ప్రధానమంత్రి ధనధాన్యయోజన కింద ఏపీ నుంచి అల్లూరిసీతారామరాజు, శ్రీసత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాల ఎంపిక

వ్యవసాయపరంగా తక్కువ ఉత్పాదకత ఉన్న 100 జిల్లాలను ఎంపికచేసి అక్కడ ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జులై 16న ప్రకటించిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కింద ఆంధ్రప్రదేశ్‌ నుంచి అల్లూరిసీతారామరాజు (ఏఎస్‌ఆర్‌), శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాలను ఎంపిక చేశారు. వీటికి నోడల్‌ అధికారులుగా నలుగురు ఐఏఎస్‌ అధికారులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో ఏఎస్‌ఆర్‌ జిల్లాకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల సంయుక్త కార్యదర్శి అమిత్‌సింగ్లా (ఏజీఎంయూటీ కేడర్‌), శ్రీసత్యసాయి జిల్లాకు సహకారశాఖ సంయుక్త కార్యదర్శి సిద్ధార్థ్‌ జైన్‌, అనంతపురం జిల్లాకు పెట్రోలియం సహజవాయువుల శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతశర్మ (ఇద్దరూ ఏపీకేడర్‌), అన్నమయ్య జిల్లాకు కార్పొరేట్‌ వ్యవహారాలశాఖ సంయుక్త కార్యదర్శి బాలమురుగన్‌ (బిహార్‌ కేడర్‌) నియమితులయ్యారు. ఈ పథకం కింద పంట మార్పిడిని ప్రోత్సహిస్తారు. సాగునీటి సౌకర్యం, పంటల సామర్థ్యం మెరుగుపరుస్తారు. రైతులకు రుణాలు అందిస్తారు. మొత్తం ఆరేళ్లకాలంలో అమలుచేస్తున్న ఈ పథకం కింద రూ.24 వేల కోట్లు ఖర్చుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రంలోని 11 మంత్రిత్వశాఖల పరిధిలో ఉన్న 36 పథకాలను సమ్మిళితంచేసి దీని కింద అమలుచేస్తారు. తద్వారా 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నది అంచనా. ఈ పథకం కింద ఎంపికచేసిన జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, నీతిఆయోగ్‌ సాయంతో కలెక్టర్లు జిల్లాస్థాయి ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తారు. దీని అమలుతీరు పర్యవేక్షణకోసం డిజిటల్‌ డ్యాష్‌ బోర్డు, రైతులకోసం యాప్‌, జిల్లా ర్యాంకింగ్‌ వ్యవస్థను అమల్లోకి తెస్తారు.

Read More

భారీగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో పెట్టుబడులు

రూ.1.02 లక్షల కోట్ల పెట్టుబడులు మన దేశ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలోకి రాబోతున్నాయి. ‘వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా’ సమ్మిట్‌లో 26 విదేశీ, దేశీయ సంస్థలతో ప్రభుత్వం ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకుంది. అంచనాలకు మించి, పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వంతో వివిధ కంపెనీలు కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలు కార్యరూపం దాల్చాక 64,000 మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు, 10 లక్షల మందికి పైగా పరోక్ష ఉపాధి లభిస్తుందని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.
ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు: రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌, ది కోక-కోలా సిస్టమ్‌ ఇన్‌ ఇండియా, గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (అమూల్‌), ఫెయిర్‌ ఎక్స్‌పోర్ట్స్‌ (ఇండియా) ప్రై.లి. (లూలు గ్రూప్‌), నెస్లే ఇండియా, టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌, కార్ల్స్‌బర్గ్‌ ఇండియా ప్రై.లి., బీఎల్‌ అగ్రో ఇండస్ట్రీస్‌, ఏబీఐఎస్‌ ఫుడ్స్‌ అండ్‌ ప్రోటీన్స్‌, ఏస్‌ ఇంటర్నేషనల్‌, పతంజలి ఫుడ్స్‌, గోద్రేజ్‌ అగ్రోవెట్‌, అగ్రిస్టో మాసా, టివానా న్యూట్రిషన్‌ గ్లోబల్‌, హల్దిరామ్‌ స్నాక్స్‌ ఫుడ్‌, ఇండియన్‌ పౌల్ట్రీ అలియన్స్‌, మిస్సెస్‌ బెక్టార్స్‌ ఫుడ్‌ స్పెషాల్టీస్‌ లిమిటెడ్‌, డాబర్‌ ఇండియా, అల్లానా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌, ఓలమ్‌ ఫుడ్‌ ఇన్‌ గ్రేడియంట్స్‌, ఏబీ ఇన్‌బెవ్‌, క్రెమికా ఫుడ్‌ పార్క్‌, డెయిరీ క్రాఫ్ట్‌, సన్‌ డెక్స్‌ బయోటెక్‌, నాసో ఇండస్ట్రీస్‌, బ్లూపైన్‌ ఫుడ్స్‌.

