కావలసిన ఆకులు, పదార్థాలు: పిచ్చి తులసి - 250 గ్రా., తులసి - 250 గ్రా., పాలకొడిశ - 250గ్రా., తుత్తురుబెండ - 250 గ్రా., పొగాకు- 250 గ్రా., కాగితంపూల ఆకులు - 250 గ్రా., వేపాకులు - 250 గ్రా. టేకుఆకులు - 250 గ్రా., కలబంద - 250 గ్రా., బొప్పాయి ఆకులు - 250 గ్రా.
పైన సూచించిన ఆకులను మెత్తగా నూరి ముద్ద చేయాలి. దీనిని ఒక పెద్ద కుండలోగానీ లేదా ప్లాస్టిక్ డ్రమ్ములో గానీ వేసి దానికి 5 లీ. ఆవుమూత్రాన్ని, 5 లీ. నీరు కలపాలి. ఈ ద్రావణం ఉంచిన కుండపై మూతపెట్టి 10 రోజుల పాటు ప్రతిరోజు ద్రావణాన్ని సవ్య, అపసవ్య దిశలలో బాగా కర్రతో కలుపుతూ ఉండాలి. తరువాత ఈ ద్రావణాన్ని పలుచని గుడ్డతో వడపోయాలి. ఈ ద్రావణానికి 150 లీ. నీరు కలిపి ఒక ఎకరా పొలంలో సాయంత్రం వేళ పంటపై పిచికారీ చేయాలి.
నేల దేశ సంపద, దేశం సుభిక్షంగా ఉండాలంటే నేల ఆరోగ్యంగా ఉండాలి. నేల అనగా అనేక బిలియన్ల బ్యాక్టీరియా, శిలీంధ్ర, నాచు ఇంకా అనేక రకాల సూక్ష్మజీవుల సహజీవనంతో తొణికిసలాడే సజీవమైన జీవధార వ్యవస్థగా గుర్తించాలి. ఇవి మొక్కల ఎదుగుదలకు పోషకంగానే కాక వర్షపు నీరును క్షామం కాలం వరకు ఉంచుకొని మొక్కలకు అందజేస్తా ఆరోగ్యంగా ఉంటేనే ఆహార భద్రత, ఆరోగ్యకరమైన పర్యావరణంతోనే మానవాళి శ్రేయస్సు సాధ్యపడుతుంది.
ఇటీవల కాలంలో రైతాంగం విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులను, పురుగు మందులను వాడడం, అలాగే పంటల అవ శేషాలను కాల్చి వేయడం ద్వారా భూసారం గణనీయంగా క్షీణించడమే గాక పర్యావరణ కాలుష్యం, ఉపయోగకరమైన బ్యాక్టీరియా వినాశనానికి దారి తీస్తూ జీవన వైవిధ్యం వినాశనం సంభవిస్తుంది. తద్వారా సరైన పోషకాలు లేని బీడు భూములు ఏర్పడుతున్నాయి. మనకు స్వాతంత్య్రం వచ్చినపుడు ప్రతి కిలో ఎరువుకు 17 నుండి 18 కిలోల ధాన్యం పండేది. కానీ ప్రస్తుతం ప్రతి కిలో ఎరువుకు కేవలం 3 కిలోల ధాన్యం మాత్రమే పండుతుంది. ఇది భూసారం క్షీణించడాన్ని సూచిస్తుంది.
భూసారాన్ని పెంచడానికి, నేల ఉత్పా దకతను మెరుగుపరచడానికి సూక్ష్మజీవుల పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే ఇవి నజ్రజనిని స్థిరీకరిస్తాయి, పోషకాలను కరిగిస్తాయి. పోషకాలను విచ్ఛిన్నం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు సహజంగానే భూమిలో ఉంటాయి. కాని వీటి సంఖ్య త్వరీతంగా తగ్గుతూ వస్తుంది. పంటల దిగుబడిని పెంచడానికి సూక్ష్మ జీవులను కృత్రిమంగా పెంచి ఎక్కువ సంఖ్యలోకి తెచ్చి సూటి అయిన ఘన పదార్ధాలలో కలిపి మరల భూమిలో వెయ్యవచ్చు.
నత్రజనిని స్థిరికరించే జీవన ఎరువులు :
జీవన ఎరువులు వాడవలసిన మోతాదు ఏ ఏ పంటలకు
రైజోబియం 200 గ్రా. కంది,పెసర , మినుము, శనగ వంటి పంటలకు
అజటోబాక్టర్ 2 కిలోలు పప్పుజాతి పంటలను మినహాయించి మిగతా అన్ని పంటలకు
నీలి ఆకుపచ్చనాచు 4 కిలోలు వరి పంటకు మాత్రమే వాడాలి.
