ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి 34,196 టన్నుల ఉద్యాన ఉత్పత్తులు కిసాన్‌ రైలు ద్వారా రవాణా

2020 ఆగస్టు 7 నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి అస్సాం, బిహార్‌, పశ్చి మబెంగాల్‌, దిల్లీ, త్రిపుర రాష్ట్రాలకు కిసాన్‌ రైలు 116 ట్రిప్పులు తిరిగింది. దీని ద్వారా 34,196 టన్నుల పండ్లు, కూరగాయల రవాణా జరిగింది. ఇందులో అరటి, మామిడి, ఉల్లి రకాలు కూడా ఉన్నాయి. 2024-25లో కంటెయినర్‌ కార్పొరేషన్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రి నుంచి 524, విశాఖపట్నం నుంచి 113 కంటెయినర్ల సరకును రవాణా చేసింది. బుధవారం లోక్‌సభలో తెదేపా ఎంపీలు కేశినేని శివనాథ్‌, దగ్గుమళ్ల ప్రసాదరావు, లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ ఈమేరకు సమాధానం ఇచ్చారు.

Read More

కలెక్టరేట్‌లో సేంద్రియ కూరగాయల స్టాల్‌

ఆంధ్రప్రదేశ్‌ ఎన్‌.టి.ఆర్‌. జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే వారి కోసం అదే ఆవరణలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో రసాయన పురుగు మందులు, ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో రైతులు పండించిన కూరగాయలతో స్టాల్‌ ఏర్పాటు చేస్తున్నారు. సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు కావడంతో ప్రజలు, అధికారులు వాటిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు

Read More

తెలంగాణలో ప్రతి జిల్లాలో రైతు విజ్ఞాన కేంద్రం!

పంటల సాగులో ఆధునిక సాంకేతికతను అందుబాటులో ఉంచడంతోపాటు ప్రయోగాలు, ఆవిష్కరణల ఫలాలను తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు అందించేందుకు వీలుగా ప్రతి జిల్లాకో రైతు విజ్ఞాన కేంద్రం (ఆర్‌వీకే) స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ మేరకు ఆర్‌వీకేలపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 9 ఏరువాక కేంద్రాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రా(కేవీకే)లు పనిచేస్తున్నాయి. ఇందులో కొద్దిమంది శాస్త్రవేత్తలే పని చేస్తున్నారు. ఏకంగా 15 జిల్లాల్లో శాస్త్రవేత్తలు లేరు. రైతులకు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడం, పంటల మార్పిడి ఆవశ్యకతను వివరించడం, నేరుగా వరి విత్తనం వేయడం, పత్తిలో కలుపు మొక్కల నివారణ వంటి వాటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. డ్రోన్లు, యంత్రాల వినియోగం, కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ వంటి ఆధునిక సాంకేతిక సేవలను అందించాలని యోచిస్తోంది. వీటన్నింటి అమలుకు ప్రత్యేకంగా రైతు విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. దీనిపై ప్రతిపాదనలు రూపొందించాలని అగ్రివర్సిటీని ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 17 ఏరువాక, కేవీకేలను ఆర్‌వికెలుగా మారుస్తారు. మరో 15 జిల్లాల్లో కొత్త ఆర్‌వికెలను ఏర్పాటు చేస్తారు. అప్పుడు 32 జిల్లాల్లో విజ్ఞాన కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి కేంద్రంలో ఆరుగురు చొప్పున శాస్త్రవేత్తలను నియమిస్తారు. ఇతర సహాయ సిబ్బంది ఉంటారు. వాటిలో ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తారు. వాటికి అనుబంధంగా విత్తన, సాగు క్షేత్రాలు ఉంటాయి. వాటిలో డ్రోన్లు, యంత్రాలపై శిక్షణ ఇస్తారు. నిత్యం పరిశోధనలు, ప్రయోగాలకు, రైతు శిక్షణ కార్యక్రమాలకు అవకాశం కల్పిస్తారు. అంకుర సంస్థలకు సైతం స్థలాలను కేటాయిస్తారు.

