భోపాల్ పోర్టబుల్ బయోచార్ యూనిట్ తో బయోచార్ తయారీ

భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) ఆధ్వర్యంలోని కేంద్ర వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ (ICAR-CIAE), భోపాల్ శాస్త్రవేత్తలు పంట అవశేషాలను బయోచార్‌గా మార్చేందుకు చిన్న స్థాయి మరియు పైలట్ స్థాయి బయోచార్ యూనిట్లను అభివృద్ధి చేశారు. పైలట్ ప్లాంట్‌లో ఒక్క సారి సుమారు 300 కిలోల పంట అవశేషాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉంది. ఇందులో బయోమాస్‌ను ఇంధనంగా ఉపయోగించి రియాక్టర్‌ను పరోక్షంగా వేడి చేస్తారు. బ్లోయర్ సహాయంతో దహన ప్రక్రియను కొనసాగిస్తారు. ఫర్నేస్‌ను అగ్నినిరోధక ఇటుకలతో నిర్మించగా, ఉష్ణోగ్రత సుమారు 350°C వరకు చేరుతుంది. ఈ విధానంలో సుమారు 33% బయోచార్ లభిస్తుంది. ఈ యూనిట్ ధర సుమారు రూ. 2.0-2.5 లక్షలు.

ఈ సాంకేతికత ద్వారా పంట అవశేషాలను బహిరంగంగా కాల్చకుండా నాణ్యమైన బయోచార్‌గా మార్చి, నేల సేంద్రియ కార్బన్‌ను పెంచడంతో పాటు గాలి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOలు), కస్టమ్ హైరింగ్ కేంద్రాలు మరియు గ్రామీణ వ్యవసాయ సేవా కేంద్రాల ద్వారా ఈ యూనిట్ల వినియోగాన్ని విస్తరించడం ద్వారా స్థిరమైన, వాతావరణ అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించవచ్చు.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

ఇక్రిశాట్ పోర్టబుల్ బయోచార్ యూనిట్ తో బయోచార్ తయారీ

వ్యవసాయ వ్యర్థాల నిర్వహణకు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా అంతర్జాతీయ మెట్ట పరిశోదన కేంద్రం శాస్త్రవేత్తలు, చిన్న రైతుల కోసం సులభంగా తరలించగల పోర్టబుల్ బయోచార్ యూనిట్ ను అభివృద్ధి చేశారు. ఈ యూనిట్‌ను నేరుగా పొలంలోనే ఉపయోగించవచ్చు. పంట అవశేషాలను ఒకచోట చేర్చి బహిరంగంగా కాల్చే బదులు, నియంత్రిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా నాణ్యమైన బయోచార్‌గా మార్చవచ్చు. ఈ సాంకేతికత తక్కువ ఖర్చుతో పనిచేయడమే కాకుండా, చిన్న రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాలు సులభంగా వినియోగించేలా రూపొందించబడింది.

ఈ యూనిట్‌లో తయారైన బయోచార్ నాణ్యత ప్రయోగశాలలో తయారైన బయోచార్‌కు సమానంగా ఉన్నట్లు పరిశోధనల్లో నిర్ధారించబడింది. బయోచార్‌లో స్థిర కార్బన్ శాతం అధికంగా ఉండటం వల్ల నేలలో సేంద్రియ కార్బన్ పెరుగుతుంది, నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుంది, నేల ఆరోగ్యం బలపడుతుంది. అదే సమయంలో పంట అవశేషాల దహనం తగ్గి, గాలి కాలుష్యం మరియు హరితగృహ వాయువుల ఉద్గారాలు తగ్గుతాయి. ఈ వికేంద్రీకృత సాంకేతికత ద్వారా పంట అవశేషాలను “వ్యర్థం నుంచి విలువైన వనరుగా ” మార్చి, స్థిరమైన వ్యవసాయం మరియు వాతావరణ అనుకూల వ్యవసాయానికి తోడ్పడవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

కాన్-టికీ కిల్న్ పద్ధతిలో బయోచార్ తయారీ

కాన్-టికీ (Kon-Tiki) బయోచార్ కిల్న్ అనేది ఫ్లేమ్ కర్టెన్ (Flame Curtain) సూత్రం ఆధారంగా పనిచేసే తలక్రిందుల శంఖాకార కిల్న్. పంట అవశేషాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో తక్కువ పొగతో బయోచార్‌గా మార్చడానికి ఈ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది.

