలేక పోతున్నాం. గత ఒకటిన్నర థాబ్దాల నుండి అభివృద్ధి చెందిన దేశాలన్నీ విషరహితమైన సేంద్రియ ఆహారాన్ని కోరుకుంటున్నారు. ఈ ఉత్పత్తులకు దేశవిదేశాల్లో గిరాకీ పెరుగుతోంది. దీనివల్ల ఔత్సాహిక వ్యవసాయదారులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ అధిక ధరలను పొందుతున్నారు. మామిడిలో కూడా సేంద్రియ పద్ధతిలో పండించిన పండ్లకు దేశవిదేశాల్లో డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. మామిడి రైతులకు నూతన మంత్రం సేంద్రియ సాగు
రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో మామిడితోలను సాగు చేయడంవల్ల చెట్లకు పురుగులు, తెగుళ్ళను తట్టుకునే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. యునైటెడ్ కింగ్డమ్ భారతదేశం నుండి ఎగుమతి అయ్యే మామిడి పండ్లపై నిషేధం విధించిన్నప్పటికీ సేంద్రియ పద్ధతిలో పండించిన మామిడి పండ్లకు కొత్త మార్కెట్లలో డిమాండ్ వుందని రైతులు నమ్ముతున్నారు. సేంద్రియ వ్యవసాయంవల్ల రైతులకు సాగు ఖర్చులు తగ్గి అధిక దిగుబడులు, ఆదాయం లభిస్తుంది. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో అధిక డిమాండ్ వుంది. రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి మార్కెట్లను వెతుక్కోనవసరం లేదు. కస్టమర్లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని నేరుగా రైతుల నుండి సరుకును కొంటారు. సూరత్, నవసారి, వేల్సాడ్లో మామిడి సాగులో వున్న 57,000 హెక్టార్లలో సుమారు 28,000 హెక్టార్లు సేంద్రియ సాగులో వున్నాయని వ్యవసాయ నిపుణుల అభిప్రాయం. మామిడిలో హార్మోన్ల పిచికారి హానికరం
మామిడిలో పూత అధికంగా రావడానికి, దిగుబడులు పెరగడానికి రైతులు పాక్లోబ్యూట్రజోల్ వంటి హార్మోన్లను పిచికారి చేస్తారు. ఈ హార్మోన్లు దీర్ఘకాలంలో మామిడి చెట్లకు హాని కల్గిస్తాయి. దీనివలన చెట్లలో వంధ్యత్యమేర్పడి వాటి జీవితకాలం 10 సంవత్సరాలు తగ్గుతుంది. ఒకసారి ఈ హార్మోన్లను పిచికారి చేస్తే భవిష్యత్తులో అవి సహజంగా పూత పూయలేవు. ప్రతి సంవత్సరం దిగుబడి రావడానికి హార్మోన్లను తప్పనిసరిగా పిచికారి చేయాలి. మామిడి తోటల్లో హార్మోన్లను పిచికారి చేయడంవలన ఆ ప్రాంతంలోని ఇతర మొక్కలలో పూత చక్రాలు దెబ్బతింటాయి. పశ్చిమ బెంగాల్లో మామిడి పట్టణంగా పేరుగాంచిన మాల్డాలోని మామిడి తోటల్లో కూడా అధికంగా హార్మోన్లను పిచికారి చేయడంవలన ఇదే సమస్యతలెత్తింది. హార్మోన్ల పిచికారిపై లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన 5-10% ధనిక రైతులు మాత్రమే నికర ఉత్పత్తిని పొందగలిగారు. ఎకరన్నర తోటలో మంచి దిగుబడులు పొందడానికి రూ. 2 లక్షలు పైగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఈ తీవ్ర సమస్యకు సేంద్రియ సాగు మాత్రమే పరిష్కారం.
భూమి తయారి : భూమిని దున్ని చదును చేయాలి. సరైన నీటి పారుదల, మురుగునీరు పారుదల సౌకర్యాలు కలిగించడానికి కొద్దిపాటి కాలువనేర్పాటు చేయాలి. మొక్కలు నాటడానికి గుర్తులు పెట్టిన తర్వాత వేసవి నెలలో 90þ90þ90 సెం.మీ. గుంతలు త్రవ్వాలి. గుంతలు తీసేటపుడు పై పొరల్లోని మట్టిని, క్రింద పొరల్లోని మట్టిని ప్రతి గుంతకు దగ్గరగా 2-4 వారాలు విడివిడిగా కుప్పలుగా పోసి వుంచాలి. దీని వలన హానికర శిలీంద్రాలు సూర్యరశ్మి సోకి నశిస్తాయి. వేర్లకు బాగా గాలి సోకుతుంది. ప్రతి గుంతను 20 కి. పశువుల ఎరువు, 5 కి. వర్మింకపోస్టు, జీవన ఎరువులు (అజోస్పైరిల్లం, ఫాస్ఫో బాక్టీరియా)తో నింపాలి. వర్షాలు ప్రారంభమవగానే జీలుగ, జనుము వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచాలి. లెగ్యూమ్ జాతికి చెందిన పచ్చి రొట్ట పైర్లను పెంచడంవల్ల నత్రజని స్థిరీకరించబడి, మొత్తం క్షేత్రాన్ని అద్భుత పచ్చదనం కప్పివుంచడం వలన తేమ నష్టాన్ని నివారిస్తుంది. మొక్కలను నాటే దూరం : వరుసల మధ్య, మొక్కకు, మొక్కకు మధ్య దూరం 7 నుండి 10 మీ.
మొక్క అంట్లు : నాటు మొక్కల అంట్లను సేంద్రియ నర్సరీ నుండి సమకూర్చుకోవడం శ్రేయస్కరం.
మొక్కలు నాటడం : వర్షాలు, నీటిపారుదల సౌకర్యాల లభ్యతను బట్టి జులై – డిశంబర్ నెలల మధ్య కాలంలో నాటవచ్చు.
నీటి యాజమాన్యం : మొక్కల 2 సంవత్సరాల వయసు వరకు క్రమం తప్పకుండా నీరందించాలి. కొత్తగా నాటిన అంట్లకు ప్రతిరోజు 25-30 లీ. నీరివ్వాలి. పెరిగి చెట్లలో కాయలేర్పడిన తర్వాత 10 రోజులకొకసారి నీరిస్తే దిగుబడులు పెరుగుతాయి. డ్రిప్ పద్ధతిలో నీరందించడం మంచిది.
కలుపు యాజమాన్యం : మొదటి కొద్ది సంవత్సరాలు మొక్కల పొదులో వరిగడ్డితో ఆచ్భాదన చేయడం వల్ల కలుపు నివారణ జరుగుతుంది. పెరిగిన మామిడి తోటల్లో నీడ, రాలిన ఆకులవల్ల కలుపు సమస్య తక్కువగా వుంటుంది.
ప్రూనింగ్ : మొక్క పరిమాణం నియంత్రణకు, పండు రంగు మెరుగు పరచడానికి మామిడి చెట్లలో కత్తిరింపులు ముఖ్యం. చెట్లలో బాగా గాలి, వెలుతురు ప్రసరించడానికి ఫ్రూనింగ్ చేస్తారు. దీనివలన పురుగులు, తెగుళ్ళ సమస్య తగ్గుతుంది. కాయలు మంచి రంగుతో ఏర్పడతాయి. కొమ్మ చివర కుళ్ళు నివారణకు చెట్టులో చనిపోయిన కొమ్మలను కత్తిరించాలి. నీటి కొమ్మలను, చెట్టులో క్రింది కొమ్మలను కత్తిరించాలి. చెట్టులో బాగా సూర్యకాంతి, గాలి ప్రసరణకు ఎగుడు దిగుడుగా, అడ్డదిడ్డంగా, తెగులు సోకిన, ఎండు కొమ్మలను, బలహీనంగా వున్న కొమ్మలను కత్తిరించాలి. మూడు సంవత్సరాలకొకసారి ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో ఫ్రూనింగ్ చేయాలి. సంవత్సరానికొకసారి ఆగస్టు-సెప్టెంబర్ నెలలో చివరి కొమ్మలను, బలహీనమైన కొమ్మలను కత్తిరించి ఆరోగ్యవంతమైన కొమ్మలనుంచాలి.
అవసరమైన పోషకాలు : మామిడి నాటిన థ నుండి పూర్తిగా పెరిగిన చెట్లు థ వరకు పంచగవ్య, వర్మికంపోస్టు ఎరువులను వేసి చెట్లకు అవసరమైన పోషకాలను సరఫరా చేసి, పురుగులు, తెగుళ్ళను నివారించవచ్చు. వానపాములను ఉపయోగించి వర్మికంపోస్టు తయారు చేస్తారు. చురుకుదనం పెంచిన వానపాములున్న వర్మింకపోస్టు బెడ్ ద్వారా నీరుపారించి వర్మి వాష్ సేకరిస్తారు. ఇది అన్ని పంటలకు సేంద్రియ పిచికారిగా ఉపయోగిస్తుంది. జీవసంబంధమైన పద్ధతులు : ఆచ్ఛాదన, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు, కంపోస్టు వాడటం. ప్రధాన పోషకాలు వాడదగిన సేంద్రియ పదార్థాలు నత్రజని లెగ్యూమ్ జాతి మొక్కలు, ఆచ్ఛాదన, కోళ్ళ ఎరువు, బ్లడ్ మీల్, రక్తం, ఎముకలు, చేపల ఎమల్షన్, కంపోస్టుభాస్వరం రాక్ఫాస్ఫేట్, గుయాన, కంపోస్టు, రక్తం, ఎముకలుపొటాషియం కంపోస్టు, సీవీడ్, పొటాషియం సల్ఫేట్కాల్షియం సున్నపు రాళ్ళు, డోలమైట్, లైమ్శాండ్, మైక్రోనైజ్డ్ లైమ్మెగ్నీషియం డోలమైట్ లేదా మెగ్నసైట్, మెగ్నీషియం సల్ఫేట్గంధకం జిప్సం, పొటాషియం సల్ఫేట్సూక్ష్మపోషకాలు కంపోస్టు, సీవీడ్, ఫిష్ ఎమల్షన్, నాచురల్ కీలేట్స్, ఐరన్ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, బోరిక్ యాసిడ్ మామిడి తోటలో నాణ్యమైన పండ్ల ఉత్పత్తి సాధించిన రైతుల అనుభవం ద్వారా కోడిగుడ్లు, నిమ్మరసం ద్రావణం నాణ్యమైన పండ్ల ఉత్పత్తికి దోహదపడుతుందని రుజువయింది.ద్రావణం తయారు చేసే పద్ధతి : ఈ ద్రావణం తయారు చేయడానికి 10 కోడిగుడ్లను వెడల్పాటి మూతిగలగాజు సీసాలో జాగ్రత్తగా పగలకుండా అమర్చిగుడ్లు మునిగేంతవరకు సుమారు అర లీటరు నిమ్మరసం పోయాలి. గుడ్ల పైన నిమ్మరసం కనీసం ఒక అంగుళం ఉండాలి. మూత పెట్టగానే గ్రుడ్లలో నుంచి గాలి బయటకు రావడం, బుడగల ద్వారా గమనించవచ్చు. ప్రతి రోజు మూత తీసిగ్రుడ్ల పైన రసం ఉన్నదీ, లేనిదీ చూసి, లేని యెడల మరల కొంచెం నిమ్మరసం పోయాలి. ఈ విధంగా 10 రోజుల వరకు చేసి 11వ రోజున ప్లాస్టిక్ గిన్నెలో గుడ్ల ద్రావణాన్ని పోసి చేతితో బాగా పిసకాలి. ఈ విధంగా బాగా పిసికిన తర్వాత పలుచటి గుడ్డులో ద్రావణాన్ని వడపోసి దానికి 250 గ్రా|| నల్ల బెల్లం కలపాలి. ఈ ద్రావణాన్ని శుభ్రపరచిన సీసాలో పోసి మూత క్రింద ప్లాస్టిక్ పేపర్ పెట్టి గాలి చొరబడకుండా మూత బిగించాలి. * ఈ ద్రావణం సుమారు 2 నెలల వరకు నిల్వవుంటుంది.* 200 మి.లీ. ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి ఎకరంలోని పంటపై సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి.* కోడిగుడ్లు-నిమ్మరసం ద్రావణం ”అమినో యాసిడ్’గా పనిచేసి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి కావలసిన ప్రోటీన్లను అందిస్తుంది.* ఈ ద్రావణాన్ని పంటలలో పిచికారి చేయడం వలన పండ్ల నాణ్యత పెరుగుతుంది.మామిడి, కొబ్బరి చెట్లకు కునపజలం : మాంసం – 1 కి., మినుములు – 250 గ్రా., నువ్వులు – 250 గ్రా., ఆవుపాలు-1 లీ., నీరు-5 లీ. తయారు చేసే విధానం : మేక పోతు మాంసాన్ని చిన్న ముక్కలుగా కోసి శుభ్రంగా కడిగిన తర్వాత మట్టికుండతో పోసిన 5 లీ. నీటిలో కలిపి నీరు ఆవిరయ్యే వరకు ఉడకబెట్టాలి.* ఈ మిశ్రమాన్ని పలుచని గుడ్డతో వడకట్టి అందులో మెత్తగా నూరిన మినుములు, నువ్వుల పొడి వేసి బాగా కలియబెట్టాలి.* కుండపై మూతపెట్టి, గుడ్డతో వాసినకట్టి భూమిలోకాని, మట్టి దిబ్బలోకానీ, పెంటకుప్పలోగానీ 10 రోజులుంచాలి.* 10 రోజుల తర్వాత ద్రావణం తయారవుతుంది. ఈ ద్రావణాన్ని పలుచని గుడ్డతో వడపోయాలి.* ఈ విధంగా తయారైన 5 లీ. ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి ఒక ఎకరా పంటపై సాయంత్రం వేళ పిచికారి చేయాలి.* ఈ ద్రావణాన్ని అన్ని పంటలలోను 1-2 సార్లు పిచికారి చేయవచ్చు. దీనివలన పంటలు ఆరోగ్యవంతంగా పెరిగి, పంటల నాణ్యత పెరగుతుంది.
మోతాదు : అర లీటరు కునపజలాన్ని 10 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. 5 లీ. కునపజలాన్ని 100 లీ. నీటిలో కలిపి ఎకరం విస్తీర్ణంలోని పంటపై పిచికారి చేయాలి.ఆచ్ఛాదనకు ఉపయోగించే పదార్థాలు : చెట్టు బెరడు, వేరుశనగ పొట్టు, కలుపుమొక్కలు, గడ్డి మొక్కలు, ఉడ్చిప్స్, సైలేజి, వరి, గోధుమ గడ్డి, చెట్ల నుండి రాలిన ఆకులు, వరి ఊక, కొబ్బరి పీచు, అరటి, చెరకు చెత్త మొదలైనవి. ఆచ్ఛాదన భూమిలో తేమ ఆవిరైపోకుండా కాపాడుతుంది. కలుపు పెరుగదు. ఉష్ణోగ్రతలో మార్పులు తగ్గుతాయి. నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. పచ్చిరొట్ట ఎరువులు : లెగ్యూమ్ జాతి పంటలను పెంచి భూమిలోకి కలియ దున్నాలి. దీనివలన భూమి భౌతిక నిర్మాణం, భూసారం పెరుగుతాయి. పంటకు పోషకాల లభ్యత పెరిగి దిగుబడి పెరుగుతుంది. భూమిలోని సూక్ష్మజీవులకు ఆహారంగా పనిచేసి అభివృద్ధి చెందేలా చేస్తాయి. జనుము, జీలుగ, విశిష్టమైన పచ్చిరొట్ట పంటలు. పచ్చిరొట్ట ఎరువులు వేసిన తర్వాత వేరుశనగను అంతరపంటగా వేస్తే నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. గ్లైరిసిడియా, సుబాబుల్, కానుగ మొక్కలను కూడా పచ్చిరొట్ట ఎరువుగా వాడతారు.
జీవన ఎరువులు : జీవన ఎరువులను సేంద్రియ వ్యవసాయంలో విస్తారంగా వాడతారు. రైజోబియం, అజోస్పైరిల్లం, అజటోబాక్టర్, ఫాస్ఫోబాక్టీరియా, బ్లూగ్రీన్ ఆల్గే వాటిలో ముఖ్యమైనవి. మామిడిలో అజోస్పైరిల్లం, ఫాస్ఫో బాక్టీరియా రైతులు ఎక్కువగా ఉపయోగించే జీవన ఎరువులు. ఎకరానికి 2 కి. ఫాస్ఫో బాక్టీరియా పశువుల ఎరువుతోగాని, ఇసుకతోగాని కలిపి చల్లాలి. 2-3కి. అజోస్పైరిల్లంను 10-15కి. పశువుల ఎరువుతో కలిపి చల్లాలి.
కంపోస్ట్ ఎరువులు : కంపోస్టింగ్ సన్న, చిన్న కారు రైతుల క్షేత్రాల్లో భూసారాన్ని పెంచి ఉత్పాదకతను పెంచే అద్భుత పద్ధతి. రైతుల క్షేత్రాల్లోని పంట అవశేషాలను, విసర్జితాలను ఉపయోగించి తామే కంపోస్టు తయారు చేసుకోవచ్చు. ఎలాంటి ఖర్చు లేకుండా భూసారాన్ని వృద్ధి చేసుకోవచ్చు. జీవన ఎరువులు, కంపోస్టు, వర్మికంపోస్టు వాణిజ్యపరంగా మార్కెట్లో లభిస్తున్నాయి.
అంతరసేద్యం : తోటలో మధ్య ఖాళీ స్థలాన్ని దున్నడం ద్వారా నేలగుల్లబారి గాలి బాగా ప్రసరించి వేర్లు బాగా పెరుగుతాయి. కలుపు మొక్కలు రావు. అలాగే నేలలో వుండే పురుగులు నిద్రావస్థలో చనిపోతాయి. లేత తోటల్లో ఖాళీ స్థలాన్ని దున్ని అంతర పంటలు, పచ్చిరొట్ట పైర్లను సాగు చేసుకుంటే మొక్కలు ఏపుగా పెరిగి త్వరగా కాపుకొస్తాయి. కాపుకు వచ్చిన తోటల్లో తొలకరి వర్షాలకు ఒకసారి దున్నడం వలన వర్షపు నీరు బాగా నేలలోకి ఇంకి నేలకోత నాపుతుంది. ఆగస్టులో రెండవసారి దున్నితే కలుపురాదు. అలాగే నేలలో వుండే పిండి పురుగులు, పండు ఈగ నిద్రావస్థ థలోనే నశిస్తాయి. వాలుకి అడ్డంగా దుక్కి చేసి, కాంటూరు గట్లు వేసుకుంటే వర్షపునీరు, నేల సారం కొట్టుకుపోకుండా వుంటుంది. వేసవిలో చెట్లు ఎండిపోవు. ఎండుపుల్ల పడదు. వేరు కుళ్ళు ఆశించదు. పూత, కోత బాగా వస్తుంది.
పూత పెరగడానికి చర్యలు : తోటల్లో తేనెటీగ పట్టులను ఏర్పాటు చేసుకుంటే తేనెటీగల సంచారం వలన పరపరాగ సంపర్కం ఎక్కువగా జరిగి పూత అధికంగా ఏర్పడుతుంది. దీనివలన పంట దిగుబడి, 20 నుండి 30 శాతం పెరుగుతుంది. పొలం నాలుగు మూలలా మార్కెట్లో లభించే తేనెపట్టుగదులను తెచ్చి తేనె పట్టుల నేర్పాటు చేసుకోవచ్చు. కొన్నిసార్లు తేనె పట్టులు సహజంగా చెట్లకు పడతాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి.
మామిడి తోటల్లో సస్యరక్షణ : తోటని పరిశుభ్రంగా వుంచాలి. పురుగులు, తెగుళ్ళు ఆశించిన కొమ్మలు, కాయలు, ఇతర మొక్క భాగాలను కత్తిరించి నాశనం చేయాలి. తోటల చుట్టూ గాలులను తట్టుకునే ఎత్తైన చెట్లను నాటాలి. కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. జీవవైవిధ్యం పెంచాలి. బదనికలను ప్రోత్సహించాలి. పూతకు ఒక నెల ముందు 20 లీ. జీవామృతాన్ని 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 15 రోజుల తర్వాత నీమాస్త్రం తయారు చేసి పిచికారి చేయాలి. పిందెలు ఏర్పడిన తర్వాత ఒకసారి జీవామృతం, 15 రోజుల తర్వాత నీమాస్త్రం, 30 రోజుల తర్వాత 6 లీ. పుల్ల మజ్జిగను 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.
పురుగు వికర్షిణి : పంచగవ్య మొక్కల పెరుగుదలను పెంచే సేంద్రియ పదార్థం. దీనిని ఆవు పేడ, ఆవు మాత్రం, ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి సరైన పాళ్ళలో కలిపి తయారు చేస్తారు. దీనిని మొక్కలపై పిచికారి చేస్తారు. దీనిలో అనేక ప్రధాన సూక్ష్మపోషకాలు, ప్రయోజనకర బాక్టీరియా, శిలీంద్రాలు. ఉంటాయి. ఇది మొక్కల పెరుగుదలకు, సమర్థవంతమైన పురుగు వికర్షిణిగా పని చేస్తుంది. ఒక ప్లాస్టిక్ లేదా సిమెంటు ట్యాంకు లేదా మట్టికుండలో 5 కి. తాజా ఆవుపేడ, ఒక లీటరు ఆవు నెయ్యి బాగా కలిపి దీనిని తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు బాగా కలపాలి. ఇలా 3-4 రోజులు కలపాలి. సుమారు 3 లీ. ఆవు పాలు, 2 లీ. ఆవు పెరుగు, 3 లీ. చెరకు రసం, 3 లీ. లేత కొబ్బరి నీరు, 10-12 బాగా మగ్గిన అరటి పండ్లను బాగా కలిపి ఈ మిశ్రామనికి కలపాలి. మొత్తం ద్రావణాన్ని 15 రోజులు పులియ నివ్వాలి. ఈ పాత్రను నెట్తో లేదా నూలుగుడ్డలో కప్పి వుంచి గాలి అడేలా చూడాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి రెండు, మూడు సార్లు కలుపుతూ 15 రోజుల అలా చేసిన తర్వాత ఉపయోగించవచ్చు. 6-7 సంవత్సరాల వయసున్న మామిడి చెట్లకు, ప్రతి చెట్టుకి 10 కి. వర్మికంపోస్టు, 30 లీటర్ల నీటిలో 1 లీ. పంచగవ్య మిశ్రమం కలిపిన ద్రావణం ఆకులపై, చెట్టు మొదలులో పిచికారి చేయాలి. పంచగవ్యను ఆకులపై పిచికారి చేయడం, చెట్టు మొదలులో పిచికారి చేయడాన్ని 4-5 సార్లు చేయాలి. పూత థ ముందు (జనవరి-మార్చి) మొదటి పిచికారి చేస్తే పూత ఎక్కువగా ఏర్పడుతుంది. 15-20 రోజుల తర్వాత రెండవ పిచికారి చేయాలి. ఈ ప్రక్రియను పూత చిన్న పిందెలుగా మారే థ వరకు కొనసాగించాలి. ఒకసారి చిన్న పిందెలు ఏర్పడటం ప్రారంభమవగానే నెలకొకసారి పిచికారి చేయాలి. పంచగవ్య, వర్మికంపోస్టు ఉపయోగించడం వల్ల కాయల పరిమాణం, సంఖ్య, రంగు పెరుగుతుందని గమనించారు.
