ఔషధ మొక్క… దేవ కాంచనం

దేవ కాంచనం ఒక చిన్న పరిమాణం నుండి మధ్య పరిమాణం కలిగి కాలానుగుణంగా ఆకులు రాల్చుతూ, వేగంగా పెరిగే పొద లేదా చెట్టు. ఈ చెట్టు గుండ్రని, వత్తయిన గుబురులాంటి క్యానపి, 10 మీ. ఎత్తు కలిగి, లేత కొమ్మలు మెత్తగా, నునుపుగా ఉంటాయి. పొడి వాతావరణం గల ప్రాంతాలలో చెట్టు పరిమాణం అతి చిన్నదిగా ఉంటుంది. బెరడు తెల్లబారిన బూడిద గోధుమ వర్ణంలో, నున్నగా, కొద్దిగా బీటలు వారిన పొలుసులు కలిగి ఉంటుంది. రెమ్మపుల్లలు సన్నని, లేత ఆకుపచ్చ రంగులో, కొంచెం నూగుతో, కోణాలు కలిగి గోధుమ బూడిద రంగులో ఉంటాయి. హార్ట్‌వుడ్ గోధుమరంగులో గట్టిగా మన్నిక కలిగి ఉంటుంది. ఆకులు సామాన్యంగా, ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. ఆకు ఆధారం గుండ్రంగా ఉండి 12 సెం.మీ. x 12 సెం.మీ. పరిమాణం, చివరి భాగం లోతుగా రెండు భాగాలుగా విడిపోయి ఉంటుంది. ఆకుపైభాగం, అడుగు భాగం నున్నగా, 9-12 ఈనెలు కలిగి ఉంటాయి. ఆకు కాడలు 2.5 – 3.5 సెం.మీ. పొడవుంటాయి. పూరెమ్మ 6-10 ఎరుపు, నీలం కలిసిన రంగు గల పూలను కలిగి ఉంటుంది. పూమొగ్గలు గద ఆకారంలో ఉంటాయి. కాయలు గోధుమ రంగులో 15-30 సెం.మీ. పొడవు, 1.5-2.5 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటాయి. కాయలో 10-15 మెరిసే గోధుమ రంగు గింజలు ఏర్పడతాయి..

సాధారణ నామం : పర్పుల్ బాహినియా/ఆర్కిడ్ ట్రీ / బటర్‌ఫ్లెå ట్రీ శాస్త్రీయ నామం : బాహినియా పర్పురియా కుటుంబం: ఫాబేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • దేవకాంచనం అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. దీని కషాయం అల్సర్లను నివారిస్తుంది. గాయాలు, దెబ్బలను నయం చేస్తుంది. బొబ్బలు, వ్రణాలను నయం చేయడానికి ఆకులను నూరి తయారు చేసిన పేస్టుని పూస్తారు.
  • కీళ్ళనొప్పులు, వాపులు తగ్గడానికి ఉపయోగిస్తారు. ఆస్త్మా, జలుబు, దగ్గులను తగ్గించడానికి ఉపయోగిస్తారు. వ్యాధులు, జలోదరం వంటి జబ్బులను నయం చేయడానికి సహాయ పడుతుంది. యాంటిక్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంది. దేవకాంచనం బెరడుని డయేరియా చికిత్సలో ఉపయోగిస్తారు. పూమొగ్గలను డిసెంట్రి, మొలల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • ఇది మహిళలకు మంచి ఔషధం. బహిష్టు సమయంలో అధిక రక్త స్రావాన్ని ఆపుతుంది. జంతువుల గాట్లకు మంచి మందు. వాయు రోగాన్ని తగ్గించడానికి రోజుకి రెండుసార్లు 10 మి.లీ. వేరు కషాయాన్ని త్రాగాలి. డయేరియా నివారణకు రోజుకి రెండు సార్లు వేరు కషాయం త్రాగాలి.
  • అల్సర్ల నివారణకు బెరడు కషాయంతో కడగాలి. 5 మి.లీ పూల కషాయం రోజుకి రెండు సార్లు త్రాగితే విరేచనాలవుతాయి.

వ్యవసాయరంగంలో

  • దేవకాంచనం ఆకు మిథనాల్ ద్రావణం వరి ధాన్యం నిల్వలో ఆశించే సైటోఫిలస్ ఒరైజెని 75% చంపింది దీనిని రసాయన పురుగు మందుకి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు (డెర్బాలా, అతని అనుచరులు, 2012).
  • దేవకాంచనం మిథనాల్ ద్రావణం గోధుమ ధాన్యం నిల్వలో ఆశించే ట్రోగోడెర్మా గ్రానేరియం పురుగులను చంపడంలో అధిక సామర్థ్యతను ప్రదర్శించింది (డెర్బాలా, 2012).
  • దేవకాంచనం వేడి నీటి ద్రావణం మామిడి పండ్ల నిల్వ సమయంలో ఆశించే ఆంత్రాక్నోస్ తెగులుని సమర్ధవంతంగా నివారించింది (విచమ్ కోర్ప్రాడిట్‌స్కల్, 1991).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

సూక్ష్మ జీవుల వృద్ధి కోసం… ఇ.ఎం. ద్రావణం

కావలసిన పదార్థాలు : మగ్గిన అరటి పండ్లు : 3 కిలోలు; బొప్పాయి పండ్లు (గింజలు తీసినవి) : 3 కిలోలు; గుమ్మడి పండ్లు (తొక్క తీసిన) : 3 కిలోలు; లేత కొబ్బరి నీరు : 300 మి.లీ.; కోడిగ్రుడ్లు : 2; నీరు : 10 లీటర్లు.

తయారు చేయు విధానం

  • పైన తెలిపిన పదార్థాలను (1, 2, 3) బాగా ముద్దగా చేసి ఒక కుండలో వేయాలి.
  • దానికి 10 లీ. నీటిని, 300 మి.లీ. లేత కొబ్బరి నీటిని మరియు 2 కోడిగ్రుడ్ల సొనని చేర్చాలి.
  • ఈ మిశ్రమాన్ని ఉంచిన కుండను గుడ్డతో కప్పి 45 రోజుల వరకూ నీడలో ఉంచాలి.
  • మధ్య మధ్యలో పై మిశ్రమాన్ని కర్రతో బాగా కలియబెట్టాలి. కషాయానికి 5 లీ. నీటిని చేర్చి పలుచని గుడ్డతో వడపోయాలి.
  • ఈ ద్రావణానికి 100 లీ. నీటిని చేర్చి ఒక ఎకరం పొలంలో పిచికారి చేయాలి.

