వివిధ బయోచార్ తయారీ పద్ధతుల పోలికలు

బయోచార్ అనేది పంట అవశేషాలు, చెట్ల కొమ్మలు, ఎండిన ఆకులు, కొబ్బరి చిప్పలు, ఇతర సేంద్రియ వ్యర్థాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో 250-700°C ఉష్ణోగ్రత వద్ద వేడి చేసే పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా తయారయ్యే కార్బన్ అధికంగా ఉండే నల్లని ఘన పదార్థం. సాధారణంగా పంట అవశేషాలను బహిరంగంగా కాల్చితే వాటిలోని కార్బన్, గాలిలో కార్బన్ డయాక్సైడ్ రూపంలో విడుదలవుతుంది. కానీ బయోచార్ తయారీ సమయంలో కార్బన్‌లో ఎక్కువ భాగం స్థిర రూపంలో నిల్వ ఉండి, తరువాత నేలలో కలిపినప్పుడు వందల నుంచి వేల సంవత్సరాల వరకు స్థిరంగా నిలిచి సేంద్రియ కార్బన్ నిల్వను పెంచుతుంది. అలాగే నేల నిర్మాణాన్ని మెరుగుపరచి, నీటిని మరియు పోషకాలను నిల్వ ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది. బయోచార్‌లోని సూక్ష్మ రంధ్రాలు ఉపయోగకరమైన సూక్ష్మజీవులకు అనుకూల నివాసంగా పనిచేసి నేల జీవక్రియలను చురుకుగా ఉంచుతాయి.

పద్ధతి: గొయ్యి పద్ధతి
పెట్టుబడి: చాలా తక్కువ
సామర్థ్యం: తక్కువ
ప్రధాన లక్షణాలు: పొగ ఎక్కువ, నాణ్యత మధ్యస్థం, చిన్న రైతులకు అనుకూలం
ప్రయోజనాలు: పరికరం అవసరం లేదు
పరిమితులు: ఆక్సిజన్ నియంత్రణ కష్టం

పద్ధతి: డ్రమ్ (200 లీ)
పెట్టుబడి: తక్కువ
సామర్థ్యం: 20-60 కిలోలు/బ్యాచ్
ప్రధాన లక్షణాలు: పొగ తక్కువ, నాణ్యత అధికo, చిన్న రైతులకు అనుకూలం
ప్రయోజనాలు: తక్కువ ఖర్చు, సులభ నిర్వహణ
పరిమితులు: సామర్థ్యం తక్కువ

పద్ధతి: TLUD కిల్న్
పెట్టుబడి: మధ్యస్థం
సామర్థ్యం: మధ్యస్థం
ప్రధాన లక్షణాలు: పొగ చాలా తక్కువ, నాణ్యత అధికo, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అనుకూలం
ప్రయోజనాలు: అధిక కార్బన్ నిల్వ
పరిమితులు: ప్రత్యేక కిల్న్ అవసరం

పద్ధతి: కాన్-టికీ కిల్న్
పెట్టుబడి: మధ్యస్థం – ఎక్కువ
సామర్థ్యం: 0.1-1.0 టన్ను/బ్యాచ్
ప్రధాన లక్షణాలు: పొగ చాలా తక్కువ, నాణ్యత అత్యుత్తమం
ప్రయోజనాలు: అధిక ఉత్పత్తి, తక్కువ కాలుష్యం
పరిమితులు: పెట్టుబడి, శిక్షణ అవసరం

పద్ధతి: ఇటుకల కిల్న్
పెట్టుబడి: ఎక్కువ
సామర్థ్యం: అధికం
ప్రధాన లక్షణాలు: పొగ తక్కువ, నాణ్యత అధిక, గ్రామ కేంద్రాలకు అనుకూలం
ప్రయోజనాలు: పెద్ద మొత్తంలో ఉత్పత్తి
పరిమితులు: స్థిర నిర్మాణం అవసరం

పద్ధతి: ఇక్రిశాట్/ భోపాల్ పోర్టబుల్ యూనిట్
పెట్టుబడి: మధ్యస్థం
సామర్థ్యం: మధ్యస్థం
ప్రధాన లక్షణాలు: పొగ చాలా తక్కువ, నాణ్యత అధిక, చిన్న రైతులు/ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అనుకూలం
ప్రయోజనాలు: తరలించవచ్చు
పరిమితులు: పరిమిత లభ్యత

