వ్యవసాయ రుణాలు ఆంధ్రప్రదేశ్‌లో రూ.3.08 లక్షల కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాలు ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.3,08,716.83 కోట్లకు చేరినట్లు కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్‌ ఠాగూర్‌ తెలిపారు. ఇందులో రూ.2,11,657.36 కోట్ల రుణాలు (68.56%) చిన్న, సన్నకారు రైతులవేనని ఆయన తెలిపారు. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి రూ. 12,49,500 కోట్ల రుణాలున్నట్లు చెప్పారు. రాజ్యసభలో మంగళవారం తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ద్వారా ఈ విషయం వెల్లడైంది.

Read More

భవిష్యత్‌ అంతా ఉద్యానపంటలదే – మంత్రి తుమ్మల

కొండా లక్ష్మణ్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో అక్షయ డైనింగ్‌ హాలును ఈ రోజు తెలంగాణా వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించడం జరిగింది. భారతదేశంలోనే అన్ని సౌకర్యాలతో హార్టికల్చర్‌ యూనివర్సిటీని తెలంగాణాలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మిగతా అన్ని రంగాల కంటే వ్యవసాయరంగానికే అత్యంత ప్రాధాన్యం ఉంది. భవిష్యత్తు అంతా వ్యవసాయానిదే. గత 4 సంవత్సరాల క్రితం కరోనా సమయంలో అన్ని వ్యవస్థలు మూతపడినా, నాగలి ఆగలేదు. రైతు శ్రమ ఆగలేదు. ఇంకా ఎక్కువ మొత్తంలో దిగుబడులు సాధించడం జరిగింది. హార్టికల్చర్‌ విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనీ, విద్యార్థులు ప్రావీణ్యతను పెంచుకుంటే, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల కన్నా, మీకు ఎక్కువ డిమాండ్‌ ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు మొత్తం కోర్సులో సగానికి కన్నా ఎక్కువ రోజులు పొలాల్లో ఉండి, వ్యవసాయంలో ప్రావీణ్యం సంపాదించుకోవాలని, రైతు చేసే వ్యవసాయ విధానాలను పరిశీలించాలని తెలిపారు. హార్టికల్చర్‌ పంటలను అభివృద్ధి చేస్తే, అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, దేశంలో లక్ష కోట్లతో పామాయిల్‌ దిగుమతి చేసుకోవడం జరుగుతుందని, పామాయిల్‌ దిగుమతి తగ్గించాలంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న 13 లక్షల ఎకరాలలో ఉన్న పామాయిల్‌ పంటను 70 లక్షల ఎకరాలకి విస్తరించినట్లయితే, డిమాండ్‌ను అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 2.65 లక్షల ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగు చేయడం జరుగుతుందని, ఆయిల్‌ పథకాన్ని అమలు చేయడంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలోఉందని, రానున్న 4 సంవత్సరాలలో రాష్ట్రంలో పామాయిల్‌ పంటను 10 లక్షల ఎకరాలకు విస్తరించడానికి ప్రణాళిక చేయడం జరిగిందన్నారు. కూరగాయలు, పండ్ల తోటలతో పాటుగా జాజి, వక్క, మెకడమియా లాంటి పంటలను పండించడానికి తెలంగాణ నేలలు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. భవిష్యత్తు అంతా హార్టికల్చర్‌దే అని నేను భావిస్తున్నానని పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెరగడానికి ఉద్యానపంటలు ఒక గ్రోత్‌ ఇంజన్‌గా నిలుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. హార్టికల్చర్‌ శాస్త్రవేత్తలు, రైతులు హార్టికల్చర్‌ పంటలు సాగుచేయడానికి అవసరమైన పరిశోధనలను విస్తృతం చేసి, సూచనలు సలహాలు అందించాలని మంత్రి పేర్కొన్నారు. యూనివర్సిటీలో పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక బోధన విషయాలలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయకమిషన్‌ చైర్మన్‌ కోదండ రెడ్డి, వైస్‌ చాన్స్‌లర్‌ రాజిరెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరి రఘునందన్‌ రావు, వ్యవసాయ కమిషన్‌ సభ్యులు మరియు యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