ముందుగా కిల్న్ అడుగు భాగంలో కొద్దిపాటి పొడి చెక్కలు లేదా ఇతర తేలికగా మండే పదార్థాలను వేసి మంట వేయాలి. అనంతరం వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు, చెరకు ఆకులు లేదా ఇతర పొడి పంట అవశేషాలను దశలవారీగా చిన్న పరిమాణాల్లో వేయాలి. పైభాగంలో ఏర్పడే మంట (Flame Curtain) పొగను దహనం చేస్తూ, కింది భాగంలోని అవశేషాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ద్వారా బయోచార్‌గా మారుస్తుంది. చివరలో అవసరమైన స్థాయిలో బయోచార్ ఏర్పడిన తర్వాత మంటను ఆపి, నీరు చల్లి లేదా గాలి ప్రవేశాన్ని నిలిపివేసి కిల్న్‌ను చల్లారనివ్వాలి.

     కిల్న్ పరిమాణాన్ని బట్టి ఒక్కో బ్యాచ్‌లో వంద కిలోల నుంచి సుమారు ఒక టన్ను వరకు పంట అవశేషాలను ప్రాసెస్ చేయవచ్చు. ముడి పదార్థం స్వభావాన్ని బట్టి సుమారు 10-20 శాతం బయోచార్ లభిస్తుంది. సాధారణంగా ఒక బ్యాచ్ పూర్తవడానికి 2-4 గంటల సమయం పడుతుంది.

     కాన్-టికీ కిల్న్ ద్వారా పొగ తక్కువగా విడుదలవుతుంది, నాణ్యమైన బయోచార్ ఉత్పత్తి అవుతుంది, తయారీ వేగంగా పూర్తవుతుంది మరియు పంట అవశేషాల దహనం వల్ల కలిగే పర్యావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. ఈ కారణాల వల్ల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు, వ్యవసాయ శిక్షణా కేంద్రాలు మరియు పెద్ద రైతులకు ఈ సాంకేతికత అనువైన ప్రత్యామ్నాయంగా గుర్తింపు పొందుతోంది.

భారతదేశంలో అనేక సంస్థలు మరియు ఫ్యాబ్రికేషన్ యూనిట్లు వివిధ పరిమాణాల కాన్-టికీ కిల్న్‌లను తయారు చేస్తున్నాయి. కిల్న్ పరిమాణం, ఉక్కు మందం, తయారీ నమూనాను బట్టి ధర ₹40,000 నుండి ₹70,000 ల మద్య ఉండవచ్చు.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

పూత, పిందె ఏర్పాటులో సహాయపడే బయోడైనమిక్ ఎరువు ‘యారో (502)’

యారోపూలను మగ కణుజు మూత్రాశయంలో ఉంచి వేసవికాలంలో ఎండలో వ్రేలాడదీసి, రాబోయే శీతాకాలంలో సారవంతమైన భూమిలో పూడ్చి పెట్టాలి. ఇది పొటాషియం, సిలికా, సెలీనియం చైతన్యకారక బాక్టీరియాని ప్రేరేపించి గంధకం యితర పదార్థాలతో కలియడానికి సహాయపడుతుంది. పూత, పిందె సరిగ్గా ఏర్పడకపోతే ఈ బలహీనతను పోగొట్టి పూత, పిందె ఏర్పాటులో సహాయ పడుతుందీ బయోడైనమిక్ ఎరువు. మొక్కలను బలపరచి పురుగుల తాకిడి నుండి రక్షిస్తుంది. గ్రహాల రిథమ్స్‌తో భూమిని కలపడానికి సహాయపడుతుంది.

