తక్కువ ఖర్చుతో టెర్రస్ గార్డెన్
పలు రకాల కారణాల వలన ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాలలో కూడా ఇంటి పంటను చేపట్టే వారు పెరుగుతున్నారు. ఇంటిపంటదారుల సంఖ్య పెరిగేకొలది ఇప్పటి వరకే ఇంటి పంట మొదలు పెట్టిన వారికి మరియు కొత్తగా మొదలు పెట్టే వారికి అనేక రకాలుగా ఉపయోగం ఉంటుంది. మొదటలో కొద్ది మంది మాత్రమే ఇంటి పంటను చేస్తున్న సమయంలో విత్తనాల కొరకు, చిన్న చిన్న సలహాల కొరకు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఇంటి పంట దారుల సంఖ్య పెరిగే కొలది అనేక రకాల సమస్యలకు పరిష్కారాలు సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి ఇంటిపంట వైపు అడుగులు వేసే వారి సంఖ్య ఏఏటికాయేడు పెరుగుతూ ఉంది. ఇంటి పంట వైపు అడుగులు వేసేవారిలో అన్ని వర్గాల వారు, అన్ని వయసుల వారు ఉంటున్నారు. మిగతా వారితో పోల్చుకుంటే ఉద్యోగ బాధ్యతల నుంచి పదవీవిరమణ చేసిన వారికి ఇంటిపంట బాగా ప్రయోజనకారిగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తమకు అవసరమయిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల లాంటి వాటిని ఎలాంటి రసాయనాలు వేయకుండా ఆరోగ్యకరంగా పండించుకొని తింటూ తమ తమ ఆరోగ్యాలను కాపాడుకోవడంతో పాటు పదవీ విరమణ అయిన తరువాత ఎలాంటి వ్యాపకం లేకుండా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఇంటి పంట ఒక ఆరోగ్యకర వ్యాపకంగా ఉపయోగపడుతుండడంతో పదవీవిరమణ చేసిన వారికి అన్ని రకాలుగా ప్రయోజనకారి ఇంటిపంట అని గ్రహించి తాము చేస్తున్న ఉద్యోగాల నుంచి పదవీ విరమణ పొందిన తరువాత టెర్రస్ గార్డెన్ మొదలు పెట్టారు హైదరాబాదు మధురానగర్కి చెందిన వినయకుమార్, సృజన దంపతులు.

వినయ్కుమార్ పవర్గ్రిడ్లో మేనేజరు బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. సృజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని చేస్తూ పదవీ విరమణ పొందారు. వీరు తమ పదవీ విరమణ అయిన తరువాత ఒక మంచి వ్యాపకం కోసం 2020వ సంవత్సరములో తమ మిద్దె మీద మిద్దెతోటను ప్రారంభించారు. మిద్దెతోట వలన ఆరోగ్యకర ఆహారాన్ని పొందడముతో పాటు శారీరక శ్రమతో పాటు మానసిక ఉల్లాసం దొరుకుతుందని ఇటువైపు అడుగులు వేశారు. వారు మిద్దెతోటను ప్రారంభించే సమయానికి అనేక మంది ఇంటి పంటదారులు ఉన్నారు కాబట్టి కొన్ని రకాల మెళకువలు చేపట్టడానికి అవకాశం కుదిరింది. తెలుసుకున్న వెళకువలలో భాగంగా మొక్కల పెంపకానికి ఉపయోగించే కంటెయినర్ల విషయంలో ఎక్కువ ఖర్చు చేయకుండా తక్కువ ఖర్చుతో ఇంట్లో అందుబాటులో ఉండే వృథాగా పడవేసే టైర్లు, డబ్బాలు, నీటి డబ్బాలు, బక్కెట్లు, నూనె టిన్నుల లాంటి వాటితో పాటు స్క్రాప్ దుకాణాలలో తక్కువ ధరలో అందుబాటులో ఉండే కూరగాయల ట్రేలు, సూట్కేసుల లాంటి వాటిని అతి తక్కువ ధరలో సేకరించి వివిధ రకాల మొక్కల పెంపకం మొదలు పెట్టారు.
