పచ్చిరొట్ట ఎరువులు – ప్రాముఖ్యత

పంటలకు అవసరమయ్యే పోషకాలు సేంద్రియ రూపంలో సమర్ధవంతంగా అందించాలంటే పచ్చిరొట్టను బాగా అందించే పంటలను అదే మడిలో ముందే వేసుకోవాలి. తక్కువ వనరులతో బాగా పెరిగే పంటలను సుమారు 2 నెలల ముందే మడిలో విత్తుకోవాలి, ఆ పంట పూతకువచ్చే సమయంలో భూమిలో కలియదున్నాలి. ఈ పంట భాగాలు నేలలోని తేమ సరిపడినంత ఉన్నప్పుడు త్వరగా కుళ్ళిపోతాయి. దున్నిన 2-3 వారాలకు బాగా కుళ్ళటం వల్ల విడుదలయిన పోషకాలు అప్పుడు మడిలో విత్తిన ముఖ్యపంటకు అందుతాయి. ఉదా: జనుము, పెసర, మినుము, బఠాణి, ఉలవలు.

దబోల్కర్ పద్ధతి
భూసారం పెంచుకోవటానికి మన ప్రక్క రాష్ట్రమైన మహారాష్ట్రకి చెందిన శ్రీపాద దబోల్కర్ అనే శాస్త్రవేత్త కొన్ని సూచనలు చేశారు.
ధాన్యపు గింజలు : 5 కేజీలు (మొక్కజొన్న, జొన్న, సజ్ౙ, తైదలు, రాగులు మొ….)
పప్పు గింజలు : 5 కేజీలు (మినుములు, పెసలు, శనగలు, కంది, అలసంద మొ….)
నూనె గింజలు : 5 కేజీలు (నువ్వులు, వేరుశనగ, ఆముదం, ప్రొద్దుతిరుగుడు, కుసుమ, మొ…)
సుగంధ ద్రవ్యములు : 50 గ్రాములు (ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర మొ…)
పచ్చిరొట్ట పంట విత్తనాలు : 5 కేజీలు (జనుము, జీలుగ, అవిశ, పిల్లిపెసర మొ॥)

దుక్కి దున్ని మండలాగిన తరువాత ఈ విత్తనాలన్నీ కలగలిపి ఎకరానికి 20-25 కిలోలను చల్లుకోవాలి. 45 రోజుల వరకు పెరగనిచ్చి భూమిలో కలియదున్నాలి.

ఇలా చేయడం వల్ల పంటకాలం నష్టపోతామని భావించినట్లయితే రైతులు తమ పొలాన్ని కొన్ని భాగాలుగా విభజించుకొని, ఏటా ఒక భాగంలో ఈ పద్ధతి పాటిస్తూ కొద్ది సంవత్సరాలలో మొత్తం పొలాన్ని సారవంతంగా చేసుకోవచ్చు.

పచ్చి ఆకు ఎరువులు
పచ్చిరొట్ట పంట వేసుకోవటం కుదరని పరిస్థితుల్లో దగ్గరలో ఉన్న చెట్ల ఆకులను, లేత కొమ్మలను తీసుకువచ్చి పొలంలో కలుపుకోవచ్చు. ఇది పచ్చి ఆకుల ద్వారా నేలకు ఎరువులు అందించే పద్ధతి.
పచ్చి ఆకు ఎరువుగా ఉపయోగపడే మొక్కలు గ్లైరిసీడియా, కానుగ, మోదుగ, సీతాఫలం, వెంపలి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గట్ల మీద ఈ మొక్కలను నాటుకుంటే సాగు భూమికి ఎరువు అవసరాలు సులువుగా అందించవచ్చు.

వరిపొలాలలో వేసుకునేందుకు అనువైన పప్పుధాన్యాలు – పెసర, అలసంద, శనగ, సోయాచిక్కుడు, వేరుశనగ, కంది.

వరి పొలాలలో అనువైన పశుగ్రాస పంటలు – సిరట్రో, క్లైటోరియా, టెస్మాంథస్, జనుము, చిక్కుడు. వరి పొలాలలో సాగుకు అనువైన పచ్చిరొట్టనిచ్చే పంటలు – జీలుగ, జనుము.

Read More

వండని వంట… తీపి రాగి పిండి

పదార్థాలను వేపకుండా, ఉడికించకుండా, మాడ్చకుండా, పచ్చి వాటినే కూరలు, పచ్చళ్ళు… ఆహారంగా తయారు చేసుకోవడం వండని వంటలు. వీలైనంత వరకు పచ్చి పదార్థాలను, మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకుని ‘అమృతాహారం’ తినడం మంచిది. రుచికరమైన బలవర్ధకమైన సువాసనభరితమైన జీవశక్తి పూరితమైన ‘వండని వంట’ తీపి రాగిపిండి తయారీ ఇలా….

అరకిలో రాగులు, అరకిలో పెసలు లేదా మినుముల పిండి ప్రధానంగా అవసరం ఉంటుంది. రాగులను పెసలను పచ్చి వాటినే పిండి పట్టించాలి. వేపకూడదు (మర పట్టించడం కంటే, విసుర్రాయితో విసురుకోవడం మంచిది.పిండిని మర పట్టిస్తే, అధిక ఉష్ణోగ్రతకు గురౌతుంది)

పచ్చి వాసనే, జీవశక్తికి నిదర్శనం!

మొత్తం కిలో రాగులు, పెసలు (మినుములు) పొడిలో, సుమారు వంద గ్రాముల నెయ్యిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి.

ఆ పిండి మిశ్రమంలో ఎండుకొబ్బరి పొడి, వేరుశనగ పొడి, నువ్వుల పొడి (ఒక్కొక్కటి వంద గ్రాములు-పచ్చిపొడులు)

జీడిపప్పు, బాదాంపప్పు కూడా కాస్తా చేర్చుకోవచ్చు. వాటిని కూడా పొడి చేసుకుని కలపాలి. చివరికి ఎండుద్రాక్ష పండ్లను కూడా తగినన్ని కలుపుకోవాలి.

ఈ మొత్తం పొడుల మిశ్రమానికి సమానంగా, ముడిచక్కెర పొడిని లేదా ముడిబెల్లపు తురుమును కలిపి, యాలకుల పొడిని కూడా కలపాలి. ఖర్ౙూర పండ్లను చిన్న చిన్న ముక్కలు చేసి కలుపుకోవచ్చు. అన్ని రకాల ఎండుపండ్ల ముక్కలను కూడా కలుపుకోవచ్చు.

అంతే! రుచికరమైన బలవర్ధకమైన సువాసనభరితమైన జీవశక్తిపూరితమైన ‘వండని వంట’ సిద్దం అవుతుంది.
నెయ్యి కలుపుతాం కనుక, బయట కూడా నిల్వ ఉంటుంది.

ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి తగినంత తయారు చేసుకోవచ్చు. ప్రయాణాలు చేసే సమయంలో ప్రధాన ఆహారంగా కూడా తినవచ్చు.