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

పురుగులు, తెగుళ్ళ నియంత్రణలో ఉపయోగపడే వావిలాకు కషాయం

పంటపొలాల చుట్టూ ప్రకృతిలో దొరికే వివిధ రకాల ఆకులను ఉడకపెట్టడం ద్వారా కషాయాలను తయారు చేస్తారు. ఇది మన సంప్రదాయ వ్యవసాయంలో భాగం. ఆకులను ఉడకపెట్టడం వలన అందులో ఉండే మూల పదార్థాలు పూర్తి స్థాయిలో ద్రావణంలో చేరి కషాయం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. పంటల సస్యరక్షణలో ఈ కషాయాలు అనాదిగా రైతులకు తెలిసినవే. ఇందులో ముఖ్యంగా వావిలాకు కషాయం రైతులకు వివిధ పంటలలో పురుగుల నియంత్రణ కొరకు ఉపయోగపడుతుంది.

వావిలాకులో సహజంగా ఉండే ఎన్నో రకాల ‘ఆల్కలాయిడ’ల వలన ఇది పురుగుల నియంత్రణలో మరియు తెగుళ్ళ నియంత్రణలో ఉపయోగపడుతుంది.

వావిలాకు కషాయాన్ని పంటలలో వచ్చే రసం పీల్చే పురుగులపైన, చిన్న దశలలో ఉన్న లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, ఆకులను తినే పురుగులపై వాడవచ్చు.

వావిలాకులో “నిర్ణుడిన” మూల పదార్థంగా ఉండడం వలన ఇది పురుగులను స్పర్శ చర్య ద్వారా మరియు పొగ చర్య ద్వారా నియంత్రించడంలో ఉపయోగ పడుతుంది.

వావిలాకును వైద్యంలో ఉపయోగిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అలాగే వావిలాకు ఆకులు వ్యవసాయంలో సస్యరక్షణలో కూడా ఉపయోగపడుతున్నవి. ఇది పురుగులకు అభివృద్ధి నిరోధకంగా మరియు క్రిమిసంహారకంగా పనిచేస్తుంది.

కావలసిన పదార్థాలు:
వావిలాకు : 5 కిలోలు
సబ్బు పొడి : 100 గ్రాములు (లేదా)
కుంకుడుకాయలు : 500 గ్రాములు

తయారు చేసే విధానం:

  • ఈ ఆకులను 10 లీటర్ల నీటిలో అరగంట నుండి గంట సేపు బాగా ఉడకబెట్టాలి. ఈ విధంగా ఉడకబెట్టిన కషాయం సుమారు 5 లీ. వరకు ఉంటుంది.
  • ఒక కర్రతో ఉడుకుతున్న కషాయాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
  • కషాయాన్ని బాగా చలార్చి, పలుచని గుడ్డతో వడపోయాలి.
  • కషాయానికి 100 గ్రా. సబ్బుపొడిని లేదా 500 గ్రా. కుంకుడుకాయ రసాన్ని కలపాలి.
  • ఈ కషాయానికి 100 లీటర్ల నీటిని చేర్చి ఒక ఎకరాకు సాయంత్రం వేళ పంటపై పిచికారీ చేయాలి.

జాగ్రత్తలు:

  • వావిలాకు కషాయం తయారు చేసేటపుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి.
  • పంట కాలంలో పంట దశను మరియు పురుగు ఉధృతిని బట్టి 2-3 సార్లు పిచికారీ చేసుకోవచ్చు.
  • తయారు చేసిన కషాయాన్ని నిల్వ ఉంచరాదు.

ఉపయోగాలు:

  • వావిలాకు కషాయాన్ని అన్ని పంటలలో వచ్చే పురుగుల నియంత్రణలో వాడవచ్చు.
  • పంట తొలిదశలో (30 – 45 రోజులు) సుమారు 100 లీ. ద్రావణం ఒక ఎకరాకు సరిపోతుంది. పంట (60 నుండి 90 రోజులు) మధ్య దశలో సుమారు 150 లీ. ద్రావణం మరియు పంట చివరి దశలో (90-120 రోజులు) సుమారు 200 లీ. ద్రావణం ఒక ఎకరాకు అవసరం పడుతుంది.
  • వావిలాకు కషాయం వేరుశనగలో వచ్చే తామర పురుగు, మిరపలో వచ్చే ఆకుముడత, కూరగాయ పంటలను ఆశించే రసం పీల్చే పురుగుల నియంత్రణలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.
  • వావిలాకు కషాయం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పంటలపై పిచికారీ చేయాల్సి ఉంటుంది.
  • పురుగుల తొలిదశలో వావిలాకు కషాయం బాగా పనిచేస్తుంది.
Read More

