మల్లాపూర్‌ మండలం ముత్యంపేటలో మూతపడిన చక్కెర పరిశ్ర మను పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్‌, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు, చెరకు అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ సీహెచ్‌ నర్సిరెడ్డిలతో కూడిన అధ్యయన కమిటీ శుక్రవారం పరిశీలించింది. అనంతరం చెరకు రైతులతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించింది. కమిటీ వెంట తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖా మంత్రి లక్ష్మణ్‌కుమార్‌తో పాటు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌, కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తదితరులున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలో ఏకైక వ్యవసాయాధారిత పరిశ్రమ అయిన ముత్యంపేట ఎన్‌డీఎస్‌ఎల్‌ చక్కెర కర్మాగారం పునరుద్ధరణకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. బ్యాంకులకు చెల్లించాల్సిన పాత బకాయిలు రూ.172 కోట్లను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. పరిశ్రమలో యంత్రాలను పరిశీలించామని, వాటిని పూర్తిగా తొలగించడమా? ఉన్న వాటిని పునరుద్ధరించడమా? అన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రైతులకు కనీస మద్దతు ధర, ఉచిత విత్తన సరఫరా, హార్వెస్టింగ్‌ వంటి విషయాల్లో అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత జువ్వాడి నర్సింగరావు తదితరులున్నారు.