  • తుమ్మేటి రఘోత్తమరెడ్డి
Read More

గొర్రెలలో చిటుకు వ్యాధి (Enterotoxaemia) నివారణకు ఉచిత టీకాల కార్యక్రమం

గొర్రెల పెంపకదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి వచ్చే నెల 15వ తేదీ వరకు గొర్రెలలో చిటుకు వ్యాధి (Enterotoxaemia) నివారణ కోసం ఉచిత టీకాల కార్యక్రమం నిర్వహిస్తోంది.

చిటుకు వ్యాధి గొర్రెలలో ఆకస్మిక మరణాలకు కారణమయ్యే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి సోకినప్పుడు గొర్రెలు మేత తినకపోవడం, నీరసం, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. చాలా సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి.

అందువల్ల ఈ వ్యాధి నివారణకు టీకా వేయించడం అత్యంత అవసరం. టీకా ద్వారా గొర్రెలను చిటుకు వ్యాధి నుండి రక్షించడంతో పాటు, రైతులు ఎదుర్కొనే ఆర్థిక నష్టాలను కూడా తగ్గించవచ్చు.

కావున అన్ని గొర్రెల కాపరులు, పెంపకదారులు తమ గ్రామాలలో నిర్వహించే ఉచిత టీకాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి గొర్రెకు తప్పనిసరిగా టీకా వేయించాలి.

గొర్రెల ఆరోగ్యం – రైతు అభివృద్ధికి పునాది.
చిటుకు వ్యాధికి టీకానే రక్షణ!

Read More

నెలకు ప్రాణం… పంటకు బలం ‘బయోచార్’

నెలకు ప్రాణం… పంటకు బలం ‘బయోచార్’

వ్యవసాయ రంగంలో బయోచార్ (Biochar) అనేది ఇప్పుడు ఒక కొత్త సంచలన పదం. ఒకే రకమైన పంటలు సాగు, వ్యర్థాలను పొలాల్లోనే కాల్చడం మరియు పరిమితికి మించి రసాయన ఎరువుల వాడకంతో భూముల్లో సేంద్రియ కర్బనం అడుగంటుతోంది. ఇదే కొనసాగితే భూములు సాగుకు పనికిరావు. దీనికి పరిష్కారంగా పంట వ్యర్థాలతో తయారుచేసే బయోచార్ (జీవ బొగ్గు) నేలలో సేంద్రియ కార్బన్ ను పెంచుతుంది.

సాధారణంగా పంట కోతలు పూర్తయ్యాక రైతులు పంట వ్యర్ధాలను పొలాల్లోనే తగలబెడుతుంటారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరగడమే కాకుండా, నేలలో ఉండే మిత్రపురుగులు, మేలుచేసే సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. ఫలితంగా భూసారం క్షీణించి, సేంద్రియ కార్బన్ (Organic Carbon) శాతం పడిపోతోంది. అయితే, ఈ సమస్యకు పంట వ్యర్థాలతోనే అద్భుతమైన పరిష్కారం కనుగొనవచ్చు. పత్తి, కంది, మిరప, ఆముదం మరియు మొక్కజొన్న వంటి పంటల సేంద్రియ వ్యర్థాలను తగలబెట్టకుండా, ఒక ప్రత్యేక పద్ధతిలో ‘బయోచార్’ (జీవ బొగ్గు) గా మార్చవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో కూడిన ఈ పద్ధతి ద్వారా నేలకు అధిక మొత్తంలో సేంద్రియ కార్బన్ను అందించి, భూసారాన్ని మళ్లీ పెంపొందించుకోవచ్చు. ప్రస్తుతం సాగుచేసే పంటలలో ఎక్కువగా రసాయన ఎరువుల వాడకం వల్ల నేల ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటోంది. ఈ సమస్యను తగ్గించడానికి మరియు నేల సారాన్ని పెంచడానికి బయోచార్ ఉపయోగకరంగా ఉంటుంది.

బయోచార్: బయోచార్ అనేది ప్రాథమికంగా ‘కాల్చిన’ వ్యవసాయ వ్యర్థం. బయోమాస్ అనే సేంద్రియ పదార్థాలను తక్కువ ఆక్సిజన్ పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రత వద్ద నిదానంగా మండించడం (పైరోలైసిస్) ద్వారా తయారయ్యే నల్లటి కార్బన్ పదార్థాన్ని బయోచార్ అంటారు. ఇది రంధ్రాలు (సచ్చిద్రత) కలిగి ఉన్న, అత్యధిక కార్బన్ గల ఒక స్థిరమైన పదార్థాన్ని సృష్టిస్తుంది, దీనిని నేల లక్షణాలను మెరుగుపరచడానికి మట్టిలో కలపవచ్చు.

నేలలో బయోచార్ (ప్రత్యేక పద్ధతిలో తయారుచేసిన బొగ్గు) ఉపయోగించడం వల్ల భూసారం అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇది నేలలో మేలు చేసే సూక్ష్మజీవుల పెరుగుదలకు తోడ్పడటమే కాకుండా, నీటిని మరియు పోషకాలను పట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఇసుక నేలలు, ఎర్ర నేలలు, మరియు సేంద్రియ కార్బన్ లోపించిన భూముల్లో బయోచార్ వాడకం వల్ల ఆశించిన దానికంటే మంచి ఫలితాలు వస్తాయి.

అంతేకాదు, ఇది నేలలో గాలి ప్రసరణను మెరుగుపరిచి, పంటల వేర్లు లోతుగా, బలంగా పెరగడానికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. రసాయన లేదా సేంద్రియ ఎరువుల ద్వారా అందించే పోషకాలు త్వరగా కరిగి వృథా కాకుండా, మొక్కకు అవసరమైనప్పుడు అందేలా ఎక్కువ కాలం నిల్వ ఉంచడంలో బయోచార్ కీలక పాత్ర పోషిస్తుంది.

