రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలి

విదేశీ పప్పులు, నూనెల దిగుమతులపై సుంకాలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వాణిజ్య విధానాల వల్లే రైతులు నష్టపోతున్నారని తెలగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర రైతులు పండించిన వరి, మక్కలు కొనకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని దుయ్యబట్టారు. గిట్టుబాటు, ఆదాయం, డిమాండుకు అనుగుణంగా పప్పులు, కూరగాయలు, ఆయిల్‌పాం వంటి ఉద్యాన పంటలు సాగుచేయాలని కర్షకులకు పిలుపునిచ్చారు. వ్యవసాయ ప్రణాళికపై ఖమ్మం కలెక్టరేట్‌లో మంత్రి బుధవారం సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘మన మామిడిపండ్లకు జపాన్ లో డిమాండ్ ఉన్నా.. రసాయన అవశేషాల పేరిట ఆ దేశం తిరస్కరించింది. ఇకనైనా రైతులు అధిక రసాయనాల వాడకం తగ్గించాలి. ఈసారి ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆరుతడి పంటల సాగుకు రైతులు మొగ్గుచూపాలి’ అని పేర్కొన్నారు. సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్‌నాయక్, మట్టా రాగమయి, కలెక్టర్ దివాకర, సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ పాల్గొన్నారు.

Read More

తెలంగాణాలో ఉచిత చేపపిల్లల పంపిణీ

రూ. 125 కోట్లతో తెలంగాణలో 2026-27 సంవత్సరానికిగాను 95 కోట్ల చేప, రొయ్య పిల్లల ఉచిత పంపిణీ పథకం అమలుకు రాష్ట్ర మత్స్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వచ్చే నెలలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి జులై ఆరంభంలో పంపిణీ చేపట్టేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా ఈ పథకం సాగుతోంది. మొదట్లో మే నెలలో టెండర్లు పిలిచి జూన్‌లో చేపపిల్లలను పంపిణీ చేసేవారు. పెండింగ్ బిల్లులు, పథకం కొనసాగింపుపై సందిగ్ధత ఇతర కారణాల వల్ల కొన్నేళ్లుగా టెండర్ల నిర్వహణలో జాప్యం జరుగుతోంది. గతానుభవాల దృష్ట్యా ఈ ఏడాది పథకం అమలులో లోటుపాట్లు లేకుండా అమలు చేసేందుకు మత్స్యశాఖ సన్నద్ధమవుతోంది.

Read More

సెర్ప్ నుంచి గ్రామీణ మహిళలకు కొత్త పథకం

రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గ్రామీణ మహిళలకు జీవనోపాధి, ఆర్థిక సాధికారత కల్పించేందుకు జూన్ 2 నుంచి కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. దీనికింద మహిళలతో పొట్టేళ్ల యూనిట్లు, గొర్రె, మేక పిల్లల పెంపకం కేంద్రాలు, నాటు కోళ్లు, ఈము పక్షుల కొనుగోళ్ల యూనిట్లు ఏర్పాటు చేయిస్తారు. వారికి బ్యాంకు లింకేజీలు, రివాల్వింగ్ ఫండ్లు, సబ్సిడీల ద్వారా ఆర్థికసాయం అందిస్తారు. పథకానికి ఎంపికైన మహిళా సంఘాల లబ్దిదారులకు పశువైద్య వర్సిటీ శిక్షణ ఇస్తుంది. దీనిపై పీవీ నరసింహారావు తెలం గాణ పశువైద్య విశ్వవిద్యాలయంతో సెర్ప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం హైదరాబాద్ బీఆర్‌కే భవన్‌లో సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, పశు వైద్య వర్సిటీ రిజిస్ట్రార్ శరత్‌చంద్ర ఒప్పందంపై సంతకాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు తెలంగాణ స్వయంసహాయక సంఘాల అభ్యున్నతి, పశుసంపద వృద్ధి కోసం ఒప్పందం చేసుకున్నట్లు దివ్యా దేవరాజన్ తెలిపారు.

Read More

భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందంతో రైతుల్లో భయం

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంతో రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ…”రైతులు పంటల ఎంపిక, పెట్టుబడుల ప్రణాళిక, మార్కెట్ పరిస్థితుల అంచనాలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో పరిస్థితి ప్రతికూలంగా మారింది. వాణిజ్య ఒప్పందం కారణంగా ఏర్పడిన అనిశ్చితి వల్ల ఏ పంట వేయాలి… ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయాల్లో రైతులకు కేంద్రం నుంచి మార్గదర్శకాలు అందడం లేదు. దీంతో రాష్ట్రాలు సందిగ్ధంలో ఉన్నాయి. ఎరువుల సరఫరా విషయంలో కూడా స్పష్టత లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. ఏప్రిల్‌కు కేటాయించిన ఎరువులు ఇంకా అందలేదు. రైతులకు నష్టం కలిగించే ఈ వాణిజ్య ఒప్పందాన్ని ఉపసంహరించాలి. ఎరువుల సరఫరాపై స్పష్టమైన హామీ ఇవ్వాలి” అని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి సూచించారు.