టెర్రస్ మీద నీళ్ళు పడితే స్లాబ్ పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి కంటెయినర్లను స్లాబ్ మీద పెట్టకుండా కొంచెం ఎత్తులో ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా ఎత్తులో ఏర్పాటు చేసుకోవడం వలన స్లాబ్ మీద పడిన నీరు వెంటనే ఆరిపోయి స్లాబ్ పాడవకుండా కాపాడుకోగలిగారు. మట్టి మిశ్రమానికి గాను మిద్దెతోట ప్రారంభించిన మొదటిలో ఒక ట్రాక్టరు ట్రక్కు మట్టిని కొనుగోలు చేసుకుని ఇప్పటివరకు ఆ మట్టిని వినియోగిస్తున్నారు. మట్టి మిశ్రమములో మట్టి, కోకోపిట్, ఎరువులను సమానంగా తీసుకుని దానికి కొద్దిమొత్తంలో వేపపిండిని కలిపి ఆ మిశ్రమాన్ని కంటెయినర్లలో నింపి మొక్కల పెంపకం మొదలు పెట్టారు.
విత్తనాల కొరకు కూడా పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. మిద్దెతోట ప్రారంభించిన కొత్తలో ఒక్కసారి మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయడం జరిగింది. తరువాత తమ మిద్దెతోటలోని మొక్కల నండి విత్తనాలను సేకరించి తాము ఉపయోగిస్తూ తోటివారికి అందిస్తూ ఉన్నారు. ఇందుకు గాను ఇంటి పంటను పెంచేవారితో కొన్ని గ్రూపులను ఏర్పాటు చేసుకుని ఆ గ్రూపులలో విత్తనాల గురించి, ఇంటి పంటకు సంబంధించిన విషయాల గురించి చర్చించుకుంటూ, ఒకరికొరకు చేదోడుగా ఉంటూ, విత్తనాలు, నారు లాంటి వాటిని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మిద్దె తోటను కొనసాగిస్తున్నారు. మొక్కలకు పోషకాలకు మరియు చీడపీడల నివారణకు గో-కృపామృతం, వేస్ట్డికంపోజర్, కిచెన్ వేస్ట్ ద్రావణాన్ని ఉపయోగిస్తున్నారు. అన్ని రకాల మెలకువలు తీసుకుంటూ తక్కువ ఖర్చుతో మిద్దెతోటలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. తమ మిద్దెతోటలో వివిధ రకాల ఆకుకూరలతో పాటు, వంగ, టమాట, చిక్కుడు, పచ్చిమిర్చి, చింత, ఉసిరి, స్ట్రాబెర్రి, జామ, సపోట, యాపిల్ బేర్, నిమ్మ, డ్రాగన్ఫ్రూట్, బత్తాయి లాంటి వాటితో పాటు తులసి, అరటి లాంటి మొక్కలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులలో పెంపకం చేస్తున్నారు.కొత్తగా ఇంటిపంటను చేపట్టేవారు కంటెయినర్ల విషయంలో ఎక్కువ
ఖర్చు పెట్టకుండా తమ ఇంట్లో వృథాగా పడి ఉన్న టైర్లు, వాటర్ క్యానులు, నూనె క్యానులు, బక్కెట్ల లాంటి వాటితో పాటు స్క్రాప్ దుకాణాలలో దొరికే కూరగాయల ట్రేలు, ప్లాస్టిక్ డబ్బాలు, బక్కెట్లు లాంటి వాటిని తక్కువ ధరలో కొనుగోలు చేసుకుని మొక్కల పెంపకం చేపట్టగలిగగితే ఖర్చులు తక్కువగా అవుతాయి. విత్తనాల విషయంలో తమ లాంటి ఇంటి పంట దారులను సంప్రదిస్తే విత్తనాలు అందుబాటులోవస్తాయి కాబట్టి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే కొత్తగా ఇంటిపంటను చేపట్టే వారిని వారు కోరుతున్నారు.
– వై. శ్రవణ్ కుమార్, స్పెషల్ కరస్పాండెంట్




