దీనిని తాజా ఆవు పేడను చనిపోయిన ఆవు కొమ్ములలో నింపి సారవంతమైన భూమిలో ఆకురాలుకాలం నుండి వసంత రుతువు వరకు పాతిపెట్టి తయారుచేస్తారు. తయారయిన కొమ్ము ఎరువు శక్తివంతమైన భూమి చైతన్య కారకం. దీనిని భూమిలో కాల్షియం చురుకుదనాన్ని, సూర్యుని / జీవ శక్తులను భూమికి తీసుకురావడానికి ఉపయోగిస్తారు. ఈ శక్తులు విత్తనం మొలకెత్తడం, వేర్లు వృద్ధి చేయడం, మొక్క పెరగడంతోపాటు భూమిలో హ్యూమస్ ఏర్పడటానికి దోహదపడతాయి. కొమ్ము ఎరువును భూమి నిర్మాణానికి, భూమిలో ప్రయోజనకర బాక్టీరియా, శిలీంద్రాలు, వానపాములను పెంచుతాయి. ఎకరానికి 85 గ్రాముల కొమ్ము ఎరువుని సరిపడే నీటిలో కలిపి సవ్యదిశలో ఒక గంటసేపు కలిపి మధ్యాహ్నం తర్వాత భూమిపై సంవత్సరానికి కనీసం రెండుసార్లు వసంత ఋతువు, ఆకులు రాల్చే కాలంలో నీటి బిందువుల రూపంలో పిచికారి చేయాలి. కొమ్ము ఎరువు అసలైన బయోడైనమిక్ ఎరువు.
గ్రామీణ తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని కూలీలు, మహిళా స్వయం సహాయక బృందాలు (Self Help Groups – SHGs) తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తెచ్చే పశు సంపద కోసం అన్వేషిస్తున్న తరుణంలో ‘సీమ పందుల పెంపకం’ ఒక ఆశాజనకమైన ఆర్థిక ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తోంది. దేశీయ (నాటు) పందులతో పోలిస్తే సీమ జాతులు వేగంగా బరువు పెరగడం, ఎక్కువ పిల్లలు ఈనడం (అధిక లిట్టర్ సైజు), తక్కువ మేతతో ఎక్కువ మాంసం ఉత్పత్తి చేయడం (మెరుగైన ఫీడ్ కన్వర్షన్ ఎఫిషియెన్సీ – FCE) వంటి లక్షణాలతో ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా మాంసం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, భారత పశు గణాంకాల (Basic Animal Husbandry Statistics – BAHS 2025) ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే మాంస ఉత్పత్తి సుమారు 2.46 శాతం వృద్ధి చెందింది. అయితే, పంది జనాభా వృద్ధి రేటు గత రెండు దశాబ్దాలుగా మందగించడం గమనార్హం. ఈ నేపథ్యంలో, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను, ఆధునిక వ్యాధి నివారణ చర్యలను, ప్రభుత్వ తోడ్పాటును సమన్వయం చేసుకుంటే పందుల పెంపకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే శక్తివంతమైన సాధనంగా మారగలదు.
సీమ మరియు సంకరీకరణ జాతుల పందులు మన దేశంలో సంప్రదాయకంగా పెంచే నాటు (దేశీయ) పందుల ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా విదేశాల నుంచి తీసుకువచ్చి మన వాతావరణ పరిస్థితులకు అలవాటు చేసిన సీమ జాతులు (Exotic Breeds) అధిక ఉత్పాదకతను కలిగి ఉంటాయి. వీటిని దేశీయ పందులతో సంకరీకరణ చేసి, స్థానిక వాతావరణానికి అలవాటుపడే మేలుజాతి సంకర రకాలను (Crossbred Varieties) కూడా వివిధ రాష్ట్రాల పశువైద్య విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేశాయి.
ప్రధాన సీమ జాతులు
లార్జ్ వైట్ యార్క్షైర్ (Large White Yorkshire) — పూర్తి తెలుపు రంగు, మేని మీద ‘ఫ్రెకిల్స్’ అనే నల్లటి మచ్చలు కలిగి ఉంటుంది. ఒక్కో ఈతకు 11–12 పిల్లలు పుట్టే అధిక లిట్టర్ సైజు, మంచి మాతృత్వ లక్షణాలు దీని ప్రత్యేకత. మగ పంది 300–400 కిలోలు, ఆడ పంది 230–320 కిలోల వరకు బరువు పెరుగుతుంది.
ల్యాండ్రేస్ (Landrace) — పొడవైన శరీరం, తక్కువ కొవ్వు, అధిక మాంస దిగుబడినిచ్చే జాతి.
డ్యూరాక్ (Duroc) — ఎర్రటి రంగు, గట్టి శరీర నిర్మాణం, శీఘ్ర పెరుగుదల కలిగిన జాతి; సంకరీకరణకు మేలు జాతిగా వాడతారు.
హ్యాంప్షైర్ (Hampshire) — నాణ్యమైన మాంసం, చురుకైన స్వభావం కలిగిన జాతి.
తెలంగాణకు అనువైన సంకర జాతులు: పి.వి.నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం (PVNRTVU) ‘శిక్షణ’ పోర్టల్ ప్రకారం, తెలంగాణలో పెంపకానికి అనువైనవిగా ఈ కింది సంకర జాతులను గుర్తించారు
SVVU–T17 — శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం (SVVU), తిరుపతి అభివృద్ధి చేసిన సంకర జాతి. లార్జ్ వైట్ యార్క్షైర్ను స్థానిక దేశీయ పందితో సంకరీకరణ చేసి 75% సీమ వారసత్వంతో రూపొందించారు. 8 నెలల వయసుకు సగటున 70–75 కిలోల బరువు, ఒక్కో ఈతకు 8–12 పిల్లలు లభిస్తాయి; ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ, పేద రైతు కుటుంబాలకు జీవనోపాధి వనరుగా విస్తృతంగా వాడుతున్నారు (SVVU, 2021).
రాణి (Rani) — ఐ.సి.ఏ.ఆర్.-జాతీయ పంది పరిశోధనా కేంద్రం, గౌహతి 2016లో విడుదల చేసిన సంకర జాతి. సీమ జాతి హ్యాంప్షైర్ను ఈశాన్య భారత దేశీయ జాతి ఘుంగ్రూతో సమాన (50:50) వారసత్వంతో సంకరీకరణ చేశారు; ఆరు తరాలుగా జాతి లక్షణాలను స్థిరీకరించారు. 8 నెలల వధ వయసుకు సుమారు 75 కిలోల బరువు, 1.98 సెం.మీ. వెన్ను కొవ్వు మందం లభిస్తుంది; డ్యూరాక్తో సంకరీకరించి ‘ఆశ’ అనే మరో రకాన్ని కూడా అభివృద్ధి చేశారు (ICAR-NRCP, 2016).