బయోచార్ వల్ల కలిగే ప్రయోజనాలు

  1. నేల ఉదజని సూచిక (pH) సర్దుబాటు :
    బయోచార్ క్షార గుణాన్ని (alkaline) కలిగి ఉంటుంది మరియు ఆమ్ల నేలల్లో నేల ఉదజని సూచిక స్థాయిని పెంచుతుంది. ఇది పోషకాలు మరియు ఖనిజ లవణాలల లభ్యతను, వాటి వినియోగ సామర్థ్యాన్ని
    పెంచుతుంది.
  2. నేల కాటయాన్ ఎక్స్ఛేంజ్ యజ్ కెపాసిటీ (CEC) పెరుగుదల :
    బయోచార్ తక్కువ పరిమాణంలో ఎక్కువ ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది మరియు ఇది అత్యధిక నెగటివ్ ఛార్జ్ (negatively charged) కలిగి ఉంటుంది. ఇది నేలలోని పాజిటివ్ ఛార్జ్ కలిగిన కాటయాన్లను (positively charged cations) పట్టి ఉంచుతుంది, తద్వారా కాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ (CEC) ని మరియు నేల సారాన్ని పెంచుతుంది.
  3. బయోచార్ నేలకు పోషకాలను జోడిస్తుంది
    ఇది బయోచార్ తయారీకి ఉపయోగించిన ముడి పదార్థాల లోని పోషకాల పరిమాణం మరియు దానిని తయారు చేయడానికి ఉపయోగించిన సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. పశువుల ఎరువు మరియు కంపోస్ట్ లాగే, బయోచార్ను నేలలో వేయడానికి ముందు దానిలోని పోషకాల పరిమాణాన్ని పరీక్షించాలి, ఎందుకంటే పోషకాల పరిమాణం చాలా భిన్నంగా ఉంటుంది మరియు బయోచార్ అప్లికేషన్లు పెద్ద మొత్తంలో (bulky) ఉంటాయి. బయోచార్లో ఏవైనా విషపూరిత అయాన్లు (toxic ions) ఉన్నాయా అనేదానిని కూడా
    పరీక్షించాలి.
  4. నేలలో కార్బన్ పరిమాణం పెరుగుదల :
    బయోచార్లో 80% వరకు కార్బన్ బ్లాక్ (carbon black) ఉంటుంది. దీనిని మట్టిలో కలపడం వల్ల కార్బన్ పరిమాణం మరియు C:N నిష్పత్తి (కార్బన్-నైట్రోజన్ నిష్పత్తి) పెరుగుతాయి. బయోచార్లోని కార్బన్ శాతం
    అనేది ప్రధానంగా పైరోలైసిస్ ప్రక్రియ మరియు ఉపయోగించిన ముడి పదార్థాల కార్బన్ పరిమాణంపై
    ఆధారపడి ఉంటుంది.
  5. బయోచార్ నేలలో సూక్ష్మజీవుల క్రియాశీలతను మరియు వైవిధ్యాన్ని పెంచుతుంది :
    బయోచార్లో ఉండే అధిక రంధ్రాల గుణం, దాని నీటి మరియు పోషకాలను నిల్వ ఉంచుకునే సామర్థ్యంతో కలిసి నేలలోని సూక్ష్మజీవులకు సురక్షితమైన ఆవాసాన్ని కల్పిస్తుంది. ఇది పొలాన్ని ఖాళీగా విడిచిపెట్టినప్పుడు (fallow) మరియు కరవు కాలంలో కూడా సూక్ష్మజీవులు మనుగడ సాగించేలా చేస్తుంది. బయోచార్ కొన్ని సూక్ష్మజీవులకు తగిన శక్తి వనరును కూడా అందిస్తుంది. సూక్ష్మజీవుల క్రియాశీలత పెరగడం వల్ల మొక్కలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాల పునరుత్పత్తి (nutrient re-cycling) పెరగడం, పోషకాలు కొట్టుకుపోవడం తగ్గడం, మొక్కలకు పోషకాలు మరింత సులభంగా లభించేలా చేయడం, గాలి నుండి నైట్రోజన్ ను గ్రహించడం, నేలలో కార్బన్ను నిలిపి ఉంచడం మరియు జోడించడం, తెగుళ్లు మరియు వ్యాధులను తగ్గించడం. ఇది కృత్రిమ ఎరువులు మరియు పురుగుమందుల అవసరాన్ని సాధారణంగా తగ్గిస్తుంది, తద్వారా వాణిజ్యపరమైన మరియు పర్యావరణపరమైన అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి.
  6. నేలలోని విషపూరిత పదార్థాలను తగ్గించడం ద్వారా బయోరెమిడియేషన్ (Bioremediation) పెరిగిన సూక్ష్మజీవుల క్రియాశీలత నేలలోని విషపూరిత పదార్థాలను మరియు పురుగుమందుల అవశేషాలను విచ్చిన్నం చేస్తుంది. బయోచార్ కొన్ని పురుగుమందులను ‘చీలేట్స్’ (chelates) చేయడం ద్వారా వాటి ప్రభావాన్ని నిష్క్రియం చేస్తుంది, తద్వారా సూక్ష్మజీవులు వాటిని జీర్ణం చేసుకోగలుగుతాయి.
  7. నేల ఆకృతి మెరుగుపడటం (Improvement of soil structure)
    బయోచార్ చేర్చిన నేలలో పెరిగే CEC (కాటయాన్ ఎక్స్ఛేంజ్ కెపాసిటీ), సూక్ష్మజీవుల మరియు వేర్ల క్రియాశీలత.. నేల కణాలు ఒకదానితో ఒకటి అతుక్కుని (soil aggregates) మరింత స్థిరమైన, నీరు చొరబడగలిగే భౌతిక ఆకృతిని ఏర్పరచడంలో సహాయపడతాయి. ఇది నేలలోకి నీరు ఇంకడాన్ని మరియు నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. రంధ్రాలు (porous) కలిగిన నేల మెరుగైన వాయు మార్పిడికి తోడ్పడుతుంది; దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్లడం, ఆక్సిజన్ లోపలికి రావడం మరియు మెరుగైన నైట్రోజన్ మార్పిడి జరిగి వేర్ల ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.
  8. వ్యవసాయ కాలుష్యం తగ్గింపు (Agricultural pollution reduction)
    నేలలో పోషకాలను నిలిపి ఉంచే సామర్ధ్యం పెరగడం వల్ల, కరిగిపోయే ఎరువులు మరియు రసాయనాలు భూగర్భ జలాల్లోకి కొట్టుకుపోవడం (leaching) తగ్గుతుంది. పెరిగిన సూక్ష్మ జీవుల క్రియాశీలత మరియు చెలేషన్ ప్రక్రియ పురుగుమందులను నిష్క్రియం చేస్తాయి. భౌతిక ఆకృతి మెరుగుపడటం వల్ల నీటి ప్రవాహం

(runoff) మరియు నేలకోత (erosion) తగ్గుతాయి. సాధారణంగా ఎరువులు మరియు రసాయనాల వాడకం తగ్గడం వల్ల వ్యవసాయ కాలుష్య ముప్పు చాలా వరకు తగ్గుతుంది.

