వండని వంట… కొబ్బరి అటుకుల లడ్డు

ఉడికించని, వేపని, వేడిచెయ్యని, సహజంగా చేసుకునే ఒక స్వీట్ కొబ్బరి అటుకుల లడ్డు. ఇది చేసుకోవడం చాలా సింపుల్. చాలా రుచికరమైన స్వీట్.

కావాల్సిన పదార్ధాలు: అటుకులు, పచ్చి కొబ్బరి తురుము, ఎలాచి పొడి, బెల్లం తురుము.

తయారీ విధానం: అటుకులను కచ్చాపచ్చాగా దంచుకుని, అందులో ఎలాచి పొడి, కొబ్బరి తురుము వేసుకుని, తీపి రుచి చూసుకుంటూ బెల్లం వేసుకోవాలి.

పచ్చి కొబ్బరి వల్ల, లడ్డు కట్టడానికి వస్తుంది… ఎక్కువ తీపి పట్టదు, కానీ రుచిగా ఉంటుంది.

పచ్చి కొబ్బరి కనుక, అప్పటికప్పుడు చేసుకుని తినవచ్చు. లేదా ఫ్రిజ్‌లో పెట్టుకుని వారం పది రోజుల పాటు వాడుకోవచ్చు.

రచన: సంధ్యా శశికాంత్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

ఔషధ మొక్క…. గారచెట్టు / ఇంగుడి / రింగ్రి

గారచెట్టు సాధారణంగా వెడల్పులేని ఆకారంలో 10 మీ. ఎత్తు పెరుగుతుంది. కొమ్మలు సుడివలే చుట్టుముట్టి పైకి పోయే పొడవైన, సూటి ఆకుపచ్చ రంగు ముళ్ళు కలిగి వుంటాయి. ముళ్ళ మొదళ్ళ నుండి ముదురు ఆకు పచ్చ రంగు ఆకులు ఏర్పడతాయి. ఒక్కొక్క ఆకు రెండు చిన్న ఆకులు కలిగి వుంటుంది. కాండం కొంచెం నెరిసిన గోధుమ రంగులో చిరిగిన బెరడు కలిగి వుంటుంది. పూగుచ్ఛం కొన్ని పూలగుత్తులను కలిగి వుంటుంది..

సాధారణ నామం : అడవి ఖర్జూర / ముళ్ళచెట్టు శాస్త్రీయ నామం : బలనైటెస్ ఈజిప్టియాకా కుటుంబం: జైగోఫిల్లేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • ఇంగుడి బెరడు, కాయగుజ్జు, గింజలు, గింజల నూనెని ఔషధంగా ఉపయోగిస్తారు. ఇంగుడి తిక్తరసం, లఘుగుణం, ఉష్ణ, కటు, కఫ, వాత హరం గుణాలను కలిగి వుంటుంది.
  • దీనిని లేపనంగా, లోపలికి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. లేపనంగా మంటలలో కాలిన శరీరభాగాలకు, గాయాలకు, శిరో రోగాలకు, జుట్టు సమస్యలకు, మానని గాయాలకు, ఎలుక కరిచినపుడు ఉపయోగిస్తారు. కడుపులో నులిపురుగులు, మలబద్ధకం, ఆకలి మందగించడం, పొత్తికడుపునొప్పి, రక్త సంబంధ వ్యాధులు, విపరీతమైన దగ్గు, ఆస్త్మా, బ్రోంకైటిస్, డైసూరియా, ల్యూకోడెర్మా, చర్మ వ్యాధులు, ఎలుకకరిస్తే విష నివారణకు లోపలికి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. దీని మోతాదు కషాయం (50-100 మి.లీ.), పొడి (3-6 గ్రా), గింజల నూనె (5-10 చుక్కలు), కాయగుజ్జు (500-1000 మి.గ్రా.) గింజలపొడి (500-1000 మి.గ్రా.)
  • అధిక సపోనిన్స్ కలిగిన కాయగుజ్జు డెంగ్యూ వ్యాధిని వ్యాప్తి చేసే దోమల లార్వాలను చంపుతుంది.

వ్యవసాయరంగంలో …

  • ఇంగుడి ద్రావణం పంట కాలువలలో నత్తల గుంపులు, నిల్వ వుంచిన అలసంద గింజలను నష్టపరిచే పురుగు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌ని నివారిస్తుంది (రావు, అతని అనుచరులు, 1997, న్వవోగు, అతని అనుచరులు, 2013)
  • ఇంగుడి ద్రావణం నిల్వ ధాన్యంలో ఆశించే కాప్రాబీటల్, ట్రోగోడెర్మా గ్రానేరం ని అరికట్టింది (మొల్మాద;, 2003), ఇంగుడి గింజల హెక్సేన్ ద్రావణం ట్రోగో డెరా గ్రానేరియం మూడవ దశ లార్వాలను సమర్థవంతంగా చంపింది (మొహ్మద్ అండ్ సత్తి, 2013)
  • ఇంగుడి ద్రావణం అతి తక్కువ (10%) మోతాదులో అలసంద గింజల నిల్వ సమయంలో ఆశించే 85% కాల్లనో బ్రూకస్ మాక్యులేటస్ పురుగులను చంపింది (కేబాల, అతని అనుచరులు, 2013)
  • ఇంగుడి గింజల ఎపికార్ప్, మీసోకార్ప్ ద్రావణాలు యాంటిఫీడెంట్ చర్యతో అలసంద గింజల నిల్వ సమయంలో ఆశించే పురుగు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌ని అరికట్టింది.
  • ఇంగుడి ద్రావణంలో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, టానిన్స్, సపోనిన్స్, కార్బో హైడ్రేట్స్, టెర్పెనాయిడ్స్ వంటి రసాయనాలున్నాయి (ఉమర్ ముహ్ద్‌గుని, 2016)
  • ఇంగుడి కాయ మీసోకార్ప్ ద్రావణంలో వున్న సపానిన్స్ డెంగ్యూ వాహకం ఈడెస్ ఈజిప్టి దోమ లార్వాలను నాశనం చేశాయి (బిష్ణుచాపగన్ అండ్ జీవ్ వీస్మన్, బెన్‌గురియన్ యూనివర్సిటి, ఇజ్రాయెల్)
  • ఇంగుడి + చింతకాయల ద్రావణాన్ని ఉపయోగించి ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ పారసైటికస్‌ల విషపూరిత పదార్థాల వల్ల ఆహారం కలుషితమవకుండా కాపాడవచ్చు (ఎల్. నగర్ బి, అతని అనుచరులు, 2013)
  • ఇంగుడి పచ్చి కాయ ద్రావణం పిచికారి చేసిన 3వ రోజు తర్వాత పిండినల్లి ఫెరిస్టా విర్గేటా నివారించబడింది. పిచికారి చేసిన 7వ రోజు పిండి నల్లులు కనిపించలేదు (వబలె, అతని అనుచరులు, 2010).
  • ఇంగుడి ద్రావణం గొర్రెల నాశించే ఈగ ల్యూసిలియా సెరికేటా మూడు దశల లార్వాలను నివారించింది (మొహ్మద్, అతని అనుచరులు, 2016)
  • ఇంగుడి ద్రావణం రైజోక్టోనియా సొలాని శిలీంద్రం పెరుగుదలను గరిష్టంగాను, ఫిథియం అఫానిడెర్మేటం శిలీంద్రాన్ని కనిష్టంగాను అరికట్టింది.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పండ్లలో చక్కెర శాతం పెంపునకు… పులిసిన పండ్ల రసం ద్రావణం