Read More

టాప్-లిట్ అప్‌డ్రాఫ్ట్ కిల్న్ పద్ధతిలో బయోచార్ తయారీ

టాప్-లిట్ అప్‌డ్రాఫ్ట్ (Top-Lit UpDraft – TLUD) కిల్న్ అనేది పంట అవశేషాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా నాణ్యమైన బయోచార్‌గా మార్చే సమర్థవంతమైన సాంకేతికత. ఈ కిల్న్ సాధారణంగా ఇనుప లేదా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయబడుతుంది. అడుగు భాగంలో నియంత్రిత గాలి ప్రవేశానికి రంధ్రాలు, పై భాగంలో పంట అవశేషాలను నింపేందుకు అనువైన ఏర్పాటు ఉంటుంది.

ముందుగా పొడి పంట అవశేషాలను 5–15 సెం.మీ. పొడవు ముక్కలుగా చేసి కిల్న్‌లో నింపాలి. అనంతరం పైభాగంలో కొద్దిపాటి పొడి గడ్డి, చిన్న చెక్క ముక్కలు లేదా ఇతర తేలికగా మండే పదార్థాలను వేసి మంట వేయాలి. మంట పైభాగం నుంచి క్రమంగా క్రిందికి వ్యాపిస్తుండగా, అడుగు భాగం నుంచి పరిమితంగా ప్రవేశించే గాలి కారణంగా అవశేషాలు పూర్తిగా కాలిపోకుండా పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా బయోచార్‌గా మారతాయి.

పైరోలిసిస్ పూర్తయిన తర్వాత గాలి ప్రవేశాన్ని నిలిపివేసి కిల్న్‌ను చల్లారనివ్వాలి. అనంతరం తయారైన బయోచార్‌ను బయటకు తీసి నిల్వ చేయాలి లేదా కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి పొలంలో ఉపయోగించవచ్చు.

ఈ పద్దతిలో పొగ తక్కువగా విడుదలవుతుంది, బయోచార్ నాణ్యత మెరుగ్గా ఉంటుంది. తయారీ సమయం తగ్గుతుంది మరియు కార్బన్ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఈ కారణాల వల్ల చిన్న రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలకు ఇది అనువైన, వాతావరణ అనుకూల సాంకేతికతగా గుర్తింపు పొందుతోంది.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం,
రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

బయోడైనమిక్ ఎరువు… కొమ్ము ఎరువు (500)

దీనిని తాజా ఆవు పేడను చనిపోయిన ఆవు కొమ్ములలో నింపి సారవంతమైన భూమిలో ఆకురాలుకాలం నుండి వసంత రుతువు వరకు పాతిపెట్టి తయారుచేస్తారు. తయారయిన కొమ్ము ఎరువు శక్తివంతమైన భూమి చైతన్య కారకం. దీనిని భూమిలో కాల్షియం చురుకుదనాన్ని, సూర్యుని / జీవ శక్తులను భూమికి తీసుకురావడానికి ఉపయోగిస్తారు. ఈ శక్తులు విత్తనం మొలకెత్తడం, వేర్లు వృద్ధి చేయడం, మొక్క పెరగడంతోపాటు భూమిలో హ్యూమస్ ఏర్పడటానికి దోహదపడతాయి. కొమ్ము ఎరువును భూమి నిర్మాణానికి, భూమిలో ప్రయోజనకర బాక్టీరియా, శిలీంద్రాలు, వానపాములను పెంచుతాయి. ఎకరానికి 85 గ్రాముల కొమ్ము ఎరువుని సరిపడే నీటిలో కలిపి సవ్యదిశలో ఒక గంటసేపు కలిపి మధ్యాహ్నం తర్వాత భూమిపై సంవత్సరానికి కనీసం రెండుసార్లు వసంత ఋతువు, ఆకులు రాల్చే కాలంలో నీటి బిందువుల రూపంలో పిచికారి చేయాలి. కొమ్ము ఎరువు అసలైన బయోడైనమిక్ ఎరువు.

