ఉల్లిగడ్డ అలియేసీ కుటుంబానికి చెందిన ద్వి వార్షిక మొక్క అధిక ఔషధ గుణములు మరియు కొన్ని రకాల చికిత్సలకు ఉపయోగ పడుతుంది. ఇది సాధారణంగా సమశీతోష్ణ వాతావరణంలో అధిక దిగుబడినిచ్చే మొక్క కానీ ఉష్ణ మండల, ఉప ఉష్ణ మండల ప్రాంతాలలో కూడా పెరుగును. దీర్ఘకాలిక పగటి కాంతి ఉల్లిపాయలో లశునము ఊరడానికి సహకరిస్తుంది కానీ ఉష్ణోగ్రత మొక్క పుష్పించడానికి దోహదపడుతుంది. ఉల్లిపాయను దాదాపు ప్రపంచంలోని అన్ని సంస్కృతుల ప్రజలు వంటలలో నిత్యావసర పదార్థంగా వాడతారు. ఇది వంటకి రుచి, సువాసనని అందిస్తుంది. దీన్ని సలాడ్‌ రూపంలో కూడా తీసుకుంటారు. ఉల్లిపాయలో వివిధ రకాల విశిష్ట రసాయన పదార్థాలున్నాయి. అవి ఫ్లవోనోయిడ్స్‌, ఆంథోసైయానిన్స్‌, ఫ్రక్టో ఒలిగో శకరైడ్‌, ఆర్గానో-సల్ఫర్‌లు ఔషధంగా ఆరోగ్యాన్ని పెంచి రుగ్మతలు, డయాబెటిస్‌ నుండి కాపాడతాయి. భారతదేశం నుండి వివిధ దేశములకు ఎగుమతి అయ్యే ఫలములు, కూరగాయలలో ఉల్లిగడ్డ ద్వారా వచ్చే ఆదాయపు వాటా శాతము 26%. చైనా ప్రపంచంలోనే ఉల్లి సాగులో మొదటి స్థానంలో ఉంటే భారత దేశం రెండవ స్థానంలో ఉన్నది. భారతదేశంలో ఉల్లిపాయలు అధికంగా పండే రాష్ట్రం మహారాష్ట్ర కాగా తదనంతర స్థానంలో కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణలో ఉండే వాతావరణ పరిస్థితులు ఉల్లి సాగుకు అనుకూలమైనవి. నాణ్యమైన విత్తనం అందుబాటులో లేకపోవడం, తెగుళ్లు, చీడల బెడద, ఉల్లిపాయను సాగుచేసే విస్తీర్ణం తక్కువ ఉండటం ఇలాంటి వివిధ కారణాల వల్ల రాష్ట్రం నుండి ఉత్పత్తి అయ్యే ఉల్లిపాయ దిగుబడి ఆశించినంత స్థాయిలో లేదు. కానీ ఆధునిక సాంకేతికత, నూతనంగా విడుదల అయిన ఉల్లి వంగడాలు, ఉత్పత్తిలో మెలకువలు సంక్షిప్త కీటక, వ్యాధి నివారణ, సాగులో మెలకువలు పాటించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉల్లి ఉత్పత్తిని గణనీయంగా పెంచవచ్చు.

సాగు చేయు ప్రాంతాలు, సమయం

తెలంగాణ రాష్ట్రంలో ఉల్లిపాయను ఖరీఫ్‌ (ఆగష్టు – నవంబర్‌) మరియు రబి (ఏప్రిల్‌ – జూన్‌) రెండు కాలములలో సాగు చేస్తారు కాని అధికంగా ఉత్పత్తి అయ్యేది రబీ కాలంలోనే. తెలంగాణలో ఉల్లిని సాగుచేసే ప్రాంతాలు వరుసగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, వరంగల్‌. ఉల్లిగడ్డ లశుణం సరిగ్గా పెరగకపోవడానికి గల కారణాలు ఉల్లిగడ్డ లశునము సరిగ్గా ఎదగక ముందే పుష్పించడం, దుంప పగుళ్లు వచ్చుట, సరైన ఉల్లిగడ్డ విత్తన రకమును ఎంచుకోవడములో తప్పిదం, నిస్సారమైన భూమి, ప్రతికూల పర్యావరణ కారకములు, ఉల్లిగడ్డ నిల్వచేయడంలో తగిన జాగ్రత్త చర్యలు చేపట్టక పోవడం.