ఔషధ మొక్క… జిల్లేడు

జిల్లేడు మొక్కలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అంతటా పొలాల్లోను, బీడు భూముల్లోను, రోడ్ల ప్రక్కనా కలుపు మొక్కలుగా పెరుగుతాయి. జిల్లేడు 2-4 మీటర్ల ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క. ఆకులు కణుపుకు రెండు చొప్పున అండాకారంలో ఉండి, తుంపితే పాలు కారతాయి. ఇవి కాడలు లేకుండా దళసరిగా ఉండి తెల్లని నూగుతో కప్పబడి ఉంటాయి. పువ్వులు తెల్లగాగానీ లేదా ఊదా రంగులో గానీ ఉండి కొమ్మల చివర గుత్తులుగా ఏర్పడతాయి. కాయలు విడివిడిగాగానీ, జంటలుగాగానీ ఏర్పడతాయి. కాయలు ఒకవైపు నిలువుగా బ్రద్ధలై, విత్తనాలు గాలితోపాటు నెమ్మదిగా బయట పడతాయి. పూవులు, కాయలు సంవత్సరం పొడవునా ఏర్పడతాయి. ఈ మొక్కలో “కెలోట్రాపిన”, “జైగాంటి యాల” వంటి అనేక ఆల్కలాయిడ్‌లు, రసాయనాలు ఉంటాయి.

సాధారణ నామం : మిల్క్‌వీడ్ శాస్త్రీయ నామం : కలోట్రాపిస్ జైగాంటియా కుటుంబం: ఆస్ల్కెపియడేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • జిల్లేడు మానవులు, పశువులు, పంటల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది. పంటల్లో దిగుబడి పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది.
  • మానవులలో : విరేచనాలు, బోదకాలు, కుష్టు, గజ్జి, తామర, సిఫిలిస్, కీళ్ళనొప్పులు, న్యుమోనియా, పళ్ళనొప్పులు, దగ్గు, జలుబు, ఆస్త్మా, జ్వరం, పాముకాటు, కడుపులో నులిపురుగులు, అల్సర్లు, నరాల వ్యాధులు, చర్మవ్యాధులు, ఆస్త్మా, అబార్షన్ నివారణకుపయోగిస్తుంది.
  • పశువులలో : ఎక్సిమా, వాపులు, చలిజ్వరం, కంట్లో పడిన నలకలను, పరాన్నజీవులను, వ్రణాలనూ, బోదకాలు, కుష్టు, మొండిఎక్ౙిమా, డయేరియా, డీసెంట్రీలను నివారిస్తుంది.

వ్యవసాయరంగంలో …

  • పంటలకు ఎరువుగా, పురుగులు, తెగుళ్ళ నివారణలో ఉపయోగపడుతుంది.
    అ) ఎరువుగా : జిల్లేడు ఆకులను, చిన్న చిన్న లేత మొక్కలను పచ్చి ఆకుఎరువుగా వినియోగించుకోవచ్చు. ఎకరానికి సుమారు 100 కి. జిల్లేడు రొట్ట అవసరమౌతుంది. కానుగ, గ్లెåరిసిడియా, తంగేడు, వేప వంటి మొక్కల పచ్చి ఆకులతో కలిపి ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. జిల్లేడు ఆకులలో 2 శాతం నత్రజని, 0.5 శాతం భాస్వరం, 0.3 శాతం పొటాష్ ఉంటాయి. పచ్చి ఆకుల ఎరువు వేయడం వలన భూమిలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది పోషకాలు మొక్కలకందుబాటులోకి వస్తాయి.