ఎలా పనిచేస్తుంది?

  • పై ద్రావణంలో చాలా రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి భూసారం పెంచడంలో ఉపయోగపడతాయి.
  • ఈ ద్రావణంలో ఉన్న పోషకాల వల్ల పంటలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి.
Read More

పండ్లలో చక్కెర శాతం పెంపునకు… పులిసిన పండ్ల రసం ద్రావణం

పులియబెట్టిన పండ్ల రసాల్లో ఉన్న పలురకాల సూక్ష్మజీవుల చర్య వలన ఇవి పంటలలో చక్కెర శాతాన్ని పెంచడానికి దోహదపడతాయి.
కావలసిన పదార్థాలు : బాగా మగ్గిన పండ్లు : 1 కిలో (అరటి, మామిడి, బొప్పాయి, మొ॥); బెల్లం : 1 కిలో.

తయారు చేసే పద్ధతి

  • ఒక కిలో బాగా మగ్గిన పండ్లను బాగా ముద్దగా చేసి దానికి ఒక కిలో మెత్తగా చేసిన బెల్లాన్ని కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని ఒక కుండలో పోయాలి.
  • కుండను ఒక గుడ్డతో మూతకట్టి దానిని ఒక నీడ ప్రదేశంలో వారం రోజులపాటు ఉంచాలి.
  • ఈ విధంగా బాగా పులిసిన ద్రావణం సుమారు 2.5 లీటర్ల వరకు ఉంటుంది.
  • ఈ మిశ్రమాన్ని వడపోసి 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరా పంట పొలంలో పిచికారి చేయాలి.

ఉపయోగాలు :

  • పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు. ఈ ద్రావణాన్ని అన్ని పండ్ల తోటలలో వాడవచ్చు.
  • ద్రావణాన్ని తయారు చేసిన వెంటనే ఉపయోగించుకోవాలి. నిల్వ ఉంచరాదు.
Read More

పొటాష్‌కు పొగాకు ద్రావణం

మొక్కల ఎదుగుదలలో కీలకపాత్ర పోషించే పొటాషియంను అందించడానికి సులభ రీతిలో పొగాకు ద్రావణాన్ని తయారుచేస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో తయారుచేసే ఈ ద్రావణాలు రైతులకు ఎంతో ఉపయోగకరం.

పొగాకు కాడలను ముక్కలుగా చేసుకుని ఒక కిలో కాడలకు ఏడు లీటర్ల నీటిని కలిపి ఏడు రోజుల పాటు నానబెట్టాలి. దీనివల్ల నీటిలో కరిగే పొటాష్ తయారవుతుంది. అరటి పండు ద్వారా కూడా పొటాష్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు.

లీటర్ నీటికి మూడుశాతం ద్రావణాన్ని కలిపి ఇవ్వడం వల్ల మొక్కకు కావలసిన పొటాష్‌తో పాటు తెగుళ్ల బెడద తగ్గుతుంది.

Read More

వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వివిధ పంట రకాలు, ప్రయోజనాలు

పప్పు ధాన్యాలు ` నూనెగింజలు

మినుము :
ఆంధ్ర రాష్ట్రంలో మినుము 9.71 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, దాదాపు 3.65 లక్షల టన్నుల ఉత్పత్తిని, సగటున ఎకరాకు 376 కిలోల దిగుబడి నిస్తుంది. రాష్ట్రంలో మినుమును తొలకరిలో, రబీలో మరియు వేసవిలో వరి కోతల తర్వాత పండిస్తారు.

మినుము పంటను జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. మినుములో అనువైన రకాలు :

జి.బి.జి-1 : ఈ రకం పంట కాలం 70-75 రోజలు, దిగుబడి 8-9 క్వింటాళ్ళు. ఇది పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. అన్ని కాలాలకు అనువైన రకం ఇది. వ్యవసాయ పరిశోధనా స్థానం, ఘంటశాల, కృష్ణాజిల్లా నుండి లభ్యం అవుతుంది- 9248838628

టి.బి.జి. 104 : పంట కాలం- 70-75 రోజలు, దిగుబడి, 8-9 క్వింటాళ్ళు. పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. ఇది అన్ని కాలాలకు అనువైన రకం. ఇది కృషి విజ్ఞాన కేంద్రం, దర్శి, ప్రకాశం జిల్లా నుండి లభ్యం అవుతుంది – 9989623827.

ఎల్.బి.జి-352: ఈ రకం పంట కాలం 75-80 రోజలు . దిగుబడి 6-7 క్వింటాళ్ళు. వరి మాగాణుల్లో ఆలస్యముగా విత్తుటకు కూడా అనువైన రకం. ఇది కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటశాల, కృష్ణా జిల్లా నుండి లభ్యం అవుతుంది – ఫోన్ నంబర్- 8008201253.

ఎల్.బి.జి`904 మరియు టి.బి.జి-129 రకాలు కెవికె, రెడ్డిపల్లి, అనంతపూరం జిల్లా నుండి లభ్యం అవుతున్నాయి – ఫోన్ నెంబర్ -9989623825

పెసర :
ఆంధ్ర రాష్ట్రంలో పెసర సాగు విస్తీర్ణం 2.59 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, దాదాపు 0.81 లక్షల టన్నుల ఉత్పత్తిని, సగటున ఎకరాకు 313 కిలోల ఉత్పాదకతనిస్తుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో తొలకరి పంటగాను, కోస్తా ఆంధ్రలో తొలకరి మరియు రబీ పంటగా పండిస్తారు. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో, వేసవిలో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలో మూడవ పంటగాను పండిస్తున్నారు. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు ఆలస్యంగా పడే ప్రాంతాల్లో వరి కంటే ముందు పెసరను పండించవచ్చు. కంది, ప్రత్తి మరియు పండ్ల తోటలలో అంతర పంటగా కూడా పండించవచ్చు.

