పశువుల్లో బెబీసియోసిస్ లేదా ఎరుపు మూత్ర వ్యాధి

బెబీసియోసిస్‌ను టిక్ ఫీవర్ లేదా టెక్సాస్ ఫీవర్ లేదా పైరోప్లాస్మోసిస్ లేదా రెడ్ వాటర్ డిసీస్ అని కూడా అంటారు. ఈ వ్యాధి రిపిసెఫాలస్ మైక్రోప్లస్ (పూర్వపు పేరు బూఫైలస్ మైక్రోప్లస్) అనే జాతికి చెందిన గోమార్ల ద్వారా వ్యాప్తి చెందును. ఈ వ్యాధి బెబీసియా బైజెమినా మరియు బెబీసియా బోవిస్ అనే ఏకకణ పరాన్నజీవుల (ప్రోటోజోవా) వలన పశువుల్లో సోకుతుంది. ఈ వ్యాధి గేదెలలో కంటే విదేశీ జాతి పశువులు మరియు సంకరజాతి పశువులలో ఎక్కువగా సోకుతుంది.

వ్యాధి లక్షణాలు:
వ్యాధి సోకిన పశువులలో అధిక జ్వరం (105-107 డిగ్రీల ఫారెన్‌హీట్), మేత తినవు. నీరసంగా ఉంటాయి. కంటి పొరలు రక్తలేమితో ఉంటాయి. రక్తహీనత మరియు కామెర్లు వంటి లక్షణాలుంటాయి. మూత్రం కాఫీరంగులో ఉండడం ఈ వ్యాధి ప్రత్యేక లక్షణం. వ్యాధి సోకిన పాడి పశువులలో పాలుతగ్గడం, దుక్కి దున్నే పశువులలో పని సామర్థ్యం తగ్గడం మరియు చూలు పశువులు ఈసుకుని పోవడం సంభవిస్తుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది.

చికిత్స:
వ్యాధి సోకిన పశువులకు ఇమిడోకార్బ్ అనే మందును 1 మి.గ్రా./కిలో బరువు చొప్పున కండరానికి ఇవ్వాలి. లేదా డైమినజిన్ అసిటురేట్ (బెరినిల్) అనే మందును 3.5 మి.గ్రా. / కిలో బరువు చొప్పున కండరానికి ఇవ్వాలి. వీటితో పాటుగా, టెట్రాసైకిన్స్ అనే యాంటిబయాటిక్‌ను, డెక్స్‌ట్రోస్, సెలైన్స్, బి-కాంప్లెక్స్ మరియు ఐరన్ ఇంజక్షన్స్ కూడా ఇవ్వాలి.

నివారణః
ఈ వ్యాధి ముఖ్యంగా గోమార్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కావునా గోమార్ల నివారణకు డెల్టామెత్రిన్ లేదా సైపర్‌మెత్రిన్ అనే మందును 2 మి.లీ./1లీ. నీటితో పశువులపై పిచికారి చేసి, పశువుల శరీరంపై ఉన్న బాహ్యపరాన్న జీవులను నిర్మూలించాలి. పోరఆన్ (ఫ్లుమెత్రిన్) అనే మందును పశువుల శరీరంపై తలభాగం నుండి తోక వరకు వెన్నెముకపై ఒక గీత లాగా పోసినచో ఈ గోమార్లను నిర్మూలించవచ్చు.

డా॥ పొట్టబత్తుల మల్లేష్, సహాయ ఆచార్యులు, ఫోన్: 9030427110,
డా. యస్. రమేష్ భూమయ్య, సహఆచార్యులు మరియు విభాగాధిపతి, ఫోన్: 8897851699
పశువైద్య పరాన్నజీవ శాస్త్ర విభాగం, పశువైద్య కళాశాల, కోరుట్ల, జగిత్యాల జిల్లా

Read More

మొక్కల ఎదుగుదలకు, ఫలదీకరణ శక్తి పెరగడానికి చేప అమినో ఆమ్లం

రైతు వారీగా అతి తక్కువ శ్రమ, స్వల్ప ఖర్చుతో తయారు చేసుకోగలిగేది చేప అమినో ఆమ్లం. చేపలతో అమినో ఆమ్లాలను తయారు చేసుకునే పద్ధతిని కొరియా వ్యవసాయ శాస్త్రజ్ఞుడు డాక్టర్ చోహాన్ క్యూ రూపొందించారు. ఈ విధానాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ప్రాకృతిక రైతులు ఆచరిస్తున్నారు.

తయారు చేసే విధానం : ముందుగా చేప పొలుసులు, ఈకలు, తోకలు తొలగించాలి. తరువాత చేపను చిన్న, చిన్న ముక్కలుగా కోయాలి. చేప ముక్కలను తూకం వేసి దానికి సరిసమానంగా బెల్లం కలపాలి. వాటిని ఒక ప్లాస్టిక్ జాడి లేదా బకెట్‌లో మూడవ వంతు వరకు నింపుకుని పైన గుడ్డ కట్టి నీడలో పెట్టుకోవాలి. కనీసం రోజుకు ఒకసారి కలియబెట్టాలి. వాతావరణ పరిస్థితులను బట్టి 10 నుండి 15 రోజుల్లో చిక్కటి ద్రావణం తయారవుతుంది. తయారైన ద్రావణం నుండి మధురమైన వాసన వస్తుంది. ఒకవేళ చేపల వాసన వస్తుంటే దానికి మరింత బెల్లం కలిపి మరో 4,5 రోజులుంచాలి.

తయారైన ద్రావణాన్ని లీటరు నీటికి 1 నుంచి 4 మి.లీ. కలిపి పిచికారి చేసుకోవాలి. దీనిని అన్ని పంటలపై పిచికారి చేసుకోవచ్చు.
Read More

ఆధునిక వ్యవసాయానికి మొబైల్ యాప్‌లు – రైతులకు డిజిటల్ మార్గదర్శి

“వ్యవసాయమే భారతదేశానికి వెన్నెముక” అనే మాట నేటికీ సత్యమే. అయితే నేటి రైతు వ్యవసాయం చేయడం అంత సులభం కాదు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, కొత్తరకం పురుగులు–తెగుళ్ల విజృంభణ, నేల సారం తగ్గుదల, పోషక లోపాలు, నీటి కొరత వంటి ఎన్నో సమస్యలు పంట దిగుబడిని, నాణ్యతను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సరైన సమయంలో సరైన సమాచారం రైతుకు అందడం అత్యంత అవసరం. డిజిటల్ సాంకేతికత విస్తరించిన ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ రైతుకు మరో వ్యవసాయ పనిముట్టుగా మారింది. చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా ఇప్పుడు రైతు తన పొలానికి సంబంధించిన అనేక విషయాలను క్షణాల్లో తెలుసుకునే అవకాశం కలిగింది. పురుగులు, తెగుళ్లను గుర్తించడం నుంచి వాతావరణ సూచనలు తెలుసుకోవడం వరకు, పంటల సాగు సలహాలు పొందడం నుంచి ఎరువులు, మందుల వినియోగంపై సూచనలు తెలుసుకోవడం వరకు అనేక సేవలు మొబైల్ యాప్‌ల ద్వారా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు మరియు వ్యవసాయ నిపుణుల నుంచి శాస్త్రీయ సలహాలను కూడా నేరుగా రైతుల చేతికి చేరవేస్తున్నాయి. దీనివల్ల రైతులు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని నష్టాలను తగ్గించుకోవడంతో పాటు దిగుబడిని పెంచుకునే అవకాశం పొందుతున్నారు.

రైతులకు ఈ సేవలను మరింత చేరువ చేయడానికి భారత ప్రభుత్వంతో పాటు పలు వ్యవసాయ పరిశోధనా సంస్థలు అనేక మొబైల్ అప్లికేషన్లను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చాయి. వీటిని గూగుల్ ప్లే స్టోర్ లేదా సంబంధిత అధికారిక వెబ్‌సైట్ల నుంచి సులభంగా డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించవచ్చు. ఈ యాప్‌లు పరిశోధనలో రూపొందిన శాస్త్రీయ సాంకేతికతను నేరుగా రైతు పొలం వరకు తీసుకెళ్లే వారధిగా పనిచేస్తున్నాయి.

