ఇంటిపంటతో ఆరోగ్యం, ఆహ్లాదం

మనందరికి ఆరోగ్యం తప్పనిసరి. ఆరోగ్యం లేని జీవితాలలో ఆనందం ఉండదు. కాబట్టి ఎవరికైనా ఆరోగ్యం తప్పనిసరి అనే విషయం అక్షర సత్యం. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి గాలి, నీటితో పాటు మంచి ఆహారం తీసుకోగలగాలి. మన ఆరోగ్యం ప్రధానంగా ఈ మూడింటిపైనే ఆధారపడి ఉంటుంది. మంచి ఆహారం కావాలంటే సాధ్యమయినంత వరకు వేరే వారి మీద ఆధారపడకుండా తామే సొంతంగా పండించుకుని తింటేనే మంచి ఆహారం దొరుకుతుందనే పరిస్థితులు ప్రస్తుత సమాజంలో నెలకొన్నాయి. మనం తినే అన్ని రకాల ఆహారాలు అందరం పండించుకోలేము కాబట్టి ఎవరికి అవకాశం ఉన్నంత వరకు వారు పండించుకోవటానికి కొంతమంది ఔత్సాహికులు ప్రయత్నిస్తున్నారు. కాబట్టే ఇంటి పంటదారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. వివిధ రంగాలలో ఉన్నవారు ఎవరికి అవకాశం ఉన్నంత మేరలో వారు కొన్ని మొక్కలు పెంచుకుంటున్నారు. ఇంట్లో మొక్కలు పెంచుకోవటం వలన ఆరోగ్యకరమయిన ఆహారం సొంతంగా పండించుకొని తినడముతో పాటు శారీరక శ్రమకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంటిపంటలో గడిపిన సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది కాబట్టి మన శక్తి పెరుగుతుంది కాబట్టి మన రోజు వారి పనులలో సామర్థ్యం పెరిగి ఫలితాలు మంచిగా ఉంటాయనడములో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని గ్రహించి ఖమ్మం పట్టణానికి చెందిన శ్రీనివాస్‌ తమ ఇంట్లో ఏ మాత్రం స్థలాన్ని వదలకుండా వివిధ రకాల మొక్కల పెంపకం చేస్తున్నాడు.

శ్రీనివాస్‌ది సాఫ్ట్‌వేర్‌ రంగం. కరోనా తరువాత ఆరోగ్యం యొక్క విలువ తెలుసుకుని ఆరోగ్యకరమయిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలంటే ఇంటి పంటే సరైన దారి అని నమ్మి 2022 వ సంవత్సరం ఆగస్టు నెలలో తమ ఇంటి మేడ మీద, బాల్కనీలో, మిద్దె మీద వివిధ రకాల మొక్కల పెంపకం మొదలు పెట్టి కొనసాగిస్తున్నాడు. మొక్కల పెంపకంతో పాటు అక్వేరియంలో చేపల పెంపకం మరియు కొన్ని రకాల పకక్షులను కూడా పెంచడానికి తగిన ఏర్పాట్లు చేసుకుని పెంపకం చేస్తున్నాడు. పకక్షులకు అవసరమయిన గింజలు కోసం సజ్జ, జొన్న లాంటి విత్తనాలను తమ ఇంటి పంటలో చల్లి వాటి ద్వారా వచ్చే దిగుబడిని పకక్షులకు ఆహారంగా అందిస్తూ వస్తున్నాడు. చేపలు మరియు పకక్షులు పెంపకం వలన మనసుకు ఆహ్లాదం కలిగి రోజు మొత్తం ఆనందంగా గడపడం శ్రీనివాస్‌ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు.

తమ ఇంటిపంటలో అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో పాటు వివిధ రకాల పూలమొక్కలు పెంచుతున్నాడు. నీడపడే ప్రదేశంలో ఇండోర్‌ ప్లాంట్లని పెంపకం చేస్తున్నాడు. తనకు కొత్త రకాల మొక్కలంటే మక్కువ ఎక్కువ కాబట్టి ఏ కొత్తరకం మొక్క లేదా విత్తనం కనిపించినా వదలకుండా తన ఇంటి పంటలో పెంపకం మొదలు పెడుతుంటాడు. మొక్కల పెంపకానికి గ్రోబ్యాగ్స్‌, ప్లాస్టిక్‌ కుండీలను మాత్రమే వినియోగిస్తున్నాడు. మొక్కలలో పరపరాగ సంపర్కం సక్రమంగా జరగాలంటే సీతాకోకచిలకలు, తేనెటీగల లాంటివి కావాలి కాబట్టి వీటిని ఆకర్షించడానికి గాను పసుపురంగు పూవులుపూసే పూల మొక్కలను పెంపకం చేస్తున్నాడు. ఇంటిపంటలో నెమటోడ్స్‌ సమస్య రాకుండా ఉండటానికి గాను బంతి మొక్కలను పెంపకం చేస్తున్నాడు. సంవత్సరం పొడవునా ఇంటి పంట అందంగా కనిపించడానికి అవసరమయిన వివిధ రకాల పూల మొక్కలను పెంచుతూ ఇంటి పంట అందంగా కనిపించడానికి అవసరమయిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటున్నాడు కాబట్టే తమ ఇంటి పంట 365 రోజులు అందంగా ఉంటుందని శ్రీనివాస్‌ అంటున్నాడు.

మొక్కలు ఆరోగ్యంగా పెరగటానికి మరియు మంచి దిగుబడిని ఇవ్వడానికి అవసరమయిన సేంద్రియ పదార్థాలను సమయానుకూలంగా అందిస్తూ ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా ఇంటి పంటను కొనసాగిస్తున్నాడు. తోటి ఇంటి పంటదారులతో ప్రతినిత్యం కలుస్తూ మెలకువలు తెలుసుకుంటూ అతి తక్కువ సమయంలో ఇంటి పంటలో నైపుణ్యం సాధించి అనేకమంది ప్రశంసలు పొందుతున్నాడు. కొత్తగా ఇంటి పంటను మొదలు పెట్టాలనుకునే వారికి శ్రీనివాస్‌ మార్గదర్శి కాగలడు అని నిస్సందేహంగా చెప్పవచ్చు.  

Read More

రఘోత్తమరెడ్డి గారి స్ఫూర్తితో ఇంటిపంట

వివిధ రకాల కారణాల వలన ఇటీవల కాలంలో ఇంటిపంటను నిర్వహించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఇంటి పంటపై శ్రద్ధ ఉన్నవారు ఎవరికి అవకాశం ఉన్న ప్రాంతంలో అంటే పెరటిలో, బాల్కనీలో, మిద్దెమీద, గోడల మీద… ఎక్కడ అవకాశం ఉంటే ఆ స్థలంలో అవకాశం ఉన్న మొక్కలు పెంచుతూ ఉంటున్నారు. కొంతమందికి ఇంటిపంట మీద ఆసక్తి ఉన్నా కూడా వివిధ రకాల కారణాల వలన ఇంటి పంటను మొదలు పెట్టడం వాయిదా వేసుకుంటూ పోతుంటారు. ఇలా వాయిదా వేసుకుంటూ పోయేవారికి వేరేవారి నుంచి స్ఫూర్తి లభించిందంటే వాయిదాలను ప్రక్కకు నెట్టి కార్యాచరణలోకి దిగుతారు. కొత్తగా ఇంటి పంటను మొదలు పెట్టే అనేకమందికి అప్పటికే ఇంటిపంటను నిర్వహిస్తున్న ఇంటి పంటదారులు స్ఫూర్తిని కలిగించి ఉండవచ్చు. కాని ఇంటిపంట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారి నుంచి స్ఫూర్తిని పొంది ఇంటి పంటను మొదలు పెట్టిన వారు ఎక్కువ మంది మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంటారని నిస్సందేహంగా చెప్పవచ్చు. హైదరాబాదు నగరం అమీరుపేటలో గత ఆరు సంవత్సరాల నుంచి మిద్దెతోటను పెంచుతున్న తనకు రఘోత్తమరెడ్డి గారే స్ఫూర్తి అని అప్పారావు అంటున్నాడు.

అప్పారావు గారికి గత 15-20 సంవత్సరాల నుంచి ఇంటిపంట మీద మక్కువ ఉన్నా కూడా ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు కాబట్టి ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలు తిరగవలసి వస్తుంది కాబట్టి ఉద్యోగంలో కొనసాగిన కాలంలో పెద్ద మొత్తంలో మొక్కల పెంపకం చేపట్టకుండా కేవలం కొన్ని మొక్కలను మాత్రం పెంచుకుంటూ వస్తూ 6 సంవత్సరాల క్రితం తన ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన తరువాత పెద్ద మొత్తంలో మొక్కల పెంపకం మొదలు పెట్టాడు. హైదరాబాదు నగరం అమీరుపేటలో మిద్దెమీద ఇంటిపంటను నిర్వహిస్తున్నాడు. తనకు ఇంటిపంటమీద మక్కువ పెరగటానికి ఇంటి పంట నిపుణుడు రఘోత్తమరెడ్డిగారే స్ఫూర్తి అని అప్పారావు వివరిస్తున్నాడు.

తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచాలనే లక్ష్యంతో అప్పారావు ఇంటిపంటను నిర్వహిస్తున్నాడు. ఇందుకుగాను చిన్న చిన్న కంటెయినర్లను ఎక్కువగా మొక్కల పెంపకానికి ఉపయోగిస్తున్నాడు. చిన్న కంటెయినర్లు అయితే తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు. మట్టి మిశ్రమం తక్కువగా పడుతుంది. అంతేకాకుండా కంటెయినర్‌ బరువు కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక చోట నుండి ఇంకో చోటకి మార్చాలంటే సులభంగా ఉంటుంది. ఇలాంటి అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి తమ మిద్దెతోటలో చిన్న కంటెయినర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు. 

