ఎల్ నినో పరిస్థితులలో పంటల సాగుకు సూచనలు

ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడం వల్ల ప్రపంచ స్థాయిలో వచ్చే ఒక సహజ వాతావరణ మార్పు. ఇది ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చి, 9 నుండి 12 నెలల పాటు ఉంటుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వర్షాలు తగ్గి, ఎండలు మరియు కరువు పరిస్థితులు ఏర్పడతాయి. 2026 ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది. ఎల్‌నినో ప్రభావం ఆగస్టు వరకే ఉంటుందని భావించినప్పటికీ, ప్రస్తుత అంచనాల ప్రకారం ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం వుంది. ప్రస్తుత 2026–27 కాలంలో ‘సూపర్ ఎల్‌నినో’ ప్రభావం 2027 ఖరీఫ్ సీజన్ వరకు కొనసాగి వ్యవసాయం, తాగునీరు మరియు గ్రామీణ జీవనోపాధిని దెబ్బతీయవచ్చని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నట్లు తెలియజేశారు.

ఆంధ్ర ప్రదేశ్ లో 16 జూలై 26 నాటికీ సాధారణ వర్షపాతము 170 మి.మి.గాను 86 మి.మి నమోదు అయింది. అంటే దాదాపు 50 శాతము లోటు వర్షపాతము నమోదు అయింది. ముక్యముగా కోనసీమ, తూర్పు, పచ్చిమ గోదావరి మరియు అన్నమయ్య జిల్లాలలో దాదాపుగా 65 శాతము భారి లోటు వర్షపాతము నమోదు అయింది. అన్ని ప్రధాన జలాశయాలలో కలిపి 290.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది, గత ఏడాది ఇదే సమయానికి (8-7-26) ఈ నిల్వ 524.56 టీఎంసీలుగా ఉండేది.అంటే 55 శాతము తక్కువగా ఉన్నాయి. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉండటం వల్ల సాగునీటి ఇబ్బందులు రావచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ లో ఖరిఫ్ లో సాధారణ సాగు ౩౦.84 లక్షల హెక్టార్లుకు గాను 6.7 లక్షల హెక్టార్లు అంటే 22 శాతం మాత్రమే సాగు అయింది. ప్రస్తుతానికి వరి 2.2 లక్షల హెక్టార్లు, ప్రత్తి 1.63 లక్షల హెక్టార్లు, కంది 70400 హెక్టార్లు, వేరుసెనగ 43000 హెక్టార్లు, మొక్కజొన్న 40700 హెక్టార్లు సాగు చేసారు. ఆంధ్రప్రదేశ్ లో 28 జిల్లాలకుగాను, కర్నూల్, శ్రీకాకుళం, తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలు తప్ప మిగిలిన 25 జిల్లాలలో 25 శాతము కన్నా తక్కువ విస్తీర్ణంలో సాగు అయింది.

పంటలపై ప్రభావం (దిగుబడి నష్టాలు):
ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా మొత్తం వ్యవసాయ ఉత్పత్తి దాదాపు 11% తగ్గే అవకాశం ఉందని, ముఖ్యంగా వర్షాధార పంటలకు 15- 20% నష్టం వాటిల్లవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్య వ్యవసాయోత్పత్తి తగ్గుదల క్రింది విధంగా పంటల వారీగా అంచనా వేసినట్లు తెలియజేశారు.

పంట ప్రభావ అంచనా / దిగుబడి తగ్గుదల
మొక్కజొన్న 30% నుండి 35% వరకు తగ్గుదల
సజ్జ 25% నుండి 30% తగ్గుదల
వరి 10% నుండి 20% తగ్గుదల
పప్పుధాన్యాలు 15% నుండి 18% తగ్గుదల
వేరుశెనగ / పత్తి / చెరకు తీవ్రమైన నీటి కొరత వల్ల నాణ్యత, దిగుబడి దెబ్బతింటుంది (వేరుశెనగ పూర్తిగా నష్టపోవచ్చు)
జొన్న, రాగి కరువును తట్టుకోగలవు కాబట్టి వీటికి ప్రమాదం తక్కువ