  1. Plantix (ప్లాంటిక్స్)
    ప్రపంచవ్యాప్తంగా రైతులు ఎక్కువగా ఉపయోగిస్తున్న వ్యవసాయ మొబైల్ అప్లికేషన్లలో ప్లాంటిక్స్ (Plantix) ఒకటి. రైతులు దీనిని “పంటల డాక్టర్” అని కూడా పిలుస్తుంటారు. పంటలో కనిపించే సమస్యలను వేగంగా గుర్తించి శాస్త్రీయ పరిష్కారాలను సూచించడం ఈ యాప్ ప్రత్యేకత. రైతులు పంట ఆకులు, కాండం, కాయలు లేదా ఇతర భాగాలపై కనిపించే లక్షణాలను మొబైల్‌తో ఫోటో తీసి ఈ యాప్‌లో అప్లోడ్ చేస్తే, కేవలం కొన్ని సెకన్లలోనే సమస్యను విశ్లేషించి అది పురుగు ఉధృతా, తెగులా లేదా పోషక లోపమా అనే విషయాన్ని గుర్తించి తెలియజేస్తుంది. అంతేకాకుండా సమస్యకు కారణాలు, నివారణ చర్యలు, సిఫారసు చేసిన పురుగుమందులు లేదా శిలీంద్రనాశకాలు, పోషక నిర్వహణ పద్ధతులను కూడా సూచిస్తుంది.

ఈ యాప్‌లో 700 కంటే ఎక్కువ పంటల పురుగులు, తెగుళ్లు మరియు పోషక లోపాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంది. రైతులు ప్రపంచంలోని ఇతర రైతులతో తమ అనుభవాలను పంచుకునే అవకాశం కూడా ఇందులో కల్పించారు. అలాగే, GPS సాంకేతికత ఆధారంగా సమీప ప్రాంతాల్లో ఏవైనా పురుగులు లేదా తెగుళ్లు ఎక్కువగా వ్యాపిస్తున్నట్లయితే ముందుగానే హెచ్చరికలు అందిస్తుంది. స్థానిక వాతావరణ సమాచారాన్ని కూడా అందించడం వల్ల పిచికారీ, కలుపు నివారణ, నీటిపారుదల వంటి వ్యవసాయ పనులను సరైన సమయంలో చేపట్టేందుకు రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది.

రైతులకు ఉపయోగాలు
పంటలో కనిపించే లక్షణాలు ఏ సమస్యకు సంబంధించినవో తెలియక రైతులు తరచూ అయోమయానికి గురవుతుంటారు. అలాంటి సందర్భాల్లో ప్లాంటిక్స్ యాప్ తక్షణమే సమస్యను గుర్తించి శాస్త్రీయ పరిష్కారాలను సూచించడం ద్వారా సరైన మందును, సరైన మోతాదులో, సరైన సమయంలో ఉపయోగించేందుకు దోహదపడుతుంది. దీంతో అనవసరంగా మందుల వినియోగం తగ్గి సాగు ఖర్చులు ఆదా కావడంతో పాటు పంటను నష్టాల నుంచి కాపాడుకోవచ్చు. రైతు చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను “వ్యవసాయ సలహాదారుగా” మార్చే యాప్‌లలో ప్లాంటిక్స్ ఒకటి.

  1. RiceXpert (రైస్ ఎక్స్‌పర్ట్)
    వరి రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఐసీఏఆర్–జాతీయ వరి పరిశోధన సంస్థ- కటక్ అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ రైస్ ఎక్స్‌పర్ట్ (RiceXpert). వరి సాగుకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని ఒకే వేదికపై రైతులకు అందించాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ యాప్, వరి రైతులకు డిజిటల్ వ్యవసాయ సహాయకుడిగా పనిచేస్తోంది.

పొలంలో కనిపించే పురుగులు, తెగుళ్లు, నులిపురుగులు (నెమటోడ్లు), కలుపు మొక్కలు, పోషక లోపాలు లేదా పోషకాల అధికత వంటి సమస్యలను రైతులు ఈ యాప్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. సమస్యకు సంబంధించిన ఫోటో, సందేశం లేదా వాయిస్ రికార్డును పంపితే నిపుణుల నుంచి శాస్త్రీయ సలహాలు అందుతాయి. అంతేకాకుండా, సమస్యకు అనుగుణంగా సిఫారసు చేసిన పురుగుమందు, దాని సరైన మోతాదు, ఎరువుల లెక్కింపు (Fertilizer Calculator) వంటి వివరాలను కూడా ఈ యాప్ అందిస్తుంది.

ఈ యాప్‌లో వివిధ వరి రకాలు, వ్యవసాయ యంత్రాలు, వాతావరణ సమాచారం, తాజా వ్యవసాయ వార్తలు, ఈ-సలహా (e-Advisory), ఈ-మార్కెటింగ్ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. రైతులు తమ సందేహాలను నేరుగా వ్యవసాయ శాస్త్రవేత్తలకు పంపి తక్షణ పరిష్కారం పొందవచ్చు. అలాగే వరి ఉత్పత్తులను కొనుగోలుదారులకు పరిచయం చేసే అవకాశాన్ని కూడా ఈ యాప్ కల్పిస్తుంది.

రైతులకు ఉపయోగాలు
వరి సాగులో ఎదురయ్యే సమస్యలను త్వరగా గుర్తించి, సరైన సమయంలో సరైన నివారణ చర్యలు చేపట్టేందుకు రైస్ ఎక్స్‌పర్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎరువులు, పురుగుమందులను ఖచ్చితమైన మోతాదులో వినియోగించడానికి మార్గనిర్దేశం చేయడం వల్ల సాగు ఖర్చులు తగ్గి, పంట దిగుబడి మరియు నాణ్యత మెరుగుపడతాయి. అంతేకాకుండా, వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు నేరుగా రైతుల చేతికి చేరడం ద్వారా శాస్త్రీయ వరి సాగు మరింత సులభంగా మారుతుంది.

  1. Crop Doctor (క్రాప్ డాక్టర్)
    క్రాప్ డాక్టర్ (Crop Doctor) అనేది రైతులు తమ పంటల్లో వచ్చే సమస్యలను త్వరగా గుర్తించి, శాస్త్రీయ పరిష్కారాలను పొందేందుకు రూపొందించిన మొబైల్ అప్లికేషన్. దీనిని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం (IGKV), రాయ్‌పూర్ మరియు నేషనల్ ఇఇన్ఫర్ మాటిక్స్ సెంటర్ (NIC) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ యాప్ ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు కూడా సులభంగా ఉపయోగించుకునే విధంగా రూపొందించబడింది.

రైతులు పంటలో కనిపించే పురుగులు, తెగుళ్లు లేదా పోషక లోపాల లక్షణాలను మొబైల్‌తో ఫోటో తీసి ఈ యాప్‌లో అప్లోడ్ చేస్తే, వాటిని విశ్లేషించి సంభావ్య సమస్యను గుర్తించి తగిన యాజమాన్య సూచనలను అందిస్తుంది. వరి, కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు వంటి ప్రధాన పంటలకు సంబంధించిన సమస్యలను గుర్తించి, వాటి నివారణకు అవసరమైన శాస్త్రీయ సలహాలను అందించడం ఈ యాప్ ప్రత్యేకత. అదనంగా, ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సబ్సిడీలు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, తాజా వ్యవసాయ సమాచారం వంటి ఉపయోగకరమైన వివరాలను కూడా రైతులకు చేరవేస్తుంది.

