మొక్కల ఎదుగుదలకు నత్రజని చాలా అవసరం. దీనిమీద లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు సబ్సిడీగా ఇస్తున్నాయి. ఇందుకోసం ఎటువంటి కృత్రిమ ఎరువులు అవసరం లేకుండా చేప బెల్లం ద్రావణాన్ని తయారుచేసి మొక్కలకు అందించవచ్చు. ఈ ద్రావణంలో పదమూడుశాతం పైగా ఎమైనో ఆసిడ్స్ వుంటాయి. పదిహేనురోజుల్లో ద్రావణం తయారు చేసుకోవచ్చు.
ఒక కిలో చేపలను ముక్కలుగా చేసి, 1కిలో బెల్లంతో కలిపి పదిహేను రోజులపాటు నిలువవుంచాలి. తయారైన ద్రావణాన్ని 1 లీటర్కు 1 మి.లీ. చొప్పున కలుపుకుని స్ప్రే చేసుకోవాలి. దీనిని నర్సరీ దశనుండి మొక్క ఎదిగే దశ వరకు ఇస్తే మంచి ఫలితాలు గమనించవచ్చు.
పనస 20 మీ. ఎత్తు పెరిగే వృక్షం. బెరడు నలుపు రంగులో లేదా ఆకుపచ్చ మచ్చలతో నునుపుగా ఉంటుంది. మానులోపల పసుపు రంగులో ఉంటుంది. దీని ఆడ, మగ పూలు లేత ఆకుపచ్చ పసుపు రంగులో ఉంటాయి. పూలు మానుపైనే ఏర్పడతాయి. ఆడ కంకులలోని పూలన్నీ ఫలదీకరణం చెంది ఒకే పెద్ద పండు తయారవుతుంది. పండ్లు చాలా పెద్దవిగా ఉంటాయి. ఇది విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుంది.
సాధారణ నామం : జాక్ఫ్రూట్ ట్రీ శాస్త్రీయ నామం : ఆర్టోకార్పస్ హిటరోఫిల్లస్ కుటుంబం: మోరేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
పనస ఆకులు, వేర్లు, పండ్లు, గింజలు, చెక్క, పాలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. పండ్లలో పిండిపదార్థాలు, అమైనోఆమ్లాలు, బీటాకెరోటిన్ ఉంటాయి. పండులోపల గల జిగురులాంటి పదార్థంలో ల్యూసిన్, ఐసోల్యూసిన్, టైరోసిన్, వాలైన్ ఉంటాయి.
మానులోపలి కర్రభాగంలో మోరిన్, ఆర్టోకార్పిన్ మొదలగు రసాయనాలుంటాయి. లేత ఆకులను వాపులకి, గాయాలకు కాపుపెట్టడానికి ఉపయోగిస్తారు.
లేత పనస కాయకూర మేధస్సును వృద్ధి చేస్తుంది. బలం, వీర్యపుష్టినిస్తుంది.
గింజల పొడిని గిరిజనులు ఆహారంగా ఉపయోగిస్తారు. పనస చెట్టు చెక్క మరియు కొద్దిగా మిరియాలు కలిపిన పొడి మందు గజ్ౙి, తామర, దురదలను పోగొడుతుంది. దీనిని విరేచనాలు అరికట్టడానికి, కడుపులో పుండ్ల నివారణకు కూడా ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో…
పనస ఆకుద్రావణం పర్యావరణహిత లార్విసైడ్గా పనిచేస్తుంది. ఇది బ్రూకస్పైసోరం, ట్రైబోలియం కాస్టానియం, సైటోఫిలస్ ఒరైజెపై కీటకనాశక చర్యను కూడా ప్రదర్శించింది (నాయిర్ అండ్ కర్వేకర్, 2017).
పనస గింజల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ ఎస్కరిచియాకోలి, సూడోమోనాసఈరూజినోసా, స్టెఫైలోకోకస్ ఆరియస్లపై అత్యంత సమర్ధవంతమైన యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (జా అండ్ శ్రీవాస్తవ, 2013).
పనస లేటెక్స్ హెక్సనాయిక్, మిథనాలిక్, పెట్రోలియం ఈదర్, క్లోరోఫాం ద్రావణాలు స్పోడోప్టెరాలిటూర లార్వాలను 90-95% చంపాయి. ఇవి లార్వాల బరువును గణనీయంగా తగ్గించాయి (ఉపాధ్యాయమ్, 2013).
పనస వేర్లు, కాండాలు, ఆకులు, గింజలలో ఉండే అసిటోజెనిన్స్ శక్తివంతమైన పురుగు మందు లక్షణాలు కలిగి ఉంటాయి (నజ్ముల్హక్, 2006).
ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి ఆహారము ‘అమృత ఆహారము’.
ఈ అమృతాహారం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతున్నాయి. దీని తయారీ విధానము మొదట్లో ఇది కొంచెం ఇబ్బంది అనిపించినప్పటికీ, ఒకసారి చేసుకుంటే చాలా సులువు. దీనికి సంబంధించి మూడు భాగాలుగా ఈ ఆహారాన్ని తయారు చేసుకునే విధానాన్ని మనము డివైడ్ చేసుకుందాం. దానివల్ల మీకు కొంచెం సులువు అవుతుంది.
మొదటి భాగం: కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇవి అవసరము. మనకు అందుబాటులో ఉన్నటువంటి కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు ఎక్కువ ధర పెట్టాలని ఏం లేదు, మనకు అందుబాటు ధరలలో ఏవైతే దొరుకుతాయో, అవి ఎన్ని ఎక్కువ రకాలు దొరుకుతాయో అన్ని.