ప్రస్తుతము సాగు చేసిన పంటల్లో సూచనలు

  • బోరు బావుల క్రింద సాగు చేస్తున్న మొక్కజొన్న, పత్తి పంటలకు నీటి వినియోగాన్ని ఆదా చేసేందుకు వరుస విడిచి వరుసకు నీటిపారుదల అందించాలి.
  • కంది మరియు ఆముదంలో మొక్కల సాంద్రత తక్కువ చేయించడం వలన ఎక్కువ దిగుబడి పొందవచ్చు. ఆముదం మరియు కంది పంటలలో ఎక్కువ వత్తుగా ఉన్న మొక్కలను తొలగించి వరుసలో మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తిన 30 మరియు 60 రోజులకు గుంటకతో గాని, గొర్రుతో గాని అంతర కృషి చేయడం ద్వారా కలుపు నివారణతో పాటుగా నేలలో తేమను రక్షించుకోవచ్చు.
  • లోతు తక్కువ గల ఎర్ర గరప నేలల్లో పంట మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత ప్రతి రెండు సాళ్ళ మధ్య కట్టె నాగలి గానీ లేదా బోదె నాగలి గానీ నడిపినట్లు అయితే పొలమంతా బోదెలు-కాలువలు లాగా తయారు అవుతాయి. బోదెలు చేయడం వలన మొక్కల మొదళ్లకు తగినంత మట్టి సమకూరుతుంది. ఇలా బోదెలు -కాలువలు చేయడం వలన వర్షపు నీరు సాళ్లలో నిలబడి భూమిలోనికి ఇంకి పోతుంది, తద్వారా ఎక్కువ నీరు భూమి లోనికి ఇంకడం వలన భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండి పంట మొక్కలకు అందించడం వలన దిగుబడి పెరుగుతుంది.
  • పంట వేసిన తరువాత వేరుశనగ పొట్టు లేదా వరి పొట్టు లేదా పంట అవశేషాలతో మల్చింగ్ (ఆచ్చాదన) చేయడం వలన భూమిలో తేమ ఎక్కువ రోజులు నిల్వ ఉండటం ద్వారా పంట బెట్టకు గురి కాకుండా ఉంటుంది. అలాగే కలుపు సమస్యలు కూడా తక్కువగా ఉంటాయి కనుక నేలలో తేమ శాతాన్ని రక్షించుకోవచ్చు.
  • మెట్ట ప్రాంతాల్లో పంటకాలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు నీటి కుంటలలో నిలువ చేసిన నీటిని, పంట కాలంలో ఎర్ర నేలల్లో పదిరోజులకు, నల్లరేగడి నేలల్లో 15 రోజులకు మించి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, స్ప్రింకర్ల ద్వారా 20 మి.మీ.ఎర్ర నేలల్లో, 40 మి.మీ.నల్లరేగడి నేలల్లో అందించగలిగితే 20-30% దిగుబడి పెరుగుతుంది. చివరి దశలో బెట్ట వస్తే (కంది, ఆముదం వంటి దూర వరస పంటలకు) నీటి ట్యాంకర్ల ద్వారా రక్షక తడులు (Protective Irrigation) ఇవ్వాలి.

వరి సాగు లో వర్షాభావ పరిస్థితులు లేదా సాగునీటి కొరత ఉంటే సూచనలు

  • పొలంలో నిరంతరం నీరు నిల్వ ఉంచకుండా ప్రత్యామ్నాయ తడి-పొడి (AWD) పద్ధతి పిలక దశలో, పై పాటుగా ఎరువులు వేసినప్పుడు అనుసరించాలి. కాలువల ద్వారా అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించాలి. పొలాల గట్లను బలపరచి నీటి నష్టాన్ని తగ్గించాలి. పొలంలో పగుళ్లు రాకుండా తగిన తేమను నిలుపుకోవాలి.
  • నీటి లబ్యత తక్కువగా ఉన్న యెడల, మురుగు నీటి నాణ్యతను పరీక్షించుకొని లవణ సాంద్రత 2 దేసిమేన్స్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే సాగునీరుగా ఉపయోగించాలి.
  • వరి దిగుబడి తగ్గే అవకాశం ఉన్న జిల్లాల్లో, ముఖ్యంగా ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు లో దమ్ము చేసి చదును, చేసిన పొలంలో మండె కట్టిన విత్తనాన్ని వెదజల్లే పద్ధతి లేదా డ్రమ్ సీడర్ పద్దతి లేదా SRI సాగు పాటించాలి.
  • తక్కువ కాలం మరియు బెట్టను తట్టుకునే వరి రకాలను ఎంపిక చేసుకొని సాగు చేసుకోవాలి.
  • ఆలస్యంగా వర్షాలు వచ్చినప్పుడు మెట్ట ప్రాంతాలు మరియు బోరు బావుల క్రింద స్వల్ప వ్యవధి రకాలైన MTU1121, MTU1293, MTU1290 మరియు MTU1426 సాగు చేయాలి. తక్కువ వయస్సు (20–25 రోజుల) నారును ఉపయోగించాలి.
  • చాడు నేలలకు: ఇంద్ర,, MCM 103, MCM 125, MTU 1290, MTU 1293
  • నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీఫ్ లో చ॥మీ॥ కు 33 కుదుళ్ళు ఉండేలా చూడాలి. భూసారం ఎక్కువ ఉన్న పొలాల్లో తక్కువ కుదుళ్ళు, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్ళు ఉండేట్లు నాటాలి. వరి రకాల కాలపరిమితిని బట్టి కుదుళ్ళ సంఖ్యను నిర్ధారించాలి. దీర్గకాలిక, మద్యకాలిక మరియు స్వల్ప కాలిక రకాలు నాటినపుడు ఒక చధరపు మీటరుకు 33 కుదుళ్లు ఉండాలి.
  • నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. బాటలు తీయటం వలన పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంతవరకు అదుపు చేయవచ్చు.
  • ఎల్ నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులలో, ఉన్న నీటిని జీవ తడులకు వాడుకోవాలి.
  • నీరు తక్కువగా ఉన్నపుడు వరి పైరు మూన తిరిగిన దశ నుండి పిలకల దశ వరకు ఆరుతడిలాగా నీటి తడులు పెడుతూ మరియు నీరు బయటకు పోకుండా పొలం గట్టును దృడంగా చేసుకోవాలి.
  • అధిక ఉషోగ్రతలకు చౌడు భూముల్లో సాగు చేసే వరి పంటకు తరచు మంచి నీరు మార్చుకోవటం వలన చౌడు తీవ్రతను తగించుకోవచ్చు .
  • పంటలో గనుక జింక్ లోపం వచ్చినటైతే ఒక లీటరు నీటికి 2 గ్రా. జింక్ సల్ఫేట్ (0.2%) కలపి పిచికారి చేసి నివారించుకోవాలి. జింక్ లోపం తీవ్రతను బట్టి 5 రోజుల కాలంలో రెండవ పిచికారి చేయాలి.
  • ఇనుము ధాతు లోపము నివారణకు లీటరు నీటికి 20 గ్రాముల అన్నభేది, 2 గ్రాముల నిమ్మఉప్పు కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ గాఢత కలిగిన ద్రావణాన్ని (10 గ్రాముల అన్నభేది) వాడాలి.