సిఫారసు చేసిన పద్దతి: ఒక హెక్టారు క్షేత్రంలోని మామిడి చెట్లపై 25 లీటర్ల పంచగవ్యను 750 – 800 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. 4-5 టన్నుల వర్మింకపోస్టు వేయాలి. పంచగవ్య పిచికారి అన్ని కాయలు కొసే చెట్లలో సాధారణంగా ఆశించే పండు ఈగను సమర్థవంతంగా నివారిస్తుంది. సేంద్రియ ఎరువులు వాడిన చెట్లలో ఆకులు పెద్ద పరిమాణంలో వుండి, చెట్లు గుబురుగా పెరిగి, బలమైన వేరు వ్యవస్థ ఏర్పడుతుంది. పండ్ల రుచి, నిల్వగుణం కూడా అతి సంతృప్తికరంగా వుంటాయి. సేంద్రియ సాగుకి అనుకూలమైన మామిడి రకం ‘ఆల్ఫాన్సో’తమిళనాడులో కాంచీపురం, తిరునవ్వేలి జిల్లాలలో మామిడి రకాలలో రాజుగా పేరుగాంచిన అల్ఫాన్సో సేంద్రియ సాగు పద్ధతులలో అధిక దిగబడులనిస్తుంది. ఈ జిల్లాలలోని సన్న, చిన్న కారు రైతులు దీని పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకుని అధిక దిగుబడులు, ఆదాయం పొందారని చెన్నైలోని ట్రాక్టర్స్ అండ్ ఫామ్ ఎక్విప్మెంట్ లి. వైస్ ప్రెసిడెంట్ యస్.యస్. నాగరాజన్ చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయ సిద్ధాంతకర్త సుభాష్ పాలేకర్ సిఫారసులు సేంద్రియ మామిడి రైతులు ఈ క్రింది పెట్టుబడిలేని వ్యవసాయ పద్ధతులనాచరించి మంచి ఫలితాలు పొందవచ్చు.* తోటవాలుకు అడ్డంగా రెండు మామిడి వరుసల మధ్య ‘ఙ’ ఆకారంలో (3 అ. వెడల్పు, 1.5 అ. లోతు)గాడిని త్రవ్వి గాడిలో కాష్టపదార్థాలు (పంట అవశేషాలు) పరచాలి.* వర్షాకాలం మొదలైన తర్వాత గాడిలోని కాష్ట పదార్థాల మీద జీవామృతాన్ని (200-400 లీ. ఎకరానికి) పోయాలి. జీవామృతం వర్షం నీటితోపాటు అడుగున వున్న భూమి పొరల్లోకి చేరినపుడు భూమిలో సమాధి స్థితిలో వున్న సహజ దేశీయ వానపాములు ఉత్తేజితం చెంది భూమిపైకి మరియు లోపలికి కదులుతూ భూమిలో వుండే పోషకాలను మట్టితోపాటు తింటూ రంధ్రాలు చేస్తూ వాటి విసర్జితాలను భూమి మీద విసర్జిస్తుంటాయి. ఈ విసర్జితాలు అన్ని పోషకాలు కలిగి ఉంటాయి. క్రమంగా గాడిలోని కాష్టపదార్థాలు కూడా కుళ్ళిపోయి పోషకాలతో నిండిన జీవ సేంద్రియ పదార్థం ఏర్పడి మొక్కలకు అన్ని విధాల ఉపయోగపడుతుంది. ఈ విధంగా గుల్లబారిన నేల వర్షపు నీటిని బాగా పీల్చుకుని వర్షాభావ పరిస్థితులలో కూడా మొక్కలకు నీటి కొరత లేకుండా చేస్తుంది. ఇలా ఏర్పడిన సేంద్రియ పదార్థం వాతావరణంలోని తేమను గ్రహించి మొక్కలకు నీటికొరత లేకుండా చేస్తుంది. త్రవ్విన గాడికి రెండు వైపులా ఏకదళ, ద్విదళ బీజ పంటలను పెంచడం ద్వారా, నాలుగు మామిడి చెట్లు మధ్య మునగ చెట్ల వంటి వాటిని పెంచడం వలన వాతావరణంలో అధికంగా వున్న నత్రజని మొక్కలకందుబాటులోకి వస్తుంది. మామిడి పంటకాలంలో సస్యరక్షణతేనె మంచు పురుగు : * జనవరిలో పూత మొగ్గ బయటపడటానికి ముందు తేనె మంచు పురుగుల నివారణ కొరకు 100 లీ. నీటికి 5 శాతం వేప గింజల కషాయం లేదా 300 మి.లీ. 1500 పిపియం అజాడి రిక్టిన్తోపాటు 300 గ్రా. నీటిలో కరిగే గంధకం పిచికారి చేయాలి.* ప్రత్యామ్నాయంగా లీటరు నీటికి 3-5 మి.లీ. పంచగవ్య లేదా 50 మి.లీ. జీవామృతం, 3-5 గ్రా. ట్రైకోడెర్మావిరిడి, 2 గ్రా. బివేరియా బాసియానా, లేదా 3 గ్రా. వర్టిసిల్లియం లెకాని కలిపి పిచికారి చేయాలి.* పూత కాడలు లేదా పుగుత్తులు బయటకు వచ్చి, పూలు వికసించడానికి ముందు లీటరు నీటికి 3-5 మి.లీ. పంచగవ్య లేదా 50 మి.లీ. జీవామృతం, 3 గ్రా. వర్చిసిల్లియం, 3-5 గ్రా. బివేరియా బాసియానా, 5 గ్రా. ట్రెకోడెర్మా విరిడి కలిపి పిచికారి చేయాలి. తామర పురుగులు * ఫిబ్రవరిలో పిందె థలో తేనె మంచు పురుగు, తామర పురుగుల నివారణకు 1500 పిపియం అజాడిరిక్టిన్ లీటరు నీటికి 3 మి.లీ., 5 గ్రా. ట్రెకోడెర్మావిరిడి, 3-5 గ్రా. బివేరియా బాసియానా, 3-5 గ్రా. వర్టిసిల్లియం లెకాని, 50 మి.లీ. జీవామృతం లేదా 3 మి.లీ. పంచగవ్య కలిపి పిచికారి చేయాలి. * 15-20 సంవత్సరాల వయస్సున్న చెట్టుకి 15-20 కి. వర్మికంపోస్టు, 5 లీ. జీవామృతం పాదులో పోసి నీరు పెట్టాలి. వీటితోపాటు చెట్టుకి 100 గ్రా. అజోస్పైరిల్లం, 100 గ్రా. ఫాస్పోబాక్టీరియా వాడితే మరింత ప్రయోజనకరం.* మార్చి-ఏప్రిల్లో పిందెలు పెరగటం జరుగుతుంది. ఈ థలో పాదులో 15-20 రోజులకొకసారి నీరు పెట్టాలి.* ఎండలో పెరిగే సమయంలో లీటరు నీటికి 15-20 గ్రా. నీటిలో కరిగే సున్నం కలిపిన ద్రావణాన్ని కాయలపై పిచికారి చేయాలి.* పిందెలు నిమ్మకాయ పరిమాణంలో ఉన్నపుడు వీటిపై టెంక పురుగు గుడ్లను పెడుతుంది. వీటి నివారణకు లీటరు నీటికి 2.5 మి.లీ. వేపగింజల కషాయం పిచికారి చేయాలి. పండుఈగ : మే-జూన్ నెలలో పండు ఈగ తాకిడికి పండ్లు చెడిపోకుండా కాపాడటానికి కోతకు నెలరోజుల ముందు ఎకరానికి 5-6 మిథైల్ యూజినాల్ పండు ఈగ ఎరలను ఏర్పాటు చేయాలి.
పాలకు స్థిరంగా గిరాకీ పెరుగుతూనే ఉంది. మేలు జాతి పాడి పశువుల పెంపకం చేపట్టి, మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చుకుంటే డెయిరీ ఫారాన్ని లాభదాయకంగా నిర్వహించుకోవచ్చు.పాలు, పాల ఉత్పత్తుల అవసరం అనుదినం ప్రతి కుటుంబానికీ ఉంటుంది. పెరుగుతున్న జనాభాతో పాటు పట్టణీకరణ, సగటు కొనుగోలు సామర్థ్యం పెరగడం వల్ల పాలు, పాల ఉత్పత్తులకు క్రమేణా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పాడి రైతులతో పాటు, ఔత్సాహికులు, నిరుద్యోగ యువత అధిక పాల సార కలిగిన మేలు జాతి ఆవులు లేదా గేదెలతో పాడి పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. ఎంత మంది చేపట్టినా గిరాకీ పెరుగుతూనే ఉండే రంగం ఇది. అయితే, పాడి పశువుల పెంపకం చెప్పినంత, విన్నంత సులభం కాదు. పశువుల పెంపకంపై ప్రేమ ఉండాలి. శాస్త్రీయ అవగాహనతో పాటు సంపూర్ణ నిమగ్నతతో కూడిన ఆచరణ తోడైతే విజయం మీ వెంటే ఉంటుంది. మేలు జాతి పాడి పశువుల పెంపకంలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఆశించిన పాల ఉత్పత్తి పొందినప్పుడే పశుపోషణ లాభదాయకమవుతుంది.
పాడి పరిశ్రమను ఎవరెవరు చేపట్టవచ్చు? డెయిరీ ఫారాన్ని సంపన్నులు, నిరుపేదలు, పురుషులు, స్త్రీలు, ప్రగతిశీల రైతులు, విశ్రాంత ఉద్యోగులు, స్వయం సహాయక బృందాలు, మహిళా సంఘాలు, సహకార సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలు, నిరుద్యోగులు.. ఎవరైనా చేపట్టవచ్చు. పాడి పశువుల పోషణపై ఆసక్తి, వాటిని ప్రేమించే స్వభావం కలిగి ఉండాలి. పాడి పశువుల పెంపకం చేపట్టబోయే ముందు కొన్ని డెయిరీ ఫారాలను కక్షుణ్ణంగా పరిశీలించాలి. రెండు నుంచి 10 పాడి పశువుల వరకు నౌకర్లపై ఆధారపడకుండా స్వయంగా రైతు కుటుంబమే నిర్వహించుకునేలా సంసిద్ధులై ఉండాలి. గడ్డి కోయడం దగ్గర నుంచి పాలు పితకడం వరకు అన్ని పనులను నేర్చుకోవాలి. ఒత్తిడులను ఎదుర్కొనేమనో నిబ్బరం కలిగి ఉండాలి.
తెలుసుకోవాల్సిన విషయాలు పాడి పరిశ్రమ స్థాపించే ముందు లాభాల బాటలో నడిచే డెయిరీకి స్వయంగా వెళ్లి, అక్కడ పనులు జరుగుతున్న తీరును, సమస్యలను కక్షుణ్ణంగా, శ్రద్ధగా గమనించాలి. సందేహాలను తీర్చుకోవాలి. వినడం కన్నా చూడటం ద్వారా త్వరగా విషయ పరిజ్ఞానం కలుగుతుంది. కష్టేఫలి అని పెద్దలు చెప్పినట్లు.. నౌకర్లపై ఆధారపడకుండా, స్వయంగా కష్టపడి, పర్యవేక్షించి, పూర్తి సమయాన్ని వెచ్చించగలిగినప్పుడే విజయం చేకూరుతుంది.
కావల్సిన వసతులు పాడి పరిశ్రమను నెలకొల్పే ప్రదేశాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు అనేక విషయాలను ఆలోచించాలి. రవాణా సౌకర్యం, రోడ్డు సౌకర్యం, విద్యుత్ సదుపాయం ఎలా ఉందో చూసుకోవాలి. నీటి లభ్యత, బోరు, పశుగ్రాసం పెంపకానికి తగినంత భూమి సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇవే కాకుండా చుట్టూ కంచె నిర్మించడం, పని వారి లభ్యతను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో నీటి లభ్యత తగ్గుతుంటే, అవసరం పెరుగుతోంది. ప్రతి సంకరజాతి ఆవు లేదా ముర్రా గేదెకు రోజుకు 75-80 లీటర్ల నీరు అవసరం. వేసవిలో ఇది వంద లీటర్లకు పెరుగుతుంది. ఏడాది పొడవునా పశుగ్రాసం సాగు చేసుకోవడానికి అదనంగా నీరు అవసరం. కాబట్టి, నీటి లభ్యత అనేది అతి ముఖ్యమైన సంగతి.
ఎలాంటి పాడి పశువులను కొనుగోలు చేయాలి? పాడి పరిశ్రమను పెట్టాలనుకునే వారు ఆ ప్రాంతంలో ఆవు పాలకు గిరాకీ ఉందా లేదా గేదె పాలకు గిరాకీ ఉందా అనేది ముందుగా తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. గేదె పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రుచిగా ఉంటాయి. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో గేదె పాలకు గిరాకీ ఉంటుంది.
10 ఆవులు, గేదెలకు ఎంత భూమి అవసరం? ఒక్కో గేదె లేదా ఆవుకు 32 చదరపు అడుగుల స్థలం అవసరమవుతుంది. ప్రతి 5 పాడి పశువులకు పశుగ్రాసాల సాగుకు ఒక ఎకరా భూమి, ఇతర వసతులకు 300 చదరపు గజాల స్థలం అవసరం. 10 ఆవులు లేదా గేదెల పెంపకానికి కనీసం రెండెకరాల భూమి అవసరమవుతుంది. షెడ్డు నిర్మాణానికి, ఇతర అవసరాలకు మరో పది కుంటలు లేదా పావెకరం భూమి అవసరం.
సంకర జాతి ఆవులు, గేదెలు ఎక్కడ దొరుకుతాయి? హెచ్.ఎఫ్., జెర్సీ సంకర జాతి ఆవుల్లో పాల సార అధికంగా ఉంటుంది. ఇవి కర్ణాటక, తమిళనాడుల్లోని చింతామణి, కోలార్, బెంగళూరు సబర్బన్ ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో దొరుకుతాయి. ఇవి రోజుకు 12 నుంచి 24 లీటర్ల పాల దిగుబడిని ఇస్తాయి. వీటి ధర మార్కెట్లో రూ. 65 వేల నుంచి లక్షపైన ధర పలుకుతాయి. గ్రేడెడ్ ముర్రా, ముర్రా అనేవి మేలైన సంకర జాతి గేదెలు. ముర్రా జాతి గేదెలు రోజుకు 8 నుంచి 12 లీటర్ల పాలు ఇస్తాయి. వీటి ధర మార్కెట్లో రూ. 75 వేల నుంచి లక్ష పైన పలుకుతాయి. గ్రేడెడ్ ముర్రా గేదెలు గోదావరి ప్రాంతాల్లో దొరుకుతాయి. ముర్రా జాతి గేదెలు హరియాణాలోని రోహ్ాహతక్, గుజరాత్లోని మెహసన ప్రాంతాల్లో దొరుకుతాయి.
మేలైన పాడి, అనుబంధ వ్యాపార అవకాశాలు ఎలా ఉంటాయి? పాడి పశువులను పెంచే రైతులు ఎక్కువగా పాల వ్యాపారానికి పరిమితం అవుతుంటారు. అయితే, పెరుగు, వెన్న, నెయ్యి, క్రీమ్ వంటి వివిధ రకాల పాల ఉత్పత్తులను తయారు చేసి అమ్మగలిగితే అధికాదాయం పొందవచ్చు. అంతేకాదు.. పేడతో గోబర్ గ్యాస్, వర్మీకంపోస్టు వంటివి తయారు చేయవచ్చు. పాల శీతలీకరణ, పాల సేకరణ, దూడల పెంపకం చేపట్టవచ్చు.
ఎన్ని రకాల పశుగ్రాసాలు పెంచాలి? అనేక రకాల పశుగ్రాసాలు సాగు చేసుకోవడం ద్వారా పోషక లోపం లేకుండా పాడి పశువులను లాభదాయకంగా పెంచుకోవచ్చు. డెయిరీ ఫారం ప్రారంభానికి 2-3 నెలలు ముందు నుంచే పశుగ్రాసాల సాగు చేపట్టాలి. పప్పుజాతి పశుగ్రాసాలు పావు వంతు, ధాన్యపు జాతి పశుగ్రాసాలు ముప్పావు వంతు విస్తీర్ణంలో సాగు చేయాలి. గట్లవెంబడి పశుగ్రాసంగా పనికి వచ్చే సుబాబుల్, స్టైలో వంటి జాతుల చెట్లు పెంచుకోవాలి. పప్పు జాతి పశుగ్రాసాలు రెండు రకాలు: 1. ఏక వార్షికాలు: లూసర్న్, బెర్సీమ్. వీటిని సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో నాటుకోవాలి. 2. బహువార్షికాలు: లూసర్న్ కో, సుబాబుల్, హెడ్జ్ లూసర్న్, స్టైలో, జనుము. ధాన్యపు జాతి పశుగ్రాసాలు రెండు రకాలు: 1. ఏకవార్షికాలు: పిసి-23, ఎస్.ఎస్.జి., జొన్న (మల్టీకట్). 2. బహువార్షికాలు : సూపర్ నేపియర్, ఎన్బి-21, కో-4, కో-5, ఎస్ఎన్-ఎపిబిఎన్. వీటిని జూన్-జూలైలలో వర్షాకాలంలో నాటుకోవాలి. చలికాలంలో వీటి ఎదుగుదల తక్కువగా ఉంటుంది.
ఎవర్ని సంప్రదించాలి? పాడి పరిశ్రమను స్థాపించదలచిన వారు మొదట బ్యాంకు వారితో, బీమా కంపెనీ వారితో, పశువైద్య నిపుణులతో సంప్రదించి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. పాల వినియోగదారులైన హాస్టళ్లు, హోటళ్లు, ఆసుపత్రులతోపాటు సమీప ప్రాంతాల్లోని సాధారణ పాల వినియోగదారులతో, పాల ఉత్పత్తిదారుల సంఘాలతో సత్సంబంధాలు పెట్టుకోవాలి. పశుగ్రాస విత్తనాల విక్రయ కేంద్రాలతోనూ మంచి సంబంధాలను పెంపొందించు కోవాలి
పాడి పరిశ్రమలో రికార్డుల నిర్వహణ మేలైన పాడి పశువులను వాణిజ్య స్థాయిలో పెంచి లాభాలు ఆర్జించాలనుకునే వారు కొన్ని వివరాలను క్రమం తప్పకుండా నమోదు చేసుకుంటూ, సమీక్షించుకుంటూ ముందడుగు వేయాలి. * మేపు రికార్డులు: పశువులకు ఎంత మేత వేస్తున్నదీ రాసి పెట్టుకోవాలి. * ఆరోగ్య సంబంధ రికార్డులు: పశువుల ఆరోగ్య రక్షణకు ఎప్పుడెప్పుడు ఏమేమి మందులు వాడిందీ రాసుకోవాలి. * పాల ఉత్పత్తి రికార్డులు: ఒక్కో పశువు రోజుకు ఎన్ని పూటలు, ఎన్నెన్ని పాలు ఇస్తున్నదో రాసుకోవాలి. * పునరుత్పత్తి రికార్డులు: ప్రతి పశువు ఎదకు వచ్చిన తేదీ, కృత్రిమ గర్భధారణ చేయించిన తేదీ, ఈనిన తేదీ తదితర వివరాలను రాసి పెట్టుకోవాలి. * ఆర్థిక రికార్డులు: రోజువారీగా రాబడి, ఖర్చుల వివరాలను రాసుకోవాలి.
పాడి పశువుల ఎంపిక ఎలా? పాడి పశువు త్రికోణాకారంలో ఉండాలి. చురుకైన కళ్లు, మృదువైన చర్మం కలిగి ఉండాలి. పొదుగు నాలుగు భాగాలూ శరీరానికి అతుక్కొని, మృదువుగా, పెద్దవిగా, సమానంగా ఉండాలి. నాలుగు చనుమొనలు సమానంగా ఉండాలి. తొడలు దృఢంగా, కాళ్లు పొట్టిగా ఉండాలి. పొదుగుకు రక్తం సరఫరా చేసే పాలనరం స్పష్టంగా వంకరలు తిరిగి ఉండాలి. కడుపు పెద్దదిగా విశాలంగా ఉండాలి. పశువుల షెడ్డు నిర్మించేదెలా?
డెయిరీ ఫారం పెట్టాలనుకునే వారు స్థలాన్ని ఎంపిక చేసుకునే ముందు రవాణా, విద్యుత్తు, నీరు లభ్యత, మార్కెటింగ్ సదుపాయాలను దృష్టిలో పెట్టుకోవాలి. పశువుల షెడ్డు తూర్పు పడమర దిశగా గాలి, వెలుతురు ఉండేలా, కాస్త ఎత్తులో నిర్మించుకోవాలి. డెయిరీ ఫారం చుట్టూ పశుగ్రాసానికి అక్కర వచ్చే చెట్లు పెంచాలి. షెడ్డును సులభంగా కడగడానికి నీళ్లు కొట్టే ప్రెషర్ పంపును సమకూర్చుకోవాలి. మేత వృథా కాకుండా చూసుకోవడానికి పచ్చి మేతను ముక్కలు చేసి వేయాలి.