ఆ) పురుగు నివారణలో…

  • చెరకు ముచ్చెలను 15%, 20% జిల్లేడు ఆకు కషాయ ద్రావణంలో ముంచి లేదా ముచ్చెలను నాటే ముందు జిల్లేడు ఆకులను 24 నుండి 48 గంటలు నీటిలో నానబెట్టి, వడకట్టిన ద్రావణాన్ని భూమిలో చల్లడం ద్వారా పాండిచ్చేరి, ఒరిస్సా, గుజరాత్ రైతులు చెరకు పంటలో చెదలను నివారిస్తున్నారు.
  • 8 -10 కి. జిల్లేడు ఆకులను 24 గంటలు నీటిలో నానబెట్టి, మరగబెట్టి, వడపోసి చెదలు ఆశించిన భూమిలో చల్లి నివారించవచ్చు.
  • గుజరాత్ రైతులు 50 జిల్లేడు కొమ్మలను ఆకులతో సహా వరి చేలల్లో 14.6 మీ. దూరంలో ఉంచి పేనుబంకని నివారించగలిగారు. కొమ్మలను పేనుబంక ఆశించే కాలంలో 3 సార్లు మార్చారు.
  • కర్ణాటక రైతులు జిల్లేడు మొక్కలను నూరి కషాయాన్ని సాగు నీటి ద్వారా పారించి వరిలో కాండం, వేరు తొలుచు పురుగులను నివారించారు.
  • గుజరాత్‌లోని భావనగర్ రైతులు 1 పాలు జిల్లేడు పాలను 15 పాళ్ళు నీటిలో కలిపి ప్రత్తి పంటపై పిచికారి చేసి గొంగళిపురుగులను 3 రోజుల్లో నివారించగలిగారు.
  • తెలంగాణ రాష్ట్రంలో మెదక్, నల్గొండ రైతులు వేరుశనగ పొలంలో సరిహద్దుల్లో జిల్లేడు కొమ్మలను ఉంచి ఎర్రగొంగళిపురుగులను నివారించగలిగారు. ఆముదం, నువ్వులు, వేరుశనగ పొలాల్లో జిల్లేడు కొమ్మలను ఎరగావేసి ఎర్రగొంగళి పురుగును నివారించారు. దీపపు ఎరలు, ఫెరమోన్ ఎరలకన్నా ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్న పని.
  • గుజరాత్‌లోని సబర్కంతా ప్రాంతంలో అల్లం పంటలో పురుగుల నివారణకు పొలంలో అక్కడక్కడ జిల్లేడు మొక్కలను నాటుతారు.
  • వేరుశనగలో జిల్లేడు ఆకు ద్రావణాన్ని (1 శాతం) వేరుశనగ మొలకెత్తిన 40 రోజులలో పిచికారి చేసి మొవ్వుకుళ్ళు తెగులుని తగ్గించగలిగారు.
  • ఎండాకాలంలో బత్తాయి, నిమ్మ, జామ, ఉసిరి, మామిడి చెట్ల మొదళ్ళపై చెదలు కనిపించగానే మట్టినంతా దులిపేసి మొక్క మొదలుచుట్టూ 25 కి. జిల్లేడు ఆకులు పరచి మట్టిలో బాగా కలిసిపోయేలా తిరగత్రవ్వాలి. సంవత్సరకాలంలో 34 సార్లు ఇలా చేయాలి.
  • వేరుశనగ పంటలో ఎర్రగొంగళి పురుగు నివారణకు పొలం చుట్టూ లోతైన మడక చాలుని ఏర్పాటు చేసి అందులో జిల్లేడు ఆకులను పరచి, వాటికి ఆశించిన పురుగులను చంపివేయాలి.
  • పంటలపై వచ్చే పురుగుల నివారణకుపయోగించే వివిధ ఆకుల కషాయం (కీటకనాశిని) తయారీలో జిల్లేడు ఆకులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

వివిధ ఆకుల కషాయం తయారు చేసే పద్ధతి
కావలసిన పదార్థాలు

  • పశువులు, గొర్రెలు తినని ఆకులు (వావిలి, అడ్డసరం ఆకులు) : 3 కి.
  • పాలుకారే ఆకులు (జిల్లేడు, గన్నేరు, మేడి) : 3 కి.
  • చెడు వాసన నిచ్చే ఆకులు (రబ్బరు ఆకు, తూటికూడ ఆకు, లాంటానా) : 3కి.
  • చేదుగా ఉండే చెట్లకాయలు (వేప, ముష్టి, కానుగ) 5 కి.
  • ఆవుపేడ మరియు నీరు: పేడ 15 కి, నీరు 45 లీ.
  • గోమూత్రం : 15 లీ.
  • ప్లాస్టిక్ డ్రమ్ము లేదా మట్టికుండలో తయారు చేసుకోవచ్చు.