రైజోబియం: లెగ్యూమ్ జాతి పంటలు అనగా అపరాల (పప్పుజాతి) పంటలకు నత్రజని అందించే జీవన ఎరువుగా వాడవలెను. పప్పుజాతి పైర్లలో ముఖ్యమైనవి కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు, వేరుశనగ, సోయాచిక్కుడు వంటి నూనె గింజల పైర్లకు రైజోబియం కల్చర్ను విత్తనమునకు పట్టించి ఉపయోగించాలి. ఉపయోగించే విధానం: వంద మిల్లీలీటర్ల నీటిలో పది గ్రాముల పంచదార, బెల్లం, లేక గంజి పౌడర్ను కలిపి పది నిమిషాలు మరగబెట్టి చల్లార్చాలి. ఈ చల్లార్చిన ద్రావణం పది కిలోల విత్తనాలపై చల్లి, దానికి 200 గ్రాములు రైజోబియం కల్చర్ పొడిని బాగా కలపాలి. విత్తనం చుట్టూ పొరలు ఉండేలా జాగ్రత్త వహించాలి.
ఈ ప్రక్రియకు రైతులు పాలిథిన్ సంచిగానీ, ప్లాస్టిక్ తొట్టిని గాని ఉపయోగించుకోవచ్చు. పది నిమిషాలు నీడలో ఆరబెట్టిన తరువాత రైతులు పొలంలో నాటుకోవలెను
అజటోబాక్టర్: పప్పుజాతి పంటలను మినహాయించి, మిగతా అన్ని పంటలకు నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ బాక్టీరియా నత్రజనిని స్థిరీకరించడమే కాక, మొక్కకు కావాల్సిన హార్మోన్లు, విటమిన్లు అందిస్తుంది.
ఈ బాక్టీరియా ముఖ్యంగా సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న భూమిలో సమర్థవంతంగా పని చేస్తుంది. అందువల్ల ఈ జీవన ఎరువు ఆకుకూరలు, కూరగాయలు, పూల తోటలకు సిఫారసు చేయబడుతుంది.
వాడే విధానం: ఏ పంటకు వాడినా రెండు కిలోల కల్చర్ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో ఒక ఎకరం నేలపై వెదజల్లాలి. ఇది చల్లిన సమయంలో కాని, వెనువెంటనే భూమిలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి
అజోస్ప్తెరిల్లమ్ : ఈ మధ్యకాలంలో దీని ప్రాముఖ్యత అధికంగా గుర్తించారు. ఈ బాక్టీరియా మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశమున్న చోట వేర్లలోకి చరొబడి కూడా జీవిస్తాయి. ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువశాతం అందుబాటులో ఉంటుంది. ఈ జీవన ఎరువును లెగ్యూమ్జాతి పంటలకు తప్పించి, మిగతా పంటలకు వాడుకోవచ్చు. ఇది వరి, చెరకు, పత్తి, మిర్చి, జొన్న, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, అరటి పంటలకు బాగా ఉపయోగపడుతుంది. సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలలో ఇది పని చేస్తుంది.
ఉపయోగించే విధానం:
తక్కువ కాలం పంటలకు రెండు కిలోల అజోస్పెరిల్లమ్ కల్చర్ను 80-100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలంలో విత్తనం కింద పడేలా వేసుకోవాలి. నారుమడి వేసుకొనే పంటలకు నారు పీకేందుకు ముందుగా నారుమడి వద్ద 70 నుంచి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి.
ఆ నీటిలో రెండు కిలోల అజోస్పెరిల్లమ్ జీవన ఎరువును బాగా కలిపి, ఆ ద్రావణంలో పది నిమిషాలు వేళ్లను మాత్రమే ముంచి వెంటనే నాటుకోవాలి. చెరకు పంట విషయంలో నాటే విత్తనం చెరకు ముక్కలను పది నిమిషాలు ముంచి నాటుకోవాలి.
పంట మొక్కలకు వేసిన లభ్య భాస్వరం, భూమిలో చేరిన కొద్ది రోజుల వ్యవధిలో భూమి ఉదజని సూచకను అనుసరించి, వివిధ రకములైన లభ్యంకాని భాస్వరం రూపంలోని మారుతుంది.
ఒక వేళ భూమి క్షార గుణం కలిగి వున్న, వేసిన భాస్వరం కాల్షియం, మెగ్నీషియం ఫాస్పేట్స్గా మారి, మొక్కకు లభ్యంకాదు.
ఈ పరిస్థితుల్లో భాస్వరానికి సంబంధించి జీవన ఎరువులు వేస్తే లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరం మొక్కకు దొరుకుతుంది.
భాస్వరంను అందించే జీవన ఎరువులు PSB (ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బాక్టీరియా) 2 కిలోలు/ 500 మీ.లీ/ఎకరాకు అన్ని పంటలకు వాడుకోవచ్చు
ఫాస్ప్ ఫంగై 2 కిలోలు అన్ని పంటలకు వాడుకోవచ్చు
ఫాస్పేట్ మోబి లైజింగ్ మైకోరైజా 5 కిలోలు అన్ని పంటలకు వాడుకోవచ్చు
పొటాషియం మోబిలైజర్స్: ప్రటూరియా అరాషనియా 2 కిలోలు నూనెగింజల పంటలకు ఎక్కువ ఉపయోగపడుతుంది
ఫాస్పోబాక్టీరియా : ఈ జీవన ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యే రూపంలోకి మార్చుతుంది. ఈ జీవన ఎరువును అన్ని పంటలకు వాడుకోవచ్చు.