డెయిరీని ఏర్పాటు చేయదలచినవారు గమనించాల్సిన ముఖ్యాంశాలు 1. పాడి పశువుల పెంపకంపై ఆసక్తి – ఆశావహ దృక్పథం, 2. వసతులు-వనరులు, 3. మేలుజాతి పాడి పశువులు, 4. పాడి పశువుల మేపు, 5. ఖర్చు తగ్గింపు, ఉత్పత్తి పెంపు, 6. పశు ఆరోగ్య సంరక్షణ, 7. పునరుత్పత్తి యాజమాన్యం, 8. దూడల పోషణ, 9. శుభ్రమైన పాల ఉత్పత్తి, 10. పాలు, పాల ఉత్పత్తుల మార్కెటింగ్.
డెయిరీ ఫారం పెట్టే రైతులకు శిక్షణ ఎవరిస్తారు? స్థానిక పశు సంవర్థక శాఖ అధికారులు, వెటర్నరీ విశ్వవిద్యాలయాలతోపాటు జాతీయ డెయిరీ పరిశోధనా సంస్థ – కర్నాల్, జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు – ఆనంద్, భారతీయ ఆగ్రోఇండస్ట్రీస్ ఫెడరేషన్- పుణే వంటి సంస్థలు మేలు జాతి పాడి పశువుల పోషణలో రైతులకు శిక్షణ ఇస్తున్నాయి.
రుణాలు… సబ్సిడీలు మేలైన పాడి పశువుల పెంపకాన్ని ప్రారంభించే బలహీన వర్గాల వారు రుణాలు, సబ్సిడీలపై సమాచారం కోసం దగ్గర్లోని సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాలను, సంబంధిత ప్రభుత్వ శాఖలు / కార్పొరేషన్ల అధికారులను సంప్రదించవచ్చు. నాబార్డు, డీఆర్డీఏ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన వంటి సంస్థలను సంప్రదించాలి. జనరల్ అభ్యర్థులు బ్యాంకులను సంప్రదించి రుణం పొందవచ్చు. ప్రాజెక్టు వ్యయంలో 75% బ్యాంకు రుణంగా ఇస్తుంది. ఈ విషయాలన్నిటినీ అర్థం చేసుకొని మేలు జాతి పాడి పశువుల పెంపకం చేపట్టి, మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చుకుంటే డెయిరీ ఫారాన్ని అత్యంత లాభదాయకంగా నిర్వహించుకోవచ్చు.
మనది వ్యవసాయక దేశం. ఒకప్పుడు 80 శాతానికి పైగా, ప్రస్తుతం 60 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధరంగాలపై ఆధారపడి జీవించారు, జీవిస్తున్నారు. అయినా కాని వ్యవసాయంలో రైతుకి తగిన గౌరవం దక్కడం లేదు. ప్రస్తుతం 10 ఎకరాల రైతుకు లేని గౌరవం పదివేల జీతం సంపాయించే ఉద్యోగస్తునికి ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు ప్రధాన కారణం మన గతం. గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే ఒకప్పుడు ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుండేవారు. అతి కొద్దిమంది మాత్రమే ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉండేవారు. ఆ సమయములో ఉద్యోగరంగంలో ఉండేవారు సౌకర్యవంతంగా జీవితాలను గడుపుతుండేవారు. రైతులకి సౌకర్యాలు అంతగా అందుబాటులో ఉండేవి కావు. కాబట్టి సౌకర్యవంతమైన జీవితం కావాలంటే వ్యవసాయం సరైన దారి కాదు, వ్యవసాంయలో ఉంటే కష్టపడవలసిందే. కాబట్టి సుఖపడాలంటే, సౌకర్యవంతమైన జీవితాలను గడపాలంటే వ్యవసాయాన్ని వదలి ఉద్యోగ రంగంలోకి పోవాలి అని భావించేవారి సంఖ్య ఎక్కువగా ఉండేది. అందుకనే బాగా చదువుకునే వారిని వ్యవసాయానికి దూరంగా ఉంచుతూ చదువురాని వారిని వ్యవసాయం మరియు పశుపోషణలో ఉంచే పరిస్థితులు అప్పట్లో నెలకొన్నవి. అందుకే అప్పట్లో చదువుకోని వారికి శిక్ష వ్యవసాయం అనేవిధంగా అంటే ఇంట్లో తమ పిల్లలని బాగా చదువుకో… లేకుంటే మట్టి పిసుక్కోవలసిందే, గేదెలు కాయవలసిందే లాంటి మాటలు ప్రతి ఇంట్లో ఉండేవి. అలాంటి పరిస్థితులలో వ్యవసాయం అంటే ఒక శిక్ష అనే భావం అప్పట్లోనే ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితులు గమనించినట్లయితే అదీను సేంద్రియ వ్యవసాయం ఊపందుకున్న తరువాత పరిస్థితులు గమనించినట్లయితే ఉన్నత చదువులు చదివి ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉండే చాలామంది వ్యవసాయరంగంలో అడుగుపెట్టి వ్యవసాయ రంగానికి నూతనోత్సాహాన్ని తెస్తున్నారు. ఇలాంటి వారి ఆలోచన ఉన్నత చదువులు వ్యవసాయానికి అడ్డంకి కాదు. ఉన్నత చదువులు వ్యవసాయానికి ఊతం అనేలా పరిస్థితులు మారుతున్నవి. ఇటీవల కాలంలో ఉన్నత చదువులు చదివిన చాలామంది యువత వ్యవసాయరంగంవైపు అడుగులు వేశారు. వేస్తున్నారు. ఈ కోవకే చెందుతాడు సూర్యాపేట జిల్లా మునగాల మండలం, మాధవరం గ్రామంలో సేంద్రియ సాగు చేస్తున్న అరవింద్. అరవింద్ది వ్యవసాయ నేపథ్యం. ఉన్నత చదువులు చదివి తన చదువుకు తగిన ఉద్యోగ బాధ్యతలు చేపట్టి అందులో కొనసాగుతూవస్తూ .. ఒకానొక సమయంలో చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడంతో సంతృప్తికొరకు ఏ రంగం అనుకూలంగా ఉంటుందో విచారిస్తుండగా సంతృప్తి పొందాలంటే వ్యవసాయరంగమే సరైన దారి అని తెలుసుకుని తన ఉన్నత చదువులు మన దేశ ఆయువు పట్టు అయిన వ్యవసాయ రంగానికి ఊతం అవ్వాలని నిర్ణయించుకుని వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టాలని కుటుంబ సభ్యులను సంప్రదించి వారి నుండి ఏలాంటి అభ్యంతరాలు ఎదురవక పోవడంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదలి వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టి మొదట పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టి కొన్ని రకాల కారణాల వలన దానిని ఆపి ప్రస్తుత వివిధ రకాల కూరగాయలు, పండ్లు, మినుము లాంటి పంటలు సేంద్రియ పద్ధతులలో పండిస్తున్నాడు. ప్రస్తుతం బీర, కాకర, టమాట, ఖర్జూర, సీతాఫలం, మినుము పంటల సాగుతో పాటు నాటుకోళ్ళ పెంపకం, తేనెటీగల పెంపకం కూడా చేస్తున్నారు. బీర:
ఒక ఎకరంలో బీర సాగులో ఉంది. డిసెంబరు రెండవవారంలో విత్తనాలను నాటించారు. లైనుకి లైనుకి 12 అడుగుల దూరం పాటించి లైనులో మొక్కకు మొక్కకు రెండు అడుగుల దూరం పాటించి శాశ్వత పందిరిలో బీర విత్తనాలను నాటించారు. దుక్కిలో మాగిన పశువుల ఎరువు ఎకరానికి 4 టన్నుల చొప్పున అందించారు. వానపాముల ఎరువును బెడ్పై వేసి విత్తనాలు నాటించారు. క్రమం తప్పకుండా జీవామృతాన్ని ఎకరానికి 200 లీటర్ల చొప్పున నెలకు మూడుసార్లు చొప్పున అందిస్తూ వస్తున్నారు. పంటపై వేపనూనె, ఆవుమూత్రం, పుల్లటి మజ్జిగ, జీవామృతం లాంటివి అవకాశాన్ని బట్టి పిచికారి చేసుకుంటూ వస్తూంటే జనవరి మూడవ వారం మొదటలో బీర దిగుబడి మొదలయ్యింది. ఇప్పటి వరకు 3000 కిలోల వరకు దిగుబడి వచ్చింది. కిలో 30/- నుంచి 60/- వరకు అమ్ముకుంటూ వస్తున్నాడు. ఇంకా దిగుబడి ఉంది. కాకర:
75 సెంట్లలో కాకర సాగులో ఉంది. ఇందుకు గాను ఈస్ట్వెస్ట్ కంపెనీ వారి ప్రగతి విత్తనాలను డిసెంబరు 2వ వారంలో నాటుకుంటే ఫిబ్రవరి మొదటి వారంలో దిగుబడి మొదలయ్యింది. బీరకు పాటించిన సాగు పద్ధతులే కాకరకు కూడా పాటించారు. ఇప్పటి వరకు 2500 కిలోల దిగుబడి వచ్చింది. ఇంకా సుమారు 1500 కిలోల దిగుబడి రావచ్చు. 30/- ల నుంచి 50/-ల వరకు అమ్ముకుంటూ వస్తున్నారు. టమాట:
50 సెంట్లలో టమాట సాగులో ఉంది. పిహెచ్ఎస్448 రకం నారుని డిసెంబరుమొదటివారంలో నాటుకున్నారు. దుక్కిలో పశువుల ఎరువులో వేపపిండిని కలిపి ఉపయోగించారు. అవసరాన్ని బట్టి జీవామృతం, తులసి, పర్ఫెక్ట్ లాంటివి పంటపై పిచికారి చేసుకుంటూ వస్తే ఫిబ్రవరి 10 తరువాత దిగుబడి మొదలయ్యింది. ఇప్పటి వరకు 7000 కిలోలకు పైగా దిగుబడి వచ్చింది. ఇంకా 2000 కిలోల దిగుబడి రావచ్చు.
ఖర్జూరలో అంతరపంటగా సీతాఫలం:
ఎకరానికి 75 ఖర్జూర మొక్కలను 2018 డిసెంబరులో నాటారు. ఒక్కొక్క మొక్క 4200/-లకు కొనుగోలు చేసి నాటారు. 3þ3 అడుగు సైజులో గుంతలు తీసి ఆ గుంతలలో మట్టి+వానపాముల ఎరువు, వేపపిండి-పశువుల ఎరువు కలిపి వేసి మొక్కలు నాటారు. 75 మొక్కలలో 60 ఆడ మొక్కలు, 15 మగ మొక్కలు చొప్పున రెండువైపులా 8 మీటర్ల దూరం పాటించారు. సంవత్సరానికి 5-6 సార్లు జీవామృతం పంపిస్తుంటారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ప్రతి మొక్కకు పశువుల ఎరువు, వేపపిండి అందిస్తుంటారు. ఈ సంవత్సరమే పూత మొదలయ్యింది. ఖర్జూరలో అంతర పంటగా సూపర్ గోల్డెన్ సీతాఫలం మొక్కలు 250 నాటారు. దిగుబడి ఇంకా మొదలు కాలేదు. ఖర్జూరకు పాటించిన సాగు పద్ధతులనే సీతాఫలం సాగుకి కూడా పాటిస్తున్నారు. ఈ పంటలతో పాటు మినుము ఒక ఎకరాలో సాగు చేశారు. డిసెంబరులో నాటి మార్చిలో దిగుబడి పొందారు. ఎకరానికి 400 కిలోల దిగుబడి పొందారు. అరవింద్ పంటల సాగుతో పాటు సమగ్ర వ్యవసాయ పద్ధతులు పాటించాలనే లక్ష్యంతో తేనెటీగల పెంపకం కూడా చేపట్టాడు. అంతేకాకుండా రెండు సంవత్సరాల నుండి కోళ్ళ పెంపకం చేస్తున్నారు. కోళ్ళలో బివి380, రాజశ్రీ, నాటుకోళ్ళు ఉన్నాయి. బివి380 గుడ్ల కొరకు మిగతావి మాంసం కొరకు పోషిస్తున్నారు. అన్నీ కలిపి ప్రస్తుతం 100 వరకు కోళ్ళు ఉన్నవి. ప్రతిరోజు కోడిగుడ్లను పొందుతూ ఒక్కొక్క గుడ్డు 10/-ల చొప్పున, లైవ్ చికెన్ 350/- కిలో చొప్పున అమ్మకం చేస్తూ వస్తున్నారు. రైతు ఆర్థికంగా బలపడాలంటే సమగ్ర వ్యవసాయమే సరైన దారి అని అరవింద్ ఆదారిలో నడుస్తున్నాడు. మరిన్ని వివరాలు 9885054562 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
వ్యవసాయంలో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా ఉండాలి. మిగతా రంగాలతో పోల్చుకుంటే ఉద్యోగ, వ్యాపార రంగాలలో కంటే వ్యవసాయ రంగంలో విజయం సాధించాలంటే కుటుంబ సభ్యుల సహకారం తప్పని సరి, అదీను సేంద్రియ వ్యవసాయంలో వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు రైతు స్థాయిలోనే తయారు చేసుకోవలసి ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుత సమాజాన్ని గమనించినట్లయితే వ్యవసాయంలో అందరికీ కుటుంబ సభ్యుల సహకారం అందడం లేదు. కుటుంబంలోని పెద్దవారు మరియు ఆడవారు వ్యవసాయ రంగంలో తమ సహకారాన్ని అందించటానికి నిరాకరించడంతో పాటు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. చాలా కొద్దిమంది మాత్రమే సహకారాన్ని అందిస్తున్నారు. అరవింద్కి అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. అరవింద్ తండ్రి, భార్య, పిల్లలు అందరూ తాను చేస్తున్న సేంద్రియ సాగుకు తమ సహకారం అందిస్తూ తమవంతు పాత్రను పోషిస్తున్నారు. కాబట్టి తన పంటల సాగుని లాభాల బాటలో నడిపిస్తున్నానని ఇందుకు సహకరించిన అధికారులకు, కుటుంబ సభ్యులకు అరవింద్ కృతజ్ఞతలు తెలియచేశాడు.
తిమ్మిర్లు లేదా రిళ్ళలు అనేది మోకాలి ఎముకల సంబంధిత వ్యాధి. ఎక్కువగా ఆవు జాతి, గేదె జాతి పశువులలో వస్తుంది. ఈ వ్యాధి వెనుకకాళ్ళలో వస్తుంది. అందువల్ల పశువులు సరిగ్గా నిలబడలేవు. నేలమీద కూర్చోలేవు. నడవలేవు, వెనకకాళ్ళను దేకుతూ నడుస్తాయి. అందువల్ల రైతు వాటిని పొలం దున్నడానికి వాడలేడు. పాల దిగుబడి కూడా తాత్కాలికంగా తగ్గుతుంది. రైతు ఈ వ్యాధి మూలంగా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అంతగా లేదు కాని, పశువులు మానసికంగా ఒత్తిడికి గురై సరిగ్గా పనిచేయలేవు.
ఈ వ్యాధి అంటువ్యాధి కాని, ప్రాణాంతకమైనది కాని కాదు. దీనిని శస్త్రచికిత్స ద్వారా నయం చేయవచ్చు.
కారణాలు:
1. ఈ వ్యాధి వంశపారంపర్య కారణాల వల్ల ఒక తరం నుండి మరొక తరంకు సంక్రమిస్తుంది.
2. మోకాలి చిప్ప అరగటం వల్ల మోకాలి చిప్ప తొంటి ఎముక పైభాగాన అంటిపెట్టుకుంటుంది, దీని వల్ల కూడా తిమ్మిర్లు రావచ్చు.
3. మోకాలి ఎముకలు దృఢంగా లేకపోవడం మరియు జాయింట్ చుట్టూ ఉన్న స్నాయువులు బలంగా లేకపోవడం
4. ఎత్తు పల్లాలు ఉన్న ప్రదేశాలలో పశువులను వ్యవసాయానికి వాడటం/కొండలు, గుట్టల లాంటి ప్రదేశాలలో పశువులను వ్యవసాయానికి వాడటం/కొండలు, గుట్టల లాంటి ప్రదేశాలలో పశువులను వినియోగించడం.
5. సరియైన వ్యాయామం లేకపోవడం వల్ల జాయింట్ చుట్టూ ఉన్న కండరాలు బలంగా లేక మోకాలి చిప్ప పటుత్వాన్ని కోల్పోవడం వల్ల కూడా తిమ్మిర్లు రావచ్చు.
6. సరియైన పోషణ లేకపోవడం వల్ల తొంటి ఎముక క్రింది భాగం (మోకాలి చిప్ప అతుక్కొనే చోట) బలహీనపడి మోకాలి చిప్ప తేలికగా కదలకుండా జాయింట్ మీద అంటిపెట్టుకోవడం వల్ల రిల్లలు రావచ్చు.
7. విరామం లేకుండా ఎక్కువగా పనిచేయడం వల్ల రావచ్చు.
8. అధికంగా పాలు ఇచ్చే పశువులలో కూడా ఈ తిమ్మిర్లు/రిల్లలు రావచ్చు.
లక్షణాలు
1. తిమ్మిరి ఉన్న కాలు యొక్క మోకాలు ముడుచుకోదు. దాని వల్ల కాలు సాగదీసినట్టు ఉండి సరిగ్గా నిలబడలేదు.
2. నడిపించినప్పుడు తిమ్మిరి ఉన్న కాలు గెంటుతుంది లేదా దాని గిట్టలు నేలకు రాకుతూ నడుస్తుంది.
3. కొన్నిసార్లు విశ్రాంతి సమయంలో బాగానే ఉండి కాస్త పొలంలో నడవగానే తిమ్మిర్లు వస్తాయి.
4. కొన్నిసార్లు ఈ తిమ్మిర్లు కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు చూడవచ్చు (ఉంటాయి). మళ్లీ సాధారణంగా అవుతుంది. ఇలా ఉంటే తిరిగి మళ్లీ వచ్చే అవకాశాలు ఉంటాయి.
5. కొన్నిసార్లు ఒక కాలు కాని రెండు వెనుక కాళ్లు ఒకేసారి కాని తిమ్మిర్లు రావచ్చు.
చికిత్స మరియు నివారణ చర్యలు
1. తిమ్మిర్లు వచ్చిన వెంటనే అందుబాటులో ఉన్న పశువైద్యాధికారి వద్దకు తీసుకెళ్ళాలి, పశువైద్యాధికారులు మోకాలికి సర్జరీ చేసి తిమ్మిర్లు తీస్తారు.
2. ప్రథమ చికిత్సగా మోకాలిని తడిమి చూసి మోకాలి చిప్ప పెద్ద కనుక స్థిరపడినట్లు ఉంటే వెంటనే మోకాలి చిప్పను క్రిందకు జారే విధంగా తాడాలి. అలా చేస్తే మోకాలి చిప్ప ఎద స్థానానికి వచ్చి ఎప్పటి లాగానే సాధారణ స్థితికి వస్తుంది.
నివారణ చర్యలు
1. ముఖ్యంగా కొండప్రాంతాలు, ఎత్తు పల్లాలు ఉన్న ప్రాంతాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి, అవి ఏమిటంటే ఆవు జాతి, గేదె జాతి పశువులకు నిర్ణీత శారీరక శ్రమ మరియు విశ్రాంతి అవసరం.
2. ఎక్కువగా ఎత్తుపల్లాలు ఉన్న ప్రాంతాలలో పశవులకు తక్కువ బరువు వేయాలి.
3. సరియైన పోషణ ఉండాలి. ముఖ్యంగా లవణాలు ఉన్న సమీకృత దాణాను వాడాలి.
4. సమాంతరంగా ఉన్న దారిలోనే పశువులను నడిపించాలి.
5. తిమ్మిర్లు రాకుండా మోకాలికి పటుత్వాన్ని పెంచే పట్టీలు (మమోకాలు పట్టీలు) వాడాలి.
డా. ఎన్. వేణుమాధవ్ (7989846261, 9490448540), (ఎం.వీ.ఎస్సీ), టీచింగ్ ఫ్యాకల్టీ, డా. ఎన్. రమ్య, ఎం.వీ.ఎస్సీ., అసిస్టెంట్ ప్రొఫెసర్, పశువైద్య కళాశాల, కోరుట్ల
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణంలో వచ్చే మార్పులు పశువులకు ప్రతికూలంగా మారతాయి. కనుక వేసవిలో పశువులకు ప్రత్యేక యాజమాన్యం అవసరం.
ఆవులకంటే గేదెలు ఎక్కువ ఉష్ణతాపానికి గురవుతాయి. గేదెల శరీరం నలుపురంగులో ఉండటం, శరీరం క్రింద కొవ్వు ఉండడం, స్వేదగ్రంథుల సంఖ్య తక్కువగా ఉండటం మొదలగు కారణాల వల్ల గేదెలు అధిక ఉష్ణతాపానికి లోనవుతాయి. సంకరజాతి ఆవులు వేసవి తీవ్రతను తట్టుకోలేవు. అలాగే కోళ్ళ మీద వేసవి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
వేసవిలో సాధారణంగా వచ్చే సమస్యలు
పాల దిగుబడి తగ్గటం: పశువులు మేత తక్కువ తింటాయి. వేసవిలో దాహంతో ఎక్కువ నీళ్ళు త్రాగి, 30-40% తక్కువ ఆహారం తీసుకుంటాయి. తద్వారా పోషకాలన్నీ అందవు. అంతేకాక జీర్ణక్రియ కుంటుబడుతుంది. పెద్దపొట్టలో అసిటిక్ ఆమ్లం ఉత్పత్తి తగ్గి పాలల్లో వెన్నశాతం పాల ఉత్పత్తి శాతం తగ్గుతుంది. కాబట్టి ఎక్కువ పోషకాల్ని తక్కువ పరిమాణం గల దాణాలో అందేవిధంగా చూడాలి. మాంసకృత్తులు, కొవ్వుపదార్థాలు, శక్తి, విటమిన్లు, ఖనిజలవణాలు సక్రమంగా అందేలా దాణాని తయారు చేసుకోవాలి.
