జులై 19వ తేదీన కేంద్ర ప్రభుత్వం నాన్‌-బాస్మతీ బియ్యం ఎగుమతుల్ని తక్షణం నిషేధించింది. గత సంవత్సరం ముందు గోధుమ ఎగుమతుల్ని నిషేధించింది. ఆ తర్వాత గోధుమ పిండి ఎగుమతుల్ని కూడా నిషేధించింది. బియ్యం నూకల ఎగుమతిని కూడా ఆపేసింది. నాన్‌-బాస్మతీ బియ్యం ఎగుమతులపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. పంచదార ఎగుమతులకు 6.1 మిలియన్ల టన్నుల పరిమితి నిర్ధేశించింది. ఆ మేరకు ఎగుమతులు పూర్తవడంతో పంచదార ఎగుమతులు కూడా నిలిచిపోయాయి. తాజాగా నాన్‌-బాస్మతీ బియ్యం ఎగుమతిని కూడా పూర్తిగా నిలిపివేసింది. ఈ చర్యలన్నిటివల్ల దేశంలో రైతులు కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నారు. వారికి గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఏర్పడినప్పుడల్లా కేంద్రప్రభుత్వం నిరంకుశ చర్యలతో విరుచుకుపడుతున్నది. పంటలు బాగా పండినప్పుడు వాటికి సేకరణ మద్దతుని అందించకుండా రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్నది. గిరాకీ ఉండి ఎగుమతి అవకాశాలున్నప్పుడు వారికి గిట్టుబాటు ధరలు లేకుండా చేస్తున్నది. 

2020 నవంబరు నుండి 2021 నవంబరు వరకు ఉత్తర రాష్ట్రాల రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలనీ, కార్పొరేట్‌ శక్తుల ఆధిపత్యాన్ని పెంచే మూడు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక ఆందోళన నిర్వహించారు. ఆ ఆందోళనలను ఉక్కు పాదంతో అణిచివేయాలని ప్రయత్నించి, ప్రభుత్వం విఫలమైంది. చివరకు వారికి క్షమాపణ చెప్పి, కనీస మద్దతు ధరలకు చట్టభద్రత కల్పించటానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. కాని ఎన్నికల గండం గట్టెక్కిన తర్వాత ‘ఏరు దాటాక తెప్పతగిలేసిన’ చందంగా వాగ్దాన భంగం చేసింది. ఉద్యమ సమయంలో ఐక్యంగా ఉన్న రైతు సంఘాలు విరమించిన తర్వాత రాజకీయంగా విడిపోయాయి. మళ్ళీ ఉద్యమాలను చేపట్టలేకపోయాయి. గోధుమ ఎగుమతిని నిషేధించినప్పుడు దక్షిణ భారత రైతులు తమకేమీ నష్టం లేదని స్పందించరు. బియ్యం ఎగుమతుల్ని నిలిపివేస్తే ఉత్తర భారత రైతులు బాస్మతీ బియ్యం ఎగుమతిని నిషేధించలేదని ఊరట చెందుతున్నారు. రైతులు ఐక్యంగా లేక, కొద్దిపాటి ఐక్యతను రాజకీయ శక్తిగా మలచుకోలేక భంగపడుతున్నారు. దేశంలో తీవ్రమైన ఆర్థిక అసమానతలున్నా, దేశంలో 84 శాతం మంది ప్రజల వాస్తవాదాయాలు పడిపోతున్నా పేదలు ఎదిరించే పరిస్థితుల్లో లేరు. మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య వైరుధ్యాలను పెంచి, పోషిస్తూ పాలక వర్గాలు పబ్బం గడుపుకుంటున్నాయి. ఆరుగాలం శ్రమించే రైతులు, కూలీలు, కార్మికులు, అసంఘటిత రంగంపై జీవించే వారు పేదరికంలోకి జారిపోతుంటే పెట్టుబడిదార్లు, వ్యాపార వర్గాలు లాభాలు కొల్లగొడుతున్నారు. దేశంలో 145 మంది బిలియనీర్లున్నందుకు గర్విస్తూ, అంబానీ, అదానీలు ప్రపంచంలోఅత్యంత ధనికులుగా ఎగబ్రాకుతున్నందుకు చప్పట్లు చరుస్తూ, అలాంటి సంపద సృష్టి కర్తలను పూజిస్తూ దేశాన్ని పీడిస్తున్న నిరుద్యోగం, పేదరికం, పౌష్టికాహార లోపం సమస్యలే కాదన్నట్లు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. అత్యంత పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను విదిలిస్తూ, కటిక దరిద్రుల సంఖ్య తగ్గిందని సంతోషిస్తున్నాము. సాపేక్షిక పేదరికం, నైరాశ్యంలో ఉన్న రైతులు, గ్రామీణ, పట్టణ పేదలు, స్తంభించిన మధ్యతరగతి జీవన ప్రమాణాలు విధాన కర్తల దృష్టికి రావడం లేదు. కొందరి వద్ద పోగుబడుతున్న సంపద అశేష సంఖ్యలో ఉన్న పేదల జేబుల్లో నుండే వస్తుందనే కార్యకారణ సంబంధాల గురించి అవగాహన మేధావి వర్గాల్లో కూడా లోపించింది. సంపన్నుల పిడికిళ్ల నుండి జారే పెట్టుబడుల ద్వారానే పేదలు తమ ఆదాయాలను మెరుగుపరుచుకోవాలనే దృక్పథం పాలక వర్గాల్లో ఉంది.