ఇది సమర్థవంతంగా పని చేసేందుకు సేంద్రియ కర్బనము అత్యవసరం. దీన్ని సేంద్రియ ఎరువుతో కలిపి వాడాలి. ఈ జీవన ఎరువు మొక్కకు రోగ నిరోధక శక్తిని పెంచి, తద్వారా పంట దిగుబడి పెంచుతుంది
వాడే విధానం : ఎకరాకు 2.0 కిలోల ఫాస్పోబాక్టర్ను లేదా ద్రవ రూపంలో ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బాక్టీరియా 500 మీ.లీ, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగానీ, మొక్క నాటినప్పుడుగానీ సాళ్లలో పడేలా వేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
పొటాషియం మొబిలైజర్స్ : ఈ జీవన ఎరువు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పొటాషియంను అందుబాటులోకి తెచ్చును. ఈ జీవన ఎరువుల్లో ఉండేటటువంటి మొబిలైజింగ్ సూక్ష్మజీవులు, విడుదల చేసే ఎంజైముల వల్ల ఈ ప్రక్రియ జరుగుతుంది.
వాడే విధానం : ఎకరాకు 2.0 కిలోల పొటాషియం రిలీసింగ్ బాక్టీరియా లేదా ద్రవరుపం లో పొటాషియం రిలీసింగ్ బాక్టీరియా 500 మీ.లీ, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగానీ, మొక్క నాటినప్పుడుగానీ సాళ్లలో పడేలా వేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
డా. ఎం. వెంకట లక్ష్మి(సస్య పోషణ), డా.డి.సుధా రాణి (సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి), డా. కె. రేవతి (సస్య రక్షణ) కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల, కృష్ణాజిల్లా – 521 133. Ph: 8008201253
గ్రామీణ స్థాయిలో పాలఉత్పత్తిదారుల సహకార సంఘాల స్థాపన, తద్వారా పాలఉత్పత్తి పెంపుదల లక్ష్యంగా 19.9.2024న కేంద్ర సహకార మరియు పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ పాలవెల్లువ 2.0కు శ్రీకారం చుట్టింది. మహిళల భాగస్వామ్యంతో 5 సంవత్సరాల్లో సహకార సంఘాల ద్వారా 50% పాలఉత్పత్తి పెంపుదల లక్ష్యంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. కొత్తగా 75000 బహుళార్థ సాధక పాలఉత్పత్తిదారుల సహకార సంఘాల స్థాపన, 46000 పాలఉత్పత్తిదారుల సంఘాల బలోపేతం, ఐదు సంవత్సరాల చివరికి రోజుకు 1000 లక్షల లీటర్ల పాలఉత్పత్తి లక్ష్య సాధన దిశగా కేంద్ర సహకార మరియు పశుసంవర్థక పాడి పరిశ్రమ శాఖలు ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో సమావేశాలు జరిపి నిరంతరం ప్రగతిని సమీక్షిస్తున్నాయి.
1998 నుండి ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో అగ్రస్థానం పదిలపరుచుకుంటున్న భారత్, స్థూల ఉత్పత్తికి 25% వాటా సమకూరుస్తుంది. డిసెంబర్ 2014 నుండి అమలవుతోన్న రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా గేదెల్లో పాలఉత్పాదకత 36.63% పెరిగిందని తెలుస్తోంది. అంతేకాక ఆధునిక పాలపరీక్షా పరికరా…తో పాల నాణ్యత పరిశీలన పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది.
రాష్ట్రాలవారీగా 2024 నుండి 2029 వరకు పాలఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు లక్ష్యం ఇలా ఉంది.