TANUVAS KPM Gold — తమిళనాడు పశు వైద్య, జంతు శాస్త్రాల విశ్వవిద్యాలయం (TANUVAS) కింద పి.జి.ఆర్.ఐ.ఏ.ఎస్., కట్టుపాక్కంలో అభివృద్ధి చేసిన సంకర జాతి. లార్జ్ వైట్ యార్క్షైర్ (75%)ను తమిళనాడు దేశీయ పందితో (25%) సంకరీకరణ చేసి 2017లో విడుదల చేశారు. అధిక వ్యాధి నిరోధకత, 3% లోపు పాలు మాన్పే వయసు మరణాల రేటు, ఒక్కో ఈతకు సగటున 8.1 పిల్లలు దీని ప్రత్యేకతలు; స్థానిక వాతావరణ పరిస్థితులకు బాగా అలవాటుపడింది (TANUVAS, 2017).
ఐ.సి.ఏ. ఆర్.-జాతీయ పంది పరిశోధనా కేంద్రం (ICAR-National Research Centre on Pig – ICAR-NRCP), గౌహతి ఈ సీమ, సంకర జాతులను దేశీయ పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేయడంలో, రైతులకు మేలుజాతి కూనలను (piglets) సరఫరా చేయడంలో, శిక్షణలు, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
శాస్త్రీయ పెంపక యాజమాన్య పద్ధతులు గృహ నిర్మాణం (షెడ్ నిర్మాణం): పందుల షెడ్డు ఎత్తైన ప్రదేశంలో, మంచి గాలి, వెలుతురు ఉండేలా నిర్మించాలి. ఈనే పందులకు వేరుగా ఫారోయింగ్ పెన్లు, పిల్లల కోసం క్రీప్ ఏరియా, వ్యాధి సోకిన పందులను వేరుచేసేందుకు ఐసొలేషన్ పెన్ ఏర్పాటు చేసుకోవాలి. నేల సులభంగా కడగగలిగేలా సిమెంట్తో వాలుగా ఉండాలి, తద్వారా మురుగునీరు సులభంగా బయటకు పోతుంది.
సంతానోత్పత్తి యాజమాన్యం: ఆడ పందులకు 8 నెలల వయసు, సుమారు 90–100 కిలోల బరువు వచ్చాక మొదటిసారి సంతానోత్పత్తికి ఉపయోగించాలి. గర్భధారణ కాలం సగటున 114 రోజులు (3 నెలలు, 3 వారాలు, 3 రోజులు) ఉంటుంది. పిల్లలను 6–8 వారాల వయసులో పాలు మాన్పించడం (weaning) శాస్త్రీయ పద్ధతి. సంతానోత్పత్తికి రెండు వారాల ముందు ఆడ పందికి కొంచెం ఎక్కువ దాణా ఇవ్వడాన్ని ‘ఫ్లషింగ్’ (Flushing) అంటారు; ఇది రోజుకు 0.7–0.9 కిలోల బరువు పెరుగుదలను, మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.
మేత యాజమాన్యం పందుల పెంపకంలో మొత్తం ఖర్చులో 70–75 శాతం మేత ఖర్చే ఉంటుంది. కాబట్టి వయసు, శరీర బరువును బట్టి శాస్త్రీయంగా మేత మార్చడం లాభదాయకతను నిర్ణయిస్తుంది.
దశలవారీ మాంసకృత్తుల (ప్రొటీన్) అవసరం దశ/ వయసు ప్రోటీన్ % శక్తి (ME, కిలో క్యాలరీలు/కిలో మేత) 2–5 కిలోల బరువు పిల్లలు 24% 3,500 5–15 కిలోల బరువు 22% 3,500 15–35 కిలోల బరువు (గ్రోయర్) 18% 3,300 35–90 కిలోల బరువు (ఫినిషర్) 14% 3,300 గర్భిణి ఆడ పందులు 14% 3250 పాలిచ్చే ఆడ పందులు 15% 3300 కోడె పందులు (boars) 14% 3250
క్రీప్ ఫీడ్ మరియు తొలిదశ మేత పుట్టిన 45 నిమిషాల్లోపే పిల్లలకు మొదటి పాలు (కొలొస్ట్రమ్) తాగించడం చాలా ముఖ్యం; ఇందులో వ్యాధి నిరోధక శక్తినిచ్చే ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు), విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. 10వ రోజు నుంచి పాలు మాన్పించిన 2 వారాల వరకూ 18–20% ప్రొటీన్తో కూడిన క్రీప్ ఫీడ్ ఇవ్వాలి. మొక్కజొన్న, వేరుశనగ చెక్క, తవుడు, చేపల పొడి, ఖనిజ మిశ్రమం కలిపి తయారుచేసే ఈ దాణా వల్ల మాన్పించే సమయంలో ఒత్తిడి తగ్గి, త్వరగా బరువు పెరుగుతాయి.
గ్రోయర్ మరియు ఫినిషర్ దాణా గ్రోయర్ దశలో మొక్కజొన్న, వేరుశనగ చెక్క, గోధుమ తవుడు, చేపల పొడి, ఖనిజ మిశ్రమంతో కూడిన సమతుల్య దాణా ఇవ్వాలి. ఫినిషర్ దశలో మార్కెట్ బరువుకు తీసుకురావడానికి శక్తినిచ్చే దాణాతో పాటు నువ్వుల చెక్క వంటివి చేర్చవచ్చు.
పదార్థం పరిమాణం (100 కిలోల దాణాలో) మొక్కజొన్న 55 భాగాలు వేరుశనగ చెక్క 20 భాగాలు గోధుమ తవుడు 15 భాగాలు చేపల పొడి 8.5 భాగాలు ఖనిజ మిశ్రమం 1.5 భాగాలు ఉప్పు 0.5 భాగాలు ఈ మిశ్రమం ద్వారా మొత్తం 22% ప్రొటీన్ లభిస్తుంది.
గర్భిణి, పాలిచ్చే ఆడ పందుల మేత: గర్భిణి ఆడ పందికి రోజుకు 1.8–1.9 కిలోల దాణా ఇస్తే గరిష్ఠ జనన బరువు (Birth Weight), మాన్పే బరువు (Weaning weight) లభిస్తాయి. ఈనడానికి 4–5 రోజుల ముందు దాణాను సగానికి తగ్గించి, మలబద్ధకం రాకుండా గోధుమ తవుడు వంటి లఘువిరేచన పదార్థాలు చేర్చాలి. పాలిచ్చే ఆడ పందికి రోజుకు 3.5 కిలోల దాణాతో పాటు ప్రతి పిల్లకు అదనంగా 0.2 కిలోల చొప్పున, 14–23 లీటర్ల నీరు అవసరం.
