ఉద్యానంలో రూ.30 వేల కోట్ల స్థూల విలువ జోడింపు

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పండ్లు, కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాలను పండిస్తూ రైతులు అధిక ఆదాయం పొందుతున్నారు. 2024-25లో ఈ పంటల సాగులో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు రూ.30 వేల కోట్ల స్థూల ఉత్పత్తి విలువ జోడింపు (జీవీఏ) సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం, యర్రగొండ పాలెం లాంటి మండలాలూ జీవీఏ సాధనలో అగ్రభాగాన ఉండటం గమనార్హం. ఉద్యాన పంటల జీవీఏలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిన జిల్లాలు, డివిజన్లు, మండలాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. లింగాల మండలం అగ్రస్థానంలో… వైఎస్సార్‌ కడప జిల్లా లింగాల మండలం అత్యధికంగా రూ.2,130 కోట్ల జీవీఏ సాధించింది. బత్తాయి, అరటి, పుచ్చ, టమాటా పంటల సాగు ద్వారా అధిక ఆదాయం లభించినట్లు ఉద్యానశాఖ పేర్కొంది. తూర్పుగోదావరి జిల్లా కడియంలో అలంకరణ మొక్కలు, పండ్ల నర్సరీల ద్వారా గణనీయమైన ఆదాయం లభించింది. ఈ మండలం మొత్తం జీవీఏ రూ. 1,758 కోట్లుగా ఉంది. అగ్ర స్థానంలో ఉన్న జిల్లాలను పరిశీలిస్తే.. అనంతపురం జిల్లా పుట్లూరు, ఎల్లనూరు, ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెం, ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల, అనంతపురం జిల్లా నార్పల, అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు తర్వాత స్థానాల్లో నిలిచాయి. మొదటిస్థానం అనంతపురం.. తర్వాత పులివెందుల డివిజన్లలో… రాష్ట్రంలోనే అత్యధిక జీవీఏ సాధించిన డివిజన్గా అనంతపురం డివిజన్‌ నిలిచింది. అరటి, బత్తాయి పంటల ద్వారా అక్కడ రూ.9,876 కోట్ల జీవీఏ సాధించింది. రెండోస్థానంలో వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల డివిజన్‌లో అరటి, బత్తాయి, టమాటా పంటల ద్వారా రూ.6,177 కోట్ల జీవీఏ లభించింది. మూడోస్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్లో మిరియాలు, పసుపు, కాఫీ ద్వారా రూ.5,674 కోట్లు వచ్చింది. అక్కడ మిరియాల పంట ద్వారా రూ.2,326 కోట్లు, పసుపు ద్వారా రూ.552 కోట్లు, కాఫీ ద్వారా రూ.534 కోట్ల జీవీఏ సమకూరింది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం రూ.5,264 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ రూ.4,433 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు రూ.4,175 కోట్లు, ప్రకాశం జిల్లా మార్కాపురం రూ.4,028 కోట్లు, అన్నమయ్య జిల్లా రాజ పేట రూ.4,003 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం రూ.3,793 కోట్లు, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూ.3,594 కోట్ల జీవీఏ సాధించాయి.

Read More

గోరకల్లు జలాశయంకు నిధులు

తక్షణం మరమ్మతులు చేయకపోతే జలాశయం భద్రతకే ముప్పు అని నివేదికలు అందడంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాయలసీమలో లక్షల ఎకరాలకు ఆధారమైన గోరకల్లు జలాశయాన్ని బాగు చేసేలా నిధులు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. రూ.617 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ డ్యాంను ముప్పు నుంచి బయటపడేసేందుకు తాజాగా రూ.53 కోట్లు మంజూరు చేయడం జరిగింది. జలవనరులశాఖ అధికారుల నుంచి మొత్తం రూ.122 కోట్లతో అవసరమైన పనులు చేసేందుకు ప్రతిపాదించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఇందుకు నిధులు కేటాయించలేదు. డ్రిప్‌ కింద ప్రతిపాదనలు పెట్టినా ఆ పథకం చేపట్టేందుకు అనుమతి లభించలేదు. దీంతో అత్యవసర పరిస్థితుల దృష్ట్యా మంత్రిమండలి ముందు ప్రత్యేకంగా ప్రతిపాదన ఉంచి జలవనరులశాఖ నిధులు తెచ్చుకుంది.