తెలంగాణాపరంగా చూస్తే – 2024-2026కు గాను కొత్త సంఘాల ఏర్పాటు 8%, బలోపేతం 42% గా నమోదయింది. ప్రస్తుత సంవత్సరంకి 306 కొత్త సంఘాల ఏర్పాటు లక్ష్యంగా ఉంది. పాడి సుస్థిర అభివృద్ధికి 3 అంచెల సహకార వ్యవస్థ రామరక్షగా నాడే క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ చెప్పారు. కాగా తెలంగాణలో బలహీనంగా ఉన్న గ్రామస్థాయి సహకార సంఘాల పాల సేకరణకు సవాల్గా మారింది. ఉన్న సంఘాల్లో ఆడిట్ జరగక పోవడం, సభ్యుల నిర్లిప్త భావన, సంఘ స్ఫూర్తికి విఘాతంగా నిలిచింది. తెలంగాణ సహకార యూనియన్ మరింతగా సభ్యుల అవగాహనా కార్యక్రమాలు విస్తృతపరచాల్సిన అవసరం ఉంది. గ్రామస్థాయిలో పాలఉత్పత్తిదారుల సహకార సంఘాలు, జిల్లా స్థాయిలో యూనియన్లు రాష్ట్ర స్థాయిలో సమాఖ్య వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. పాడి రైతులు సంఘటితంగా ఉంటే, పక్క రాష్ట్రం, కర్నాటకలో రోజుకు కోటి లీటర్లు పాలసేకరణ సాధ్యపడుతుండగా, విస్తృత విపణి అవకాశాలున్నా, తెలంగాణలో వివిధ సహకార వ్యవస్థలు, ప్రైవేటు ఆధిపత్యానికి దారితీస్తోంది. తెలంగాణలో కరీంనగర్ పాడి రైతుల కంపెనీ, ముల్కనూర్ మహిళా డెయిరీ, నల్లగొండ రంగారెడ్డి యూనియన్, విజయడెయిరీ ఇలా 4 రకాల వ్యవస్థలు నడుస్తున్నాయి. 1964 చట్టంలో ఉన్న విజయ డెయిరీ వ్యవస్థాగత అసమానతలతో ఆశించినంతగా పాలసేకరణ, మార్కెటింగ్ లక్ష్యాలకు చేరువ కావాలంటే, పాడిరైతుల సంఘటిత ముందడుగు ఎంతో అవసరం. సహకారశాఖ ద్వారా త్వరితగతిన సంఘాల ఏర్పాటు, పశుసంవర్థక శాఖ ద్వారా పాడిరైతులకు సేవలు సమ్మిళితంగా లభిస్తే, పాడి రైతు బతుకులో భరోసా వస్తుంది. అలాగే, సబ్సిడీతో పాడిపశువులకు రుణాలు దొరకకపోవడం, పాడిపరిశ్రమపై బడ్జెట్ లో తగు కేటాయింపులు జరగకపోవడం పాడిపరిశ్రమపై నీలినీడలు ప్రసరించడానికి కారణం అవుతోంది. కర్నాటకలో ఏటా 2000 కోట్లు ప్రోత్సాహకం ఇస్తుంది కాబట్టే, పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. తద్వారా నిర్వహణ ఖర్చులు అదుపులో ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా – 1) పాడి పశువులను సబ్సిడిపై ఇచ్చే పథకం అమలు 2) పాల ప్రోత్సాహకం విడుదల 3) సాంకేతిక వనరుల సరఫరా 4) పశు ఆరోగ్యంకై నిరంతర సేవలు 5) సంఘాల ఏర్పాటు అనివార్యం చేయడం అనే పంచ సూత్రాలు అమలయితే పాల ఉత్పత్తి పెరిగి, జీవనోపాధులు మెరుగు కాగలవు.
మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ తెలంగాణ, హైదరాబాద్. ఫోన్: 9121160553
పంచగవ్యను ప్రకృతి వ్యవసాయంలోనే కాక రసాయన సేద్యం చేస్తున్న పొలాల్లో క్రిమి సంహారిణిగా వాడి మంచి ఫలితాలు పొందుతున్నారు రైతులు.
పంచగవ్య తయారీకి కావలసిన పదార్థాలు ఆవుపేడ : 7 కిలోలు; ఆవు మూత్రం : 7 లీటర్లు; ఆవు పెరుగు : 2 లీటర్లు; ఆవు పాలు : 2 లీటర్లు; ఆవు నెయ్యి : 1 కిలో; లేత కొబ్బరి నీరు : 3 లీటర్లు; లేదా కల్లు : 3 లీటర్లు; బాగా మగ్గిన అరటిపండ్లు :12; నీరు : 15 లీటర్లు; నల్లబెల్లం : 1 కిలో
తయారు చేయు విధానం : మట్టి కుండలో వేసిన పేడలో నెయ్యివేసి బాగా కలిపి పెట్టాలి. ఈ విధంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నాలుగు రోజులు చేయగా పేడంతా నేతి వాసన వస్తుంది. 5వ రోజున మూత్రం, పాలు, పెరుగు, కల్లు, కొబ్బరి నీరు, బెల్లం, నీరు బాగా కలియబెట్టాలి. ఆ తరువాత అరటి పండ్లు మెత్తగా పిసికి ఈ మిశ్రమంలో కలియ తిప్పాలి. ఈ మిశ్రమం పోసిన మట్టి పాత్ర గాని ప్లాస్టిక్ డ్రమ్ముగాని వెడల్పాటి మూతికలిగి ఉండాలి. మూత బెట్టకుండా గుడ్డతో మూతిబిగించాలి. (లేకపోతే ఈగలు, క్రిములు మిశ్రమంలో పడతాయి) ఈ విధంగా 15 రోజులు వేసిన తరువాత మిశ్రమాన్ని పలుచటి గుడ్డలో వడబోయాలి. ఈ మిశ్రమాన్ని ఆరు నెలల వరకు వాడవచ్చు. పాత్ర మూత వదులుగా వుండాలి. ఒకవేళ పంచగవ్య గట్టిపడితే తగినంత నీరు కలుపుకుని వాడుకోవాలి. పంచగవ్య మొక్క పెరుగుదలకే కాకుండా చీడపీడలను దరిచేరనీయదు. అన్ని రకాల మొక్కలపై వాడుకొనవచ్చు. నారుమళ్ళకు బాగా శ్రేష్టం.
