క్రిమిసంహారిణిగా ‘పంచగవ్య’

పంచగవ్యను ప్రకృతి వ్యవసాయంలోనే కాక రసాయన సేద్యం చేస్తున్న పొలాల్లో క్రిమి సంహారిణిగా వాడి మంచి ఫలితాలు పొందుతున్నారు రైతులు.

పంచగవ్య తయారీకి కావలసిన పదార్థాలు
ఆవుపేడ : 7 కిలోలు; ఆవు మూత్రం : 7 లీటర్లు; ఆవు పెరుగు : 2 లీటర్లు; ఆవు పాలు : 2 లీటర్లు; ఆవు నెయ్యి : 1 కిలో; లేత కొబ్బరి నీరు : 3 లీటర్లు; లేదా కల్లు : 3 లీటర్లు; బాగా మగ్గిన అరటిపండ్లు :12; నీరు : 15 లీటర్లు; నల్లబెల్లం : 1 కిలో

తయారు చేయు విధానం : మట్టి కుండలో వేసిన పేడలో నెయ్యివేసి బాగా కలిపి పెట్టాలి. ఈ విధంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నాలుగు రోజులు చేయగా పేడంతా నేతి వాసన వస్తుంది. 5వ రోజున మూత్రం, పాలు, పెరుగు, కల్లు, కొబ్బరి నీరు, బెల్లం, నీరు బాగా కలియబెట్టాలి. ఆ తరువాత అరటి పండ్లు మెత్తగా పిసికి ఈ మిశ్రమంలో కలియ తిప్పాలి. ఈ మిశ్రమం పోసిన మట్టి పాత్ర గాని ప్లాస్టిక్ డ్రమ్ముగాని వెడల్పాటి మూతికలిగి ఉండాలి. మూత బెట్టకుండా గుడ్డతో మూతిబిగించాలి. (లేకపోతే ఈగలు, క్రిములు మిశ్రమంలో పడతాయి) ఈ విధంగా 15 రోజులు వేసిన తరువాత మిశ్రమాన్ని పలుచటి గుడ్డలో వడబోయాలి. ఈ మిశ్రమాన్ని ఆరు నెలల వరకు వాడవచ్చు. పాత్ర మూత వదులుగా వుండాలి. ఒకవేళ పంచగవ్య గట్టిపడితే తగినంత నీరు కలుపుకుని వాడుకోవాలి. పంచగవ్య మొక్క పెరుగుదలకే కాకుండా చీడపీడలను దరిచేరనీయదు. అన్ని రకాల మొక్కలపై వాడుకొనవచ్చు. నారుమళ్ళకు బాగా శ్రేష్టం.

Read More

వరిలో నేరుగా విత్తు సాగు విధానం – మెళకువలు

ఆవశ్యకత :
ఉత్తర కోస్తా జిల్లాలలో ఖరీఫ్ పంటకాలంలో వరి ప్రధానమైన పంట, సుమారు 5 లక్షల 20 వేల ఎకరాలలో సాగు చేయబడుతుంది, అందులో సుమారు 50 శాతం విస్తీర్ణం నేరుగా విత్తే (ఎదసాగు) పద్దతిలోనే సాగు అవుతుంది. సాగు ఖర్చులు పెరగడం, కూలీలు సకాలంలో అందుబాటులో లేకపోవడం, కూలీల ఖర్చు పెరగడం వలన రైతులు నేరుగా విత్తే పద్ధతిలో వరిసాగువైపు మరలుతున్నారు.

మారిన వాతావరణ పరిస్థితులలో తక్కువ నీటితో లాభదాయక దిగుబడులు పొందడం వరిలో నేరుగా విత్తు విధానం ద్వారా సాధ్యం. అంతేకాకుండా ఈ సాగువిధానం వలన కొంతవరకు మీథెన్ వాయువు విడుదల తగ్గటం వలన పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అలాగే నీటి వినియోగం 25% ఊడ్పు పద్ధతి మీద తగ్గుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవచ్చు. ప్రతికూల పరిస్థితులలో వరిసాగు ఆలస్యం అయినపుడు నేరుగా వరి విత్తుసాగు పద్దతిలో సాగుచేయడం వలన సమయం ఆదా అవుతుంది.