నీటి అవసరం (రోజుకు): వర్గం నీరు (లీటర్లలో) కోడె పంది (boar) 45–50 ఈనే ఆడ పంది 18–22 పాలు మాన్పిన పిల్లలు 3.5–4 పాలిచ్చే ఆడ పంది 14–23
చౌక, స్థానిక మేత వనరులు దాణా ఖర్చు తగ్గించుకోవడానికి అజొల్ల, వరి తవుడు (75% వరకు), బ్రూవరీ వ్యర్థాలు (15% వరకు), అరటి వ్యర్థాలు, కూరగాయల మార్కెట్ వ్యర్థాలు, హోటల్ వంటగది వ్యర్థాలు వంటి స్థానిక వనరులను సమతుల్యంగా వాడుకోవచ్చు. అయితే, గార్బేజ్ ఫీడింగ్లో మాంసం ముక్కలను ఇవ్వకూడదు — ఇవి వ్యాధులను వ్యాప్తి చేయడంతో పాటు గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. పులిసిన లేదా నిల్వ ఉంచిన ఆహారాన్ని ఇస్తే సాల్మొనెల్లోసిస్ వంటి వ్యాధులు వచ్చి మరణాలకు దారితీయవచ్చు కాబట్టి ఉడికించిన వ్యర్థాలనే ఇవ్వాలి.
వ్యాధి వర్గం: బాక్టీరియా వ్యాధులు
ప్రధాన వ్యాధులు : బ్రూసెల్లోసిస్
ముఖ్య లక్షణాలు: గర్భస్రావం, వంధ్యత్వం
నివారణ / నియంత్రణ : సోకిన పందులను వేరుచేయాలి, పరీక్షలు నిర్వహించాలి. జూనోటిక్ వ్యాధి.
వ్యాధి : *లెప్టోస్పైరోసిస్
ముఖ్య లక్షణాలు: జ్వరం, విరేచనాలు, గర్భస్రావం
నివారణ / నియంత్రణ : పరిశుభ్రత, ఎలుకల నియంత్రణ, అవసరమైన టీకాలు
వ్యాధి : స్వైన్ ఎరిసిపెలాస్
ముఖ్య లక్షణాలు: అధిక జ్వరం, చర్మంపై వజ్రాకార మచ్చలు
నివారణ / నియంత్రణ : సమయానికి టీకాలు, యాంటీబయోటిక్ చికిత్స
వ్యాధి : అట్రోఫిక్ రైనైటిస్, సాల్మొనెల్లోసిస్, పాశ్చురెల్లోసిస్
ముఖ్య లక్షణాలు: శ్వాసకోశ సమస్యలు, విరేచనాలు
నివారణ / నియంత్రణ : పరిశుభ్రత, బయోసెక్యూరిటీ, వెటర్నరీ చికిత్స
వైరస్ వ్యాధులు: *
వ్యాధి : క్లాసికల్ స్వైన్ ఫీవర్ (CSF)
ముఖ్య లక్షణాలు: జ్వరం, ఆకలి తగ్గడం, అధిక మరణాలు
నివారణ / నియంత్రణ : సమయానికి టీకాలు వేయాలి
వ్యాధి : ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ASF)
ముఖ్య లక్షణాలు: అకస్మిక మరణాలు, అధిక మరణాల రేటు
నివారణ / నియంత్రణ : ప్రస్తుతం సమర్థవంతమైన టీకా లేదు. కఠినమైన బయోసెక్యూరిటీ పాటించాలి.
వ్యాధి: ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ (FMD)
ముఖ్య లక్షణాలు: నోరు, కాళ్లపై బొబ్బలు
నివారణ / నియంత్రణ : టీకాలు, వ్యాధిగ్రస్త పందులను వేరుచేయాలి
వ్యాధి : స్వైన్ ఇన్ఫ్లుఎంజా
ముఖ్య లక్షణాలు: శ్వాసకోశ, జీర్ణకోశ సమస్యలు
నివారణ / నియంత్రణ : మంచి నిర్వహణ, అవసరమైన టీకాలు
*పరాన్నజీవి వ్యాధులు *
వ్యాధి : సార్కాప్టిక్ మేంజ్
ముఖ్య లక్షణాలు: తీవ్రమైన దురద, చర్మ సమస్యలు
నివారణ / నియంత్రణ : ఐవర్మెక్టిన్ చికిత్స, పరిశుభ్రత
వ్యాధి : రౌండ్వార్మ్, విప్వార్మ్, కిడ్నీ వార్మ్, లంగ్ వార్మ్
ముఖ్య లక్షణాలు: ఎదుగుదల మందగించడం, బరువు తగ్గడం
నివారణ / నియంత్రణ : ప్రతి 3 నెలలకోసారి డీవార్మింగ్ చేయాలి
వ్యాధి : ట్రైకినోసిస్
ముఖ్య లక్షణాలు: జూనోటిక్ వ్యాధి
నివారణ / నియంత్రణ : పంది మాంసాన్ని పూర్తిగా ఉడికించి తీసుకోవాలి
జూనోటిక్ వ్యాధులపై జాగ్రత్తలు బ్రూసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, సాల్మొనెల్లోసిస్, ట్రైకినోసిస్ వంటి వ్యాధులు పందుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉంది. అందువల్ల చేతి తొడుగులు ఉపయోగించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మాంసాన్ని పూర్తిగా ఉడికించి తినడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తప్పనిసరి.
బయోసెక్యూరిటీ చర్యలు • కొత్తగా కొనుగోలు చేసిన పందులను 2–3 వారాలు క్వారంటైన్లో ఉంచాలి. • షెడ్డును, పరికరాలను, తాగునీటి పాత్రలను క్రమం తప్పకుండా శుభ్రపరచి క్రిమిసంహారక మందులు ఉపయోగించాలి. • ప్రతి 3 నెలలకోసారి డీవార్మింగ్ చేయాలి. • టీకాల షెడ్యూల్ను తప్పకుండా పాటించాలి. • అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యుడిని సంప్రదించి, అనుమానాస్పద మరణాలను సంబంధిత అధికారులకు తెలియజేయాలి.
రైతులకు సూచన: “చికిత్స కంటే నివారణే ఉత్తమం.” పరిశుభ్రమైన నిర్వహణ, సమతుల్య పోషకాహారం, సమయానికి టీకాలు, క్రమం తప్పకుండా డీవార్మింగ్ చేయడం ద్వారా పందుల ఆరోగ్యాన్ని కాపాడి అధిక లాభాలు పొందవచ్చు.
ప్రభుత్వ పథకాలు — విధానాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పందుల పెంపకాన్ని ఒక వ్యవస్థాపక అవకాశంగా ప్రోత్సహించేందుకు పలు పథకాలను అమలు చేస్తున్నాయి.