ఒకవేళ రెండు మూడు రకాలు దొరికినాయి అనుకోండి, అంటే రెండు కూరగాయలు – ఒక ఆకుకూర – రెండు రకాల పండ్లు, అట్లా అయినా పర్వాలేదు. వాటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
రెండవ భాగం: మొలకలు అంటే, పప్పు ధాన్యాలకు సంబంధించి పెసలు, ఉలువలు, శనగలు, పల్లీలు, బొబ్బర్లు, రాజ్మా, కాబూలీచెన ఇట్లాంటివి. అంటే రెండు పలకల నుండి మొలకలు వచ్చేవి ఏవైనా గాని, అవి కూడా అందుబాటులో ఉన్నవి ముందే తయారు చేసుకొని మొలకగట్టి రెడీగా ఉంచుకోవాలి.
మూడవ భాగం: ధాన్యము, చిరుధాన్యాలకు సంబంధించి అంటే బియ్యము దంపుడు బియ్యం అయితే మంచిది, ఎర్ర బియ్యం, నల్ల బియ్యం, రాగులు, సామలు, అరికెలు, ఊదలు, కొర్రలు, అండు కొర్రలు, జొన్నలు, గోధుమలు, ఇందులో ఏవి అందుబాటులో ఉంటే అవి. ఉదయం నానబెట్టి రాత్రికి ఇడ్లీ పిండి రుబ్బినట్టు రుబ్బి పక్కన పెట్టుకుంటే, పొద్దునకి పులుస్తది. ఈ పులిసిన పేస్ట్ లోంచి ఒక మనిషికి రెండు స్పూన్ల చొప్పున అవసరం అయితది.
ఇప్పుడు ఈ మూడు భాగాలను ఒక భాగంగా తయారు చేసి, మనం ఎట్లా ఆహారంగా తీసుకోవాలో చూద్దాం. మనము తినగలిగినన్ని కూరగాయ ముక్కలు ఒక గిన్నెలోకి తీసుకొని, దాంట్లోకి రెండు చెంచాల పేస్టు, ఒక చెంచా మొలకలు కలుపుకొని తినొచ్చు.
ఉదయము ఈ ఆహారాన్ని తీసుకుంటే ఆకలి కూడా ఎక్కువగా వేయదు. మనము తినగలిగినంత అమృతారాన్ని తినొచ్చు. ఎటువంటి అభ్యంతరం లేదు. మధ్యాహ్నముా, రాత్రికి కూడా ఇదే ఆహారాన్ని తీసుకోవచ్చు. ఒకవేళ అట్లా తీసుకోలేకపోతే, మనం భోజనం చేసేముందు కొంత, అంటే ఒక రెండు మూడు చెంచాలు ఈ అమృత ఆహారాన్ని తీసుకొని, తర్వాత భోజనాన్ని కంటిన్యూ చేయొచ్చు.
ఇది అనేక ఆరోగ్య సమస్యలను నిర్మూలిస్తుంది, రాకుండా చేస్తుంది. కాబట్టి మిత్రులు దీన్ని ప్రయత్నం చేయొచ్చు.
మేము ఒక నెల నుంచి తింటున్నాము.
ప్రాణం తేలిగ్గా ఉంటుంది. ఒకవేళ కొత్తలో ఎవరికైనా తినడం కష్టం అనిపిస్తే, కొంచెం బెల్లం ముక్క లేదంటే ఒక రెండు చెంచాల పెరుగు, కొన్ని ఎక్కువ పండ్ల ముక్కలు మనకు ఇష్టమైనవి వేసుకొని తినొచ్చు. తినే ముందు కొన్ని నువ్వులు కొన్ని అవిసెలు దీంట్లో కలుపుకొని తింటే, అప్పుడు పంటికి పచ్చివి చాలా టేస్ట్ అనిపిస్తాయి. మేము ఇద్దరమే తింటాం కాబట్టి మాకు వారానికి అవసరమైనటువంటి పండ్ల ముక్కల్ని కూరగాయ ముక్కలు ఒకసారి కట్ చేసి పెట్టుకుంటున్నాము. దాన్యాలకి సంబంధించినటువంటి పేస్టును కూడా ఒకేసారి రుబ్బి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిజ్లో పెట్టుకుంటున్నాము. తినడానికి రెండు మూడు గంటల ముందు ఫ్రిజ్ లోంచి మన అవసరం నిమిత్తం ఎంతయితే తినాలో అంత క్వాంటిటీని వేరే గిన్నెలోకి తీసుకొని బయటపెట్టి దాన్ని బ్రేక్ ఫాస్ట్కి తీసుకుంటున్నాం.
ఒకవేళ మీకు ఏమైనా సందేహం ఉంటే Ameya Krishi Vikasa Kendram YouTube Channel / అమేయ కృషి వికాస కేంద్రం యూట్యూబ్ ఛానల్లో దీనికి సంబంధించిన వీడియో ఉన్నది మిత్రులు గమనించగలరు.