Read More

పంటల వివరాల నమోదులో SAR డాటా వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదనలు

తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాలు అంచనా వేసేందుకు ప్రొ. జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతిపాదించిన ప్రాజెక్టుపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగవుతున్న పంటల విస్తీర్ణం అంచనా వేయటం ద్వారా రానున్న కాలంలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుంటుంది కావున వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం ముందస్తు అంచనా వేయటానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం మరియు ఇతర వసతులను ఉపయోగించి ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల వరకు రాష్ట్రంలో పంటల వారిగా సాగవుతున్న విస్తీర్ణాన్ని అంచనా వేయడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని, వాటి అమలుకు అవసరమైన నిధులు ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అదేవిధంగా రానున్న కాలంలో ప్రభుత్వం అమలు చేయనున్న పంటల భీమా పథకానికి సమగ్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించాలని విశ్వవిద్యాలయ అధికారులను ఆదేశించారు. ఇంతకుముందు వివిధ సాంకేతిక సంస్థలతో జరిపిన సంప్రదింపులకు కొనసాగింపుగా జరిగిన ఈ సమావేశంలో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాము ఇంతకుముందు Synthetic Aperture Data ఆధారంగా స్విట్జర్లాండ్‌ సంస్థ భాగస్వామ్యంతో కలిసి చేసిన ప్రయోగాలను మరియు ఆ సాంకేతికత ఆధారంగా వానాకాలంలో పంటల నమోదులో వివిధ రాష్ట్రాలలో సాధించిన ఖచ్చితత్వాన్ని మంత్రికి తెలియజేశారు.

అంతేకాకుండా వివిధ పంటలను ఆశించు చీడపీడల వివరాలను కూడా సెన్సార్‌ అమర్చడం ద్వారా ముందుగానే తెలుసుకునే వీలుందని, ఈ దిశగా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వివిధ పంటలలో ఈ పంటకాలం నుంచే ప్రయోగాలు చేపట్టాలని ఉపకులపతికి మంత్రిగారు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా మనకు అందుతున్న వివరాలను బట్టి శాటిలైట్‌ టెక్నాలజీ ద్వారా లభించే సమాచారం కంటే కూడా సెన్సార్ల ద్వారా అందే సమాచారం ద్వారా చీడపీడల నివారణ సమర్థవంతంగా నిర్వహించవచ్చని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మంత్రికి తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ డా. సమీరేండు మోహంతి మరియు శాస్త్రవేత్త డా. టి.ఎల్‌. నీలిమ, పరిశోధన సంచాలకులు డా. యం బలరాం, డిజిటల్‌ అగ్రికల్చర్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డా. బి. బాలాజీ నాయక్‌ పాల్గొన్నారు.