నేలలు, వాతావరణం

భూ సారము అధికంగా ఉండి, సరి అయిన మురుగు నీరు పోయే సౌకర్యం ఉన్న ఇసుక నేలలు మరియు చల్లని వాతావరణము ఉల్లిపాయలో సరయిన పెరుగుదలకు దోహదపడే అంశాలు. దీర్ఘకాలిక కాంతి ఉండి ఉష్ణోగ్రత తక్కువ ఉన్నప్పుడు దుంప ఎదుగుదల సరిగ్గా జరుగుతుంది. ఉష్ణమండల తెలంగాణ ప్రాంతాలలో దీర్ఘకాల కాంతి వంగడాలను పెంచుకోవడానికి అనుకూలమైనవి. అధిక ఉష్ణోగ్రత స్వల్ప ఆర్ద్రత ఉండే వాతావరణంలో దుంప త్వరగా ఎదుగుతుంది. ఉల్లిగడ్డ శీతకాలాపు పంట, దుంపల కోసం, ఆకు కోసం సాగు చేస్తారు. 

సరైన వంగడాలు: N 2-4-1, ఆర్కా నికేతన్‌, అగ్రి ఫౌండ్‌ లైట్‌ రెడ్‌, పూస రెడ్‌, భీమా రాజ్‌ మరియు భీమా రెడ్‌ అనేవి రబి సీజన్లో సాగు చేయుటకు అనుకూలమైన రకాలు.

విత్తనం ఎంపిక, నారుమడి తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఉల్లిగడ్డను విత్తనము ద్వారా గాని, లేదా చిన్న దుంపల ద్వారా గాని సాగు చెయ్యవచ్చు. నారు మొక్కలు చాలా అనువైనవి నారు మొక్కలను ముందుగా నిర్మించుకున్న నారుమడిలో విత్తనాలను తగినంత దూరములో విత్తుకోవాలి. బెడ్‌లను భూమి నుంచి 10-15 సెం.మీ. ల ఎత్తులో నిర్మించుకోవాలి ప్రతి రెండు బెడ్‌ ల మధ్య కనీస నిడివి 50సెం.మీ. లు ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల అంతరకృషి సులభతరమగును రెండు విత్తన వరసల మధ్య దూరము 4-5 సెం.మీ.లు ఉండేట్లు చూసుకోవాలి. నారుకుళ్లు తెగులును అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకుని 4-6 వారాల వయసున్న నారు మొక్కలను ప్రధాన నాటుకోవాలి. 

నీరు, యాజమాన్యం

ఉల్లిమొక్క నీటి ఎద్దడిని దుంప ఊరే దశ, దుంప అభివృద్ధి చెందే దశలో అస్సలు తట్టుకోలేదు. పంట పరిపక్వత దశకు చేరుకున్న తరవాత అధిక నీరు ఇచ్చినట్లయితే ద్వితీయ వేర్లు వస్తాయి తద్వారా దిగుబడి తగ్గే అవకాశం ఉంది. పంట కోసే రెండు వారాల ముందు నుండి నీటి సరఫరా ఆపి వేయాలి. ఉల్లి సాగులో నీటిని తుంపర సేద్యము, బిందు సేద్యము ద్వారా అందించినచో సంప్రదాయ పద్ధతి లో సాధించే దానికన్నా ఎక్కువ దిగుబడి పొందవచ్చు. బిందు సేద్యము ద్వారా నీటిలో కరిగే పోషకాలను వాడటం సరైన లాభాలను ఆర్జించవచ్చు. పశు సంబంధిత వ్యర్ధాలు, పంట వ్యర్ధాలు, పచ్చి రోట్ట ఎరువులను వాడటం, పంట మార్పిడి, మృత్తికా పరీక్ష అనంతరం సూచించిన మోతాదులో నియమిత ఫర్టిలైజర్‌ ను అందించటం మేలైనది. ఒక హెక్టార్‌ భూమికి సుమారు 40 టన్నుల పశవుల ఎరువు వాడటం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చు. 

కలుపు నివారణ: ఉల్లి మొక్క వేరు వ్యవస్థ చిన్నధి అందువల్ల కలుపు ను అస్సలు తట్టుకోలేదు. సరైన సమయములో కలుపు ను నియంత్రన చర్యలు చేపట్టాలి. 