  1. కార్బన్ నిక్షిప్తం (Carbon Sequestration)
    బయోమాస్ కార్బన్ ను బయోచార్గా మార్చడం ద్వారా అసలు కార్బన్లో 50% వరకు కుళ్ళిపోవడానికి నిరోధకత కలిగిన ఒక స్థిరమైన రూపంలో నిక్షిప్తం చేయవచ్చు. ఇది శతాబ్దాల పాటు నేలలోనే ఉండిపోతుంది, మిగిలిన 50% ఆహారం మరియు శక్తి కోసం ఉపయోగించవచ్చు. దీనికి భిన్నంగా, వ్యర్థాలను కాల్చడం ద్వారా కేవలం 3% కార్బన్ మాత్రమే, మరియు జీవసంబంధమైన కుళ్ళిపోవడం (biological decomposition) ద్వారా 20% కంటే తక్కువ కార్బన్ మాత్రమే నిక్షిప్తమవుతుంది. కాబట్టి వ్యవసాయ నేలల్లో కార్బన్ ను నిక్షిప్తం చేయడానికి మరియు నేలలపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి భారీ అవకాశం ఉంది. గమనిక: పునరుత్పాదక కార్బన్ పదార్థం నుండి బయోచార్ను తెలివిగా మరియు స్థిరమైన పద్ధతిలో ఉపయోగించాలి. బయోదార్ను నేల సవరణగా చేర్చేటప్పుడు రైతు బయోదార్ యొక్క లక్షణాలను మరియు నేల యొక్క స్వభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. బయోచార్ స్వయంగా ఒక కాలుష్య కారకంగా మారకుండా ఉండటానికి దానిని మట్టిలో బాగా కలపాలి.

జాగ్రత్తలు

  1. నేరుగా ఎక్కువ మోతాదులో వేయకూడదు
  2. కంపోస్ట్ లేదా పశువుల ఎరువుతో కలిపి వేయడం మంచిది
  3. పొడి రూపంలో వాడేటప్పుడు గాలి ద్వారా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
  4. నేల పరీక్ష ఆధారంగా మోతాదు నిర్ణయించాలి

సిఫార్సు మోతాదు

  • ఎకరానికి 4 నుండి 6 క్వింటాళ్లు వరకు వేసుకోవచ్చు
  • సేంద్రియ ఎరువులతో కలిపి వేయాలి
    బయోచారును సేంద్రియ ఎరువులు, జీవామృతం, ఘన జీవామృతం, వర్మీకంపోస్ట్ వంటి వాటితో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రస్తుతం సహజ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయంలో బయోచారుకు మంచి ప్రాధాన్యత లభిస్తోంది. బయోచార్ వినియోగం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడి, స్థిరమైన వ్యవసాయం సాధ్యమవుతుంది.

డా. బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట,
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం (SKLTGHU), M. No. 8374278258

Read More

వండని వంట… పండు మిర్చి పచ్చడి

వండని వంటలు అంటే, పదార్థాలను వేపకుండా, ఉడికించకుండా, మాడ్చకుండా, పచ్చి వాటినే కూరలు పచ్చళ్ళు ఆహారంగా తయారు చేసుకోవడం.

ధాన్యం, పప్పులు, నూనె గింజలు, కూరగాయలు మొదలగునవి ఉడికించినా, వేపినా, ఫ్రై చేసినా, వాటిలో ఉన్న జీవశక్తి నాశనం అవుతుంది, మృతాహారాన్ని తినవలసి వస్తుంది. మృత ఆహారం అంటే చనిపోయిన ఆహారం అని అర్థం.

మృతాహారం తింటే, మన శరీరానికి జీవశక్తి లభించదు. మనలో జీవశక్తి లోపిస్తే, వ్యాధి కారక శక్తులు ప్రవేశిస్తాయి. కోవిడ్ వైరస్ చెప్పిన పాఠాల్లో, అది ముఖ్యమైన పాఠం కద!

అమృతాహారాన్ని తినవలసిన మనుషులు, మృతాహారం తినడం వైపు పయనించారు! మృతాహారం, వ్యాధి కారకం!

వీలైనంత వరకు పచ్చి పదార్థాలను, మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకుని తినడం మంచిది.
అమృతాహారాన్ని తయారు చేసుకుని భుజిస్తే, మన ఆయురారోగ్యాలు పదిలంగా ఉంటాయి!

అమృతాహారం అంటే, చనిపోని ఆహారం అని అర్థం!

మిద్దెతోట, పెరటితోటల్లో మిర్చి ఉత్పత్తి ఎక్కువ వస్తున్నప్పుడు, మధ్య మధ్య పండు మిరపకాయలతో రోటి పచ్చడి తయారు చేసుకోవాలి. అది బయటి ఉష్ణోగ్రతల వద్ద కూడా నిల్వ ఉంటుంది. ఫ్రిజ్ అవసరం లేదు.
పెరటితోట మిద్దెతోట అంటే, పురుగుమందుల వాడకం లేని, సహజ ఉత్పత్తి అని కద! అప్పుడే అది అమృతాహారం అవుతుంది.

కాసిన్ని పండు మిరపకాయలను తెంపుకుని, క్లాత్‌తో శుభ్రంగా తుడిచి, తొడిమలు తీసేసి ముక్కలు ముక్కలుగా కోసి, ఆ పండుమిరపకాయలకు తగినంత కొత్త చింతపండు, తగినంత ఉప్పు (రాక్ సాల్ట్ అయితే బెటర్), వెల్లుల్లి పాయలను, కొద్దిగా పసుపు, జీలకర్రను వేసుకొని, రోటిలో వేసి మెత్తగా నూరుకోవాలి. ఈ పచ్చడి బయట వాతావరణంలో కూడా, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కాకపోతే ఉప్పు తగినంత కలుపుకోవాలి. ఈ పచ్చడి తయారీలో నీటి తేమ తగలకుండా తయారు చేసుకోవాలి.

పచ్చడిలో నూనె పోపు అవసరం లేదు. పోపు పెట్టడం అంటే, కాలిన నూనెను తినడం అవుతుంది. కాకపోతే అన్నం తినేటప్పుడు పచ్చి నూనెను – అదీ చెక్క గానుగ నూనెను కొద్దిగా వేసుకొని తినవచ్చు.
పాతకాలపు పండుమిరపకాయల పచ్చడినే, నూనె తాలింపు పెట్టకుండా వాడుకోవచ్చును!
నిల్వ పచ్చడి అంటేనే, ఉప్పు ఎక్కువగా ఉంటుంది.

శారీరక శ్రమ చేసేవారు కాస్తా ఎక్కువ సార్లు తిన్నా పరవాలేదు కానీ, నీడపట్టున పనులు చేసేవారు రుచి కోసం అప్పుడప్పుడు తినడం మంచిది.

పండుమిరపకాయల్లో చింతపండుకు బదులుగా టొమాటో పండ్లను కూడా వేసుకొని పచ్చడి తయారు చేసుకోవచ్చు కానీ, ఎప్పటికప్పుడు తయారు చేసుకుని వాడుకోవచ్చు. బయట నిల్వ ఉండదు. ఫ్రిజ్‌లో పెట్టుకుని రెండు మూడు రోజుల పాటు వాడుకోవచ్చు.

మొదటిసారిగా చేసుకునేవారు, కొద్ది మొత్తంలో చేసుకుని, ఉప్పు, కారం, పులుపు సరిగా ఉన్నాయో లేదో చూసుకుని, తరువాత మార్పులు చేర్పులు చేసుకోవడం మంచిది. రోలు రోకలి లేనివారు మిక్సీలో వేసి తిప్పుకోవాలి.