రచన: శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి
రైతు ముంగిట నాణ్యమైన విత్తనాలువ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల జూలై 27 నుంచి 29 వరకు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రతి మండల కేంద్రంలోని రైతు వేదికల్లో విత్తన మేళా నిర్వహించనున్నారు.ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగుకు అనువైన ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రతి రైతు వేదికలో 4 నుంచి 5 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి, నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచనున్నారు.ఈ విత్తన మేళాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU), శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTU), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (IIMR), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్సీడ్స్ రీసెర్చ్ (IIOR), కృషి విజ్ఞాన కేంద్రాల (KVKs) శాస్త్రవేత్తలు పాల్గొని రైతులకు పంటల ఎంపిక, సాగు విధానాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన వ్యవసాయ పద్ధతులపై శాస్త్రీయ సలహాలు, సూచనలు అందిస్తారు. ఆయా విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు సిఫారసు చేసిన నాణ్యమైన విత్తనాలు కూడా ప్రత్యేక కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి.అదేవిధంగా వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOలు), మండల వ్యవసాయ అధికారులు (MAOలు), సహాయ వ్యవసాయ సంచాలకులు (ADAలు), జిల్లా వ్యవసాయ అధికారులు (DAOలు), ఉద్యాన శాఖ అధికారులు రైతులకు పంటల ఎంపిక, విత్తనాల ఎంపిక, సాగు విధానాలు, నీటి యాజమాన్యంపై అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తారు.రాష్ట్రంలోని రైతులందరూ తమ సమీప రైతు వేదికలో నిర్వహించే విత్తన మేళాలో అధిక సంఖ్యలో పాల్గొని, శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు తమ ప్రాంతానికి అనువైన పంటలను ఎంపిక చేసుకొని, నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ సంచాలకులు తెలిపారుడాక్టర్ బి. గోపి, ఐఏఎస్వ్యవసాయ సంచాలకులువ్యవసాయ శాఖ, తెలంగాణ రాష్ట్రం
నేల దేశ సంపద, దేశం సుభిక్షంగా ఉండాలంటే నేల ఆరోగ్యంగా ఉండాలి. నేల అనగా అనేక బిలియన్ల బ్యాక్టీరియా, శిలీంధ్ర, నాచు ఇంకా అనేక రకాల సూక్ష్మజీవుల సహజీవనంతో తొణికిసలాడే సజీవమైన జీవధార వ్యవస్థగా గుర్తించాలి. ఇవి మొక్కల ఎదుగుదలకు పోషకంగానే కాక వర్షపు నీరును క్షామం కాలం వరకు ఉంచుకొని మొక్కలకు అందజేస్తా ఆరోగ్యంగా ఉంటేనే ఆహార భద్రత, ఆరోగ్యకరమైన పర్యావరణంతోనే మానవాళి శ్రేయస్సు సాధ్యపడుతుంది.
ఇటీవల కాలంలో రైతాంగం విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులను, పురుగు మందులను వాడడం, అలాగే పంటల అవ శేషాలను కాల్చి వేయడం ద్వారా భూసారం గణనీయంగా క్షీణించడమే గాక పర్యావరణ కాలుష్యం, ఉపయోగకరమైన బ్యాక్టీరియా వినాశనానికి దారి తీస్తూ జీవన వైవిధ్యం వినాశనం సంభవిస్తుంది. తద్వారా సరైన పోషకాలు లేని బీడు భూములు ఏర్పడుతున్నాయి. మనకు స్వాతంత్య్రం వచ్చినపుడు ప్రతి కిలో ఎరువుకు 17 నుండి 18 కిలోల ధాన్యం పండేది. కానీ ప్రస్తుతం ప్రతి కిలో ఎరువుకు కేవలం 3 కిలోల ధాన్యం మాత్రమే పండుతుంది. ఇది భూసారం క్షీణించడాన్ని సూచిస్తుంది.
భూసారాన్ని పెంచడానికి, నేల ఉత్పా దకతను మెరుగుపరచడానికి సూక్ష్మజీవుల పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే ఇవి నజ్రజనిని స్థిరీకరిస్తాయి, పోషకాలను కరిగిస్తాయి. పోషకాలను విచ్ఛిన్నం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు సహజంగానే భూమిలో ఉంటాయి. కాని వీటి సంఖ్య త్వరీతంగా తగ్గుతూ వస్తుంది. పంటల దిగుబడిని పెంచడానికి సూక్ష్మ జీవులను కృత్రిమంగా పెంచి ఎక్కువ సంఖ్యలోకి తెచ్చి సూటి అయిన ఘన పదార్ధాలలో కలిపి మరల భూమిలో వెయ్యవచ్చు.
నత్రజనిని స్థిరికరించే జీవన ఎరువులు :
జీవన ఎరువులు వాడవలసిన మోతాదు ఏ ఏ పంటలకు
రైజోబియం 200 గ్రా. కంది,పెసర , మినుము, శనగ వంటి పంటలకు
అజటోబాక్టర్ 2 కిలోలు పప్పుజాతి పంటలను మినహాయించి మిగతా అన్ని పంటలకు
నీలి ఆకుపచ్చనాచు 4 కిలోలు వరి పంటకు మాత్రమే వాడాలి.
రైజోబియం: లెగ్యూమ్ జాతి పంటలు అనగా అపరాల (పప్పుజాతి) పంటలకు నత్రజని అందించే జీవన ఎరువుగా వాడవలెను. పప్పుజాతి పైర్లలో ముఖ్యమైనవి కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు, వేరుశనగ, సోయాచిక్కుడు వంటి నూనె గింజల పైర్లకు రైజోబియం కల్చర్ను విత్తనమునకు పట్టించి ఉపయోగించాలి. ఉపయోగించే విధానం: వంద మిల్లీలీటర్ల నీటిలో పది గ్రాముల పంచదార, బెల్లం, లేక గంజి పౌడర్ను కలిపి పది నిమిషాలు మరగబెట్టి చల్లార్చాలి. ఈ చల్లార్చిన ద్రావణం పది కిలోల విత్తనాలపై చల్లి, దానికి 200 గ్రాములు రైజోబియం కల్చర్ పొడిని బాగా కలపాలి. విత్తనం చుట్టూ పొరలు ఉండేలా జాగ్రత్త వహించాలి.
ఈ ప్రక్రియకు రైతులు పాలిథిన్ సంచిగానీ, ప్లాస్టిక్ తొట్టిని గాని ఉపయోగించుకోవచ్చు. పది నిమిషాలు నీడలో ఆరబెట్టిన తరువాత రైతులు పొలంలో నాటుకోవలెను
అజటోబాక్టర్: పప్పుజాతి పంటలను మినహాయించి, మిగతా అన్ని పంటలకు నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ బాక్టీరియా నత్రజనిని స్థిరీకరించడమే కాక, మొక్కకు కావాల్సిన హార్మోన్లు, విటమిన్లు అందిస్తుంది.
ఈ బాక్టీరియా ముఖ్యంగా సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న భూమిలో సమర్థవంతంగా పని చేస్తుంది. అందువల్ల ఈ జీవన ఎరువు ఆకుకూరలు, కూరగాయలు, పూల తోటలకు సిఫారసు చేయబడుతుంది.