రైతులకు ఉపయోగాలు
పంటలో సమస్య కనిపించిన వెంటనే వ్యవసాయ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్మార్ట్‌ఫోన్ ద్వారానే ప్రాథమిక నిర్ధారణ చేసుకునే అవకాశం ఈ యాప్ కల్పిస్తుంది. సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల సరైన సమయంలో సరైన నివారణ చర్యలు చేపట్టవచ్చు. దీంతో పంట నష్టాన్ని తగ్గించడంతో పాటు, అనవసరంగా పురుగుమందులు లేదా ఎరువుల వినియోగాన్ని కూడా నివారించవచ్చు. రైతులకు శాస్త్రవేత్తల సలహాలను వేగంగా అందిస్తూ, పొలం మరియు వ్యవసాయ నిపుణుల మధ్య వారధిగా ఈ యాప్ సమర్థవంతంగా పనిచేస్తుంది.

  1. Kisan Suvidha (కిసాన్ సువిధా)
    రైతులకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని ఒకే వేదికపై అందించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2016లో కిసాన్ సువిధా మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. రైతులు రోజువారీ వ్యవసాయ నిర్ణయాలను సులభంగా తీసుకునేందుకు అవసరమైన అనేక సేవలను ఈ యాప్ ఒకే చోట అందిస్తుంది. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో అందుబాటులో ఉండటం వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు సులభంగా ఉపయోగించుకోవచ్చు.

ఈ యాప్ ద్వారా రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో పాటు ఐదు రోజుల వాతావరణ సూచనలను తెలుసుకోవచ్చు. దీనివల్ల పిచికారీ, కోత, నీటిపారుదల వంటి వ్యవసాయ పనులను వాతావరణానికి అనుగుణంగా ప్రణాళిక చేసుకోవచ్చు. అదనంగా, వివిధ పంటలకు సంబంధించిన స్థానిక మార్కెట్ ధరలు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రాలు, గోదాములు, కోల్డ్ స్టోరేజ్ కేంద్రాల సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది.

పంటల్లో వచ్చే పురుగులు, తెగుళ్లను గుర్తించి వాటి నివారణకు అవసరమైన సమీకృత పురుగు యాజమాన్య సూచనలు కూడా ఈ యాప్ అందిస్తుంది. అంతేకాకుండా, రైతులు తమ సందేహాలను వ్యవసాయ నిపుణులకు పంపించి వ్యక్తిగత సలహాలు పొందే అవకాశం కూడా కల్పించబడింది. దీంతో శాస్త్రీయ పద్ధతులను అనుసరించి పంటలను సమర్థవంతంగా నిర్వహించడం సులభమవుతుంది.

రైతులకు ఉపయోగాలు
వ్యవసాయానికి సంబంధించిన అనేక సేవలను ఒకే యాప్‌లో అందించడం కిసాన్ సువిధా ప్రత్యేకత. వాతావరణ సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చు. మార్కెట్ ధరల ఆధారంగా సరైన సమయంలో పంటను విక్రయించి మంచి ధర పొందే అవకాశం ఉంటుంది. అలాగే, శాస్త్రీయ సలహాలు, పురుగులు–తెగుళ్ల నివారణ పద్ధతులు, వ్యవసాయ పరికరాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే చోట పొందడం వల్ల రైతులు సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు శాస్త్రీయంగా, లాభదాయకంగా వ్యవసాయం చేయడానికి ఈ యాప్ ఎంతో దోహదపడుతుంది.

  1. ANGRAU DAATTC App
    ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) ఆధ్వర్యంలోని జిల్లా వ్యవసాయ సలహా మరియు శిక్షణ కేంద్రాలు రైతులకు శాస్త్రీయ వ్యవసాయ సమాచారాన్ని వేగంగా చేరవేయడానికి ANGRAU DAATTC Appను అభివృద్ధి చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ యాప్, వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు రైతుల మధ్య సమర్థవంతమైన సమాచార వారధిగా పనిచేస్తోంది.

ఈ యాప్ ద్వారా రైతులు పంటల వారీగా సాగు సిఫారసులు, మెరుగైన వంగడాల వివరాలు, పురుగులు–తెగుళ్ల గుర్తింపు మరియు యాజమాన్య పద్ధతులు, పోషక నిర్వహణ, వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వంటి శాస్త్రీయ సమాచారాన్ని పొందవచ్చు. అదనంగా, రైతులకు క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలకు సంబంధించి వ్యవసాయ నిపుణుల సలహాలు, తాజా వ్యవసాయ సాంకేతికతలు, శిక్షణా కార్యక్రమాలు, క్షేత్ర ప్రదర్శనలు మరియు విశ్వవిద్యాలయం విడుదల చేసే తాజా సూచనలు కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి.

ఈ యాప్‌లో రైతులు తమ పంటలో కనిపించే సమస్యలను ఫోటోల రూపంలో పంపించి శాస్త్రవేత్తల సలహాలు పొందే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా, జిల్లాల వారీగా రైతులకు అవసరమైన సాంకేతిక సమాచారం, హెచ్చరికలు మరియు అత్యవసర వ్యవసాయ సూచనలు సకాలంలో అందించడం ద్వారా పంట నష్టాలను తగ్గించేందుకు ఈ యాప్ దోహదపడుతోంది.

రైతులకు ఉపయోగాలు
ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ANGRAU DAATTC App ద్వారా స్థానిక పరిస్థితులకు అనుగుణమైన శాస్త్రీయ వ్యవసాయ సలహాలను సులభంగా పొందవచ్చు. పురుగులు, తెగుళ్లు, పోషక లోపాలు వంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టవచ్చు. అలాగే, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పనులను ప్రణాళిక చేసుకోవడంతో పాటు, విశ్వవిద్యాలయం సిఫారసు చేసిన ఆధునిక సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా పంట దిగుబడిని పెంచుకోవడం, సాగు వ్యయాన్ని తగ్గించడం మరియు లాభదాయకమైన వ్యవసాయాన్ని సాధించడం సాధ్యమవుతుంది.

  1. Kapas Kisan (కపాస్ కిసాన్)
    పత్తి రైతులు తమ పంటను కనీస మద్దతు ధర కింద సులభంగా విక్రయించేందుకు భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ కపాస్ కిసాన్. పత్తి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా మరియు రైతు స్నేహపూర్వకంగా మార్చేందుకు ఈ యాప్‌ను రూపొందించారు.

ఈ యాప్ ద్వారా రైతులు ఇంట్లో నుంచే స్వీయ నమోదు చేసుకోవచ్చు. అనంతరం సమీపంలోని CCI కొనుగోలు కేంద్రంలో పత్తిని విక్రయించేందుకు తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని ముందుగానే ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది. పత్తి నాణ్యత పరీక్ష, ఆమోదించిన పరిమాణం, చెల్లింపు ప్రక్రియ వంటి వివరాలను కూడా రైతులు తమ మొబైల్‌లోనే రియల్ టైమ్‌లో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, విక్రయించిన పత్తికి సంబంధించిన చెల్లింపు స్థితిని కూడా ఈ యాప్ ద్వారా సులభంగా పరిశీలించవచ్చు.

రైతులకు ఉపయోగాలు
కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా ప్రభుత్వ MSP కొనుగోలు వ్యవస్థతో అనుసంధానమవుతారు. కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుంది. మొత్తం కొనుగోలు ప్రక్రియ డిజిటల్ రూపంలో ఉండటంతో పారదర్శకత పెరిగి, చెల్లింపుల వివరాలు కూడా స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో రైతులు కనీస మద్దతు ధరను సకాలంలో పొందడంతో పాటు, పత్తి విక్రయ ప్రక్రియను సులభంగా, వేగంగా పూర్తి చేసుకోవచ్చు.