నేరుగా విత్తే వరి సాగు చేయుటవలన లాభాలు :-

  1. తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకోవచ్చు.
  2. నారుమడి పెంపకం, నాట్లకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. సుమారు ఎకరానికి 2500 నుండి 3000 రూపాయల వరకు కూలీల ఖర్చు ఆదా అవుతుంది.
  3. చెరువుల క్రింద, కాలువల క్రింద సాగుచేసే పరిస్థితులలో నాట్లు ఆలస్యం కాకుండా సకాలంలో పంటను సాగు చేయవచ్చు.
  4. విత్తన మోతాదు 40-50 శాతం తగ్గుతుంది.
  5. పంట పడిపోదు, పంట వారం నుండి 10 రోజుల ముందు కోతకు వస్తుంది.
  6. పురుగులు, తెగుళ్ళు సమస్య కొంతవరకు తక్కువగా ఉంటుంది.
  7. నీటిని ఆదా చేసుకోవచ్చు.
  8. కోత యంత్రాలతో సులువుగా పంట కోత చేపట్టవచ్చు.

నేరుగా విత్తే వరిలో అదిక దిగుబడికి కీలక యాజమాన్య పద్దతులు
రకాల ఎంపిక :-

ముంపు ప్రాంతాలకు / లోతట్టు ప్రాంతాలకు అనువైన రకాలు :
ఎం.టి.యు – 1061 (ఇంద్ర) ఎం.టి.యు – 1064 (అమర), ఆర్.జి.ఎల్-2537 (శ్రీకాకుళం సన్నాలు) ఎత్తు పెరిగి, కాండం దృడంగా వుండి, పడిపోని రకాలను సాగుచేసుకోవాలి.
సాధారణ కాలువ ప్రాంతాలు, చెఱువుల క్రింద వరి సాగుకు అనువైన రకాలు :
ఎం.టి.యు – 3291 (సోనామసూరి), ఎం.టి.యు-1210 (సుజాత), ఎం.టి.యు -7029 (2), ఎం.టి.యు -1121 (శ్రీదృతి), ఎం.టి.యు-1224 (మారుటేరు సాంబ) బి . పి టి -5204
కాలువ చివరి భూములు ఆలస్యంగా విత్తే ప్రాంతాలకు అనువైన రకాలు :
ఎం.టి.యు – 1156 (తరంగిణి), ఎం.టి.యు – 1153 (చంద్ర) ఎన్.ఎల్.ఆర్- 34449,
ఆర్.ఎన్.ఆర్ – 15048

నేల తయారీ : తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకొని పలుమార్లు దున్ని మెత్తని దుక్కి
చేసినట్లయితే కలుపు సమస్యను కొంతవరకు అదిగమించవచ్చు. ఆఖరి దుక్కిలో సిఫారసు మేరకు పోషకాలు వేసి కలియదున్ని బాగా చదును చేయాలి. నేల సుమతులంగా / చదునుగా లేనట్లయితే తేమ సరిగా అందక మొలక సరిగా రాదు. పంట ఎదుగుదల కూడా సమానంగా ఉండదు, నీటి యాజమాన్యం సమస్యఅవుతుంది. అఖరు దుక్కిని రోటావేటర్‌తో వేసుకోవడం మంచిది.
వాలును బట్టి నీరు బయటకి పోవుటకు వీలుగా ప్రతి 2 మీటర్లకు బాటలు చేసుకోవడం వలన తర్వాత ఎరువులు వేయుటకు, సస్యరక్షణ చర్యలు చేపట్టుటకు ఉపయోగపడటమే కాకుండా దోమపోటు ఎక్కువగా ప్రభలకుండా వుంటుంది.

విత్తన మోతాదు : ఎకరానికి 16Ð20 కిలోల విత్తనము ఉపయోగించాలి.

విత్తన శుద్ధి : విత్తేముందు సూడోమోనాస్‌తో విత్తన శుద్ధిచేయాలి.