Read More

‘నాటుకోళ్ల’ పెంపకంకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో యువతకు, మహిళలకు కొత్త ఆదాయ మార్గాలను సృష్టించడానికి, రైతులకు అదనపు రాబడిని కల్పించడానికి నూతన, సంప్రదాయ విధానాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా తిన్నవారికి ప్రొటీన్లు… పెంచిన వారికి ఆదాయం అందుతుందనే భావనతో నాటుకోళ్ల పెంపకాన్ని భారీ ఎత్తున చేపట్టాలని నిర్ణయించింది. గతంలో ప్రతి పల్లెలో నాటుకోళ్లు ఉండేవి. కాలక్రమంలో వాటి సంఖ్య భారీగా తగ్గింది. జాతీయ పశుగణన గణాంకాల ప్రకారం… తెలంగాణలో 2014లో 8,20,134 నాటుకోళ్లు ఉండగా 2025 నాటికి 5,10,552 తగ్గాయి. మరోవైపు పట్టణాల్లో నాటుకోడి మాంసానికి అధిక గిరాకీ ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో కోళ్ల పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేసింది.
కార్యాచరణ…
వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలతోపాటు సంబంధిత విశ్వవిద్యాలయాల ద్వారా పథకాన్ని అమలు చేస్తారు.
దళిత, గిరిజనుల కుటుంబాలకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కింద కోళ్లను పంపిణీ చేస్తారు. ఇప్పటికే మహబూబాబాద్‌, ములుగు, నల్గొండ జిల్లాల్లో దళితులు, గిరిజనులకు ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆరు వేల చొప్పున నాటుకోళ్లను అందజేశారు.
రైతులు తక్కువ పెట్టుబడితో పెరట్లో, వ్యవసాయ క్షేత్రాల్లో కోళ్ల షెడ్లను ఏర్పాటు కోవచ్చు. గుడ్లు, మాంసం సంతల్లో, స్థానిక మార్కెట్లలో అమ్మకాల ద్వారా లాభాలు పొందవచ్చు.
షెడ్లను ఉపాధి హామీ పథకం కింద నిర్మించుకోవచ్చు. మదర్‌ యూనిట్‌ కింద పెద్దషెడ్‌ నిర్మాణానికి రూ.3 లక్షలు ఇస్తున్నారు. దీనిలో కోడిపిల్లలను పెంచి గ్రామంలో ఇతరులకు పెంపకానికి ఇస్తారు. చిన్న యూనిట్లకు రూ. లక్ష ఇస్తారు. ఈ మేరకు రాయితీపై కోళ్లను, కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా రుణసాయాన్ని అందజేస్తారు.
మహిళాశక్తి పథకం కింద ప్రతి మండలానికి రెండు చొప్పున యూనిట్లు, 100 చొప్పన చిన్న యూనిట్లను మంజూరు చేస్తోంది. దీనికి రుణసాయాన్ని సెర్ప్‌ అందజేస్తుంది.

Read More

గేదెల మరణాలపై నివేదిక

తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవంలో గేదెల మరణాలు పరాన్నజీవి, వైరల్‌ సంక్రమణ (ఇన్ఫెక్షన్‌) వ్యాధుల కారణంగానే సంభవించినట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి టి. శ్రీనివాస్‌ తెలిపారు. వ్యాధి సోకిన పశువుల నుంచి సేకరించిన నమూనాలను ప్రయోగశాలలో పరిశీలించగా ఈ విషయం వెల్లడైనట్లు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ”చనిపోయిన గేదెల్లో మొదట మెడవద్ద వాపు కనిపించి, తర్వాత చర్మం ఊడిపోవడం, బలహీనపడడం, మేత తీసుకోకపోవడం, నోటి నుంచి చొంగ కారడం, శ్వాసకోశ సమస్యలు, కొన్నింటికి జ్వరం వచ్చింది. విజయవాడకు చెందిన వీబీఆర్‌ఐ, కాకినాడకు చెందిన ఆర్‌ఎఏడీడీఎల్‌ నిపుణుల బృందం వ్యాధిని నిర్ధారించింది. నీరు, పశుగ్రాసంలో ఎలాంటి విషపదార్థాలూ లేవని చెప్పింది”. పశువులకు క్రమం తప్పకుండా డీవార్మింగ్‌ చేయించి అవసరమైన టీకాలు వేయించాలని, గేదెలు, గొర్రెలు, మేకలకు వేర్వేరుగా మేత వేయాలని రైతులకు ఆయన సూచించారు. రాష్ట్రంలో పశుపోషకులు ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాన్ని తగ్గించడానికి పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా స్వల్పకాలిక రుణాలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేస్తోందని శ్రీనివాస్‌ చెప్పారు.