మిక్సీలో వేసి తిప్పితే, పదార్ధం ఉష్ణోగ్రతకు గురౌతుంది, ఆ కారణంగా పదార్ధంలో ఎంతో కొంత జీవశక్తి లాస్ అవుతుంది. కనుక రోలు రోకలి వాడటం బెటర్. రోళ్ళు, రోకళ్ళు పట్టణాలలో అక్కడక్కడ రోడ్ల పక్కన పెట్టి అమ్ముతున్నారు. కొనుక్కుని తెచ్చి పెట్టుకోవాలి. ఎప్పటికీ ఉపయోగపడుతుంది.

  • తుమ్మేటి రఘోత్తమరెడ్డి
Read More

నాణ్యమైన గొర్రెలు/మేకల మంద అభివృద్ధి కావాలంటే

ఆరోగ్యమైన మరియు జన్యుపరంగా మంచి నాణ్యత కలిగిన మందను అభివృద్ధి చేయాలంటే గొర్రెల/మేకల పెంపకందార్లు ప్రతి ఏటా “ఏరివేత”ని అవలంబించాలి. నాసిరకం జీవాలని ఎప్పటికప్పుడు గుర్తించి మందనుండి వేరుచేసి, ఆరోగ్యమైన జీవాలని మాత్రమే ఉంచడం వలన పోషణ ఖర్చు తగ్గి, జీవాల పెంపకం లాభదాయకంగా ఉంటుంది.

పుట్టిన ఆడ జీవాల(పిల్లలు)లో ఆరోగ్యంగా, మంచి శరీర బరువు కలిగి ఉండి, జాతి లక్షణాలున్న వాటిని మందలో ఉంచుకోడానికి ఎంపిక చేసుకోవాలి. బలహీనంగా ఉండి, పెరుగుదల లేని, ఆరోగ్యంగా  లేని పిల్లల్ని, తల్లి పాలు సరిగా అందని వాటిని గుర్తించి ఏరివేయాలి. పుట్టిన పిల్లలకి పాలివ్వలేని తలుల్ని  వేరుచేసి, ఆరోగ్యంగా, పాలిచ్చే శక్తి కలిగిఉన్న తల్లుల్ని మాత్రమే మందలో ఉంచాలి. మంద సగటు బరువు కంటే తక్కువ బరువున్న జీవాల్ని, బలహీనంగా ఉన్నవాటిని, ఎదుగుదల లోపాలున్నవాటిని, ముసలివాటిని గుర్తించి ఏరివేయాలి. సకాలంలో ఎదకు రాని, చూలి నిలవని వాటిని, తరచుగా ఈడుసుకుని పోయే జీవాల్ని, పొదుగు వాపు సోకిన జీవాల్ని మందనుండి తీసివేయాలి. 

ఇక మగ జీవాల (పిల్లల) విషయానికొస్తే అధిక శరీర బరువు కలిగివుండి, జాతి లక్షణాలున్న 3-4 మగ జీవాల పిల్లల్ని మందలో ఉంచి, మిగితా వాటిని వేరు చేసి 6-7 మాసాలు పోషించి, మాంసం కొరకు అమ్మివేయాలి. మంచి జాతి లక్షణాలున్న మరికొన్నింటిని 12-18 నెలలు పోషించి పునరుత్పత్తి కోసం (విత్తనపు పొటేళ్లుగా) అమ్మివేయాలి. రెండు సంవత్సరాల పాటు మందలో ఉన్న పొట్టేలు/పోతులను తొలగించివేయాలి. లేనిచో మందలో “ఇన్ బ్రీడింగ” సమస్య  తలెత్తి, మంద నాణ్యత జన్యుపరంగా క్షీనిస్తుంది. కాబట్టి పొట్టేలు / పోతులను ప్రతి రెండేళ్లకోసారి మార్చుకోవాలి.

వంగిపోయిన కాళ్ళు, వెడల్పుగా ఉన్న భుజాలు, దవడ లోపాలు (పెద్దగా లేదా చిన్నగా ఉండడం), పగిలిన నోరు మొదలగు జన్యుపరమైన లోపాలున్న జీవాల్ని ఏరివేయాలి.  మంద పరిమాణం. వసతి, మేత వనరులు మొదలగు అంశాలను దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఏటా 10-20% జీవాల్ని ఏరివేయటం మంచిది.

డా. జె. సాయి ప్రసన్న, డా. సరిన్ కున్నత్, సహ ఆచార్యులు, పశు జన్యుశాస్త్ర మరియు ప్రజనన విభాగం, పీవీ నరసింహ రావు తెలంగాణ పశువైద్య విశ్వా విద్యాలయం, హైదరాబాద్. ఫోన్: 8008910925

Read More

పశువులలో నీళ్ళ విరోచనాలు (Watery Diarrhea in Cattle/Buffaloes) – హోమియోపతి చికిత్స

పశువులు నీళ్ళ లాంటి పలుచటి విరోచనాలు చేయడం అంటే, పేగులలో ఇన్‌ఫెక్షన్ లేదా జీర్ణక్రియ లోపం వలన ఆహారం పూర్తిగా జీర్ణం కాక నీరు ఎక్కువగా బయటకు పోవడాన్ని నీళ్ళ విరోచనాలు అని అంటారు.

కారణాలు
• చెడిపోయిన లేదా పాడైన దాణా, పచ్చిక
• నీరు లేదా ఆహారం ద్వారా బ్యాక్టీరియా/వైరస్ సంక్రమణ
• అజీర్ణం
• అధిక దాణాఇవ్వడం
• వాతావరణ మార్పు, ఒత్తిడి
• పురుగులు

లక్షణాలు
• నీళ్ళ లాంటి విరోచనాలు
• విరోచనాల్లో దుర్వాసన
• ఆహారం తినకపోవడం
• నీరు ఎక్కువగా కోల్పోవడం వల్ల బలహీనత
• కళ్ళు లోపలికి పోవడం, చెవులు వంగిపోవడం
• కొన్నిసార్లు జ్వరము కూడా ఉండవచ్చు

4. హోమియోపతి చికిత్స (Homeopathy Treatment)
మందు పేరు వాడే సందర్భం డోసు
Arsenicum Album 30 చెడిపోయిన ఆహారం వల్ల వాంతులు, విరోచనాలు, దుర్వాసన ఉన్న మలం 10 డ్రాప్స్ లేదా 5 పెల్లెట్స్ రోజుకు 3 సార్లు
China (Cinchona) 30 ద్రవ నష్టం వల్ల బలహీనత, నీళ్ళ విరోచనాలు 10 డ్రాప్స్ రోజుకు 2 సార్లు
Veratrum Album 30 తీవ్రమైన నీళ్ళ విరోచనాలు, చల్లగా చెమటలు పట్టడం 10 డ్రాప్స్ రోజుకు 3 సార్లు
Phosphorus 30 పచ్చ లేదా రక్తం కలిసిన విరోచనాలు 10 డ్రాప్స్ రోజుకు 2 సార్లు
Aloe Socotrina 30 విరోచనాలు ఆకస్మికంగా రావడం, ఆహారం తిన్న వెంటనే మల విసర్జన 10 డ్రాప్స్ రోజుకు 3 సార్లు
మందులను నీటిలో (5–10 ml) కలిపి నోటి ద్వారా ఇవ్వాలి.

