వాతావరణ మార్పులను అడ్డుకోవడానికి అన్ని దేశాలు సహకరించుకోవాలి
వాతావరణ మార్పులను అడ్డుకోవడంలో సంపన్న దేశాలు, వర్థమాన దేశాల మధ్య సత్వరం అంగీకారం కుదరకపోతే సమయం మించిపోతుందని 30వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్ 30) సభ అధ్యక్షుడు ఆందే కొరియా డు లాగో సోమవారం హెచ్చరించారు. వాతావరణ మార్పుల నిరోధం గురించి చర్చించడానికి, ప్రపంచ దేశాలతో సమన్వయం నెరపడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించడాన్ని ఆయన తప్పుబట్టారు. కర్బన ఉద్గార రహిత అభివృద్ధి సాధనకు సంపన్న దేశాలు చేయూతనివ్వాలని వర్ధమాన దేశాలు కోరుతుంటే.. సంపన్న దేశాలు దానికి నిరాకరించడమే కాకుండా వర్ధమాన దేశాలు తమ పాట్లు తాము పడాలన్నట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కాలుష్య కారక శిలాజ ఇంధనాల స్థానంలో జీవ ఇంధనాల వినియోగాన్ని బ్రెజిల్, భారత్లో పెద్ద ఎత్తున చేపట్టాయని వివరించారు. అయితే ఇది ఖరీదైన పరిష్కారమార్గం కాబట్టి.. దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని సూచించారు.