వాడే విధానం: ఏ పంటకు వాడినా రెండు కిలోల కల్చర్ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో ఒక ఎకరం నేలపై వెదజల్లాలి. ఇది చల్లిన సమయంలో కాని, వెనువెంటనే భూమిలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి
అజోస్ప్తెరిల్లమ్ : ఈ మధ్యకాలంలో దీని ప్రాముఖ్యత అధికంగా గుర్తించారు. ఈ బాక్టీరియా మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశమున్న చోట వేర్లలోకి చరొబడి కూడా జీవిస్తాయి. ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువశాతం అందుబాటులో ఉంటుంది. ఈ జీవన ఎరువును లెగ్యూమ్జాతి పంటలకు తప్పించి, మిగతా పంటలకు వాడుకోవచ్చు. ఇది వరి, చెరకు, పత్తి, మిర్చి, జొన్న, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, అరటి పంటలకు బాగా ఉపయోగపడుతుంది. సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలలో ఇది పని చేస్తుంది.
ఉపయోగించే విధానం:
తక్కువ కాలం పంటలకు రెండు కిలోల అజోస్పెరిల్లమ్ కల్చర్ను 80-100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలంలో విత్తనం కింద పడేలా వేసుకోవాలి. నారుమడి వేసుకొనే పంటలకు నారు పీకేందుకు ముందుగా నారుమడి వద్ద 70 నుంచి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి.
ఆ నీటిలో రెండు కిలోల అజోస్పెరిల్లమ్ జీవన ఎరువును బాగా కలిపి, ఆ ద్రావణంలో పది నిమిషాలు వేళ్లను మాత్రమే ముంచి వెంటనే నాటుకోవాలి. చెరకు పంట విషయంలో నాటే విత్తనం చెరకు ముక్కలను పది నిమిషాలు ముంచి నాటుకోవాలి.
పంట మొక్కలకు వేసిన లభ్య భాస్వరం, భూమిలో చేరిన కొద్ది రోజుల వ్యవధిలో భూమి ఉదజని సూచకను అనుసరించి, వివిధ రకములైన లభ్యంకాని భాస్వరం రూపంలోని మారుతుంది.
ఒక వేళ భూమి క్షార గుణం కలిగి వున్న, వేసిన భాస్వరం కాల్షియం, మెగ్నీషియం ఫాస్పేట్స్గా మారి, మొక్కకు లభ్యంకాదు.
ఈ పరిస్థితుల్లో భాస్వరానికి సంబంధించి జీవన ఎరువులు వేస్తే లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరం మొక్కకు దొరుకుతుంది.
భాస్వరంను అందించే జీవన ఎరువులు PSB (ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బాక్టీరియా) 2 కిలోలు/ 500 మీ.లీ/ఎకరాకు అన్ని పంటలకు వాడుకోవచ్చు
ఫాస్ప్ ఫంగై 2 కిలోలు అన్ని పంటలకు వాడుకోవచ్చు
ఫాస్పేట్ మోబి లైజింగ్ మైకోరైజా 5 కిలోలు అన్ని పంటలకు వాడుకోవచ్చు
పొటాషియం మోబిలైజర్స్: ప్రటూరియా అరాషనియా 2 కిలోలు నూనెగింజల పంటలకు ఎక్కువ ఉపయోగపడుతుంది
ఫాస్పోబాక్టీరియా : ఈ జీవన ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యే రూపంలోకి మార్చుతుంది. ఈ జీవన ఎరువును అన్ని పంటలకు వాడుకోవచ్చు.
ఇది సమర్థవంతంగా పని చేసేందుకు సేంద్రియ కర్బనము అత్యవసరం. దీన్ని సేంద్రియ ఎరువుతో కలిపి వాడాలి. ఈ జీవన ఎరువు మొక్కకు రోగ నిరోధక శక్తిని పెంచి, తద్వారా పంట దిగుబడి పెంచుతుంది
వాడే విధానం : ఎకరాకు 2.0 కిలోల ఫాస్పోబాక్టర్ను లేదా ద్రవ రూపంలో ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బాక్టీరియా 500 మీ.లీ, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగానీ, మొక్క నాటినప్పుడుగానీ సాళ్లలో పడేలా వేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
పొటాషియం మొబిలైజర్స్ : ఈ జీవన ఎరువు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పొటాషియంను అందుబాటులోకి తెచ్చును. ఈ జీవన ఎరువుల్లో ఉండేటటువంటి మొబిలైజింగ్ సూక్ష్మజీవులు, విడుదల చేసే ఎంజైముల వల్ల ఈ ప్రక్రియ జరుగుతుంది.
వాడే విధానం : ఎకరాకు 2.0 కిలోల పొటాషియం రిలీసింగ్ బాక్టీరియా లేదా ద్రవరుపం లో పొటాషియం రిలీసింగ్ బాక్టీరియా 500 మీ.లీ, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగానీ, మొక్క నాటినప్పుడుగానీ సాళ్లలో పడేలా వేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
డా. ఎం. వెంకట లక్ష్మి(సస్య పోషణ), డా.డి.సుధా రాణి (సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి), డా. కె. రేవతి (సస్య రక్షణ) కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల, కృష్ణాజిల్లా – 521 133. Ph: 8008201253
రైతు వ్యర్థంగా భావించే వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు, చెరకు ఆకులు, పప్పుధాన్యాల కాండాలు, కూరగాయ పంటల అవశేషాలు భూమికి అమూల్యమైన సహజ సంపద. వీటిలో సేంద్రియ పదార్థం, విలువైన పోషకాలు, నేల సారాన్ని పెంచే కార్బన్ సమృద్ధిగా ఉంటాయి. వాటిని కాల్చేస్తే ఈ సంపద మొత్తం నష్టపోతుంది. అదే శాస్త్రీయంగా వినియోగిస్తే నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది, నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది, ఎరువుల వినియోగం సమర్థవంతమవుతుంది, సాగు ఖర్చు తగ్గుతుంది.