Read More

అటవీ ఏనుగుల సమస్య పరిష్కారానికి ఆపరేషన్‌ కుంకీ

కుంకీ ఏనుగుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చేపట్టిన తొలి ఆపరేషన్‌ విజయ వంతమైందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం పరిధిలోని మొగిలి వద్ద మామిడితోటలు ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపును కుంకీ ఏనుగులు విజయవంతంగా తరిమికొట్టాయని చెప్పారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ కొనసాగిన ఈ ఆపరేషన్‌లో కృష్ణ, జయంత్‌, వినాయక్‌ అనే కుంకీ ఏనుగులు పాల్గొనగా కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కృష్ణ అనే కుంకీ ఏనుగు చాలా చురుగ్గా పాల్గొందని వివరించారు. ఏనుగుల సంచారంతో ఇబ్బందులు పడుతున్న సరిహద్దు ప్రాంతాల రైతులు, ప్రజలకు ఈ ఆపరేషన్‌ ద్వారా భరోసా కల్పించామని చెప్పారు. పుంగనూరు అటవీ ప్రాంతంలో తదుపరి ఆపరేషన్‌ చేపట్టనున్నట్లు చెప్పారు.

Read More

పర్యావరణ మార్పులను తట్టుకోవడంలో ఉద్యాన పంటలసాగు దోహదపడుతుంది

ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ దండా రాజిరెడ్డి

పర్యావరణ మార్పులను అదుపులో ఉంచడానికి ఉద్యాన పంటలను విరివిగా పెంచాలని ఆచార్య కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ దండా రాజిరెడ్డి అన్నారు. పర్యావరణ మార్పులు, పంటలు సంబంధిత అంశాలపై లోతైన పరిశోధన చేసేందుకుగాను ప్రత్యేక పరిశోధన స్థానం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. వనపర్తి జిల్లా మోజెర్లలోని ఉద్యాన కళాశాలలో పర్యటించాక మదనాపురంలోని విద్యార్థుల ఉద్యాన బోధనా క్షేత్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పండ్లతోటల సాగుతో పాటు అంతర పంటలు సాగు చేయాలని, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుంటే వర్షాభావ పరిస్థితుల్లో తోటలకు నీటిని అందించవచ్చన్నారు. తక్కువ నీటితో బాగా దిగుబడినిచ్చే ఉద్యాన పంటలైన ఉసిరి, చింత, నేరేడు, సపోటా, వాక్కాయ, కుంకుడు, దానిమ్మ, సీతాఫలం, మునగ లాంటి వాటిపై దృష్టి సారించాలని అన్నారు. తక్కువ కాలంలో కోతకొచ్చే కూరగాయలు, ఆకుకూరలు, ఏక వార్షిక రకాలు, ప్రాంతానికి అనువైన ఔషధ మొక్కలను సాగుచేయాలని తెలిపారు.