  1. APAIMS 2.0
    ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరియు వ్యవసాయ శాఖకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేయడానికి రూపొందించిన సమగ్ర మొబైల్ అప్లికేషన్ APAIMS 2.0. కృత్రిమ మేధస్సు (AI), మెషిన్ లెర్నింగ్ (ML), ఉపగ్రహ సమాచారం, భౌగోళిక సాంకేతికతలను ఉపయోగించి రైతులకు వేగవంతమైన, పారదర్శకమైన మరియు శాస్త్రీయ సేవలను అందించడం ఈ యాప్ ప్రధాన లక్ష్యం.

ఈ యాప్ ద్వారా రైతులు ఈ-పంట నమోదు, భూమి వివరాలు, రైతు యూనిక్ ఐడీ, ప్రభుత్వ పథకాల అర్హత, విత్తనాలు, ఎరువుల పంపిణీ, సబ్సిడీలు, పంటల స్థితి, వాతావరణ సమాచారం వంటి అనేక సేవలను ఒకే వేదికపై పొందవచ్చు. అంతేకాకుండా, పొలం స్థాయిలో పురుగులు, తెగుళ్లపై ముందస్తు హెచ్చరికలు, పంటల ఆధారంగా వ్యక్తిగత వ్యవసాయ సూచనలు, సమస్యలను ఫోటోల ద్వారా అధికారులకు పంపే సౌకర్యం కూడా ఇందులో ఉంది. రైతు సేవా కేంద్రాలు (RSKs), వ్యవసాయ అధికారులు మరియు రైతులను ఒకే డిజిటల్ వేదికపై అనుసంధానించడం ద్వారా వ్యవసాయ సేవలను మరింత సమర్థవంతంగా అందించే ప్రయత్నం ఈ వ్యవస్థ చేస్తోంది.

రైతులకు ఉపయోగాలు
APAIMS 2.0 ద్వారా రైతులు ప్రభుత్వ వ్యవసాయ సేవలను కార్యాలయాల చుట్టూ తిరగకుండా మొబైల్‌లోనే పొందగలుగుతున్నారు. ఈ-పంట నమోదు, ప్రభుత్వ పథకాల లబ్ధి, విత్తనాలు మరియు ఎరువుల పంపిణీ వివరాలు, పంటలపై వ్యక్తిగత సలహాలు, వాతావరణ హెచ్చరికలు వంటి సేవలు ఒకే యాప్‌లో అందుబాటులో ఉండటం వల్ల సమయం, శ్రమ ఆదా అవుతాయి. అంతేకాకుండా, పొలం స్థాయిలో ముందస్తు పురుగు–తెగుళ్ల హెచ్చరికలు అందడం వల్ల రైతులు తక్షణ నివారణ చర్యలు చేపట్టి పంట నష్టాలను తగ్గించుకోవచ్చు. రాష్ట్రంలో డిజిటల్ వ్యవసాయానికి నాంది పలికిన సమగ్ర వ్యవసాయ వేదికగా APAIMS 2.0 రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారుతోంది.

ముగింపు
వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో మొబైల్ అప్లికేషన్లు రైతుకు కొత్త బలంగా మారాయి. పంట సాగు ప్రారంభం నుంచి కోత వరకు ప్రతి దశలో రైతుకు అవసరమైన సమాచారం, శాస్త్రీయ సలహాలు, వాతావరణ హెచ్చరికలు, పురుగులు–తెగుళ్ల యాజమాన్యం, పోషక నిర్వహణ, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాల వివరాలను ఒకే వేదికపై అందిస్తూ వ్యవసాయాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి. ప్లాంటిక్స్, రైస్ ఎక్స్‌పర్ట్, క్రాప్ డాక్టర్, కిసాన్ సువిధా, ఫార్మ్-ఓ-పీడియా, ఏఎన్‌జీఆర్‌ఏయూ డాట్టిక్, కపాస్ కిసాన్, ఏపీఏఐఎంఎస్ 2.0 వంటి మొబైల్ అప్లికేషన్లు రైతులకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. వీటి వినియోగం ద్వారా పురుగులు, తెగుళ్లను ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థవంతంగా నివారించడంతో పాటు, ఎరువులు మరియు పురుగుమందులను శాస్త్రీయ పద్ధతిలో వినియోగించడం వల్ల సాగు వ్యయం తగ్గి పంట దిగుబడి, నాణ్యత, లాభదాయకత పెరుగుతాయి.
అయితే, ఈ మొబైల్ అప్లికేషన్లు రైతులకు సహాయక సాధనాలు మాత్రమే. వాటి ద్వారా అందిన సమాచారాన్ని స్థానిక పరిస్థితులు, నేల స్వభావం, వాతావరణం, పంట దశలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ అధికారులు సూచించే సాంకేతిక సలహాలతో సమన్వయం చేసుకొని అమలు చేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. రానున్న రోజుల్లో కృత్రిమ మేధస్సు, ఉపగ్రహ సాంకేతికత, డ్రోన్లు, సెన్సార్ ఆధారిత వ్యవసాయం, ఖచ్చితత్వ వ్యవసాయం వంటి ఆధునిక సాంకేతికతలు ఈ మొబైల్ అప్లికేషన్లతో మరింతగా అనుసంధానమవుతాయి. దీంతో రైతులకు ప్రాంతాలకనుకూలంగా, పంటనిర్దిష్టంగా, సమయానుకూలంగా మరింత ఖచ్చితమైన సలహాలు అందుబాటులోకి వస్తాయి. ఇది వ్యవసాయాన్ని ఉత్పాదకంగా, లాభదాయకంగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
డిజిటల్ వ్యవసాయం అనేది భవిష్యత్తు కాదు… అది ఇప్పటికే వర్తమానమైంది. ఈ సాంకేతిక అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకుంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించడమే కాకుండా, ప్రకృతి వైపరీత్యాలు, పురుగులు–తెగుళ్ల వల్ల కలిగే నష్టాలను కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు. అందువల్ల ప్రతి రైతు కనీసం తన పంటకు ఉపయోగపడే ఒకటి లేదా రెండు విశ్వసనీయ వ్యవసాయ మొబైల్ అప్లికేషన్లను వినియోగించడం నేటి అవసరం.

డా. ఏం. ఉదయ్ భాస్కర్, డా. ఏం. ఉషా
వ్యవసాయ విస్తరణ విభాగం, ఆచార్య ఎన్. జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాం, గుంటూరు
ఫోన్: 9494666359

Read More

ఔషధ మొక్క… జీడి మామిడి

జీడిమామిడిని భూసారం తక్కువగా ఉన్న నేలల్లో భూమి కోతను తగ్గించడానికి సాగు చేస్తారు. జీడిమామిడి మధ్యస్త పరిమాణంలో ఉండే చెట్టు. ఇది ఎల్లప్పుడూ ఆకుపచ్చ రంగులో ఉండి, అనేక కొమ్మలు విస్తరించి ఉండి 12 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. ప్రథమ వేరు ప్రస్ఫుటంగా ఉండి అనేక ప్రక్క వేర్లు, సింకర్ వేర్ల వ్యవస్థ కలిగి ఉంటుంది. ఆకులు ఒకదానిని విడిచి ఇంకొకటిగా ఏర్పడి, అండాకారంలో, లేత ఆకుపచ్చ రంగులో గుండ్రని చివర్లు కలిగి 10-18 x 8-15 సెం.మీ. పరిమాణంలో చిన్న ఆకు తొడిమ కలిగి వుంటాయి. లేత ఆకులు ఎరుపు రంగు, ముదురు ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. జీడిమామిడి 3-5 సంవత్సరాలలో పూతకు వస్తుంది. పూగుచ్ఛం గుత్తిలో అనేక మగపూలు, ద్విలింగ పుష్పాలు ఏర్పడతాయి. జీడికాయ ఎండి, విషపూరిత గుల్లలో పెద్ద, వంపు తిరిగిన గింజ (2.5 సెం.మీ.) కలిగి ఉంటుంది. జీడి కాయ పసుపు రంగులో పలుచని చర్మంతో, మెత్తని కండతో, అధిక రసం కలిగి ఉంటుంది.