Read More

అధిక మోతాదులో రసాయన ఎరువుల వాడకం

– మిరప, మొక్కజొన్నల్లో భారీగా వాడుతున్నారు

– జొన్నలోనూ యూరియా వాడకం 417% అధికం

రసాయన ఎరువుల బస్తాలు ఎన్ని ఎక్కువ వాడితే.. పంట దిగుబడి అంత ఎక్కువగా వస్తుందనే ఆలోచనే రైతులను పరిమితికి మించిన వాడకం దిశగా నడిపిస్తోంది. పెట్టుబడి వ్యయం పెరగడానికి ఇదీ ఒక కారణం. ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 సంవత్సరంలో పంటల వారీగా చూస్తే ఎరువుల వాడకంలో మిరప అగ్రస్థానంలో ఉండగా మొక్కజొన్న రెండోస్థానంలో నిలిచింది. జొన్న, వేరు శనగ, పసుపు, పప్పుధాన్యాలు తదితర పంటలకూ యూరియాను కుమ్మరిస్తున్నారు. *మిరపలో ఎరువుల వాడకం అధికం* రాష్ట్రంలో రసాయన ఎరువులు అత్యధికంగా వాడే పంట మిరప.. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారమే హెక్టారుకు 1,325 కిలోల వాడకం ఉంది. సిఫార్సు చేసిన మోతాదు కంటే యూరియా 78%, భాస్వరం 122% అధికంగా వాడుతున్నారు. వాస్తవంగా చూస్తే రైతులు ఇంతకు రెట్టింపుస్థాయిలోనే వాడుతున్నారు. ఫలితంగా మిరపకు ఎకరాకు రూ. 3 లక్షల పెట్టుబడి అవుతోంది. తీరా చూస్తే ధరలు దక్కడం లేదు. క్వింటాలుకు రూ.10 వేలు ఉన్నా గిట్టుబాటు కాని పరిస్థితి. లక్షల్లో నష్టపోతున్నారు. ఎరువుల వాడకం తగ్గించుకుంటే పెట్టుబడి కూడా తగ్గుతుందని ఆలోచించడం లేదు.*మొక్కజొన్న సాగులోనూ భారీగా…* ఎరువుల వినియోగం అధికంగా ఉండే రెండో పంట మొక్కజొన్న. హెక్టారుకు 565 కిలోలు వాడుతున్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవ వినియోగం ఇంకా ఎక్కువే. రెండు మూడేళ్లుగా గిట్టుబాటు ధరలు లభిస్తుండటంతో అధిక శాతం రైతులు మొక్కజొన్న సాగుకు మొగ్గుచూపిస్తున్నారు. ఇతర పంటల సాగులో నష్టాలతో.. ప్రత్యామ్నాయ పంటగా మొక్కజొన్ననే ఎంచుకుంటున్నారు

.*జొన్న సాగుకు 417% అధికంగా యూరియా:* జొన్న సాగులో సిఫారసు చేసిన మోతాదుకు మించి 417% అధికంగా యూరియాను వినియోగిస్తున్నారు. వేరుశనగకు కూడా 303% అధికంగా వేస్తున్నారు. గడ్డి పెంపకానికి 283% అధికంగా వాడటం గమనార్హం.

*అపోహ మాత్రమే* భూసార పరీక్షలు చేయించుకుని.. అవసరం మేరకు రైతులు ఎరువులు వాడాలి. ఎక్కువ వేస్తే దిగుబడి పెరుగుతుందనేది కేవలం అపోహ మాత్రమే. నత్రజని ఎక్కువగా వాడితే చీడపీడలు పెరుగుతాయి. వాటి నివారణకు పురుగుమందులు ఎక్కువగా చల్లాలి. పంటల నాణ్యత దెబ్బతింటుంది. భూగర్భజలాలు కలుషితమవుతాయి. ఎరువుల్ని సిఫార్సు మేరకు మాత్రమే అందించాలి. లేదంటే మొక్కల్లో రోగనిరోధకత తగ్గుతుంది. కరవు పరిస్థితుల్లో నానో ఎరువులు పిచికారి చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే నేల ద్వారా అందించడమూ ముఖ్యమే.- *వి. శైలజ,* ప్రధాన శాస్త్రవేత్త, సాయిల్‌ సైన్స్‌, ప్రాంతీయ పరిశోధనాస్థానం, లాం, గుంటూరు

Read More

కృష్ణా బేసిన్‌ రిజర్వాయర్లలో జలకళ

గోదావరి బేసిన్‌లోని రిజర్వాయర్లలోకి నీటి ప్రవాహం ఆశాజనకంగా లేదు కాబట్టి శ్రీరామసాగర్‌ నుంచి ఎల్లంపల్లి వరకు దాదాపు అన్ని రిజర్వాయర్లలోనూ నాలుగోవంతు నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. కృష్ణా పరీవాహకంలోని అన్ని రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి.