Read More

స్థానిక జాతి మొక్కలు, చెట్లనే పెంచుదాం

మొక్కలు నాటడమంటే తంతు కాదు.. అదో యజ్ఞం. సరైన చోట సరైన వృక్షజాతులను పెంచితేనే మంచి ఫలితాలొస్తాయి. కానీ చాలాచోట్ల పచ్చదనం పేరుతో ఏవేవో రకాలను పెంచుతున్నారు. అవి ఫలించి, పుష్పించి, పచ్చగా కనిపించినా పర్యావరణానికి మాత్రం చేటు చేస్తున్నాయి. మనవైన మొక్కలతోనే ఈ ఉపద్రవాన్ని అరికట్టగలుగుతాం. గతంలో మనం చూసిన చాలా పకక్షులు, ఉడతల వంటి జీవులు. ఇప్పుడు కనిపించట్లేదు. అందమైన సీతాకోకచిలుకలూ కనుమరుగైపోతున్నాయి. దేశీయ మొక్కలు, చెట్లు లేకపోవడం వీటన్నిటికీ కారణం. పట్టణాలు విస్తరిస్తున్నకొద్దీ పచ్చదనం మాయమవుతోంది. పచ్చదనం పెంచాలన్న లక్ష్యంతో వేల మొక్కలు నాటుతున్నా వాటిలో ఎక్కువ స్థానికేతర జాతులే ఉంటున్నాయి. దేశవాళీ వృక్ష సంపద తగ్గిపోయే కొద్దీ జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అంతేకాదు భూగర్భ జలాలు, వర్షపాతం, ఉష్ణోగ్రతలపైనా ఈ ప్రభావం పడుతోందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.*వలసపోతున్న పక్షులు*స్థానిక వృక్ష జాతుల వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇవి మన నేలలకు అలవాటు పడ్డ రకాలు. వీటిపైనే పకక్షులు ఎక్కువగా వాలతాయి. గూళ్ళు కట్టుకుంటాయి. మన వృక్షాలు లేకపోవడం వల్ల చాలా పకక్షులు వలసపోతున్నాయి. పకక్షులకు సహజ ఆవాసాలుగా మారే తుమ్మ వంటి చెట్లు లేకపోవడంతో చిలుకలు, మైనా వంటివి తగ్గిపోయాయి. తాటి, ఈత చెట్లు, వడ్రంగి పిట్టలు, పాలపిట్టలకు సహజసిద్ధ అవాసాలు. ఉమ్మడి రాష్ట్ర పక్షిగా గుర్తించిన పాలపిట్ట ఇపుడు అంతరించిపోయే పరిస్థితి ఉంది.సీతాకోక చిలుకలు తేనెటీగలను దేశీజాతి ఫల, పుష్పాలు ఆకర్షిస్తాయి. ఆ చెట్ల సంఖ్య తగ్గేకొద్దీ అవి కనుమరుగవుతాయి. పిచ్చుకల్లో చాలా రకాలు ఉండేవి. ఇప్పుడు ఇందులో కేవలం ఒకటి మాత్రమే కనిపిస్తోంది.*గాలి నాణ్యతకు దోహదం*వేప, మద్ది, రావి, మర్రి, వంటివి క్షామాన్ని తుపాన్లను కూడా తట్టుకుని నిలబడతాయి. ఎక్కువ ప్రాణవాయువును విడుదల చేస్తాయి. నగరాల్లో వాయు కాలుష్యం పరిమితికి మించి పెరిగింది. గాలిలోని ధూళి కణాలను శుద్ధి చేయడంలో ఈ చెట్లు బాగా పనికివస్తాయి. ఈ రకం చెట్లు పడిన వాననీటిని భూగర్భంలో ఇంకేలా చేస్తాయి. వీటి వల్ల భూగర్భ నీటి మట్టం పెరుగుతుంది. మేఘాలను ఆకర్షించి వర్షం కురిసేలా. చేయడంలోనూ అవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి.*మన పెరట్లో…*బయటే కాకుండా మన ఇళ్లల్లోని పెరట్లో కూడా స్థానిక జాతి మొక్కలు, చెట్లను పెంచుదాం. దీంతో జీవావరణం వృద్ధి చెందుతుంది. జీవవైవిధ్యానికి కూడా మేలు చేసిన వారమవుతాం.కరివేపాకు, జామ, సీతాఫలం, బొప్పాయి, వాటర్‌ యాపిల్‌, స్టార్‌ ఫ్రూట్‌ వంటి పండ్ల రకాలను నాటొచ్చు. రూఫ్‌టాప్‌పై సోర, బీర, టమోటా, వంగ, వంటి వాటిని పెంచితే మంచిది. మల్లె, సన్నజాజి, జాజి, బంతి, తదితర దేశీయ పూల మొక్కలను పెంచొచ్చు.*శేషాచలంపైనా….*శేషాచలం కొండల్లో 80వ థకంలో అటవీ ప్రాంత విస్తరణ కోసం పెద్దఎత్తున ఆకాసియా ఔరిక్యలిఫార్మిస్‌ అనే ఆస్ట్రేలియన్‌ మొక్కలను భారీగా నాటారు. ఇవి నేలలో క్షార గుణాన్ని పెంచి, స్థానిక మొక్కలను బతకనీయకుండా చేస్తున్నాయి. లాంటానా కామారా అన్న స్థానికేతర జాతి చెట్లు తెలుగు రాష్ట్రాల్లోని అడవులు, పచ్చిక బయళ్లను ఆక్రమించాయి. వీటిపై పకక్షులు గూళ్ళు కట్టి, ఆహారం సేకరించే అవకాశాలు ఉండడం లేదు. పూలు, ఫలాలు లేకపోవడం వల్ల తేనెటీగలు.. సన్‌బర్డ్‌, బుల్‌బుల్‌ వంటి పుప్పొడి రవాణా చేసే పకక్షులు గణనీయంగా తగ్గిపోయాయి. *ఏవి దేశీయ జాతులు?:* మర్రి, రావి, మేడి, వేప, మారేడు, వెలగ, గానుగ, తుమ్మ, మునగ, ఇప్ప, జువ్వి గంగరావి, నేరేడు, ఉసిరి, కుంకుడు, కొబ్బరి, తాటి, మద్ది, తదితర రకాలు*ఇవి స్థానికేతర రకాలు :* బూరుగు, కోనోకార్పస్‌, జామాయిల్‌, మలేషియా వేప, మహాగని, పుమేరియా, బాటిల్‌ బ్రష్‌. *కాపాడాల్సిన బాధ్యత మనదే..*పార్కుల్లో అందం కోసం, లెక్క కోసం స్థానికేతర స్థానిక రకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. రహదారుల విస్తరణలో చింత చెట్లను విచ్చలవిడిగా కొట్టేస్తున్నారు. వీటిని విస్తారంగా పెంచితే పేదలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకూ ఆసరాగా ఉపయోగపడతాయి.- *ప్రొ.తుమ్మల శ్రీకుమార్‌,* పర్యావరణవేత్త, విజయవాడ