జాతీయ పశు సంపద మిషన్ (National Livestock Mission – NLM)
పశు సంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ఈ పథకంలోని వ్యవస్థాపకత అభివృద్ధి ఉప-పథకం (Entrepreneurship Development Sub-Mission) కింద, పందుల పెంపక క్షేత్రాల ఏర్పాటుకు షెడ్ నిర్మాణం (ఈనే పందుల షెడ్, కోడె పందుల యూనిట్, ఫారోయింగ్ పెన్), మేలుజాతి పిల్ల పందుల కొనుగోలు, పరికరాలు, బీమా, పశు వైద్య సహాయం వంటి అంశాలపై 50% వరకు మూలధన రాయితీ లభిస్తుంది. వ్యక్తులు, రైతు ఉత్పత్తి సంఘాలు (FPO), స్వయం సహాయక బృందాలు (SHG), రైతు సహకార సంస్థలు (FCO), ఉమ్మడి బాధ్యతా బృందాలు (JLG) ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముగింపు సీమ, సంకర జాతుల పందుల పెంపకం తక్కువ పెట్టుబడి, తక్కువ స్థలం, తక్కువ కాలంలో ఎక్కువ రాబడినిచ్చే గ్రామీణ ఉపాధి మార్గంగా విస్తరిస్తోంది. అయితే, శాస్త్రీయ యాజమాన్యం, దశలవారీ సమతుల్య మేత, కచ్చితమైన టీకా కార్యక్రమం, కఠినమైన బయోసెక్యూరిటీ చర్యలు పాటించకుండా చేపడితే — ముఖ్యంగా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వంటి టీకా లేని వ్యాధుల నేపథ్యంలో — నష్టాలు తప్పవు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, రుణ సదుపాయాలు, విశ్వవిద్యాలయాల విస్తరణ సేవలను సద్వినియోగం చేసుకుంటూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే, తెలంగాణలోని చిన్న, సన్నకారు రైతులు, మహిళా స్వయం సహాయక బృందాలు సీమ పందుల పెంపకం ద్వారా నిలకడైన ఆదాయాన్ని, నిజమైన ఆర్థిక సాధికారతను సాధించగలరు. ఇందుకు పశు విస్తరణ విద్య, క్షేత్రస్థాయి శిక్షణలు, పశు వైద్యుల మార్గదర్శకత్వం అనునిత్యం అందుబాటులో ఉండటం అత్యవసరం. . డా. ఎం. అరవింద్ (పీజీ స్కాలర్), పశువైద్య & పశుసంవర్థక శాఖ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్, సెల్: 8499884669.
జాఫ్రా 4-5 మీ. ఎత్తు పెరిగే చిన్న చెట్టు. గులాబి రంగు పూలు కొమ్మల చివర్లో గుత్తులుగా ఏర్పడతాయి. ముదురు ఎరుపు రంగులో పండ్లు ముళ్ళతో నిండి, అండాకారంలో కొంచెం నొక్కినట్లు ఉంటాయి. గింజలు ముక్కోణాకారంతో ముదురు నారింజ రంగులో 3-4 మి.మీ. పరిమాణం కలిగి ఉంటాయి. ఇవి సామాన్యంగా ఫిబ్రవరి – మే మాసాల్లో లభిస్తాయి. దాదాపు 3 నుండి 12 సంవత్సరాల వయసు వరకు ఫలసాయం పొందవచ్చు.
సాధారణ నామం : అనాటో / సింధూర శాస్త్రీయ నామం : బిక్సా ఒరెల్లానా కుటుంబం: బిక్సేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
బెరడు, విత్తనాలు, గుజ్జు, ఆకులు, వేర్లు ఔషధగుణాలు కలిగి ఉంటాయి.
గింజలలో “బిక్సిన్” అనే రసాయనముంటుంది.
గింజల గుజ్జులో రంగును కలుగచేసే కెరోటినాయిడ్ ఉంటుంది.
దీని బెరడును గనేరియా వ్యాధి, తరచూ వచ్చే జ్వరాల నివారణకు పయోగిస్తారు.
గింజల గుజ్జును బంక విరేచనాల నివారణకు ఉపయోగిస్తారు.
ఆకులను కామెర్ల వ్యాధి నివారణకు, పాముకాటుకు ఉపయోగిస్తారు.
వైద్యపరంగానే గాక గింజల నుండి తీసిన సహజ రంగును ఆహార పదార్థాలలో విరివిగా వాడతారు.
వ్యవసాయరంగంలో …
జాఫ్రా గింజల ద్రావణం శాండ్ ఫ్లై, లుట్జోమియా లాంగిపాల్పిస్ చావు శాతాన్ని పెంచింది. బలమైన యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. (డిఆరియాస్, అతని అనుచరులు, 1992).
జాఫ్రా ఆకులు జీవపురుగు మందు సామర్థ్యం కలిగి ఉన్నాయి (కేల్, అతని అనుచరులు, 2012).
జాఫ్రా ఇథనాల్ ఆకు ద్రావణం గ్రామ్ పాజిటివ్ బాక్టీరియాపై యాంటిబాక్టీరియల్ చర్య ప్రదర్శించింది.
జాఫ్రా గింజల ద్రావణం టిక్స్పై పురుగు వికర్షక, పారసైట్ నాశక, దోమవికర్షక చర్యలను ప్రదర్శించింది (డి బోయిర్, అతని అనుచరులు, 2010)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
పంట పెట్టడం ఒకెత్తయితే… అది ఆరోగ్యంగా ఎదిగేలా చూసుకోవడం ఒకెత్తు. మార్కెట్లో నూటారు పేర్లతో గ్రోత్ ప్రమోటర్లను అమ్ముతున్నారు. అయితే, వీటిని కొనకుండా కొద్దిపాటి శ్రమతో ఇంటి వద్దే పెద్ద ఖర్చేమీ లేకుండా తయారుచేసుకోవచ్చు. మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే ఆక్సిన్స్, జిబ్బరిల్లిన్ తదితరాలు ‘నర్రెంగ’ మొక్కలో దండిగా ఉన్నాయి. దీని శాస్త్రీయ నామం ‘అల్బీజీయా అమరా’. నర్రెంగ ఆకులను ఒక కిలో తీసుకొని, ఐదు లీటర్ల పుల్ల మజ్జిగలో వేసి, వారం రోజుల పాటు పులియబెట్టాలి. ఆ తరువాత వడకట్టి లీటర్ ద్రావణాన్ని 20 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. నర్రెంగ మొక్కలు దొరకకపోతే మరో మార్గం ఉంది. పచ్చి కొబ్బరిని రుబ్బి, పాలు తీయాలి. ఐదు లీటర్ల కొబ్బరి పాలకు ఐదు లీటర్ల మజ్జిగను చేర్చి… ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో పోసుకొని పులియబెట్టుకోవాలి. వారం తరువాత ద్రావకాన్ని వడకట్టుకొని లీటరు ద్రావణాన్ని 20 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ రెండు ద్రావణాలు పంటల ఎదుగుదలకే కాకుండా పూత, పిందె బాగా రావడానికి ఉపయోగపడతాయి.
వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతంతో పాటు రోగకారక క్రిములు (బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు) వేగంగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల పశువులలో పాల దిగుబడి తగ్గడమే కాకుండా తీవ్రమైన వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో పశుపోషణలో పాటించాల్సిన సమగ్ర శాస్త్రీయ నిర్వహణ పద్ధతులు
1: షెడ్ల నిర్వహణ, పారిశుధ్యం మరియు గాలి-వెలుతురు (Shed Management & Sanitation)
వర్షాకాలంలో పశువుల ఆరోగ్యం షెడ్ పరిశుభ్రతపైనే 80% ఆధారపడి ఉంటుంది.
ఏ . షెడ్ పరిశుభ్రత మరియు నీటి నిల్వ నివారణ:
నేల పొడిగా ఉంచడం: షెడ్ లోపల నీరు నిలవకుండా చూడాలి. కాంక్రీట్ లేదా మట్టి నేలపై వర్షం నీరు లేదా మూత్రం నిలిస్తే గిట్టల కుళ్లు (Foot rot) మరియు పొదుగు వాపు (Mastitis) వ్యాధులు వస్తాయి.
సున్నం మరియు క్రిమిసంహారకాలు: వారానికి కనీసం రెండు సార్లు షెడ్ నేలపై, మూలల్లో పొడి సున్నం (Quick lime) లేదా వరి పొట్టు చల్లాలి. ఇది తేమను పీల్చుకుని క్రిములను చంపుతుంది.
మురుగు నీటి కాలువలు: షెడ్ చుట్టూ ఉన్న కాలువలను శుభ్రం చేసి వర్షపు నీరు సులభంగా బయటకు వెళ్లేలా చూసుకోవాలి.
షెడ్ ఎత్తు మరియు గాలి, వెలుతురు:
కిటికీలు మరియు పరదాలు: వర్షం చినుకులు లోపలికి పడకుండా గోనె సంచులు లేదా తార్పాలిన్ పరదాలను అమర్చాలి. అయితే, షెడ్ లోపల అమ్మోనియా వాయువు నిలిచిపోకుండా గాలి ఆడటానికి పైన ఖాళీ (Ventilation) ఉంచాలి.
ఈగలు, దోమల నివారణ: వర్షాకాలంలో దోమలు, ఈగల తీవ్రత ఎక్కువ. వీటి నివారణకు సాయంత్రం వేళల్లో వేపఆకులు, సాంబ్రాణి పొగ వేయడం లేదా పొగచుట్ట పొడి ద్రావణాన్ని షెడ్ చుట్టూ పిచికారీ చేయడం చేయాలి.
2: మేత మరియు పోషక యాజమాన్యం (Feed & Nutrition Management) వర్షాకాలంలో లభించే చిగురించిన పచ్చిమేత వల్ల జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఏ . పచ్చిమేత వాడకంలో జాగ్రత్తలు:
లేత గడ్డి వల్ల ప్రమాదం: వర్షాలకు కొత్తగా పెరిగిన లేత పచ్చిమేతలో నీటి శాతం ఎక్కువ, పీచు పదార్థం (Fiber) తక్కువగా ఉంటుంది. దీనిని నేరుగా తినిపిస్తే పశువులకు సార విరేచనాలు (Diarrhea) మరియు కడుపు ఉబ్బరం (Bloat) వస్తాయి.
ఎండుగడ్డి కలపడం: పచ్చిమేతతో పాటు తప్పనిసరిగా తగినంత వరిగడ్డి లేదా జొన్న చొప్ప (ఎండుమేత) కలిపి అందించాలి. పచ్చిమేత కోసిన వెంటనే వేయకుండా 2-3 గంటల పాటు నీడలో ఆరబెట్టి వేయాలి.
బి . బూజు పట్టిన మేత నివారణ (Aflatoxin Control):
వర్షాకాలంలో గాలిలో తేమ వల్ల నిల్వ ఉంచిన దాణా, శనగ పొట్టు, తవుడు బూజు పట్టే ప్రమాదం ఉంది.
బూజు పట్టిన దాణాను పశువులకు మేపకూడదు. దీనివల్ల కాలేయం పాడై ‘ఆఫ్లాటాక్సికోసిస్’ అనే విషప్రభావం ఏర్పడుతుంది. దాణాను నిల్వ చేసే ప్రదేశంలో ప్లాస్టిక్ షీట్ పరిచి దానిపై బస్తాలు ఉంచాలి.
సి . మినరల్ మిశ్రమం మరియు తాగునీరు:
ధాతు లవణాల మిశ్రమం (Mineral Mixture): వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి ప్రతి పాడి పశువుకు రోజుకు 50-100 గ్రాముల మినరల్ మిశ్రమం దాణాలో కలిపి ఇవ్వాలి.
శుభ్రమైన నీరు: వర్షాకాలంలో కలుషిత నీటి వల్ల వ్యాధులు వ్యాపిస్తాయి. పశువులకు పంపు నీరు లేదా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాపాలి. గుంటల్లో నిలిచిన వర్షపు నీటిని తాపకూడదు.
3: వ్యాధుల వ్యాప్తి, నివారణ మరియు అత్యవసర జాగ్రత్తలు (Disease Control & Health Care) వర్షాకాలంలో బ్యాక్టీరియల్ మరియు పరాన్నజీవుల (Parasites) ద్వారా వచ్చే వ్యాధులు ఎక్కువ.
ఏ . ముఖ్యమైన వ్యాధులు – ముందస్తు టీకాలు (Vaccinations):
వ్యాధి పేరు గొంతువాపు (HS)
లక్షణాలు: గొంతు వాచి శ్వాస తీసుకోవడం కష్టమవడం, తెల్లటి నురుగు రావడం
నివారణ / టీకా: వర్షాకాలం ముందు లేదా ప్రారంభంలో H.S. టీకా వేయించాలి
వ్యాధి పేరు: జానపద వ్యాధి (BQ)
లక్షణాలు: పిరుదుల కండరాలు వాచి, తాకితే చప్పుడు రావడం, తీవ్ర జ్వరం
నివారణ / టీకా: B.Q. టీకా వేయించాలి
వ్యాధి పేరు: పొదుగు వాపు (Mastitis)
లక్షణాలు: పొదుగు గట్టిపడి పాలు ఎర్రగా/విరిగిపోయి రావడం
నివారణ / టీకా: పాలు పితికిన తర్వాత చనుమొనలను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో ముంచాలి
వ్యాధి పేరు: పరాన్నజీవుల సమస్య
లక్షణాలు: బరువు తగ్గడం, కళ్ల వెంట నీరు, దవడ కింద వాపు
నివారణ / టీకా: నట్టల నివారణ మందు (Deworming) తాపించాలి
బి . గిట్టల సంరక్షణ (Foot Care): • నేల తేమగా ఉండటం వల్ల గిట్టల మధ్య పుండ్లు పడతాయి (Foot rot). • పరిష్కారం: వారానికి ఒకసారి పశువుల కాళ్లను 2% రాగి మైలుతుత్తం (Copper Sulphate) ద్రావణంతో కడగాలి.
