ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు మంచి ఏర్పాట్లు

సన్న, దొడ్డు వడ్లకు వేర్వేరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఖరీఫ్‌ (వానాకాలం) సీజన్‌లో తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి 75 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని..  పౌరసరఫరాలశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధాన్యం సేకరణ కార్యాచరణను వెల్లడించారు. 'రైతులు వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి కుప్పపోసిన తరువాత తడిసినా, మరే ఇతర నష్టం వాటిల్లినా మేం బాధ్యత తీసుకుంటాం. వర్షాలు పడుతున్నాయన్న భయంతో తక్కువ ధరకు బయట అమ్ముకోవద్దు. మద్దతు ధరతో పాటు సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్‌నూ ప్రభుత్వం చెల్లిస్తుంది. మిల్లులకు ధాన్యం చేరుకున్నాక వడ్లు నాణ్యంగా లేవని, తూకంలో కోత పెడతామంటూ మిల్లర్లు ఫోన్‌ చేస్తే అంగీకరించొద్దు. కొనుగోలు కేంద్రాల్లో అయినా, మిల్లర్లయినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం' అని చౌహాన్‌ వెల్లడించారు.

సేవలు ఉచితం
‘పలు కొనుగోలు కేంద్రాల్లో ఆటోమేటిక్‌ ప్యాడీ డ్రైయర్లు, క్లీనర్లను వినియోగిస్తున్నాం. దేశంలో వీటిని వాడుతున్న తొలి రాష్ట్రం తెలంగాణే. ప్రస్తుత సీజన్‌లో రైతులకు ఉచితంగా వీటి సేవలందిస్తాం. తూకంలో తేడాలు రాకుండా తూనికలు-కొలతల శాఖ ఎలక్ట్రానిక్‌ వెయింగ్‌ స్కేల్స్‌ను ముందే తనిఖీ చేస్తుంది. మధ్యమధ్యలో ఆకస్మిక తనిఖీలుంటాయి. వర్ష సమాచారాన్ని ప్రతిరోజు ఉదయం 6 గంటలకే కొనుగోలు కేంద్రాలకు పంపిస్తాం. ధాన్యం తడిసిపోకుండా కంటెయినర్‌ తరహా ఏర్పాట్లు చేస్తాం. రైతులపై పిడుగుల ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. సన్నాలకు బోనస్‌ తెలంగాణ రైతులకే చెల్లిస్తాం. నిబంధనల మేరకు హార్వెస్టర్లను ఉపయోగించకపోతే వాటి యజమానులపై కఠిన చర్యలు తప్పవు’ అని చౌహాన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో రేషన్‌ కార్డుల సంఖ్య 1.01 కోట్లకు, లబ్ధిదారుల సంఖ్య 3.26 కోట్లకు చేరుకుందని వివరించారు. బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన మిల్లర్లకే ధాన్యం కేటాయిస్తున్నట్లు తెలిపారు.

Read More

విజయవాడ ఉత్సవంలో వ్యవసాయ ప్రదర్శన

విజయవాడ ఎక్స్‌పోలో 11 రోజులు ఈ వ్యవసాయ ప్రదర్శన ఉంటుంది. వ్యవసాయం, ఆక్వా, పశుసంవర్థక, ఉద్యాన శాఖలవి 90 ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మొదలు పరికరాల వరకు అనేక అంశాలు వీటిలో ప్రతిబింబించనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా రైతులు వస్తారని అంచనా. వీరి కోసం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ, వైఎస్సార్‌ ఉద్యాన, వేంకటేశ్వర వెటర్నరీ, ఫిషరీస్‌ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, అధ్యాపకులు రానున్నారు. పెదవేగి ఆయిల్‌పాం పరిశోధన స్థానం నుంచి సైతం శాస్త్రవేత్తలు వస్తారు. ఈ స్టాళ్లలో రైతులకు అవసరమైన పరికరాలు, యంత్రాలు, ఉత్పత్తులు, విత్తనాలు, చేప పిల్లలు, మేత, పశువులను ప్రదర్శిస్తారు. సాగులో ప్రయోగాలు చేసి విజయం సాధించిన రైతులను సన్మానిస్తారు. ప్రభుత్వం రైతుల ప్రగతికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి అర్హతలు ఎలా దరఖాస్తు చేయాలి? అంశంపై వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా, వెటర్నరీ విభాగాల అధికారులు అవగాహన కల్పిస్తారు. సాగులో సమస్యలు, తీసుకోవాల్సిన సస్య రక్షణ, డ్రోన్‌ వినియోగం, రసాయనాల పిచికారీ, విత్తనాలు వేయడం, ఏఐ, రోబోల ద్వారా సాగు చేసే సాంకేతిక విధానాలపై అవగాహన కల్పిస్తారు. మామిడి, ఆయిల్‌పాం, అరటి సాగులో అధిక నాణ్యత, దిగుబడి సాధనకు అనుసరించాల్సిన సాగు పద్ధతులు వివరిస్తారు. సాంకేతిక విధానాలతో పాల ఉత్పత్తి, నాణ్యత పెంపు, పశుగ్రాసాలపై అవగాహన కల్పిస్తారు.
Read More