Read More

ఆయిల్‌పామ్‌ సాగుతో లాభాలు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఈ రోజు వికారాబాద్‌ జిల్లా కోత్రేపల్లి గ్రామంలో నిర్వహించిన మేగా ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ ఆయిల్‌ పామ్‌ సాగు ప్రాధాన్యత, దీని ద్వారా లభించే ఆర్థిక లాభాలు, మరియు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక చర్యలను వివరించారు.

Read More

విత్తన కంపెనీలు రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకోండి

ఆర్గనైజర్ల వ్యవస్థను రద్దు చేసి, విత్తన కంపెనీలు నేరుగా పత్తి విత్తనోత్పత్తి రైతులతో ఒప్పందాలు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న రూ.700 కోట్ల బకాయిలను నెల రోజుల్లో రైతులకు విడుదల చేయాలని, జాప్యం చేస్తే లైసెన్స్‌ల రద్దుకూ వెనకాడబోమని స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు రావాల్సిన పెండింగ్‌ బిల్లుల సమస్యపై సోమవారం సచివాలయంలో పర్యాటక, ఆబ్కారీశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి తుమ్మల సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ సంచాలకుడు గోపి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విత్తన కంపెనీల ప్రతినిధులు, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ… ”50 వేల ఎకరాల్లో పత్తి విత్తనోత్పత్తితో దేశంలోనే గద్వాల జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. పత్తి సాగు చేసినవారికి నిధులు వెను వెంటనే ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. విత్తన కంపెనీలు ఆర్గనైజర్లకు బాధ్యతలు అప్పగించి చేతులు దులిపేసుకొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకొని వెనువెంటనే బిల్లులు చెల్లించాలి” అని సూచించారు.

Read More

అన్నదాతా సుఖీభవ మరియు పీఎం కిసాన్‌ నిధులు ఆగస్టు 2న విడుదల

ఆగస్టు 2న పీఎం కిసాన్‌ 20వ విడత వాయిదా సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కానుంది. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 41.58 లక్షల రైతు కుటుంబాలకు రూ. 831.60 కోట్లు అందుతాయి. అదే రోజు అన్నదాతా సుఖీభవ సొమ్ము కూడా రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఈ మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. పీఎం కిసాన్‌ నుంచి రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీభవ కింద తొలివిడతగా రూ. 5 వేలు అందించనున్నాయి. రాష్ట్రంలో అన్నదాతా సుఖీభవ పథకానికి 46.64 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. వీరిలో 46.20 లక్షల కుటుంబాల్లోని రైతులు ఈకేవైసీ పూర్తి చేయగా.. ఇంకా 40,346 మంది రైతులు ఈకేవైసీ చేయాల్సి ఉంది. కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యాక కౌలు రైతులకు రెండో విడతలో.. మొదటి, రెండో విడత నిధులను కలిపి జమ చేస్తారు.