గొర్రెలు, మేకలు మరియు కోళ్ల ప్రత్యేక జాగ్రత్తలు: • గొర్రెలు/మేకలు: వీటిని వర్షంలో తడవనివ్వకూడదు. వర్షాకాలంలో PPR టీకా మరియు ఎంటరోటాక్సిమియా (ET) టీకా తప్పనిసరిగా వేయించాలి. • పెరటి కోళ్లు: కోళ్ల షెడ్లలో రంధ్రాలు లేకుండా చూసి, రాణిఖేత్ (RDV) టీకా వేయించాలి. తాగునీటిలో యాంటీబయోటిక్స్ లేదా విటమిన్లు కలిపి ఇవ్వడం శ్రేయస్కరం.
రైతులకు ముఖ్య గమనిక: వర్షాకాలంలో పశువులలో ఏమాత్రం మేత తినకపోవడం, జ్వరం రావడం లేదా నడవలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలో ఉన్న పశువైద్యుడిని (Veterinary Doctor) సంప్రదించి చికిత్స అందించాలి.
రచయిత: డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం). Ph: 8121451017 కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్
పపటాకు 1.8 మీటర్ల ఎత్తు పెరిగే వార్షిక మొక్క. ఇది విపీరతంగా పెరిగి కలుపు మొక్కలా తయారవుతుంది. ఆకులు వ్యతిరేక దిశలో ఏర్పడి 3 నుండి 5 అండాకారంలో వున్న చిన్న ఆకులు కలిగి వుంటాయి. మొక్క సంవత్సరంలో ఏ సమయంలోనైనా పూయవచ్చు. పూలు పొడవాటి కాడల మీద చిన్న గుత్తులుగా ఏర్పడతాయి. కాయలు కొద్దిగా వంకరగా, బిర్రుగా, గరుకుగా, నలుపు కడ్డీలులాగా వుంటాయి. కాయలు నక్షత్రం ఆకారంలో గుండ్రని గరుకైన అంచులు కలిగి సుమారు 1-2 సెం.మీ. వ్యాసంలో వుంటాయి. ఉత్తర భారతదేశంలో లేత ఆకులు, కొమ్మలను చేపల కూరలో చేపలతో కలిపి వండుకు తింటారు.
సాధారణ నామం : బ్లాక్ జాక్ / బెగ్గర్టిక్ శాస్త్రీయ నామం : బిడెన్స్ పైలోసా కుటుంబం: ఆస్టరేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
పపటాకు ఫార్ములేషన్ యాంటి డయాబెటిక్ డ్రగ్స్తో కలిపి వాడితే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులలో డయాబెటిస్ నియంత్రణలో వుంటుంది.
చైనాలో, ఈశాన్య ఉత్తర భారతదేశంలో ప్రజలు ఔషధంగా ఉపయోగిస్తారు. మొత్తం మొక్క లేదా వివిధ భాగాలను వాపు, రోగనిరోధక సమస్యలు, జీర్ణకోశ సమస్యలు, కీళ్ళ నొప్పులు, అంటువ్యాధులు, క్యాన్సర్లు, గాయాలు వంటి 40 జబ్బులకు పైగా చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో …
దక్షిణాఫ్రికాలో దీనిని పందులకు మేతగా ఉపయోగిస్తారు.
పపటాకు ఎసిటోన్ ద్రావణాన్ని చిక్కుడు గింజల నిల్వదశలో ఆశించే అకాంతో సెలిడెస్ ఒబ్టెక్టస్, జాట్రోటెస్ సబ్సాసియేటస్ పురుగుల నివారణలో మొట్టమొదటిసారిగా ఉపయోగించి 100 శాతం నివారణ సాధించారు. పపటాకు ఒక అద్భుతమైన వృక్ష సంబంధ పురుగుమందు. దీనిని అధిక పరిమాణంలో లెగ్యూమ్ జాతి పంటల ధాన్యాన్ని పురుగులాశించకుండా నిల్వ చేయడానికి ఉపయోగించవచ్చు. (రేణుక, ఆమె అనుచరులు, 2014) రసాయన పురుగుమందులకు ఈ కలుపు మొక్క ఒక అద్భుత ప్రత్యామ్నాయం.