మంచి కాంబినేషన్లు (Effective Combinations)
Combination – 1 (Acute watery diarrhea)
Arsenicum Album 30 + Veratrum Album 30
5 డ్రాప్స్ చొప్పున కలిపి, 3 గంటలకొకసారి మొదటి రోజు ఇవ్వాలి.
తర్వాత రోజుకు 3 సార్లు 3 రోజుల పాటు ఇవ్వాలి.
Combination – 2 (Weakness after diarrhea)
China 30 + Phosphorus 30
10 డ్రాప్స్ చొప్పున కలిపి, రోజుకు 2 సార్లు 3 రోజులు.
Combination – 3 (Long-standing diarrhea / chronic cases)
Aloe Socotrina 30 + Sulphur 30
రోజుకు 2 సార్లు 5 రోజుల పాటు.

సహాయక చికిత్స (Supportive care)
• పశువుకు పరిశుభ్రమైన నీరు ఎల్లప్పుడూ ఇవ్వాలి
• నీరు ఎక్కువగా కోల్పోతే గ్లూకోస్ నీరు లేదా ఎలక్ట్రోలైట్ ద్రావణం ఇవ్వాలి
• ఆహారం తగ్గించాలి; చెడిపోయిన దాణా/పచ్చిక ఆపాలి
• పచ్చిక మెల్లగా ఇవ్వాలి
• రూమెన్ టానిక్ లేదా లివర్ టానిక్ వెటర్నరీ డాక్టర్ సలహాతో వాడవచ్చు

జాగ్రత్తలు (Precautions)
• చెడిపోయిన ఆహారం, ఫంగస్ ఉన్న దాణా ఇవ్వకూడదు
• నీరు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి
• కొత్త దాణా/ పచ్చిక మార్చేటప్పుడు కొద్ది కొద్దిగా అలవాటు చేయాలి
• తీవ్రస్థితిలో వెటర్నరీ డాక్టర్ను సంప్రదించాలి (IV fluids అవసరం కావచ్చు)

డాక్టర్ జి. రాంబాబు, Phone: 9618499184

Read More

వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత

ఆహార ధాన్యాల స్వయం సమృద్ధిసాధనలో రసాయనిక ఎరువుల వాడకం ప్రాధాన్యతను సంతరించుకుంది. రసాయనిక ఎరువుల్లో ముఖ్యంగా నత్రజని ఎరువుల వాడకం వల్ల నేలల్లోని పోషకపదార్థాల నిల్వల సమతుల్యత దెబ్బతిని ఉత్పాదకశక్తి కోల్పోడం, అధికంగా చీడపీడలు ఆశించడం, సూక్ష్మపోషకాలు లోపించడం చౌడు తదితర సమస్యలు ఉత్పన్నం కావడంతో దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. పంటల ఉత్పాదకత పెరగడానికి భూభౌతిక స్వరూప స్వభావాల్లో వివిధ మార్పులు తేవడానికి భూసార పరిరక్షణకు గాను రసాయనిక ఎరువులకు తోడుగా సేంద్రియ, జీవన ఎరువులను వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ప్రకృతిలో గల సూక్ష్మాతిజీవులు జీవించుటకు స్వతంత్య్రంగా కాని, మొక్కలతో కలసి కాని జరిగే ప్రక్రియలో పంటలకు కావలసిన పోషకాలను వాతావరణం లేదా నేల నుండి గ్రహించి మొక్కలకు అందించే జీవుల సముదాయాన్ని జీవన ఎరువులు అంటారు. జీవన ఎరువులు అనేవి వాటంతట అవి ఎరువులు కావు. రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువుల మాదిరి వీటిలో పోషకాలు లేవు. అయితే ఇవి మొక్కకు కావలసిన పోషకాలు తీసుకోవడానికి దోహదపడతాయి. దానికనుగుణంగా మార్పులను భూమిలో కలుగచేస్తాయి. జీవన ఎరువులు సహజమైనవి వాడడం సులభం మరియు కాలుష్యం ఉండదు. పంటకు గాని, భూమికి గాని ఎలాంటి హాని కలుగచేయవు. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయన ఎరువుల ధరలు అధికంగా ఉన్నందున చాలినంత సేద్రియ ఎరువులు లభ్యం కానందున జీవన ఎరువుల ప్రాధాన్యత రోజు రోజుకూ పెరుగుతుంది. సమగ్ర ఎరువుల వాడకంలో ఇది ఒకభాగమై నేలఆరోగ్యం ఉత్పాదకత కాపాడడంలో దిగుబడి నాణ్యత పెంచడంలోనూ ప్రముఖపాత్ర వహిస్తుంది. 

జీవన ఎరువులు:

  • నత్రజనిని స్థిరీకరించేది
  • భాస్వరాన్ని అందించేది.
  • పొటాషియం మొబిలైజర్స్.
  • జింకు సాల్యుబలైజర్స్
  • మొక్క పెరుగుదలను అభివృద్ధి పరచే జీవన ఎరువు (పి.జి.పి.ఆర్.)
  • ద్రవరూపంలో రూపొందించబడిన జీవన ఎరువులు

నత్రజని స్థిరీకరించే జీవన ఎరువుల వివరాలు:
పంట నత్రజని స్థిరీకరణ కిలోలు / ఎకరాకు సగటు దిగుబడి పెరిగే శాతం
కంది 65-80 19
పెసర, మినుము 20 20
అలసంద 34 23
శనగ 34-44 22
బఠాణి 20-28 13
వేరుశనగ 20-24 19
సోయాబీన్ 24-32 35

ఉపయోగించు విధానం: 100 మి.లీ. నీటిలో 10 గ్రా. పంచదార / బెల్లం / గంజి కలిపి 10 ని॥ మరగబెట్టి చల్లార్చి 200 గ్రా. రైజోబియం పొడిని కలిపి 10 కిలోల విత్తనాలపై చల్లి 10 ని॥ నీడలో ఆరబెట్టిన తరువాత పొలంలో నాటుకోవచ్చు.

ఇతర వివరాలు: వేర్వేరు పైర్లకు వేర్వేరు రైజోబియం కల్చరు వాడాలి.

అజటోబాక్టర్:
పంటః పప్పుజాతి మినహాయించి అన్ని పంటలు
నత్రజని స్థిరీకరణ కిలోలు / ఎకరాకు: 8-16
సగటు దిగుబడి పెరిగే శాతం: 10
ఉపయోగించు విధానం: కిలోల కల్చరు ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటిన సమయంలో ఒక ఎకరంపై చల్లాలి.
ఇతర వివరాలు: సేంద్రియ పదార్థం ఉన్నప్పుడు సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. తక్కువగా ఉన్న నేలల్లో కూడా పనిచేయును.