ఆవశ్యకత : ఉత్తర కోస్తా జిల్లాలలో ఖరీఫ్ పంటకాలంలో వరి ప్రధానమైన పంట, సుమారు 5 లక్షల 20 వేల ఎకరాలలో సాగు చేయబడుతుంది, అందులో సుమారు 50 శాతం విస్తీర్ణం నేరుగా విత్తే (ఎదసాగు) పద్దతిలోనే సాగు అవుతుంది. సాగు ఖర్చులు పెరగడం, కూలీలు సకాలంలో అందుబాటులో లేకపోవడం, కూలీల ఖర్చు పెరగడం వలన రైతులు నేరుగా విత్తే పద్ధతిలో వరిసాగువైపు మరలుతున్నారు.
మారిన వాతావరణ పరిస్థితులలో తక్కువ నీటితో లాభదాయక దిగుబడులు పొందడం వరిలో నేరుగా విత్తు విధానం ద్వారా సాధ్యం. అంతేకాకుండా ఈ సాగువిధానం వలన కొంతవరకు మీథెన్ వాయువు విడుదల తగ్గటం వలన పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అలాగే నీటి వినియోగం 25% ఊడ్పు పద్ధతి మీద తగ్గుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవచ్చు. ప్రతికూల పరిస్థితులలో వరిసాగు ఆలస్యం అయినపుడు నేరుగా వరి విత్తుసాగు పద్దతిలో సాగుచేయడం వలన సమయం ఆదా అవుతుంది.
నేరుగా విత్తే వరి సాగు చేయుటవలన లాభాలు :-
తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకోవచ్చు.
నారుమడి పెంపకం, నాట్లకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. సుమారు ఎకరానికి 2500 నుండి 3000 రూపాయల వరకు కూలీల ఖర్చు ఆదా అవుతుంది.
చెరువుల క్రింద, కాలువల క్రింద సాగుచేసే పరిస్థితులలో నాట్లు ఆలస్యం కాకుండా సకాలంలో పంటను సాగు చేయవచ్చు.
విత్తన మోతాదు 40-50 శాతం తగ్గుతుంది.
పంట పడిపోదు, పంట వారం నుండి 10 రోజుల ముందు కోతకు వస్తుంది.
పురుగులు, తెగుళ్ళు సమస్య కొంతవరకు తక్కువగా ఉంటుంది.
నీటిని ఆదా చేసుకోవచ్చు.
కోత యంత్రాలతో సులువుగా పంట కోత చేపట్టవచ్చు.
నేరుగా విత్తే వరిలో అదిక దిగుబడికి కీలక యాజమాన్య పద్దతులు రకాల ఎంపిక :- ముంపు ప్రాంతాలకు / లోతట్టు ప్రాంతాలకు అనువైన రకాలు : ఎం.టి.యు – 1061 (ఇంద్ర) ఎం.టి.యు – 1064 (అమర), ఆర్.జి.ఎల్-2537 (శ్రీకాకుళం సన్నాలు) ఎత్తు పెరిగి, కాండం దృడంగా వుండి, పడిపోని రకాలను సాగుచేసుకోవాలి. సాధారణ కాలువ ప్రాంతాలు, చెఱువుల క్రింద వరి సాగుకు అనువైన రకాలు : ఎం.టి.యు – 3291 (సోనామసూరి), ఎం.టి.యు-1210 (సుజాత), ఎం.టి.యు -7029 (2), ఎం.టి.యు -1121 (శ్రీదృతి), ఎం.టి.యు-1224 (మారుటేరు సాంబ) బి . పి టి -5204 కాలువ చివరి భూములు ఆలస్యంగా విత్తే ప్రాంతాలకు అనువైన రకాలు : ఎం.టి.యు – 1156 (తరంగిణి), ఎం.టి.యు – 1153 (చంద్ర) ఎన్.ఎల్.ఆర్- 34449, ఆర్.ఎన్.ఆర్ – 15048
నేల తయారీ : తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకొని పలుమార్లు దున్ని మెత్తని దుక్కి చేసినట్లయితే కలుపు సమస్యను కొంతవరకు అదిగమించవచ్చు. ఆఖరి దుక్కిలో సిఫారసు మేరకు పోషకాలు వేసి కలియదున్ని బాగా చదును చేయాలి. నేల సుమతులంగా / చదునుగా లేనట్లయితే తేమ సరిగా అందక మొలక సరిగా రాదు. పంట ఎదుగుదల కూడా సమానంగా ఉండదు, నీటి యాజమాన్యం సమస్యఅవుతుంది. అఖరు దుక్కిని రోటావేటర్తో వేసుకోవడం మంచిది. వాలును బట్టి నీరు బయటకి పోవుటకు వీలుగా ప్రతి 2 మీటర్లకు బాటలు చేసుకోవడం వలన తర్వాత ఎరువులు వేయుటకు, సస్యరక్షణ చర్యలు చేపట్టుటకు ఉపయోగపడటమే కాకుండా దోమపోటు ఎక్కువగా ప్రభలకుండా వుంటుంది.
