ఇది నేలసారాన్ని మెరుగుపరచి, ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను వృద్ధిచేస్తుంది. మొక్కలు బలంగా, ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడుతుంది. సేంద్రియ మరియు సహజ వ్యవసాయానికి ఇది చాలా అనువైనది.

మోతాదు: ఎకరాకు 200 లీటర్లు సాగు నీరు ద్వారా గానీ, భూమిపైన గాని చల్లాలి.
కావలసిన పదార్థాలు : ఆవుపేడ: 10 కేజీలు; ఆవు నెయ్యి : 250 గ్రాములు; తేనె / నల్లబెల్లం : 500 గ్రాములు.
తయారు చేయు విధానం: ముందుగా ఆవుపేడ మట్టి కుండలో వేసి పావుకిలో ఆవునెయ్యి వేసి సుమారు 2 గంటలు బాగా కలిపి తర్వాత తేనె లేక బెల్లపు నీరు (అరకేజి బెల్లంకు అర లీటరు నీరు) పోసి 2 గంటలు ఆవుపేడను బాగా పిసుకుతూ కలపాలి. తర్వాత నీటిలో కళ్ళాపిలాజేసి 200 లీటర్ల డ్రమ్ములో పోసి డ్రమ్మునిండా నీరు పోస్తూ కలుపుతుండాలి. డ్రమ్ము నింపిన తర్వాత మిశ్రమాన్ని సుమారు 3 లేక 4 గంటలు కర్రతో త్రిప్పి ఆ తర్వాత ఎకరం పొలంలో కళ్ళాపిలా చిమ్మడం గాని లేక పారుతున్న నీటిలో పోస్తూ గాని భూమికివ్వాలి.