ఎల్‌నినో / బెట్ట పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు:
వర్షాలు సకాలములో లేని యెడల ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి.

  • ఆగష్టు మాసములో : తేలికపాటి నేలలు : జొన్న, కొర్ర , సజ్జ , పెసర , అలసంద మేత జొన్న, ఉలవలు
  • భరువైన నేలలు: ఆముదము, జొన్న, కొర్ర , సజ్జ , పెసర , అలసంద, కంది ఉలవలు
  • ప్రస్తుత పరిస్థితుల్లో వరి, మొక్కజొన్న పంటల సాగును సాధ్యమైనంత వరకు తగ్గించడం మంచిది.
  • ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ పంట కాలం గల మినుములు, కొర్రలు, సజ్జలు వంటి పంటలను సాగు చేయాలని సూచించారు.

పండ్ల తోటలను (చీని, మామిడి లో) తీవ్ర కరువు సమయంలో చెట్లను కాపాడుకునే అత్యవసర పద్ధతులు:

  • పాదులలో అచ్ఛాధన (మల్చింగ్) చేసుకొని నీటి ఆవిరిని అరికట్టాలి. నేల ఆరోగ్యాన్ని పెంపొందించాలి.
  • ఎండ తీవ్రతలేని సాయంత్రం సమయంలోనే పండ్ల తోటలకు సాధారణ తడిగానీ, లేదా ట్యాంకర్ల ద్వారా రక్షకతడిగానీ ఇవ్వాలి.
  • చెట్టు పాదులో ఒక వారం ఒక సగభాగం, మరుసటి వారం ఇంకో సగభాగంలో నీరు పెట్టడం ద్వారా నీటిని ఆదాచేయవచ్చును. ఇది పార్షియల్ డ్రై రూట్ జోన్ తడి పద్ధతి అంటారు.
    • 1:1 నిష్పత్తిలో బంకమట్టి + సున్నం కలిపి కాండానికి పూస్తే చెట్లు ఎండకు ఎండిపోవడాన్ని తగ్గించవచ్చు.
    • పచ్చిరొట్ట పంటలు వేసుకొని, నేలలో సేంద్రీయ పదార్థాన్ని పెంచవచ్చు.
    • చెరువు మట్టిని వేసి నేలలో తేమను నిలిపే గుణాన్ని పెంచవచ్చు.
    • చెట్టు ఎండిపోతున్నప్పుడు బాగా ఎండిపోతున్న చెట్ల కొమ్మలన్నీ నరికి, ఒక్క ప్రధాన కొమ్మనే ఉంచాలి. ఈ పద్ధతి చెట్టు నీటి అవసరాన్ని తగ్గించి బ్రతికిస్తుంది. దీనిని డీ-హార్నింగ్ (De-horning) అంటారు.
    • పంట కోత అనంతరము కొమ్మలు కత్తిరించి, ఆ వ్యర్థాలను ముక్కలు చేసి, పాదుల్లోనే మల్చింగ్ గా వేయాలి. దీనివల్ల నేల తేమ ఆవిరి బాగా తగ్గుతుంది. ముఖ్యంగా చీడపీడలకు గురైన కొమ్మలను పూర్తిగా కత్తిరించాలి.
    • చెట్టుకు 40-50 కేజీల సేంద్రియ ఎరువు (పశువుల/గొర్రెల/కోళ్ల వ్యర్థాలు) వేయాలి. పండ్ల చెట్ల మధ్య వరుసల పచ్చిరొట్ట పంటలు వేసి 50% పూత దశలో భూమిలో దున్నాలి.
    • మొక్కల వేగవంతమైన పెరుగుదలకు మరియు పోషకాల లభ్యతకు తోడ్పడే పి.ఎస్.బి (PSB – ఫాస్ఫో బ్యాక్టీరియా) వంటి జీవన ఎరువులను వినియోగించాలి.
    • ఉద్యాన పంటలకు అత్యంత కీలకమైన పూత మరియు పిందె దశల్లో నీటి కొరత రాకుండా తగినంత నీరు కచ్చితంగా అందించాలి.