పచ్చగడ్డి కొరత: వేసవిలో పచ్చగడ్డి కొరత సాధారణంగా చూస్తాము. ధాన్యపు జాతికి చెందిన నేపియర్ వంటి బహువార్షిక పశుగ్రాసాలు సాగు చేసుకుంటే సంవత్సరం పొడవునా పచ్చిమేత దిగుబడి ఉంటుంది. వీటిని ఒకసారి నాటితే 3-4 సంవత్సరముల వరకు నిరంతరంగా పలుకోతలు తీసుకోవచ్చు. ఈ విధంగా వేసవిలో కూడా పచ్చగడ్డి అందించే విధంగా జాగ్రత్త వహించాలి. పచ్చగడ్డి లభ్యంకాని సమయాల్లో మాగుడుగడ్డి, యూరియా గడ్డిని పశువుల కందించాలి. సుబాబుల్, అవిశ ఆకులు, రెమ్మల్ని దాణాలో కలిపి ఇవ్వాలి. ఎండుమేత మేపినపుడు విటమిన్ ‘ఎ’ అదనంగా ఇవ్వాలి. ఎండుగడ్డిని ఎప్పుడూ రాత్రివేళల్లో మేపాలి. ఖనిజలవణ మిశ్రమాన్ని ప్రతిరోజు 30-40 గ్రాములు అందివ్వాలి.
వ్యాధులు/ఆరోగ్య సమస్యలు
వడదెబ్బ: వాతావరణ ఉష్ణోగ్రత, గాలిలో తేమ అధికమైనపుడు పశువులు ఎక్కువగా వడదెబ్బకు లోనవుతాయి. పశువులను గాలి ప్రసరణ సరిగ్గాలేని ప్రాంతాల్లో, తక్కువ స్థలంలో ఎక్కువ పశువులను కిక్కిరిసి ఉంచినప్పుడు, నీటి సౌకర్యం అందుబాటులో లేనప్పుడు పశువులు అధిక శ్రమకు లోనవుతాయి. ఇలాంటి సందర్భంలో వడగాలుల తాకిడికి లోనైనప్పుడు వడదెబ్బకు గురవుతాయి. సాధారణంగా పశువులు ఒకేసారి ఎక్కువ సంఖ్యలో వడదెబ్బ బారిన పడతాయి. తెల్లజాతి పశువులకంటే నల్లజాతి పశువులు ఎక్కువగా, త్వరగా వడదెబ్బకు లోనవుతాయి. వేసవికాలంలో బయట ఉష్ణోగ్రత, పశువుల శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువైనపుడు మెదడులోని హైపోతలామన్ స్వేద గ్రంథుల నిర్వహణపై పర్యవేక్షణ కోల్పోతుంది. ఆ సందర్భాల్లో చర్మంపై గల స్వేదగ్రంథులు చెమట అధికంగా ప్రసారం చేసి పశువులను అధిక ఉష్ణోగ్రతలకు లోనుకాకుండా కాపాడతాయి. చెమట ద్వారా శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ కోల్పోయి, శరీర ప్రక్రియ మందగిస్తుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శ్వాస, గుండె, నాడి వేగం పెరుగుతాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మూత్రవిసర్జన కుంటుపడుతుంది. పశువుల ఆరోగ్య పరిస్థితి విషమించి, అపస్మారక స్థితిలోకి వెళ్ళి శ్వాస ఆడక మరణిస్తాయి.
లక్షణాలు: వడదెబ్బ తగిలిన పశువుల శరీర ఉష్ణోగ్రత 103 డిగ్రీ ఫారెన్హీట్ కంటే ఎక్కువగా ఉంటుంది. చర్మం సున్నితత్వం కోల్పోయి గట్టిపడుతుంది. నోటివెంట చొంగపడుతుంది. పశువులు బలహీనంగా, సరిగ్గా నడువలేక తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి.
చికిత్స: వడదెబ్బకు లోనైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే నీడ ప్రాంతానికి మార్చాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేర్చడానికి చల్లటి నీటితో పలుసార్లు కడగాలి. తడిగోనె సంచులు కప్పి నీళ్ళు చల్లాలి. త్రాగునీరు ఇచ్చి వెంటనే చికిత్స చేయించాలి.
శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీ ఫారెన్హీట్ దాటితే శ్వాస పీల్చటం కష్టమవుతుంది. ఫిట్సు లక్షణాలతో పశువులు క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళి మరణిస్తాయి. వడదెబ్బ ప్రభావం వల్ల చూడి పశువుల్లో గర్భస్రావాలు సంభవిస్తాయి. పునరుత్పత్తి ప్రక్రియ కుంటుపడి, తాత్కాలిక వంధ్యత్వం సంభవింస్తుంది. పాడిపశువుల్లో పాల దిగుబడి తగ్గిపోతుంది.
గొంతువాపు, జబ్బవాపు: వేసవిలో పశువుల్లో వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది. గొంతువాపు, జబ్బవాపు వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండి, ముందే టీకాలు వేయించాలి.
పరాన్నజీవులు:బాహ్యపరాన్నజీవులు, వాటి కాటు ద్వారా సంభవించే వ్యాధుల నివారణకు బాహ్యపరాన్నజీవులు నిర్మూలన మందుల్ని పిచికారి చేయాలి. దూడల వెంట్రుకలు కత్తిరించాలి. పశువుల పొడవాటి వెంట్రుకలు కత్తిరించాలి. అంతరపరాన్నజీవుల నిర్మూలనకు నట్టల నివారణ మందులు పశువులకు తాగించాలి.
జీర్ణకోశ సమస్యలు:దాహార్తితో ఉన్న పశువులు మురికినీళ్ళు త్రాగటం వల్ల, పారుడు వంటి జీర్ణకోశ సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి గ్రామాల్లో నీటితొట్లు శుభ్రపరచి, పరిశుభ్రమైన త్రాగునీళ్ళను అన్నివేళలా అందుబాటులో ఉంచాలి.
పునరుత్పత్తలో సమస్యలు: వేసవిలో పునరుత్పత్తి ప్రక్రియ కుంటుపడుతుంది. అధిక వేడివల్ల ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ ఉత్పత్తి కుంటుపడుతుంది. శరీరంలో గ్లూకోజ్ పరిమాణం తగ్గుతుంది. అందువల్ల అండాశయాల్లో స్థబ్ధత, అండోత్పత్తిలో వ్యత్యాసాలు సంభవించి పశువులు తిరిగి పొర్లుతుంటాయి. వేసవిలో ఎక్కువ ఎండుగడ్డి సంగ్రహించడం వల్ల కూడా విటమిన్ ఎ, కాల్షియం, కాపర్, మెగ్నీషియం మొదలగు ఖనిజలవణాల లోపం కూడా ఏర్పడి, పశువుల్లో తాత్కాలిక వంధ్యత్వం ఏర్పడుతుంది. పశువుల ఎదలక్షణాల్ని వేసవి తాపం వల్ల ప్రస్ఫుటంగా బహిర్గతం చేయలేవు. పశువుల్ని జాగ్రత్తగా గమనిస్తూ, టీజర్బుల్ సహాయంతో ఎదగుర్తించి వీర్యదానం చేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో ఆవులకంటే గేదెల సంఖ్య ఎక్కువ. గేదెలకు సంవత్సరం పొడవునా ఎదకొచ్చి పొర్లే స్వభావం ఉన్నప్పటికి, వేసవి వల్ల పునరుత్పత్తి ప్రక్రియకు విఘాతం కలగడం వల్ల ఈతల మధ్య వ్యవధి పెరిగి వేసవిలో చాలా గేదెలు ఈనవు, వేసవి వచ్చేసరికి కొన్ని పాడిగేదెల్లో అత్యధిక పాలదిగుబడి కాలం పూర్తవడం వల్ల వేసవిలో పాలకు కొరత ఏర్పడుతుంది. కాబట్టి డిమాండ్ అధికంగా ఉండే వేసవిలో పాలు ఉత్పత్తి చేయాలంటే రైతులు పశువులపై వేసవి ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలి.
పొదుగువాపు: వేసవిలో ‘కొరినీబ్యాక్టీరియం పయోజన్స్’ అనే సూక్ష్మక్రియ వల్ల పెయ్యలు, వట్టిపోయిన పశువుల్లో పొదుగువాపు ఎక్కువగా/సాధారణంగా వస్తుంది. ఈ వ్యాధి వల్ల పొదుగు బాగా వాచి, గట్టిగా తయారవుతుంది. పొదుగులో పాలు చెడిపోవుట వలన దుర్వాసనలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో రొమ్ము పూర్తిగా పాడై కింద పడిపోతుంది. పశువు జ్వరంతో బాధపడుతుంది. సూక్ష్మక్రియ ద్వారా విడుదలయ్యే విషపదార్థాలు రక్తమంతా వ్యాపించి పశువు చనిపోతుంది. వ్యాధి నుండి కోలుకున్న పశువులలో దెబ్బతిన్న పొదుగుభాగం జీవితాంతం పనిచేయదు.
వేసవిలో పశువుల సంరక్షణకు తీసుకోవలసిన చర్యలు
* వేసవిలో పగటివేళల్లో పశువుల్ని మేతకు వదలకూడదు. ఉదయం (10 గంటల ముందు), సాయంత్రం (5 గంటల తర్వాత) చల్లగా ఉండే సమయాల్లో మాత్రమే బయట తిరగనివ్వాలి. ముఖ్యంగా గేదెలు 80 శాతం ఎండవేడిమి స్వీకరించి, 20% వేడి మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తాయి. కాబట్టి పశువుల్ని మేతకు మండుటెండల్లో పంపించడం వల్ల మేత లభ్యంకాకపోగా, చాలా దూరం నడవడం వల్ల శక్తి కోల్పోతాయి. నీరసపడతాయని గమనించాలి.
* గృహవసతి యాజమాన్యం: 38 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న సందర్భాల్లో శీతల స్థితి కల్పించాలి. అందుకుగాను పశువుల కొట్టాలు 10-12 అడుగుల ఎత్తు ఉండేలా నిర్మించాలి. గాలి వీయడానికి అనుకూలంగా ప్రక్కగోడను పూర్తిగా కప్పివేయకుండా వదిలివేయాలి.
* వేసవిలో తాటాకుల కొట్టం పశువులకు అనుకూలంగా ఉంటుంది. సిమెంట& రేకుల షెడ్పై గడ్డిపరచి మధ్యాహ్నం వేళల్లో నీళ్ళు చిలకరిస్తుండాలి.
* వడగాలుల నిరోధానికి షెడ్ ఒక ప్రక్క పరదాలు కట్టి నీళ్ళు చల్లుతుండాలి.
* పాకల చుట్టూ త్వరగా ఎదిగి నీడను, పశుగ్రాసాన్నిచ్చే చెట్లు పెంచాలి. అవసరమైతే షెడ్లోపల ఫ్యాన్స్, కూలర్స్, స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేయాలి.
* పాకల్లో పశువుల్ని కిక్కిరిసి ఉంచకూడదు. ప్రతి ఆవుకు 3 చ.మీ. కనీస స్థలం ఉంచాలి.
* నీటి చెరువులు, కుంటలు ఉన్నచోట పశువులను నీళ్ళలో ఈదులాడనివ్వాలి.
* పశువులపై మధ్యాహ్నం వేళల్లో 3-4 సార్లు నీళ్ళు చల్లుతుండాలి. ఇలా చేయగలిగితే ఈదటానికి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉండదు.
* రాత్రి సమయంలో ఆరుబయట విడిచిపెట్టినచో వేడి నుండి ఉపశమనం లభిస్తుంది.
* పునరుత్పత్తి మెరుగుపరచడానికి ఎదలక్షణాలను క్రమంగా గమనించాలి. ఉదయం తోక, మడి వద్ద మట్టి అంటుకొని ఉందేమో చూడాలి. చల్లటి వేళల్లో (ఉదయం / సాయంత్ర సమయాల్లో) పశువులను కట్టించాలి.
ఈ విధంగా పశుపోషకులు మేలైన యాజమాన్య పద్ధతులు పశుపోషణ విషయాల్లో స్వల్ప శ్రద్ధ తీసుకోవటం ద్వారా ఎండవేడిమి బారి నుండి పశువుల్ని రక్షించుకోవాలి. డా. ఎ. అనిత, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎల్పిఎం విభాగం, ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, గన్నవరం – 521 102. ఫోన్: 9492514967
పాడి పశువుల నుండి పాల ఉత్పత్తి అధికం చేయడానికి పాల రైతు మార్గాలు వెతుకుతూ ఉంటాడు. తోటి వారితో సంభాషిస్తాడు. పశు వైద్యుని సూచనలను అమలు చేస్తాడు. నిపుణులను సంప్రదిస్తాడు. అనుభవజ్ఞుల సలహాలను ఆచరిస్తాడు. తన ఆవు ఎక్కువ పాలు ఇవ్వడం గర్వకారణం. దూడలు చెంగు చెంగున గంతులేస్తుంటే మనసు ఉప్పొంగి పోతుంది. అయినా నేలాకరున లెక్కలు చూసుకుంటే లాభం కనిపించాలి. ఎంత ప్రేమ, అభిమానం ఉన్నా డబ్బు మిగలకపొతే పశువులను ఎల్లకాలం మేపలేరు. పాల దిగుబడికి బాలింత పశువులు ముఖ్యం గనుక ఈనటానికి ఇరవై రోజులు ముందు, ఈనిన తరువాత మూడు నెలలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సమయం క్లిష్టమైనది, ముఖ్యమైనది. హార్మోన్లు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడి. ఆహారం చాలినంత తినలేవు. ప్రసవ వేదన వర్ణనాతీతం. శరీరంలో వేగంగా జరిగే మార్పులు. ఆందోళన, భయం, నీరసం, భ్రమ, మానసిక కల్లోలం ప్రతి తల్లిని ప్రసవ సమయంలో సహజంగా ఆవరిస్తాయి. ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
అందువలన పాడిపశువులు నిస్సత్తువతో నిస్సారమై పోకుండా రక్షించుకోవలసిన భాద్యత మనమీదే ఉంది. అందుకుగాను సమీకృతాహారాన్ని అందచేయాలి. అందులో మాంసకృత్తులు, పిండి పదార్ధములు, కొవ్వులు, పీచు, విటమినులు, ఖనిజాలు, లవణాలు, ఎంజైములతోబాటు మరికొన్ని ఆదరవులు (Additives) పొందు పరాచాలి. ఈ సంచికలో ఆదరవుల గురించి చర్చించుకుందాము.
ఫీడ్ అడిటివ్స్ (Feed Additives): మనభాషలో ఆదరవులు, సంకలనాలు అందాము. ప్రపంచ జనాభా పెరుగుతుంది. పెరుగుతున్న జనాభాకి ఆహారావసరాలు పెరుగుతున్నాయి. జంతు సంబంధమైన ఉత్పత్తుల అవసరాలు అధికమౌతున్నాయి. వృక్షాలనుండి లభించే గింజలు, దినుసులు ఒకప్పుడు పశువుల మేతగా ఉపయోగపడేవి. ఇప్పుడు వాటిని మానవులకు ఆహారంగాను, ఔషధాలలోను, సౌందర్య సాధనాలలోను విరివిగా వాడుతున్నారు. గనుక పశువుల మేత తయారీ కష్టంగానూ, ప్రియంగాను మారింది. పాడిపశువుల మేత ఖరీదు ఎక్కువ, రాబడి తక్కువ అవ్వడం మూలాన పాల ఉత్పత్తికి, మాంసం ఉత్పత్తికి పశువుల పెంపకం ఆశించిన మేరకు పొందాలంటే శాస్త్రపరమైన అవగాహన అవసరం. అనుకోని అవాంతరాలు ఏర్పడినపుడు వెంటనే తేరుకోవాలి. ఫలితాలు ఆశించిన విధంగా రావాలంటే మంచి పాలన, పోషణ జరగాలి. మేత ఖర్చు తగ్గించడానికి శాస్త్రజ్ఞులు మార్గాలు వెతుకుతున్నారు. నిరంతర పరిశోధనల ఫలితం కొత్త కొత్త ఆదరవులను తయారుచేసి ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగిస్తున్నారు.
ఒకప్పుడు పశు ఉత్పత్తులను పెంచడానికి అంటిబయోటిక్స్, హార్మోన్లు కొన్ని దేశాలలో విరివిగా వాడేవారు. మన దేశంలో పాలు పిండడానికి ఆక్సిటోసిన్ ఇంజక్షన్ ఇప్పటకీ కొన్ని చోట్ల వాడుతూనే ఉన్నారు. ఇవి మనుషుల ఆరోగ్యానికి చేటుచేస్తాయి గనుక ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వాటి వాడకం నిషేధించింది. పశ్చిమ దేశాల్లోను, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మొదలగు దేశాలలో వాటి స్థానే ఆదరవులు (Feed Additives) సంకలనాలు (Supplements) వాడకంలోకి వచ్చాయి.
నెమరు వేయు జంతువులలో వాడుకలో ఉన్న ఆదరవులు:
* ఆమైనో ఆసిడ్స్ * అంటిబయోటిక్స్
* అసిడిఫయర్స్ * అంటిఆక్సిడెంట్స్
* టాక్సిన్ బైన్డర్స్ * ఎంజైములు
* సుగంధ ద్రవ్యాలు* ఖనిజములు
* విటమినులు * బఫర్స్
* మొనేన్సిన్ * ప్రోబయోటిక్స్
* ఈస్ట్ * యుక్కా
ఫీడ్ అడిటివ్స్ అనబడు ఆదరవులు కొద్ది మోతాదులో, ఒకటి లేక మరిన్నికలియకలో పశువుల ఉత్పత్తి, ఆరోగ్యం, మెరుగవ్వడానికి సహకరిస్తాయి. తద్వారా పెరుగుదల, బరువు, ఆరోగ్యం, రోగనిరోధకశక్తి, ప్రత్యుత్పత్తి మెరుగవుతాయి.
అంటిబయోటిక్స్ సూక్షక్రిముల వలన కలుగు రోగాలను తగ్గించడానికి మాత్రమే వాడకానికి ఇప్పుడు అనుమతులున్నాయి. ఉత్పత్తి పెంచడానికి ఉపయోగించడం ప్రపంచమంతా నిషేధించారు. అంటిబయోటిక్స్ వాడకం విరివిగా విచ్చలవిడిగా విచిక్షణా రహితంగా జరగడం వలన సూక్ష్మక్రిములు (Bacteria) అలవాటుపడి ప్రతిఘటించడం మొదలుపెట్టి నాశనము కాకుండ బలాన్నిపెంచుకుని సూపర్ బగ్స్ (Superbugs) మారి పెద్దఎత్తున మానవ మరణాలకు దారితీస్తున్నాయి. హార్మోన్ల వాడకం వలన పశు ఉత్పత్తులలో వాటి అవశేషాలు ముఖ్యంగా బాల బాలికలలో తీవ్రమైన మార్పులు తీసుకు వస్తాయి. ఇంకా కేన్సర్, తదితర రోగాలకు కారణ మౌతున్నాయి. అందువలన ఇతర వస్తువులను, పదార్ధాలను ఉపయోగించి ఆరోగ్యకరమైన, హాని కలిగించని విధంగా ఆదరవులను తయారు చేస్తున్నారు. ఆమైనో ఆసిడ్లు, ఎంజైములు, ఖనిజములు, విటమినులు ఎప్పుడు ఎలా వాడాలో గత సంచికలలో తెలుసుకున్నాము. మిగిలిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము.
అసిడిఫయర్స్ (Acidifiers): ఫార్మిక్, సిట్రిక్, ప్రొపియోనిక్, లాక్టిక్. అసిటిక్, సోర్బిక్ అమ్లములను ప్రత్యేకంగా తయారుచేస్తారు. రూమేన్లో వాటి లక్షణాలు మారకుండా కేవలం ప్రేవులలో వినియోగం చెందేలా మార్పులు చేస్తారు. ఇంకా మేతలో దాగివున్న శిలీంధ్రాలను సైతం అణిచివేస్తాయి. కొవ్వు ఆమ్లముల (Fatty acids) తయారు చేస్తాయి.
అంటిఆక్సిడెంట్స్ (Antioxidants) : ఆహారంలో కొవ్వులుంటాయి. నిల్వ ఉంటే అవి మురిగి పోతాయి. చెడు వాసన వస్తాయి. జీర్ణం కావు. విటమిను ఏ, డి, ఈ లు, బి కాంప్లెక్స్ విటమినులు పనికిరాకుండా చేస్తాయి. లైసిన్ మొదలగు అమినో ఆసిడ్లు ఉపయోగపడవు. కొవ్వులు చెడిపోకుండా ఉండడానికి ఎతోక్సిక్యిన్ లేదా ఔకఊ మేతకు కలుపుతుంటారు.
టాక్సిన్ బైన్డర్స్ (Toxin Binders): మైకోటాక్సిన్స్ అనగా శిలీంద్రముల నుండి ఉద్భవించే విష పదార్ధములు. వాతావరణంలో తేమ వేడి ఎక్కువగా ఉన్నపుడు బూజు పడుతుంది. దానినుండి పుట్టే విషం మేతను కలుషితం చేసి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. విషాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు గనుక విషప్రభావం తగ్గించడానికి బైన్డర్స్ వాడతారు. ఈ బైన్డర్స్ విషాన్ని ఆకర్షించి జీర్ణం కాకుండా విష ప్రభావాన్ని తగ్గిస్తాయి. సోడియం బెంతోనైట్ అందుకు ఉపయోగపడుతుంది.
సుగంధ ద్రవ్యాలు: అవులకు సునిశితమైన ముక్కు, నోరు ఉన్నాయి. సువాసనలను, రుచిని ఆస్వాదించ గలవు. మంచి వాసన, రుచిగల ఆహారాన్ని సంతోషంగా తింటాయి. మనిషి నాలుక గొంతులో 9,000 రుచిమొగ్గలుంటే, ఆవు నాలుక గొంతులో 25,000 రుచి మొగ్గలున్నాయి. గనుక రుచికరమైన ఆహారాన్ని ఎంత ఇష్టంగా తింటాయో ఊహించండి. పాలు ఉత్పత్తి చేయాలంటే మేత తృప్తిగా తినాలికదా! వెల్లుల్లి, సోపు, నల్లజీలకర్ర వాసనలు ఇష్టపడతాయి. చెరుకు మడ్డిని ఆస్వాదిస్తాయి.
బఫర్స్: రూమేన్లో ఆమ్లములు పెరగడం వలన జీర్ణశక్తి తగ్గి అనారోగ్యానికి గురిచేస్తుంది. మేతలో గింజల నిష్పత్తి అధికమైతే ఆమ్లములు ముంచుకొస్తాయి. పేడ పలచబడుతుంది. నురగ వస్తుంది. తిన్నది జీర్ణంకాక గింజలు పేడతో బహిష్కరించబడతాయి. జీర్ణమవ్వని జొన్న, సజ్జ గింజలను పేడలో చూడవచ్చును. నివారణకు మెగ్నీషియం ఆక్సైడ్ వంటసోడాల మిశ్రమము ఉపయోగిస్తారు.