మొక్కల పెంపకానికి ఉపయోగించే మట్టిమిశ్రమంలో 30 శాతం మట్టి, 30 శాతం వర్మికంపోస్టు, 30 శాతం కోకోపిట్‌ లేదా ఇసుక మిగిలిన 10 శాతం వేపపిండిని ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా మట్టి మిశ్రమం తయారు చేసుకుని మొక్కల పెంపకం చేపట్టి తరువాత అవసరాన్ని బట్టి పోషకాలను అందిస్తుంటాడు. వారి ఇంటి పంటలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు, పూల మొక్కల పెంపకం చేస్తుంటారు. అరుదైన రకాలను దూర ప్రాంతాల నుంచి తెప్పించి పెంపకం చేయడం అప్పారావు గారికి ఇష్టం కాబట్టి ఇతర దేశాల నుంచి కూడా విత్తనాలను తెప్పించి మొక్కల పెంపకం చేస్తున్నారు. వారి ఇంటి పంటలో 15 నుంచి 20 రకాల వంగ, 50 నుంచి 60 రకాల టమాటతో పాటు పొట్టి అరటి, చిన్న కంటెయినర్‌లో పెరిగే మునగ, సంపంగి, డ్రాగన్‌ ఫ్రూట్‌, బత్తాయి, నిమ్మ మొక్కలతో పాటు అరుదైన పూల మొక్కలు, ఆకుకూరలు అనేకం ఉన్నాయి. 

ఉద్యోగ బాధ్యతల నుంచి పదవీ విరమణ పొందిన తరువాత తన పూర్తి సమయాన్ని ఇంటి పంటపై పెట్టి ఇంటి పంట దారుల సంఖ్య పెంచడంలో తనవంతు పాత్రను పోషిస్తున్నాడు. రఘోత్తమరెడ్డి గారి నుంచి స్ఫూర్తిని పొందిన అప్పారావు ఇంటి పంటను మొదలు పెట్టి విజయవంతంగా కొనసాగిస్తూ అనేకమందికి స్ఫూర్తిని కలిగిస్తున్నాడు.

పెంచుకుందాం… పంచుకుందాం…

అప్పారావు ఇంటి పంటను నిర్వహించడంతోపాటు ఇంటిపంటదారుల సంఖ్య పెరగటానికి విపరీతంగా కృషి చేస్తున్నాడు. ఇందుకుగాను వివిధ ప్రాంతాల నుంచి అరుదైన రకాల విత్తనాలను, మొక్కలను తెప్పించి తన ఇంటి పంటలో పెంపకం చేసి విత్తనాలను అభివృద్ధి చేసి భారతదేశం మొత్తం అడిగిన వారికి ఉచితంగా అంటే రవాణా ఖర్చులు కూడా తానే భరిస్తూ విత్తనాలను పంపిణీ చేస్తున్నాడు. తన దగ్గర విత్తనాలను తీసుకున్న వారు అవకాశం ఉంటే వారి దగ్గర ఉన్న విత్తనాలను అప్పారావు గారికి పంపిస్తుంటారు. వాటిని అప్పారావు గారు అవసరమయిన వారికి ఉచితంగా పంపిస్తుంటారు. ఈ విధంగా పెంచుకుందాం… పంచుకుందాం… అనే భావనతో ముందుకు సాగుతున్నారు.

Read More

ఉద్యోగం తప్పనిసరి కాకపోతే…సమయాన్ని కుటుంబం కోసం కేటాయించడమే ఉత్తమం 

ప్రతిమనిషికి అన్నింటికంటే ముఖ్యం ఆనందం. ఆనందం కావాలంటే ఆరోగ్యం తప్పనిసరిగా ఉండాలి. ఆరోగ్యం సక్రమంగా లేకుండా వివిధ రకాల అనారోగాలతో ఇబ్బందులు పడేవారు ఆనందంగా తమ జీవితాన్ని కొనసాగించలేరు. ఎన్ని లక్షల కోట్లు డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం సక్రమంగా లేకుంటే అన్ని లక్షల కోట్లు వృథా అనే విషయం అందరికి తెలిసిందే కాని వాస్తవాన్ని గ్రహించలేకపోవచ్చు. కాని ఆ విషయం కరోనా తరువాత అందరికి తెలిసి వచ్చింది. లక్షల కోట్లు డబ్బు ఉన్న వాళ్ళు కూడా కంటికి కనిపించని చిన్న వైరస్‌ దెబ్బకు భయపడి ఇల్లుదాటి బటకు రాలేదు అనే విషయం మన అందరం ప్రత్యక్షంగా చూశాము. కరోనా వల్ల ఆరోగ్యం యొక్క విలువ ప్రతి ఒక్కరూ బాగా గ్రహించగలిగారు. సంపాదన కోసం ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి ఎంత సంపాదించినా కాని ఆరోగ్యం సరిగ్గా లేకపోతే సంపాదించిన సొమ్ము ఎందుకు పనికిరాకపోవచ్చు. కాబట్టి సంపాదన కంటే ఆరోగ్యం ముఖ్యం. కాని కొన్ని కనీస అవసరాలకు సంపాదన తప్పనిసరి కాబట్టి కనీస అవసరాల కొరకు తప్పనిసరిగా సంపాదన కోసం ప్రయత్నించాల్సిందే. కొంతమంది కుటుంబ ఆర్థిక పరిస్థితులు  కనీస అవసరాల కొరకు భార్యా, భర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయవలసిన అవసరము లేకపోవచ్చు. అలాంటి పరిస్థితులలో భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరి ఉద్యోగం ద్వారా వచ్చిన ఆదాయం తమ అవసరాలకు సరిపోయినట్లయితే ఇంకొకరు తమ సమయాన్ని కుటుంబం కోసం, కుటుంబ ఆరోగ్యం కోసం కేటాయించినట్లయితే ఆరోగ్యంగా, ఆనందంగా తమ జీవితాలను కొనసాగించవచ్చు. ఈ విషయాన్ని గ్రహించిన పద్మిని గారు తన భర్త సాంబశివరావుగారి ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం తమకు సరిపోతుంది కాబట్టి తాను ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా తన పూర్తి సమయాన్ని తమ కుటుంబం కోసం మరియు కుటుంబ ఆరోగ్యం కోసం కేటాయిస్తున్నారు.

పద్మిని గారిది వ్యవసాయ నేపథ్యం. తన చిన్నతనం నుంచి తండ్రితో కలిసి పొలాలకు వెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వ్యవసాయ మూలాలు ఉన్న ప్రతి ఒక్కరికి వ్యవసాయం అన్నా, మొక్కలన్నా, పచ్చదనం అన్నా మక్కువ ఎక్కువగా ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. ఈ కోవకే చెందిన పద్మిని గారికి కూడా చిన్నతనం నుంచి మొక్కలన్నా, పచ్చదనం అన్నా చాలా మక్కువ కాబట్టి ఉన్నత చదువులు చదివిన పద్మిని ఎలాంటి ఉద్యోగ ప్రయత్నం చెయ్యకుండా తన భర్త సహాయ సహకారాలతో ఇంట్లో మొక్కలు పెంచుతూ ఉంటారు. భర్త ఉద్యోగ భాధ్యతల రీత్యా వివిధ ప్రాంతాలు తిరుగుతున్న సమయాలలో కూడా ప్రతి చోట మొక్కలు పెంచుతూ ప్రాంతం మారినపుడు అన్ని మొక్కలను తమతో పాటు రవాణా చేస్తూ ఉండేవారు. వేరేప్రాంతానికి మారవలసి వచ్చినపుడు ఇంటి సామను కంటే మొక్కలకు సంబంధించిన సామాను ఎక్కువగా ఉండేది. అయినా కాని ఏ మాత్రం ఆలోచించకుండా తాము మారిన కొత్త ప్రాంతానికి మొక్కలను కూడా మారుస్తూ వచ్చి నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాదు, మదీనాగూడలో సొంత ఇంటిని నిర్మించుకొని ఆ ఇంటి మిద్దెమీద వివిధ రకాల మొక్కల పెంపకం చేస్తూ వస్తున్నారు.

మిద్దె మీద మొక్కల పెంపకం చెయ్యాలి కాబట్టి ఇంటి నిర్మాణ సమయంలోనే నీరు స్లాబులోకి ఇంకకుండా జాగ్రత్తలు వహించారు. స్లాబు మీద కూడా స్టాండ్లు ఏర్పాటు చేసి స్టాండ్‌ల మీదనే వివిధ రకాల కుండీలు, బకెట్ల లాంటివి ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. తాను ఇంటిపంటను చేసేది తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కాబట్టి మొదటగా తమ ఆహారాలకు అవసరమయిన కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని రకాల పండ్లకు ప్రాముఖ్యతను ఇచ్చి కొన్ని రకాల పూల మొక్కలు కూడా పెంచుతున్నారు. తమ ఇంటి అవసరాలకు అవసరమయిన కూరగాయలు, ఆకుకూరలు సగానికి పైగా తామే సొంతంగా పండించుకుంటూ మిగతావి బయట మార్కెట్‌లో కొనుగోలు చేసుకుని ఉపయోగించుకుంటున్నారు. పండ్ల విషయానికొస్తే జామ, దానిమ్మ, యాపిల్‌బేర్‌, అంజూర లాంటి పండ్లను సొంత మిద్దె తోట నుంచి పొందుతూ కొన్ని రకాలను బయట నుంచి కొనుగోలు చేస్తుంటారు.