Read More

రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల

తెలంగాణలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో రూ.2206 కోట్లు రైతు భరోసా రెండో విడత కింద మంగళవారం జమయ్యాయి. గత నెల 23న సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా మొదటి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న 68,89,955 మందికి, తాజాగా సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్పల్లిలో సీఎం రెండో విడతలో రెండు ఎకరాల వరకు భరోసా నిధులను విడుదల చేశారు. గత రెండు విడతల్లో కలిపి ఇప్పటివరకు రైతు భరోసా కోసం రూ.5,653 కోట్లు విడుదల కాగా మొత్తం 71.06 లక్షల మంది రైతులు లబ్ది పొందారని మంత్రి వివరించారు. రైతు భరోసాలో ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో 5,40,693 మంది రైతులకు రూ.448.09 కోట్లు, ఖమ్మం జిల్లాలో 3,45,142 మందికి రూ. 271.52 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 3,66,343 మందికి రూ.271.05 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 3,28,818 మందికి రూ.246.30 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 2,98,352 మందికి రూ.236.49 కోట్లు జమయ్యాయి.

Read More

విడుదలైన వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు

రైతుభరోసా రెండో విడత నిధులు రైతుల ఖాతాల్లో విడుదలైన వెంటనే జమ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతుభరోసాపై ఆదివారం తన నివాసంలో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో సోమవారం సీఎం చేతుల మీదుగా 45,11,947 మంది రైతులకు మొత్తం 36,76,766 ఎకరాల కోసం రూ.2,206.06 కోట్ల విడుదలకు సంబంధించిన సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ సహా రాష్ట్రంలోని అన్ని బ్యాంకులకు తెలియజేయాలని సూచించారు. సీఎం నిధులను విడుదల చేయగానే ఆ నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో వెంటనే జమ కావాలన్నారు. మొదటి విడతలో కొన్ని బ్యాంకులు రైతుల ఖాతాలను నిలిపివేయడం వల్ల వారికి నిధులు అందలేదని, ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు.

శనగ, పొద్దుతిరుగుడు కొనుగోళ్లపై పరిమితి ఎత్తివేయాలి*మొక్కజొన్న పంటను నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు కేంద్రం ముందుకు రావాలని, శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న 25 శాతం పరిమితిని ఎత్తివేసి పూర్తిగా కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఆదివారం లేఖ రాశారు. ‘పంటలకు మద్దతు ధరల ప్రకటనకే కేంద్రం పరిమితమవుతోంది. మద్దతు ధరకు మార్కెట్ ధరకు భారీ వ్యత్యాసం వల్ల రైతులకు నష్టం వాటిల్లుతోంది. కొనుగోలులో కొత్త విధానంతో పత్తి రైతులను నష్టపరిచేందుకు పథకం వేస్తోంది. శివరాజ్‌సింగ్ ఈ వ్యవహారాలను సమీక్షించి రైతులకు మేలు కలిగే నిర్ణయాలు తీసుకోవాలి’ అని తుమ్మల లేఖలో కోరారు.

Read More

90 లక్షల టన్నుల ధాన్యం ఈ యాసంగిలో ఉత్పత్తి అవుతుంది

“తెలంగాణలో యాసంగి పంటలో వచ్చే ధాన్యం ఉప్పుడు బియ్యం మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ నుంచి 30 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డితో కేంద్ర మంత్రిని దిల్లీలో కలిసి ఈ అంశంపై చర్చించారు. దేశవ్యాప్తంగా ఈ బియ్యానికి డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ విభాగం అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. ఇందులో మొత్తం 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (5% నూకతో), 5 లక్షల మెట్రిక్ టన్నుల ముడి బియ్యం (10% నూకతో) సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం” అని రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రికి వినతిపత్రమిచ్చారు. 2014-15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించి రూ.1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీఎం కోరారు. రాష్ట్రంలో ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నామని, దీని కారణంగా పౌర సరఫరాలశాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే బకాయిలు విడుదల చేయించాలని విన్నవించారు. ఉప్పుడు బియ్యం సరఫరాకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి చేసిన ప్రతిపాదనలకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Read More