రైతులు పంట అవశేషాలను కాల్చడానికి కూడా బలమైన కారణాలే ఉన్నాయి. ఒక పంట కోసిన వెంటనే మరో పంట వేయాల్సిన అవసరం, కూలీల కొరత, అవశేషాలను తొలగించడానికి అయ్యే అధిక ఖర్చు, యంత్రాల లభ్యత లేకపోవడం వంటి సమస్యలు వారిని ఈ నిర్ణయానికి దారి తీస్తున్నాయి. కానీ తాత్కాలికంగా సమయం ఆదా చేసినా, దీర్ఘకాలంలో నేల సారాన్ని, పంట ఉత్పాదకతను కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే పంట అవశేషాలను కాల్చడం కంటే వాటిని కంపోస్టు, వర్మీ కంపోస్టు, మల్చింగ్, పశువుల మేత, బయోగ్యాస్ లేదా బయోచార్ రూపంలో వినియోగించడం ఉత్తమ పరిష్కారం. ముఖ్యంగా ఇటీవలి కాలంలో బయోచార్ సాంకేతికత నేలలో సేంద్రియ కార్బన్ను పెంచడం, పోషకాల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, నీటి నిల్వను పెంచడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం వంటి అనేక ప్రయోజనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతోంది. పంట అవశేషాలను సమస్యగా కాకుండా విలువైన వనరులుగా మార్చుకునే ఈ సాంకేతికత రైతులకు స్థిరమైన, లాభదాయకమైన వ్యవసాయానికి కొత్త దిశను చూపుతోంది.
బయోచార్ అనేది పంట అవశేషాలు, చెట్ల కొమ్మలు, ఎండిన ఆకులు, కొబ్బరి చిప్పలు, ఇతర సేంద్రియ వ్యర్థాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో 250-700°C ఉష్ణోగ్రత వద్ద వేడి చేసే పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా తయారయ్యే కార్బన్ అధికంగా ఉండే నల్లని ఘన పదార్థం. సాధారణంగా పంట అవశేషాలను బహిరంగంగా కాల్చితే వాటిలోని కార్బన్, గాలిలో కార్బన్ డయాక్సైడ్ రూపంలో విడుదలవుతుంది. కానీ బయోచార్ తయారీ సమయంలో కార్బన్లో ఎక్కువ భాగం స్థిర రూపంలో నిల్వ ఉండి, తరువాత నేలలో కలిపినప్పుడు వందల నుంచి వేల సంవత్సరాల వరకు స్థిరంగా నిలిచి సేంద్రియ కార్బన్ నిల్వను పెంచుతుంది. అలాగే నేల నిర్మాణాన్ని మెరుగుపరచి, నీటిని మరియు పోషకాలను నిల్వ ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది. బయోచార్లోని సూక్ష్మ రంధ్రాలు ఉపయోగకరమైన సూక్ష్మజీవులకు అనుకూల నివాసంగా పనిచేసి నేల జీవక్రియలను చురుకుగా ఉంచుతాయి.
ప్రస్తుతం వాతావరణ మార్పులు, నేల సారం క్షీణించడం, నీటి కొరత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగానికి బయోచార్ ఒక స్థిరమైన పరిష్కారంగా గుర్తింపు పొందుతోంది. ఇది నేలలో కార్బన్ను దీర్ఘకాలం నిల్వ ఉంచడం ద్వారా కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి హరితగృహ వాయువుల ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల బయోచార్ నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, వాతావరణ అనుకూల మరియు సుస్థిర వ్యవసాయానికి కూడా కీలకమైన సాంకేతికతగా నిలుస్తోంది.
డ్రమ్ పద్ధతిలో బయోచార్ తయారి చిన్న, సన్నకారు రైతుల స్థాయిలో తక్కువ ఖర్చుతో బయోచార్ను 200 లీటర్ల సామర్థ్యం గల పాత ఇనుప డ్రమ్ సహాయంతో తయారు చేయవచ్చు. ముందుగా డ్రమ్ అడుగు భాగంలో మరియు కింది ప్రక్కవైపున కొద్దిపాటి గాలి ప్రవేశించేలా చిన్న రంధ్రాలు చేయాలి. అనంతరం పొడి పంట అవశేషాలను చిన్న ముక్కలుగా చేసి డ్రమ్లో గట్టిగా నింపాలి. తరువాత డ్రమ్కు మూత బిగించి, మూత అంచులను బంకమట్టితో మూసివేయాలి. దీంతో డ్రమ్లోకి గాలి ప్రవేశించడం నియంత్రించబడుతుంది.
ఆ తర్వాత డ్రమ్ను పొయ్యి లేదా ఇటుకలతో ఏర్పాటు చేసిన మంటపై ఉంచి వేడి చేయాలి. సుమారు 20-25 నిమిషాల తర్వాత మూత అంచుల వద్ద నుంచి నీలిరంగు వాయువు విడుదల కావడం ప్రారంభమవుతుంది. ఈ దశలో డ్రమ్లో ఉష్ణోగ్రత 300-400°C వరకు చేరుకొని పైరోలిసిస్ ప్రక్రియ పూర్తవుతుంది.
నీలిరంగు వాయువు విడుదల తగ్గిన తర్వాత మంటను ఆర్పివేయాలి. అనంతరం డ్రమ్ను జాగ్రత్తగా దించి నేలపై ఉంచాలి. వెంటనే అడుగు భాగంలోని రంధ్రాలను కూడా బంకమట్టితో మూసివేయాలి. దీంతో గాలి లోపలికి ప్రవేశించకుండా నిరోధించబడి, పంట అవశేషాలు పూర్తిగా బూడిదగా మారకుండా కార్బన్ రూపంలో నిల్వ చేయబడతాయి.