ఎల్.జి.జి-574: ఈ రకం పంట కాలం 65-70 రోజులు. దిగుబడి 6 నుండి 7 క్వింటాళ్ళు. ఇది పల్లాకు తెగులును తట్టుకుంటుంది. ఈరకం కెవికె, రెడ్డిపల్లి అనంతపురం నుండి లభిస్తుంది – 9989623825.

డబ్ల్యు.జి.జి.-42: ఇది ఖరీఫ్ పంటకు అనుకూలం, పంట కాలం 55-60 రోజులు. 4-6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉండి మెరుస్తుంటాయి. ఇవి కెవికె, ఊటుకూరు, వై.యస్.ఆర్. కడప జిల్లాలో లభ్యం అవుతాయి. ఫోన్ నెంబర్:9848809236,

కంది : అనువైన రకాలు ఎల్.ఆర్.జి-52 రకం. వ్యవసాయ పరిశోధనా స్థానం, గరికపాడు, ఎన్.టి.ఆర్. జిల్లా నుండి లభ్యం అవుతుంది. ఫోన్ నెంబర్-9491003499 మరియు టి.ఆర్.జి.-59 మరియు జి.ఆర్.జి-152 రకాలు కెవికె, బనవాసి నుండి అభ్యం అవుతున్నాయి – 8074420092.

వేరుశనగ : పంట కాలం 105-110 రోజులు. ఇందులో కదిరి లేపాక్షి రకం తీవ్ర బెట్ట పరిస్థితులను తట్టుకుని 6-8 క్వింటాళ్ళు దిగుబడి ఇస్తుంది. ఈరకం కెవికె, రెడ్డిపల్లిలో లభ్యం అవుతుంది -9989623825, కదిరి చిత్రావతి కూడా లభ్యం అవుతుంది. కె-6, కదిరి, అమరావతి రకాలు వ్యవసాయ పరిశోధనా స్థానం, కదిరి నుండి లభ్యం అవుతున్నాయి. సంప్రదించవలసిన నంబరు – 9490081470. విశిష్ట రకం వ్యవసాయ పరిశోధనా స్థానం, ఊటుకూరు నుండి లభ్యం ఆవుతుంది. ఫోన్ నెంబర్ – 7981982531.

నువ్వులు : నువ్వులలో YLM-66 రకం,YLM-17 రకం ఖరీఫ్‌కు అనువైనవి. పంటకాలం 75-80 రోజులు, దిగుబడి 5-6 క్వింటాళ్ళు. ఇవి రాయలసీమకి ఆనుకూలం. వ్యవసాయ పరిశోధనా స్థానం, యలమంచిలి, అనకాపల్లి జిల్లా నుండి లభిస్తుంది. ఫోన్ నెంబర్: 9440977352, 9849275470.

ఆముదం : ఆముదం పంట కాలం 90-150 రోజులు, దిగుబడి 6 – 7 క్వింటాళ్ళు. ఇందులో కిరణ్ రకం బెట్టను తట్టుకుంటుంది. బూజు తెగులు తక్కువ. డి.సి.ఎస్-107 మరియు ప్రగతి ఎండు తెగులును తట్టుకుంటుంది. ఐ.సి.హెచ్- 66 ఎండు తెగులు మరియు బెట్టను తట్టుకుంటుంది. ఇవి వ్యవసాయ పరిశోధనా స్థానం అనంతపురం నుండి లభ్యం అవుతున్నాయి. ఫోన్ నెంబర్: 9989210879.

వరితో పోల్చితో చిరుధాన్యాల్లో అధిక పోషక విలువలు ఉన్నాయి. వీటిలో అధిక మాంసకృకృత్తులతో పాటుగా మంచి అమైనో ఆమ్లాలు ఉంటాయి. పిండి పదార్థాలు తక్కువ. పీచు పదార్థం ఎక్కువ ఉండి రాగి, కాల్షియం అధిక మోతాదులలో ఉంటాయి. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల ఏర్పడే తీవ్ర కరువు ప్రభావాన్ని తగ్గించడానికి, రైతులు అధిక నీటి అవసరం ఉన్న పంటలను కాక నీటి ఎద్దడిని తట్టుకునే చిరుధాన్యాలను సాగు చేసుకున్నట్లయితే తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడులను సాధించవచ్చు.

జొన్న: ఇది అధిక కరువు నిరోధకత కలిగిన పంట. దీని లోతైన “వేరువ్యవస్థ కారణంగా సుదీర్ఘ వర్షాభావ పరిస్థితులను తట్టుకోగలదు. ముఖ్యంగా చిరుధ్యాల సాగు అధికంగా ఉండే రాయలసీమ జిల్లాల్లో ఒకటైన కడపలో ఇటీవల కాలంలో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. నల్లరేగడి నేలలుండి కెసి కెనాల్ ఆయకట్టు ప్రాంతాలైన ప్రొద్దుటూరు మరియు పులివెందుల ప్రాంతాలలో NTJ NJ-1 CSV-29 రకాలను సాగు చేయవచ్చు. అలాగే ఇవి ధాన్యం మరియు పశుగ్రాసం రెండింటిని అందిస్తాయి. సజ్జ పంట విషయానికి వస్తే తక్కువ తేమగల నల్లరేగడి నేలలలో ABH-1, CTP-8203 హైబ్రిడ్ రకాలను ఎంచుకోవచ్చు. ఆలస్యమైనా ఖరీఫ్ సీజన్‌లో ఆగష్టు రెండవ వారం నుండి సెప్టెంబర్ మొదటి వారం లోపు వేసుకోవచ్చు. ఎర్రనేలలు అధికంగా ఉన్న జమ్మలమడుగు మండలంలో కొర్రలు(స్వల్పకాలిక రకాలు) సియా`3223 (రేనాడు/గరుడ) లేదా సూర్యనంది వంటి అధిక దిగుబడులు ఇచ్చే రకాలు నాటుకోవచ్చు.