విత్తన శుద్ధి : విత్తేముందు సూడోమోనాస్తో విత్తన శుద్ధిచేయాలి.
విత్తే విధానం: శుద్ధిచేసిన విత్తనాన్ని నేరుగా చదును చేసిన పొలంలో వెదజల్లడం ద్వారా గాని 20 సెం.మీ. దూరంలో నాగటి సాలు వెనకగాని, గొర్రుతోగాని, ట్రాక్టరుతో నడిచే ఎరువులు మరియు విత్తనాన్ని ఒకేసారి వేసే గొర్రుతో (ఫర్టికమ్ సీడ్ డ్రిల్) గాని వేసుకోవాలి.
విత్తనాన్ని ఎక్కువ లోతులో వేసినట్టయితే మొలకశాతం దెబ్బతినే అవకాశం ఉంది. కనుక పై పోరల్లో సుమారు (2.5 – 5 సెం.మీ) లోతులో వేసుకోవాలి.
దమ్ముచేసి సాగు చేయు పద్ధతిలో మొలకెత్తిన విత్తనాలను దమ్ము చేసిన పొలాల్లో వెదజల్లడం ద్వారా లేదా డ్రమ్సీడరు ద్వారా విత్తుకోవచ్చు.
మొక్కలు లేనిచోట కొత్త మొక్కలు వేసుకొనుట :
వేదజల్లు పద్ధతిలో సాగు చేయు రైతులు విత్తే రోజే ఎకరానికి అరసెంటు నారుముడి పోసుకున్నట్లయితే అధిక వర్షాల వలన లేదా పల్లపు ప్రాంతాలలో మొక్కలు చనిపోయి ఖాళీలు ఏర్పడిన ప్రాంతాలలో ఈ నారును ఉపయోగించడం వలన కావలసిన మొక్కల సాంధ్రత ఉంటుంది. అలాగే ఒత్తుగా ఉన్న మొక్కలు తగ్గించి పలుచగా ఉన్న ప్రాంతాలలో నాటుకోవచ్చు. మంచి దిగుబడికి పొలం తయారీ సమయంలో ఎకరానికి 8 – 10 టన్నుల పశువుల గెత్తం వేసుకోవాలి.
ఎరువుల యాజమాన్యం: నేరుగా విత్తే వరి పొలాలలో భూ ఆరోగ్యానికి, సేంద్రీయ కర్బనం పెంచడం కోసం తొలకరి వర్షాలకు పెసర వంటి అపరాల పంటలు వేసి భూమిలో కలియదున్నుకోవాలి.
జీవన ఎరువులను తప్పని సరిగా వేసుకోవాలి. ఎకరానికి 500మి.లీ. అజోస్పైరిల్లం 500 మి.లీ.లు పాస్పోబాక్టీరియాను 100 కిలోల పశువుల గెత్తంతో కలిపి విత్తిన తరువాత తగు తేమ వున్నపుడు వేసుకోవాలి. సిఫారసు చేసిన పోషకాలను తప్పనిసరిగా అందించాలి.
కలుపు యాజమాన్యం : కలుపును మనుషుల సహాయంతో మొదటగా నిర్మూలించి, సరైన సమయంలో నీరు పెట్టి, ఆ నీటిలో సిఫారసు చేసిన మోతాదులో అజొల్లాను వేయాలి.
నీటి యాజమాన్యం : పంటకు 7-10 రోజుల కొకసారి అవసరం మేరకు తడులు పెట్టాలి.
ఈ పద్ధతిలో ఎల్లప్పుడు నీరు నిలువ ఉంచవలసిన అవసరం లేదు. అయితే పంటకు కావలసిన తేమను అందించి పంట కీలక దశల్లో బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. నీటి లభ్యతనుబట్టి విత్తనము ఎద పెట్టిన 30 నుంచి 40 రోజుల్లో పొలంలో నీరు పారించి మాగాణి వరి మాదిరిగా మార్చుకోవాలి.