ప్రతిరోజు ఉదయం, సాయంకాలం కలిపి మూడు నుంచి నాలుగు గంటలు మిద్దెతోటకు కేటాయించి మొక్కలకు అవసరమయిన పనులను తానే సొంతంగా చేస్తూ శారీరక శ్రమకు అవకాశం ఇస్తున్నారు. మొక్కల పెంపకానికి ఎలాంటి రసాయనాలను ఉపయోగించకుండా కేవలం సేంద్రియ పదార్థాలను ఉపయోగిస్తుంటారు. విత్తనాలను కూడా తామే సొంతంగా తమ ఇంటి పంట నుంచి సేకరిస్తూ ఉపయోగిస్తుంటారు. మిరప, టమాట, వంగ లాంటి మొక్కలను కూడా సొంతంగా నారు పోసుకుంటుంటారు. కొమ్మల ద్వారా అభివృద్ధి చేయగల మొక్కలను కూడా సొంతంగా అభివృద్ధి చేసుకుని ఉపయోగిస్తూ ఉంటారు. చీడపీడల నివారణ కొరకు తప్పనిసరి పరిస్థితులలో ఎగ్‌ఎమినో యాసిడ్‌ లాంటివి పిచికారి చేస్తుంటారు. మొదటగా చీడపీడలు ఆశించిన ఆకులను, కొమ్మలను కడగడం లేదా అంతవరకు తుంచడం చేస్తుంటారు. మొక్కలకు పోషకాలకు గాను కిచెన్‌లో వృథాగా పడవేసే కూరగాయల, పండ్ల తొక్కలు, బియ్యం కడిగిన నీటిని ఉపయోగిస్తుంటారు. సంవత్సరంలో ఒకటి లేదా రెండుసార్లు పశువుల ఎరువు లేదా మేకల ఎరువును అందిస్తుంటారు. తోటి ఇంటి పంటదారులతో ప్రతినిత్యం సంభాషణలు జరుపుతూ అవసరమయిన సమాచారాన్ని తెలుసుకుంటూ ఉంటారు.

మనం ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినగలగాలి. ఆరోగ్యకరమైన ఆహారానికి కొంతలో కొంత సరైన దారి ఇంటి పంట అని గ్రహించిన పద్మిని తన చదువు అయిన తరువాత ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా తన సమయాన్ని కుటుంబ సభ్యుల కోసం, ఇంటిపంటకోసం కేటాయించి తోటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి

ఇంటి పంటకు అవసరమయిన కుండీలు, ఎరువులు, ద్రావణాలు, విత్తనాలు, మొక్కలు మొదలగు వాటి కొరకు వివిధ ప్రాంతాలు తిరగవలసి వస్తుంది. అలాంటి సమయాలలో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి అవుతుంది. కొన్నిసార్లు ఇంటి పంట అవసరాలకు దూర ప్రాంతం వెళ్ళవలసి వచ్చినప్పుడు అవి కొనుగోలు చేసే ధర కంటే రవాణాకు ఎక్కువ ఖర్చు పెట్టవలసి రావడంతో పాటు సమయాన్ని కూడా ఎక్కువగా కేటాయించవలసి వస్తుంది. అలాంటి సమయాలలో పద్మిని భర్త సాంబశివరావు తోడుగా ఉంటూ ఏ మాత్రం విసుగు చెందకుండా ఎంత దూరం అయినా రావడంతో పాటు డబ్బును, సమయాన్ని కేటాయించడానికి ఏమాత్రం వెనుకాడడు కాబట్టి తాను విజయవంతంగా ఇంటి పంటను నిర్వహించగలుగుతున్నాని భర్త సాంబశివరావుకి పద్మిని కృతజ్ఞతలు తెలియచేశారు.

ఆరోగ్యం విలువ అనంతం

గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే గతంలో మనిషి పుట్టింది సంపాదన కోసమే అన్నట్లు ప్రవర్తించారు. కాబట్టే తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి సంపాదన కోసం తాపత్రయ పడ్డవారు చాలామంది ఉన్నారు. కాలం గడిచే కొలది డబ్బు అందరికి అందుబాటులోకి రావడంతో పాటు కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న తరువాత ఆరోగ్యం విలువ చాలా వరకు ప్రతి ఒక్కరికి తెలిసి వచ్చింది. ఎదైనా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. పోయినప్పుడే దేని విలువ అయినా తెలిసేది అనే విషయం అక్షర సత్యం. కాబట్టే ఆరోగ్యంగా ఉన్నపుడు ఆరోగ్యం విలువ తెలుసుకొనని వారు ఆరోగ్యం పాడైపోయిన తరువాత ఆరోగ్యం విలువ గుర్తించగలుగుతున్నారు కాని కొన్ని సమయాలలో ఎంత గుర్తించినా ప్రయోజనం ఉండటం లేదు. కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు ఎంత ఖర్చు పెట్టినా కూడా బాగు చేసుకోలేకపోతున్నారు. బాగా డబ్బు ఉన్న వాళ్లు కూడా వచ్చిన రోగాల నుంచి బయట పడలేక ఇబ్బందులు పడిన వారి గురించి మనం ప్రతినిత్యం వింటూనే ఉంటాము. ఇలాంటి సందర్భాలు ఎదురైనపుడు ఆరోగ్యం విలువ అనంతం అని అర్థం అవుతుంది. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన పద్మిని తమ కనీస అవసరాలు తన భర్త సంపాదనతో తీర్చుకోగలుగుతున్నారు కాబట్టి తన సమయాన్ని కుటుంబ ఆరోగ్యం కోసం కేటాయించాలని నిర్ణయించుకొని ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయలేదు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి గాలి, మంచి నీరుతో పాటు మంచి ఆహారం తినగలగాలి. గాలి, నీరు ప్రకృతి నుంచి లభిస్తున్నాయి కాబట్టి తమ పరిధిలో ఉన్న ఆహారాన్ని ఎలాంటి విష రసాయనాలు లేకుండా తామే ఇంటి అవరణలోనే పండించుకోవాలనే లక్ష్యంతో ఎక్కువ ప్రాంతాలు తిరిగినా, ఎన్ని ఇళ్లు మారినా కూడా ఇంటి పంటను వదలకుండా కొనసాగిస్తూ తమ కుటుంబానికి అవసరమయిన కొంత ఆహారాన్ని తమ పరిధిలో పండించుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ ఆరోగ్యంగా, ఆనందంగా తమ జీవితాలను కొనసాగిస్తున్నారు.

Read More

వేలాడే తోటతో ఆకర్షితమైన ఇంటి అలంకరణ

కొద్దిగా సూర్యరశ్మి, సారవంతమైన మట్టి మిశ్రమం, కాస్తంత స్థలం ఉంటే చాలు. అందమైన కుండీల్లో మొక్కలను సైతం ఈ హ్యాంగింగ్‌ బాస్కెట్లలో ఆకర్షణీయంగా పెంచుకోవచ్చు. వివిధ వర్ణాల పూలతో కనువిందు చేస్తాయివి.

వేలాడే కుండీల్లో నాటే మొక్కల్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. పెద్ద కుండీల్లో పెంచేందుకు ఒకే జాతి మొక్కలను, మరీ చిన్న కుండీలైతే ఒకే జాతి మొక్కలతో పాటు, ఒకే ఆకారంలో ఆకులు, పూలు అందించే వాటిని ఎంపిక చేసుకోవాలి. బహువార్షికాలను నాటితే చలి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సూర్యరశ్మి, నీటిని ఒకే మోతాదులో తీసుకునే మొక్కలను గుంపుగా పెంచుకోవాలి. ఈ మొక్కల మధ్య సమతుల్యం బాగుంటుంది.

రంగులూ ముఖ్యమే: ఎరుపు, పసుపు లేదా ఆకుపచ్చ, ఊదా రంగు మొక్కలను ఎంచుకోవాలి. ఏకవర్ణ మొక్కలు కావాలనుకుంటే ఎరుపు మేలు. ఏకవార్షిక పూల రకాలుగా ఆకుపచ్చ ఆకులున్నవి బాగుంటాయి. కుండీల రంగు, వాటిని వేలాడదీసే ప్రాంతం, బయటి వాతావరణాన్ని బట్టి మొక్కల వర్ణాన్ని ఎంపిక చేసుకోవాలి. వేలాడే, పాకే లతలుగా ఎదిగే మొక్కలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

ఎలాంటి కుండీలంటే: ఇనుప పళ్లాలు, వెడల్పాటి సీసాలు, ప్లాస్టిక్‌, సిరామిక్‌ కుండీలు, చెక్క పెట్టెలు, మట్టి కుండలు.. ఇలా ఏదయినా వాడుకోవచ్చు. నీళ్లు బయటకు వెళ్లకపోతే మొక్క త్వరగా చనిపోతుంది. కాబట్టి వాటికి రంధ్రాలు ఉండాలి. మొక్క పెరిగేకొద్దీ కుండీ బరువూ ఎక్కువవుతున్నప్పుడు గొలుసులు, తాడుతో వాటికి ఊతమివ్వాలి. మొక్కను ఇసుక లేదా పెర్లైట్‌లో పెంచాలా అనేది నిర్ణయించుకోవాలి. దీనివల్ల వేర్లకు గాలి అంది బాగా పెరుగుతాయి. తేమా చక్కగా అందుతుంది. పద్ధతి ప్రకారం రెండు వంతుల పీట్‌ మాస్‌ ఒక్కోవంతు చొప్పున ఇసుక, పెర్లైట్‌ వాడాలి. ద్రవరూప ఎరువులు వాడితే మేలైన ఫలితాలు ఉంటాయి. పిచికారి చేయడం కన్నా మొక్కలు నాటేముందు మట్టిలో ఎరువులు కలపడం మేలు. మొక్కలన్నింటిని కుండీల్లో నాటాకే అనుకున్న ప్రదేశంలో వేలాడదీయాలి. 10-14 అంగుళాల వ్యాసార్థం ఉన్న కుండీలను ఎంచుకోవాలి. వీటిలో ఒక్కోదానిలో మూడు మొక్కలను నాటుకోవచ్చు.

