ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని జాతీయ స్థాయిలో అత్యుత్తమ పది సంస్థలలో నిలపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపకులపతి ప్రొఫెసర్‌ ఆల్దాస్‌ జానయ్య పిలుపునిచ్చారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయం 37వ ర్యాంకులో ఉందని రానున్న మూడేళ్లలో విశ్వవిద్యాలయం పది లోపు ర్యాంక్‌ సాధించాలని ఆయన సూచించారు. ఈ మధ్యనే ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన ఆల్దాస్‌ జానయ్య ఈరోజు రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఉద్యోగులు, విద్యార్థులతో సమావేశం అయ్యారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ ఉప కులపతి సహా ఇప్పటికి తాను 15 బాధ్యతలు చేపట్టానని వివరించారు.
తనకు ఈ అవకాశం కల్పించిన కులపతి, రాష్ట్ర గవర్నర్‌, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రికి జానయ్య ధన్యవాదములు తెలిపారు. సమష్టి కృషితో విశ్వవిద్యాలయాన్ని ముందుకి తీసుకెళదామని పిలుపునిచ్చారు. జనవరిలోగా విశ్వవిద్యాలయ అధికారుల పదవులని భర్తీ చేస్తామన్నారు. సాంకేతిక అర్హత లేకపోయినా కొన్ని ప్రయివేటు సంస్థలు వ్యవసాయ కోర్సులలో ప్రవేశాలు చేపట్టడం దురదృష్టం అన్నారు. సామాన్యులకి వ్యవసాయ విద్యని అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు ప్రత్యేక కోటా సీట్లు భారీగా పెంచి, ఫీజులు సగానికి తగ్గించామని వివరించారు. విశ్వవిద్యాలయంలోని ఖాళీలని ప్రభుత్వ విధానాలకి అనుగుణంగా భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామని జానయ్య తెలిపారు. బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటుమన్నారు. తనకి ఎవరితోనూ వ్యక్తిగత విబేధాలు లేవని, విశ్వవిద్యాలయం చట్టం తనకు బైబిల్‌ అని స్పష్టం చేశారు. తాను పూర్తి ప్రజాస్వామిక విధానాలని అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకుంటానని వివరించారు. ఇదే మాతృక విశ్వవిద్యాలయం అని, త్వరలోనే వజ్రోత్సవం (Diamond Jubilee) నిర్వహిస్తామని జానయ్య ప్రకటించారు. టాసా అధ్యక్షులు ప్రొఫెసర్‌ బి. విద్యాసాగర్‌, బోధనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రధాన కార్యదర్శి అమృత రెడ్డి, విద్యార్థుల ప్రతినిధులు పూజ, బాలకోటి, పూర్వ విద్యార్థుల ప్రతినిధి కవిరాజ్‌లు ప్రసంగించారు. జానయ్యని అభినందించారు. ఆయన సారధ్యంలో విశ్వవిద్యాలయం అభివృద్ధిలో సాగాలని, తమ అంశాలని సానుకూలంగా పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.