తెలంగాణాలో కూరగాయల రైతులకు సమీపంలోనే విక్రయ కేంద్రాలు

కూరగాయ పంటలు పండించే చోటే స్థానిక మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 60 ప్రాంతాలను దీని కోసం గుర్తించింది. కూరగాయల సాగు విస్తీర్ణం పెంపుదల ప్రణాళికలో భాగంగా రైతు సమస్యలపై ఉద్యానశాఖ, ఉద్యానవర్సిటీలు అధ్యయనం చేశాయి. పంటలు పండించిన తర్వాత విక్రయాలు, మార్కెటింగ్ సమస్యగా మారిందని, దీంతో రైతులు సాగుకు వెనకాడుతున్నారని అధ్యయనంలో తేల్చింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 36 రైతుబజార్లు మాత్రమే ఉన్నాయి. అవీ నగరాలు, పట్టణాల్లోనే ఏర్పాటయ్యాయి. తెల్లవారుజామునే పంటను అక్కడికి తరలించడం రైతులకు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో అన్నదాతలకు తమ గ్రామాల సమీ పంలోనే మార్కెట్లను ఏర్పాటు చేసి క్రయవిక్రయాలకు అవకాశం కల్పించాలని ఉద్యానశాఖ, వర్సిటీలు సూచించాయి. దీనికి అనుగుణంగా స్థలాలను గుర్తించాలని సర్కారు అన్ని జిల్లాల కలెక్టర్లను ఇటీవలే ఆదేశించింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల రహదారులకు సమీపంలో రవాణా సౌకర్యం ఉన్నవాటికి ప్రాముఖ్యం ఇవ్వాలని సూచించింది. కలెక్టర్లు మొదటి విడతలో 60 ప్రాంతాలను గుర్తించారు. అక్కడ కూరగాయల నిల్వ, విక్రయాల కోసం మార్కెటింగ్ శాఖ షెడ్లను నిర్మించనుంది. కూరగాయల లభ్యతపై సమీప గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. రవాణా కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకులా లకు అక్కడి నుంచే కూరగాయలు పంపిణీ చేయనున్నారు.

Read More

71.86 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

తెలంగాణాలో ఖరీఫ్ 2025-26 సీజన్‌లో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మొత్తం 71.86 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందులో సన్నధాన్యం 39.08 లక్షల టన్నులు కాగా, దొడ్డు ధాన్యం 32.78 లక్షల టన్నులు. సన్న ధాన్యం రైతులకు క్వింటాకు రూ.500 అదనంగా చెల్లించారు. కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8,448 కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. సాగు పెరగడంతో పాటు ఇటు పీపీసీలకు సన్నాలు భారీగా వచ్ౘ్ాయి. సేకరించిన ధాన్యంలో 71.83 లక్షల టన్నుల్ని పౌరసరఫరాల సంస్థ రైస్ మిల్లులకు తరలించింది. 0.03 లక్షల టన్నుల ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7.49 లక్షల మంది రైతులు సన్న ధాన్యాన్ని విక్రయించగా.. ఇందులో 99.25% మంది అన్న దాతలకు ప్రభుత్వం సోమవారం నాటికి రూ.1,939.58 కోట్లను బోనస్‌గా అందించింది. మరో రూ.14.62 కోట్లు చెల్లించాల్సి ఉంది.

Read More

నారాయణపేటలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

తెలంగాణాలోని నారాయణపేట జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.కోటి విలువైన పత్తి విత్తనాలను పట్టుకున్నారు. సోమవారం జిల్లా పోలీసుశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ డా. వినీత్ వివరాలు వెల్లడించారు. నారాయణపేట మండలం బండగొండ, కొత్తపల్లి మండలం భూనీడ్ గ్రామాల్లో నకిలీ పత్తి విత్తనాలు అక్రమంగా నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. జిల్లా పోలీసులు, టాస్క్‌ఫోర్స్, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా ఆదివారం సాయంత్రం ఆయా గ్రామాల్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. భూనీడ్‌కు చెందిన తండ్రీకొడుకులు బాలకృష్ణనాయుడు, శశివర్దన్‌నాయుడు ఇళ్ల నుంచి రూ.కోటి విలువైన 10 టన్నుల (100 క్వింటాళ్లు) నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు. రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలను సరఫరా చేసినా, అమ్మినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కేసును ఛేదించిన డీఎస్పీ లింగయ్య, సీఐలు శివశంకర్, సైదులు, ఎస్సైలు రాముడు, విజయ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ బృందం, వ్యవసాయశాఖ అధికారులను అభినందించారు.

Read More
  • 1
  • 2