రాగి రకాలు చూసినట్లయితే గౌతమి (PR) వకుళ, చైతన్య మరియు ఇంద్రావతి వర్షాధార పరిస్థితులకు అనుకూలం. ఈ రకాలు బ్లాస్ట్ తెగులు మరియు తేమ ఒత్తిడిని అధికంగా తట్టుకుంటాయి. పంట ఏది వేసినా విత్తనశుద్ధి తప్పకుండా చేయాలి. సాళ్ళలో నాటడం వలన అప్పుడప్పుడు పడిన వర్షం బొట్టును కూడా ఒడిసి పట్టుకుని పంట నిలబడుతుంది. అలాగే అంతర పంటల సాగుకు కూడా అనుకూలం. కొర్ర లేదా జొన్నను కంది తో కలిపి 4:1 లేదా 5:1 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకోవచ్చు. విత్తనం కొరకు భారత చిరుధ్యాల పరిశోధనా సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు.ఫోన్ నంబరు : 040 – 24599300.

నీటి ఎద్దడిని తట్టుకునే పశుగ్రాస రకాలు
నీటి ఎద్దడిని (Drought) తట్టుకుని, తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పశుగ్రాస రకాలు పాడి రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అనంతపురం, వై ఎస్ ఆర్ కడప జిల్లాల పరిసర ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు ఈ క్రింది రకాల పశుగ్రాసాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి:

ధాన్యపు జాతి పశుగ్రాసాలు:

జొన్న గడ్డి రకాలు :
ఏకవార్షికాలు – పి.సి -9, ఎం.పి. చారి, పంత్ చారి-5,7, సి.ఎస్.వి. -30F,
32F,

బహు వార్షికాలు – ఎస్. ఎస్. జి 59 -3 , పూస చారి – 6, 23, సి.ఎస్.వి. -33 COFS 29 (కోఎస్ఎస్ 29) COFS 31 (కోఎస్ఎస్ 31). బహుళ కోతలు (మల్టీ కట్) జొన్న రకాలు. కరవును తట్టుకుని, వర్షాలు పడగానే మళ్లీ చిగురిస్తుంది.

సోర్గమ్ -సూడాన్ గడ్డి (SSG): ఇది జొన్న మరియు గడ్డి జాతుల సంకరం. ఇందులో కాండం మందంగా ఉండి రసం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రతలను సైతం తట్టుకుని పెరుగుతుంది
సజ్జ గడ్డి రకాలు : జైంట్ బాజ్ర , ఎస్ – 530, జె-55 , కె – 533

కాయజాతి (లెగ్యూమ్) పశుగ్రాసాలు:
హెడ్జ్ లూసర్న్ (దశరథ గడ్డి): ఇది బహువార్షిక (3-4 ఏళ్లు వచ్చే) పశుగ్రాసం. ఇందులో ప్రోటీన్లు ఎక్కువ. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది.

అలసందలు / బొబ్బర్లు: వర్షాభావ పరిస్థితుల్లో స్వల్పకాలికంగా పండించడానికి ఇది అనువైన పశుగ్రాసం.
స్టైలో హేమాటా – ఇది నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. దీనిని వర్షాధారంగా సారవంతం కాని భూముల్లో సాగుచేయవచ్చు. భూసారాన్ని పెంచుతుంది. మిశ్రమ పంట లాగా తోటల్లో సాగు చేయవచ్చు.

గడ్డి జాతులు:
బాజ్రా నేపియర్ హైబ్రిడ్ : నేపియర్ రకాల వేర్లు లోతుగా చొచ్చుకుపోయి నీటిని గ్రహిస్తాయి కాబట్టి కరవును తట్టుకుంటాయి.

అంజన్ గడ్డి – ఇసుక నేలల్లో కూడా సాగు చేయవచ్చు. తోటల్లో మిశ్రమ పంటగా సాగు చేసుకోవచ్చు
గిన్ని గడ్డి – ఇది నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో బాగా అనువైన రకం.

చెట్ల మేత:
సుబాబుల్ మరియు అవిశ: నీరు లేని సమయాల్లో వీటి కొమ్మలు, ఆకులను పశువులకు మేతగా వేయవచ్చు.

విత్తనాలు లభ్యత :
పశుగ్రాస విత్తనాలను ఆంధ్రప్రదేశ్ లోని పశువైద్య విశ్వ విద్యాలయ పరిధిలోని పరిశోధన కేంద్రాలు, ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణ కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు లేదా వ్యవసాయ సంభందిత ఆన్లైన్ ప్లాట్ ఫారముల ద్వారా పొందవచ్చు.

రైతుల సమాచారం కోసం కెవికె శాస్త్రవేత్తలచే రూపొందించబడినది. సంప్రదించవలసిన చిరునామా, కెవికె, ఒనిపెంట`9398982828, 7032463875, 8121136184

డా. శ్రీవిద్య రాణి.ఎన్, శాస్త్రవేత్త, విస్తరణ విభాగం , డా.బి.ఎస్.కాంతి శ్రీ, శాస్త్రవేత్త, గృహవిజ్ఞాన విభాగం, డా. టి.విజయ నిర్మల, శాస్త్రవేత్త, పశుపోషణ విభాగం. Ph: 93989 82828

Read More

మొక్క వేర్ల పెరుగుదలను పెంచే ట్రైకోడెర్మా, సూడోమోనాస్

సహజ జీవ నియంత్రణ కారకాలుగా, జీవ ఎరువులుగా వీటిని ఉపయోగిస్తారు. వీటిని నేల ద్వారా వ్యాపించే శిలీంధ్ర వ్యాధికారకాలను అణచివేయటానికి, వేర్ల పెరుగుదలను మెరుగుపరచటానికి, పంట దిగుబడులను పెంచడానికి, నేలలోని పోషకాలను కరిగించడానికి ఉపయోగిస్తారు.