పులియబెట్టిన పండ్ల రసాల్లో ఉన్న పలురకాల సూక్ష్మజీవుల చర్య వలన ఇవి పంటలలో చక్కెర శాతాన్ని పెంచడానికి దోహదపడతాయి.
కావలసిన పదార్థాలు : బాగా మగ్గిన పండ్లు : 1 కిలో (అరటి, మామిడి, బొప్పాయి, మొ॥); బెల్లం : 1 కిలో.

తయారు చేసే పద్ధతి

  • ఒక కిలో బాగా మగ్గిన పండ్లను బాగా ముద్దగా చేసి దానికి ఒక కిలో మెత్తగా చేసిన బెల్లాన్ని కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని ఒక కుండలో పోయాలి.
  • కుండను ఒక గుడ్డతో మూతకట్టి దానిని ఒక నీడ ప్రదేశంలో వారం రోజులపాటు ఉంచాలి.
  • ఈ విధంగా బాగా పులిసిన ద్రావణం సుమారు 2.5 లీటర్ల వరకు ఉంటుంది.
  • ఈ మిశ్రమాన్ని వడపోసి 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరా పంట పొలంలో పిచికారి చేయాలి.

ఉపయోగాలు :

  • పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు. ఈ ద్రావణాన్ని అన్ని పండ్ల తోటలలో వాడవచ్చు.
  • ద్రావణాన్ని తయారు చేసిన వెంటనే ఉపయోగించుకోవాలి. నిల్వ ఉంచరాదు.
Read More

వండని వంట… ఫ్రూట్ సలాడ్

మామూలుగా బయట దొరికే ఫ్రూట్ సలాడ్‌లో కస్టర్డ్ పౌడర్, చక్కెర, పాలలో వేసి మరిగించి చల్లారాక ఫ్రూట్స్ వేసి కలుపుతారు.

చక్కెర, కస్టర్డ్ పౌడర్ లేకుండా, పాలను మరిగించకుండా ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది.ఉడికించని ఆహారం కనుక, జీవశక్తిపూరితంగా ఉంటుంది.

తయారీ విధానం: రెండు అరటిపళ్ళు, నాలుగు సపోటాలు బాగా మాగినవి, కొన్ని అంగూర (ద్రాక్ష) పండ్లు, రెండు దోర జామపండ్లు, అన్నిటినీ సన్న ముక్కలుగా తరిగి గిన్నెలో వేసుకొని, పచ్చి పాలు పోసి కలుపుకొని, కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి.

కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు.

జీడీపప్పు, బాదం పప్పు ఉంటే వేసుకోవచ్చు.

మాములుగా తినొచ్చు, లేదా ఎండలు బాగా వున్నాయి కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే, కడుపుకు చల్లగా హాయ్‌గా ఉంటుంది.

చక్కెర అవసరం లేదు. పళ్ళలో వుండే తీపి సరిపోతుంది. ఇంకా తీపి కావాలనిపిస్తే, తేనే కలుపుకోవచ్చు !

రచన: శివారెడ్డి కర్నాటి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

కాయ నాణ్యతకు… కాల్షియం ద్రావణం

మొక్కల్లో పూత కాయగా మారే క్రమంలో కాల్షియం కీలకపాత్ర పోషిస్తుంది. దీనిని కూడా చాలా సులువుగా తయారు చేసుకునే ప్రక్రియ ఈ వ్యవసాయ విధానంలో కనిపిస్తుంది.

మనిషి ఎముక బలానికి కాల్షియం ఎంత అవసరమో, మొక్కకు అంతే అవసరం. దీనిని సహజ పద్దతుల్లో తయారు చేసుకోవడానికి సముద్రంలో, నదులలో దొరికే గవ్వలను లేదా గుడ్డు పెంకులను వెనిగర్‌తో కలిపితే ద్రవరూప కాల్షియం లభిస్తుంది. దీనిని మొక్కలకు అందించడం వల్ల ప్రధానంగా కాయ నాణ్యత, కాయ కోత తరువాత ఎక్కువ రోజుల నిల్వకు దోహదపడుతుంది.

కాల్షియంను ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్ రూపంలో కూడా అందించవచ్చు. ఒక కిలో అల్లాన్ని మెత్తగా దంచి అందులో కిలో బెల్లాన్ని కలుపుకుని పదిహేనురోజుల పాటు వుంచి మొక్కలకు పూత దశ నుంచి స్ప్రే చేయాలి.

Read More

ఔషధ మొక్క…. జలబ్రహ్మి

సాధారణ నామం : సంబరేణి మొక్క /నీర్ బ్రహ్మి శాస్త్రీయ నామం : బాకోపా మాన్నియెరి కుటుంబం: స్క్రోఫులేరియేసి

ఇది నేలబారుగా పెరిగే ఒక బహువార్షిక మొక్క. నీటి ఆధారం బాగా ఉన్న చోట ఎక్కువగా కనబడుతుంది. కణుపుల వద్ద అనేక వేర్లు తొడుగుతుంది. ఆకులు ఒక్కో కణుపు వద్ద రెండు చొప్పున వస్తాయి. ఆకులు మొదట సన్నగా ఉండి పోను పోను వెడల్పుగా మారతాయి. ఆకులు మందంగా ఉండి కనపడని ఈనెలతో ఉంటాయి. పూవులు లేత నీలం రంగు లేదా తెలుపు వర్ణంలో ఉండి ఆకుల మొదళ్ళ నుండి ఒక్కొక్కటిగా వస్తాయి. కాయలు చిన్నగా గుండ్రంగా లేదా అండాకారంలో ఉండి రెండు గదులు కలిగి ఉంటాయి. కాయలలో అనేక గింజలు సూక్ష్మంగా ఉంటాయి.

