ఆవశ్యకత :
ఉత్తర కోస్తా జిల్లాలలో ఖరీఫ్ పంటకాలంలో వరి ప్రధానమైన పంట, సుమారు 5 లక్షల 20 వేల ఎకరాలలో సాగు చేయబడుతుంది, అందులో సుమారు 50 శాతం విస్తీర్ణం నేరుగా విత్తే (ఎదసాగు) పద్దతిలోనే సాగు అవుతుంది. సాగు ఖర్చులు పెరగడం, కూలీలు సకాలంలో అందుబాటులో లేకపోవడం, కూలీల ఖర్చు పెరగడం వలన రైతులు నేరుగా విత్తే పద్ధతిలో వరిసాగువైపు మరలుతున్నారు.
మారిన వాతావరణ పరిస్థితులలో తక్కువ నీటితో లాభదాయక దిగుబడులు పొందడం వరిలో నేరుగా విత్తు విధానం ద్వారా సాధ్యం. అంతేకాకుండా ఈ సాగువిధానం వలన కొంతవరకు మీథెన్ వాయువు విడుదల తగ్గటం వలన పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అలాగే నీటి వినియోగం 25% ఊడ్పు పద్ధతి మీద తగ్గుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవచ్చు. ప్రతికూల పరిస్థితులలో వరిసాగు ఆలస్యం అయినపుడు నేరుగా వరి విత్తుసాగు పద్దతిలో సాగుచేయడం వలన సమయం ఆదా అవుతుంది.

నేరుగా విత్తే వరి సాగు చేయుటవలన లాభాలు :-
- తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకోవచ్చు.
- నారుమడి పెంపకం, నాట్లకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. సుమారు ఎకరానికి 2500 నుండి 3000 రూపాయల వరకు కూలీల ఖర్చు ఆదా అవుతుంది.
- చెరువుల క్రింద, కాలువల క్రింద సాగుచేసే పరిస్థితులలో నాట్లు ఆలస్యం కాకుండా సకాలంలో పంటను సాగు చేయవచ్చు.
- విత్తన మోతాదు 40-50 శాతం తగ్గుతుంది.
- పంట పడిపోదు, పంట వారం నుండి 10 రోజుల ముందు కోతకు వస్తుంది.
- పురుగులు, తెగుళ్ళు సమస్య కొంతవరకు తక్కువగా ఉంటుంది.
- నీటిని ఆదా చేసుకోవచ్చు.
- కోత యంత్రాలతో సులువుగా పంట కోత చేపట్టవచ్చు.
నేరుగా విత్తే వరిలో అదిక దిగుబడికి కీలక యాజమాన్య పద్దతులు
రకాల ఎంపిక :-
ముంపు ప్రాంతాలకు / లోతట్టు ప్రాంతాలకు అనువైన రకాలు :
ఎం.టి.యు – 1061 (ఇంద్ర) ఎం.టి.యు – 1064 (అమర), ఆర్.జి.ఎల్-2537 (శ్రీకాకుళం సన్నాలు) ఎత్తు పెరిగి, కాండం దృడంగా వుండి, పడిపోని రకాలను సాగుచేసుకోవాలి.
సాధారణ కాలువ ప్రాంతాలు, చెఱువుల క్రింద వరి సాగుకు అనువైన రకాలు :
ఎం.టి.యు – 3291 (సోనామసూరి), ఎం.టి.యు-1210 (సుజాత), ఎం.టి.యు -7029 (2), ఎం.టి.యు -1121 (శ్రీదృతి), ఎం.టి.యు-1224 (మారుటేరు సాంబ) బి . పి టి -5204
కాలువ చివరి భూములు ఆలస్యంగా విత్తే ప్రాంతాలకు అనువైన రకాలు :
ఎం.టి.యు – 1156 (తరంగిణి), ఎం.టి.యు – 1153 (చంద్ర) ఎన్.ఎల్.ఆర్- 34449,
ఆర్.ఎన్.ఆర్ – 15048