సాధారణ నామం : కాష్య్ణు, శాస్త్రీయ నామం : అనకార్డియం ఆక్సిడెంటేల్, కుటుంబం: అనకార్డియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • జీడిమామిడి సిరప్ దగ్గు, జలుబులకు మంచి మందు, జీడిమామిడి రసం సిఫిలిస్ చికిత్సలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.
  • పాతజీడిమామిడి లిక్కర్ తక్కువ మోతాదులో కడుపునొప్పి తగ్గిస్తుంది, జీడిమామిడి గుల్ల నుండి తీసిన నూనెని గ్రామస్థులు కాలి మడమ పగుళ్ళను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
  • జీడిమామిడిని కలరా, మూత్రపిండ సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • జీడిమామిడి పెంకు నుండి తీసిన నూనెని విరేచనకారిగా, మధుమేహం, కిడ్నీ సమస్యలు, కాలి మడమ పగుళ్ళ, ఆనెల నివారణలో ఉపయోగిస్తారు.
  • జీడి పప్పుని డయేరియా అరికట్టడానికుపయోగిస్తారు, మొగ్గలు, లేత ఆకులను చర్మవ్యాధులను నయం చేయడానికుపయోగిస్తారు.
  • గింజల రసాన్ని మానసిక సమస్యలకు, కీళ్ళనొప్పులకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • జీడిమామిడి పెంకు ద్రావణం ధాన్యం నిల్వలో ఆశించే ట్రైబోలియం కాస్టానియం పురుగుని నివారిస్తుంది, నత్తల నివారణలో ఉపయోగపడుతుంది.
  • జీడికాయ, పెంకులు బంబారా వేరుశనగ నిల్వలలో ఆశించే కాల్లసోబ్రూకస్ సబిన్నోటేటస్‌ని నివారిస్తాయి (ఒపరేక్, బన్ని, 2006)
  • జీడి మామిడి కాయ రసం (20%) కొబ్బరిలో ఎర్రముట్టె పురుగు (రెడ్‌పామ్ వీవిల్)ని కాండానికి ఇంజక్ట్ చేయడం, మొవ్వులో పోయడం ద్వారా సమర్ధవంతంగా నివారించవచ్చు. ఇది రసాయన పురుగుమందు కార్బరిల్‌కి ప్రత్యామ్నాయం.
  • జీడిమామిడి పెంకు ద్రవం నిల్వ ధాన్యాలను ఆశించే సైటోఫిలా ఒరైజే బీటిల్‌ని సమర్ధవంతంగా నివారిస్తుంది (బక్ట్సన్, అతని అనుచరులు, 2017).
  • జీడిమామిడి చెట్టు అన్ని భాగాల ద్రావణాలు కీటకనాశక, పురుగు వికర్షక లక్షణాలు కలిగి చెద పురుగులు, కాఫీ గింజలను తొలిచే తెల్ల పురుగులను నివారించాయి. గింజల నుండి తీసిన నూనె ప్రత్తిలో రెడ్ కాటన్ బగ్, పొగాకులద్దె పురుగులను అరికట్టాయి (రిచర్డ్ విలియం హే ఫ్లూక్, 1999)
  • జీడిమామిడి ద్రావణం (నీటిలో కలిపిన) అనేక చెట్లకు నష్టం కలిగించే మాక్రోటెరిమస్ చెద పురుగుని నివారించింది (ఓసిపిటన్, & ఓసెవేమి, 2012).
  • జీడిమామిడి ఆకు పొడి చెద పురుగు ఒడొంటో టెర్మెస్ ఒబెసస్‌ని 53.33% నివారించాయి (రంజిత్, అతని అనుచరులు, 2017).
  • జీడిమామిడి పెంకు ద్రవం శనగ పచ్చ పురుగు లార్వాలను నివారించింది (మహాపాత్రో, 2010).
  • జీడి మామిడి గింజల పొడి, ద్రావణం అలసంద గింజల నిల్వ సమయంలో ఆశించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ అలసంద బ్రూచిడ్)ని సమర్ధవంతంగా నివారించాయి (ఇలెకి, 2012).
  • జీడిమామిడి గింజల నూనె (3%) బెండ కాండం మరియు కాయతొలుచు పురుగు లార్వాలను 87.4% నివారించింది (ప్రవీణ; ఆమె అనుచరలు, 2012).
  • జీడి మామిడి గింజల పొడి ద్రావణం జొన్న గింజల నిల్వ సమయంలో ఆశించే పురుగు (సైటోఫిలస్ ఒరైజె)ని నివారించింది (ఇలెకి, అతని అనుచరులు, 2013)
  • జీడిమామిడి క్రూడ్ మిథనాల్ ద్రావణం క్యాబేజిలో డైమండ్ బ్యాక్‌మాత్‌ని నివారించింది. (మున్సెమన & ఆల్బర్టో, 2017).
  • జీడిమామిడి బంక ద్రావణం కొన్ని శిలీంద్రాలు, బాక్టీరియా పెరుగుదల నరికట్టింది. కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ (బ్రూచిడ్) పెద్ద పురుగుల సంఖ్యను తగ్గించింది. (మార్క్వెస్, అతని అనుచరులు, 1992)
  • జీడిమామిడి ద్రావణం క్షేత్రస్థాయిలో మాక్రోటెర్మస్ బెల్లికోసస్ (చెదపురుగు)ని పర్యావరణహిత పద్ధతిలో నివారించింది (ఓస్పిటాన్, ఒసెయెమి, 2012).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

దోసకాయ-మామిడికాయ పచ్చడి

వేపకుండా, ఉడికించకుండా తయారుచేసే సహజాహార వంటకం ఈ ‘దోసకాయ-మామిడికాయ’ పచ్చడి
దోసకాయను-మామిడికాయను బాగా కడిగి, చెక్కు తీసి కానీ, తీయకుండా కానీ, చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పచ్చిమిర్చి కానీ, పండుమిర్చి కానీ, బాగా కడిగి తుడిచి పెట్టుకోవాలి. (కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు).

సముద్రపు రాళ్ళ ఉప్పు కానీ, రాక్ సాల్ట్ కానీ తగినంత తీసుకోవాలి. మిక్సీలో కానీ రోట్లో కానీ పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి నూరుకోవాలి. తరువాత మామిడికాయ ముక్కలు మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా నూరుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నూరు కున్న పచ్చడిని, మామిడికాయ పచ్చడిగా కూడా తినవచ్చు. లేదంటే దోసకాయ ముక్కలు దానిలో కలిపి దోసకాయ ష మామిడికాయ పచ్చడిగా కూడా తినవచ్చు.

రెండు రకాలుగా చేసుకోవచ్చు.

అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. రోటీ, పుల్కా, చపాతీలలో కూడా బాగుంటుంది.

ఎండుమిర్చికంటే పచ్చిమిర్చి కానీ పండుమిర్చి కానీ వాడుకుంటే రుచి ఎక్కువ ఉంటుంది.
పండుమిర్చిఎండిన తర్వాత కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎండుమిర్చి తక్కువ వాడుకుంటే మంచిది.

మామిడికాయ బదులుగా చింతపండు కూడా వాడుకోవచ్చు. కానీ చింతపండు ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది. అందుకని మామిడికాయ వాడుకుంటే రుచిగా ఉంటుంది.

ఈ పచ్చడిని ఏ రోజుకు ఆరోజు తయారు చేసుకుని వాడుకోవడం మంచిది.

రచన : లతా కృష్ణమూర్తి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

చేప వ్యర్థాలతో పోషక మిశ్రమం

వికె-నార్డెప్ స్థానికంగా లభించే వనరుల ద్వారా సేంద్రియ పద్ధతిలో పంటల పెరుగుదలకవసరమైన ముఖ్య పోషకాలన్నీ కలిగి ఉన్న పోషక మిశ్రమాన్ని చేప వ్యర్థాలనుపయోగించి చేసే కొత్త టెక్నాలజీని రూపొందించింది.