ఉపయోగాలు : ఔషధ రంగంలో

  • మొక్క సమూలంగా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది.
  • దీనిలో బ్రాహ్మైన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది.
  • ఈ మొక్క నుండి బి1 ఆక్టలేట్, బి2 ఆక్టలేట్ మరియు బి3 క్లోరోప్లాటినేట్ లభిస్తాయి. అంతేకాక హెర్పిస్టెన్, సాపోనిన్, బాకోసైడ్ ‘ఎ’ మరియు బాకోసైడ్ ‘బి’, మొన్నియరిన్ మొదలైన ఆల్కలాయిడ్స్ కూడా లభిస్తాయి.
  • జలబ్రహ్మి వాతం, కఫరోగం నివారణకు, నరాల వ్యాధులకు, నొప్పి, మూర్ఛవ్యాధి, పిచ్చి, కణుతులు, పుండ్లు, అజీర్ణం, మలబద్ధకం, ఉబ్బసం, బ్రాంకైటిస్, కుష్టు, ల్యూకోడెర్మా, బోదకాలు, నపుంసకత్వం, జ్వరం, సాధారణ బలహీనత మొదలగు వాటి చికిత్సలో ఉపయోగపడుతుంది.
  • ఇది జ్ఞాపకశక్తి పెంచుటకు కూడా ఉపయోగపడుతుంది.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… ఉల్లిగడ్డ ముక్కల కారం

ఉల్లిగడ్డలతో మనము రకరకాల వంటలు చేసుకోవచ్చు.

ఇది ఉల్లిగడ్డ ముక్కలతో చేసేది. నోరు బాలేనప్పుడు, చట్నీలు చేసే టైం లేనప్పుడు, దోసెల్లోకి, జొన్నరొట్టెల్లోకి, చపాతీల్లోకి బాగుంటది. చాలా సింపుల్‌గా ఒక నిమిషంలో అయిపోతది.

ఎండాకాలంలో ఎంత ఎక్కువ ఉల్లిగడ్డ తింటే అంత మంచిది. చలువ చేస్తుంది, కాబట్టి వీలైనంత మటుకు ఉల్లిగడ్డను మన ఆహారంలో చేర్చాలి.

కావలసినవి: 2 ఉల్లిగడ్డలు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, నూనె… అంతే ! జీలకర్ర, ఎల్లిగడ్డ అవసరం లేదు.
ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, దాంట్లో మనం తినగలిగినంత కారం, కొంచెం ఉప్పు, పచ్చి నూనె కలపాలి. అన్నింటిని మంచిగా కలిపి తినేయడమే.

దీంట్లో నూనెకు బదులుగా నెయ్యి వాడదామని అనుకునేరు, అస్సలు బాగుండదు. కాకపోతే మనం తినే దోసెల మీద లేదా రొట్టెల మీద కొంచెం వెన్నపూస పెట్టుకుంటే బాగుంటది.
అప్పటికప్పుడు చేసుకోవడానికి బాగుంటది.

రచన: శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

ఎల్‌నినో ప్రభావం: పంటలపై కీటకాల ఉధృతి — రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు

వాతావరణ మార్పులతో మారుతున్న కీటకాల ప్రవర్తనను అర్థం చేసుకొని, సమగ్ర సస్యరక్షణ యాజమాన్యంతో నష్టాలను నివారిద్దాం

పరిచయం
వ్యవసాయం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడిన జీవన విధానం. విజయవంతమైన పంటల సాగుకు అనుకూలమైన వాతావరణం, సకాలంలో వర్షాలు, సరైన ఉష్ణోగ్రతలు, తగిన నేల తేమ వంటి అంశాలు అత్యంత కీలకం. అయితే ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులు (Climate Change) వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, అనిశ్చిత వర్షపాతం, దీర్ఘకాలిక కరువు, అకస్మాత్తుగా కురిసే భారీ వర్షాలు, వడగాడ్పులు (Heat Waves) వంటి పరిస్థితులు రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

ఈ వాతావరణ హెచ్చుతగ్గులకు దోహదపడే ప్రధాన కారణాల్లో ఎల్‌నినో (El Niño) ఒకటి. ఎల్‌నినో ప్రభావం పంటల పెరుగుదలపైనే కాక, పంటలను ఆశించే కీటకాల జీవన చక్రం, సంతానోత్పత్తి రేటు, వ్యాప్తి, హానికారకత్వంపై కూడా గణనీయమైన మార్పులు తీసుకువస్తుంది. కొన్ని కీటకాలు అసాధారణంగా విజృంభించి పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తే, మరికొన్నింటి ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది.

కాబట్టి “ఎల్‌నినో సంవత్సరాల్లో ఏ కీటకాలు ఎక్కువగా విజృంభిస్తాయి? ఏ పంటల్లో ఎక్కువ నష్టం సంభవించే అవకాశం ఉంది? రైతులు ఎలాంటి ముందస్తు, సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలి?” అనే అంశాలపై సరైన అవగాహన కలిగి ఉండటం నేటి పరిస్థితుల్లో అత్యవసరం.

ఎల్‌నినో అంటే ఏమిటి?
ఎల్‌నినో అనేది మధ్య మరియు తూర్పు భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాల ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే 0.5°C లేదా అంతకంటే ఎక్కువ పెరిగి, ఆ పరిస్థితి కనీసం ఐదు వరుస నెలలపాటు కొనసాగినప్పుడు నిర్ధారించే ఒక సహజ సముద్ర-వాతావరణ దృగ్విషయం (ENSO వ్యవస్థలో వెచ్చని దశ).
సాధారణ పరిస్థితుల్లో తూర్పు నుండి పడమర వైపు వీచే వాణిజ్య పవనాలు (Trade Winds) వెచ్చని ఉపరితల జలాలను ఇండోనేషియా వైపుకు నెట్టివేస్తాయి. ఎల్‌నినో సమయంలో ఈ గాలులు బలహీనపడటం వల్ల వెచ్చని నీరు మధ్య-తూర్పు పసిఫిక్‌లోనే పేరుకుపోయి, ప్రపంచ వాతావరణ ప్రసరణ మార్గాల్లో మార్పులకు కారణమవుతుంది.