తయారీ విధానం :

  • ముందుగా 15కి., ఆవుపేడను 45 లీ. నీటిలో కలిపి ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో గానీ, మట్టికుండలోగానీ పోసి మూత పెట్టాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు కర్రతో కలుపుతూ 4 రోజులు మురగబెట్టాలి. 5వ రోజున పైన పేర్కొన్న ఆకులు, కాయలు తెచ్చి ముందుగా కాయలు మెత్తగా కొట్టి ఆవుపేడ, నీరు మిశ్రమంలో పోయాలి. ఆ తర్వాత ఆకులను మెత్తగా నూరి డ్రమ్ములో వేసి 15 లీ. గోమూత్రం అందులో పోసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. ఆపైన డ్రమ్ము/కుండపై మూత బెట్టి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం బాగా కలియబెట్టాలి. మొదటి రోజు ఆకులు పైకి తేలతాయి. ఒక మోస్తరుగా ఆకులన్నీ మాగిన తర్వాత 5వ రోజు నుండి ఆకులన్నీ ద్రావణం క్రిందకు జారతాయి. ఈ విధంగా 10 నుండి 15 రోజులు ఉంచిన ఈ మిశ్రమాన్ని పలుచటి గుడ్డలో వడపోసి ఉంచుకోవాలి. ఈ ద్రావణాన్ని అన్ని పంటల్లో వాడవచ్చు.

మోతాదు : ఒక లీటరు ద్రావణం 10 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు 100 లీటర్లు పిచికారి చేయాలి.

వరిలో కాండంతొలిచే పురుగు లేదా తెల్ల కంకి నివారణ

  • ఈ పురుగు నివారణకు రైతులు ఎకరాకు 100 కి. జిల్లేడు ఆకులు, లేత కొమ్మలను వరిపొలంలో 30-45 రోజుల మధ్య సమంగా వేసి నీటిని పొలం నుండి తీయకుండా సుమారు 5 రోజులు ఉంచుతారు. పొలంలో వేసిన జిల్లేడు ఆకులు క్రమంగా మాగి తర్వాత కుళ్ళుతాయి. జిల్లేడు ఆకులోని ఆల్కలాయిడ్స్ వల్ల కాండంతొలిచే పురుగు ఉత్పత్తి తగ్గుతుంది. జిల్లేడు ఆకులు ఉపయోగించిన రైతు పొలంలో తెల్లకంకి బెడద చాలా తక్కువగా ఉంది. 5 రోజుల తర్వాత పొలంలో నీరు తీసివేసి మరల 23 సెం.మీ. లోతు మించకుండా నీరు కట్టాలి (రైతుల అనుభవం).

తెగుళ్ళ నివారణలో…

  • జిల్లేడు ఆకులకు శిలీంద్రనాశిని గుణాలు కూడా వున్నాయని పరిశోధనలలో తేలింది. అనేక దేశాలలో మామిడితోటల సాగులో విపరీత నష్టాన్ని కలిగిస్తున్న ఫ్యుజేరియం మాంగిఫెరే అనే తెగులు కారక శిలీంద్రం జీవనియంత్రణలో ఉపయోగపడతాయి. జిల్లేడు ఆకుల కషాయం భూమిలో నివసించి పం\ల్లో తెగుళ్ళను కలిగించే ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఫ్యుజేరియం సొలాని, రైజోక్టోనియా ఒరైజేసెటైవే శిలీంద్రాల పెరుగుదలను అరికట్టింది. (మండేపూడి డేవిడ్ మరియు అతని అనుచరులు, 2013). కాని ఈ శిలీంద్రాల పెరుగుదలనరికట్టే ట్రైకోడెర్మా విరిడె అనే జీవనియంత్రణకారక శిలీంద్రం పెరుగుదలపై ఎటువంటి ప్రభావం చూపలేదు. అందువలనే జిల్లేడు ఆకులను పచ్చి ఆకు ఎరువుగా నారుమళ్ళలో నారు మొక్కలను పెంచడానికి, కొబ్బరి తోటల్లో ఎరువుగా వాడుచున్నారు.

పంటల దిగుబడి పెరగడానికి…

  • పోక, కొబ్బరి తోటల్లో దిగుబడులు పెంచడానికి కొన్ని గ్రామాల్లో రైతులు చెట్ల మొదళ్ళు చుట్టూ మట్టిని త్రవ్వి 25-45 కి. జిల్లేడు ఆకుల ముక్కలను వలయాకారంలో భూమిలో పాతిపెడతారు.
  • వర్షాకాలంలో పోకచెట్టు లేదా కొబ్బరి చెట్లకు సహజంగా పాలు లేదా జిగురు కారే మొక్కల ఆకులను పచ్చి ఆకు ఎరువుగా వేస్తే దిగుబడులు పెరుగుతాయని రైతుల నమ్మకం.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

గేదె పదేపదే ఎదకు వస్తోందా? గర్భం నిలవకపోవడానికి కారణాలు – రైతులు ఏం చేయాలి?