Read More

పొటాష్‌కు పొగాకు ద్రావణం

మొక్కల ఎదుగుదలలో కీలకపాత్ర పోషించే పొటాషియంను అందించడానికి సులభ రీతిలో పొగాకు ద్రావణాన్ని తయారుచేస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో తయారుచేసే ఈ ద్రావణాలు రైతులకు ఎంతో ఉపయోగకరం.

పొగాకు కాడలను ముక్కలుగా చేసుకుని ఒక కిలో కాడలకు ఏడు లీటర్ల నీటిని కలిపి ఏడు రోజుల పాటు నానబెట్టాలి. దీనివల్ల నీటిలో కరిగే పొటాష్ తయారవుతుంది. అరటి పండు ద్వారా కూడా పొటాష్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు.

లీటర్ నీటికి మూడుశాతం ద్రావణాన్ని కలిపి ఇవ్వడం వల్ల మొక్కకు కావలసిన పొటాష్‌తో పాటు తెగుళ్ల బెడద తగ్గుతుంది.

Read More

ఇటుకల కిల్న్ పద్ధతిలో బయోచార్ తయారీ

ఇటుకల కిల్న్ అనేది ఇటుకలు లేదా రాళ్లతో శాశ్వతంగా నిర్మించే బయోచార్ తయారీ నిర్మాణం. ఒకేసారి ఎక్కువ పరిమాణంలో పంట అవశేషాలను బయోచార్‌గా మార్చేందుకు ఈ పద్ధతి అనువైనది. ముఖ్యంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతు సమూహాలు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు మరియు గ్రామస్థాయి బయోచార్ ఉత్పత్తి కేంద్రాలు ఈ విధానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

ముందుగా కిల్న్ అడుగు భాగంలో పొడి చెక్కలు లేదా చిన్న కొమ్మలను అమర్చి మంట వేయాలి. అనంతరం వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు లేదా ఇతర పొడి పంట అవశేషాలను పొరలుగా నింపాలి. పై పొర మండడం ప్రారంభమైన తర్వాత కిల్న్ లో గాలి ప్రవేశాన్ని క్రమంగా నియంత్రించాలి. దీంతో అవశేషాలు పూర్తిగా కాలిపోకుండా పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా బయోచార్‌గా మారతాయి.

అవశేషాలు ఎక్కువ భాగం నల్లని బయోచార్‌గా మారిన తర్వాత గాలి ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేసి కిల్న్ ను మూసివేయాలి. అనంతరం పూర్తిగా చల్లారిన తర్వాత బయోచార్‌ను బయటకు తీసి బూడిదను వేరుచేయాలి. అవసరమైతే బయోచార్‌ను చిన్న ముక్కలుగా చేసి కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి పొలంలో ఉపయోగించవచ్చు.

ఇటుకల కిల్న్ ద్వారా ఒకేసారి ఎక్కువ పరిమాణంలో నాణ్యమైన బయోచార్‌ను తయారు చేయవచ్చు. ప్రారంభ నిర్మాణ వ్యయం కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలం ఉపయోగించుకునే అవకాశం ఉండటం, ఉత్పత్తి వ్యయం తగ్గడం, పెద్ద ఎత్తున బయోచార్ తయారీకి అనువుగా ఉండటం వల్ల గ్రామీణ స్థాయిలో సామూహిక బయోచార్ ఉత్పత్తికి ఈ పద్ధతి ఉత్తమ ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతోంది.

Read More

గొయ్యి పద్ధతిలో బయోచార్ తయారీ

యంత్రం లేదా ఇనుప డ్రమ్ అందుబాటులో లేని పరిస్థితుల్లో చిన్న గొయ్యి ద్వారా కూడా బయోచార్‌ను తయారు చేయవచ్చు. ఇందుకోసం సుమారు ఒక మీటరు లోతు గల గొయ్యిని తవ్వాలి. ఆ గొయ్యిలో పొడి పంట అవశేషాలను నింపి, పైభాగం నుంచి మంట వేయాలి. అవశేషాలు నల్లని రంగులోకి మారడం ప్రారంభమైన తరువాత గొయ్యిని మట్టి లేదా ఇనుప రేకుతో కప్పి, గాలి ప్రవేశాన్ని పరిమితం చేయాలి. ఈ దశలో ఆక్సిజన్ ప్రవేశం నియంత్రించబడటం వల్ల అవశేషాలు పూర్తిగా కాలిపోకుండా పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా బయోచార్‌గా మారతాయి.