డ్రమ్ను సుమారు రెండు గంటల పాటు అలాగే ఉంచి పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం మూతను తీసి బయోచార్ను బయటకు తీసుకోవాలి. బూడిద ఏర్పడి ఉంటే దానిని వేరుచేసి, బయోచార్ను చిన్న ముక్కలుగా లేదా పొడి రూపంలో తయారు చేయాలి. అనంతరం దీనిని కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి కొంతకాలం ఉంచిన తర్వాత పొలంలో ఉపయోగించడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు. బయోచార్ తయారీలో ఆక్సిజన్ ప్రవేశం పరిమితంగా ఉండాలి. గాలి ఎక్కువగా ప్రవేశించినట్లయితే పంట అవశేషాలు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారుతాయి. అటువంటి పరిస్థితిలో నాణ్యమైన బయోచార్ తయారు కాదు.
డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921
మొదట కడిగిన బియ్యాన్ని ఉడకబెట్టి ఒక చెక్క పెట్టెలో వుంచి దాన్ని చెట్టు కింద నీడలో గుంత తీసి పూడ్చి పెట్టాలి. నాలుగు రోజుల తరువాత దానిని వెలికితీయాలి. దీనిని చో మెధడ్లో ఐయంఓ (ఇండీజినిస్ మైక్రో ఆర్గానిజమ్)గా వ్యవహరిస్తారు. ఇందులో బెల్లాన్ని కలిపితే ఐయంఓ తయారవుతుంది. దీన్ని నిలువ వుంచుకుని మొక్కలకు స్ప్రే చేయాలి. దీనివల్ల మొక్కకు అన్ని రకాలైన పోషకాలు అంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొక్క జీవితకాలం కూడా పెరుగుతుంది.
గమనికః మొదటగా లీటర్ నీరు నిలువ వుంచడానికి లీటరున్నర పాత్రను తీసుకోవాలి. అపుడే బాక్టీరియా పాత్రలో ప్రవేశించడానికి అవకాశముంటుంది.
మాచిపత్రి నేలబారుగా పెరిగే నిటారైన శాఖలు గల బహువార్షిక మొక్క. ఆకులు చామంతి ఆకుల వలే ఉండి, కణుపుకి ఒకటి చొప్పున ఏర్పడతాయి. అంచుల నుండి ఈనెల వరకు వివిధ పరిమాణాలలో నొక్కులు కలిగి ఉంటాయి. పూవులు పసుపుఛాయ కలిగి అతి చిన్న ముద్ద వలె ఏర్పడతాయి. దీనిని పిలక మొక్కలు మరియు విత్తనాల ద్వారా వ్యాప్తి చేస్తారు.
సాధారణ నామం : ఇండియన్ వర్మ్వుడ్ శాస్త్రీయ నామం : ఆర్టెమిసియా వుల్గారిస్ కుటుంబం: ఆస్టరేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
ఆకులు, వేర్లు ఔషధగుణాలు కలిగి ఉంటాయి.
ఆకులలో ఆవిరయ్యే నూనె, సెస్క్యిటెర్పిన్స్, లాక్టోన్స్, ఫ్లేవనాయిడ్స్, కౌమారిన్స్, ట్రైటెర్పిన్ మొదలైన రసాయనాలుంటాయి.
మాచిపత్రి వాతం, చర్మవ్యాధులు, కంటి వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.
దీనిని వీర్యవృద్ధికి, క్రిమిసంహారిణిగా, కడుపునొప్పి, ఉబ్బసం, నరాల వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.
మహిళలు ఋతుక్రమాన్ని సక్రమంగా ఉంచడానికి ఉపయోగిస్తారు. ఆకలిని వృద్ధి చేయడానికి, మలేరియా నివారణకు కూడా ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో…
మాచిపత్రి (ఆర్టెమిసియా జుడైకా) ఎసెన్షియల్ ఆయిల్ అలసంద వీవిల్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పెద్ద పురుగులను అత్యంత సమర్ధవంతంగా కీటకనాశక చర్య ద్వారా నివారించింది (అబ్డఎల్హాడి, 2012).
మాచిపత్రి (ఆర్టెమిసియా వుల్గారిస్) ఆకు (1500 పిపియం) మరియు పూల (4000 పిపియం) క్రూడ్ ద్రావణాలు, ఎసెన్షియల్ ఆయిల్ ఈడెస్ ఈజిప్టి 3, 4 వ దశ లార్వాలపై బలమైన లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి. ఆకుల ఎసెన్షియల్ ఆయిల్ దోమకాటుకు అధిక స్థాయిలో రక్షణ కల్పించింది (మాంగ్ మాండ్ మైయ, అతని అనుచరులు, 2016).
మాచిపత్రి ఎసెన్షియల్ ఆయిల్ ట్రైబోలియం కాస్టానియం, రైజోపెర్తా డామినిక, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్లను ప్యూమిగెంట్ విష చర్య ద్వారా నివారించింది (షారిఫియాన్, అతని అనుచరులు, 2012).
మాచిపత్రి (ఆర్టెమిసియా స్కోపారియా) ఎసెన్షియల్ ఆయిల్ కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, సైటోఫిలస్ ఒరైజె, ట్రైబోలియం కాస్టానియంలను సమర్ధవంతంగా నివారించింది. ఈ ఫలితాలు సేంద్రియ ఆహార ఉత్పత్తిలో మాచిపత్రి సామర్థ్యాన్ని నిరూపించాయి (నెగాబాన్, అతని అనుచరులు, 2006).
మాచిపత్రి కాండం నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ ఈడెస్ ఈజిప్టి లార్వాలను తక్కువ మోతాదులో సమర్ధవంతంగా అరికట్టింది (సుజాత అండ్ రంజిత, 2013).