 తయారీ విధానం : దీని తయారీకి సుమారు 20 కి. చేపల వ్యర్థాలను సేకరించి 40 లీ. సామర్థ్యం ఉన్న ప్లాస్టిక్ క్యాన్‌లో నిల్వ ఉంచాలి. దీనికి 10 లీ. నీటిని, 20-30 మి.లీ. బొప్పాయి పాలను (పపైన్) కలపాలి. (ముదిరిన ఆకుపచ్ౘ్రంగు బొప్పాయి కాయపై బ్లేడుతో చిన్నగాట్లు చేసి పాలను సేకరించాలి).

చేప వ్యర్థాలను పపైన్‌తో బాగా కలిపి 5-8 గంటలుంచాలి. పాత్రను మూసి ఉంచి ప్రతి గంటలకు ఒకసారి కలియత్రిప్పాలి.

పులియ బెట్టడం
5-8 గంటల తర్వాత బెల్లం ద్రావణాన్ని (4 కి. బెల్లాన్ని 5 లీ. నీటిలో కలిపి) చేప వ్యర్థాలకు కలిపి బాగా కలియత్రిప్పాలి. ఈ మిశ్రమాన్ని 15-20 రోజులు బాగా పులియనివ్వాలి. ఈ సమయంలో చేప పొలుసులు, ఎముకలు బాగా క్షీణించి పోతాయి.
15-20 రోజులు పులిసిన తర్వాత పులిసిన పదార్థానికి 2 నుండి 5 రెట్లు నీరు కలిపి ద్రావణం తయారు చేయాలి. ఈ ద్రావణాన్ని వడపోసి మొక్కలపై పిచికారి చేయాలి. పూర్తిగా కరగని పదార్థమేదైనా ఉంటే దానిని భూమికి ఎరువుగా వేయాలి.
పంటపై పిచికారి చేయడానికి 250 నుండి 500 మి.లీ. ద్రావణాన్ని 10 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఈ ఫార్మ్యులేషన్‌ని అన్ని కూరగాయలు, పూల పంటల్లో ఉపయోగించవచ్చు. బెండ, తోటకూర, పాలకూర, వంగ, టమాట పంటలపై విస్తృత పరిశోధనలు జరిపి మంచి ఫలితాలను పొందారు.

రైతునేస్తం ప్రచురణ ‘స్వేద వేదం ’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

కోళ్లలో మైకోప్లాస్మోసిస్ వ్యాధి / దీర్గ కాలిక శ్వాసకోశ వ్యాధి (సి.ఆర్.డి)

మైకోప్లాస్మా జాతి సూక్ష్మజీవుల వలన కలిగే వ్యాధుల సమూహాన్ని “మైకోప్లాస్మోసిస్” అంటారు. ఈ జాతి సూక్ష్మజీవులు సుమారుగా 17 రకాలున్నప్పటికీ, 2-3 రకాలు మాత్రమే కోళ్లలో వ్యాధిని కలిగిస్తాయి. అవి మైకోప్లాస్మా గాలిసెప్టికం(అన్ని రకాల పక్షులకు), మైకోప్లాస్మా సైనోవి (సాధారణ కోళ్ళు, టర్కీలు, పావురాలు), మైకోప్లాస్మా మిలియాగ్రిడిస్ (ప్రధానంగా టర్కీలకు). ఈ వ్యాధిలో ప్రధానంగా శ్వాసకోశ సంబందిత లక్షణాలు గమనిస్తాము మరియు దీర్గకాలికంగా ఉంటుంది. అందువలన దీనిని దీర్గ కాలిక శ్వాసకోశ వ్యాధి లేదా క్రానిక్ రేస్పిరెటరి డిసీజ్ (సి.ఆర్.డి) అని అంటారు.

అన్ని వయస్సు కోళ్ళకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. శీతాకాలం వంటి చల్లగా వుండే మాసాల్లో మరియు ఇతర వ్యాధులైనటువంటి ఇ.కోలి, పాశ్చురేల్లోసిస్, ఇన్ఫేక్ట్చువస్ బ్రోoకిటిస్, కొక్కెర తెగులు సోకినప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి ఉదృతంగా ఉంటుంది. వ్యాధి సోకిన కోడి ద్వారా, కలుషితమైన గాలి ద్వారా ఆరోగ్యకరమైన ఇతర కోళ్ళకు వ్యాపిస్తుంది. షెడ్ లో కోళ్ళు కిక్కిరిసి వుండి, గాలి, వెలుతురు ప్రసరణ సరిగా లేకుండా ఉన్నప్పుడు వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కలుషితమైన లిట్టర్, కోళ్ళ మూత్రం ద్వారా, కలుషితమైన దాణా,  త్రాగునీటి ద్వారా, ఇతర పక్షులు, కోడి పిల్లల బాక్సులు, పరికరాలు, గ్రుడ్ల ట్రే ల ద్వారా, టీకాలు వేసే సమయంలో, ముక్కు కత్తిరించే సమయంలో పని మనుషుల ద్వారా , బ్రీడింగ్ ఫారాలలో వ్యాధి గ్రస్త పుంజుల వీర్యం ద్వారా, తల్లి కోడి అండాశయం నుండి గ్రుడ్డు ద్వారా కోడిపిల్లలకు వ్యాపిస్తుంది.

లక్షణాలు:
మైకోప్లాస్మా గాలిసెప్టికం బారిన పడిన బ్రాయిలర్ కోళ్లలో 4 వారాల తరువాత మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి బారిన పడిన లేయర్ కోళ్లలో వ్యాధి మెల్లగా వ్యాపిస్తుంది. సూక్ష్మక్రిమి కోళ్ళ శరీరంలోకి ప్రవేశించిన తరువాత 11-18 రోజుల్లో లక్షణాలు కనబడతాయి. ప్రప్రథమంగా శ్వాసకోశ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. అందులోను మొదటగా శ్వాసనాళo పైభాగం ఆశించడం వలన శ్వాస తీసుకోవడం కష్టతరమై కోళ్ళు తల పైకెత్తి గాలి పీల్చుకుంటాయి. అలా శ్వాస తీసుకుంటున్నప్పుడు కూతలు కూడా వినబడుతాయి. ఆ తర్వాత సుక్ష్మక్రిమి గాలిగదులు, శ్వాసనాళం కింది భాగాన్ని ఆశించినప్పుడు గాలి గదులు వాచిపోతాయి. శ్వాసనాళంలో నెమ్ము చేరడం వలన గురక శబ్దం వస్తూ ఉంటుంది. కళ్ళు, ముక్కు నుండి నీరు కారుతూ ఉంటుంది. చిన్న పిల్లలలో 30% వరకు మరణాలు సంభవిస్తాయి. గ్రుడ్ల ఉత్పత్తి 20-30% తగ్గిపోతుంది. మేత వినియోగం తగ్గటం వలన పెరిగే కోళ్లలో పెరుగుదల రేటు తగ్గి బరువు తగ్గిపోతుంది. కొన్ని సందర్భాలలో నీళ్ళ విరోచనాలుంటాయి. ఇంకా పెరికార్దిటిస్, పెరిటోనిటిస్, పెరిహేపటైటిస్ తరచుగా కనబడతాయి.

మైకోప్లాస్మా సైనోవి తరచుగా 4-12 వారాల కోడిపిల్లలకు, అలాగే 10-12 వారాల టర్కీకోళ్ళకు సోకుతుంది. ఇది ప్రధానంగా కీళ్ళను ప్రభావితం చేయడం వలన కీళ్ళ వాపులు, కీళ్ళ మధ్యలో మరియు టేండాన్ పొరలలో తెల్లటి చిక్కటి ద్రవం చేరి, కోళ్ళు కుంటుతూ ఉంటాయి.