మొనేన్సిన్ :దీని వలన కొన్ని లాభాలున్నాయి. రూమేన్లోని సూక్ష్మక్రిములలో మంచివాటిని పెంపు చేస్తుంది. కీటోసిస్ వ్యాధి రాకుండ అడ్డుకుంటుంది. మొనేన్సిన్ అదనపు శక్తిని అందచేస్తుంది. అదనపు శక్తి బాలింత పశువుల పాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. ఇంకా కాక్సీడియోసిస్ వ్యాధిని రానివ్వదు.
అప్టిజెన్ :అంతరాయం లేకుండా నత్రజనిని నెమ్మదిగా విడుదల చేస్తూ రూమేన్లోని సూష్మకణ జీవుల వృద్దికి తోడ్పడుతుంది. కొంత మేరకు సోయ, ఆవ తదితర చెక్కలను తగ్గించ వచ్చును. జీర్ణశక్తి పెరిగి ఎక్కువ ఆహారం వినియోగపడుతుంది. పాల ఉత్పత్తి పెరుగుతుంది. దాణా తయారీలో నత్రజని కొరకు యూరియా కలుపుతుంటారు. నత్రజని శాతం పెరిగితే ప్రోటీన్ శాతం పరోక్షంగా పెరుగుతుంది. యూరియా తిన్న వెంటనే అమోనియా రక్తంలో అధికంగా కనిపిస్తుంది. తినడం అయిపోయిన తరువాత నత్రజని ప్రాబల్యం ఉండదు. అంటే యూరియా వలన ప్రయోజనం తాత్కాలికం. ఆప్టిజెన్ నెమ్మదిగ విడుదల అవ్వడంతో రోజంతా నత్రజని రక్తంలో ఉండడం మూలాన ప్రయోజనం ఎక్కువ సేపుంటుంది.
ప్రోబయోటిక్స్: ప్రతి ప్రాణి శరీరంలో సూష్మజీవులు మంచివి, హానికరమైనవి ఉంటాయి. వాతావరణం, ఒత్తడి, కాలుష్యం వలన శరీరం పట్టు తప్పినపుడు రోగనిరోధకశక్తి క్షీణించి హానికరమైన జీవుల ప్రభావం పెరిగి వ్యాధులు అంకురిస్తాయి. అలా జరగకుండా కాపాడడానికి మేలుచేసే సూష్మజీవులను మేతలో కలుపుతారు. పులిసిన పదార్ధములు మజ్జిగ, పెరుగు, తర్వాణి మొదలగు వాటిలో మేలు చేయు సూష్మ జీవులు అధికంగా ఉంటాయి.
ఈస్ట్: రూమేన్లో పీచు పదార్థాన్ని జీర్ణం చేయడానికి కొన్ని ప్రత్యేకతలు కలిగిన సూక్ష్మజీవులుంటాయి. వాటి సంఖ్య పెంచడానికి ఈస్ట్ కణాలు సహాయం చేస్తాయి. నెమరు వేయు జంతువుల ఆహారంలో పీచు ఎక్కువ. రొట్టె తయారీలో ఈస్ట్ను వాడతారు.
యుక్కా: రక్తంలో, పాలలో నత్రజని తగ్గిస్తుంది. అమ్మోనియా వాయువును అధీనంలో ఉంచుతుంది. రక్తంలో నత్రజని మితిమీరితే గర్భధారణ ఆలస్యమౌతుంది. యూరియా ఎక్కువ మోతాదులో దాణాలో కలపడం వలన దాణా ఖరీదు తగ్గవచ్చును. కాని ప్రత్యుత్పత్తికి ఇబ్బందులొస్తాయి.
అనయానిక్ సాల్ట్స్: అమోనియం క్లోరైడ్, అమోనియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, కేల్సియం క్లోరైడ్ మొదలగునవి పాలజ్వరం రాకుండా అడ్డుకుంటాయి. పాల ఉత్పత్తి ఉధృతంగా ఉన్న సమయంలో రక్తంలో కేల్సియం తగ్గకుండా చేస్తాయి. అవసరమైతే ఎముకలనుండి కాల్షియంను గ్రహించి రక్తంలో నింపుతాయి. రక్తంలో కాల్షియం సమస్థాయిలో ఉంచడానికి పారధార్మోన్ హార్మోన్ అవసరం. ఆనయానిక్ సాల్ట్స్ అందుకు ఉపయోగం. బాలింత ఆవు అధికంగా పాలు ఇస్తున్నపుడు రక్తంలోని కేల్సియం పాలద్వారా బయటకు పోతుంది. అలాంటప్పుడు కాల్షియం లోపం జరిగితే పాలజ్వరంతో పాడిపశువు అడ్డం పడుతుంది.
ఆదరవులు వాడకంలో తెలుసుకోవలసిన విషయాలు:
1. మన పాడిపశువు సామర్ధ్యం మనకు తెలిసి ఉండాలి. ఎన్ని పాలు ఇస్తుంది. ఎంతకాలం ఇస్తుంది. అన్న విషయాలు తెలియాలి. సాధారణ పశువులపై ఆశలు పెట్టుకుని అంచనాలు పెంచుకుని నిర్ణయాలు తీసుకుంటే భంగపడాలి.
2. పశువును బట్టి పోషణ ఉండాలి. ఉత్పత్తికి తగ్గ పోషణ ఉందా! లేకుంటే ఎక్కడ లోపం ఉందో తెలుసుకుని లోటుపాట్లు సరిదిద్దుకోవాలి.
3. పాలన అంటే పాడిపశువు సౌకర్యం ఉండడానికి మనం చేసే ప్రయత్నాలు. అందుకు కావాల్సిన వసతుల ఏర్పాట్లు. గాలి, వెలుతురు, నేల, పరుండే చోటు, తిరగడానికి జాగా, విశ్రాంతి ప్రదేశము, మల మూత్రాల తొలగింపు, దోమల, ఈగల బెడద, అందుబాటులో మేత, శుబ్రమైన నీరు మొదలగునవి. అన్నీ ముఖ్యమే.
4. ఆరోగ్యంగా ఉన్న పశువే ఉత్పత్తి పెంచగలదు. వ్యాధుల రక్షణకు అవసరమైన టీకాలు వేయించాలి. పొదుగు వాపు, కాళ్ల నొప్పులు పశువుల ఫారంలో అడుగు పెట్టకూడదు. పరిసరాల శుభ్రత పాటించాలి.
5. ప్రత్యుత్పత్తి మెరుగ్గా ఉంటేనే ప్రతి సంవత్సరం ఒక దూడని పెట్టి ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తాయి. పునరుత్పత్తి నిర్విగ్నం గా సాగాలంటే ‘ఎద’ కు వచ్చిన పశువును గుర్తించి సకాలంలో సంపర్కం చేయించడం అవసరం. యజమాని గమనిస్తూ ఉండాలి.
6. పైన ఉదాహరించిన ఆదరవులన్నిటిని ఆదరించలేము. నిపుణుల సలహాలు తీసుకోవాలి. సలహాలు ఇచ్చేవారికి మన ఫారం పద్ధతులు తెలిసి ఉండాలి. అప్పుడే పూర్తి న్యాయం జరుగుతుంది.
7. మనం తయారుచేసి మేపే మేతలో ఇవ్వన్నీ ఉండవు. బయట నుండి తెచ్చే దాణాలో తయారీదారు తనకు వీలున్న విధానంలో తయారుచేస్తాడు. గనుక మేత పూర్వాపరాలు నాణ్యత తెలియడానికి పరీక్షలు అవసరం.
8. ఖర్చు పెట్టినపుడు సరిపడా ఆదాయం వచ్చిందా! మనకి నచ్చిందని లేదా ఎవరో చెప్పారని అనవసరపు ఖర్చు చేస్తున్నామా అన్న విషయం తెలుసుకోవడం తెలిసి ఉండాలి.
పాడి రైతు, పశు పోషకుడు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఇదంతా చెప్పడం జరుగుతుంది. ఇక ముందు పాడిపశువులు ఫారాలలోనే ఉంటాయి. వ్యవసాయ భూములలో వాణిజ్య పంటలు పండుతున్నాయి. మరికొన్నిటిలో భవనాలు, కార్యాలయాలు మొలుస్తున్నాయి. ఇక చిన్నకమతాలెక్కడ సన్నకారు రైతులెక్కడ. రెండు మూడు ఆవులను గేదెలను ఎవరు సాకుతారు.
పెద్ద సంఖ్యలో భారీ పెట్టుబడులతో పెంచేవారికి కొంతైన అవగాహన ఉండాలి కదా. భవిష్యత్తులో తక్కువ జాగాలో పాడిపశువులను పెంచాల్సి ఉంటుంది. దొరకిన పశుగ్రసాలు వాడాల్సి ఉంటుంది. ఇకమీదట సగటు ఆవులు గేదెలు ఫారాల్లో ఉండవు. నాటు ఆవులు, గేదెలు సంకరజాతి లో మార్పుచెందడం జరిగింది. మనదైన ఒంగోలు, పుంగనూరు, పొడ తూర్పు పాల ఉత్పత్తికి వాణిజ్య పరంగా అనువైనవి కావని తేలింది. వాటిని కొన్ని పరిశోధన కేంద్రాలలో పెట్టి మెరుగు పరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాణిజ్య పరంగా పాల ఉత్పత్తి చేయాలంటే ఆధికంగా ఉత్పత్తి చేయగల ఆవులను, గేదెలను పెంచాల్సి ఉంటుంది.
అధికంగా పాలు పిండాలంటే …
1. జాతి ముఖ్యం. అందుకనే పాశ్చాత్య జాతులైన జెర్సీ, హోల్స్టీన్ ఫ్రిజియన్, బ్రౌన్ స్విస్ జాతులతో మన దేశవాళి పశువులను సంకరం చేస్తున్నాము.
2. మంచిజాతి పశువుకు అధిక పోషణ చేయాలి. మేత, ఆహారం, పోషక పదార్ధాల ఆవశ్యకతను తెలుసుకున్నాం. మేతతో బాటు శుభ్రమైన మంచి నీరు ఏర్పాటు చేయాలి.
3. సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పాటు చేయాలి. గాలి, వెలుతురు, నేల, చల్లదనం, సులభంగా తిరగడానికి వీలుండాలి.
4. ప్రేమ, అభిమానం, ఆదరణ చూపించాలి. అరవడం, కొట్టడం, భయపెట్టడం పనికిరావు.
5. రోగ నివారణ చేపట్టాలి. టీకాలు వేయించాలి. పొదుగు వాపు, కాళ్ల నొప్పులు, గర్భధారణ ఇక్కట్లు ఫారం లాభాలను కొల్లగొడతాయి.
6. పాల ఉత్పత్తికి ప్రత్యుత్పత్తి మూలాధారం. ఒట్టిపోయే సమయం తక్కువగా ఉండాలి. ఎక్కువ కాలం పాలు ఇస్తూ ఉండాలి. అలా జరగాలంటే గర్బాధారణ సకాలంలో జరగాలి.
7. యజమాని ద్రుష్టి కేంద్రీకృతమై ఉండాలి. పర్యవేక్షణ, తనిఖీలు తప్పని సరిగా చేస్తుండాలి.
8. సమాచారాన్ని నమోదు చేసుకుంటూ ఉండాలి. ప్రతి అవుకు సంబంధించిన సమాచారం సమయానికి ఉపయోగిస్తుంది. అది ఎంతో విలువైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. డానికి తోడు అనుభవం తోడైతే ఫారంలో పాల ఉత్పత్తి అభివృద్ధిపథంలో నడుస్తుంది.
ఇంతవరకు పోషణకు సంబంధించి మేత పరమైన విషయాలు తెలుసుకున్నాం. తదుపరి విషయం ప్రత్యుత్పత్తి. మున్ముందు తెలుసుకుందాం. డా. నాగేశ్వరరావు, ఫోన్: 96521 05405
షెడ్డు నిర్మాణము, స్థలం ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలు
* కోళ్ళ షెడ్డును వేరేవారి యొక్క కోళ్ళ షెడ్డుకు దూరంగా కట్టాలి. ఎందుకంటే అనివార్య కారణం వలన ఆ షెడ్డులో వచ్చిన వ్యాధులు ఈ షెడ్డుకు కూడా సంక్రమించవచ్చు. కనుక షెడ్డు నిర్మాణము 1-2 కి.మీ. దూరంలో నిర్మించాలి.
* షెడ్డును చెరువులు, కుంటలకు దూరంగా నిర్మించాలి. ఈ నీటి కొరకు వలస పకక్షులు మరియు పశువులు రావడం వలన ఆ పకక్షులకు మరియు పశువులకు ఏమైనా వ్యాధులు ఉన్నట్లయితే ఆ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నది.
* షెడ్డు సరిహద్దు చుట్టూ కంచెను నిర్మించాలి. అదే విధంగా లోపల వివిధ షెడ్డుల యొక్క పైర్లు మరియు నిషిద్ధ ప్రాంతము యందు ”బయటి వారు లోనికి రాకూడదు” వంటి బోర్డులను కట్టవలెను.
* షెడ్డులోనికి ధారాళంగా గాలి, వెలుతురు వచ్చు విధంగా నిర్మించాలి. తద్వారా షెడ్డు లోపలి వాతావరణం కోళ్ళకు అనుకూలంగా ఉండి కోళ్ళను ఒత్తిడి నుండి కాపాడటమే కాకుండా, షెడ్డులో వెలువడిన అమ్మోనియా వంటి వాయువులు బయటకు వెళ్ళిపోవును.
* షెడ్డు నిర్మాణాన్ని అక్కడున్న వాతావరణానికి అనుకూలంగా నిర్మించాలి. ఉదాహరణకు, వేడి, తేమ ఎక్కువ ఉన్న ప్రదేశములో తూర్పు, పడమర దిశలో నిర్మించాలి. తద్వారా ఎండ యొక్క వేడిమి లోపల ఉన్న కోళ్ళపై ప్రత్యక్షముగా పడకుండా కాపాడవచ్చు.
* షెడ్డు లోపలికి బయటి నుండి పకక్షులు రాకుండా జాలిని కట్టుకోవాలి.
* షెడ్డు చుట్టూ మురుగు నీరు నిలువ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
* షెడ్డు అడుగు భాగమును కాంక్రీటు వేసినట్లయితే సరైన పద్ధతిలో, సులువుగా నేలను శుభ్రపరచుకోవచ్చును.
* ప్రవేశ ద్వారమందు వాహనముల యొక్క చక్రములు శుభ్రపరచుటకు, షెడ్డుకు ముందు భాగమున పాదములు శుభ్రపరచుటకు అనుకూలంగా ఒక చిన్న ట్యాంక్ను నిర్మించి అందులో తగు మోతాదులో క్రిమిసంహారక మందును పోయవలెను. తద్వారా బయటినుండి లోపలకు వ్యాధికారక క్రిములు రాకుండా కాపాడవచ్చు.
* షెడ్డును నిర్మించే సమయంలో ఈ క్రమములో షెడ్డు నిర్మించాలి. మొదటగా పిల్లలను పొదిగే షెడ్డును తరువాత పెరిగే కోళ్ళను పెంచు షెడ్డును నిర్మించాలి.
* షెడ్డుకు-షెడ్డుకు మధ్య దూరము 30 అడుగులు ఉండేవిధంగా నిర్మించుకోవాలి.
షెడ్డులో పనిచేయువారు తీసుకొనవలసిన జాగ్రత్తలు
* ఫామ్ లోపలికి వెళ్ళే ముందు ముఖద్వారము వద్ద కాళ్ళు, చేతులు శుభ్రముగా కడుక్కోవలెను.
* ఫామ్లో పనిచేసేవారు శుభ్రమైన బట్టలు ధరించాలి. వారికి వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన ఉండాలి.
* ఏ షెడ్డులో పనిచేయువారు ఆ షెడ్డుకు మాత్రమే వెళ్ళవలెను. వేరే షెడ్డుకు వెళ్ళిన ఎడల, ఒకవేళ తను పనిచేసే షెడ్డులో ఏమైనా వ్యాధులు ఉన్నట్లయితే వేరే షెడ్డుకు కూడా వ్యాధులు వ్యాపించవచ్చు.
* అవసరమున్నప్పుడు మాత్రమే షెడ్డు యొక్క తాళము తెరువవలెను. మిగిలిన సమయంలో మూసి ఉంచి తాళం వేయవలెను.
షెడ్డు లోపల తీసుకొనవలసిన జాగ్రత్తలు
* ఒకవేళ ఇంతకు ముందు షెడ్డులో వ్యాధులు వ్యాపించి ఉన్నట్లయితే ఆ షెడ్డును శుభ్రముగా శుభ్రపరచి 3 వారాలు వేచి వున్న తరువాత కొత్త బ్యాచ్ను ప్రారంభించాలి.
* షెడ్డు లోపల కీటకాల నివారణ చర్యలు చేపట్టవలెను లేని ఎడల ఈ కీటకాలు వ్యాధి వ్యాప్తిలో వాహకముగా పనిచేస్తాయి.
* ఎలుకలు, పందికొక్కుల నివారణ కూడా చేయవలెను. ఇవి కూడా వ్యాధి వ్యాపించడంలో తోడ్పడుతాయి.
* వ్యాధులు వ్యాపించడానికి ముఖ్యకారణం షెడ్డును శుభ్రంగా ఉంచుకోకపోవడం, ప్రభావవంతంగా షెడ్డును శుభ్రపరిచి క్రిమిసంహారక మందులు వాడి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టినట్లయితే చాలావరకు వ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు.
* పరిశుభ్రమైన, పరిశుద్ధమైన మంచి నీరు కోళ్ళకు ఎల్లవేళలా అందేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
* షెడ్డు యందు ఉపయోగించు అన్ని పరికరములను శుభ్రముగా కడగాలి. ముఖ్యంగా దాణా మరియు నీటి తొట్లను ప్రతిరోజు శుభ్రంగా కడగాలి.
* క్రమబద్ధంగా బ్లోల్యాంప్తో కేజ్లను శుభ్రపరచాలి. కేజ్లను శుభ్రపరిచే ముందు పేరుకుపోయిన కోళ్ళ రెట్టలను తీసి వేయాలి.
* లిట్టర్ యందు తడి తనము లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేని ఎడల శిలీంధ్రాలు పెరిగి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది.
* చనిపోయిన కోళ్ళను ఎప్పటికప్పుడు తీసివేయాలి. వాటికి శవ పరీక్షలు పశువైద్యుని సహాయంతో జరిపించి పూడ్చి వేయాలి. శవ పరీక్షల ఆధారంగా పశువైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి.
* ఎల్లవేళలా పరిశుభ్రమైన సమీకృత దాణాను ఇవ్వాలి.
* క్రమబద్ధంగా మందులు, వ్యాధినిరోధక టీకాలు ఇవ్వాలి. తద్వారా కోళ్ళు వ్యాధినిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి.
డా. సి.హెచ్. శివప్రసాద్, సహాయ ఆచార్యులు ఞ అధిపతి, పశుగణ క్షేత్ర సముదాయం, పశువైద్య కళాశాల, కోరుట్ల. ఫోన్: 9866392292
కరోనా ప్రభావం తగ్గిపోతున్నది. చలికాలపు పంటలు చేతికొచ్చే సమయం. వేసవిలో ఎండలు సాధారణం కంటే ఎక్కువ వుంటాయనే ప్రెడిక్షన్లు. ఇలాంటి పరిస్థితుల్లో ఏప్రిల్ (రేవతి, అశ్విని, భరణి కార్తె తొలి రోజులు)లో వివిధ పంటలలో ఆచరించవలసిన పనులను గురించి తెలుసుకుందాం. పంటల నమ్ముకునేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి కూడా తెలుసుకుందాం.
వరి: వార్తల్లో విశేషంగా వినిపిస్తూ, రాజకీయాలతో ముడిపడిన పంట. నవంబరులో విత్తిన వరి పంట కోతలు ఏప్రిల్లో ఉంటాయి. కొన్ని చోట్ల ఈ నెలలో ఈదురుగాలులు, వడగండ్ల వానలు వచ్చి తయారైన పంట దెబ్బతినవచ్చు. వీటి నుండి వీలైనంత వరకు తప్పించుకోవాలంటే, పంట తయారైన వెంటనే కోయాలి. యంత్రాల సహాయం తీసుకుంటే పని తొందరగా అవుతుంది. పిలక, పూత, పాలుపోసుకొను, గింజ గట్టిపడుథ వరకు భూమిలో తేమ తగ్గకుండా ఉంచితే నూక శాతం బాగా తగ్గి, గట్టి బియ్యం ఎక్కువగా వస్తాయి. పంట కోసినాక ఏప్రిల్ ఎండల్లో తెగ ఎండితే, ఎక్కువగా నూకలొస్తాయి. కాబట్టి వడ్లను మోతాదుగానే ఆరనివ్వాలి. రైతులకు మేలు చేయాలంటే ప్రభుత్వాలు రైతుల దగ్గర కొని ఎక్స్పోర్ట్ చేయడానికి అపార అవకాశాలున్నాయి. అప్పుగా ఎక్స్పోర్ట్ చేసి, తర్వాత వడ్డీతో సహా వసూలు చేసుకుంటే నష్టాలు అంతగా ఉండవు. లాభాలు కూడా రావచ్చు. కొద్దిపాటి నష్టాలున్నా ప్రభుత్వాలు భరిస్తే ఆ ప్రభుత్వాలకు రైతుల్లో మహామంచి పేరొస్తుంది. పాతబియ్యానికి ఎక్కువ ధర వస్తుంది. వీలున్న రైతులు, రైతు సంఘాలు వడ్లను నిల్వ చేసి, పాతవయినాక బియ్యం చేసి అమ్మవచ్చు. వరి నిల్వకు పల్లెల్లో ఖాళీగా ఉన్న రూములు/ఇండ్లు వాడవచ్చు. ఎడగారు (రాయలసీమ), కత్తెర (తెలంగాణ), షష్ఠికం (ఉత్తరకోస్తా) పంటల పేరుతో ఈ నెలలో వరి విత్తే రైతులు, వరికి బదులుగా పశుగ్రాసాలు, పూలు అధిక ధరలు పలికే కూరగాయలు పంట పెట్టవచ్చు. ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఎక్కువ భూమిలో సాగు చేయవచ్చు. స్వంత అవసరాలకు వీలైనంత వరకు సేంద్రియ పద్ధతిలో పండించాలనే రైతులకు ఈ నెల గొప్ప సదవకాశం. కనీసం పాతిక లేక అర ఎకరంలో సేంద్రియ పద్ధతిలో పండించి ఎక్కువగా ఉన్న పంటను అధిక ధరలకు అమ్ముకోవచ్చు. ప్రతి సంవత్సరం, విస్తీర్ణాన్ని కొద్దికొద్దిగా పెంచుతూ పోతూ, కొన్నేళ్ళల్లో మొత్తం సేంద్రియ పద్ధతిలోకి అదీ దిగుబడులు తగ్గకుండా పండించవచ్చు. మనుషుల, పంటల మరియు భూమి ఆరోగ్యంతో పాటు డబ్బు లాభాలు స్వంతం చేసుకోవచ్చు. ఇండ్ల ముందరకొచ్చి వడ్లను బియ్యం చేసే చిన్న మిషన్లను ప్రభుత్వాలు సబ్సిడీమీద ఇస్తే పెద్ద మిల్లుల మీద ఆధారపడడం తగ్గి రైతులు బాగుపడతారు.