Read More

బోయినపల్లి మార్కెట్‌ను పరిశీలించిన రైతు కమిషన్‌

మార్కెట్‌ అధికారుల నిర్లక్ష్యంపై కమిషన్‌ చైర్మన్‌ కోదండ రెడ్డి సీరియస్‌

సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ నిర్వహాణపై రైతు కమిషన్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్కెట్‌ అధికారులు కూడా అందుబాటులో లేకపోవడంపై కమిషన్‌ చైర్మన్‌ కొదండరెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం 6 గంటలకే రైతు కమిషన్‌ చైర్మన్‌తో పాటు సభ్యులు రాములు నాయక్‌, భవానీ రెడ్డి..మార్కెట్‌ను అకస్మిక తనిఖీ చేశారు. దాదాపు గంటన్నర పాటు అక్కడే ఉండి.. మార్కెట్‌ యార్డులో సమస్యలు, రైతులు పడుతున్న ఇబ్బందులు, అధికారుల నిర్లక్ష్యాన్ని గుర్తించారు. చాలా సేపు మార్కెట్‌ యార్డులో తిరిగి అక్కడికి వివిధ రాష్ట్రాల నుండి వచ్చే రైతులు, వ్యాపారస్తులు, హామాలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.మార్కెట్‌ కార్యాలయంలోని రికార్డులను, అటెండెన్స్‌ రిజిస్టర్లను కమిషన్‌ బృందం పరిశీలించింది. గత మూడు, నాలుగు రోజులు మార్కెట్‌ సెక్రెటరీ అందుబాటులో లేకపోవడం, కింది స్థాయి సిబ్బంది కూడా సమయానికి రాకపోవడంపై కమిషన్‌ చైర్మన్‌ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఒకే ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌ విధుల్లో ఉండడం చూసి.. కమిషన్‌ ఆశ్చర్యానికి లోనైంది. ఇంత పెద్ద మార్కెట్లో ఒకే ఒక అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది అందుబాటులో ఉండడం ఏంటనీ ప్రశ్నించింది. ప్రతిరోజు బోయిన్‌పల్లి మార్కెట్‌ కు ఏఏ రాష్ట్రాల నుండి కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు వస్తాయో అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో కూరగాయల వ్యర్ధాలతో గ్యాస్‌ ఉత్పత్తి చేయడానికి గతంలో బయో గ్యాస్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే గత మూడు నెలల నుండి ప్లాంట్‌ నడవకపోవడంతో.. కూరగాయల వ్యర్ధాలను తరలించడానికి ప్రతినెల మార్కెట్‌ కమిటి నాలుగున్నర లక్షల రూపాయలను ఖర్చుచేస్తున్న విషయం కమిషన్‌ దృష్టికి వచ్చింది. మార్కెట్‌ యార్డులో కూరగాయల అమ్మకాలు, కొనుగోళ్ల వివరాలపై కమిషన్‌ ఆరా తీసింది. బోయినపల్లి మార్కెట్‌ కమిటీలో ఉద్యోగుల వివరాలు, ఆదాయ, వ్యయాలు, షాపుల వివరాలు అన్ని కమిషన్‌కు నివేదిక రూపంలో అందించాలని సూచించింది. మార్కెట్‌ను సందర్శించిన వారిలో కమిషన్‌ అధికారులు హారివెంకట ప్రసాద్‌, మహేష్‌ నాయక్‌ తదితరులు వున్నారు.

Read More

‘రాజముద్ర’తో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్‌లో తొలివిడత రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు ఎవరి చిత్రాలూ లేకుండా కేవలం రాజముద్రతో భూమి యాజమాన్య హక్కు పత్రం, పట్టాదారు పాసు పుస్తకాలు ప్రభుత్వం ముద్రించింది. పల్నాడు జిల్లాలోని 12 మండలాల్లో 10 వేల మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15న వీటిని పంపిణీ చేసేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More

గోల్డ్‌ లైన్డ్‌ సీబ్రీమ్‌ రకం చేప జన్యువుల విశ్లేషణ

చెన్నైలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్రాకిష్‌వాటర్‌ ఆక్వా కల్చర్‌ (సీఐబీఏ) పరిశోధకులు చేపల ఉత్పత్తి సామర్థ్యం, వాటి పెంపక విధానాలను మెరుగుపరచడానికి గోల్డ్‌లైన్డ్‌ సీబ్రీమ్‌ అనే చేప జన్యువులను విశ్లేషించారు. ఉప్పు, మంచి నీటి వనరుల్లో పెరగగలిగే ఈ చేపను తమిళంలో ‘మత్తివాయన్‌’ అని అంటారు. ఇది మంచి రుచి, ఎక్కువ పోషకాలు కలిగి ఉంటుంది. చేపల్లో సంతానోత్పత్తి, పర్యావరణ మార్పులకు వాటి స్పందనలు తెలుసుకునేందుకు ఈ జన్యు విశ్లేషణ దోహదపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్య శాస్త్రవేత్త ఎం.ఎస్‌. శేఖర్‌ నాయకత్వంలో వినయ్‌ కుమార్‌, అశోక్‌ కుమార్‌ జంగం, రేమండ్‌, కుల్దీప్‌ కె. లాల్‌ పరిశోధనలో పాలుపంచుకున్నారు.

