నేలసారాన్ని పెంచే అమృత జలం

ఇది నేలసారాన్ని మెరుగుపరచి, ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను వృద్ధిచేస్తుంది. మొక్కలు బలంగా, ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడుతుంది. సేంద్రియ మరియు సహజ వ్యవసాయానికి ఇది చాలా అనువైనది.

మోతాదు: ఎకరాకు 200 లీటర్లు సాగు నీరు ద్వారా గానీ, భూమిపైన గాని చల్లాలి.

కావలసిన పదార్థాలు : ఆవుపేడ: 10 కేజీలు; ఆవు నెయ్యి : 250 గ్రాములు; తేనె / నల్లబెల్లం : 500 గ్రాములు.

తయారు చేయు విధానం: ముందుగా ఆవుపేడ మట్టి కుండలో వేసి పావుకిలో ఆవునెయ్యి వేసి సుమారు 2 గంటలు బాగా కలిపి తర్వాత తేనె లేక బెల్లపు నీరు (అరకేజి బెల్లంకు అర లీటరు నీరు) పోసి 2 గంటలు ఆవుపేడను బాగా పిసుకుతూ కలపాలి. తర్వాత నీటిలో కళ్ళాపిలాజేసి 200 లీటర్ల డ్రమ్ములో పోసి డ్రమ్మునిండా నీరు పోస్తూ కలుపుతుండాలి. డ్రమ్ము నింపిన తర్వాత మిశ్రమాన్ని సుమారు 3 లేక 4 గంటలు కర్రతో త్రిప్పి ఆ తర్వాత ఎకరం పొలంలో కళ్ళాపిలా చిమ్మడం గాని లేక పారుతున్న నీటిలో పోస్తూ గాని భూమికివ్వాలి.

Read More

విత్తనోత్పత్తిలో రైతులు

తెలంగాణాలో చాలామంది రైతులు ఇటీవల విత్తనోత్పత్తి చేపడుతున్నారు. పొలాస, కూనారం, వరంగల్, రుద్రూరు, రాజేంద్రనగర్, మారుటేరు, నెల్లూరు తదితర పరిశోధన స్థానాల నుంచి తెచ్చిన బ్రీడర్, ఫౌండేషన్, ట్రూత్‌ఫుల్ లేబుల్ విత్తనాలను సాగుచేసి పండిన పంటను తిరిగి విత్తనంగా విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తూ తోటి రైతులకు నాణ్యమైన వంగడాలను చేరవేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ ద్వారా గత వానాకాలానికి ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో వరి, పెసర, మినుము, కంది, వేరుసెనగ, నువ్వులు తదితర పంటల విత్తనాలిచ్చారు. వీటిని సాగు చేసినవారు తోటి రైతులకు సైతం విత్తనాలను చేరవేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఈ యాసంగిలో 9.59 లక్షల ఎకరాల్లో సాగు చేసిన వరి పైరు ప్రస్తుతం గొలక దశ నుంచి నూర్పిడి దశ వరకు శాస్త్రవేత్తలు విత్తన ప్రాధాన్యతను రైతులకు వివరిస్తున్నారు. పొలంలో కల్తీ కర్రలు, బెరకు కేళీలను ఏరివేసి పంటను వేరుగా నూర్పిడి చేసుకొని రైతు విత్తనంగా వాడుకోవచ్చు. దీంతో కల్తీలు, నకిలీల బెడద ఉండదు. మన నేలల్లోనే పండించిన పంట కాబట్టి స్థిరమైన దిగుబడి వస్తుంది. ప్రైవేటుగా విత్తనాలను కొంటే హెక్టారుకు రూ. 3 వేల నుంచి రూ. 6 వేల వరకు విత్తనానికి వెచ్చించాల్సి వస్తోంది. అదే రైతు విత్తనమైతే సగం ఖర్చుతోనే సరిపోతుంది. వచ్చే వానాకాలం సీజన్‌లో సన్నాలను అధికంగా సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నందున ఇప్పటినుంచే రైతులు మేలైన సన్న గింజ రకాలను సేకరించుకోవాలి. మక్క, పత్తి తదితర హైబ్రిడ్స్ మినహా వరి నువ్వులు, పెసర, మినుము, అలసంద తదితర సూటి రకాల్లో ప్రతి పంటకు నూతన విత్తనం కొనకుండా రైతు విత్తనాన్ని వినియోగించాలని ఏడీఆర్ డా. హరీశ్ కుమార్ శర్మ సూచించారు.

Read More