విత్తిన దగ్గర నుండి మొదటి 30 రోజులు ఆరుతడి నీటి యాజమాన్యం పాటించాలి. వర్షాలు పడిన తరువాత లేదా కాలువలకు చెఱువులకు నీరు అందుబాటులో ఉన్నపుడు సాధారణ మాగాణి నాట్లు వరి మాదిరి నీటి యజమాన్యం చేపట్టాలి. దుబ్బుచేసే దశలు 1-2 అంగుళాలు మేర నీటిని ఉంచి, పూత దశ నుండి గింజనిండే దశ వరకు 2-4 అంగుళాల నీటిని ఉంచడం ద్వారా అదిక పిలకలు, వెన్నులు వచ్చి దిగుబడి పెరుగుతుంది. సస్యరక్షణ చర్యలు : నాట్లు పద్ధతిలో లాగానే పురుగు ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు (ఎకరం పొలానికి)
200 లీటర్ల నీరు (ఎకరానికి సరిపోతుంది)
10 కిలోల పేడ (నాటు ఆవు)
5 నుంచి 10 లీటర్ల నాటు ఆవు మూత్రం
2 కిలోల బెల్లం (నల్లబెల్లం శ్రేష్టమైనది)
2 కిలోల పప్పుధాన్యాల పిండి (ఉదా: ఉలవ, అలసంద, కంది, మినప, పెసర పిండి, ఏదైనా లేక వీటిని కలిపైనా వాడొచ్చు)
పొలం గట్టు మట్టి…పిడికెడు
రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో సూక్ష్మజీవరాశి, సేంద్రియ పదార్థం నశించి పొలాలు నిస్సారమైపోయాయి. ఈ దశలో భూమిని తిరిగి సారవంతం చేయడం అత్యవసరం. అందుకు ‘జీవామృతం’ చక్కగా ఉపయోగపడుతుంది. ప్రకృతి వ్యవసాయ రథానికి నాలుగు చక్రాలు, వాటిలో జీవామృతం ఒకటి. మిగతావి… బీజామృతం, అచ్ఛాదన, నీటి యాజమాన్యం.
జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతాయి. మట్టిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను చైతన్యవంతం చేయడం ద్వారా జీవామృతం భూసారం పెరగడానికి దోహదపడుతుంది. భూమిలోని పోషకాలను మొక్కలు నేరుగా వినియోగించుకునే రూపంలోకి మార్చి అందించడంలో వానపాములు, సూక్ష్మజీవుల పాత్ర అసాధారణమైనది. మేలు చేసే కోటాను కోట్ల సూక్ష్మజీవులకు నిలయం పశువుల పేడ, మూత్రం. పేడ, మూత్రంతో పాటు బెల్లం, పప్పుల పిండి, నీటిని కలిపినప్పుడు పేడలోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకు రెట్టింపవుతుంది.
జీవామృతం తయారీ విధానం: ఎండ తగలని చోట పెట్టిన సిమెంటు తొట్టి లేదా ప్లాస్టిక్ పీపాలో 200 లీటర్ల నీటిని నింపాలి. పేడ, మూత్రం, బెల్లం, పిండి తదితరాలను అందులో వేసి బాగా కలపాలి. గడియారం ముల్లు తిరిగే దిశగా అంటే సవ్యదిశలో కర్రతో కలియతిప్పాలి. గోనె సంచి కప్పాలి. ఉదయం ఒక నిమిషం, సాయంత్రం ఒక నిమిషం కలియ తిప్పుతూ ఉండాలి. అందులోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకోసారి రెట్టింపు అవుతూ ఉంటుంది. 48 గంటల తర్వాత వాడకానికి జీవామృతం సిద్ధమవుతుంది. ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని ప్రతి 15 రోజులకోసారి సాగు నీటితో పాటు వాడాలి లేదా భూమిలో పదునుంటే నేరుగా చల్లాలి. జీవామృతాన్ని అన్ని పంట పొలాల్లోనూ వాడవచ్చు. పంటలపైన పిచికారీ చేయొచ్చు.
పంటలపై జీవామృతం పిచికారీ ఇలా… 3 నెలల్లో (60Ð90 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి): మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్లు జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. రెండోసారి: (21 రోజుల తర్వాత) 150 లీ.నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. మూడోసారి: (21 రోజుల తర్వాత) 200 లీ. నీటికి 20 లీ. జీవామృతంను కలిపి చల్లాలి. నాలుగోసారి: (గింజ ఏర్పడుతున్న దశలో) 200 లీ. నీటిలో 5 లీ. పుల్లమజ్జిగ కలిపి పిచికారీ చేయాలి (ఈసారి జీవామృతం అక్కర్లేదు). 6 నెలల్లో (150 నుంచి 180 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి): మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్లు జీవామృతం కలిపి చల్లాలి. రెండోసారి: (30 రోజుల తర్వాత) 150 లీ.నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. మూడోసారి: (30 రోజుల తర్వాత) 200 లీటర్ల ‘నీమాస్త్రం’ను చల్లుకోవాలి. నాలుగోసారి: (30 రోజుల తర్వాత) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. ఐదోసారి: (30 రోజుల తర్వాత) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి చల్లాలి. ఆరోసారి: (గింజ ఏర్పడుతున్నప్పుడు) 200 లీ. నీటిలో 6 లీ. పుల్లమజ్జిగ (ఈసారి జీవామృతం అక్కర్లేదు) కలిపి పిచికారీ చేయాలి. జీవామృతం, పంచగవ్య తదితరాల తయారీలో వాడే ఆవు పేడ ఎంత తాజాదైతే అంత మంచిది. వారం రోజుల వరకు పర్వాలేదు. మూత్రం మాత్రం ఎంత పాతదైతే అంత మేలు జరుగుతుంది.