కొంత సమయం తరువాత గొయ్యిని పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం మట్టి లేదా ఇనుప రేకును తొలగించి బయోచార్‌ను బయటకు తీసుకోవాలి. బూడిద ఏర్పడి ఉంటే దానిని వేరుచేసి, బయోచార్‌ను నిల్వ చేసుకోవచ్చు లేదా కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి పొలంలో ఉపయోగించవచ్చు.

ఈ పద్ధతిలో ఆక్సిజన్ ప్రవేశాన్ని పరిమితం చేయడం అత్యంత ముఖ్యమైన అంశం. గాలి ఎక్కువసేపు లోపలికి ప్రవేశిస్తే పంట అవశేషాలు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారతాయి. అటువంటి పరిస్థితిలో నాణ్యమైన బయోచార్ తయారు కాదు.

Read More

జీవన ఎరువులు నేలకు అమూల్యమైన ధననిధి

                    నేల దేశ సంపద, దేశం సుభిక్షంగా ఉండాలంటే నేల ఆరోగ్యంగా ఉండాలి. నేల అనగా అనేక బిలియన్ల బ్యాక్టీరియా, శిలీంధ్ర, నాచు ఇంకా అనేక రకాల సూక్ష్మజీవుల సహజీవనంతో తొణికిసలాడే సజీవమైన జీవధార వ్యవస్థగా గుర్తించాలి. ఇవి మొక్కల ఎదుగుదలకు పోషకంగానే కాక వర్షపు నీరును క్షామం కాలం వరకు ఉంచుకొని మొక్కలకు అందజేస్తా ఆరోగ్యంగా ఉంటేనే ఆహార భద్రత, ఆరోగ్యకరమైన పర్యావరణంతోనే  మానవాళి శ్రేయస్సు సాధ్యపడుతుంది.

                      ఇటీవల కాలంలో రైతాంగం విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులను, పురుగు మందులను వాడడం, అలాగే పంటల అవ శేషాలను కాల్చి వేయడం ద్వారా భూసారం గణనీయంగా క్షీణించడమే గాక పర్యావరణ కాలుష్యం, ఉపయోగకరమైన బ్యాక్టీరియా వినాశనానికి దారి తీస్తూ జీవన వైవిధ్యం వినాశనం సంభవిస్తుంది. తద్వారా సరైన పోషకాలు లేని బీడు భూములు ఏర్పడుతున్నాయి. మనకు స్వాతంత్య్రం వచ్చినపుడు ప్రతి కిలో ఎరువుకు 17 నుండి 18 కిలోల ధాన్యం పండేది. కానీ ప్రస్తుతం ప్రతి కిలో ఎరువుకు కేవలం 3 కిలోల ధాన్యం మాత్రమే పండుతుంది. ఇది భూసారం క్షీణించడాన్ని సూచిస్తుంది.

                 భూసారాన్ని పెంచడానికి, నేల ఉత్పా దకతను మెరుగుపరచడానికి సూక్ష్మజీవుల పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే ఇవి నజ్రజనిని స్థిరీకరిస్తాయి, పోషకాలను కరిగిస్తాయి. పోషకాలను విచ్ఛిన్నం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు సహజంగానే భూమిలో ఉంటాయి. కాని వీటి సంఖ్య త్వరీతంగా తగ్గుతూ వస్తుంది. పంటల దిగుబడిని పెంచడానికి సూక్ష్మ జీవులను కృత్రిమంగా పెంచి ఎక్కువ సంఖ్యలోకి తెచ్చి సూటి అయిన ఘన పదార్ధాలలో కలిపి మరల భూమిలో వెయ్యవచ్చు.