Read More

ముత్యంపేటలో మూతబడిన చక్కెర పరిశ్రమ పునరుద్దరణకు ప్రభుత్వం సిద్ధం

మల్లాపూర్‌ మండలం ముత్యంపేటలో మూతపడిన చక్కెర పరిశ్ర మను పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్‌, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు, చెరకు అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ సీహెచ్‌ నర్సిరెడ్డిలతో కూడిన అధ్యయన కమిటీ శుక్రవారం పరిశీలించింది. అనంతరం చెరకు రైతులతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించింది. కమిటీ వెంట తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖా మంత్రి లక్ష్మణ్‌కుమార్‌తో పాటు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌, కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తదితరులున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలో ఏకైక వ్యవసాయాధారిత పరిశ్రమ అయిన ముత్యంపేట ఎన్‌డీఎస్‌ఎల్‌ చక్కెర కర్మాగారం పునరుద్ధరణకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. బ్యాంకులకు చెల్లించాల్సిన పాత బకాయిలు రూ.172 కోట్లను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. పరిశ్రమలో యంత్రాలను పరిశీలించామని, వాటిని పూర్తిగా తొలగించడమా? ఉన్న వాటిని పునరుద్ధరించడమా? అన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రైతులకు కనీస మద్దతు ధర, ఉచిత విత్తన సరఫరా, హార్వెస్టింగ్‌ వంటి విషయాల్లో అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత జువ్వాడి నర్సింగరావు తదితరులున్నారు.

Read More

రానున్న సంవత్సరాలలో ప్రకృతి వ్యవసాయానికి తెలంగాణలో అధిక ప్రాధాన్యం

తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా ప్రణాళికను రూపొందిస్తున్నామని వ్యవసాయశాఖా మంత్రి తెలిపారు. సెక్రటేరియట్‌లో ఏపిసిఎన్‌ఎఫ్‌ ప్రతినిధులు విశ్రాంత ఐఏఎస్‌ విజయ కుమార్‌, ఇతరులు, పక్క రాష్ట్రాలలో, వివిధ దేశాలలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను మరియు వారి అనుభవాలు ప్రకృతి వ్యవసాయం ఆచరించి అధిక ఆదాయం పొందుతున్న రైతుల విజయ గాధలు, ప్రకృతి వ్యవసాయంలో మెరుగైన నేల ఆరోగ్యం మరియు ఆరోగ్యకర ఉత్పత్తులను మంత్రికి వివరించి తాము తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసారు.
సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌, వ్యవసాయ శాఖా సంచాలకులు డా. గోపి ఈ సంవత్సరం నుండి ఆరంభించిన ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రగతిని వివరించి ఇప్పటికే రాష్ట్రంలో 489 క్లస్టర్లు ఏర్పాటు చేసి 61,125 రైతులను ఎంపిక చేసినట్లు (50 హెక్టార్లు ప్రతి క్లస్టర్లు), దీనికి గాను కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 42.07 కోట్లు కేటాయించిందని రిసోర్స్‌ పర్సన్‌లకు వాలంతరి ఆధ్వర్యంలో శిక్షణను పూర్తి చేశామని తెలియచేసారు. ఏపిసిఎన్‌ఎఫ్‌ ప్రతినిధులు సూచించిన విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్తామని తెలియజేసారు.
తరువాత తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటిదాకా రైతులలో ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులు తగ్గుతాయని ఒక అపోహ ఉందని, కానీ ఏపిసిఎన్‌ఎఫ్‌ ప్రతినిధుల అనుభవాలు మరియు నా అనుభవం, తోటి రైతుల అనుభవాలు ఇది తప్పని నిరూపించాయని, రైతుల నికరాదాయం, మొదటి సంవత్సరం నుండి పెరగడం ఆరంభమైందని తెలియజేసారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకర ఉత్పత్తులు తీసి మార్కెటింగ్‌ అవకాశాలను పెంచుకొనే అవకాశం కలదని, వర్షాధార ప్రాంతాలలో కూడా 3 పంటలు తీసే అవకాశం కలదని, అలాగే కలుపు, చీడపీడల సమస్య కూడా గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ప్రస్తుత కర్తవ్యం నేల ఆరోగ్యాన్ని కాపాడడం తద్వారా మానవాళి ఆరోగ్యం కాపాడడమే కాకుండా రైతుకు నికర ఆదాయం పెంచడమని, ఇది ఒక్క ప్రకృతి వ్యవసాయంతోనే సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.