ఈ మార్పుల ప్రభావం ప్రపంచంలోని అనేక దేశాలపై, ముఖ్యంగా భారత ఉపఖండంపై స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా ఎల్‌నినో సంవత్సరాల్లో ఈ కింది పరిస్థితులు ఏర్పడే అవకాశం ఎక్కువ:
• సాధారణం కంటే తక్కువ, అనిశ్చిత వర్షపాతం
• నైరుతి రుతుపవనాల బలహీనత లేదా ఆలస్యం
• పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు
• నేల తేమ తగ్గుదల
• దీర్ఘకాలిక పొడి వాతావరణ పరిస్థితులు

గమనిక: ఇవి సంభావ్యతలు మాత్రమే — ఎల్‌నినో ఉన్న ప్రతి సంవత్సరం భారతదేశంలో కరువు తప్పనిసరిగా వస్తుందని కాదు; స్థానిక భౌగోళిక అంశాలు, హిందూ మహాసముద్ర డైపోల్ (IOD) వంటి ఇతర అంశాలు కూడా తుది ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి.

ఎల్‌నినో కీటకాలపై ఎలా ప్రభావం చూపుతుంది?
కీటకాలు శీతల రక్త జీవులు (Poikilothermic/Cold-blooded organisms) — వాటి శరీర ఉష్ణోగ్రత పరిసర వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల వాతావరణంలో స్వల్ప మార్పులు కూడా వాటి పెరుగుదల రేటు, జీవిత చక్రంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.

ఉష్ణోగ్రత పెరిగినప్పుడు:
• గుడ్లు వేగంగా పొదుగుతాయి
• లార్వా దశ తక్కువ వ్యవధిలో పూర్తవుతుంది
• ప్యూపా దశ కాలం తగ్గుతుంది
• పెద్ద పురుగులు త్వరగా లైంగిక పరిపక్వత చెంది సంతానోత్పత్తి ప్రారంభిస్తాయి
• ఒకే పంట కాలంలో ఎక్కువ తరాలు (generations) అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది

తక్కువ వర్షపాతం వల్ల:
• భారీ వర్షాల ద్వారా సహజంగా కొట్టుకుపోయే పురుగుల మరణాల రేటు తగ్గుతుంది
• ఆకులపై నివసించే చిన్న, మృదుకాయ కీటకాలు సులభంగా మనుగడ సాగిస్తాయి
• అధిక తేమ అవసరమయ్యే కీటక-పరాన్నజీవి శిలీంధ్రాలు (entomopathogenic fungi వంటివి) సమర్థంగా వృద్ధి చెందక, కీటకాల సహజ మరణాల రేటు తగ్గుతుంది
ఫలితంగా కొన్ని కీటక జాతుల జనాభా వేగంగా పెరిగి, ఆర్థిక నష్టపు గరిష్ఠ స్థాయిని (Economic Threshold Level) దాటే అవకాశం ఏర్పడుతుంది.

ఎల్‌నినో పరిస్థితుల్లో ఎక్కువగా విజృంభించే కీటకాలు
ఎల్‌నినో ప్రభావంతో అన్ని కీటకాలు ఒకేలా పెరగవు. ప్రధానంగా వేడి, పొడి వాతావరణానికి అనుకూలంగా ఉండే జాతులు మాత్రమే వేగంగా విస్తరిస్తాయి.

  1. రసం పీల్చే పురుగులు (Sap-Sucking Insects)
    ఎల్‌నినో పరిస్థితుల్లో అత్యధికంగా పెరిగే కీటక సమూహం ఇదే. ఇందులో తెల్లదోమలు, తామర పురుగులు (Thrips), పేనుబంక (Aphids), జాసిడ్లు, మీలీబగ్స్, స్కేల్ కీటకాలు ప్రధానమైనవి. ఇవి మొక్కల ఆకులు, లేత కొమ్మలు, పూతలు, పిందెల నుండి కణరసాన్ని పీల్చి మొక్కలను బలహీనపరుస్తాయి.
    ఎక్కువగా పెరగడానికి కారణాలు: తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత, తక్కువ సాపేక్ష ఆర్ద్రత, వేగవంతమైన జీవితచక్రం, అధిక సంతానోత్పత్తి సామర్థ్యం.
    కలిగించే నష్టం: మొక్కల పెరుగుదల మందగించడం, ఆకులు పసుపు రంగులోకి మారడం, ఆకులు ముడుచుకుపోవడం, పూత-పిందె రాలిపోవడం, దిగుబడి తగ్గుదల, వైరస్ వ్యాధుల వేగవంతమైన వ్యాప్తి.
  2. తామర పురుగులు (Thrips)
    ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో సంవత్సరాల్లో అధికంగా నమోదయ్యే కీటకాల్లో ఇవి ముఖ్యమైనవి. మిరప, ఉల్లి, వేరుశెనగ, పత్తి, ద్రాక్ష, పూల పంటల్లో తీవ్ర నష్టం కలిగిస్తాయి. త్రిప్స్ ఆకు ఉపరితలాన్ని గీరి కణరసాన్ని పీల్చడం వల్ల ఆకులపై వెండి-బూడిద రంగు మచ్చలు/గీతలు (silvering) కనిపిస్తాయి. తీవ్ర ఉధృతిలో ఆకులు ఎండిపోయి పంట పెరుగుదల పూర్తిగా దెబ్బతింటుంది. మిరపలో ఇవి “ఆకుముడత” (leaf curl) వ్యాధి వ్యాప్తికి కూడా దోహదపడతాయి.
  3. తెల్లదోమ (Whitefly)
    తెల్లదోమ అనేక మొక్కల వైరస్ వ్యాధులకు (ముఖ్యంగా బిగోమోవైరస్‌లకు) ప్రధాన వాహకం. ఎల్‌నినో పరిస్థితుల్లో వీటి జనాభా వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా పత్తి, టమాట, బెండ, మిరప, సోయాబీన్ పంటల్లో అధిక నష్టం కలిగిస్తుంది — ప్రత్యక్ష రసం పీల్చడం ద్వారానే కాక, వైరస్ వ్యాప్తి ద్వారా కూడా.
  4. పచ్చ నల్లి / స్పైడర్ మైట్స్ (Spider Mites)
    సాంకేతికంగా మైట్స్ కీటకాలు (Insecta) కాదు — ఇవి అష్టపాద జాతికి (Arachnida) చెందినవి. అయినప్పటికీ వ్యవసాయ సస్యరక్షణలో వీటిని హానికర కీటకాలతో పాటే పరిగణిస్తారు. అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణంలో వీటి అభివృద్ధి అత్యంత వేగంగా జరుగుతుంది. పత్తి, మిరప, వంకాయ, కూరగాయలు, పండ్ల తోటల్లో తీవ్ర నష్టం కలిగిస్తాయి.
  5. మీలీబగ్స్ (Mealybugs)
    మామిడి, బొప్పాయి, దానిమ్మ, ద్రాక్ష, పత్తి వంటి పంటల్లో ఎల్‌నినో సంవత్సరాల్లో మీలీబగ్స్ ఉధృతి పెరిగే అవకాశం ఉంది. వీటి తీపి విసర్జనం (honeydew) మీద నల్లటి బూజు తెగులు (Sooty mold) ఏర్పడి కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం కలిగిస్తుంది.
  6. ఫాల్ ఆర్మీవార్మ్ మరియు స్పోడోప్టెరా జాతులు
    ఫాల్ ఆర్మీవార్మ్ (Spodoptera frugiperda) మరియు టుబాకో కాటర్‌పిల్లర్ (Spodoptera litura) వంటి ఆకుతినే పురుగుల తీవ్రత ఎల్‌నినో ఒక్క కారణం వల్లనే పెరుగుతుందని చెప్పడం శాస్త్రీయంగా సరికాదు. అయితే దీర్ఘకాలిక పొడి వాతావరణం వల్ల మొక్కలపై ఒత్తిడి (Plant stress) పెరగడం, సహజ శత్రు కీటకాల (parasitoids, predators) సంఖ్య తగ్గడం, ఆలస్యంగా వచ్చే వర్షాలు వంటి పరోక్ష కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో వీటి ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కజొన్న, వేరుశెనగ, సోయాబీన్, కూరగాయల పంటల్లో క్రమం తప్పకుండా పర్యవేక్షణ అవసరం.

రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు
ఎల్‌నినో సంవత్సరాల్లో కీటకాల ఉధృతిని పూర్తిగా నివారించలేకపోయినా, సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం (Integrated Pest Management – IPM) ద్వారా నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

  1. పంట ప్రారంభానికి ముందు తీసుకోవాల్సిన చర్యలు
    • తట్టుకునే/తక్కువ కాలపరిమితి గల రకాలను ఎంపిక చేసుకోవడం
    • విత్తనశుద్ధి తప్పనిసరిగా చేపట్టడం (సిఫారసు చేసిన శిలీంధ్రనాశక/కీటకనాశక మోతాదులతో)
    • భూసార పరీక్ష ఆధారంగా సమతుల్య ఎరువుల
    • పంట మార్పిడి (Crop rotation) పాటించడం
    • పంట చుట్టూ ట్రాప్ పంటలు (marigold, castor వంటివి) వేయడం
  2. పంట పెరుగుదల దశలో నిరంతర పర్యవేక్షణ
    • ప్రతి వారం పొలాన్ని పరిశీలించి కీటకాల ఉనికిని గుర్తించడం
    • పసుపు/నీలం రంగు జిగురు అట్టలు (Yellow/Blue sticky traps) – తెల్లదోమ, తామర పురుగుల పర్యవేక్షణకు
    • లింగాకర్షక బుట్టలు (Pheromone traps) – ఆకుతినే పురుగుల ముందస్తు హెచ్చరికకు
    • ఆర్థిక నష్టపు స్థాయి (Economic Threshold Level – ETL) దాటిన తర్వాతే నివారణ చర్యలు చేపట్టడం — ముందుగానే మందులు వాడకపోవడం
  3. నీటి యాజమాన్యం
    • అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుతూ, డ్రిప్/స్ప్రింక్లర్ పద్ధతుల ద్వారా క్రమం తప్పకుండా తేమ నిర్వహణ
    • తేలికపాటి తుంపర్లు (light irrigation/sprinkling) ఇవ్వడం ద్వారా ఆకులపై పేరుకున్న కొన్ని రసం పీల్చే పురుగులను తగ్గించుకోవచ్చు
    • నీటి ఎద్దడి (moisture stress) లేకుండా చూసుకోవడం, ఎందుకంటే ఒత్తిడికి గురైన మొక్కలు కీటకాలకు మరింత లోబడతాయి
  4. జీవ నియంత్రణ (Biological Control) ప్రోత్సాహం
    • క్రైసోపెర్ల, లేడీబర్డ్ బీటిల్స్ వంటి సహజ శత్రు కీటకాలను సంరక్షించడం
    • NPV, బ్యూవేరియా బాసియానా వంటి జీవ కీటకనాశకాలను తగిన పరిస్థితుల్లో వినియోగించడం
  5. సమగ్ర రసాయన యాజమాన్యం
    • స్థానిక వ్యవసాయ శాఖ / కృషి విజ్ఞాన కేంద్రం సిఫారసులను పాటించడం
    • పురుగుల, తెగుళ్ల నిరోధకత (resistance) ఏర్పడకుండా జాగ్రత్త పడటం
    • పిచికారీకి ముందు వాతావరణ సూచనలు పరిశీలించడం — ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న మధ్యాహ్న వేళల్లో పిచికారీ మానుకోవడం
  6. సమాచార వినియోగం
    • భారత వాతావరణ శాఖ (IMD), రాష్ట్ర వ్యవసాయ శాఖల ముందస్తు హెచ్చరికలను నిరంతరం అనుసరించడం
    • సమీప కృషి విజ్ఞాన కేంద్రం (KVK) నిపుణుల సలహాలు తీసుకోవడం
    • తోటి రైతులతో అనుభవాలు పంచుకుంటూ ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవడం

ముగింపు
ఎల్‌నినో వంటి వాతావరణ దృగ్విషయాలు రైతుల నియంత్రణలో లేనప్పటికీ, వాటి ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి, తగిన సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతులను అనుసరించడం ద్వారా పంట నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. నిరంతర పర్యవేక్షణ, సకాలంలో నిర్ణయాలు, జీవ-రసాయన నియంత్రణ పద్ధతుల సమతుల్య వినియోగం ద్వారా రైతులు ఎల్‌నినో సంవత్సరాల్లో కూడా తమ పంటలను సురక్షితంగా కాపాడుకోగలరు.

ఈ వ్యాసంలోని సూచనలు సాధారణ మార్గదర్శకాలు మాత్రమే. నిర్దిష్ట పంట, ప్రాంతం, తెగుళ్ల తీవ్రతను బట్టి స్థానిక వ్యవసాయ శాఖ లేదా కృషి విజ్ఞాన కేంద్రం నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

డా. టి. నరేష్, సహాయ ఆచార్యులు (కీటక శాస్త్రం) మరియు డా. హరీషా ఎన్. , సహాయ ఆచార్యులు (వ్యవసాయ విస్తరణ శాస్త్రం), విజ్ఞాన్ వ్యవసాయ మరియు సాంకేతిక సంస్థ విజ్ఞాన్ విశ్వవిద్యాలయం, గుంటూరు.