నత్రజనిని స్థిరికరించే జీవన ఎరువులు :

జీవన ఎరువులు వాడవలసిన మోతాదు ఏ ఏ పంటలకు

రైజోబియం 200 గ్రా. కంది,పెసర , మినుము, శనగ వంటి పంటలకు

అజటోబాక్టర్ 2 కిలోలు పప్పుజాతి పంటలను మినహాయించి మిగతా అన్ని పంటలకు

అజో స్స్పైరిల్లం 2 కిలోలు వరి, చెరకు, ప్రత్తి, మిర్చి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు , అరటి పంటలకు

నీలి ఆకుపచ్చనాచు 4 కిలోలు వరి పంటకు మాత్రమే వాడాలి.

రైజోబియం: లెగ్యూమ్‌ జాతి పంటలు అనగా అపరాల (పప్పుజాతి) పంటలకు నత్రజని అందించే జీవన ఎరువుగా వాడవలెను. పప్పుజాతి పైర్లలో ముఖ్యమైనవి కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు, వేరుశనగ, సోయాచిక్కుడు వంటి నూనె గింజల పైర్లకు రైజోబియం కల్చర్‌ను విత్తనమునకు పట్టించి ఉపయోగించాలి.
ఉపయోగించే విధానం: వంద మిల్లీలీటర్ల నీటిలో పది గ్రాముల పంచదార, బెల్లం, లేక గంజి పౌడర్‌ను కలిపి పది నిమిషాలు మరగబెట్టి చల్లార్చాలి. ఈ చల్లార్చిన ద్రావణం పది కిలోల విత్తనాలపై చల్లి, దానికి 200 గ్రాములు రైజోబియం కల్చర్‌ పొడిని బాగా కలపాలి. విత్తనం చుట్టూ పొరలు ఉండేలా జాగ్రత్త వహించాలి.

 ఈ ప్రక్రియకు రైతులు పాలిథిన్‌ సంచిగానీ, ప్లాస్టిక్‌ తొట్టిని గాని ఉపయోగించుకోవచ్చు. పది నిమిషాలు నీడలో ఆరబెట్టిన తరువాత రైతులు పొలంలో నాటుకోవలెను

అజటోబాక్టర్‌: పప్పుజాతి పంటలను మినహాయించి, మిగతా అన్ని పంటలకు నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ బాక్టీరియా నత్రజనిని స్థిరీకరించడమే కాక, మొక్కకు కావాల్సిన హార్మోన్లు, విటమిన్లు అందిస్తుంది.

 ఈ బాక్టీరియా ముఖ్యంగా సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న భూమిలో సమర్థవంతంగా పని చేస్తుంది. అందువల్ల ఈ జీవన ఎరువు ఆకుకూరలు, కూరగాయలు, పూల తోటలకు సిఫారసు చేయబడుతుంది.

వాడే విధానం: ఏ పంటకు వాడినా రెండు కిలోల కల్చర్‌ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో ఒక ఎకరం నేలపై వెదజల్లాలి. ఇది చల్లిన సమయంలో కాని, వెనువెంటనే భూమిలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి

అజోస్ప్తెరిల్లమ్‌ : ఈ మధ్యకాలంలో దీని ప్రాముఖ్యత అధికంగా గుర్తించారు. ఈ బాక్టీరియా మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశమున్న చోట వేర్లలోకి చరొబడి కూడా జీవిస్తాయి.
ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువశాతం అందుబాటులో ఉంటుంది. ఈ జీవన ఎరువును లెగ్యూమ్‌జాతి పంటలకు తప్పించి, మిగతా పంటలకు వాడుకోవచ్చు.
ఇది వరి, చెరకు, పత్తి, మిర్చి, జొన్న, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, అరటి పంటలకు బాగా ఉపయోగపడుతుంది. సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలలో ఇది పని చేస్తుంది.

ఉపయోగించే విధానం:

         తక్కువ కాలం పంటలకు రెండు కిలోల అజోస్పెరిల్లమ్‌ కల్చర్‌ను   80-100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలంలో విత్తనం కింద పడేలా వేసుకోవాలి. నారుమడి వేసుకొనే పంటలకు నారు పీకేందుకు ముందుగా నారుమడి వద్ద 70 నుంచి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి. 

