తెలంగాణా రాష్ట్రంలోని మార్కెట్‌ యార్డుల్లో సౌరవిద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సౌరవిద్యుత్‌ సంస్థ ద్వారా దీనిని అమలు చేయనుంది. తొలిథలో పైలట్‌ ప్రాజెక్టుగా వరంగల్‌, నిజామాబాద్‌, గద్వాల, సూర్యాపేట మార్కెట్‌ యార్డులను ఎంపిక చేసింది. శుక్రవారం వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంస్థ అధికారులతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. సంస్థ అధికారులు ఈ వారంలోనే ఆయా యార్డులను సందర్శించి ముందుగా ప్లాంటు ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తిస్తారు. ఆయా యార్డుల్లో విద్యుత్‌ వినియోగాన్ని గుర్తించి దానికంటే అధిక సామర్థ్యం గల సౌరవిద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. యార్డు అవసరాలు పోనూ మిగిలిన విద్యుత్‌ను విద్యుత్‌ పంపిణీ సంస్థలకు విక్రయించనున్నారు.