Read More

పశువుల కొనుగోలు సమయంలో తప్పక పరిశీలించాల్సిన 10 ముఖ్యమైన అంశాలు

     పాడి పరిశ్రమ రైతులకు రోజువారీ ఆదాయం అందించే ముఖ్యమైన అనుబంధ వృత్తి. అయితే, ఈ రంగంలో లాభం రావాలంటే మొదటి అడుగు నాణ్యమైన పశువును ఎంపిక చేసుకోవడమే. చాలామంది రైతులు పశువు బయటకు ఆరోగ్యంగా కనిపిస్తే చాలు అనుకుని కొనుగోలు చేస్తారు. కానీ పాల ఉత్పత్తి, ఆరోగ్య స్థితి, వయస్సు, ప్రజనన చరిత్ర, టీకాలు, నిర్వహణ వంటి విషయాలను పరిశీలించకుండా కొనుగోలు చేస్తే తరువాత పాల దిగుబడి తగ్గడం, తరచూ అనారోగ్యం రావడం, చికిత్స ఖర్చులు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే పశువును కొనుగోలు చేసే ముందు కొంత సమయం కేటాయించి కొన్ని ముఖ్యమైన విషయాలను పరిశీలిస్తే భవిష్యత్తులో నష్టాలను నివారించవచ్చు. రైతులు తప్పక గుర్తుంచుకోవాల్సిన 10 ముఖ్యమైన అంశాలు ఇవి.
  1. కొనుగోలు లక్ష్యాన్ని ముందుగా నిర్ణయించుకోవాలి
    పశువును ఎందుకు కొనుగోలు చేస్తున్నామో ముందుగా స్పష్టంగా నిర్ణయించుకోవాలి. పాలు ఉత్పత్తి పెంచడానికా, సంతానోత్పత్తికా, ఇప్పటికే ఉన్న ఫారాన్ని విస్తరించడానికా, లేక కొత్తగా పాడి పరిశ్రమ ప్రారంభించడానికా అనే విషయాన్ని ముందే ఆలోచించాలి. లక్ష్యానికి అనుగుణంగా పశువును ఎంపిక చేస్తే సరైన జాతి, సరైన వయస్సు, అవసరమైన పెట్టుబడి నిర్ణయించడం సులభం అవుతుంది. మీ ప్రాంత వాతావరణం, పచ్చిమేత లభ్యత, నీటి సౌకర్యం, నిర్వహణ సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇతరుల మాటలు విని లేదా తొందరపాటులో నిర్ణయం తీసుకోవడం కంటే ముందస్తు ప్రణాళికతో కొనుగోలు చేయడం మంచిది.
  2. మంచి జాతి పశువును ఎంపిక చేయాలి
    పాడి పరిశ్రమలో లాభదాయకతకు జాతి ఎంపిక చాలా ముఖ్యమైనది. అయితే కేవలం జాతి పేరును చూసి పశువును కొనుగోలు చేయకూడదు. మీ ప్రాంత వాతావరణానికి అనుకూలంగా ఉండే, మంచి పాల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన, ఆరోగ్యవంతమైన పశువును ఎంపిక చేయాలి. సాధారణంగా ఆవులలో గిర్, సాహివాల్ వంటి స్వదేశీ జాతులు, అలాగే హెచ్‌ఎఫ్ (HF) సంకరజాతి, జెర్సీ సంకరజాతి పశువులు పాల ఉత్పత్తికి అనుకూలంగా ఉంటాయి. గేదెలలో ముర్రా, జాఫ్రాబాది వంటి జాతులు రైతుల్లో ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే ఏ జాతినైనా ఎంపిక చేసే ముందు పశువు ఆరోగ్యం, పాల దిగుబడి, ప్రజనన చరిత్ర, స్థానిక పరిస్థితులకు అలవాటు పడే సామర్థ్యం, నిర్వహణ సౌలభ్యం వంటి అంశాలను పరిశీలించాలి. వీలైనంత వరకు విశ్వసనీయ రైతులు, ప్రభుత్వ పశు అభివృద్ధి కేంద్రాలు, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు లేదా గుర్తింపు పొందిన డెయిరీ ఫారాల నుంచి పశువులను కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల నాణ్యమైన పశువును ఎంపిక చేసే అవకాశం పెరుగుతుంది.
  3. వయస్సు మరియు కొనుగోలుకు అనువైన దశను గుర్తించాలి
    పాడి పశువు వయస్సు, దాని పాల ఉత్పత్తి, ప్రజనన సామర్థ్యం, ఉత్పాదక జీవితంపై ప్రభావం చూపుతుంది. అందువల్ల పశువును కొనుగోలు చేసే ముందు దాని వయస్సును తప్పనిసరిగా తెలుసుకోవాలి. పుట్టిన తేదీ లేదా రికార్డులు లేకపోతే పళ్లను పరిశీలించి వయస్సును అంచనా వేయవచ్చు. అవసరమైతే పశువైద్యుని సహాయం తీసుకోవడం మంచిది. సాధారణంగా రెండో లేదా మూడో ఈతలో ఉండి, ఇటీవల ఈనిన పాడి పశువులకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. అలాంటి పశువుల గత పాల ఉత్పత్తి, ప్రజనన చరిత్రను అంచనా వేయడం సులభం. అలాగే మరికొన్ని సంవత్సరాలు ఉత్పాదకంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. చాలా చిన్న వయస్సు గల లేదా అధిక వయస్సు గల పశువులను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. పశువు చివరిసారిగా ఎప్పుడు ఈనిందో, ప్రస్తుతం పాలిచ్చే కాలంలో ఏ దశలో ఉందో కూడా తెలుసుకోవాలి.
  4. శారీరక ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి
    పశువు బయటకు ఆరోగ్యంగా కనిపించడం మాత్రమే సరిపోదు. కొనుగోలు చేసే ముందు దానిని కొంతసేపు గమనించి సాధారణ ఆరోగ్య స్థితిని అంచనా వేయాలి. ఆరోగ్యవంతమైన పశువు చురుకుగా ఉండి మేతను ఆసక్తిగా తింటుంది. కళ్లు స్పష్టంగా, ప్రకాశవంతంగా ఉండాలి. ముక్కు సహజంగా తేమగా ఉండాలి. వెంట్రుకలు నునుపుగా, మెరుస్తూ ఉండాలి. చర్మంపై గాయాలు, పుళ్లు, గడ్డలు లేదా చర్మవ్యాధి లక్షణాలు ఉండకూడదు. శ్వాసలో ఇబ్బంది, తరచుగా దగ్గు, ముక్కు లేదా కళ్ల నుంచి అసాధారణ స్రావం, విరేచనాలు, అధిక బలహీనత, శరీరంపై వాపులు లేదా అసాధారణ ప్రవర్తన కనిపిస్తే అలాంటి పశువును కొనుగోలు చేయకపోవడం మంచిది. పశువు మేత తినే తీరు, నెమరు వేసే విధానం,మూత్రం రంగు, మలవిసర్జనను కూడా గమనించాలి. సందేహం ఉంటే కొనుగోలు చేసే ముందే స్థానిక పశువైద్యునితో పూర్తి ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలి.
  5. పొదుగు నిర్మాణం, చనుమొనలను పరిశీలించాలి