ఆకుకూరలు, కూరగాయలు:
• పొలంలో వర్షపు నీరు పొర్లిపోకుండా, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా బోర్‌వెల్ రీఛార్జ్ పిట్ (ఇంకుడు గుంత) ఏర్పాటు ద్వారా భూగర్భ జలమట్టాన్ని పెంచవచ్చు.
• తక్కువ నీరు & స్వల్ప కాలపరిమితి గల కూరగాయ పంటలను వేసుకోవాలి. ఎక్కువ నీరు అవసరమయ్యే టొమాటో, మిర్చిలకు బదులు గోరుచిక్కుడు, చిక్కుడు, అలసంద. చిలగడదుంప, చామదుంప, కంద, ముల్లంగి, బీట్‌రూట్ , క్యారెట్ (కరుడ రకాలు: 80-90 రోజులు) వేసుకోవలెను.
• వివిధ రకాల ఆకుకూరలు తక్కువ కాలంలో పండుతాయి. కొత్తిమీర, గోంగూరలు డ్రిప్ + మైక్రో జెట్స్ ద్వారా తక్కువ నీటితో సాగు చేయవచ్చును.

ఆయిల్ పామ్ పంటల్లో:

  • రక్షక నీటి పారుదల మరియు తేమ సంరక్షణ చర్యలను చేపట్టండి. నేలలో తేమను కాపాడటానికి మరియు నేల ఉష్ణోగ్రతను తగ్గించడానికి, ఎండిన ఆకులు, ఖాళీ పండ్ల గుత్తులు లేదా సేంద్రియ వ్యర్థాలను ఉపయోగించి నేరుగా నేలలోనే మల్చింగ్ చేయండి.
  • అధిక ఉష్ణోగ్రతల సమయంలో తగినంత నీటిపారుదల లేకుండా అధికంగా ఎరువులు వేయడం మానుకోండి.
  • వేసవిలో ఆకులను ఎక్కువగా కత్తిరించడాన్ని నివారించండి, ఎందుకంటే చెట్టు పైభాగం (canopy) తగ్గడం వల్ల వేడి ఒత్తిడి పెరగవచ్చు. ప్రతి చెట్టుకు కనీసం 35–40 పని చేసే ఆకులు ఉండేలా చూసుకోండి. పశు సంరక్షణకు సూచనలు
  • సన్నకారు రైతులు ఉలవలు వేసుకుని 10 నుంచి 15 పొట్టేలు పిల్లలు మేపుకుంటే ఒక్కొక్క పొట్టేలుపై పది నుంచి పదిహేను వేల రూపాయల ఆదాయం వస్తుంది.
  • దాణా తక్కువ ధరలో దొరుకుతుందని ఎక్కువగా పశువులకు ఇవ్వడం జరుగుతుంది. దీని వలన పాల దిగుబడి బాగా వచ్చినా పశువుల జీర్ణ వ్యవస్థ పనితీరు తగ్గి చనిపోతాయి. కావున ఈ పద్దతిని ఆచరించకుండా చూడాలి.
  • Co F31, Australian Red Napier వంటి గడ్డి రకాలు తక్కువ నీటితో పండించవచ్చును. తద్వారా పచ్చి మేత కొరత తగ్గించవచ్చును.
  • పాడి పశువుల ఆరోగ్యం, పాల ఉత్పాదకత పెరగడానికి వాటి ఆహారంలో క్రమం తప్పకుండా మినరల్ మిక్స్ (ఖనిజ లవణాల మిశ్రమం) అందించాలి అని తెలపడము అయినది.
  • అవసరమైన టీకాలను, సరైన సమయంలో ఇవ్వాలి.

రైతులందరూ వాతావరణ భీమా WBCIS (Weather Based Crop Insurance Scheme) మరియు ప్రధానమంత్రి పంటల భీమా PMFBY (Pradhan Mantri Fasal Bima Yojana) పథకాలలో తప్పనిసరిగా నమోదు చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించి, నీటి పొదుపు: నీటి వినియోగంలో జాగ్రత్త వహించాలి. భూమిలో తేమ ఆరిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

డా . బి. సహదేవ రెడ్డి, డా. పి.వి. రమేష్ బాబు, డా . య౦ .గిరిజా రాణి మరియు
డా . సి.హెచ్. శ్రీనివాస్, సహ పరిశోధన సంచాలకులు
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము, మారుటేరు. Ph: 9866787072

Read More

ఎల్ నినో పరిస్థితుల్లో రైతు ఆదాయ స్థిరత్వానికి వ్యూహాలు: అనుకూల పంటల ఎంపిక మరియు వ్యవసాయ రికార్డుల నిర్వహణ

భారతదేశ జనాభాలో సుమారు 68.84 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, మొత్తం శ్రామిక శక్తిలో 54.6 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణలో కూడా సుమారు 61.12 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, దాదాపు 55 శాతం మంది వ్యవసాయ రంగంతో అనుసంధానమై ఉన్నారు. వ్యవసాయ గణాంకాల ప్రకారం భారతదేశంలో 86 శాతం కంటే ఎక్కువ వ్యవసాయ కమతాలు చిన్న మరియు సన్నకారు వర్గాలకు చెందుతాయి.