అజస్పైరిల్లమ్:
పంటః వరి, పత్తి, మిరప,జొన్న, అరటి
నత్రజని స్థిరీకరణ కిలోలు / ఎకరాకు: 8-16
సగటు దిగుబడి పెరిగే శాతం: 15
ఉపయోగించు విధానం: 2 కిలోల కల్చరును 100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలంలో పోయాలి.
ఇతర వివరాలు: సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలల్లో కూడా పనిచేయును.

నీలి ఆకుపచ్చ నాచు :
పంటః వరి
నత్రజని స్థిరీకరణ కిలోలు / ఎకరాకు: 8-12
సగటు దిగుబడి పెరిగే శాతం: 15
ఉపయోగించు విధానం: ఒక ఎకరం పొలంలో వరినాట్లు వేసిన 3-7 రోజుల వ్యవధిలో 4-6 కిలోలు. 40-50 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి చల్లాలి.
ఇతర వివరాలు: రైతులే తయారు చేసుకోవచ్చు. నాచు సేంద్రియ పదార్ధంగా ఉపయోగపడును.

అసిటోబాక్టరు:
పంటః చెరకు
నత్రజని స్థిరీకరణ కిలోలు / ఎకరాకు: 40-72
సగటు దిగుబడి పెరిగే శాతం: 10
ఉపయోగించు విధానం: ఒక ఎకరం పంటకు 4 కిలోల జీవన ఎరువును ముచ్చలు నాటేటప్పుడు 2 కిలోలు, మోకాలు లోతు పంటయినప్పుడు 2 కిలోలు 100 కిలోల సేంద్రియ ఎరువుతో వాడాలి.
ఇతర వివరాలు: చెక్కెర శాతం 0.5-1.0 పెరుగుతుంది.

అజొల్లా:
పంటః వరి
నత్రజని స్థిరీకరణ కిలోలు / ఎకరాకు: 8-12
సగటు దిగుబడి పెరిగే శాతం: 15
ఉపయోగించు విధానం: వరి నాటిన వారం తరువాత 200 కిలోల అజొల్లా ఒక ఎకరంలో వెదజల్లి 15-20 రోజులు నీటిపై బాగా పెరగనివ్వాలి.
ఇతర వివరాలు: ఎండబెట్టి పొడిగా చేసి పశువులకు తినిపించడం వల్ల పాలఉత్పత్తి పెరుగును.

భాస్వరం అందించే జీవన ఎరువులు: పంట మొక్కలకు వేసిన లభ్య భాస్వరం, భూమిలో చేరి కొద్ది రోజుల వ్యవధిలో భూమి యొక్క ఉదజని సూచికను అనుసరించి లభ్యం కాని భాస్వరం రూపంలో మారిపోవును. భాస్వరం అందించే జీవన ఎరువులు, సూక్ష్మజీవులు, శిలీంద్రాల ద్వారా భూమిలో నిల్వ ఉంచి లభ్యం కాని భాస్వరాన్ని మొక్కలకు అందుబాటులోకి తీసుకువస్తాయి. భాస్వరం వేసిన ఆమ్లనేలల్లో ఐరన్ లేదా అల్యూమినియం ఫాస్ఫేట్‌గాను మారి మొక్కకు లభ్యం కాదు.
ముఖ్యంగా వాడుకలో ఉన్నవి…

  • ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బాక్టీరియా (ఫాస్ఫో బాక్టీరియా)
  • ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ ఫంగై (ఫాస్పో ఫంగై)
  • ఫాస్ఫేట్ మొబిలైజింగ్ మైకోరైజా (వి.ఎ.ఎం)

భాస్వరం అందించే జీవన ఎరువుల వివరాలను కింద పొందుపరచినాము..
ఫాస్ఫో బాక్టీరియా: ముఖ్యంగా బాసిల్లస్ మెగథీరియంతో గాని, సూడోమోనాస్‌తో గాని ఉపయోగించి తయారుచేయబడును. అన్ని పంటలకు వాడుకోవచ్చు. సేంద్రియ ఎరువును వాడాలి. మొక్కలకు హార్మోన్లు సరఫరా చేసి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
వాడే విధానం: ఎకరాకు 2 కిలోల ఫాస్ఫోబాక్టర్‌ను 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలో గాని సాళ్ళలో గాని వేసుకోవలయును. వరినాట్లు వేసిన 3-7 రోజుల వ్యవధిలో వేసుకోవాలి.
ఫాస్పో ఫంగై: ఆస్పర్ౙిల్లస్ అవమోరి లేదా పెనిసీలియం డిజిటోటమ్ ఉపయోగించి తయారు చేయబడును. అన్ని పంటలకు వాడుకోవచ్చు. ఫాస్ఫో బాక్టీరియా కన్నా శక్తివంతమైన జీవన ఎరువు.
వాడే విధానం: 2.0 కిలోల జీవన ఎరువును 100 కిలోల సేంద్రియపు ఎరువుతో కలిపి ఒక ఎకరం నేలకు విత్తనం నాటి సాళ్ళలో పడేటట్లు వేసుకోవాలి.
ఫాస్ఫేట్ మొబిలైజింగ్ మైకోరైజా: శిలీంద్రపు జాతికి చెందిన జీవన ఎరువు. భాస్వరంతో పాటు జింకు, కాపర్, సల్ఫర్, మాంగనీసు, ఇనుము మొదలగు వాటిని కూడా మొక్కకు అందించును. మొక్కల్లో నీటి ఎద్దడిని తట్టుకోవడం, రోగ నిరోధక శక్తి పెరగడం గమనించవచ్చు.
వాడే విధానం: 5 కిలోలు / ఒక ఎకరానికి వేయవలసి ఉంటుంది. తప్పనిసరిగా విత్తనం / మొక్క కింద మాత్రమే పడేటట్లు వాడాలి.
పొటాషియం మొబిలైజర్స్: మొక్కకు అందుబాటులో లేని పొటాషియం అందుబాటులోకి తెచ్చును. ముఖ్యంగా ప్రటూరియా అర్షానియా అనే బ్యాక్టీరియా పొటాషియంను మొబిలైజర్స్‌గా ఇవ్వబడుతుంది. 100 కిలోల సేంద్రీయ ఎరువులో 2.0 కిలోల జీవన ఎరువును కలిపి ఒక ఎకరం భూమిపై వెదజల్లవలెను. నూనె పంటలలో దీని ప్రభావం బాగా కనబడుతుంది.
జింకు సాల్యుబలైజర్స్: కొన్ని బాసిల్లస్ స్పీసిస్ ఉపయోగించి జీవన ఎరువును కొన్ని ప్రైవేటు సంస్థలు తయారుచేయబడుచున్నవి. వరి, మొక్కజొన్న వంటి పంటల్లో దీని ప్రభావం కొంత మేరకు చూడవచ్చు.
మొక్క పెరుగుదలను అభివృద్ధి పరచే జీవన ఎరువు (పి.జి.పి.ఆర్): మిశ్రమ సముదాయంతో కూడుకున్న జీవన ఎరువు. బాసిల్లస్ మరియు సూడోమోనాస్ జాతి బ్యాక్టీరియాలను మిశ్రమంగా తయారు చేసి పి.జి.పి.ఆర్‌గా అందించనున్నారు. పోషకాలు అందించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించును. భూమిలోని మొక్కలకు తెగుళ్ళు కలుగచేసే శిలీంద్రాలను పెరగకుండా అరికట్టును. ఒక ఎకరాకు రెండు కిలోలు జీవన ఎరువును 100 కిలోల పశువుల ఎరువుతో గాని, వానపాముల ఎరువుతో గాని విత్తనం నాటుకునే సమయంలో వెదజల్లాలి. అవసరమైనప్పుడు పైరుపై సాయంత్రం వేళ పిచికారి కూడా చేయవచ్చు.
ద్రవరూపంలో రూపొందించబడిన జీవన ఎరువులు: ఆచార్య యన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారి అమరావతి వ్యవసాయ పరిశోధనా స్థానం వారు రూపొందించిన ద్రవరూప జీవన ఎరువులు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఒక ఎకరం పొలానికి 300 మి.లీ. నుండి 500 మి.లీ. వరకు ప్రతి ఒక్కొక్క రకపు జీవన ఎరువును మిశ్రమ ద్రావణంగా చేసి వాడాలి. వీటిని విత్తనానికి గాని, భూమిలో గాని, నారును ముంచే పద్ధతి, డ్రిప్ పద్ధతిలో గాని వాడవచ్చు.