గేదె ఎదకు వచ్చింది… కృత్రిమ గర్భధారణ (AI) చేయించారు… కానీ గర్భం నిలవకుండా మళ్లీ ఎదకు వచ్చింది. మరోసారి కృత్రిమ గర్భధారణ చేయించినా అదే పరిస్థితి. ఇలా పదేపదే జరిగితే రైతుకు ఖర్చు పెరగడమే కాకుండా, రెండు ఈతల మధ్య కాలం పెరిగి పాల ఉత్పత్తి మరియు ఆదాయంపై కూడా ప్రభావం పడుతుంది.

గేదె సాధారణంగా ఎదకు వస్తున్నప్పటికీ, సరైన సమయంలో మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు కృత్రిమ గర్భధారణ చేయించినా గర్భం దాల్చకపోతే దీనిని రిపీట్ బ్రీడింగ్ (Repeat Breeding) అంటారు.

దీనికి ఒకే కారణం ఉండదు. ఎదను సరిగ్గా గుర్తించకపోవడం, కృత్రిమ గర్భధారణ సమయం తప్పడం, ప్రసవం తర్వాత గర్భాశయ సమస్యలు, సమతుల్య ఆహారం అందకపోవడం, ఖనిజలవణాల లోపం వంటి అనేక కారణాలు ఉండవచ్చు. అందువల్ల గర్భం నిలవడం లేదని పదేపదే కృత్రిమ గర్భధారణ చేయించడం కాకుండా, అసలు కారణాన్ని గుర్తించి దానికి తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యం.

ఎదను సరిగ్గా గుర్తించండి
గేదెల్లో ఎద లక్షణాలు ఆవులతో పోలిస్తే కొన్నిసార్లు స్పష్టంగా కనిపించవు. ముఖ్యంగా రాత్రి లేదా తెల్లవారుజామున ఎదకు వస్తే రైతు గమనించకుండా పోయే అవకాశం ఉంటుంది. ఎదను సరిగ్గా గుర్తించకపోతే కృత్రిమ గర్భధారణ చేయించే సమయం కూడా తప్పిపోవచ్చు.

అందుకే ఉదయం, సాయంత్రం గేదెలను కొద్దిసేపు ప్రత్యేకంగా గమనించండి. ఇతర గేదె ఎక్కినప్పుడు కదలకుండా నిలబడటం ఎదకు ముఖ్యమైన లక్షణం. ఇతర పశువులపై ఎక్కడానికి ప్రయత్నించడం, యోని నుంచి పారదర్శకమైన జిగట స్రావం రావడం, తరచుగా మూత్రం పోయడం, సాధారణం కంటే ఎక్కువగా తిరుగుతూ ఉండటం, తోకను ఎత్తడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

అయితే ఒక్క లక్షణాన్ని చూసి ఎదకు వచ్చిందని నిర్ణయించకుండా, రెండు మూడు లక్షణాలను కలిపి గమనించడం మంచిది.

రైతులకు సూచన: ఎద లక్షణాలు మొదట కనిపించిన తేదీతో పాటు సమయాన్ని కూడా రాసిపెట్టండి. సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.
సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించండి

ఎదను గుర్తించడం ఎంత ముఖ్యమో, సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించడం కూడా అంతే ముఖ్యం. చాలా ముందుగా లేదా ఆలస్యంగా కృత్రిమ గర్భధారణ చేయిస్తే గర్భం దాల్చే అవకాశం తగ్గవచ్చు.
రైతులు సులభంగా గుర్తుంచుకోవడానికి సాధారణంగా ఉదయం ఎద స్పష్టంగా కనిపిస్తే అదే రోజు సాయంత్రం, సాయంత్రం ఎద కనిపిస్తే మరుసటి రోజు ఉదయం కృత్రిమ గర్భధారణ చేయించడం అనుసరించే పద్ధతి.
ఎద ఎప్పుడు మొదలైందో స్పష్టంగా తెలియకపోతే ఊహించి సమయం నిర్ణయించకుండా, శిక్షణ పొందిన కృత్రిమ గర్భధారణ సిబ్బంది లేదా పశువైద్యుని సలహా తీసుకోవడం మంచిది.