Read More

జీడి, మిర్చి, మామిడి రైతుల ప్రయోజనాల కోసం బోర్డులు ఏర్పాటు చేయమని కేంద్రమంత్రిని కోరిన లోకేశ్‌

‘జీడిపప్పు ఉత్పత్తిలో ఏపీ రెండో స్థానంలో ఉంది. ప్రాసెసింగ్‌ వ్యవస్థ ఆధునికీకరణ, సరైన మార్కెటింగ్‌ కోసం జీడి బోర్డు అవసరం. మిర్చి బోర్డు ఏర్పాటైతే ధరల హెచ్చుతగ్గులను నియంత్రించవచ్చు. రాష్ట్రంలో ఏటా దాదాపు 50 లక్షల మెట్రిక్‌ టన్నుల మామిడి దిగుబడి వస్తోంది. ఈ పంటలు సాగు చేసే రైతుల కష్టాలు తొలగడానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీకాకుళంలో జీడి, గుంటూరులో మిర్చి, చిత్తూరులో మామిడి బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్రవాణిజ్యమంత్రి పీయూష్‌ గోయల్‌ను మంత్రి లోకేశ్‌ కోరారు. మూలపేట, చిలమత్తూరు, కుప్పం, దొనకొండల్లో 4 కొత్త పారిశ్రామిక నోడ్‌లను అభివృద్ధి చేసేందుకు అనుమతులివ్వాలి. నీరు, విద్యుత్తు, రైల్వే కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.5,811 కోట్ల గ్రాంట్‌ మంజూరు చేయండి. విజయవాడ- చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో చిత్తూరు నోడ్‌కు అనుమతివ్వాలి. ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్‌ల మాస్టర్‌ప్లాన్లు ఆమోదం పొంది, టెండర్లకు సిద్ధంగా ఉన్నాయి. వీటి ఈపీసీ విడుదలకు నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి ఆమోదం ఇప్పించండి’ అని విజ్ఞప్తి చేశారు.

Read More

ఎరువుల కొరత సమస్యలపై 9154970454కు ఫోన్‌ చేయండి

ఎన్‌టిఆర్‌ జిల్లాలో ఎరువుల సరఫరాపై ఏవైనా ఫిర్యాదులు లేదా సమాచారాన్ని అందించేందుకు విజయవాడ కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 9154970454కు ఫోన్‌ చేయవచ్చని రైతులకు కలెక్టర్‌ జి. లక్ష్మీశ సూచించారు. ఈ నంబర్‌ను ఎరువుల దుకాణాలు, సొసైటీల వద్ద తప్పనిసరిగా ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌ నుంచి క్షేత్రస్థాయి అధికారులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్‌ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న క్రమంలో ఎరువులు సమృద్ధిగా ఉన్నట్లు తెలిపారు. కిలో ఎరువు కూడా పక్కదారి పడడానికి వీల్లేదన్నారు. సాగు అవసరాల మేరకే ఎరువులు తీసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎరువుల లెక్కలకు సంబంధించి ఫిజికల్‌, ఆన్‌లైన్‌ రికార్డులతో లావాదేవీలు పారదర్శకంగా ఉండాలన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని వివరించారు. జిల్లాలో 6,388 మెట్రిక్‌ టన్నుల యూరియాతో పాటు, డీఏపీ, ఎంవోపీ, ఎస్‌.ఎస్‌.పి. కాంప్లెక్సు. ఇలా మొత్తం 23,820 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్‌ వెల్లడించారు. నానో ఎరువుల వినియోగంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

Read More

అగ్రివర్సిటీ కళాశాలల్లో 15% సీట్లు రైతుకూలీల పిల్లలకు

2025-26 విద్యాసంవత్సరం నుంచి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బీఎస్సీ(అగ్రి), బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ) కోర్సుల్లో రైతు కూలీల పిల్లలకు 15 శాతం ప్రత్యేక కోటాను అమలు చేయనుంది. దీనికి ఎవరు అర్హులనే దానిపై అగ్రివర్సిటీ ఆదివారం మార్గదర్శకాలను విడుదల చేసింది.