జీవన ఎరువుల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు:

  1. పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడు వాడుకోవాలి.
  2. రసాయనిక ఎరువులతో కలిపి జీవన ఎరువులు వాడరాదు.
  3. ప్యాకెట్‌పై ఉన్న గడువు (షెల్ఫ్ పిరియడ్) దాటిన ఎరువులు వాడరాదు
  4. చల్లని ప్రదేశాల్లో నిల్వ ఉంచాలి.
  5. పైరుకు నిర్ధేశించిన జీవన ఎరువునే వాడాలి.
  6. విత్తనశుద్ధి చేయదలచినప్పుడు మొదటగా శిలీంద్రనాశినులతో శుద్ధి చేసి 24 గం॥ తరువాత జీవన ఎరువులను పట్టించాలి.
  7. సేంద్రియ ఎరువుతో జీవన ఎరువు కలిపిన వెంటనే పంటకు వాడుకోవాలి.

జీవన ఎరువుల వల్ల కలిగే ప్రయోజనాలు:

  1. నత్రజని స్థిరీకరిస్తాయి. నేలలోని భాస్వరాన్ని అందుబాటులోకి తెస్తాయి.
  2. భూసార నిల్వలు పరిరక్షించబడతాయి. సూక్ష్మజీవులు పెరుగుతాయి.
  3. 20-25 శాతం నత్రజని, భాస్వరం ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చును. 10-20 శాతం దిగుబడులు పెరుగుతాయి.
  4. నేల నుండి సంక్రమించే తెగుళ్ళు కొంతమేర నిరోధించబడతాయి.
  5. హార్మోన్లు, విటమిన్లు, ఎంజైములు లభ్యమై మొక్క పెరుగుదల చురుకుగా ఉంటుంది.
  6. కాలుష్యం ఉండదు. నేలకు, పంటకు ఎటువంటి హానికలగదు.
  7. చవుడు నేలల్లో సోడియం కరిగించి నేలను సారవంతం చేస్తాయి.
  8. క్రమం తప్పకుండా 3-4 కాలాలు వాడిన ఎడల దిగుబడులు గణనీయంగా పెరిగి నేలసారవంతమై ఉత్పాదక శక్తి పరిరక్షింపబడుతుంది.

ఎం. మల్లికార్జున్ (9491238885) (సేద్య విభాగం), ఇ. శిరీష (కీటక విభాగం), కె. బాలాజీ నాయక్ (విస్తరణ విభాగం), వి. యుగంధర్ (ఉద్యాన విభాగం), ఎం. హరని (పశు విభాగం), ఇ. చండ్రాయుడు (సమన్వయ కర్త), శ్రీమతి లక్ష్మీ దేవి కృషి విజ్ఞాన కేంద్రం, కళ్యాణదుర్గం, ఆంధ్రప్రదేశ్, 515761

Read More

మూడు సంస్థల నుంచి వ్యవసాయ అంకురాలకు ప్రోత్సాహం

బయోనెస్ట్ కో ఇంక్యుబేషన్ కార్యక్రమం కింద వ్యవసాయ అంకురాలను ప్రోత్సహించడానికి హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్) లో మూడు సంస్థల మధ్య శుక్రవారం త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. నార్మ్, ఎ-ఐడియా, భారత నూనె గింజల పరిశోధన సంస్థ(ఐఐవోఆర్)ల ప్రతినిధులు దీనిపై సంతకం చేశారు. దీని కింద ఎంపికైన అంకురాలకు ఈ 3 సంస్థలు సాయం అందిస్తాయి. నార్మ్ సంచాలకుడు, ఎ-ఐడియా అధ్యక్షుడు ఆరఎం సుందరం, ఐఐవోఆర్ సంచాలకుడు ఆర్‌కె మాథూర్, అంకుర సంస్థల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

సాంకేతికతను సాగుకు అనుసంధానించడం ద్వారా రైతుకు మేలు

వ్యవసాయాన్ని లాభదాయకం చేసేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని సాగుకు సాంకేతికతను అనుసంధానించడం ద్వారా రైతుకు మేలు చేయాలని నాబార్డ్ మాజీ చైర్మన్, ఐఐఎఫఎల్ సంస్థ ఫైనాన్స్ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు అన్నారు. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(ఆంగ్రూ) 63వ వ్యవస్థాపక దినోత్సవాలు గుంటూరు సమీపంలోని లాంఫాం ఆడిటోరియంలో శుక్రవారం జరిగాయి. వాతావరణ మార్పు అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆంగ్రూ అభివృద్ధికి రూ.3 లక్షలు విరాళం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రచురించిన ‘మారనున్న వాతావరణ, వాణిజ్య పరిస్థితులకు సుస్థిర వరి వ్యవసాయం’, గుంటూరు జిల్లాలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ప్రచురించిన ‘కంది సాగు సమగ్ర యాజమాన్యం, మినుము పంటకు నేల ద్వారా సంక్రమించే తెగుళ్లు, అపరాల సాగులో సమగ్ర కలుపు యాజమాన్యం’ పుస్తకాలను ఆవిష్కరించారు.

Read More