విత్తే విధానం: శుద్ధిచేసిన విత్తనాన్ని నేరుగా చదును చేసిన పొలంలో వెదజల్లడం ద్వారా గాని
20 సెం.మీ. దూరంలో నాగటి సాలు వెనకగాని, గొర్రుతోగాని, ట్రాక్టరుతో నడిచే ఎరువులు మరియు విత్తనాన్ని ఒకేసారి వేసే గొర్రుతో (ఫర్టికమ్ సీడ్ డ్రిల్) గాని వేసుకోవాలి.

విత్తనాన్ని ఎక్కువ లోతులో వేసినట్టయితే మొలకశాతం దెబ్బతినే అవకాశం ఉంది. కనుక పై పోరల్లో సుమారు (2.5 – 5 సెం.మీ) లోతులో వేసుకోవాలి.

దమ్ముచేసి సాగు చేయు పద్ధతిలో మొలకెత్తిన విత్తనాలను దమ్ము చేసిన పొలాల్లో వెదజల్లడం ద్వారా లేదా డ్రమ్‌సీడరు ద్వారా విత్తుకోవచ్చు.

మొక్కలు లేనిచోట కొత్త మొక్కలు వేసుకొనుట :

వేదజల్లు పద్ధతిలో సాగు చేయు రైతులు విత్తే రోజే ఎకరానికి అరసెంటు నారుముడి పోసుకున్నట్లయితే అధిక వర్షాల వలన లేదా పల్లపు ప్రాంతాలలో మొక్కలు చనిపోయి ఖాళీలు
ఏర్పడిన ప్రాంతాలలో ఈ నారును ఉపయోగించడం వలన కావలసిన మొక్కల సాంధ్రత ఉంటుంది. అలాగే ఒత్తుగా ఉన్న మొక్కలు తగ్గించి పలుచగా ఉన్న ప్రాంతాలలో నాటుకోవచ్చు. మంచి దిగుబడికి పొలం తయారీ సమయంలో ఎకరానికి 8 – 10 టన్నుల పశువుల గెత్తం వేసుకోవాలి.

ఎరువుల యాజమాన్యం: నేరుగా విత్తే వరి పొలాలలో భూ ఆరోగ్యానికి, సేంద్రీయ కర్బనం పెంచడం కోసం
తొలకరి వర్షాలకు పెసర వంటి అపరాల పంటలు వేసి భూమిలో కలియదున్నుకోవాలి.

జీవన ఎరువులను తప్పని సరిగా వేసుకోవాలి. ఎకరానికి 500మి.లీ. అజోస్పైరిల్లం 500 మి.లీ.లు పాస్పోబాక్టీరియాను 100 కిలోల పశువుల గెత్తంతో కలిపి విత్తిన తరువాత తగు తేమ వున్నపుడు వేసుకోవాలి. సిఫారసు చేసిన పోషకాలను తప్పనిసరిగా అందించాలి.

కలుపు యాజమాన్యం : కలుపును మనుషుల సహాయంతో మొదటగా నిర్మూలించి, సరైన సమయంలో నీరు పెట్టి, ఆ నీటిలో సిఫారసు చేసిన మోతాదులో అజొల్లాను వేయాలి.

నీటి యాజమాన్యం : పంటకు 7-10 రోజుల కొకసారి అవసరం మేరకు తడులు పెట్టాలి.

ఈ పద్ధతిలో ఎల్లప్పుడు నీరు నిలువ ఉంచవలసిన అవసరం లేదు. అయితే పంటకు కావలసిన తేమను అందించి పంట కీలక దశల్లో బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. నీటి లభ్యతనుబట్టి విత్తనము ఎద పెట్టిన 30 నుంచి 40 రోజుల్లో పొలంలో నీరు పారించి మాగాణి వరి మాదిరిగా మార్చుకోవాలి.