నారింజ రంగు పుట్టగొడుగులు నేలకు నేస్తాలు

వైఎస్సార్‌ కడప జిల్లా యోగి వేమన విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థులు నారింజ రంగులోని ఈ పుట్టగొడుగులను గుర్తించారు. ఏపీలో మొదటిసారి తమ వర్సిటీలో గుర్తించినట్లు వైవీయూ వృక్షశాస్త్ర ఆచార్యులు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. వీటిని కేశర పుట్టగొడుగులు అంటారని, తినడానికి పనికిరావని చెప్పారు. మొదట శ్రీలంకలో, ఆ తర్వాత ఖమ్మం, వరంగల్‌ అటవీ ప్రాంతాల్లో వీటిని కనుగొన్నారని పేర్కొన్నారు. రాలిపోయిన ఆకులు, కలప దుంగలపై పెరిగే ఈ పుట్టగొడుగులు వాటిని త్వరగా కుళ్లిపోయేలా చేసి మట్టిలో కలిపేస్తాయని వివరించారు. భూమిని గుల్లబరచడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు.
Read More

సన్న వడ్లకు బోనస్‌ వలన ఇతర పంటల విస్తీర్ణం తగ్గుతుంది

వరి సన్నాలకు బోనస్‌ ఇవ్వడంతో దాని సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల ఇతర పంటల విస్తీర్ణం తగ్గుతుంది కాబట్టి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వరితో పాటు ఇతర పంటలను ప్రోత్సహించాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ సూచించారు. సోమవారం ఆయన వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ కార్యాలయంలో ఛైర్మన్‌ కోదండరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ నిపుణుడు నరసింహారెడ్డి, కమిషన్‌ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరగోపాల్‌ మాట్లాడుతూ.. ఆ పంటల విస్తీర్ణం పెరిగేందుకు కృషి చేయాలన్నారు. కొత్త విత్తన చట్టం వస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.

Read More

ఆహార పదార్థాలలో రసాయన అవశేషాలను గుర్తించే పరికరం

ప్రజలలో ఆరోగ్య స్పృహ పెరిగిన నేపథ్యంలో సేంద్రియ ఉత్పత్తుల వాడకం పెరిగింది. ఎక్కడ చూసినా సేంద్రియం పేరిటే అమ్మకాలు జరుగుతున్నాయి. కాబట్టి నిజమైన సేంద్రియ ఉత్పత్తులను గుర్తించేందుకు వీలుగా ఆహార పదార్థాల్లో క్రిమి సంహారక అవశేషాలను గుర్తించే పరికరాన్ని బిట్స్‌ హైదరాబాద్‌ పరిశోధకులు రూపొందించారు. ఆహార పదార్థాలు, పండ్లు, టమాటాలకు సూక్ష్మ పట్టీని అతికించి ఈ పరికరాన్ని దగ్గరికి తీసుకెళ్తే చాలు.. క్రిమి సంహారక అవశేషాలుంటే రెడ్‌లైట్‌ వెలుగుతుంది. నార్వేలోని ఆర్కిటిక్‌ విశ్వవిద్యాలయం సహకారంతో ప్రొ. సంకేత్‌ గోయల్‌ నేతృత్వంలో డా.పి. సాయికుమార్‌, పరిశోధక విద్యార్థి రేష్మ, రజనీశ్‌ కౌర్‌లు దీన్ని తయారు చేశారు. దీనికి కెమిలు మినో మీటర్‌ అని పేరు పెట్టారు. పరిశోధన పత్రం ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ మైక్రో మెకానికల్‌లో ప్రచురితమైంది. ఈ పరికరాన్ని వాణిజ్య అవసరాలకు రూపొందించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ప్రొ. సంకేత్‌ గోయల్‌ వివరించారు.
Read More