జొన్న: హైదరాబాద్లో జొన్న పిండి కిలో 70 రూపాయలకు రిటైల్గా అమ్ముతున్నారు. రైతుకు మంచి ధర వస్తుంది. జనవరిలో విత్తిన జొన్నలో కంకినల్లి, గింజబూజు ఆశించే అవకాశమున్నది. వీటి నివారణకు తగిన సస్యరక్షణ చర్యలు ఏప్రిల్లో తీసుకోవాలి.
సజ్జ:పంట కోతలు ఈ నెలలో ఉంటాయి. పిలక కంకుల కంటే, ప్రధాన కాండపు కంకి ముందుగా కోత కొస్తుంది. అందువలన కనీసం రెండుసార్లయినా కంకులు కోయాలొస్సుంది.
పెసర, మినుము: ఈ పంటల కోతలు ఏప్రిల్లో ఉంటాయి. ఊరి సంఘాలు రిటైల్గా అమ్మకాలు మొదలుపెడితే, మధ్యవర్తుల లాభాలు కూడా రైతులకే దక్కుతాయి. ఊరందరి వినియోగదారులకు తక్కువ ధరకు, పెసరపప్పు, మినపప్పు దొరుకుతుంది.
వేరుశనగ: డిశంబరులో విత్తిన వేరుశనగను ఏప్రిల్లో భూమిలో నుండి తీయాల్సుంటుంది. కాయలు తెగిపోకుండా భూమినుండి బయటకు తీయాలంటే, భూమిలో తగినంత తేమ ఉండాలి. ట్రాక్టరుతో నడిచే బ్లేడు గుంటక లేక వేరుశనగ డిగ్గర్ను వాడవచ్చు. పారనాగలి (నాగలి చివర పార ఉన్నది) కూడా ఉపయోగించవచ్చు. తక్కువ ధర వేరుశనగ డిగ్గర్లను ప్రాచుర్యంలోకి తేవాల్సిన అవసరముంది. సబ్సిడీలో సప్లయి చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాయలను చెనిగి చెట్ల నుండి వేరుచేయడానికి స్ట్రిప్పర్ను ఉపయోగించి త్వరగా పని ముగించవచ్చు. ప్రతి ఊరిసంఘం అద్దె పాత్రిపదికన యంత్రాలను రైతులకు సప్లయి చేయవచ్చు. సబ్సిడీ మీద ఇలాంటి యంత్రాలను ఇంకా ఎక్కువగా ఇచ్చి ప్రోత్సహించాలి. ఈ నెలలో పండిన కాయలను విత్తనానికి వాడాలంటే, నీడలో ఆరబెట్టాలి. ఎండలు తీవ్రంగా ఉండుట వలన ఎండలో ఆరబెడితే మొలకశాతం బాగా తగ్గుతుంది. కాయలను నిల్వ చేయాలంటే తేమ శాతం 9 కంటే తక్కువ ఉండాలి. పచ్చికాయగా అమ్ముకోవాలంటే, మట్టి లేకుండా శుభ్రం చేసి అమ్మితే ఎక్కువ రేటొస్తుంది.
కొత్తిమీర: ఎండవేడి ఎక్కువగా ఉన్నందున ఏప్రిల్, మే నెలలో కొత్తిమీర సరిగా ఎదగదు. కొంత నీడ, కొంత ఎండ ఉంటే ఎండాకాలంలో కొత్తిమీర బాగా వస్తుంది. షేడ్నెట్లు సబ్సిడీలో దొరుకుతుంటే తీసుకొని మంచి కొత్తిమీర పంట తీయవచ్చు. ఆర్థిక సంవత్సరంలో తొలి నెల నుండి ఏప్రిల్, మే నెలల్లో కూడా సబ్సిడీ మీద షేడ్నెట్లు దొరికే విధంగా ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకుంటే రైతులుకు మేలు జరుగుతుంది. చౌడు భూముల్లో సాధారణ రకాల కొత్తిమీర సరిగా ఎదగదు. కో-2 అనే రకం చౌడు భూముల్లో కూడా వస్తుంది. సాధారణ నేలల్లో విత్తడానికి అధిక ఆకుదిగుబడినిచ్చే రకాలు: ఆర్.సి.ఆర్-446, ద్వా-3, పంత్హరితిమా, హిస్సార్ ఆనంద్, సాధన, కో-1, కో-2, కో-3.
పొదీన: మసాలా కూరల్లో విరివిగా వాడే పుదీనా ఆకుకు కూడా ఎండాకాలంలో మంచి గిరాకీ ఉంటుంది. రంజాన్ నెల కూడా ఏప్రిల్లో ఉన్నందున దీనికి మంచి గిరాకీ ఉండే అవకాశముంది. ఈ పంటను, కాండపు ముక్కల ద్వారా మరియు వేర్ల ద్వారా వ్యాప్తి చేస్తారు. ఎకరా పొలానికి 3-4 క్వింటాళ్ళ కాండపు ముక్కలు నాటడానికి అవసరముంటాయి. వరుసల మధ్య 45 సెం.మీ. కాండపు ముక్కలు నాటి, మట్టితో కప్పాలి. చిగురు వచ్చి తీగలుగా ఎదుగుతాయి. దిగుబడి: 15-20 టన్నులు/ఎకరాకు. అనువైన రకాలు: సక్షమ్, కోసి, శిలిక్, హిమాలయ.
పాలకూర: అత్యధిక పోషక విలువలు గలిగిన ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. ఇందులో ఇనుము, కాల్షియం, మాంసకృత్తులు, విటమిన్ ఎ, సి, పుష్కలంగా ఉంటాయి. అధిక దిగుబడి రావాలంటే ఉదజని సూచిక 7.0 కు దగ్గర గా ఉన్న భూములు అత్యంత అనుకూలం. అయినా ఉదజని సూచిక 10.5 ఉన్న అధిక క్షారనేలల్లో కూడా, ఈ పంట తీసుకోవచ్చు. అత్యధిక దిగుబడినిచ్చే రకాలు: ఊటీ-1: దిగుబడి 24 ట/ఎ., జాంనగర్ గ్రీన్ : దిగుబడి 16-19 ట/ఎ.
సిరికూర:కాండం కూడా కూరగా ఉపయోగపడుతుంది. దిగుబడి : 4-5 ట/ఎ.
మెంతికూర:ఆకు కోసం సంవత్సరమంతా సాగు చేయవచ్చు.విత్తిన 25-30 రోజులకు మొదటి కోత, తర్వాత 10-15 రోజుల కొకకోత 2-3 కోతలు తీసుకోవచ్చు. అనుకూలమైన రకాలు: గుజరాత్ మేథి, లాంమేథి-1 (ఎల్.ఎఫ్.సి-84), లాంమేథి-2 (ఎల్.ఎఫ్.సి-103).
టమాట: ప్రాజెక్టుల్లో చెరువుల్లో బాగా నీరున్నందున భూగర్భ జలాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. టమాట సాగు చేయడం రైతులకు బాగా వచ్చు. ఎక్కువ విస్తీర్ణంలో పంట పెట్టడం వలన దిగుబడి ఎక్కువగా వస్తున్నది. వాతావరణంలో ఎండ బాగా ఉంటే దిగుబడి బాగుంటుంది. మేఘావృతమైతే దిగుబడి బాగా పడిపోతుంది. ప్రస్తుతం ధరలు తక్కువగా ఉన్నాయి. మేఘావృతమైన వాతావరణం ఏర్పడితే తప్ప దిగుబడి తగ్గదు. ధరలు పెరగవు. మంచి ధరలు రావాలంటే విస్తీర్ణాన్ని నియంత్రించాలి. తక్కువ రేట్లున్నపుడు టమాటతో విలువ పెంచే పదార్థాలు (వాల్యూయాడెడ్ ప్రాడక్ట్సు) చేసి విక్రయించుకోవాలి.
వంగ:టమాట ధరల కంటే వంగ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఈ పంట కాలం ఎక్కువవడం వలన రైతులు ఈ పంటపై తక్కువ మొగ్గుచూపుతున్నారు. ప్రాంతాలవారీగా వేరు వేరు రకాలను ఇష్టపడుట వలన అన్ని ప్రాంతాలకు అనువైన రకాలు. ఉత్పిత్తి తక్కువ. టమాట రేట్లతో పోలిస్తే ఈ పంట రేట్లు ఒడిదుడుకులు లేకుండా మధ్యస్థంగా ఉంటున్నాయి. నల్ల రకాల కంటే తెల్ల వంకాయలకు ధర ఎక్కువ. పుచ్చులను తెల్లరకాలలో గుర్తు పట్టడం సులభం కావడం కూడా తెల్లవంకాయల గిరాకీకి కారణం.
కీరదోస:ఎండలు ముదిరేకొద్దీ ఈ పంటకు గిరాకీ ఎక్కువ. పాలీహౌస్లు, నెట్హౌస్ల విస్తీర్ణం మరియు దిగుబడి పెరుగుతున్నది. కీరదోసపై ప్రజాదరణ కూడా పెరుగుతున్నది. ప్రతి ఫంక్షన్లోను కీరదోస ముక్కలు సాలాడ్గా పెట్టడం అలవాటైపోతున్నది. అందువలన, ఇప్పట్లో ఈ పంటకు మంచి ధరలే ఉండే అవకాశమున్నది. అనుకూలమైన ఆడ, మగ వేర్పాటు లేని (పార్థినోకార్పిక్) రకాలు: సన్-9728, సన&-3019, కియోన్.
కూరమిరప/కాప్సికం/బెంగుళూరు మిర్చి:పల్లెల్లో కూడా ఫాస్ట్ ఫుడ్స్ తినడం పెరిగిపోవడం, చైనీస్ వంటకాలైన నూడుల్స్ వంటి వాటికి ప్రజలు ఆకర్షితులవడం ఈ పంటకు గిరాకీ పెంచుతున్నది. ఎండాకాలంలో శుభకార్యాలు, ఫంక్షన్లు ఎక్కువగా ఉంటాయి. దీనికితోడు అనుకూలమైన, అత్యధిక దిగుబడి (40ట/ఎ) నివ్వగల హైబ్రిడ్లు, హరిత గృహాల్లో పండించడానికి విత్తనాలు బజార్లో పుష్కలంగా దొరుకుతున్నాయి. కొన్ని మంచి హైబ్రిడ్లు: ఎరుపు: ట్రిపుల స్టార్, నతాషా, ఇన్స్పిరేషన్, బోంబె, పసరిల్లా. పసుపు: సన్యెజ్, ఓరోబెల్లి, బచ్చాట, స్వర్ణ, ఆకుపచ్చ: యమున, ఇంద్ర.
చేమగడ్డ:ఏప్రిల్లో కూడా వీటిని నాటవచ్చు. అరటి, కొబ్బరి వంటి తోటల్లో అంతర పంటగా దీనిని సాగు చేయవచ్చు. చేమ దుంపల పొలంలో మొదటి 2 నెలల్లో పంట పూర్తయ్యే ఫ్రెంచ్ బీన్స్, ముల్లంగి పంటలను అంతర పంటలుగా సాగు చేసి అధికాదాయాన్ని పొందవచ్చు. మంచి రకాలు: భావపురి (కె.సి.ఎస్-2): 8 నెలలు, 14 ట/ఎ. కె.సి.ఎస్-3: 5 నెలలు, 9.6 ట/ఎ. విత్తనంగా తల్లి దుంపల నుండి పిలకదుంపలు వాడినప్పటి కంటే ఎక్కువ దిగుబడి పొందవచ్చు. విత్తడానికి 300-400 కిలోలు/ఎకరానికి దుంపలు అవసరం.
అల్లం: ఈ పంట విత్తడానికి ఏప్రిల్ తొలివారం నుండి మే కడ వరకు అనుకూలం. జూన్-జులైల్లో గాలులతో కూడిన అధిక వర్షాలకు పడిపోకుండా అల్లం మొక్కలు నిలదొక్కుకోవాలంటే ముందుగా విత్తడం అవసరం. భూమిలో తేమ తగినంతగా లేకపోతే నీటి తడి ఇచ్చి లేకపోతే వర్షం బాగా పడినాక విత్తుకోవాలి. ఎక్కువ ఎండ, ఎక్కువ వేడి, ఎక్కువ తేమ ఉన్న ప్రాంతాలు అల్లం దిగుబడికి అత్యంత అనుకూలం. పాక్షికంగా నీడ ఉండే ద్రాక్ష, నిమ్మ, బొప్పాయి, మామిడి, కొబ్బరి, జామ తోటలు పందిరి కూరగాయ తోటల్లోను ఈ పంటను పండించవచ్చు. అధిక పచ్చి అల్లం మరియు ఎండు అల్లం కొరకు అనువైన రకాలు తెలంగాణకు : మారన్, రియోడిజనీరో. ఆంధ్రప్రదేశ్కు : వైనాడ్ లోకల్, రియోడిజనీరో.
పసుపు: ఈ పంట తవ్వి తీయడం ఏప్రిల్లో ఉంటుంది. ఉడకబెట్టడం, ఆరబెట్టడం, పాలిషింగ్, గ్రేడింగ్, మార్కెట్కు పంపుట ఈ నెలలో ఉంటాయి. ట్రాక్టరుతో త్రవ్వించడం వలన ఎక్కువ విస్తీర్ణంలోని పంటను వెలికి తీయవచ్చు. తక్కువ గాయాలు తగిలిన దుంపలు పొందవచ్చు. ఈ పద్ధతిలో భూమిలో మిగిలిపోయే దుంపలు కూడా తక్కువ.
నిమ్మ, బత్తాయి:కొమ్మ కత్తిరింపులు, వేరుమూలాల్నుండి పెరిగే కొమ్మలు, కాండంపై 2 అడుగుల వరకు పెరిగే కొమ్మలు, నీడన ఉన్న అనవసరమైన, ఎండిన పుల్లలను కత్తిరించాలి. కత్తిరించిన చోట బోర్డోపేస్టు పూసి తెగుళ్ళు సోకకుండా కాపాడవచ్చు.
పశువుల మేత: ఎండల్లో పచ్చిమేతకు మంచిగిరాకీ. ఈ నెలలో విత్తదగిన పశుగ్రాస పంట: జొన్న, పి.సి.-6 అనే రకం సున్నారపు నేలల్లో కూడా పెరుగుతుంది. ముందుగా విత్తిన పశువుల మేత పంటల నుండి, మేతను సేకరించి బాగా ఎక్కువ ధరకు ఎండాకాలంలో అమ్ముకునే వీలుంది.
మామిడి:ఈ పంటకు నీటి తడులను ఆపాలి. బాగా తయారైన లేత ఆకుపచ్చ రంగున్న కాయలు, అందులో కండ లేత పసుపు రంగుకు మారినటువంటి కాయలు కోయడానికి అనుకూలం. మామిడి కాయలను ఇథిలిన్ వాయువుతో మాగబెట్టవచ్చు. కాల్షియం కార్బైడ్ ద్వారా మాగబెట్టరాదు.
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి దేశీయ ఆవులను సబ్సిడీ రూపంలో ఇస్తే రైతుల, ప్రజల ఆరోగ్యానికి సేవ చేసినట్లవుతుంది.
పలు పంటలపైన, రైతు సంఘాలపైన సలహాలు, సూచనలు పొందగోరే వారు 9494408619 కు ఫోను చేయవచ్చు. సంఘాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఏర్పాటు చేయించుకోవచ్చు. ఫేస్బుక్లో SALLA NARAYANASWAMY/Profsnswamy అకౌంట్లలో పోస్టింగులలో వివిధ విషయాలపై వివరణలను, ఫొటోలతో సహా చూడవచ్చు. సలహాలు, సూచనలు రైతులకు ఉచితం.
ఒకప్పుడు పసిపాపలు, రోగులు, వృద్ధులకు అవసరమైన పాలను కల్తీచేయుట మహాపాపమని మన పూర్వీకులు భావించేవారు. కానీ సమాజంలో స్వార్థము, ధనకాంక్ష పెరిగి నైతిక విలువలు క్షీణిస్తున్నకొద్దీ ప్రజల నిత్యావసరమైన పాలను నీరు మరియు వివిధ ఇతర పదార్థాలు, రసాయనాలను కలిపి కల్తీ చేసి విక్రయించే వాణిజ్య విషసంస్కృతి పెరిగిపోతూ ఉంది. వివిధ రకాల కల్తీలను వ్యాపారులు కనిపెడ్తూవుండగా, వాటిని కనుగొని, గుర్తించి నియంత్రించే సాంకేతిక విధానాలను కూడా మన శాస్త్రజ్ఞులు ఆవిష్కరిస్తూనే ఉన్నారు. పాలలోని విలువైన పోషక ఘనపదార్థాలైన వెన్న, వెన్నకాని పదార్థాలను వివిధ మార్గాల ద్వారా తొలగించి, పాల విలువను, నాణ్యతను తగ్గించుట కూడా కల్తీ క్రిందనే భావించబడ్తుంది. అముల్, విజయ, విశాఖ వంటి పేరెన్నికగన్న బ్రాండ్ల పాలు, పాల పదార్థాలకు నకిలీ బ్రాండ్లు తయారు చేసి మార్కెట్లో విక్రయించుట ద్వారా ట్రేడ్ మార్క్ చట్టానికి సైతం తూట్లు పొడుస్తున్న నకిలీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపవలసిన ప్రభుత్వం ఆశించిన స్థాయిలో తనవంతు పాత్రను నిర్వహించకపోవుట దురదృష్టకరము.
పాల కల్తీ వల్ల ముప్పు – ఎలా?
1. వినియోగదారుడు కొనుగోలు చేసిన పాలలో ఉండవలసిన పరిమాణంలో పోషక నపదార్థాలు తగ్గిపోవుట వల్ల ఆర్థికపరమైన నష్టము
2. పాల మీద ఆధారపడే పసిపిల్లలు, వృద్ధులు, రోగులకు అందవలసిన స్థాయిలో పోషకాలు అందనందువల్ల ఎదురయ్యే పోషకాహార లోపాలు
3. అనేక అంటురోగక్రిములు కలిగిన మురుగు-అశుభ్రమైన నీటితో కలుషితమైన నీటితో కల్తీ చేయబడిన పాలు మరియు సీసము, నైట్రేట్, మెర్క్యూరీ వంటి పారిశ్రామిక వ్యర్థాలను కలిగిన నీటితో కల్తీ చేయబడిన పాలమీద దీర్ఘకాలం ఆధారపడే వినియోగదారులు తీవ్రమైన అనారోగ్యాలకు గురౌతున్నారు.
4. పచ్చి పాలను ఎక్కువ గంటలు-రోజులు నిల్వ ఉంచాలనే దురుద్దేశంతో ఫార్మలిన్ యాంటీబయోటిక్స్, సోడాబైకార్బొనేటు (వంటసోడా), డైక్రొమేట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫినాయిల్, యూరియా, డిటర్జంటు వంటి ప్రమాదకరమైన రసాయనాలను కలుపుట. కల్తీకి వినియోగించే కొన్ని పదార్థాలు కిడ్నీ, చర్మం, ఊపిరితిత్తులు, గుండె సంబంధ వ్యాధులే కాక కాన్సర్స్ను కలిగించి ప్రాణాలకే ముప్పు తేవచ్చును.
5. వివిధ రకాల అన్యపదార్థాలతో పాలను కల్తీ చేయుట వల్ల పాలు సహజమైన రుచి, వాసన, నాణ్యతలను కోల్పోవటమేకాక ఈపాలతో చేసిన పాలపొడి పెరుగు, మజ్జిగ, కోవా, వెన్న, నెయ్యి వంటి పదార్థాల నాణ్యత కూడా క్షీణిస్తుంది. కొందరు వెన్న తీయగా వచ్చిన ‘వే’ ద్రవాన్ని పాలలో కల్తీ చేసి నీళ్ళు కిసిన పాలలో ఎస్.ఎస్.ఎఫ్ శాతాన్ని పెంచే కుతంత్రాలు కూడా పాల్పడవచ్చు. ఇందువల్ల పాలు విరిగిపోకుండా ఇతర రసాయనాలను కలిపి జాగ్రత్తపడ్తూ ఉంటాయి.
6. వివిధ రుతువుల మధ్య పాల ఉత్పత్తిలో భారీ వ్యత్యాసాలు కనిపించే గేదె పాడి ప్రాంతాలలో, పాల కొరత మరియు గిరాకీలు ఎక్కువగా ఉండే రోజులలో ముఖ్యంగా వేసవిలోనూ, పెళ్ళిళ్లు, జాతరలు, ఇతర పర్వదినాల సందర్భాలలో కల్తీ సమస్య మనకు ఎక్కువగా కనిపిస్తుంది.
వివిధ రకాల కల్తీలు:
నీటితో పాలను కల్తీ చేయుట: పచ్చి పాలను సన్నని ధారగా గ్లాసు మీదగానీ స్టీల్ ప్లేటు మీదగానీ వీలుగా జారవిడిస్తే నీరు కలిసిన పాలలో లోపించిన చిక్కదనం స్పష్టంగా కనిపిస్తుంది. పాలలో సహజంగా ఉండవలసిన కనీస వెన్న (గేదెపాలు 6 శాతం – ఆవుపాలలో 3.0 శాతం) వెన్న కాని పదార్థం (గేదెపాలు 9.0 శాతం – ఆవుపాలలో 8.5శాతం) లేకపోవడాన్ని లాక్టోమీటరు మరియు బ్యుటిరోమీటరు లేదా ఎలక్ట్రానిక్ మిల్క్ టెస్టింగ్ మిషన్ల ద్వారా సులువుగా కనుగొనవచ్చును. అయితే పాలలో అత్యంత తేలికగా ఉండే వెన్నను (క్రొవ్వును) తొలగించి, ఆ తర్వాత అదేపాలను కొంత నీటితో కల్తీ చేస్తే పాల సాంద్రత అంతగా మారకపోవచ్చును. ఇటువంటి ద్విముఖ మోసాల పట్ల కూడా వినియోగదారులు జాగ్రత్తపడాలి. పాల విక్రయస్థాయిలో పాలప్యాకెట్ల నుండి సిరంజిలతో పాలను తస్కరించి నీటితో భర్తీ చేసే సంఘటనలు కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి.