తయారీకి కావలసిన పదార్థాలు : ట్రైకోడెర్మావిరిడె మదర్ కల్చర్, సూడోమోనాస్ మదర్‌కల్చర్, బెల్లం – 20 గ్రా.; ఈస్టు – 5 గ్రా.; ప్రెజర్‌కుక్కర్ – 10 లేదా 15 లీటర్లది; స్టీలు డబ్బాలు మూతగలవి; స్పిరిట్ లేదా డెటాల్, గ్యాస్ స్టవ్, ప్లాస్టిక్ బాటిల్స్ – 1 లేదా 2 లీటర్లవి.

తయారీ విధానం : ప్రెజర్‌కుక్కర్‌లో శుభ్రపరచిన స్టీలు డబ్బాని పెట్టి డబ్బా చుట్టూ అంగుళం మేర ఖాళీ ఉండునట్లు చూడాలి. ఈ స్టీలు డబ్బాలు 4 లేదా 8 లేదా 12 లీటర్ల పరిమాణంలో ఉండాలి. ఎంపిక చేసుకున్న కుక్కర్ పరిమాణాన్ని బట్టి డబ్బాల ఎంపిక ఉండాలి. ఎంపిక చేసుకున్న స్టీలు డబ్బాలో సూచించిన పరిమాణంలో నీరు, బెల్లం, ఈస్టు తీసుకోవాలి. నాలుగు లీటర్ల నీరు తీసుకున్నట్లయితే 80 గ్రా. బెల్లం, 20 గ్రా. ఈస్టు కలపాలి. డబ్బా మూతని బిగుతుగా బిగించి పెట్టాలి. కుక్కర్‌లో కూడా నీరు పోసి, మూత పెట్టి పైన విజిల్ పెట్టి స్టవ్ మీద వేడి చేయాలి. మొదటి విజిల్ సుమారు గంట తర్వాత వస్తుంది. తొలి విజల్ వచ్చిన మరో 40 నిమిషాలపాటు వేడి చేయాలి. బెల్లం నీరు మరిగి సూక్ష్మజీవుల రహితంగా మారుతుంది. స్టవ్ ఆపివేసి కుక్కర్‌ని దించి గది వాతావరణంలో చల్లబడిన తర్వాత స్టీల్ డబ్బాలోని బెల్లం ద్రావణాన్ని సీసాల్లో మూడవ వంతు వరకు నింపి దూదితో చేసిన ప్లగ్‌లు (బిరడాలు) పెట్టాలి. మార్కర్‌తో సూడోమోనాస్, ట్రైకోడెర్మావిరిడె వంటి లేబిల్స్‌ని సిద్ధం చేసుకోవాలి. సీసాలకు లేబిల్స్ అతికించిన తర్వాత ఆయా సీసాల్లో ఆయా శిలీంద్రం, బాక్టీరియా మదర్ కల్చర్ని ఒక చెంచా చొప్పున కలిపి బిరడా పెట్టుకోవాలి. ఒక వారం రోజుల వరకు ప్రతి రోజు సీసాలను ఊపుకోవాలి.

వాటి మదర్ కల్చర్లను  వ్యవసాయ పరిశోధనా స్థానాల నుండి పొందవచ్చు. ఒకసారి మదర్ కల్చర్ని సేకరించుకుంటే దాన్ని పునరుత్పత్తి చేసుకోవచ్చు. ఒకసారి తయారు చేసుకున్న తర్వాత 6 నెలల వరకు ఇవి నిల్వ ఉంటాయి.
Read More

నేలసారాన్ని పెంచే అమృత జలం

ఇది నేలసారాన్ని మెరుగుపరచి, ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను వృద్ధిచేస్తుంది. మొక్కలు బలంగా, ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడుతుంది. సేంద్రియ మరియు సహజ వ్యవసాయానికి ఇది చాలా అనువైనది.

మోతాదు: ఎకరాకు 200 లీటర్లు సాగు నీరు ద్వారా గానీ, భూమిపైన గాని చల్లాలి.

కావలసిన పదార్థాలు : ఆవుపేడ: 10 కేజీలు; ఆవు నెయ్యి : 250 గ్రాములు; తేనె / నల్లబెల్లం : 500 గ్రాములు.

తయారు చేయు విధానం: ముందుగా ఆవుపేడ మట్టి కుండలో వేసి పావుకిలో ఆవునెయ్యి వేసి సుమారు 2 గంటలు బాగా కలిపి తర్వాత తేనె లేక బెల్లపు నీరు (అరకేజి బెల్లంకు అర లీటరు నీరు) పోసి 2 గంటలు ఆవుపేడను బాగా పిసుకుతూ కలపాలి. తర్వాత నీటిలో కళ్ళాపిలాజేసి 200 లీటర్ల డ్రమ్ములో పోసి డ్రమ్మునిండా నీరు పోస్తూ కలుపుతుండాలి. డ్రమ్ము నింపిన తర్వాత మిశ్రమాన్ని సుమారు 3 లేక 4 గంటలు కర్రతో త్రిప్పి ఆ తర్వాత ఎకరం పొలంలో కళ్ళాపిలా చిమ్మడం గాని లేక పారుతున్న నీటిలో పోస్తూ గాని భూమికివ్వాలి.

Read More

మొక్క పెరుగుదలకు దోహదపడే ‘చేప కునప జలం’

కావలసిన పదార్థాలు:
తాజా చేప ముక్కలు : కిలో
దేశీ ఆవు మూత్రం : 5 లీటర్లు, నల్లబెల్లం – కిలో
దేశీ ఆవు నెయ్యి : 50 గ్రా, తేనె – 50 గ్రా

చేప కునప జలం ఇంచుమించు ‘మీనామృతం’ మాదిరిగానే పంటలపై పనిచేస్తుంది.