తెలంగాణ వ్యవసాయం నీటిపారుదల మరియు వర్షాధార వ్యవసాయ వ్యవస్థల సమ్మేళనంగా ఉండి, వర్షపాతం వ్యవసాయాభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇటీవలి సంవత్సరాల్లో సాగునీటి వసతులు పెరిగినప్పటికీ, వాతావరణ మార్పులు రైతుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు తీసుకునే ప్రతి పంట నిర్ణయం కుటుంబ ఆదాయంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వర్షపాతం అస్థిరంగా ఉండే సంవత్సరాలలో పంటల ఎంపిక మరింత కీలకంగా మారుతుంది. ఎల్నినో (Elnino) వంటి వాతావరణ పరిస్థితులు వర్షపాతాన్ని ప్రభావితం చేసి వ్యవసాయ ఉత్పత్తిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో సాధారణంగా రుతుపవనాల బలహీనత, సగటు కంటే తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. 2025-26 సంవత్సరానికి కూడా వాతావరణ పరిస్థితులపై ఎల్నినో ప్రభావం కొనసాగే అవకాశాలపై వివిధ వాతావరణ సంస్థలు సూచనలు చేస్తున్నాయి.

తెలంగాణలోని ప్రధాన పంటలు మరియు వాటిపై ఎల్ నినో ప్రభావం
వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం తెలంగాణలో 2025 వానాకాలంలో తెలంగాణ రాష్ట్ర మొత్తం పంటల సాగు విస్తీర్ణంలో వరి పంట 50.57 శాతం వాటాతో ప్రథమ స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో పత్తి 34.52 శాతం విస్తీర్ణాన్ని ఆక్రమించింది. ఈ గణాంకాలు రాష్ట్ర వానాకాల పంటల సరళిలో వరి మరియు పత్తి పంటల ప్రాబల్యాన్ని సూచిస్తున్నాయి. అయితే ఎల్నినో వంటి వాతావరణ అనిశ్చిత పరిస్థితులు ఎదురైనప్పుడు కేవలం సంప్రదాయ పద్ధతిలో వరి సాగుపైనే ఆధారపడకుండా, నీటి లభ్యత తక్కువగా అవసరం ఉన్న కందులు, పెసర వంటి పప్పుధాన్యాలు లేదా స్థానిక పరిస్థితులకు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటలను కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరం.

డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రచురించిన గణాంకాల ప్రకారం, ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో (2014-15 మరియు 2015-16) తెలంగాణలో ప్రధాన పంటల నికర ఆదాయంలో గణనీయమైన మార్పులు నమోదయ్యాయి.

2015-16 తీవ్రమైన ఎల్ నినోలో పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించింది. వరి (-14007.72), మొక్కజొన్న – 11373.53), పత్తి (-10908.38), కందులు (-9818.09), పెసర (-5207.97) పంటలన్నింటిలోనూ నికర ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. ఇది తీవ్రమైన వర్షాభావ పరిస్థితులలో పంటలు ఎంతగా దెబ్బతింటాయో సూచిస్తుంది. అదే విధంగా తక్కువ నీటి అవసరం ఉన్న పంటలు వర్షాభావాన్ని తట్టుకొని రైతులకు నష్టాలను తగ్గించే అవకాశాన్ని కల్పించాయి. దీనినిబట్టి ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో అన్ని పంటలు ఒకే విధంగా ప్రభావితమవలేదని గమనించవచ్చు. కొన్ని సంవత్సరాలలో వరి అత్యధిక నష్టాలను చవిచూడగా, కొన్ని ప్రత్యామ్నాయ పంటలు లాభాలను మరియు తక్కువ నష్టాలను నమోదు చేశాయి.

అదేవిధంగా పంటల ఎంపికలో కూడా ఒకే సూత్రం అందరికీ వర్తించదు. రైతు నేల స్వభావం, నీటి వనరులు, గత అనుభవం, మార్కెట్ పరిస్థితులు మరియు కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయాన్ని శాస్త్రీయంగా తీసుకోవడానికి వ్యవసాయ రికార్డులు ఎంతో ఉపయోగపడతాయి. గత సంవత్సరాలలో ఏ పంటకు ఎంత ఖర్చు అయింది, ఎంత దిగుబడి వచ్చింది, ఎంత ఆదాయం లభించింది, వర్షాభావ పరిస్థితుల్లో ఏ పంట మెరుగ్గా నిలిచింది వంటి వివరాలు రికార్డుల ద్వారా స్పష్టంగా తెలుస్తాయి.