ఆవుపాలలో, నీటితోపాటు గేదె పాలను కలిపి విక్రయించుట
పర్వదినాలలో ఆవుపాలు అవసరమైన వినియోగదారులకు ఆవుపాలతో, గేదెపాలతోనే కాక నీటితో కొందరు కల్తీ చేసి విక్రయిస్తున్నారు. అనేక డెయిరీలు ఆవుపాల ఉత్పత్తిని ప్రోత్సహించుటకు ఆవుపాలలోని ఘనపదార్థాలకు అదనపు ధరను చెల్లిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. ఇటువంటి సందర్భాలలో నీళ్లతోపాటు గేదెపాలతో ఆవు పాలను కల్తీ చేయడాన్ని హంసటెస్టు అనే సులువుగా క్షేత్ర స్థాయిలోనే నిముషాలలో జరుపగల సీరం టెస్టింగుతో గుర్తించవచ్చును.
ఇటీవల ఆర్గానిక్ దేశీ ఆవుపాలకు గేదె పాలకంటే రెట్టింపు ధర పలుకుతోంది. దీనిని ఆసరాగా తీసుకొని దేశీఆవుపాలలో విదేశీ ఆవుల పాలను, గేదె పాలను, నీటిని, కొన్ని సందర్భాలలో పసుపు నీటిని కలిపి మోసాలు చేస్తున్నారు. నీరుతోపాటు పశువుల మూత్రం, తెల్ల పెయింట్, రిఫైన్డ్ ఆయిల్, ఆల్కలీ యూరియా, డిటర్జంట్, మెలామిన్ వంటి ప్రమాదకరమైన రసాయన పదార్థాలను చక్కెర, వంటనూనెలు, జంతువుల క్రొవ్వులు, నీటితో కలిపి కృత్రిమ పాలుగా చేసి, అసలు పాలతో కలిపి మార్కెట్లో విక్రయిస్తూ అత్యంత ఏహ్యమైన మోసాలకు కూడా కొందరు పాల్పడుతున్నారు. ఇటువంటి పాలకు సహజమైన, రంగు, రుచి, వాసనలు ఉండవు. ఈ పాలు సాధారణ గది ఉష్ణోగ్రతలో సైతం 6-7 గంటలు పులిసిపోకుండా, విరిగి పోకుండా, తోడు పెడితే పెరుగుగా మారకుండా ఉంటాయి. అనుమానించిన వెంటనే ఈ పాల నమూనాలను సంబంధిత కల్తీ నిరోధక శాఖ అధికారులకు పాల నమూనాతో సహా ఫిర్యాదు చేస్తే, వారు కొన్ని రసాయన పరీక్షలు, ఎలీసా, ఫేజ్, పి.సి.ఆర్. వంటి సీరమ్ పరీక్షలు మరియూ లిక్విడ్ క్రొమాటోగ్రాపీ వంటి ఆధునిక పరీక్షలు జరిపి కల్తీని నిర్ధారించగల్గుతారు.
కల్తీలను గుర్తించే విధానాలు:
పాలలో సహజంగా ఉండవలసిన నీటి శాతం కంటే ఎక్కువ ఉంటే పాలసాంద్రత తగ్గిపోతుంది. దీనిని సాధారణంగా లాక్టోమీటరుతో గుర్తించవచ్చు. ఇప్పుడు చాలా పాల సేకరణ కేంద్రాలలో వెన్న శాతంతో పాటు వెన్నకాని పదార్థాల (ఎస్.ఎన్.ఎఫ్)ను కూడా సులువుగా తెలుసుకునే ఎలక్ట్రానిక్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. సరియైన పద్ధతిలో పాల నమూనా సేకరించి, ఖచ్చితమైన పరిమాణంలో టెస్టింగ్లో వాడితే పాలలో వెన్న-వెన్న కాని పదార్థాలను సులువుగా తెలుసుకోగలము.
కాలం వల్ల (ఏజింగ్) నాణ్యతను కోల్పోయే పాలను వాసనతో కనుగొనుట సాధ్యమే అయినప్పటికీ, ఎలక్ట్రానిక్ ముక్కు అనే పరికరంతో పరిమాణపూర్వకంగా ఖచ్చితంగా తెలుసుకోగలము.
ఆవుపాలలో గేదె పాలను కల్తీ చేయడాన్ని హంస టెస్టు ద్వారా ఒక నిముషంలో గుర్తించవచ్చును. పాలు:డిస్టిల్డ్వాటరు 1:10 నిష్పత్తిలో కలిపి, గ్లాసుస్లైడ్ మీద ఒక బొట్టు (చుక్క) వేసి, దీనితో హంస టెస్టు రియేజంటును కలిపితే పాల తరకలు అరనిముషంలో ఏర్పడితే ఆవుపాలలో గేదెపాలు కలిసినట్లు నిర్ధారణ అవుతుంది.
చెక్కెరతో పాల కల్తీ: 5 మిల్లీలీటర్ల పాల నమూనాలో ఒక మిల్లీ లీటరు గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు 0.1 గ్రాము రిసోర్సినాల్ కలిపి, టెస్ట్ట్యూబును నీళ్లలో ఉంచితే, పాలనమూనా ఎర్రగామారితే ఈ విధమైన కల్తీ నిర్ధారణ అవుతుంది.
గంజి-పిండి వంటి పదార్థాలతో పాలు కల్తీ జరిగితే 5 మిల్లీ లీటర్ల పాలనమూనాకు ఒక చుక్క 0.1 శాతం అయొడిన్ ద్రావణం కలిపితే నీలంరంగు కనిపిస్తే ఈ రకమైన కల్తీల నిర్ధారణ జరుగుతుంది.
ఫార్మలిన్ కలిసిన పాలను గుర్తించుట: టెస్ట్ట్యూబ్లో 10 మిల్లీలీటర్ల నమూనాను తీసుకుని దానికి 5 మిల్లీలీటర్లు గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని, కొంచెం ఫెర్రిక్ క్లోరైడ్ను కలిపి, కదల్చకుండా ఉంచితే కొంతసేపటికి ఊదారంగు లేదా నీలంరంగు వలయం రెండు ద్రవాల మధ్య కనిపిస్తే అది ఫార్మలిన్ కల్తీని నిర్ధారిస్తుంది.
యూరియా గుర్తింపు: టెస్ట్ట్యూబ్లో 5.0 మిల్లీలీటర్ల నమూనాను తీసుకొని దానికి సమాన పరిమాణంలో పి-డైమిథైల్ ఎమైనోబెంజాల్డిహైడ్ రియేజెంటును కలిపినప్పుడు స్పష్టమైన పసుపురంగుకు మారితే యూరియా ఆ నమూనాలో ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది.
బోరిక్ పౌడరు, బోరాక్స్ గుర్తింపు: టెస్ట్ట్యూబ్లో 5 మి.లీ. నమూనాకు 1.0 మి.లీ. గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలిపి అందులో టర్మరిక్ పేపరును ముంచితే, ఆ పేపరురంగు పసుపు నుండి ఎర్రగా మారుతుంది.
డిటర్జంటును గుర్తించుట: టెస్ట్ ట్యూబులో 5.0 మి.లీ. పాల నమూనాను తీసుకొని దానికి 0.1 మి.లీ. 0.5% బ్రోయోక్రిసాల్ పర్సుల్ ద్రావణాన్ని కలిపినప్పుడు ఊదారంగు కనిపిస్తే అది డిటర్జంటు ఉనికిని స్పష్టం చేస్తుంది.
అధిక పాల దిగుబడికి, చేపుకు కొందరు పాలు పిండే ముందు చేపు ఇంజక్షను (ఆక్సిటోసిన్) అనే ఇంజక్షను ఇస్తారు. ఈ హార్మోను అవశేషాలు పాలద్వారా ప్రతిరోజూ అదే పాల మీద ఆధారపడే వినియోగదారుల ఆరోగ్యాలను పునరుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇటువంటి అక్రమాలు మన దృష్టికి వస్తే స్థానిక వైద్యశాఖ/ఆహారకల్తీ నివారణ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి.
నాణ్యమైన పాలపొడి, ద్రవరూపంలోని పాలలోని నీటిని, వెన్నను వివిధ శాస్త్రీయ మార్గాల ద్వారా తొలగిస్తేనే తయారవుతుంది. పాలను పొడి రూపంలో దీర్ఘకాలం నిల్వ చేసి, అవసరమైనప్పుడు స్టెరిలైజ్ చేసిన నీరు, పాశ్చురైజ్ చేసిన పాలు, వెన్ననూనె (బటర్ ఆయిల్)తో నిర్ణీత ప్రమాణాలలో కలుపుటను కల్తీగా భావించకూడదు. పాలలో సహజంగా ఉండవలసిన వెన్న, వెన్నకాని పదార్థాలు తప్ప, అన్యపదార్థాలు పాలలో కనిపించకూడదు.
పాలలోని వెన్న-వెన్నకాని పదార్థాల శాతాలను బట్టి పాలను స్కిమ్డ్మిల్క్ (వెన్న లేని పాలు) డబుల్ టోన్డ్ మిల్క్ 1.5 శాతం వెన్న, టోన్డ్ మిల్ (3.0 శాతం వెన్న) స్టాండర్డ్ మిల్క్ (4.5 శాతం వెన్న) హోల్ మిల్క్ (6.0 శాతం వెన్న) గా వివిధ డెయిరీలు వేర్వేరు ధరలకు విక్రయించుటను చట్టప్రకారం అనుమతించబడింది.
పైన పేర్కొన్న వివిధ కల్తీ గుర్తింపు పరీక్షలు మనకు కల్తీ జరిగినట్లు అనుమానించుటకు తప్ప నేరుగా చట్టపరమైన చర్యలు తీసుకొనుటకు సరిపోవు. అనుమానితులపై జిల్లా కలెక్టరు, స్థానిక సంస్థ (పంచాయతీ-మున్సిపాలటీ, కర్పొరేషన్)ల అధికారులకు, రాష్ట్ర ప్రజారోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదును అవసరమైతే తాజా పాలనమూనాతో పాటు సమర్పించి చట్టపరంగా దోషుల్ని కోర్టు ఉత్తర్వుల ద్వారా శిక్షించవచ్చును.
మిరప, వరి, చెరకు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు లాంటి పంటలతో పాటు రైతులు ఔషధ మొక్కల సాగు కూడా చేపడుతున్నారు. ఔషధ మొక్కలలో ప్రధానంగా కలబంద, తులసి, దూలగొండి, అశ్వగంధ లాంటి వాటిని రైతుల స్థాయిలో పండించి అమ్ముకుంటున్నారు. ఔషధ మొక్కలు సాగు చేసే రైతులు తప్పనిసరిగా మార్కెటింగ్ అవకాశాలను చూసుకొన్న తరువాతనే కొనుగోలుదారులతో ఒప్పందాలు కుదుర్చుకున్న తరువాతనే పంటల సాగు మొదలు పెట్టాలేగాని ఏలాంటి కొనుగోలు ఒప్పందాలు లేకుండా సుగంధ మరియు ఔషధ మొక్కల లాంటివి సాగు చేసినట్లయితే ఇబ్బందులు ఎదురవుతాయి అనే విషయం రైతుల అనుభవాల సారం. ఈ పంటలు కూడా ఏ నేలలలో పడితే ఆ నేలలలో సరైన దిగుబడులు రావు కాబట్టి పంట లక్షణాన్ని బట్టి నేలలను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ తమకు సమీపంలో అనుకూలమైన నేల లేనట్లయితే అనుకూలమయిన నేల అందుబాటులో ఉన్న ప్రాంతాలకు వలసపోయి సాగు చేపట్టినట్లయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. కాబట్టి తాము ఉండే ప్రాంతంలో నేల తాము అనుకున్న పంటల సాగుకు ఉపయోగపడదు కాబట్టి ఆ పంట సాగుకు అనుకూలమైన నేల అందుబాటులో ఉన్న ప్రాంతానికి వెళ్ళి తులసి పంట సాగు చేస్తున్నారు అన్నదమ్ములు శ్రీనివాసరావు మరియు నాగేశ్వరరావు.
వీరిది గుంటూరు సమీపములోని పుల్లడిగుంట ప్రాంతం. ఈ ప్రాంతంలోని నేలలు నల్లరేగడి నేలలు. వీరు తులసి పంటను సాగు చేయాలనుకొని పుల్లడిగుంట ప్రాంతంలోని నల్లరేగడి నేలలు తులసి సాగుకు అనుకూలం కావు అని తెలుసుకున్నారు. తులసి సాగుకు ఇసుక నేలలు, ఎర్రనేలలు అనుకూలం. కాబట్టి అలాంటి నేలలు అందుబాటులో ఉన్న ప్రకాశం జిల్లా ఆకివీడు ప్రాంతానికి వెళ్ళి తులసి పంట సాగు మొదలు పెట్టారు. నల్లరేగడి నేలలో తులసి సాగు చేసినట్లయితే నూనెదిగుబడి తక్కువగా వచ్చి పంట గిట్టుబాటు కాదు. ఇసుక లేదా ఎర్ర నేలల్లో నూనె దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది కాబట్టి తులసి సాగును నల్లరేగడి నేలలలో చేపట్టవచ్చు అని వీరు సూచిస్తున్నారు.
గత సంవత్సరం మే నెలలో తులసి పంట సాగును 30 ఎకరాలలో చేపట్టారు. ఇందుకుగాను అవసరమైన విత్తనాలను హైదరాబాదులో సిఎంఏపి వద్ద కొనుగోలు చేసికుని నారు పోసుకున్నారు. దుక్కిలో బాగా మాగిన పశువుల ఎరువును అందించారు. 35 నుంచి 40 రోజుల వయస్సు ఉన్న నారుని లైనుకి లైనుకి 27 అంగుళాలు మొక్కకు మొక్కకు 15 నుంచి 16 అంగుళాల దూరం పాటించి నాటించారు. అవసరాన్ని బట్టి నీటిని అందిస్తూ వస్తున్నారు. తులసి ఔషధగుణాలు ఉన్న మొక్క కాబట్టి ఎలాంటి చీడపీడలు పంటను ఆశించలేదు. ఒకవేళ చీడపీడలు ఆశించినా కూడా ఎలాంటి సస్యరక్షణా చర్యలు చేపట్టవలసిన అవసరం లేదు అని వీరు వివరిస్తున్నారు. అన్నీ సక్రమంగా ఉంటే నారు నాటిన 60 రోజులకు మొదటి కోత వస్తుంది. తరువాత 50 రోజులకు ఒక కోత చొప్పున కోసుకోవచ్చు. సంవత్సరానికి 5 నుంచి 6 కోతలు కోయవచ్చు. పంట కోత విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వాతావరణములో తేమ తక్కువగా ఉన్నప్పుడే తులసి పంటను కోయాలి. పంట కోతకు ముందు కనీసం వారం రోజులు నీటితడిని ఆపి మొక్క బాగా వాడుబడిన తరువాత కోత కోయవలసి ఉంటుంది. వర్షాకాలంలో పంట వాడుపడదు కాబట్టి వాడుపడకుండా కోత కోసి నూనెను తీసినట్లయితే నూనె నాణ్యత తగ్గుతుంది కాబట్టి పంట వాడు పట్టిన తరువాతనే కోసి నూనెను తీస్తున్నారు. పంట ఎదుగుతూ పూత పూర్తిగా వచ్చి విత్తనాల తయారీ మొదలు కాకుండానే పంటను కోయాలి. విత్తనాల తయారీ మొదలయితే నూనె శాతం తగ్గుతుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితేనే నాణ్యమయిన నూనె దిగుబడి పొందవచ్చు.
నూనె తీయడానికి సిద్ధంగా ఉన్న పంటను కట్టెతో సహా కోసి నూనె తీసే యంత్రంలో వేసి నూనె తీస్తున్నారు. అంతా సక్రమంగా ఉంటే మొదటికోతలో ఎకరానికి 9 లీటర్ల నూనె దిగుబడి పొందవచ్చు. రెండవ కోత నుంచి నూనె దిగుబడి కొద్దిగా తగ్గుతుంది. ప్రస్తుతం తులసి నూనె లీటరు ధర 6700/- నడుస్తుంది. చెన్నై, బెంగుళూరు, బొంబాయిలలో ఈ నూనెకు గిరాకి ఉంది. విత్తనాలు, నారు, కూలీ ఖర్చులు అన్నీ కలిపి మొదటి కోత వరకు ఎకరానికి 30000/- వరకు ఖర్చు అవుతుంది. రెండవ కోత నుంచి కోతకు 10000/- వరకు ఖర్చు అవుతుంది. ఒకసారి నాటుకుంటే 3 సంవత్సరాలలో 15 నుంచి 16 కోతలు కోసుకోవచ్చు అని వీరు వివరిస్తున్నారు. మరిన్ని వివరాలు 9441928521 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
ఉల్లిగడ్డ అలియేసీ కుటుంబానికి చెందిన ద్వి వార్షిక మొక్క అధిక ఔషధ గుణములు మరియు కొన్ని రకాల చికిత్సలకు ఉపయోగ పడుతుంది. ఇది సాధారణంగా సమశీతోష్ణ వాతావరణంలో అధిక దిగుబడినిచ్చే మొక్క కానీ ఉష్ణ మండల, ఉప ఉష్ణ మండల ప్రాంతాలలో కూడా పెరుగును. దీర్ఘకాలిక పగటి కాంతి ఉల్లిపాయలో లశునము ఊరడానికి సహకరిస్తుంది కానీ ఉష్ణోగ్రత మొక్క పుష్పించడానికి దోహదపడుతుంది. ఉల్లిపాయను దాదాపు ప్రపంచంలోని అన్ని సంస్కృతుల ప్రజలు వంటలలో నిత్యావసర పదార్థంగా వాడతారు. ఇది వంటకి రుచి, సువాసనని అందిస్తుంది. దీన్ని సలాడ్ రూపంలో కూడా తీసుకుంటారు. ఉల్లిపాయలో వివిధ రకాల విశిష్ట రసాయన పదార్థాలున్నాయి. అవి ఫ్లవోనోయిడ్స్, ఆంథోసైయానిన్స్, ఫ్రక్టో ఒలిగో శకరైడ్, ఆర్గానో-సల్ఫర్లు ఔషధంగా ఆరోగ్యాన్ని పెంచి రుగ్మతలు, డయాబెటిస్ నుండి కాపాడతాయి. భారతదేశం నుండి వివిధ దేశములకు ఎగుమతి అయ్యే ఫలములు, కూరగాయలలో ఉల్లిగడ్డ ద్వారా వచ్చే ఆదాయపు వాటా శాతము 26%. చైనా ప్రపంచంలోనే ఉల్లి సాగులో మొదటి స్థానంలో ఉంటే భారత దేశం రెండవ స్థానంలో ఉన్నది. భారతదేశంలో ఉల్లిపాయలు అధికంగా పండే రాష్ట్రం మహారాష్ట్ర కాగా తదనంతర స్థానంలో కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణలో ఉండే వాతావరణ పరిస్థితులు ఉల్లి సాగుకు అనుకూలమైనవి. నాణ్యమైన విత్తనం అందుబాటులో లేకపోవడం, తెగుళ్లు, చీడల బెడద, ఉల్లిపాయను సాగుచేసే విస్తీర్ణం తక్కువ ఉండటం ఇలాంటి వివిధ కారణాల వల్ల రాష్ట్రం నుండి ఉత్పత్తి అయ్యే ఉల్లిపాయ దిగుబడి ఆశించినంత స్థాయిలో లేదు. కానీ ఆధునిక సాంకేతికత, నూతనంగా విడుదల అయిన ఉల్లి వంగడాలు, ఉత్పత్తిలో మెలకువలు సంక్షిప్త కీటక, వ్యాధి నివారణ, సాగులో మెలకువలు పాటించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉల్లి ఉత్పత్తిని గణనీయంగా పెంచవచ్చు.
సాగు చేయు ప్రాంతాలు, సమయం
తెలంగాణ రాష్ట్రంలో ఉల్లిపాయను ఖరీఫ్ (ఆగష్టు – నవంబర్) మరియు రబి (ఏప్రిల్ – జూన్) రెండు కాలములలో సాగు చేస్తారు కాని అధికంగా ఉత్పత్తి అయ్యేది రబీ కాలంలోనే. తెలంగాణలో ఉల్లిని సాగుచేసే ప్రాంతాలు వరుసగా రంగారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, వరంగల్. ఉల్లిగడ్డ లశుణం సరిగ్గా పెరగకపోవడానికి గల కారణాలు ఉల్లిగడ్డ లశునము సరిగ్గా ఎదగక ముందే పుష్పించడం, దుంప పగుళ్లు వచ్చుట, సరైన ఉల్లిగడ్డ విత్తన రకమును ఎంచుకోవడములో తప్పిదం, నిస్సారమైన భూమి, ప్రతికూల పర్యావరణ కారకములు, ఉల్లిగడ్డ నిల్వచేయడంలో తగిన జాగ్రత్త చర్యలు చేపట్టక పోవడం.
నేలలు, వాతావరణం
భూ సారము అధికంగా ఉండి, సరి అయిన మురుగు నీరు పోయే సౌకర్యం ఉన్న ఇసుక నేలలు మరియు చల్లని వాతావరణము ఉల్లిపాయలో సరయిన పెరుగుదలకు దోహదపడే అంశాలు. దీర్ఘకాలిక కాంతి ఉండి ఉష్ణోగ్రత తక్కువ ఉన్నప్పుడు దుంప ఎదుగుదల సరిగ్గా జరుగుతుంది. ఉష్ణమండల తెలంగాణ ప్రాంతాలలో దీర్ఘకాల కాంతి వంగడాలను పెంచుకోవడానికి అనుకూలమైనవి. అధిక ఉష్ణోగ్రత స్వల్ప ఆర్ద్రత ఉండే వాతావరణంలో దుంప త్వరగా ఎదుగుతుంది. ఉల్లిగడ్డ శీతకాలాపు పంట, దుంపల కోసం, ఆకు కోసం సాగు చేస్తారు.