తయారుచేసే పద్ధతి: ఒక కిలో తాజా చేపలను ముక్కలుగా కోయాలి. వాటికి ఒక కిలో నల్లబెల్లం పొడిని కలపాలి. 50 గ్రాముల ఆవు నెయ్యి, 50 గ్రాముల తేనె కూడా కలిపి 30 నిమిషాలు ఉంచాలి. తరువాత ఒక మట్టికుండలో గాని, ప్లాస్టిక్ పాత్రలో గాని 5 లీటర్ల ఆవు మూత్రం పోసి అందులో ఈ మిశ్రమాన్ని కలపాలి. పాత్ర మీద మూత ఉంచి శుభ్రమైన గుడ్డతో బిగించి కట్టాలి. రోజుకొకసారి ఈ మిశ్రమాన్ని కలుపుతూ 20 రోజుల పాటు చల్లని గదిలో ఉంచి మురగబెట్టాలి. తయారైన చేప కునప జలాన్ని వడకట్టి వాడుకోవచ్చు. 100 లీటర్ల నీటికి 3 లీటర్ల చొప్పున దీన్ని కలిపి మె°క్కలపై పిచికారీ చేయాలి. ఇది 2 నెలల వరకు నిల్వ ఉంటుంది.

వాడే విధానం : 3 నుండి 5 శాతం ద్రావణాన్ని ఏ పంటపైనయినా ఉదయం, సాయంత్రం వేళల్లో పిచికారి చేయవచ్చు.

ఫలితాలు :

  • భూమికి అద్భుతమైన పోషకాలనందిస్తుంది.
  • మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది.
  • దీనిని సులభంగా తయారు చేయవచ్చు.
  • మొక్కలకు అద్భుతమైన టానిక్‌లా పనిచేస్తుంది.
Read More

తక్కువ ఖర్చుతో ఏడాది పొడవునా ఆకుకూరల సాగు

భారతీయ వ్యవసాయ రంగంలో నూతన ఒరవడులు సృష్టిస్తూ, మన రైతులు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు తీస్తున్నారు.

మానవ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఆకుకూరలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. విటమిన్లు, ఖనిజ మూలకాలు, పిండి పదార్థాలు, మాంసకృత్తులు మరియు పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆకుకూరలను నిత్యం 125 గ్రాముల చొప్పున తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. కాగా, మార్కెట్లో వీటికి ఉన్న నిరంతర డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, సరైన యాజమాన్య పద్ధతులతో సాగు చేపడితే ఆకుకూరల ద్వారా రైతులకు గరిష్ట లాభాలు లభిస్తాయి.”

ఆకుకూరలు తక్కువ కాలంలో (20-30 రోజులు) మరియు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే పంటలు. తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర వంటివి నేరుగా విత్తనాలు చల్లి అన్ని కాలాల్లోనూ (వారానికి/పదిహేను రోజులకు ఒకసారి విత్తనాలు వేసుకోవడం ద్వారా) విజయవంతంగా సాగు చేయవచ్చు.

గోంగూర సాగు:
ఆకుకూరలన్నింటి కంటే గోంగూర రుచి ఎక్కువ. నీరు నిల్వ ఉండని తేలికపాటి గరప నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు నేలలు గోంగూర సాగుకు చాలా అనుకూలం. ఇది ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు. ఏఎన్‌జిఆర్ఏయూ1 ఇది ఎర్ర గోంగూర రకం. విత్తనాలు నాటిన 30 నుండి 35 రోజులకే పంట కోతకు వస్తుంది. నీటి వసతి కలిగిన భూముల్లో ఒక ఎకరానికి దాదాపు 4 – 6 టన్నుల దిగుబడిని పొందవచ్చు.

పాలకూర:
పాలకూర మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర. లేత ఆకులను కాండంతో సహా కూరగా వాడుతారు. ఇందులో అధికంగా విటమిన్ ‘ఎ’, ‘సి’, కాల్షియం మరియు ఇనుము వున్నవి. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో మంచి లాభాలను అందించే ఆకుకూర. అన్ని రకాల నేలల్లో సాగుచేయవచ్చు. కాని ఇసుకతో కూడిన ఎర్ర నేలల్లో అధిక దిగుబడినిస్తుంది. ఆల్ గ్రీన్, పూస, అర్క, అనుపమ, రకాలు అనుకూలం. ఎకరానికి 10 – 12 కిలోల విత్తనం అవసరం. మడుల్లో సాలుకు 10 – 20 సెం.మీ దూరం నాటుకోవాలి. 25 – 30 రోజుల్లో కోతకు వస్తుంది. ఆల్‌గ్రీన్ రకం ఆకులు, కాడలు ఆకుపచ్చ రంగులో వుంటాయి. ప్రతి 15-20 రోజులకొక కోత తీసుకోవచ్చు. ఎకరాకు 6-7 కోతలకు 5 టన్నుల దిగుబడి నిస్తుంది.

తోటకూర: తోటకూరను సాగు చేయడానికి ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. వివిధ శీతోష్ణస్థితుల్లో పెంచేందుకు తోటకూర చాలా అనువైంది. నీరు నిలిచే బంకమట్టి, ఇసుక నేలలు దీనికి పనికిరావు. జూన్ నుండి అక్టోబర్ వరకు జనవరి నుండి మే నెల మధ్య విత్తనాలు వేయాలి. అర్క వర్ణ, కో-1, కో-2, కో-3, కో-4, అర్కా సుగుణ వంటి రకాలు ఎంపిక చేయవచ్చు. ఎకరాకు 1 కిలో విత్తనం సరిపోతుంది. విత్తనం వెదజల్లితే ఎకరాకు 2 కిలోల విత్తనం కావాలి. విత్తేటప్పుడు పది రెట్లు ఇసుక కలిపి చల్లాలి. విత్తిన 25 రోజులకు కోత మొదలవుతుంది. మొదటి కోత తర్వాత ప్రతి పది రోజులకు కోత తీయవచ్చు. దిగుబడి 4 నుండి 5 టన్నులు వస్తుంది.

బచ్చలికూర :
బచ్చలిని ఇండియన్ స్పినాచ్ లేదా మలబార్ స్పినాచ్ అని పిలుస్తారు. ఈ పంట భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో సాగవుతోంది. బచ్చలి కూర అధిక మోతాదులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుమును సరఫరా చేస్తుంది. అంతేకాకుండా విటమిన్ ‘ఎ’, ‘సి’ లను కలిగి ఉంటుంది. లేత కాడలలో కూడా విటమిన్ ‘ఎ’ ఎక్కువగా ఉంటుంది. బచ్చలి కూరను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. కాని అధిక దిగుబడి కోసం ఇసుకతో కూడిన గరప నేలలు చాలా అనుకూలమైనవి. ఎకరాకు 5 – 6 కిలోల విత్తనం అవసరం. వర్షాకాలంలో జూన్ నుండి జూలై వరకు నాటుకోవచ్చు. . దిగుబడి 4 నుండి 6 టన్నులు వస్తుంది.