విత్తిన దగ్గర నుండి మొదటి 30 రోజులు ఆరుతడి నీటి యాజమాన్యం పాటించాలి. వర్షాలు పడిన తరువాత లేదా కాలువలకు చెఱువులకు నీరు అందుబాటులో ఉన్నపుడు సాధారణ మాగాణి నాట్లు వరి మాదిరి నీటి యజమాన్యం చేపట్టాలి. దుబ్బుచేసే దశలు 1-2 అంగుళాలు మేర నీటిని ఉంచి, పూత దశ నుండి గింజనిండే దశ వరకు 2-4 అంగుళాల నీటిని ఉంచడం ద్వారా అదిక పిలకలు, వెన్నులు వచ్చి దిగుబడి పెరుగుతుంది.
సస్యరక్షణ చర్యలు : నాట్లు పద్ధతిలో లాగానే పురుగు ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

డా॥ ఎం.ఎం.వి.శ్రీనివాసరావు, డా॥ కె. లక్ష్మణ , ప్రధాన శాస్త్రవేత్తలు, ఏరువాక కేంద్రం, విజయనగరం. ఫోన్: 94401 23223

Read More

విత్తనోత్పత్తిలో రైతులు

తెలంగాణాలో చాలామంది రైతులు ఇటీవల విత్తనోత్పత్తి చేపడుతున్నారు. పొలాస, కూనారం, వరంగల్, రుద్రూరు, రాజేంద్రనగర్, మారుటేరు, నెల్లూరు తదితర పరిశోధన స్థానాల నుంచి తెచ్చిన బ్రీడర్, ఫౌండేషన్, ట్రూత్‌ఫుల్ లేబుల్ విత్తనాలను సాగుచేసి పండిన పంటను తిరిగి విత్తనంగా విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తూ తోటి రైతులకు నాణ్యమైన వంగడాలను చేరవేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ ద్వారా గత వానాకాలానికి ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో వరి, పెసర, మినుము, కంది, వేరుసెనగ, నువ్వులు తదితర పంటల విత్తనాలిచ్చారు. వీటిని సాగు చేసినవారు తోటి రైతులకు సైతం విత్తనాలను చేరవేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఈ యాసంగిలో 9.59 లక్షల ఎకరాల్లో సాగు చేసిన వరి పైరు ప్రస్తుతం గొలక దశ నుంచి నూర్పిడి దశ వరకు శాస్త్రవేత్తలు విత్తన ప్రాధాన్యతను రైతులకు వివరిస్తున్నారు. పొలంలో కల్తీ కర్రలు, బెరకు కేళీలను ఏరివేసి పంటను వేరుగా నూర్పిడి చేసుకొని రైతు విత్తనంగా వాడుకోవచ్చు. దీంతో కల్తీలు, నకిలీల బెడద ఉండదు. మన నేలల్లోనే పండించిన పంట కాబట్టి స్థిరమైన దిగుబడి వస్తుంది. ప్రైవేటుగా విత్తనాలను కొంటే హెక్టారుకు రూ. 3 వేల నుంచి రూ. 6 వేల వరకు విత్తనానికి వెచ్చించాల్సి వస్తోంది. అదే రైతు విత్తనమైతే సగం ఖర్చుతోనే సరిపోతుంది. వచ్చే వానాకాలం సీజన్‌లో సన్నాలను అధికంగా సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నందున ఇప్పటినుంచే రైతులు మేలైన సన్న గింజ రకాలను సేకరించుకోవాలి. మక్క, పత్తి తదితర హైబ్రిడ్స్ మినహా వరి నువ్వులు, పెసర, మినుము, అలసంద తదితర సూటి రకాల్లో ప్రతి పంటకు నూతన విత్తనం కొనకుండా రైతు విత్తనాన్ని వినియోగించాలని ఏడీఆర్ డా. హరీశ్ కుమార్ శర్మ సూచించారు.

Read More

పసుపు కొనుగోళ్ళపై సమీక్ష

అకాల వర్షాలు, ఈదురు గాలులతో నష్టపోయిన పసుపు రైతులను ఆదుకునేందుకు తేమతో ఉన్న పసుపును కూడా ఎటువంటి కోతలు లేకుండా పూర్తి తూకంతో కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించామని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో పసుపు కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు భారీగా పసుపు వస్తోంది. సోమవారం అర్ధరాత్రి బలమైన గాలులు, వర్షాల ప్రభావంతో సుమారు 3,450 మంది రైతులకు చెందిన 7,080 పసుపు కుప్పలు తేమకు గురయ్యాయి. ఈ పసుపును ఎటువంటి కోతలు లేకుండా కొనుగోలు చేసేందుకు ఆదేశించాం’ అని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం
తెలంగాణలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించబోయే రైతు ఉత్సవాల్లో రైతులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మంగళవారం ఆయన సచివాలయం నుంచి ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్‌లో కార్యదర్శి సురేంద్రమోహన్‌తో కలిసి మాట్లాడారు.