పపటాకు తాజా ఆకులనుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ బంబార వేరుశనగ నిల్వ సమయంలో ఆశించే పురుగు కాల్లసోబ్రోకస్ మాక్యులేటస్ను, శిలీంద్రాలు ఆస్పర్ౙిల్లస్, పెనిసిలియం, ఫ్యుజేరియం, మ్యూకార్లను సమర్థవంతంగా నివారించింది. పపటాకు ఎసెన్షియల్ ఆయిల్ పురుగు, శిలీంద్ర నాశక లక్షణాలు ఈ పరిశోధన ద్వారా విశదమయ్యాయి (అగస్టిన్గేడౌమ్, అతని అనుచరులు, 2016)
పపటాకు తాజా ఆకుల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యాన్ని పురుగులాశించకుండా కాపాడుతుంది (ఆగస్టిన్ గేడౌమ్, అతని అనుచరులు, 2016)
పేనుబంక, లద్దె పురుగులు, చెదల నివారణకు మొత్తం మొక్క, దాని గింజలనుపయోగించి ఫార్ములేషన్ తయారు చేసుకోవచ్చు. మొదట ముదిరిన గింజలను నీటిలో 10 ని॥ మరిగించాలి. చల్లారిన తర్వాత ఇంకొంచెం నీటితోపాటు చిన్న సబ్బు ముక్క లేదా కొంచెం సబ్బు పొడి కలపాలి. ఈ ద్రావణాన్ని వడకట్టి నారుమడి, కూరగాయల పం\ల్లో పిచికారి చేయవచ్చు. మొత్తం మొక్కను కూడా బాగా దంచి రాత్రంతా నీటిలో నానబెట్టి ఉంచి, మరునాడు వడపోసి పిచికారి చేసే ముందు చిన్న సబ్బు ముక్క కలిపి పిచికారి చేయవచ్చు.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
దేవ కాంచనం ఒక చిన్న పరిమాణం నుండి మధ్య పరిమాణం కలిగి కాలానుగుణంగా ఆకులు రాల్చుతూ, వేగంగా పెరిగే పొద లేదా చెట్టు. ఈ చెట్టు గుండ్రని, వత్తయిన గుబురులాంటి క్యానపి, 10 మీ. ఎత్తు కలిగి, లేత కొమ్మలు మెత్తగా, నునుపుగా ఉంటాయి. పొడి వాతావరణం గల ప్రాంతాలలో చెట్టు పరిమాణం అతి చిన్నదిగా ఉంటుంది. బెరడు తెల్లబారిన బూడిద గోధుమ వర్ణంలో, నున్నగా, కొద్దిగా బీటలు వారిన పొలుసులు కలిగి ఉంటుంది. రెమ్మపుల్లలు సన్నని, లేత ఆకుపచ్చ రంగులో, కొంచెం నూగుతో, కోణాలు కలిగి గోధుమ బూడిద రంగులో ఉంటాయి. హార్ట్వుడ్ గోధుమరంగులో గట్టిగా మన్నిక కలిగి ఉంటుంది. ఆకులు సామాన్యంగా, ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. ఆకు ఆధారం గుండ్రంగా ఉండి 12 సెం.మీ. x 12 సెం.మీ. పరిమాణం, చివరి భాగం లోతుగా రెండు భాగాలుగా విడిపోయి ఉంటుంది. ఆకుపైభాగం, అడుగు భాగం నున్నగా, 9-12 ఈనెలు కలిగి ఉంటాయి. ఆకు కాడలు 2.5 – 3.5 సెం.మీ. పొడవుంటాయి. పూరెమ్మ 6-10 ఎరుపు, నీలం కలిసిన రంగు గల పూలను కలిగి ఉంటుంది. పూమొగ్గలు గద ఆకారంలో ఉంటాయి. కాయలు గోధుమ రంగులో 15-30 సెం.మీ. పొడవు, 1.5-2.5 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటాయి. కాయలో 10-15 మెరిసే గోధుమ రంగు గింజలు ఏర్పడతాయి..
సాధారణ నామం : పర్పుల్ బాహినియా/ఆర్కిడ్ ట్రీ / బటర్ఫ్లెå ట్రీ శాస్త్రీయ నామం : బాహినియా పర్పురియా కుటుంబం: ఫాబేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
దేవకాంచనం అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. దీని కషాయం అల్సర్లను నివారిస్తుంది. గాయాలు, దెబ్బలను నయం చేస్తుంది. బొబ్బలు, వ్రణాలను నయం చేయడానికి ఆకులను నూరి తయారు చేసిన పేస్టుని పూస్తారు.
కీళ్ళనొప్పులు, వాపులు తగ్గడానికి ఉపయోగిస్తారు. ఆస్త్మా, జలుబు, దగ్గులను తగ్గించడానికి ఉపయోగిస్తారు. వ్యాధులు, జలోదరం వంటి జబ్బులను నయం చేయడానికి సహాయ పడుతుంది. యాంటిక్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంది. దేవకాంచనం బెరడుని డయేరియా చికిత్సలో ఉపయోగిస్తారు. పూమొగ్గలను డిసెంట్రి, మొలల చికిత్సలో ఉపయోగిస్తారు.
ఇది మహిళలకు మంచి ఔషధం. బహిష్టు సమయంలో అధిక రక్త స్రావాన్ని ఆపుతుంది. జంతువుల గాట్లకు మంచి మందు. వాయు రోగాన్ని తగ్గించడానికి రోజుకి రెండుసార్లు 10 మి.లీ. వేరు కషాయాన్ని త్రాగాలి. డయేరియా నివారణకు రోజుకి రెండు సార్లు వేరు కషాయం త్రాగాలి.
అల్సర్ల నివారణకు బెరడు కషాయంతో కడగాలి. 5 మి.లీ పూల కషాయం రోజుకి రెండు సార్లు త్రాగితే విరేచనాలవుతాయి.
వ్యవసాయరంగంలో
దేవకాంచనం ఆకు మిథనాల్ ద్రావణం వరి ధాన్యం నిల్వలో ఆశించే సైటోఫిలస్ ఒరైజెని 75% చంపింది దీనిని రసాయన పురుగు మందుకి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు (డెర్బాలా, అతని అనుచరులు, 2012).
దేవకాంచనం మిథనాల్ ద్రావణం గోధుమ ధాన్యం నిల్వలో ఆశించే ట్రోగోడెర్మా గ్రానేరియం పురుగులను చంపడంలో అధిక సామర్థ్యతను ప్రదర్శించింది (డెర్బాలా, 2012).
దేవకాంచనం వేడి నీటి ద్రావణం మామిడి పండ్ల నిల్వ సమయంలో ఆశించే ఆంత్రాక్నోస్ తెగులుని సమర్ధవంతంగా నివారించింది (విచమ్ కోర్ప్రాడిట్స్కల్, 1991).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వ్యవసాయ రంగం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. భారతదేశ వ్యవసాయం ప్రధానంగా వర్షాధారం పై ఆధారపడి ఉంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీన కేరళ తీరాన్ని చేరుకొని, క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో సాధారణంగా జూన్ మొదటి లేదా రెండవ వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. రైతులు ఈ వర్షాలను ఆధారంగా చేసుకొని ఖరీఫ్ పంటల సాగును ప్రారంభిస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా నైరుతి రుతుపవనాల రాక ఒకటి నుండి మూడు వారాల వరకు ఆలస్యమవుతోంది. దీని కారణంగా విత్తనాల మొలక ఆలస్యం కావడం, సాగు విస్తీర్ణం తగ్గడం, నేలలో తేమ కొరత ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా, వర్షపాతం ఆలస్యంగా ప్రారంభమవడం, ఒకేసారి అధిక వర్షపాతం నమోదవడం, పంట పెరుగుదల మధ్యలో పొడి వాతావరణం (డ్రై స్పెల్స్) ఏర్పడడం, తుఫానులు, వడగాల్పులు మరియు ఉష్ణోగ్రతలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు వంటి అసాధారణ వాతావరణ పరిస్థితులు పంటల పెరుగుదల మరియు దిగుబడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ముందస్తు ప్రణాళికతో స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటలను మరియు తక్కువ వ్యవధిలో పరిపక్వత చెందే పంట రకాలను ఎంపిక చేసుకొని సాగు చేయడం ద్వారా నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, విత్తే సమయాల్లో అవసరమైన మార్పులు, స్వల్పకాలిక పంట రకాల వినియోగం, నేలలో తేమ మరియు నీటి సంరక్షణ చర్యల అమలు, అలాగే అందుబాటులో ఉన్న సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించడం వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి.