మొక్కలకు ప్రతిరోజూ నీరు పోయాలి. మట్టి మిశ్రమం పైభాగం నుంచి 25 శాతం తేమను కోల్పోయినప్పుడు నీటిని పిచికారి చేయాలి. వారానికోసారి ద్రవరూప ఎరువులను అందించాలి. ఎత్తుగా పెరిగిన వాటిని ఆకృతి ప్రకారం కత్తిరించుకోవాలి. మొక్క నాటే ముందు మట్టిని, పరికరాలను స్టెరిలైజ్‌ చేయాలి లేదా 1:10 నిష్పత్తితో తయారు చేసిన క్లోరిన్‌ నీటితో తడపాలి. వాటి వేళ్లు ఉండల్లా చుట్టుకుపోతే బయటకు తీసి సరిచేసి మళ్లీ నాటాలి. కొత్తగా నాటిన మొక్కల్ని నాలుగైదు వారాల వరకు నేరుగా సూర్యరశ్మిలో ఉంచి తరువాత అనుకున్న ప్రదేశంలో వేలాడదీయాలి.

ఏ మొక్కలంటే: పూల మొక్కల్లో అబూటిలాన్‌ మెగా పొలిమికమ్‌, అలమంద, బిగోనియా (వేలాడే రకాలు), వేలాడే చామంతి, వేలాడే పెటూనియా, క్లైయాంథస్‌, బాల్‌సమ్‌, తలంబ్రాల మొక్క, ప్లెమ్‌ వాయిలెట్‌, కంప్యానులా, లిప్‌స్టిక్‌ మొక్కలు అనుకూలం. ఆకుల మొక్కల్లో కొలియస్‌, పిలోడెండ్రాన్‌, పోతస్‌, స్పైడర్‌ ప్లాంట్‌, ఫన్స్‌, జెబ్రినా, ఆస్పరాగస్‌, కంగారోవైన్‌, త్రేసిస్‌ కాన్షియా మొదలగు వాటిని ఎంచుకోవాలి.

దేవరాయ్‌ లవ కుమార్‌, పి.హెచ్‌డి స్కాలర్‌, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ, న్యూఢిల్లీ, ఫోన్‌: 9515691254

Read More

మొక్కలపై మక్కువ సొంత ఇంటి కలను  వేగంగా నెరవేర్చింది

వివిధ రకాల కారణాల వలన ఇటీవల కాలంలో ఇంటి పంటను చేపట్టే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇంటి పంటవలన ప్రయోజనాలను గ్రహించిన చాలామంది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అంటే పెరట్లో, మేడ మీద, మెట్ల మీద, పిట్ట గోడల మీద.. ఈ విధంగా తమ అనకూలతను బట్టి కొన్ని మొక్కలను పెంచుతూ పోతున్నారు.

ఇంటి పంటను చేపట్టే వారిలో సొంత ఇంటిదారులతో పాటు అద్దెకు ఉండేవారు కూడా ఉన్నారు. సొంత ఇంటిదారులకు పెద్దగా ఇబ్బందులు ఉండవు కాని అద్దెకు ఉండే వారి విషయంలో అనేక సమస్యలు ఉంటాయి. ఇల్లు మారవలసిన సందర్భంలో మొక్కలను కుండీలతో కలిపి వేరే ఇంటికి మార్చడము చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని మొక్కలు పనికి రాకుండా పోయే అవకాశాలు ఉంటాయి. రవాణా ఖర్చులు, ఎగుమతి, దిగుమతి ఖర్చులు కూడా ఎక్కువగా అవుతుంటాయి. కాబట్టి ఇంటి పంటపై, పచ్చదనంపై మక్కువ ఉన్నవారు సొంత ఇంటి కలను తొందరగా సాకారం చేసుకోవాలని ఉంటారు. ఈ దారిలోనే నడచి తమకు పచ్చదనంపై ఉన్న మక్కువతో తమ సొంత ఇంటి కలను వేగంగా సాకారం చేసుకున్నారు విశాఖపట్టణం, మధురవాడకు చెందిన ఝాన్సీరాణి.

ఝాన్సీరాణి డిగ్రీ వరకు చదువుకుని కొన్ని రోజులు ఉద్యోగం చేసి పచ్చదనంపై ఉన్న మక్కువతో చేస్తున్న ఉద్యోగాన్ని మానివేసి, ప్రస్తుతం గృహిణి బాధ్యతలు నిర్వర్తిస్తూ తన పూర్తి సమయాన్ని కుటుంబానికి, తమ మిద్దెతోటకు కేటాయిస్తున్నారు. ఝాన్సీరాణికి పచ్చదనంపై మక్కువ చాలా ఎక్కువ. కాబట్టి అద్దె గృహాలలో ఉండే సమయంలో కూడా అవకాశం ఉన్న చిన్న ప్రదేశాన్ని కూడా వదలకుండా మొక్కలు పెంచుతుండేవారు. ఇళ్ళు మారవలసి వచ్చినప్పుడు మొక్కలను మార్చడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ఎంతో ప్రేమగా, ఎంతో కాలం నుంచి పెంచుకున్న కొన్ని మొక్కలు పాడై పోవడం ఝాన్సీరాణిని బాధిస్తుండేవి. ఇలాంటి అన్ని సమస్యలకు సొంత ఇల్లు సరైన పరిష్కారం అని నిర్ణయించుకుని చాలా వేగంగా సొంత ఇంటి కలను సాకారం చేసుకుని 3 అంతస్తుల సొంత ఇంట్లో మిద్దె మీద మిద్దె తోటను పెంపకం చేయడముతో పాటు మూడు అంతస్తులకు ఎక్కేదారిలో ఉండే అన్ని మెట్ల మీద మరియు ఇంట్లో అవకాశం ఉన్న అన్ని ప్రాంతాలలో చివరకు గోడలకు కూడా వృథాగా పడవేసే నూనె క్యాన్‌లను బిగించి అన్నింటిలో ఇండోర్‌ ప్లాంట్స్‌ పెంపకం చేస్తున్నారు.

ఝాన్సీరాణికి ఇంటిపంటలో 8 సంవత్సరాల అనుభవం ఉంది. ప్రస్తుతం 800 చదరపు అడుగుల విస్తీర్ణంలో మిద్దె మీద వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు., స్లాబు మీద నీరు పడితే స్లాబు పాడై పోతది కాబట్టి స్లాబు మీద నీరు పడకుండా స్టాండులు ఏర్పాటు చేసుకుని స్టాండుల మీద వివిధ సైజు ప్లాస్టిక్‌ కుండీలు, టబ్బులు ఏర్పాటు చేసుకుని ఆ టబ్బులలో బరువు తక్కువగా ఉండే సాయిల్‌ మిక్స్‌ని నింపి అందులో వివిధ రకాల మొక్కలు పెంపకం చేస్తున్నారు.

ప్రస్తుతం వారి మిద్దెతోటలో ఆకుకూరలు, కూరగాయలు, ఔషధ మొక్కలు, సుగంధ మొక్కలు, క్రోటాన్స్‌, పూలమొక్కలు, పండ్ల మొక్కలు లాంటి అవకాశం ఉన్న మొక్కలను వదలకుండా పెంపకం చేస్తున్నారు. మొక్కల నిర్వహణకు ఎక్కువగా ఫిష్‌ ఎమినో యాసిడ్‌, వేపనూనె, ఎగ్‌ ఎమినో యాసిడ్‌, ఫ్రూట్‌ పర్మెంటెడ్‌ జ్యూస్‌, థపర్ణి కషాయం, పంచగవ్య, అల్లం+ బెల్లం ద్రావణం, తాటికల్లు+ దాల్చిన చెక్క ద్రావణం, వెల్లుల్లి+ బెల్లం ద్రావణం లాంటి ఎన్నో రకాల ద్రావణాలను సొంతంగా తయారు చేసుకుంటూ మొక్కలకు ఉపయోగిస్తూ ఆరోగ్యకరమైన మిద్దె తోటను పెంచుతున్నారు. 

మిద్దె తోటలో పండే పంటలపై తమతో పాటు ప్రకృతిలో ఉండే వివిధ రకాల పకక్షులకు కూడా అధికారం ఉందని నమ్మి తమ మిద్దెతోటలో వివిధ రకాల పకక్షులు నివశించడానికి, పకక్షులు తమ మిద్దెతోటను ఉపయోగించుకోవటానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి వివిధ రకాల పకక్షులు వాటికి ఇష్టమైన అంజూర, దానిమ్మ లాంటి పండ్లను తమకంటే ముందు పకక్షులే తింటుంటాయి.