అంతర పంటల సాగు

ఒకే  సంవత్సరంలో వరసగా కేవలము ఉల్లిగడ్డ ను సాగు చేయకూడదు. దీనివల్ల భూమి యొక్క సారము తగ్గిపోవును, చీడ పీడల ఉధృతి అధికమగును. రసాయనిక ఎరువులు వాడటానికి బదులుగా ఇతర జాతి పంటలను పండించడం ద్వారా నేల సారవంతంగా మారును. ఉల్లి స్వల్పకాలపు పంట కాబట్టి రెండు ఋతువుల మధ్య అంతర పంట సాగు చెయ్యవచ్చు. బెండి, ముల్లంగిల మధ్య అంతర పంటగా ఉల్లిని సాగు చేయడము ద్వారా అధిక లాభాలు పొందవచ్చు. అన్నిటికంటే బీట్‌రూట్‌తో ఉల్లిని 15 సెం.మీ.ల వ్యవధితో సాగు చేసినప్పుడు అధిక లాభాలు గణించవచ్చు.

పంట పరిపక్వత దశ,  కోయు విధానం

నిల్వ చేసే ఉల్లిపాయలను కోత కోయడానికి మెడ విరుపు దశ,అత్యంత ముఖ్యమైనది. దాదాపుగా 75% పై ఆకులు నేలకు ఒరగడం ఇది మొక్క పూర్తిగా కోతకు వచ్చిందని సూచిస్తుంది. కోతకు 2-3 వారాల సమయం ముందు నీరు అందించడం ఆపాలి. కోత కోసే సమయం లో సమయంలో దుంపలను భూమి నుండి లాగి ఆకుల చివరలను కత్తిరించాలి. కోసిన దుంపలను వ్యవసాయ భూమి లోనే 2-3 వారాలు దుంపల పై ఉన్న పొలుసులు పూర్తిగా పొడిగా అయ్యే అంత వరకు ఆరనివ్వాలి.  ఆకు పచ్చని ఉల్లి పాయల కోసం దుంపలను భూమి నుండి లాగి కాడలను 15 సెం.మీ. లు ఉండే విధంగా కత్తిరించాలి.

చీడ పీడలు, తెగుళ్లు నివారణ

ఉల్లిలో చీడపీడలు, తెగుళ్లు కూడా అధికమే, కేవలం తామర పురుగుల ద్వారా 50% పంట నష్టం జరుగుతుంది. తామర పురుగులు పొడిగా వేడిగా ఉండే వాతావరణంలో అధిక నష్టాన్ని కలుగ చేస్తాయి. ఇవే కాకుండా మొక్కలకు నీరు పెట్టేటప్పుడు, ఆచ్ఛాదన, నాటుపెట్టే సమయం వల్ల  కూడా తామర పురుగుల ఉధృతి పెరుగును. వివిధ రకాల సేంద్రియ కషాయాలు మరియు ద్రావణాలతో తామర పురుగుల ఉధృతిని అరికట్టవచ్చు బవేరియా బస్సియానా అనబడే శిలీంద్రంను వాడటం ద్వారా అనేక రకాల చీడలను అరికట్ట వచ్చు. అస్పెర్గిల్లస్‌నైజర్‌ మరియు ఫ్యూసేరియం అనే శిలీంద్ర జాతులు విత్తనము ద్వారా దుంపలలో కూడా వ్యాపిస్తుంది. అధిక ఉష్ణోగ్రత ఆర్థ్రత వున్న పరిస్థితులలో నారుకుళ్ళు తెగులు ద్వారా 75-80 శాతము నష్టం కలుగును. ఎదుగుదల థలో అధిక నీటి వల్ల నారుకుళ్లు, ఊదారంగు మచ్చ  వ్యాధి సోకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది తగిన మోతాదులో నీటిని అందించడం వలన అరికట్టవచ్చు.              

డా. బి. అశోక్‌ కుమార్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, వెజిటబుల్‌ సైన్స్‌, మల్లారెడ్డి యూనివర్సిటి, బి. గౌతమి, పిహెచ్‌.డి. స్కాలర్‌, ఐఏఆర్‌ఐ, న్యూఢిల్లీ.