మొక్కజొన్న పరిశోధనా కేంద్రంలో కీటకాల పెంపకం

మొక్కలలో పరాగ రేణువులు వ్యాప్తి చెందడానికి కీటకాలు ఎంతగానో తోడ్పడి దిగుబడి పెరుగుతుంది. అందుకోసమే ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలోని మొక్కజొన్న పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేసి కీటకాలను పెంచుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ గొట్టాల్లాంటి వెదురు పుల్లల్లో తుమ్మెద జాతి కీటకాలను ఉంచి, అవి గూళ్లు కట్టి, గుడ్లు పెట్టేలా చూస్తున్నారు. పంటలు పూత థకు వచ్చేసరికి అవి ఎగిరే థకు వస్తున్నాయి. తర్వాత ఆ మొక్క నుంచి ఈ మొక్క మీదకు వాలుతూ పరాగ సంపర్కానికి దోహదపడుతున్నాయి. రైతులు కూడా వ్యవసాయ క్షేత్రాల్లో వెదురుపుల్లలను అమర్చితే పంటలకు మేలుచేసే కీటకాలు వ్యాప్తి చెందుతాయని శాస్త్రవేత్త డాక్టర్‌ కె. మోహనరావు తెలిపారు.

Read More

ధాన్యం సేకరణపై పౌరసరఫరాల సంస్థ కార్యాచరణ

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జిల్లాలవారీగా ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు కార్యాచరణ సిద్ధం చేసింది. కొనుగోలు కేంద్రాల సంఖ్యనూ ఖరారు చేసింది. 5 లక్షల టన్నులకు పైగా ధాన్యం సేకరణ లక్ష్యంలో నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాలు ఉన్నాయి. ఆ తర్వాత నల్గొండ, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలున్నాయి. హైదరాబాద్‌ మినహా మిగతా 32 జిల్లాల్లో 39.08 లక్షల టన్నుల సన్నాలు, 35.91 లక్షల టన్నుల దొడ్డు రకాలు సేకరించాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
సన్నాలు, దొడ్డు రకాలు కలిపి- ఖమ్మం జిల్లాలో 2,78,892 టన్నులు కొనాలని అంచనా. 326 కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు. సిరిసిల్లలో 2,44,522 టన్నులు, 244 కేంద్రాలు, నారాయణపేట 2,35,917 -117, మహబూబ్‌గర్‌ 2,26,418 – 190, భువనగిరి 2,26,410- 325, కొత్తగూడెం 2,23,272-193, మహబూబాబాద్‌ 2,18,373 – 237 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించనున్నారు.

Read More

ఆయిల్‌పామ్‌ రైతులకు మహర్దశ

  • దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక టెక్నాలజీతో నర్మెట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం
  • ఫ్యాక్టరీలో ట్రయల్‌ రన్‌ విజయవంతం
  • సీఎం రేవంత్‌ రెడ్డి లాంగ్‌ విజన్‌తో ఆయిల్‌ ఫామ్‌ సాగు విస్తరణ
  • ఆయిల్‌పామ్‌ సాగులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలవనుంది….
  • త్వరలోనే సీఎం రేవంత్‌ రెడ్డి గారి చేతుల మీదుగా నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం: మంత్రి తుమ్మల

నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీతో ఆయిల్‌పామ్‌ రైతులకు మహర్దశ పట్టనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. శనివారం నాడు అధికారులతో కలసి సిద్దిపేట జిల్లా నర్మేట్టలో ఆయిల్‌ఫెడ్‌ 300 కోట్లతో నిర్మాణం చేసిన పామాయిల్‌ ఫ్యాక్టరీ పరిశీలించారు. ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంతో అధికారులను, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్‌ రెడ్డి లాంగ్‌ విజన్‌తో నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టామని, దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక టెక్నాలజీతో ఫ్యాక్టరీ నిర్మాణం చేసినట్లు తెలిపారు. ఆయిల్‌పామ్‌ సాగుతో దీర్ఘకాలిక లాభాలు ఉంటాయని, అంతర పంటల సాగుతో అదనపు లాభాలు రైతులకు లభిస్తాయని తెలిపారు. దేశంలోనే ఆయిల్‌పామ్‌ సాగులో తెలంగాణ మొదటి స్థానంలో నిలవనుందనీ మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే సీఎం రేవంత్‌ రెడ్డి గారి చేతుల మీదుగా నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరుగనుందని తెలిపారు.

