పంటల సాగులో ఎరువుల వినియోగం చాలా కీలకమైనది. సాధారణంగా రైతులు ఎరువులు నేలకు నేరుగా వేస్తారు. భాస్వరం, పొటాష్ ఎరువుల్ని పైరు విత్తే ముందే వేస్తారు. నత్రజని ఎరువును 2-3 దఫాలుగా వేస్తారు. దీనివల్ల పైరుకు రెండు మూడు నెలల పాటు అవసరమయ్యే పోషకాలు ముందే వెయ్యటం వల్ల, అధిక శాతం ఎరువు వృథా అవుతున్నాయి. దీనివల్ల సాగు ఖర్చు పెరగటంతో పాటు నేల కాలుష్యం, వాతావరణ కాలుష్యం జరుగుతుంది. మరియు పైర్లు ఆశించిన స్థాయిలో పెరగక దిగుబడులు తగ్గుతున్నాయి.
ఇటీవలి కాలంలో ఎరువుల్ని పైరు ఎదుగుదల థలకు అనుగుణంగా ఎరువుల అవసరాన్ని బేరీజు వేస్తూ డ్రిప్ పద్ధతి నీటితో పాటుగా అందిస్తే ఎరువుల ఆదాతో పాటు పైరు దిగుబడులు గణనీయంగా పెరిగినట్లు పరిశోధనలలో తేలింది. దీని కోసం పంట మొక్కల వయసును బట్టి పోషకాల అవసరాన్ని లెక్కకట్టి, ఆయా పోషకాలకు కావలసిన ఎరువుల్ని నీటిలో కరిగించి, డ్రిప్ లైన్ల ద్వారా మొక్కల మొదళ్ల దగ్గర ఎరువు ద్రావణాన్ని అందిస్తారు. ప్రత్తి, చెరకు, మొక్కజొన్న వంటి ఆరు తడి పంటలకు మరియు టమాట వంగ వంటి కూరగాయ పంటలకు, బొప్పాయి, జామ వంటి పండ్ల తోటలకు నేరుగా ఎరువు ద్రావణాన్ని డ్రిప్ లైన్ల ద్వారా ఇవ్వటానికి అవసరమైన ఎరువుల మోతాదును, వినియోగించవలసిన ఎరువులను సిఫార్సు చేస్తున్నారు. పైరుకు అవసరమయ్యే పోషకాలు పైరు వివిధ థల్లో ఎరువు ద్రావణం రూపంలో డ్రిప్ ద్వారా అందించడాన్ని ఫెర్టిగేషన్ అంటారు.
ఫెర్టిగేషన్ పద్ధతిలో ఎరువు ద్రావణాన్ని ఫెర్టిగేషన్ ట్యాంకు ద్వారా గాని, వెంచురీ లేదా ఫెర్టిగేషన్ పంపు ద్వారా అందించవచ్చు. ఈ ఫెర్టిగేషన్ పరికరం డ్రిప్ యంత్రం కంట్రోలు హెడ్ దగ్గర అమర్చబడి ఉంటుంది. ఫెర్టిగేషన్ పరికరం ద్వారా వచ్చే ఎరువు ద్రావణం మెయిన్ లైన్లోని నీటితో కలిసి ఫిల్టరు ద్వారా మరల మెయిన్ లైన్లోకి వెళ్లునట్లు చేస్తారు. ఈ విధంగా చేయడం వలన ఎరువు ద్రావణంలో ఉన్న మలినాలు ఫిల్టరు అవుతాయి.
ఫెర్టిగేషన్ వల్ల కలిగే లాభాలు
* పైరు ఎదుగుదలకు అనుగుణంగా పోషకాలు అందించటం వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. పంట మొక్కలకు వయసును బట్టి కావల్సిన మోతాదులో పోషకాలు అందుతాయి.
* ఎరువులను నేరుగా మొక్క మొదళ్ల వద్ద అందించటం వల్ల వృథాను అరికట్టవచ్చు. ఎరువుల వినియోగం 25 శాతం తగ్గుతుంది.
* పంట దిగుబడి దాదాపు 30 నుండి 40 శాతం పెరిగే అవకాశం ఉంది.
* పంట ఉత్పత్తుల నాణ్యత మెరుగవుతుంది.
* వాలు ఎక్కువ ఉన్న పొలాల్లో డ్రిప్ ద్వారా ఎరువు అందించే పద్ధతి అత్యంత అనుకూలమైనది.
డ్రిప్ పద్ధతిలో సాగు చేసే పంటలకు ఎరువులు వాడకంలో మెలకువలు

* రేగడి నేలలకు ఫెర్టిలైజరు ట్యాంకు పరికరాన్ని వాడాలి. తేలికపాటి భూముల్లో ఫెర్టిలైజరు ఇంజక్టరు పరికరాన్ని వాడాలి.
* ప్రతిరోజు ఫెర్టిగేషన్ ద్వారా పోషకాలను అందించటం అత్యంత శ్రేయస్కరం. కనీసం వారానికి రెండుసార్లయినా పైర్లకు ఫెర్టిగేషన్ చెయ్యాలి.
* పంట మొక్క వయసు బట్టి పోషకాల అవసరం దృష్ట్యా సరైన ఎరువులను ఎంపిక చేసుకోవాలి.
* సాగు నీటి నాణ్యతను పరీక్షించుకోవాలి. సాగు నీటిలో అధిక కాల్షియం, మెగ్నీషియం, సల్ఫేట్, ఇనుము, మాంగనీసు గనక ఉంటే అవి ఎరువు సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.
* ఒకే ట్యాంకులో కలిపిన వివిధ ఎరువుల కంపేటబిలిటీ ఉండాలి.
* పంటకు సిఫార్సు చేసిన మొత్తం పోషకాల మోతాదు, పూర్తి పంటకాలానికి సరిపోయేలా రోజు వారి మోతాదును లెక్కగట్టాలి.
* ద్రవ లేదా పొడి రూపంలో ఉండే ఎరువులను టాంకులో కలిపేటపుడు, టాంకు పరిమాణంలో 70 శాతం మించకుండా ఉండేటట్లు జాగ్రత్త పడాలి. డ్రిప్ ద్వారా ఎరువులు అందించడం, డ్రిప్ సాగు నీరు పద్ధతిలో అంతర్భాగమై ఉండాలి.
* ఫెర్టిగేషన్ ప్రక్రియ ప్రారంభించే ముందు కొద్దిసేపు డ్రిప్ ద్వారా నీటిని వదలాలి. దీని వల్ల పొలం అంతటా సమానమైన ఒత్తిడితో నీరు విడుదలవుతుంది. ఫెర్టిగేషన్ తరువాత, కొనసాగింపుగా నీటిని డ్రిప్పర్ల ద్వారా కొద్దిసేపు పంపించాలి. దీనివల్ల పైపులలో మరియు డ్రిప్పర్లలో ఉండే ఎరువు అవశేషాలు కడిగి వేయబడతాయి.
పి. గురుమూర్తి, ప్రొఫెసర్ అండ్ హెడ్, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ విభాగం, వ్యవసాయ కళాశాల, నైరా-532185 ఫోన్: 9491567949