చుక్క కూర:
చుక్కకూరలో సమృద్ధిగా ఉండే పీచు పదార్థాలు (ఫైబర్), తిన్న ఆహారం త్వరగా మరియు సులభంగా జీర్ణమవడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఏడాది పొడవునా దీన్ని సాగు చేయవచ్చు. నల్లరేగడి భూములు అనుకూలం. ఎకరాకు 6-8 కిలోల విత్తనం అవసరం. విత్తిన నెల తర్వాత కోత కోయవచ్చు. పంటకాలం 3 నుండి 4 నెలలు 20 నుండి 30 – 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.

కొత్తిమీర:
కొత్తిమీర ఆకులతో పాటు విత్తనాల (ధనియాలు) ఉత్పత్తి కొరకు సాగయ్యే కొత్తిమీర, వంటల్లో సువాసనను, రుచిని పెంచడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. పోషక విలువల పరంగా చూస్తే.. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, సుగంధ తైలాలు, పీచు పదార్థాలు మరియు విటమిన్-కె, ఎ, సి వంటి కీలక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే విశేష గుణాలు ఉండటం వల్ల, దీనిని జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలకు ఔషధంగానే కాకుండా వివిధ ఆయుర్వేద చికిత్సల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. కొత్తిమీరను దాదాపు అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. అయితే, వర్షాధార పంటగా పండించేటప్పుడు మాత్రం మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్న బంక నేలలు అత్యంత శ్రేష్ఠమైనవి. ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనాలు అవసరం. సురుచి, సుగుణ, సాధన, సింధు ముఖ్యమైన రకాలు అందుబాటులో ఉంటాయి. విత్తిన నెలకే కోతకు వస్తుంది. ఎకరాకు 15 నుండి 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది.

పుదీన:
పుదీనాను అటు ఆకుకూరగాను, ఇటు సుగంధ తైలం ఉత్పత్తి కొరకు విరివిగా సాగు చేస్తారు. మనదేశంలో జపనీస్ పుదీనాకు ఎక్కువ గిరాకీ ఉంది. దీని నుండి తీసే తైలాన్ని సుగంధ పాన్‌మసాలాల తయారీలోనే కాకుండా.. దగ్గు, జలుబు, నొప్పుల నివారణ ఔషధాలలోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. ఉష్ణ వాతావరణంలో బాగా పెరుగుతుంది. చలి, మంచు అనుకూలించవు. ఎర్రనేలలు మరియు నల్ల నేలలు అనుకూలం. జపాన్ పుదీన, కోసి, హిమాలయ, శివాలిక్ రకాలు అందుబాటులో ఉంటాయి. నాటిన నాలుగు నెలలకు కోత ఆరంభమవుతుంది. ఎకరానికి 12-16 టన్నులు దిగుబడి వస్తుంది.

మెంతి కూర:
దీనిని ఆకుకూరగాను, గింజలను పచ్చళ్ళలోను ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్య పంటల్లో ఇదోకటి. ఈ పంట సాగుకు చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రత మరియు తగినంత తేమ అనుకూలం. వర్షాధారం కింద నల్లరేగడి నేలల్లో, నీటి వసతి కింద గరపనేలలు, ఎర్రనేలలు మరియు ఇతర లేతపాటి నేలల్లో సాగుకు అనుకూలం. విత్తనాల్లో గుజరాత్ మెంతి-1 రకం అనువైనది. ఎకరాకు 6 నుండి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తిన తర్వాత 25 నుండి 30 రోజుల్లో మొదటి కోత తీసుకోవచ్చు. పక్షం రోజులకొకసారి చొప్పున మూడు సార్లు కోత కోయవచ్చు. ఎకరానికి 4-5 టన్నులు దిగుబడి వస్తుంది.

బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట,
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU). Ph: 8374275258

Read More

‘మీనామృతం’తో మునగకు రక్ష!

సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం వంటి సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో ఆధునిక క్రిమిసంహారకాలకు దీటైన లేదా పోల్చదగిన ప్రత్యామ్నాయాలు లభించకపోవటం ఒక ప్రధాన సమస్య. అయితే, చేప ద్రావణాలతో ఉద్యాన పంటల్లో చీడపీడల యాజమాన్యంలోనూ అద్భుత ఫలితాలు సాధించవచ్చని డా॥ గున్నంరెడ్డి శ్యామసుందర్‌రెడ్డి పరిశోధనలో తేలింది. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఆవరణలో ‘సస్యశ్యామల కృషివనం’ ప్రకృతి సేద్య పరిశోధనా క్షేత్రంలో ఆయన స్థిరపరచిన ‘మీనామృతం’, ‘మత్స్య సంజీవని’ మునగ పంటపై అద్భుతమైన ఫలితాలనిచ్చింది. చేప కషాయం, చేప అమైనో ఆమ్లాలు, చేప కునప జలం వంటివి కూడా వివిధ ఉద్యాన పంటల్లో చీడపీడల యాజమాన్యంలోను, పోషకాలను, వృద్ధి కారకాలను అందించడంలోను, భూసారాన్ని పెంపొందించడంలోను ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటున్నాయి.