బయటకు చెప్పే కారణాలు

దేశంలోని ప్రజలంతా వినిమయదారులే. ద్రవ్యోల్బణం వల్ల వాస్తవాదాయాలు ప్రభావితం అవుతున్నాయి. రెండేళ్ల పాటు కోవిడ్‌-19 కారణంగానూ, ఒక సంవత్సరంన్నరగా రష్యా-యుక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సమస్యగా మారుతున్నది. వడ్డీ రేట్లు పెరగటం వల్ల కొంత శాంతించినా, ఇంకా సమసిపోలేదు. ద్రవ్యోల్బణంలో మూడు విభాగాలున్నాయి. ఒకటి ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల వల్ల ఏర్పడేది. రెండవది మౌలిక ద్రవ్యోల్బణం. దీనిని ఇంగ్లీషులో ‘కోర్‌ ఇన్‌ఫ్లేషన్‌’ అని వ్యవహరిస్తారు. మూడవది ఆహార ద్రవ్యోల్బణం. వాతావరణంలో వస్తున్న మార్పులు, అతివృష్టి, అనావృష్టి, చీడ, పీడల వల్ల ఆకస్మికంగా కలిగే పరిణామాల వల్ల వ్యవసాయ ఉత్పత్తిలో హెచ్చుతగ్గులేర్పడుతున్నాయి. పంటలు నష్టపోయినప్పుడు, మిగిలిన కొద్ది పంటకు మంచి ధరలు లభిస్తాయి. పంటలు బాగా పండినప్పుడు ధరలు తగ్గుతాయి. ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వాలు ఆదుకోకుండా, పెరిగినప్పుడు అంకుశం విధిస్తే అన్యాయమే అవుతుంది. యుద్ధ ప్రభావం వల్ల ముడిచమురు ధరలు బారెల్‌కి వంద డాలర్లకు పెరిగి, తర్వాత 80 డాలర్లకు తగ్గింది. చమురు ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం పెట్రోల్‌, డీజెల్‌ ధరల్ని పెంచింది. కాని అవి తగ్గినప్పుడు వినిమయదారులకు అదే దామాషాలో ఉపశమనాన్ని కల్గించలేదు. పెట్టుబడిదారీ వ్యవస్థలో పోటీ సరిగ్గా ఉంటే మౌలిక ద్రవ్యోల్బణం తగ్గుతుంది. కాని గుత్తాధిపత్యం వల్ల కంపెనీల ఉత్పత్తుల ధరలు పెరిగి, లాభాలొస్తాయి. కాని మౌలిక ద్రవ్యోల్బణం అదుపులోకి రాదు. సాంకేతిక ప్రగతి, డిజిటల్‌ విప్లవాల వల్ల ద్రవ్యోల్బణం తగ్గాలి. కాని గుత్త సంస్థలు సాంకేతిక ప్రగతిని తమ లాభాల్ని పెంచుకోవటానికే వాడతాయి. వ్యవసాయ రంగంలో కూడా కొంత సాంకేతిక ప్రగతి ఉన్నా వాతావరణ ప్రభావం ఉత్పత్తిని ఎక్కువగా శాసిస్తున్నది. పాలక వర్గాలు చమురు ధరలు తగ్గించకుండా, గుత్త సంస్థల్ని నియంత్రించకుండా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో విఫలమౌతున్నాయి. కాని వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై మాత్రం ఉక్కుపాదాన్ని మోపుతున్నాయి. గత నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.8 శాతంగా నమోదైంది. ఒక సంవత్సర కాలంలో బియ్యం ధరలు 11 శాతం పెరిగాయి. ఒక నెలలో మూడు శాతం పెరిగాయి. ఉత్తర భారతంలో అధిక వర్షాలు, వింధ్య పర్వతాల క్రింద వర్షాభావం వల్ల ఉత్పత్తిని కొంత వరకు దెబ్బతీయవచ్చు. వీటిని సాకుగా చెప్పి బియ్యం ఎగుమతుల్ని నిషేధించారు.