  • విద్యార్థులు 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యాభ్యాసంలో కనీసం నాలుగేళ్లు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి ఉండాలి.
  • విద్యార్థి లేదా అతడి తల్లితండ్రులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం(జాబ్‌) కార్డును కలిగి ఉండాలి. జాబ్‌ కార్డు లేని పక్షంలో వారు ఎకరం లోపు భూమిని కలిగి ఉండాలి.
Read More

ఆంధ్రప్రదేశ్‌లో ఆహార నాణ్యత పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

రాష్ట్రస్థాయి ఆహార నాణ్యత పరీక్షా కేంద్రాలు విశాఖ, గుంటూరు, తిరుమల, తిరుపతి, కర్నూలులో ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో కలిసి వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. ల్యాబొరేటరీల నిర్మాణం, ఆధునికీకరణకు సుమారు రూ.100 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. తిరుమల, విశాఖపట్నంలలోని రాష్ట్రస్థాయి లేబొరేటరీల్లో ఆహార నమూనాల పరీక్షలు నెల రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. ఒంగోలు, ఏలూరుల్లోని ప్రజా రోగ్య ప్రయోగశాలలలో రూ.13 కోట్లతో ఆధునిక పరికరాల కొనుగోలుకు అనుమతిచ్చినట్లు వివరించారు.

Read More

భూధార్‌ ద్వారా భూమికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవచ్చు

ఒక వ్యక్తి ఆధార్‌ సంఖ్యతో వారి వయసు, చిరునామా, సిమ్‌కార్డులు, ఆదాయ వివరాలు తెలుసుకొనే తరహాలోనే భూమికి సంబంధించిన సర్వే, ఉప సర్వే నంబర్లు, విస్తీర్ణం, సరిహద్దులు, నేల రకం, ఎలా సంక్రమించింది, మ్యాప్‌, లింక్‌ డాక్యుమెంట్లు, బీమా, బ్యాంకు రుణాలు, మార్టిగేజ్‌ తదితర సమగ్ర సమాచారం తెలుసుకునేలా త్వరలోనే ‘భూధార్‌’ అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రెవెన్యూ శాఖను ఇటీవల ఆదేశించారు. భూధార్‌ అమలు లోకి వస్తే.. భూ ఆక్రమణలు, నకిలీ పత్రాల సృష్టికి అడ్డుకట్ట పడనుందని ప్రభుత్వం భావిస్తోంది. భూధార్‌ జారీకి ప్రతి భూమిని సర్వే చేయాల్సి ఉంటుంది. భూమి సరిహద్దులను అక్షాంశాలు, రేఖాంశాలతో గుర్తించి భూధార్‌ నమోదు చేస్తారు. సర్వే పూర్తికాక ముందు తాత్కాలిక, పూర్తయ్యాక శాశ్వత భూధార్‌ జారీ చేయనుంది. ప్రతి రిజిస్ట్రేషన్‌-మ్యుటేషన్‌కు సర్వేను తప్పనిసరి చేస్తూ భూభారతి చట్టంలో సెక్షన్లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికి కనీసం 43 మంది చొప్పున లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను ప్రభుత్వం నియమిస్తోంది. ప్రస్తుతం ఏడు వేల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇటీవల సర్వే నిర్వహించిన పైలట్‌ గ్రామాల్లో భూధార్‌ కార్డులను తొలుత జారీ చేసి, తరువాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో 70.50 లక్షల మంది రైతులకు 1.40 కోట్ల ఎకరాల సాగు భూములున్నాయి. భూ దస్త్రాలు యాజమాన్య హక్కుల చట్టం (ఆర్వోఆర్‌) కింద ప్రతి కమతానికి పట్టా పాసుపుస్తకం జారీ చేస్తుండగా.. అందులో పలు సర్వే నంబర్ల కింద ఉన్న భూమి వివరాలు తప్ప ఏమీ ఉండటం లేదు.
భూధార్‌లో ఒక రైతుకు చెందిన భూమి సమగ్ర వివరాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా కమతాలన్నింటినీ కంప్యూటరీకరించడం, ప్రభుత్వం వద్ద భూమికి సంబంధించిన పథకాలన్నింటినీ జోడించే ప్రక్రియలను చేపట్టనున్నారు.
అనంతరం ఆర్వోఆర్‌ 2025 భూభారతి చట్టంలోని సెక్షన్‌ (రూల్‌ 9) ప్రకారం రాష్ట్రంలోని ప్రతి కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను జారీ చేయనున్నారు.
ఆన్‌లైన్‌లో ఈ సంఖ్యను నమోదు చేస్తే భూమి సమగ్ర వివరాలు ఇట్టే తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. దీనికోసం రెవెన్యూశాఖ ఇప్పటికే కార్యాచరణ చేపట్టింది.
డిజిటల్‌ ఇండియా భూ దస్త్రాల ఆధునికీకరణ పథకంలో భాగంగా ప్రతి కమతానికి యూఎల్‌పిన్‌/భూ ఆధార్‌ / భూధార్‌ జారీ చేయాలని కేంద్రం సూచిస్తోంది. పలు రాష్ట్రాలు ఇప్పటికే తాత్కాలిక లేదా శాశ్వత భూధార్‌ కార్డుల జారీని ప్రారంభించాయి.