దీనికోసం రైతు పొలంలో జరిగే వివిధ కార్యకలాపాలకు వేర్వేరు రికార్డులు అవసరం. రైతు నిర్వహించుకోదలచిన ముఖ్యమైన రికార్డు రకాలు ఇవి:

  1. వ్యవసాయ దినచర్య రికార్డు
  2. పంటల వారీ ఖర్చు-ఆదాయ రికార్డు
  3. ఎరువుల వినియోగ రికార్డు
  4. పురుగుమందుల వినియోగ రికార్డు
  5. కార్మికుల వినియోగ రికార్డు
  6. యంత్రాల వినియోగ రికార్డు
  7. నీటి వినియోగ రికార్డు
  8. దిగుబడి రికార్డు
  9. పశుసంవర్ధక రికార్డు
  10. నిల్వ మరియు విక్రయాల రికార్డు

ప్రస్తుతం తెలంగాణలోని అభ్యుదయ రైతులు కొంతమంది ప్రధానంగా కాగితపు రికార్డుల ద్వారానే వ్యవసాయ సమాచారాన్ని నమోదు చేసి భద్రపరుస్తున్నారు. అయితే, కాలానుగుణంగా అందుబాటులోకి వచ్చిన వివిధ ఆధునిక పద్ధతులను కూడా వినియోగించి వ్యవసాయ రికార్డులను మరింత సమర్థవంతంగా భద్రపరచుకోవచ్చు. వీటిలో సంప్రదాయ కాగితపు పద్ధతులతో పాటు డిజిటల్ రికార్డు పద్ధతులు, స్మార్ట్ఫోన్ ఆధారిత పద్ధతులు మరియు ప్రభుత్వ డిజిటల్ వేదికలు ముఖ్యమైనవి. ఈ పద్ధతుల వివరాలు క్రింది చిత్రంలో చూపించబడ్డాయి.

వివిధ వ్యవసాయ రికార్డుల పద్ధతులు
ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటి అవసరం గల అనుకూల పంటలను ఎంపిక చేసి సాగు చేయడం రైతుల ఆదాయ స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు వాతావరణ మార్పులు మరియు వర్షాభావ పరిస్థితుల ప్రభావాలను తగ్గించడంలో ముఖ్యమైన వ్యూహంగా నిలుస్తుంది. అదే సమయంలో, పంటల ఎంపిక, ఖర్చులు, దిగుబడులు, ఆదాయం మరియు వనరుల వినియోగానికి సంబంధించిన వ్యవసాయ రికార్డులను క్రమం తప్పకుండా నమోదు చేసి భద్రపరచడం ద్వారా రైతులు గత అనుభవాలను విశ్లేషించి భవిష్యత్ సాగు నిర్ణయాలను మరింత శాస్త్రీయంగా మరియు సమర్థవంతంగా తీసుకునే అవకాశం కలుగుతుంది. అందువల్ల, అనుకూల పంటల సాగుతో పాటు సమగ్ర వ్యవసాయ రికార్డుల నిర్వహణ కూడా వాతావరణ అనిశ్చితులను ఎదుర్కొంటూ స్థిరమైన మరియు లాభదాయకమైన వ్యవసాయాభివృద్ధికి కీలకమైన అంశంగా పరిగణించబడుతుంది.

డా. డి. ఎ. రజిని దేవి, సహాయ ప్రొఫెసర్, వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగం, వ్యవసాయ కళాశాల,రాజేంద్రనగర్
డా. కె. శేఖర్, సహాయ ప్రొఫెసర్, సేద్య విభాగం, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, ఫోన్: 9032128184

Read More

వరిలో నేరుగా విత్తు సాగు విధానం – మెళకువలు

ఆవశ్యకత :
ఉత్తర కోస్తా జిల్లాలలో ఖరీఫ్ పంటకాలంలో వరి ప్రధానమైన పంట, సుమారు 5 లక్షల 20 వేల ఎకరాలలో సాగు చేయబడుతుంది, అందులో సుమారు 50 శాతం విస్తీర్ణం నేరుగా విత్తే (ఎదసాగు) పద్దతిలోనే సాగు అవుతుంది. సాగు ఖర్చులు పెరగడం, కూలీలు సకాలంలో అందుబాటులో లేకపోవడం, కూలీల ఖర్చు పెరగడం వలన రైతులు నేరుగా విత్తే పద్ధతిలో వరిసాగువైపు మరలుతున్నారు.

మారిన వాతావరణ పరిస్థితులలో తక్కువ నీటితో లాభదాయక దిగుబడులు పొందడం వరిలో నేరుగా విత్తు విధానం ద్వారా సాధ్యం. అంతేకాకుండా ఈ సాగువిధానం వలన కొంతవరకు మీథెన్ వాయువు విడుదల తగ్గటం వలన పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అలాగే నీటి వినియోగం 25% ఊడ్పు పద్ధతి మీద తగ్గుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవచ్చు. ప్రతికూల పరిస్థితులలో వరిసాగు ఆలస్యం అయినపుడు నేరుగా వరి విత్తుసాగు పద్దతిలో సాగుచేయడం వలన సమయం ఆదా అవుతుంది.