కొరతలేని ఉత్పత్తి

800 కోట్ల ప్రపంచ జనాభాలో 300 కోట్ల మందికి వరి బియ్యమే ప్రధాన ఆహారం. అయితే బియ్యంలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల మధమేహం వంటి అనేక దీర్ఘకాల వ్యాధులు ప్రబలుతున్నాయనే ప్రచారం వల్ల బియ్యం వాడకాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు. బియ్యం ఉత్పత్తి, వినిమయాల మధ్య సమతూకం ఉంటున్నది. 2019-20లో ఉత్పత్తి 503.6 మిలియన్‌ టన్నులు కాగా వినిమయం 501.1 మిలియన్‌ టన్నులుగా ఉంది. 2020-21లో 518 మిలియన్‌ టన్నులు కాగా వినిమయం 509.9 మిలియన్‌ టన్నులుగా ఉంది. 2021-22లో ఉత్పత్తి 526 మిలియన్‌ టన్నులు కాగా, వినిమయం 522.7 మిలియన్‌ టన్నులుగా ఉంది. 2019-20లో 181.8 మిలియన్‌ టన్నుల బియ్యం నిల్వలుండగా 2021-22లో అవి 197 మిలియన్‌ టన్నులకు పెరిగాయి. 2022-23లో మాత్రం ఉత్పత్తి 517.6 మిలియన్‌ టన్నులు కాగా, వినిమయం 520.4 మిలియన్‌ టన్నులు కావటం వల్ల నిల్వలు 195.1 మిలియన్‌ టన్నులకు తగ్గాయి. 2023 జులైలో వెలువడ్డ అంచనాల ప్రకారం 2023-24లో ఉత్పత్తి 523.7 మిలియన్‌ టన్నులుండవచ్చనీ, వినిమయం 520 మిలియన్‌ టన్నులుండవచ్చనీ, నిల్వలు 198.5 మిలియన్‌ టన్నులకు పెరగవచ్చనీ తెలుస్తున్నది.

ఈ లెక్కలన్నీ ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ వెలువరించినవే. ఈ గణాంకాలు ప్రపంచ స్థాయిలో నిల్వలు తగ్గలేదని తెలుస్తున్నది. ఇక భారత్‌లో కూడా బియ్యానికి ఎటువంటి కొరత లేదు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 129.47 మిలియన్‌ టన్నుల బియ్యం ఉత్పత్తయ్యాయి. వినిమయం 109 మిలియన్‌ టన్నులు కాగా, ఎగుమతులు 22 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి. గత నాలుగేళ్ళుగా బియ్యం నిల్వలు పెరిగాయే కాని తగ్గలేదు. బియ్యం సేకరణను సకాలంలో చేపట్టకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుత్సాహపరుస్తున్నాయి. ‘వరి వేస్తే ఉరే’ నన్న నినాదంతో రైతుల్ని బెదిరించటం మన స్మృతి పథం నుండి చెరిగిపోలేదు. వరి సాగుని తగ్గించాలనీ, అనవసరంగా వరి బియ్యం నిల్వలను నిర్వహించాల్సి వస్తుందని ప్రభుత్వ ప్రతినిధులు సూత్రీకరించారు. వారే ఇప్పుడు వరి బియ్యానికి కొరత ఏర్పడనున్నదనీ, అందుకే ఎగుమతుల్ని నిషేధించామని చెప్పటం హాస్యాస్పదంగా ఉంది. ఈ కొరత ఊహాజనితమేనని ఎగుమతిదార్ల సంఘం చెప్పింది.