మునగ పంటకు ఆకుచుట్టు పురుగు ఒక ప్రధానమైన సమస్య. సేంద్రియ పద్ధతిలో మునగ పండించే రైతులకు, మరీ ముఖ్యంగా ఎగుమతి కోసం మునగ ఆకు పండించే రైతులకు ఈ పురుగు సింహ స్వప్నంగా మారింది. తల్లి పురుగులు (సీతాకోకచిలుకల వంటివి) పెట్టిన గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఆకులపైన, లేత రెమ్మలపైన ఉన్న పత్రహరితాన్ని గోకి తినటం మొదలుపెడతాయి. లార్వాలు పెరుగుతున్న కొలదీ ఇతర భాగాలకు పాకుతూ ఆకులను, లేత చిగుళ్లను, పూమొగ్గలను తింటూ బతుకుతాయి. లేత పిందెలు, పెరుగుతున్న కాయల మీద ఉన్న పత్రహరితాన్ని కూడా గోకి తింటాయి. లార్వాలు మొక్క పైకి, కిందకీ చురుకుగా కదులుతూ కొత్తగా వస్తున్న చిగుళ్లను ఎప్పటికప్పుడు తినేస్తూ ఉండటం వలన మొక్క మోడులా మారిపోతుంది. లేత మునగ మొక్కలకు ఇది ఆశిస్తే ఆ మొక్కలను పూర్తిగా నాశనం చేస్తుంది. మీనామృతాన్ని ఐదు రోజులకొకసారి మూడుసార్లు పిచికారీ చేస్తే మునగ ఆకు చుట్టు పురుగు జాడ లేకుండా పోతుంది.

మీనామృతం తయారీకి కావాల్సిన వస్తువులు: తాజా చేప ముక్కలు: 1 కిలో; దేశీ ఆవు మూత్రం : 5 లీటర్లు; నల్ల బెల్లం : 1 కిలో; తాటికల్లు : 1 లీటరు; దేశీ ఆవు నెయ్యి : 50 గ్రాములు; తేనె : 50 గ్రాములు

తయారీ పద్ధతి: మీనామృతం రెండు దశల్లో తయారవుతుంది. ఇందుకు మొత్తం 20 రోజులు పడుతుంది. సిద్ధమైన మీనామృతం 6 నెలలు నిల్వ ఉంటుంది. ఒక కిలో తాజా చేపలను చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. కిలో బెల్లాన్ని పొడి చేయాలి. ఈ రెంటినీ కలిపి అరగంట సేపు ఉంచాలి. చేపను ముక్కలు చేయక ముందే శుభ్రంగా కడగాలి. చేప ముక్కలను కడగకూడదు. చేప తోక, రెక్కలు, మొప్పలు వంటి సులభంగా కుళ్లని భాగాలను తీసివేయాలి. ఒక మట్టికుండలో 5 లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని తీసుకొని చేప ముక్కలు, బెల్లం మిశ్రమాన్ని అందులో వేయాలి. తరువాత కుండపై మూత ఉంచి శుభ్రమైన గుడ్డతో మూతి బిగించి కట్టాలి. ఎట్టి పరిస్థితిల్లోనూ ఈగలు, ఇతర కీటకాలు లోనికి వెళ్లే అవకాశం ఇవ్వకూడదు. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఒక పరిశుభ్రమైన తడి లేని కర్రతో ద్రావణాన్ని నిమిషం పాటు కలియబెడుతూ ఉండాలి. పది రోజుల తర్వాత ఈ ద్రావణాన్ని పింగాణీ జాడీ లేదా ప్లాస్టిక్ క్యానులోకి వడకట్టుకోవాలి.

అందులో ఒక లీటరు తాటికల్లు, 50 గ్రాముల దేశీ ఆవు నెయ్యి, 50 గ్రాముల తేనె వేసి మూతపెట్టి గుడ్డతో బిగుతుగా కట్టాలి. ఈ మిశ్రమాన్ని మరో పదిరోజుల పాటు ఉంచాలి. ఈసారి కలియబెట్టనవసరం లేదు. పది రోజుల తర్వాత ‘మీనామృతం’ పిచికారీకి సిద్ధమవుతుంది. మీనామృతాన్ని 6 నెలల వరకు నిల్వ ఉంచుకొని వాడుకోవచ్చు. కొద్ది లీటర్లయితే పింగాణి జాడీలలో నిల్వ ఉంచుకోవచ్చు. చాలా ఎక్కువ లీటర్లయితే ప్లాస్టిక్ క్యానులు లేదా డ్రమ్ముల్లో నిల్వ ఉంచుకోవచ్చు. గాలి చొరబడని క్యానుల్లో ఉంచినప్పుడు తరచుగా మూతను లేదా బిరడాను తీసి గాలిని బయటకు వదులుతూ ఉండాలి.

‘మీనామృతం’ 3సార్లు పిచికారీ చేయాలి
మునగ చెట్టుపై పురుగును గమనించిన వెంటనే మీనామృతాన్ని పిచికారీ చేయడం ఉత్తమం. వంద లీటర్ల నీటికి 2.5 లీటర్ల నుంచి 5 లీటర్ల చొప్పున మీనామృతాన్ని కలిపి, చెట్టంతా తడిసేలా పిచికారీ చేయాలి. 5 రోజుల వ్యవధితో మరో రెండుసార్లు పిచికారీ చేస్తే మునగ ఆకు చుట్టు పురుగు జాడ లేకుండా పోతుంది. మరింత మెరుగైన ఫలితాల కోసం మీనామృతంతో పాటు వేపనూనె (1500 పీపీఎం) లీటరు నీటికి 3 మిల్లీ లీటర్లు చొప్పున లేదా 10 శాతం లొట్టపీచు’ (తూటాకు) కషాయం లీటరు నీటికి 50 మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయవచ్చు.

‘మీనామృతం’ వల్ల ఇతర ప్రయోజనాలివే…
మీనామృతం స్థూల, సూక్ష్మ ధాతు లోపాలను సమర్థవంతంగా నివారిస్తుంది. పందిరి కూరగాయలు, పచ్చ, దోస, దానిమ్మ వంటి ఉద్యాన పంటల్లో ఆడపూల నిష్పత్తిని గణనీయంగా పెంచుతుంది. మొక్కల్లో రోగనిరోధక శక్తిని వృద్ధిపరచి, ఆకుమచ్చ, కాయకుళ్లు తెగుళ్లను నిరోధిస్తుంది. రసం పీల్చే పురుగులు, లార్వాల తొలి దశలను నాశనం చేస్తుంది. కూరగాయలు, పండ్ల నాణ్యతను, పోషక విలువలను పెంచుతుంది.

Read More