ఆసియా, యూరప్, ఉత్తర అమెరికాలో 500 ఆర్టెమిసియా జాతులున్నాయి. ఆర్టిమిసియా హెర్బాఆల్బా, ఆర్టెమిసియా ఆబ్సింతియం ఎసెన్షియల్ ఆయిల్స్ ట్రైబోలియం కాస్టానియం, ఒరైజోఫిలస్ సురినానెన్సిస్ పెద్ద పురుగులపై విష చర్యను ప్రదర్శించాయి (జెమా, 2014)
ఆర్టిమిసియా నీలగిరిక ఎసెన్షియల్ ఆయిల్ ద్రాక్ష పండ్లను ఆశించి కుళ్ళజేసే ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్నైగర్, ఆస్పర్ౙిల్లస్ ఓక్రేసియస్ శిలీంద్రాల పెరుగుదలను 100% అరికట్టింది. ఆయిల్ అఫ్లాటాక్సిన్, ఆక్రాటాక్సిన్ ఉత్పత్తి చేసే ఆస్పర్ౙిల్లస్ స్పీసీస్ని అరికట్టింది. మైకోటాక్సిన్ స్రవాన్ని పూర్తిగా అరికట్టింది. ఆయిల్తో ఫ్యూమిగేట్ చేస్తే 1కి. ద్రాక్ష పండ్లను ఈ శిలీంద్రాల నుండి కాపాడి నిల్వ కాలాన్ని 9 రోజులు పెంచింది (సోంకర్, అతని అనుచరులు, 2015)
ఆర్టిమిసియా నీలగిరిక ఎసెన్షియల్ ఆయిల్ రైజోక్టోనియా సొలాని, స్ల్కీరోషియం రాల్ఫ్సి, మాక్రోఫోమినా ఫేసియోలినా వంటి పంట…లో వేరుకుళ్ళు కలిగించే శిలీంద్రాలను అరికట్టింది. ఈ ఆయిల్ కొల్లెటోట్రైకం ఫ్రాగేరియే, కొల్లెటోట్రైకం గ్లియోస్పోరియాయిడెస్, కొల్లెటోట్రైకం ఆక్యుటేటంలపై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది. ఆర్టెమిసియా సీరూలెసెన్స్ ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్, ఆల్టర్నేరియా, ఫ్యుజేరియం శిలీంద్రాలను అరికట్టింది (పెట్రెట్టో, అతని అనుచరులు, 2013; స్టాప్పెన్, అతని అనుచరులు, 2014).
ఆర్టిమిసియా అబ్సింతియం ఎసెన్షియల్ ఆయిల్ ఫ్యుజేరియం ఆక్సిస్ఫోరం, ఫ్యుజేరియం సొలాని శిలీంద్రాలపై గణనీయమైన యాంటి ఫంగల్ చర్యను ప్రదర్శించింది (బెయిలెన్, అతని అనుచరులు, 2013)
అర్టెమిసియా జుడైకా ఎసెన్షియల్ ఆయిల్ నుండి వేరు చేసిన ట్రాన్సఇథైల్ సిన్నమేట్, పైపర్టోన్కన్నా శక్తివంతంగా స్పొడోప్టెరా లిట్టురాలిస్ని పూర్తిగా తిండి తినకుండా చేసింది (అబ్డెల్లలీల్, అతని అనుచరులు, 2008).
మాచిపత్రి ద్రావణం ట్రైబోలియం కాస్టానియం లార్వాలను అత్యధిక శాతంలో చంపింది. (పుగజ్వెండన్, అతని అనుచరులు, 2012).
మాచిపత్రి ఆకు మిథనాల్ ద్రావణం క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ లార్వాలను వేరు, కాండం ద్రావణాల కన్నా గణనీయంగా అధికంగా చంపాయి (ఇలాహి అండ్ ఉల్లా, 2013)
మాచిపత్రి ఆకునీటి ద్రావణం (10%) తేయాకు పంటలో ఎర్రనల్లి కలిగించే నష్టాన్ని తగ్గిస్తుంది (మామున్ అండ్ అహ్మద్, 2011)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
మెట్ట, పాక్షిక మెట్ట పట్టురైతుల కొరకు ప్రత్యేక మార్గదర్శిని
ఎల్ నినో అంటే ఏమిటి? దీని చరిత్ర ఏంటి? పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీరు అసాధారణంగా వేడెక్కడాన్ని”ఎల్ నినో” (El Niño) అంటారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పవనాల గతి తప్పి, భారతదేశంలో రుతుపవనాలు బలహీనపడతాయి. ఫలితంగా తీవ్ర వర్షాభావం, కరవు మరియు మితిమీరిన వేడిగాలులు (హీట్వేవ్స్) ఏర్పడుతాయి.
గత చరిత్ర: • 1997-1998: దేశవ్యాప్తంగా అత్యంత తీవ్రమైన కరవును మిగిల్చింది. • 2015-2016: అంతర్గత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. • 2023-2024: రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో పట్టుపరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది.
2026–2027 ఎల్ నినో కాలక్రమం (Timeline of the 2026–2027 El Niño Event) ఒక బలహీనమైన లా నినా (La Niña) వేగంగా ముగిసిన తర్వాత, రాబోయే ఎల్ నినో (El Niño) యొక్క ప్రారంభ సంకేతాలను ప్రధాన అంతర్జాతీయ వాతావరణ సంస్థలు మొదటిసారిగా 2026 మార్చి నుండి మే నెలల మధ్య ముందస్తుగా అంచనా వేశాయి. భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలను దాటడంతో, ఎల్ నినో పరిస్థితులు 2026 జూన్ నాటికి అధికారికంగా ప్రారంభమయ్యాయని వాతావరణ శాస్త్రవేత్తలు ధృవీకరించారు. అమెరికాకు చెందిన క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్ (NOAA) మరియు ప్రపంచ వాతావరణ సంస్థ (WMO)తో సహా అంతర్జాతీయ వాతావరణ నిపుణులు, ఈ ఎల్ నినో ప్రభావం మరింత ఉధృతమై 2026 చివరి నాటికి ఒక చారిత్రాత్మక “అత్యంత బలమైన” లేదా “సూపర్” ఎల్ నినోగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నిపుణుల ఖచ్చితమైన విశ్లేషణల ప్రకారం, ఈ వాతావరణ మార్పులు 97% నిశ్చితత్వంతో 2027 వసంతకాలం (మార్చి–ఏప్రిల్) ప్రారంభం వరకు కొనసాగుతాయి, దీనివల్ల దక్షిణ భారతదేశంలో సుదీర్ఘమైన కరవు ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంది.
ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉండే ముఖ్య జిల్లాల జాబితా దక్షిణ భారతదేశంలో ఈ క్రింది మెట్ట మరియు పాక్షిక మెట్ట జిల్లాలు ఎల్ నినో బారిన పడే అవకాశం చాలా ఎక్కువ: • ఆంధ్రప్రదేశ్: అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, అన్నమయ్య. • కర్ణాటక: కోలార్, బల్లాపూర్ స్థానంలో చిక్కబల్లాపూర్, రామనగర, తుమకూరు, చిత్రదుర్గ. • తమిళనాడు: ధర్మపురి, కృష్ణగిరి, ఈరోడ్, తిరుప్పూర్.
ఎల్ నినో వల్ల పట్టుపరిశ్రమకు కలిగే నష్టాలు • మల్బరీ తోటల క్షీణత: నేలలో తేమ తగ్గి, ఆకుల దిగుబడి మరియు పోషకాలు పడిపోతాయి. • అధిక ఉష్ణోగ్రత: పట్టుపురుగుల పెరుగుదలకు కావాల్సిన 24°C – 27°C కంటే ఉష్ణోగ్రత చాలా ఎక్కువవుతుంది. • తక్కువ తేమ (Low Humidity): గాలిలో తేమ తగ్గి పురుగులు నిర్जలీకరణానికి గురవుతాయి. • తెగుళ్లు మరియు పురుగుల దాడి: త్రిప్స్ (Thrips), తెల్లదోమ మరియు ఉజి ఈగ (Uzi fly)ల ఉధృతి పెరుగుతుంది. • వ్యాధులు: పట్టుపురుగులకు పచ్చరోగం (Grasserie), ఫ్లాచెరీ (Flacherie) వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి.
మల్బరీ తోటల యాజమాన్యం (నీటి పొదుపు చర్యలు) • బిందు సేద్యం (Drip Irrigation): డ్రిప్ పద్ధతి ద్వారా 40% నీటిని ఆదా చేస్తూ వేర్లకు నేరుగా నీరు అందించవచ్చు. • లోతైన చారలు (Deep Trenching): వరుసల మధ్య 30 సెం.మీ లోతు కందకాలు తవ్వి వర్షపు నీటిని నిల్వ చేయాలి. • మల్చింగ్ (Organic Mulching): కొబ్బరి పీచు లేదా ఎండిన గడ్డిని తోటలో పరచడం ద్వారా భూమిలోని తేమ ఆవిరి కాకుండా చూడవచ్చు. • కత్తిరింపుల మార్పు (Pruning Shifts): వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగానే మల్బరీ కొమ్మల కత్తిరింపులు చేపట్టాలి.
పట్టుపురుగుల పెంపక గృహాల (Rearing Room) నిర్వహణ • పైకప్పు రక్షణ: రేకుల లేదా కాంక్రీట్ రూఫ్లపై కొబ్బరి ఆకులు లేదా గడ్డిని దట్టంగా పరచాలి. • తడి గునె సంచులు (Wet Gunny Bags): కిటికీలు, తలుపులకు తడి బస్తాలను వేలాడదీసి గది ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. • తీవ్రమైన క్రిమిసంహారక చర్యలు: వేడి వల్ల వచ్చే బ్యాక్టీరియాను అరికట్టడానికి ‘క్లోరిన్ డయాక్సైడ్’తో గదిని శుద్ధి చేయాలి. • పడకల సాంద్రత తగ్గించడం (Bed Thinning): ట్రేలలో పురుగుల సంఖ్యను తగ్గించి గాలి ధారాళంగా ఆడేలా చూడాలి. • ఆకుల నిల్వ: కోసిన మల్బరీ ఆకులను తడి గుడ్డ కింద, చల్లని ప్రదేశంలో భద్రపరచాలి.
తక్షణ వాతావరణ కార్యాచరణ పట్టిక సమస్య: అధిక వేడి. *తక్షణ చర్య: నేలపై ఇసుక పోసి నీరు చల్లడం; గోడలపై నీరు కొట్టడం. లభించే ప్రయోజనం ఉష్ణోగ్రత 3°C నుండి 5°C వరకు తగ్గుతుంది
పొడి గాలి (<70% తేమ) హ్యూమిడిఫైయర్లు లేదా తడి బొగ్గుల వాడకం గూళ్లు కట్టడానికి తగిన తేమ లభిస్తుంది
ఆకుల కొరత ఆకులను వర్గీకరించి, చిన్న పురుగులకు ముందుగా మేత వేయడం నాణ్యమైన మేత వృథా కాకుండా ఉంటుంది
ఉజి ఈగ దాడి కిటికీలు, తలుపులకు నైలాన్ నెట్ (జాళి) అమర్చడం ఉజి ఈగలు గదిలోకి రాకుండా 100% నివారించవచ్చు
అత్యవసర సహాయం కొరకు సంప్రదించండి • సెంట్రల్ సిల్క్ బోర్డు (CSB): రాయితీ డ్రిప్ కిట్ల కొరకు మీ ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించండి. • కృషి విజ్ఞాన కేంద్రం (KVK): అత్యవసర తెగుళ్ల నివారణ సలహాల కొరకు.
• రాష్ట్ర పట్టుపరిశ్రమ శాఖ: ప్రభుత్వ కరవు ఉపశమన పథకాల సమాచారం కొరకు.
రూపకర్తలు (Prepared by): ● డా. కె. శ్రీనివాస్, సైంటిస్ట్ ‘బి’ రీసెర్చ్ ఎక్స్టెన్షన్ సెంటర్ సబ్ యూనిట్, బీదర్ (REC SU, Bidar) ● డా. రమ్య వి., సైంటిస్ట్ ‘బి’ ప్రoతీయ పట్టుపరిశ్రమ పరిశోధనా కేంద్రం, అనంతపురం (RSRS, Anantapur)