అయినా కాని మేము ఏ మాత్రం బాధపడకుండా పకక్షులు కూడా ప్రకృతిలో భాగం కాబట్టి పకక్షులకు ఆహారం ఏర్పాటుకు తమకు అవకాశం దొరికినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. కేవలం 800 చదరపు అడగుల విస్తీర్ణంలో రెండు, మూడు రెట్లు ఎక్కువ మొక్కలు పెంచుతున్న వారి మిద్దె తోటను అనేకమంది ప్రముఖులు సందర్శించారు. ఇంకా సందర్శిస్తూనే ఉన్నారు. మరిన్ని వివరాలు 63025 09928 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌

Read More

బహుళ ప్రయోజనకారి అరటి

అరటి అనగానే మనకు అరటి పండ్లు మాత్రమే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. లేదా అరటి ఆకులు అరటి పూవులు కూడా కొంతమందికి గుర్తుకు వస్తాయి. కాని అరటి చెట్టులోని అన్ని భాగాలు ఉపయోగపడతాయి. ఒక అరటి మొక్కను నాటినట్లయితే అనేక పిలకలు వస్తూనే ఉంటాయి. అరటి వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని గ్రహించి తమ ఇంటి ప్రక్కన కొంత స్థలాన్ని లీజుకు తీసుకుని వివిధ రకాల అరటి మొక్కలు పెంచుతున్నాడు విజయవాడకు చెందిన సురేష్‌.

సురేష్‌ది వ్యవసాయ నేపథ్యం. అయినాకాని ఉన్నత చదువులు చదివి వ్యవసాయానికి దూరం జరిగి విజయవాడలోని ఒక మల్టీస్పెషాలటీ వైద్యశాలలో ఐ.టి. మేనేజరుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. సురేష్‌కి వ్యవసాయం అన్నా, మొక్కలన్నా, పచ్చదనం అన్నా మక్కువ చాలా ఎక్కువ. తన మక్కువను తీర్చుకొనటానికి విజయవాడ మాచవరం డౌన్‌లో కొంత స్థలాన్ని లీజుకు తీసుకుని దాంట్లో వివిధ రకాల అరటి మొక్కలు సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం తన అరటి వనంలో 7 రకాల అరటి మొక్కలు ఉన్నాయి. కర్పూర, రెండు రకాల చక్రకేళి, ఎర్ర అరటి, పచ్చఅరటి, రెండు రకాల కూర అరటి మొక్కలను తెలిసిన  రైతుల వద్ద నుంచి తెలిసిన ఇంటి పంట దారుల నుంచి సేకరించి 7 రకాల అరటి మొక్కలతో అరటి వనాన్ని పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాడు.

అరటి మొక్కలతోపాటు పడి మొలసిన కొన్ని రకాల మొక్కలను కూడా సురేష్‌ పెంచుతున్నాడు. వాటిలో నల్ల ఉమ్మెత్త, పారిజాతం, గురివింద మొక్కలు కూడా ఉన్నాయి. అరటి మొక్కలు పెరిగిన తరువాత ఆ మొక్కల కింద నీడ ఉండి నర్సరీ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి సురేష్‌ ఆవిధంగా కూడా అరటి మొక్కల నీడను కూడా సద్వినియోగం చేసుకుంటూ ఆ నీడలో కొన్ని రకాల మొక్కలను పెంపకం చేస్తూ తాను ఉపయోగించుకోవడంతో పాటు, ఇంటిపంటదారులకు, స్నేహితులకు, తెలిసిన వారికి ఉచితంగా అందచేస్తుంటాడు. కొన్నిసార్లు తానే రవాణా ఖర్చులు కూడా భరించి ఉచితంగా విత్తనాలు, మొక్కలు పంపిస్తుంటాడు. సురేష్‌ విత్తన నిధిని మెయింటేన్‌ చేస్తూ కొన్ని రకాల పురాతన, నాటు విత్తనాలను సంరక్షిస్తూ, వృద్ధి పరుస్తూ, తన వద్దలేని విత్తనాలను తోటి రైతుల వద్ద నుంచి, తోటి ఇంటి పంటదారుల నుంచి, తెలిసిన వారి నుంచి సేకరిస్తూ అవసరమైన వారికి అందిస్తుంటాడు. ఈ విధంగా పచ్చదనం పెంచడంలో తన వంతు పాత్రను పోషిస్తున్నాడు.

తన అరటి వనంలో అరటితో పాటు వివిధ రకాల మొక్కలను పూర్తి సేంద్రియ పద్ధతులతో పెంపకం చేస్తున్నారు కాబట్టి తేనెటీగలు తేనె తుట్టెలను పెడుతుంటాయి. ఈ తేనె టీగల వలన అరటి పంటలో పరపరాగ సంపర్కము సక్రమంగా జరిగి అరటి పండ్ల నాణ్యత, రుచి పెరగటంతోపాటు అరటి గెలలు కూడా పెద్దగా వస్తున్నాయి. గెలలో అన్ని కాయలు గట్టిపడి నాలుగు, ఐదు కాయలు పండి రంగు మారిన తరువాత గెలను కోసి ప్రకృతి సిద్ధంగా పండించి కొన్ని కాయలను తాము వినియోగించుకుంటూ మిగిలిన కాయలను అడిగిన వారికి అమ్మకం చేసి ఆదాయాన్ని కూడా పొందుతున్నాడు.

అరటి మొక్కలలో అన్ని భాగాలు ఉపయోగపడతాయి. అరటి ఆకులు అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు. అరటి గెలలో కాయలు పడిన తరువాత గెల చివరన మిగిలిన పువ్వులతో కూర చేసుకోవచ్చు. అరటి గెలలో కాయలు కోసిన తర్వాత మిగిలే దూటను కూడా కొంతమంది కూరగా చేసుకోవడానికి ఉపయోగిస్తుంటారు. అరటి బోదెలో దొప్పలను కూడా కార్తీక మాసంలో దీపాలు పెట్టి నీటిలో వదలటానికి ఉపయోగిస్తుంటారు. మిగిలి పోయిన అరటి బోదెను వేస్ట్‌డికంపోజరుతో కుళ్ళించినట్లయితే మంచి సేంద్రియ ఎరువు తయారవుతుంది. ఈ విధంగా అరటి మొక్కలోని ఏభాగం వృధా కాకుండా అరటి మొక్క మొత్తం ఉపయోగపడడంతో పాటు అరటి మొక్క నుండి ప్రతినిత్యం పిలకలు వస్తుంటాయి. ఆ పిలకలు ముదిరిన తరువాత తవ్వి మరలా నాటుకోవచ్చు. కాబట్టి అరటిని బహుళ ప్రయోజనకారి అని తెలుసుకున్న సురేష్‌ అరటి వనాన్ని సృష్టించాడు. మరిన్ని విరాలు 89850 68899 కి ఫోను చేసి తెలుసుకోగలరు. 

Read More

ఇంటితోపాటు మిద్దెతోటను వారసత్వంగా ఇవ్వాలి

తల్లిదండ్రులు తమ ఆస్తులను తమ పిల్లలకు వారసత్వంగా అదించడం మన సాంప్రదాయం అనే విషయం అందరికీ తెలిసిందే. ఎంత ఆస్తి ఉన్నా ఆరోగ్యం సక్రమంగా లేకుంటే ఉన్న ఆస్తిని ఆనందంగా అనుభవించలేరు. కాబట్టి ఆస్తి కన్నా ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం ఉన్నప్పుడే ఆస్తి వలన ఉపయోగం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించినట్లయితే మనం తినే ఆహారంలో ప్రత్యేకించి ఆకుకూరలు మరియు కూరగాయలలో విష రసాయన అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఈ సమస్యకు పరిష్కారంగా అవకాశం ఉన్నవారు ఇటిపంటను మొదలుపెట్టి తామే సొంతంగా కూరగాయలు, ఆకుకూరలతో పాటు కొన్ని రకాల పండ్లను పండించుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినగలుగుతున్నారు. ఇలాంటి వారు తమ వారసులకు తమ ఇంటితోపాటు మిద్దెతోటను వారసత్వంగా ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని మిద్దెతోట నిపుణులు రఘోత్తమరెడ్డి అంటున్నారు. రఘోత్తమరెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంటి పంటలు చేసే వారందరికి సుపరిచితమైన పేరు రఘోత్తమరెడ్డి. 

వారసులకు మిద్దెతోటను వారసత్వంగా ఇవ్వాలనుకునేవారు మిద్దెమీద ఇటుకలతో మడులు నిర్మించుకోవాలి. అవి రెండు మూడు తరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటాయి. సాధారణంగా నలుగురు కుటుంబ సభ్యులు ఉండే ఒక కుటుంబానికి ఒకరోజుకు అవసరమయిన కూరగాయలు పొందాలంటే 16 చదరపు అడుగుల మడి సరిపోతుంది. అంటే 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు ఇటుకలతో మడి నిర్మించుకుంటే అందులో బెండ, టమాట లాంటి మొక్కలు 16 వరకు పెంచవచ్చు. ఈ 16 మొక్కలనుంచి ఒక కుటుంబానికి ఒక రోజుకి అవసరమైన కూరగాయలు పొందవచ్చు. లోతు విషయానికొస్తే కూరగాయల పెంపకానికి ఒక అడుగు లోతు మరియు పండ్ల మొక్కల పెంపకానికి రెండు లేదా మూడు అడుగుల లోతు మడులను నిర్మించుకుంటే అనుకూలంగా ఉంటుంది. ప్రతి రెండు మడుల తరువాత మూడవ మడి పండ్ల మొక్కల పెంపకంకుగాను ఎక్కువ లోతు గల మడి నిర్మించుకుని అందులో పండ్ల మొక్కలు పెంచుకుంటే వేసవికాలంలో నీడ ఏర్పడి కూరగాయలు, ఆకుకూరలు బాగా ఎదగడానికి అవకాశం ఉండటంతో పాటు, మిద్దెతోటలో చల్లదనం కూడా ఉంటుంది కాబట్టి వేసవికాలంలో వేడి నుంచి ఉపశమనం కోసం ప్రతి మూడవ మడి పండ్లమొక్కలకు కేటాయించాలి. 