మైకోప్లాస్మా మిలియాగ్రిడిస్ వ్యాధి బారిన పడిన టర్కీ కోళ్ళలో శ్వాస కష్టమవటం, తక్కువ శరీర పెరుగుదల, మెడ మరియు కాళ్ళ కీళ్ళలో వాపు, గ్రుడ్ల ఉత్పత్తి తగ్గిపోవటం, పొదిగే గ్రుడ్ల నుండి పిల్లల ఉత్పత్తి తగ్గటం, అధిక మరణాలు సంభవించడం వంటివి గమనిస్తాము.

పోస్ట్ మార్టెం చేసి చూస్తే:
శ్వాసనాళం ఫైభాగంలో రక్తస్రావాలు ఉంటాయి. తెల్లటి జిగట పదార్ధం కనబడుతుంది. గాలి గదులు మందమై కందిపోయి జున్ను లాంటి పదార్ధం పేరుకొని ఉంటుంది. గుండె, కాలేయం మీద పలుచని పొర ఏర్పడుతుంది.
చికిత్స : వ్యాధి గ్రస్త కోళ్ళకు థయాముటిన్, టైలోసిన్ వంటి యాంటిబయోటిక్ మందులను త్రాగే నీళ్ళలో లేదా ఇంజక్షన్ రూపంలో 5-7 రోజులు వాడాలి. ఇవే కాకుండా ఆక్సిటెట్రాసైక్లిన్, క్లోర్టెట్రాసైక్లిన్ ను టన్ను దాణాలో 200-400 గ్రా. చొప్పున కలిపి కూడా వాడవచ్చు.

నివారణ :

  • పెద్ద కోళ్ళు, కోడి పిల్లలు ఒకే షెడ్లో కాకుండా వేర్వేరు షెడ్లలో ఉంచాలి. ఈ షెడ్లు దూరంగా, ఎడంగా ఉండాలి.
  • కొత్తగా పిల్లలు తెచ్చే ముందు, షెడ్లను పొటాషియం పెర్మంగానేట్ మరియు ఫార్మలిన్ ద్రావణంతో ఫుమిగేషన్ చేసి 2-3 వారాలు ఖాళీగా ఉంచాలి.
  • కోళ్ళ ఫారాలలో కోళ్ళు కిక్కిరిసి, గుమికూడి ఉండకుండా చూడాలి. అందుకొరకు సరిపోను స్థలం కేటాయించాలి.
  • అధిక చలి మరియు గాలి, వెలుతురు లోపం వలన ఈ వ్యాధి వ్యాపిస్తుంది. కావున గాలి,వెలుతురు సక్రమంగా ప్రసరించేలా చూడాలి.
  • టీకాలు, ఏలికపాముల మందు వేసే సమయంలో, ముక్కు కత్తిరించే సమయంలో కోళ్ళు ఒత్తిడికి గురికాకుండా చూడాలి.
  • పాత లిట్టర్ తొలగించి, అమోనియా వాయువును నివారించాలి.
  • వ్యాధితో మరణించిన కోళ్ళను కాల్చి వేయాలి. వ్యాధి సోకిన వాటిని వెంటనే వేరు చేయాలి.
  • వాహనాలు, దాణా బస్తాలు, క్రేట్లు, పరికరాల ద్వారా వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్త వహించాలి.
  • కోళ్ళ షెడ్లు మరియు పరికరాలను శుభ్రం చేయడానికి ప్రతిపాదిత క్రిమిసంహారణిలైనటువంటి ఫినోలిక్ ఆమ్లం, క్రెసాలిక్ ఆమ్లం, హైపోక్లోరైట్, 10% ఫార్మలిన్, 0.1% గ్లుటరాల్దిహైడ్, బ్లీచింగ్ పౌడర్ ను వాడాలి.

డా. టి. విజయ నిర్మల శాస్త్రవేత్త (పశువైద్య విభాగం), డా. ఎన్. శ్రీ విద్య రాణి శాస్త్రవేత్త (విస్తరణ విభాగం), డా. బి.ఎస్. కాంతి శ్రీ శాస్త్రవేత్త (గృహ విజ్ఞాన విభాగం), డా. ఎస్. ఫిరోజ్ హుస్సేన్, శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం), డా. ఎం.బాలకృష్ణ, సీనియర్ శాస్త్రవేత్త & అధిపతి, కృషి విజ్ఞాన కేంద్రం, ఒనిపెంట, వై.ఎస్.ఆర్. కడప జిల్లా-516173, డా. గోవిందరాజులు, ఎ.డి.ఆర్., ఆర్.హెచ్.ఆర్.ఎస్., తిరుపతి & డా. సి.హెచ్. రూత్, విస్తరణ సంచాలకులు, వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా
ఫోన్ : 8121136184

Read More

కలుపు మాయం… పాదులు సిద్ధం

ఉద్యాన పంటల్లో చెట్లచుట్టూ కలుపు తీయాలన్నా, పాదులు చేయాలనా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు, దీనికి ఎక్కువ మంది కూలీలు అవసరం. పంటలకు ధరలున్నప్పుడు రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూలీలను పెట్టుకొని కలుపు తీయడం, పాదులు చేయించడం చేస్తారు. అదే ధరలు లేని సమయంలో ఈ పని తలకు మించిన భారం అవుతుంది. పంట దిగుబడికి ఈ పనులు తప్పనిసరి. అలాగే వదిలేస్తే చెట్లు బ్రతకకుండా ఉండే ప్రమాదం కూడా ఉంది.

ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కిచ్చేందుకు ఒక ప్రత్యామ్నాయ పరికరాన్ని మెకానికల్ అడ్వాంటేజ్ అనే సూత్రం తో తయారు చేసి ఈ పరికారానికి సుదర్శన్ వీడర్ గా పేరు పెట్టారు ప్రొఫెసర్ ముప్పా లక్ష్మణ రావు

ఉద్యానవన పంటల్లో అంతర్ కృషి పరికరం

ఈ పరికరం కోసం ఒక పొడవాటి ఇనుప పైపును తీసుకొని చక్రా కారం లో వంచి కింద బాగాన చిన్న పాటి కర్రులు అమర్చి వెల్డింగ్ ద్వారా అనుసంధానం చేసి పరికరాన్ని తయారు చేశారు, చెట్టు వద్ద 5 నిముషాలలో కలుపు, పాది రెండూ చేసుకోవచ్చు. ఉద్యానవన రైతులకు ఈ పరికరం ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
ట్రాక్టర్లు, ఎద్దుల సహాయంతో రైతులు ఉద్యాన పంటల్లో కలుపు తీసే కార్యక్రమం చేస్తుంటారు. అయితే చెట్టు పాది లో అంతర కృషి చేయాలంటే మనుషుల సహాయం అవసరం ఉంటుంది.

ఈ పరికరాన్ని చెట్టుకు అమర్చి ఒక వ్యక్తి చుట్టూ తిరగడం వల్ల గుంటక తరహాలో మడకలు భూమిని చదును చేయడంతో పాటు పాది ఏర్పడుతుంది. దీనివల్ల రైతులకు ఖర్చు మిగులుతుంది. శ్రమ తక్కువగా ఉండటంతో పాటు ఒక్క మనిషి గంట వ్యవధిలోనే అర ఎకరా పొలం పూర్తి చేయవచ్చు.

దీనికి 4 వేల వరకు ఖర్చు వస్తుంది. చెట్టు సైజు ని బట్టి పరికరం ధర మారుతుంది.

రైతుల కోరితే వారికి తయారు చేసి ఇస్తారు. ఈ పరికరానికి పేటంట్ చేయడం జరిగింది. పేటెంట్ నెంబర్ :507641-001

ఈ పరికరం కోసం శ్రీ ఆంజనేయ స్మాల్ అగ్రి టూల్స్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ రైతునేస్తం ముప్పా లక్ష్మణరావు, ఫోన్ : 9849140465 లో సంప్రదించగలరు.