ఆహారధాన్యాల నిల్వకు ప్రాతిపదిక

2023 మే చివరి నాటికి దేశంలో గోధుమ నిల్వలు 33.12 మిలియన్‌ టన్నులు, బియ్యం నిల్వలు 31.14 మిలియన్‌ టన్నులున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 1వ తేదీకి 21.04 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాల నిల్వ ఉంటే చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్‌, మే మాసాల్లో గోధుమ, రబీ వరి బియ్యం సేకరణలో గోదాములన్నీ నిండిపోతాయి. జులై 1వ తేదీకి 41.12 మిలియన్‌ టన్నులు, అక్టోబరు 1వ తేదీకి 30.77 మిలియన్‌ టన్నులు, జనవరి 1వ తేదీకి 21.41 మిలియన్‌ టన్నులు ఆహారధాన్యాల నిల్వ ఉంటే చాలని ప్రభుత్వం మార్గదర్శక సూత్రాలను ప్రకటించింది. జూన్‌ నుండి సెప్టెంబరు మాసాల మధ్య ప్రజాపంపిణీ వ్యవస్థకు 9.75 మిలియన్‌ టన్నుల బియ్యం, 7.5 మిలియన్‌ టన్నుల గోధుమ అవసరమని అంచనా వేసింది. పేదలకు ఉచితంగా అందించే ఆహారధాన్యాల పథకం కోసం 22.9 మిలియన్‌ టన్నుల బియ్యం, 10.2 మిలియన్‌ టన్నుల గోధుమలు సరిపోతాయి. ఇవి పోగా అక్టోబరు 1, 2023 నాటికి 10.3 మిలియన్‌ టన్నుల బియ్యం, 20.8 మిలియన్‌ టన్నుల గోధుమలు మిగిలి ఉంటాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 10.32 మిలియన్‌ టన్నుల బియ్యం, 20.52 మిలియన్‌ టన్నుల గోధుమలు సరిపోతాయి. అక్టోబరు-డిసెంబరు నెలల మధ్య ఖరీఫ్‌ వరి బియ్యం గోదాములకు చేరతాయి. అక్టోబరు 1వ తేదీకి సరిపోనూ ఆహార నిల్వలుంటున్నప్పుడు ఇంకా కొరత గురించి ఆందోళన ఎందుకు? ఖరీఫ్‌ వరి దిగుబడుల గురించి అనుమానం, ఆందోళన వల్లనే ఎగుమతుల్ని నిషేధించడం సమర్ధనీయం కాదు. బాస్మతి బియ్యం, ఉప్పుడు బియ్యం ఎగుమతులను ఆంక్షల నుండి మినహాయించారు. ఇప్పటికే ఎగుమతుల కోసం మార్గమధ్యంలో ఉన్న బియ్యం కూడా అనుమతించబడుతుంది. ఇప్పటికే ఎగుమతి ఒప్పందాలు కుదుర్చుకున్న బియ్యం ఎగుమతిని కూడా అనుమతించటం అవసరం. అంతర్జాతీయ వాణిజ్య సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది.