మట్టి మిశ్రమంగా నల్లమట్టి, ఎర్రమట్టిలలో ఏది అందుబాటులో ఉంటే అది ఉపయోగించుకోవచ్చు. ఎరువుగా బాగా మాగిన గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకల ఎరువులలో ఏది అందుబాటులో ఉంటే అది ఉపయోగించవచ్చు. రెండు వంతుల మట్టి ఒక వంతు బాగా మాగిన ఎరువును ఉపయోగించి విత్తనాలను నాటుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి మట్టి మొత్తాన్ని బాగా ఎండబెట్టినట్లయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇందుకుగాను మిద్దెతోటలో 30 శాతం దిగుబడితోను, 30 శాతం ఖాళీగా, 30 శాతం విత్తనాలను నాటినవిగా ప్రణాళిక వేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుంది. విత్తనాల గురించి కూడా ఎక్కువ ఇబ్బంది పడకుండా నాటు విత్తనాల కొరకు ప్రయత్నించి అవి దొరకనట్లయితే సంకర జాతి విత్తనాలను కూడా వేసుకుని ఆ దిగుబడి నుండి మరలా మనము విత్తనాలను సేకరించినట్లయితే కొన్ని రోజులకు అవి నాటు విత్తనాలుగా రూపాంతరం చెందుతాయని రఘోత్తమరెడ్డి వివరిస్తున్నాడు.

చీడపీడల గురించి కూడా పెద్దగా ఇబ్బందులు పడనవసరం లేదు. మొక్కలో రోగనిరోధక శక్తి తగినంత ఉన్నట్లయితే ఆ మొక్కలను  చీడపీడలు అశించవు. పోషకాలు సక్రమంగా గల బాగా మాగిన పశువుల ఎరువు అందించి మంచి విత్తనాన్ని నాటినట్లయితే పెరిగే మొక్క తప్పనిసరిగా రోగనిరోధక శక్తితో పెరుగుతుంది. కాబట్టి అలాంటి మొక్కలకు చీడపీడలు ఆశించవు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పేను లాంటి చీడలు ఆశించిననట్లయితే పేను ఆశించిన ఆకులను తీసివేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

మొక్కలకు అందించే నీటి విషయంలో ఇంటి పంటదారులు తప్పనిసరిగా కామన్‌సెన్స్‌తో ఆలోచించాలి. మొక్కలకు నీరు అవసరం లేదు. కేవలం తేమ మాత్రమే అవసరం ఉంటుంది కాబట్టి మట్టిలోని తేమను గమనిస్తూ నీటిని అందించాలి. ఎక్కువ నీటిని అందించకుండా తగినంత నీటిని మాత్రమే అందించాలి. కాలాన్ని బట్టి నీటిని అందించవలసి ఉంటుంది. అన్ని కాలాలలో ఒకే రకమైన నీటి అవసరం ఉండదు. వివిధ కాలాలకు వివిధ రకాల నీటి అవసరాలు ఉంటాయి కాబట్టి కామన్‌సెన్స్‌ ఉపయోగించి నీటిని అందించవలసి ఉంటుంది.

దోసెడు మట్టి, పిడికెడు ఎరువు, ఒక విత్తనం ఉంటే మిద్దెతోటను ప్రారంభించవచ్చు. ఇటుకలతో మడులు కట్టుకోవడానికి ఇబ్బందులు పడేవారు ఫైబరు టబ్బులను కూడా కొనుగోలు చేసుకుని మిద్దెతోటను ప్రారంభించవచ్చు.

ఇవేమి లేకున్నా కాని సంకల్పం ఉండాలే కాని గ్రోబ్యాగ్స్‌ లేదా ఖాళీ సిమెంటు సంచులతో కూడా మిద్దెతోటను ప్రారంభించవచ్చు. తక్కువ ఖర్చుతో మిద్దెతోటను ప్రారంభించి అనుభవం గడించిన తరువాత శాశ్వత టబ్బులు లేదా శాశ్వత మడులకు మారినట్లయితే ఫలితాలు బాగా ఉంటాయి. ఏది ఏమయినా కాని మన తరువాత తరం వారు ఆరోగ్యంగా, ఆనందంగా మన ఆస్తిని అనుభవించాలంటే ఆస్తితోపాటు మిద్దెతోటను వారసత్వంగా అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని రఘోత్తమరెడ్డి గట్టిగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు 90001 84107 కి ఫోను చేసి తెలుసుకోగలరు. 

Read More

మిద్దెమీదనే పల్లెటూరు, రిసార్ట్‌

వివిధ రకాల కారణాల వలన పట్టణాలలో, నగరాలలో ఇంటిపంట లేదా మిద్దెతోట సంస్కృతి రోజురోజుకు పెరుగుతూ ఉంది. మొదటలో తమ ఇంటి అవసరాలకు సరిపోను కూరగాయలు మరియు ఆకుకూరలతో మొదలైన ఇంటిపంటను కొందరు పట్టుదలతో నందనవనంగా మార్చుకుంటున్నారు. మనసు ఉంటే మార్గాలు అనేకం అన్నట్లు, సంకల్పం ఉంటే ఏదైనా అసాధ్యం కాదు అని కొంతమంది ఇంటిపంట ఔత్సాహికులు నిరూపిస్తున్నారు. అలాంటి ఔత్సాహికులలో హైదరాబాద్‌ కొంపల్లిలో మిద్దెతోటను నిర్వహిస్తున్న శోభ ముందువరుసలో ఉంటుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

శోభకు మొక్కలన్నా, పల్లెటూరు అన్నా, పచ్చదనం అన్నా మక్కువ ఎక్కువ. పరిస్థితుల ప్రభావంతో పల్లెటూరుని వదలి నగరంలో జీవనం కొనసాగించవలసి రావడంతో వాటన్నింటిని మిస్‌ అవుతున్నామన్న లోటు నుంచి బయటకు రావటానికి తన మిద్దెతోటను ఒక నందనవనంగా తీర్చిదిద్ది మిద్దెతోటలోనే ఒక పల్లెటూరును, ఒక రిసార్టును సృష్టించి మనసు ఉంటే మార్గం తప్పక ఉంటుందని నిరూపిస్తున్నారు.

కొంపల్లిలోని గేటెడ్‌ కమ్యూనిటీలో, తమ విల్లా పైన అందుబాటులో ఉన్న 200 గజాల మిద్దెను రెండు భాగాలుగా చేసుకుని ఒకవైపు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మరియు రెండోవైపు పూలు మరియు క్రోటాన్స్‌ను పెంచుతూ మిద్దెమీదకు వచ్చిన అందరూ రిసార్టులో మరియు పల్లెటూరులో ఉన్న అనుభూతి పొందేలా తమ మిద్దెతోటను తీర్చిదిద్దారు. మిద్దెమీద ఒక ప్రాంతంలో పల్లెటూరులో ఉండే అన్ని అంశాలను సొంతంగా తయారు చేసి ఏర్పాటు చేసుకున్నారు. వృధాగా పడవేసే ఏ వస్తువులను కూడా వదలకుండా తనకు అనుకూలంగా డిజైన్‌ చేసుకుని అందులో మొక్కలు పెంచుతుంటారు. చివరకు తాగిపడవేసే కొబ్బరి బోండాలను కూడా వృథాగా పడేయకుండా కొబ్బరి బోండాలకు రంగులు వేసి డిజైన్లు వేసి ఏదో ఒక మొక్కను పెంచుతుంటారు. ఈ విధంగా ఖాళీ పెరుగు డబ్బాలు, నూనె సీసాలు లాంటి వాటన్నింటిలో మొక్కలు పెంచుతుంటారు. మిద్దెతోపాటు పెరటిలో కూడా విల్లా నాలుగు ప్రక్కల పెరటి గోడపక్కన కూడా పసుపు, మిరప, వగ, టమాటాలాంటి మొక్కలు పెంచుతున్నారు.

మిద్దెతోటలో పాలకూర, చుక్కకూర, మెంతికూర, పొదీనా, కొత్తిమీర, బీర, కాకర, చిక్కుడు, సొర, వంగ, టమాట, మునగ, సపోట, జామ, అంజూర, మామిడి, స్టార్‌ఫ్రూట్‌, జీడిమామిడి, వాటర్‌ యాపిల్‌, మల్లె, మందార, గన్నేరు మొదలగు మొక్కల పెంపకం చేస్తున్నారు. అవకాశం ఉన్న చోట వ్రేలాడే కుడీలను కూడా నిర్వహిస్తున్నారు.

