తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న పత్తి కొనుగోళ్లు కార్యకలాపాలపై మార్కెటింగ్‌ శాఖ అధికారులతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులు జిన్నింగ్‌ మిల్లులను ఆకస్మిక తనిఖీలు చేయాలని, వరి కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా పర్యవేక్షించాలని, రైతులకు కావాల్సిన అన్ని మౌళిక సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్రంలో మేజర్‌ మార్కెట్‌ కమిటీలను ఆధునీకరించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. బుధవారం సెక్రటేరియట్‌లో జరిగిన పత్తి కొనుగోళ్లపై సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పత్తి కొనుగోళ్లపై సమగ్ర వివరాలు అందించే విధంగా ఒక వెబ్‌ పోర్టల్‌ తయారు చేయడం జరిగిందని, దీని ద్వారా సీసీఐ వారు ఇప్పటి వరకు ఎంత పత్తిని కొనుగోలు చేశారో, ఎంత పత్తిని రిజెక్ట్‌ చేశారో అన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగిందని మంత్రి అన్నారు. మార్కెటింగ్‌ అధికారులు, ప్రాంతీయ అధికారులు జిన్నింగ్‌ మిల్లులను ఆకస్మిక తనిఖీలు చేసి, రిపోర్టును డైరెక్టర్‌ మార్కెటింగ్‌ శాఖ వారికి అందించాలని ఆదేశించారు. ప్రధాన కార్యదర్శితో మాట్లాడి, వరి కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా పర్యవేక్షించాలని తెలిపారు.
మార్కెటింగ్‌ సెంటర్లలో ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలను ఉపయోగించుకొని దగ్గరలోని సీసీఐ సెంటర్లలోనే పత్తిని అమ్ముకోవాలని రైతులకు సూచించారు. రైతులు పత్తిలో తేమశాతం 8 నుండి 12 మధ్యలో ఉంచుకున్నట్టయితే అధిక మద్ధతు ధరను పొందవచ్చని, అలాగే పత్తి అమ్ముకోవడంలో ఏమైనా సమస్యలు ఎదురయితే ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్‌ చాట్‌ యాప్‌ (8897281111) ద్వారా తెలియజేయగలరని మంత్రి పేర్కొన్నారు.