Read More

ఔషధ మొక్క… తెల్లగన్నేరు

సాధారణ నామం : కొండగన్నేరు / విసాగ్ని
శాస్త్రీయ నామం : ఆల్‌స్టోనియా వెనెనేట; కుటుంబం: అపోసైనేసి

తెల్లగన్నేరు సుమారు 6 మీ. ఎత్తు వరకు పెరిగే చిన్న లేదా మధ్య రకం చెట్టు. చెట్టు బెరడు బూడిద రంగుతో కూడిన గోధుమ వర్ణం కలిగి ఉంటుంది. వేరు చిక్కటి పసుపు రంగులో ఉండి గట్టిగా కర్రలాగా ఉంటుంది. ప్రతి కణుపు వద్ద 3-6 ఆకులు చుట్టూ అమరి ఉంటాయి. ఆకులు పలుచగా, బళ్ళెం ఆకారంలో ఉండి, అంచులు అలల్లాగా ఉంటాయి. ఆకు కొనలు సన్నగా మొనదేలి ఉంటాయి. అనేక ఈనెలు దగ్గర దగ్గరగా, సమాంతరంగా ఉండి ఆకుల చివర్ల నుండి పుట్టిన సన్నని దారంలాంటి ఈనెలతో కలపబడి ఉంటాయి. పూలు తెల్లగా ఉండి కొమ్మల చివర్లలో వస్తాయి. కాయలు కాడ కలిగి రెండు చివర్లు కొనదేలి ఉంటాయి. అనేక విత్తనాలు బల్లపరుపుగా, రెండు చివర్లలో వెంట్రుకలు కలిగి ఉంటాయి.

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • తెల్లగన్నేరు వేర్లు, పండ్లు ఔషధాల తయారీలో ఉపయోగించబడుతున్నాయి.
  • వీటిలో ఇండోల్ ఆల్కలాయిడ్స్ అధికంగాను, ఆల్‌స్టోవినైన్, వినినాటైన్, రిసర్పెåన్ మొదలైన రసాయనాలు ఉంటాయి.
  • వేర్లను చర్మవ్యాధులు, కుష్టు, చెవిపోటుల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • వీటిని పాము కాటు, ఇతర విషపు పురుగుల కాట్ల చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.
  • మూర్ఛ రోగం, ఆయాసం, జ్వరం మొదలగు వాటి చికిత్సకు, పుండ్లు, సిఫిలిస్, పిచ్చి వంటి జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • ఆల్‌స్టోనియా బూనీ ఆకులు మరియు కాండం బెరడు ద్రావణాలు గులాబి రంగు కాండం తొలుచు పురుగు, సెసేమియాకెలామిస్టిస్ లార్వాలపై విషపూరిత చర్యను, పెరుగుదలనరికట్టే చర్యను ప్రదర్శించాయి. వీటిని గులాబి రంగు కాండంతొలుచు పురుగు నివారణకు రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (ఆయిజయాన్‌గ్బె, అతని అనుచరులు, 2007).
  • ఆల్‌స్టోనియా స్కాలారిస్ కాండం బెరడు మరియు ఆకుల నీటి ద్రావణాలు, పాక్షికంగా శుద్ధి చేసిన ద్రావణాలు లిమ్నేయ అక్యూమినేట (నత్త)పై మొల్లస్కిసైడల్ మరియు యాంటికోలినెస్టరేజ్ చర్యలను ప్రదర్శించాయి. కాండం బెరడు ద్రావణాలు ఆకు ద్రావణాల కన్నా బలమైన మొల్లస్కసైడల్ చర్యను ప్రదర్శించాయి. (సింగ్ అండ్ ఇసంగ్, 2003).
  • ఆల్‌స్టోనియా స్కాలారిస్ మొక్క అసిటోన్ లేటెక్స్ ద్రావణాలు లాబియో రోహిత (చేప)పై నీటి ద్రావణాలకన్నా 23 రెట్లు అధిక విషపూరిత చర్యను ప్రదర్శించాయి (సింగ్ అండ్ సింగ్, 2010).
  • ఆల్‌స్టోనియా స్కాలారిస్ ఆకుద్రావణాలు ఈడెస్ ఆల్బోపిక్టస్ 3వ దశ లార్వాలపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి.
  • ఆల్‌స్టోనియా స్కాలారిస్ క్లోరోఫాం, ఇథనాల్, నీటి ద్రావణాలు బాక్టీరిసైడైల్, ఫంగిసైడల్, యాంతెల్మింటిక్ చర్యలను ప్రదర్శించాయి. బాసిల్లస్ సీరియస్, క్లెబ్సియెల్లా న్యుమోనియె, ఎస్కెరిచియా కోలి, ఫిగెల్లా డీసెంట్రియేపై బాక్టీరిసైడల్ చర్యను ప్రదర్శించింది. రైజోపస్ ఒరైజె, క్లాడోస్పోరియం హెర్పారమ్, ఆస్పర్ౙిల్లస్ నైగర్, రైజోపస్ ఒరైజెపై ఫంగిసైడల్ చర్యను ప్రదర్శించింది.
  • ఆల్‌స్టోనియా స్కాలారిస్ 100% ఆకుల ద్రావణాన్ని 15 రోజుల వయసు పార్థినియం మొక్కలపై 5 రోజుల వ్యవధిలో పిచికారి చేస్తే, మొదటి పిచికారి చేసిన 15 రోజుల తర్వాత వేర్లు మరియు కాండం జీవపదార్థం గణనీయంగా తగ్గింది. ఆకుల నీటి ద్రావణంలో ఉన్న కలుపు నాశక పదార్థాలు పార్థినియం నివారణకుపయోగిస్తాయి (జావైద్, అతని అనుచరులు, 2010).
  • ఆల్‌స్టోనియా స్కాలారిస్ ఆకు ఎసిటోన్ ద్రావణం చెదపురుగులపై వికర్షక చర్యను ప్రదర్శించింది (సోహైల్ అహ్మద్, అతని అనుచరులు)
  • ఆల్‌స్టోనియాస్కాలారిస్ ఇథనాల్ ద్రావణం స్పోడోప్టెరా లిటూర 3వ దశ లార్వాలపై యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… ఉల్లిపాయ కారం

ముందుగా ఉల్లిపాయలలోని పోషకాల గురించి తెలుసుకుందాం ! ఉల్లిపాయలలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, ఐరన్ విటమిన్ ఎ, సి, ఇ, ఇంకా ఎన్నో ఉంటాయి. కేన్సర్ కణాలను నిరోధించటంలో ముఖ్యమైనది ఈ ఉల్లిపాయ. జుట్టు వత్తుగా, నల్లగా పెరగటానికి దోహదం చేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు రక్తంలో షుగర్ తగ్గించుకునేందుకు ఉల్లిపాయ ఉపయోగకరమైనది. చెడు కొలెష్ట్రాల్‌ని తగ్గించటమే గాక గుండె వ్యాధులను కూడా నిరోధిస్తుందని సంబంధిత నిపుణులు అంటారు.

కావల్సిన దినుసులు: ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు, జీలకర్ర, పసుపు, ఒక పెద్ద ఉల్లిపాయ (అన్నీ ఉల్లిపాయకు తగినన్ని)

ముందుగా ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్రలని రోట్లో వేసి మెత్తగా దంచుకున్నాక, చింతపండు కూడా వేసి బాగా కలిసేట్లు దంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మెత్తగా దంచి, పచ్చడిని గిన్నెలోకి తీసుకోవాలి.
మిక్సీలో కంటే రోట్లో చేసిన పచ్చడికి రుచి ఎక్కువ. పచ్చడి చేసేటప్పుడు నీరు తగలకుండా ఉంటే, ఈ పచ్చడి వారమైనా బయట కూడా పాడవదు. ఇది దోశెల్లోకి, అన్నంలోకి, జొన్నరొట్టెల్లోకి చాలా బావుంటుంది. రైస్‌లో తినేటప్పుడు కొంచెం కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె వేస్తే రుచి పెరుగుతుంది.

రచన : శ్రీమతి కొలను పద్మావతి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More