పసుపు సాగులో శోభగారిని ప్రత్యేకించి చెప్పుకోవలి. తమ ఇంటి పంటలో పసుపును ఎక్కువగా సాగు చేస్తున్నారు. తనకు పసుపు సాగుపై మక్కువ పెరగడంతో తమ గేటెడ్‌ కమ్యూనిటీలో ఖాళీ ప్రాంతంలో పసుపును సాగు చేసి తోటి వారికి పసుపును ఉచితంగా పంపిణీ చేశారు. ఎవరికి వారు తమకు సంవత్సరానికి సరిపోయేటంత పసుపును తామే సొంతంగా పండించుకోవటానికి ముందుకు రావాలన్నదే శోభ ధ్యేయం. పసుపు సులభమైన పంట కాబట్టి ఎవరైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా పసుపును పండించుకోవవచ్చు అని తోటి ఇంటిపంటదారులకు చెప్పడంతో పాటు ఇంటిపంట అవగాహనా సదస్సుల ద్వారా కూడా వేరేవారికి చెబుతూ ఉంటారు.

మట్టి మిశ్రమంలో ఎర్రమట్టి, కోకోపిట్‌, వర్మికంపోస్ట్‌, ఇసుక, వేపపిండిలతో మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుని మొక్కలు పెంచుతుంటారు. తరువాత అవసరాన్నిబట్టి ఆముదాల పిండి, బోన్‌ మీల్‌, కిచెన్‌ వేస్ట్‌లను మొక్కలకు బలంగా అందించడంతో పాటు చీడపీడల నివారణకు బూడిద, వేపనూనె, పులిసిన మజ్జిగలను వినియోగిస్తుంటారు. కొత్తగా ఇంటిపంటను చేపట్టేవారు మొదటిలో చిన్న చిన్న టబ్బులలో మెంతికూర, పాలకూర, పొదీనా లాంటివాటి పెంపకాన్ని చేపట్టి అనుభవం గడిచే కొలది మొక్కల సంఖ్యను పెంచుకుంటూ పోతే ఫలితం బాగా ఉంటుందని కొత్తగా ఇంటి పంటలోకి అడుగు పెట్టేవారికి శోభ సలహా ఇస్తున్నారు.          

– వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌

Read More

ఆహ్లాదకర వాతావరణానికి మిద్దెతోట సరైనదారి

మన ఆరోగ్యాన్ని కాపాడుటలో మనం తినే ఆహారం, మనం పీల్చే గాలి, శారీరక శ్రమ, మన మానసిక పరిస్థితి, ప్రకృతితో మమేకమవడం లాంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. కాని ప్రస్తుత కాంక్రీట్‌ జంగిల్స్‌ మరియు ఉరుకుల పరుగుల జీవితాలలో ఇవన్నీ అందుబాటులో దొరకడము చాలా కష్టంగా ఉంటుంది. ఇవన్నీ అందుబాటులో లేకపోవడముతో చాలామంది ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి తమతమ ఆరోగ్యాలను సంరక్షించుకోవాలనుకునే వారందరూ తమకు అవకాశం ఉన్నంతలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలకు అందుబాటులోకి వచ్చిన మార్గమే ఇంటిపంట. ఇంటి పంట వలన రసాయనాలు లేని కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని రకాల పండ్లను పొందడముతో పాటు పచ్చదనం వలన వాతావరణ కాలుష్యం తగ్గటంతో పాటు ఇంటి పంట వలన శారీరక శ్రమకు అవకాశం కుదురుతుంది కాబట్టి ఆహ్లాదకర వాతావరణానికి ఇంటి పంట సరైనదారి అని నమ్మి ఇంటిపంటను ఇప్పటి వరకు చేపట్టిన వారు, ఇంకా చేపట్టే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.  ఆరోగ్యకర ఆహారాన్ని పొందడముతో పాటు యోగా చేసుకోవటానికి, తనకిష్టమైన సంగీతాన్ని పచ్చని మొక్కల మధ్య ఆస్వాదించటానికి సరైన దారి ఇంటిపంట అని గ్రహించి విజయవాడ, పటమట ప్రాంతానికి చెందిన భారతిదేవి మిద్దెతోటను మొదలు పెట్టారు.

భారతీదేవి కాస్మొటాలజిస్ట్‌. వీరికి చిన్నతనం నుంచి పచ్చదనం, సంగీతం, యోగాల మీద మక్కువ చాలా ఎక్కువ. తన వృత్తిలో తీరిక లేకుండా ఉండే భారతీదేవి తనకు అందుబాటులో ఉన్న సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా సక్రమంగా వినియోగించుకుంటూ కాస్మొటాలజిస్ట్‌గా తన వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తూ సంగీతానికి, యోగాకి ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయిస్తుంటారు. వాటితోపాటు ఇంటి పంటపై కూడా మక్కువ ఉంది కాబట్టి కొంత సమయాన్ని కేటాయించి తమ మిద్దె మీద కొన్ని రకాల మొక్కల పెంపకం చేపట్టి కొనసాగిస్తున్న పరిస్థితులలో కరోనా రావడం జరిగింది. కరోనా సమయంలో ఎక్కువ సమయం ఇంటి వద్దనే గడపవలసి రావడముతో ఆ సమయాన్ని తమ మిద్దె తోటలోని మొక్కల సంఖ్యను పెంచటానికి కేటాయించి మిద్దెతోటను అభివృద్ధి చేశారు.

మిద్దెమీద మొక్కల పెంపకం చేస్తున్నారు కాబట్టి స్లాబుమీద నీరుపడి స్లాబు పాడవకుండా ఉండటానికి వీలుగా స్లాబుకు వాటర్‌ ఫ్రూప్‌ కోటింగ్‌ను వేయించడంతో పాటు స్టాండులు ఏర్పాటు చేసుకుని స్లాండులపై కుండీలు, టబ్బులు, డ్రమ్ములు లాంటివి ఏర్పాటు చేసుకుని వాటిలో మొక్కల పెంపకం చేస్తున్నారు. అన్ని రకాల మొక్కలకు ఒకే రకమైన కంటెయినర్లు ఉపయోగించకుండా మొక్కల రకాలను బట్టి కంటెయినర్లను ఎంపిక చేసుకున్నారు. ఆకుకూరలకు వెడల్పు మూతి ఉండే టబ్బులను, పండ్ల మొక్కల పెంపకానికి డ్రమ్ములను, కూరగాయలకు బక్కెట్లను…. ఈ విధంగా మొక్కల రకాన్ని బట్టి అందుకు అనుకూలంగా ఉండే కంటెయినర్లను ఎంపిక చేసుకున్నారు. మట్టి మిశ్రమంలో మట్టి, ఎరువు, వేపపిండి, ఇసుక లాంటి వాటిని కలుపుకున్నారు. మట్టి మిశ్రమములో కోకోపిట్‌ను ఉపయోగించలేదు. ఈ మట్టి మిశ్రమము మూడు నెలల వరకు మొక్కలకు పోషకాలను అందిస్తుంది. కాబట్టి మూడునెలల తరువాత మరలా అవసరమైన మట్టి మిశ్రమాన్ని అందిస్తుంటారు. కంటెయినర్లలోని మట్టి గట్టిపడినట్లయితే మొక్క పెరగదు కాబట్టి మట్టి గట్టిపడకుండా ఉండేందుకు గాను క్రమం తప్పకుండా మట్టిని కలుపుతూ మట్టి గుల్లగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇంట్లో వృథాగా పడి ఉండే ప్లాస్టిక్‌ బక్కెట్లు మరియు ఇతర సామాగ్రిని కూడా కంటెయినర్లగా ఉపయోగిస్తూ&వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు.

వీరి మిద్దెతోటలో చింతచిగురు కోసం చింత, సపోట, జామ, అంజీర, డ్రాగన్‌ఫ్రూట్‌, దానిమ్మ, అరటి, ఉసిరి, ద్రాక్ష, నిమ్మ, బత్తాయి మొదలగు మొక్కలతో పాటు అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఆల్‌స్సైసెస్‌ మొక్క, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, బీర సొర, కాకర లాంటి తీగజాతి కూరగాయల మొక్కలను కూడా ఆయా మొక్కలకు అనుకూలమైన కంటెయినర్లలో పెంచుతున్నారు. వీటితో పాటు కొన్ని రకాలను పాలినేషను కొరకు, మిద్దెతోట అందంగా కనిపించేందుకుగాను పెంచుతున్నారు. వేసవి కాలంలో మొక్కల పాదులలో కొబ్బరి పీచు లేదా ఎండు ఆకులను ఏర్పాటు చేయడం వలన ప్రయోజనం బాగా ఉంటుందని ఆవిధంగా చేస్తున్నారు. వేసవి కాబట్టి పిచ్చుకలకు, పకక్షులకు తాగేందుకు నీటిని కూడా మొక్కల నీడలో ఏర్పాటు చేయడం వలన వివిధ రకాల పకక్షులు వీరి మిద్దెతోటలో కనిపిస్తుంటాయి.

వీరికి సంగీతంపై మక్కువ ఎక్కువ కాబట్టి ప్రతిరోజు కొంత సమయాన్ని మిద్దెతోటలో వీణవాయించటానికి కేటాయిస్తారు. మిద్దెతోటలో వీణ వాయించటముంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో వీణవాయించటం వలన పొందే తృప్తితో పాటు మిద్దెతోటలోని మొక్కలకు కూడా ప్రతిరోజు సంగీతాన్ని వినిపిస్తున్నారు. అంతేకాకుండా తాను చిన్నతనం నుంచి యోగా చేస్తుంటారు. ఇప్పుడు మిద్దెతోటలో యోగా చేయడం వలన ఫలితాలు ఇంకా ఆశాజనకంగా ఉంటున్నాయని భారతీదేవి అంటున్నారు. ప్రతిరోజు కొంత సమయాన్ని మిద్దెతోటలో గడపడం వలన శారీరక శ్రమకు అవకాశం దొరుకుతుందని వీరు భావిస్తున్నారు.