నేరుగా విత్తే వరి సాగు చేయుటవలన లాభాలు :-

  1. తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకోవచ్చు.
  2. నారుమడి పెంపకం, నాట్లకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. సుమారు ఎకరానికి 2500 నుండి 3000 రూపాయల వరకు కూలీల ఖర్చు ఆదా అవుతుంది.
  3. చెరువుల క్రింద, కాలువల క్రింద సాగుచేసే పరిస్థితులలో నాట్లు ఆలస్యం కాకుండా సకాలంలో పంటను సాగు చేయవచ్చు.
  4. విత్తన మోతాదు 40-50 శాతం తగ్గుతుంది.
  5. పంట పడిపోదు, పంట వారం నుండి 10 రోజుల ముందు కోతకు వస్తుంది.
  6. పురుగులు, తెగుళ్ళు సమస్య కొంతవరకు తక్కువగా ఉంటుంది.
  7. నీటిని ఆదా చేసుకోవచ్చు.
  8. కోత యంత్రాలతో సులువుగా పంట కోత చేపట్టవచ్చు.

నేరుగా విత్తే వరిలో అదిక దిగుబడికి కీలక యాజమాన్య పద్దతులు
రకాల ఎంపిక :-

ముంపు ప్రాంతాలకు / లోతట్టు ప్రాంతాలకు అనువైన రకాలు :
ఎం.టి.యు – 1061 (ఇంద్ర) ఎం.టి.యు – 1064 (అమర), ఆర్.జి.ఎల్-2537 (శ్రీకాకుళం సన్నాలు) ఎత్తు పెరిగి, కాండం దృడంగా వుండి, పడిపోని రకాలను సాగుచేసుకోవాలి.
సాధారణ కాలువ ప్రాంతాలు, చెఱువుల క్రింద వరి సాగుకు అనువైన రకాలు :
ఎం.టి.యు – 3291 (సోనామసూరి), ఎం.టి.యు-1210 (సుజాత), ఎం.టి.యు -7029 (2), ఎం.టి.యు -1121 (శ్రీదృతి), ఎం.టి.యు-1224 (మారుటేరు సాంబ) బి . పి టి -5204
కాలువ చివరి భూములు ఆలస్యంగా విత్తే ప్రాంతాలకు అనువైన రకాలు :
ఎం.టి.యు – 1156 (తరంగిణి), ఎం.టి.యు – 1153 (చంద్ర) ఎన్.ఎల్.ఆర్- 34449,
ఆర్.ఎన్.ఆర్ – 15048

నేల తయారీ : తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకొని పలుమార్లు దున్ని మెత్తని దుక్కి
చేసినట్లయితే కలుపు సమస్యను కొంతవరకు అదిగమించవచ్చు. ఆఖరి దుక్కిలో సిఫారసు మేరకు పోషకాలు వేసి కలియదున్ని బాగా చదును చేయాలి. నేల సుమతులంగా / చదునుగా లేనట్లయితే తేమ సరిగా అందక మొలక సరిగా రాదు. పంట ఎదుగుదల కూడా సమానంగా ఉండదు, నీటి యాజమాన్యం సమస్యఅవుతుంది. అఖరు దుక్కిని రోటావేటర్‌తో వేసుకోవడం మంచిది.
వాలును బట్టి నీరు బయటకి పోవుటకు వీలుగా ప్రతి 2 మీటర్లకు బాటలు చేసుకోవడం వలన తర్వాత ఎరువులు వేయుటకు, సస్యరక్షణ చర్యలు చేపట్టుటకు ఉపయోగపడటమే కాకుండా దోమపోటు ఎక్కువగా ప్రభలకుండా వుంటుంది.

విత్తన మోతాదు : ఎకరానికి 16Ð20 కిలోల విత్తనము ఉపయోగించాలి.

విత్తన శుద్ధి : విత్తేముందు సూడోమోనాస్‌తో విత్తన శుద్ధిచేయాలి.

విత్తే విధానం: శుద్ధిచేసిన విత్తనాన్ని నేరుగా చదును చేసిన పొలంలో వెదజల్లడం ద్వారా గాని
20 సెం.మీ. దూరంలో నాగటి సాలు వెనకగాని, గొర్రుతోగాని, ట్రాక్టరుతో నడిచే ఎరువులు మరియు విత్తనాన్ని ఒకేసారి వేసే గొర్రుతో (ఫర్టికమ్ సీడ్ డ్రిల్) గాని వేసుకోవాలి.

విత్తనాన్ని ఎక్కువ లోతులో వేసినట్టయితే మొలకశాతం దెబ్బతినే అవకాశం ఉంది. కనుక పై పోరల్లో సుమారు (2.5 – 5 సెం.మీ) లోతులో వేసుకోవాలి.

దమ్ముచేసి సాగు చేయు పద్ధతిలో మొలకెత్తిన విత్తనాలను దమ్ము చేసిన పొలాల్లో వెదజల్లడం ద్వారా లేదా డ్రమ్‌సీడరు ద్వారా విత్తుకోవచ్చు.