ముఖ్య సూచన: గర్భం నిలవలేదని వెంటనే మరోసారి కృత్రిమ గర్భధారణ చేయించడమే పరిష్కారం కాదు. ముందుగా ఎదను సరిగ్గా గుర్తించామా, కృత్రిమ గర్భధారణ సరైన సమయంలో జరిగిందా అనే విషయాలను పరిశీలించాలి.

ప్రసవం తర్వాత ఆరోగ్యాన్ని గమనించండి
కొన్ని గేదెల్లో రిపీట్ బ్రీడింగ్ సమస్యకు కారణం గత ప్రసవం తర్వాతే మొదలవుతుంది. ప్రసవం తర్వాత గర్భాశయం మళ్లీ ఆరోగ్యకరమైన స్థితికి రావాలి. మాయ పడటం ఆలస్యం కావడం, గర్భాశయంలో ఇన్ఫెక్షన్ రావడం వంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే తరువాత గర్భం దాల్చడంపై ప్రభావం పడవచ్చు.

ప్రసవం తర్వాత గేదెను జాగ్రత్తగా గమనించండి. మాయ పడటం ఆలస్యమైనా, దుర్వాసనతో కూడిన లేదా అసాధారణమైన స్రావం వచ్చినా నిర్లక్ష్యం చేయకండి. జ్వరం, ఆకలి తగ్గడం లేదా బాగా నీరసంగా కనిపించడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పశువైద్యుని సంప్రదించాలి.

ఇలాంటి సమస్యలను తొలిదశలోనే గుర్తించి చికిత్స చేయిస్తే తరువాత వచ్చే పునరుత్పత్తి సమస్యలను తగ్గించుకోవచ్చు.

సమతుల్య ఆహారం అందించండి
గేదెకు కడుపు నిండా మేత ఇవ్వడం మాత్రమే సరిపోదు. పాల ఉత్పత్తితో పాటు గర్భం దాల్చడానికి కూడా అవసరమైన పోషకాలు తగినంతగా అందాలి. పచ్చిమేత, ఎండుమేత, దాణా సరైన పరిమాణంలో అందకపోవడం లేదా పాలిచ్చే గేదెకు అవసరమైన పోషకాలు తగినంతగా అందకపోవడం వల్ల పశువు క్రమంగా బలహీనపడవచ్చు. ఇది ఎదకు రావడం మరియు గర్భం దాల్చడంపై కూడా ప్రభావం చూపవచ్చు.

అందువల్ల మంచి నాణ్యత గల పచ్చిమేత, ఎండుమేతతో పాటు పాల ఉత్పత్తికి అనుగుణంగా దాణా ఇవ్వాలి. ఎల్లప్పుడూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. గేదె క్రమంగా బలహీనపడుతున్నట్లు లేదా బక్కగా అవుతున్నట్లు కనిపిస్తే కేవలం దాణా పరిమాణం పెంచడం కాకుండా, రోజువారీ ఆహారంలో అవసరమైన పోషకాలు సమతుల్యంగా అందుతున్నాయా అనే విషయాన్ని కూడా పరిశీలించాలి.

ముఖ్య సూచన: పాలిచ్చే గేదెకు తగినంత మేతతో పాటు, అవసరమైన పోషకాలు సమతుల్యంగా అందేలా చూడటం ముఖ్యం.

ఖనిజలవణాలపై శ్రద్ధ పెట్టండి
మేత బాగానే ఇస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో పశువుకు అవసరమైన ఖనిజలవణాలు తగినంత అందకపోవచ్చు. ఖనిజలవణాల లోపం పశువుల సాధారణ ఆరోగ్యంతో పాటు పునరుత్పత్తి పనితీరును కూడా ప్రభావితం చేయవచ్చు.

అందువల్ల రోజువారీ ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే పశువైద్యుడు లేదా పశుపోషణ నిపుణుడి సలహా మేరకు మంచి నాణ్యత గల ఖనిజలవణ మిశ్రమం (Mineral Mixture) ఇవ్వాలి. పదేపదే గర్భం దాల్చని గేదెల్లో పోషకాహారం లేదా ఖనిజలవణాల లోపం ఉందేమో కూడా పరిశీలించడం మంచిది.