 ఆ నీటిలో రెండు కిలోల అజోస్పెరిల్లమ్‌ జీవన ఎరువును బాగా కలిపి, ఆ ద్రావణంలో పది నిమిషాలు వేళ్లను మాత్రమే ముంచి వెంటనే నాటుకోవాలి. చెరకు పంట విషయంలో నాటే విత్తనం చెరకు ముక్కలను పది నిమిషాలు ముంచి నాటుకోవాలి.

       పంట మొక్కలకు వేసిన లభ్య భాస్వరం, భూమిలో చేరిన కొద్ది రోజుల వ్యవధిలో భూమి ఉదజని సూచకను అనుసరించి, వివిధ రకములైన లభ్యంకాని భాస్వరం రూపంలోని మారుతుంది. 

 ఒక వేళ భూమి క్షార గుణం కలిగి వున్న, వేసిన భాస్వరం కాల్షియం, మెగ్నీషియం ఫాస్పేట్స్‌గా మారి, మొక్కకు లభ్యంకాదు. 

 ఈ పరిస్థితుల్లో భాస్వరానికి సంబంధించి జీవన ఎరువులు వేస్తే లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరం మొక్కకు దొరుకుతుంది.

భాస్వరంను అందించే జీవన ఎరువులు
PSB (ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బాక్టీరియా) 2 కిలోలు/ 500 మీ.లీ/ఎకరాకు అన్ని పంటలకు వాడుకోవచ్చు

ఫాస్ప్ ఫంగై 2 కిలోలు అన్ని పంటలకు వాడుకోవచ్చు

ఫాస్పేట్ మోబి లైజింగ్ మైకోరైజా 5 కిలోలు అన్ని పంటలకు వాడుకోవచ్చు

పొటాషియం మోబిలైజర్స్:
ప్రటూరియా అరాషనియా 2 కిలోలు నూనెగింజల పంటలకు ఎక్కువ ఉపయోగపడుతుంది

ఫాస్పోబాక్టీరియా :
ఈ జీవన ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యే రూపంలోకి మార్చుతుంది. ఈ జీవన ఎరువును అన్ని పంటలకు వాడుకోవచ్చు.

ఇది సమర్థవంతంగా పని చేసేందుకు సేంద్రియ కర్బనము అత్యవసరం. దీన్ని సేంద్రియ ఎరువుతో కలిపి వాడాలి. ఈ జీవన ఎరువు మొక్కకు రోగ నిరోధక శక్తిని పెంచి, తద్వారా పంట దిగుబడి పెంచుతుంది

వాడే విధానం :
ఎకరాకు 2.0 కిలోల ఫాస్పోబాక్టర్‌ను లేదా ద్రవ రూపంలో ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బాక్టీరియా 500 మీ.లీ, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగానీ, మొక్క నాటినప్పుడుగానీ సాళ్లలో పడేలా వేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

పొటాషియం మొబిలైజర్స్ :
ఈ జీవన ఎరువు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పొటాషియంను అందుబాటులోకి తెచ్చును. ఈ జీవన ఎరువుల్లో ఉండేటటువంటి మొబిలైజింగ్ సూక్ష్మజీవులు, విడుదల చేసే ఎంజైముల వల్ల ఈ ప్రక్రియ జరుగుతుంది.

వాడే విధానం :
ఎకరాకు 2.0 కిలోల పొటాషియం రిలీసింగ్ బాక్టీరియా లేదా ద్రవరుపం లో పొటాషియం రిలీసింగ్ బాక్టీరియా 500 మీ.లీ, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగానీ, మొక్క నాటినప్పుడుగానీ సాళ్లలో పడేలా వేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

డా. ఎం. వెంకట లక్ష్మి(సస్య పోషణ), డా.డి.సుధా రాణి (సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి),
డా. కె. రేవతి (సస్య రక్షణ) కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల, కృష్ణాజిల్లా – 521 133. Ph: 8008201253

Read More