Read More

సమిష్టిగా పర్యావరణ మార్పులను ఎదుర్కొందాం: భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర

ఉద్యానరంగంపై పర్యావరణ మార్పుల ప్రభావం పై జాతీయ సదస్సులో పిలుపుజాతీయ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరుపొంచి ఉన్న పర్యావరణ మార్పులను సమిష్టిగా ఎదుర్కోవాలని అప్పుడే మానవాళిని వ్యవసాయ, ఉద్యాన రంగాలను కాపాడుకోగలమని

*భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర* అన్నారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతంగంపై పర్యావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పర్యావరణ మార్పులు కేవలం రైతాంగాన్ని, ప్రజలనే కాకుండా వాతావరణ శాఖను సైతం ఇబ్బంది పెడుతుందని అందుకు దీటైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విద్యాలయం, ఉద్యాన శాఖ, నాబార్డ్, ఎర్త్ సైన్సెస్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉద్యానరంగంపై పర్యావరణ మార్పుల ప్రభావం అనే అంశంపై ములుగులోని ఉద్యాన విశ్వవిద్యాలయం వేదికగా 18, 19 తేదీలలో నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వాతావరణ అంచనాలు ప్రస్తుతం 40 నుంచి 50% మాత్రమే ఉన్నాయని మల్టీ ఫోర్కాస్ట్ మోడల్స్ తో దీన్ని అధికమిస్తామని ఆయన అన్నారు. మారుమూలలో ఉన్న చిన్న, సన్నకారు రైతుకు సైతం ఈ మార్పుల ప్రభావం తట్టుకునే తరుణోపాయాలు అందించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. పూర్తిస్థాయి పర్యావరణ మార్పులు ప్రస్తుతం కనిపిస్తున్నాయని అనుగుణంగా సాగులో మార్పులు, తగిన విధానాలు, పంటల ఎంపికలలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. గ్లోబల్ యాక్షన్, లోకల్ ప్రొడక్షన్ పద్ధతిలో పంటల సాగు జరగాలని కోరారు. పర్యావరణ మార్పులు, వాతావరణానికి సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని ఎప్పటికప్పుడు దేశంలోని ప్రతి పౌరునికి అందేలా చూడాలని తెలిపారు. పర్యావరణ మార్పులను తట్టుకొని నాణ్యత, అధిక దిగుబడి నిచ్చే పంట రకాల వైపు పరిశోధనలు ముమ్మరం చేయాలి. ప్రతి వ్యక్తికి పర్యావరణ మార్పుల్లోని ప్రతి అంశాన్ని అర్థమయ్యేటట్టు అందించే ప్రయత్నం భవిష్యత్తులో జరగాలని కోరారు.ఇప్పటివరకు జరిగిన అన్ని పరిశోధనలు, విధానాలు దేశ ఆహార భద్రత కోసమే జరిగాయని, దేశ పోషక భద్రత కోసం అందరు పని చేయాలని అందుకు తగిన విధివిధానాలు రూపొందించుకోవాలని *తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి, అగ్రికల్చర్ ప్రొడక్షన్ కమిషనర్ ఎం.రఘునందన్ రావు* అన్నారు. ఈ లక్ష్యానికి పర్యావరణ మార్పులు అడ్డుగా ఉన్నాయని, పరిష్కరించే ప్రయత్నాలు చేయాలని కోరారు. వాతావరణ శాఖ, సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.పర్యావరణ ఉద్యానరంగంపై పర్యావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు అవకాశం ఉన్న ప్రతి సాంకేతిక, పరిశోధన అంశాన్ని రైతులకు చేరవేసేందుకు l సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం *వైస్ ఛాన్స్లర్ డాక్టర్ దండ రాజిరెడ్డి* తెలిపారు. ప్రభుత్వం, ఉద్యాన శాఖ, విశ్వవిద్యాలయం కలిసి రైతులకు ఎప్పటికప్పుడు చేదోడు వాదోడుగా ఉండి పర్యావరణ పర్యావరణ మార్పుల ప్రభావాన్ని జయిస్తామని ఆయన చెప్పారు.కార్యక్రమంలో నిపుణులు రూపొందించిన ఇంట్రడక్టరీ అగ్రికల్చర్ మెటీరియాలజీ అనే టెక్స్ట్ బుక్ ను, బుక్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ ను ప్రముఖులు విడుదల చేశారు.కార్యక్రమంలో *ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాష, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ కే ఉదయభాస్కర్, బోర్లాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియా రీజనల్ ప్రోగ్రాం లీడర్ డాక్టర్ ప్రమోద్ కుమార్ అగర్వాల్, వర్సిటీ రిజిస్టర్ డాక్టర్ భగవాన్*, ప్రముఖ వాతావరణ శాఖ, ఉద్యాన ఉద్యాన నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధన విద్యార్థులు పాల్గొన్నారు.