గర్భాశయ సమస్యలను నిర్లక్ష్యం చేయకండి
బయటకు గేదె ఆరోగ్యంగానే కనిపించినా కొన్ని సందర్భాల్లో గర్భాశయంలో సమస్య ఉండవచ్చు. ముఖ్యంగా ప్రసవం తర్వాత వచ్చిన ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గకపోతే తరువాత గర్భం దాల్చడంపై ప్రభావం చూపవచ్చు.
దుర్వాసనతో కూడిన లేదా అసాధారణమైన స్రావం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే సొంతంగా మందులు వాడకుండా పశువైద్యుని సంప్రదించాలి. పలుమార్లు కృత్రిమ గర్భధారణ చేయించినా గర్భం దాల్చకపోతే గర్భాశయం మరియు ఇతర పునరుత్పత్తి అవయవాల్లో ఏదైనా సమస్య ఉందా, ఎద సక్రమంగా వస్తోందా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అనే విషయాలను పశువైద్యునితో పరీక్ష చేయించాలి.

జాగ్రత్త: గర్భం దాల్చడం లేదని సొంతంగా హార్మోన్ ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందులు వాడకండి. కారణాన్ని గుర్తించిన తర్వాత పశువైద్యుని సూచన మేరకే చికిత్స చేయించాలి.
పదేపదే కృత్రిమ గర్భధారణ చేయించకుండా కారణాన్ని తెలుసుకోండి

ఒకసారి కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత గర్భం దాల్చకపోవచ్చు. కానీ సరైన సమయంలో మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు కృత్రిమ గర్భధారణ చేయించినా గర్భం దాల్చకపోతే మరోసారి కృత్రిమ గర్భధారణ చేయించడమే పరిష్కారం కాదు.

అలాంటి గేదెను పశువైద్యునికి చూపించి గర్భం నిలవకపోవడానికి అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలి. గర్భాశయ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, ఎదకు సంబంధించిన సమస్యలు, పోషకాహార లోపాలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో పరీక్ష చేయించాలి.

కారణాన్ని బట్టి చికిత్స చేయించడం లేదా ఆహారం, నిర్వహణలో అవసరమైన మార్పులు చేసుకోవడం మంచిది. ఇలా అసలు కారణాన్ని గుర్తిస్తే అనవసరంగా పదేపదే కృత్రిమ గర్భధారణ చేయించే ఖర్చు మరియు సమయాన్ని తగ్గించుకోవచ్చు.

పునరుత్పత్తి వివరాలను రాసిపెట్టండి
ఒక చిన్న నోట్‌బుక్ కూడా రైతుకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి గేదెకు సంబంధించిన ప్రసవ తేదీ, ఎద వచ్చిన తేదీ మరియు సమయం, కృత్రిమ గర్భధారణ చేసిన తేదీ మరియు సమయం, ఎన్నవసారి కృత్రిమ గర్భధారణ చేశారు, గర్భ నిర్ధారణ వివరాలు రాసిపెట్టాలి.

ఇలా రికార్డు ఉంచితే గేదె ఎప్పుడు ఎదకు వచ్చింది, ఎప్పుడు కృత్రిమ గర్భధారణ చేశారు, ఎన్నిసార్లు కృత్రిమ గర్భధారణ చేశారు అనే విషయం ఇంట్లో ఎవరికైనా సులభంగా తెలుస్తుంది. రైతు ఇంట్లో లేకపోయినా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఈ వివరాలు చూసి అవసరమైనప్పుడు గేదెను పశువైద్యశాలకు తీసుకెళ్లవచ్చు. పశువైద్యునికి ఈ రికార్డు చూపిస్తే గత వివరాలు వెంటనే తెలుసుకొని, సమస్యను గుర్తించి సరైన సలహా ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది.

గేదె పదేపదే ఎదకు వస్తున్నా గర్భం దాల్చకపోతే అనవసరంగా మళ్లీ మళ్లీ కృత్రిమ గర్భధారణ చేయించకండి. ఎదను సరిగ్గా గమనించడం, సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించడం, సమతుల్య ఆహారం అందించడం, ప్రసవం తర్వాత వచ్చే సమస్యలకు సమయానికి చికిత్స చేయించడం ద్వారా గర్భధారణ అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు. అయినప్పటికీ సమస్య కొనసాగితే ఆలస్యం చేయకుండా పశువైద్యునికి చూపించి కారణాన్ని తెలుసుకోవడం మంచిది.

Dr.గడ్డం రాధిక, పశువైద్య అధికారి
P.V.C. ఉప్పరపల్లి, వరంగల్
Dr. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం
పశువైద్య కళాశాల, కోరుట్ల. Ph: 7093198419

Read More