వర్షాకాలం ఆలస్యమైనప్పుడు వర్షాలు జూన్ నెలలో ప్రారంభం కాక జూలై లేదా ఆగస్టు వరకు ఆలస్యం అయితే సాధారణంగా సాగు చేసే దీర్ఘకాలిక పంటలకు బదులుగా స్వల్పకాలిక పంటలను ఎంచుకోవాలి. పెసర, మినుము, ఉలవలు, నువ్వులు, జొన్న, సజ్జ, కొర్రలు వంటి పంటలు తక్కువ వ్యవధిలో పూర్తవుతాయి మరియు తక్కువ నీటితో కూడా మంచి దిగుబడిని ఇస్తాయి.
మధ్యలో పొడి వాతావరణం ఏర్పడినప్పుడు వర్షాలు ప్రారంభమైన తరువాత కొన్ని వారాలు వర్షాభావం ఏర్పడితే నేలలో తేమను కాపాడటం అత్యంత ముఖ్యం. కలుపు నివారణ చేయడం, నేలపై మల్చింగ్ చేయడం, అంతరకృషి నిర్వహించడం, అవసరమైతే జీవరక్షక నీటిపారుదల ఇవ్వడం ద్వారా పంటను రక్షించవచ్చు.
అధిక వర్షాలు కురిసినప్పుడు భారీ వర్షాల వల్ల పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా వెంటనే బయటకు వెళ్లేలా డ్రైనేజీ సౌకర్యం కల్పించాలి. నీరు నిల్వ ఉండటం వల్ల వేరుకుళ్లు, శిలీంధ్ర వ్యాధులు మరియు పోషక లోపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల అవసరమైన మొక్కల సంరక్షణ చర్యలు వెంటనే చేపట్టాలి.
వర్షాలు ముందుగానే ముగిసినప్పుడు వర్షాకాలం త్వరగా ముగిసి నేలలో తేమ తగ్గినప్పుడు తక్కువ కాలంలో పూర్తయ్యే పంటలు లేదా రబీ సీజన్లో తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంచుకోవాలి. నేలలో తేమను సంరక్షించేందుకు మల్చింగ్, కన్జర్వేషన్ టిల్లేజ్ వంటి పద్ధతులు ఉపయోగించాలి.
దీర్ఘకాలిక కరవు పరిస్థితులు: పంట ఎదుగుదల దశలో వర్షాలు ఆగిపోతే, మొక్కల సంఖ్యను తగ్గించి, కలుపును తీసివేసి వాటిని నేలపై కప్పి ఉంచడం) ద్వారా తేమను కాపాడుకోవాలి. నీటి ఎద్దడిని తట్టుకునే పంటలను (అలసందలు వంటివి) సాగు చేయడం మేలు.
ప్రత్యామ్నాయంగా సాగు చేయదగిన పంటలు • వేరుశెనగకు బదులుగా – పెసర, నువ్వులు, ఉలవలు • వరికి బదులుగా – జొన్న, సజ్జ, రాగులు • పత్తికి బదులుగా – పెసర, మినుము, నువ్వులు • మొక్కజొన్నకు బదులుగా – జొన్న, కొర్రలు, సజ్జ
రైతులు పాటించాల్సిన ముఖ్య సూచనలు • వాతావరణ శాఖ సూచనలను ప్రతిరోజూ గమనించాలి. • స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలను పాటించాలి. • ధృవీకరించిన విత్తనాలను మాత్రమే వినియోగించాలి. • వర్షపు నీటిని సంరక్షించే చర్యలు చేపట్టాలి. • పంటల బీమా పథకాలలో నమోదు చేసుకోవాలి. • సమగ్ర పంట నిర్వహణ పద్ధతులను అనుసరించాలి.
నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల మొక్కల ఎదుగుదల మెరుగుపడి, వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంటలు నిలదొక్కుకుని మంచి దిగుబడిని ఇస్తాయి.
• వేసవి దుక్కి: వేసవిలో లోతుగా దున్నడం వల్ల వర్షపు నీరు నేలలోకి బాగా ఇంకి తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అలాగే కలుపు మొక్కలు మరియు కొన్ని కీటకాల సమస్య కూడా తగ్గుతుంది. • వాలు ప్రాంతాల్లో భూమి సమోన్నత రేఖలకు అనుగుణంగా దున్నడం వల్ల వర్షపు నీటి ప్రవాహం తగ్గి నేల కోత నివారించబడుతుంది. • పొలాన్ని చిన్న చిన్న గట్లుగా విభజించడం ద్వారా వర్షపు నీరు పొలంలోనే నిలిచి నేలలోకి ఇంకుతుంది. • మల్చింగ్: పంట అవశేషాలు, గడ్డి లేదా ప్లాస్టిక్ మల్చ్ను నేలపై పరచడం ద్వారా నేల నుంచి నీటి ఆవిరీభవనం తగ్గి తేమ ఎక్కువ కాలం ఉంటుంది. అలాగే కలుపు మొక్కల పెరుగుదల కూడా తగ్గుతుంది. • అంతరకృషి: పంటల మధ్య తేలికగా దున్నడం వల్ల నేలపై ఏర్పడే గట్టి పొర తొలగి నీటి చొరబాటు మెరుగుపడుతుంది మరియు తేమ నష్టం తగ్గుతుంది. • సమయానికి కలుపు నివారణ: కలుపు మొక్కలు నేలలోని తేమను ఎక్కువగా వినియోగిస్తాయి. కాబట్టి వాటిని తొలగించడం ద్వారా ప్రధాన పంటకు తేమ ఎక్కువగా అందుతుంది. • వెడల్పు వరుసల సాగు: నీరు సులభంగా చొరబడేలా వెడల్పు బెడ్లు మరియు కాలువలు ఏర్పాటు చేయడం ద్వారా నీటి నిల్వ, పారుదల రెండూ మెరుగుపడతాయి. • సేంద్రీయ పదార్థాల వినియోగం పశువుల ఎరువు, కంపోస్ట్, పంట అవశేషాలను నేలలో కలపడం వల్ల నేల నిర్మాణం మెరుగుపడి నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం పెరుగుతుంది.
ప్రస్తుత వాతావరణ మార్పులు వ్యవసాయానికి ప్రధాన సవాలుగా మారాయి. అయితే అసాధారణ వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, తగిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలు చేయడం ద్వారా రైతులు పంట నష్టాలను తగ్గించుకొని స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం, వాతావరణ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం మరియు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేయడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చు.
ఇ. ప్రియాంకబాయి, రిసెర్చ్ అసోసియేట్, యాజమాన్య విభాగము, వ్యవసాయ పరిశోధన స్థానం, కదిరి. ఫోన్ : 7674886216