    పాడి పశువును కొనుగోలు చేసే సమయంలో పొదుగు నిర్మాణం, చనుమొనలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఆరోగ్యకరమైన పొదుగు మృదువుగా, సమతుల్యంగా ఉండి శరీరానికి బలంగా అనుసంధానమై ఉండాలి. పొదుగు నాలుగు భాగాలు సమానంగా అభివృద్ధి చెంది ఉండటం మంచిది. నాలుగు చనుమొనలు సహజ ఆకారంలో, సరైన దూరంలో ఉండి పాలు పితికేందుకు అనువుగా ఉండాలి. పొదుగులో గడ్డలు, గట్టిపడిన భాగాలు, అధిక వేడి, వాపు, గాయాలు లేదా నొప్పి ఉన్నాయేమో పరిశీలించాలి. వీలైతే పాలు పితికే సమయంలో ప్రత్యక్షంగా గమనించి నాలుగు చనుమొనల నుంచి పాలు సరిగా వస్తున్నాయో చూడాలి. మొదటి పాలధారలను శుభ్రమైన పాత్రలో తీసుకుని వాటి రంగు, స్వభావం, గడ్డలు ఉన్నాయేమో పరిశీలించాలి. పాలలో గడ్డలు, రక్తపు చారలు లేదా ఇతర అసాధారణ మార్పులు కనిపిస్తే పొదుగు వాపు (మాస్టిటిస్) ఉండే అవకాశం ఉంది. అలాంటి పశువులను పశువైద్యుని పరీక్ష లేకుండా కొనుగోలు చేయకపోవడం మంచిది.
  6. కాళ్లు, గిట్టలను పరిశీలించాలి
    పాడి పశువు రోజంతా నిలబడటం, నడవడం, మేత మేయడం వంటి పనులకు బలమైన కాళ్లు అవసరం. అందువల్ల కొనుగోలు చేసే ముందు పశువును కొంత దూరం నడిపించి దాని నడకను గమనించాలి. కుంటడం, ఒక కాలిపై ఎక్కువ బరువు వేయడం లేదా నడవడానికి ఇబ్బంది పడడం వంటి లక్షణాలు ఉంటే అలాంటి పశువులను కొనుగోలు చేయకుండా ఉండటం మంచిది. గిట్టలు ఆరోగ్యంగా, పగుళ్లు లేకుండా ఉండాలి. కాళ్ల కీళ్ల వద్ద వాపు, గాయాలు లేదా అసాధారణ మార్పులు ఉన్నాయేమో పరిశీలించాలి. కాళ్ల సమస్యలు ఉన్న పశువులు మేతను సరిగా తినలేకపోవడం వల్ల పాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి బలమైన కాళ్లు, ఆరోగ్యకరమైన గిట్టలు ఉన్న పశువులను ఎంపిక చేయాలి.
  7. పాల దిగుబడి వివరాలు తెలుసుకోవాలి
    పశువు ఎన్ని పాలు ఇస్తుందనే విషయాన్ని కేవలం యజమాని మాటలపై ఆధారపడి నిర్ణయించకూడదు. వీలైతే ఉదయం లేదా సాయంత్రం పాలు పితికే సమయంలో ప్రత్యక్షంగా పరిశీలించి పాల దిగుబడిని అంచనా వేయాలి. పశువు ఏ తేదీన ఈనిందో, ప్రస్తుతం ఎన్ని నెలల పాలకాలంలో ఉందో కూడా తెలుసుకోవాలి. ఇటీవల ఈనిన పశువులు సాధారణంగా మంచి పాల ఉత్పత్తి దశలో ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గత ఈతల వివరాలు, పాల ఉత్పత్తి రికార్డులు, కృత్రిమ గర్భధారణకి సంబంధించిన సమాచారం ఉంటే పరిశీలించడం మంచిది. ఈ వివరాలు అందుబాటులో ఉంటే పశువు ఉత్పాదకతను మరింత విశ్వసనీయంగా అంచనా వేయవచ్చు.
  8. టీకాలు, ఆరోగ్య రికార్డులు పరిశీలించాలి
    పశువుకు గాలికుంటు వ్యాధి (FMD), లంపీ స్కిన్ వ్యాధి (LSD), హెమరేజిక్ సెప్టిసీమియా (HS), బ్లాక్ క్వార్టర్ (BQ) వంటి ముఖ్యమైన వ్యాధుల నివారణ టీకాలు సకాలంలో వేయించారో లేదో తెలుసుకోవాలి. అలాగే నులిపురుగుల నివారణ మందులు క్రమం తప్పకుండా ఇచ్చారా అనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకోవాలి. గతంలో తీవ్రమైన వ్యాధులు వచ్చాయా, శస్త్రచికిత్సలు జరిగాయా, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే వివరాలను తెలుసుకోవడం అవసరం. వీలైతే ఆరోగ్య రికార్డులు, చెవి ట్యాగ్ (Ear Tag) లేదా ఇతర గుర్తింపు వివరాలను నమోదు చేసుకోవాలి.
  9. స్వభావాన్ని గమనించాలి
    పశువు ఆరోగ్యంతో పాటు దాని స్వభావం కూడా చాలా ముఖ్యమైనది. కొన్ని పశువులు పాలు పితికేటప్పుడు తన్నడం, ఎక్కువగా ఆందోళన చెందడం లేదా మనుషులను చూసి భయపడడం వంటి ప్రవర్తన చూపుతాయి. అలాంటి పశువులను నిర్వహించడం కష్టంగా మారుతుంది. అందువల్ల పశువును కొంతసేపు గమనించి, యజమాని లేదా పాలు పితికే వ్యక్తితో మాట్లాడి దాని స్వభావం గురించి తెలుసుకోవాలి. శాంత స్వభావం కలిగిన పశువులు నిర్వహణకు సులభంగా ఉండటమే కాకుండా పాల ఉత్పత్తి కూడా స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది.
  10. కొనుగోలు తర్వాత వేరుగా ఉంచాలి
    కొత్తగా కొనుగోలు చేసిన పశువును నేరుగా ఇప్పటికే ఉన్న పశువులతో కలపకూడదు. కనీసం రెండు వారాల పాటు (10–15 రోజులు) ప్రత్యేక ప్రదేశంలో వేరుగా ఉంచి దాని ఆరోగ్యాన్ని గమనించాలి. ఇలా చేయడం వల్ల కొత్త పశువు ద్వారా ఇతర పశువులకు అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఈ సమయంలో ఆహారం, నీరు, మలవిసర్జన, శరీర ఉష్ణోగ్రత, సాధారణ ప్రవర్తనను పరిశీలించాలి. అదేవిధంగా స్థానిక పశువైద్యునితో పూర్తి ఆరోగ్య పరీక్ష చేయించి అవసరమైతే టీకాలు, నులిపురుగుల నివారణ మందులు ఇప్పించాలి. కొత్త పశువును రవాణా చేసే సమయంలో కూడా గాయాలు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చర్యల వల్ల కొత్త పశువు కొత్త వాతావరణానికి సులభంగా అలవాటు పడుతుంది. అలాగే పాకలో ఇప్పటికే ఉన్న ఇతర పశువులకు అంటువ్యాధులు వ్యాపించకుండా నివారించవచ్చు
    పాడి పరిశ్రమలో విజయానికి నాణ్యమైన పశువును ఎంపిక చేసుకోవడం అత్యంత కీలకమైన మొదటి అడుగు. పశువును కొనుగోలు చేసే సమయంలో ఆరోగ్యం, వయస్సు, పాల ఉత్పత్తి, ప్రజనన చరిత్ర, టీకాలు, స్వభావం వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తే భవిష్యత్తులో అనవసర ఖర్చులు, నష్టాలను నివారించవచ్చు. అందువల్ల పశువుల కొనుగోలులో తొందరపడకుండా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైతే పశువైద్యుని సలహా తీసుకుని నిర్ణయం తీసుకోవడం ద్వారా పాడి పరిశ్రమను మరింత లాభదాయకంగా తీర్చిదిద్దుకోవచ్చు.