Read More

పశువుల ఆరోగ్యం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు

వేసవిలో తీవ్రమైన వేడి గాలుల కారణంగా వడదెబ్బతో పశువుల ఆరోగ్యం, వాటి ఉత్పత్తుల సామర్థ్యంపై తీవ్ర ప్రభావం పడడంతోపాటు మరణాలకూ దారితీయవచ్చు కాబట్టి క్షేత్రస్థాయి సిబ్బందికి, పశుపోషకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి. దామోదర్ నాయుడు అత్యవసర మార్గదర్శకాలను జారీ చేశారు.
పశువులు అధిక మొత్తంలో నీటిని తీసుకునేందుకు వీలుగా నీటి తొట్టెలను నిండుగా పెట్టాలి. పశువులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో సామూహిక నీటితొట్టెలు ఏర్పాటు చేయాలి. పశువులు ఉండే షెడ్లలో ఉష్ణోగ్రత పెరగకుండా నీటితో తడిపిన గోనె సంచులను చుట్టూ కట్టాలి, పైకప్పు మీద తరుచూ నీల్లు చల్లుతూ ఉండాలి. పశువులను మేతకు ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 5 గంటల తర్వాతనే వదలాలి. సంకర జాతి పశువుల షెడ్లలో తప్పనిసరిగా స్ప్రింకర్లు, ఫ్యాన్లు అమర్చాలి. పశువులు వేగంగా శ్వాస తీసుకోవడం, నోటి నుంచి చొంగ కారడం, నిస్సత్తువగా ఉండడం, నీరు అదే పనిగా తాగడంలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ పశువులను చల్లని నీటితో తడపాలి, స్థానిక పశువైద్యులను సంప్రదించాలి. అత్యవసర పరిస్థితుల్లో సంచార పశు ఆర్యోగ సేవా వాహనాలను వినియోగించుకోవాలి అని సూచించారు.

Read More

వేప చెట్లకు డైబ్యాక్ శిలీంధ్రం ఆశిస్తుంది

అన్ని ప్రాంతాల్లోనూ వేప చెట్లకు మళ్లీ తెగులు సోకింది, కొమ్మలు ఎండిపోతున్నాయి, చెట్లకు పూత రావడం లేదు. అంతో ఇంతో వచ్చినా కాయలుగా మారడం లేదు. డైబ్యాక్ అనే శిలీంధ్రం వల్ల ఈ సమస్య తలెత్తిందని వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. టీ దోమ అనే కీటకమూ మరో కారణమని తేల్ౘ్ారు. ఈ తెగులు సోకితే చెట్టు పైభాగం నుంచి మొదలై.. కింది వరకు కొమ్మలు క్రమంగా ఎండిపోతాయి. పూత మాడిపోతుంది. 100% గింజ ఉత్పత్తి ఉండదు.

పరిష్కారం: ఎండిపోయిన చోటుకు 15 సెం.మీ. దిగువన (కొమ్మ ఆరోగ్యంగా ఉన్నచోటకు) కత్తిరించాలి. కత్తిరించిన కొమ్మలను దూరంగా తీసుకెళ్లి తగలబెట్టాలి. లేదంటే శిలీంధ్ర బీజాలు గాలి ద్వారా ఇతర ఆరోగ్యకర చెట్లకు వేగంగా వ్యాప్తి చెందుతాయి. చెట్ల కింద రాలిన వేప ఆకులతో సాయంత్రం పొగ వేయడం ద్వారా టీ దోమల్ని నియంత్రించవచ్చు. చెట్టు మొదలులో వేప పిండి, సేంద్రియ ఎరువులు వేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచవచ్చని ఉద్యాన శాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read More