తమ ఇంట్లో తమ చేతులతో ఎలాంటి రసాయనాలు లేకుండా పండించుకున్న ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా మంచి రుచిగా ఉంటాయని, కూరగాయలు, ఆకుకూరలు త్వరగా ఉడుకుతాయని, తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. మిద్దెతోటలో ఉసిరి, చింత లాంటి విటమిన్లు అందుబాటులో ఉండే మొక్కలను పెంచి వాటిని ఆహారంగా తీసుకున్నట్లయితే మన శరీరానికి కావలసిన విటమిన్లు సహజ సిద్ధంగా అందుబాటులోకి వస్తాయి కాబట్టి మిద్దెతోట వలన అందరికీ ప్రత్యేకించి స్త్రీలకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు  ఉంటాయి కాబట్టి అందరు ఇంటి పంటను తప్పని సరిగా చేపట్టాలని భారతీదేవి కోరుతున్నారు. కొత్తగా ఇంటి పంటను చేపట్టే వారు మొదటలో ఆకుకూరలతో మొదలుపెడితే ఫలితాలు బాగుంటాయనే సూచనను ఇంటిపంటను మొదలు పెట్టేవారికి ఇస్తున్నారు.   

  – వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌

Read More

వృథా వస్తువులతో మిద్దెతోట

కారణాలు ఏమైనా కాని ఇంటిపంట చేపట్టే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉంది. ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో కొన్ని మొక్కలు పెంచుతున్నారు. మొక్కలు పెంచుకోవటానికి అనేక రకాల కుండీలు, టబ్బులు, డ్రమ్ములలాంటివి వివిధ రకాల కొలతలలో అందుబాటులో ఉంటున్నాయి. కానీ ఇలాంటివి అన్నీ కూడా కొంత డబ్బు వెచ్చించి కొనుగోలు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఖర్చు ఎక్కువుగా అవుతుంది. తక్కువ ఖర్చుతో ఇంటి పంటను మొదలు పెట్టాలనుకునేవారు తమ ఇంట్లో అందుబాటులో ఉండే వృథా అయిన ఫ్రిజ్‌ డబ్బాలు, బక్కెట్లు, కూలర్‌ డబ్బాల లాంటి వాటితో మొదలు పెడుతున్నారు. వాటన్నింటితో పాటు ఇంట్లో అనేక రకాల బిందెలు, కుండీలు, నీళ్ళ డబ్బాల లాంటి వాటిని కూడా తమ మిద్దెతోటలో వినియోగిస్తున్నారు నెల్లూరు పట్టణంలోని మైపాడు గేటు సమీపములో మిద్దెతోటను పెంచుతున్నారు విజయ.

విజయ గారిది వ్యవసాయ నేపథ్యం. ప్రస్తుతం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన విజయకి మొక్కలన్నా, పచ్చదనం అన్నా బాగా ఇష్టం కాబట్టి ఇంటిపంటలను మొదలు పెట్టాలని ఆలోచించి తమ మిద్దెమీద మిద్దె తోట పెంపకానికి అవకాశం ఉంది కాబట్టి మిద్దెతోటను సాగు చేస్తున్నారు. జీరో బడ్జెట్‌తో మిద్దెతోటను మొదలు పెట్టాలనే తలంపుతో మొక్కల పెంపకానికి అవసరమయిన కుండీలు లేదా డ్రమ్ముల లాంటివాటిని బయట నుంచి కొనుగోలు చేయకుండా తమ ఇంట్లో వృథాగా పడి ఉండే బక్కెట్లు, డబ్బాలు, కుండీలు, బియ్యం డబ్బాలు, స్టీలు బిందెలు, ఫ్రిజ్‌ డబ్బాల లాంటి వాటిని తమ మిద్దె తోటలో ఉపయోగిస్తున్నారు. కొన్నిసార్లు పాతసామానుకు ఉల్లిపాయలు అమ్మేవారి వద్ద నుంచి తక్కువ ధరకు ప్లాస్టిక్‌ బక్కెట్లు, ప్లాస్టిక్‌ డబ్బాలు లేదా ఏ ఇతర సామాన్లు మొక్కల పెంపకానికి అనుకూలంగా ఉంటాయో అలాంటి వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసుకుని ఉపయోగిస్తున్నారు. ఏది ఏమైనా కాని మొక్కల పెంపకానికి ఉపయోగించే కంటెయినర్ల కోసం సాధ్యమయినంతవరకు ఖర్చు పెట్టకుండా జీరో బడ్జెట్‌లో చేయాలన్నదే విజయ గారి లక్ష్యం. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తూ ఇంట్లో ఏ వస్తువును వృథాగా పడవేయకుండా చివరికి పగిలిపోయిన కుండలలో కూడా మొక్కలు పెంచుతున్నారు. 

మొక్కల పెంపకానికి ఉపయోగించే మట్టి మిశ్రమం కోసం కూడా ఎక్కువ ఖర్చు పెట్టకుండా తమ మిద్దెతోటలో ఉండే మొక్కల నుండి లభించే ఎండు ఆకులతో పాటు బయట అందుబాటులో ఉండే ఎండు ఆకులను కూడా సేకరించి ఎండు ఆకులు మరియు మట్టిని పొరలు పొరలుగా వేసుకుంటూ పైన 25 శాతం భాగం మాత్రమే ఎరువు, మట్టితో నింపి అందులో మొక్కల పెంపకం చేపడుతున్నారు. ఈ పద్ధతి వలన లోపల వేసిన ఎండు ఆకులు నిదానంగా కుళ్లుతుంటాయి కాబట్టి మొక్క నాటిన లేదా విత్తనం పెట్టిన 60 నుండి 90  రోజుల వరకు మొక్కకు పోషకాలు ప్రధానంగా అందుతుండడము విజయ అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. మొక్కకు అవసరమైన పోషకాలు సక్రమంగా అందడము వలన మొక్కల రోగనిరోధక శక్తి పెరిగి చీడపీడల ప్రభావం తక్కువగా ఉంటుంది. తాను పెంపకం చేసే మిద్దెతోటలో చీడపీడల ప్రభావం తక్కువగా ఉంటుంది కాట్టి చీడపీడల నివారణ కొరకు పెద్దగా ఇబ్బందులు ఉండడం లేదు.

వీరి మిద్దెతోటలో ఆకుకూరలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడుటలో ఆకుకూరలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. కాబట్టి రోజు మార్చి రోజు తమ ఆహారంలో ఆకుకూర ఉండేలా తమ మిద్దెతోటలో ఆకుకూరలను పెంచుతున్నారు. తోటకూర, కొత్తిమీర, పొదీనా, రెండు రకాల బచ్చలి కూర, పొన్నగంటి కూర, రెండు రకాల గోంగూర, మెంతికూర పెంచడముతోపాటు ఆవాలు, వాము లాంటి వాటిని కూడా మిద్దెతోటలో పెంచుతూ ఆకుకూరగా ఉపయోగిస్తున్నారు. వీటితోపాటు మునగ ఆకు, తమలపాకు లాంటి వాటిని కూడా తమ వంటలలో క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నారు. వంగ, బెండ, టమాట లాంటి కూరగాయలతో పాటు తీగజాతి కూరగాయల పెంపకానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. తీగజాతి కూరగాయల పెంపకానికి ఎక్కవ స్థలం అవసరం లేకపోగా దిగుబడి కూడా బాగా వస్తుంది కాబట్టి బీర, కాకర, పొట్ల, దోస లాంటి కూరగాయలు 365 రోజులు వచ్చేలా విత్తనాలను వేస్తుంటారు. ఏది ఏమైనా కాని తమ ఇంటి అవసరాలకు సరిపోయే కూరగాయలు, ఆకుకూరలను అతి తక్కువ ఖర్చుతో ఒక విధంగా చెప్పాలంటే ఖర్చు లేకుండా ఆరోగ్యంగా పెంచుతూ ఉపయోగిస్తున్నారు. వీరు పెంపకం చేసే చింత చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చింత చిగురు కోసమని చింత చెట్టును పెంచుతున్నారు. ఆ చెట్టు నుండి ప్రతినిత్యం చింతచిగురు పొందుతున్నారు. చింత చెట్టు పెద్ద చెట్టు అయిన తరువాత తమ ఇంటి చుట్టుప్రక్కల వారు తమ తమ అవసరాలకు ఆ చెట్టు నుండి చింత చిగురును పొందుతుంటారు. వీటితో పాటు కరివేపాకు, బొప్పాయి, నిమ్మ, జామ, సపోట, సీతాఫలం, కొబ్బరి, కుంకుడు, బత్తాయి, నారింజ, గన్నేరు, మల్లె లాంటి మొక్కలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నారు.

తాను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కాబట్టి మొక్కల పెంపకం గురించి, పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు అనునిత్యం తెలియ చేయడంతో పాటు స్కూలు ఆవరణలో కూడా కొన్ని మొక్కలను పిల్లల చేత నాటిస్తుంటారు. అంతేకాకుండా ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో అవకాశం ఉన్న చోట మొక్కల పెంపకం చేపడుతుంటారు. కొత్తగా ఇంటి పంటను చేపట్టే వారు ఇంట్లో వృథాగా ఉండే వస్తువులను తమ ఇంటి పంటలో ఉపయోగిస్తే జీరోబడ్జెట్‌తో ఇంటి పంటను మొదలు పెట్టవచ్చు అని సలహా ఇస్తున్నారు.        – వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌

Read More
  • 1
  • 2