Read More

మేనేజ్‌లో నిర్వహించిన అగ్రి యురేకాకు దేశవ్యాప్తంగా అద్భుత స్పందన

ఇటీవల హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ (మెనేజ్‌)లో ‘అగ్రి యురేకా’ పేరిట నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలకు దేశవ్యాప్తంగా 500 దరఖాస్తులు వచ్చాయి. అవన్నీ వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారాలపై… వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలు చూపాయి. వాటిలో అంకుర వ్యవస్థాపకుడైన సాయి విష్ణు, విద్యార్థినులు తివిక్ష, యుక్తిక చేసిన ఆవిష్కరణలు అత్యుత్తమమైనవిగా ఎంపికయ్యాయి. వారిని ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా ఎంపిక చేసి, .. మెనేజ్‌ డైరెక్టర్‌ జనరల్‌ సాగర్‌ హనుమాన్‌ సింగ్‌ బహుమతులను అందజేశారు

.*’హెడ్‌ బ్యాండ్‌’తో పశువుల ఆరోగ్య పరిరక్షణకు*

మా ఇంట్లో పశువులు నిత్యం అనారోగ్యంతో బాధపడేవి. చికిత్స ఆలస్యమై చనిపోయేవి. మనుషులకు ఆరోగ్య పరికరాలు అందుబాటులో ఉన్నట్లే. పశువుల కోసం ఏదైనా కనుక్కోవాలని ఆలోచించా. నా సహవిద్యార్థి శివతో కలిసి సౌరశక్తితో పనిచేసే తల పట్టి(హెడ్‌బ్యాండ్‌)ని తయారు చేశా. బ్యాటరీతో పనిచేసే దీనికి కృత్రిమ మేధను అనుసంధానించా. ఇది జంతువుల శరీర ఉష్ణోగ్రతలతోపాటు దవడ కదలికలను తెలియజేస్తుంది. సరిగా తినకున్నా, నెమరు వేయకున్నా మనకు తెలియజేస్తుంది. హెడ్‌బ్యాండ్‌పై గ్లో-ఇన్‌-ది-డార్క్‌ కోటింగ్‌ కారణంగా రాత్రిపూట కూడా పశువుల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవచ్చు

.-*ఎస్‌ఎస్‌ యుక్తిక,* బీటెక్‌ విద్యార్థిని, హైదరాబాద్‌*చెరకు పిప్పితో బయోహెర్బిసైడ్‌*

పంటలకు కలుపు మొక్కలే ప్రధాన సమస్యగా మారాయి. వీటి కారణంగా దిగుబడులు సరిగా రావడం లేదు. కలుపు నివారణకు రసాయన పురుగు మందులు వాడితే నేల సాంద్రత దెబ్బతింటోంది. వీటిపై అధ్యయనం చేసి చెరకు పిప్పి(బగాస్‌) తో కలుపు నివారణ మందు ‘బయో హెర్బిసైడ్‌ను తయారు చేశాం. ఇది పర్యావరణ వ్యవస్థలకు ఎలాంటి హాని కలిగించకుండా కలుపు మొక్కలను మాత్రమే నిరోధిస్తుంది. ఈ మందు కలుపు సమస్యకు పరిష్కారం చూపడంతోపాటు రసాయనాల వాడకాన్ని భారీగా తగ్గిస్తుంది.- *ఎ. తివిక్ష*, వ్యవసాయ విద్యార్థిని, హైదరాబాద్‌*

ఉప్పునీటి నేలలలో పంటల సాగుకు జీవ ఎరువు*

మన దేశానికి 7,516 కి.మీ. పొడవైన సముద్ర తీరప్రాంతముంది. ఇంత భారీస్థాయిలో ఉన్న భూముల్లో పంటలు సాగవక వృథాగా వదిలేయాల్సి వస్తోంది. ఈ ఉప్పునీటి నేలల్లో సాంద్రత తక్కువగా ఉండడంతో రసాయన ఎరువులు వాడినా ప్రయోజనం ఉండదు. ఈ సమస్యపై ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల తీరంలో ప్రయోగాలు చేశాం. హాలోఫిలిక్‌ బ్యాక్టీరియా ద్వారా జీవ ఎరువును రూపొందించాం. ఇది నేల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంతోపాటు మొక్కల వేర్లను అభివృద్ధి చేసి, పైరు ఎదుగుదలకు దోహదపడుతుంది. పర్యావరణ హితమైన ఈ ఎరువు వినియోగం ద్వారా మంచి దిగుబడి కూడా వస్తుంది. నా ప్రయత్నాన్ని మెనేజ్‌ గుర్తించడం సంతోషంగా ఉంది. మెట్ట ప్రాంతాల్లోనూ దీని వినియోగానికి ప్రయోగాలు చేస్తున్నా. – *కె. సాయి విష్ణు*, అంకుర వ్యవస్థాపకుడు, హైదరాబాద్‌

Read More