Read More

16 ప్రాజెక్టులకు డీపీఆర్‌

వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు, గతంలో సర్వేల కోసం ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ముందుకు పడని పలు ప్రాజెక్టులను తెరపైకి తెచ్చి కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 16 పథకాలకు సర్వే, ఇన్వెస్టిగేషన్‌ సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీకి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఉత్తర్వులు (జీవో ఎం.ఎస్‌.నం-34) జారీ చేశారు. ఇన్ని పథకాలకు ఒకేసారి, అదీ ఒకే ఉత్తర్వుతో డీపీఆర్‌ల తయారీకి ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకొంది. కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ పలు దఫాలుగా నీటిపారుదలశాఖ అధికారులు, సీనియర్‌ న్యాయవాదులు, సలహాదారులు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఇంజినీర్లతో చర్చించిన తర్వాత అన్ని పథకాలకు ఒకేసారి ఆదేశాలు జారీ అయ్యాయి. *ముఖ్య వివరాలివీ…*ఈ నెల 23 నుంచి బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వచ్చిన జీవో లోని ముఖ్యమైన అంశాలు, ఏయే పథకాలకు డీపీఆర్‌ తయారీ అన్న వివరాలు ఇలా ఉన్నాయి.

* రేలంపాడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరును నాలుగు నుంచి పది టీఎంసీలకు పెంచడం. గట్టు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ సామర్థ్యం 1.32 నుంచి ఐదు లేదా పది టీఎంసీల సామర్థ్యానికి పెంపు. జూరాల నుంచి నాలుగు టీఎంసీలు తీసుకొని అదనంగా 25 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు నెట్టెంపాడు రెండో దశ

* పులిచింతల వెనక భాగం నుంచి బొజ్జతాండా, భీమతాండా ఎత్తిపోతలు. 0.5 టీఎంసీ వినియోగంతో మట్టంపల్లి మండలంలోని మూడు గ్రామాల్లో 1,380 ఎకరాల ఆయకట్టుకు నీరందించడం. .

* కల్వకుర్తి ఎత్తిపోతల రెండో దశ కింద శ్రీశైలం నుంచి 13 టీఎంసీలను మళ్లించి 93,531 ఎకరాల అదనపు ఆయకట్టు సాగులోకి. ఇందుకోసం కాలువలు, హెడ్‌వర్క్స్‌ సామర్థ్యం పెంచడంతోపాటు తాగునీటికి 7.12 టీఎంసీలు వినియోగించుకొనేలా మౌలిక సదుపాయాల కల్పనకు నివేదిక తయారీ.

* జూరాల నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున 100 టీఎంసీలు మళ్లించేలా వరద కాలువ పథకం. నల్గొండ, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాల్లో 11.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు… మార్గం మధ్యలో చెరువులను నింపడం. జూరాల వెనక భాగం నుంచి వరద సమయంలో 123 టీఎంసీలను మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలకు సరఫరా చేయడం.

* కోయిల్‌సాగర్‌ కింద 3.3 టీఎంసీలతో అదనంగా 13,500 ఎకరాలకు సాగునీరు.

* మహబూబాబాద్‌ జిల్లాలో 1.3 టీఎంసీలతో 13,201 ఎకరాలకు సాగు నీరిచ్చేందుకు మహబూబాబాద్‌ మండలం ఏదుల పూసపల్లి వద్ద మున్నేరు నదిపై బ్యారేజీ నిర్మాణం. ఇదే జిల్లాలోని మరిపెడ మండలం విసంపల్లి గ్రామం వద్ద ఆకేరు నదిపై 1.2 టీఎంసీలతో బ్యారేజీ నిర్మాణం. గార్ల మండలం ముల్కనూరు గ్రామం వద్ద 11,871 ఎకరాలకు నీరిచ్చేందుకు మున్నేరుపై 1.2 టీఎంసీలతో బ్యారేజీ.

* మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం ముల్కపల్లి వద్ద 25 నుంచి 35 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణం.

ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం మండలం ఏదులచెరువు గ్రామం వద్ద ఆకేరు నదిపై బ్యారేజీ నిర్మించి 1.3 టీఎంసీల వినియోగంతో 13,129 ఎకరాలకు నీటిసరఫరా. శ్రీశైలం ఎడమగట్టు కాలువకు కొనసాగింపుగా నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సోమశిల గ్రామం వద్ద నుంచి శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ రోజుకు ఒక టీఎంసీ చొప్పున మళ్లించి 35 టీఎంసీల వినియోగంతో 3.99 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీటిసరఫరా. క హైదరాబాద్‌, చుట్టుపక్కల ప్రాంతాల తాగునీటి అవసరాలకు 3 రిజర్వాయర్ల నిర్మాణం. దేవులమ్మనగరం, దండుమల్లారం వద్ద పదేసి టీఎంసీల చొప్పున, ఆరుట్ల వద్ద 5 లేదా 10 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లకు డీపీఆర్‌ తయారీ.

Read More