పంటల రక్షణతో పాటు యువతకు ఉపాధి లక్ష్యంగా మొక్కల ఆరోగ్య నిర్వహణపై తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జాతీయ మొక్కల నిర్వహణ యాజమాన్య సంస్థ(ఎన్‌ఎఐపీ హెచ్‌ఎం) సంయుక్తంగా ఏడాది కాల పరిమితి గల పీజీ డిప్లొమా కోర్సు నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని అగ్రివర్సిటీలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎన్‌ఐపీ హెచ్‌ఎం డైరెక్టర్‌ జనరల్‌ సాగర్‌ హనుమాన్‌సింగ్‌, అగ్రివర్సిటీ వీసీ అల్దాస్‌ జానయ్యల సమక్షంలో రెండు సంస్థల రిజిస్ట్రార్లు శ్రీనివాస్‌, విద్యాసాగర్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. కోర్సులో భాగంగా మూడు నెలలు ఇంటర్న్‌షిప్‌ ద్వారా అభ్యర్థులు పరిశ్రమల్లో పనిచేసే అవకాశాలు లభిస్తాయని, శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు తెలిపారు.