Read More

ఆయిల్‌పామ్‌ ధరలు గత రెండేళ్లకు నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌కు సంబంధించి ప్రభుత్వం గత రెండేళ్లకు ధరలు నిర్ణయించింది. 2023-24 సంవత్సరానికి 2023 నవంబరు 1 నుంచి 2024 అక్టోబరు 31 వరకు ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేషియో పర్సంటేజి(ఓఈఆర్‌) 19.17%, గింజలకు 10. 25% చొప్పున ఇవ్వనున్నారు. 2024-25 సంవత్సరంలో ఇదే కాలానికి (ఓఈఆర్‌)19.42%, గింజలకు 10.15% చొప్పున చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. వ్యవసాయ, సహకారశాఖ ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ సోమవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

Read More

తెలంగాణ రాష్ట్రంలో రాయితీలతో ఉద్యాన పంటలకు ఊతం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాయి. మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌, నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌-ఆయిల్‌ పామ్‌, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన తదితర పథకాలను అమలు చేస్తూ రాయితీలను అందజేస్తున్నాయి.
సమీకృత ఉద్యాన అభివృద్ధి.. పథకం ద్వారా పండ్ల తోటలు, నీటి కుంటలు, కూరగాయల సాగును ప్రోత్సహిసున్నారు. రాయితీతో కూరగాయల నారును అందించడంతోపాటు, ప్రస్తుత సంవత్సరం డ్రాగన్‌ ఫ్రూట్‌, బొప్పాయి, మామిడి, జామ, కూరగాయలు, తదితర పంటల సాగుకు సైతం రాయితీని కల్పిస్తున్నారు.

ఆయిల్‌పామ్‌ సాగు
తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగును పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది.ఈ సాగును పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతులకు బిందు, తుంపర సేద్యంపై రాయితీ ఇస్తున్నారు. ఎకరాకు రూ.4,200 ల చొప్పున నాలుగేళ్లపాటు రాయితీ అందుతుంది.

రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన
20 గుంటల విస్తీర్ణంలో పందిరి నిర్మాణానికి రూ.50 వేల సబ్సిడీ అందిస్తున్నారు. గరిష్టంగా 2.20 ఎకరాల వరకు రాయితీ అందుతుంది. సన్నకారు రైతులు ఈ పథకం ద్వారా శాశ్వత పందిరి ఏర్పాటు చేసుకొని కూరగాయలు సాగు చేపట్టొచ్చు. రైతులకు అవగాహన కల్పిస్తూ వీటిపై మొగ్గు చూపేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

జాతీయ వెదురు పథకం
సాగుకు యోగ్యం కాని భూముల్లో, పొలం గట్లపైన, వెదురు మొక్కలు నాటే రైతులకు ప్రభుత్వం రెండేళ్ల వరకు నిర్వహణ ఖర్చు కింద మొదటి సంవత్సరం రూ. 75 రెండో సంవత్సరం రూ. 45 చొప్పున అందజేస్తారు.

బిందు సేద్యం
ఉద్యాన పంటలు సాగు చేయడానికి డ్రిప్‌, స్ప్రింకర్లను సబ్సిడీపై అందించనున్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీతో పరికరాలను అందిస్తున్నారు. బీసీ రైతులకు 90 శాతం, అయిదెకరాల్లోపు ఉన్న ఓసీ రైతులకు 80 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. తుంపర సేద్యం పరికరాలకు అందరికీ 75 రాయితీని అందిస్తున్నారు.

రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, రాయితీలు పొందేందుకు రైతులు పట్టాదారు పాస్‌బుక్‌, బ్యాంకు పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డు జిరాక్స్‌, పాస్‌పోర్టు సైజు ఫొటోతో సంబంధిత ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తు అందజేయాలి. గరిష్ఠంగా అయిదెకరాల భూమి కలిగిన రైతులు అర్హులు.
-కేఆర్‌ లత, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారిణి

Read More