నేల తయారీ : తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకొని పలుమార్లు దున్ని మెత్తని దుక్కి
చేసినట్లయితే కలుపు సమస్యను కొంతవరకు అదిగమించవచ్చు. ఆఖరి దుక్కిలో సిఫారసు మేరకు పోషకాలు వేసి కలియదున్ని బాగా చదును చేయాలి. నేల సుమతులంగా / చదునుగా లేనట్లయితే తేమ సరిగా అందక మొలక సరిగా రాదు. పంట ఎదుగుదల కూడా సమానంగా ఉండదు, నీటి యాజమాన్యం సమస్యఅవుతుంది. అఖరు దుక్కిని రోటావేటర్తో వేసుకోవడం మంచిది.
వాలును బట్టి నీరు బయటకి పోవుటకు వీలుగా ప్రతి 2 మీటర్లకు బాటలు చేసుకోవడం వలన తర్వాత ఎరువులు వేయుటకు, సస్యరక్షణ చర్యలు చేపట్టుటకు ఉపయోగపడటమే కాకుండా దోమపోటు ఎక్కువగా ప్రభలకుండా వుంటుంది.
విత్తన మోతాదు : ఎకరానికి 16Ð20 కిలోల విత్తనము ఉపయోగించాలి.
విత్తన శుద్ధి : విత్తేముందు సూడోమోనాస్తో విత్తన శుద్ధిచేయాలి.
విత్తే విధానం: శుద్ధిచేసిన విత్తనాన్ని నేరుగా చదును చేసిన పొలంలో వెదజల్లడం ద్వారా గాని
20 సెం.మీ. దూరంలో నాగటి సాలు వెనకగాని, గొర్రుతోగాని, ట్రాక్టరుతో నడిచే ఎరువులు మరియు విత్తనాన్ని ఒకేసారి వేసే గొర్రుతో (ఫర్టికమ్ సీడ్ డ్రిల్) గాని వేసుకోవాలి.
విత్తనాన్ని ఎక్కువ లోతులో వేసినట్టయితే మొలకశాతం దెబ్బతినే అవకాశం ఉంది. కనుక పై పోరల్లో సుమారు (2.5 – 5 సెం.మీ) లోతులో వేసుకోవాలి.
దమ్ముచేసి సాగు చేయు పద్ధతిలో మొలకెత్తిన విత్తనాలను దమ్ము చేసిన పొలాల్లో వెదజల్లడం ద్వారా లేదా డ్రమ్సీడరు ద్వారా విత్తుకోవచ్చు.

మొక్కలు లేనిచోట కొత్త మొక్కలు వేసుకొనుట :
వేదజల్లు పద్ధతిలో సాగు చేయు రైతులు విత్తే రోజే ఎకరానికి అరసెంటు నారుముడి పోసుకున్నట్లయితే అధిక వర్షాల వలన లేదా పల్లపు ప్రాంతాలలో మొక్కలు చనిపోయి ఖాళీలు
ఏర్పడిన ప్రాంతాలలో ఈ నారును ఉపయోగించడం వలన కావలసిన మొక్కల సాంధ్రత ఉంటుంది. అలాగే ఒత్తుగా ఉన్న మొక్కలు తగ్గించి పలుచగా ఉన్న ప్రాంతాలలో నాటుకోవచ్చు. మంచి దిగుబడికి పొలం తయారీ సమయంలో ఎకరానికి 8 – 10 టన్నుల పశువుల గెత్తం వేసుకోవాలి.
ఎరువుల యాజమాన్యం: నేరుగా విత్తే వరి పొలాలలో భూ ఆరోగ్యానికి, సేంద్రీయ కర్బనం పెంచడం కోసం
తొలకరి వర్షాలకు పెసర వంటి అపరాల పంటలు వేసి భూమిలో కలియదున్నుకోవాలి.
జీవన ఎరువులను తప్పని సరిగా వేసుకోవాలి. ఎకరానికి 500మి.లీ. అజోస్పైరిల్లం 500 మి.లీ.లు పాస్పోబాక్టీరియాను 100 కిలోల పశువుల గెత్తంతో కలిపి విత్తిన తరువాత తగు తేమ వున్నపుడు వేసుకోవాలి. సిఫారసు చేసిన పోషకాలను తప్పనిసరిగా అందించాలి.
కలుపు యాజమాన్యం : కలుపును మనుషుల సహాయంతో మొదటగా నిర్మూలించి, సరైన సమయంలో నీరు పెట్టి, ఆ నీటిలో సిఫారసు చేసిన మోతాదులో అజొల్లాను వేయాలి.
నీటి యాజమాన్యం : పంటకు 7-10 రోజుల కొకసారి అవసరం మేరకు తడులు పెట్టాలి.
ఈ పద్ధతిలో ఎల్లప్పుడు నీరు నిలువ ఉంచవలసిన అవసరం లేదు. అయితే పంటకు కావలసిన తేమను అందించి పంట కీలక దశల్లో బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. నీటి లభ్యతనుబట్టి విత్తనము ఎద పెట్టిన 30 నుంచి 40 రోజుల్లో పొలంలో నీరు పారించి మాగాణి వరి మాదిరిగా మార్చుకోవాలి.
విత్తిన దగ్గర నుండి మొదటి 30 రోజులు ఆరుతడి నీటి యాజమాన్యం పాటించాలి. వర్షాలు పడిన తరువాత లేదా కాలువలకు చెఱువులకు నీరు అందుబాటులో ఉన్నపుడు సాధారణ మాగాణి నాట్లు వరి మాదిరి నీటి యజమాన్యం చేపట్టాలి. దుబ్బుచేసే దశలు 1-2 అంగుళాలు మేర నీటిని ఉంచి, పూత దశ నుండి గింజనిండే దశ వరకు 2-4 అంగుళాల నీటిని ఉంచడం ద్వారా అదిక పిలకలు, వెన్నులు వచ్చి దిగుబడి పెరుగుతుంది.
సస్యరక్షణ చర్యలు : నాట్లు పద్ధతిలో లాగానే పురుగు ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
డా॥ ఎం.ఎం.వి.శ్రీనివాసరావు, డా॥ కె. లక్ష్మణ , ప్రధాన శాస్త్రవేత్తలు, ఏరువాక కేంద్రం, విజయనగరం. ఫోన్: 94401 23223