సరైన వంగడాలు:N 2-4-1, ఆర్కా నికేతన్, అగ్రి ఫౌండ్ లైట్ రెడ్, పూస రెడ్, భీమా రాజ్ మరియు భీమా రెడ్ అనేవి రబి సీజన్లో సాగు చేయుటకు అనుకూలమైన రకాలు.
విత్తనం ఎంపిక, నారుమడి తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఉల్లిగడ్డను విత్తనము ద్వారా గాని, లేదా చిన్న దుంపల ద్వారా గాని సాగు చెయ్యవచ్చు. నారు మొక్కలు చాలా అనువైనవి నారు మొక్కలను ముందుగా నిర్మించుకున్న నారుమడిలో విత్తనాలను తగినంత దూరములో విత్తుకోవాలి. బెడ్లను భూమి నుంచి 10-15 సెం.మీ. ల ఎత్తులో నిర్మించుకోవాలి ప్రతి రెండు బెడ్ ల మధ్య కనీస నిడివి 50సెం.మీ. లు ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల అంతరకృషి సులభతరమగును రెండు విత్తన వరసల మధ్య దూరము 4-5 సెం.మీ.లు ఉండేట్లు చూసుకోవాలి. నారుకుళ్లు తెగులును అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకుని 4-6 వారాల వయసున్న నారు మొక్కలను ప్రధాన నాటుకోవాలి.
నీరు, యాజమాన్యం
ఉల్లిమొక్క నీటి ఎద్దడిని దుంప ఊరే దశ, దుంప అభివృద్ధి చెందే దశలో అస్సలు తట్టుకోలేదు. పంట పరిపక్వత దశకు చేరుకున్న తరవాత అధిక నీరు ఇచ్చినట్లయితే ద్వితీయ వేర్లు వస్తాయి తద్వారా దిగుబడి తగ్గే అవకాశం ఉంది. పంట కోసే రెండు వారాల ముందు నుండి నీటి సరఫరా ఆపి వేయాలి. ఉల్లి సాగులో నీటిని తుంపర సేద్యము, బిందు సేద్యము ద్వారా అందించినచో సంప్రదాయ పద్ధతి లో సాధించే దానికన్నా ఎక్కువ దిగుబడి పొందవచ్చు. బిందు సేద్యము ద్వారా నీటిలో కరిగే పోషకాలను వాడటం సరైన లాభాలను ఆర్జించవచ్చు. పశు సంబంధిత వ్యర్ధాలు, పంట వ్యర్ధాలు, పచ్చి రోట్ట ఎరువులను వాడటం, పంట మార్పిడి, మృత్తికా పరీక్ష అనంతరం సూచించిన మోతాదులో నియమిత ఫర్టిలైజర్ ను అందించటం మేలైనది. ఒక హెక్టార్ భూమికి సుమారు 40 టన్నుల పశవుల ఎరువు వాడటం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చు.
కలుపు నివారణ:ఉల్లి మొక్క వేరు వ్యవస్థ చిన్నధి అందువల్ల కలుపు ను అస్సలు తట్టుకోలేదు. సరైన సమయములో కలుపు ను నియంత్రన చర్యలు చేపట్టాలి.
అంతర పంటల సాగు
ఒకే సంవత్సరంలో వరసగా కేవలము ఉల్లిగడ్డ ను సాగు చేయకూడదు. దీనివల్ల భూమి యొక్క సారము తగ్గిపోవును, చీడ పీడల ఉధృతి అధికమగును. రసాయనిక ఎరువులు వాడటానికి బదులుగా ఇతర జాతి పంటలను పండించడం ద్వారా నేల సారవంతంగా మారును. ఉల్లి స్వల్పకాలపు పంట కాబట్టి రెండు ఋతువుల మధ్య అంతర పంట సాగు చెయ్యవచ్చు. బెండి, ముల్లంగిల మధ్య అంతర పంటగా ఉల్లిని సాగు చేయడము ద్వారా అధిక లాభాలు పొందవచ్చు. అన్నిటికంటే బీట్రూట్తో ఉల్లిని 15 సెం.మీ.ల వ్యవధితో సాగు చేసినప్పుడు అధిక లాభాలు గణించవచ్చు.
పంట పరిపక్వతదశ, కోయు విధానం
నిల్వ చేసే ఉల్లిపాయలను కోత కోయడానికి మెడ విరుపు దశ,అత్యంత ముఖ్యమైనది. దాదాపుగా 75% పై ఆకులు నేలకు ఒరగడం ఇది మొక్క పూర్తిగా కోతకు వచ్చిందని సూచిస్తుంది. కోతకు 2-3 వారాల సమయం ముందు నీరు అందించడం ఆపాలి. కోత కోసే సమయం లో సమయంలో దుంపలను భూమి నుండి లాగి ఆకుల చివరలను కత్తిరించాలి. కోసిన దుంపలను వ్యవసాయ భూమి లోనే 2-3 వారాలు దుంపల పై ఉన్న పొలుసులు పూర్తిగా పొడిగా అయ్యే అంత వరకు ఆరనివ్వాలి. ఆకు పచ్చని ఉల్లి పాయల కోసం దుంపలను భూమి నుండి లాగి కాడలను 15 సెం.మీ. లు ఉండే విధంగా కత్తిరించాలి.
చీడ పీడలు, తెగుళ్లు నివారణ
ఉల్లిలో చీడపీడలు, తెగుళ్లు కూడా అధికమే, కేవలం తామర పురుగుల ద్వారా 50% పంట నష్టం జరుగుతుంది. తామర పురుగులు పొడిగా వేడిగా ఉండే వాతావరణంలో అధిక నష్టాన్ని కలుగ చేస్తాయి. ఇవే కాకుండా మొక్కలకు నీరు పెట్టేటప్పుడు, ఆచ్ఛాదన, నాటుపెట్టే సమయం వల్ల కూడా తామర పురుగుల ఉధృతి పెరుగును. వివిధ రకాల సేంద్రియ కషాయాలు మరియు ద్రావణాలతో తామర పురుగుల ఉధృతిని అరికట్టవచ్చు బవేరియా బస్సియానా అనబడే శిలీంద్రంను వాడటం ద్వారా అనేక రకాల చీడలను అరికట్ట వచ్చు. అస్పెర్గిల్లస్నైజర్ మరియు ఫ్యూసేరియం అనే శిలీంద్ర జాతులు విత్తనము ద్వారా దుంపలలో కూడా వ్యాపిస్తుంది. అధిక ఉష్ణోగ్రత ఆర్థ్రత వున్న పరిస్థితులలో నారుకుళ్ళు తెగులు ద్వారా 75-80 శాతము నష్టం కలుగును. ఎదుగుదల థలో అధిక నీటి వల్ల నారుకుళ్లు, ఊదారంగు మచ్చ వ్యాధి సోకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది తగిన మోతాదులో నీటిని అందించడం వలన అరికట్టవచ్చు.
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలోని పరిశవారిపాలెం (దిండి) వద్ద రూ. 88.08 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కు పనులకు ప్రభుత్వం గురువారం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర ప్రభుత్వం రూ. 52.85 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 35.23 కోట్లు చొప్పున భరిస్తాయి. ఇందులో రూ. 25.79 కోట్లతో చేపల విభాగం, రూ. 18.58 కోట్లతో రొయ్యల విభాగం, రూ. 13.78 కోట్లతో సీఫుడ్ పార్కు, రూ. 9.88 కోట్లతో పీతల విభాగం, రూ. 6.72 కోట్లతో సీ వీడ్ పార్కు, రూ. 7.23 కోట్లతో ఆర్నమెంటల్ ఫిష్ టెక్నాలజీ పార్కు ఏర్పాటు చేస్తారు.
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన
ఆర్గానిక్ పద్ధతిలో పసుపు పంటను పండించుటకు తగిన చర్యలు తీసుకోవాలని పసుపు బోర్డు సెక్రటరీ శ్రీమతి భవాని శ్రీ, ఐ.ఎ.ఎస్ గారికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అత్యధిక కుర్క్మిన్ ఉండే పసుపు విత్తనాన్ని రైతులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోలని, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా పసుపు పంటను పండించేందుకు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పసుపు ఆధారిత ఉప ఉత్పత్తులను తయారుచేసే పరిశ్రమలను ప్రోత్సహించాలని మంత్రి తుమ్మల అన్నారు.
తొలివిడతగా 12,500 టన్నులతో రేపు బయల్దేరనున్న నౌక కాకినాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ వెళ్లే అవకాశం
ఫిలిప్పీన్స్కు 8 లక్షల టన్నుల తెలంగాణ బియ్యం ఎగుమతి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా అందులో తొలి విడతగా దాదాపు 12,500 టన్నులు కాకినాడ పోర్టుకు చేరింది. నౌకలో లోడింగ్ చేస్తున్నారు. ఫిలిప్పీన్స్కు వెళ్లే నౌక ప్రయాణం గురువారం ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ నౌక ప్రయాణాన్ని పౌరస రఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జెండా ఊపి ప్రారంభించే అవకాశం ఉంది. ‘ఎంటీయూ 1010’ రకం ముడి బియ్యాన్ని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎగుమతి చేస్తోంది. బియ్యం అక్కడకు చేరిన 60 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. కొద్దినెలల క్రితం హైదరాబాద్లో జరిగిన సదస్సుకు వచ్చిన ఫిలిప్పీన్స్ అధికారులు ఇక్కడి బియ్యం నాణ్యతను పరిశీలించారు. నచ్చడంతో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పౌరసరఫరాల సంస్థ కమిషనర్ డీఎస్ చౌహాన్తో చర్చించి ఒప్పందం కుదుర్చుకున్నారు. మరో రెండు దేశాలకు కూడా బియ్యం ఎగుమతిపై పౌరసరఫరాల సంస్థ దృష్టి పెట్టింది. డీఎస్ చౌహాన్ ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టారు. ఆ ప్రక్రియ త్వరలో కొలిక్కి రానుందని సమాచారం. ఆ దేశాల పేర్లను పౌరసరఫరాలశాఖ వెల్లడించడం లేదు.
పీఎం కిసాన్ కింద 19వ విడత (2024 డిసెంబరు-మార్చి 2025) నిధుల విడుదలలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు రూ.854.28 కోట్లు ఇచ్చామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దీనివల్ల ఏపీలో 41,27,619 మంది రైతులు లబ్ధి పొందారని వివరించారు. లోక్సభలో ఎంపీ బెన్నీ బెహనన్ మంగళవారం అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.
గిరిజనులు పండించే అరకు కాఫీ బ్రాండ్ను విస్తృత పరచడానికి పార్లమెంటు ఆవరణలో రెండు స్టాళ్లను గిరిజన సహకార సంఘం సోమవారం ప్రారంభించింది. కూటమి ఎంపీల విజ్ఞప్తి మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇవ్వగా లోక్సభ, రాజ్యసభ సభ్యుల క్యాంటీన్లలో.. కేంద్ర వాణిజ్య శాఖామంత్రి పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్రిజిజు, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయెల్ ఓరం, పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు స్టాళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ… భౌగోళిక ప్రత్యేక గుర్తింపు ఉన్న అరకు కాఫీ బ్రాండ్ను ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న చొరవను అభినందించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు.. అరకు కాఫీని అత్యంత ప్రాధాన్య ఉత్పత్తిగా ప్రపంచం అసూయపడేలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాయని చెప్పారు. జుయెల్ ఓరం మాట్లాడుతూ.. అరకులోయలో కాఫీ పెంపకం వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ప్రారంభించామన్నారు. అప్పట్లో ఇందుకోసం రూ. 200 కోట్లు ఇచ్చినట్లు గుర్తుచేశారు. కిరణ్ రిజిజు మాట్లాడుతూ…. ‘గిరిజనులు అంకితభావంతో పండించిన సుసంపన్నమైన కాఫీని ఇక్కడ విక్రయించడం గర్వకారణం. ఇది గిరిజనుల సాధికారత, స్వావలంబనకు నిదర్శనం’ అని అన్నారు.
*చంద్రబాబు ప్రయత్నాల వల్లే…*
రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ…సీఎం చంద్రబాబు చేపట్టిన విస్తృత కార్యక్రమాల వల్ల అరకు కాఫీ ప్రపంచస్థాయి గుర్తింపు పొందిందన్నారు. ఆయన దావోస్లోనూ అందరికీ అరకు కాపీని ఇచ్చి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేశారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉద్యాన విశ్వ విద్యాలయం ఉపకులపతి దండా రాజిరెడ్డి సూచించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కూరగాయలు, పండ్లతోటలు, పసుపు తదితర పంటలపై అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పంట పొలాల్లో నిలిచిన నీటిని 24 గంటల్లోపు బయటకు పంపాలని, టమాటాలకు పగుళ్లు రాకుండా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
అకాల వర్షాలు, వడగళ్ల వానతో జరిగిన పంటనష్టంపై చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాలవర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, అన్నదాతలెవరూ ఆందోళన చెందొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగా సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో జరిగిన పంటనష్టం, అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీరజంపల్లిలో ఇద్దరు అరటి రైతుల ఆత్మహత్యాయత్నంపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆదివారం చంద్రబాబు సమీక్షించారు. రైతుల ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ”వడగళ్ల వాన కారణంగా వైఎస్సార్, అనంతపురం, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లా లోని 10 మండలాలకు చెందిన 40 గ్రామాల్లో పంట నష్టం జరిగింది. 1,670 హెక్టార్లలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. సుమారు 1,364 మంది రైతులు నష్ట పోయారు” అని అధికారులు సీఎంకు తెలిపారు. క్షేత్రస్థాయికి వెళ్లి వివరాలను పరిశీలించినట్లు నివేదించారు. అంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉద్యానశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వడగళ్ల వాన కారణంగా జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు.
త్వరలో సీఎం సమక్షంలో ఒప్పందానికి సెర్ప్ కార్యాచరణ
మహిళాశక్తి పథకం కింద తెలంగాణలో భారీఎత్తున ఆహారశుద్ధి యూనిట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వయం సహాయక సంఘాల ద్వారా రానున్న మూడేళ్లలో 2,500 పరిశ్రమల ఏర్పాటుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రతిపాదనలు రూపొందించింది. హైదరాబాద్ శివారులోని ఇక్రిశాట్ సంస్థ దీనికి సాంకేతిక సహకారం అందించనుంది. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకోనుంది. అందులో భాగంగా జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న పంట ఉత్పత్తులను గుర్తించి, స్థానిక మహిళా సంఘాల ద్వారా వాటి శుద్ధి కోసం పరిశ్రమలను ఏర్పాటు చేస్తుంది. సెర్ప్ ప్రతిపాదనలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు.
బ్రాండ్ ఖరారుకు కసరత్తు ఆహారశుద్ధి పరిశ్రమలకు మార్గనిర్దేశం చేసేందుకు వీలుగా ఇక్రిశాట్కు అందులో భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థతో సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్ సంప్రదింపులు జరిపారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటారు. ఒప్పందంలో భాగంగా శుద్ధి విధానాలు, యంత్రాల వినియోగం, పరిశ్రమల నిర్వహణపై సంఘాల సభ్యులకు శిక్షణ ఇస్తారు.. పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, ఎగుమతులకు అవసరమైన సహకారం అందించనున్నారు. వీటి ఏర్పాటుకు ప్రభుత్వం బ్యాంకు రుణాల సదుపాయం కల్పించనుంది. పరిశ్రమల స్థాపన అనంతరం… ఆయా ప్రాంతాల చారిత్రక నేపథ్యం, పర్యాటక స్థలాలు తదితరాలు ప్రాతిపదికన వీటికి బ్రాండ్ను ఖరారు చేయనున్నారు.
సొంత పొదుపు నిధులతోనే… ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు జాతీయ ఫుడ్ ప్రాసెసింగ్ మిషన్, ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల వ్యవస్థీకరణ పథకం తదితరాలు తోడ్పాటు అందిస్తున్నాయి. వీటికి సబ్సిడీ ఉన్నా బ్యాంకు రుణాలతో ముడిపడి ఉన్నందున.. ప్రస్తుతం మహిళా సంఘాలకు పొదుపు నిధులతో సొంతంగా పరిశ్రమలను స్థాపించేలా సెర్ప్ ప్రణాళిక రూపొందించింది. అనంతర కాలంలో భారత చిరుధాన్యాల నిర్వహణ సంస్థ(ఐఐఎంఆర్), జాతీయ గ్రామీణ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) తదితర సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకొని మరిన్ని పరిశ్రమలను స్థాపించాలని భావిస్తోంది.
అఖిల భారత కాటన్ వార్షిక సమావేశంలో శాస్త్రవేత్తలుగులాబీ రంగు పురుగు విజృంభణ, దిగుబడి తగ్గుదలపై ఆందోళనఆంధ్రాలో పూర్తిగా పడిపోయిన సాగు విస్తీర్ణం
దేశవ్యాప్తంగా సంభవించిన వాతావరణ మార్పులతో జీవచ్చవంలా మారిన పత్తికి ప్రాణం పోయాల్సిన తరుణం ఆసన్నమైందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. గుంటూరు సమీపంలోని లాం ఫామ్లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అఖిల భారత పత్తి వార్షిక సమావేశం-2025 శుక్రవారం ఆరంభమయింది. మూడు రోజులు పాటు జరగనున్న ఈ సమావేశంలో జాతీయ స్థాయికి చెందిన 160 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరైన భారతదేశ పత్తి మనిషిగా పిలువబడే డాక్టర్ సీడీ మాయీ మాట్లాడుతూ దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రారంభించిన మొదటి ‘టెక్నాలజీ మిషన్ ఆఫ్ కాటన్’ దేశంలో సాగు రూపురేఖలు మార్చిందన్నారు. అప్పుడు ప్రవేశపెట్టిన మొదటి మిషన్లోనే బీటీ పత్తి వంగడం రూపుదిద్దుకున్నది చెప్పారు. దాని ఫలితంగా పత్తి పంటలో ఉత్పత్తి, ఉత్పాదకత, లాభదాయకత పెరిగాయన్నారు. కొన్ని థాబ్దాల తర్వాత గులాబిరంగు పురుగు తిరిగి రావడం ఆందోళనకరమన్నారు. దాన్ని తట్టుకొని, వాతావరణ పరిస్థితులను ఎదిరించే నూతన వంగడాల సృష్టి ద్వారానే దేశ భవిష్యత్ వస్త్ర అవసరాలు తీర్చగలమని పేర్కొన్నారు. నూతనంగా ఆరంభం కానున్న రెండవ మిషన్లో ‘మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ’ నినాదాన్ని ముందుకు తీసుకుపోవాలని అన్నారు. ఈ మిషన్ ఉత్పాదకత, సుస్థిరతను పెంపొందించడం, అతి పొడవైన స్టేపుల్ పత్తి రకాల సాగును (పొడవు పింజ పత్తి) ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. యూనివర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యంగా పత్తి దిగుమతులపై భారతదేశం ఆధారపడటాన్ని దృష్టిలో ఉంచుకొని వార్షిక దిగుమతులు 3 మిలియన్ బేళ్లను మించడం ఆందోళన కలిగిస్తుందన్నారు. స్వదేశీ ఉత్పత్తిని పెంచడానికి తక్షణ విధి విధానాలు అవసరమని చెప్పారు. విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్ శారదా జయలక్ష్మీ మాట్లాడుతూ భారతదేశంలో పత్తి కాయతొలిచే పురుగును సమర్థవంతంగా నియంత్రించడం ద్వారా పురుగుమందుల వినియోగాన్ని తగ్గించడంలో బీటీ వంగడాలు సమర్థవంతంగా పనిచేశాయని అన్నారు. ఎన్ జీ రంగా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసి విడుదల చేసిన పత్తి రకం ‘నరసింహ (ఎన్ ఏ-1325)’ గణనీయమైన విజయాన్ని సాధించినదని అన్నారు. నాగపూర్ ఐసీఏఆర్ – సీఐసీఆర్ డైరెక్టర్ డాక్టర్ జి. ప్రసాద్ మాట్లాడుతూ పత్తి ఉత్పత్తి 15 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుందని, ఒకప్పుడు రెండవ అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుగా ఉన్న ఏకీకృత ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ఇప్పుడు వాతావరణ మార్పుల కారణంగా సాగు విస్తీర్ణం తగ్గుతుందని పేర్కొన్నారు. డాక్టర్ ఎస్.కె. శుక్లా మాట్లాడుతూ భారతీయ పత్తిలో అధిక కలుషిత స్థాయిలపై ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ ప్రశాంత కుమార్ దాస్ మాట్లాడుతూ ప్రతికూల పరిస్థితులలో పత్తి నిరోధకతను, ఉత్పాదకతను పెంచడానికి జన్యుమార్పిడి సాంకేతికత చాలా అవసరమని అభిప్రాయ పడ్డారు.
రాష్ట్రంలో పాతాళానికి పడిపోయిన పత్తి సాగు..
ఆంధ్రప్రదేశ్లో పత్తి సాగు విస్తీర్ణం పాతాళానికి పడిపోయింది. 2001-2002 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో 10.02 లక్షల హెక్టార్లలో పత్తి సాగుచేయగా, 2023-2024 సంవత్సరంలో సాగు విస్తీర్ణం 4.27 లక్షలకు పడిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో పత్తి విస్తీర్ణం, దిగుబడి పూర్తిగా పడిపోయినట్లు వార్షిక సమావేశం 2025 నివేదిక స్పష్టం చేస్తున్నది. పత్తి ధరల పతనం, గులాబీ రంగు పురుగు వల్ల రైతాంగం ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
రైతులకు బ్రీడర్ విత్తనాలను రాయితీపై సరఫరా చేసేందుకు కేంద్ర వ్యవసాయశాఖ విత్తన విభాగం ఆమోదం తెలిపింది. 7 రకాల పంటలకు సంబంధించి, 1,736 క్వింటాళ్ల బ్రీడర్ విత్తనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడానికి అనుమతించింది. వరి, కంది, పెసర, మినుము, రాగి, వేరుశనగ, సజ్జ పంటలకు సంబంధించి, బ్రీడర్ విత్తనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరఫరా కానున్నాయి. న్యూఢిల్లీలో జరిగిన సమీక్షలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు.