పండ్లలో చక్కెర శాతం పెంపునకు… పులిసిన పండ్ల రసం ద్రావణం

పులియబెట్టిన పండ్ల రసాల్లో ఉన్న పలురకాల సూక్ష్మజీవుల చర్య వలన ఇవి పంటలలో చక్కెర శాతాన్ని పెంచడానికి దోహదపడతాయి.
కావలసిన పదార్థాలు : బాగా మగ్గిన పండ్లు : 1 కిలో (అరటి, మామిడి, బొప్పాయి, మొ॥); బెల్లం : 1 కిలో.

తయారు చేసే పద్ధతి

  • ఒక కిలో బాగా మగ్గిన పండ్లను బాగా ముద్దగా చేసి దానికి ఒక కిలో మెత్తగా చేసిన బెల్లాన్ని కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని ఒక కుండలో పోయాలి.
  • కుండను ఒక గుడ్డతో మూతకట్టి దానిని ఒక నీడ ప్రదేశంలో వారం రోజులపాటు ఉంచాలి.
  • ఈ విధంగా బాగా పులిసిన ద్రావణం సుమారు 2.5 లీటర్ల వరకు ఉంటుంది.
  • ఈ మిశ్రమాన్ని వడపోసి 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరా పంట పొలంలో పిచికారి చేయాలి.

ఉపయోగాలు :

  • పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు. ఈ ద్రావణాన్ని అన్ని పండ్ల తోటలలో వాడవచ్చు.
  • ద్రావణాన్ని తయారు చేసిన వెంటనే ఉపయోగించుకోవాలి. నిల్వ ఉంచరాదు.
Read More

కాయ నాణ్యతకు… కాల్షియం ద్రావణం

మొక్కల్లో పూత కాయగా మారే క్రమంలో కాల్షియం కీలకపాత్ర పోషిస్తుంది. దీనిని కూడా చాలా సులువుగా తయారు చేసుకునే ప్రక్రియ ఈ వ్యవసాయ విధానంలో కనిపిస్తుంది.

మనిషి ఎముక బలానికి కాల్షియం ఎంత అవసరమో, మొక్కకు అంతే అవసరం. దీనిని సహజ పద్దతుల్లో తయారు చేసుకోవడానికి సముద్రంలో, నదులలో దొరికే గవ్వలను లేదా గుడ్డు పెంకులను వెనిగర్‌తో కలిపితే ద్రవరూప కాల్షియం లభిస్తుంది. దీనిని మొక్కలకు అందించడం వల్ల ప్రధానంగా కాయ నాణ్యత, కాయ కోత తరువాత ఎక్కువ రోజుల నిల్వకు దోహదపడుతుంది.

కాల్షియంను ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్ రూపంలో కూడా అందించవచ్చు. ఒక కిలో అల్లాన్ని మెత్తగా దంచి అందులో కిలో బెల్లాన్ని కలుపుకుని పదిహేనురోజుల పాటు వుంచి మొక్కలకు పూత దశ నుంచి స్ప్రే చేయాలి.

Read More

వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వివిధ పంట రకాలు, ప్రయోజనాలు

పప్పు ధాన్యాలు ` నూనెగింజలు

మినుము :
ఆంధ్ర రాష్ట్రంలో మినుము 9.71 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, దాదాపు 3.65 లక్షల టన్నుల ఉత్పత్తిని, సగటున ఎకరాకు 376 కిలోల దిగుబడి నిస్తుంది. రాష్ట్రంలో మినుమును తొలకరిలో, రబీలో మరియు వేసవిలో వరి కోతల తర్వాత పండిస్తారు.

మినుము పంటను జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. మినుములో అనువైన రకాలు :

జి.బి.జి-1 : ఈ రకం పంట కాలం 70-75 రోజలు, దిగుబడి 8-9 క్వింటాళ్ళు. ఇది పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. అన్ని కాలాలకు అనువైన రకం ఇది. వ్యవసాయ పరిశోధనా స్థానం, ఘంటశాల, కృష్ణాజిల్లా నుండి లభ్యం అవుతుంది- 9248838628

టి.బి.జి. 104 : పంట కాలం- 70-75 రోజలు, దిగుబడి, 8-9 క్వింటాళ్ళు. పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. ఇది అన్ని కాలాలకు అనువైన రకం. ఇది కృషి విజ్ఞాన కేంద్రం, దర్శి, ప్రకాశం జిల్లా నుండి లభ్యం అవుతుంది – 9989623827.

ఎల్.బి.జి-352: ఈ రకం పంట కాలం 75-80 రోజలు . దిగుబడి 6-7 క్వింటాళ్ళు. వరి మాగాణుల్లో ఆలస్యముగా విత్తుటకు కూడా అనువైన రకం. ఇది కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటశాల, కృష్ణా జిల్లా నుండి లభ్యం అవుతుంది – ఫోన్ నంబర్- 8008201253.

ఎల్.బి.జి`904 మరియు టి.బి.జి-129 రకాలు కెవికె, రెడ్డిపల్లి, అనంతపూరం జిల్లా నుండి లభ్యం అవుతున్నాయి – ఫోన్ నెంబర్ -9989623825

పెసర :
ఆంధ్ర రాష్ట్రంలో పెసర సాగు విస్తీర్ణం 2.59 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, దాదాపు 0.81 లక్షల టన్నుల ఉత్పత్తిని, సగటున ఎకరాకు 313 కిలోల ఉత్పాదకతనిస్తుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో తొలకరి పంటగాను, కోస్తా ఆంధ్రలో తొలకరి మరియు రబీ పంటగా పండిస్తారు. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో, వేసవిలో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలో మూడవ పంటగాను పండిస్తున్నారు. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు ఆలస్యంగా పడే ప్రాంతాల్లో వరి కంటే ముందు పెసరను పండించవచ్చు. కంది, ప్రత్తి మరియు పండ్ల తోటలలో అంతర పంటగా కూడా పండించవచ్చు.

ఎల్.జి.జి-574: ఈ రకం పంట కాలం 65-70 రోజులు. దిగుబడి 6 నుండి 7 క్వింటాళ్ళు. ఇది పల్లాకు తెగులును తట్టుకుంటుంది. ఈరకం కెవికె, రెడ్డిపల్లి అనంతపురం నుండి లభిస్తుంది – 9989623825.

డబ్ల్యు.జి.జి.-42: ఇది ఖరీఫ్ పంటకు అనుకూలం, పంట కాలం 55-60 రోజులు. 4-6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉండి మెరుస్తుంటాయి. ఇవి కెవికె, ఊటుకూరు, వై.యస్.ఆర్. కడప జిల్లాలో లభ్యం అవుతాయి. ఫోన్ నెంబర్:9848809236,

కంది : అనువైన రకాలు ఎల్.ఆర్.జి-52 రకం. వ్యవసాయ పరిశోధనా స్థానం, గరికపాడు, ఎన్.టి.ఆర్. జిల్లా నుండి లభ్యం అవుతుంది. ఫోన్ నెంబర్-9491003499 మరియు టి.ఆర్.జి.-59 మరియు జి.ఆర్.జి-152 రకాలు కెవికె, బనవాసి నుండి అభ్యం అవుతున్నాయి – 8074420092.

వేరుశనగ : పంట కాలం 105-110 రోజులు. ఇందులో కదిరి లేపాక్షి రకం తీవ్ర బెట్ట పరిస్థితులను తట్టుకుని 6-8 క్వింటాళ్ళు దిగుబడి ఇస్తుంది. ఈరకం కెవికె, రెడ్డిపల్లిలో లభ్యం అవుతుంది -9989623825, కదిరి చిత్రావతి కూడా లభ్యం అవుతుంది. కె-6, కదిరి, అమరావతి రకాలు వ్యవసాయ పరిశోధనా స్థానం, కదిరి నుండి లభ్యం అవుతున్నాయి. సంప్రదించవలసిన నంబరు – 9490081470. విశిష్ట రకం వ్యవసాయ పరిశోధనా స్థానం, ఊటుకూరు నుండి లభ్యం ఆవుతుంది. ఫోన్ నెంబర్ – 7981982531.

నువ్వులు : నువ్వులలో YLM-66 రకం,YLM-17 రకం ఖరీఫ్‌కు అనువైనవి. పంటకాలం 75-80 రోజులు, దిగుబడి 5-6 క్వింటాళ్ళు. ఇవి రాయలసీమకి ఆనుకూలం. వ్యవసాయ పరిశోధనా స్థానం, యలమంచిలి, అనకాపల్లి జిల్లా నుండి లభిస్తుంది. ఫోన్ నెంబర్: 9440977352, 9849275470.

ఆముదం : ఆముదం పంట కాలం 90-150 రోజులు, దిగుబడి 6 – 7 క్వింటాళ్ళు. ఇందులో కిరణ్ రకం బెట్టను తట్టుకుంటుంది. బూజు తెగులు తక్కువ. డి.సి.ఎస్-107 మరియు ప్రగతి ఎండు తెగులును తట్టుకుంటుంది. ఐ.సి.హెచ్- 66 ఎండు తెగులు మరియు బెట్టను తట్టుకుంటుంది. ఇవి వ్యవసాయ పరిశోధనా స్థానం అనంతపురం నుండి లభ్యం అవుతున్నాయి. ఫోన్ నెంబర్: 9989210879.

వరితో పోల్చితో చిరుధాన్యాల్లో అధిక పోషక విలువలు ఉన్నాయి. వీటిలో అధిక మాంసకృకృత్తులతో పాటుగా మంచి అమైనో ఆమ్లాలు ఉంటాయి. పిండి పదార్థాలు తక్కువ. పీచు పదార్థం ఎక్కువ ఉండి రాగి, కాల్షియం అధిక మోతాదులలో ఉంటాయి. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల ఏర్పడే తీవ్ర కరువు ప్రభావాన్ని తగ్గించడానికి, రైతులు అధిక నీటి అవసరం ఉన్న పంటలను కాక నీటి ఎద్దడిని తట్టుకునే చిరుధాన్యాలను సాగు చేసుకున్నట్లయితే తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడులను సాధించవచ్చు.

జొన్న: ఇది అధిక కరువు నిరోధకత కలిగిన పంట. దీని లోతైన “వేరువ్యవస్థ కారణంగా సుదీర్ఘ వర్షాభావ పరిస్థితులను తట్టుకోగలదు. ముఖ్యంగా చిరుధ్యాల సాగు అధికంగా ఉండే రాయలసీమ జిల్లాల్లో ఒకటైన కడపలో ఇటీవల కాలంలో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. నల్లరేగడి నేలలుండి కెసి కెనాల్ ఆయకట్టు ప్రాంతాలైన ప్రొద్దుటూరు మరియు పులివెందుల ప్రాంతాలలో NTJ NJ-1 CSV-29 రకాలను సాగు చేయవచ్చు. అలాగే ఇవి ధాన్యం మరియు పశుగ్రాసం రెండింటిని అందిస్తాయి. సజ్జ పంట విషయానికి వస్తే తక్కువ తేమగల నల్లరేగడి నేలలలో ABH-1, CTP-8203 హైబ్రిడ్ రకాలను ఎంచుకోవచ్చు. ఆలస్యమైనా ఖరీఫ్ సీజన్‌లో ఆగష్టు రెండవ వారం నుండి సెప్టెంబర్ మొదటి వారం లోపు వేసుకోవచ్చు. ఎర్రనేలలు అధికంగా ఉన్న జమ్మలమడుగు మండలంలో కొర్రలు(స్వల్పకాలిక రకాలు) సియా`3223 (రేనాడు/గరుడ) లేదా సూర్యనంది వంటి అధిక దిగుబడులు ఇచ్చే రకాలు నాటుకోవచ్చు.

రాగి రకాలు చూసినట్లయితే గౌతమి (PR) వకుళ, చైతన్య మరియు ఇంద్రావతి వర్షాధార పరిస్థితులకు అనుకూలం. ఈ రకాలు బ్లాస్ట్ తెగులు మరియు తేమ ఒత్తిడిని అధికంగా తట్టుకుంటాయి. పంట ఏది వేసినా విత్తనశుద్ధి తప్పకుండా చేయాలి. సాళ్ళలో నాటడం వలన అప్పుడప్పుడు పడిన వర్షం బొట్టును కూడా ఒడిసి పట్టుకుని పంట నిలబడుతుంది. అలాగే అంతర పంటల సాగుకు కూడా అనుకూలం. కొర్ర లేదా జొన్నను కంది తో కలిపి 4:1 లేదా 5:1 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకోవచ్చు. విత్తనం కొరకు భారత చిరుధ్యాల పరిశోధనా సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు.ఫోన్ నంబరు : 040 – 24599300.

నీటి ఎద్దడిని తట్టుకునే పశుగ్రాస రకాలు
నీటి ఎద్దడిని (Drought) తట్టుకుని, తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పశుగ్రాస రకాలు పాడి రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అనంతపురం, వై ఎస్ ఆర్ కడప జిల్లాల పరిసర ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు ఈ క్రింది రకాల పశుగ్రాసాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి:

ధాన్యపు జాతి పశుగ్రాసాలు:

జొన్న గడ్డి రకాలు :
ఏకవార్షికాలు – పి.సి -9, ఎం.పి. చారి, పంత్ చారి-5,7, సి.ఎస్.వి. -30F,
32F,

బహు వార్షికాలు – ఎస్. ఎస్. జి 59 -3 , పూస చారి – 6, 23, సి.ఎస్.వి. -33 COFS 29 (కోఎస్ఎస్ 29) COFS 31 (కోఎస్ఎస్ 31). బహుళ కోతలు (మల్టీ కట్) జొన్న రకాలు. కరవును తట్టుకుని, వర్షాలు పడగానే మళ్లీ చిగురిస్తుంది.

సోర్గమ్ -సూడాన్ గడ్డి (SSG): ఇది జొన్న మరియు గడ్డి జాతుల సంకరం. ఇందులో కాండం మందంగా ఉండి రసం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రతలను సైతం తట్టుకుని పెరుగుతుంది
సజ్జ గడ్డి రకాలు : జైంట్ బాజ్ర , ఎస్ – 530, జె-55 , కె – 533

కాయజాతి (లెగ్యూమ్) పశుగ్రాసాలు:
హెడ్జ్ లూసర్న్ (దశరథ గడ్డి): ఇది బహువార్షిక (3-4 ఏళ్లు వచ్చే) పశుగ్రాసం. ఇందులో ప్రోటీన్లు ఎక్కువ. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది.

అలసందలు / బొబ్బర్లు: వర్షాభావ పరిస్థితుల్లో స్వల్పకాలికంగా పండించడానికి ఇది అనువైన పశుగ్రాసం.
స్టైలో హేమాటా – ఇది నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. దీనిని వర్షాధారంగా సారవంతం కాని భూముల్లో సాగుచేయవచ్చు. భూసారాన్ని పెంచుతుంది. మిశ్రమ పంట లాగా తోటల్లో సాగు చేయవచ్చు.

గడ్డి జాతులు:
బాజ్రా నేపియర్ హైబ్రిడ్ : నేపియర్ రకాల వేర్లు లోతుగా చొచ్చుకుపోయి నీటిని గ్రహిస్తాయి కాబట్టి కరవును తట్టుకుంటాయి.

అంజన్ గడ్డి – ఇసుక నేలల్లో కూడా సాగు చేయవచ్చు. తోటల్లో మిశ్రమ పంటగా సాగు చేసుకోవచ్చు
గిన్ని గడ్డి – ఇది నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో బాగా అనువైన రకం.

చెట్ల మేత:
సుబాబుల్ మరియు అవిశ: నీరు లేని సమయాల్లో వీటి కొమ్మలు, ఆకులను పశువులకు మేతగా వేయవచ్చు.

విత్తనాలు లభ్యత :
పశుగ్రాస విత్తనాలను ఆంధ్రప్రదేశ్ లోని పశువైద్య విశ్వ విద్యాలయ పరిధిలోని పరిశోధన కేంద్రాలు, ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణ కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు లేదా వ్యవసాయ సంభందిత ఆన్లైన్ ప్లాట్ ఫారముల ద్వారా పొందవచ్చు.

రైతుల సమాచారం కోసం కెవికె శాస్త్రవేత్తలచే రూపొందించబడినది. సంప్రదించవలసిన చిరునామా, కెవికె, ఒనిపెంట`9398982828, 7032463875, 8121136184

డా. శ్రీవిద్య రాణి.ఎన్, శాస్త్రవేత్త, విస్తరణ విభాగం , డా.బి.ఎస్.కాంతి శ్రీ, శాస్త్రవేత్త, గృహవిజ్ఞాన విభాగం, డా. టి.విజయ నిర్మల, శాస్త్రవేత్త, పశుపోషణ విభాగం. Ph: 93989 82828

Read More

జీవన ఎరువులు నేలకు అమూల్యమైన ధననిధి

                    నేల దేశ సంపద, దేశం సుభిక్షంగా ఉండాలంటే నేల ఆరోగ్యంగా ఉండాలి. నేల అనగా అనేక బిలియన్ల బ్యాక్టీరియా, శిలీంధ్ర, నాచు ఇంకా అనేక రకాల సూక్ష్మజీవుల సహజీవనంతో తొణికిసలాడే సజీవమైన జీవధార వ్యవస్థగా గుర్తించాలి. ఇవి మొక్కల ఎదుగుదలకు పోషకంగానే కాక వర్షపు నీరును క్షామం కాలం వరకు ఉంచుకొని మొక్కలకు అందజేస్తా ఆరోగ్యంగా ఉంటేనే ఆహార భద్రత, ఆరోగ్యకరమైన పర్యావరణంతోనే  మానవాళి శ్రేయస్సు సాధ్యపడుతుంది.

                      ఇటీవల కాలంలో రైతాంగం విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులను, పురుగు మందులను వాడడం, అలాగే పంటల అవ శేషాలను కాల్చి వేయడం ద్వారా భూసారం గణనీయంగా క్షీణించడమే గాక పర్యావరణ కాలుష్యం, ఉపయోగకరమైన బ్యాక్టీరియా వినాశనానికి దారి తీస్తూ జీవన వైవిధ్యం వినాశనం సంభవిస్తుంది. తద్వారా సరైన పోషకాలు లేని బీడు భూములు ఏర్పడుతున్నాయి. మనకు స్వాతంత్య్రం వచ్చినపుడు ప్రతి కిలో ఎరువుకు 17 నుండి 18 కిలోల ధాన్యం పండేది. కానీ ప్రస్తుతం ప్రతి కిలో ఎరువుకు కేవలం 3 కిలోల ధాన్యం మాత్రమే పండుతుంది. ఇది భూసారం క్షీణించడాన్ని సూచిస్తుంది.

                 భూసారాన్ని పెంచడానికి, నేల ఉత్పా దకతను మెరుగుపరచడానికి సూక్ష్మజీవుల పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే ఇవి నజ్రజనిని స్థిరీకరిస్తాయి, పోషకాలను కరిగిస్తాయి. పోషకాలను విచ్ఛిన్నం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు సహజంగానే భూమిలో ఉంటాయి. కాని వీటి సంఖ్య త్వరీతంగా తగ్గుతూ వస్తుంది. పంటల దిగుబడిని పెంచడానికి సూక్ష్మ జీవులను కృత్రిమంగా పెంచి ఎక్కువ సంఖ్యలోకి తెచ్చి సూటి అయిన ఘన పదార్ధాలలో కలిపి మరల భూమిలో వెయ్యవచ్చు.

నత్రజనిని స్థిరికరించే జీవన ఎరువులు :

జీవన ఎరువులు వాడవలసిన మోతాదు ఏ ఏ పంటలకు

రైజోబియం 200 గ్రా. కంది,పెసర , మినుము, శనగ వంటి పంటలకు

అజటోబాక్టర్ 2 కిలోలు పప్పుజాతి పంటలను మినహాయించి మిగతా అన్ని పంటలకు

అజో స్స్పైరిల్లం 2 కిలోలు వరి, చెరకు, ప్రత్తి, మిర్చి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు , అరటి పంటలకు

నీలి ఆకుపచ్చనాచు 4 కిలోలు వరి పంటకు మాత్రమే వాడాలి.

రైజోబియం: లెగ్యూమ్‌ జాతి పంటలు అనగా అపరాల (పప్పుజాతి) పంటలకు నత్రజని అందించే జీవన ఎరువుగా వాడవలెను. పప్పుజాతి పైర్లలో ముఖ్యమైనవి కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు, వేరుశనగ, సోయాచిక్కుడు వంటి నూనె గింజల పైర్లకు రైజోబియం కల్చర్‌ను విత్తనమునకు పట్టించి ఉపయోగించాలి.
ఉపయోగించే విధానం: వంద మిల్లీలీటర్ల నీటిలో పది గ్రాముల పంచదార, బెల్లం, లేక గంజి పౌడర్‌ను కలిపి పది నిమిషాలు మరగబెట్టి చల్లార్చాలి. ఈ చల్లార్చిన ద్రావణం పది కిలోల విత్తనాలపై చల్లి, దానికి 200 గ్రాములు రైజోబియం కల్చర్‌ పొడిని బాగా కలపాలి. విత్తనం చుట్టూ పొరలు ఉండేలా జాగ్రత్త వహించాలి.

 ఈ ప్రక్రియకు రైతులు పాలిథిన్‌ సంచిగానీ, ప్లాస్టిక్‌ తొట్టిని గాని ఉపయోగించుకోవచ్చు. పది నిమిషాలు నీడలో ఆరబెట్టిన తరువాత రైతులు పొలంలో నాటుకోవలెను

అజటోబాక్టర్‌: పప్పుజాతి పంటలను మినహాయించి, మిగతా అన్ని పంటలకు నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ బాక్టీరియా నత్రజనిని స్థిరీకరించడమే కాక, మొక్కకు కావాల్సిన హార్మోన్లు, విటమిన్లు అందిస్తుంది.

 ఈ బాక్టీరియా ముఖ్యంగా సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న భూమిలో సమర్థవంతంగా పని చేస్తుంది. అందువల్ల ఈ జీవన ఎరువు ఆకుకూరలు, కూరగాయలు, పూల తోటలకు సిఫారసు చేయబడుతుంది.

వాడే విధానం: ఏ పంటకు వాడినా రెండు కిలోల కల్చర్‌ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో ఒక ఎకరం నేలపై వెదజల్లాలి. ఇది చల్లిన సమయంలో కాని, వెనువెంటనే భూమిలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి

అజోస్ప్తెరిల్లమ్‌ : ఈ మధ్యకాలంలో దీని ప్రాముఖ్యత అధికంగా గుర్తించారు. ఈ బాక్టీరియా మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశమున్న చోట వేర్లలోకి చరొబడి కూడా జీవిస్తాయి.
ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువశాతం అందుబాటులో ఉంటుంది. ఈ జీవన ఎరువును లెగ్యూమ్‌జాతి పంటలకు తప్పించి, మిగతా పంటలకు వాడుకోవచ్చు.
ఇది వరి, చెరకు, పత్తి, మిర్చి, జొన్న, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, అరటి పంటలకు బాగా ఉపయోగపడుతుంది. సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలలో ఇది పని చేస్తుంది.

ఉపయోగించే విధానం:

         తక్కువ కాలం పంటలకు రెండు కిలోల అజోస్పెరిల్లమ్‌ కల్చర్‌ను   80-100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలంలో విత్తనం కింద పడేలా వేసుకోవాలి. నారుమడి వేసుకొనే పంటలకు నారు పీకేందుకు ముందుగా నారుమడి వద్ద 70 నుంచి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి. 

 ఆ నీటిలో రెండు కిలోల అజోస్పెరిల్లమ్‌ జీవన ఎరువును బాగా కలిపి, ఆ ద్రావణంలో పది నిమిషాలు వేళ్లను మాత్రమే ముంచి వెంటనే నాటుకోవాలి. చెరకు పంట విషయంలో నాటే విత్తనం చెరకు ముక్కలను పది నిమిషాలు ముంచి నాటుకోవాలి.

       పంట మొక్కలకు వేసిన లభ్య భాస్వరం, భూమిలో చేరిన కొద్ది రోజుల వ్యవధిలో భూమి ఉదజని సూచకను అనుసరించి, వివిధ రకములైన లభ్యంకాని భాస్వరం రూపంలోని మారుతుంది. 

 ఒక వేళ భూమి క్షార గుణం కలిగి వున్న, వేసిన భాస్వరం కాల్షియం, మెగ్నీషియం ఫాస్పేట్స్‌గా మారి, మొక్కకు లభ్యంకాదు. 

 ఈ పరిస్థితుల్లో భాస్వరానికి సంబంధించి జీవన ఎరువులు వేస్తే లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరం మొక్కకు దొరుకుతుంది.

భాస్వరంను అందించే జీవన ఎరువులు
PSB (ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బాక్టీరియా) 2 కిలోలు/ 500 మీ.లీ/ఎకరాకు అన్ని పంటలకు వాడుకోవచ్చు

ఫాస్ప్ ఫంగై 2 కిలోలు అన్ని పంటలకు వాడుకోవచ్చు

ఫాస్పేట్ మోబి లైజింగ్ మైకోరైజా 5 కిలోలు అన్ని పంటలకు వాడుకోవచ్చు

పొటాషియం మోబిలైజర్స్:
ప్రటూరియా అరాషనియా 2 కిలోలు నూనెగింజల పంటలకు ఎక్కువ ఉపయోగపడుతుంది

ఫాస్పోబాక్టీరియా :
ఈ జీవన ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యే రూపంలోకి మార్చుతుంది. ఈ జీవన ఎరువును అన్ని పంటలకు వాడుకోవచ్చు.

ఇది సమర్థవంతంగా పని చేసేందుకు సేంద్రియ కర్బనము అత్యవసరం. దీన్ని సేంద్రియ ఎరువుతో కలిపి వాడాలి. ఈ జీవన ఎరువు మొక్కకు రోగ నిరోధక శక్తిని పెంచి, తద్వారా పంట దిగుబడి పెంచుతుంది

వాడే విధానం :
ఎకరాకు 2.0 కిలోల ఫాస్పోబాక్టర్‌ను లేదా ద్రవ రూపంలో ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బాక్టీరియా 500 మీ.లీ, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగానీ, మొక్క నాటినప్పుడుగానీ సాళ్లలో పడేలా వేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

పొటాషియం మొబిలైజర్స్ :
ఈ జీవన ఎరువు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పొటాషియంను అందుబాటులోకి తెచ్చును. ఈ జీవన ఎరువుల్లో ఉండేటటువంటి మొబిలైజింగ్ సూక్ష్మజీవులు, విడుదల చేసే ఎంజైముల వల్ల ఈ ప్రక్రియ జరుగుతుంది.

వాడే విధానం :
ఎకరాకు 2.0 కిలోల పొటాషియం రిలీసింగ్ బాక్టీరియా లేదా ద్రవరుపం లో పొటాషియం రిలీసింగ్ బాక్టీరియా 500 మీ.లీ, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగానీ, మొక్క నాటినప్పుడుగానీ సాళ్లలో పడేలా వేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

డా. ఎం. వెంకట లక్ష్మి(సస్య పోషణ), డా.డి.సుధా రాణి (సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి),
డా. కె. రేవతి (సస్య రక్షణ) కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల, కృష్ణాజిల్లా – 521 133. Ph: 8008201253

Read More

‘లాబ్’ (లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా)తో లాభాలు

మొక్కలకు కావలసిన పోషకాలను సహజంగా అందించడానికి లాక్టిక్ ఆసిడ్ బాసిల్లస్‌ను (లాబ్) ఉపయోగించాలి.
లాక్టిక్ ఆసిడ్ ద్రావణం తయారీ

ఇందులో ఉపయోగించుచున్న పదార్థాలలో సహజంగా ఉండే ఎన్నో రకాల సూక్ష్మజీవుల వలన శిలీంధ్రాలు మరియు వైరస్ తెగుళ్ళ నియంత్రణలో ఈ ద్రావణం బాగా పనిచేస్తుంది.

కావలసిన పదార్థాలు :
బియ్యపు కడుగు : 5 లీటర్లు
ఆవు పాలు : 10 లీటర్లు
బెల్లం : 1 కిలో

తయారు చేసే పద్ధతి :

  • 5 లీటర్ల బియ్యపు కడుగును ఒక కుండలో పోసి, మూతపెట్టి 7 రోజులు నీడలో ఉంచాలి.
  • 7 రోజుల తరువాత పై ద్రావణానికి 10 లీటర్ల ఆవుపాలను కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని మూతపెట్టి మరలా 7 రోజులు నీడలో ఉంచాలి.
  • ఈ మిశ్రమాన్ని వడపోసి దానికి బెల్లపు పొడిని కలపాలి.
  • మిశ్రమాన్ని కర్రతో బాగా కలియబెట్టాలి.
  • ఈ మిశ్రమాన్ని వడపోసి లీటర్ నీటికి 1 లేదా 2 మి.లీ. ద్రావణాన్ని కలిపి మె°క్కలపై స్ప్రే చేయాలి.

ఉపయోగాలు:

  • ఈ ద్రావణాన్ని అన్ని పంటలలోను, పండ్ల తోటలలోను వాడవచ్చు.
  • పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు.
Read More

పంటకాలం పెరుగుదలకు ‘వండర్ ఆయిల్స్’

ప్రతి మొక్క దాని తరువాత తరం కోసం కావలసిన అన్ని పోషక పదార్థాలను గింజలలో దాచుకుంటుంది. ఆ గింజలో శక్తిని నూనెగా మార్చి అదే మొక్కకు అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో మెదక్ జిల్లా రైతు పొన్ను స్వామి చాలా ప్రయోగాలు చేశారు. తక్కువ ఖర్చుతో లభించే నూనెలను నీటిలో కరిగించి మొక్కలకు డ్రిప్ ద్వారా, పిచికారి ద్వారా అందించి ప్రత్తి, చెరకు, బొప్పాయి, అరటి, కూరగాయల పంటలలో అద్భుతమైన దిగుబడులు సాధించారు. ఉదాహరణకు ప్రత్తి పంటకు అర లీటరు ప్రత్తి నూనెలో 50 మి.లీ. ఎమల్షన్ కలిపి ఆ ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి డ్రిప్ ద్వారా లేదా పిచికారి చేసి అందించారు. అపుడు నూనె నీటిలో కలిసిపోయి పాలలా తెల్లగా మారింది. దీనితోపాటు కానుగ నూనె, వేరుశనగ నూనె, ప్రొద్దు తిరుగుడు నూనె, వేప నూనె వంటి రకరకాల నూనెలను మార్చి మార్చి అందించడం వలన మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు అందుతాయి. ఇలా వారానికి ఒకసారి నూనెలను అందించడం వలన మొక్కలలో రోగ నిరోధకశక్తి పెరిగి చీడపీడలను తట్టుకుంటాయి. పంటకాలం పెరిగి రైతు అధిక దిగుబడులను పొందే అవకాశం కలుగుతుంది. అంటే 4 నెలలు దిగుబడి వచ్చే పంట 6 నెలల వరకు కూడా దిగుబడులనిస్తుంది. 

ఈ పద్ధతిని ఖమ్మం జిల్లా కోయచలకకు చెందిన రైతు రామారావు అనుసరించి తన కూరగాయల తోటలో రెట్టింపు దిగుబడులు పొందారు. రామారావు స్ఫూర్తితో సక్రూనాయక్, పెదవడ్లపూడి గ్రామానికి చెందిన ధర్మేందర్, చింతలలంక గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు వంటి రైతులు పుచ్చ, బంతి, బీర, బొప్పాయి పంటలలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తున్నారు.

నూనెల మిశ్రమం : నూనెల మిశ్రమం తయారీకి ఎమల్సిఫయర్‌కు బదులు లీటరు నూనెను రెండు కోడిగుడ్ల సొన కలిపి మిక్సీలో వేసి 5 నుంచి 10 నిమిషాలు తిప్పాలి. దీంతో నూనె నీటిలో కరిగేవిధంగా తయారవుతుంది.

Read More

బహుళ ప్రయోజనకారి ‘మైకోరైజా (వ్యామ్)’

మైకోరైజా బహుళ ప్రయోజనకారి. పంటలను వేరుకుళ్ళు, ఎండుతెగులు వంటి తెగుళ్ళనుండి కాపాడటమేగాక, వర్షాభావ పరిస్థితుల్లో సుదూర లోతులో ఉన్న నీరు, పోషకాలను సంగ్రహించి మొక్కల వేర్లకు అందిస్తుంది. మైకోరైజాను రైతు వ్యవసాయ క్షేత్రంలోనే స్వయంగా తయారు చేసుకోవచ్చు.

తయారీ విధానం : 4 మీ. పొడవు, వెడుల్పు, అరగజం లోతులో గొయ్యి తీసుకోవాలి. అందులో మట్టి మృదువుగా ఉంటే అదే మట్టిని వాడుకోవచ్చు లేదా బయట నుండి మెత్తని మన్ను సేకరించి ఎండబెట్టి శుద్ధి చేసుకుని గోతిలో నింపాలి. దానిలో మెత్తని పశువుల ఎరువు లేదా వర్మికంపోస్టు కలుపుకోవాలి. గోతిలో ప్లాస్టిక్ షీట్ పరవాలి. అందులో ఎరువు కలిపిన మట్టిని వేసి దానిలో 100 గ్రా. మైకోరైజా కల్చర్ ని కలిపి దానిలో వివిధ రకాల పప్పుధాన్యపు గింజలు, తృణధాన్యపు గింజలు, కూరగాయల గింజలు వరుసల వారీగా విత్తుకుని 40 రోజుల వరకు పెంచాలి. పెరిగిన పైరుకు వారం రోజుల పాటు నీటి తడిని ఆపి మట్టి పొడిబారిన తర్వాత మొక్కలపై కాండాలను కోసి వేయాలి. వేర్లను మట్టితో పాటు పెకలించి పొడి చేసుకుని సంచుల్లో నింపుకోవాలి. క్వింటాళ్ల కొద్ది మైకోరైజా వేర్లు అందుబాటులోకి వస్తాయి. వీటిని మెత్తగా దంచి అన్ని రకాల పైర్ల సాగులో, నారు మడుల పెంపకంలో వినియోగించుకోవచ్చు.

Read More

కుళ్ళిన పండ్లు లేక కూరగాయల మిశ్రమ ద్రావణం

ఈ మిశ్రమం సూక్ష్మక్రిములకు, వానపాములకు ఆహారంగా ఉపయోగపడి మొక్క ఆరోగ్యంగా పెరుగుటకు దోహదపడుతుంది.

మోతాదు : ఎకరానికి 50 లీటర్లు

కావలసిన పదార్థాలు : ఆవుపేడ : 25 కిలోలు; నీరు : 50 లీటర్లు; కుళ్ళిన పండ్లు లేదా కూరగాయలు : 20 కిలోలు.

తయారు చేయు విధానం: ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో నీరు, ఆవుపేడ కలిపి నాలుగు రోజులు మురగబెట్టాలి. కుళ్ళిన పండ్లు లేదా కూరగాయలను ఒక డ్రమ్ములో వేసి మూతబెడితే 4 రోజులలో కుళ్ళిపోతాయి. వీటిని అదే రోజున మెత్తగా పిసికి, ఆవుపేడ, నీళ్ళు కలిపిన డ్రమ్ములో వేసి కలియ పెట్టాలి. ఆపైన మూత వదులుగా పెట్టి, మరుసటి రోజున ఈ మిశ్రమాన్ని కర్రతో కలిపి డ్రమ్ముపై మూతపెట్టాలి. 10 రోజులలో మిశ్రమం తయారవుతుంది. 11వ రోజున ఈ మిశ్రమాన్ని వడబోసి, సుమారు 50 లీటర్లు ఒక ఎకరం పొలంలో నీటిద్వారా గాని, లేదా కళ్ళాపిలా గాని నేలపై చల్లాలి.

Read More

నేలసారాన్ని పెంచే అమృత జలం

ఇది నేలసారాన్ని మెరుగుపరచి, ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను వృద్ధిచేస్తుంది. మొక్కలు బలంగా, ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడుతుంది. సేంద్రియ మరియు సహజ వ్యవసాయానికి ఇది చాలా అనువైనది.

మోతాదు: ఎకరాకు 200 లీటర్లు సాగు నీరు ద్వారా గానీ, భూమిపైన గాని చల్లాలి.

కావలసిన పదార్థాలు : ఆవుపేడ: 10 కేజీలు; ఆవు నెయ్యి : 250 గ్రాములు; తేనె / నల్లబెల్లం : 500 గ్రాములు.

తయారు చేయు విధానం: ముందుగా ఆవుపేడ మట్టి కుండలో వేసి పావుకిలో ఆవునెయ్యి వేసి సుమారు 2 గంటలు బాగా కలిపి తర్వాత తేనె లేక బెల్లపు నీరు (అరకేజి బెల్లంకు అర లీటరు నీరు) పోసి 2 గంటలు ఆవుపేడను బాగా పిసుకుతూ కలపాలి. తర్వాత నీటిలో కళ్ళాపిలాజేసి 200 లీటర్ల డ్రమ్ములో పోసి డ్రమ్మునిండా నీరు పోస్తూ కలుపుతుండాలి. డ్రమ్ము నింపిన తర్వాత మిశ్రమాన్ని సుమారు 3 లేక 4 గంటలు కర్రతో త్రిప్పి ఆ తర్వాత ఎకరం పొలంలో కళ్ళాపిలా చిమ్మడం గాని లేక పారుతున్న నీటిలో పోస్తూ గాని భూమికివ్వాలి.

Read More

చేప అమైనో ఆమ్లాల ద్రావణం / చేప – బెల్లం ద్రావణం

చేప-బెల్లం ద్రావణంలో ఎన్నో రకాల ‘అమినో యాసిడ్’ లు ఉంటాయి. ఇవి పంటల యొక్క పెరుగుదలకు ఉపయోగపడతాయి.

కావలసిన పదార్థాలు: చేప వ్యర్థాలు : 1 కిలో (ఎముకలు, మొప్పలు, చర్మం మొ॥); బెల్లం : 1 కిలో

తయారు చేయు పద్ధతి (చోహాన్ క్యూ పద్ధతి):

  • ఒక కిలో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించిన చేపల వ్యర్థ పదార్థాలను, ఒక కిలో బెల్లం పొడిని తీసుకొని బాగా కలిపి ఒక కుండలో నిలువ చేయాలి.
  • కుండపై మూతపెట్టి 10-12 రోజుల పాటు ఆ మిశ్రమాన్ని పులియబెట్టాలి.
  • ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ కర్రతో బాగా కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని 10-12 రోజుల తర్వాత వడపోసి, ఒక లీటరు మిశ్రమానికి 100 లీటర్ల నీటిని కలిపి (1 శాతం) ఒక ఎకరం పొలంలో పంటపై గానీ, పొలంలోని భూమిపైగానీ, కంపోస్టు గుట్టపైగానీ పిచికారీ చేయాలి.
    సూచనః
  • పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు.
  • ఈ ద్రావణాన్ని అన్ని పంటలలో, పండ్ల తోటలలో వాడవచ్చు.
  • ద్రావణాన్ని తయారు చేసిన వెంటనే ఉపయోగించుకోవాలి. నిల్వ ఉంచరాదు.

రైతునేస్తం ప్రచురణ ‘స్వేద వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More
  • 1
  • 2