సన్న, దొడ్డు వడ్లకు వేర్వేరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఖరీఫ్‌ (వానాకాలం) సీజన్‌లో తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి 75 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని..  పౌరసరఫరాలశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధాన్యం సేకరణ కార్యాచరణను వెల్లడించారు. 'రైతులు వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి కుప్పపోసిన తరువాత తడిసినా, మరే ఇతర నష్టం వాటిల్లినా మేం బాధ్యత తీసుకుంటాం. వర్షాలు పడుతున్నాయన్న భయంతో తక్కువ ధరకు బయట అమ్ముకోవద్దు. మద్దతు ధరతో పాటు సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్‌నూ ప్రభుత్వం చెల్లిస్తుంది. మిల్లులకు ధాన్యం చేరుకున్నాక వడ్లు నాణ్యంగా లేవని, తూకంలో కోత పెడతామంటూ మిల్లర్లు ఫోన్‌ చేస్తే అంగీకరించొద్దు. కొనుగోలు కేంద్రాల్లో అయినా, మిల్లర్లయినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం' అని చౌహాన్‌ వెల్లడించారు.

సేవలు ఉచితం
‘పలు కొనుగోలు కేంద్రాల్లో ఆటోమేటిక్‌ ప్యాడీ డ్రైయర్లు, క్లీనర్లను వినియోగిస్తున్నాం. దేశంలో వీటిని వాడుతున్న తొలి రాష్ట్రం తెలంగాణే. ప్రస్తుత సీజన్‌లో రైతులకు ఉచితంగా వీటి సేవలందిస్తాం. తూకంలో తేడాలు రాకుండా తూనికలు-కొలతల శాఖ ఎలక్ట్రానిక్‌ వెయింగ్‌ స్కేల్స్‌ను ముందే తనిఖీ చేస్తుంది. మధ్యమధ్యలో ఆకస్మిక తనిఖీలుంటాయి. వర్ష సమాచారాన్ని ప్రతిరోజు ఉదయం 6 గంటలకే కొనుగోలు కేంద్రాలకు పంపిస్తాం. ధాన్యం తడిసిపోకుండా కంటెయినర్‌ తరహా ఏర్పాట్లు చేస్తాం. రైతులపై పిడుగుల ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. సన్నాలకు బోనస్‌ తెలంగాణ రైతులకే చెల్లిస్తాం. నిబంధనల మేరకు హార్వెస్టర్లను ఉపయోగించకపోతే వాటి యజమానులపై కఠిన చర్యలు తప్పవు’ అని చౌహాన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో రేషన్‌ కార్డుల సంఖ్య 1.01 కోట్లకు, లబ్ధిదారుల సంఖ్య 3.26 కోట్లకు చేరుకుందని వివరించారు. బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన మిల్లర్లకే ధాన్యం కేటాయిస్తున్నట్లు తెలిపారు.