ముర్రా గేదె

సాహీవాల్ ఆవు

Dr. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్,
Dr. బద్దం అఖిల, టీచింగ్ ఫాకల్టీ,
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం,
పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. 7093198419

Read More

ఔషధ మొక్క…. వేప

వేప జన్మ స్థానం భారతదేశం. ఈ చెట్టు సుమారుగా 50 అడుగుల దాకా ఎత్తు పెరుగుతుంది. ఫిబ్రవరి, మార్చిలలో పూలు పూస్తాయి. పూలు తెలుపు రంగులో గుత్తులుగుత్తులుగా ఉండి మంచి సువాసన కలిగి ఉంటాయి. ఏప్రిల్ మాసం చివరికి కాయలు వస్తాయి. వేప చెట్టులోని బెరడు, ఆకులు, కాయలు, పండ్లు, గింజలు, ఆకులు, కలప సమస్తం ఉపయోగపడుతాయి. వేప, మన నిత్య జీవితంలో ఆరోగ్య సమస్యలకు ఔషధముగా, సౌందర్య సాధనాలుగా, వ్యవసాయంలో క్రిమిసంహారిణిగా, ఎరువుగా, కలపగా ఉపయోగపడుతుంది. వేప పువ్వుని సేకరించి ఎండబెట్టి చూర్ణం చేసి ఎన్నో జీర్ణశక్తిని పెంచే ఔషధాలలో వాడుతారు. వేప కలపకు దీర్ఘకాలం మన్నే గుణం ఉంది. అందుకే ఈ కలపను నిర్మాణ రంగంలో విరివిగా ఉపయోగిస్తారు. వ్యవసాయ పనిముట్ల తయారీకి కూడా వాడతారు. వేప బెరడును చర్మవ్యాధులకు, జ్వరాలకు, అంటువ్యాధులకు సంబంధించిన ఔషధాలలో వాడుతారు.

సాధారణ నామం : వేప శాస్త్రీయ నామం : అజాడిరిక్టా ఇండికా కుటుంబం: మీలియేసి

ఉపయోగాలు : వ్యవసాయరంగంలో

  • వేప గింజలతో తీసిన నూనెను సౌందర్య సాధనాల తయారీకి, ఔషధాల తయారీలో, వ్యవసాయ రంగంలో క్రిమిసంహారిణిగా వాడుతారు.
  • వేప గింజల నుండి తయారైన వేప పిండిని ఎరువులలో, క్రిమిసంహారక మందులలో వాడుతారు.
  • వేపపిండి, వేపాకులు భూమిలో వేసి కలియదున్నట వలన కొన్ని రకాల శిలీంద్ర తెగుళ్ళను నివారించవచ్చు.
  • వేపనూనె పిచికారి చేయటం వలన, జామ, కాలీఫ్లవర్, సపోటా, అరటి వంటి పండ్ల మొక్కలను ఆశించే నులి పురుగులను సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చు.
  • వేప గింజల పొడిని వరి, గోధుమ, జొన్న, పప్పుధాన్యాల వంటి గింజలలో కలిపి నిలువ చేస్తే కీటకాల బారి నుంచి అరికట్టవచ్చు. వందకిలోల ధాన్యానికి ఒక కిలో వేప గింజల పిండి సరిపోతుంది. దీని వలన ధాన్యం రంగు, రుచి, వాసనల్లో ఎలాంటి మార్పులు రావు. అంతేకాదు. సుమారు 9 నెలలు సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు. ధాన్యం నిల్వ కాలాన్ని పొడిగించాలంటే, మళ్ళీ ఇంకొక కిలో వేప గింజల పొడి చేర్చి నిల్వ చేసుకోవచ్చు.
  • టమాట నారు నాటే ముందు వేప నూనె ద్రావణంలో గాని, వేప గింజల కషాయంలో గాని ముంచి నాటినట్లయితే ఎండుతెగులును అరికట్టవచ్చు.
  • మిరపలో వేరు పురుగుల బెడదను నివారించటానికి 250 కిలోల వేపపిండిని ప్రతి హెక్టారు విస్తీర్ణంలో ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి.
  • వేప నూనె మందుల్ని ఉదయం లేదా సాయంత్రం పూట చల్లని వాతావరణంలో పిచికారి చేయవలసి ఉంటుంది. అంతేకాని, మిట్ట మధ్యాహ్నపు ఎండలో పిచికారీ చేసినట్లయితే సూర్యరశ్మి వలన దీని ప్రభావం త్వరగా తగ్గిపోతుంది. – రాంబాబు, ఆహార్ కుటీర్

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More