మొక్కలు లేనిచోట కొత్త మొక్కలు వేసుకొనుట :

వేదజల్లు పద్ధతిలో సాగు చేయు రైతులు విత్తే రోజే ఎకరానికి అరసెంటు నారుముడి పోసుకున్నట్లయితే అధిక వర్షాల వలన లేదా పల్లపు ప్రాంతాలలో మొక్కలు చనిపోయి ఖాళీలు
ఏర్పడిన ప్రాంతాలలో ఈ నారును ఉపయోగించడం వలన కావలసిన మొక్కల సాంధ్రత ఉంటుంది. అలాగే ఒత్తుగా ఉన్న మొక్కలు తగ్గించి పలుచగా ఉన్న ప్రాంతాలలో నాటుకోవచ్చు. మంచి దిగుబడికి పొలం తయారీ సమయంలో ఎకరానికి 8 – 10 టన్నుల పశువుల గెత్తం వేసుకోవాలి.

ఎరువుల యాజమాన్యం: నేరుగా విత్తే వరి పొలాలలో భూ ఆరోగ్యానికి, సేంద్రీయ కర్బనం పెంచడం కోసం
తొలకరి వర్షాలకు పెసర వంటి అపరాల పంటలు వేసి భూమిలో కలియదున్నుకోవాలి.

జీవన ఎరువులను తప్పని సరిగా వేసుకోవాలి. ఎకరానికి 500మి.లీ. అజోస్పైరిల్లం 500 మి.లీ.లు పాస్పోబాక్టీరియాను 100 కిలోల పశువుల గెత్తంతో కలిపి విత్తిన తరువాత తగు తేమ వున్నపుడు వేసుకోవాలి. సిఫారసు చేసిన పోషకాలను తప్పనిసరిగా అందించాలి.

కలుపు యాజమాన్యం : కలుపును మనుషుల సహాయంతో మొదటగా నిర్మూలించి, సరైన సమయంలో నీరు పెట్టి, ఆ నీటిలో సిఫారసు చేసిన మోతాదులో అజొల్లాను వేయాలి.

నీటి యాజమాన్యం : పంటకు 7-10 రోజుల కొకసారి అవసరం మేరకు తడులు పెట్టాలి.

ఈ పద్ధతిలో ఎల్లప్పుడు నీరు నిలువ ఉంచవలసిన అవసరం లేదు. అయితే పంటకు కావలసిన తేమను అందించి పంట కీలక దశల్లో బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. నీటి లభ్యతనుబట్టి విత్తనము ఎద పెట్టిన 30 నుంచి 40 రోజుల్లో పొలంలో నీరు పారించి మాగాణి వరి మాదిరిగా మార్చుకోవాలి.

విత్తిన దగ్గర నుండి మొదటి 30 రోజులు ఆరుతడి నీటి యాజమాన్యం పాటించాలి. వర్షాలు పడిన తరువాత లేదా కాలువలకు చెఱువులకు నీరు అందుబాటులో ఉన్నపుడు సాధారణ మాగాణి నాట్లు వరి మాదిరి నీటి యజమాన్యం చేపట్టాలి. దుబ్బుచేసే దశలు 1-2 అంగుళాలు మేర నీటిని ఉంచి, పూత దశ నుండి గింజనిండే దశ వరకు 2-4 అంగుళాల నీటిని ఉంచడం ద్వారా అదిక పిలకలు, వెన్నులు వచ్చి దిగుబడి పెరుగుతుంది.
సస్యరక్షణ చర్యలు : నాట్లు పద్ధతిలో లాగానే పురుగు ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

డా॥ ఎం.ఎం.వి.శ్రీనివాసరావు, డా॥ కె. లక్ష్మణ , ప్రధాన శాస్త్రవేత్తలు, ఏరువాక కేంద్రం, విజయనగరం. ఫోన్: 94401 23223

Read More

చౌడును తట్టుకునే వరి విత్తనం

మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం తాజాగా ఎంసీఎం-125 అనే వరి రకాన్ని అందుబాటులోకి తెచ్ౘ్ింది. ఇటీవల దీనికి అనుమతులు లభించడంతో శాస్త్రవేత్తలు రైతులకు విత్తనాలను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఎంటీయూ 1042, ఎంటీయూ 1061 విత్తనాలను సంకరం చేసి ఎంసీఎం-125 విత్తనాన్ని రూపొందించారు. ఇది ఖరీఫ్‌కు అనువైన రకమని, పంట కాలం 145 రోజులు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రకం కొంతవరకు దోమపోటు, అగ్గి తెగులు, మెడవిరుపు తెగులును కూడా తట్టుకుంటుంది. మొక్క 110 నుంచి 115 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. ఎకరానికి.. చౌడు నేలల్లో 30 బస్తాలు, సాధారణ భూముల్లో 40 బస్తాల వరకు దిగుబడి ఇస్తుంది.
ఎంటీయూ-1061, బీపీటీ 5204 రకాలకు ప్రత్యామ్నాయంగా ఎంసీఎం-125 రకాన్ని చౌడు, సాధారణ భూముల్లో సాగు చేసుకోవచ్ౘ్ని పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె. నాగేంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో కోస్తా ప్రాంతాల్లోని చౌడు భూములకు అనువైన వంగడమని చెప్పారు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉన్నందున వినియోగించుకోవాలని కోరారు.

Read More