Read More

బి.ఎస్సీ అగ్రికల్చర్‌ డ్యూయల్‌ డిగ్రీ కోర్స్‌లో ప్రవేశాలకు 18న కౌన్సెలింగ్

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు ఆస్ట్రేలియాకు చెందిన వెస్ట్రన్‌ సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న బి.ఎస్సి అగ్రికల్చర్‌ డ్యూయల్‌ డిగ్రీ కోర్స్‌లో ప్రవేశాల కోసం ఈ నెల 18వ తేదీన కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జిఈసిహెచ్‌ విద్యాసాగర్‌ తెలిపారు. విశ్వవిద్యాలయం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని ఆయన సూచించారు. వెస్ట్రన్‌ సిడ్నీ యూనివర్సిటీ మరియు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలు అందిస్తున్న ఈ కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్‌ రాజేంద్రనగర్‌లోని నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం, ఆడిటోరియంలో 18వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నారు.

Read More

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ‘పశు పోషకులు అప్రమత్తంగా ఉండాలి’

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వరదలు వచ్చే అవకాశం ఉన్నందున పశుపోషకులంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ పశు సంవర్ధక శాఖ సంచాలకుడు డాక్టర్‌ టి. దామోదర్‌ నాయుడు తెలిపారు. ఈ మేరకు కొన్ని సూచనలు చేశారు. ‘పశువులు సహా ఇతర జీవాల షెడ్లను పొడిగా ఉంచి వాటి చుట్టూ బ్లీచింగ్‌ పౌడర్‌ వంటివి చల్లాలి. ఈ కాలంలో సంభవించే వ్యాధుల నుంచి వాటిని రక్షించుకుంటూ ప్రభుత్వం ఉచితంగా అందించే నట్టల నివారణ మందులు, వ్యాధి నిరోధక టీకాలను వేయించాలి. లేగదూడలకు వెచ్చని వాతావరణం కల్పించాలి. పశువులకు సురక్షిత నీటిని అందించాలి. తడిసిన దాణా పెట్టకూడదు. పశువులకు అనారోగ్య లక్షణాలు కనిపించినా లేదా చనిపోయినా సమీప పశువైద్యశాలలో తప్పకుండా తెలియజేయాలి’ అని దామోదర్‌ వివరించారు.

Read More

ఉచిత చేపపిల్లల పంపిణీకి అనుమతి

గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని ఈ ఏడాదీ అమలు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2025-26 సంవత్సరానికి 90 కోట్ల చేపపిల్లలను రూ. 122 కోట్లతో కొనుగోలు చేసి పంపిణీ చేయాలని ఆదేశించింది. నెలాఖరు వరకు టెండర్లు పిలిచి వచ్చేనెల 15 నాటికి వాటిని ఖరారు చేయాలని మత్స్యశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

Read More