కోల్పోతున్న ఆదాయాలు

గత సంవత్సరం (2022) గోధుమలు, గోధుమ పిండి ఎగుమతుల్ని నిషేధించినప్పుడు గోధుమ ధరలు క్వింటాలుకి రూ. 2700/-నుండి 2200/-కి తగ్గాయి. ఫలితంగా గోధుమ రైతులు టన్నుకి రూ. 5000/-ల చొప్పున కనీసం 60 మిలియన్‌ టన్నులపై రూ. 30 వేల కోట్లు నష్టపోయారు. అలాగే నూకల ఎగుమతిని నిషేధించి, బియ్యం ఎగుమతులపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించటం వల్ల బియ్యం ధరలు క్వింటాలుకి వెయ్యి రూపాయలు తగ్గాయి. వరి సాగు చేసిన రైతులు 80 మిలియన్‌ టన్నుల బియ్యంపై 80 వేల కోట్ల వరకు నష్టపోయారు. ఎగుమతులపై నిషేధం, పన్నులు, సుంకాలు లేకుంటే వడ్లకు క్వింటాలుకి రూ. 2200 ధర లభించేది. కాని సేకరణ మద్దతు అందక, కనీస మద్దతు ధర కన్నా రెండు మూడు వందల రూపాయలకు తక్కువకే అమ్ముకోవాల్సి వచ్చింది. బస్తాకు 5 నుండి 10 కిలోలు అదనంగా తీసుకొని మిల్లర్లు లాభించారు. ఈ సంవత్సరం పూర్తి నిషేధం వల్ల వడ్లు, బియ్యం ధరలు ఇంకా తగ్గవచ్చు. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లోనే ప్రభుత్వ విధానాల వల్ల వరి, గోధుమ రైతులు లక్ష కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచామని గొప్పలు చెప్పుకోవటానికీ, వినిమయదారులు, పెట్టుబడిదార్లకు లాభాలనివ్వటానికీ రైతుల ఆదాయాలను పణంగా పెట్టారు. 2022-23లో 22 మిలియన్‌ టన్నుల నాన్‌-బాస్మతీ బియ్యం ఎగుమతయింది. ఈ సంవత్సరం దానిని 15 మిలియన్‌ టన్నులకు తగ్గించేలా ఎగుమతి సుంకాన్ని కొంత పెంచితే సరిపోయేది. కాని పూర్తి నిషేధం బియ్యం ధరలను క్రుంగదీస్తుంది. వడ్లకు గిరాకీ తగ్గి, రైతులు నష్టపోవడం ఖాయం. కొంత దిగుబడి ప్రకృతివైపరీత్యాల వల్ల తగ్గితే, మిగిలిన పంటకు కనీస మద్దతు ధర కూడా లభించకుండా రైతులకు ఖర్చులు కూడా రావు. ప్రపంచ మార్కెట్లో 40 శాతం నాన్‌-బాస్మతీ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న భారతదేశపు ప్రతిష్ట దిగజారుతుంది. భారత్‌ను నమ్మకమైన వ్యాపార భాగస్వామిగా గుర్తించరు. 2021-22లో భారత్‌ నుండి 50 బిలియన్‌ డాలర్ల కన్నా ఎక్కువగా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. 2022 ఏప్రిల్‌ నుండి డిసెంబరు వరకు ఎగుమతుల విలువ సుమారు 39 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే కేవలం 2.8 బిలియన్‌ డాలర్లే ఎక్కువ. దిగుమతుల విలువ కూడా 3.8 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. వ్యాపార మిగులు తగ్గింది. గోధుమ, బియ్యం ఎగుమతుల్లో ఏర్పడిన అవకాశాలను కోల్పోవటం జరిగింది. ఈ పంటల్ని సాగు చేస్తున్న రైతులు ప్రభుత్వ విధానాల వల్ల ఆసక్తిని కోల్పోయి, ఉత్పత్తిని పెంచటంలో ఉత్సాహాన్ని చూపరు. ఎగుమతుల్ని అనుమతిస్తే రైతులు లాభించి మరింత ఎక్కువ పండిస్తారు. వినిమయదారులు, పెట్టుబడిదార్ల ప్రయోజనాల కోసం రైతుల్ని బలి చేయటం అవివేకమౌతుంది. కొరతలేకుండానే నిషేధం విధించి రైతులకు నష్టం కలిగించడం సమర్థనీయం కాదు.   

డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త, (రిటైర్డ్‌ ఞ కన్సల్టెంట్‌ ఇక్రిసాట్‌)

ఫోన్‌: 83098 59517, 70328 11608