విషతుల్యమైన సాగు పద్ధతుల వైపు మొగ్గుచూపడం భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని, సహజసిద్ధ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ద్వారానే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షును పొందగలడని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. అమృతం వంటి సేంద్రియ విధానాలను అందిపుచ్చుకొనేందుకు యువత సాగు రంగంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సుభాష్ పాలేకర్ కృషి విజ్ఞాన కేంద్రం’, ‘రైతునేస్తం ఫౌండేషన్, తిరుపతి భూలక్ష్మి నేచురల్ ఎఫ్పిసి, అక్రాన్ గ్రూప్-హైదరాబాద్, గ్రామీణ అభివృద్ధి సంక్షేమ సంస్థ – WORD, సేవ్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో తిరుపతిలో ఐదురోజుల జాతీయస్థాయి ప్రకృతి వ్యవసాయ రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఈ సదస్సులో తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు. తొలిరోజు శిక్షణకు 12 రాష్ట్రాల నుంచి సుమారు 892 మంది ప్రతినిధులు హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు.
రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గ్రామీణ మహిళలకు జీవనోపాధి, ఆర్థిక సాధికారత కల్పించేందుకు జూన్ 2 నుంచి కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. దీనికింద మహిళలతో పొట్టేళ్ల యూనిట్లు, గొర్రె, మేక పిల్లల పెంపకం కేంద్రాలు, నాటు కోళ్లు, ఈము పక్షుల కొనుగోళ్ల యూనిట్లు ఏర్పాటు చేయిస్తారు. వారికి బ్యాంకు లింకేజీలు, రివాల్వింగ్ ఫండ్లు, సబ్సిడీల ద్వారా ఆర్థికసాయం అందిస్తారు. పథకానికి ఎంపికైన మహిళా సంఘాల లబ్దిదారులకు పశువైద్య వర్సిటీ శిక్షణ ఇస్తుంది. దీనిపై పీవీ నరసింహారావు తెలం గాణ పశువైద్య విశ్వవిద్యాలయంతో సెర్ప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం హైదరాబాద్ బీఆర్కే భవన్లో సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, పశు వైద్య వర్సిటీ రిజిస్ట్రార్ శరత్చంద్ర ఒప్పందంపై సంతకాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు తెలంగాణ స్వయంసహాయక సంఘాల అభ్యున్నతి, పశుసంపద వృద్ధి కోసం ఒప్పందం చేసుకున్నట్లు దివ్యా దేవరాజన్ తెలిపారు.
2030 నాటికి రసాయన ఎరువుల్లో తప్పనిసరిగా 10% పులియబెట్టిన సేంద్రియ ఎరువుల (ఎఫ్ఓఎం)ను కలిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ (ఐబీఏ) పిలుపునిచ్చింది. ఇందువల్ల ఏటా ఎరువుల దిగుమతులపై 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.19,000 కోట్లు) ఆదా చేయొచ్చని పేర్కొంది. ‘ఎఫ్ఎం నేలకు పోషణనిస్తుంది ఇందువల్ల సుస్థిరతకు నేల పోషణనిస్తుంది’ అనే శ్వేతపత్రాన్ని ఐబీఏ సమర్పించింది. కేంద్ర కొత్త, పునరుత్పాదక ఇంధన కార్యదర్శి సంతోష్ కుమార్ సారంగి ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేశారని ఐబీఏ తెలిపింది. దేశంలో క్షీణిస్తున్న నేల సారాన్ని పునరుద్ధరించడానికి, సుస్థిర వ్యవసాయం వైపు పరివర్తనను వేగవంతం చేయడానికి సూచనలు చేసినట్లు వివరించింది. 2030 నాటికి రసాయన ఎరువుల్లో ఎఫఎంను 10% మేర కలపడాన్ని దశల వారీగా సాదించాలని శ్వేతప్రతం ప్రతిపాదించింది. 2026-27లో 1%, 2027-28లో 3%, 2028-29లో 5%, మేర ఎఫఎఎంను రసాయన ఎరువుల్లో కలపడం తప్పనిసరి చేసి, 2030కి 10 శాతానికి చేర్చాలని ప్రతిపాదించింది. బయోగ్యాస్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల నుంచి ఎఫఎంను సమీకరించాలని తెలిపింది.
కేంద్ర కేబినెట్ కాటన్ ప్రొడక్టివిటీ మిషన్కు రూ.5,659.22 కోట్ల వ్యయంతో ఆమోదం తెలపడం దేశంలోని పత్తి రైతులకు వరం లాంటిదని భాజపా తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. “ఈ మిషన్ పత్తి ఉత్పాదకతను పెంచడంతో పాటు, ప్రపంచ టెక్స్టైల్ మార్కెట్లో భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. పంట క్షేత్రం నుంచి విదేశాల వరకు (ఫాం టు ఫారిన్) అనే లక్ష్యానికి అనుగుణంగా రైతులు, పరిశ్రమ, సాంకేతికత ఎగుమతులను అనుసంధానిస్తుంది. సుమారు 32 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చే దిశగా ఈ మిషన్ కొనసాగుతుంది అని రామచందర్రావు అన్నారు.