Read More

పశువైద్యశాలల బలోపేతానికి నిధులు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పశువైద్యశాలలు, డిస్పెన్సరీలు, సంచార పశు వైద్యశాలల అభివృద్ధి, బలోపేతానికి రూ. 32.83 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ నిధులను ఇతర ఏ పథకాలకూ మళ్ళించడానికి వీల్లేదని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్వి బి. రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Read More

ఆధునిక సాంకేతికతతోనే అన్నదాతలకు మేలు

వ్యవసాయ పరిశోధనలు, ఆధునిక సాంకేతికతతో అన్నదాతలకు శారీరక శ్రమతో పాటు సాగు వ్యయం తగ్గుతుందని, ఆదాయం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. హైదరాబాద్‌లో బుధవారం జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్‌), కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు కార్యాలయం సంయుక్తంగా గ్రామీణ సాంకేతికతపై నిర్వహించిన జాతీయ సదస్సులో శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు, ఆవిష్కర్తలు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత ప్రధాన శాస్త్ర సలహాదారు కార్యాలయం శాస్త్రవేత్త రాకేశ్‌ కౌర్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగం విస్తరణ లక్ష్యంగా పరిశోధనలు జరగాలన్నారు. వ్యవసాయ సాంకేతికత, యంత్రాలు, పరికరాలు, మత్స్య, పశుసం వర్ధక రంగాల్లో ఆవిష్కరణలు విస్తరించాలని, గ్రామీణ సాంకేతికతకు పెద్దపీట వేయాలన్నారు. వ్యవసాయ అంకురాలను ప్రోత్సహించాలన్నారు. నార్మ్‌ డైరెక్టర్‌ గోపాల్‌ లాల్‌, ఎ- ఐడియా సీఈవో సెంథిల్‌ వినాయగం తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆధునిక యంత్ర పరికరాలను ప్రదర్శించారు.

Read More

యువతకి ఉపాధి లక్ష్యంగా పీజీ డిప్లొమా

పంటల రక్షణతో పాటు యువతకు ఉపాధి లక్ష్యంగా మొక్కల ఆరోగ్య నిర్వహణపై తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జాతీయ మొక్కల నిర్వహణ యాజమాన్య సంస్థ(ఎన్‌ఎఐపీ హెచ్‌ఎం) సంయుక్తంగా ఏడాది కాల పరిమితి గల పీజీ డిప్లొమా కోర్సు నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని అగ్రివర్సిటీలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎన్‌ఐపీ హెచ్‌ఎం డైరెక్టర్‌ జనరల్‌ సాగర్‌ హనుమాన్‌సింగ్‌, అగ్రివర్సిటీ వీసీ అల్దాస్‌ జానయ్యల సమక్షంలో రెండు సంస్థల రిజిస్ట్రార్లు శ్రీనివాస్‌, విద్యాసాగర్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. కోర్సులో భాగంగా మూడు నెలలు ఇంటర్న్‌షిప్‌ ద్వారా అభ్యర్థులు పరిశ్రమల్లో పనిచేసే అవకాశాలు లభిస్తాయని, శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు తెలిపారు.

Read More

విద్యుత్‌ రాయితీకి చేపలు, రొయ్యల చెరువులకు లైసెన్సులు సరైన మార్గం

ఆంధ్రప్రదేశ్‌లో చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలకు లెసెన్స్‌ తీసుకోవడం తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లును సభ్యులు ఏకగ్రీంగా ఆమోదించారు. ప్రభుత్వం కల్పించిన విద్యుత్తు రాయితీ ఆక్వా రైతులు పొందేందుకు లైసెన్స్‌ తీసుకోవడం సరైన మార్గమని మంత్రి అన్నారు. గడువు తీరిన పాత లైసెన్సులను నిర్దేశించిన ఫీజుతో పాటు 50% ఆలస్యపు రుసుములు చెల్లించి పునరుద్ధరించుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. తీర ప్రాంతంలో చేపలు, రొయ్యల పెంపకం కార్యకలాపాల కాలవ్యవధి జీవితకాలం నుంచి ఐదేళ్లకు తగ్గించారు. ఆక్వా దుకాణాలకు సంబంధించిన జీవితకాలం ఏడాదికి తగ్గిస్తూ చట్ట సవరణ చేశారు.

Read More